సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 27, 2010

రావుడు నుంచీ "రామం" వరకూ... నాన్న కథ - 5 !!



looking at his own creation at mutyalampaDu Art Gallery


Oct 27, 2:30p.m
విజయచిత్ర పత్రిక మొదలెట్టినప్పటి నుంచీ అప్టుడేట్ గా అన్ని సంచికలూ వరుస ప్రకారం క్రమం తప్పకుండా బైండ్ చేయించి పదిలపరిచేది రామం సతీమణి సీత. తన చిన్నప్పటినుంచీ సినిమా హాళ్ళలో రామం కొని పదిలపరిచిన రెండొందలకు పైగా సినిమా పాటల పుస్తకాలు కూడా సీతే బైండ్ చేయించిండి. ఇవన్నీ కాక రామం స్వయంగా వివిధభారతి పోగ్రామ్ల కోసం ఉద్యోగంలో చేరకముందే దాదపు మూడువేల తెలుగు సినిమాపాటల రెడీ రికనర్(జంత్రీ), సినీ సంగీతదర్శకుల వ్యక్తిగత జంత్రీ, గేయ రచయితల జంత్రీ, శీర్షిక గీతాల జంత్రీ ఇవన్నీ సర్వకాల సర్వావస్థల్లో రామం భుజానికి తగిలించుకునే సంచీలో సిధ్ధంగా ఉండేవి. "సీతామాలక్ష్మి" సినిమాలో "అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే.." అన్నట్టు ఆ ముఫ్ఫై సంవత్సరాలలో ఎప్పుడు రామాన్ని కదిపినా పాటే. హిందీ, తెలుగు సినిమా పాటల్లో ఓపినింగ్ మ్యూజిక్ బిట్ గానీ, చరణాల మధ్యన వచ్చే ఇంటర్ల్యూడ్ మ్యూజిక్ గానీ, ఏది చెప్పినా ఆ పాట మొత్తం చెప్పే చాకచక్యం ఆ రోజుల్లో(ఇప్పటికీ) రామం సొంతం. ఈ సంగీత పరిజ్ఞానమంతా రేడియో కార్యక్రమాల తయారీకి ఎంతో దోహదపడేది. సినిమాపాటలతోనేకాక సినీపరిశ్రమకు చెందిన సాంకేతిక సమాచారాన్ని కూడా తనను విశేషంగా అభిమానించే రేడియో శ్రోతలకు అందించాలనే సదుద్దేశంతో యువవాణి విభాగంలో కూడా "వెండితెర వెలుగు జిలుగులు" శీర్షికతో కొన్ని సీరీస్ ప్రసారం చేసాడు రామం.(తన రేడియో శ్రోతల్ని "శబ్దమిత్రులు" అని సంబోధించి, వారికి మొట్టమొదట ఆ పేరు పెట్టినవాడు రామమే). సినిమాలలో విశాల పరిధి, నిడివి గల చిత్రాలను ’సినిమా స్కోప” అని పిలిచినట్లే తను నూతనంగా ప్రయోగాత్మకంగా శ్రోతల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమానికి "రేడియోస్కోప్ మల్టి కలర్ ప్రోగ్రాం" అని నామకరణం చేసిందీ రామమే. వీటన్నింటిలోనూ ఈనాటి ప్రైవేట్ ఎఫ్.ఎమ్ ఏంకర్ల వడి వేగం ఆనాడే రామం గొంతులో పలకటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ వినూత్న ప్రయోగాన్నైనా ఎంతో అభిమానంగా, ఆనందంగా స్వీకరించేవారు ఆనాటి రామం శ్రోతలు.






తన ముఫ్ఫై ఏళ్ళ రేడియో ప్రస్థానంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు చేయటానికి రామానికి అవకాశం వచ్చింది. అందునా సినీ, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు విజయవాడ కేంద్ర బిందువు కావటంతో ఎంతో మంది ప్రముఖులు విజయవాడ రేడియో కేంద్రానికి వస్తూ ఉండేవారు. రామం వివిధభారతి వాణీజ్యవిభాగంలో పనిచేయటం వల్ల ఇటువంటి ఎందరో ప్రముఖులను రేడియో శ్రోతలకు పరిచయం చేసే మహాభాగ్యం కలిగింది. అందులో కొన్ని వివిధభారతి కోసం మాత్రమే చేసిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు. 1971లో రామం హైదరాబాద్ వివిధభారతి కేంద్రంలో కేజువల్ అనౌన్సర్గా చేస్తున్నప్పుడు "సంబరాల రాంబాబు" చిత్రం ప్రదర్శిస్తున్నకాలంలో గాయకుడు బాలు హైదరాబాద్ రావటం తటస్థించింది. ఆ సందర్భంగా గాయకుడు బాలుతో రామం చేసిన పరిచయ కార్యక్రమం(ప్రత్యేక జనరంజని) హైదరాబాద్ వాణిజ్యవిభాగంలో ప్రసరమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ అదే మొదటి పరిచయకార్యక్రమం. బాలు రేడియోలో పాల్గొన్న తొలి తెలుగు పరిచయ కార్యక్రమం కూడా అదే.


interview with kamal hasan

interviews with Daasari, Bharani, Sirivennela, actress Roja


అలాగే తను విజయవాడ కేంద్రానికి మారాకా సినీరంగానికి చెందిన సావిత్రి, అంజలి, విజయ నిర్మల, కె.విశ్వనాథ్, జగ్గయ్య, ముళ్ళపూడి, కమల్ హాసన్, పద్మనాభం, సిరివెన్నెల, తనికెళ్ల భరణి, దాసరి, రోజా, సంగీతదర్శకులు పెండ్యాల, మాష్టర్ వేణూ; ఇతర కళారంగాలకు చెందినవారిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ప్రముఖ నాట్యాచార్యులు నటరాజరామకృష్ణ, విజయచిత్ర కెమేరామేన్ కె.ఆర్.వి.భక్త("అందాలరాశి" చిత్రనిర్మాత) మొదలైన ఎందరెందరో ప్రముఖులతో ఇంటర్వ్యూ లు రికార్డ్ చేసి, ప్రసారం చేసే అవకాశం లభించింది. విజయవాడ కేంద్రానికి లేదా ఊళ్ళోకి ఏ ప్రముఖులొచ్చినా రేడియోలో వారిని పరిచయం చెయ్యటానికి రామానికే ఎక్కువ ఆహ్వానాలు లభించటం ఒక పక్క ఆనందాన్ని కలగజేసినా రాను రానూ శలవురోజు అయినా, డ్యూటీ ముగించికుని వచ్చి నిద్రోతున్నా కేంద్రానికి దగ్గరగా క్వార్టర్స్ లోనే ఉండటంవల్ల ఈ పిలుపుల తాకిడి మరీ ఎక్కువై, కొంత బాధాకరంగా పరిణమించాయి అనటం అతిశయోక్తి కాదు. దీనికి తోడు ప్రొఫెషనల్ జెలసీ ఉండనే ఉండేది. అందుకే కొన్నిసార్లు తప్పించుకోక తప్పేది కాదు.


