సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 22, 2011

నీళ్లు



మూడురోజులనించీ నీళ్ళు రాలేదు. పైనవాళ్ల ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళు మోటారు వేసినప్పుడల్లా గుండెల్లో రైళ్ళు. ఉన్న ఒక్క బిందె నీళ్ళు ఇవాళ అయిపోతే ఎలాగో అని బెంగపడిపోయాను. అదృష్టం బాగుండి ఇవాళ పొద్దున్నే ఆరింటికే నీళ్ళు వచ్చాయి. ఆనందమే ఆనందం. గంగాళం, స్టీలు బకెట్టు, బిందెలు, చిన్నాపెద్దా గిన్నెలు అన్నీ నింపేసా. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఇబ్బంది తెలీదు. నీళ్ళు రాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు టాంకర్ తెప్పించేవారు. అడిగిన డబ్బులు ఇస్తే సరిపోయేది. ఏ తలనెప్పి లేదు. తెలీదు. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అవటం వల్ల రోజు విడిచి రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూపులే . అసలు ఓ టైమూ పాడూ లేదు. ఒకోసారి అవీ రావు. రెండ్రోజులకోసారి వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడే ఎక్కువ పట్టేసి ఉంచుతాం. మళ్ళీ ఎల్లుండీ రాకపోతేనో...అనుకుని. ఇక వేసం కాలం ఎలా ఏడ్పిస్తాడో మరి.

బొంబాయిలో రోజు విడిచి రోజు ఇచ్చినా ఒక టైం ప్రకారం వదిలేవాడు నీళ్ళు. ఏమాటకామాటే చెప్పాలి వాళ్ల పధ్ధతుల్ని మెచ్చుకుని తీరాలి. అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. ఆఖరికి బస్సులు కూడా అందరు లైన్లలోనే ఎక్కుతారు. ఇక్కడిలా పొలోమని తోసుకుపోరు. మేం ఉన్నన్నాళ్ళు ఏనాడూ నీళ్ళకు ఇబ్బంది పడలేదు. ఇక విజయవాడ సంగతి చెప్పనక్కర్లేదు. కృష్ణమ్మ ఉండగా నీళ్లకు ఇబ్బందేమిటీ? అసలు ఆ మాటే తెలీదు. మా పనమ్మాయి అంట్లు తోముతున్నంత సేపు పంపు వదిలేసి ఉంచేది రోజూ. నేను దాన్ని కేకలేస్తూ ఉండేదాన్ని. ఆఖరికి అది మాట వినట్లేదని ఆ నీళ్ళు వేస్టవకుండా మొక్కల్లోకి వెళ్ళేలా పంపు దగ్గర నుంచి ఒక చిన్న కాలవ కూడా నేనే తవ్వాను.

ఇక విజయవాడ వదిలేప్పుడు ఎంత తగ్గించినా నా మొక్కలు కూండిలు ఒక ఏభై అయ్యాయి. సామాన్ల లారీలో అవి పట్టలేదని కేవలం వాటి కోసం నాన్న ఒక వేరే లారీ కూడా మాట్లాడారు. అలా ఒక ఏభై మొక్కలు తెచ్చాను. ఇక్కడి నీళ్ళ బెడదతో కాసిని మొక్కలు, నే పెళ్లయివెళ్ళాకా అమ్మకి ఓపిక లేక కాస్త.. మొత్తానికి ఇప్పుడు ఒక్క మొక్క కూడా మిగల్లేదు. అద్దింట్లో ఉన్నన్నాళ్ళూ వాళ్ల ఇంటాయన వాడుకోవటానికి కూడా నీళ్ళు జగ్గులతో లెఖ్ఖ కట్టి ఇచ్చేవాడు. ఇక మొక్కలకేం పోస్తారు? ఇప్పుడిక సొంతిల్లు కాబట్టి ఓపిక ఉన్నమటుక్కు కాసిని మొక్కలు కొని పెంచితోంది అమ్మ. మొన్నటిదాకా మాకూ ఇల్లు పెద్దదైనా అపార్ట్మెంట్లో బాల్కనీ లేక ఏ మొక్కా పెంచలేకపోయా. ఇదిగో ఈ ఇల్లుకి మారాకానే మొక్కల సరదా తీర్చుకుంటున్నా. ఇక్కడా క్రింద మట్టి లేదు కనుక కుండీల్లోనే.

ఇక నీళ్ల వాడకం గురించి ఎన్ని తెల్సుకున్నాననీ? బట్టలుతికిన నీళ్ళు సందు కడగటానికి, ఆకు కూరలు, కూరలు కడిగిన నీరు మొక్కలకి పొయ్యటానికీ వాడతాను. వంటింట్లో సింక్ లో ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చేతులు కడగటానికీ దానికీ దాన్నే వాడి, ఆ నీటిని మళ్ళీ మొక్కల్లో పోస్తాను.(అంటే జిడ్డు చేతులు కాదు. వంటింట్లో చాలా సార్లు చేతులు కడగటం ఒక అలవాటు నాకు..:)) ఇంకా పొద్దున్నే మొహం కడిగేప్పుడు చిన్నప్పుడైతే(పెద్దప్పుడు కూడా) బ్రష్ తో తోముతున్నంతసేపూ నీళ్ళు వదిలేసేదాన్ని. ఇప్పుడు ఒక మగ్ తో వాటర్ పెట్టుకుని వాటితో మొహం కడుగుతాను. అయిపోతే మళ్ళీ పట్టుకుంటా తప్ప టాప్ తిప్పి వదిలెయ్యను. పాపకు టబ్లో స్నానం చేయించి ఆ నీటిని బాత్రూమ్ కడగటానికి వాడతాను. ఇంకా చెప్పాలంటే జంధ్యాల సినిమాలో పిసినారి కోటా టైపులో నీళ్ళు వాడటం నేర్చుకున్నాను. రెండ్రోజులు ఉండటానికి వచ్చిన అమ్మానాన్న కూడా నా నీళ్ళ వాడకం చూసి మరీనూ... విడ్డూరం...ఓవర్ చేస్తున్నావ్..అంతొద్దు...అని వేళాకోళం మొదలెట్టారు. అయినా నే మారనుగా. మరి రెండు మూడు రోజులు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది వాటి విలువ. ఏదైనా అంతే మరి. మనుషులైనా, వస్తువులైనా ఉన్నన్నాళ్ళు విలువ తెలీదు !!

నీళ్ల గురించి కరువు పడ్డప్పుడల్లా నాకు చిన్నప్పుడు డిడి లో ఓ మధ్యాహ్నం చూసిన ప్రాంతీయ భాషా చిత్రం "తన్నీర్ తన్నీర్" గుర్తొస్తుంది. సరిత ఎంత బాగా చేస్తుందో. బాలచందర్ డైరెక్టర్ ఈ మూవీకి. ఒక మారుమూల పల్లెలో ప్రజలు నీటి కోసం పడే తాపత్రయం, ఇబ్బందులు, ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రమాణాలూ...బావుంటుంది సినిమా. దీనినే "దాహం దాహం" అని తెలుగులో డబ్ చేసిన గుర్తు. ఇందాకా వెతికితే యూ ట్యూబ్ లో మూవీ లింక్స్ దొరికాయి. ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. చిన్నప్పుడెప్పుడో చూసింది కదా మళ్ళీ నేనూ చూస్తా.
మొదటిభాగం:

http://www.youtube.com/watch?v=XtDMmQHOGBs&feature=రెలతెద్

రెండవభాగం:

http://www.youtube.com/watch?v=Xqf6s_bFU8A&feature=రెలతెద్


ఎవరికైనా బ్రష్ చేసుకునేప్పుడు సింక్లో నీళ్ళు వదిలే అలవాటు ఉంటే మానేయండి మరి. నీళ్లను జాగ్రత్తగా వాడండి. ఆదా చేయండి. ఇంతకీ ఇవాళ తృష్ణ కన్ను నీళ్ళ మీద పడిందేంటబ్బా అనుకుంటున్నారా? ఇవాళ march 22nd - World water day !!


---------------
note: నే నిచ్చిన యూట్యూబ్ లింక్స్ లో "తన్నీర్ తన్నీర్" సినిమా కొంత భాగమే ఉంది.

Monday, March 21, 2011

Dr.Balamuralikrishna - Pandit Ajoy Chakraborthi గార్ల జుగల్బందీ VCD


ఈ VCD చూస్తే మిడిమిడి సంగీత జ్ఞానం ఉన్న నాకే ఇంత ఆనందం కలిగితే నిజంగా శాస్త్రీయ సంగీతజ్ఞానం బాగా ఉన్నవారికి ఎంత ఆనందం కలుగుతుందో కదా...అన్నది ఈ VCD చూడగానే నాకు కలిగిన భావన. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ VCDలో కర్ణాటక సంగీత విద్వాంసులు డా.బాలమురళీకృష్ణ + హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్ అజయ్ చక్రవర్తి గార్ల జుగల్బంది ఉంది. హైదరాబాద్ లోని Chowmahalla Palace లో జరిగిన live concert రికార్డింగ్ ఇది.

నెట్లో వెతికితే యూట్యూబ్లో వీరిద్దరి జుగల్బందీ లింక్స్ కొన్ని దొరికాయి. సంగీతప్రియులు చూసి, విని ఆనందించండి.

http://www.youtube.com/watch?v=HEG7rIxOhgE&feature=related
http://www.youtube.com/watch?v=ER-f3fE7t30&feature=related

http://www.youtube.com/watch?v=rKviFaBPacM&feature=related
http://www.youtube.com/watch?v=TdncV2kOp-c&feature=related




ఇద్దరూ పాడిన వాతాపిగణపతిం భజే మొదటిభాగం:



రెండవభాగం:


Sunday, March 20, 2011

దెబ్బకు ఠా...


నిన్న ఒకచోటకు వెళ్ళాం. అనివార్య కారణాలవల్ల అక్కడ్నుండి morning showకు వెళ్ళాలని నిర్ణయించటం అయ్యింది. అయితే ఏ సినిమా? ఏ హాలు? అని ఆలోచిస్తే మేం వెళ్ళిన చోటుకు దగ్గరలో ఉన్న రెండు మూడు హాల్స్ లో అని డిసైడైయ్యింది. మూడింటిలోనూ "దొంగల ముఠా" అని ఉంది. ఇదేం సినిమా? ఊరూ పేరూ వినలేదే? పబ్లిసిటీ ఏం ఇవ్వలేదా? ఎప్పుడు రిలీజైంది? అన్నాను పొరపాటున. 'ఏం తల్లి ఏ లోకంలో ఉన్నావు? ఐదురోజుల సినిమా, ఐదురోజుల సినిమా అని డప్పు మోగుతూంటే? పైగా నిన్ననే రిలీజ్..' అన్నారు. "విన్నాను కానీ అయిపోయిందనీ,రిలీజ్ కూడా అయ్యిందని తెలీదు.." అన్నా. అయినా నిన్నే రిలీజ్ అయితే టికెట్లేం దొరుకుతాయి? పైగా ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్తే ఏమౌతుందో ఈ మధ్యన బాగా అర్ధం అయ్యాకా అంత సాహసం తగునా? అనిపించింది. కానీ మనసు పీకింది.. వద్దంటే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో.. ఏదో ఒకటి చూసేస్తే పోలా అనేస్కుని సరేననేసా. మనకో దుర్వ్యసనం ఉంది. తను నా కూడా వస్తే చాలు ఏ డొక్కు సినిమా అయినా చూసెయ్యబుధ్ధేస్తుంది. టిపికల్ భార్య మెంటాలిటీ. కాన్ట్ గెట్ డీవియేటెడ్ !

ఇరవై నిమిషాలు ఉంది సినిమా మొదలవటానికీ. ఎందుకైనా మంచిదని వెళ్ళినచోటే ఓసారి "దీప రివ్యూ" కోసం నెట్లో వెతికా. ఎవరీ దీప? అంటే ఫుల్ హైదరాబాద్.కామ్ లో రివ్యూలు రాస్తుందీవిడ. రివ్యులు చూసి వెళ్ళినా కొత్త సినిమాకి వెళ్ళి బుక్కయిపోతున్నామని గగ్గోలు పెడితే అన్నయ్య చెప్పాడీమధ్యనే. ఈ సైట్లో రివ్యూ చూడు. అదీ "దీప" రివ్యూ చూడు. ఆవిడ బాగా రాస్తే మనకీ నచ్చుతుంది. కనీసం రేటింగ్ అయినా సరిగ్గా వేస్తుంది. మన views తో match అవుతుందావిడ రివ్యూ అని. అప్పటి నుంచీ ఏదన్నా తెలీని సినిమాకు వెళ్ళే ముందు దీప ఎంత రేటింగ్ ఇచ్చింది అని చూసి మరీ వెళ్లటం అలవాటైపోయింది. ఇక అదివరకూలాగ నిరాశపడట్లేదు. నిన్న ఏం రాసిందో చదివే టైం లేదు కానీ రేటింగ్ 5.5 అని చూసి పర్వాలేదు అనుకుని బయల్దేరా.


ఐదు నిమిషాల్లో హాల్ చేరాం. టికెట్లు ఈజీగానే దొరికేసాయి. మా పక్కకి ఒక ముదుసలి జంట(ఇద్దరికీ 65ఏళ్ళు పైనే ఉంటాయి) వచ్చి కూర్చున్నారు. అమ్మో వీళ్ళకెంత ఓపికో ఈ ఎక్స్పరిమెంటల్ సినిమాకు వచ్చారు అని హాచ్చర్యపడిపోయేసాము. ఆ మధ్యన వర్మగారు "అడవి"లోకి తీసుకెళ్ళి భయపెట్టేసాకా మళ్ళీ వర్మ సినిమాలేం చూడలేదిక. సినిమా మొదలైంది. కెమేరా తెగ కదుల్తోంది. ఒక చోట నిలవట్లేదు. కుంచెం భయమేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తోంది. కొంపతీసి ఇది దెయ్యాల సినిమా కాదుకదా అన్నా. అయితే దెయ్యాలు లేకపోతే అండర్ వరల్డ్. రెండే కదా ఈయన థీములు.

