"pustakam.net" లో క్రితం ఏడు ప్రచురితమైన నా మొదటి పరిచయం వాడ్రేవు వీరలక్ష్మిగారి “ఆకులో ఆకునై...”
ఇప్పుడు మళ్ళీ రెండవ పరిచయం -- ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు " గురించి. కీర్తిశేషులైన 62 మంది సాహితీప్రముఖుల జీవన విధానాల గురించి వారి వారి కుమారులు,కుమార్తెలు రాసిన వివరాల సంకలనం ఇది. వివరాల కోసం మరి ఓ లుక్ వేసేయండి...
చాలా మంచి పుస్తకం. ప్రతి సాహిత్య అభిమాని ఇంటా ఉండవలసిన పుస్తకం.
మూడేళ్ళ పాప పాడిన ఈ కృష్ణ భక్తిగీతం మా అమ్మాయితో పాటు నాకూ ఎంతో ఇష్టం. రెండేళ్ళ క్రితం ఎవరిదగ్గారో కాపి చేసుకుని మొబైల్లో మా వారు ఈ పాట తెచ్చారు. అప్పటి నుంచీ రాత్రిళ్ళు అన్ని జోలపాటలతో పాటూ మా పాప తప్పక వినే పాట ఇది.
సాహిత్యం:
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా((జయ)) గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే మదనకోమలా కృష్ణా మాధవాహరే వసుమతీపతే కృష్ణా వాసవానుజా వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా విమలపాలకా కృష్ణా వల్లభీపతే కమలలోచనా కృష్ణా కామ్యదాయకా ((జయ))
విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా చరణపల్లవం కృష్ణా కరుణకోమలం కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే భువననాయకా కృష్ణా పావనాకృతే గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా రామసోదరా కృష్ణా దీనవత్సలా ((జయ))
కామసుందరా కృష్ణా పాహిసర్వదా నరకనాశనా కృష్ణా నరసహాయకా దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా పావనాత్మకా కృష్ణా దేహిమంగళం తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో((జయ))
భక్తదాసనా కృష్ణా హరసునీసదా కాదునింతినా కృష్ణా సలహెయావిభో గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా((జయ))
(సాహిత్యంలో ఏవన్నా మార్పులు ఉంటే ఎవరన్నా తెలుపగలరు.)
కలర్స్ ఆఫ్ లైఫ్...అంటే ఇదే అనిపించేలా ఎంత బాగున్నాయో చూడండి ఈ మావిడి కొమ్మలు..!! ఒకే చెట్టు ఆకులకు ఇన్ని రంగులు మనకి మళ్ళీ చెట్లలో నాకు చాలా ఇష్టమైన "రావి చెట్టు"లో కనిపిస్తాయి. ఒకే చెట్టుకు ఎన్నో రంగుల ఆకులు. రీడిఫ్ మైల్ లో ఎక్కడో ఈ ఫోటో కనిపించింది...వెంఠనే బ్లాగులో దూర్చేసా...:)
తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.
1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.
బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :
ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా : అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.
అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.
ఈ బ్లాగ్ రిజిస్టర్ చేసి రెండురోజులైంది. ఇప్పుడు మొదటి టపా రాస్తున్నాను. కూడలికి లంకె ఎప్పుడు వేస్తానో..?!
సాటిలైట్ చానల్స్ హడావుడి లేకుండా రేడియో ఏకఛత్రాధిపత్యం వహించిన 1970s & '80s రోజుల్లో.... "సంగీతప్రియ శ్రోతలకు మీ రామం నమస్కారం.." అంటూ " 4,5 సంవత్సరాల పాటు "రేడియో రామం " గా అప్పటి ప్రముఖ అనౌన్సర్ల లో ఒకరైన మా నాన్నగారు రేడియో లో ప్రొడ్యూస్ చేసిన ఒక సంగీత ధారావాహిక కార్యక్రమం పేరే" సంగీత ప్రియ ". అదే పేరును ఈ బ్లాగుకు పెట్టదలిచాను. ఈ బ్లాగులో అన్నీ సంగీతానికి సంబంధించిన కబుర్లే ఉంటాయి. నాకిష్టమైన పాటలతో పాటు శాస్త్రీయ, లలిత, సినిమా సంగీతానికి సంబంధించినవి; రకరకాల వాద్య సంగీతాలను గురించీ; ప్రముఖ సంగీతకారులూ, సినీ కళాకారుల సంబంధిత టపాలూ ఉంటాయి.
"తృష్ణ" బ్లాగ్లో అదివరకు నేను రాసిన సంగీతపరమైన కబుర్ల కోసం ఆ బ్లాగ్ లోకి తొంగి చూడాల్సిందే...ఎందుకంటే అవి కంటే ఇక్కడ లింక్స్ ఇవ్వలేనన్ని ఎక్కువ కాబట్టి..!!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ఆమధ్యన ఒక 16CD gift pack చూశాను ఒకరింట్లో. "Sur Saaz aur Taal" అని ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారుల వోకల్ సీడీలు + సితార్, సంతూర్, తబ్లా మొదలైన వాద్య సంగీతాలతో నిండిన ఆల్బమ్స్ అవి. అద్భుతమైన కంబినేషన్. ఖరీదు కూడా కొంచెం ఎక్కువే కానీ విడిగా రెండు,మూడు చప్పున కూడా పేక్స్ ఉన్నాయిట. ఆ సీడీస్ తాలూకు ఫోటోస్ క్రింద చూడండి.
"రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళు రాయనన్నావు...మళ్ళీ ఎందుకు రాస్తున్నావు?" అడిగాడు గత పది రోజులుగా నేను రాస్తున్న టపాలు చూసిన మా అన్నయ్య(తను నా బ్లాగ్ రెగులర్ రీడర్). కొన్నాళ్ళుగా నత్త నడక నడుస్తున్న నా బ్లాగ్ను ఒకరోజు చూసుకుంటూంటే, 187 వ టపా నంబరు చూసాను...మేనెల చివరకు బ్లాగ్ తెరిచి ఒక సంవత్సరం అవుతుంది...ఈ లోపూ 200 టపాలన్నా పూర్తి చేస్తే...ఏదో కాస్త "తుత్తి"గా ఉంటుందనిపించింది....కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైనదో తర్వాత కానీ తెలియలేదు.
బ్లాగ్ మొదలెట్టిన దగ్గరనుంచీ నెలకి 20,25 తక్కువ కాకుండా టపాలు రాసిన నాకు ఈ చివరి 10,15 రాయటం ఎంత కష్టమైందో... అది నాకే తెలుసు ! కంప్యూటర్ లేక కొన్నాళ్ళు, ఓపిక లేక కొన్నాళ్ళూ జాప్యం జరుగుతూ వచ్చింది. ...సంవత్సరం లోపూ 200టపాలు పూర్తి అవ్వాలని రూలేం లేదు...రాస్తే ఏ అవార్డులూ రావు. రాయకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఏ ఛాలెంజ్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. అన్నీ వీలుగా ఉన్నప్పుడు టపాలు రాయటం గొప్పేమీ కాదు...పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇలా రాయగలగటం నా మనసుకైతే సంతృప్తినే ఇచ్చింది. నిన్నటి టపాతో డబుల్ సెంచరీ పూర్తయ్యింది. రాయాలనుకున్నవి రాసాను.
బ్లాగుల గురించి ఏమీ తెలియకుండా సంవత్సరం క్రితం మే28న "తృష్ణ..." మొదలెట్టాను.ఈ సంవత్సర కాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులూ, పాఠాలూ...!! మరో పది రోజులకు కూడలిలో నా బ్లాగును లంకె వేయగలిగాను. మరో నెలకు "విజిటర్స్ కౌంటర్" పెట్టడం తెలిసింది. "తృష్ణ వెంట" నడుచుకుంటూ వెళ్ళాను... ఇవాళ్టికి 47,500 పై చిలుకు అతిధులు బ్లాగు చూశారు, ఎవరన్నా ఫాలో అవుతారా? అనుకున్న నా బ్లాగుకు 45 మంది నాతో నడిచేవాళ్ళు చేరారు. సుమారు 760 పైగా వ్యాఖ్యలు సంపాదించగలిగాను. వ్యాఖ్యలు రాయకపోయినా కొత్తగా టపా రాస్తే, రెగులర్గా చదివే 150 పై చిలుకు అతిధులను సంపాదించుకోగలిగాను. ఈ లెఖ్ఖలూ, పద్దులూ ఎందుకు? నా తృప్తి కోసమే. ఏ పేపర్లోనూ పడకపోయినా, ఏ బ్లాగర్ చేతా పొగడబడకపోయినా నాలాంటి సాధారణ గృహిణికి ఒక సంవత్సరం లో ఈ మాత్రం అభిమానాన్ని సంపాదించుకోవటం ఆనందం కలిగించే విషయమే.
