Tuesday, May 17, 2011

ఇదేం సినిమానో తెలుసా?


"ఓ హలా ! ఎక్కడున్నావు...?"

"ఒసే ఏమే ఏమిటే, ఈ మెరపకాయలు తినండే !"

ఈ డైలాగులు ఏ సినిమా లోవో గుర్తున్నాయా?
ఇంకా క్లూ కావాలా?

ఓ రాజకుమారుడు ఉంటాడు.
ఆ రాజకుమారుడికి ఓ పెద్ద కల..నలుగురు దేవతా స్త్రీలతో ఎంజాయ్ చేస్తున్నట్లు..!
ఒక్కరు కాదు నలుగురా? అయినా ఇదేం కల నాయనా? అని రాజుగారు నోరు వెళ్లబెడతాడు. కోపగిస్తాడు. కల నెరవేర్చుకుని రమ్మని యువరాజుని రాజ్యంలోంచి పంపించివేస్తాడు.

కట్ చేస్తే:

యువరాజు తన కలని ఎలా సాకారం చేసుకుని ఆ నలుగురు దేవత స్త్రీలనూ సొంతం చేసుకున్నాడన్నది మిగిలిన కత !

చిన్నప్పుడూ హాల్లో ఈ సినిమా చూసినప్పుడు మరీ చిన్న వయస్సవటం వల్ల ఏ ప్రశ్నలు ఉత్పన్నమవలేదు. ఇప్పుడు సినీజ్ఞానం బాగా పెరిగిపోవటం వలన అనేకానేక ప్రశ్నలు...

* హీరోకి మరీ ఇంత విపరీతమైన "కల" ఏంటో? రాజుగారి ప్రశ్నే నాకునూ....మరీ నలుగురా?

* ఇద్దరు హీరోన్లుంటే ఇప్పటి సినిమాల్లో అసూయలూ, కారాలు,మిరియాలు గట్రాలు బోలెడు. ఈ నలుగురికీ సఖ్యత ఎలా ఉంటుందబ్బా?

* ఈ హీరోయినేంతబ్బా ఇంత లావుగా ఉంది? ఇప్పటి "బక్క హీరోయిన్ల"ను చూసి నా చూపు మరీ చిక్కిపొయినట్లుంది..!

* ..... డ్యూయెట్లు పాడుతూంటే కాస్త నవ్వు వచ్చినమాట నిజమేననాలేమో?

కానీ ఈ సినిమాలో ఓ పాట నాకు చాలా ఇష్టం. సూపర్ మ్యూజిక్, నలుగురు అమ్మాయిలు...బ్లాక్ వైట్ అయినా సూపర్ సాంగ్ !!

పాట చెప్పేస్తే సినిమా పేరు తెలిసిపోతుందే?!

Monday, May 16, 2011

శ్రీశైలం ప్రయాణం, ఫోటోలు


చిన్నప్పుడు అమ్మ పూజ చేస్తూ సంకల్పం చెప్పేప్పుడు "భరత వర్షే, భరత ఖండే.....దక్షిణా దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే..." అంటూ చెప్పేప్పటి నుండీ శ్రీశైలం అంటే ఓ గొప్ప ప్రదేశం అని భావన. అన్ని పూజలకూ, వ్రతాలకూ ముందర చెప్పుకునే సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు పేరు చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. బోలెడు పుణ్య క్షేత్రాలుండగా శ్రీశైలాన్నే ఎందుకు సంకల్పంలో చెప్పుకుంటామని నాకు సందేహం ఉండేది. భూమండలానికి శ్రీశైలక్షేత్రం నాభీప్రాంతం అని పురాణాలు చెబుతాయని అందువల్ల సంకల్పంలో ఆ విధంగా చెప్పుకుంటాం అనీ అక్కడ నేను కొన్న "శ్రీశైల చరిత్ర"(స్థలపురాణం)లో రాసాడు. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు ఆ స్థల పురాణం పై ఆయా ప్రదేశాల్లో ఏవైనా పుస్తకాలు దొరికితే కొనటం నాకు ఇష్టమైన ఆసక్తుల్లో ఒకటి.

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీశైల శిఖర దర్శనమే ఎంతో పుణ్యాన్ని మనదరికి చేరుస్తుందని అంటారు. ఇక శ్రీశైల మల్లికార్జునుని దర్శన భాగ్యం చేసుకుంటే మహా పుణ్యం లభిస్తుందట. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను వీలయినన్నింటిని దర్శించుకోవాలని నాకు చాలా కోరిక. రెండేళ్ళ నుండీ శ్రీశైలం వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయాణం వాయిదా పడుతూనే వచ్చింది. ఇంకా శివుడి ఆజ్ఞ రాలేదేమో అనుకుంటూఉన్నాం మేము. మొన్న శుక్రవారం అప్పటికప్పుడు అనుకుని శ్రీశైలం బయల్దేరాం. వర్షాకాలం, చలికాలం దాటిపోయాయి ఇక ఈ ఎండల్లో కుదిరిందేమిటో అనుకున్నా. ఎండల్లో పాపని ఇబ్బంది పెట్టకూడదని పాపను అమ్మదగ్గర దించి బయల్దేరాం. రిజర్వేషన్ లేకపోయినా ఏదో ఒక బస్సు దొరుకుతుందని నమ్మకం. పెళ్ళయిన కొత్తల్లో తిరుపతి అలానే వెళ్ళాం. నెల ముందు చేసిన రిజర్వేషన్ కన్ఫార్మ్ అవ్వలేదు. అయినా రైలెక్కేసాం బొంబాయి నుంచి. వెంకన్నబాబు దయతో అంత పెద్ద ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ ప్రయాణం.

అలానే ఈ ప్రయాణం కూడా ఆశ్చర్యంగా జరిగింది. బస్టాండ్ లో చూస్తే ఏ బస్సులోనూ సీటూ లేదు. శెలవులని జనం ఎక్కువ ఉన్నారుట. మాకోసమే అన్నట్లు(ఇలాగని మాతో ఉన్నవాళ్లందరూ అనుకున్నారు) స్పెషల్ బస్సొకటి అప్పటికప్పుడు వేస్తున్నారని తెలిసింది. మరో గంటలో బస్సులో ఉన్నాం. తిరుగు ప్రయాణానికి కూడా ఇలానే టికెట్టు దొరుకుతుందిలే అన్నారు శ్రీవారు. పొద్దున్నే నల్లమల అడవిదారిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. కదులుతున్న బస్సులోంచే బోలెడు ఫోటోలు తీసేసా. వాతావరణం కూడా చల్లగా ఉంది. దిగాకా పొద్దున్నే దర్శనానికి బయల్దేరాం. మూడు గంటలు పట్టచ్చు రద్దీ ఉంది అన్నారు బయట కనుక్కుంటే. దర్శనానికి వెళ్తుంటే శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు ఉన్న ఒక మంచి పటం దొరికితే కొన్నాం ఇంట్లో దేవుడిమందిరంలో పెట్టుకోవటానికని. ఎప్పుడో మొక్కుకున్నానని, అమ్మవారికి రాయించమని అమ్మ ఇచ్చిన పట్టుచీర, ఈ పటము తీసుకుని క్యూలో నించున్నాం. అరగంటలో దర్శనం అయ్యింది. మామూలుగా శివలింగాన్నిముట్టుకుని అభిషేకం చేస్కోనిస్తారుట ఇక్కడ. కాశీలోనూ అలానే చేసుకున్నాం మేము. కానీ జనం ఉన్నప్పుడు కాస్త దూరం నుంచే పంపేస్తారుట. లోపలికి వెళ్ళలేకపోయినా మేం కొన్న పటం దేవుడి దగ్గర పెట్టివ్వమని అడిగాము. శివలింగాన్ని తాకించి, అభిషేకం చేసిన నీరు చల్లి, పూజ చేసిన బిల్వ పత్రాలు కూడా వేసి పటం మా చేతికిచ్చారు పూజారిగారు. సంతోషదర్శనం అయ్యింది.

అక్కడ్నుంచి అమ్మవారి దర్శనానికి దారి. అక్కడ కూడా అరగంటే పట్టింది. అక్కడ కూడా ఈ పటాన్ని ఇచ్చాము. పూజారిగారు చక్కగా పూజా కుంకుమ ,పువ్వులు పటం పైన వేసి ఇచ్చారు. అమ్మ ఇచ్చిన పట్టుచీర ఇస్తే, మమ్మల్ని ఆగమని అమ్మవారి దగ్గర అది పెట్టి, హారతి ఇచ్చారు. శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి దర్శనమే ఆనందదాయకంగా ఉండగా ఈ కుంకుమ, హారతులు మాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చాయి. కాశీ విశాలాక్షి గుడిలో కూడా ఇలానే అనుకోకుండా నాకు కుంకుమ, గాజులు కూడా ఇచ్చారు పూజారిగారు. చిన్న విషయాలైనప్పటికీ ఇలాంటివి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అలా ఓ గంటలో దర్శనం అయిపోయింది. గుడి బయటకు వచ్చేప్పుడు దర్శనం క్యూ చాలా పెరిగిపోయి ఉండటాన్ని గమనించాం. పూజరి చెప్పినట్లుగా పట్టుచీరను ఆఫీసులో అందించాము. రసీదు ఇచ్చి ఏరోజు అమ్మవారికి కడతారో చెప్పారు వాళ్ళు.

గుడి లోపల అనుమతిలేదు కానీ బయట కాసిని ఫోటోలు తీసుకున్నా. చాలా చోట్ల రాళ్ళపై చెక్కిన ఏవేవో శాసనాలు ఉన్నాయి. వాటిపై ఉన్న భాష అర్ధం అయితే ఎన్ని చారిత్రక విషయాలు తెలుస్తాయో కదా అనిపించింది. గుడి చుట్టు తిరగటం వల్ల ఎండలో కాళ్ళు సుభ్భరంగా కాలిపోయాయి. అంతలా ఎప్పుడూ పాదాలు కాలలేదు నాకు. ఆ ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఒక చిన్న పిల్లాడికి గాంధీ వేషం వేసి, వెండి రంగు పూసి గుడి గేట్లో నిలబెట్టారు. చాలా దు:ఖం వచ్చింది వాడిని చూస్తే. ఓ ఐస్క్రీం కొని వాడిని ఓ చోట కూచోపెట్టి తినిపించాను. అంతకంటే ఏమీ చెయ్యలేక ! ఇక క్యూ మైన్టైనెన్స్ మాత్రం మాకు చాలా అసంతృప్తిని కలిగించింది. ఒకరి వెనుక ఒకరిని కాక, ఉన్న సన్నటి దారిలోనే జనాల్ని వదిలేస్తున్నారు. జనాలక్కూడా తొందరే. ఆ తోపులాటలు చికాకు తెప్పించాయి. సరైన పధ్ధతిలో క్యూ కట్టించవచ్చు కదా అధికారులు అనిపించింది. మరి తిరుపతి మాటేమిటీ అనకండి. అది మరీ ఘోరం. ఏదో ఒక పూజకి టికెట్టు కొంటే తప్ప మామూలుగా దర్శనానికి వెళ్ళలేం.

