సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 21, 2012

షిర్డి - ఘృష్ణేశ్వర్ - ఎల్లోరా - 2





ఎల్లోరా గుహలు: 

ఘృష్ణేశ్వరుడి దర్శనం అయ్యాకా "ఎల్లోరా" గుహలకి తీసుకువెళ్ళాడు. బౌధ్ధ, జైన, హిందూ మతాలకి స్మారక చిహ్నాలు ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ఈ ఎల్లోరా నిర్మాణాలు. ఈ మూడు మతా వ్యవస్థలనూ ప్రతిబింబించే శిల్పకళారీతులు ఈ గుహల్లో మనకు కనబడతాయి. అతిప్రాచీనమైన ఈ గుహల నిర్మాణం క్రీ.శ.500 మరియు 700 మధ్యన జరిగిఉంటుందని అంచనా. న్యాయంగా చెప్పాలంటే ఒక రోజంతా తీరుబడిగా ఉండి మొత్తం ముఫ్ఫైనాలుగు గుహలూ చూడాల్సిన మాట. అంత అద్భుత కట్టడాలు ఇవి. అన్నింటిలో ముఖ్యమైనవి పదహారవ గుహ, ముఫ్ఫై రెండవ గుహా ట. మాతో వచ్చిన ఢిల్లీ వాళ్ళు డిస్కవరి ఛానల్లో ఎల్లోరా గుహలను గురించిన కార్యక్రమం చూసారుట. వాళ్ళే మాకు ఏ గుహలో ఏమున్నాయో అన్నీ చెప్పారు. సో, మేము సైతం ఎల్లోరా గుహల విశేషాలను పరోక్షంగా డిస్కవరి ఛానల్ ద్వారా తెలుసుకున్నామన్న మాట :౦  ముఫ్ఫైదాకా గుహలన్నీ చూసాం. ఆ పై దారి మూసేసారు. మరమత్తు జరుగుతోంది. వేరే రోడ్డు మార్గం ఉంది ఆ ముఫ్ఫై రెండవ గుహకు తీసుకెళ్లవయ్యా అంటే మా వాన్ డ్రైవర్ ఒప్పుకోలేదు :( ఇక next  tripలో అజంతా గుహలతో పాటూ మిగిలినవీ చూడాలి అనుకున్నాం.








"శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు...",  "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో.." అని పాడుకుంటూ, చాలామటుకు శిధిలమైపోయిన ఆ శిల్పకళాసృష్టిని చూస్తూ ఉద్వేగపడుతూ.. ఏవో ఆలోచనల్లోకి వెళ్పోయా నేను. ఎందుకనో ఈ చారిత్రాత్మక కట్టడాలంటే నాకు చాలా ఇష్టం. కోటలూ, మ్యూజియమ్స్, గుహలు, పురాతనమైన ఆలయాలూ.. ఇలాంటివన్నీ వీలయినన్ని చూడాలని నా కోరిక. ఎప్పుడో.. ఏ గతజన్మలోనో ఏదో ఒక చరిత్రతాలుకూ పుటల్లో నేనూ ఓ భాగమై ఉంటానని నాకో పిచ్చి విశ్వాసం..:) ఆలోచిస్తూ కంటికి నచ్చిన ప్రతిశిల్పాన్నీ ఫోటో తీసాను.

అసలు మన దేశ కళాత్మక చరిత్రకూ, అద్భుత శిల్పకళా నైపుణ్యానికీ ప్రతీకలైన ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలను గూర్చిన చరిత్రను తెలుసుకుంటూ, చాలా పరిశీలించి, అనుభూతి పొందుతూ, గర్వపడుతూ చూడాలి. కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చే మాబోటి యాత్రికులకు ఈ దొరికే గంటా, రెండుగంటల సమయమే మహాప్రసాదం.