రవితేజ గెటప్ బానే ఉంది. హీరోలా కాకుండా ఇలా ఒక మర్యాదైన భర్త పాత్ర ఏదైనా వెయ్యచ్చు అనిపించింది. అదేమిటో చార్మీ అలా మాట్లాడుతోంది? నట్టుతోందా? భర్తని దెప్పుతోందా? అర్ధం కాలే. సరే ఇద్దరు ముగ్గురు పాత్రలు బయటకు వచ్చారు. నయం ఈ ఇద్దరితోనే సినిమా లాగించేస్తాడేమో అని భయపడ్డా. కానీ ఎంతసేపటికీ కథ ముందుకి జరగదే? తొసేవాళ్ళెవరూ లేకపోయారో ఏమో. మంచు లక్షిగారు జీన్సే వేసుకుని ఓ పైపుచ్చుకుని పైకి పాకుతున్నారు. సారీ ఎక్కుతున్నారు. ఆ తర్వాత కూడా కెమేరా ఛార్మీ జీన్స్ దాటి ముందుక్కానీ వెనక్కిగానీ వెళ్లటం లేదు. నాకు "క్షణ క్షణం"లో శ్రీదేవి జీన్స్ వేసుకుని పైకెక్కటం గుర్తు వచ్చింది. పాపం జీన్స్ కీ - డైరెక్టర్ కీ ఏదో అవినాభావసంబంధం ఉండి ఉంటుంది అనుకున్నా.

సినిమా సస్పెన్సా? కామిడీనా? డైరెక్టర్ ఇంటర్వెల్ దాకా డిసైడ్ చేసుకోలేకపోయాడు పాపం. ఇంటర్వెల్లో పక్కన కూర్చున్న తాతగారు బయటకు వెళ్ళివచ్చారు ఓపిగ్గా. మంచు లక్ష్మి ని చూస్తూంటే నాకు పాత సినిమాల్లోని విజయలలిత గుర్తుకు వస్తోంది. "అనగనగా.. " సినిమాలో కూడా ఆ నటన అదీ చూస్తూంటే విజయలలితే గుర్తు వచ్చింది. సరిగ్గా వాడుకోవాలి కానీ తెలుగు తెరకు ఒక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది అనిపించింది నాకు. లేడి విలన్ గా ఎస్టాబ్లిష్ అవటం ఇష్టం లేకనేమో ఈ సినిమా కథ మధ్యలో అర్జెంట్గా పోలీస్ఆఫీసర్ అయిపోతుందీవిడ. ఏదో ఒకటి తెలుగు కాస్త సరిగ్గా పలికితే బాగుండు...ఆ డైలాగులు వింటూంటే రెండు మూడు రోజుల క్రితం ఏదో బ్లాగ్లో ఈవిడ తెలుగు ఏక్సెంట్ మీద చదివిన టపా గుర్తుకొచ్చింది.(తన పక్కన కూర్చుని, సినిమాహాల్లో కూడా బ్లాగు ని మర్చిపోని వీర బ్లాగర్ని..హా..హా..హా)

రెండవ భాగం సినిమాలో కాస్త కామెడీ కనబడింది. సినిమాను ఏ జానర్ లోకి తొయ్యాలో అప్పటికి డిసైడ్ అయ్యిందన్నమాట. బ్రహ్మాజీకి పాత్ర, డైలాగులు లేకపోయినా అతని మేనరిజం నాకు భలే నచ్చేసింది. ముగ్గురు దొంగలతో రవితేజ డైలాగులు చెప్తున్నప్పుడు, తలొకరి వైపూ చూసి తలాడించటం విసుగనిపించినా నవ్వు తెప్పించింది. బ్రహ్మానందానికి బొత్తిగా చెయ్యటానికి ఏం లేదు. ప్రకాష్ రాజ్ కూడా అనవసరమ్ అనిపించింది. కానీ కథనంలో బలం లేక ఈ నటులవాల్లనైనా చివర్దాకా చూడగలిగాం. కొత్త ఎక్స్పరిమెంట్ చెయ్యాలన్నా శ్రధ్ధ కథనం పట్ల కూడా ఉండి ఉంటే మంచి సినిమాగా మిగిలిపోయేదేమో. చివరలో ఆ పాట ఎందుకో తెలీలేదు. ప్రేక్షకుడిలో ఇంకా ఏ మాత్రమైనా సహనం మిగిలి ఉందా అని పరీక్షించడానికేమో.

ఇహ సినిమాకు వాడిన కెమేరా, లైటింగ్ గట్రాల గురించి చాలామంది చాలా చోట్ల రాసేసారు. గంటన్నర లో సినిమా అయిపోవటం మాత్రం తెగ నచ్చేసింది.ఇంతకీ సినిమా ఎలా ఉందీ అని మేం వెళ్ళమని తెలిసిన అందరూ అడగటమే. "అదే..సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాకుండా ఉంది..."అని చెప్పా. ఇంతవరకూ డిసైడ్ చేస్కోలేకపోయా. అద్ది రాం గోపాల్ వర్మ టాలెంట్ అంటే. ఈ డెసిషన్ మేకింగ్ లో కాస్త మీరు హెల్ప్ చేయ్యరూ..?

Saturday, March 19, 2011

నిరీక్షణ..


నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?

క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..

చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

*** *** *** *** ***

పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.

పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.

Thursday, March 17, 2011

త్రిశతం


ఈ మెట్టు మొత్తానికి ఎక్కేసాను. మధ్య మధ్య ఆగిపోతూ ...పడుతూ..లేస్తూ..వగరుస్తూ...ఒకోసారి నెమ్మదిగా పాకుతూ.. మొత్తానికి ఇలా మూడొండలవ టపా పూర్తి చేస్తున్నాను. రెండో మూడో టపాలు తీసేసాకా, కొన్ని డ్రాఫ్ట్ లోకి తోసేసాకా, మరికొన్ని నా ఇతర బ్లాగ్విభజన్లోకి వెళ్పోయాకా ఇదిగో ఇప్పటికి మూడొందలకి చేరాను. మొదట్లో ఉన్న మామూలు స్పీడ్లో వెళ్లి ఉంటే కనీసం ఐదొందలు దాకా చేరేదాన్ని. కానీ నిజ జీవితం లాగే ఈ బ్లాగ్ జీవనం కూడా ఒక roller coaster రైడ్ లాంటిదే. కాబట్టి సీదాగా ప్రయాణం సాగించలేకపోయాను. ఈ మెట్టును చేరటం సులభమైతే కాలేదు. మొదట్లో కొన్ని బ్లాగుల్లో లకారం పైనే ఉన్న విజిటర్స్ నంబర్ చూసి అమ్మో అనుకునేదాన్ని. అలాంటిది క్రితం నెల్లోనే నా అతిధుల జాబితా కూడా లక్ష దాటింది. నామటుకు నాకు అది చాలా ఆనందకరమైన విషయం. ఎక్కువ వ్యాఖ్యలు రావటం వేరు, ఎక్కువమంది బ్లాగును చదవటం వేరు.

దాదాపు ఏడాది పూర్తయ్యేవరకూ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అని కలవరించేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ వ్యాఖ్యలు వస్తే ఆ రోజంతా సంబరమే. ఎందుకంటే ఏ రచయితకయినా చదివేవారి స్పందనే ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా బాగా రాయాలన్న ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి వ్యాఖ్యలు తగ్గిపోయినప్పుడు కృంగిపోయేదాన్ని. ప్రముఖ బ్లాగర్లు ఏం రాసినా ఆహా ఓహో అంటారు, సామాన్య బ్లాగర్ మంచి విషయాలు రాసినా ఒక్క వ్యాఖ్యా రాయరు అని తిట్టుకునేదాన్ని. కాబట్టి నాకున్న సమయంలో నేను కొత్త బ్లాగ్ ఏదైనా చదివితే మాత్రం నచ్చిన చోట తప్పక వ్యాఖ్య రాస్తూంటాను. కానీ మెల్లగా నాకు అర్ధమైన సంగతి ఏంటంటే నా బ్లాగ్లో వ్యాఖ్యల కన్నా రీడర్స్ సంఖ్య పెరుగుతోందని. ఒకప్పుడు వందమంది మాత్రమే చదివే ఈ బ్లాగ్ ను రోజుకు మూడొందలు తక్కువ కాకుండా చదువుతున్నారు. అది నాకు విజయమనే చెప్పాలి.

వ్యాఖ్యలు రాయకపోయినా రెగులర్గా నా బ్లాగ్ చదివే నా మిత్రులు, బంధువులు ఎంతో మంది ఉన్నారని ఈ మధ్యనే తెలిసింది. "పొద్దుటే ఆఫీసుకి రాగానే ఇవాళేం రాసావో అని చూడటం అలవాటయిపోయింది...నువ్వు రాయటం మానేస్తే మళ్ళీ ఎప్పుడు రాస్తావు అని చూస్తుంటాను..." అని కొందరు ఇటీవలే చెప్పటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి అప్పుడప్పుడు వ్యాఖ్య రాయచ్చుకదా అంటే "ఆఫీసులో ఉంటాకదా కుదరదు..ఒకోసారి బధ్ధకం" అని సమాధానం. ఇలా నాతో చెప్పకపోయినా చదివేవాళ్లు ఇంకా ఉన్నారన్న ఆలోచన రాయాలన్న సంకల్పాన్ని దృఢం చేస్తుంది.

ఇక భాస్కరన్నగారు తన 400వ టపాలో రాసినట్లుగానే ఉంటుంది బ్లాగ్లోకంలో ఈక్వేషన్..
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్
(ఇది భాస్కరన్నగారు రాసిన ఈక్వేషనే)

నేనూ అలా చాలామంది రీడర్స్ ను దూరం చేసుకున్నాను. కామెంట్స్ తగ్గిపోయాయి. కానీ ఇంకా కొందరున్నారు. నేనెప్పుడూ వాళ్ల బ్లాగ్ జోలికన్నా వెళ్ళకపోయినా వ్యాఖ్యలు రాస్తారు. వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. ఏమాటకామాటే.. నేనంత మంచిదాన్ని కాదు మరి. కొంచెం చెడ్డదాన్నే...:) కొత్తల్లో బ్లాగ్లోకం చాలా బాగుండేది. ఈమధ్యన పాతమిత్రులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరే రాయటం మానేస్తున్నారు. ఎంతో దిగులుగా ఉంటుంది. ముఖ పరిచయం లేకపోయినా అల్లుకుపోయిన స్నేహాలను మరిచిపోవటం సాధ్యమా? అలాఅని రాస్తూ ఉండమని ఎంతమందినని అడిగేది? ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఎవరికి ఎరుక? నాకూ కుదరటం లేదు. కానీ ఛీ పొమ్మన్నా చూరుపట్టుకుని వేళ్ళాడే దశమగ్రహం లాగ ఎన్ని అడ్డంకులొచ్చినా బ్లాగ్లోకపు చూరును వదలలేదు. ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసిన నాకు బ్లాగింగ్ వదిలేయటం కష్టమైన పని కాదు. ఇదొక వ్యసనమని కాదు.... ఒడిదొడుకుల జీవితానికి బ్లాగింగ్ ఒక ఆటవిడుపు అని.

ఇంకో కొత్త విషయం ఈ మధ్యన బోధపడింది. నా బ్లాగ్ నచ్చనివాళ్ళు, నా రాతల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా ఉన్నారని. అవును మరి నాణానికి రెండో వైపు కూడా చూడాలికదా. నా బ్లాగ్ నచ్చనివారికీ, నా రాతలు వేళాకోళంగా అనిపించేవారికీ ఒక్కటే మాట చెప్తాను...దయచేసి నా బ్లాగ్ చదవకండి. నచ్చనివి చదవటం ఎందుకు? మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? నా రాతలు నచ్చేవారే నా బ్లాగ్ చదువుతారు. నా సొంత బ్లాగ్లో నాకు తోచిన రాతలు రాసుకునే హక్కునీ, అవకాశాన్ని, నాకు తోచిన విషయాలు రాసుకునే స్వేచ్ఛనీ నాకు బ్లాగ్ స్పాట్ వాళ్లు ఇచ్చారు. నే రాసినది మరో పదిమంది చదవాలన్నది నా అభిలాష కాబట్టి అగ్రిగేటర్లలో నా బ్లాగ్ ఏడ్ చేసుకున్నాను. కాబట్టి నా రాతలు నచ్చనివాళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని, మేధస్సునీ ఈ బ్లాగ్ చదవటానికి కాకుండా మరో మంచి పనికి వినియోగించుకోవలసినదని సవినయమైన మనవి.

దాదాపు ఇరవై నెలల బ్లాగింగ్ అనుభవంలో చివరిగా నేను చేసుకున్న నిర్ణయం ఒక్కటే. రాయాలని తోచినన్నాళ్ళు, కుదిరినన్నాళ్ళు రాస్తాను. చదివేవాళ్ళు చదువుతారు. అంతే. వ్యాఖ్యలకై ఎదురుచూపులు, చింతించటాలు ఎప్పుడో పోయాయి. ఈ బ్లాగ్ ఒక సామాన్య మధ్యతరగతి స్త్రీ మనోభావాల సమాహరం. నిరంతరం ఘోషించే కెరటాల మాదిరి ఈ ఆలోచనలు విశ్రాంతి నెరుగవు. "బ్లాగనందం" అనే టపాలో చెప్పిన పాటనే ఇప్పుడు కూడా నా బ్లాగ్ కు డెడికేట్ చేస్తున్నాను..

"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటో
పొల్చుకో హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."


మరోసారి.. మరోసారి.. మరోసారి.. నా బ్లాగ్ చదివే పాఠకులకూ, వ్యాఖ్యలు రాసి ప్రోత్సహించే అభిమానులకూ శతకోటి వందనాలు.

Wednesday, March 16, 2011

మల్లాది సూరిబాబుగారి గాత్రం


"మల్లాది సోదరులు"గా పేరుగాంచిన కర్ణాటక సంగీతకళాకారులు మల్లది శ్రీరామ్ ప్రసాద్, మల్లది రవి కుమార్ సోదరుల తండ్రిగారు శ్రీ మల్లది సూరిబాబుగారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌన్సర్ గా రిటైరయ్యారు. నాన్నగారి కొలీగ్ కావటంతో చిన్నప్పటి నుంచీ పరిచయం. సూరిబాబు మావయ్యగారు అనే ఇప్పటికీ పిలుస్తాను. ఇటీవలే ఇంటికి వెళ్ళినప్పుడు మావయ్యగారిని చాలా ఏళ్ళతరువాత కలవటం కూడా జరిగింది. మావయ్యగారు చాలా బాగా పాడతారు. మా చిన్నప్పుడు ఎప్పుడటువైపు వెళ్ళినా శిష్యులతో వాళ్ళ ఇల్లంతా నిండిపోయి ఉండేది. లలిత, శాస్త్రీయ సంగీతాలను ఆయనవద్ద నేర్చుకోవటానికి ఎంతో మంది పొరుగూళ్ల నుంచి కూడా వస్తూండటం నాకు తెలుసు. నాకెంతో ఇష్టమైన ఆయన గాత్రంలో ఒక భక్తి గీతం ఇక్కడ వినండి. రొటీన్ గా కాకుండా ఒక విశిష్ఠతతో వినేకొద్దీ వినాలనిపించే ఆయన గాత్రం చాలా బావుంటుంది.