ఎందుకు పెట్టారో కానీ ఇక్కడ కులాలవారీగా సత్రాలు, ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి.(ఎక్కడా ఇన్ని రకాల కులసత్రాలు చూడలేదు నేను) ఏదేమైనా వారు అందించే సదుపాయాలకు గానూ ఆయా సత్రాల నిర్వాహకులను మెచ్చుకోవాల్సిందే. భోజనం చేసి చుట్టుపక్కల ప్రదేశాలు చూద్దామని ఆశగా బయల్దేరాం. అసలు నాకు అడవి ప్రదేశాలు చూడాలని చాలా ఆసక్తి. స్థల పురాణంలో కొన్ని ప్రాంతాల గురించి చదివి ఎప్పుడెప్పుడని చాలా ఉత్సాహపడుతూ ఓ జీప్ మాట్లాడుకుంటూంటే రాత్రి బస్సుకు టికేట్లు లేవన్నాడు ఒకాయన. "రాత్రేమిటి రేపు రాత్రికి కూడా లేవుట" అన్నారు ఇంకొకరు. ఇక బలవంతాన సైట్ సీయింగ్ ప్రోగ్రాం కాన్సిల్ చేసేస్కుని బస్టాండ్ చేరాం ఆదుర్దాగా. నాలుగింటి బస్సులో టికెట్లు ఉన్నాయి. ఎల్లుండి పొద్దున్న దాకా ఇక లేవు టికెట్లు అన్నారు కౌంటర్లో. రాకరాకవచ్చి అప్పుడే వెళ్పోవటమా అని నేను ఏడుపుమొహం వేసాను. "రెండేళ్ళ నుంచీ రావాలనుకుంటే రాగలిగామా? ఇప్పుడు దర్శనం బాగా అయ్యింది కదా? రెండురోజులు ఉండిపోవటం అవ్వదు. పనులున్నాయి. పాపను తీసుకుని చల్లబడ్డాకా మళ్ళీ ఉండేలా వద్దాం" అని శ్రీవారు సముదాయించారు. ఏమనుకున్నా తప్పేది లేదని రూం ఖాళీ చేసి ఇక బయల్దేరి పోయాం.

ఎండంతా మన పరమే అని భయపడుతుంటే అప్పటికప్పుడు మబ్బుపట్టి వాతావరణం చల్లగా మారిపోయింది. కాస్త చినుకు కూడా పడింది. వర్షాకాలంలో వెళ్తున్నట్లే అనిపించింది. చీకటి పడేదాకా మళ్ళీ బస్సులోంచి ఫోటోలు తీస్తూ, మధ్య మధ్య తెచ్చుకున్న పుస్తకం చదివేస్తూ తిరుగుప్రయాణం ఎంజాయ్ చేసేసా. శ్రీశైలం డామ్ ఏరియా, పాతాళగంగ(కృష్ణానదే) మాత్రం భలే ఉంది. ఆ ఫోటోలు బాగా వచ్చాయి. ఏమీ చూడడానికి వీలవ్వకపోయినా ఇలా బస్సులోంచి ఫోటోలయినా బాగా తీసుకోగలిగినందుకు సంతోషం కలిగింది. రెండు రోజులు ప్లాన్ చేసుకుని ఉండిరావాల్సిన ప్రయాణం ఇది.

ఊరు చేరుతూంటే "दानॆ दानॆ पॆ लिखा है खानॆवालॆ का नाम", "ఏది ఎప్పుడు ఎలా జారగాలో అలానే జరుగుతుంది", "ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది" మొదలైన కొటేషన్స్ అన్నీ గుర్తుకొచ్చాయి.

**** ***** ****

Srisailam trip photos'>ఫోటోల లింక్:




బుజ్జి మొక్కలు



ఒకేలా ఉన్నా కొంచెం తేడా ఉంది రెండు ఫోటోలకి...
ఇంతకీ ఈ మొక్కలేమిటో చాలామందికి తెలిసిపోతుంది.
పండిపోయిన కాకరకాయ గింజలు కాస్తంత ఎండబెట్టి మట్టిలో వేస్తే వచ్చిన బుజ్జి మొక్కలు.
కాబోయే కాకర పాదులు !



Sunday, May 15, 2011

'ఊరగాయ వైరాగ్యం' (ఈసారి ఫోటోతో)





(బ్లాగర్ ప్రాబ్లం వల్ల ఈ టపా మొన్న పెట్టిన కాసేపుకి డిలీట్ అయిపోయింది. ఆ కాసేపులో వచ్చిన నాలుగు వ్యాఖ్యలు కూడా డిలీట్ అయిపీఓయాయి. అందుకని ఈసారి ఫోటోతో పెడుతున్నాను...:))





పట్టుమని పది మావిడికాయలతో ఈసారి ఆరు రకాలు:

వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
మాగాయ
తురుము మాగాయ !!
(ఇది 12thన రాసినది..:))

పొద్దున్నుంచీ బయటకు వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చీ, వెళ్ళి వచ్చీ...
డాబాపై ముక్కలు పెట్టి..మళ్ళీ తీసుకువచ్చి..
కారం, ఉప్పు , ఆవ కొలుచుకుని
పెసరపొడి జల్లించి
మెంతులు, ఆవాలు వేయించి.. చల్లర్చి
ఇంగువ నూనె కాచి
ఒక్కొక్కటీ కలిపి...
అన్నీ మూతలు పెట్టి
గోడకి జారలబడి
ఎందుకో ఈ ఊరగాయలు పెట్టడం?
దండిగా తింటే పడేనా?
అసలివన్నీ అరోగ్యానికి ఏం మంచి చేస్తాయని?
పక్షానికో నేలకో ఓసారి నాలిక్కి రాసుకోటానికి
ఇన్ని తంటాలు అవసరమా?

కూర్చున్న చోట్నుంచి లేచాకా ఫోన్ దగ్గరకు పరుగు
అమ్మకి, అన్నయ్యకీ డప్పు కొట్టడానికి
'ఉరేయ్ నేనూరగాయలు పెట్టేసానోచ్' !!
'సాంపిల్ ఎప్పుడు తెస్తావు' అని వాడు..
'నన్నడిగితే పెట్టివ్వనా? ఎందుకన్ని తంటాలు పడటం?' అని అమ్మ...
అంటూంటే
'మరి నా సరదా తీరేదెలా?' అని నేను.
'అమ్మా, మెంతికాయ ఎలా చెయ్యాలో చెప్పవే
మళ్ళీ ఏడు చేస్తాను...'!

...దీన్ని 'ఊరగాయ వైరాగ్యం' అంటారు !!

__________________________________

జయగారు, మీరు శ్రమ తీసుకుని మళ్ళీ వ్యాఖ్య రాసినా ఇలా రెండవసారి టపా పెట్టటం వల్ల అది కూడా పోయింది...ఏమీ అనుకోవద్దండీ..! ఒకటో రెండో కాక, ఇన్నిరకాలు పెట్టడం ఇదే మొదటిసారి నాకూనూ. అన్నీరకాలు కూడా బాగా కుదిరాయి. టేస్ట్ చేసినవాళ్ళందరూ బాగుందనే అన్నారు !!


Monday, May 9, 2011

Tagore జయంతి ఉత్సవాల కబుర్లు

My love for Tagore is ardent. Reasons are many...may be because of his literary works i have studied in my literature books or because of his 'learnedness' or may be because of his bigger image my lecturers have shown or may be because of the one and only "Geetanjali"...and the reasons get multiplied..!! ఈ ప్రేమతోనే 'సంగీతప్రియ' బ్లాగ్ లో టాగూర్ స్వయంగా పాడిన ఆయన కవితలు, పాటలతో ఒక టపా పెట్టాను.
(http://samgeetapriyaa.blogspot.com/2010/06/tagore.html )


విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 150వ జయంతి ఉత్సవాలను(may 7th) పురస్కరించుకుని "సంస్కృతి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐదు బోగీల ఒక ప్రదర్శన రైలును ఊరూరా చాలా ఊళ్ళలో తిప్పారు. ఆ రైలులో ఆయన జీవిత విశేషాలు, ప్రముఖులతో ఫోటోలు, పైంటింగ్స్, రచనలు..బోలెడు ప్రదర్సనకు ఉంచారు. సికిందరాబాద్ లో ఆ రైలు ఉంచినప్పుడు వెళ్ళి బోలెడు ఫోటోలు తృప్తిగా తీసుకున్నాను. అప్పుడూ టపా రాసాను.(http://trishnaventa.blogspot.com/2010/09/tagores-rare-photos-from.html )


మొన్న ఆయన 150వ జయంతి ఉత్సవాలను ఢిల్లీ, కలకత్తా మొదలైన చోట్ల చాలా ఆర్భాటంగా జరిపారు. ఢిల్లీ లో ప్రధాని, సోనియా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో టాగూర్ రచనల ఆధారంగా విడుదలైన ఆరు సినిమాల డివీడిల పేక్ ను విడుదల చేసారు.

రవీంద్రుని రచనలపై వచ్చిన మిగిలిన సినిమాలు వాటి కబుర్లు, కొత్తగా విడుదలైన డివీడి లోని సినిమాల వివరాలు అన్నీ క్రింద ఉన్న లింక్ లో ఆసక్తిగలవారు చదువుకోవచ్చు.
http://www.nfdcindia.com/tagorestoriesonfilm/gclid=COza1si42qgCFQd66wodmRIgHA


ఈ శోధనలో మరో సంగతి తెలిసింది. టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగా ప్రముఖ బెంగాలి దర్శకుడు Rituparno ghosh తీసిన సినిమా 41వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో ప్రదర్శింపబడింది. అది చూసిన ప్రఖ్యాత హిందీచిత్ర దర్శకుడు Subhash ghai ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేయటానికి అనుమతి పొండారుట. పేరొందిన సుకవి "గుల్జార్"కు సినిమా యొక్క అనువాద బాధ్యతలను అప్పగించారుట. "కష్మకష్" పేరుతో విడుదలవబోతున్న ఆ సినిమాకు గుల్జార్ హిందీలో రాసిన పాటలను చూసి సుభాష్ ఘై మైమరచిపోయాడుట. అంతటి సమ్మోహనాశక్తి మరి గుల్జార్ గారి సిరాలో తప్పకుండా ఉంది. "రైన్ కోట్", "చోఖేర్ బాలి" సినిమాలు చూసాకా ఈ డైరెక్టర్ కి ఫాన్ అయిపోయాను నేను. ఎనిమిది ఫిల్మ్ ఫేర్లు, మరికొన్ని అంతర్జాతియ అవార్డులు తెచ్చుకున్న ఘనత Rituparno ghoshది. మరిక ఆ సినిమా కోసం ఎదురు చూడటమే ప్రస్తుతం నేను చెయ్యగలిగినది.


ఇంకో సంగతి ఏంటంటే టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగానే మన తెలుగులో టి.రామారావు గారు "చరణదాసి"(1956) సినిమా తీసారు. ఎన్.టి.ఆర్, ఏ.ఏన్.ఆర్, సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు మొదలైన హేమాహేమీలు నటించారీ సినిమాలో.అసలు కథకూ ఈ సినిమాకూ కొద్దిపాటి మార్పులున్నట్లున్నాయి. ఇంకో విశేషం ఏమంటే ఈ సినిమాకు మాటలు, రీరికార్డింగ్ విశ్వనాథ్ గారు చేసారు. ఓ ఆన్లైన్ లింక్ దొరికింది. చాలా కాలం క్రితం ఓసారి టీవీలో చూసాను. మళ్ళీ చూడాలి. మీరూ చూసేయండి. ఆ లింక్ ఇదిగో:

http://webcache.googleusercontent.com/search?q=cache:uHL3ls0O37AJ:www.bharatmovies.com/telugu/watch/Charana-Daasi-movie-online.htm+charana+daasi&cd=2&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in



Saturday, May 7, 2011

వి.ఐ.పి లు


సమాజంలో లాగే పనిమనుషుల్లో కూడా మార్పులు వచ్చేసాయి. నమ్మకం, విశ్వాసం అనేవి ఏ కోశానా కనబడట్లేదు ఇప్పటి వాళ్ళలో. నువ్వు కాకపోతే ఇంకోరు అన్న ధీమా వాళ్లది. వాళ్లపై ఆధారపడిన బ్రతుకులు మనవి. ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్ళలో పని మనిషి రాకపోతే ఉండే పాట్లు చెప్పనలవి కాదు. మాకేం పనుమనుషులున్నారనీ ? మేం చేసుకోవట్లేదా? అని వాదిస్తుంది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు. కానీ అలవాటైన ఒక చట్రం నుండి బయటపడటం సులభంకాదు. ఇద్దరమే ఉన్నప్పుడు నేనూ కొన్నేళ్ళు అన్ని పనులూ నేనే చేసుకున్నాను. కానీ పెద్ద కుటుంబంలో ఉన్నప్పుడు అన్నీ చెయటానికి పనిమనిషి సాయం తప్పనిసరి. మన అవసర౦ చూసుకుని వాళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. నైజం మారిపోయింది. కొన్నేళ్ళుగా నాకు తెలిసిన కొందరు పనివాళ్లను గురించి ...వాళ్ళలో వచ్చిన మార్పుల గురించీ...