భద్ర మారుతీ సంస్థాన్: 
ఆ తర్వాత  "భద్ర మారుతీ మందిర్" అనే హనుమంతుడి గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ గుడి తాలూకూ కథ ఒక చోట రాసి ఉంది. భద్రసేనుడనే రాజు కి ఇచ్చిన మాటపై హనుమంతుడు అక్కడ వెలసాడుట. ఇక్కడి విశేషం ఏమిటంటే ఎప్పుడూ చూడనటువంటి రీతిలో మారుతి పవళించి ఉన్న విగ్రహం అక్కడ ఉంది.  గుడి లోపల అద్దాలతో చేసిన నిర్మాణం ముచ్చటగొలిపేలా ఉంది. అక్కడ కూచున్న కాసేపూ అలౌకికమైన ప్రశాంతతతో మనసు ఆహ్లాదంగా మారిపోయింది.



ఆ తర్వాత దేవగిరి కోట మీదుగా "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్లాడు డ్రైవర్. దౌలతాబాద్ కోటే శివాజీ రాజయ్యాకా దేవగిరి కోట అయ్యిందిట. "మినీ తాజ్ మహల్" అంటూ ఔరంగజేబ్ భార్య గోరీపై అతని కుమారుడు తల్లి స్మృత్యర్థం కట్టిన "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్ళాడు. ఆ నిర్మాణానికి అప్పట్లోనే ఆరులక్షల అరవైఎనిమిదివేల రెండువందల చిల్లర అణాలు ఖర్చు అయ్యిందిట. నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే కట్టడం లోపల ఉన్న మక్బరా పై జనాలు చిల్లర విసిరి దణ్ణం పెడుతున్నారు. ఆవిడ ఓ రాజుకి భార్య తప్ప దేవత కాదు కదా.. ఒకళ్ళు చేస్తే అందరూ చేస్తారు.. అలా ఎందుకు చెయ్యాలి అని ఆలోచించరేమిటో ! బయట వాటర్ బాటిల్ కొంటూంటే చిల్లర లేదంటే కొట్టువాడు కూడా "జనాలు చిల్లరంతా లోపలికి తీశుకువెళ్ళి వ్యర్థంగా వేసేస్తారు. మాకేమో ఇవ్వరు..’ అన్నాడు. అతనికున్న ఆలోచన లోపల చిల్లరవేసేవాళ్ళకి కలగదో ఏమో! ఆ చిల్లర నిండిన మక్బరాకి ఫోటో తియ్యబోతూంటే ఇకచాలన్నట్లు బ్యాటరీల్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇంతకన్నా దేవగిరి కోట చూపించమని అడగాల్సింది అనుకున్నాం.



మేము ఎక్కిన వాన్ లో మాతో పాటూ మరో నాలుగు కుటుంబాలవారు ఎక్కారు. ఒక తెలుగు, ఒక ఢిల్లీ, ఒక ఒరియా, మరొక మరాఠీ. డైవరు మరాఠీ. ఒరియావాళ్ళు నదిలో వదలాల్సినదేదో ఉందనీ, ఏదైనా ప్రవహించే నది వద్ద వాన్ ఆపమనీ బండాగిన ప్రతి చోటా డ్రైవర్ని అడుగుతున్నారు. ఎక్కిన దగ్గర్నుంచీ "పానీవాలా జగహ్..పానీ వాలా జగహ్.." అని చంపుతున్నారు అని డ్రైవర్ విసుక్కున్నా, చివర్లో చీకటిపడినా గోదావరి ప్రవహించే ఓ చోట ఆపాడు.

మళ్ళీ శిర్డీ:
ఆ రాత్రి తొమ్మిదిన్నరకి మమ్మల్ని శిర్డీ లో దింపాడు డ్రైవర్. రూంకెళ్ళి ఫ్రెష్ అయ్యి, రాత్రి హారతికి మందిరంలోకి వెళ్లాం. బాబా విగ్రహం ముందర ఉన్న హాలుదాకా వెళ్ళాకా లైన్ ఆపేసారు. అక్కడే కూచోబెట్టేసారు అందరినీ. ఆ విధంగా హాయిగా బాబాగారి ముందర కూచుని రాత్రి హారతి కూడా తిలకించాం. ఇదివరకూ హారతి అయ్యాకా దర్శనానికి పంపేవారు. కానీ ఇప్పుడు హారతి అయ్యాక తలుపులు మూసేసి, హాల్లోవాళ్లని బయటకు పంపేస్తున్నారు. క్లీనింగ్ కి టైం దొరకట్లేదుటవాళ్లకి. అందుకని మర్నాడు పొద్దున్నే మళ్ళీ దర్శనానికి వెళ్ళాం మేము. అప్పటికి జనాలు పెరగటం గమనించాం. ఇక ఆదివారం నుండీ దీపావళి శెలవులయ్యేదాకా బాగా జనం ఉంటారుట. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి జనం ఉన్నా గంటన్నరలో మరో మంచి అద్భుతమైన, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం.


