కొన్నేళ్ళక్రితం అన్నయ్య కొత్తగా ఐడియా మొబైల్ కొనుకున్నప్పుడు ఫోన్ చేయండని నంబర్ చెప్పాడు. రింగ్ చెయ్యగానే ఐడియా మొబైల్ వాళ్ళ Ad theme music వినబడింది..."9..8...tararaa..." అంటూ విన్పించిన ఆ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు అనిపించింది. రెండు రోజులు బుర్ర బద్దలుచేసుకున్నాకా గుర్తువచ్చింది...అదీ మణిరత్నం మొదటి సినిమా "పల్లవి అనుపల్లవి" సినిమాలోని పాట తాలూకూ మ్యూజిక్ అని. వెంఠనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పా. వాడు ఇళయరాజాకు ప్రరమ భక్తుడు. ఆ తరువాత తెలిసిన కథ ఏమిటంటే ఐడియా మొబైల్ ఏడ్స్ డైరెక్ట్ చేసిన బాలకృష్ణన్(చీనీ కం, పా దర్శకుడు)కూడా ఇళయరాజా అభిమానేట. ఇళయ్ అనుమతి తీసుకుని ఆ ఏడ్ లో ఆ ట్యూన్ వాడుకున్నారట. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటైన ఆ పాట ఇదే --
"కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం.."
1983లో కన్నడంలో మణిరత్నం మొదటిసారి దర్శకుడి పాత్ర వహించిన సినిమా "ಪಲ್ಲವಿ ಅನುಪಲ್ಲವಿ". రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మణిరత్నమే. తరువాత ఈ సినిమాను తమిళంలోనూ, తెలుగులోనూ డబ్బింగ్ చేసారు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో హీరో. "వంశవృక్షం" తరువాత ఆయన నటించిన మరో ప్రాంతీయ భాషా చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు "బాలూ మహేంద్ర" ఈ సినిమకు సినిమాటోగ్రాఫర్. కథ కూడా ఒక అసాధరణమైన కథ. ఈసినిమాకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మణిరత్నం "బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్" అందుకున్నాడు. పాట గురించి ఇందాకా చెప్పేసాను. ఇక ఇళయరాజా అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తనివితీరదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. ఈ మ్యూజిక్ వినండి మీకే తెలుస్తుంది..
ఈ సినిమా అందమంతా ఈ సంగీతం లోనే ఉంది. పాటలు ఒరిజినల్ వి బాగుంటాయి. తెలుగులో డబ్బింగ్ కాబట్టి అంత ప్రాముఖ్యాన్ని పొందలేకపోయాయేమో. ముఖ్యంగా నేపథ్యసంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
స్త్రీ మనసు లోతుల్ని మగవాడు ఎప్పటికీ సరిగ్గా అర్ధం చేసుకోలేడేమో అన్న పాయింట్ ని నిజం చేస్తుంది ఈ చిత్ర కథ. కథలో అనిల్ కపూర్, లక్ష్మి, కిరణ్ వైరలే(ఈమె సాగర్, అర్థ్, ప్రేమ్ రోగ్, సాథ్ సాథ్, నమ్కీన్, నరమ్ గరమ్ మొదలైన హిందీ సినిమాల్లో నటించారు) ముఖ్య ప్రాత్రలు. సినిమా కథలోకి వెళ్తే విజయ్,మధు ప్రేమికులు. ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళిన విజయ్ కు అను పరిచయమౌతుంది. భర్త నుంచి విడిపోయి ఉంటున్న అనుకి ఒక ఏడేనిమిదేళ్ల కొడుకు ఉంటాడు. విజయ్ కీ, అను కొడుకు కూ మంచి స్నేహం ఏర్పడుతుంది. అదే స్నేహం అనూతో కూడా ఏర్పడుతుంది. అందమైన అనుబంధంగా మారుతుంది. కానీ అది చిన్న ఊరు కావటంతో ఊళ్ళో జనాలు వీరిద్దరి స్నేహాన్నీ అపార్ధం చేసుకుంటారు. ఒకానొక ఉత్తేజకరమైన పరిస్థితుల్లో ఊరందరి ముందూ ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్ళి చేసుకుంటానంటాడు విజయ్.
అదే సమయంలో విజయ్ కోసం ఆ ఊరు వచ్చిన మధు ఆ మాటలు విని మనసు చెదిరి వెళ్పోతుంది. అలాంటి తెలివితక్కువ స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనూ విజయ్ ను బాగా కోప్పడుతుంది. తన భర్తను ఇంకా ప్రేమిస్తున్నాన్నీ, విజయ్ లో ఒక మంచి స్నేహితుణ్ణి మాత్రమే చూసాననీ అనూ చెబుతుంది. వాళ్ల స్నేహం ముగిసిపోతుందా? విజయ్ మధుని మళ్లీ కలిసాడా? వారిద్దరు ప్రేమా ఏమౌతుంది? అను సంగతి ఏమైంది? అన్నది మిగిలిన కథ.