ఏభై ఏళ్ళ పాటు ఒకటే ఇల్లు నమ్ముకున్న "సముద్రం" :
"సముద్రం" అమ్మా వాళ్ల ఇంట్లో ఏభై ఏళ్ళు పని చేసింది. పేరు భలేగా ఉంది కదా. ఆ ఇంట్లో ఉన్న పురిటి గదికి నర్సు కూడా సముద్రమే. పదిహేనో ఎన్నో పురుళ్ళయితే ఎనిమిది మంది సంతానం మిగిలారు. అందర్నీ సాకి పెద్దచెయటంలో అమ్మమ్మకు ఎంతో సాయంగా ఉండేదిట సముద్రం. తాతయ్యగారింట్లో ఎప్పుడూ బంధుసమూహం కళకళ్ళాడుతూ ఉండేది. అదికాక ఆయన లాయరవటం వల్ల వచ్చేపోయే క్లైంట్లు, కొందరు పొరుగూరు నుంచి వచ్చి భోజనం చేసేవాళ్ళతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేదిట. అందరి పనులూ తనే చూసుకునేదట ఎప్పుడూ నవ్వుతూ ఉండే సముద్రం. పొద్దుటే వచ్చేసి రాత్రికి ఇంటికి వెళ్ళేదట. తాతగారి పదహారు మంది మనవలనూ ఆమె ఆటలాడించింది. ఓపిక నశించి పని చేయలేకపోయేవరకూ వచ్చేదట. సముద్రం గురించి అమ్మ ఎప్పుడూ బోలెడు కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం సముద్రమంటే.

ముఫ్ఫై ఏళ్ళు ఒకే ఇంట్లో పని చేసిన లక్ష్మి:
లక్ష్మిది సణుగుడు స్వభావం. మొగుడు తాగుబోతు. దాదాపు రెండ్రోజులకోసారన్నా తాగొచ్చి చితకబాదుతూంటాడు పెళ్ళాన్ని. ఆర్నెల్లకో మతం మార్చేస్తు ఉంటాడు. ఇంటిల్లిపాది పేర్లనూ కూడా ఆ మతానికి అనుగుణంగా మార్చేస్తూ ఉంటాడు. ఇల్లు గడవటానికి పదిళ్ళలో పాచి పని మొదలెట్టింది లక్ష్మి. కానీ ఏ ఇంట్లోనూ మానకుండా పని చేయటం లక్ష్మికి అలవాటు. చేసే ఇల్లు తన ఇల్లనుకుని పని చేస్తుంది. కాకినాడలో మా మావయ్య ఇంట్లో పని చేసేది. ముఫ్ఫై ఏళ్ల పాటూ అలా చేసింది. ఇల్లు అమ్మేస్తూంటే తన ఇల్లు అమ్మేస్తున్నట్లే బాధపడింది. ఊరు విడిచి వెళ్పోతూంటే తనను మర్చిపోవద్దని కన్నీళ్ళు పెట్టుకుంది .

పదిహేనేళ్ళపాటు పని చేసిన "సరస్వతి" :
విజయవాడలో సూర్యారావుపేటలో మేం ఉన్నన్నాళ్ళు మా ఇంట్లో పని చేసింది. మా ఇంట్లో చేరే సరికే ఏభైఏళ్ళు ఉంటాయి. ఏ రోజూ మానేది కాదు. కుదరకపోతే కూతురుని పంపేది. నాకు పన్నేండేళ్ళు వచ్చేవరకూ తనే. పని అవసరం ఉన్నప్పుడు వాళ్ళింటిదాకా వెళ్ళి సరస్వతిని పిలుచుకు వచ్చేదాన్ని కూడా. ఇంటివాళ్ళు ఆ ఇల్లు అమ్మేసినప్పుడూ అక్కడ ఉంటున్న ఆరువాటాలవాళ్ళం ఇల్లు ఖాళీ చేసాం. వేరే ఏరియాకు వెళ్పోతున్నప్పుడు అంత దూరం నడిచి రాలేనమ్మా అంది పాపం. అప్పటికే చేయలేకపోతోందని అమ్మ కూడా వద్దంది.

పదేళ్ళూ చేసిన "ఐలమ్మ" :
ఐలమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. "ఐలమ్మ" ఓల్డ్ గా ఉండని నేను తనకి "ఐలూ" అని పేరు పెట్టాను. అలానే పిలిచేదాన్ని. మా ఇంట్లో చేరినప్పుడూ తన వయసు పదిహేనేళ్ళు. నేను కాలేజీలో చదివేదాన్ని. ఐలమ్మ తరువాత వాళ్లమ్మకు ఐదుగురు సంతానం. చివరి ఇద్దరినీ తప్ప మిగిలినందర్నీ పనిలో పెట్టేసింది డబ్బుల కోసం అని. ఐలూ ని చదివించమని నేను దెబ్బలాడితే ఖర్చు తప్ప ఏంముందమ్మా? పని చేస్తే మరో నాలుగొందలు వస్తాయి..అనేది. ఎన్నిసార్లు ఐలూని చదివిద్దామని చూసినా దానికి ఏబిసీడీలు వచ్చేవే కాదు. విసుగొచ్చి మానేసాను. ఏది ఇచ్చినా తమ్ముళ్ళ కోసం, చెల్లెలి కోసం ఇంటికి పట్టుకెళ్ళేది, తినేది కాదు. దానికి పెళ్ళి చేస్తే పదిళ్ళ పని పోతుందని వాళ్ళమ్మ చాలా కాలం పెళ్ళి చేయలేదు. ఊరు మారాకా కూడా ఎవరైనా వెళ్తూంటే బట్టలు పంపేదాన్ని. ఇంకా గుర్తున్నానా పాపగారికి అనేదట. ఈ మధ్యన నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళిన రోజున తన పెళ్ళి అని విని చాలా ఆనందించాను.

**** **** ****
ఇక ఇక్కడ్నుంచీ విశ్వాసంగా పని చేయటం అనే మాట మర్చిపొయిన పనివాళ్ళనే చూసాను. మా అత్తగారింట్లో అయితే రెండ్నేల్లకో పనిమనిషిని మారటం చూశాను. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మాకు కుదిరిన పనమ్మాయి ఆహార్యం హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ ఉండేది కాదు. జీన్స్ పేంట్, విరబోసుకున్న జుట్టు, రెగులర్గా కట్ చేసుకునే ఐబ్రోస్ తో అసలు పని చేస్తుందా అని అనుమానం వచ్చేది. కొన్నాళ్ళకు దాన్ని భరించలేక మాన్పించేసి నేనే చేసుకోవటం మొదలెట్టాను.

ఇక మళ్ళీ ఇటు వచ్చాకా కుదిరిన "దుర్గ" మాత్రం బాగా చేసేది. అంత నెమ్మదస్తురలిని ఈ కాలంలో నే చూడలేదు. వాళ్లమ్మాయి "మీనా" గురించి ఓసారి టపా రాసాను కూడా. డిగ్రీ అవగానే మీనాకు ఐదువేల ఉద్యోగం వచ్చింది పెళ్ళీ అయిపోయింది. ఆ ఇల్లు మారాకా మాత్రం మళ్ళీ తంటాలు మొదలు. ఇప్పుడు మాకు చేసే పనమ్మాయి కూడా విసిగిస్తుంది. పని వచ్చు కానీ బధ్ధకం. సరిగ్గా చేయకపోయినా ఏం అనకూడదు. ఎక్కువ పని చెప్పకూడదు. ఎంతసేపూ ఏం తీసుకుపోదాం అన్న దురాశే. ఇచ్చినది తీసుకుంటూ ఇంకా అది ఇస్తారా? ఇదిస్తారా అని అడిగితే ఇచ్చేది కూడా ఇవ్వాలనిపించదు. మానేస్తే చెప్పి మానేయదు. వస్తుందో రాదో తెలీక మహా ఇబ్బందిగా ఉంటుంది. రాకపోతే చెప్పి మాను అంటే వినదు. ఒక్కరోజు జ్వరం పనివాళ్ళకే ఎందుకు వస్తుందో నాకస్సలు అర్ధం కాదు.

ఇక అమ్మావాళ్ళకు చేసే "లక్ష్మమ్మ" ది ఒక పెద్ద కథ. లక్ష్మమ్మకు ఏభై ఐదు పైనే వయసు. తల్లికి తండ్రి తాలూకూ పింఛను వస్తుందని తల్లిని దగ్గర బెట్టుకుని సేవ చేస్తుంది. ముగ్గురు కూటుళ్ళకు పెళ్ళిళ్ళూ చేసింది. ముగ్గురివీ మూడు కథలు. తను అమ్మావాళ్ళింట్లో పనికి కుదిరినప్పుడు పెద్దమ్మాయి గొడవ చేసిందని దానికి అమ్మావాళ్ళఇల్లు అప్పజెప్పింది లక్ష్మమ్మ. దానికి ఎంత సేపూ డబ్బు ఆశే. నెల తిరిగేసరికీ జీతం డబ్బుల్లో పావు వంతైనా మిగలదు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే పని మానేస్తుంది. ఏవో గొడవలతో అది మానేసింది. ఇప్పుడు దాని చెల్లెల్లు వస్తోందిట పన్లోకి. దానికి చేతివాటుతనం ఉందట. జాగ్రత్తగా చూడకపోతే అంతే సంగతులు. పది రోజులొస్తే వారమ్ రోజులు మానేస్తుందిట. గట్టిగా దెబ్బలాడితే ఆ దిక్కూ ఉండదని నోరు మూసుకోవటం. ఓపిక తగ్గిపోయి చేసుకోలేని అమ్మ అవస్థలు చూడలేక మనసు చివుక్కు మంటుంది.

అడిగినంతా ఇస్తారులే. ఎవరి కోసం అన్న ధీమా ఇవాళ్టి పనివాళ్ళది. ఈ వీ.ఐ.పీ లను కాదని గడుపుకోలేని నిస్సహాయత మనది.

Thursday, May 5, 2011

మంత్రిగారి వియ్యంకుడు(1983)


బాపు సినిమాల్లో బాగా ప్రజాదరణ చెందిన చిత్రాల కోవకు చెందుతుంది "మంత్రిగారి వియ్యంకుడు(1983)". చిరంజీవి విజయ చిత్రపరంపరలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. "రుద్రవీణ", "చంటబ్బాయ్"ల తరువాత నాకు నచ్చే చిరంజీవి సినిమా ఇది. చెప్పదలుచుకున్న సందేశానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకులకు అందించటం బాపు సినిమాల్లోని ప్రత్యేకత. మానవ సంబంధాలనూ, స్నేహాలనూ డబ్బుతో వెలకట్టలేమన్నది ఈ చిత్రం ఇచ్చే సందేశం. పాత్రల వ్యక్తిత్వాలను కాస్తంత హాస్య రసంలో ముంచి దుష్టపాత్రలను కూడా మనం నవ్వుతూ చూసేలా చెయ్యగలిగారు బాపురమణలు.

ఇక చిత్రానికి ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని గురించి పొగడటానికి మాటలు చాలవు. కెరీర్లో హై పీక్ లో ఉన్నప్పుడు చేసిన పాటలవటం వల్ల వినటానికి ఎంత బావుంటాయో అన్ని పాటలూ. ప్రతి పాటా మళ్ళీ మళ్ళీ వినాలనేలాగ ఉంటుంది. "ఏమనినే మరి పాడేదనో" పాట నాకు అన్నింటికన్నా ఇష్టం. ప్రతి పాటకూ కథకు అనువైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. పాటల్లోని ఏ వాక్యమూ బాలేదని అనిపించదు.  ఈ సినిమా వెరైటీ టైటిల్స్ ఓసారి చూసేయండి. టైటిల్స్ లో తులసి, సుధాకర్ ల జంటను కుదిర్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి.