శిర్డి దగ్గర్లోని పంచముఖ గణపతి గుడి ఈమధ్యన బాగా పేరుపొందిందిట. అక్కడికి వెళ్లాం. అక్కడ పక్కనే ఉన్న హనుమంతుడి గుడి, అన్నపూర్ణాదేవి గుడీ బాగున్నాయి.









అనుకున్న దర్శనాలు, సందర్శనాలు అయిపోయాయి కాబట్టి ఇక రిటర్న్ బస్సు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టాం. ఏడొందల బస్సు టికెట్లు పదమూడొందలు పలికాయి ఆరోజు. లక్కీగా మాకు కాస్త తక్కువకే దొరికాయి. మందిరం పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాకా నేను మిస్సవ్వని "రాజధాని" భోజనం చేసేసి, కాస్త షాపింగ్ చేసేసి, సాయంత్రం బస్సెక్కేసాం. అలా మూడురోజులు పడుతుందనుకున్న ప్రయాణం బాబా దయవల్ల  రెండ్రోజుల్లోనే దిగ్విజయంగా పూర్తయిపోయింది.



ఈ ప్రయాణం తాలుకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/1.html
http://lookingwiththeheart.blogspot.in/2012/11/2.html



సర్వేజనా:సుఖినోభవంతు!


Tuesday, November 20, 2012

ఏకాంతకోకిల






అడవి యాకులందు నలరుల రేకుల
నీటి చినుకులెల్ల నిలిచి, గాలి
వీచినంత తెరలి, విచ్చలవిడి తోడ
మబ్బులేని వాన మరియు కురియు

కొండపైని వాన గుడి ముంగిటనువాన
చెరువు తమ్మిపూల చెంత వాన
పల్లెటూరి వరినాట్ల పై వాన
విరహిజనుల మనసు బరువు, వాన

***     ***       *** 

తనువులోపల జేరగ తపనపడుట
వెలుపలికి ముక్తి గోరుచు వెతలcబడుట
అక్షరమ్ముల మిగులు నా యనుభవములు
పుస్తకము వంటి బ్రదుకులో పుటలనడుమ

***      ***      *** 

తరిమి మూసిన రాతిరి తరిగిపోని
దిగులు నదివో లెవ్యాపించు, దెసలనడుమ
ఎన్ని నిట్టూర్పు పొగ మబ్బులిచటc గురిసి
తడియు, స్పర్శయులేనిదై సుడులు రేపు!

***      ***       *** 

రేయి నాకసమ్ము చేయి విదల్చుచు
ఆసవంపుపాత్ర నవని పైకి
వంపినప్పు డాసవమ్ము తొణికె నేమొ
తరువు తరువు తడిసి యరుణమాయె !



***       ***       *** 

 అనుభవమ్ము నాకు ఆప్తప్రమాణమ్ము
కవితకైన, బ్రతుకుకథలకైన;
అంతరంగ శుక్తి హత్తుచు, మేలైన
స్వాతి వాన చినుకు వ్రాలవలయు !


***     ***        *** 

తెలియబడనిది, తెలియగా విలువగలది
తెలిసి తెలియని వేళలొ తీపుc గలది,
మదికి తహతహ పుట్టించు మహిమcగలది
మనిషి యనుభూతి, కవితకు మర్మశక్తి !