రచన: ఆదూరి శ్రీనివాసరావు
గానం: మల్లది సూరిబాబు
ఆల్బం: సాయినాదఝరి




వీడకుమా విడనాడకుమా (2)
ఎదనుండి ఎడబాయకుమా(2) llవీడకుమాll

కనులలో దాగిన కాంతివి నీవు
చెవులకు వినికిడి శక్తివి నీవు
దేహము లోని దేహివి నీవు(2)
ఆకృతిలేని ఆత్మవు నీవు llవీడకుమాll

సత్యము తెలిపిన సద్గురు స్వామివి
అందరిలోనీ అంతర్యామివి
శ్రీశైలములో సుందర శివుడవు
పళనిలో వెలసిన శరవణభవుడవు llవీడకుమాll

ఏమరుపాటుతో మిడిసిపాటుతో
ఎపుడైనా నే తలచకున్నను
కంటికి రెప్పగా కాయుము దేవా
తీరుగా నడుపుము జీవన నావ llవీడకుమాll

*******************

ఇది మరో చిన్న ఆలాపన. "నిశ్శబ్దం-గమ్యం" అనే నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాం లోది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రాసిన ఈ వాక్యాలు ఎంత సత్యమో కదా అనిపిస్తాయి.


ఇక్కడని అక్కడని ఎక్కడ ఎన్ని శిఖరాలెక్కినా
ఒక్కనాడూ...
ఒక్కనాడూ మనిషి లోపలి లోభము ఎక్కడ తీరదూ
మనిషి లోపలి లోభమెక్కడ తీరదూ...




Tuesday, March 15, 2011

ఏళ్ళు మారినా రైళ్ళలో ఇదే ఇబ్బంది !


రైళ్ళతో నా అనుబంధం చాలా ఎక్కువనే చెప్పాలి. దాదాపు ఇరవైఏళ్ళపాటు పొద్దున్నే లేచి విజయవాడలో సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి మధ్యాహ్ననికి కాకినాడ చేరేవాళ్ళం. వెళ్ళేప్పుడు ఇదే రైలు. తిరిగివచ్చేప్పుడూ అదే రైలు. మధ్యాహ్నం ఎక్కితే రాత్రికి చేరేవాళ్ళం. రత్నాచల్ వచ్చాకా దానికి మారిపోయాం. కానీ దానిలో ఓ నాలుగైదేళ్ళకన్నా ఎక్కువ ప్రయాణించలేదు. ఎక్కువ సర్కారే మా ఆస్థాన రైలు. రెండు మూడు నెలలకోసారి తప్పక ప్రయాణాం ఉండేది. మరి మా అన్నయ్య అక్కడే ఉండేవాడు కనుక కాలేజీకొచ్చేదాకా ఏ శలవులొచ్చినా మాకు తెలిసినది కాకినాడ ప్రయాణమే . కాలేజీలోకి వచ్చాకా పెద్దమ్మావాళ్ళ ఊరు భీమవరం, పిన్నీ వాళ్ళ ఊరు నర్సాపురం అనీ శలవుల్లో బంధువుల ఇళ్ళకు వెళ్ళటానికి పర్మిషన్ దొరికేది. ఆ ఊళ్ళకి ఆయా పాసింజర్లు ఎక్కేవాళ్లం. చాలా చిన్న దూరాలకు బస్సు తప్ప ఎప్పుడూ రైళ్ళే ఎక్కేవాళ్ళం.

ఇంతకూ సర్కార్ ఎక్స్ ప్రెస్ లో మాది సిట్టింగ్ జర్నీ అయినా రిజర్వేషన్ ఉండేది. వారం ముందో, శలవు దినాలైతే ఇంకా ముందో రిజర్వేషన్ చేయించేసేవారు నాన్న. వెళ్ళేప్పుడు తక్కువ సామాను ఉన్నా వచ్చేప్పుడు మాత్రం చాలా సామాను ఉండేది. విజయవాడ, కాకినాడ రెండూ స్టార్టింగ్ స్టేషన్సే కాబట్టి రద్ది ఉండేది కాదు. ఎక్కటానికీ దిగటానికీ వీలుగానే ఉండేది. ఎప్పుడూ కూడా మధ్యలో మాత్రం విపరీతమైన రద్దీ ఉండేది. డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగస్తులూ, కాలేజీ పిల్లలతో కిటకిటలాడుతూ ఉండేది రైలంతా. రాజమండ్రి అమ్మావాళ్ల ఊరవటంతో అక్కడ ఎవరో ఒకళ్ళు, భీమవరంలో పెద్దమ్మావాళ్ళు స్టేషన్కు వచ్చేవారు. వాళ్ళు ఎక్కి కాసేపు కూర్చునేవాళ్ళు. ఒకోసారి అలా కుదిరేది కాదు జనం వల్ల. బయట నించునే మాట్లాడేసి వెళ్పోయేవారు. అసలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలోకి మామూలు జనం ఎందుకు ఎక్కుతారో , ఎందుకు ఎక్కనిస్తారో ఇప్పటికీ నాకు అర్ధం కాని ప్రశ్న. డైలీ ట్రావెల్ చేసేవాళ్లకి వేరే కంపార్ట్మెంట్లు ఇవ్వచ్చు కదా? రిజర్వేషన్ దాంట్లో కి ఎందుకు ఎక్కనివ్వాలి? పైగా ఎక్కి ఊరుకోరు కూచోనిమ్మని గొడవ పెడతారు. జరగకపోతే తిట్టుకోవటం. క్యూల్లో నించుని రిజర్వేషన్ చేసుకుని మేము ఎక్కితే, అప్పటికప్పుడు రిజర్వ్డ్ బోగీలోకి రాజాలా ఎక్కేసి సీట్ల కోసం దెబ్బలాడటం ఏమిటో అర్ధమయ్యేది కాదు నాకు చిన్నప్పుడు.

ముగ్గురు కూచోవాల్సిన సీట్లలో మినిమం ఏడుగురు ఇరుక్కుని కూర్చునేవారు. మాకు రిజర్వేషన్ ఉంది మొర్రో అన్నా వినిపించుకోకుండా జరగండి జరగండి అని డిమాండ్ చేసి కూర్చునేసేవారు జనాలు. పోనీ కూర్చుని ఊరుకుంటారా అంటే అదీ లేదు. మన చేతిలోని పుస్తకమో పేపరో, విక్లీనో కబ్జా చేసేసి మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అని భయపడేట్టు చేయటం. లేకపోతే అది అలా అలా చేతులు మారుతూ పోయి మనం దిగే టైంకి ఎక్కడికి చేరిందో కూడా తెలీని పరిస్థితి వచ్చేది.వచ్చినా రూపురేఖలు కోల్పోయి వెనక్కు వచ్చేది. ఇక కంపార్ట్మెంట్ అయితే జనాలకు డస్ట్ బిన్ తో సమానం. కూర్చున్నచోటే వేరుశనగ తొక్కలు, నలిపేసిన కాయితం ముక్కలు, సీట్ల మీద అడ్డమైన రాతలు ఒకటేమిటి ? ఎక్కేప్పుడు అప్పుడే బీరువాలోంచి తీసిన ఇస్త్రీ చొక్కాలాగ నీట్ గా ఉన్న కంపార్ట్మెంట్ దిగే సమయానికి డస్ట్ బిన్లా మారిపోయేది. ఇక రైల్లో టాయిలెట్స్ అయితే డోకొక్కటే తక్కువ. గంతలు గంటలు వెళ్లకుండా ఉండలేము వెళ్ళి డోక్కోకుండా బయటకు రాలేము. నాకు తెలిసి ఓ ఇరవై పాతికేళ్లపాటు అంత భీభత్సంగా ఉండేది సర్కార్ ఎక్స్ ప్రెస్.



ఆ తరువాత "రత్నాచల్" చాలా నయం అనే చెప్పాలి. ఇక విజయవాడ వదిలాకా డే టైం జర్నీ చేయాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నైట్ జర్నీలే. పడుకోవటం పొద్దున్నే లేవటం. దానితో ఈ డే జర్నీలు ప్రస్తుతం ఎలా ఉన్నయో తెలీదు నాకు. మళ్ళీ దాదాపు పదేళ్ల తరువాత మొన్న ఒక పెళ్ళికి వెళ్లటానికి sitting జర్నీ చేయాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడూ కూడా. రిజర్వేషన్ వారం ముందే చేసారు తను. ఇక ఆరేళ్ళు నిండాయి కాబట్టి పాపకు కూడా టికెట్ కొన్నారు. వెళ్ళేప్పుడు రైల్లో బానే వెళ్ళిపోయాం. సీటింగ్ బాగుంది. ఆ రైలు అదే ఎక్కటం నేను. వచ్చేప్పుడు మాత్రం మళ్ళీ ఓసారి ఇరవై, పదేళ్ళ వెనుకటి ప్రయాణాలు గుర్తుకు వచ్చింది. రైలుపై అవే రాతలు, బోగీల్లో నానా తుక్కూ, రిజర్వేషన్ లేకుండా ఎక్కేసే జనం. జరగమన్నామని తిట్టుకోవటాలు, కంపుకొట్టే చెత్త టాయిలెట్లు.

వచ్చేప్పుడూ రైల్లో మధ్యలో ఓ చోట ముగ్గురు ఎక్కారు. "రిజర్వేషన్ చేయించుకున్నాం. పాపకు ఇబ్బందిలేకుండా దానికీ టికెట్ కొన్నాము. మేం జరగము." అని చెప్పము. అయినా అక్కడే నిలబడి దిగేదాకా మరో నాలుగైదు సార్లయినా జరగమని, చోటిమ్మని అడిగారు. పాపని ఒళ్ళో కూచోపెట్టుకోమంటారు. వారం క్రితం రిజర్వ్ చేయించుకున్నాం మొర్రో అన్నా వినరే. పెళ్ళిలో ఆడి ఆడి అలసిపోయి పాప నిద్రోయింది చాలా సేపు. పడుకుని లేవటంలేదని "పిల్ల కాదు పిశాచం" అన్నాడు నించున్న వాడు పక్కనమ్మాయితో. నాకు వినబడింది, ఒళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉందా? అని గట్టిగా అరిచేసాను రైల్లో.(వాడన్న మాటకు నాకు గౌరవమివ్వాలని కూడా అనిపించలేదు. ఏకవచనం వాడేసా) గొడవెందుకని తను ఆపేసారు. అటు తిరిగిపోయి నించున్నాడింకతను మొహం చెల్లక. ఓ పక్కన విపరీతమైన ఎండ భరించటం కాక మా సీట్లో మేము కూచుంటే కూడా ఇలా మాటలు పడాల్సిరావటం చాలా చికాకు తెప్పించింది. బస్సులో అయినా వెళ్దాం కానీ ఇంకెప్పుడూ సిట్టింగ్ జర్నీలొద్దు బాబోయ్ అని శ్రీవారితో మొరపెట్టుకున్నాను. ఏళ్ళు మారినా రైళ్ళలో ఇబ్బందులు, పరిస్థితులు ఇలానే ఉన్నాయే అని ఆశ్చర్యం,అసహ్యం కలిగాయి.


*************************
"రైలు ప్రయాణం "గురించి నేను రాసిన పాత టపా ఇక్కడ.

Monday, March 14, 2011

ప్రకృతి వైపరీత్యాలు

నాల్రోజులు పాటు టివీ, న్యుపేపర్లు చదవలే. ఊరెళ్ళి వచ్చి టివీ పెట్టగానే కనబడ్డా వార్తలు కలవరపెట్టాయి. రాష్ట్ర రాజధానిలో విగ్రహాల కూల్చివేత, జపాన్లో భయంకర సునామీ..భూకంపం....ఇవాళ పొద్దున్నేనేమో రేడియేషన్ భయం..అంటూ వార్తలు..! రాష్ట్రంలో సంగతి గురించి విచారించటం తప్ప ఏమీ చెయ్యలేం. పాపం విగ్రహాలేం చేసాయి...వాటి తాలూకు మనుషులకు కాదు ఇది తెలుగు జాతికి జరిగిన అవమానం అనిపించింది నాకు. రాష్ట్ర భవిష్యత్తు కాలానికే తెలుసు కదా అనుకున్నా..

సూర్యుని కిరణాలు మొదట తాకే నేల కాబట్టి "Land of Rising sun" అని చిన్నప్పుడు చదువుకున్న పాఠo. ప్రపంచయుధ్ధంలో పెద్దఎత్తున నష్టపోయాకా, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చవి చూశాకా కూడా మళ్ళీ నిలదొక్కుకుని ఆ దేశం సాధించిన ప్రగతి నన్ను అబ్బురపరుస్తాయి. ఇవాళ మరోసారి జపాన్ దేశం లో జరిగిన భీభత్సాన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. రైల్లో వస్తూంటే "పేపరే చూడలేదు ఈ నాలుగురోజులు. ప్రపంచం ఏమౌతోందో.." అన్నాను. నిజంగానే నాలుగురోజుల్లో ఎన్ని దుర్ఘటనలు జరిగిపోయాయో..

What are natural calamities and how does they occur? అని చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో ప్రశ్న ఉండేది. అది గుర్తొచ్చింది ఇవాళ న్యూస్ చూడగానే.. ప్రపంచంలో ఏదో ఒక చోట మానవుడి ప్రమేయం లేకుండా ప్రకృతి చేసే విలయతాండవ రూపమే ఈ వైపరీత్యాలు... మరి అవి ఎందుకు వస్తాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటూ పెద్ద జవాబే ఉండేది స్కూలు పుస్తకాల్లో. కానీ వేదాంతధోరణిలో చెప్పాలంటే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని దించటానికి దేవుడు ఇలాంటి వైపరీత్యాలు సృష్టిస్తూ ఉంటాడు అని ఎక్కడో చదివిన గుర్తు.