నాకు తెలిసిన, అనుభూతికి అందిన ఎన్నో విషయాలను మరికొందరితో పంచుకోవాలని, ఇంకా ఇంకా రాయాలని ఉన్నవి... ఎన్నో ఉన్నాయి...కానీ ఇక తొందర లేదు కాబట్టి అవి మెల్లగా ఎప్పుడో....! ఎందుకంటే బ్లాగ్ వల్ల నేనెంత ఆనందాన్ని,తృప్తినీ పొందానో, అంతే సమానమైన బాధనూ, వేదననూ కూడా పొందాను. ఎందుకు బ్లాగ్ తెరిచాను? ఈ బ్లాగ్ వల్ల కదా ఇంత దు:ఖ్ఖాన్ని అనుభవిస్తున్నాను... అని బ్లాగ్ మూసేయాలని చాలాసార్లు ప్రాయత్నించాను. విరామం కూడా ప్రకటించాను. కానీ ఎప్పుడూ పదిరోజులకన్నా బ్లాగ్కు దూరంగా ఉండలేకపోయాను. ఎప్పటికప్పుడు ఏదో శక్తి నాకు అనుకున్నది రాసే అవకాశాన్ని ఇస్తూనే ఉంది. బహుశా నాలో అంతర్లీనంగా అనుభవాలనూ, సంగతులనూ పంచుకోవాలని ఉన్న తపన దానికి కారణం అయి ఉండవచ్చు. అందుకనే నేను రాసేవి ఉపయోగకరమైనవి, ఎవరినైనా ఎన్టర్టైన్ చేసేవీ అయితే మళ్ళీ మళ్ళీ రాసే అవకాశాన్ని భగవంతుడు తప్పకుండా నాకు ఇస్తాడనే నా నమ్మకం. అందుకే ఈసారి విరామాన్నీ, శెలవునీ ప్రకటించట్లేదు...:)
ఇంతకాలం ప్రత్యక్ష్యంగా వ్యాఖ్యలతో, పరోక్షంగా మౌనంతో నా బ్లాగ్ చదివి నన్ను ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు...!!జీవితంలో ఏనాడూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ నెనెవరినీ ఇబ్బంది పెట్టి ఎరుగను. ఒకవేళ పొరపాటుగా ఎవరికైనా ఎప్పుడైనా వ్యాఖ్యల వల్ల కానీ, టపా వల్ల కానీ ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించగలరు.
ఈ టపాను ప్రముఖ ఆంగ్లకవి "Robert frost " masterpiece అయిన "Stopping By Woods on a Snowy Evening" లోని వాక్యాలతో పూర్తి చేస్తున్నాను... "..But I have promises to keep, And miles to go before I sleep, And miles to go before I sleep. "
పాశ్చాత్య సంగీతంతో నా పరిచయం చిన్ననాటిది. నాన్నగారి కేసెట్స్ ఖజానాలో తెలుగు,హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ మొదలైన భారతీయ భాషలతో పాటూ రకరకాల western Music cassettes కూడా ఉండేవి. Accordion, Electric guitar, Acoustic guitar, Piano, Saxophone, Trumpet మొదలైన western instrumental cassettes; Popular Western Film Themes ఉన్న కేసెట్లు; Vivladi, Mozart, Beethoven మొదలైన మహామహుల Concerts; ABBA, BoneyM, Shadows, Beatles, Ventures మొదలైన band albums; Pop, Jazz, Rock types, Cliff Richards, Connie Francis, Barbra Streisand, Michael jackson మొదలైనవారి individual albums ఉండేవి. అన్నిరకాల కేసెట్స్ తో పాటూ ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళం మేం పిల్లలం.
అవన్నీ విన్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉండేవి. చాలా భారతీయ సినిమా పాటలపై western music impact లేదా వాటి inspiration ఉందన్నది అందరికీ తెలుసున్న విషయమే. కొత్త సినీ సంగీత దర్శకులే కాక, చాలా మంది పాత తెలుగు సినీసంగీత దర్శకులు కూడా western music నుంచి స్ఫూర్తి పొంది చక్కని తెలుగు పాటలు కంపోజ్ చేసారు అన్న సంగతి ఆ western music cassettes వింటూంటే తెలిసేది . western inspirations లోంచి కొన్ని పాటలుగానే కాక పల్లవులుగా, పాటల్లోని ఇంటర్లూడ్ మ్యూజిక్ లా కూడా వచ్చాయి. బహు కొద్ది ఉదాహరణలు చూడండి :
ప్రేమించిచూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,
చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "love is blue" song music నుంచీ,
ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.
ఇలా మన పాత తెలుగు సినిమా పాటల్లో మారువేషాలు ధరించిన పాశ్చాత్య బాణీలు ఎన్నో ఉన్నాయి...అయితే అలనాటి తెలుగు సినీసంగీత దర్శకులు ఒరిజినల్ ట్యూన్స్ తయారు చెయ్యటం లో సిధ్ధహస్తులు కాబట్టి ఈ పాశ్చాత్య బాణీల నుంచి తగినంతవరకే ఇన్స్పిరేషన్ పొందేవారు.
ఇక మేము పెద్దయ్యాకా కాలేజీల్లోకి వచ్చాకా సొంత కలక్షన్స్ మొదలెట్టాము. అప్పుడిక అంతా Vchannel, Mtv పరిజ్ఞానమే. Spice girls, Back Street Boys, Boyzone, Savage Garden మొదలైన ప్రఖ్యాత bands తాలూకు పాటలూ, Celine Dion, Janet jackson, Mariah Carey, Marc Anthony, Ricky Martin, Enrique Iglesias మొదలైనవారి single albums మా కాలేజీ రోజుల్లో బాగా పాపులర్. అవే వినేవాళ్ళం. కొనేవాళ్ళం. టివీలో చూసిన కొన్ని నచ్చిన పాటలు రికార్డ్ చేయించుకునేదాన్ని నేను. విజయవాడలో దొరకకపోతే నాన్న awards తీసుకోవటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు నా చాంతాడంత లిస్ట్ లు ఆయనకు ఇచ్చి వీలైనవి రికార్డ్ చేయించికురమ్మనేదాన్ని. పాపం ఆయన నాకోసం బజారంతా వెతికి మొత్తానికి దొరికినన్ని రికార్డ్ చేయించుకుని వచ్చేవారు.
మా కాలేజీ రోజుల్లో మంచి ఇంగ్లీష్ పాటలు ఉండేవి. అప్పుడు ఫాలో ఐనంత ఇప్పుడు వినట్లేదు కానీ అప్పటి పాటలు మాత్రం ఇతర భాషలతో పాటూ ఇప్పటికీ అస్తమానం మోగిస్తూనే ఉంటాను. Western classical అద్భుతంగా పాడే Barbra Streisand తరువాత నాకు బాగా నచ్చిన female voice "Celine dion"ది. Cliff Richards తరువాత నచ్చే male voice "Marc anthony" ది. ఆ రెండు గొంతులలో పలికే ఆర్తి, భావ ప్రకటన నాకు ఇష్టం.
నాకు బాగా ఇష్టమైన English Songs చాలా ఉన్నాయి కానీ వాటిల్లో బాగా ఇష్టమైన కొన్ని పాటలూ + వాటి సాహిత్యం ఉన్న లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను.
============================ Love Is All Artist: Marc Anthony Lyrics:
-------------------- She's Always A Woman Artist: Billy Joel Lyrics:
------------------------ Rhythm Divine Artist: Enrique iglesias Songwriters: Barry, Paul M; Taylor, Mark P; lyrics:
---------------------------------- Woman In Love Artist: Barbra Streisand : Lyrics:
-------------------- Tell him Artist: Celine dion Lyircs:
------------------ "Nothing's gonna change my love" Artist:Glen Medeiros Lyrics:
"నీ అందం ఆరోగ్యం, నీ చదువూ సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం వందనం, నీ నిదానం నిగ్రహం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు."
"పుట్టిల్లు వదిలి రేపట్నుంచీ అత్తింటికి వెళుతున్నావు. ముత్యం మూడు రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇకనుంచీ నీకు అమ్మా,నాన్న,గురువు,దేవుడు,స్నేహితుడు అన్నీ నీ భర్తే."
"నిన్ను చూసి ఇంకోళ్ళకి కన్ను కుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు."
"కాల్లో ముల్లు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచోకూడదు."
"ప్రతి గుండెలో గోరంతదీపం ఉంటుంది. కటిక చీకటిలా కష్టాలు చుట్టూముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవాలన్న ఆశ. చిగురంత ఆశ."
"నువ్వు చాలా హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్ళను తలుచుకో.చూడ్దానికి రా ! ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు."
"నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి."
"గోరంత దీపం(1978)" సినిమాలో పెళ్ళై అత్తారింటికి వెళుతున్న కూతురు పద్మావతికి తండ్రి సీతారామయ్య అప్పగింతల ముందు చెప్పిన మాటలివి. నిజం చెప్పాలంటే అక్షర సత్యాలు. పెళ్ళైన ప్రతి కూతురికీ తల్లీ,తండ్రీ చెప్పే మాటలు ఇవి. నాకు చాలా ఇష్టమైన చిత్రాల్లో ఇదీ ఒకటి. "ముత్యాలముగ్గు" సినిమా కన్నా ముందు నుంచీ ఈ సినిమా గురించి రాయాలని...ఇన్నాళ్ళకు కుదిరింది.
