సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 19, 2009

శరన్నవరాత్రులు

"సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే"


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచీ శరదృతువు ప్రారంభం కావడం ఈ ఆశ్వయుజమాస విశేషం.ఈ రోజు అంటే "ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి" నుండి తొమ్మిది రాత్రులు ఆదిశక్తిని పూజించటం శుభప్రదం. ఈ నవరాత్రులలోనూ శక్తి స్వరుపిణిని-- దుర్గ,మహాలక్ష్మి,లలిత,సరస్వతి,గాయిత్రి,అన్నపూర్ణ,బాలాత్రిపురసుందరి,శ్రీరాజరాజేశ్వరి,మహిషాసుర మర్దిని మొదలైన రూపాలలో ఆరాధిస్తారు.వెన్నెలను "శారద" అని కూడా అంటారు.శారదకాంతులతో విరాజిల్లే దేవి కాబట్టి ఆదిశక్తిని "శారద" అని స్తుతిస్తాము.అందువల్ల ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుంచీ ఆ మాతను పుజించే తొమ్మిది రాత్రులను "శరన్నవరాత్రులు" అనీ,"శారదరాత్రులు" అనీ పిలస్తాము.సాంప్రదాయమున్నవారు ఈ తొమ్మిది రోజులూ కలశాన్ని స్థాపించి దేవిని నియమంగా పూజిస్తారు.దశమి రోజున ఉద్వాసన చేస్తారు.

తొమ్మిది రోజులలో మూలా నక్షత్రం రోజున "సరస్వతీ దేవి"ని ఆరాధిస్తారు.తొమ్మిది రోజులు పూజ చేయలేనివారు ఈ రోజు నుండీ నవమి దాకా ముడు రోజులూ పూజ చేస్తారు.శక్తి స్వరూపిణి అయిన దేవి ఆశ్వయుజ శుధ్ధ అష్టమి నాడు అవతరించినందువల్ల ఆ రోజు "దుర్గాష్టమి" గా ప్రసిధ్ధి చెందింది.నవరాత్రులలో అతి ముఖ్యమైనది "మహానవమి".దసరా పూజలకి ఇదే ప్రధానమైన రోజు.ఆశ్వయుజ శుధ్ధ నవమి నాడు జగన్మాత "మహిషాసురుడు" అనే రాక్షసుని సంహరించి లోకోపకారము చేసినందువల్ల ఈ నవమి "మహా నవమి" అయ్యింది.ఈ నవరాత్రులూ దేవిని ఆరాధించి ఏ పనైనా మొదలుపెడితే తప్పక విజయం లభిస్తుందని భారతీయుల నమ్మకం.

శ్రీరాముడు ఈ మాసమున ఆ దేవిని పుజించిన తరువాతే లంకకు వెళ్లి రావణుణ్ణి వధించాడని రామాయణంలో చెబుతారు.
అలానే భారతంలో, అజ్ఞాతవాస సమయంలో దుర్యోధనాదులతో యుధ్ధము చేయటానికి అర్జునుడు,పాండవులు ఆయుధాలుంచిన శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి,గాండీవమును తీసుకుని కౌరవులందరినీ తానొక్కడే జయించి,విరాటుని గోవులను నగరానికి మరలుస్తాడు.అర్జునుడికి "విజయం" దశమి రోజున కలిగినందువల్ల
ఆశ్వయుజ శుధ్ధ దశమికి "విజయదశమి" పేరు వచ్చిందని చెబుతారు.ఎక్కడో చదివిన గుర్తు--ఈ రోజున నక్షత్రాలు కనబడిన వేళ "విజయ ముహుర్తం" అని,ఈ ముహుర్తంలో తలపెట్టిన పనులు,ప్రయాణాలూ తప్పక విజయవంతమౌతాయనీ నమ్మకం ఉందట.
శరన్నవరాత్రులకు సంబంధించి నాకు తెలిసిన కొద్దిపాటి విశేషాలు ఇవి.