***     ***        *** 


"ఏకాంతకోకిల" శ్రీకాంతశర్మ గారి కొత్త పుస్తకం
తన మిత్రులు, కథారచయిత తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రి గారికి అంకితం చేసారు.
కవర్ బొమ్మ: బాపూ
కవర్ డిజైన్: చంద్ర
నవోదయా పబ్లికేషన్స్
వెల: నలభై రూపాయిలు



Monday, November 19, 2012

షిర్డి - ఘృష్ణేశ్వర్ - ఎల్లోరా -1





క్రితం వారాంతంలో అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు కొనుక్కుని శిర్డి  బయల్దేరాం. Waiting లేకుండా టికెట్స్ కన్ఫార్మ్డ్ టికెట్లు దొరకటం అదృష్టం. రిటర్న్ టికెట్లు వీలుపడవు కాబట్టి తీసుకోలేదు. ఏదో ఓ బస్సులో దీపావళి రోజుకన్నా వచ్చేద్దాం అననుకున్నాం. మనకు దసరా శెలవుల్లాగ మహారాష్ట్ర లో దీపావళికి శెలవులు ఉంటాయి. అందువల్ల శిర్డీలో జనం ఎక్కువగా ఉంటారేమో పిల్ల ఇబ్బంది పెట్టడం ఎందుకని దాన్ని అమ్మ దగ్గర ఉంచి బయల్దేరాం.

ట్రైన్ లో మా ఎదురుగా ఒక తల్లీ,తండ్రీ, ఆరేళ్ళ పిల్లాడు కూర్చున్నారు. ఆ పిల్లాడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతిదానికీ ఒకటే నస, సణుగుడు, పేచీ. రాత్రి నిద్రలో కూడా మెలుకువ వచ్చేసింది వాడి పేచీకి. ఆ తల్లీదండ్రీ సముదాయిస్తూ నచ్చజెప్తున్నారే తప్ప కేకలేయకపోవటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మాకూ ఒక్కతే పిల్ల. గారమే. కానీ మరీ ఇంత నెత్తికెక్కించుకోము. ఏం పెంపకాలో ఏమిటో ! ఇక అవతలవైపు విండో సీట్ దగ్గర ఇద్దరు+ఇద్దరు ఓ సన్న ఫ్యామిలీ. అంటే నలుగురూ ఒకేలా సన్నగా అంటే సన్నగా ఉన్నారు. ఆ తల్లి మాత్రం ఇంత గొంతేసుకుని దిగేదాకా ఆపకుండా బడాబడా వాగుతూనే ఉంది. అందరూ నిద్రోతున్నారనన్నా లేకుండా పొద్దున్నే నాలుగింటికే లేచి కూచుని పేద్ద గొంతుతో కూతురితో కబుర్లాట్టం మొదలెట్టింది. ఇక నేనూ లేచి మొహం కడిగి రాత్రి ఆపిన పుస్తకం చదువుకుంటూ పడుకున్నా.(పైనవాళ్ళు లేచేదాకా కూచోవటానికి ఉండదు కదా:))





నాగర్సోల్ లో దిగి శిర్డీ చేరి, ఎప్పుడూ దిగే హోటల్లో దిగి, తయారై, టిఫిన్ తిని సాయిమందిరం క్యూలో నిలబడేసరికీ ఎనిమిదిన్నర. ఆశ్చర్యంగా జనం ఎక్కువగా లేరు, క్యూ కూడా ఫాస్ట్ గా కదులుతోంది. తొమ్మిదింపావుకల్లా చక్కటి, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. అంత త్వరగా, పైగా కావాల్సినంత సేపు బాబాను చూసుకునే దర్శనం చాలా ఏళ్ల తరువాత దొరికిందనే చెప్పాలి. ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి దర్శనం దొరికింది. అప్పుడు ఇలా క్యూ సిస్టం లేదు. బాబావిగ్రహానికి ఫోటోలు కూడా తీసుకోనిచ్చేవారు. ద్వారకామాయి లో కూడా బాబా కూచునే రాయిని చేత్తో ముట్టుకోనిచ్చేవారు. తిరుపతిలోలాగా ఇంత జనప్రవాహం అప్పుడు లేదు మరి. బయటకు వచ్చేసి విభూతి పొట్లాలు కూడా నాలుగైదుసార్లు మళ్ళీ మళ్ళీ క్యూలో వెళ్ళి తీసుకుని బయటకు వచ్చేసాం.