ప్రపంచం ఎంత అభివృధ్ధి చెందినా, అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని సంపాదించినా ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆ పరిజ్ఞానానం అంతా మూగపోతుంది. చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయతలో మిగిలిపోతుంది. అంతా ప్రకృతి మాయ. జపాన్ లో ఈ వైపరీత్యం వాల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని, నష్టపోయిన కుటుంబాలు కొంతమేరకైన బాగుపడాలనీ, కనబడకుండా పోయిన కుటుంబసభ్యులు వారి వారి కుటుంబాలను మళ్ళీ చేరుకోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మీరూ ప్రార్ధించండి.

'Japan Earthquake: before and ఆఫ్టర్' అని ఒకచోట దొరికిన ఫోటోలు నేను ఇప్పుడే చూసాను. క్రింద లింక్ లో చూడండి...
http://www.abc.net.au/news/events/japan-quake-2011/beforeafter.htm

Tuesday, March 8, 2011

అభివందనం..



అన్నివేళలా పక్కనుండగల శక్తి
ఏది, ఏంత చెప్పినా వినే ఓరిమి
అర్ధం చేసుకునే సహనం
శ్రధ్ధ తీసుకోగల అభిమానం
అనురాగం ఆత్మీయత నిండిన
నవనీత హృదయ మగువ.

అన్నదమ్ములకు అనురాగం అందించినా
తల్లిదండ్రులకు అభిమానం పంచినా
స్నేహసౌరభాలు పంచిఇచ్చినా
భార్యగా బంధాలు పెనవేసినా
మాతృత్వపు మమకారాలు చూపినా
అత్తింట బాధ్యతలు తనవి చేసుకున్నా
ఉద్యోగభారాన్ని సమర్ధంగా మోసినా
ఎక్కడ ఎన్ని అవతారాలెత్తినా
తన స్త్రీత్వమనే అస్థిత్వాన్ని పదిలపరుచుకుంటుంది అతివ.


అపురూపమైన ఈ అస్థిత్వాన్ని గుర్తించలేని నిర్భాగ్యులు కొందరైతే
అదే అస్త్రంగా తమ స్త్రీత్వాన్ని ప్రజ్వలించుకునేవారు కోకొల్లలు.
పరిపూర్ణమైన ఆ స్త్రీత్వానికి వందనం.
ప్రతి బంధంలో ప్రాణం నింపే ప్రతి అతివకూ అభివందనం.




Sunday, March 6, 2011

ఒళ్ళు మండుతోంది..

ఆ దృశ్యం చూసినప్పటి నుంచీ.
నిన్న పొద్దున్నుంచీ.
ఒళ్ళు మండుతోంది.
బుడుగు భాషలో చెప్పాలంటే నడ్డి మీద చంపెయ్యాలన్నంత ఖోపం. ప్రతి పనికీ ఆ వీధిలోంచి వెళ్ళక తప్పదు. నిన్న కూడా ఆ ఇంటి మీదుగా నాలుగైదుసార్లు వెళ్ళాల్సివచ్చింది. అలా వెళ్ళినప్పుడల్లా మనసు రగిలిపోయింది. ఇవాళ పొద్దున్న కూడా పాల కోసం వెళ్తూంటే మళ్ళీ అల్లంత దూరంలో ఆ ఇల్లు కనబడగానే నిన్నటి విషయం గుర్తుకొచ్చి భలే కోపం వచ్చింది. అసలు మొదటి నుంచీ అతనిది ఏదో తేడా బొమ్మ అనే అనుకుంటూ వస్తున్నా. ఇప్పుడిక కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటిదాకా అతనిపై ఉన్న కాస్త జాలీ కూడా ఎగిరిపోయింది. దగ్గరకు వెళ్ళీ, ఏమయ్యా ! నీకసలు మనసుందా? మనిషివేనా? అని కడిగెయ్యాలని. బాగా మనసారా తిట్టాలని...అనిపించింది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. నాకేం హక్కుంది? అతని ఇల్లు అతని ఇష్టం.

మేం ఈ ఏరియాలోకి వచ్చాకా ఏదన్నా పని మీద వెళ్లాలంటే ఆ వీధి లోంచే వెళ్ళాలి. బస్టాప్ దాకా వెళ్ళాలంటే ఐదు నిమిషాల నడక. దారిలో చాలా ఇళ్ళున్నా నా దృష్టి వీధికి ఎడమవైపున్న ఆ ఇంటి మీద పడటానికి ఒక బలమైన కారణం ఉంది. సన్నజాజి తీగ. నాకెంతో ప్రీతిపాత్రమైన పూలు. కాస్తా కూస్తా కాక ఇంత లావు మొదలుతో ఖాళీగా ఉన్న డాబా పైకి పాకిన పెద్ద తుప్పులా ఉన్న సన్నజాజితీగను చూసి రోజూ ఆనందిస్తూ ఉండేదాన్ని. ఇంకెంత మరో నెలారెంణెళ్ళు ఆగితే చెట్టంతా పువ్వులే అన్న ఊహ నన్ను చాలా సంబరపెట్టేది. ఆ తరువాత,ఆ ఇంటి గేటు దగ్గరే ఎప్పుడూ కనబడుతూ ఉండే సర్దార్జీ ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేది. ఏభై యేళ్ళకు ఏ మాత్రం తక్కువ ఉండదు అతని వయసు. అంత పెద్ద ఇంట్లో అతను కాక ఒక ముసలి తల్లి మాత్రం కనబడుతూ ఉంటూంది. మరెవరూ కనబడేవారు కాదు. పైగా రోజూ ఏ వేళలో అటువైపు వెళ్ళినా ఆ గేటు దగ్గరే కుర్చీలో నిద్రోతూనో, నించునో కనబడతాడు ఆయన. రోజూ అదే దారి కావటంతో కొన్నాళ్ళకు గేట్లో ఆయన కనబడకపోతే ఆశ్చర్యం వేసేది. ఇవాళేంటి లేడు అని. ఆయన గురించి బస్టాప్ వచ్చేదాకా మాకు డిస్కషను. "ఎందుకండీ ఆయన అక్కడే నిలబడతాడు? ఏం పని లేదా? ఆ ఇంట్లో ఇంకెవరూ లేరేంటి? పెళ్ళవలేదంటారా? " అని తనని ప్రశ్నలతో వేధించేదాన్ని. "మనకెందుకు? అతని ఇల్లు అతని ఇష్టం. నించుంటాడో కూచుంటాడో." అనేవారు తను. "అలాక్కాదండీ, అలా వీధిలో నించునే ఉంటాడెందుకు? వేరే పనేం లేదా? అదేం టైం పాస్? ఏ పుస్తకమో చదువుకోవచ్చు కదా? కంప్యూటర్ లేదంటారా? లేదా టివీ చూడొచ్చు కదా? ముప్పొద్దులా అలా గేట్లోనే ఉంటాడేం? వాళ్ళీంట్లో ఏవైనా విలువైన వస్తువులున్నాయేమో? వాటికి కాపలాగా అలా నింఛుంటాడేమో?" అని అనేదాన్ని.
ఓ రోజలాగే ఏదో అనబోయాను. "అతని కాలు వైపు చూడు" అన్నారు తను. అప్పుడు చూశాను అతని ఒక కాలు బాగా లావుగా వాచి ఉంది. ఏదో కట్టు కూడా ఉంది. చూట్టానికి భయం వేసింది. "ఓహో అదన్నమాట సంగతి. ఏదో దెబ్బ తగిలి ఇలా ఇంట్లో ఉండిపోతున్నాడన్న మాట" అన్న సమాధానం దొరికింది. కానీ దెబ్బ తగిలితే ఇంట్లోనే ఉండచ్చు కదా. ఇలా వీధిలో నిలబడటం ఎందుకు? పైగా ఓ కుర్చీ కూడా వేసుకుని రాత్రిళ్ళు కూడా అక్కడే కూచుని కనిపిస్తాడు. కాలక్షేపానికి ఏం చేయాలో తెలియదా ఈయనకి?" అని బోలెడు ప్రశ్నలు నాకు. మరో రోజు వాళ్ళింటి గోడ దగ్గర ఏదో తుక్కు పోతున్నారని ఎవరినో తిడుతున్నాడు. ఆ తరువాత సంత రోజున కూరలవాళ్ళు ఆ ఇంటి ముందు కూరలు పరచబోతే ఒప్పుకోలేదు. ఇంతోటి ఇంద్ర భవనానికీ అడ్డామా అని నవ్వుకున్నాం. కూరలవాళ్ళు సణూక్కుంటూంటే మేమూ నవ్వుకున్నాం. కిరికిరీ మనిషన్న మాట. అనుకున్నాం.

ఇక నిన్న పొద్దున్నే వెళ్తూంటే ఆ ఇంటివైపు చూసి అవాక్కయ్యాను. తరువాత బోలెడు ఖోపం వచ్చేసింది. ఓళ్ళు మండిపోయింది. ఇంతకీ ఏం చేసాడో తెలుసా? అంత లావు మొదలుతో మరో నెల్లో పూయబోయే సన్నజాజి తీగ మొదలంటా నరికించేసాడు. అదేం పాపం చేసింది పాపం? నోరు లేని జీవం. పచ్చగా ఉన్న తీగను ఎలా నరకాలనిపించిందో. పరీక్షగా చూస్తే ఇంటికి రంగులేస్తున్న పనివాళ్ళు కనబడ్డారు. ఇంటికి రంగు వెయ్యటానికి అడ్డం వస్తోండని కొట్టించేసాడన్న మాట. కాసిని కొమ్మలు కొట్టించి మిగతాది ఉంచచ్చు కదా. ఇప్పుడా ఇంటి అందానికి ఇదేం అడ్డం వచ్చింది? ఉండేది ఇద్దరే కదా. ఎలాగోఅలా ఈ కిరికిరీ అంకుల్ ను మంచి చేసుకుని వేసం కాలంలో ఆ సన్నజాజి పూలూ రోజూ కోసుకోవచ్చని ఎన్ని కలలు కన్నాను..? ఒప్పుకోకపోతారా? అనుకున్నా. అంత పెద్ద తీగెకు ఎన్ని పూవులు పూస్తాయో కదా...కోసుకున్నా కోసుకోకపోయినా చూసి ఆనందించచ్చు. అటు వెళ్ళినప్పుడల్లా గుప్పుమనే వాసన ఆస్వాదించచ్చు అని ఆశపడ్డాను...

అసలు నా ఆశల సంగతి వదిలేస్తే పచ్చని చెట్టు నరకాలన్న ఆలోచన ఎంత భయంకరమైనది? మనసున్న మనిషెవ్వడూ అలా చెయ్యడసలు. మనుషులను హింసిస్తే శిక్షిస్తారు. జంతువులను హింసిస్తే కూడా శిక్షిస్తారు. కానీ పచ్చని ప్రాణమున్న చెట్టుని కొట్టేస్తే ఏ శిక్షా లేదేం? అలాంటి చట్టం కూడా ఎవరన్నా చెయ్యకూడదూ? మొక్కలకు మాత్రం ప్రాణాం ఉండదా? పొద్దున్నే లేవగానే చల్లని గాలితో ఎంత అందంగా పలకరిస్తాయి? ఆ పలకరింపులోని చల్లదన్నన్ని ఎవరూ గమనించరా? అందమైన పువ్వులతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మొక్కల మధ్యన కూచుంటే చిన్నగా తలలూపుతూ ఎన్ని కబుర్లు చెప్తాయో...అవి ఎవరికీ వినిపించవా? ఏమిటో మొక్కలంటే మనుషులకి అంత అలుసు. జంతువులు ఇంకా కుయ్యో మొయ్యో అని అరుస్తాయి. పాపం మొక్కలకు, చెట్లకు అలా అరవటం కూడా రాదు. వాటిని నరుకుతుంటే బాధ ఎవరితో చెప్పుకుంటాయి? చిరంజీవి లెవెల్లో " మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా.." అని భారీ డైలాగు వాటి తరఫున చెప్పే నాధుడు లేడనే కదా మొక్కలంటే మనుషులకు అలుసు. అందుకే ఒళ్ళు మండుతోంది...

***** ****
పూయలేకపోయిన నా ప్రియమైన సన్నజాజులు...

Saturday, March 5, 2011

ఇవేం పూలు?


ఏమిటీ కాగితం పూలు అనేద్దామనుకుంటున్నారా? అదేం కదు. ఇవి "చుక్కాకు పులు". ఆకుకూరల్లో ఒకటైన చుక్కాకుకు ఈ పూలు పూసాయి.నేనూ ఇదే చూడటం.కుండీలో పెంచిన చుక్కాకు పప్పులోకి రెండు కోతలు అయిపోయాకా ఇలా పూలు వస్తూంటే బాగున్నాయని ఉంచేసాను. కుండీ నిండుగా ఇలా పూసేసాయి. కాగితo పూల్లాగా ఉన్న ఈ పూలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంచేస్తే ఎండిపోయి విత్తనాలయిపోతాయని ఉంచేసాను. బాగున్నాయి కదా.




Thursday, March 3, 2011

ఇవాళేం చేసానంటే..


ఆయ్యో ఇవాళ బ్లాగనేలేదు... అసలు రోజూ రాయాలా? రూలేమీ లేదు. కానీ వీలైనంతవరకూ నాకోసం నేను ఈ ఈ-కబుర్లు రాస్కుంటూనే ఉంటాను. ఇంతకీ టపా రాయకుండా ఇవాళ ఏం చేసినట్లు? నిన్న చాంతాడంత క్యూ ఉందని సాములారి దర్శనం చేసుకోకుండా వచ్చేసాం కదా. అందుకని పొద్దున్న పనులయ్యాకా మళ్ళీ గుడికి వెళ్ళి ఓసారాసాములారిని పలకరించి, కాసిన్ని పాలు అభిషేకించి, ఓ దణ్ణమెట్టేసుకుని వచ్చేసామన్నమాట. ఇప్పుడొచ్చావ్... అప్పుడొచ్చావ్...అని కోప్పడడు కదా పెద్దాయన. మనుషులకైతేనే భయపడాలి. దేవుళ్ళకు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమేంటో ఎదుటోళ్ళకన్నా, మనకన్నా, బాగా తెలిసినది దేవుళ్ళకే కాబట్టి.

