సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 31, 2010

సాక్షి ఆదివారం(28-3-10) పుస్తకం...

మా ఇంట్లో రోజూ వచ్చే దినపత్రికలు ఆంధ్ర జ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా,ఎకోనోమిక్ టైమ్స్. సాక్షి వచ్చిన కొత్తల్లో నా పోరు పడలేక కొన్నాళ్ళు "సాక్షి" తెప్పించినా తిరిగి ఆంధ్రజ్యోతి కే మారిపోయారు. కనీసం ఆదివారం సాక్షి పుస్తకం కొని తెండి అంటే మావారు ఎప్పుడు "మర్చిపోతారు" పాపం ... అలాంటిది మొన్న ఆదివారం అనుకోకుండా నామాట గుర్తుండి ఆదివారం "సాక్షి" కొనితెచ్చారు.

అదృష్టవశాత్తు అది వాళ్ళ రెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక అవటంతో కొన్ని మంచి సంగతులు దానిలో ఉన్నాయి. కూడలి నేను రేగులర్గా చూడటం లేదు కాబట్టి ఎవరన్నా దీనిని గురించి రాసేసారేమో తెలియదు. తెలియనివాళ్ళు ఉంటే చదువుతారని ఈ టపాలో రాస్తున్నాను...

28వ తారీకు ఆదివారం ఈ-పేపర్ లింక్ ఇక్కడ చూడచ్చు.
ఇంతకీ అందులో ఉన్న తాయిలం ఏమిటంటే ....


"తప్పక చూడాల్సిన 100 సినిమాలు"

"తప్పక చదవాల్సిన 100 తెలుగు పుస్తకాలు"


"తప్పక వినాల్సిన 100 తెలుగు పాటలు"

జాబితాలోని సినిమాలు ఒక పది తప్ప మిగిలినవన్నీ చూసినవే,పాటలు దాదాపు అన్ని విన్నవే. చాలామటుకు నాదగ్గర ఉన్నవే. కానీ పుస్తకాలు మాత్రం పది పదిహేను మించి చదివినవి లేవు...మిగిలినవన్నీ చదవాల్సినవే..!!


ఆలస్యమెందుకు...ఇప్పటిదాకా ఈ ఆదివారం పుస్తకం చదవనివాళ్ళు ఉంటే తప్పక చదివి ఆనందించేయండి మరి ...

Tuesday, March 23, 2010

శ్రీరామనవమి జ్ఞాపకాలు...


"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."


నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.

శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.

మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...

ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!

మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...

శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..

బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

" మృత్యోర్మా అమృతంగమయ -- ౩ "

మొదటిభాగం
రెండవ భాగం తరువాయి....

కిషోర్ హాస్పటల్కు వెళ్తుంటే వైజాగ్ లో ఉన్న కూతురు శైలజ దగ్గరకు వెళ్తానని టికెట్లు రిజర్వ్ చేయించమని అడుగుతుంది కాంతిమతి. పదిరోజులకన్నా ఎక్కువ అయితే తను ఉండలేనని త్వరగా వచ్చేయమని చెబుతాడు కిషోర్. శైలు ఇంటికి వెళ్తుంది కాంతిమతి. అల్లుడిది మంచి ఉద్యోగం. ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కాపురం శైలుది. ఓ వారం గడిచాకా ఒకరోజు పక్కింట్లో జరిగిన ఒక సంఘటన కాంతిమతిని బాగా కదిలించివేస్తుంది. కొడుకు,కోడలు నిర్లక్యం వాళ్ళ అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన పక్కింటి సుబ్బరాయమ్మ గారి కధ ఆవిడ మనసును కలచివేస్తుంది. ప్రాణసమానంగా పెంచుకున్న కొడుకు పెళ్ళవగానే మారిపోయి కన్నతల్లి మరణానికి కారణం కాగలడన్న సంగతి ఆమె జీర్ణిమ్చుకోలేకపోతుంది. ఆ తరువాత శైలు స్నేహితురాలు, తన ఒకప్పటి స్టూడెంట్ అయిన నీరజను కలుస్తుంది. నీరజ అత్తగారు ఆమెను పెడుతున్న ఇబ్బందుల సంగతి తెలుసుకుని బాధపడుతుంది.

ఒకరోజు తన పీ.ఎఫ్. గురించి ఆరా తీసి వాటితో తనకు ఫ్రిజ్ కొనిపెట్టమని , రెండు జతల గాజులు చేయించమని అడిగిన శైలును చూసి ఆశ్చర్యపోతుంది కాంతిమతి. భర్తకు మంచి ఉద్యోగం ఉండీ, తనది పెన్షన్ లేని ఉద్యోగం అని తెలిసీ వచ్చే కొద్దిపాటి డబ్బుని పంచమన్నట్లు అడుగుతున్నా కూతురికి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాదు ఆమెకు. "ప్రపంచంలో ఇటు చేసి కాని, అటు పెట్టి కాని ఎవ్వరినీ తృప్తి పరచలేము" అనుకుంటుంది మనసులో. వెళ్ళే ముందు తన మెడలోని గొలుసును శైలుకు ఇచ్చి, శైలు దగ్గర నుంచి మద్రాసులో ఉన్న పెద్దకొడుకు కృష్ణముర్తి దగ్గరకు బయల్దేరుతుంది కాంతిమతి.ఆమె రాకకు చాలా ఆనందిస్తాడు పెద్ద కొడుకు. అయితే ఆడపడుచు కూతురైన పెద్దకోడలు జానకి ఎత్తిపొడుపు మాటలు మాత్రం ఆమెకు చివుక్కుమనిపిస్తాయి. మాట్లాడకుండా కాళ్ళకు చుట్టుకున్న మనుమలిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది కాంతిమతి.

మద్రాసులోనే ఉంటున్న తన స్నేహితురాలు రేవతి కుమార్తె ఉమను కలుస్తుంది. పెద్దింటి సంబంధం , ఎంతో అదృష్టవంతురాలు అనుకున్న ఉమ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంది ఆమె. ముక్కు మొహం తెలియకపోయినా తనను ఎంతో ఆదరించిన ఉమ అత్తగారు, కోడలిని కొడుకుతో సరిగ్గా మాట్లాడనివ్వదని, వాళ్ళను అన్యోన్యంగా ఉండనివ్వదని తెలుసుకుని ఎంతో బాధ పడుతుంది. ఉమ ఇల్లు వెతుక్కుని వెళ్లి దూరపు చుట్టంగా పరిచయం చేసుకుని కాసేపు ఉండి వస్తుంది కాంతిమతి. ముక్కు మొహం తెలీని తననే ఆదరంగా చూసిన ఉమ అత్తగారు కోడలితో ప్రవర్తించే విధానం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. ఉన్న కాసేపులో కొడుకంటే ఉమ అత్తగారికి ఎంత ప్రాణమో తెలుసుకుంటుంది. తిరిగి వచ్చే దారిలో ఎన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి.

"కొడుకును అపురుపంగా చూసుకునే తల్లి కోడలిని కూడా ఎందుకు సమానంగా చూడదు? వారిద్దరూ అన్యోన్యంగా ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న అభద్రతా? పవిత్రమైన తల్లి ప్రేమ కొడుకు వైవాహిక జీవితానికి అడ్దంకు అవుతుందా? సృష్టిలోకెల్లా తీయనైన తల్లిప్రేమ ఇంత సంకుచితంగా, స్వార్ధపూరితంగా ఉంటుందా?...." మొదలైన అనేకరకాల ఆలోచనలతో ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టదు. నిద్రపట్టక దర్లుతున్న ఆమెకు పక్క గదిలోంచి పెద్దకోడలి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాంతిమతి పేరన ఉన్న ఇల్లును వాళ్ళ పేరన రాయించుకొమ్మని భర్తతో ఘర్షణ పడుతుంది జానకి. అందుకు ససేమిరా ఒప్పుకోడు కృష్ణమూర్తి. పాత రోజులు కళ్ళ ముందుకు వస్తాయి కాంతిమతికి.

"దానికి అన్యాయం జరిగిందర్రా. కోడలైనా కూతురిలా సేవ చెసింది. ఇంటి బాధ్యతలన్నీ తనపై వేసుకుని తీర్చింది .." అంటు ఆమె అత్తగారు ఆఖరి ఘడియల్లో సర్వహక్కులతో తన పేర్న ఉన్న ఇల్లును పట్టుబట్టి కాంతిమతి పేర్న రాయిస్తుంది. ఆగ్రహించిన మరుదులూ, ఆడపడుచూ అత్తగారు పోయాకా కార్యక్రమాలకు ఖర్చులన్నీ కాంతిమతే భారించాలని వాదిస్తారు. తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించి డబ్బు సర్దుతాడు అంత్యక్రియలకు వచ్చిన ఆమె భర్త గోపాలరావు. ఇల్లు తనకు వద్దనీ వాళ్ళందరికీ రాసేస్తానని అన్న కాంతిమతిని భర్త వారిస్తాడు. పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇల్లును ఎవరిపేరనా రాయొద్దనీ, ఆ ఊరునూ ఇంటినీ వదిలి వెళ్ళొద్దని మాట తీసుకుంటాడు గోపాలరావు.


బాధామయ గతాన్ని తలుచుకుంతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది కాంతిమతి. కొద్ది రోజుల తరువాత వెళ్పోతూ వెళ్పోతూ తన మెడలోని మరొక పేట గొలుసును ఇచ్చినప్పుడు మాత్రం జానకి మొహం విప్పారుతుంది. తిరువణ్ణామలై కు టికెట్ కొనుక్కున్న తల్లిని చూసి ఆశ్చర్యపోతాడు స్టేషన్ కు వచ్చిన కృష్ణమూర్తి. బాధ్యతలు తీరాయి కద్దా కొన్నాళ్ళు ప్రసాంత వాతావరణంలో గడపాలనుందని చెబుతుందామె. అరుణాచెలం,పుదుచ్చేరి తిరిగి నెల తరువాత ఇల్లు చేరుతుంది కాంతిమతి.

(ఇంకా ఉంది..)

Sunday, March 21, 2010

గాయం..