ఘృష్ణేశ్వర్ :



 తత్కాల్ టికెట్లు దొరికాకా ఇంటికొచ్చి నేను చేసిన మొదటి పని శిర్డీ చుట్టుపక్కల ఇదివరకూ చూడని ప్రదేశాలు ఏమున్నాయని నెట్లో వెతకటం. ఎలాగైనా ఈసారి "ఘృష్ణేశ్వర్" వెళ్ళాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఏ మూడో అయిపోతుందనుకున్న దర్శనం త్వరగా అయిపోయేసరికీ మర్నాడు వెళ్దాం అనుకున్న "ఘృష్ణేశ్వర్"కు అదే రోజు బయల్దేరాం. లక్కీగా అది పేకేజ్ ట్రిప్ అయ్యింది. ఎల్లోరా గుహలు, అహ్మదాబాద్ చుట్టుపక్కల కూడా చూపించి రాత్రికి మళ్ళీ శిర్డిలో దింపేస్తానన్నాడు. దేవగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రమే "ఘృష్ణేశ్వర్‌". ఔరంగాబాద్ నుండి ముఫ్ఫై కిలోమీటర్ల దూరం. శిర్డీ నుండి వేన్ లో రెండు గంటలు పట్టింది మాకు. మాతో పాటు మరో నాలుగు కుటుంబాలవాళ్ళు వచ్చారు.

దేవాలయ నిర్మాణం అంతా త్రయంబకం గుడి నిర్మాణాన్ని పోలి ఉంది. కాకపోతే అది నల్ల రాయితో చేస్తే ఘృష్ణేశ్వరాలయానికి ఎరుపు రంగు రాయిని వాడారు. విశాలమైన ప్రాంగణం. గర్భగుడి బాగా క్రిందుగా ఉంది. లోపల నల్లని పెద్ద శివలింగం. గర్భగుడి బయట మండపంలో నల్లని పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంది. మగవారు చొక్కా తీసివేసి లోపలికి వెళ్లాలి. లోపల జ్యోతిర్లింగాన్ని మనం స్వయంగా పువ్వులతో, బిల్వాలతో పుజించుకోవచ్చు.  గుడి బయట ఆవుపాలు అమ్ముతున్నారు. అవి తెచ్చుకుని మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు. హడావుడి, జనసందోహం లేని ఆ ప్రశాంత వాతావరణం మాకు బాగా నచ్చింది. ఆవుపాలు తెచ్చుకుని అభిషేకం చేసుకుని, పువ్వులతో, బిల్వాలతో తృప్తిగా అర్చించుకుని బయటకు వచ్చాం. నాలుగైదేళ్ల క్రితం కాశీలో కూడా ఇలానే పాలతో అభిషేకం చేసుకున్నాం. మధ్యలో శ్రీశైలం, త్రయంబకం వెళ్ళినా స్వయంగా అభిషేకించుకునే అవకాశం దొరకలేదు. ఈ గుడి నిర్మాణం చాలా పాతదే కానీ పధ్ధెనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిగిందిట.



ఆలయానికి సంబంధించి రెండు మూడు కథలు స్థలపురాణంలో ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే ఒక బ్రాహ్మణుడి మొదటి భార్యకు సంతానం లేకపోతే ఆమె భర్తను బ్రతిమాలి తన చెల్లెలితో వివాహం జరిపించిందట. అయితే పోనుపోనూ అక్కాచెల్లెళ్ల మధ్యన ఈర్ష్యాసూయలు తలెత్తాయిట. ఈర్ష్య వల్ల చిన్న భార్యకు పుట్టిన కుమారుడిని పెద్దభార్య హతమార్చి, చెరువులో పారవేసిందిట. అంతదు:ఖంలో కూడా శివభక్తుర్తాలైన బ్రాహ్మణుడి చిన్నభార్య రోజూలానే చెరువు గట్టుకెళ్ళి నూరు శివలింగాలను చేసి పూజించి నదిలో విసర్జించి వెనక్కు తిరిగేసరికీ కొడుకు సజీవుడై కనబడ్డాడుట. అప్పుడామెకు శివుడు ప్రత్యక్ష్యమై కనబడగా తన అక్క పాపాన్ని క్షమించమని, తన భక్తికి ప్రసన్నుడైతే గనుక అక్కడ వెలవమని ప్రార్థించిందిట. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా అక్కడ వెలసాడుట. సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం అని ఒక కథ ఉంది. కథ ఏదైనా జ్యోతిర్లింగం మహిమాన్వితమైనది. భక్తితో అర్చించవలసినది.