కథలోకి వెళ్తే...ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని సాధించే అత్తగారూ, ఇంటి బాగోగులు పట్టించుకోని మావగారూ; పెళ్ళికెదిగిన ఆడపడుచు; తల్లిని ఏమీ అనలేని నిస్సహాయుడే కాక భార్యపై కన్ను వేసిన స్నేహితుడి నిజ స్వరూపాన్ని అర్ధం చేసుకోలేని అమాయకపు భర్త, వీరందరి మధ్యా నలిగిపోయే ఒక కొత్త పెళ్ళికూతురు. అపార్ధాలు సృష్టించి భార్యాభర్తలను వేరు చేసినా వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం వారిని ఎలా మళ్ళీ ఒకటి చేసింది అనేది ప్రధానాంశం.
సినిమాలో నాకు బాగా నచ్చినది ఎంత దూరమైనా, అపార్ధాలకు లోనైనా, భార్యాభర్తల మధ్యన అంతర్లీనంగా దాగి ఉన్న నమ్మకం. పరిస్థితులు విడదీసినా,ఎవరెన్ని చెప్పినా ఒకరిపై ఒకరికి తరగని ప్రేమ చివరికి వారిద్దరినీ కలుపుతుంది. చివరి సన్నివేశంలో పద్మ కలిపిన "ఆవకాయ ముద్ద"కు కూడా వారిద్దరినీ కలిపిన క్రెడిట్ దక్కుతుంది...:) ఇరుకు వంటింట్లో భార్యాభర్తల పాట్లూ, సరసాలూ; శేషు-పద్మ బాడ్మింటన్ ఆడే సన్నివేశం; అత్తగారింటికి వెళ్ళినప్పుడు శేషగిరి కి పద్మ ఔన్నత్యం అర్ధమైన సీన్; పద్మను వరలక్ష్మి ఆదరించి ధైర్యాన్ని చెప్పే సన్నివేశం; సినిమా చివరలో శేషు పద్మను కలవటానికి వచ్చినప్పటి సన్నివేశం, ఆ వెనుక వచ్చే మేండొలిన్ బిట్ మొదలైన సన్నివేశాలన్నీ మనసుకు హత్తుకుంటాయి.
బాపూగారి హీరోయిన్స్ లో నాకు నచ్చేది... అందంతో పాటూ అభిమానం, సంస్కారం, ధైర్యం మొదలైన సద్గుణాలే కాక అంతకుమించిన ఆత్మస్థైర్యం. ఈ సినిమాలో కూడా పద్మావతి పాత్ర, ఆమెలోని సహనం, మౌనం, నేర్పూ,ఓర్పూ అన్నీ మనల్ని ఆకట్టుకుంటాయి. చాలా సినిమాల్లో లాగ కాకుండా హెవీమేకప్ లేకుండా, అతి సామాన్యంగా, మధ్యతరగతి కోడలి పాత్రలో ఒదిగిపోయిన వాణిశ్రీగారి నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అతి తక్కువ డైలాగ్స్ తో, హీరోయిన్ కళ్ళతోనే సగం భావాన్ని వ్యక్తపరిచే బాపూగారి దర్శకత్వ ప్రతిభను ఇంకా ఇంకా పొగడగలమే తప్ప కొత్తగా చెప్పవలసింది లేదు.
శేషు పాత్రలో శ్రీధర్, గయ్యాళి అత్తగారిగా సూర్యాకాంతం, శేషు తండ్రిగా రావుగోపాల్రావ్, ఆదినారాయణ పాత్రలో అల్లురామలింగయ్య మెప్పిస్తారు. "నో ప్రాబ్లం" డైలాగుతో పరిపూర్ణ విలన్ గా మోహన్ బాబు తనదైన ప్రత్యేక నటనను కనబరుస్తారు.
"ముత్యాల ముగ్గు"కు ఫొటోగ్రఫీ అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఈ సినిమాకు కూడా తన కెమేరాతో రంగులు దిద్దారు. ఈ సినిమాలో పలు దృశ్యాల్లో అద్భుతమైన మేండొలిన్ వాదన వినిపిస్తుంది. అది "ముత్యాల ముగ్గు" సినిమాలో మనల్ని తన మేండొలిన్ తో అలరించిన ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు శ్రీ సాజిద్ హుస్సేన్ గారే అయిఉంటారని అనుకుంటున్నాను.
ఇక కె.వి.మహదేవన్ గారి సంగీతం; నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరధి గార్ల సాహిత్యం; పాటల చిత్రీకరణ అన్నీ అద్భుతమే. ఈ సినిమాలో నాకు 3 పాటలు చాలా ఇష్టం. ముందుగా టైటిల్ సాంగ్...ఈపాటను ఇక్కడ వినవచ్చు. పాట మీద ఇష్టం కొద్దీ సాహిత్యాన్ని కూడా రాస్తున్నాను.
౨చ:కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి
నీళ్ళులేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి
ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
"అమ్మా, మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?" అడిగింది మా చిన్నారి. పేస్ట్ లో ఉప్పా? అడిగాను ఆశ్చర్యంగా. నా అజ్ఞానానికి జాలిపడుతూ "ఈసారి నీకు చూపిస్తాను ఆ "ఏడ్" టీవీలో వచ్చినప్పుడు" అంది సీరియస్ గా. శెలవులు కావటం వల్ల ఎక్కువగా అడ్డుకునే అవకాశం లేక వదిలేయటం వల్ల వాళ్ళ నాన్నమ్మతో పాటూ స్వేచ్ఛగా బుల్లితెర వీక్షించటానికి అలవాటుపడింది మా చిన్నది. నెల మొదట్లో సరుకులకు వెళ్ళినప్పుడు తోడు వచ్చింది. ఎప్పుడు వెళ్ళిందో, పేస్ట్ లు ఉన్న వైపు వెళ్ళి "కాల్గేట్ సాల్ట్" టూత్ పేస్ట్ తెచ్చేసుకుంది. "అమ్మా, నేను ఈ పేస్ట్ తోనే పళ్ళు తోముకుంటాను" అంది. పెళ్ళయేదాకా నాన్న కొనే "వీకో వజ్రదంతి", ఆ తరువాత అత్తారింట్లో వాడే "పెప్సొడెంట్" తప్ప వేరే పేస్ట్ ఎరగని నేను పిల్లదాని పంతానికి తలవంచక తప్పలేదు.
నేను సరుకులు కొనే హడావిడిలో పడ్డాను. ఈసారి మా చిన్నది "డెట్టాల్" సబ్బుతో తిరిగి వచ్చింది. "అమ్మా, నేనింకనించీ ఈ సబ్బుతోనే స్నానం చేస్తాను. ఈ సబ్బుతో రుద్దుకుంటే క్రిములు ఒంట్లో చేరవు తెలుసా?" అంది. "ఎవరు చెప్పారు?" అన్నాను అనుమానంగా చుట్టూ చూస్తూ... షాపులో ఎవరన్నా చెప్పారేమో అని. "టీ్వీ ఏడ్ లో చూశాను నేను" అంది. నేను "డవ్" తప్ప మరోటి వాడను. పాపకు 'జాన్సన్ బేబి సోప్' మానేసాకా ఇప్పటిదాకా దానికీ "డవ్" సోపే. ఇప్పుడు కొత్తగా దానికో కొత్త సబ్బు?! నాకు కాలేజీరోజులు గుర్తు వచ్చాయి...కాలేజీలో ఎవరో చెప్పారని ఇంట్లో అందరూ వాడే సబ్బు కాక "ఇవీటా"(అప్పట్లో కొన్నాళ్ళు వచ్చింది) కొనుక్కుని వాడతానని అమ్మని ఒప్పించటానికి నేను పడ్డ పాట్లు...
ఇంకా అదేదో నూనె వాడితే జుత్తు ఊడదనీ, హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూతో తల రుద్దుకుంటే డేండ్రఫ్ పోతుండనీ, "డవ్" వాళ్ళు కొత్తగా ఏదో ఒంటికి రాసుకునే క్రీమ్ తయారు చేసారనీ...అవన్నీ నన్ను కొనుక్కోమనీ పేచీ మొదలెట్టింది. నీ పేస్ట్, సబ్బు కొన్నాను కదా నాకేమీ వద్దులే అనీ దాన్ని ఒప్పించేసరికీ షాపులోని సేల్స్ గార్ల్స్ నవ్వుకోవటం కనిపించింది...!
సరుకులు కొనటం అయ్యి హోమ్ డేలివెరీకి చెప్పేసి రోడ్డెక్కాం. సిటీ బస్సొకటి వెళ్తోంది..."అమ్మా, ఆ బస్సు మీద చూడు.."అంది పాప. "ఏముంది?" అన్నాను. ఆ బస్సు మీద నాన్నమ్మ రాత్రి చూసే సీరియల్స్ లో ఒకదాని బొమ్మలు ఉన్నాయి. ఇంకా చాలా బస్సుల మీద ఇదే సీరియల్ బొమ్మలున్నాయి తెలుసా? అంది. "ఓహో..." అన్నా నేను. దారి పొడుగునా నాకా సీరియల్ తాలూకూ కధ వినక తప్పలేదు. అమ్మో దీని శెలవులు ఎప్పుడు అయిపోతాయో అనిపించింది. మా పాప పుట్టని క్రితం ఎవరి ఇంటికన్నా వెళ్తే వాళ్ళ పిల్లలు టి.వీ.సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడుతుంటే, ఆ తల్లిదండ్రులు మురిసిపోతూంటే తిట్టుకునేదాన్ని. ఇవాళ నన్నా తిట్లు వెక్కిరిస్తున్నట్లనిపిస్తోంది...