interview with Sri V.A.K.Rangarao


*** *** ***

ఆకాశవాణి జాతీయ అవార్డ్ ల పరంపర లోకి రామం ప్రవేశించటం విచిత్రంగా జరిగింది. వారం వారం వివిధభారతి శ్రోతల కోసం అతను రూపొందించే ఒకానొక కార్యక్రమంలో "సినిమా ట్రైలర్" అనే వినూత్న ప్రయోగాన్ని రామం ఒకసారి చేసాడు. (ఈ "సినిమా ట్రైలర్" నే "సాహిత్యాభిమాని బ్లాగర్ "శివ"గారు ఆ మధ్యన వారి బ్లాగ్లో టపాగా పెట్టారు.) అది మొట్టమొదటిసారి రూపొందించినప్పుడు దానిలో వ్యాఖ్యానం ప్రముఖ రచయిత, కవి, రేడియోమిత్రులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు చదివారు. ఆ ప్రోగ్రాం ఎడిటింగ్ చేస్తూండగా అప్పట్లో హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ శ్రీనివాసన్ గారు అనుకోకుండా వచ్చి విని, "ఇదేదో ఇన్నోవేటివ్ ఐడియాలా ఉందయ్యా. దీన్ని నేషనల్ అవార్డ్ కు పంపకూడదు" అన్నరు. కానీ రామం పట్టించుకోలేదు. మళ్ళీ కొంతకాలం తరువాత ఆయనే వచ్చి "ఏం చేసావ్ నే చెప్పిన ఐడియా?" అని రెట్టించారు. ఇక తప్పదనుకుని ఆ చిన్న ఐడియా చుట్టూ మరికొన్ని నూతన ప్రయోగాలను జోడించి ఓ అరగంట ప్రోగ్రాం చేసాడు రామం. ఈసారి ఒక మార్పు కోసం సినిమా ట్రైలర్ వ్యాఖ్యానం కో-అనౌన్సర్, గాయకుడు, హాస్యప్రియుడు అయిన మల్లాది సూరిబాబుగారితో చదివించాడు. అదే రామానికి మొట్టమొదటి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన "నీలినీడలు". విజయవాడ కేంద్రానికి కూడా ఇన్నోవేటివ్(సృజనాత్మక) విభాగంలో తొలి జాతీయ బహుమతి.


రామానికి ఈ పంధా నచ్చి ఆ దారిలోనే అనేక సృజనాత్మక కార్యక్రమలకు రూపకల్పన చేసాడు రామం. ఇంచుమించు ప్రతిసారీ ఢిల్లీ న్యాయనిర్ణేతలకు(జ్యూరీకి) కూడా ఆ కాన్సెప్ట్ నచ్చి అవార్డ్లు ఇస్తూ వచ్చారు. మధ్య మధ్య రైతులు పంట మార్పిడీ చేసినట్లు ఒకోసారి మార్పు కోసం ఓ మంచి నాటకాన్నీ, మరోసారి మంచి సంగీతరూపకాన్ని, ఇంకోసారి మంచి ఇతివృత్తంతో ఉన్న డాక్యుమెంటరీనీ రూపొందించి పోటీలకు పంపేవాడు రామం. అన్ని విభాగాలలో బహుమతులను సొంతం చేసుకున్నాడు అతను. అవార్డ్ ఇచ్చిన ప్రతిసారీ 'for best sound recording and music mixing' అని సైటేషన్ చదివి అవార్డ్ ఇచ్చేవారు. దాని కోసమే తాను ఢిల్లీ దాకా వెళ్ళేవాడు. కేవలం రెండు మూడు మైకులతో రికార్డింగ్ చేసే చిరకాల ఆకాశవాణి పధ్ధతికి స్వస్తి చెప్పి ఏడెనిమిది చానల్స్లో మ్యూజిక్ రికార్డింగ్ చేసి, సింగిల్ ట్రాక్ పైనే మల్టీఛానల్ రికార్డింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగ ఎంతో శ్రమించేవాడు సౌండ్ ఇంజినీర్ రామం. ఇందుకోసం రికార్డింగ్ స్టూడియోలో ఎన్నో మార్పులు చేర్పులూ, కొత్త పరికరాలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసాడు రామం. దానికి ప్రతిఫలం ఢిల్లోలో దక్కేది. 'ఇది ఆకాశవాణి రికార్డింగ్ కాదు, బయట కమర్షియల్ స్టూడియోలో రికార్డ్ చేసినది' అని ఢిల్లీ పెద్దలు అనుమానం వ్యక్తపరిచేవారు కూడా.


ఈ అవార్డ్ కార్యక్రమాల పరంపర 1980 నుంచీ 2000 వరకూ నిరవధికంగా కొనసాగింది. మిగిలిన అవార్డ్ ప్రోగ్రాముల వివరాలు....


(తదుపరి భాగంలో...)


Tuesday, October 26, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 4 !!

మూడవ భాగం తరువాయి...

recording of a children's play produced by ramam

Oct 26, 8.30a.m
ఆ విధంగా వివిధభారతిలో వైవిధ్యమైన కార్యక్రమాల ద్వారా " When God closes one door, he opens another.." అన్న సూక్తిని నిజం చేస్తూ మద్రాస్ లో దాగుండిపోయిన కలలో కొన్నింటినన్నా రేడియో ద్వారా తీర్చుకునే సువర్ణావకాశాన్ని భగవంతుడు రామానికి అందించాడు. డైలీ డ్యూటిలతో పాటూ తనకు మొదటి నుంచీ ఇష్టమైన పిల్లల కార్యక్రమాలు అనేకం సమర్పించే అవకశాలు వచ్చాయి. ప్రముఖ ఆకాశవాణి కళాకారులు, హాస్య రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు అప్పట్లో పిల్లల కార్యక్రమం ప్రొడ్యూసర్ గా ఉండటం వల్ల రామంలోని పిల్లల పట్ల ఆసక్తిని గమనించి అనేక పిల్లల కార్యక్రమాలు రూపొందించే ఫ్రీ హాండ్ ఇచ్చారు. అందులో భాగంగా అనేక వారాలు సీరియల్గా వచ్చిన ఉపనిషత్ కథలు ఒకటి. ఇంటి చుట్టూ పిల్లలని పోగేసి ఓపిగ్గా వాళ్ళతో రిహార్సల్స్ చేయించి చక్కని సంగీతానికి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి ఈ సీరియల్స్ రూపొందించేవాడు రామం. అలాంటిదే మరో సీరియల్ "అల్లరి గోపి". అల్లరి చేసే ఓ కొంటె పిల్లాడిని ఓ సీతాకోకచిలుక తన మాయాజాలంతో అణుమాత్రంగా మార్చేసి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించి అతని మానసిక పరివర్తన తేవటం ఇందులో ఇతివృత్తం. ఈ సీరియల్ లో ఉపయోగించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల ఇది పిల్లల పసి మనసుపైన చరగని ముద్ర వేసింది. తరువాత ఇది రష్యన్ భాషలో కూడా రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ఏళ్ళ తరువాత ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో ప్రముఖ హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్ దర్శకత్వంలో "హనీ ఐ ష్రంక్ ద కిడ్స్" అనే పేరు మీద ఈ నాటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకపోయినా అద్భుతమైన పిల్లల చిత్రంగా రావటం.


అలాంటిదే "అల్లాఉద్దీన్ అద్భుతదీపం" నాటిక. పేరు పొందిన సినిమా సంస్థల్లాగ, రామం చేతిలో ఒక చురుకైన పిల్లల బృందం ఎప్పుడు తయారుగా ఉండేది. వాళ్ళు ఏ నాటకానికైనా సిధ్దమే. మెత్తని మైనంలాగ మలచుకునే అవకాశం ఉన్న పిల్లలు. అంతేకాక ఇంకా కొత్త కొత్త పిల్లలకు కూడా రామం ద్వారా అవకాశాలు దొరుకుతూ ఉండేవి. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రెంటాల గోపాలకృష్ణగారి కుమార్తె, ప్రస్తుత ప్రముఖ బ్లాగర్, రచయిత, కవయిత్రి, మిత్రులు రెంటాల కల్పనగారు కూడా దాదాపు పదేళ్ళ ప్రాయంలో రామం రూపొందించిన ఒక సీరియల్ లో పాల్గొన్న స్వీట్ మెమొరీని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. "టాం సాయర్" సీరియల్ తాలూకూ క్రింది ఫోటోలో కల్పనగారు కూడా ఉన్నారు.