ఎల్లోరా గుహలో శివలింగం

Tuesday, November 13, 2012

దీపావళి శుభాకాంక్షలు





తీపిగురుతులు.. స్మృతుల సవ్వడులు
మిలమిలలాడే రంగురంగుల ఆకాశం
మధురమైన అభినందనలు
నోరూరించే తీపివంటలు
ఇల్లంతా దీపాలు
మనసు నిండా ఆనందాలు
దీపావళి కానుకలు !

శాంతి సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలూ
ఈ దీపావళి రోజున అందరికీ అందాలని.... ఆకాంక్ష !
దీపావళి శుభాకాంక్షలు.






Wednesday, November 7, 2012

అన్నయ్య కోసం 'కమల్ హాసన్' పాటలు...




మా అన్నయ్యకి నటుడు కమల్ హాసన్ అంటే బోలెడు ఇష్టం. అన్నయ్య కాకినాడలో పెరిగాడు. మేము విజయవాడలో ఉండేవాళ్లం. కమల్ కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే మేము చూసేదాకా చూసారా...? లేదా? అని సినిమా చూసేదాకా గోల పెట్టేసేవాడు. కమల్ పోస్టర్లు తలుపులకీ, బీరువాలకి అంటించేవాడు. అలా అంటించిన "సత్య" సినిమా లో కమల్ ఫోటో నాకింకా గుర్తు. ఆ విధంగా కమల్ సినిమాలన్నీ చూసి చూసి అన్నయ్య ఇష్టం మాకూ ఇష్టం అయిపోయింది :) ఇవాళ కమల్ పుట్టినరోజని ఈ టపా మా అన్నయ్య కోసం కమల్ హాసన్ పాటలతో...

1)దశావతారం - ముకుందా ముకుందా



 2)ఇది కథ కాదు - తకథిమితక థిమితకథిమి

3)ఆకలిరాజ్యం - కన్నెపిల్లవని
  


4)సొమ్మొకడిది సోకొకడిది - తొలివలపు
  



 5)అందమైన అనుభవం - కుర్రాళ్ళోయ్ కురాళ్ళు

6)సాగరసంగమం - నాద వినోదము
  

7)క్షత్రియపుత్రుడు - సన్నజాజి పడక



8)గుణ - కమ్మని ఈ ప్రేమ లేఖనే
  



 9)మరో చరిత్ర - భలే భలే



10)డాన్స్ మాస్టర్ - రేగుతున్నదొక రాగం
  



 11)వసంత కోకిల - ఈ లోకం అతి పచ్చన



12)మహానది - శ్రీరంగరంగనాథుని



















13)మైఖేల్ మదనకామ రాజు సుందరి నీవు




14)రాఘవన్ - వెన్నెలవే వెండివెన్నెలవే



15)సత్య - పరువాలు కనివిని ఎరుగని
  




 16)భారతీయుడు - పచ్చని చిలుకలు



17) విచిత్ర సోదరులు - నిన్ను తలచి
 



18) నాయకుడు - నీలాల కన్నుల్లో


















19)నాయకుడు - ఏదో తెలియని బంధమిది
 http://ww.raaga.com/play/?id=38155


 20)భామనే సత్యభామనే - నీ జతే నేనని
 http://ww.raaga.com/play/?id=161042 



21) హేరామ్ - जन्मॊं की ज्वाला थी मन मॆं
http://ww.smashits.com/hey-ram/janmon-ki-jwala/song-14348.html


22)అమావాస్య చంద్రుడు - సుందరమో సుమధురమో... 
http://www.in.com/music/track/amaavasya-chandrudu-songs/sundaramo-sumadhuramo-461575.html




Sunday, November 4, 2012

కొన్ని కొత్త(తెలుగు) సినిమా పాటలు...