ఇంకా ఏవేవో పనులు...ఇప్పుడేమో మరి రాత్రయిపోయింది కదా ఇంకేం కబుర్లాడతాను? టయిం లేదు...ప్చ్! అంద్కని ఇప్పుడే చేసిన "stuffed capsicum" కూర ఫోటో పెట్టేస్తాను చూసేయండి...ఈసరి గ్రేటెడ్ పనీర్ అదీ వేయకుండా సాత్వికమైన కర్రీలా వండేసాను. టేస్ట్ కూడా బానే ఉంది. మీకు నచ్చిందనుకోండి, "రుచి..." బ్లాగ్ లో మళ్ళీ చేసేస్కుందాం. ఎల్లెల్లవమ్మా. నువ్వు చెప్పేదేమిటి? గూగులమ్మ నడిగితే రెసిపీ చెప్పేస్తుంది అంటారా? అయితే నేనే తినేసి హాయిగా బజ్జుంటాను.


అదిగో బొమ్మ బాగుంది కదా...అడిగేయండి...అడిగేయండి..ఎలా చేసానో చెప్పేస్తాను..!!

Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

Tuesday, March 1, 2011

జ్ఞాపకాల పూలు



పొద్దున్నే మెలుకువ వచ్చి లేచి కళ్ళు నులుముకుంటూ లైటు కనబడుతున్న వంటింటి వైపు వెళ్తే, అక్కడ రేడియో లోంచి వినబడుతున్న ప్రసార విశేషాలు, అప్పుడే తీసిన కాఫీ డికాషన్ తాలుకూ ఫ్రెష్ సువాసన, పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్న ఇడ్లీ ప్లేట్లు, చెమట ఇంకటానికి మెడ చుట్టు చుట్టుకున్న పల్చటి తెల్లటి తువ్వాలుతో మామ్మయ్య దర్శనం అయ్యేది.(మా నాన్నమ్మను మేము "మామ్మయ్య" అని పిలిచేవాళ్లం). సెలవుల్లో ఊరు వెళ్లినన్నాళ్ళూ రోజూ అదే దృశ్యం. ఇంకా ముందర లేస్తే వంటింటి బదులు దొడ్లో లైటు, అక్కడ వారగా ఉండే సిమెంట్ గోలెం మందారాలు పుసిందా? అన్నట్లు గోలెం నిండుగా పరుచుకుని ఉన్న ఎర్రటి రేకమందారాలు(ముందు రోజు సాయంత్రమే ఎవరో ఒకరు మొగ్గలు కోసి అందులో వేసేవారు)...తులసి కోట దాటి తలుపు తీస్తే దొడ్లో ఏవో పనులు చేస్తూనో, మొక్కలకి నీళ్లు పోస్తూనో కనబడేది మామ్మయ్య. చీకట్లు తొలగుతూ తెల్లవారేవేళ అలా లేచి మామ్మయ్యను చూడటం ఒక అపురూపంగా తోచేది మాకు. ఆ దృశ్యం చూడటానికి వీలైనన్నిసార్లు పొద్దున్నే లేవటానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ, మా తమ్ముడూ.

అదే వర్షాకాలమైతే దొడ్లో నూతి నిండా నీళ్ళు ఉండేవి. చేద వేయనక్కర్లేకుండా చెంబుతో ముంచితే నీళ్ళు అందేంత పైకి నీళ్ళు ఉండేవి. క్రితం రోజు సాయంకాలం మందార మొగ్గలు కోసి నూతిలో వెసేసేవారు. అప్పుడు పొద్దున్నే లేవగానే నూతి గోడల అంచుదాకా పైకి ఉన్న నీటిలో విచ్చుకున్న ఎర్రటి రేకమందారాలు ఎంత అందంగా ఉండేవో మాటల్లో చెప్పటం కష్టం. అప్పట్లో డిజిటల్ కెమేరాలు, మొబైల్ కెమేరాలు లేవు. లేకపోతే ఎన్ని ఫోటోలు తీసిఉందునో అనుకుంటూ ఉంటాను. దాదాపు పదమూడు రకాల మందారాలు పెంచేది మామ్మయ్య. అన్నీ పెద్ద పెద్ద వృక్షాలయి బోలెడు పూలు పూసేవి. పారిజాతాలు, కాసిని మల్లెలు, సంపెంగలు, నిత్యమల్లి, చామంతులు, దేవకాంచనాలు మొదలైన మిగిలిన పూలు కూడా పూసేవి. పాండ్స్ టాల్కం పౌడర్ ఏడ్ లో కనబడే ఫ్లవర్స్ లాగ ఉండేవి దేవకాంచనాలు. (అవి తెలుపు, లేవెండర్, గోధుమ రంగుల్లో ఉన్న చెట్లు చూసాను నేను. ఇంకా రంగులు ఉన్నాయేమో తెలీదు.) మా ఇంట్లోని దేవకాంచన వృక్షం తెల్లటి తెలుపు పులు పూసేవి. అందుకని మేము వాటిని "డ్రీమ్ ఫ్లవర్స్" అనేవాళ్లం. ఇక పనిమనిషి లక్ష్మి వస్తునే మిగిలిన పువ్వులన్నీ పూజకు కోసి తెచ్చాకా, అవి ఇంట్లోని నాలుగు వాటాలవాళ్లకు పంచబడేవి. సన్నజాజులు మాత్రం నేనక్కడ ఉన్నన్ని సాయంత్రాలు నా జడల్లోకే. మంచినీళ్లకు ఎవరొస్తేవాళ్ళు వాళ్ల వాటా తాలుకు పూలు పట్టుకెళ్ళేవారు. ఇంటివాళ్లం మనమే కదా అన్ని పూలూ మనమే వాడుకోవచ్చు కదా అనడిగేదాన్ని నేను. వాళ్ళూ దేవుడికి పెడితే మంచిదే కదా అనేది మామ్మయ్య. సాయంత్రాలు రెండ్రోజులకోసారి ఎరుపు, పసుపచ్చా రంగుల్లో పూసిన కనకాంబరాలు, దోడ్లో పెరిగిన మరువమో, ధవనమో కలిపి అమ్మ దండ కడితే రెండు జడలకీ వంతెనలాగ అటు నుంచి ఇటు వచ్చేలా నా జెడల్లో కట్టిన దండ పెట్టేది అమ్మ.

డాబా మీదకు వెళ్ళి, సన్షేడ్ మీదకు దిగి మరీ దొరికినన్ని సన్నజాజులు కోసుకు రావటం నా సాయంత్రపు దినచర్య. ఆల్రెడీ జళ్ళో కనకాంబరం దండ ఉంటే అవి రేప్పొద్దున్నకి ఫ్రిజ్ లో దాచేవాళ్ళు. తరువాత ఆకు సంపెంగ చెట్ల చుట్టూ తిరిగి వాసనబట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి, ఇవాళ విడుస్తాయనిపించిన పూలు కోసి నీళ్లల్లో వేయటం ఓ పని. ఆ తర్వాత అన్నయ్యను నిచ్చెన వేయించి సింహాచలం సంపెంగ చెట్టు ఎక్కించి అందుబాటులో ఉన్న పూలన్నీ కోయించటం. "పువ్వుల కోసం నువ్వడగటం వాడెక్కటం బాగానే ఉంది" అని పెద్దవాళ్లు మందలించటం సరదాగా ఉండేది. ఆరు ఏడు అయ్యాక సాయంత్రమే కోసి నీటిలో వేసి మూత పెట్టిన ఆకు సంపెంగలు వంటింట్లోకి వెళ్తూనే గుప్పుమనేవి. రోజూ ఏడెనిమిది పూల దాకా పూసేవి ఆకుపచ్చ సంపెంగలు.

అలా శెలవులకు ఊరెళ్లినప్పుడల్లా నన్ను పలకరించే రకరకాల పూలన్నీ మామ్మయ్య ప్రేమగా పెంచినవే. తన చేత్తో వేస్తే ఏ మొక్క అయినా, కొమ్మ అయినా బ్రతికేది. పూల మొక్కలే కాక దబ్బకాయ, జామ, పనస, అరటి మొదలైన పెద్ద చెట్లు కూడా తన సంరక్షణలో పెరిగేవి. మామ్మయ్య పోయిన తరువాత తనను వీడి ఉండలేనట్లుగా తను పెంచిన దొడ్లోని చెట్లన్నీ చాలా వరకూ వాడి ఎండిపోయాయి. మామ్మయ్యకూ మొక్కలకీ ఉన్న ఆ అనుబంధం ఎంతో అపురూపమైనది..చిత్రమైనది. ఆ తోట, ఆ ఇల్లు, పూలు ఇప్పుడు లేకపోయినా తలచినప్పుడల్లా ఇప్పటికీ చుట్టుముట్టే ఈ జ్ఞాపకాల పూలన్నీ మనసులో పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.


మధుర గీతాలు: ఇది కథ కాదు(1979) పాటలు

"ఇది కథ కాదు" సినిమాలో ఎంత వాస్తవికత ఉందో పాటలూ అంత అర్ధవంతంగా బావుంటాయి. బాలచందర్(దర్శకత్వం), ఆత్రేయ(సాహిత్యం), ఎం.ఎస్.విశ్వనాథన్(సంగీతం) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పాటలు మనసుకు దగ్గరగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. ఇందులో " తకధిమితక ధిమితకధిమి " పాట, "గాలికదుపు లేదు.." పాట సాహిత్యపరంగా నాకు చాలా నచ్చే పాటలు. ఒకో వాక్యంలో ఎంత అర్ధం దాగి ఉందో అనిపిస్తుంది. ముఖ్యంగా "జత జతకొక కథ ఉన్నది" పాటలో ప్రతీ వాక్యమూ ఎంత అనుభవపూర్వకంగా రాసారో ఆత్రేయగారు అనిపిస్తుంది. నాకు చాలా నచ్చే పాట అది. "గాలికదుపు లేదు" పాటలో జానకి గారి గళం నిజంగా గంగ వెల్లువలా పరవళ్ళు తొక్కుతుంది. వేరొకరెవరు పాడినా ఈ పాటకు న్యాయం చెయ్యలేకపోయేవారేమో.

ఆత్రేయ రచన పాటలకు ప్రాణమైతే, ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం ఊపిరి. బాలు, సుశీల ల యుగళగీతం "సరిగమలు గలగలలు" పాట వింటుంటే చక్కనైన ఏ జంటయినా ముచ్చటగా ఇలానే పాడుకుంటారేమో అనిపిస్తుంది. "జూనియర్ జూనియర్.." పాటలో బాలు పలికించిన భావాలు కమల్ నటనతో పోటీ పడతాయి. సుశీలమ్మ గొంతులో "జోలపాట పాడి ఊయలుపనా" పాట హృదయాన్ని భారం చేస్తుంది. ఓసారి ఈ పాటలు చూసేస్తూ...గుర్తుకు తెచ్చేసుకుందామా...

1)తకధిమితక ధిమితకధిమి..


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే ఛమ్ ఛమ్
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం

ఈలోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు
చెప్పేసెయ్ తుది వేడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు
కన్నీటి సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపు తానోడుతే దాని గెలుపు(౨)
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాన్ని నిలిపేది రేపు(౨)
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

2)గాలికదుపు లేదు కడలికంతు లేదు



గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు?
మళ్ళి మళ్ళి వసంతమొస్తే మల్లె కేది ఆకుచాటు?

ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను
ఓ మాలికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణయ్యింది పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతె తప్పేముంది?


3)సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము




4)జూనియర్ జూనియర్..
ఇటు అటుకానీ హృదయం తోటి
ఎందుకురా ఈ తొందర నీకు


5)"జోలపాట పాడి ఊయలూపనా, నా జాలి కథను చెప్పి జోల పాడనా" పాటను పి.సుశీల పాడారు. ఈ సాంగ్ వీడియో లింక్ దొరకలేదు.



ఈ సినిమా పాటలన్నీ వినేందుకు లింక్:
http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.ఇన్



http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.in


Monday, February 28, 2011

వంటరాని మగాడు (Just for fun..)


"వంటొచ్చిన మగాడు" అని మా అన్నయ్యను దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితం ఒక టపా రాసాను. ఆ తరువాత "వంటరాని మగాడు" అని రెండవ భాగం రాస్తానని అన్నాను కానీ అది రాయటం కుదరనేలేదు. కొందరు బ్లాగ్మిత్రులు రెండవభాగం ఏదని అడిగారు అప్పట్లో.. అయినా ఎందుకనో ఆ రెండవభాగం రాసే మూడ్ అప్పుడు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ రెండవ భాగం రాయాలని సంకల్పం కలిగింది. రెంటికీ లింక్ అయితే లేదు కానీ మొదటిది చదవనివారు అక్కడకు వెళ్ళి ఓ లుక్కేస్తే బాగుంటుందని అభిప్రాయం.
( http://trishnaventa.blogspot.com/2009/10/just-for-fun.html )
************
వంటరాని మగాడు:

వంటరాని మగవాళ్ళలో నాకు తెలిసినంతలో ముఖ్యంగా మూడు రకలవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఉంటారేమో నాకైతే తెలీదు..:))

1) కొందరికి వండటం రాదు కానీ వారు పెట్టినది తిని ఎంజాయ్ చెయ్యగలరు. వీరితో ఏ ఇబ్బందీ ఉండదు.

2)మరొకరకం వారు వండటం రాకపోయినా వంటలకు వంకలు పెడుతూ ఉంటారు వండిపెట్టేవారి ఒళ్ళుమండెలా. భోజనం తింటున్నంతసేపూ వారి సాధింపుల రికార్డ్ మోగుతూనే ఉంటుంది. ఆ వంకలన్నీ టేస్ట్ లు తెలియటం వల్ల కదా అని ఈ రకం వారితో కూడా కాస్తంత సర్దుకుపోవచ్చు అని నా అభిప్రాయం.

3)కానీ మూడో రకం వారున్నారే వారితోనే మహా కష్టం. వాళ్ళకు వండటమూ రాదు. తినటమూ రాదు. అసలు ఫలానాది తినాలన్న కోరికా ఉండదు. పదార్ధాల్లో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయో, తక్కువయ్యాయో తెలియదు. ఏం వండాలో, ఎంత వండాలో, వండితే తింటారో తినరో కూడా తెలీని ఈ రకం వారితోనే అసలైన తంటాలన్నీ!!

ఇప్పుడు ఈ మూడు రకాలవాళ్లతో భార్యల సంభాషణలు ఎలాగుంటాయంటే : (ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు...కేవలం సరదాకే అని మరొకసారి మనవి)

1) వండటం రాకపోయినా తినేవారు:


"ఇవాళ ఏం వండను?"
"ఏదో నీకు తోచినది వండు. ఏదైనా పరవాలేదు."