Team of ramam's 'Tom sawyer' Radio play


ఈ సీరియల్ వెనుక చిన్న కథ ఉంది. రామం పుట్టి పెరిగిన ఖండవిల్లి గ్రామానికి డైలీ న్యూస్ పేపర్ రావాలంటే మధ్యాహ్నం మూడు గంటలు దాటేది. అప్పుడే ఆ రోజు పేపర్ చదువుకోవటం. అలాగే రామం వాళ్ళ ఇంట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీలు కూడా రెగులర్ గా తెప్పించేవారు. అప్పట్లో వారపత్రిక వెల పావలా. ఆ కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అనేక పిల్లల సీరియల్స్ వస్తూండేవి. మద్దిపట్ల సూరిగారి అనువాదం "పథేర్ పాంచాలి", జూల్స్ వెర్న్ నవల "సాగర గర్భంలో సాహస యాత్ర", మార్క్ ట్వైన్ రచించిన సుప్రసిధ్ధ పిల్లల నవల "టాం సాయర్", ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు" వంటి అనేక రోమాంచితమైన రచనలు వచ్చేవి. ఏ ఇతర ప్రచార సాధనాలూ లేని ఆ ఊళ్ళో రామానికి ఈ వారపత్రికలే ముఖ్యమైన ఆకర్షణలు. ప్రతి పరిణితి చెందిన వ్యక్తిలోనూ ఒక పసి బాలుడు దాగి ఉంటాడు అని మార్క్ ట్వైన్ చెప్పినట్లు ఈ రచనలన్నీ రామం హృదయం మీద చెరగని ముద్ర వేసాయి. అందులోనూ వీరోచిత కృత్యాలతో నిండిన బాల నాయకుడు "టాం సాయర్" రామానికి ఆదర్శప్రాయుడైయ్యాడు. ఈ క్రెడిట్ అంతా మార్క్ ట్వైన్ పిల్లల కోసం రాసిన నవలాన్నీ అద్భుతంగా అనువాదం చేసిన నండూరి రామ్మోహనరావు గారికే దక్కుతుంది. దాదాపు 15,20 ఏళ్ళ తరువాత రామం రేడియోలో స్థిరపడ్డాక "టాం సాయర్" సీరియల్ పిల్లల కోసం ప్రసారం చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. అదృష్టవశాత్తు ఆ అవకాశం అతనికే దక్కింది. ఏ కథైతే తను చిన్నతనంలో తన మనసుకి అయస్కాంతంలా అతుక్కుపోయిందో దాన్నే మళ్ళీ పిల్లల సీరియల్గా శబ్ద రూపంలో స్వయంగా రూపొందించే అవకాశం దక్కటం రేడియో తనకు ప్రసాదించిన అపూర్వమైన అదృష్టంగా రామం ఇప్పటికీ భావిస్తాడు.


పది వారాల పాటు దిగ్విజయంగా పిల్లల ప్రశంసలు పొందుతూ ప్రసారమైన ఈ సీరియల్ పూర్తి నీడివి మూడున్నర గంటలు. అంటే ఓ రాజ్కపూర్ సినిమా అంత. ఇది రామం కలలలో ఒకటి. అందుకే ఇందులో తన పిల్ల బృందంతో పాటూ కొన్ని పెద్ద వయసు పాత్రలను లబ్ధప్రతిష్ఠులైన సీతారత్నమ్మగారిలాంటి రేడియో కళాకారులు కొందరు పాలుపంచుకున్నారు. అప్పట్లో రేడియో శబ్ద మాంత్రికులుగా పేరుగాంచిన సీ.రామ్మోహన్రావు, నండూరి సుబ్బారావుగారు వంటి చెయ్యి తిరిగిన కళాకారుల చేత "పొట్టిబావా బాగా చేస్తున్నావోయ్.." అని ప్రత్యేక ప్రశంసలు పొందటం రామం జీవితంలో నేషనల్ అవార్డ్స్ కంటే అపూర్వమైన అనుభూతి. నండూరి రామ్మోహన్ రావుగారి నవలను రేడియోకి అనువదించి అద్భుతమైన సంభాషణలు రాసిన ప్రముఖ రచయిత, సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు కూడా ఎంతో అభివందనీయులు. ఈ సీరియల్లో వాడిన డజన్ల కొద్దీ సౌండ్ ఎఫెక్ట్స్, కథా గమనానికి అనువైన నేపధ్య సంగీతం కోసం రామం ఎంతో శ్రమించాడు. అంతే కాక "టాం సాయర్" పోలీ పెద్దమ్మ, పిల్లి నటించిన సీన్ లో ’పిల్లి ’ రామమే. అర్ధరాత్రి టాం సాయర్, హక్ భయపడే కుక్కల సీన్ లో ’కుక్క ’ కూడా రామమే. ఇవన్నీ కాక అవసరార్ధం ఎన్నో చిన్న చిన్న పాత్రలు కూడా రామమే ధరించాల్సివచ్చింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా "టాం సాయర్" సీరియల్లోని ఏదో కొంత భాగాన్ని గీతా పారాయణంలాగ తరచు వింటూ ఉండటం ఇప్పటికీ రామం నిత్య కృత్యాల్లో ఒకటి. ఇక ఆ సీరియల్లోని సీన్లు, డైలాగులన్నీ ఇంటిల్లిపాదికీ కంఠతావచ్చు. "టాం సాయర్", "హకల్ బెరిఫిన్" రెండు ఆంగ్ల చిత్రాల కంటే ఈ శబ్దరూపకమే బాగా వచ్చిందని రామం ఘట్టి అభిప్పిరాయం(బుడుగ్గడిలాగ).



జర్నలిస్ట్, ప్రఖ్యాత సైన్స్ రైటర్ పురాణపండ రంగనాథ్ గారు రేడియోకి ఎన్నో శాస్త్రీయ రచనలు చేస్తూ ఉండేవారు. అలాగే పిల్లల కోసం కూడా ఎన్నో సైన్స్ నాటకాలు రాసారు. అందులో ఒక స్టేజ్ నాటకం పేరు "రోపోడా"(రోగాలు పోగొట్టే డాక్టర్?) దురదృష్టవశాత్తు బాల్యంలోనే వృధ్ధాప్యం దాపురించిన ఓ పిల్లవాడు ఒక విచిత్రమైన కాలయంత్రం ద్వారా తిరిగి యవ్వనాన్ని పొందటం ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసన్, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రయాగ వేదవతిగార్ల నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో ఈ నాటకాన్ని నిర్వహించి, కలా నిజమా అని భ్రమించేలాగ ఓ కాలయంత్రాన్ని కృత్రిమంగా సృష్టించి పత్రికల ప్రశంసలు పొందాడు రామం. ఇంతా చెస్తే ఆ యంత్రం తయారిలో వాడిన భాగాలన్నీ రేడియో స్టేషన్లోని ఇంజినీరింగ్ విభాగంలో పనికిరాకుండా పడేసిన పరికరాలే. మళ్ళీ ఇదే నాటకాన్ని అదే బృందంతో శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్లోని బహిరంగ రంగస్థలంపై అనేకమంది సాంకేతిక నిపుణులు, సైంటిస్ట్ ల్లు, సామాన్య ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించి వారి మెప్పును కూడా పొందటం జరిగింది. ఈ క్రింది ఫోటోలోనిదే ఆ యంత్రం.







దీని తరువాత, పిల్లల కార్యక్రమాల్ని పర్యవేక్షించే శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారి ప్రేరణతో తానే ఒక పిల్లల సంగీత కథారూపకం "చింటూ - బిజ్జూ" రూపొందించి సీరియల్గా ప్రసారం చేసాడు రామం. ఇందులో కథనం, పాటలూ, మిమిక్రీ అన్ని రామమే. దీని నిడివి ఒక గంట.