హృదయం ముక్కలవుతుంది
దెబ్బతిన్న ప్రతిసారీ..

మౌనం వెక్కిరిస్తుంది
మాటలు కరువైన ప్రతిసారీ..

మనసు విలవిలలాడుతుంది
అభిమానం అవమానింపబడిన ప్రతిసారీ..

గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..

కన్నులు మసకబారతాయి
ఆరని మంటలు ప్రజ్వలించిన ప్రతిసారీ..

ఆత్మ ఆక్రోశిస్తుంది
చేయని తప్పుకు శిక్ష పడిన ప్రతిసారీ..

ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ..


ఒక అపార్ధం నుంచి వచ్చిన నిరసన, నిర్లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనలోంచి వచ్చిన వాక్యాలు ఇవి...అవుట్లెట్ కోసం రాసినవి మాత్రమే! ఎందుకంటే మనిషికి కలిగే బాధ స్వయంకృతం. అది మనం ఎదుటి వ్యక్తికీ ఇచ్చే విలువను,ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఈ ఇహలోకపు భ్రమల్లో సంచరిస్తూ ఉన్నంతకాలం మనకు మనం విధించుకునే సంకెళ్ళు ఈ భావోద్వేగాలు...వీటిని అధిగమించటానికి భగవదనుగ్రహం కావాలి...అంతవరకు తప్పవు ఈ గాయాలు..

*******************************************

నేను పరిచయం చేస్తున్న సీరియల్ చదువుతున్న ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వారికి ఈ గమనిక...

నిన్న కష్టపడి ఒక గంట కూర్చుని మూడవ భాగం రాసాను..కానీ రాస్తున్నది ఆన్లైన్లో అవటం వల్ల చివరి క్షణంలో కరెంట్ పోయి మొత్తం డిలిట్ అయిపోయింది. నా సిస్టం పాడయిపోవటం వల్ల కలుగుతున్న తిప్పలు... చదివేవారు కొందరైనా మొదలెట్టినది పూర్తి చేయాలి కదా..మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాకా, ఈ బ్లాగ్లో టపాలు తాత్కాలికంగా ఆగిపోయేలోపు తప్పక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.

--తృష్ణ.

Tuesday, March 16, 2010

అందరికీ శుభాకాంక్షలు...



ఉగాది అంటే మన నూతన సంవత్సరం...
ఈ రోజున ప్రతి తెలుగు ఇంటా వెల్లివిరుస్తుంది ఉత్సాహం...
ఆ ఉత్సాహం కావాలి నవోదయానికి స్వాగతం...
అది తేవాలి ప్రతి మనసుకూ చిరునవ్వుల శుభోదయం...!!


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

Friday, March 12, 2010

"మౌన గీతం " నుంచి నాలుగు పాటలు ...

ఇష్టమైన పాటల గురించి రాసి చాలా రోజులైంది అని ఆలోచిస్తుంటే 1981 లో జే.మహేంద్రన్ దర్శకత్వం వహించిన "మౌన గీతం" సినిమాపాటలు గుర్తు వచ్చాయి. సుహాసిని నటించిన మొదటి సినిమా ఇది. హీరోయిన్ గా బుక్ చేసుకున్న పద్మిని కొల్హాపురి రాకపోతే ఆఖరు నిమిషంలో సినిమాకు అసిస్టెంట్ కెమేరా ఉమన్ గా పనిచేస్తున్న సుహాసిని ని హీరోయిన్ గా తీసుకోవటం జరిగిందని చెబుతారు. ప్రతాప్ పోతన్,మోహన్,సుహాసిని ప్రధాన తారాగణం. సినిమాలో నాలుగు పాటలు చాలా ఆదరణ పొందినవే. ఇళయరాజా మార్కుతో ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు అవి. తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన ఈ తమిళ్ సినిమా (" Nenjathai Killathey ") కూడా మంచి సినిమాల కేటగిరిలోకి వస్తుంది. 1986 లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'మౌన రాగం' చిత్ర కధ ఈ సినిమా కధకు కాస్త దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నేను రాస్తున్న నాలుగు పాటలు "ఆచార్య ఆత్రేయ"గారు రచించారు. మార్నింగ్ వాక్ తో మొదలైయ్యే "పరువమా చిలిపి పరుగు తీయకు.. పరుగులో పంతాలు పోవకు.." బాలు, s.జానకి గళాల్లో జీవం పోసుకున్న ఒక గొప్ప రొమాంటిక్ సాంగ్ ఇది. రెండవ పాట "చెలిమిలో వలపు రాగం వలపులో మధురభావం" మూడవ పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. "నా రాగమే తోలి పాటై పాడెను.. ఆ పాటకు ఎద వీణై మ్రోగెనే మీటేదెవరోపాడేదెవరో.. తెలుసుకో నేనే..." ఇక నాలుగవది చాలా ప్రత్యేకమైన పాట. "పాపా పేరు మల్లి నా ఊరు కొత్త ఢిల్లీ అర్ధ్రరాత్రి నా కల్లోకి వచ్చిలేపి నా సంగీతం గొప్ప చూపమంది..." దీనిని ఎస్.జానకి గారు పాడారు అంటే ఎవరు నమ్మలేరు. ఒక తాగుబోతు గొంతును ఇమిటేట్ చేస్తూ ఆవిడ పాడిన విధానం "ఔరా" అనిపిస్తుంది. జానకిగారు పాడిన వైవిధ్యమైన పాటల జాబితాలో చేర్చుకోదగిన పాట ఇది.

Thursday, March 11, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 2"

మొదటి భాగం తరువాయి....

వృత్తిరీత్యా అదే ఊళ్ళో డాక్టరు ప్రకాశరావుగారు. పేరుకు కాంతిమతికి పెదతల్లి కొడుకైనా సొంత అన్నగారి కంటే అభిమానంగా ఉంటారు. కాంతిమతికి పెళ్ళి సంబంధం కుదిర్చింది మొదలు,ఆమెకు టీచర్ ఉద్యోగం, ట్రైనింగ్, పీ.జీ., అయ్యాకా లెక్చరర్ ఉద్యోగం ఇప్పించటం వరకూ ఆమెకు ఎంతో సహాయకంగా ఉంటూ వచ్చారు. కుటుంబంలో ఆర్ధిక సమస్యలున్న మంగ అనే పధ్ధెనిమిదేళ్ళ ఒక అమ్మాయికి ఆసరా చూపించవలసినదిగా కాంతిమతి అన్నగారిని కోరుతుంది.

ప్రకాశరావుగారి
ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు అమెరికాలో ఉండగా, మూడవ కొడుకు సురేష్ బాధ్యతలు విస్మరించి అల్లరిగా తిరగటం ఆయనకు ఉన్న ఏకైక చింత. చిన్న వయసులో కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయటం కోసం ఉద్యోగానికి సిధ్ధపడ్డ మంగను చూసి ముచ్చటపడతారు ఆయన. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించేవరకు తన మందుల షాపులోనే పనిలో పెట్టుకుంటానని మాట ఇస్తారు ప్రకాశరావుగారు. హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన చిన్న కొడుకు, కోడలుకూ అదే ఊళ్ళో డాక్టర్లుగా స్థిరపడటానికి కూడా ప్రకాశరావుగారి పలుకుబడే కారణం. కాంతిమతి దగ్గర ఉంటూ ఆమెను ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉంటారు అబ్బాయి కిషోర్,కోడలు మంజు.

* * * * * * * * *

రిటైరయిన మర్నాడు పొద్దున్న లేచేసరికీ వంట ప్రయత్నంలో ఉన్న కోడలును చూసి తనను లేపలేదేమని అడుగుతుంది కాంతిమతి. ఇన్నేళ్ళ తరువాత విశ్రాంతిగా పడుకున్న ఆవిడను లేపాలనిపించలేదంటుంది మంజు. ఆ రోజు శుక్రవారం ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుందామని అన్నీ అమర్చుకుని కూర్చుందామనుకునేసరికీ కొలీగ్ శారద "లెక్చర్ నోట్స్" తన హేండ్ బ్యాగ్లో ఉండిపోయిన సంగతి గుర్తు వస్తుంది ఆవిడకు. ఆ నోట్స్ ఇచ్చేసి వచ్చి పూజ చేసుకోవచ్చని, పక్కవీధిలోని శారద ఇంటికి బయల్దేరుతుంది ఆమె.

ఓరవాకిలిగా వేసిఉన్న తలుపు లోపల నుంచి పెద్దగా వినిపిస్తున్న మాటలు విని కాంతిమతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. శారదా వాళ్ళ పాపకు జ్వరంగా ఉండటం వల్ల,పనిపిల్ల మానివేసిన కారణంగాను ఆఫీసుకు శెలవు పెట్టుకునే విషయంలో ఘర్షణ పడుతున్న ఆ భార్యాభర్తల సంభాషణ వింటుంది ఆమె. తాను శెలవు పెట్టడం ససేమిరా వల్లకాదని, కావాలంటే ఉద్యోగం మానుకోమని ధుమధుమలాడుతూ కాంతిమతిని దాటుకుని బయటకు వెళ్పోతాడు శారద భర్త.

కాంతిమతి పలకరించగానే కన్నీళ్ళు పెట్టుకున్న శారద, ఇద్దరు సంపాదిస్తూంటేనే చాలని జీతాలతో ఉద్యోగాన్ని మానివేస్తే సంసారమేలా ఈదటం అని బాధ పడుతుంది. ప్రస్తుతం ఖాళీ కాబట్టి పనిపిల్ల దొరికేదాకా పాపను చూస్తానని హామీ ఇచ్చి, అవసరమైన వస్తువులు తీసుకుని శారదను కాలేజీకు పంపించి పాపతో ఇల్లు చేరుతుంది కాంతిమతి. సాయంత్రం పాపనెత్తుకుని సంతృప్తిగా వెళ్ళిపోతున్న శారదను చూసిన కాంతిమతికి ఉదయం పూజ పూజ చేసుకోలేదన్న విషయం పెద్దగా బాధించదు.