కథ చాలా మామూలుదే. స్వశక్తితో బాగా డబ్బు గడించిన కొబ్బరికాయల సుబ్బారాయుడనే(అల్లు రామలింగయ్య) వ్యక్తి ఎవరి సాయంతో పైకి వచ్చాడో మర్చిపోతాడు. తాను దాటి వచ్చిన పేదరికాన్నే అసహ్యించుకుంటాడు. తన డాక్టర్ కొడుకుని మంత్రిగారి అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేసి తాను "మంత్రిగారి వియ్యంకుడు" అయిపోవాలని ఆశ పడతాడు. ఆ ఆశలను వమ్ము చేస్తూ అతని కొడుకు శివ(శుభలేఖ సుధాకర్) నర్స్ సుశీల(తులసి)ని ప్రేమిస్తాడు. సుశీల తన పాత మిత్రుడు, గడ్డు కాలంలో సాయం చేసినవాడు అయిన రావులపాలెం రామభద్రయ్య(రావికొండలరావు) కుమార్తె అని తెలిసి కూడా సుశీల తల్లిదండ్రులను పిలిపించి అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సుశీల తల్లి అన్నపూర్ణమ్మ(నిర్మలమ్మ) సుబ్బారాయుడిని డబ్బు మదంతో విర్రవీగటం అనర్ధాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తుంది.కాలేజీలో రామభద్రయ్య కుమారుడు బాబ్జీని(చిరంజీవి) అవమానించాలని ప్రయత్నించి తానే అవమానపడుతుంది సుబ్బారాయుడి కుమార్తె అనురాధ(పూర్ణిమా జయరాం). మెల్లగా జగడాలు ప్రణయాలుగా మారతాయి. అన్నపూర్ణమ్మను ఎన్నికలలో నిలబెడతాడు బాబ్జీ. చివరికీ అంతా కలిసి కొబ్బరికాయల సుబ్బారాయుడికి ఎలా బుధ్ధి చెప్పారు? రెండు జంటల పెళ్ళిళ్ళు అవుతాయా అన్నది మిగిలిన కథ.


బిచ్చగాడికి నోట్లు ఇస్తున్నట్లు అల్లురామలింగయ్య ఫోటో తీయించుకునే సీన్లో పూర్ణిమా జయరాం వచ్చి "వాడ్ని జైల్లో వేయించేయ్..ఉరి తీయించెయ్.." అంటే ఎవరని కూడా అడక్కుండా పోలీస్ అల్లుడైన రాళ్లపల్లితో అవే మాటలు చెప్పే సీన్ భలే ఉంటుంది. కాలేజీలో "ఆ కాయను బేన్ చేసారు కదా" అంటూ చిరంజీవి హీరోయిన్ ను ఏడిపిస్తూ చెప్పే డైలాగులు, చిరంజీవిని డిస్మిస్ చేయించినప్పుడు పాడే పాట హాస్యంగా ఉంటాయి. "పది లక్షల రూపాయిల కోసమే గోయిందా సకల పాపాలు చేసావు గోయిందా" అంటూ చివర్లో నూతన్ ప్రసాద్ పాడటం, రాళ్లపల్లి డైలగులు, అల్లు రామలింగయ్య నటన హాస్యరసాన్ని ప్రవహింపజేస్తాయి. "డబ్బు జేసి", "క్రిందపడ్డా పై చేయి నీదేనంటావు?" మొదలైనవి పక్కా రమణ మార్కు డైలాగులు.

నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి ఇద్దరికీ కూడా మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. శ్రీలక్ష్మికి ఈ సినిమాలో పెద్దగా పాత్ర లేదు. కప్పల అప్పారావు పాత్రలో సత్యనారాయణది కూడా మితమైన పాత్రే. ఎక్కువగా మళయాళ, తమిళ చిత్రాలు, తెలుగులో బహుశా ఈ ఒకటే చిత్రం చేసిన కేరళకుట్టి పూర్ణిమా జయరాం ప్రఖ్యాత తమిళ దర్శక నిర్మాత, నటుడు, రచయిత భాగ్యరాజ్ ను వివాహం చేసుకున్నారు. వారి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ సినీప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  అప్పటికే ప్రఖ్యాత నటుడైపోయిన చిరంజీవి అభినయంలో స్టార్ మార్క్ స్టైలిష్ నటన ప్రతి ఫ్రేంలోనూ కనబడుతుంది. అయినా ఎక్కడా అతిగా కనబడదు. అది బాపూ దర్శకత్వ ప్రతిభ.


పాటలు:
అన్నిపాటలకూ సంగీతం  ఇళయరాజా. సాహిత్యం వేటూరి. కొన్ని వీడియో లింక్స్ దొరికాయి చూసేయండి.

1) "మనసా శిరసా నీ నామము పాడేద ఈ వేళా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
పాట లో గిటార్ వాడిన తీరు అద్భుతం.




2) "మనకు దోస్తి ఒకటే ఆస్తిరా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట బాలు హిట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చరణాలను పాడిన తీరు చాలా బావుంటుంది.




3) "ఛీ ఛీఫో పాపా "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


4)"కొలువైనాడే ఊరికి కొరివైనాడే "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


5) ఏమనినే పాడేదనో.."
జానకి,బాలు ఇద్దరూ ఈ పాటకు నూరుపాళ్ళు న్యాయం చేసారనిపిస్తుంది. అంత బావుంటుంది ఈ పాట.





6) "అమ్మ కదే బిజ్జి కదే నాపై కోపమా"
పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.హీరోని మచ్చిక చేసుకునే నేపథ్యంలో వచ్చే ఈ పాటలో పూర్ణిమా జయరామ్ వేసుకున్న వైట్ కలర్ స్కర్ట్ చాలా బావుంది. పాటకు వంద డ్రస్సులు మార్చే సినిమాటిక్ పాటలా కాక ఒకే డ్రెస్ తో పాటంతా తీయటం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది.

7) "సల సల నను కవ్వించనేల" పాట పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్ ల ప్రోత్సాహంతో రెండు జంటలు పాడుకునే ఈ పాట కూడా సరదా అయినదే.

నా మాట: తీరికవేళల్లో తాపీగా కూర్చుని హాయిగా నవ్వుకోవటానికి వీలున్న మంచి సినిమా.

Wednesday, May 4, 2011

మామ్మయ్య - ఊరగాయలు !


 
మా మామ్మయ్య(నాన్నమ్మ) పెట్టే ఊరగాయల గురించి చెప్పేముందు ఆవిడ పాకప్రావీణ్యం గురించి కొంచెం చెప్పాలి. ఆవిడ చేతిలో అద్భుతం ఉండేది. ఏది వండినా రుచి అమోఘమే. ఆవిడ అత్తారింట్లో ప్రతిరోజూ పాతిక మందికి తక్కువకాకుండా వండేదిట. అది కూడా మడి వంట. ఇక పండగలు తద్దినాలు వస్తే వంటింట్లోనే మకాం. ఆవిడ కొబ్బరి పచ్చడి రుబ్బుతూంటే రోట్లో ఉండగానే సగం పచ్చడి అయిపోయేదిట.(అలా తినేసేవారట అటుగా వచ్చినవాళ్ళు). పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట.

ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి. రోజంతా మిల్లాడిస్తూ ఉండండి అని మా మావయ్య జోక్ చేసేవాడు. ఇదంతా మామ్మయ్య పాకప్రావీణ్యం గురించి చెప్పటానికే. ఇక వేసవిలో ఊరగాయల సంగతికొస్తే ఆ రకం పెట్టినా అన్నీ సమపాళ్ళలో కుదిరేవి. ఆవీడ పెట్టినన్ని ఊరగాయల రకాలన్నీ తినగలగటం మా పిల్లల అదృష్టం.


కాకినాడలో మా ఇంట్లోని వంటింట్లో ఓ మెష్ డోర్ ఉన్న గూడు ఉండేది. దాన్నిండా చిన్నవి, పెద్దవి రకరకల సైజుల్లో జాడీలు ఓ ముఫ్ఫై పైనే ఉండేవి. ఆ జాడీల ఆకారాలు కూడా రకరకాలుగా ముద్దుగా ఉండేవి. గుర్తు కోసం నేనో రెండు జాడిలు తెచ్చుకున్నాను కూడా. మాకు నెల నెలా సామర్లకోట నుండి పప్పు నూనె తెచ్చే ఆదినారాయణ ఊరగాయలు పెట్టే సమయానికి సైకిలు మీద ఫ్రెష్ పప్పు నూనెతో వచ్చేసేవాడు. మా పిన్నివాళ్ల అత్తగారు అయితే ఊరగాయలకు మావిడికాయలు చెట్టు నుండి దగ్గరుండి మరి కోయించుకునేవారు మొన్నమొన్నటిదాకా. పప్పునూనె కూడా గానుగలో దగ్గరుండి ఆడించుకునేవారు.


ఇక నాన్న ఆవకాయలకు ముక్కలు కొట్టేవారు. ఇంట్లోని మహిళలేమో మాగయకు తరిగగేసేవారు. అటు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా రానిచ్చేవారు కాదు. మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది. దాంతో మావిడికాయను చెక్కితే మాగాయకు ముక్కలు వచ్చేవి.(ఇప్పటి పీలర్ లాగన్నమాట). పెరట్లోనేమో పనమ్మాయి లక్ష్మి తాలూకూ కొందరు ఆడవాళ్ళు వచ్చి కారం కొట్టేవారు. ఆ రోకళ్ళ చప్పుడు భలేగా ఉండేది. అటువైపు అసలు వెళ్లనిచ్చేవారు కాదు ఘాటుకి తుమ్ములు వస్తాయని. వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే వొలుచుకునేవారు.



ఇక మా మామ్మయ్య పెట్టే ఆవకాయ రకాలు ఏమిటంటే:

1) వెల్లుల్లి ఆవకాయ
2)ఉత్తి ఆవకాయ (వెల్లుల్లి తిననివాళ్ళ కోసం)
3)పులిహార ఆవకాయ (కావాల్సినప్పుడల్లా కాస్తంత తీసుకుని పులిహోర పోపు పెట్టుకుంటారు)
4)అల్లం ఆవకాయ (దీంట్లో అవపిండి ఉండదు)
4)పచ్చావకాయ (పచ్చ మెరపకాయలతో పెడతారు)
5)పెసర ఆవకాయ (దీంట్లో అవపిండి బదులు పెసరపిండి వాడతారు)
6)బెల్లం ఆవకాయ
7)సన్న ఆవాల ఆవకాయ (ప్రత్యేకం సన్న ఆవపిండితో పెడతారు.ఘాటు ఎక్కువగా ఉంటుంది)
8)శనగల ఆవకాయ (ఎండిన శనగలు వెస్తారు. కొన్నాళ్ళకు అవి ఊరి తినటానికి బావుంటాయి)
9)నువ్వుపిండి ఆవకాయ(దీంట్లోనూ అవపిండి బదులు నువ్వుపిండి వాడతారు)
10)మావిడి పిందెలతో అవకాయ (కేరళావాళ్ళు ఎక్కువ చేస్తారు దీన్ని)

మాగాయ రకాలు:
1)నూనె మాగాయ
2) తొక్కు మాగాయ
3) ఎండు మాగాయ
4)తురుము మాగాయ/ కోరు మాగాయ
5)ఉల్లిమాగాయ(వెల్లుల్లి తో)

ఇవి కాక మెంతిపిండి ఎక్కువ వేసి చేసే
* మెంతికాయ
* చెంప మెంతికాయ ఆవిడ స్పెషల్స్.


ప్రతి ఏడాదీ ఈ రకాలన్నీ చెయ్యకపోయినా ఒకో ఏడూ వీటిలో సగం పైనే కవర్ చేసేది మామ్మయ్య. నెమ్మది నెమ్మదిగా ఓపిక తరిగేకొద్దీ రకాలూ తగ్గి రెండు,మూడు రకాలు మాత్రమే పెట్టే స్టేజ్ కి వచ్చేసింది చివరిరోజుల్లో.