*** *** ***


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫైనలియర్ పరీక్షాంశంగా సబ్మిట్ చేసిన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" అనే థీసీస్ లో ఒక చాప్టర్ "బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్స్"( సినిమాలలో నేపథ్యసంగీతం). రామానికి ఇష్టమైన సబ్జక్ట్స్ లో ఒకటి. విజయచిత్ర పత్రికవారు ఇదే అంశం పైన నిర్వహించిన పోటిలో రామానికి ప్రధమ బహుమతి లభించింది. దాని న్యాయ నిర్ణేత ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు(ప్రముఖ నటి అంజలీదేవి భర్త). ఇదే అంశంపై ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో రెండువారాలు ధారావాహికగా ప్రచురితమైంది. తనకెంతో ఇష్టమైన ఇదే అంశం మీద తను రాసిన మరో ప్రత్యేక వ్యాసం ఆంధ్రప్రభవారు అరవైఏళ్ళ తెలుగు సినీ చరిత్రను పురస్కరించుకుని ప్రచురించిన "మోహిని" లో చోటుచేసుకుంది.


ఇవన్నీ కాక తొలినాటి మూకీల నుంచి, నేటి DTS వరకూ తెలుగు చలనచిత్ర నేపథ్యసంగీతానికి సంబంధించిన అనేక ఆడియో క్లిప్పింగ్స్ తో ఆ పరిణామక్రమం ప్రేక్షక శ్రోతలు సులువుగా అర్ధమయ్యే రీతిలో సోదాహరణాత్మకంగా వివరించే స్టేజ్ షోలు అనేకం విజయవాడ, నెల్లూరు, భీమవరం మొదలైన చోట్ల స్వయంగా నిర్వహించి ఆహూతుల మన్ననలు అందుకున్నాడు రామం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన పత్రికలవారు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే కారణంగా అకాశవాణి తరచూ బయటఊళ్ళలో నిర్వహించే OBలు(స్టేజ్ షోలు) ఎన్నింటికో రామాన్నే ప్రత్యేక వ్యాఖ్యాతగా తీసుకెళ్ళేవారు.

గాయకులు బాలు నిర్వహణలో కొనసాగిన "పాడుతా తీయగా" విజేతలతో (ఉష, పార్థసారథి,రామాచారి) విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోకి కూడా రామం వ్యాఖ్యాతగా, అనుసంధానకర్తగా తన పాత్ర విజయవంతంగా పోషించి, ఆ షోలో బాలు రాని లోటును తీర్చాడని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు పొందాడు. ఆ క్రెడిట్ విజయవాడ "రసమంజరి" సంస్థ వారిదే.

*** *** ***
జాతీయ స్థాయిలో మొట్టమొదటి సైన్స్ సీరియల్ ప్రొడ్యూస్ చేసేందుకు ఢిల్లీ నుంచి పిలుపు అందుకున్నాడు రామం. మూడు నెలలు అక్కడ ఉండి ఢిల్లీలో పనిచేయటం మరపురాని అనుభూతి తనకు. తరువాత మళ్ళీ 1990లో నూతనంగా ప్రారంభించిన తెలుగు విదేశీ ప్రసారవిభాగం ఇ.ఎస్.డి.లో ప్రారంభ అనౌన్సర్ గా ఏ.బి.ఆనంద్ గారితో పాటు కలిసి పనిచేయటానికి ఆహ్వానం రావటం అతనికి ఢిల్లీ దాకా ఉన్న గుర్తింపుకి మచ్చుతునక. ఈ కారణాలతో ఢిల్లీ ఆకాశవాణి భవన్లో పని చేయటం వల్ల ఢిల్లీ అంటే కూడా ప్రేమ ఏర్పడింది అతనికి.

(ఇంకా ఉంది...)

Saturday, October 23, 2010

vote for Gorgeous madhuri

gorgeous smile

నూరు వరహాలు ఆ నవ్వికివ్వచ్చు
ఒక్క చూపు కోసం దాసోహమనచ్చు
ఆమె ఊహతో కమ్మని కోటి కలలు కనచ్చు
ఆ సుమనోహరి కోసం ఏమైనా చేయచ్చు




నాలాంటి ఫాన్స్ ఎవరైనా ఉంటే మాధురికి వోట్ చేయండి.
వివరాల కోసం క్రింద లింక్ చూడండి...
http://in.yfittopostblog.com/2010/07/02/beautiful-women-of-the-century/

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 3 !!

రెండవ భాగం తరువాయి...

ramam performing first programme
శ్రీరామ్మూర్తి లాంటి వాళ్లకోసమే అన్నట్లు ఆకాశవాణిలో "యువవాణి" విభాగం కొత్తగా దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రతి శుక్రవారం ఉదయం విజయవాడ కేంద్రo నుంచి ఒక యువ శ్రోత తనకు నచ్చిన ఎనిమిది పాటలు వ్యాఖ్యానంతో సహా వినిపించే ప్రత్యేక అవకాశం వచ్చింది. దానిలో భాగంగానే శ్రీరామ్మూర్తికీ ఒక ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. తను మద్రాస్ లో ఉండగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కోసం తయారుచేసి పెట్టుకున్న స్క్రిప్ట్ లు ఎప్పుడు అతని దగ్గర రెడిగా ఉండేవి. అందులో ఒకటి "మూడ్స్ అండ్ మ్యూజిక్". ఒకరోజు సాయంత్రం విజయవాడ కేంద్రంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్, ప్రముఖ కర్ణాటక సంగీట విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారితో ఈవెనింగ్ వాక్ చేస్తూ ఈ కాన్సెప్ట్ గురించి చెప్పే అవకాశం దొరికింది శ్రీరామ్మూర్తికి. అది ఎంతో శ్రధ్ధగా విన్న ఓలేటిగారు "బావుంది. ఇది మా స్టేషన్కే కొత్త ఐడియా.యువవాణిలో ఓ అరగంట దీని మీద ప్రోగ్రామ్ చేయండి" అని, అప్పటి యువవాణి విభాగం అధినేత శంకరనారయణగారికి( ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారి సొదరుడు) పరిచయం చేసారు. ఆ ప్రోగ్రాం పేరు "భావనా సంగీతం". ఎవరో కుర్రకళాకారుడు అని తీసిపారేయక తానే స్వయంగా లైబ్రరికి వచ్చి కావాల్సిన రికార్ద్లన్నీ తీయించి ఇచ్చి, ఆ ప్రోగ్రాంకి పరిచయ వాక్యాలు కూడా తానే చదివి దగ్గరుండి ఆ కార్యక్రమం తయారు చేయించారు శ్రీ ఓలేటి. విజయవాడ, హైదరబాద్ రెండు కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారమైన ఈ కార్యక్రమానికి ప్రముఖుల ప్రశంసలు లభించటమే కాక B-high grade కూడా లభించింది. అప్పట్లో అదొక రికార్డ్. అందుకే ఆ కార్యక్రమం మళ్ళీ ఎన్నోసార్లు ప్రసారం చేసారు విజయవాడవారు.


aparanji arts, E.S.murthy from left
ఇక రేడియోనే తన తదుపరి మజిలీ అని నిర్ణయించుకున్నాడు శ్రీరామ్మూర్తి. కాకినాడ తిరిగి వచ్చి తన మిత్రుడు, గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్, దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి మేనల్లుడు అయిన ఈ.ఎస్.మూర్తి తో కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో యువవాణి కార్యక్రమాలు ఇచ్చాడు. అవన్నీ పున: పున: ప్రసారం అవుతూనే ఉండేవి. (ఆ తరువాత కాలంలో ఈ.ఎస్.మూర్తి తన మద్రాసు ప్రస్థానంలో కొంతకాలం బాలు దగ్గర, ఎంతో కాలం సంగీత దర్శకులు ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా పనిచేసారు.) కార్యక్రమానికి వెళ్ళిన ప్రతిసారీ విజయవాడ కేంద్ర ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు రఘురాం గారు ఈ కాకినాడ బేచ్ ని గేట్ దాకా సాగనంపి మళ్ళీ మంచి ప్రోగ్రాం తీసుకురండి అని వీడ్కోలు పలికేవారు. టాలెంట్ ఉన్న యువశక్తిని ప్రోత్సహించే సుగుణం ఆనాటి పెద్దల్లోనే ఉండేది. ఈ ప్రోత్సాహమే 1970లో విశాఖపట్నంలోనూ, 71లో హైదరబాద్ వివిధభారతిలో కేజువల్ అనౌన్సర్ గా పని చేసే అవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న కాలంలో ప్రముఖ వేణుగాన విద్వాంసులు కీ.శే. ఎన్.ఎస్.శ్రీనివాసన్, వారి సతీమణి, నాటక విదుషీమణీ శ్రీమతి శారదా శ్రీనివాసన్ చూపిన ఆదరణ, వాత్సల్యం అతని జీవితంలో ఎప్పటికీ మరువలేనివి.