ఇక ఇలా కాదని, మా గదిలో టి.వీలో కార్టున్స్ పెట్టి చూపించటం మొదలుపెట్టాను. సీరియల్స్ చూడటం అయితే మానేసింది కానీ పోగో, కార్టూన్ నెట్వర్క్ చానల్స్కు అతుక్కుపోయింది. "పోగో" పిచ్చి అంత తేలికగా పోయేది కాదని అర్ధమైంది. కలరింగ్ బుక్స్, బొమ్మలూ,ఆటలూ...మొదలైన పక్కదారుల్ని పట్టించా కానీ "చోటా భీం", "హనుమాన్" కార్టూన్ల టైమ్ అవ్వగానే కీ ఇచ్చినట్లు టీవీ దగ్గరకు పరుగెత్తే పిల్లను ఎంతకని ఆపగలను? ఇక నా ఉక్రోషం మావారి వైపు తిరిగింది. ఆ కంప్యూటర్ బాగున్నంత కాలం పిల్ల టీవీ వైపు కన్నెత్తి చూడలేదు. కంప్యూటర్లో గేమ్స్, కౌంటింగ్ గేమ్స్, రైమ్స్ అంటూ ఏవో ఒకటి చూపిస్తే చూసేది.....అది బాగుచేయించండి...అంటూ పోరు పెట్టాను. (పనిలో పని నాక్కూడా బ్లాగ్కోవటానికి వీలుగా ఉంటుండని...) ఇక లాభంలేదనుకుని ఒక వారం రోజులు రకరకాల షాపులు తిరిగి, దొరకదనుకున్న "పార్ట్" ఎలాగో సంపాదించి మొత్తానికి మొన్ననే నా సిస్టం బాగుచేయించారు. నాలుగైదు నెలల విరామం తరువాత పనిచేస్తున్న నా సిస్టం ను చూసుకుని మురిసిపోయాను.
సిస్టం బాగయ్యాకా ఇప్పుడు టీవీ పిచ్చి కాస్త తగ్గింది కానీ పూర్తిగా మానలేదు. ఇక శెలవులు ఇంకో పదిహేను,ఇరవై రోజులుంటాయి...అంతదాకా తప్పదు అని సర్దిచెప్పుకుంటున్నాను. టీవీ ఎంత ప్రమాదకరమైన మాధ్యమమో, చిన్న పిల్లల్ని కూడా ఏ విధంగా ప్రభావితం చెయ్యగలదో అనుభవపూర్వకంగా అర్ధమైందిప్పుడు. కానీ దాని దుష్ప్రభావం పిల్లలపై పడకుండా ఎలా కాపాడుకోవటం అనేది ప్రస్తుతం నా బుర్రను దొలుస్తున్న ప్రశ్న.. కేబుల్ కనక్షన్ పీకించెయ్యటమో, టీవీని అమ్మేయటమో చెయ్యగలమా? పనవ్వగానేనో, ఆఫీసు నుంచి రాగానేనో మెకానికల్ గా టీవీ రిమోట్ పట్టుకునే మన చేతులు అంత పని చెయ్యగలవా??
ఆలోచిస్తుంటే, పిల్లల పదవ తరగతి అయ్యేదాకా టీవీ కొనకుండా, ఆ తరువాత కొన్నా, డిగ్రీలు అయ్యేదాకా కేబుల్ కనక్షన్ పెట్టుకోకుండా కాలక్షేపం చేసిన మా పిన్ని నాకు గుర్తు వచ్చింది.మనసులోనే పిన్నికి "హేట్సాఫ్" చెప్పేసాను.
"నాకు వర్కింగ్ ఉమెన్ హెల్పింగ్ గా పసిపిల్లల కోసం ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండేలాంటి "క్రెష్" పెట్టాలని ఉందిరా..." అంటుంది కాంతిమతి. సీత బాబు గురించి తెలుసుకుని కిషోర్,మంజుల ఆశ్చర్యపోతారు. ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను, వేదనా భరితంగా ఉన్న వదనాన్ని చూసి తల్లి ఈ సంఘటనకు ఎంతకా కుమిలిపోతోందో అర్ధం చేసుకుంటాడు కిషోర్. ఆ మధ్యాహ్నం ప్రకాశరావుగారి దగ్గరకు వెళ్ళి తన అభిప్రాయం చెబుతుంది ఆమె. అంతటి కార్యభారాన్ని నెత్తిన వేసుకునే ముందు అందులోని లోటుపాట్లు, ఇబ్బందులూ అన్నింటి గురించీ వివరిస్తారు ఆయన. తన ఇంట్లో క్రింద భాగాన్ని కేర్ హోమ్ కు ఉపయోగిస్తాననీ, మంగను సాయానికి పెట్టుకుంటాననీ, పిల్లల్ని తీసుకురావటానికి రిక్షాబండి మాట్లాడుకుంటాననీ, ఒక ఎక్స్పరిమెంట్ లాగ చేస్తాను...విఫలమైతే వదిలేస్తాననీ తన పధకాన్ని వివరిస్తుంది కాంతిమతి. ఆమె ప్రయత్నం జయప్రదం కావాలని ఆశీర్వదిస్తూ ఆయన తన డిస్పెన్సరీ నుంచి ఒక ఉయ్యాలను బహుకరిస్తాననీ, తెలిసిన లేడీ డాక్టర్స్ దగ్గర నుంచి మరికొన్ని ఉయ్యాలలు ఇప్పిస్తాననీ, బండి కుదిరే దాకా తన కారును వాడుకోమని, డ్రైవ్ చేయటానికి కొడుకు సురేష్ ను పంపిస్తాననీ హామి ఇస్తారు. "అన్నయ్యా,నోట్లో మాట నోట్లో ఉండగానే ఇంత సహాయం చేస్తున్నావని... " థాంక్స్ చెప్తున్న ఆమెకు ఏనిగెక్కినంత ఆనందంతో మాటలు రావు. "ఏం చేసి ఏం లాభమమ్మా! నీ సంసారం చక్కదిద్దలేకపోయాను...అతను ఇలా చేస్తాడనుకోలేదు..." తానే కుదిర్చిన సంబంధం అలా అయ్యిందని బాధ పడతారు ప్రకాశరావుగారు.
అక్కడనుంచి వెళ్తూ వెళ్తూ మంగ ఇంటికి వెళ్ళి ఆమె సాయాన్ని అడుగుతుంది. వాళ్ళీంట్లోవాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. శారద పాప, మరిద్దరు పిల్లలతో కాంతిమతి హోమ్ మొదలౌతుంది. నెల రోజుల్లో పదిహేను మంది పిల్లలు చేరుతారు. సురేష్ సాయంతో మంగ రోజూ ఆ పిల్లలను ఇళ్ళ దగ్గరనుంచీ తీసుకువచ్చి, సాయంత్రం దింపి వస్తూంది. మంగ చెల్లెలు పూర్ణ కూడా వాళ్ళకు తోడౌతుంది. ఒకరోజు మంగ కోసం వాళ్ళీంటికి వెళ్ళిన కాంతిమతికి మంగ మామ్మగారు, ఇంకొక ముసలావిడ కనపడతారు.ఆ ముసలమ్మ వాళ్ళ ఊరు తాలూకా అనీ, కొడుకూ,కోడలూ వెళ్లగొట్టారనీ, హోమ్లో ఏదైనా పని ఇప్పించమనీ, కూడూ గుడ్డా ఇస్తే చాలనీ, జీతం భత్యం అక్కరలేదు వేడుకుంటారు వాళ్ళు. కాంతిమతికి వైజాగ్లో చనిపోయిన సుబ్బాయమ్మగారు, నీరజ అత్తగారు, రేవతి వియ్యపురాలు గుర్తు వస్తారు. మంగ మామ్మగారు కూడా మనవరాళ్ళకు సాయంగా హోమ్లో పని చేస్తానని కోరుతుంది. ఆలోచిస్తు ప్రకాశరావుగారి ఇంటికి చేరుతుంది కాంతిమతి.