మా ఇంట్లో ఆవకాయ తినటం తక్కువవటం వల్ల అమ్మ ఎప్పుడు ఇన్ని రకాలు ప్రయత్నించలేదు. ఇప్పుడిక డాక్టర్లు ఊరగాయలు తినద్దంటున్నారని అసలు పెద్ద ఎత్తున ప్రయత్నాలే లేవు. ఏదో శాస్త్రానికి నాలుగైదు రకాలు పెడుతోంది మా పిల్లల కోసం. మేము కూడా డైట్ కంట్రోల్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అంటూ చాలావరకూ ఊరగాయలకు దూరంగా ఉండిపోతున్నాం. తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను.

Tuesday, May 3, 2011

"Herbvia" ( Herbal Stevia Sweetner)


వచ్చేసింది వచ్చేసింది "Herbvia". i.e Herbal Stevia Sweetner. "Stevia"(http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_05.html) గురించి అదివరకూ రాసాను.


ఆ మధ్యన ఒక హెర్బల్ ఎగ్జిబిషన్ లో స్టివియా పౌడర్ వచ్చింది అని చూశాను. కానీ ఎక్కడ దొరుకుతుందో వివరాలు అడగటం మర్చిపోయాను. నిన్న బజార్లో ఓ సూపర్ మార్కెట్లో స్టీవియా పౌడర్ కొందామని వెళ్ళేసరికీ ఈ Herbvia చూశాను. చుట్టూ మనుషుల్లేకపోతే హుర్రే అని అరిచే మాటే. నేను మూడేళ్ల నుంచీ పంచదార బదులు స్టీవియా పౌడర్ కొని వాడుతున్నాను. కానీ అది సమపాళ్ళలో మరిగించుకుని, పది గంటల తరువాత వడబోసి దాచి వాడటం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. కానీ నేచురల్ స్వీట్నర్ అని మిగిలిన artificial sweetners కన్నా నేను దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.


ఇప్పుడు ఇక మరిగించుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ Herbvia పిల్స్ వాడేయచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లకైతే స్టీవియా చాలా మంచిది. చాలామంది ఆర్టిషియల్ స్వీట్నర్స్ వాడలేక పంచదార లేకుండా ఏదీ తినలేక తాగలేక ఇబ్బంది పడుతూంటారు. అలాంటివారికి ఇది వరమనే చెప్పాలి. పైగా ఎక్కువకాలం artificial sweetners వాడటం వల్ల ఎన్నో ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సుగర్ ఫ్రీ స్వీట్స్ అని బజార్లో అమ్మేస్తూ ఉంటారు. వాటిల్లో వాడే artificial sweetners డయాబెటిస్ వాళ్లకు ఎంతో హాని చేస్తాయి.

* ఇవి మెదడు మీద ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తాయి.

* గర్భవతులు వీటిని వాడితే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* ఇవి బ్లడ్ సుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయ్యలేవు.

ఇవి కేవలం artificial sweetners యొక్క కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు మాత్రమే. స్టీవియాలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స ఏవీ ఉండవు. ఈ స్టీవియాతో తయారు చేసిన Herbvia లో కూడా స్టీవియా పౌడర్ కున్న సుగుణాలే ఉన్నాయా లేవా అన్నది ఇంకా నేను ధృవీకరించుకోవాల్సి ఉంది. కానీ జనాలు ఎక్కువగా వాడే ఏస్పర్టేమ్, సర్కోస్ లాంటి artificial sweetners కన్నా డెఫినేట్ గా Herbvia నయం అని చెప్పవచ్చు.

Monday, May 2, 2011

పాటల్లో చెత్త ఉపమానాలు


నిన్న పొద్దుటి ఊసు. ఆదివారం కదా వాకింగ్ కి బధ్ధకంగా బయల్దేరా. అంటే లేటుగా అన్నమాట. అన్ని Fms లోనూ భక్తిగీతాలు అయిపోయి సినిమా పాటలు మొదలైపోయాయి. ఇదీ బానే ఉందనుకుంటూ వింటూ నడుస్తున్నా. రోబోలోని ఓ హిట్ సాంగ్ మొదలైంది. ఈ పాట ఎలా హిట్టయ్యిందో జనాలే చెప్పాలి. చరణంలో ఏ వాక్యానికీ పొంతనలేదు. ఈ డబ్బింగ్ పాటలు పాడేవాళ్ళు చాలామటుకు తెలుగువాళ్ళు ఉండరు (తెలుగువారు కాకపోయినా తెలుగు వచ్చినవాళ్ళూ ఉంటారు). మరి తెలిసో తెలీకో ఇచ్చిన సాహిత్యాన్ని శ్రధ్ధగా పాడేస్తారు పాపం... వినే మన ఖర్మకి మనల్ని వదిలేసి.

ఇంతకీ ఇందాకటి రోబో పాటలో చిన్మయి అనుకుంటా "తేటగ ఉన్న దూటనయ్యో నన్ను నోటబెట్టెయ్ మొత్తం" అని పాడింది. ఓరి భగవంతుడా ఇదేం ఉపమానం తండ్రీ అనుకున్నా. పచ్చి దూట ఎవరన్నా కరకర నమిలి తినగలరా అసలు? తమిళంలో ఈ పాటలో ఈ వాక్యం ఇలానే ఉందో మరి ఏమన్నా మార్పులున్నాయో...లేక ఇది అనువాదకుల ప్రతిభో మరి తెలీదు. ఇలాంటి భయానక ఉపమానాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసిన పాటల్లోనే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి.

వెంఠనే నాకు "బాయ్స్" సినిమాలో పాటలోని ఓ వాక్యం గుర్తుకొచ్చింది. సాధనా సర్గమ్ పాడుతుంది "కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం.." అంటూ. నిఘంగా ఆవిడకు ఆ వాక్యం అర్ధం తెలిస్తే ఆ పాట పాడేదా? అని డౌటొచ్చేది నాకు ఆ పాట ఎక్కడైన విన్నప్పుడల్లా.
ఎంత గాఢప్రేమికులైతే మాత్రం కుళ్ళిపోయిన పండులో పురుగులతో పొలికా? వాక్యాలకు పొంతన లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త కంపారిజన్ లు ఎందుకు వాడతరో...తెలీదు.

'దేషం', 'ఆష', 'ఆకాషాలు' అని పాడుతూంటే చచ్చినట్లు వింటున్నాం. అవికాక ఇలాంటి
ఘోరమైన వాక్యాలు డబ్బింగ్ పాటల్లో కోకొల్లలుగా వస్తున్నా ఆదరించేస్తున్నాం. అయినా చేసేవారు చేస్తున్నారు, రాసేవాళ్ళు రాస్తున్నారు, వినే మనం వినేస్తున్నాం.


మీకూ గుర్తున్న ఇలాంటి చెత్త కొంపారిజన్లు ఏమన్నా ఉంటే తెలపండి...

Thursday, April 28, 2011

దమ్మున్న సినిమానే !


సినిమాకు ఓ హీరో, ఓ హీరోయిన్ తప్పక ఉండితీరాల్సిన అవసరం లేదు. ఓ కథనో , ఓ సమస్యనో, నచ్చిన కాన్సెప్ట్ నో తీసుకుని, దానిని తెరపై ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్రీకరించగలిగితే చాలు. అది మంచి సినిమా అనిపించుకుంటుంది. అలాంటి సినిమాల్లో ఉండేవి కొన్ని ముఖ్య పాత్రలు మాత్రమే. వాళ్ళు మామూలు హీరో హీరోయిన్లలా ఉత్తమ లక్షణాలు కలిగి ఉండరు. మామూలు మనుషుల్లానే కాస్తో కాస్త కంటే ఎక్కువో బలహీనతలు కలిగి ఉంటారు. అటువంటి పాత్రల ద్వారా దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తెరపై చూపగలుగుతాడు. కాకపోతే ఇలాంటి సినిమాలు (హీరో, హీరోయిన్ లేకుండా) తియ్యటానికి కాస్తంత ధైర్యం కావాలి.

గోవా లో బలమైన పట్టు ఉన్న ఒక డ్రగ్ డీలింగ్ ముఠాను పోలీసులు ఎలా అంతం చేయగలిగారు అన్న కథను సరళంగా తెరకెక్కించారు "Dum maaro dum" దర్శకులు రోహన్ సిప్పీ. ఎటువంటి అంతుపట్టని మిస్టరీ లేకున్నా, ప్రేక్షకులకు భయాందోళనలు కలగకున్నా, పూర్తిగా ఉత్కంఠభరితంగా లేకున్నా కూడా సినిమా చూసినవాళ్లతో 'బాగుంది' అనిపించగలగటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. తమ వంతు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించగలిగిన ముఖ్య నటులకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. "ప్రీతమ్" అందించిన సంగీతం కూడా చిత్రవిజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇతని బాణిలన్నీ బాగుంటాయి. ఈ చిత్రంలో సునిధీ చౌహాన్ పాడిన పాట చాలా నచ్చేసింది నాకు. "జానా హై", "జియే క్యూం" కూడా బాగున్నాయి.

ఇక చిత్ర కథలోకి వచ్చేస్తే గోవా లో ఒక డ్రగ్స్ ముఠా. అమాయకులైన "లోరీ"(ప్రతీక్ బబ్బర్) లాంటి కుర్రాళ్ళు వాళ్ళ వ్యాపారంలో పావులు. డిజె జాకీ(రానా దగ్గుపాటి) ప్రేమికురాలైన జోయ్ (బిపాషా బసు) కూడా ఆ డ్రగ్స్ ముఠా నాయకుడు బిస్కుట్(ఆదిత్య పాంచోలి) గూటిలో చిక్కుకుపోయి ప్రేమికుడికి దూరం అయిపోతుంది. ఏ.సి.పి.విష్ణు కామత్ కు ఆ ముఠాను పట్టుకునే పనిలో ఉంటాడు. ఈ ముఖ్య పాత్రధారులందరికీ కూడా తమ తమ బలహీనతలు ఉంటాయి. అందువల్ల చిక్కుల్లో పడతారు వారంతా. ఓ కుట్రలో భాగమై పోలీసుల చేతికి చిక్కిన లోరీ చివరికి నిర్దోషిగా నిరూపించబడతాడా? జాకీ తన ప్రేమికురాలైన జోయ్ ని మళ్ళీ కలుసుకోగలుగుతాడా? బిస్కుట్ ఆటలు అడ్డుకోవటంలో ఏ.సి.పి.విష్ణు కామత్ సఫలమౌతాడా? అన్నది మిగిలిన కథ. ఉత్కంఠత లేకుండా ప్రేక్షకుని ఊహానుగుణంగా సాఫీగా సాగిపోయే ఈ చిత్రకథను సస్పెన్స్ థ్రిల్లర్ అనలేము. అలాగని డ్రామా అనీ అనలేము. కానీ కథనం, చిత్రీకరణ రెండు సినిమాకు బలాన్ని అందించాయి. చివరిదాకా బోర్ ఫీలవకుండా చేసాయి.

లోరీగా ప్రతీక్ బబ్బర్ నటనలో ఏ లోటూ కనబడదు. తల్లి స్మితా పాటిల్ నటనా కౌశల్యం అతని ప్రతి ఫ్రేం లోనూ కనబడుతూ ఉంటుంది. కానీ ఇతను ఇక ఇలాంటి కేరెక్టర్ రోల్స్ వదిలేసి ఏదైనా సీరియస్ సింగిల్ రోల్ లో నటిస్తే బాగుంటుంది. లేకపోతే ఇలా కేరెక్టర్ ఆర్టిస్ట్ ముద్ర వేసి పక్కన పెట్టేయగలరు మన సినీ పెద్దలు. "హమేషా", "యస్ బాస్" మొదలైన చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ వేసి మెప్పించిన ఆదిత్య పంచోలి "బిస్కుట్" పాత్రలో కూడా తనదైన ముద్ర వేసాడు.