రామానికి పదేళ్లప్పుడు జరిగిన వాళ్ళ అక్క పెళ్ళి తరువాత చేరువైన బావగారి కుటుంబం అతని కుటుంబంగా మారింది. బంధుత్వాలు, వాటి ఆప్యాయతలూ ఎరుగని ఒంటరితో మచ్చిక చేసారు వారంతా. 1970లో తన బావగారి చెల్లెల్లినే ఇచ్చి పెళ్ళి చేస్తానన్నారు మామగారు. సరైన ఉద్యోగం లేదని రామం తాత్సారం చేసినా ఇరిపక్షాల వత్తిడితో వివాహానికి అంగీకారం తెలిపాడు అతను. ఇద్దరి పేర్లు, మనసులు కలిసాయి. సీతారాములు ఒకటైయ్యారు. సంసారసాగరం మొదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఎంతో సహనవతి, అనుకూలవతి సీత. అన్యోన్యదాంపత్యం అంటే వాళ్ళిద్దరిదే అనిపించేది అందరికీ. రేడియోనే జీవితంగా బ్రతికే అతని మనసుని అర్ధం చేసుకుని, పిల్లల చదువులు మొదలు ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకునేది సీత. ఇల్లు మారితే "డ్యూటీ అయ్యాకా ఆఫీసు నుంచి ఫలానా అడ్రస్కు వచ్చేయండి" అంటే అక్కడికి వెళ్ళటం మినహా రామం మరేమీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

పర్మనెంట్ అనౌన్సర్ గా సెలక్ట్ అయిన తరువాత శ్రీరామ్మూర్తి ప్రస్థానం ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి మారింది.1972 నుంచీ 2002 వరకూ పర్మనెంట్ సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ గా శ్రీరామ్మూర్తి జీవితం నిరాటంకంగా కొనసాగింది. అనౌన్సర్ గా డైలీ షిఫ్ట్లు చేస్తూనే సినిమా సంగీతం పైన, లలిత సంగీతం పైన, వాద్య సంగీతాల పైన ఎన్నో కార్యక్రమాలు "రామం" పేరుతో రూపొందించాడు అతను. వారానికో శీర్షిక ఎంచుకుని అనువైన పాటలు, ఆకట్టుకునే వ్యాఖ్యానంతో "సరాగమాల" కార్యక్రమం కొనసాగింది కొన్ని సంవత్సరాలు. తన కాలేజీరోజుల్లో "ఆంధ్రసచిత్రవారపత్రిక"లో సినిమా సంగీతం పైన సరాగమాల పేరుతో వి.ఏ.కె.రంగారావు గారు నిర్వహించిన కార్యక్రమానికి గుర్తుగా ఆ పేరే ఈ కార్యక్రమనికి కూడా పెట్టుకున్నాడు రామం. తరువాత రేడియో సిలోన్ లో "అమీన్ సయానీ" వారం వారం సమర్పించే బినాకా గీత్ మాలా క్రమం తప్పకుండా విని ఆయన ఒరవడిని ఆకళింపుచేసుకున్న రామం ఆయన అడుగుజాడల్లోనే తెలుగులో కూడా అలాంటి కార్యక్రమం శ్రోతలకు అందించాలని "ఇంద్రధనసు" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు అతను.


ప్రతివారం ఒక సంగీత వాయిద్యాన్ని పరిచయం చేస్తూ దాని రూపురేఖలు, పుట్టు పూర్వోత్తరాలూ వివరిస్తూ, దాన్ని శాంపిల్ గా వినిపిస్తూ, అదే వాయిద్యాన్ని వివిధ సంగీత దర్శకులు తెలుగు పాటల్లో ఎలా వినియోగించారో శోదాహరణాత్మకంగా చెబుతూ "ఇంద్రధనసు" కార్యక్రమాన్ని రూపొందించేవాడు రామం. వారం వారం వందలాది శ్రోతల ఉత్తరాలు ఉత్తరాల కార్యక్రమాన్ని ముంచెత్తేవి. రేడియో స్టార్ రామాన్ని చూడటానికి విజయవాడ కేంద్రానికి, కొందరు రామం ఇంటికి కూడా వస్తూనే ఉండేవారు. ఇక గ్రీటింగ్ కార్డ్లు, బహుమతులు, పార్సిల్స్ లెఖ్ఖే లేదు. భారతీయ వాయిద్యాలైన వీణ, వేణువు, సితార్, సంతుర్, షహనాయ్ వంటి వాయిద్యాలే కాకుండా పాశ్చాత్య వాయిద్యాలైన ఎకార్డియన్, గిటార్, ట్రంపెట్, సాక్సో ఫోన్, మాన్డొలీన్, మౌత్ ఆర్గాన్ వంటి అనేక వాద్యాల గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించే ఈ కార్యక్రమం తెలుగు సినీగీతాల కూర్పుతో 25వారాల పాటు దిగ్విజయంగా కొనసాగింది. 25వ వారం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసాడు రామం. (హిందీలో అమీన్ సయానీ దాదాపు 25 సంవత్సరాల పాటు నిర్వహించిన బినకా గీత్ మాలా నే దీనికి స్ఫూర్తి.) ఆఖరు రోజు శ్రొతలందరూ ఆనంద భాష్పాలతో కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. ఆ రోజును ఇప్పటికీ తలుచుకుంటున్న శ్రోతలు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రోతలు ఆ వీడ్కోలు కార్యక్రమంలో ప్రత్యక్ష్యంగా పాల్గోవాలని రేడియో రామం ఒక ఇంద్రజాలం చేసాడు. అది ఆకాశవాణి చరిత్రలోనే వినూత్న ప్రయోగం.


అదేమిటంటే, అరగంట ప్రోగ్రాం కొద్ది నిమిషాల్లో పూర్తవుతుందనగా శ్రోతలని రేడియో సెట్ల దగ్గరకు ఆహ్వానించాడు రామం. మీ ఎడమ చేయి రేడియో సెట్ మీద పెట్టి, కుడి చేయి గాల్లో ఎడమ నుంచి కుడికి మూడుసార్లు అడ్డంగా కదపండి అని 1,2,3 చెప్పాడు రామం. నలభై కిలోమీటర్ల పరిధిలో వివిధ భరతి వింటున్న శ్రోతలందరూ రామం చెప్పినట్లే మంత్ర ముగ్ధుల్లా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ తో అతను చెప్పినట్లే చేసారు. "చూసారా..మీకు తెలీకుండానే ఇంద్రధనసు కు వీడ్కోలు చెప్పేసారు.." అని నవ్వుతూ చమత్కరించాడు రామం. ఆ కాసేపూ తను ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ అయ్యాడు. వివిధభారతి శ్రోతలంతా ప్రేక్షకులయ్యారు. ఈ ట్రిక్లో పాల్గొన్న శ్రోతలు మహదానందంతో మళ్ళీవారం ఉత్తరాల వర్షం కురిపించారు. ఆ రకంగా ఇంద్రధనసు ఆకాశవాణిలో చరిత్ర సృష్టించింది.