ఆవిడ ఆలోచన విని "నీకు మతి పోతున్నట్లుంది. ఇవాళ ఇద్దరితో మొదలెడితే రేపు పది మంది అవుతారు. అంత మందిని పోషించటం నీ ఒక్కదానివల్లా అవుతుందా?" అని ప్రశ్నిస్తారు ఆయన. ఈ ఆలోచన ఈవాల్టిది కాదనీ, శైలు దగ్గరకు వెళ్ళినప్పుడు, మద్రాసులో ఎదురైన సంఘటనలు ఎలా ఆలోచింపజేసాయో చెప్తుంది కాంతిమతి. అంతేకాక కాలంతో వస్తున్న ఆర్ధిక,సాంఘిక రంగాల్లోని మార్పులు మనుషుల దృక్పధాల్లో మాత్రం రావట్లేదని వాపోతుంది. ఆడవారికి ఆర్ధిక స్వాతంత్ర్యం అన్నారు కానీ, వేల సంఖ్యలో ఉద్యోగాల్లో మహిళలు చేరినా వాళ్ళ సమస్యల్ని ఎవరు పట్టించుకోవట్లేదనీ, పరిష్కారమార్గాల కోసం ప్రయత్నించేవారెవరని ప్రశ్నిస్తుంది. పారిశ్రామీకరణ వల్ల సమిష్టి కుటుంబాలు విచ్ఛిన్నమై, చిన్న కుటుంబాలేర్పడ్డాయి...ఆనేకకారణాలవల్ల భద్రత కరువైన ఎందరో అభాగినులగురించి ఎవరు పట్టించుకుంటున్నారు? కవిత్వాల్లో,కథల్లో తప్ప కనిపించని ప్రేమ మీద పేజీలకు పేజీలు రాసే రచయితలు వీరిని గురించి పది పంక్తులు రాయగలరా? వేదికనెక్కే మహిళామణులూ, మహిళా సంఘాలు వీరిని గురించి పట్టించుకుంటారా? ఉద్యోగాల రీత్యా భార్యాభర్తలే ఒకచోట ఉండలేనప్పుడు కుటుంబాల్లో వయసుమళ్ళిన పెద్దలు ఎక్కడ ఉండాలి? ఒకవేళ కలసి ఉన్నా చాలీచాలని జీతాలతో సంసారం గడపటమే కష్టమైన సామాన్యమధ్యతరగతివారికి పెద్దలు భారమవటంలో తప్పులేదన్నయ్యా.....అంటూ తన ఆవేదన తెలుపుతుంది. "....అలాగని శక్తి ఉడిగినవాళ్ళంతా మరణించాలని కోరుకోము కదా. ఈ వృధ్ధాప్యం అందరూ అనుభవించే అవస్థే...వీరికి నా వంతు సహాయం చేయాలనేది నా ఆలోచన అన్నయ్యా. .." అని ముగిస్తుంది కాంతిమతి.
"అప్పుడప్పుడు నువ్విలా దుమ్ము దులిపి పెట్టకపోతే ఈ ముసలి బుర్ర ఎప్పుడో తుప్పు పట్టి ఉండేదమ్మా..." అని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటారు ప్రకాశరావుగారు. నా పరిస్థితులూ, నా చుట్టుపక్కలవారి సమస్యలు, నా సమస్యలూ నన్నిలా ఆలోచింపజేసాయి. కానీ వాటికి కార్యరూపాన్ని ఇవ్వాలంటే నీ సహాయం అవసరం...అని ఆయన అంగీకారంతో ఇల్లు చేరుతుంది ఆమె. పిల్లలను రోజూ హోమ్ కు తీసుకువచ్చే పని వల్ల సురేష్, మంగ స్నేహితులుగా, ఆత్మీయులుగా మారతారు. సురేష్ లో వస్తున్న ఒబ్బిడితనాన్ని,బాధ్యతనూ మార్పును చూసి ప్రకాశరావుగారూ, కాంతిమతి సంతోషిస్తారు. ఆపైన ఆ మార్పుకు కారణం మంగ అని తెలుసుకుని వారిద్దరిని ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు. హోమ్ లో చేస్చుకున్న వృధ్ధమహిళలతో కూరగాయల తోట, అప్పడాలు పెట్టించటం, టైలరింగ్ వచ్చినవాళ్ళతో ఆ పని, పచ్చళ్ళు పెట్టించటం మొదలైన స్వయం ఉపాధి పనుల ద్వారా హోమ్ లోని మహిళలకు ఎంతో కొంత ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తుంది కాంతిమతి. అయితే పెరుగుతున్న పిల్లల, వృధ్ధుల సంఖ్య వల్ల కొన్ని ఆర్ధిక ఇబ్బందులను, సమస్యలనూ కూడా ఎదుర్కుంటుంది ఆవిడ. పెద్దకోడలు జానకి వచ్చి ఇంటిలో వాటా ఇమ్మని గొడవ పెడుతుంది కూడా.
ఒకరోజు ప్రకాశరావుగారు కాంతిమతి హోమ్ ను చూస్తానన్న ఒక మిత్రుడు విశ్వనాధాన్ని తీసుకు వస్తారు. ఆయన హోమ్లో మగవారిని కూడా చేర్చుకోమని సలహా ఇస్తారు. పట్టుబట్టి కాంతిమతితో మద్రాసులో కూడా మరొక హోమ్ ను ఏర్పాటు చేయించి మంత్రిగారితో రిబ్బన్ కట్ చేయిస్తారు. అక్కడి పనులు కాంతిమతి తన స్నేహితురాలు రేవతి వియ్యపురాలికి అప్పగిస్తుంది. నెమ్మదిగా ఆమెలో ఎంతో మార్పు వచ్చి కోడలిని బాగా చూసుకోవటంతో దానికి కారణం కాంతిమతే అని రేవతి చాలా సంతోషిస్తుంది. "రిటైరవ్వగానే ఆశ్రమానికి వెళ్ళిపోవాలనీ,మోక్ష సాధన చేసుకోవాలని అనుకున్నాను. కుదరలేదని బాధపడ్డాను. కానీ ఇలా నా చుట్టూ ఉన్నవారి కష్టాలు పంచుకోగలిగి, నలుగురికీ మంచి చెయ్యగల జన్మనే భగవంతుడు నాకు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని" సజల నయనాలతో కోరుకుంటుంది కాంతిమతి. మద్రాసులో హోమ్ అద్దె ఇంట్లోంచి నూతన భవనం ఏర్పడి అందులోకి మారుతుంది. వైజాగ్, హైదరాబాదుల్లో కూడా హొమ్స్ పెట్టాలని చాలా మంది ముందుకు రావటంతో కాంతిమతి ప్రయాణాలూ పెరుగుతాయి.
ఒక ప్రయాణం తరువాత అలసినిద్రపోతున్న ఆమెను, హోమ్లో చేరటానికి ఎవరో వచ్చారని విశ్వనాధంగారు కబురు చేస్తే ఎవరో నిద్ర లేపుతారు. మీరు చేర్చుకోకపోయారా అంటూ వస్తుంది కాంతిమతి. ఈయన మిమ్మల్ను చూడాలని కోరుకుంటున్నారు అంటారు విశ్వనాధం గారు. దుబ్బులా పెరిగిన జుట్టు, బాగా పెరిగిన గడ్డం, జ్వరం తో నిలువెల్లా వణికిపోతూ, నిండుగా పాత దుప్పటి ఒకటి కప్పుకున్న ఆ అరవైఏళ్ళు పైబడిన మనిషిని విచిత్రం గా చూస్తారు అంతా. కిషోర్ వచ్చి పరీక్ష చేసి మందు ఇస్తాడు. నాకేమన్నా అయితే అంత్యక్రియలు నువ్వు కానీ, మీ అన్నయ్య కానీ చేస్తారా? అనడుగుతాడు ఆయన. నాకన్నయ్య ఉన్నట్లు మీకెలా తెలుసు? మీరెవరు? అనడుగుతాడు కిషోర్. "నా పేరు..గోపాల్రావ్.." అంటాడాయన అతికష్టమ్మీద. ఆశ్చర్యపోతారు అంతా. ఈ వృధ్ధాప్యంలో తనను వెతుక్కుంటూ వచ్చిన భర్తకు తానే సపర్యలు చేయటం తన కర్తవ్యమని భావిస్తుంది కాంతిమతి. పదిహేనురోజులకు కాస్త కోలుకుంటాడు అతను. కబురు చేయగానే శైలూ,కృష్ణా కూడా శెలవు పెట్టుకుని ఆయనను చూడటానికి వస్తారు.
ఒకరోజున పరీక్ష చేసి వెళ్పోతున్న కిషోర్ ను ఇన్నాళ్ళూ రాత్రి, పగలు సపర్యలు చేసిన కాంతిమతి కాస్త తగ్గగానే కనబడట్లేదేమని అడుగుతాడు గోపాల్రావ్. అదేం లేదనీ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఉపవాసం ఉందట. ఇన్నాళ్ళ కరస్పాన్డెన్స్ లు అవీ చూసుకుంటోంది...అంటాడు. మీ అమ్మకు నేను క్షమించలేని అన్యాయం చేసాననీ, చిన్న పని చేసి పెట్టమని అడుగుతాడు గోపాల్రావ్. తన వీలునామా, ఒక పేకెట్, ఇక్కడకు వచ్చేముందు తాను రాసిన ఒక ఉత్తరం కాంతిమతికి అందజేయమని ఇస్తాడు. అవి కాంతిమతికి ఇవ్వటానికి వెళ్తాడు కిషోర్. "అరవిందాశ్రమం నుండి ఉత్తరం వచ్చింది..రెండు,మూడు వేకెన్సీస్ ఉన్నాయని...హోమ్నెవరికైనా అప్పగించి వెళ్ళాలని.." అంటుంది కాంతిమతి. "ఇంతమందికి ఆశ్రయం కల్పించావు. ఇంకా ఆశ్రమం మీద మోజు పోలేదా అమ్మా? అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకో.." అని మందలింపుగా అని వెళ్పోతాడు కిషోర్. ఈ వయసులో ఏం ఉత్తరం రాసారో ఈయన అనుకుంటూ చదవటం మొదలెడుతుంది కాంతిమతి.