"ఆహా చారు అదిరింది. ఎంత బాగుందో"
"ఈ కూర కూడా సూపర్. అసలు నీ వంటే వంట. ఉండు ఈసారి మా బాస్ ను భోజనానికి పిలుస్తాను"

"ఏమిటీ ఊరు వెళ్తావా? మరి నా భోజనం? అసలే నాకు బయట తిండి పడదు. త్వరగా వచ్చేయ్..."
" ...?? మీకు వండి పెట్టడం కోసం నేను వచ్చేయాలా? అంటే మీకు మీ తిండిని గురించిన జాగ్రత్తే తప్ప నా మీద బెంగ ఉండదన్న మాట...."

******* ********** ********
2) వండటం రాకపోయినా తింటున్నంత సేపూ వంకలు పెట్టేవారు:

"ఏమండీ ఇవాళేం వండమంటారు?"
"గుత్తివంకాయ కూర , కొబ్బరి పచ్చడి చేసి, పప్పుపులుసు పెట్టు"

"ఏమిటిది? ఇదసలు గుత్తివంకాయ కూరేనా? అసలు మసాలా ఏది? ఏమేం వేసావిందులో..?
ఇది కొబ్బరి పచ్చడా? దీన్నిండా కొబ్బరి ముక్కలే కనబడుతున్నాయి. మెత్తగా గ్రైండ్ చెయ్యటం రాదా నీకు? మా అమ్మయితే రోట్లో కూడా ఎంత మెత్తగా రుబ్బేదనుకున్నావు"
(ఇలా ఎవరితోనన్నా కంపారిజన్ లు చేసినప్పుడు సదరు అమ్మగారికి రోకలి తెచ్చి అయ్యగారి నెత్తిన ఒక్కటిచ్చుకోవాలన్నంత కోపం వస్తుంది.)

"ఇది పప్పు పులుసా? చారా? తేడా ఏం కనబడటం లేదు. ఈ పోపేమిటి ఇలా మాడిపోయింది? మాడిపోయిన పోపుని చూస్తే నాకెంత ఒళ్ళుమంటో నీకు తెలుసుకదా? అయినా మాడిస్తే ఏమిటర్ధం?...."
"అయితే మీకు నచ్చేట్టు మీరే వండుకోండి. వండిన ప్రతిదానికీ వంక పెడితే నేను వండలేను.."
"నాకు వంటొస్తే నిన్నెందుకు చేసుకోవటం? హాయిగా నాక్కావాల్సిన పదార్ధం నేనే వండుకుని తినేవాడిని"
"అంటే కేవలం వండిపెట్టడానికే నన్ను చేసుకున్నారా..?"

****** ******* ******

3) వండటమూ రాదు. తినటమూ రాదు :

"ఏమండీ ఇవాళ ఏం వండను?"
" రోజూ ఎందుకలా అడుగుతావు? ఏదో ఒకటి వండు."
"ఇవాళ ఇది చెయ్యి అని అసలెప్పుడూ అడగరా?"
"ఏమో నాకు అలా అడగాలని అనిపించదు.."

**** ***** ******

"కూర బాగుందా?"
"బానే ఉంది."
"పప్పు?"
"బానే ఉంది"
"రాత్రికి మొన్న చేసిన కూర చెయ్యనా?"
"ఏ కూర? నాకు గుర్తులేదు.."

**** **** *****
"ఎందుకు కూర ఉంచేసారు? మొన్న తిన్నారు కదా?"
"ఆ రోజు నచ్చింది. ఇవాళ నచ్చలేదు. ఎప్పుడు వండినా తినితీరాలని రూల్ లేదుగా.."

"ఈ పచ్చడెందుకు వదిలేసారు?"
"నేనెప్పుడూ తినలేదిది"
"ఓసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా నచ్చుతుందేమో..?"
"ఎప్పుడూ తినని కొత్త పదార్ధాలు నేను తినను"

**** ***** *****

"ఇది మీరు చిన్నప్పటినుంచీ బాగా తినే కూర అన్నరు కదా..వదిలేసారేం?"
"చూడటానికి బాలేదు"
"తింటే బాగుంటుందేమో...ట్రై చేయచ్చు కదా.."
"ఇదివరకూ చెప్పను నీకు చూడగానే బాగుంటే తప్ప నేను ఏదీ తిననని"
"మరి ఇక ఏం వండాలి నేను?"
"......."
"ఏరోజూ ఇది కావాలని అడగరు. కొత్త పదార్ధాలు తినరు. పాత పదార్ధాలు ఒకోసారి తింటారు. ఒకోసారి తినరు. మీతో వేగటం నావల్ల కాదు బాబూ.."
"చేసుకున్నాకా తప్పదు మరి...ఈ జన్మకిలాక్కానీ..."

********** ******** *********

విశ్లేషణ:వంట రాని మగవాళ్ళలో మొదటి కేటగిరీనే బెస్ట్. అవసరార్ధం తప్పదనో, నిజంగానే భార్య వంట నచ్చో మెచ్చుకుంటూ తినేస్తారు. ఎవర్నన్నా భోజనానికి పిలిచినా, పిలవకపోయినా భార్య వంట మెచ్చుకుంటారు.

ఇక రెండో రకం వారితో సర్దుకుపోవచ్చు. వంకలు పెడ్తున్నారని కోపం వచ్చినా ఫలానాది తినాలని ఉందనీ, ఫలానాది బాలేదనీ చెప్పటం వల్ల కాస్త తినటం పట్ల ఆసక్తి ఉందని గమనించొచ్చు. వంట వచ్చిన ఇల్లాలికి మనశ్శాంతి.

కానీ ఆ మూడో రకం వాళ్ళతో మాత్రం చాలా కష్టం.

ఏమైనా నా ఓటు మాత్రం వంటొచ్చిన మగవాళ్ళకే. వీరి తాలూకూ భార్యలు చాలా అదృష్టవంతులు అని నా అభిప్రాయం.(ఇక్కడ మా అన్నయ్యకూ జై...!!)అదేం లేదు.దూరపు కొండలు నునుపు.. అంటారా?

Sunday, February 27, 2011

మా వీధిలో "కూరల సంత"


"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.

ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.


సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.

మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.



Saturday, February 26, 2011

కుంపటి


"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.

మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.


ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.

"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?

Friday, February 25, 2011

ప్రేమించి చూడు(1965)


బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కాక ముళ్ళపూడి వెంకటరమణగారు మూగమనసులు, దాగుడుమూతలు, నవరాత్రి, రక్త సంబంధం, ప్రేమించి చూడు వంటి సుపర్ హిట్ చిత్రాలకు కూడా "మాటలు" రాసారు. అందులో నాకు బాగా ఇష్టమైన సినిమా "ప్రేమించి చూడు". హాస్యరసం ప్రధానాంశమైన ఈ చిత్రం సంగీతభరితంగా, ఆనందకరంగా ఉంటుంది. "కాదలిక్క నేరమిల్లై" పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సి.వీ. శ్రీధర్ అందించారు. ఈ చిత్రానికి తెలుగులో దర్శకులు పి.పుల్లయ్య. ముళ్ళపూడివెంకటరమణగారు మాటలు(డైలాగులు) రాసారు.

సినిమాలో ముఖ్యంగా రేలంగి పాత్ర నాకు చాలా నచ్చేస్తుంది. రేలంగి చెప్పే ప్రతి డైలాగూకూ మనం నవ్వకుండా ఉండలేము. బుచ్చబ్బాయ్ పాత్రలో రేలంగి జీవించారనే చెప్పాలి. "పెద్దమ్మాయ్ బిఎస్సీ , చిన్నమ్మయ్ పి.యు.సీ" డైలాగ్; డైరెక్టర్ అవ్వాలనుకునే కొడుకు చెప్పే సినిమా కథ విని భయపడే సీన్; కూతుళ్ళు ఏదంటే అది ఒప్పేసుకునే ఆ వల్లమాలిన ప్రేమ, పేద్ద ధనవంతుడిలాగ మారువేషం వేసుకొచ్చిన జగ్గయ్యను నమ్మి కాకాపట్టి ఎలాగైనా ఒక కుమార్తెను అతనికి కోడల్ని చేయాలని పడే తాపత్రయం, ఆ క్రమంలో జగ్గయ్యకి తందానతాన అంటూ చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి.

కథలోకి వస్తే, బుచ్చబ్బాయ్(రేలంగి) ఒక ఎస్టేట్ యజమాని. లక్షల ఆస్తి, అందమైన బంగ్లా ఉంటాయి. ఒక కుమారుడు(చలం), ఇద్దరు కుమార్తెలు(కాంచన, రాజశ్రీ) ఉంటారు. తన వెనుక తండ్రి ఆస్తి ఉందన్న ధీమాతో ఎలాగైనా సినిమాకి దర్శకత్వం వహించాలనే కోరిక అతని కుమారుడిది. కుమార్తెలు అంటే బుచ్చబ్బయ్ కి వల్లమాలిన ప్రేమ. వాళ్ళు ఎంతంటే అంత. పట్నంలో చదువుకుంటున్న వాసూ, కాంచనమాల ప్రేమించుకుంటారు. బుచ్చబ్బాయ్ ఎస్టేట్లోనే అసిస్టెంట్ మేనేజర్ గా చేరతాడు రంగారావు(నాగేశ్వరరావు). ఒక చిన్న తగాదాతో అతనికి పరిచయమౌతుంది బుచ్చబ్బాయ్ చిన్న కూతురు రత్నమాల. కోపంతో అతన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయిస్తుంది. స్నేహితుల సాయంతో బుచ్చబ్బాయ్ బంగ్లా ముందు డేరా వేసి ధర్నాకి దిగుతాడు రంగడు. ఈ సీన్లో వచ్చే "మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు..." పాటను ముళ్ళపూడి గారే రాసారు. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్...అంటూ సాగే ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది.

ఈ జగడంలో రత్నమాల, రంగారావు ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఒక మామూలు స్కూలు టీచర్ కుమారుడైన రంగడి పేదరికం పెళ్ళికి అడ్డంకిగా నిలుస్తుంది. అందుకని రంగా తన స్నేహితుడైన వాసు(జగ్గయ్య)కి గడ్డం తగిలించి కోటీశ్వరుడైన శ్రీనివాస భూపతిగా బుచ్చబ్బాయ్ కి పరిచయం చేస్తాడు. ధనాశాపరుడైన బుచ్చబ్బాయ్ ఆస్తి కలిసి వస్తుందని ఒక కుమార్తెను శ్రీనివాసభూపతి తన కొడుకుగా నమ్మించిన రంగాకి ఇచ్చి వివాహం జరిపించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అనుకోకుండా బుచ్చబ్బాయ్ ను కలుస్తాడు అతని బాల్య మిత్రుడు సుబ్బారాయుడు. ఇద్దరు కలిసి సుబ్బారాయుడి కుమారుడికి బుచ్చబ్బాయ్ పెద్ద కుమార్తె కాంచనమాలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయిస్తారు. సుబ్బారాయుడు కుమారుడే వాసు అని కాంచనకు తెలిసి వివాహానికి ఒప్పుకుంటుంది ఆమె. కానీ శ్రీనివాస భూపతి వేషంలో ఉన్న వాసు గడ్డం తీసివేస్తే రత్నమాల, రంగల పెళ్ళి ఆగిపోతుంది. ఉంచితే వాసు,కాంచనల పెళ్ళి అవ్వదు.

ఈలోపూ పట్నంలో ఒక ఇంట్లో రంగా ఫోటో చూసిన సుబ్బారాయుడు ఆ సంగతి బుచ్చబ్బాయ్ కి చెప్తాడు. రంగా, వాసుల నాటకం బయటపడిపోతుందా? వాళ్ల పెళ్ళిళ్ళు అవుతాయా? బుచ్చబ్బయ్ కుమారుడు సినిమా తీసాడా? మొదలైన ప్రశ్నలకు సినిమా చూడటమే సమాధానం. సినిమాలో చలం,గిరిజల జంట, గిరిజ తండ్రి పాత్ర, వాళ్ల ముగ్గురి సంభాషణలు హాస్యాన్ని పండిస్తాయి. మాస్టర్ వేణూ సంగీతం సినిమాకు సగం విజయాన్నందించింది. "దొరికేరూ దొరగారూ", "వెన్నెల రేయీ ఎంతో చలీ చలీ", "అందాలే తొంగి చూసే హా హా హా..", నాయికానాయకులు నలుగురూ కలిసి పాడే "ప్రేమించి చూడు పిల్లా పెళ్ళడుదాము మళ్ళా" అనే టైటిల్ సాంగ్, ఏ.ఎన్.ఆర్ ఇద్దరు అక్కచెల్లెళ్ళనూ ఏడిపిస్తూ పాడే "మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద", పైఅన్ చెప్పుకున్న "మేడ మీడ మేడ కట్టి", చలం, గిరిజల పాట "కళ కళాలాడే కన్నులు" , అన్నింటిలోకీ రొమాంటిక్ అయిన "అదిఒక ఇదిలే" పాట Bésame Mucho అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. (ఈ సంగతి అదివరకూ ఓ టపాలో రాసాను.) నాకు కూడా అన్నింటిలోకీ "మీ అందాల చేతులు", "అది ఒక ఇదిలే" రెండూ ఇష్టమైన పాటలు.
రమణగారి గుర్తు చేసుకుంటూ ఆయన ఈ సినిమాకి రాసిన పాట మరోసారి చూసేద్దామా మరి..

ఏం రాయను...?



అవును..ఏం రాయను..? ముళ్ళపూడి వెంకటరమణ గారి గొప్పతన్నాని నేను అక్షరాల్లోకి ఒదిగించగలనా? అసాధ్యం. నిన్న పొద్దున్నే పూజకు కూర్చున్నాను.. టివీలో స్క్రోలింగ్ వెళ్తోంది అని "ముళ్లపూడిగారి వార్త" చెప్పారు తను. గబుక్కున లేచి రాబోయాను. "ఇంకేమీ చూపించటం లేదు. పూజ పూర్తి చేసుకుని రా. కంగారు పడకు" అన్నారు తను. స్తోత్రాలేవో చదువుతున్నాను కానీ స్థిమితం లేదు. ధ్యాస అక్కడ లేదు. నిన్న దేవుడికి పువ్వులు తేవటం కుదరలేదు. మందిరం బోసిగా ఉంది నా మనసులాగే..అనుకున్నా. అయ్యో, బాపూ గారు ఎలా ఉన్నారో...అని అలోచన. యాంత్రికంగా పూజ అయ్యిందనిపించి, పాపను స్కూలుకు పంపించాకా టీవీ ముందుకు చేరా. స్క్రోలింగ్స్ లో తప్ప ఎక్కడా ఎవరు ఈ సంగతి మాట్లాడటంలేదు. ఇక బ్లాగులు తెరిచను. వరుసగా అన్నీ రమణగారిపై టపాలు...! ఆఫీసుకి వెళ్తూ తను చెప్పారు.."ఆ టివీ చూసి, బ్లాగులు చదివి బాధపడుతూ కూర్చోకు. అవన్నీ కట్టేసి ఏ పుస్తకమో చదువుకో.." అని.