దాని తరువాత కొన్ని సంవత్సరాలపాటు "సంగీత ప్రియ" కార్యక్రమం రాజ్యమేలింది. ఇందులో ముఖ్యమైన ఆకర్షణ "singing partners" అనే అంశం. ఈనాటి టి.వి. "పాడుతా తీయగా"కు 30 ఏళ్లకు ముందే రామం ఈ అంశాన్ని ప్రవేశపెట్టాడు. అటు సినీమా ఫీల్డ్ కు వెళ్ళలేకపోయినా, ఇటు రేడియో సంగీతానికి అర్హత పొందలేకపోయినా, ఇంట్లో అద్భుతంగా పాటలు పాడే యువ కళాకారుల్ని వెతికి పట్టుకుని వారిచేత వివిధభారతిలో అద్భుతమైన పాటలు పాడించిన ఘనత రామానిదే. దానితో పాటూ కొంతమంది వాద్య కళాకారులను కూడా సంగీతప్రియ ద్వారా పరిచయం చేసాడు రామం. కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ రేడియోలో ప్రవేశించక ముందే వివిధభారతిలోని సంగీతప్రియ ద్వారా శ్రోతలను చేరిందంటే ఆశ్చర్యపడక తప్పదు.

రాత్రి పన్నెండు దాకా స్క్రిప్ట్ రాసుకుని, పొద్దున్న రేడియో స్టేషన్ తెరిచ గానే రికార్డింగ్ మొదలుపెట్టి, పదింటికల్లా పూర్తి చేసి టేప్ అప్పజెప్పి వచ్చేవాడు. ఇలాంటి అన్ని ప్రోగ్రాంల వెనుకా అన్ని సంవత్సరలూ రామం సతీమణి సీత అందించిన సహకారమే అతన్ని ముందుకు నడిపించింది - ఎందుకంటే తన ప్రతి కార్యక్రమానికీ ప్రధమ శ్రోత, క్రిటిక్ సీతే కనుక. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికల్లా వివిధభారతి శోతల్ని రేడియో దగ్గరకి లాక్కొచ్చి కూచోపెట్టిన ఖండవిల్లి రావుడు, "రేడియో రామం" గా స్థిరపడిపోయాడు.

(మూడవ భాగం పూర్తి...)



Friday, October 22, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 2 !!


మొదటిభాగం తరువాత
..

Oct 21,11.30p.m
ఫోటోలో భాస్కర్ తో పాటూ ఉన్నది అతని సన్నిహిత మిత్రుడు "నారయణమూర్తి". ఇతను ప్రముఖ న్యాయవాది, హాస్య రచయిత, రంగస్థల,సినీ నటులు అయిన శ్రీ పుచ్ఛా పూర్ణానందంగారి అల్లుడు. నలభై ఐదేళ్ళు అయినా చెక్కు చెదరని వాళ్ళ స్నేహం గాఢానురాగాలతో ఇప్పటికీ కొనసాగుతోంది.

అక్కగారి వివాహం అవ్వగానే బావగారు బాగా చేరువయ్యారు. బావ, అతనింటి సభ్యులు అందరూ అతన్ని "ఖండవిల్లి రామం" అని పిలిచేవారు. తండ్రి లేని లోటు అప్పటికి తీరింది. బావ ప్రోత్సాహంతో డిగ్రీ అవ్వగానే మద్రాసులోని గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు అప్లై చేసాడు భాస్కర్. తను గీసిన పైంటింగ్స్, మిగిలిన ఆర్ట్ వర్క్లో ఉన్న టేలంట్ చూసి ఇంటర్వ్యూ లో "డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్" బాగా ఇంప్రెస్స్ అయ్యి ’ఇతనికి తప్పకుండా సీత్ ఇవ్వండి" అని చెప్పి వెళ్ళాడు. దాదాపు అరగంట సేపు సాగిన ఇంటర్వ్యూలో తన దగ్గరున్న ఆర్ట్ మెటీరియల్ చూపించటానికే ఎక్కువ టైం పట్టింది. ఫోటోగ్రఫీ అంటే భాస్కర్ కు ఎంతో ఇష్టం. ఒక మామూలు హేండ్ కెమేరాతో ఎన్నో రకాల ట్రిక్ ఫోటోలు తీసేవాడు. అవన్నీ చూసి బోర్డ్ సభ్యులందరూ ఫొటోగ్రఫీ సెక్షన్ లో సీట్ తీసుకోమని బలవంతపెడితే, నాకు సంగీతం మీద ఆసక్తి ఎక్కువ. అందుకని సౌండ్ రికార్డింగ్ సెక్షన్ లోనే చేరతానని భాస్కర్ పట్టు పట్టాడు. ఎప్పటికైనా విజయా గార్డెన్స్ లో సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ లాగ మంచి పేరు తెచ్చుకోవాలని అప్పట్లో తన కోరిక. (ఆ కోరిక రేడియోలో జాతీయ బహుమతులు సంపాదించుకున్న తరువాత కొంతవరకు తీరింది.) అతని ఆశయాలు, కోరికలు తీరేలాగ 1965లో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో D.F.Tech(sound recording & sound engineering) లో సీటు వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళో గోడ మీద మూగ బొమ్మలు వేసుకునే కుర్రాడికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీటు రావటం ! తన అదృష్టానికి తానే మురిసిపోయాడు భాస్కర్. అక్కడికి కూడా తోడుగా ఉండి వండిపెట్టటానికి వాళ్ళ అమ్మమ్మ వస్తానని పట్టుపట్టింది. కానీ మద్రాసు లాంటి మహానగరంలో చిన్నపాటి ఇల్లు అది సంసారానికి అనువుగా దొరకక రాలేకపోయింది. అక్కడితో హాస్టల్లో ఒంటరి జీవితం మొదలైంది.
Madras film Institute van

1968 దాకా మూడేళ్ళు ఒక అద్భుత ప్రపంచంలో విహరించాడు అతను. హాస్టల్లో మొదటిరోజే తన వాయిద్యాలతో, సంగీతంతో తమిళ స్నేహితులను, అభిమానులనూ సంపాదించుకున్నాడు. వాళ్ల ఇన్స్టిట్యూట్ కేంపస్ లోనే ఉన్న "కేటరింగ్ ఇన్స్టిట్యూట్" లో కూడా స్నేహితులను సంపాదించుకున్నాడు భాస్కర్. ఇక్కడ స్నేహితులందరూ "శ్రీరామ్మూర్తి" అనే పిలిచేవారు. కాలేజీమిత్రులందరూ కలిసి ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ తయారుచేసుకున్నారు. బుల్బుల్ వాయించటమే కాక గ్రూప్ కు సారధ్యం కూడా వహించి మద్రాసు అనేక చోట్ల ప్రోగ్రామ్లు ఇచ్చేవారు.