కథలో మనకు బాగా నచ్చేది అనూ పాత్ర అని వేరేచెప్పఖ్ఖర్లేదు. ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని స్నేహంలా చూడలేని కథానాయకుడి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ను చూస్తే జాలి వేస్తుంది. అతని భావం అలా మారకుండా అనూని మంచి స్నేహితురాల్లా ఎందుకు చూడలేదూ? అనూ గొడవలో పడి తనకోసమే ఎదురుచూస్తున్న ప్రేమికురాలి సంగతి ఎలా మర్చిపోగలడు? అని అతనిపై కోపం వస్తుంది. అనిల్ కపూర్ నాకు బాగా ఇష్టమైన హీరోల్లో ఒకరు. కాబట్టి ఆయన నటన గురించి చెప్పేదేముంది? లక్ష్మి సహజ నటన ఎప్పటిలానే ప్రశంసలు అందుకుంటుంది. ప్రేమికురాలు పాత్రలో కిరణ్ వైరలే కూడా మంచి నటన కనబరుస్తారు సినిమాలో. లక్ష్మి కొడుకుగా వేసిన చిన్న పిల్లవాడు భలే ముద్దుగా ఉంటాడు.
చిన్నప్పుడెప్పుడో టివీలో వచ్చినప్పుడు చూసిన సినిమా. ఇంతకంటే గుర్తు లేదు. కానీ ఒక్కసారి చూసినందుకూ, మణిరత్నం మొదటి సినిమా అనీనూ నాకు బాగా గుర్తుండిపోయింది. చాలా రోజుల్నుంచీ ఈ సినిమ గురించి రాయాలని గుర్తున్నంతవరకూ రాసేసా..:) యూట్యూబ్లో లక్కీగా పాటలు దొరికాయి. సినిమా సీడీ అయినా డివీడీ అయినా దొరుకుతుందేమో కనొక్కోవాలి.
Wednesday, January 5, 2011
పల్లవి అనుపల్లవి(1983) - మణిరత్నం మొదటి చిత్రం
Tuesday, January 4, 2011
మరో మంచి ఇండోర్ ప్లాంట్ (నిన్నటి టపాలోని మొక్క గురించి)
నిన్న పెట్టిన "ఇదేం మొక్కో చెప్పుకోగలరా?" టపాకు ఆరు వ్యాఖ్యలు వచ్చాయి. రాసిన అందరికీ బోలెడు థాంక్స్ లు. అందులో ఇద్దరు(సూర్యుడు గారు, స్నేహ గారు) కరెక్ట్ గా రాసారు. అది potato మొక్క. పైన ఫోటోలో దుంప కనబడుతోంది చూడండీ...
మా చిన్నప్పుడు ఒకసారి ఓ బంగాళాదుంపకు బాగా మొలకలు వచ్చేసాయని మట్టిలో పాతిపెట్టాం. అది పెరిగి అందమైన మొక్కగా తయారైంది. బాగా పొడుకు అయిపోతే నాన్న నాలుగు పుల్లలతో చిన్నపాటి పందిరి కూడా కట్టారు వంగిపోకుండా. కొన్నాళ్ళకు మొక్క ఎండిపోయింది. తవ్వితే క్రిందన చిన్న చిన్నవి నాలుగైదు బంగాళాదుంపలు ఉన్నాయి. ఎంతో అపురూపంగా ఆ బుజ్జి బుజ్జి దుంపలను ఉడకపెట్టుకుని తిన్నాం. ఇది చిన్ననాటి ఊసు.
అలానే మొన్నొకరోజు ట్రేలోని ఓ బంగాళాదుంపకి బాగా మొలకలు వచ్చేసాయి. ఎందులో పాతుదాం అని ఆలోచిస్తూంటే, బీట తీసినా పడేయలేక దాచిఉంచిన ఒక 'అన్ బ్రేకబుల్ డిష్' కనపడింది. వెంఠనే మట్టివేసి potato పాతేసాను. చల్లదనం వల్ల ఓ వారానికి బాగా ఏపుగా పెరిగింది. మరో వారానికి ఇదిగో పైన ఫోటోలోలా అయ్యింది. ఇండోర్ ప్లాంట్ లాగ చక్కగా ఇంట్లో ఏదో ఓ చోట పెట్టుకుంటే ఎంతబాగుంటుందో కదా అని ఐడియా వచ్చింది. మీరూ వేసి చూడండి. చలికాలం కాబట్టి ఇప్పుడే బాగా పెరుగుతుంది. మొక్క పెరిగాకా ఇంట్లో పెట్టినా అప్పుడప్పుడు ఎండలో పెట్టడం మర్చిపోకండేం...:)
గతంలో ఒకసారి చిలకడ దుంపతో అందమైన ఇండోర్ ప్లాంట్ ఎలా తయారౌతుందో రాసాను. ఆ టపా తర్వాత నుంచీ రెగులర్గా మీ బ్లాగ్ చదువుతున్నాం అని కొందరు రాసారు కూడా.
Monday, January 3, 2011
Sunday, January 2, 2011
మరో దశాబ్దపు మొదటిరోజు
![]() |
| రంగులు దిద్దుతున్న మా "ముగ్గుగుమ్మ" |
దశాబ్దపు మొదటిరోజు అయితే ఏమన్నా కొమ్ములుంటాయా? ఏమీ ఉండవు. అదీ ఒక మామూలు రోజే...it's just an other day...another day !! కానీ నేను మాత్రం bryan adams "Here I am - this is me" పాట గుర్తొచ్చి "It's a new day - it's a new plan ... It's a new world ... it's a new start ..." అని పాడుకున్నా !! ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిన్న నిరాశను మిగిల్చినా రేపు బాగుంటుందేమోని అని ఆశ పడతాడు మనిషి. ఈ ఆశ లేకపోతే కొత్త ఉదయాలను చూడటం కష్టం. కొత్త కేలండర్లతో అలాంటి ఆశలు రేపేకొత్త సంవత్సరం అంటే నాకు ఇష్టం. మామూలుగానే గడచిపోవచ్చు..మరో ఏటికి ఇది just another year అయిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి it's a new start.
చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలో ఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినా మారదు. గ్రీటీంగ్స్ తయారు చేసి పోస్ట్ చేసేరోజులు పోయాయి కాబట్టి ఎప్పటిలానే రెండ్రోజుల ముందరే (అందరికన్నా ముందు విషస్ చెప్పాలనే అజ్ఞానపు తాపత్రయం) మైల్ బాక్స్ లో ఉన్న ఎడ్రస్లన్నింటికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. ఎప్పటిలానే మావారూ నవ్వారు.."వీళ్ళలో సగం మంది కూడా తిరిగి జవాబివ్వారు. ఎందుకు పంపిస్తావు?" అని. ఒక విష్ పంపినందువల్ల తప్పేముంది? కొట్టరు కదా. "Be aware that your kindness may be treated as your weakness...but still be kind" అన్నరు స్వామి. నా అలవాటునాది. ఓపిక, వీలు ఉన్నన్నాళ్ళు పంపిస్తాను. అంతే.
కౌన్ట్ డౌన్ లెఖ్ఖపెట్టుకుంటూ టీవీ చానల్స్ తిప్పుతూ కూచునే రోజులు పోయి నాలుగైదేళ్ళు అయ్యింది. చిన్నప్పుడు, పెద్దయ్యాకా కూడా హడావుడి పడిపోయి ప్రోగ్రామ్స్ మొదలెయ్యేలోపూ బయట న్యూ ఇయర్ ముగ్గు పూర్తి చేసేసి, టివీ ముందుకి చేరిన రోజుల్ని, పన్నెండవ్వగానే లైన్స్ కలవవని ఓ అరగంట ముందుగానే స్నేహితులకీ, బంధువులకీ ఫోన్లు చేసిన క్షణాల్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. ముగ్గు వెయ్యటం మాత్రం ఇప్పటికీ మానలేదు నేను. ఈసారి నా న్యూ ఇయర్ ముగ్గు వేస్తూండగానే మొదలయ్యింది. ఆ నిశ్శబ్దంలో నేనూ, చీకటిలో ఓపిగ్గా తోడు నించున్న తనూ ఇద్దరమే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాం. పేచీపెట్టి రంగులు కొనిపించుకుని తానే రంగులు మా పాప వేస్తానని మరీ మరీ చెప్పటం వల్ల ముగ్గు మాత్రం వేసి ఊరుకున్నా. పొద్దున్నే లేచి రంగులు ప్లేట్లో పెట్టుకుని పాప ముగ్గుకి రంగులు దిద్దుతూంటే "ముగ్గు గుమ్మ" అనుకున్నా. నా వారసత్వాన్ని,అభిరుచుల్నీ అన్నివిధాలా కాపాడుతుంది అనిపించే నా బంగారాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఇక పొద్దున్నే పనులన్నీ అయ్యాకా నేను చేసిన మంచి పని ఏమిటంటే ఫోన్ నంబర్ల బుక్ దగ్గర పెట్టుకుని అందరు మిత్రులకీ ఫోన్లు చేయటం. ఇది గత కొన్నేళ్ళుగా నేను మానేసిన పని. కొందరి లైన్లు కలవలేదు. కొందరు పలికారు. నాతో ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్న ఒక పాత స్నేహితురాలు లైన్ దొరికింది. ఇప్పుడు బొంబాయిలో ఉన్నారుట. ఇద్దరు అబ్బాయిలు. బోలెడు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నా. "నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు. మళ్ళీ నీ ఉత్తరం చదవాలని ఉంది. ఈ ఎడ్రస్ కి ఉత్తరం రాయవే" అని పోస్టల్ ఎడ్రస్ ఇచ్చింది. దాదాపు మూడునాలుగేళ్ళ క్రితాం దాకా ఏ ఊరు మారినా తనకు లెటర్స్ రాస్తూనే ఉండేదాన్ని. లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి ఆ జ్ఞాపకాలు.
ఆ తరువాత మైల్ బాక్స్ తెరిచాను ఎవరన్నా జవాబులు రాసారేమో అని. కొందరు రాసారు. ఒక కాలేజీ మిత్రురాలు డిగ్రీ క్లాస్మేట్స్ కొందరు కలిసారనీ వివరాలు అవీ రాసింది. ఆశ్చర్యంగా కొన్ని పేర్లు నాకు గుర్తుకు రాలేదు. నాక్కూడా మరపు వచ్చేస్తోంది అని అర్ధమైంది. లేకపోతే నేను ఏదన్నా మర్చిపోవటమా? ఎంఏ ప్రెండ్ చెప్పిన కొన్ని వార్తలు, ఇప్పుడీ స్నేహితురాలు రాసిన కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి. న్యూ ఇయర్ పూటా ఇలాంటి వార్తలేమిటీ అనుకున్నాను... కానీ నాకు ఒక సంగతి అర్ధమైంది. బహుశా దేవుడు నాకు పెద్ద గీత చూపిస్తున్నడేమో అని. పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది కదా. గతించిన కాలంలో నీపై రోకలి పోటు పడకుండా సుత్తి దెబ్బతో సరిపెట్టాను అని దేవుడు చెప్తున్నాడన్న మాట అనుకున్నాను.
విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలు. పధ్నాలుగేళ్ళు పాటు విడువకుండా వెళ్ళాను. వీలవదు కానీ ప్రతి ఒకటవ తారీఖున వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. ఇంకా...బయట అమ్మొచ్చిన మొక్కలబ్బాయిని పిలిచేసి, నన్ను బయటకు పిలిచేసి నాతో చేమంతి మొక్కలు కొనిపించేసింది మా చిన్నారి.బయటకు వెళ్ళి వస్తూంటే దారిలో పండగకు ముగ్గు వెయ్యటానికి అని మరో ఐదారు రంగుల పేకెట్లు వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంది. మరోసారి పుత్రికోత్సాహం పెల్లుబికింది. మిగిలిన దినచర్య మామూలే.. కొత్త సంవత్సరం అని పొద్దుపోక మానుతుందా? వెలుతురు నిశీధిగా మారింది. రాత్రి గడిచి మరో ఉదయం ప్రారంభమైంది...ఎన్నో సత్యాలను కళ్ల ముందు ఉంచిన ఈ దశాబ్దపు మొదటి రోజు ఇలా గడిచింది.
మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక వసంతం
మరొక హేమంతం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!
Friday, December 31, 2010
సింహావలోకనం-2 (కొన్ని discovered blogs)

ఇన్వెన్షన్ కీ డిస్కవరీకీ తేడా తెలిసేది కాదు నాకు చిన్నప్పుడు. అప్పుడు నాన్న చెప్పారు "ఏదైన కొత్త విషయాన్ని కనిపెడితే "ఇన్వెన్షన్", ఆల్రెడీ ఉన్నదాన్నే కొత్తగా కనుక్కుంటే "డిస్కవరీ" అని. అలాగ ఈ మధ్యన నేను డిస్కవర్ చేసిన బ్లాగులు కొన్నింటి గురించి ఈ టపాలో రాయాలని. అసలీ సింహావలోకనం-2 ఏమిటంటే, రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. క్రితం ఏడాది అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. ఆ టపా "ఇక్కడ" చూడవచ్చు. ఆ పోస్ట్ లో నేను అప్పట్లో చూసిన బ్లాగుల్లో నాకు నచ్చిన టపాలు కొన్ని ఏరి కూర్చాను.
కానీ ఈ సారి సగం ఏడాది దాకా అసలు నా బ్లాగు నేనే సరిగ్గా రాయలేదు. మూడు కొత్తవి తెరిచి, వాటిల్లోనూ అనుకున్నవి రాయలేకపోతున్నాను. ఇక బ్లాగులు చదవటం, వ్యాఖ్యానించటం కూడా చాలా తక్కువైపోయింది. సగం మంది బ్లాగ్మిత్రులు నన్ను మర్చిపోయారు. అడపాదడపా టపాల్రాసినా వ్యాఖ్యలు రావటం కూడా తగ్గిపోయాయి. అందుకని అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా బ్లాగ్లోకంలో విహరించటం మొదలుపెట్టాను. అప్పుడు పాత బ్లాగ్మిత్రులు చాలామంది టపాలు రాయటం తగ్గించేసారని అర్ధమైంది. బ్లాగుల నాణ్యత తగ్గిపోతోందని కూడా చాలామంది అనుకుంటున్నారని తెలిసింది.
అయ్యో, తెలుగు బ్లాగుల పరిస్థితి ఇదా? అని బాధపడుతూ బ్లాగ్విహారాలు చేస్తున్న ఇటీవల సమయంలో కొత్త బ్లాగులు డిస్కవర్ చేసాను...అంటే నేను అదివరకూ చూడనివన్నమట. నాకు బాగా నచ్చాయి. బ్లాగ్లోక సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి అనిపించింది. వీటిని మించిన మంచి బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ నా పరిధిలో, నా విహరణలో కనబడ్డ బ్లాగులు ఇవి. బ్లాగులను పరిచయం చేసేంత ప్రాముఖ్యం నా బ్లాగుకీ, నాకూ లేకపోయినా, ఈ బ్లాగులను గురించి ఓ నాలుకు వాక్యాలు రాయాలనిపించింది.
ముందుగా అందరికీ తెలిసినదే కానీ నేను ఆలస్యంగా చూసిన మంచి బ్లాగ్..."నీలాంబరి ". నా "సినిమా పేజీ" బ్లాగ్లో శారదగారు రాసిన కామెంట్ వల్ల ఆ బ్లాగ్ తెలిసింది. వీరు చాలా కాలం నుంచీ బ్లాగుతున్నారని ఖజానా చూస్తే తెలిసింది. ఎన్నో జ్ఞాపకాలు, బోలెడు పుస్తకాలు, సంగీతం, సాహిత్యం..ఎన్ని కబుర్లో...చదివిన ప్రతి టపా ఈ బ్లాగర్ పట్ల అభిమానం పెంచేసింది.