టీవీ అయితే కట్టేసాను కానీ బ్లాగులు మూయలేదు. పనుల మధ్యన తెరుస్తూ మూస్తూ ముళ్ళపూడిగారిపై వచ్చిన ప్రతి టపా చదువుతూ పొద్దంతా గడిపేసాను. మధ్యలో బాపూరమణల సినిమానవల ఒకటి పూర్తిచేసేసాను. చాలా రోజులకు ఒకపూటలో మొత్తం పుస్తకాన్నిచదివేసాను మునుపటిలా. మొన్ననే వస్తూ వస్తూ నాన్న దగ్గర నుంచి కొన్ని సినిమా నవలలు తెచ్చుకున్నాను. విచిత్రమేమిటంతే వాటిల్లో మూడు బాపూరమణల సినిమాలే. వాటి గురించి వీలు చూసుకుని రాయాలి. అయితే వీటి సినిమా సీడీలు మాత్రం దొరకలేదు. ఇటీవలే ఒక ప్రముఖ మ్యూజిక్ స్టోర్స్ లో సీడీలు వెతుకుతూ అక్కడ నించిన్న అమ్మాయిని బాపూ సినిమాలేమైనా ఉన్నాయా అంటే "బాపూ" ఎవరు? అంది. ఓసినీ నీకిక్కడ నించునే అర్హత ఉందా అసలు? అని మనసులో తిట్టుకుని, గొప్ప తెలుగు సినిమాలు తీసిన డైరెక్టర్ అమ్మా అని మాత్రం చెప్పి ముందుకెళ్ళిపోయా. ఇంకేం చెప్పాలి?

ఏమాటకామాటే చెప్పాలి. తమిళులకున్న భాషాభిమానం తెలుగువాళ్లకు లేదు. బొంబాయిలో Matunga road ఏరియా దగ్గరకు వెళ్లినప్పుడలా అనుకునేదాన్ని ఇలాంటి మహా నగరంలో చిన్న తమిళ్నాడును సృష్టించగల ప్రాంతీయాభిమానం తమిళులకే ఉంది అని. కాలేజీ రోజుల్లో కలకత్తా వెళ్ళినప్పుడు "శాంతినికేతన్" చూడటానికి వెళ్ళం. బోల్ పూర్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి రిక్షాలో వెళ్ళాలి శాంతినికేతన్ కి. (ఇప్పుడు ఆటోలు గట్రా వచ్చాయేమో తెలీదు) వెళ్తూంటే ఆ రిక్షానడిపే అతను దారి పొడుగునా అక్కడి విశేషాలు, రవీంద్రుడు చేసిన పనులు, శాంతినికేతన్ ఎలా కట్టారు? టాగూర్ ఏం ఏం చేసారు మొదలైన డీటైల్స్ అన్నీ ఎంతో చక్కగా హిందీలో వివరించాడు మాకు. రిక్షా అబ్బాయికి కూడా ఎంత శ్రధ్ధా? అని ఆశ్చర్యపోయాం మేము. మన తెలుగువారికా శ్రధ్ధ ఉందా?

తెలుగు సాహితీ ప్రపంచానికి రమణగారు చేసిన సేవ తక్కువా? సినీ ప్రపంచంలో బాపూరమణ ద్వయం తీసిన సినిమాలకే కాక రక్త సంబంధం, మూగ మనసులు, ప్రేమించి చూడు మొదలైన మంచి మంచి సినిమాలకు రమణగారు అందించిన "మాటలు" ఎంత అద్భుతమైనవి? ఇవాళ్టికీ ఇంట్లో మాటల్లో వాడుకునే "బుడుగు" డైలాగ్స్ కు పోటీ ఏవైనా ఉన్నాయా? అసలు "బుడుగు"లాంటి గొప్ప కేరెక్టర్ ను తెలుగు సాహిత్య ప్రపంచంలో మరెవరైన సృష్టించగలిగారా? మరి అటువంటి మహానుభావులకు తెలుగువారు ఏమి అవార్డులు ఇచ్చారు? ప్రభుత్వం ఏమి చేసింది? మనిషి పోయిన తరువాత ఎన్ని గౌరవాలు ఇస్తే మాత్రం ఏం లాభం? వారసులు తడిమి చూసుకోవటానికి తప్ప అవి ఎందుకైనా పనికివస్తాయా? బ్రతికి ఉండగా వారి గౌరవాన్ని వారికి అందిస్తే అది వారి ప్రతిభకు గుర్తింపు అవుతుంది. వారు చేసిన సాహిత్యసేవకు, కళా సేవకూ విలువనిచ్చినట్లౌతుంది. రమణగారూ దూరమైపోయినా కనీసం బాపూగారికయినా ప్రభుత్వం ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన అవార్డుని ఇప్పటికైనా అందిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.

సినీజగత్తులో పేరు పొందిన వ్యక్తులెవరైనా పోయినప్పుడు దూరదర్శన్ వాళ్ళు(DD-1) వారి తాలూకూ సినిమాలను వరుసగా ఓ పదిరోజులనుకుంట టివీలో వేసేవారు. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో అలా ఎన్ని మంచి మంచి హిందీ సినిమాలు చూసానో. అంతా దూరదర్శన్ పుణ్యమే. హృషీకేష్ ముఖర్జీ, గురుదత్, రాజ్ కపూర్, బిమల్ రాయ్ మొదలైనవారి మేటి సినిమాలన్నీ నేను చూసినది టీవీలోనే. నాన్నతో పాటూ అర్ధ్రరాత్రి దాటినా ఆ సినిమాలన్నీ వదలకుండా చూసేదాన్ని. అది మన తెలుగువాళ్ళు ఎందుకు చెయ్యరో నాకు అర్ధమే కాదు. పోయినప్పుడనే కాదు, ఫలానావారి స్మృత్యార్ధం అని ఎస్.వీ.రంగారావు, నాగయ్య, సావిత్రి మొదలైన గొప్పనటులు నటించిన సినిమాలు, విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావు మొదలైన గొప్ప దర్శకులు తీసిన చిత్రాలు ఓ వారం రోజులపాటు వేయచ్చు కదా. లేకపోతే ఇప్పటి తరానికి పూర్వసినీవైభవం తెలిసేది ఎలా? కొన్ని ఛానల్స్ వాళ్లు ఏ.ఏన్.ఆర్ హిట్స్ అనీ, ఎన్.టీ.ఆర్ హిట్స్ అనీ వేస్తున్నట్లున్నారు. ఇప్పుడిక టివీ పెద్దగా చూడను కాబట్టి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో ఏదైనా ఓ ఛానల్ వాళ్ళైనా బాపూరమణల సినిమాలు ఓ వారం రోజులు చక్కగా వేస్తే ఎంత బాగుంటుంది? కనీసం వారు తీసిన సినిమాలన్నీ సీడీల రూపంలోనో డివీడీల రూపంలోనో బయటకు వస్తే ఎంత బాగుంటుంది? ఆ మ్యూజిక్ స్టోర్స్లో అమ్మయికి బాపూగారి గొప్పతనం అర్ధమైతే ఎంత బాగుంటుంది?

"అంతులేని ఆవేదన ఎందుకే కడలీ" అని ఓ ప్రైవేట్ సాంగ్ ఉంది. అలాగ ఏదో రాయాలని తాపత్రయం తప్ప ఏం రాసి ఏం ప్రయోజనం? నేను రాస్తే ప్రభుత్వం అవార్డులిచ్చేయదు. పోయిన మనిషి తాలూకూ ఎడబాటుని బాపుగారు, ఆయన మనుషులు అనుభవించకా తప్పదు. ఏదో హృదయ ఘోష ఇలా అక్షరాలోకి మార్చి నే "తుత్తి"పడ్డం తప్ప...! వెళ్పోయినవాళ్ళు బానే ఉంటారు స్వర్గంలో. ఉన్నవాళ్ళకే బాధ. ఆ ఎడబాటులోని వ్యధ, లోటు మరెవరూ పూడ్చలేనివీ. బ్రతికి ఉన్నంతకాలం అనుభవించవలసినవీనూ.

ఆత్రేయగారి మాటల్లో అందంగా చెప్పాలంటే "పోయినోళ్ళందరూ మంచోళ్ళు...ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"...అంతే కదా..

Monday, January 24, 2011

క్షమ


"क्रॊध कॆ बोझ को मन पे उठाये काहे चेल्ता है प्राणी
क्षमा जो शत्रु को भी कर दे, वहि मुक्त है...वहि ग्यानी"


bhootnath సినిమాలో జావేద్ అఖ్తర్ "समय का पैय्या चेलता है.." పాటలోని మొదటి రెండు వాక్యాలూ..ఇవి.

"మనసులో కోపమనే బరువును ఎందుకు మోస్తూంటాడు ప్రాణి
శత్రువును సైతం క్షమించినప్పుడే ముక్తి....అతడే జ్ఞాని.." -- అని అర్ధం !!

మొదటి రెండు వాక్యలూ అయ్యాకా bhootnath సినిమాలో "సమయ్ కా పైయ్యా చెల్తా హై" అనే పాట మొదలౌతుంది. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన పోయింట్ ఇది. శత్రువును సైతం క్షమించగలగటానికి ఎంతో ధీరత్వం ఉండాలి. ఉదాత్తత ఉండాలి. మనల్ని బాగా బాధపెట్టినవాళ్లనీ, సూటిపోటి మాటలతో మనసుని గాయపరచిన వాళ్ళనీ, తమ చేతలతో మనసుని ముక్కలు చేసిన వాళ్ళనీ మనం క్షమించగలమా? చాలా కష్టం..! కానీ ఈ పాటలోని వాక్యాలు విన్నాకా అనిపించింది...నిజమే, ఎందుకు మనం ఇతరులపై కోపాన్నీ, బాధనీ, దు:ఖాన్నీ మోసుకుంటూ బ్రతుకుతాం? వాళ్ల పాపానికి వాళ్ళని వదిలేసి మన మనసులని ఎందుకు తేలిక చేసుకోమూ...అని. లేకపోతే మనం కూడా అమితాబ్ పాత్ర మాదిరి చనిపోయాకా భూతంగా మారిపొతామేమో....ఈ లెఖ్ఖన ప్రపంచంలో ఎన్ని కోట్ల,బిలియన్ల భూతాలు తిరగాడుతూ ఉన్నాయో..అనిపించింది కూడా!!


(పై వాక్యాలు "భూత్ నాథ్" సినిమా చూశాకా నేను గతంలో రాసిన టపాలోనివి.)

***********************
జీవితంలో చాలా కష్టమైన పని, ప్రశాంతత నిచ్చేపని "క్షమించటమే" అని అనుభవపూర్వకంగా అర్ధమయ్యాకా ఈ వాక్యాలను మళ్ళీ రాయాలని అనిపించింది.

ఇంతకు మించి రాసేదేమీ లేదు.

రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”


పెళ్ళి నాటికి ఇరవై సంవత్సరాలు నిండిన “కమల” విద్యావంతురాలు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించికున్న విజ్ఞానవంతురాలైన గృహిణి. అత్తవారింట్లో ఆదర్శ గృహిణిగా తాన్ను తను తీర్చిదిద్దుకోవాలని తహ తహలాడిన స్త్రీ. సమాజంలోనూ, వ్యక్తుల్లోనూ అభివృధ్ధిని కాంక్షించే అభ్యుదయవాది. పెళ్ళైన ఏడేళ్ళలో ముగ్గురు పిల్లల తల్లి అయి, వైవాహిక జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ దాదాపు గడపివేసిన అనుభవజ్ఞురాలు. రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల” నవలా నాయిక.

“చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించినా, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించినా ఫలితం ఒకటే – అశాంతి ! మనస్పర్థ !” అన్న నేపధ్యంతో 1966లో జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన నవల రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”. నేను 1996లో కొనే సమయానికి ఆరు పున:ముద్రణలు పూర్తి చేసుకుంది.

మూర్తిని ప్రేమించి వివాహమాడిన కమల ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనీ, భర్తకు తన చేతులతో వండివడ్డించాలనీ ఆశ పడుతుంది. కానీ పద్ధతీ తీరూ లేని అత్తవారిల్లు, మర్యాదా మన్ననా తెలియని ఇంట్లో మనుషులు, చాలా సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించే అత్తగారు, ఇంట్లో ఏమి జరిగినా, కారణమెవరో తెలిసినా స్పందించని భర్త, కమలను ఎంతో నిరాశకు,ఆవేదనకూ గురిచేస్తారు. దుర్మార్గురాలు కాకపోయినా కోడలిపై అధికారం చెలాయించటం జన్మ హక్కుగా భావించే సగటు అత్తగారు శేషమ్మ. పనిపాటలు తెలిసి, ఇంటిని అందంగా తీర్చిదిద్దగల నేర్పు ఉన్న కమలపై తన అత్తగారి పెద్దరికాన్ని అన్నివిధాలుగా చెలాయిస్తుంది శేషమ్మ. ఆమె చేసే మూర్ఖపు పనులు అత్తాకోడళ్ళ మధ్య సర్వసాధారణమైన మనస్పర్ధలకు తావునిస్తాయి. తర్కానికీ, న్యాయానికీ చోటులేని నిర్ణయాలు చేయటం ఆ అత్తగారి హక్కు. వాటికి తప్పనిసరిగా తలవంచటం మాత్రమే ఆ కోడలు చాలా ఏళ్లపాటు చేయాల్సివచ్చిన అనివార్యకార్యం. కొన్నేళ్ళపాటు ఎదురులేని సంసారసార్వభౌమత్వం వహించాకా కొత్తగా కోడలు వచ్చి కొత్త సవరణలు చేయటం సహించలేకపోవటం అత్తగారనబడే పాత్రకున్న జన్మహక్క మరి.