కానీ మంజు కూడా ఉద్యోగాస్తురాలు. రేపు పిల్లలు కలిగాకా వారు కూడా ఏ పనిపిల్ల చేతుల్లోనో పెరగటం, దాని వల్ల కొడుకు కోడలు కూడా ఇలాగే కిచులాడుకుంటారా అన్న సందేహం ఆమెకు కలుగుతుంది. రకరకాల ఆలోచనలతో కుదుటపడని ఆవిడ మనసుని భగవద్గీత పఠనం ప్రశాంత పరుస్తుంది.

ఆ తరువాత అనుకోకుండా శారద పక్కింట్లో ఉన్న మరో ఉద్యోగాస్తురాలు సీత బాబును కూడా చూసే బాధ్యతా తీసుకుంటుంది కాంతిమతి. పనిపిల్లల్ని పెట్టుకున్నాకా కూడా ఆ పిల్లలతో సహా పిల్లల్ని ఆవిడకే అప్పగించి వెళ్ళేవారు శారద, సీత. నెలరోజులు గడిచేసరికి పిల్లలు కాంతిమతికి బాగా చేరువయి, శ్రద్ధగా చూసుకోవటం వల్ల గుమ్మడిపళ్ళలా తయారవుతారు.

(
ఇంకా ఉంది ...)


Saturday, March 6, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 1"



మహిళా బ్లాగర్లందరికీ ముందుగానే ఉమెన్స్ డే శుభాకాంక్షలు.

రాబోతున్న "ఉమెన్స్ డే" సందర్భంగా మొన్నటి టపాలో ప్రస్తావించిన ఒక "
పాత పత్రిక--ఆంధ్రప్రభ" నుంచి ఒక నవలను పరిచయం చేయాలని సంకల్పం. ఇది 1975లో ఆంధ్రప్రభ పత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన శ్రీమతి ఏ.తేజోవతిగారి నవల "మృత్యోర్మా అమృతంగమయా". తేజోవతి గారి ఇతర రచనలు (నవలలు,కధలు) అంతకు ముందు కూడా ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యాయి. అవి పుస్తకరూపంలో ప్రచురితమయ్యాయా లేదా అనేది నాకు తెలియదు. కధల సంపుటి మాత్రం అచ్చయినట్లు రచయిత్రి ఒకచోట పేర్కొన్నారు.

ఎం.ఏ.ఇంగ్లీష్ లిటిరేచర్ చదివిన ఈ రచయిత్రి అప్పట్లో గుంటూరులోని పలు కళాసాలల్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసినట్లు కూడా తన పరిచయంలో తెలిపారు. రిటైర్ అయిన ఒక మహిళా లెక్చరర్ తన శేష జీవితాన్ని సమాజానికీ, ఉదోగస్థులైన ఇతర మహిళలకూ ఉపయోగపడేలా ఎలా మలుచుకున్నదీ ఈ నవల కధాంశం. ఒక ఆశ్రమానికి వెళ్ళి తన రిటర్డ్ లైఫ్ గడపాలనుకున్న ఆమె తన చూట్టూ జరిగిన కొన్ని సంఘటనలకు స్పందించి, తన చిరకాల కోరికను వదులుకుని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కధ.


రచయిత్రి రాసిన విధానం, తన చుట్టూ ఉన్న కొందరు మనుషుల ఇబ్బందులు, బాధలూ చూసి వారికి ఏదన్నా సాయం చేయాలని ప్రధాన పాత్రధారి పడే ఆరాటం, ఆమెకున్న సేవా దృక్పధం, ఎదుటి వ్యక్తిని ఆమె అర్ధం చేసుకునే తీరు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆమె కేరక్టరైజేషన్ చాలా బాగుంది. ముఖంగా రచయిత్రి నవలను మహిళా లోకానికి అంకితం ఇచ్చిన వాక్యాలు నాకెంతగానో నచ్చాయి.
"ఇటు గృహిణులుగానూ, అటు ఉద్యోగినులుగానూ అష్టావధానం చెయ్యలేక సతమతమవుతున్న మహిళాలోకానికి" అని రాసారు .

ఈ నవల బయట దొరకదేమో అనే ఉద్దేశంతో మొత్తం కధను రాయదలిచాను.మరి నవలా కధను నాకు చేతనైన విధంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను...

మృత్యోర్మా అమృతంగమయా:


ఉమెన్స్ కాలెజీ లెక్చరర్ గా "కాంతిమతి" ఉద్యోగ విరమణ సభతో కధ మొదలౌతుంది. అభిమానంతో,పూలమాలలతో విద్యార్ధినులు,సహోద్యోగినులూ సన్మానించి, భారమైన మనసులతో రిక్షా ఎక్కించి కాంతిమతి ని ఇంటికి పంపిస్తారు. కానీ ఉద్యోగ విరమణ బాధ కన్నా ఎన్నో సంవత్సరాల బంధనాల నుంచి విముక్తి లభించిందన్న ఆనందంతో ఆమె ఇంటికి చేరుతుంది. ఎస్.ఎస్.ఎల్.సి తరువాత వివాహమైన ఆమె మామగారి మరణం, భర్త చిరుద్యోగం, కుటుంబ బాధ్యతలు వల్ల స్కూలు తిచరుగా ఉద్యోగం ప్రారంభిస్తుంది. ఆ తరువాత పిల్లల పోషణ నిమిత్తం పై చదువులు చదివి లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకోగలుగుతుంది . చిన్ననాటి నంచీ తనకు ఇష్టమైన పూజా పునస్కారాలూ, హరికధా కాలక్షేపాలు మొదలైనవాటికి సమయం కేటాయించుకోలేని బాధ ఆమెలో మిగిలిపోతుంది.


ఇప్పుడిక సమయ పరిమితి,నిబంధనలు లేకుండా తన ఇష్టాన్ని కొనసాగించవచ్చని ఎంతో ఆనందిస్తుందామె. తన చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయిందని, దానిని తీర్చుకోవటానికి అడ్డు చెప్పవద్దని తన వద్ద ఉంటున్న చిన్న కొడుకుని కోరుతుంది కాంతిమతి .
(ఇంకా ఉంది..)

Tuesday, March 2, 2010

పాత పత్రికలూ...మధుర స్మృతులు!

నేను ఊహ తెలిసేసరికీ ఇద్దరు తాతయ్యలనీ ఎరుగను. అందువల్ల నా పాపకు పెద్దల ముద్దుమురిపాలు వీలయినంత అందించాలనేది నా ఆశయం. మా మామగారు కూడా రెండేళ్ళ క్రితం కాలం చేయటంతో మా ఇంట్ళో దాని కాలక్షేపం ఒక్క "నానమ్మ"తోనే. పాపకు అమ్మమ్మ,తాతయ్యల ప్రేమను కూడా అందించాలనే కోరికతో ఈ ఊరు వచ్చినప్పటి నుంచీ స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా, వారం పదిరోజులకోసారైనా, ఓపిక ఉన్నా లేకపోయినా పాపను అమ్మావాళ్ళింటికి తీసుకువెళ్తూ ఉంటాను. కానీ ఈసారి దాదాపు నెల తరువాత ఇంటికి వచ్చాను. ఈసారి ఇంట్లోని పాత పుస్తకాలన్నీ ఓసారి చూడాలనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చదవటం అయిపోనన్ని పుస్తకాలు, వినటం అయిపోనన్ని కేసెట్లు మా ఇంట్లో. నా బాల్యం, సగం జీవితం ఈ పుస్తకాల మధ్యన, కేసెట్ల మధ్యనే గడిచిపోయింది. వాట్ని చూస్తే నా ప్రాణం లేచి వచ్చినట్లు, మళ్ళీ నాలో కొత్త జీవం ప్రవేశించినంత ఆనందం కలుగుతుంది. పాత పుస్తకాలంటే కధలూ,నవలలు...ఇతర పుస్తకాలూ కాదు. పాత పత్రికల తాలుకూ బైండింగ్స్.

మా చిన్నప్పుడు ఇంట్లో చాలా పత్రికలు తెప్పించేవారు. పూర్తి సినిమా కబుర్లతో ఉండే "విజయచిత్ర", "వనిత", "ఆంధ్ర సచిత్ర వార పత్రిక", "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ", "రీడర్స్ డైజస్ట్", 'స్పేన్"...అప్పుడప్పుడు సితార మొదలైన పొడుగాటి సినీ పత్రికలు...ఇలా రకరకాల పత్రికలు ఇంట్లో ఉండేవి. మా పిల్లల కోసం "ట్వింకిల్","బాలజ్యోతి", బాలమిత్ర", "చందమామ","అమర చిత్ర కధలు" మొదలైనవి కూడా తెచ్చేవారు నాన్న. నాకు తెలుగు చదవటం బాగా వచ్చాకా అప్పట్లో పావలాకు అద్దెకు ఇచ్చే "పగడాల పడవ","రాకాసి లోయ" లాంటి చిన్న కధల బుల్లి పుస్తకాలూ, మిగతా పిల్లల పుస్తకాలతో పాటూ అవీ ఇవీ అని లేకుండా నవలలూ,పత్రికలు కూడా చదివేస్తున్నానని అమ్మ నన్ను కంట్రోల్ చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ అమ్మ మధ్యాహ్నం నిద్రోయినప్పుడూ, శెలవు దినాల్లోనూ అమ్మకు కనబడకుండా నా చదువు కొనసాగుతూ ఉండేది.


మా అప్పటి ఇంట్లో ఒక చిన్న గదిలో బాగా ఎత్తుమీద ఒక కిటికీ ఉండేది. దానికో బుల్లి అరుగు కూడా ఉండేది. అందులోకి ఎక్కి ఎవరికీ కనపడకుండా పత్రికలన్నీ చదివేస్తూ ఉండేదాన్ని. అది కనిపెట్టిన అమ్మ నా క్షేమాన్ని కాంక్షించి అసలు వార పత్రికలు కొనటమే మానేసింది. కానీ అప్పటిదాకా తెప్పించిన పత్రికల్లోని మంచి కధలనూ, సీరియల్స్ నూ, ఇతర విషయాలనూ కొన్నింటిని కట్టింగ్స్ చేసి జాగ్రత్తగా బైండింగ్ చేయించి దాచింది. పిల్లల పుస్తకాలన్నీ కూడా భద్రంగా దాచి బైండింగ్స్ చేయించింది అమ్మ. అవన్ని నా టెంత్ క్లాస్ అయ్యాకా శెలవుల్లో,నేను కాలేజీలోకి వచ్చాకా చదవనిచ్చేది. అప్పుడు మొదలు సమయం దొరికినప్పుడల్లా ఆ బైండింగ్స్ ను ఎన్నిసార్లు చదివానో...