playing Bulbul

ఒకసారి మద్రాస్ ఐ.ఐ.టి.లో అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు జరిగినప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీరామ్మూర్తి బుల్బుల్ తీసుకుని సంగీత విభాగంలో పోటికి వెళ్ళాడు. మద్రాసు మహానగరంలోని అనేక కాలేజీల నుంచి సంగీత కళాకారులు పియానో, ట్రంపెట్, సాక్సోఫోన్, జాజ్ డ్రమ్స్ లాంటి పెద్ద పెద్ద ఇస్ట్రుమెంట్స్ తీసుకువచ్చారు. అప్పటికి ఊళ్ళో 'లవ్ ఇన్ టోక్యో' హిందీ సినిమా విజయవంతంగా ఆడుతోంది. తాను ఆశా పారేక్ ఫాన్ కావటం వల్ల ఆ సినిమాలోని "సాయోనారా.." పాట రేడియోలో వచ్చినప్పుడల్లా విని నేర్చుకుని ఆ పాటే ఐ.ఐ.టి లో బుల్బుల్ మీద వాయించాడు. గొప్ప అప్లాజ్ వచ్చింది. ఐటమ్ అయిపోగానే వెళ్పోతుంటే ఆడియన్స్ "వన్స్ మోర్" అని కేకలు వేసారు. కాంపిటీషన్లో వన్స్ మోర్ ఏంటీ అని వెళ్పోతుంటే, ఆడియన్స్ ఊరుకోలేదు. అప్పుడు నిర్వాహకులే మళ్ళీ రిక్వస్ట్ చేసి రెండోసారి ఆ పాట వాయించమన్నారు. అప్పుడూ గ్రేట్ అప్లాజ్ వచ్చింది. అదో తీపి జ్ఞాపకం.

cover page painted by ramam


ఫైనల్ ఇయర్లో థీసీస్ సమర్పించాల్సివచ్చినప్పుడు, తనకి బాగా ఇష్టమైన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" మీద థీసీస్ సబ్మిట్ చేసాడు శ్రీరామ్మూర్తి. ప్రముఖ సౌండ్ రికార్డిస్ట్, మన తెలుగువారైన "వల్లభ జోస్యుల శివరాం"గారు ఎగ్జామినర్గా వచ్చారు. థీసీస్ చాలా బాగుందని 75% (డిస్టింక్షన్) ఇచ్చారు. ఫైనల్ ఇయర్ పరీక్షలో భాగంగా స్టూడేంట్స్ మూడు షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సి వచ్చేది. వాటిల్లో ఒక దానికి కోసం శ్రీరామ్మూర్తి "థ హౌస్" అనే కథ రాసి, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా కూడా అవార్డ్ తీసుకున్నాడు అతను. దానికి ఆధారం హాస్టల్ పరిసరాల్లో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇల్లు, షూటింగ్ తాలుకు ఫోటోలు.


with students shooting for 'The House'

'The house' behind the tree'

House in a different angle

అలా సౌండ్ రికార్డింగ్ లో డిప్లొమా పూర్తి చేసాడు. మద్రాసు ఫిలిం చాంబర్ హాల్లో ఏ.వీ.ఎం.చెట్టియార్ చేతుల మీదుగా "బెస్ట్ స్టూడెంట్" అవార్డ్ అందుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రకరకాల భాషల, ప్రాంతాల వీ వందలకొద్దీ సినిమాలు చూసి చూసి అతనికి ఎన్నో ఆలోచనలు వస్తూండేవి. ఓ పాకెట్ నోట్ బుక్స్ పెట్టుకుని తనకు వచ్చిన ఆలోచనలనీ, ఐడియాలనీ వాటిల్లో రాసుకునేవాడు. సినిమాలు చూస్తూ కూడా మధ్యలో వచ్చిన ఏవో ఏబ్స్ట్రాక్ట్ ఐడియాస్ జేబులోని చిన్న స్పైరల్ నోట్ బుక్లో ఆ చీకట్లోనే రాసుకునేవాడు. ఫిల్మ్ కోర్స్ పూర్తయ్యాకా సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాలనే కోరికతో ఓ ఏడుగురు స్నేహితులు మద్రాసులోనే ఒక ఏడాది ఉండిపోయారు. ఆ మిత్రులు అంతా కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిన్న కవిత ఆధరంగా "క్లౌడ్స్ అండ్ వేవ్స్" అని ఒక చిల్డ్రెన్స్ షార్ట్ ఫిల్మ్ తీసారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు మొదలైనవారంతా వచ్చి చూసి ప్రశంసలందించారు. అతని జీవితంలో అదొక స్వర్ణయుగం.


Oct 22, 11.45a.m
ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోయిన వాళ్ల గ్రూప్ ఆశలు నిరాశలే ఐనాయి. అప్పట్లో దూరదర్శన్ లాంటి సంస్థలు కూడా లేవు. సినీ పరిశ్రమలో అప్రంటిస్ గా చేరితే రెండొందలు కన్నా జీతం రాదు. ఉద్యోగం లేకున్నా అప్పటికే ఒక సంవత్సరం పాటు బావగారు ధన సహాయం చేస్తు వచ్చారు. ఆ పై ఆర్ధికంగా పోషించటానికి వెనుక ఎవరూ లేని నిస్సహాయత ఏదో సాధించాలన్న శ్రీరామ్మూర్తి ఉత్సాహాన్నీ, సృజనాత్మకతనూ నీరుకార్చేసాయి. భాస్కర్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో కుటుంబరీత్యా స్థితిమంతుడైనప్పటికీ అతనికి పెద్దగా స్థిరాస్థులేమీ అందలేదు. బావగారు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. అక్క, బావ అక్కడ ఉన్నారని, పిల్లవాడి వంతు వచ్చిన డబ్బుతో కాకినాడలో ఇల్లు కొని స్థిరపడ్డారు అమ్మ, అమ్మమ్మ. అలా కాకినాడ తో అనుబంధం మొదలైంది.


ఇంటి నుంచి వచ్చేయమని వత్తిడి ఎక్కువవటంతో ఎటూ తోచని పరిస్థితిలో బలవంతాన1968లో పెట్టె,బేడా సర్దుకుని కాకినాడ వెళ్పోయాడు శ్రీరామ్మూర్తి.. తన స్నేహితులకు మల్లె తనకు తండ్రి అండ ఉండి ఉంటే, ఇంకొన్నాళ్ళు మద్రాసులో ఉండగలిగితే వాళ్ళకు లాగే తానూ సినీ పరిశ్రమలో ఉండిపోయేవాడిని కదా అనుకుంటాడు ఇవాళ్టికి కూడా. అతని స్నేహితులు చాలా మంది గొప్ప గొప్ప స్థానాలో, పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నారు. అతని రూట్స్ ఇప్పటికీ మద్రాసులోనే ఉంటాయి. మద్రాసు పేరు చెబితేనే ఉత్సాహంతో తన మనసు అక్కడికి పరుగులు తీస్తుంది.

ఒక మహా వైభవాన్ని చూసిన మనిషికి, ఏవేవో చెయ్యాలని కలలు కన్న మనిషికి, తనది అనుకునే ప్రపంచం నుంచి వేరు పడిన మనిషికి ఇక ప్రపంచంలో ఏ మూల ఉన్నా పెద్ద తేడా కనబడదు. ఏ పనైనా ఒకటే. అదే నిర్లిప్తతతో పెద్దల తృప్తి కోసం చదువుతో సంబంధం లేని కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు కొన్నాళ్ళు చేసాడు అతను. నేనేమిటి ఇలాంటి పన్లేమిటి అనుకున్న సందర్భాలెన్నో...! తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్లుగా ఇక్కడ జీవితం రామాన్ని మరో దారిలోకి తిసుకువెళ్ళింది.
(రెండవ భాగం పూర్తి...)


Thursday, October 21, 2010

"పుస్తకం.నెట్"లో మరపురాని మనీషి


ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి”. తిరుమల రామచంద్ర గారు రచించిన ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.






రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!


Oct 21, 11.30a.m
రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!

temple in khandavilli



పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం. అతి చిన్న పల్లేటూరు. ఊళ్ళో "శిష్ఠావారిల్లు" అంటే బోలెడు గౌరవం. వీధి నుంచి వీధి వరకూ వ్యాపించిన ప్రహారి గోడతో పెద్ద ఇల్లు. ఇంటి తాలుకు కధలో ప్రస్తుతానికి నేను రాయబోయేది "రామం" ఒక్కడి గురించే. శిష్ఠా పురుషోత్తంగారి నాలుగవ కుమారుడు "సత్యనారయణ". ఆయన ఏకైన కుమారుడు భాస్కర శ్రీరామ్మూర్తి. ఊళ్ళో అందరూ రావుడు అని పిలిచేవారు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం "రాంబాణం" అని పిలిచేది. మనవడు పాకుతూంటే మోకాళ్ళు గీసుకుపోతున్నాయని దొడ్దంతా గచ్చు చేయించిన వెర్రి అప్యాయత ఆమెది.