ప్రియమైన కాంతీ...అంటూ మొదలెట్టి, తన రెండవ భార్య రమ ఆ రోజు చెప్పినట్లు కాలేజీలో ఏ ప్రేమాయణం జరగలేదనీ..కేవలం స్నేహంతోనే ఆగిపోయిందనీ..,కాంతిమతిని తాను ఇష్టపడే వివాహం చేసుకుని ఎంతగానో ప్రేమించాననీ రాస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ట్రాన్స్ఫర్ అయిన చోట మళ్ళీ తన ఆఫీసులో టైపిస్ట్ గా కనబడిందనీ, పాత పరిచయాన్ని పురస్కరించుకుని వస్తూ వెళ్తూ ఉండేదనీ, ఒక బలహీన క్షణంలో లొంగిపోయాననీ ఇక పెళ్ళి చేసుకోక తప్పలేదనీ రాస్తాడు. ఆ రోజు ఇవన్నీ నీకు చెబుదామని వచ్చాను కానీ నీ మౌనం నా అహాన్ని దెబ్బతీసింది. నా అండ లేకుండా నువ్వు పిల్లల్ని పెంచలేవనీ మళ్ళీ నా దగ్గరకు వస్తావనే అహంకారంతో,కోపంతో వెళ్ళిపోయాననీ; కానీ ఆ తరువాత రమ తనను రానివ్వలేదనీ, తనకు వచ్చిన ఉత్తరాలను కూడా అందనివ్వలేదనీ రాస్తాడు. రమతో పంచుకున్న జీవితమంతా నరకం అనుభవించాననీ, రమ చనిపోయాకా ఆమె ద్వారా పుట్టిన ముగ్గురు ఆడపిల్లలకూ వాళ్ళ వాటా పంచి ఇచ్చేసి, కాంతిమతి హోమ్ గురించి పేపర్లో చూసి చివరి రోజుల్లో అక్కడే చేరాలనీ, కాంతిని క్షమాపణ అడగాలని వచ్చాననీ రాస్తాడు. ఆ రోజు కాంతిమతి మరచిపోయి వెళ్ళిన చీరను రమ కళ్ళ బడకుండా ఇన్నాళ్ళూ పదిలంగా దాచాననీ, తనను ఇప్పటికైనా క్షమించగలిగితే పేకెట్లో తాను పంపిన ఆ చీరను కట్టుకుని రమ్మని, లేకుంటే ఆమెకు ఇక బాధ కలిగించకుండా మరెక్కడికైనా వెళ్పోతాననీ ఉత్తరం ముగిస్తాడు గోపాల్రావ్.
ఉత్తరం చదివిన కాంతిమతి సంతోషానికి అవధులుండవు. తాను ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్య అన్న నిజమే ఆమెకు ఎనలేని తృప్తిని కలిగిస్తుంది. వెంఠనే వెళ్ళి మీరిక్కడే ఉండిపొండి అనడగాలని తొందరపడుతుంది. పేకెట్లోంచి చీర తీస్తుంది ఆమె. అదే చీర. ఆయన మనసుపడి తనకోసం కొన్న చీర. కట్టుకునే ఓపికలేక భుజాలకు కప్పుకుని మెట్లు దిగుతుంటే ఊపిరి పీల్చటం కష్టమౌతుందామెకు. లక్ష్యపెట్టక శక్తినంతా కూడదీసుకుని బలవంతాన మెట్లు దిగి గోపాల్రావ్ గదిలోకి వెళ్ళి అతని చేతుల్లో వాలిపోతుందామె. "కాంతీ.." అన్న గోపాల్రావ్ కేకకు హోమ్ అంతా అదిరిపోతుంది. కిషోర్ వచ్చి ఇంజెక్షన్ చేసినా ఫలితం ఉండదు...ఆ ముక్కోటి ఏకాదశి నాడు భర్త ఒడిలో, పిల్లల సమక్షంలో ఆఖరి శ్వాస విడుస్తుంది కాంతిమతి. తీర్థప్రజల్లా వచ్చి కన్నీరు పెట్టుకుంటారు తెలిసినవాళ్ళంతా....వెళ్తూ వెళ్తూ కృష్ణ తండ్రిని వచ్చి తనతో ఉండమంటాడు. "మీ అమ్మ ఈ హోమ్కు ఊపిరి పోసి తను ఊపిరి వదిలింది బాబూ...నాలాంటి నిర్భాగ్యులకోసమే కోసమేరా ఈ హోం..!" అంటాడు గోపాల్రావ్.
(హమ్మయ్య...అయిపోయింది. )
(ఈ నవల 35ఏళ్ళ క్రితం రాసినదైనా అప్పటికీ, ఇప్పటికీ రచయిత్రి ఎత్తి చూపిన సమస్యల్లో పెద్ద సంఖ్యల్లో బేబి కేర్ సెంటర్లు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ తప్ప మిగిలిన వాటిలో పెద్దగా మార్పు వచ్చినట్లు నాకయితే కనిపించలేదు...ఆశ్చర్యం !!)
చీకటివేళ ఖాళీ చేతులతో ఇంట్లోకి అడుగుపెట్టిన కాంతిమతిని చూసి "అప్పుడే వచ్చేసావేం? అబ్బాయి ఊళ్ళో లేడా? చేతిలో సంచీ ఏది?" అని పలకరిస్తుంది అత్తగారు. అవునని తలఊపి..బ్యాగ్ రైల్లో పోయిందని చెబుతుంది కాంతిమతి. "అమ్మా నాన్న దగ్గరకు మమ్మల్ని తీసుకువెళ్ళలేదేం" అని కాళ్ళకు చుట్టుకున్న పిల్లలను చూడగానే దు:ఖ్ఖం ఆగదు అమెకు. తన కర్తవ్యం ఏమిటి? బిడ్డల మాటేమిటి? రాజీపడి ఎలా జీవించటం? మొదలైన సాగర కెరటాల్లాంటి అంతులేని ప్రశ్నలు వేధిస్తాయామెను. మరుసటి ఆదివారం గోపాల్రావ్ వస్తాడు. భర్త అదివరలో తనకు ప్రేమగా కొనిపెట్టిన, తను అక్కడ వదిలేసి వచ్చిన చీర తీసుకువస్తాడని అనుకున్న ఆమెకు నిరాశే ఎదురౌతుంది.
ఉన్న రెండురోజులు అతనికి దూరంగానే మసలుతుంది కాంతిమతి. క్షమాపణ చెబుతాడని ఎదురుచూస్తూంటే "వారం వారం వస్తూ ఉంటాలే" అన్న అతడి మాటలు ఆమెను ఇంకా కృంగదీస్తాయి. మౌనంగా,దురంగా ఉంటున్న భార్య ప్రవర్తన అతడికి అవమానంగా తోచి "ఏం చూసుకుని అంత పొగరు? నా అండ లేకుండా ఆ పంతులమ్మ ఉద్యోగంతోనే పిల్లల్ని పెద్దచేస్తావా?" అని ప్రశ్నిస్తాడు వెళ్తూ వెళ్తూ. తల వాల్చుకుని కన్నీరు దాచుకుంటున్న కాంతిమతి "ఆమెనయినా నట్టేట ముంచకుండా కాపురం చేయండి..." అని మాత్రం అంటుంది . కాసేపు నిలబడి ఒక సుదీర్ఘశ్వాస విడిచి వెళ్పోతాడు గోపాల్రావ్.
విషయం తెలీక కోడలిని మందలించబోయిన అత్తగారికి అసలు సంగతి చెబుతుంది కాంతిమతి. అవాక్కయి కూర్చుండిపోతుంది అత్తగారు. "వాడుండగా చెబితే లెంపలు వాయిద్దును. మహాలక్ష్మిలాంటి నీ ఉసురు పోసుకున్నాడు..?" అని బాధపడుతుంది ఆమె కూడా. "అబ్బాయి నచ్చిందన్నాకే ముహుర్తాలు పెట్టించామే అమ్మా..నిన్ను ఇష్టపడే చేసుకున్నాడే..." అని మాత్రం అంటుందామె. శాపంగా మారవలసిన రాత్రులను వరంగా మార్చుకుని రెండేళ్ళలో ఎమ్.ఏ ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, టీచర్ ట్రైనింగ్ చేసి అత్తగారు పట్టుబట్టి తన పేర రాసిన ఇంట్లోనే ఉంటూ, ప్రకాశరావుగారి సాయంతో అదే ఊళ్ళో లెక్చరర్ అవుతుంది కాంతిమతి. ఆ వెళ్ళిన రోజు తరువాత ఉత్తరం ముక్కయినా రాదు గోపాల్రావ్ నుంచి. తల్లి పోయినప్పుడు ఒకసారి, కూతురు పెళ్ళికి ఒకసారి వస్తాడంతే. కూతురు పెళ్ళికి వచ్చినప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిన తండ్రిని "ఆరోగ్యం బాగాలేదా" అని పిల్లలు ప్రశ్నిస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడే తప్ప మాత్లాడడు అతను. ఆ తరువాత కొడుకుల పెళ్ళిళ్ళకు ఉత్తరం రాసినా మనిషి రాడు. వాకబు చేస్తే వేరే చోటకు మారిపోయినట్లు తెలుస్తుంది. భారమైన గతం లోంచి గడియారం గంటలతో బయటకు వస్తుంది ఆమె.