ఇంతకీ ఆ బైండింగ్స్ లో ఏమున్నాయంటే పురాణం సీతగారి "ఇల్లాలి ముచ్చట్లు" , మాలతీ చందూర్ గారి "ప్రమదావనం" తాలూకూ కట్టింగ్స్ ఒక బైండ్; "వనిత"లోని కధలు, సీరియల్స్ ఒక బైండ్, "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లోని కొన్ని సీరియల్స్ ఒక బైండ్, "విజయచిత్ర" పత్రికల్లోని కట్టింగ్స్ సంవత్సరం వారీగా ఒక పదేళ్ళపైగా ఉన్న కొన్ని బైండ్స్, "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ"లో ప్రచురించిన మంచి మంచి ఫొటొగ్రాఫ్స్ తో
ఒక బుక్కు, అన్నిరకాల పత్రికల్లోంచీ సేకరించిన కొన్ని మంచి కధలతో ఒక బైండ్, ఇవికాక మేం పిల్లలం ఇప్పటికీ నాకంటే నాకని దెబ్బలాడుకునే "చందమామా" "బాలజ్యోతి" "ట్వింకిల్" "అమర చిత్ర కధలు" మొదలైనవాటి బైండింగ్స్...ఇంక్లా పైంటింగ్స్, వంటా-వార్పూ, సలహాలు,సూచనలు....ఇలా రాసుకుపోతే రెండు టపాలకు సరిపోయేన్ని నిధి నిక్షేపాలను మా అమ్మ పదిలపరిచింది.

ఇవాళ పొద్దున్నే వాటిని తిరగేసి , చదవటానికి కొన్నింటిని తీసుకున్నా. ఇవన్నీ నేను ఇదివరలో చాలా సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉంటాయి. అంత మంచి కధలూ, విశేషాలూ అవన్నీ. ఇన్నాళ్ళ తరువాత వాటిని చూసాకా వాటి గురించి బ్లాగులో రాయాలని మనసైంది....ఈ టపా తయారైంది..!!

Friday, February 26, 2010

ఎవరు నువ్వని?


కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న
అమాయకత్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
గారాల పాపాయిని అంది.

పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న
రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.

కళ్ళనిండా కాటుకతో
కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
విరబుసిన మందారాన్ని...కన్నెపిల్లని అంది.

చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే
ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.

అధికారంతో ఆ చేతులకు
రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.

సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ
వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.

పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న
సిగ్గులమొగ్గను అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.

మెడలో మెరిసే మాంగల్యంతో
తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.

వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో
తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.

విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ
కలహాలను దాటుకుని
పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా..
కలకాలం అతని వెంట
జంటగా నిలిచే భార్యను అంది.

నెలలు నిండుతున్న భారంతో
చంకలో మరో పాపతో సతమతమౌతున్న
సంఘర్షణ నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.

అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ
పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
నా చిన్నారులకు మొదటి గురువుని అంది.

ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

Saturday, February 20, 2010

రాగ సుధారస



వాగ్గేయకారులలో నాకెంతో ఇష్టమైన "త్యాగయ్య" కృతులను కొన్నింటినైనా బ్లాగ్లో రాయాలని సంకల్పం. జనవరి నెలలో ఒకటి రాసాను. ఇది నాకు నచ్చిన మరొక కీర్తన...
బాలమురళిగారు పాడిన ఈ కీర్తన ఇక్కడ వినవచ్చు:




త్యాగరాయ కృతి
రాగం: ఆందోళిక
తాళం: ఆది

ప: రాగ సుధారస పానము చేసి - రంజిల్లవే ఓ మనసా (ప)
అ.ప : యాగ యోగ త్యాగ - భోగఫల మొసంగే (ప)

చ: సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తు - లని త్యాగరాజు తెలియు (ప)

నా కర్ధమైన అర్ధము:

ఓ మనసా! రాగమనెడి అమృతమును సేవించి రంజిల్లుము. ఇది యాగము, యోగము, త్యాగము, భోగము మొదలైన భోగముల ఫలములను అందిస్తుంది. నాదము సదాశివమయమైనది.ఓంకారూపమందు నిలిచిన ఆ నాదమే రాగమైయింది. ఈ సత్యానెరిగినవారంతా జీవన్ముక్తులు అన్నది త్యాగరాజు తెలుసుకున్న సత్యం.

Monday, February 15, 2010

పుత్రికోత్సాహం...


"పుత్రోత్సాహం" లాగ పుత్రికోత్సాహం నాలో పొంగి పొరలింది మొన్నటి రోజున...ఎందుకంటారా? వాళ్ళ స్కూలు ఏన్యువల్ డే సందర్భంగా జరిగిన ఫంక్షన్లో మా ఐదేళ్ల పాప మొదటిసారి స్టేజి ఎక్కి "వెల్కం డాన్స్" చేసింది. భయపడకుండా, ధైర్యంగా, నవ్వుతూ, కాంఫిడెంట్గా..! నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...బహుశా వాటినే పెద్దలు ఆనందభాష్పాలు అంటారేమో..
ఆ రోజు పాప పుట్టినరోజు కూడా అవ్వటం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. సమయానికి మావాళ్ళెవరూ ఊళ్ళో లేకపోయారు. అమ్మ,తమ్ముడు మాత్రం రాగలిగారు.

కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. కానీ మా పాపకు మొదట్లో పుట్టిన ఐదు నెలల్లో రెండు ఆపరేషన్లు జరగటం...ఆరునెలలుదాకా నిద్రాహారాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మనుషుల్లో పడిన పిల్ల అవటంవల్ల మాకు అందరికీ అదెంతో అపురూపం. అలా కళ్ళలో పెట్టుకు పెంచినపిల్ల ఇవాళ స్టేజి మీద డాన్స్ చేస్తూంటే మరి ఆనందమేగా. నాలోని నెగెటివె పోయింట్స్ రాకుండా అన్నీ మంచి గుణాలను అది పుణికిపుచ్చుకోవటం అదృష్టమే అనుకుంటాను. భగవంతుని దయ వల్ల పాప మంచి చదువు చదివి తన కాళ్ళపై తాను నిలబడాలని నా ఆకాంక్ష.

ఇదంతా బాగుంది కానీ తెర వెనుక కధ కూడా రాయాలని...

డాన్సు ప్రాక్టిసు కోసం నెల రోజులనుంచీ స్కూలువాళ్ళు పిల్లలను తెగ తోమేసారు. హోం వర్క్ లేదు చదువు లెదు. డాన్సులే డాన్సులు. పిల్ల ఇంటికి వచ్చి కాళ్ళు నెప్పులని గొడవ. ప్రొగ్రాం రోజున మూడింటికి పిల్లలను పంపమంటే పంపాము. నాలుగున్నరకు కార్యక్రమం మొదలౌతుందంతె నాలుగింటికే వెళ్ళి కూర్చున్నాము. స్టేజి తయారి దగ్గర నుంచీ కుర్చీలు వేయటం దాకా అంతా చూస్తూ దోమల చేత కుట్టించుకుంటూ కూర్చుంటే....ఏడున్నరకు మొదలెట్టారు. గెస్ట్ లందరి స్పీచ్లు అయ్యి కల్చురల్ ప్రోగ్రాంస్ మొదలయ్యే సరికీ ఎనిమిది దాటింది.

అదృష్టవశాత్తూ మా పాపది వెల్కం డాన్స్ అవటం వల్ల ముందు అది అయిపోయింది. కాని మొత్తం అయ్యేదాకా పిల్లలను పంపము అన్నారు. వంట్లో బాలేదు అంత సేపు కూర్చోలేను మొర్రో అని మొత్తుకున్నా వినరే...! మొత్తానికి ఎలాగో బ్రతిమిలాది నీరసంతో ఇంటికీ రాత్రి వచ్చేసరికీ పది అయ్యింది.


పుత్రికోత్సాహం సంగతి ఎలా ఉన్నా ఇంకెప్పుడు ఇలా డాన్సులకు పంపకూడదు అని నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి.కానీ తరువాత పాప ఇష్టపడి చెస్తాను అంటే చేసేదేముండదని తెలుసు..:) ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేము కదా. కాకపోతే ముందుగానే పర్మిషన్లూ అవి తీసుకుని ఉంచుకోవాలి అనుకున్నాము.

చలిలో పిల్లలను స్టేజీ పక్కన కూర్చోపెట్టారు.పిల్లలకు చలి+ దోమలు కుట్టేసి దద్దుర్లు. 4,5 గంటలు ఆకలితో ఉన్నారని మనకు బాధ తప్ప వాళ్ళకు ఆ ఉత్సాహంలో ఆకలే తెలియలేదు...:)

Friday, February 5, 2010

ఏది శాశ్వతం?

ఏది శాశ్వతం..?జీవితంలోని ఏది ఏది శాశ్వతం కాదని తెలిసినా...ఈ ప్రశ్నను ఇప్పటికి గత రెండు రోజుల్లో వేయి సార్లు వేసుకుని ఉంటాను..! కాస్త విశ్రాంతిగా ఉంటుందని అమ్మావాళ్ళింటికి వచ్చాను. అందుకే మనసునాపుకోలేక అమ్మ ఆ మాయ కంప్యూటర్ జోలికి వెళ్లకని వారిస్తున్నా...ఇలా వెంఠనే తపా రాయగలుగుతున్నాను...