ఈమధ్య కాలంలో నాకు బాగా నచ్చిన కొన్ని కొత్త తెలుగు సినిమా పాటలు...
ఇవన్నీ మరి కొత్తవి కాదు కానీ తరచుగా ఎఫ్.ఎం రేడియోల్లో వస్తూంటాయి.


1) నిన్నలా లేదే మొన్నలా లేదే
(దినకర్ - ఇట్స్ మై లవ్ స్టోరీ)





2)నిన్ను నన్ను చెరో జగాలలో
 (శ్వేతా పండిత్ - మరో చరిత్ర)




3)ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా...
(హరిచరణ్ - అందాల రాక్షసి)



4)చిరు చిరు చిరు (హరిచరణ్,తన్వి - ఆవారా)





5)నీ ఎదలో నాకు చోటేవద్దు
(వెన్నెలకంటి -యువన్ శంకర్ రాజా -ఆవారా)



6)అటు నువ్వే ఇటు నువ్వే
(నేహా బాసిన్ - కరెంట్)




7)నీ చూపులే
(హరిచరణ్,చిత్ర - ఎందుకంటే ప్రేమంట)




8)ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
(కార్తీక్,సంగీత - మహాత్మ)




9)చిట్టి చీట్టి పులకింత
(సత్య హరిణి - జర్నీ)




10)చూపే నీ చూపే
(హరీష్ రాఘవేంద్ర - రక్షకుడు)




11)ఎందుకో ఏమో (రంగం)




12)నువ్వేలే నువ్వేలే
(శ్రేయా ఘోషాల్ - దేవుడు చేసిన మనుషులు)

 


13) గాయం తగిలి
(ఇళయరాజా - ధోనీ)




14)నిదురే చెదిరే ఈ మెలుకువ లోనా
(కార్తీక్ - కెరటం)





15)ఈ మంచుల్లో (రంగం)

 

Thursday, November 1, 2012

"సూర్యుడి ఏడో గుర్రం" (सूरज का सातवाँ घोड़ा)






చిన్నప్పుడు దూరదర్శన్ లో వేసే సినిమాలన్నీ వదలకుండా చూసేవాళ్ళం. వాటిల్లో చాలా బాగున్న సినిమాలు కొన్ని గుర్తుండిపోయాయి. పుస్తకాల షాపులో "సూర్యుడి ఏడో గుర్రం" పుస్తకం చూడగానే నాకు చిన్నప్పుడు చూసిన "सूरज का सातवाँ घोड़ा" గుర్తుకు వచ్చింది.  ఆ సినిమాకు గానూ ఉత్తమనటుడి పురస్కారాన్ని అందుకున్న 'రజత్ కపూర్' గుర్తుకువచ్చాడు. జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా అందుకుందీ సినిమా. చిన్నప్పుడు శ్యామ్ బెనెగల్ తీసిన సినిమాగా మాత్రమే ఇది పరిచయం. నవల గురించి ఏమీ తెలీదు. ఈ తెలుగుఅనువాదం ఆ సినిమాదే అని తెలిసి ఎగిరి గంతు వేసాను. "వేమూరి ఆంజనేయశర్మ" గారు అనువదించిన ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ. ఇప్పుడు నవల కొని చదవగానే సినిమా చూద్దామనిపించి నెట్లో వెతికితే యూట్యూబ్ లో సినిమా దొరికింది. సినిమా చూసాకా నవల ఇంకా బాగ అర్థం అయ్యింది. తెరపై దృశ్యరూపం నవల కన్నా అందంగా ఉండగలదని ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాకు రెండు ప్రాణాలు. ఒకటి శ్యాం బెనెగల్ దర్శకత్వం, రెండోది వన్రాజ్ భాటియా నేపథ్యసంగీతం. ముందు నవల గురించి చెప్తాను..