"అంచేత నేను చెప్పొచ్చేదేంటంతే!!!!!!" అంటూ చెప్పుకుపోయే ఈయన ఈ బ్లాగ్ మొదలు పెట్టింది చాలా కాలం క్రితమైనా టపాలు చాలా తక్కువగా రాస్తూంటారు. "SHANKY" పేరుతో బ్లాగే ఈయన రాసే పేరడీలు భలే చమత్కారంగా ఉంటాయి. ఆసక్తికరమైన ఈ బ్లాగ్లోని చాలా టపాలను నేనింకా చదవాల్సి ఉంది. మర్క్ చేసుకుని మరీ చదవాల్సినంత మంచి బ్లాగ్ ఇది.
అనుకోకుండా నకు కనబడ్డ బ్లాగ్ "కలం కలలు(పాత బ్లాగ్)" ఈ బ్లాగుని మూసివేస్తున్నాను...అంటూ ఫణీంద్ర అనే ఆయన రాసిన టపా ముందర కనబడుతుంది. చాలా మంది బ్లాగ్మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. ఎందుకు మూసేసారో తెలీదు కానీ పుస్తకాలూ,సాహిత్యం అంటూ ఎన్నో మంచి విషయాలను రాసిన ఈయన మళ్ళీ బ్లాగ్ తెరిస్తే బాగుండును అనిపిస్తుంది ఆ టపాలను చదువుతూంటే.
కొన్ని బ్లాగులు చదవాలంటే సాహిత్యం పట్ల కాసింత అవగాహన, భాషపై పట్టు ఉండాలి. అలాంటి ఒక బ్లాగ్ "కలం కలలు" పైన మెన్షన్ చేసిన బ్లాగ్ పేరూ, ఈ బ్లాగ్ పేరూ ఒకటే. మరి రెండీటికీ లింక్ ఉండా లేదా అన్నది వాళ్ళని అడగి తెలుసుకోవాల్సినదే. మేంఇద్దరం రాస్తున్నం అంటూ "మెహెర్, సంహిత" కలిసి రాసే ఈ బ్లాగ్ నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. సంహితగారు రాసే కవితలు ఎంతో భావయుక్తంగా చక్కని పదాల కూర్పుతో చదువుతూంటే తొలకరి జల్లుని, సంపెంగల సుగంధాన్ని గుర్తుకుస్తాయి. అంత మంచి కవితలవి. ఇక ఈ బ్లాగ్లో రాసే మిగతా సాహిత్యపు కబుర్లు కూడా సాహిత్యాభిమానులను ఆకర్షించేవిగానే ఉంటాయి.
"MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం" రెండు రోజుల క్రితం చూసిన బ్లాగ్ ఇది. బ్లాగ్ పేరు విచిత్రంగా అనిపించి చూద్దామని వెళ్ళా. చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. అని రాసారు. చిన్నప్పటి గ్రూప్ ఫోటోలూ, కబుర్లూ చూసి వాళ్ళ నెట్వర్కకింగ్ ఐడియాకు సలాం చేసేసా. ఈ బ్లాగ్లో చిన్ననాటి ముచ్చట్లే కాక పాటలూ, సినిమాల తాలూకూ కబుర్లు కూడా ఉన్నాయి. ఈ బ్లాగ్లోని గ్రూప్ ఫోటోస్ అవీ చూసి నేను కూడా నా స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకున్న...ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో...ఆటోగ్రాఫ్ బుక్ తీసి ఆ ఎడ్రస్సులకి ఉత్తరాలు రాస్తే జవాబులు వస్తాయా? అనిపించింది. అప్పట్లో ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు మరి. అడ్రసులే ఆధారం.
ఇక "ఇందు" గారి చేస్తున్న "వెన్నెలసంతకం" గురించి నేను కొత్తగా ఏం చెప్పేది? ఈవిడ తోటలోని సీతాకోకచిలుకలు బాగున్నాయి నా తోటలోకి కూడా పంపించమని అడిగాను...ఎప్పటికి పంపుతారో...! ఈ బ్లాగ్ రచయిత్రి కథలు కూడా చాలా బాగా రాయగలరు అని మొదటి కథతోనే నిరూపించేసుకున్నారు.
బ్లాగ్ మొదలెట్టింది క్రితం ఏడాది. రాసినవి ఆరో ఏడో టపాలు. "ఈ పేరు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు" అని గోల పెట్టిన "శివరంజని"గారి పేరు మాత్రం బ్లాగ్లోకంలో మారుమ్రోగిపోతోంది.
ఇది మౌనరాగం కాదంటూ "మనసుపలికే" అపర్ణగారు ఆలపించే మధురమైన రాగాలు బ్లాగ్లోకమంతటా వినిపించేస్తున్నాయి. మా గోదావరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారే అని నేను సంబర పడిన బ్లాగ్ ఇది. ఇటీవలే ఈ బ్లాగ్లో పెట్టిన పాపికొండల ట్రిప్ ఫోటోలు అమాంతం గోదావరి దగ్గరకెళ్ళిపోయి ఆ సోయగాల్ని చూడాలనిపించేలా ఉన్నాయి.