మర్నాడు ఉదయం మంజులకు ముడో నెల అని తెలుసుకుని ఆనందిస్తుంది. అంతలోనే ఓపలేని పిల్లను వదిలి ఆశ్రమానికి వెళ్ళగలనా? బిడ్డ పుట్టాకా చూడకుండా ఉండగలనా? అని సందేహపడుతుంది. బిడ్ద పుడితే ఏం పేరు పెట్టాలో చెప్పి వెళ్ళమా..అని కన్నీళ్ళతో అడిగిన కొడుకుని చూసి చలించిపోతుంది ఆమె. "అరుణాచల స్వామీ, నా మనసుని ఈ ప్రాపంచిక బంధాల నుండి తప్పించి నీ సేవకనుగుణంగా మార్చుకో తండ్రీ.." అని మాత్రం వేడుకుంటుంది ఆమె. ఆ సాయంత్రం శారద ఇంటికి వెళ్దామని బయల్దేరుతుంది కాంతిమతి. తను ఊరు వెళ్ళేముందు బంతిలా ఉన్న శారద పాపకు వంట్లో బాగుండదు. శారద, పాప ఇద్దరూ చిక్కి సగమై ఉంటారు. కాంతిమతి గొంతు విని సీత వస్తుంది. గుర్తుపట్టలేనంతగా మారిన సీతను చూసి బాబేడని ప్రశ్నిస్తుంది. బాబు పోయి పదిహేను రోజులైందని సీత కన్నీళ్ళతో చెప్పిన మాటలు విని అవాక్కవుతుంది కాంతిమతి. జ్వరంతో ఉన్న బాబుని పనిపిల్ల సరిగ్గా చూడకపోవటం వల్ల అలా జరిగిందని తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. మీరు ఊరువెళ్లకుండా ఉండి ఉంటే నా బాబు నాకు దక్కేవాడని విలపిస్తున్న సీతను ఎలా ఓదార్చాలో అర్ధంకాక కాసేపుండి వచ్చేస్తుంది ఆమె.
అన్నం దగ్గర కూర్చున్నా ముద్ద మింగుడు పడదామెకు. సీత బాబే కళ్ళముందు మెదలుతాడు. తను ఆశ్రమానికి వెళ్పోయాకా రేపు మంజుకు బిడ్డ పుడితే ఇలా పనిపిల్ల సాకవలసిందేనా? అపురూపంగా పెరగవలసిన బిడ్డ పనిపిల్ల ఈసడింపులతో పెరగవలసిందేనా? శారద పాపలా చిక్కిపోయి ఉండవలసిందేనా? మొదలైన ప్రశ్నలామెను చుట్టుముడతాయి. ఈలోపూ "అమ్మా, పాపో,బాబో పుడితే చూడటానికన్నా వస్తావా...?" అని కిషోర్ అడిగేసరికీ ఇక కన్నీరాగదామెకు. అన్నం సహించటం లేదని వెళ్ళిపోతుంది. మంచం మీద వాలినా ఇవే ఆలోచనలు...ఏం చేయాలి?ఎవరిని వదులుకోవాలి? సీతా,శారద, మంజు....ఇలా ఎందరో ఉద్యోగినుల బాధలు వినేదెవ్వరు? వాళ్ళ వాళ్ళ పసిపిల్లల మూగవేదన అర్ధమయ్యేదెవ్వరికి? వాళ్ళలో కొందరి కోసమైనా తను ఏమీ చెయ్యలేదా? ఈ ప్రశ్నల ఘర్షణలో కాంతిమతి నిద్దుర చెదరిపోతుంది. నేను ఇరుగు పొరుగువారి కష్టాలను గూచి ఆలోచించకుండా ఉండలేను. భగవాన్! అసత్యము,అశాశ్వతమైనవైనా సరే సాటివారి దు:ఖ్ఖంలో పాలుపంచుకోకుండా ఉండలేను. నావల్ల కాదు స్వామీ! అనుకుంటుంది. లేచి కూర్చుని ఒక నిర్ణయానికి వస్తుందామె.
ఉదయాన్నే టిఫిన్ చేస్తున్న కిషోర్ దగ్గరకు వెళ్ళి "నా టికెట్టు కేన్సిల్ చేయించు ఈ పూట " అని చెప్తుంది. "మమ్మల్ని వదిలి వెళ్తున్నావని బాధతో ఏవో అన్నాను..మా కోసం నీ నిర్ణయం మార్చుకోవద్దమ్మా" అంటాడు కిషోర్.
(ఆఖరి భాగం త్వరలో...)
పొద్దుటే నాన్నగారింట్లో మొన్నటి సాక్షి ఆదివారం పుస్తకం(9-5-10) తిరగేస్తుంటే ఆసక్తికరమైన కథ చదవటం జరిగింది. "మహమ్మద్ ఖదీర్ బాబు" గారు రాసిన ఈ కథ నాకు చాలా నచ్చేసింది. రచనా శైలి అద్భుతంగా ఉంది. రాసినది ఎవరా అని చూస్తే, నాన్న దగ్గర నేను ఇదివరకు చదివిన "మన్ చాహే గీత్" అని హిందీ సినీ గీతాలూ, సంగీత దర్శకులూ, కొందరు సింగర్స్ గురించీ రాసిన పుస్తక రచయతే ఈయన అని అర్ధమైంది. ఇక ఆయన వివరాల్లోకి వెళితే ఖదీర్ బాబు గారు సాక్షిలో ఆదివారం మాగజైన్ ఇన్చార్జ్ అనీ అదివరలో ఆయనకు 1999లో "కథా అవార్డ్" , ఇంకా "భాషా సమ్మాన్అవార్డ్", "చాసొ అవార్డ్" మొదలైన పురస్కారాలు లభించాయని తెలిసింది. అంతేకాక "దర్గామిట్ట కథలు" "పోలేరమ్మ బండ కథలు" "పప్పూజాన్ కథలు " మొదలైన కధాసంపుటిలు రాసారని తెలుసుకున్నాను. నేను చదివిన "మన్ చాహే గీత్" పుస్తకం మాత్రం చాలా బాగుంటుంది. పాత హిందీ సినీగీతాలు ఇష్టపడే ప్రతివారూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. మిగిలిన పుస్తకాలు కూడా అర్జంట్ గా కొని చదివేయాలని డిసైడైపోయాను...:)
సాక్షిలో ప్రచురించబడిన కథ ఈలింక్ "ఇక్కడ"(page.no.12) చూడండి. కథలంతే ఇష్టమున్న ప్రతివారికీ ఈ కథ తప్పక నచ్చుతుందనీ, మొన్న ఆదివారం చదవటం మిస్స్ అయినవారు ఉంటే చదువుకోవటానికి వీలుగా ఈ లింక్ ఇస్తున్నాను.
ఇప్పుడు "Sagarika daCosta” గా మారిన ఒకప్పటి "Sagarika Mukherjee" ప్రఖ్యాత గాయకుడు , జీ టివి లోని 'టీవీఎస్ స,రి,గ,మ పా' కార్యక్రమం హోస్ట్ "Shaan" (Shantanu Mukherjee) అక్క . వారిద్దరూ కలిసి చేసిన 2,3 పాప్ ఆల్బమ్స్ నేను డిగ్రీ చదివే రోజులో వచ్చాయి. Martin daCosta ను పెళ్ళి చేసుకున్నాకా అతనితో పాటూ ఆమె కూడా restaurateur గా మారారు. నా డిగ్రీ రోజుల్లో Saagarika చేసిన "మా" ఆల్బమ్ చాలా పేరుగడించింది. నాకు చాలా చాలా ఇష్టమైన ఈ పాటను ఇవాళ "మదర్స్ డే" సందర్భంగా అందరు అమ్మలకూ....dedicate చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికీ "అమ్మ" అనగానే ఇదే భావన ఉంటుందని నా నమ్మకం. ఎవరి అమ్మ వారికి గొప్ప కదా మరి..!!
నేను అదివరకూ మా అమ్మ గురించి రాసిన 'అమ్మే నా బెస్ట్ ఫ్రెండ్' post "ఇక్కడ" చూడచ్చు..
ఈ పాటకు ప్రఖ్యాత సినీ గేయ రచయిత, గజల్ రచయితా "Nida Fazli" హృద్యమైన సాహిత్యాన్ని అందించారు. పాట విడియోనూ, సాహిత్యాన్నీ క్రింద చూడండి...
lyrics: Nida Fazli singer: saagarika mukherjee
धूप में छाया जैसी प्यास में नदिया जैसी तन में जीवन जैसी मनं में दर्पण जैसी हाथ दुआवों वाले रोशन करे उजाले फूल पे जैसे शबनम सांस में जैसे सरगम प्रेम की मूरत दया की सूरत ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
जहां में अँधेरा छाए वो दीपक बन जाए जब भी कभी रात जगाये वो सपना बन जाए अन्दर नीर बहाए बाहर से मुस्काये काया वो पावन सी मधुरा ब्रिन्दावन जैसी जिसके दर्शन में हो भगवन ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
ఈమధ్యన రెండు పూటలా వాకింగ్ చేయటంవల్ల ఎఫ్.ఎం.చానల్స్ ఎక్కువ వినే అవకాశం + కొత్త పాటలు కూడా బాగానే తెలుస్తున్నాయి. నిన్న ఒక రెండు పాటలు విన్నాను. నాకు బాగా నచ్చేసాయి. వివరాలు తెలుసుకుంటే ఒకటి "వరుడు" సినిమాలోదీ, మరొకటి "డార్లింగ్" సినిమాలోది అని తెలిసాయి. ఆడియో లింక్స్ కన్నా utube లింక్స్ త్వరగా దొరుకుతాయని ఇవి పెట్టేస్తున్నాను.