" Tu " అనే పాప్ సాంగ్ తో ఒకప్పుడు హంగామా సృష్టించిన మోడల్ బిపాషా ఇవాళ ఒక అగ్ర నటి. చాలామంది కుర్రాళ్ళ ఆరాధ్య దేవత. నా దృష్టిలో ఈమె అందం, అభినయం రెండూ ఉన్న మరొక అదృష్టవంతురాలు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయాన్ని అందించింది. బిపాషా కళ్ళు చాలా ఎక్స్ప్రేసివ్ గా ఉంటాయి.

ఈ మధ్యన చెప్పుకోదగ్గ హిట్స్ లేని అభిషేక్ కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. అంతకు ముందు రోహన్ తీసిన రెండు సినిమాల్లో కూడా అతని మిత్రుడైన అభిషేక్ బచ్చన్ నటించాడు. Om jai jagadish, Yuva, bluff master, Guru, Dhoom series, Paa, Delhi-6 మొదలైనవి నాకు నచ్చిన అభిషేక్ సినిమాలు. ముఖ్యంగా "గురు"లో అతని నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. అంచలంచెలుగా పరిణితి చెందుతూ ఎదిగిన నటుడతను. పాత్రల్లో బాగా లీనమయ్యే గుణమున్న ఇతడు "Dum maaro dum" లో ఏ.సి.పి.విష్ణు కామత్ గా కనిపిస్తాడు. కానీ చివరిలో ఇతగాడిని ఎందుకు చంపేయాలి? పక్కవాడి మోసాన్ని కనిపెట్టి బ్రతికేసినట్లు చూపెట్టొచ్చు కదా అని నటుడిపైని అభిమానం ప్రశ్నించింది. "రానా" పాత్రను ఎలివేట్ చేయాలన్న ప్రయత్నమేమో మరి..!

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన తెలుగువాడైన రానా సంగతి. టిపికల్ తెలుగు హీరో లక్షణాలు ఏ మాత్రం కనబడని రానా ఈ హిందీ చిత్రంలో బాగా ఇమిడిపోయాడు. మొదటి సినిమాతోనే బిపాషాతో లింక్ కట్టేస్తు వచ్చిన వార్తలు ఇతని పవర్ఫుల్ ఇమేజ్ ను తెలుపుతాయి. ఎక్కువ పాత్ర లేకున్నా, ఇచ్చిన మేరకు సమర్ధవంతంగా మరిన్ని మంచి పాత్రలు లభిస్తే బాలీవుడ్ అతని మొదటి ఆస్థానంగా మారిపోవచ్చు. రాబోతున్న తెలుగు సినిమాతో అతని భవిష్యత్తుని మన ప్రేక్షకులు ఎలాగూ నిర్ణయిస్తారు..:)

చివరిగా సినిమాలో నాకస్సలు నచ్చని రిమిక్స్ పాట గురించి తప్పక చెప్పాలి. అసలూ...అసలూ...అసలూ...వాటి మానాన వాటిని వదిలేయ్యక పాత పాటల్ని రీమిక్స్ ఎందుకు చేస్తారు? తెలుగైనా, హిందీ అయినా రిమిక్స్ లంటే ఒరిజినల్స్ పాటలను ఖూనీ చెయ్యటమే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఎవడిక్కావాలి? "దమ్మారో దమ్.." అంటూ జీనత్ చేసిన చిన్నపాటి ఊపుకి యావద్దేశం ఓ ఊపు ఊగింది. ఇప్పటికీ అంతే. కానీ ఈ కొత్త రీమిక్స్ ను చూస్తూంటే అసహ్యం కలిగింది. "జుగుప్స" అంటారే అలాంటి భావన కలిగింది. ఏదైనా శృతిమించితే కలిగేది వికారమే. అందం, అభినయం ఉన్నా కూడా సరైన సినిమాల్లేక తెరమరుగైన హీరోయిన్ల జాబితాలోకి వచ్చేస్తుందేమో ఇక దీపిక. "ఓం శాంతి ఓం" లో ఈమెను చూసి వహీదాలాగ ఉంది పైకొస్తుందేమో అని ఆశపడ్డాను.

సినిమా మధ్యలో ఓచోట లోర్నా పాటలనుకుంటా వినిపిస్తాయి. ప్రఖ్యాత గోవన్ గాయని "లోర్నా" వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉండి తను పాడిన పాటలు చాలా బాగుంటాయి. టైటిల్ సాంగ్ లో ప్రచారం చేసినంత దమ్ము లేకపోయినా పట్టుసడలని కథనంతో, పాత్రధారుల ఉత్సాహవంతమైన నటనతో నా దృష్టిలో దమ్మున్న సినిమానే అనిపించుకుంది "Dum maaro dum". ఓసారి చూసేయచ్చు.



Wednesday, April 27, 2011

nearly Perfect !!

కొత్త సినిమాను ఒక్కసారే భరించటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చాలా రోజుల తరువాత ఓ కొత్త సినిమా మళ్ళీ చూద్దామనిపిస్తోంది. గత వారంలో చూసిన రెండు కొత్త సినిమాలు బాగున్నాయనిపించాయి. వాటిల్లో నాకు రెండవసారి చూడాలనిపిస్తున్నది nearly Perfect అనిపించిన "Mr.Perfect". నేనీ సినిమా చూడ్డానికి రెండు కారణాలు.
ఒకటి - బాగా నచ్చిన మూడు పాటలు.
రెండు - కాజల్.



అసలీ సినిమా పేరు Mr.Perfect కాకుండా Miss.Perfect అని పెడ్తే బాగా సరిపోయేదేమో. ఆ అమ్మాయి పాత్ర అలా ఉంది. "చందమా" సినిమా చూసినప్పుడే నాకు బోల్డంత నచ్చేసింది ఈ అమ్మాయి. తప్పకుండా పైకి వస్తుంది అనుకున్నా. ఆ సినిమాలో ఈ అమ్మాయిని చాలా అందంగా చూపించారు. ముక్కు కొంచెం వంకర అనిపించినా, ఈ అమ్మాయికి అదృష్టవశాత్తు కాలం కలసివచ్చి మంచి పాత్రలు లభించి త్వరగానే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ("అదృష్టవశాత్తు" అని ఎందుకు అన్నానంటే అభినయం, అందం అన్నీ ఉన్నా రావాల్సినంత పేరు రాక ఉనికి కోల్పోయిన వారెందరో ఉన్నారు.) చాలా వరకు అభినయానికి అవకాశం ఉన్న పాత్రలే రావటం కూడా కాజల్ కు కలిసివచ్చింది. కాస్తంత ఒళ్ళుగా ఉంటే ఇంకా అందంగా, పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ అమ్మాయి.

ఇక ఈ చిత్రం ఓ అద్భుతమైన సినిమా ఏమీ కాదు. మొదటి భాగం మధ్యలో స్లో అయినట్లు కూడా అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్లు కూడా ఉన్నాయి. కానీ మంచి కాన్సెప్ట్, చక్కని కథనం, పాత్రల్ని మలిచిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. ముఖ్యంగా కథలో మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం బాగుంది. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావాల్సినది అభిరుచులు కలవటమా? ఒకర్నొకరు అర్ధంచేసుకోవటమా? రాను రాను మనుషుల మధ్యన అనుబంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? ఒక బంధం కలకాలం నిలవాలంటే ఏం చెయ్యాలి? మన ఆనందం గొప్పదా? పదిమందికి సంతోషం కలిగించటం గొప్పదా? మొదలైన ప్రశ్నలకు సంతృప్తికరంగా ప్రేక్షకులను సమాధానపెట్టగలిగారు దర్శకులు.

"ప్రేమ అంటే ఇద్దరు కలిసి ఒక మంచి కాఫీని తయారుచేసుకోవటం", "మనం కాస్త ఎడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన చుట్టు చాలామంది మిగిలిఉంటారు" "మన సంతోషం కన్నాఇతరులను ఆనందపెట్టడంలోనే ఎక్కువ తృప్తి లభిస్తుంది" "ప్రేమంటే ఎదుటిమనిషి కోసం జీవించటం" మొదలైన ఎన్నో డైలాగ్స్ మనసును తాకుతాయి. పెళ్ళి విషయంలో ఒకేలాగ ఆలోచించే ఇద్దరు మనుషులు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారన్నది కేవలం అపోహ. ఒకర్నొకరు అర్ధం చేసుకోగలిగితే భిన్న ధృవాలైన ఇద్దరు మనుషులు కూడా సంతోషంగా ఉండగలరు అన్నది సినిమా అందించిన సందేశం. ఏక్షన్, సస్పెన్స్, ఓవర్ ఎక్స్పోజింగ్, హింసలతో కాక ప్రేక్షకుల మనసులను సెంటిమెంట్ తో దోచారీ సినిమా కధకులు. క్లీన్ అండ్ నీట్ మూవీ అని కూడా అనొచ్చు. అందుకే nearly Perfect అనిపించింది.

ప్రభాస్ నటన, రూపం అన్నీ బాగుంటాయి కానీ పాపం ఇతనికి గ్లామర్ పాళ్ళు కాస్తంత తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో బాగా చేసాడు. అతని డైలాగ్ డెలివరీ బాగుంటుంది. కాస్తంత ఎక్కువ గ్లామరస్ గా ఉండి ఉంటే మహేష్ బాబుకి పోటీ అయిపోయేవాడనిపిస్తుంది నాకు. గతంలోని రకరకాల ఎక్స్పరిమెంటల్ రోల్స్ చూసిన తరువాత ఈ సినిమాతో ఇతన్ని కుటుంబ కథాచిత్రాలకే పరిమితం చేసేస్తారేమో ప్రేక్షకులు అని డౌట్ వచ్చింది. ప్రతీ హీరోనూ ఏదో ఒక ఇమేజ్ లో ఫిక్స్ చేసేయటం మనవాళ్ళకు అలవాటు కదా. ఆ "ఇమేజ్ చట్రం"లో ఇరుక్కుపోయి వైవిధ్యమైన పాత్రల్ని చెయ్యలేక, ఇమేజ్ లోంచి బయటకు రాలేక ఈ కాలపు యువహీరోలు అవస్థలు పడుతున్నారు పాపం. ఇతగాడికి ఆ అవస్థ రాకూడని నా అభిలాష.

ఈ సినిమాలో నాకు బాగాబాగా నచ్చిన సీన్ ఒకటుంది. రాత్రిపూట సిన్లో ఒక గుబురు చెట్టు, దాని పక్కనే ఉన్న బెంచ్ మీడ అటుతిరిగి హీరో కూర్చుని ఉంటాడు. చెట్టు మీదుగా పడుతున్న కొద్దిపాటి లైట్. రాత్రి పూట ఉండే నిశ్సబ్దం..! భలే నచ్చాయి నాకు. ఈ బెంచ్ ఉన్న సీన్ రెండుసార్లేమో సినిమాలో వస్తుంది. అర్జెంట్ గా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోవాలి అనిపించింది. ఇండియా కాదేమో మరి..:(

ఇక రెండో హీరోయిన్(తాప్సీ) గురించి ఏమీ రాయకపోవటమే మంచిది. నేను ఎర్ర ఇంకుతో పెద్ద ఇంటూ మార్క్ పెట్టేసాను ఈ అమ్మాయికి. బ్రహ్మానందం పాత్ర కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇక ఆయన అటువంటి పాత్రలు తగ్గించుకుంటే మంచిదేమో. మిగతా పెద్దలందరు తమ వంతు పాత్రల్ని ఇచ్చిన మేరకు సమర్ధవంతంగానే పోషించారు. ఎంత మేకప్ వేసినా విశ్వనాథ్ గారి వయస్సు బాగా తెలిసిపోతోంది. ఈ వయసులో ఎందుకో అంత కష్టపడటం అనిపించింది.