తెల్లటి తెలుపుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం రాముడిది. దురదృష్టశాత్తు మూడవ ఏటనే తండ్రిని పోగొట్టుకున్న అతనికి ఇంట్లో ఆదరించే అందరూ ఆడవాళ్ళే. నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఇద్దరక్కలు, మేనత్త. నాన్న,అన్న, తమ్ముడు, మావయ్యా.... ఇలా బంధాలూ లేవు. తెలియవు. తండ్రి ప్రేమ కానీ, మరో మగదిక్కు కాని లేని ఒంటరి పయనం అక్కడ నుంచే మొదలయ్యింది. తండ్రిని కోల్పోయిన మనవలనూ, లంకంత ఇంట్లో ఒంటరైన కుమార్తెకు తోడుగా ఉండటానికి రాముడి అమ్మమ్మ కూడా ఇంటికి వచ్చి, ఇంటివారి అనుమతితో గదిలో తన వంట తాను వండుకుంటూ అక్కడే ఉండిపోయారు. అమ్మమ్మకూ రాముడికీ ఎంతో అనుబంధం. నిత్యం పాతిక మందికి పైగా ఉండే ఇంట్లోని మనుషులకు వండి పెట్టే అమ్మ ఇంటి పనులతో, అత్తమామల సేవతో సతమతమౌతూ ఉంటే, రావుడికి అమ్మమ్మ బాగా చేరువైపోయింది. ఆవిడకు మనవడే లోకం. అలా తండ్రి లేని లోటు తప్పించి, ఇంట్లోని ఆడవారందరి చేతుల్లో గారంగా, అపురూపంగా గడిచిందతని బాల్యం.

తండ్రి కొని ఉంచిన గ్రామఫోన్ రావుడి ముఖ్య వినోద సాధనం. తణుకు వెళ్ళి ఆయన కొని తెచ్చుకున్న కర్ణాటక సంగీత గ్రామఫోన్ రికార్డులు, డ్రామా సెట్లు, హాస్య గీతాలు రావుడి మొదటి సంపద. తెలిసీ తెలియని జ్ఞానంతో మళ్ళీ మళ్ళీ అవన్నీ ప్లే చేసి వినేవాడు అతను. సంగీతం పట్ల ఆతని ఆసక్తి అక్కడ మొదలైంది. హై స్కూల్లో చేరాకా సైన్స్ పాఠాలు బాగా వంటబట్టాయి అతనికి. మధ్యాహ్నం అందరూ నిద్దరోతూంటే పాత సామాను పడేసిన తడికల గాదె లో దూరి, పాత సామానుతో సైన్స్ ఎక్స్పరిమెంట్లన్నీ చేసేవాడు. ఎండలో అద్దం పెట్టి, చిన్న్ చిన్న ఫిల్మ్ ముక్కలు ఆధారంగా గోడ మీద మూగ సినిమా సొంతంగా వేసేవాడు. అమ్మ నిద్రపోతుంటే మూగ సినిమా, మెళుకువగా ఉంటే గ్రామఫోన్ కూడా జోడించి నిజం సినిమా వేయటం.



ఊళ్ళోకి సినిమా వస్తే, సినిమా ప్రదర్శన గురించి మైకులో చెప్తూ జీప్ తిరిగేది. దాని వెనుక మిగతా పిల్లలతో పాటూ తానూ పరిగెత్తుతూ వెళ్ళేవాడు రావుడు. సినిమాల మీద కూడా అప్పుడే సరదా మొదలైంది. రావుడు ఎస్.ఎస్.ఎల్.సిలోకి వచ్చేదాకా కిర్సనాయిలు దీపాలే చదువుకి ఆధారం.

అప్పటిదాకా ఎవరింట్లోనూ రేడియో లేని ఊళ్ళో, రాముడు హైస్కూలుకు వచ్చే నాటికి వాళ్ల ఎదురిల్లైన మునుసబుగారి ఇంట్లో బ్యాటరీ రేడియో వెలిసింది. ప్రొద్దుటి పూట వాళ్ళ ఇంట్లోంచి రేడియో సిలోన్, తరువాత పురానే ఫిల్మోంకా లోక్ ప్రియ్ సంగీత్, శ్రోతల ఫర్మాయిషీ ఫిలిం గీతాలు వినిపిస్తుంటే గోడ పక్క నించుని అబ్బురంగా వింటూండేవాడు రావుడు. అదే రేడియోతో అతని మొదటి పరిచయం. మరో ఇరవైఏళ్ల తరువాత అదే జీవితంగా మారుతుందని అప్పుడతనికి తెలియదు. హైస్కూల్ చదువయ్యాకా కాలేజీ కోసం నెల్లూరు వెళ్లాడు అతను.


1961లో డిగ్రీ పూర్తయ్యేవరకూ నెల్లూరే అతడి వాసం. అతడికి తోడుగా వండిబెట్టడానికి అమ్మమ్మ తోడు వచ్చింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే బుధ్ధుడికి బోధి వృక్షం లాగ రాముడికి నెల్లూరు విజ్ఞాన కేంద్రం అయ్యింది. అతని మనోవికాశానికి నాంది నెల్లూరే. సినిమాలు, పుస్తకాలు, పత్రికలు, స్నేహితులు అన్నీ అక్కడే పరిచయం. కమ్ సెప్టెంబర్, బేబీ ఎలిఫెంట్ వాక్, లవ్ ఈజ్ బ్లూ వంటి వెస్ట్రన్ మ్యూజిక్ రికార్డ్లు వినటం, కొనటం అక్కడే మొదలైంది.సొంతంగా బొమ్మలు వెయ్యటం, బుల్బుల్, షాహిబాజా, మౌత్ ఆర్గాన్, మాన్డొలీన్ మొదలైన సంగీత వాయిద్యాలను సొంతంగా నేర్చుకున్నదీ ఇక్కడే. తను బుల్బుల్ వాయించుకోవటానికి అప్పుడప్పుడు వాయిద్యాన్ని అరువుగా ఇచ్చే లాయరుగారు, అతను బాగా వాయించడం చూసి ఇన్స్ట్రుమెంట్ నువ్వే ఉంచేసుకో అని బహుమతిగా ఇచ్చేసారు.నలభై ఐదు సంవత్సరాల వయసున్న బుల్బుల్ ఇప్పటికీ భాస్కర్ దగ్గర ఉంది. ఇంకా వాయిస్తూనే ఉంటాడు.




అందుకే ఊరంటే అతనికి ఎంతో ప్రేమ, మమకారం. వాళ్ళ వి.ఆర్.కాలేజీ ఎదురుగా ఉండే లీలామహల్లో వచ్చిన ప్రతి సినిమా విడువకుండా చూసేవాడు. ఇంగ్లీషు సినిమాల పరిచయమూ అక్కడే. ఖండవిల్లి రాముడు కాస్తా స్నేహితుల పిలుపుతో "భాస్కర్"గా మారాడిక్కడ. నెల్లూరులో ఉండగానే మద్రాసులో ఒక సినీ స్టూడియోలో పనిచేసే బంధువు ద్వారా తరచూ సినిమా షూటింగులు చూస్తూ ఉండేవాడు. సినిమా అతని మీద బలమైన ముద్ర వేసింది. ఎలాగైనా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి, మంచి టెక్నీషియన్ అయిపోవాలని ఉవ్విళ్ళూరేవాడు భాస్కర్.


(మొదటి భాగం పూర్తి..)