నేను రాయబోయేది కధ కాదు...ఒక జరిగిన యదార్ధం...అది వింటూంటే అసలు దేముడు అంత నిర్దయంగా అయిపోయాడే అనిపిస్తుంది...మనసు వికలమౌతుంది...నేను ఈ సంగతి రాసేది ఎవరి మనసునీ భారం చెయ్యాలని కాదు. కానీ, జీవితంలో ఏదీ మన చేతుల్లో ఉండదు...మనం కేవలం నిమిత్తమాత్రులమే అని మనకు తెలియచెప్పటానికి నాకు ఎదురైన ఒక ఉదాహరణను తెలుపాలని ఇది రాస్తున్నాను..

ఒక అందమైన కుటుంబం. మావారి సమీప బంధువులు. భార్య,భర్త,అమ్మాయి,అబ్బయి. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ చదువుతున్న ఆ ఇరవై ఏళ్ళ అబ్బాయి హటాత్తుగా అలవిగాని అనారోగ్యం వచ్చి ఒక సంవత్సరం నానా యాతనా అనుభవించి ప్రాణాలు వదిలాడు. ప్రానం నిలవదని తెలిసినా లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించారు తల్లిదండ్రులు...అయినా ఫలితం దక్కలేదు.ఆ తల్లి బాధ వర్ణనాతీతం...మళ్ళీ రెందేళ్ళ తరువాత ఆమధ్యన ఆ తల్లిని చూసి నేను గుర్తుపట్తలెకపోయాను. అంతగా పాడయిపోయారు ఆవిడ .ఎంతో అందమైన రూపం ... అసలు గుర్తుపట్టలేనంతగా పాడయిపోయారు. మనోవ్యధకు మందు లేదంటే ఏమిటో ఆవిడను చూస్తే అర్ధమైంది..!

ఇక ఉద్యొగలరీత్యా భార్య ఒక చోటా,భర్త ఒక చోట,చదువు రీత్యా అమ్మాయి ఒక చోటా మూడు ఊర్లలో కాలం గడుపుతున్నారిన్నాళ్ళూ. పది రోజుల క్రితం కూడా మాతొ ఫొన్లో మాట్లాడారు ఆయన. ఎంతో మంచి మనిషి. బీ.పీ,సుగర్ ఎమీ లేవు.కొద్దిపాటి ఆస్థ్మా ఉంది. కొద్దిగా బాలేదని భార్య ఉన్న ఊరు స్వయంగా బస్సెక్కి వెళ్ళారు.

హటాత్తుగా ఫోను వారం క్రితం...ఆయన ఐ.సి.యూ లో ఉన్నారని. నాకు వెంథనే ఆవిడ ఎలా ఉన్నారో అనిపించింది. నాలుగు రోజుల క్రితం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారన్నారు...మావారు,బంధువులు వెళ్ళారు. నిన్న పొద్దున్నే తుది శ్వాస విడిచారని మావారు ఎస్.ఎం.ఎస్ వచ్చింది...
నాకసలు ఏం తోచలేదు..ఏది శాశ్వతం...ఏమిటి జీవితం...అని రకరకాల ప్రశ్నలు...మనసంతా వికలమైపోయింది. కొడుకుని పోగొట్టుకున్న బాధ నుండి కోలుకోకుండానే ఈ బాధ..ఇంతటి దెబ్బని అసలు తట్టుకోవటం ఆ తల్లికీ,అమ్మాయికీ ఎంతటి కష్టమో..అసలు వాళ్ళు ఎలా కోలుకుంటారు అన్న ప్రశ్నలకు నాకు సమాధానమే దొరకటం లేదు...అయ్యో దేవుడు కాస్తైనా దయ చూపలేదే అని బాధ కలిగింది..నిద్ర కూడా పట్టటం లేదు బాధతో...

రేపు ఏమి జరుగుతుందో తెలియని అసందిగ్ధ క్షణికమైన జీవితం కోసం మనమింత తాపత్రయ పడుతున్నామే అని నాకు విరక్తితో కూడిన భావనలు కలిగాయి. జీవితమే శాశ్వతం కానప్పుడు...కొన్ని సంఘటనల వల్ల కలిగే భావోద్వేగాలూ,కోపాలూ,తాపాలూ జివితాంతం మనతో మోసుకోవటం అనేది ఎంతటి అవివేకమైన పనో అనిపించింది...

ఇంతకానా ఎక్కువ కష్టాలు,బాధలు ఎందరి జీవితాల్లోనో ఉండి ఉండచ్చు..కాని ఎదురుగా కనిపించిన,నిన్ననే జరిగిన సంఘఠన కావటంతో బ్లాగ్లో రాయాలనిపించి రాసేస్తున్నాను...నా వేదనను బ్లాగ్మిత్రులతొ పంచుకోవాలని...

ఇంతకన్నా రాయాలని ఉన్నా రాయలేని నిస్సత్తువ...వెనుక నుంఛి అమ్మ అంటోంది...అందుకే మీ ఆయన కంప్యూటర్ బాగు చేయించటంలేదు...అది ఉంటే ఇక నిన్ను నువ్వు పట్టించుకోవు...అని..!!

ప్రస్తుతానికిక శెలవు మరీ...

Wednesday, February 3, 2010

కారణ జన్ములు...

క్రితం వారం అనుకుంటా ఒక హోటల్ కు డిన్నర్ కు వెళ్తే అక్కడ "దర్శకులు విశ్వనాథ్"గారిని చూడటం జరిగింది. బాగా దగ్గర నుంచి అదే చూడటం. అదివరకులా కాక బాగా సన్నబడ్డారు. వయసు ప్రభావం...వాకింగ్ స్టిక్ కూడా ఉంది చేతిలో..!ఆయన కుటుంబంతో కాబోలు ఉన్నారు. భోజనం అయిపోయి వెళ్పోతున్నారు. అందుకని ఇంక దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. కాకపోతే అన్ని గొప్ప సినిమాల సృష్టికర్త ను అలా "ఓల్డ్ ఏజ్"లో చూడలేకపోయాననే చెప్పాలి...ఏదో సినిమా మళ్ళీ తీస్తున్నారని వినికిడి.

ఆ తరువాత "వేటూరి"గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చానల్స్ వాళ్ళు ఆయనతో ఇంటర్వ్యూ లు ప్రసారం చేసారు. చాలా బాగా ,ఓపికగా మాట్లాడారు. ముఖ్యంగా తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, జాతీయ స్థాయిలో తెలుగు భాష ఎంతటి నిరాదరణకు,అలక్ష్యానికీ గురౌతోందో చక్కగా వివరించారు. ఆత్రేయగారి "నేనొక ప్రేమ పిపాసిని.." పాట గొప్పతనాన్ని ప్రతి వాక్యం, పదం గుర్తుచేసుకుంటూ చెప్పారు.
ఆయన ఇంకా రాస్తున్న కొత్త సినిమా పాటల వివరాలు చెప్పారు. చానల్ వాళ్ళు ఆయన రాసిన "సాంగ్స్ బిట్స్" వినిపించారు. అంతా బాగుంది కానీ,అయ్యో ఎంతటి మాహా రచయిత పెద్దవారైపోయారే అనిపించింది...

ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి "ఎనభై ఒకటి" సంవత్సరాలట.ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి 81సంవత్సరాలట. ఆ అద్భుత గాయనికి సాటిలేరెవరూ అనుకున్నాను.

అక్కినేని అవార్డ్ సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూంటే 87ఏళ్ల మనిషి ఆరోగ్యం పట్ల ఎంత శ్రధ్ధ తీసుకుంటారో అని అబ్బురం కలిగింది. ఆయన డిసిప్లీన్ , ఆరోగ్యం పట్ల ఆయన చూపే జాగ్రత్త చాలా మందికి మార్గదర్శకం కావాలి అనుకుంటూ ఉంటాను అస్తమానం.

ఈ మహామహులందరూ కారణ జన్ములు. ఎవరికి వారే "యునీక్" అనిపించింది. బాగా రాసేవారూ, పాటలు పాడేవారూ ,బాగా నటించేవారూ, సినిమాలు తీసేవారు చాలా మంది ఉన్నారు.. ఇంకా వస్తారు కానీ , పైన రాసిన మహామహులందరిని రీప్లెస్ చేసేవారు మాత్రం ఎవ్వరూ ఉండరు...పుట్టరు అనిపించింది. ఇటువంటి మహానుభావులెందరికోసమో నేమో త్యాగయ్యగారు అన్నారు..."ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు.." అని.

****************************
బ్లాగ్మిత్రులకు:
నా సిస్టం బాగవకపోవటం వల్ల బ్లాగులు చూసి చాలా కాలమైంది...! నాకొక బ్లాగుందని నేనే మర్చిపోతానేమో అని ఇన్నాళ్ళకు ఇలా ఓ టపా రాసే ప్రయత్నం చేసాను. తరచూ చూసే బ్లాగులు చూడకపోయినా నాకు బాధే. బ్లాగుల
పట్ల నాకున్న మక్కువ అటువంటిది. వీలున్నప్పుడెప్పుడో మిస్సయిన టపాలన్ని చదువుతాను.
టపాలు తగ్గిపోయినా "తృష్ణ"ను మర్చిపోకండేం...!

Saturday, January 23, 2010

ऐ मालिक तेरे बंदे हम...


భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో వి.శాంతారాం ఒకరు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లలో కూడా ఒకరు. ఆయన నిర్మించిన, నటించిన చాలా సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారాను . అయన చిత్రాల్లో "దో అంఖే బారః హాత్" కూడా నాకెంతో ఇష్టమైన చిత్రాల్లో ఒకటి .

"ఓపెన్ ప్రిజన్" పరిశోధనల ఆధారంతో,గాంధీయ సిద్ధాంతాలతో తయారైన చిత్రం ఇది.ఒక జైలర్ కొందరు ఖైదీలని జైలుకి దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళలో గొప్ప మార్పుని ఎలా తీసుకువచ్చాడన్నది ఈ చిత్ర కధాంశం. చాలా గొప్ప సినిమా. శాంతారామ్ చిత్రాలన్నింటిలో నాకు నచ్చిన సినిమా ఇది.ఈ చిత్రానికి బెర్లిన్ ఫిమ్ ఫెస్టివల్లో "సిల్వర్ బేర్" మరియు "గోల్డెన్ గ్లొబ్ అవార్డ్" కూడా వచ్చాయి. ఈ సినిమాలోని "ఏ మాలిక్ తేరే బందే హం.." నేను ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ వినే పాట.