ఇక తులసి ఎందుకు ఇలా నటనకు ఆస్కారం లేని అమ్మ పాత్రలు చేస్తోందో తనకే తెలవాలి. ఒక కాలంలో సినిమాలో తులసి ఉందంటే సంబరంగా ఉండేది. మంచి నటిని ఇప్పుడిలా కాస్తైనా ప్రాధాన్యత లేని పాత్రల్లో చూస్తే బాధ వేస్తోంది. "శశిరేఖా పరిణయం"లో కూడా ఇలానే అనిపించింది. పైపెచ్చు పావలాకి అర్ధరూపాయి ఏక్షన్ చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

ఇక చిత్రంలోని నేపథ్య సంగీతం కూడా సన్నివేశానుసారం బాగుంది. మొత్తం పాటల్లో నాకు మూడు పాటలు ముందు నుంచీ వినీ వినీ బాగా నచ్చేసాయి. "బదులు తోచని ప్రశ్నల తాకిడి" గురించి ఇదివరకే చెప్పేసాను. మరొకటి "లైట్ తీస్కో భాయ్ లైట్ తీస్కో..". కానీ నాకో సందేహం నిజంగా అన్ని విషయాలనూ అలా లైట్ తీసుకోగలమా? తీసుకున్నా ఇబ్బందే ! ఒక మూడోది సుమధుర గాయని శ్రేయ ఘోషాల్ పాడిన "చలిచలిగా అల్లింది..." పాట చాలా చాలా నచ్చేసింది నాకు.

నాకు నచ్చిన మరొక కొత్త సినిమా గురించి తదుపరి టపాలో..

Sunday, April 24, 2011

నా స్వామి

సత్యం
ధర్మం
ప్రేమ
శాంతి
అహింస
ఇది స్వామి చూపిన బాట.

* ప్రార్ధించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న.

* ద్వేషించేవారిని వారిని కూడా ప్రేమించు.

*నిన్నని మర్చిపో. రేపు గురించి చింతించకు. ఇవాళ ఒక్కటే నీ చేతిలో ఉన్నది. దాన్ని సద్వినియోగపరుచుకో.

*కష్టం వచ్చినప్పుడు నిలబడు. ఒటమికెన్నడు కృంగిపోకు.

*చేతనయినంత సాయం వీలైనంత మందికి చెయ్యి.

*సాయం చెయ్యలేకపోయినా పరవాలేదు ఎవరికీ కష్టం మాత్రం కలిగించకు.

*శత్రువుని సైతం క్షమించు. అంతకు మించిన గొప్ప పని లేదు.

ఇవి స్వామి నుంచి నేను గ్రహించుకున్న జీవిత సత్యాలు.
చెప్పుకుపోతే ఎన్నో....ఎన్నెన్నో...

మిగతావన్నీ నాకనవసరం.
ఎవరు అపహాస్యం చేసినా
ఎవరు చేయి వీడి వెళ్ళిపొయినా
ఎవరు నన్ను ద్వేషించినా
ఎవరు వేళాకోళం చేసినా
నేను నమ్మిన నా సాయి పలుకులను, స్వామి చూపిన బాటను వీడను.

ఒక మహాపురుషుడి గురించి చర్చలు జరిపి, వ్యాసాలు రాసేంత మేధస్సు నాకు లేదు.
ఆయన చెప్పిన మాటల వెంట నడవటం మాత్రమే తెలుసు.

ఆ పాదాలను తాకి నమస్కరించుకునే భాగ్యం నాకు దొరకటం నా అదృష్టం.
ఎదురుగా ఆయన నడిచి వెళ్తూండగా దగ్గరగా చూసిన నా జన్మ ధన్యం.

నా స్వామి ఎప్పుడూ నాతో ఉన్నారు. ఉంటారు. తప్పటడుగు వేయకుండా, జీవితాన్ని సార్ధక మార్గంలో నడిపించటానికి వెన్నంటి దారి చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడూ ఎప్పుడూ నా చివరి శ్వాస వరకూ.

My dearest Swami..here i humbly remain at your lotus feet !!

Saturday, April 23, 2011

తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు"


నిన్న రాత్రి(21st) ఆకాశవాణి విజయవాడకేంద్రం నుండి 9.30p.mకి ప్రత్యేక త్రైమాసిక నాటకం ఒకటి ప్రసారం అయ్యింది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు" కథానికకు కందిమళ్ళ సాంబశివరావుగారు రేడియో అనుసరణ చేసారు. విజయవాడకేంద్రం సహాయ సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు ఈ నాటకాన్నినిర్వహించి, సమర్పించారు. నాటకం చాలా బాగుంది. కథను నాటకంగా మలచటం అంటే మరో సృష్టే. అది చాలా సమర్థవంతంగా చేసారు సాంబశివరావుగారు. 1964లో ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో ప్రచురితమైన కథ ఇది.

విచిత్రం ఏమిటంటే తిలక్ గారి కథల పుస్తకంలో నేను చదవకుండా వదిలేసిన కథలలో ఇదీ ఒకటి. నిన్న నాటకం విన్నాకా మళ్ళీ "తిలక్ కథలు" పుస్తకం వెతుక్కుని, పొద్దున్నుంచీ ఖాళీ దొరికినప్పుడల్లా ఈ కథను, అదివరకు చదవని మిగతా కథలను చదివాను. ఈ కథను అయితే ఇందాకా రెండవసారి మళ్ళీ చదివాను. 1964లో రాసిన ఈ కథలో అంతకు మునుపు పాతికేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. కథ నాకు ఎంతగానో నచ్చింది. కథను చెప్పాలనిపించింది. కాస్తంత ప్రయత్నిస్తాను..

* * * * * * * * *

ఊరికి దూరంగా నల్లజర్ల అడవిలో ఒక తోట బంగ్లాలో "అవధాని" అనే ధనవంతుడైన ఆసామి తన చిన్ననాటి భయానక అనుభవాన్ని మిత్రులకు చెప్పటం మొదలుపెడతారు. కరంటు లేని ఆ చీకటి రాత్రిలో అవధాని చెప్పే కథను భయం భయంగా వింటూంటారు వారు.

తణుకులో టెన్నిస్ చాంపియన్ అయిన రామచంద్రం, కలప వ్యాపారి నాగభూషణం, పధ్ధెనిమిదేళ్ళ అతని మేనల్లుడు(కథ చెబుతున్న అవధాని) కలిసి ఏలూరు నుండి రాత్రి పదిగంటలు దాటాకా కారులో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీదుగా తణుకు బయల్దేరతారు. తణుకు పదిహేను మైళ్ళ దూరంలో ఉందనగా నల్లజర్ల అడవి దగ్గర వాళ్ల కారు హటాత్తుగా ఆగిపోతుంది. సమయానికి కలక్టర్ గారింట్లో పెళ్ళికి వెళ్ళలేకపోతామేమో అన్న చిన్న అనుమానాన్ని అసలు అడవి దాటి బయటపడతామా అన్న ప్రాణభయం కప్పేస్తుంది. కాసేపటికి చీకట్లో ఆడవంతా భయంకరంగా కనబడుతుంది వాళ్లకు. చెట్ల గుబుర్ల మధ్య నుండి నేల జారుతున్న వెన్నెల కూడా భయపెట్టేట్లుగా ఉండటంతో భయం వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది.

ఆ చీకట్లో కారు బాగుచేయటానికి దిగిన రామచంద్రాన్ని ఒక పాము కాటువేస్తుంది. గిలగిల్లాడుతూ మృత్యువుకు అతి చేరువౌతాడు అతడు. అర్ధరాత్రిపూట ఆ చీకటి అడవిలో పాము కాటుకు గురైన రామచంద్రాన్ని ఎం చేయాలో తెలియక బెదిరిపోయి భయంతో వణికిపోతూంటారు నాగభూషణం, అతని మేనల్లుడు.

ఇంతలో అటుగా వచ్చిన సిధ్ధయ్య అనే పాములవాడు వీరిపై జాలి తలచి తన పాకకు తీసుకువెళ్తాడు. కానీ రామచంద్రానికి మంత్రం వేసేప్పుడు కావాల్సిన వేరుముక్క లేదని నిరుత్సాహపడతాడు. వయసుమళ్ళిన మీదట తనకు చూపు ఆనటం లేదని లేకపోతే ఆ చీకట్లో వెళ్ళి వేరు తెచ్చేవాడినని చెప్తాడు. చివరి ఘడియల్లో ఉన్న రామచంద్రాన్ని అలా వదిలేయలేక వేరు కోసం తాను వెళ్తానని బయల్దేరుతుంది సిధ్ధయ్య కుమార్తె సూరీడు. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం భయానకమైన అడవిలోకి..చీకట్లో ఒంటరిగా వెళ్తున్న గర్భవతైన కుమార్తెను ఆపలేక నిస్సహాయంగా చూస్తూండిపోతాడు సిధ్ధయ్య.

సూరీడు వెనకకు వస్తుందా? రామచంద్రం ప్రాణాలు దక్కుతాయా? వారు తిరిగి ప్రయాణమవ్వగలుగుతారా? చివరికి ఈ కథానిక ఎటువంటి అనూహ్యమైన మలుపు తిరుగుతుంది? అన్నది మిగిలిన కథ. కథానిక ముగింపు చాలా భారమైనది. మనుషుల్లో మానవత్వం ఏ మాత్రం మిగిలుందో, దానికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే కథ ఇది. ఉత్కంఠభరితమైన ఈ కథలో కథనం, కొన్ని వర్ణనలు, వాక్యాలు నిజంగా కట్టిపడేస్తాయి. కవిగానే కాక కథకులుగా కూడా తిలక్ గారు మనల్ని ఆకట్టేసుకుంటారు. సమాజానికీ, కట్టుబాట్లకూ లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవనాన్ని సాగించే ధైర్యశాలిగా సూరీడు, ఆమెను సమర్ధించే తండ్రిగా సిధ్ధయ్య గుర్తుండిపోతారు.

కథలో నన్నాకట్టుకున్న కొన్ని వాక్యాలు:
* హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా, విరుధ్ధంగా బాగా డబ్బున్నవాడు.

*అతని భార్యనెక్కువ ప్రేమిస్తాడో, భార్యపేర అతని తండి రాసి ఇచ్చిన ముఫ్ఫైనాలుగెకరాలనూ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలక జిజ్ఞాసువులు చాలా మంది బాధపడేవారు పాపం.

* ఇటువంటి భోగట్టా నాకూ సరిగ్గా తెలియదు. మా ఆవిడకి తప్ప.

* ...ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు, సమాజమూ తమ చుట్టూ గోడలను కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు..."

*..ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫు తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, కౄరమృగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటూ వీరవరులూ, స్వధర్మనిరతులూ కూడా మాయమైపోయారు.

* చావుకన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది.

* ఆ నిమిషంలో స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలూ అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంత వరకే. ప్రతి మనిషీ లోపల్లోపల ఒక పాము !

* రాత్రిపడిన బాధ, భయమూ పీడకలేమో అనిపించినట్టుంది......మామూలు పెద్దమనిషీ, శ్రీమంతుడూ, టెన్నిస్ ఛాంపియనూ అయిపోయాడు.

*** *** ***

కథ చదవటం అయిపోయాకా "ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లు.." అన్న సామెత గుర్తుకువచ్చింది. పదిహేనొవ శతాబ్దంలో షేక్స్పియర్ రాసినా, ముఫ్ఫై ఐదేళ్ల క్రితం తిలక్ గారు రాసినా, ఇరవైయ్యోకటవ శతాబ్దంలో మరెవరు రాసినా మనుషుల స్వార్థ మనస్థత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయన్నమాట అని మరోసారి అనిపించింది.

Friday, April 22, 2011

'Earth Day' సందర్భంగా ఒక మంచి వ్యాసం

ఇవాళ apr.22nd 'Earth Day' . ఈ సందర్భంగా "పుడమితల్లికి రామయ్య పచ్చని పందిరి! " అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడిషన్ 'నవ్య'లో వచ్చిన ఇవాళ్టి ఆర్టికల్ "ఇక్కడ" చదవండి.

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య గురించి చదివి పచ్చదనాన్ని చూస్తే పులకించే ప్రతి మనసూ ఆనందిస్తుంది. ఇటువంటివారున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. Hats off to this man !! ఇటువంటి గొప్ప 'మనీషి' గురించి రాసినవారికి వందనం.