"ఎన్నెల రామాయణం" అని మాలికలో చూసి అటువెళ్ళిన నేను ఆ వెన్నెల చల్లదనం చూసి మైమరచిపోయాను. అంత బాగుంటుంది ఆ చందమామ ఫోటో. టపాలు ఎక్కువ లేకపోయినా ఈ "ఎన్నెల" ఎందుకో మరి నా మనసు దోచేసింది. "వెన్నెల" పేరులో ఉన్న మేజిక్ అది. తెలంగాణా స్లాంగ్ లో ఈవిడ రాసిన ఎన్నెల రామయణం ఎంత చదువుదామని ఆత్రుత పడ్డా ఆ భాషరాక పట్టుమని నాలుగు లైనులైనా చదవలేకపోయాను..:( ఆ టపాలకు వచ్చిన వ్యాఖ్యలు ప్రశంసల వెన్నెలలు వెదజల్లాయి. ఈవిడ మరిన్ని మంచి మంచి టపాలు రాసి చిరునవ్వుల ఎన్నెలలు కురిపించాలని మనవి.
ఈ పల్లవులు కనుక్కోగలరా అని ఈ బ్లాగర్ విసురుతున్న సవాళ్ళు ఎన్నో పాత పాటలనూ, అంతే మంచి జ్ఞాపకాలనూ గుర్తుకు తెస్తున్నాయి. పాటలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చే బ్లాగ్ ఇది. జ్ఞాపకాల గులాబీల పరిమళాలు అంటూ " మెహక్ " గుర్తుచేసే పాటలు అన్నీ మధురమైనవే.
గోదారి సుధీర గారి "పాపాయ్" నేనీమధ్యన చూసిన బ్లాగుల్లో ఒకటి. ఖలీల్ జిబ్రాన్ మాటలతో స్వాగతం చెప్పే ఈ బ్లాగ్లో బెంగాలీ సాహిత్యంతో పరిచయమున్న ప్రతివారికీ ఇష్టమయ్యే "శరత్" ఇల్లు, ఇంకా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకూ కబుర్లు, కొన్ని కథలతో ఆసక్తికరమైన బ్లాగ్ ఇది.
టపాలు తక్కువగా ఉన్నా మంచి అభిరుచి ఉందే అనిపించే బ్లాగ్ "కలభాషిణి" . ఈ బ్లాగ్లో టపాలు చదివితే ఆ సంగతి అర్ధమౌతుంది.
జూన్ నుంచీ మొదలైన "శ్రీసుగన్ ధ్" బ్లాగ్లో కూడా ఆరేడు టపాలకు మించి లేవు. కానీ వీరు టపాలు ఎక్కువ రాస్తే బాగుంటుంది అనిపించేలా ఉన్నాయి 'కేకే'గారి టపాలు.
*****************************
చిగురించే కొత్త ఆశలతో
పెదవుల నవ్వుల హరివిల్లులతో
గెలుపుబాటనే పయనంతో
మధుర క్షణాల జ్ఞాపకాలతో
మీ మరొక సంవత్సరం
నిండాలని మనసారా కోరుతూ
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తృష్ణ.
Thursday, December 30, 2010
గొల్లపూడిగారి "సాయంకాలమైంది"
గతంలో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన "ఎలిజీలు" చదివాకా ఆ పుస్తకం గురించి రాయాలనిపించింది. ఇప్పుడు "సాయంకాలమైంది" చదివగానే నాకు కలిగిన ఆలోచనలు రాయాలనిపించింది. కాబట్టి ఈ టపా నవల చదవగానే కేవలం నాలో కలిగిన అభిప్రాయాల సారం. అంతే.
అన్ని నవలల్లోనూ సాహసకృత్యాలో, రొమాన్సో, జనోధ్ధరణో చేసే హీరోనే ఉండనఖ్ఖరలేదు. కొన్ని నవలల్లో కథను తన చూట్టూ తిప్పుకునే ఒక ముఖ్య పాత్రధారి కూడా ఉంటూంటాడు. అతడే "Protagonist". ఎవరిచుట్టు అయితే కథ మొత్తం తిరుగుతుందో, ఎవరివైపైతే మన సానుభూతి వెళుతుందో, కథలో ప్రాముఖ్యత ఏ పాత్రకైతే ఉంటుందో అతడ్ని Protagonist అంటారు. "శంకరాభరణం" సినిమాలో Protagonist "శంకరశాస్త్రి"గారైతే, గొల్లపూడిగారి "సాయంకాలమైంది" నవలలో Protagonist "సుభద్రాచార్యులు" గారు. సుభద్రాచార్యులుగారి మరణంతో మొదలైన కథ ఆయన పూర్వీకుల చరిత్ర, ఆయన జీవనపయనం ఎలా గడిచిందో మొదలైన విశేషాలతో నడుస్తుంది. కథలో మిగిలిన పాత్రలు బలమైనవే అయినా మొత్తం కథకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ సుభద్రాచార్యులుగారు.
ఇది ఒక Picturesque novel. అంటే చదివే ప్రతి దృశ్యం, సన్నివేశం కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉంటుంది. కళ్ళకుకట్టినట్లున్న వర్ణన ఇది కల్పితం కాదేమో ఎక్కడైనా నిజంగా జరిగిన కథేమో అనిపిస్తుంది. టైటానిక్ సినిమాలో సినిమా అయిపోయాకా పాడుబడిన షిప్లోంచి షాట్ మళ్ళీ లోపలికి వెళ్ళి అందరూ ఆడుతూ పాడుతూ ఉండే దృశ్యాన్ని చూపిస్తారు. అలాగ ఈ నవల చదవటం అయిపోయాకా అందులో పాత్రలన్నీ టాటా చెబుతూ వెళ్పోతున్నట్లు అనిపించింది. 2001లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో సీరియల్ గా వచ్చినట్లు పుస్తకంలో రాసారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తమ పిల్లలు విదేశాలలో ఉండే చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఏమీ మారలేదని ఇంకా దిగజారిపోయిందనే అనిపించింది నాకు.