Movie Name: Do Aankhen Bara Haath (1957)
Music Director: Vasant Desai
Lyrics: Bharat Vyas
singer: Lata

ऐ मालिक तेरे बंदे हम
ऐसे हो हमारे करम
नेकी पर चलें
और बदी से टलें
ताकि हंसते हुये निकले दम

जब झुल्मों का हो सामना
तब तू ही हमें थामना
वो बुराई करें
हम भलाई भरें
नहीं बदले की हो कामना
बढ चुके प्यार का हर कदम
और मिटे बैर का ये भरम
नेकी पर चलें ...

ये अंधेरा घना छा रहा
तेरा इनसान घबरा रहा
हो रहा बेखबर
कुछ न आता नज़र
सुख का सूरज छिपा जा रहा
है तेरी रोशनी में वो दम
जो अमावस को करदे पूनम
नेकी पर चलें ...

बडा कमझोर है आदमी
भी लाखों हैं इसमें कमीं
पर तू जो खडा
है दयालू बडा
तेरी कर कृपा से धरती थमी
दिया तूने जो हमको जनम
तू ही झेलेगा हम सबके गम
नेकी पर चलें ...

బ్లాగ్మిత్రులకు:

నా సిస్టం పాడయిపోవటం వల్ల వారం నుంచీ నేను బ్లాగ్ తెరవలేకపోయాను. కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరించకపోవటంవల్ల టపాలు రాయటానికి వేరే ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేకపోయాను. సిస్టం బాగు చేయిస్తే ఆరోగ్యం పట్ల అశ్రధ్ధ వహిస్తానని శ్రీవారు పి.సి.ని బజ్జోపెట్టే ఉంచేసారు :)

బ్లాగుల్లోని చాలా టపాలకు వ్యాఖ్యలు బాకీ ఉన్నానని ఇవాళ బ్లాగులు చూస్తే తెలిసింది....కానీ ప్రస్తుతానికి ఎవ్వరికీ వ్యాఖ్యలు రాయలేను...మిత్రులందరూ అన్యధా భావించద్దని మనవి.

ఆరోగ్యం పట్ల శ్రధ్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ఈ బ్లాగ్లో కొన్నాళ్ళు పాటు రెగులర్గా టపాలు ఉండవు. ఏ మాత్రం వీలున్నా వారం పదిరోజులకు ఒక టపా అయినా రాయటానికి ప్రయత్నిస్తాను...ఇంతకాలం వ్యాఖ్యలు రాసి,నా బ్లాగ్ చదివి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

Thursday, January 14, 2010

హాస్య బ్రహ్మగారి " చంటబ్బాయ్ "


"లిటిరేచర్" అధ్యయనం చేసేప్పుడు కామెడి లో రకాలు చెప్తూంటారు. Romantic comedy, Farce, Comedy of humours, comedy of manners, Satiric comedy, High comedy,Tragi-comedy అని బోలెడు రకాలు. హాస్యంలోని ఈ రకాలన్నింటినీ తెలుగు వెండితెరకు పరిచయం చేసిన ఘనత హాస్యబ్రహ్మ "జంధ్యాల" గారిది. ఇవాళ జనవరి 14న మనందరికీ "జంధ్యాల(14 Jan 1951 - 19 Jun2001)"గా తెలిసిన హస్యబ్రహ్మ "జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి"గారి పుట్టినరోజు.


హాస్య చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపు, తన సంభాషణలతో తెలుగు భాషలోనే గొప్ప మార్పు తెచ్చినవారు "జంధ్యాల" అనటం అతిశయోక్తి కాదేమో. "సుత్తి" అనే పదం మనందరి వాడుక భాషలో ఎంత సుస్థిరమైన స్థానం సంపాదించుకుందో వేరే చెప్పనక్కరలేదు. ఇలాంటి పదాలూ, పద ప్రయోగాలూ, మేనరిజమ్స్...ఆయన సినిమాల నిండా కోకొల్లలు. వాటిలో చాలామటుకు మన ప్రస్తుత భాషా ప్రయోగాల్లో కలిసిపోయినవనేకం. రెండు జెళ్ళ సీత, రెండు రెళ్ళు ఆరు, మొగుడు పెళ్ళాలు, చంటబ్బాయ్, పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్ళంత, వివాహ భోజనంబు, హై హై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, ఇష్..గప్ చుప్....ఇలాంటి సినిమాల పేర్లన్నీ తలుచుకుంటే చాలు తెలుగు ప్రేక్షకుల వదనాల్లో ఇప్పటికీ దరహాస మందారాలు పూయించగల సామర్ధ్యం ఉన్న చిత్రాలు.


కొత్తగా ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పటమంటే సూర్యునికి దివిటీ చూపించటమే అవుతుంది. ఆయన సినిమా ప్రస్థానం, వచ్చిన అవార్డులు, ఇతర జీవిత విశేషాలను గురించి "
ఇక్కడ" చూడండి.
క్రితం అక్టోబర్లో "బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" కోసం నేను రాసిన "చంటబ్బాయ్" సినిమా కబుర్లు....ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారిని తలుచుకుంటూ....మరోసారి.
*** *** ***


ఆహాహా....సుహాసినీ సుమధుర హాసినీ...వందే...."

ఎవరది?వేళకాని వేళ వందేమాతరం పాడుతున్నారు..?
అయ్యో, మా నాన్నగారండి......గుమ్మం అటు....
నాకు తెలియదనుకున్నారా? వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు గృ..గృ..గృ...గృహం మధ్యదాకా వచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకనే..ఇలా...."
*** *** ***

"కఐ కలౌ కయూ..."
"కమి కటూ..."
ఏమిటిది మనిషంత మనిషిని పిల్లకి తండ్రిని నా ఎదురుగుండా నాకు అర్ధంకాని భాషలో మా అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదయ్యా వీల్లేదు..."
*** *** ***


"ఏమండేమండీ..మీరు సినిమా తీస్తున్నరాండీ...నా పేరు విశ్వనా"ధం" అండీ, చాలా నాటకాలు వేసానండి..ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమలో ఏక్ట్ చెయ్యాలని కోరికగా ఉందండి...ఒక్క చిన్న బిట్ ఏక్ట్ చేస్తాను...బాబ్బాబు కాదనకండి.."
"ఆల్ రైట్. ఆకలితో బాధ పడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా..?"
"నటిస్తానండి..బాగా ఆకలితో కదండి....అయ్యా, బాబూ...ధర్మం చెయ్యండి బాబూ...ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా హొటల్లో చికెన్ బిర్యానీ తింటాను తండ్రీ...బాబూ.....అయ్యో వాళ్ళేరీ?"
(ఇంతలో అతని తండ్రి వస్తాడు...)
"ఎవర్రా వాళ్ళు... సినిమానా నీ శార్ధమా? అడ్దగాడిద. ఏం మేమంతా చచ్చాం అనుకుంటున్నావా? అనాధ జన్మంటూ అడుక్కు తింటున్నావ్? ముప్పొద్దులా మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా..!"
"అది కాదు నాన్నా, సినిమాలో వేషం ఇస్తానంటేనూ..."
"ఫో రా, సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తింటూ బ్రతుకు.నా కొడుకు పుట్టగానే టి.వి. చూసి ఝడుసుకుని చచ్చాడనుకుంటాను..."
"నాన్నా...”
"ఫో...”
"నాన్నా... "
"ఫో...”
నాన్నా...
*** *** ***

"ఏమిటో...జరిగిందంతా విన్నాకా ఆశువుగా నాకొక కవిత వచ్చేస్తోంది....జీవితమంటే...."
"ఏమండీ...వన్ మినిట్...నేనలా బయటకు వెళ్ళాకా కన్టిన్యూ చేసుకోండి.."
*** *** ***

"నేను కొన్ని కవితలు రాసాను..మచ్చుక్కొకటి వినిపిస్తాను వినండి...
ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుండి? ఎర్రగా ఉంటే బాగుండదు కనుక.
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? నీలంగా ఉంటే బాగుండదు కనుక.
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు కనుక."
"ఇవి విన్నాకా కూడా నేను ఎందుకు బ్రతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనుక."
"చాలా బాగుందండి..ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను..వీటిని మీ పత్రికలో వేయించండి."
"ఇవిక్కడే ఉంచుతానమ్మా. మేమిక పత్రిక నడపలేము అని నిర్ణయించుకున్నాకా ప్రచురిస్తాము. ఇది రిలీజయే టైముకి మేము ఏ ఆఫ్రికానో, అండమానో పారిపోతామమ్మా !"

"థాంక్స్ అండి.....పోతే..."
ఎవరు పోతేనమ్మా, నేనా?
"ఇది కాస్త తినండి...”
పోవటానికేనామ్మా?
"నేనే స్వయంగా తయారు చేసిన స్వీటండి. వంటా-వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి.అతరిపండు లంబా లంబా అని దీని పేరు."

"(బొందా బొందా అనకపోయావ్). మళ్లీ తినటం ఎందుకు రిస్కు. జీవితం మీద ఆశున్నవాణ్ణి. ఇదిక్కడే పెట్టమ్మా."

"వస్తానండి.మళ్ళీ వచ్చేప్పుడు మరిన్ని కవితలూ,స్వీటు పట్టుకొస్తాను."
"...ఎప్పుడొస్తారో ముందుగా చెబితే సెలవు పెట్టుకుంటాను.."
"అబ్బే, సెలవు పెట్టుకుని మరీ వినాల్సిన అవసరం లేదండి...ఆఫీసులో వింటే చాలు...”

*** *** ***


"కాల యముడు కినుక వహించిన ఆ క్షణం తన కింకనులని పుణ్యమూర్తి ఆఫీసుకే పంపాడు పాడు యముడు."
చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి, చిత్రవధ చేసి, ఒకదానిక్రింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు.
"కవితనక పోతే ఏమంటారు?”

ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరూ ఏ పేరూ పెట్టలేదు.
"అయితే ఆ పేరూ నేనే పెడతాను... కవిత కాకపోతే తవిక."
తవికా..
"అవును. కవితను తిరగేసాను."
అద్భుతం. కవిత్వాన్నే తిరగేసిన మీకు పేర్లు తిరగేయటం ఒక లెఖ్ఖా..?
"ఇదిగోనండీ...ఇంకో తవిక..నోటికి మాట, నెత్తికి రీటా, కాలికి బాట, నాకిష్టం సపోటా..."
నీకూ నాకూ టాటా తొందరగా ఫో ఈ పూట.
"ఏమన్నారు..?"
అబ్బే ఏం లేదండీ..!!
*** *** ***


"ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏమి చెయ్యాలి?"
"రామకృష్ణా బీచ్ కెళ్ళి సముద్రంలో దూకాలి.
"ఎడిటర్ గారూ..."

"నోర్ముయ్! నెల రోజులుగా నా ప్రాణాలు పిచుమిఠాయిలా కొరుక్కు తినేసావు కదే రాక్షసీ...నీ పిచ్చిరాతలకి నా తల తిరిగిపోయి, మా ఆవిడని "సీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు" అని...మా ఆరేళ్ళ అమ్మాయిని "దీర్ఘ సుమంగళీ భవ" అనీ దీవించటం మొదలెట్టానే....

నోరెత్తావంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను....ఇవి తవికలా...పిడకలే....నీ పాడె మీద పెట్టుకునే పిడకలు.
ఇవేమిటి....ఇవి కధలా...ఆకుపచ్చని కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనుప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి...ఇవి కధలా?.....
*** *** ***

"ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చెయ్యటం. ఏం గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను? నాతో పెట్టుకోకొరేయ్... కుంతీస్ సెకెండ్ సన్స్ బూన్ (అదే..భీమవరం) లో వన్ పర్సన్ ని చావ కొట్టాను. పెట్టేయ్.. ఫోన్ కీప్ చెయ్.."
*** *** ***


ఈ డైలాగులన్నీ చదివాకా ఇదే చిత్రమో అర్ధం అయ్యే ఉంటుంది...క్లాసిక్ కామెడీ "చంటబ్బాయ్" లోని డైలాగ్స్ ఇవి.మా ఇంట్లో కేసెట్ అరిగిపోయే దాకా విని విని మాకు బట్టీ వచ్చేసిన డైలాగులివన్నీ..!!నా ఫేవరేట్ కమీడియన్ "శ్రీలక్షి"గారి "కవయిత్రి" పాత్ర ఈ చిత్ర విజయానికి బలమైన కారణం అంటే అతిశయోక్తి కాదు.


"చంటబ్బాయ్" చిత్రం గురించిన విశేషాలు:
1986లో జంధ్యాలగారి దర్శకత్వం లో వచ్చిన హాస్యచిత్రం ఈ "చంటబ్బాయ్". చిరంజీవి గారి సినీ కెరీర్ లోని ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. యాక్షన్ సినిమాలే కాదు, కామిడీని కూడా అద్భుతంగా పండించగలడు అని చిరంజీవి ఋజువు చేసారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల "చంటబ్బాయ్" ఈ సినిమా ఆధారం. ఇదే కాక బ్రిటిష్ కమిడియన్ Peter Sellers నటించిన A Shot in the Dark నుంచి ఈ సినిమా కధ తీసుకోబడిందని వినికిడి. ఏది ఏమైనా ఒక క్లాసిక్ హాస్య చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపొయిందీ సినిమా.

చిత్ర కధ:
"జేమ్స్ పాండ్" గా తనని తాను పిలుచుకునే పాండురంగారావు ఒక ప్రైవేటు డిటెక్టివ్. అతను ప్రేమించే టెలిఫోన్ డివైజ్ క్లీనరైన "జ్వాల" అనే అమాయకపు మంచి మనసున్న అమ్మాయి, ఒక హత్య కేసులో ఇరికించబడుతుంది. పాండు రంగంలోకి దిగి తాను పని చేసే డిటెక్టివ్ ఏజన్సీ బాస్ ఈ హత్య చేసినట్లు కనుక్కుని, నిరూపించి, జ్వాలను హత్య కేసు లోంచి విడిపిస్తాడు. ఇది విని జ్వాల స్నేహితురాలైన డాక్టర్ నిశ్చల, తన తండ్రికి వేరే వివాహం ద్వారా పుట్టిన తన అన్నయ్య "చంటబ్బాయ్" ను వెతికిపెట్టమని కోరుతుంది. ఆమె తండ్రి పేరుమోసిన వ్యాపారవేత్త కాబట్టి, దొరికిన "చంటబ్బాయ్" కాక మరో వ్యక్తి తానే "చంటబ్బాయ్" నని వస్తాడు. అసలు కొడుకు ఎవరన్నది సమస్యగా మారుతుంది.


ఎవరు అసలైన "చంటబ్బాయ్" అనే పరిశోధనలో, చివరిదాకా అనేక హాస్య సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. చివరికి పాండురంగారావే చంటబ్బాయ్ అని తెలుస్తుంది. చిత్రం లో చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రలు. సుహాసినికి చాలా సినిమాల్లో డబ్బింగ్ వాయిస్ అందించిన సరిత ఈ సినిమాలో కూడా చక్కని తన గాత్రంతో మెప్పిస్తారు. జగ్గయ్య, ముచ్చర్ల అరుణ, శ్రీలక్ష్మి, సుధాకర్, చంద్ర మోహన్, రావి కొండల రావు, పొట్టి ప్రసాద్ మొదలైన వారు మిగిలిన పాత్రధారులు. బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రానికి సాహిత్యం వేటూరి,సంగీతం చక్రవర్తి సమకూర్చారు. పాటలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల లు తమ గళాలనందించారు.

Tuesday, January 12, 2010

సంక్రాంతి...ముగ్గులు...


స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,

డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.

సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....




ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo

ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.

మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...








బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Sunday, January 10, 2010

స్వర రాగ గంగా ప్రవాహమే...


"चलो मन जाये घर अपनॆ
इस परदॆस में वॊ पर भॆस में
क्यॊ परदॆसी रहॆं....
चलो मन जाये घर अपनॆ....."


అంటూ 1998 లో G.V.Iyer గారు దర్శకత్వం వహించిన "స్వామి వివేకానంద" హిందీ చిత్రానికి ఒక అద్భుతమైన పాట పాడారు ఏసుదాస్ గారు.
గుల్జార్ రాయగా, ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు "సలీల్ చౌదరి" గారు స్వరపరిచిన పాట ఇది.
ఈ పాట ఈ లంకెలో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=d5oOvxcff0g



నాకు చాలా ఇష్టమైన గాయకుల్లో "ఏసుదాస్" గారు ఒకరు. K.J.Yesudas గొంతు నాకు ఇష్టం అనటం "వెన్నెల" అంటే నాకూ ఇష్టమే అని చెప్పటమే అవుతుంది. ఆయన పాటల గురించి, ఆ స్వరంలోని మాధుర్యాన్ని, విలక్షణమైన ఒరవడి గురించీ ఎంత చెప్పినా తనివి తీరదు. కాబట్టి ఆయిన పాడిన కొన్ని తెలుగు ,హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను.

ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని తెలుగు పాటలు:

ఓ నిండు చందమామ..నిగనిగలా భామా (బంగారు తిమ్మరాజు)
కొంగున కట్టేసుకోనా(ఇద్దరు మొనగాళ్ళూ)
కురిసెను హృదయములో తేనె జల్లులే (నేనూ నా దేశం)
నీవు నా పక్కనుంటే హాయి(శివమెత్తిన సత్యం)
చిన్ని చిన్ని కన్నయా కన్నులలో నీవయ్యా(భద్రకాళి)
ఎవ్వరిది ఈ పిలుపు..(మానస వీణ)
ఊ అన్నా...ఆ అన్నా....ఉలికి ఉలికి పడతావెందుకు....(దారి తప్పిన మనిషి)
అమృతం తాగిన వాళ్ళు (ప్రతిభావంతుడు)
లలిత ప్రియ కమలం(రుద్రవీణ)
తులసీ దళములచే(రుద్రవీణ)
నీతోనే ఆగేనా(రుద్రవీణ)
తెలవారదేమో స్వామీ(శృతిలయలు)
చుక్కల్లే తోచావే(నిరీక్షణ)
ఇదేలే తరతరాల చరితం(పెద్దరికం)
రాధికా కృష్ణా(మేఘసందేశం)
ఆకాశ దేశానా(మేఘ సందేశం)
సిగలో అవి విరులో(మేఘ సందేశం)
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా(పచ్చని సంసారం)
పచ్చని చిలుకలు(భారతీయుడు)
స్వర రాగ గంగా ప్రవాహమే(సరిగమలు)
కృష్ణ కృపా సాగరం(సరిగమలు)
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ(అల్లుడుగారు)
నగుమోము(అల్లుడుగారు)
పూమాల వాడెనుగా పూజసేయకే(సింధు భైరవి)
నీవేగ నా ప్రాణం అంట(ఓ పాపా లాలి)
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా(కుంకుమ తిలకం)
మా పాపాలు కరిగించు (శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం)
నాకు చాలా ఇష్టమైన "హరివరాసనం" పాటను ఈ లింక్ లో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=rcQCkkVKC5w


ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని హిందీ పాటలు:

१)चांद जैसॆ मुख्डॆ पॆ...
२)दिल के टुकडॆ टुक्डॆ कर कॆ मुस्कुराकॆ चल दियॆ...जातॆ जातॆ यॆ तॊ बता जा हम जियॆंगॆ किस्कॆ लियॆ..
३)गॊरि तेरा गांव बडा प्यारा में तो गया मारा आकॆ यहा रॆ...(चित चॊर)
४)आज से पेह लॆ..आज सॆ ज्यादा खूशी आज तक नही मिली..(चित चॊर)
५)जब दीप जले आना..जब शाम ढलॆ आना(चित चॊर)
६)जानॆ मन जानॆ मन तॆरॆ यॆ नयन..
७)निस..गम..पनि....आ ..आभीजा..(आनंद महल)
८)सुरमयि अखियॊं में..(सदमा)
९)का करू सजनी आयॆ ना बालम (स्वामी)
१०)माना हॊ तुं बॆहद हसी..(टूटॆ खिलॊनॆ)
११)कहा सॆ आयॆ बदरा -- (चष्मॆ बद्दूर, Singers: K.J. Yesudas & Haimanti Shukla)
నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇక్కడ చూడండి...