Tuesday, April 19, 2011

rare album : "pancham unexplored "






Here is a rare album. ఈ సిడిలో ఆర్.డి.బర్మన్ (పంచెమ్ దా) కొన్ని సినిమాలకు స్వరపరిచిన కొన్ని themes ఉన్నాయి. R.D.Burman lovers can relish this album.



content details :

 

Monday, April 18, 2011

పాతాళభైరవి(1951)


ఇటీవలే షష్ఠిపూర్తి జరుపుకున్న జానపదచిత్రం "పాతాళభైరవి" సినిమా మళ్ళీ చూద్దామనిపించి నిన్ననే.. బహుశా పాతికేళ్ళ తరువాతేమో చూశాను. "కహో నా ప్యార్ హై" సినిమా చూసి హృతిక్ రోషన్ పై అమ్మాయిలంతా ఫిదా అయిపోయినట్లుగా అప్పట్లో ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఖచ్చితంగా ఎన్.టీ.ఆర్ పై ఫిదా అయిఉంటారు అనిపించింది. హృతిక్ రోషన్ ఎక్కడ? ఎం.టీ.ఆర్ ఎక్కడ? అనకండి. నేను వాళ్ళిద్దరిలోని ‘charisma’ గురించి చెప్తున్నాను. "తోటరాముడు" తల విదిలించినప్పుడల్లా వెనక్కు వెళ్ళే ఆ రింగుల రింగుల జుట్టు, ఆ తీక్షణమైన చూపులు, "నిజం చెప్పమంటారా అబధ్ధం చెప్పమంటారా? " అన్నప్పుడల్లా అమాయకంగా తోచే ముఖము, పాత్రలో లీనమైపోయిన నటన.. అన్నింటికీ నేను కూడా తోటరాముడికి ఫిదా అయిపోయి "జై పాతాళభైరవి" అనేసా.


మిగిలిన వ్యాసం ఇక్కడ చూడండి.

Sunday, April 17, 2011

మరో కొత్త సినిమా బోధించిన పాఠలు !


కొత్త సినిమా బోధించిన పాఠలు :
* ప్రేమంటే ఏమిటి ? నిజమైన ప్రేమను గుర్తించాకా ఏంచెయ్యాలి?
* నిజమైన ప్రేమను గుర్తించాలి అంటే, ప్రేమంటే కనబడ్డ అమ్మయికల్లా లైను వేసి, ఆపైన పడేసిన అమ్మాయిల్లో ఎవరు బాఘా మనసుకి దగ్గరగా వస్తారో అని ఏళ్ల తరబడి గమనించుకుంటూ ఉండాలి.
* ఆ ప్రయత్నంలో ఎంత మంది అమ్మాయిలతో అయినా, ఎలాంటి అమ్మాయిలతో అయినా తిరగొచ్చు, ఏదైనా చేయచ్చు. మన పవిత్ర భారతదేశంలో అందరూ పవిత్రంగా భావించుకునే "పెళ్ళి" అయే టైముకి సదరు అబ్బాయిగానీ అమ్మాయి గానీ పవిత్రంగా ఉండాల్సిన పనే లేదు.
* ఆ పైన మనసుకి దగ్గరగా ఉన్న అమ్మాయిని గుర్తించాకా ఆ అమ్మాయికి పెళ్లయిపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళాలి.
* ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాకా అవసరం లేనకపోయినా ఒక పెద్ద హడావుడి ఫైటింగ్ ఒకటి చేయాలి.
* ఆ తరువాత అమ్మయి ఎక్కడుందో కనుక్కుని ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి, పెళ్లవకముందు చెప్పాల్సిన డైలాగుని ఆలస్యంగా చెప్తున్నందుకు చింతిస్తూ డైలాగులు చెప్పేయాలి.
* సదరు అమ్మాయి కూడా పెళ్ళికొడుకుతో డిన్నర్లకూ వాటికీ వెళ్ళి, పెళ్ళికి ఒప్పుకుని పవిత్రంగా తాళి కట్టించుకున్నాకా, వెర్రిమొహం వేసుకుని చూస్తున్న భర్తగారికి టాటా చెప్పి వెళ్పోవచ్చు.
* ఇప్పటిదాకా నిశ్చితార్ధాలు, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోయాయి సినిమాల్లో. ఇకపై అయిపోయిన పెళ్ళీళ్ళు కూడా రద్దు చేసుకోవచ్చు అని బాగా తెలియచెప్పారు.
* మనిషిలో కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎంతవరకూ ఉండొచ్చు అన్న విషయాన్ని చాలా బాగా తెలియచెప్పారు.

అర్ధం కానిది:

* ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాడు అన్న గాఠ్ఠి నమ్మకం గల సదరు అమ్మాయికి పెళ్ళికి ముందుగానే కాస్త జ్ఞానోదయం అయినా సరే పెళ్ళికి నిరాకరించకుండా ఎందుకు ఉండదో అర్ధం కాలేదు.
* ప్రేమించిన అమ్మాయిని చూడ్డం కోసం వీర ప్రేమికుడు ఒక చావు ఇంట్లో కూడా ప్రవేశించి అవతలవాళ్ళు ఏడుస్తూ ఉంటే అమ్మాయితో మాట్టాడ్డానికి ప్రయత్నించటం...
* ఒక ఫ్లాష్ బ్యాక్ కథలో పరికిణీ ఓణీలు వేసుకున్న ట్రెడిషనల్ అమ్మాయి "పోయింటెడ్ హీల్స్" ఎలా వేసుకుంటుంది ? కెమేరాలో అవి కనపడవనుకునేంత అమాయకులా సినిమావాళ్ళు?
* పాతతరం పేమ ఎలా ఉండేది? కొత్త తరంలో ప్రేమ ఎలా ఉంటోంది అని చూపించే వినూత్నప్రయత్నమే ఈ సినిమా తీసినవాళ్ల ముఖ్య ఉద్దేశం. ఈచిత్రానికి మూలమైన హిందీ సినిమా టైటిల్ కూడా అదే కదా. కానీ అదేమిటో నా మట్టిబుర్రకి ఈ సింపుల్ పాయింట్ అర్ధం కావట్లేదు.
* అంతా బానే ఉంది కానీ ఈ పెళ్ళి అయిన తరువాత పారిపోవటం అనే కాన్సెప్ట్ ఎంతకీ మింగుడు పడట్లేదు...may be iam very old fashioned to catch this great concept !!

నచ్చినవేవైనా ఉన్నాయా?

* నేపథ్య సంగీతం చాలా చాలా నచ్చింది నాకు. సన్నివేశానిసారంగా, భావానికి దగ్గరగా, మనసుకు హత్తుకునేట్లుంది.
* చివరిదాకా వాళ్లకు తెలీకపోయినా వాళ్ల మధ్యన కనబడిన ప్రేమ నచ్చింది.
* కొన్ని డైలాగులు బాగున్నాయి.

******    *****     ******

నా దృష్టిలో మంచి సినిమా ఎలా ఉండాలి?

* కొత్తదైనా పాతదైనా అప్పుడే అయిపోయిందా అనిపించాలి.
* హాస్యమైన, దు:ఖమైనా పాత్రల భావానుసారంగా మనమూ వాళ్ల అనుభూతిని పొందాలి.
* మధ్యలో కాస్తైనా బోర్ కొడుతోంది అనిపించకూడదు.
* తెర ఎత్తిన మొదలు దించేదాకా మరే ఇతర ఆలోచన రాకుండా ఉండాలి. మనల్ని మనం మర్చిపోవాలి.

అలాంటి మంచి సినిమా కోసం ఓ దేవుడా నేను ఎదురు చూస్తున్నాను.................

Saturday, April 16, 2011

మా బంగారుతల్లికి 4th rank !



పొద్దున్న స్కూలుకెళ్ళి రిపోర్ట్ కార్డ్ తెచ్చాం. వెళ్లగనే "your child got into the notice board this time" అన్నరు టీచర్ మాతో. గబగబా ఏ ర్యాంక్ వచ్చిందా అని చూసాం...4th rank ! marks 439/500 వచ్చాయి. నలభై మంది క్లాసుపిల్లల్లో ఆ మాత్రం ర్యాంక్ వచ్చిందంటే నాకు ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. మరోసారి నాలో "పుత్రికోత్సాహం" పొంగిపొర్లింది.

LKG లోనూ, UKGలోనూ గ్రేడ్స్ ఉండేవి. అప్పుడూ 'A+' వచ్చేది. ఫస్ట్ క్లాస్ నుంచీ ర్యాంక్ లు ఇస్తారు. ఇప్పటి ఫస్ట్ క్లాస్ కీ మేం చదువుకున్న ఫస్ట్ క్లాస్ కీ ఎంతో తేడా. అదేం సిలబస్సో..పిల్లలసలు చదవగలరా అనుకునేదాన్ని నేను. కానీ జనరేషన్ చాలా మారిపోయింది కాబట్టి అంతంత సిలబస్సులనీ కూడా ఇట్టే చదివేస్తున్నారీ కాలంపిల్లలు. ఈ ఏడాది మొదట్లో నేను ఓంట్లోబాలేక అమ్మ దగ్గర ఉండిపోవటంతో రెండు మూడు నెలలు దాని స్కూలు సరిగ్గా సాగలేదు. చాలా మిస్సయ్యింది. అవన్నీ మేమిద్దరం వీలైనప్పుడల్లా నేర్పిస్తూ, చదివిస్తూ వచ్చాము. అందులోనూ తెలుగు అక్షరాలూ, గుణింతాలూ అవీ బేసిక్స్ ఇప్పుడు సరిగ్గా రాకపోతే భాష సరిగ్గా రాకుండాపోతుందని మా భయం.

కానీ నువ్వు ఫలానా ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఏనాడూ మేము దాన్ని ఫోర్స్ చెయ్యలేదు. ర్యాంకులూ, పోటీ అంటూ పిల్లల చిన్నతన్నాన్ని చిదిమేసి చదువుల్ని పిల్లల మీద రుద్దేయటం మా ఇద్దరికీ కూడా ఇష్టం లేదు. "మార్కుల గురించి ఆలోచించద్దు. పాఠం సరిగ్గా అర్ధం అయ్యిందా లేదా? అన్నది చూసుకో" అని చెప్పేవాళ్ళం దానికి. స్కూల్లో అన్నీ బట్టీ వేయించేస్తూ ఉంటారు. పైగా ఏదన్నా తప్పు చెబితే మా టీచర్ ఇలానే చెప్పారు అంటుంది. అందుకని మేము నోట్స్ లోని ప్రశ్నలు జవాబులు కాకుండా టెక్స్ట్ బుక్ లోని పాఠమే చదివించేవాళ్లం. అయితే pressurize చెయ్యకుండా, పరీక్షల భయం ఇప్పటినుంచీ దానిలో కలగకుండా జాగ్రత్త పడ్డాం. మొత్తానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏనాడూ ఆశించలేదు.

ఇప్పుడు అందరు పిల్లలూ బాగా చదువుకుంటున్నారు, కళలు,ఆటలు అన్నింటిలోనూ ఏక్టివ్ గా ఉంటున్నారు. 4th rank is not a big thing... ఇదేమీ గొప్ప అని నేను రాయటం లేదు. కేవలం ఆనందాన్ని పంచుకోవటానికి రాస్తున్నాను. మా బంగారుతల్లి ఇలానే బాగా చదువుకుని ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటున్నాను. నా కలల్ని దాని మీద రుద్దాలని ఎప్పుడూ అనుకోను, కానీ తాను చూసే కలల్ని తను సాకారం చేసుకోగలగాలని ఆశపడతాను.

నాకు బాగా నచ్చిన "Airtel 3G ad"


New Airtel 3G ad STARE.wmv

"మేరా తిల్ తుమ్హారా చెక్ పోస్ట్ తో హై నహీ...ఆజ్ యహా కల్ వహా..." డైలాగ్ సూపరసలు.Good idea!