కథలో నా ఆసక్తి అంతా సుభద్రాచార్యులుగారి పైనే ఉండిపోయింది. ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ, చిన్ననాటి నుంచీ దాన్ని కాపాడుకోవటానికి ఆయన పడే ఆరాటం, తాపత్రయం, అది కాపాడుకోలేకపోతున్నప్పుడు ఆయన పడే మానసిక వేదన ప్రత్యేకంగా వర్ణించకపోయినా పుస్తకం చదువుతున్నంత సేపూ ఆ భావనలు మన అనుభూతికి అందుతాయి. సాంప్రదాయాన్ని కాపాడాలని కాకపోయినా తండ్రిని బాధపెట్టకూడదని, సదాచారానికి ఏ లోటూ రాకుండా కాపాడిన పెదతిరుమలాచార్యులవారి పారంపర్యం సుభద్రాచార్యులుగారు స్వీకరించినట్లు అతని కుమారుడు తిరుమల కొనసాగించలేకపోతాడు. తల్లి మరణించినప్పుడు అతనిలో కలిగిన ప్రకంపనలు తండ్రి మరణం సమయానికి ఉండవు. తండ్రి కర్మకాండలకు ఎప్పుడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండంతా జరిపించటం బాధను కలిగిస్తుంది. ఆ వాక్యంతోనే నవలలో రచయిత చెప్పదలుచుకున్న విషయం అర్ధమైపోతుంది. పెట్టిన నవలాశీర్షికకు అర్ధం గోచరమౌతుంది.
వరదమ్మ కాలంచేసాకా "సుభద్రాచార్యులవారి కథకు కాళ్ళు చేతులు లేవు" అంటారు రచయిత. ఆయన జీవితంలో ఆమె లేని లోటు ఆ ఒక్క వాక్యం చెబుతుంది. "మడిబట్ట ఆరవేసుకోవటం కొత్త...నళీనాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవటం కొత్త" "ఏభైఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద పలకకపోవటం కొత్త" లాంటి వాక్యాలు భార్యను పోగొట్టుకున్న భర్త ఏం కోల్పోతాడో తెలుపుతాయి. ఇద్దరు పిల్లల్ని కని కూడా చివరిరోజుల్లో అలా ఒంటరిగా, వండిపెట్టే దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఈ నిష్ఠాగరిష్ఠులు జీవితంలో సాధించిందేమిటి? అనిపిస్తుంది. అంతవరకూ కాస్తో కూస్తో అభిమానం ఉన్న ఆయన పిల్లలపై కోపం వస్తుంది. రెక్కలు రాగానే కష్టనష్టాలు భరించి పెంచిన తల్లిదండ్రులను మరిచి ఎగిరిపోయే కృతజ్ఞత, బాధ్యత తెలీని పిల్లలపై కోపం వస్తుంది.
ఈ ఉత్కృష్టమైన కథలో ఉదాత్తమైన పాత్ర ఎవరిదైనా ఉందీ అంటే అది సంజీవి పాత్ర.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిండిన ఆ పాత్ర బరువు మిగిలిన పాత్రల మంచితనాన్ని ఆక్రమించేస్తుంది. పెళ్ళి రోజు బహుమతిగా నవనీతాన్ని తిరుమలతో మాట్లాడించినప్పుడే అతని వ్యక్తిత్వం ఆకాశం అంత ఎదిగిపోతుంది. మరొకరిని ప్రేమించే స్త్రీని మనస్ఫూర్తిగా తనదాన్నిగా చేసుకోవటం, జీవితాంతం అదే అనురాగాన్ని, అభిమానాన్ని అందివ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉద్రేకాలు, భేదాలు, ఖేదాలు లేని తృప్తి నిండిన ఆదర్శప్రాయమైన జంట వాళ్లది. మనస్థైర్యం, జీవనవేదాంతం ఉండాల్సిన పాళ్లలో ఉన్న నిండుకుండ నవనీతం పాత్ర.. తనపై జరిగిన అత్యాచారం తన శరీరానికే గానీ మనసుకు, ఆత్మకూ కాదన్న సత్యం అర్ధం అయిన స్థితప్రజ్ఞత నవనీతానిది. తిరుమలతో ఆమెకున్న అనుబంధం ఆత్మబంధం. వాళ్ళిద్దరూ ఆత్మబంధువులు. అంతే. కళ్ళు లేని "నారిగాడిని" పెంచుకుందానని భర్తను అడిగిన ఆమె కోరికలో మరొక బిడ్డ అనాథగా పెరగకూడదన్న సద్భావం కనబడుతుంది.