టివిలో ఫరీదా ఖనుం ఒక కాన్సర్ట్ లో పాడుతున్న ఈ గజల్ క్లిప్పింగ్ చూసి ...బ్లాగ్లో పెడదామనిపించి బ్లాగ్ తెరిచాను..
"queen of ghazals" గా పేరుపొందిన ఆమె 1935లో కలకత్తాలో పుట్టి అమృత్సర్ లో పెరిగారు. 1947లో పాకిస్తాన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. 2005 లో పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెను 'హిలాల్ -ఎ -ఇమ్తయాజ్' (highest civilian honor ) ఆవార్డ్ తో సత్కరించారు.
ఈ గజల్ "మాన్సూన్ వెడ్డింగ్" సినిమాలో కూడా వాడుకున్నారు. utubeలింక్ కోసం వెతుకుతుంటే "మధుబాల" పిక్చర్స్ తో ఉన్న ఈ లింక్ దొరికింది. బాలివుడ్ లో నాకు బాగా ఇష్టమైన నటీమణులు ముగ్గురు. మధుబాల, రేఖ, మాధురి దీక్షిత్ . అందంలో ఈ ముగ్గురి తరువాతే బాలివుడ్ లో ఎవరైనా అనిపిస్తుంది నాకు.
గజల్ , సాహిత్యం :
आज जाने की ज़िद न करो(3) यूँही पहलू में बैठे रहो (2) आज जाने की ज़िद न करो हाय मर जायेंगे , हम तो लुट जायेंगे ऐसी बातें किया न करो आज जाने की ज़िद न करो (3)
तुम ही सोचो ज़रा , क्यूँ न रोके तुम्हे जान जाती है जब उठ के जाते हो तुम (2) तुमको अपनी क़सम जान-ऐ-जान बात इतनी मेरी मान लो आज जाने की जिद न करो यूँही पहलू में बैठे रहो (2) आज जाने की ज़िद न करो हाय मर जायेंगे , हम तो लुट जायेंगे ऐसी बातें किया न करो आज जाने की ज़िद न करो
वक़्त की क़ैद में ज़िन्दगी है मगर (2) चंद घड़ियाँ येही हैं जो आज़ाद हैं (2) इनको खोकर मेरे जान-ऐ-जान उम्र भर न तरसते रहो आज जाने की जिद न करो हाय मर जायेंगे , हम तो लुट जायेंगे ऐसी बातें किया न करो आज जाने की ज़िद न करो
कितना मासूम रंगीन है यह समां हुस्न और इश्क की आज में राज है (2) कल की किसको खबर जान-इ-जान रोक लो आज की रात को आज जाने की ज़िद न करो यूँही पहलू में बैठे रहो (2) हाय मर जायेंगे , हम तो लुट जायेंगे ऐसी बातें किया न करो आज जाने की ज़िद न करो
తీరిక దొరికితే పుస్తకాలు చదవటం,ఎదన్నా రాసుకోవటం లేక నెట్ లో కొత్త కొత్త విషయాలేమైనా తెలుసుకోవటం నాకు అలవాటు. బాగా ఖాళీగా ఉంటే తప్ప టి.వీ.జోలికి పోను. ఒకప్పుడు బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం తీరిక సమయాల్లో టి.వీ.చూడటం టైంవేస్ట్ చేసుకోవటమే అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టివీ చూసినా తెలుగు చానల్స్ చూసే ధైర్యం చేయను.అవంటే నాకు భయం. కానీ ఈమధ్యన చానల్స్ తిప్పుతుంటే అనుకోకుండా ఏవో కొన్ని తెలుగు డాన్స్ ప్రొగ్రాంస్ చూడటం జరిగింది. 3,4 సార్లు ఇలా ఈ మధ్యన చూసాను.అవి కూడా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు.
2008 జూన్ లో అనుకుంటా నేను నవ్య లో పడిన "నా కోసం నేను కాదు" అనే ఆర్టికల్ లింక్ ఇచ్చాను బ్లాగ్లో.. అందులో పోటీ ప్రపంచంలో తమ పాప ముందు ఉండాలని తల్లిదండ్రుల ఫోర్స్ చేయటం వల్ల తాను చిన్నతనానికి ఎలా దూరంఅవుతోందో... ఒక పాప తన మనసులోని వ్యధ చెప్పుకుంటుంది.
టి.వీ.లో ఆ డాన్స్ లు చూస్తే నాకు ఆ ఆర్టికల్ గుర్తు వచ్చింది. ఇంకా అసలు వీళ్ళు పిల్లలేనా అని డౌట్ వచ్చింది. వాళ్ళు చేస్తున్నది మామూలు పాటలకు కాదు వాంప్ పాటలకు,క్లబ్ పాటలకూ. అసలు ఆ తల్లిదండ్రులు అలాంటి పాటలకు డాన్స్ చేయటానికి చిన్న చిన్న పిల్లలను ఎలా ప్రోత్సాహించగలుగుతున్నారు అని సందేహం కలుగుతోంది నాకు. చిన్న పిల్లలు ఆ పెదవి విరిపులూ,మొహంలో అసహ్యకరమైన భావాలు ఒలికిస్తూ గంతులు వేస్తూంటే చూడటానికి నాకు విరక్తి కలిగింది. వీళ్ళా దేశ భవిష్యత్తు? వీళ్ళా మన భావి తరం? ఇదా మనం పిల్లలకు నేర్పించవలసింది? అని బాధ వేసింది.
గత నవంబర్ 14న నాకిష్టమైన ఒక " పిల్లల పాట" సాహిత్యం,ఆ పాట ఒక టపాలో రాసాను. "పిల్లల్లారా పాపల్లారా... రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిల్లలారా..." అని దాశరధి గారు రాసిన ఎంతో అందమైన సాహిత్యం అది.పిల్లలు అలా ఉండాలని, అలా పెరగాలని నేను అభిలషిస్తూ ఉంటాను...కానీ ఏమిటో సినిమా పాటలే భక్తి గీతాలూ, సినిమా డైలాగులే వేదవాక్కులూ అవుతున్నాయి ఇవాళ పిల్లలకు. మా బాబు ఫలానా హీరోలా డైలాగు భలే చెప్తాడు తెలుసా అని మురిసిపోయే వాళ్ళనూ, మా పాప "ఆ అంటే అమలాపురం.." "రింగా రింగా .." పాటకూ ఎంతబాగా dance చేస్తుందో అని చెప్పుకునే వాళ్ళనూ, "అమ్మా లేదు,నాన్నా లేడు..." అంటూ పాడుతూ తిరిగే పిల్లలనూ ఇవాళ చూస్తున్నాం.
ఏమిటి ఈ ఆట? ఈ తరం ఎటు పోతుంది..? అనే ప్రశ్నలు మనసును వేధిస్తున్నాయి. అందరూ అలా ఉంటున్నారని నేను అనటం లేదు. కానీ చాలా వారకు పిల్లలు అలానే ఉంటున్నారు. ముఖ్యంగా టి.వీలో జరుగుతున్న పొటీ డాన్సులలో వాళ్ళు ఎన్నుకునే పాటలు మరీ కలవర పెడుతున్నాయి. అవి ఈ మధ్యన చూసి చూసీ ఆవేదనతో ఈ టపా రాయాలని మొదలుపెట్టాను..
నేను ఈ టపా రాయటం అనేది మార్పులు తెచ్చేయాలనో, ఎవరినో ఎత్తిపొడవాలనో కాదు. నేను రాయటం వల్ల ఏమీ జరగదని కూడా తెలుసు. ఇది కేవలం నా వ్యధనూ,భావితరం పట్ల నాకున్న ఆశనూ తెలపటానికే...! కనీసం నా పాపనైనా ఈ గందరగోళాలకు దూరంగా ఉంచుకోగలుగుతున్నాను...ప్రస్తుతానికి.అదే కాస్త తృప్తి.
19th Apr.2010 dated "BusinessWorld" magazine లో KG BASIN మీద రాసిన cover story నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఈ విషయం మీద ఆసక్తి ఉన్నవారెవరైనా చదువుతారని ఈ-లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను. http://www.businessworld.in/bw/Magazine
ఈ మధ్యన కొంచెం రెస్టింగ్ స్టేజ్ లో ఉండబట్టి పుస్తకాలూ,పేపర్లూ ఎక్కువ చదివే సమయం దొరుకుతోంది.ఆసక్తి ఉండీ చూడనివారు ఉంటే చదువుకొగలరని ఇలా ఈ-లింకులూ గట్రా బ్లాగ్లో పెడుతున్నాను. ..:)