పండుగలలో "వినాయకచవితి" తరువాత నాకు చాలా ఇష్టమైనవి ఈ "నవరాత్రులు".కలశం పెట్టే ఆనవాయితీ లేకపోయినా ,మా అమ్మ తొమ్మిదిరోజులూ పూజ చేసి నైవేద్యాలు చేసేది.బెజవాడలో ఉండటం వల్ల కనకదుర్గ అమ్మవారి అలంకరణలు తెలుసుకుని ఆ ప్రకారం ఆయా అవతారాలను పూజించేది అమ్మ.పెళ్లయ్యాకా నేను కూడా అలానే నవరాత్రులూ దేవీ పూజ చేసి,నైవేద్యాలు చెయ్యటం మొదలుపెట్టాను.ఈ పుజలు చేసి ఏదో భోగభాగ్యాలు పొందెయ్యాలని కాదు...ఇలా చేయటం వల్ల నాకు ఎంతో మన:శ్శాంతి లభిస్తుంది.పెళ్లైన మొదటి ఏడాది నవరాత్రులు బొంబాయిలో చేసుకున్నాను.మా ఇంటి దగ్గర "మహిషాసురమర్దిని" ఆలయం ఉండేది.ఆయన ఆఫీసు నుంచి వచ్చాకా రాత్రి 9,9.30కి గుడికి వెళ్ళేవాళ్ళం.అప్పుడు ఆఖరు హారతి ఇస్తూ ఉండేవారు...చూడటానికి కన్నుల పండుగ్గా ఉండేది.అదే First and best celebrated festivalగా నా స్మృతుల్లో ఉండిపోయింది.ఇవాళ కుడా పొద్దున్నే మొదటిరోజు పూజాకార్యక్రమాలు ముగించి, అన్నం పరమాన్నం నైవేద్యం పెట్టాను..!!

9 comments:

మాలా కుమార్ said...

విజయదశమి శుభాకాంక్షలు .

జయ said...

దసరా వచ్హిందంటే ఆ కళే వేరు. ఒకపక్క ఎన్ని సంబరాలు జరుగుతున్నా, ఈ తొమ్మిది రోజులు చేసే పూజలు ఎంతో త్రుప్తిని ఇస్తాయి. మీరన్నట్లు ఏ భోగభాగ్యాల కోసమో కాదు, మనకి ముఖ్యమైన మనశ్శాంతి దొరుకుతుంది. లలితా సహస్ర నామాల పరమార్ధం కూడా అదే. చాలా బాగా చెప్పారండి.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

తొమ్మిదిరోజులు చేసే పూజలేకాకుండా ప్రసాదాలు కూడా రాస్తే మహాభక్తులవుతాము

తృష్ణ said...

@మాలా కుమార్:ధన్యవాదాలు.

@జయ:నిజమేనండీ..సహస్రనామాలు,అష్టలక్ష్మి,మహిషాసురమర్దిని స్తోత్రాలు..ఇవన్నీ చదువుతుంటే ఏవో తెలియని వైబ్రేషన్స్ మనసుని ఆనందంతో నింపేస్తాయి..మీ భావాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

చైతన్యా, రోజూనా ? అప్పుడు నీ వ్యాఖ్య ఒక్కటే ఉంటుంది..... :) :)
ప్రసాదాలు కావాలంటే మరి మా ఊరు రావాల్సిందే ...!

హరే కృష్ణ said...

బాగా వివరించారు..థాంక్స్..విజయదశమి శుభాకాంక్షలు..
అవునండీ!..విజయవాడ లో వుంటే ఎంత ఘనంగా జరుపుతారో..

తృష్ణ said...

@ హరే కృష్ణ: "కన్నుల పండుగ" అంటే ఇదే అనిపిస్తుంది దసరాల్లో మా బెజవాడలో ఉంటే...ఆ కృస్ణా తీరం,అందులో హంసవాహనంలో అమ్మవారి విహారం చూసి తీరవలసినవి..అబ్బా..మా ఊరిని గుర్తుకు తెచ్చేసారే..నేనెక్కడికో వెళ్పోయా.. :)

శ్రీలలిత said...


దసరా నవరాత్రుల గురించి చక్కగా వివరించారు. ఈ పూజలు మన ఇళ్ళలో చేసుకునే కారణం కూడా యిదే అనుకుంటాను.. చేసుకున్నవాళ్ళకి కాస్త మనఃశాంతి, తృప్తి కలిగిస్తాయి. ఆ తరవాత గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇంతకన్న మనలాంటి సామాన్యులకి యేదికావాలి చెప్పండి..

తృష్ణ said...

నేను చేసుకునే కారణం అదేనండి. ఏదో శక్తిమేరకు నవరాత్రులు చేసుకున్నానని తృప్తి, మనఃశ్శాంతి.
ధన్యవాదాలు శ్రీలలిత గారూ.