తల్లిని, చెల్లెలిని గొప్పగా అభిమానించి, ప్రేమించే తిరుమల తండ్రిపై గౌరవాభిమానాలున్నా వాటిని నిలబెట్టుకోలేని అసమర్ధునిలానే కనిపిస్తాడు. తరతరాలుగా మహోన్నతంగా కాపాడబడి వెలిగించబడిన శ్రీవైష్ణవ ఆచారం, సాంప్రదాయం అతని హయాంలో సన్నగిల్లుతుండగా చూసి బాధపడని పాఠకుడు ఉండడేమో. ఎంత వయసు ప్రభావం అని సరిపెట్టుకుందామన్నా శ్యామల విషయంలో అతని తొందరబాటూ, అమెరికాలో పాడ్ తో ప్రేమాయణం తిరుమల పాత్రలోని గాంభీర్యాన్ని పోగొడతాయి. నవనీతం వంటి ఉత్తమురాలితో అతని వివాహం జరగకపోవటమే మంచిదయింది అనిపిస్తుంది. సంజీవి తరువాత నన్ను ఆకర్షించిన మరో పాత్ర కూర్మయ్యది. విద్య వివేకాన్నీ, వినయాన్ని ఇస్తుందన్న వాక్యానికి ఉదాహరణ ఈ పాత్ర.. నవలలో కన్నతల్లిగా వరదమ్మ చూపెట్టిన పుత్రవాత్సల్యం సహజమైనదే. కానీ తండ్రుల్లో కూడా కన్నతల్లికి మించిన పుత్రవాత్సల్యాన్ని "రేచకుడు" పాత్రలో చూసి మనసు ఆర్ద్రమౌతుంది.
తిరుమల ఉన్నతికీ, అతనిలోని ప్రతిభ బయటకు రావటానికీ కారణభూతుడైన వెంకటాచలం ఎంత మంచిపని చేసాడనిపించినా, చివరలో అతనికి వచ్చిన వ్యాధి, కష్టాలు చదివితే నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు వంటి అమయక వైష్ణవుడిని మోసం చేసిన పాపమే అదని అనిపిస్తుంది. ప్రేమ ఎంత గొప్పదైనా తల్లిదండ్రుల గౌరవప్రతిష్ఠలను గాలికి వదిలేసి కూర్మయ్యను వివాహమాడిన ఆండాళ్ళు పాత్ర కూడా అటువంటిదే. తండ్రి పార్ధివశరీరాన్ని దగ్గర నుంచి చూసి, ఆఖరి నమస్కారం చేసుకోలేని దుస్థితి స్వయంకృతమే. కానీ "To err is human" కదా. అందుకనేనేమో మనకు కూడా perfection ఉన్న పాత్రల కన్నా పొరపాట్లు చేసే పాత్రల పట్లే సానుభూతి, దగ్గరితనం కలుగుతుంది. ఎందుకంటే అవి సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు కాబట్టేమో. అలా సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రల్లో మనల్ని మనం పోల్చుకోవటం వల్లనేమో చాలా నవలలు, వాటిల్లోని పాత్రలు మనకు గుర్తుండిపోతాయి.
"భరించరాని దు:ఖం మనిషిని ఆవరించినప్పుడు ఎండు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. అంత:కరణ గల వ్యక్తి ఊహించని మలుపుతో ఏకోన్ముఖుడౌతాడు."
"కన్నీళ్ళు ఆర్ద్రతకీ, అభిమానానికీ, క్షమాపణకీ, పశ్చాత్తాపానికీ, ప్రేమకీ, ఆవేశానికీ అన్నిటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలోనే నష్టపోయిన దురదృష్టవంతుడతను";
"ఇంకా సెంటిమెంటుకు దూరం కాని 22ఏళ్ళ నల్ల పిల్ల";
"కొత్త ఆకర్షణలు అలవాటయి, అవసరమయి, వ్యసనమయి, వదులుకోలేని లంపటమయి...";
"మేధస్సు అగ్నిశిఖలాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్ధాన్ననినా అది జీర్ణం చేసుకుంటుంది."
"మృత్యువు కొందరికి విముక్తి, కొందరికి విజయం, కొందరికి ముగింపు, కొందరికి అవకాశం" మొదలైన నవలలోని ఎన్నో వాక్యాలు గొల్లపూడిగారి జీవితాన్ని, మనుషులనూ ఎంత బాగా అర్ధం చేసుకున్నారో తెలుపుతాయి. శ్రీవైష్ణావ సాంప్రదాయాన్నీ, పధ్ధతుల్నీ ఎంతో శ్రధ్ధతో తెలుపుతూ రాసిన రచనావిధానం ముచ్చటగొలుపుతుంది. అయితే అక్కడక్కడా కథలో చోటు చేసుకున్న కొన్ని "వర్ణనలు" అవసరమా అనిపించాయి. బహుశా ఒక వారపత్రికలో సీరియల్ కోసం రాసినదవటం వల్ల ఆ విధంగా రాయాల్సివచ్చిందేమో మరి. అటువంటి వర్ణనలు, సన్నివేశాలు లేకపోయినా ఈ ఉత్కృష్టమైన కథకు వచ్చే లోటేమీ లేదనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
చదివిన చాలాకాలం మనసు పొరల్లో గుర్తుండిపోయే కథ, పాత్రలు రెండూ ఈ నవల ప్రత్యేకతలే. కేరెక్టర్ ఎనాలసిస్ కు ఉపయోగపడేలాంటి రకరకాల స్వభావాలు గల పాత్రలున్న ఈ నవలను పిజీ స్టూడెంట్స్ సిలబస్ లో ఒకపుస్తకంగా చేరిస్తే బాగుంటుండేమో అని కూడా అనిపించింది. అలాంటి ప్రతిపాదన ఇప్పటికే ఉందేమో తెలీదు మరి.