ఇంటిని అందంగా తయారుచేయాలన్న కోరికను భర్త సలహాపై తమ గదిమటుకే పరిమితం చేసుకోక తప్పదు కమలకు. పొందికగా తయారైన తమ గదిని చూసి విస్మయం చెందుతాడు ఆమె భర్త. గది నచ్చినా, మెచ్చని సుగుణం సొంతమైన అత్తగారు మెల్లగా సణుక్కోవటం వినబడుతుంది ఆమెకు. గౌరవం పొందాల్సిన మామగారి ధోరణి చిరాకునూ, జుగుప్సనూ కలిగిస్తాయి కమలకు. సర్ది పెట్టిన తమ పక్క మీద మధ్యాహ్నాలు నిద్రపోవటం మొదలెట్టిన మామగారి అలవాటుని ఇంట్లో అందరితో ఒప్పించి మాన్పించి "ఎంతైనా గడుసుది" అన్న కొత్త బిరుదు పొందుతుంది కమల.

భార్యాభర్తలకు ఏకాంతానికీ, మురిపాలకూ అడ్డంపడుతూ తలదూరుస్తు ఉండే తల్లి మూర్తి దృష్టిలో అమాయకురాలు. అతని దృష్టిలో భార్య బుర్రకి ఆలోచనలెక్కువ. ఆడంబరాలకూ, సంబరాలకూ ఆర్భాటం చేయటం, కొడుకు సంపాదనను దుబారా చేయటం, అవసరం ఉన్నా లేకపోయినా బంధువులను ఆహ్వానించి అతిథిసత్కారాలు చేయటం, కొడుకుతో అప్పు చేయించైనా ఆదపాదడపా కూతురుకి ఆర్ధిక సహాయం అందించటం శేషమ్మకు అలవాటు. అందుకు భర్త చేసే సమర్థన భార్యాభర్తల ఘర్షణను పెంచటానికి తప్ప మరెందుకు ఉపయోగపడదు. బిడ్డ కష్టార్జితంతో వేడుక చేసుకు ఆనందించే ఆ తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణంలోంచీ సమర్ధించలేకపోతుంది కమల. అనుమతి లేకుండా తన ఉత్తరాలను చదివే ఆడపడుచును, తల్లి అండతో వచ్చినప్పుడల్లా ఇల్లు దోచుకుపోయే ఆమె తీరు కమలను ఆందోళపరుస్తాయి. 

పిల్లలు పుట్టాకా జరిగే సంఘటనలూ, పరిస్థితులు కమలను మరీ కలవరపెడతాయి. పిల్లలకు ఇష్టమైన పేరు పెట్టడానికి కూడా పేచీలు, మగపిల్లవాడికి చిన్నప్పుడే ఆడపిల్లను లోకువచేయటం నేర్పిస్తున్న అత్తమామల ప్రవర్తన ఆమెకు చాలా బాధను కలగజేస్తాయి. ఇంకా ఇంకా పెరుగుతున్న సమస్యలు, చికాకుల వల్ల భార్యాభర్తల మధ్యన పెరుగుతున్న దూరం ఎంతవరకూ వెళ్ళింది? వాళ్ళ కథ ఎలా ముగింపుకి వచ్చింది? అన్నది మిగిలిన కథ.  ఒక మామూలు మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చక్కని కథనంతో "చదువుకున్న కమల" ప్రతి చదువుకున్న అమ్మాయి ఆలోచనలను ప్రతిబింబింపచేస్తుంది.


ఈ నవల అరుణా పబ్లిషింగ్ హౌస్,విజయవాడ ద్వారా ప్రచురింపబడింది. (వారి ఫో.నం.0866-431181)


.... -----   ......   -----   .....    ------
 "వనితామాలిక"లో ప్రచురితం : ఇక్కడ చదవచ్చు..

Saturday, January 22, 2011

"యాహూ హోం పేజ్" లో తళుక్కుమన్న "Deol ladies"


పై ఫోటో లో ఉన్నది ప్రఖ్యాత హిందీ నటి హేమమాలిని, ఆమె కుమార్తెలు ఈషా, అహానా. "Namaste India" అనే Indo-American Association for Arts and Entertainment తాలూకూ లాంచ్ ప్రోగ్రాంలో నృత్యం చేస్తున్న ఫోటోలు ఇవి.

"యాహూ హోం పేజ్" లో "Deol ladies" పేరుతో కనబడ్డ ఈ ఫోటోలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వెంఠనే కాపీ చేస్కున్నాను. 62ఏళ్ళ ఈ అందమైన నటికి నృత్యం పట్ల ఉన్న passion,dedication నాకు ఆమె పట్ల గౌరవాన్ని పెంచుతాయి. కుమార్తెల కన్నా ఈమే ఎక్కువ అందంగా ఉందే అనిపిస్తుంది. పెరిగే వయసుతో పోటీపడే సౌందర్యం ఆమెది.

చిన్నప్పుడూ టివీలో "నూపుర్" అని హేమమాలిని డైరెక్ట్ చేసిన సీరియల్ వచ్చేది. విడువకుండా చూసేవాళ్ళం. హేమమాలిని, కబీర్ బేడీ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సీరియల్లో. ఎంతో ఇష్టంతో భరతనాట్యం నేర్చుకుని, నృత్యానికే జీవితం అంకితం చేయాలనుకునే మహిళ జీవిత కథ అది. గుల్జార్ రచించారు. కుమార్తెలతో పాటూ ఉన్న పై ఫోటోలను పొద్దున్నే యాహూ లో చూడగానే ముచ్చట వేసి ఈ టపా రాయాలనిపించింది. ఆమె తన కుమార్తెలు కూడా ఆ కళను నేర్పటం భరతనాట్యం పట్ల ఆమెకు ఉన్న ప్రేమను, అంకితభావాన్ని తెలుపుతాయి. ఆమె సంకల్పమే కాక వారు కళను నేర్చుకోవటం, అది వారికి అబ్బటం కూడా అదృష్టమే.



Wednesday, January 19, 2011

వెన్నెల్లో వాకింగ్...


భోజనమయ్యాకా పది నిమిషాలు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా...లైట్ వెయ్యకుండానే సందంతా పరుచుకున్న తెల్లని వెన్నెల రారమ్మని పిలిచింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని నడవటం మొదలెట్టాను. మెట్ల మీద కూడా వెన్నెలే. చిన్నప్పుడు నేర్చుకున్న లలితగీతం ఒకటి గుర్తుకొచ్చింది. అందులో "వెన్నెలలో వెండి మెట్ల దారురలో రావా...ఈ పుల బాటసారి మదిని వసంతమై పోవా.." అనే వాక్యం గుర్తుకొచ్చింది ఈ మెట్ల మీద పరుచుకున్న వెన్నెలను చూడగానే. ఇలాంటి వెన్నెల నిండిన మెట్లను చూసే రాసి ఉంటారు రచయిత అనుకున్నా. చలి తగ్గిపోయింది అప్పుడే. స్వెట్టర్ అవసరం అనిపించలేదు.


ఎఫ్.ఎమ్ ఛానల్స్ తిప్పుతూ నడుస్తున్నా. "వయ్యారి గోదారమ్మా..." మొదలైంది.. బాలు నవ్వుతో. ఆహా...అనుకున్నా.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపొతే కల వరం ! "
వేటూరిగారి మాట విరుపులో కూడా విరహమే.


"నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా
మువ్వగోపాలుని రాధిక
ఆకాశవీణ గీతాలలోనా
ఆలాపనై నే కరిగిపొనా..."
వేటూరి గారి కలం లోంచి ఒలికిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి. ఏం సాహిత్యం రాసారో కదా అనుకున్నా. కొన్ని పాటలు అదివరకు చాలా సార్లు విన్నవే అయినా , చాలారోజుల తరువాత మరోసారి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తాయి. పాట అయిపోయింది. వెంఠనే మరొ వేటూరి గీతం మొదలైంది. ఇది ఇంకా బాగుంటుంది..


సా...నిసరి సా..నీ....మొదలైంది. "అన్వేషణ"లో "కీరవాణి " పాట..


"ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా.."


...నీ కన్నూలా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై.."
ఏం రాసారు...తిరుగుందా ఈ సాహిత్యానికి? కొత్త సినిమాల్లో ఇలాంటి పాటలేవీ? ఈ సాహిత్యం ఒక ఎత్తైతే, వీటికి ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రెండు పాటలకీ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇన్నాళ్ళ తరువాత కూడా వింటూంటే మైమరచిపోయేలా చేయటం ఆయనకే సొంతం. అప్పటి గోల్డెన్ ఇరా లో ఆయన అందించిన బాణీలన్నీ ఇలాంటివే. అతి చెత్త మూడ్ లో ఉన్నా కూడా స్టార్టింగ్ హమ్మింగో, ట్యూనో వినగానే అప్రయత్నంగా గొంతు కలిపేస్తాం పల్లవితో..! అలాంటి ట్యూన్స్ ఇళయరాజావి.


ఆలోచనలు నడుస్తూండగానే మరో రెండు పాటలు అయిపోయాయి. పది నిమిషాలనుకున్న నడక కాస్తా అరగంట దాటింది. ఇక ఈపూటకు చాల్లెమ్మని ఇంట్లోకి వచ్చేసా. వస్తూనే నా వెన్నెల్లో వాకింగ్ నీ, ఆలోచనల్ని ఇలా టపాయించేసా...

Wednesday, January 12, 2011

గాలిపటాలు



ఊరినిండా అడుగడుగునా అమ్మకానికి పెట్టిన గాలిపటాలను చూస్తూంటే "స్నేహం" సినిమాలోని "ఎగరేసిన గాలిపటాలు"పాట గుర్తుకు వచ్చింది.ఆ పాటలోని కొన్ని వాక్యాలు...

"ఎగరేసిన గాలిపటాలు...
దసరాలో పువ్వుల బాణం..
దీపావళి బాణా సంచా..
నులివెచ్చని భోగిమంటా..

చిన్ననాటి ఆనవాళ్ళు
స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు...."

పి.బి.శ్రీనివాస్ పాడిన ఈ పాట ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది. నాకు గాలిపటాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటిపక్కన ఉండే మా కన్నా పెద్ద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూంటే అదేదో 8th wonder లాగ చూసేవాళ్ళం. అసలు నలుపలకలుగా ఉన్న ఆ కాగితం అలా గాల్లో అంత ఎత్తుకి ఎలా వెళ్తుంది అని ఆశ్చర్యం కలిగేది. ఎగరేస్తు దూరంగా ఉన్న గాలిపటాలతో పోటీ పడటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గాలిపటాలను ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరేసుకోవటాలు, పడగొట్టడాలూ భలేగా ఉండేది. మధ్య మధ్య ఆ పిల్లలు దారం పట్టుకొమ్మని చెప్పి ఏదో పని మీద వెళ్ళివచ్చేవారు. మహాప్రసాదం లాగ ఆ దారన్ని అతి జాగ్రత్తగా పట్టుకుని, ఆ గాలిపటం దగ్గర్లో ఎగిరే మరే గాలిపటానికీ చిక్కకుండా వెళ్ళినవాళ్ళు వచ్చేదాకా కాసేపన్నా గాలిపటాన్ని ఎగరవేయటం గొప్ప థ్రిల్ గా ఉండేది. అలా కాసేపు గాలిపటాన్ని పట్టుకోవటం కోసం పెద్దపిల్లలందరూ గాలిపటం ఎగరేస్తున్నంత సేపూ అక్కడే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళం..ఓ సారివ్వవా? అని అడుగుతూ...అదో మధురమైన జ్ఞాపకం.

గాలిపటం ఎగరేయటం నేర్పమంటే, "చిన్నపిల్లలు మీకు రాదు" అనేసేవారు వాళ్ళు. ఉక్రోషం వచ్చి నేనూ,మా తమ్ముడూ కలిసి గాలిపటం కొనుక్కొచ్చి మేడ మీదకి వెళ్ళి, ఒకళ్ళం దారాన్ని పట్టుకుంటే ఒకళ్ళం గాలిపటం పట్టుకుని దూరంగా పరిగెత్తుకువెళ్ళి దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించేవాళ్ళం. కాస్త ఎగిరేది. క్రింద పడిపోయేది. కొన్ని కాస్త దూరం ఎగిరి ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని చిరిగిపోయేవి. అలా గాలిపటాన్ని ఎగరేయాలన్న కోరిక కోరికలాగే ఉండిపోయింది. అన్నయ్యకూ ,తమ్ముడికీ కూడా రాదు ఇప్పటికీ. పెళ్ళయ్యాకా మావారు, మా మరిది ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయటంలో ఎక్స్పర్టులు అని తెలిసి చాలా సంతోషించాను. ఇంట్లో పాత సామానుల్లో గాలిపటాల దారాలు అవీ చూసి సంబరపడిపోయేదాన్ని. కానీ కొన్ని కారణాలవల్ల చాలా ఏళ్ళు గాలిపటాలు ఎగరేయటం మాకు కుదరనే లేదు. క్రితం ఏడు మా పాప వీధుల్లో అమ్ముతున్న గాలిపటాలను చూసి కావాలని మారాం చేసింది. కొనిపెట్టాం. వాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎగరేసుకుని వచ్చారు. కానీ ఏవో పనుల్లో ఉండి నాకు వెళ్ళి చూడటం కుదరనేలేదు. పనయ్యి నేను పైకి వెళ్దామని బయల్దేరేలోపూ వాళ్ళు క్రిందకు వచ్చేసారు.

ఈసారి మళ్ళీ పాప గాలిపటాలు కొనమని గొడవచేస్తూంటే ఈ చిన్నప్పటి ఊసులన్నీ గుర్తుకొచ్చాయి. ఈసారి ఏమైనాసరే గాలిపటాన్ని స్వయంగా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి..
ప్రతి ఏడూ గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి కూడా 21st ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఈ నెల తొమ్మిది నుండీ ఇవాళ్టివరకూ జరిగింది. గుజరాత్ అంతా టూరిస్ట్ లతో మహా సందడిగా ఉంటుంది ఈ సమయంలో. ఒక కైట్స్ ఫెస్టివల్ తాలూకూ క్లిప్పింగ్ చూడండి...రకరకాల గాలిపటాలు భలే అందంగా ఉన్నాయి ఈ వీడియోలో.



2010 లో జరిగిన 20th kites festival తాలూకూ వీడియో లింక్:
http://www.youtube.com/watch?v=6eWny8zBa8s&feature=fvw.