2000లో ఈయన పాడిన "Sitaron mein tu hi" ప్రైవేట్ హిందీ అల్బమ్ చాలా ఆదరణ పొందింది. "మెహబూబ్" రాయగా, హిందీ చిత్ర స్వరకర్త "లలిత్" స్వరపరిచిన ఈ అల్బం లోని పది పాటలూ చాలా బావుంటాయి. వాటిలోని ఒక "చమక్ ఛం ఛం" అనే పాటని ఇక్కడ చూడండి..





ఏసుదాస్ గారికి "పిన్నమనేని అవార్డ్" ను విజయవాడలో ఒక సభలో ప్రధానం చేసారు. అప్పుడు ఆయన చేసిన "లైవ్ కచేరి" వినలేకపోయినా, రికార్డింగ్ ను దాచుకోగలగటం నా అదృష్టం. K.J.Yesudas గురించిన మరిన్ని వివరాల కోసం "
ఇక్కడ" చూడండి. కొందరు ప్రముఖులు ఆయనకు ఇచ్చిన ప్రశంసలు, ఆయనకు వచ్చిన అవార్డులు, పాడిన భాషల వివరాలూ అన్నీ ఈ వికిపీడియా లింక్ లో ఉన్నాయి. అందుకని ఇంక ప్రత్యేకంగా ఆయన గురించి ఇంకేమీ రాయటం లేదు.

ఏసుదాస్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మనకందరికీ ఇంకెన్నో అద్భుతమైన పాటలనందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆయన టపా ద్వారా ఇవాళ ఏసుదాస్ గారి పుట్టిన రోజని తెలిపి నాకు ఈ మధురమైన పాటలన్నీ మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన "మురళిగారికి" ప్రత్యేకధన్యవాదాలు.

Friday, January 8, 2010

A Patch of Blue


1961 లో ఆస్ట్రేలియన్ రైటర్ "Elizabeth Kata" రాసిన నవల "Be Ready With Bells and Drums" ఆధారంగా అమెరికన్ డైరెక్టర్ Guy Green 1965 లో తీసిన చిత్రం "A Patch of Blue". కలర్ లో తీసే అవకాశం ఉన్నా "బ్లాక్ అండ్ వైట్" లోనే ఈ సినిమా తీసాడు దర్శకుడు. నవలకు 'Writers Guild of America అవార్డు' కూడా వచ్చింది. కానీ నవల కన్నా ఎక్కువగా "సినిమా"కు బాగా ఆదరణ లభించింది. ఆఫ్రికన్-అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ జోరుగా సాగుతున్న నేపధ్యంలో "ప్రేమకు జాతి, వర్ణ భేదాలు ఉండవు" అనే సూత్రాన్ని తెలిపేలా తీసిన చిత్రం ఇది. Bahamian - American నటుడైన Sir Sidney Poitier నల్లజాతీయుడైన "Gordon" పాత్రలో నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పాలి. స్టేజ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా Sidney Poitier ఎంతో ప్రాఖ్యాతి గాంచారు. పేరు పొందిన ఆయన చిత్రాల్లో "టు సర్, విత్ లవ్" మరో ఉత్తమ చిత్రం.

టూకీగా చెప్పాలంటే ఇది "Gordon Ralfe" అనే ఒక నల్ల జాతీయునికీ, "Selina D'Arcey" అనే పధ్ధెనిమిదేళ్ళ అంధురాలైన అమెరికన్ యువతికీ మధ్య నడిచిన ప్రేమ కధ. ఐదేళ్ళ వయసులో తల్లి "Rose-Ann" వల్ల ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయిన Selina, నిర్దయురాలైన తల్లితో, తాగుబోతైన తాత "Ole' Pa" అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటుంది. స్కూల్ మొహం కూడా ఎరుగని ఒంటరి. ప్రపంచం తెలియని అమాయకురాలు. వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు క్లీన్ చేయటం, కౄరురాలైన తల్లి చేతిలో దెబ్బలు తినటం ఆమె దైనందిక చెర్యలు. "బీడ్స్" దండలుగా గుచ్చటం కొద్దిపాటి సంపాదనతో పాటూ ఆమెకున్న ఎకైక వ్యాపకం. రోజూ ఆమె వినే రేడియోనే ఆమెకు తోడు.

దగ్గరలోని పార్క్ కు రోజూ తీసుకువెళ్ళి, మళ్లీ పని నుంచి తిరిగి వచ్చేప్పుడు ఇంటికి తీసుకువెళ్ళేలా తల్లికి తెలియకుండా ఒప్పందం కుదురుతుంది Selina కు, ఆమె తాతకూ. ఇల్లు తప్ప మరో లోకం తెలీని Selina వెంఠనే ఒప్పుకుంటుంది. అక్కడ ఆమెకు Gordon పరిచయమౌతాడు. Selina - Gordon మొదట్లో పార్క్ లో కలుసుకున్న ఒకటి రెండు సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎనిమిది నిమిషాల ఈ క్రింది వీడియోలో ఆ సన్నివేశాలు చూడండి.




ఆ పరిచయం ఓ మంచి స్నేహంగా, హృద్యమైన ప్రేమగా మారుతుంది. నిరసన, చీత్కారాలు తప్ప ఆప్యాయతన్నది ఎరుగని Selina, Gordon మంచితనానికీ, అభిమానానికీ, దయార్ద్ర హృదయానికీ కదిలిపోతుంది. అతడి చుట్టూ తన ప్రపంచాన్ని,ఆశల్ని పెంచుకుంటుంది. ఆమెలోని నిర్మలత్వాన్ని, అమాయకతను, మంచితనాన్ని అతడు ప్రేమిస్తాడు. తాను నల్ల జాతీయుడినని తెలిస్తే ఆమె స్నేహాన్ని పోగొట్టుకుంటానన్న భయంతో అతను ఆ సంగతి దాస్తాడు. తన తమ్ముడు Mark కు పరిచయం చేసినప్పుడు అతడు కూడా జాతి భేదాన్ని గుర్తు చేసి వారి అనుబంధాన్ని నిరుత్సాహపరుస్తాడు. ఒకరోజు పక్కింటి స్నేహితురాలి ద్వారా Selina, Gordon ల స్నేహం గురించి తెలుసుకున్న ఆమె తల్లి వారిద్దరినీ విడదీయటానికీ తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తుంది. అవాంతరాలన్ని అధిగమించి వారిద్దరు కలుస్తారా? విడిపోతారా? అన్నది క్లైమాక్స్.

సూక్ష్మమైన భావాలను కూడా మొహంలో చూపెట్టిన Sidney Poitier నటన ఈ చిత్రానికి ప్రాణం. Jerry Goldsmith అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పియానో వాడిన విధానం ఆకట్టుకుంటుంది. Selina గా నటించిన "Elizabeth Hartman" నటన కూడా మనకు గుర్తుండిపోతుంది. నిర్దయురాలైన తల్లిగా నటించిన Shelley Winters కు ఆ సంవత్సరం "బెస్ట్ సపోర్టింగ్ ఏక్టర్" Oscar లభించింది. ఇంకా బెస్ట్ ఏక్ట్రస్, బెస్ట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మొదలైన కొన్ని కేటగిరీల్లో ఆ ఏటి అకాడమీ అవార్డ్ నోమినేషన్స్ సంపాదించుకుంది ఈ చిత్రం.


సున్నితమైన భావాలకూ, ఆర్ద్రమైన ప్రేమకూ భాష్యం చెప్పే ఈ సినిమా తప్పక చూడవలసిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం టి.వి.లో చూసిన ఈ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి.

Thursday, January 7, 2010

ఇక కావలసినదేమి...


వాగ్గేయకారుల్లో నాకు అత్యంత ఇష్టమైన "త్యాగయ్య" గురించి ప్రత్యేకం చెప్పటానికేముంది? పొద్దున్నే ఆయన కృతులు వింటుంటే ఈ కృతిని బ్లాగ్లో రాయాలనిపించింది..."బోంబే సిస్టర్స్"(సరోజ,లలిత)పాడిన కృతి వినటానికి పెడుతున్నను...




త్యాగరాజ కృతి, బలహంస రాగం, ఆది తాళం :

పల్లవి
: ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అనుపల్లవి
: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు
అంతరంగమున నెలకొనియుండగ (ఇక)

చ1: ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-
కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ (ఇక కావలసిన)

చ2
: కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ (ఇక కావలసిన)

చ3: క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను
నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ (ఇక కావలసిన)


త్యాగరాజ కృతికి అర్ధాన్ని రాసేంతటి గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్ధమైన అర్ధాన్ని కూడా రాయటానికి సాహసించాను...

అర్ధం:

ఓ మనసా, ప్రశాంతంగా ఎందుకుండవు? ఇంకేమికావాలి నీకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీ మనసునందు నిండి ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఆనందకారకుడైన శ్రీరాముడు తన నందక ఖడ్గంతో పుర్వ జన్మలందు చేసిన పాపారణ్యములను నాశనం చేయటానికి సిధ్ధముగానుండగ ఇంకేమి కావాలి నీకు?

నీలోని కామము,లోభము,మదము,మోహమూ మొదలైన అంధకారములను తొలగించటానికి, సూర్య చంద్రాదులను తన నేత్రాలలో నింపుకున్న శ్రీరామచంద్రుడు నీలో కొలువై ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఈ త్యాగరాజాశించెడి క్షేమాది శుభములను నీకొసగ గలిగిన దయానిధి అయిన శ్రీరామభద్రుడు నీలో ఉండగా ఇంకేమి కావాలి నీకు?
ఓ మనసా....