"ధర్మవీర్ భారతి". ఈ పేరు వింటేనే ఏదో ఉత్తేజం కలుగుతుంది. తను సాహిత్యానికి చేసిన సేవలకు ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" బిరుదు పొందిన ప్రముఖ హిందీ కవి, రచయిత, నాటక కర్త, సామ్యవాది ధర్మవీర్ భారతి. "ధర్మయుగ్" అనే పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేసారు. నాటక కర్తగా "సంగీత నాటక అకాడమీ" పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన మొదటి నవల "గునాహోం కా దేవతా" గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత రాసిన నవలే "సూఅజ్ కా సాత్వా ఘోడా". ఈయన 1952 లో, అంటే దాదాపు అరవై ఏళ్ల క్రితం వైవిధ్యభరితమైన శైలితో ఇంత చక్కని ప్రయోగాత్మకమైన నవల రాసారంటే ఆశ్చర్యం కలిగింది. అసలింత చిన్న నవలలో ఎంత గొప్ప ఆంతర్యాన్ని ఎలా కుదించారో! అప్పట్లో ఈ నవల హిందీ నవలాసాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించి ఉండాలి.


కథనానికి విభిన్నమైన శైలి వాడారు ధర్మవీర్ గారు. ఆంగ్ల సాహిత్యంలో దీనిని "మెటాఫిక్షన్" అంటారు. ఒకరకంగా ఇది పంచతంత్రం కథలు, విక్రమార్కుడి కథలు మొదలైన కథల శైలి అన్నమాట. అంటే ఒకే కథలో మరికొన్ని కథలు ఉంటాయి. అయితే ఈ నవలలో చిత్రం ఏంటంటే ఈ కథలన్నీ మళ్ళీ ఒకే కథలో కలుస్తాయి. కథకుడు మనకు చెప్పే ఒక కథలో "మాణిక్ ముల్లా" అనే పాత్ర చెప్పే మరిన్ని కథలుంటాయి. విడివిడిగా చెప్పినా ఇవన్నీ అంతర్లీనంగా ఒకే దారంతో ముడిపడిఉంటాయి. నవల చివరికొచ్చేసరికీ మనకి ఒక కథలోంచి మరోకథలోకి ఎలా లంకె ఏర్పడిందో తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. అవే కథలను మనం ఇతర పాత్రల దృష్టితో చూస్తూంటే, తద్వారా వివిథపాత్రల స్వభావాలు మారిపోవటం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కథలన్నీ మాణిక్ ముల్లా జీవితంలో అతనికి ఎదురైన ముగ్గురు స్త్రీల చుట్టూ తిరుగుతాయి. వీటన్నింటి నేపథ్యం "ప్రేమ" అని మాణిక్ ముల్లా చెప్తాడు కానీ వాటి వెనుక ఉన్న దిగువ మధ్యతరగతి జీవితాలలోని సంఘర్షణ,నిస్పృహ, దు:ఖమయ వేదన మనల్ని కల్లోలపరుస్తాయి. ఈ కథల వల్ల మనిషి మనస్థత్వాన్ని విభిన్నకోణాల్లోంచి చూసే అవకాశం కూడా మనకు కలుగుతుంది.


నవలలో కొన్నిచోట్ల శరత్ "దేవదాసు" గురించిన ప్రస్తావన తెస్తాడు రచయిత. ఆ ప్రస్తావనల ద్వారా అప్పటిదాకా సాహిత్యంలో చిత్రించబడిన భగ్నప్రేమికుడి స్వరూపం తప్పనీ, సాకారమైనా, విఫలమైనా నిజమైన ప్రేమ మనిషి వికాసానికి తోడ్పడుతుందనే ఉద్దేశాన్ని తెలుపుతాడు. "ఇది ప్రేమ కాదు ఇది ప్రేమ కాదు అని అని ప్రేమను గురించి వ్యాఖ్యానిస్తూనే జీవితంలో ప్రేమకు గల స్థానాన్ని నిరూపించటమే ఈ కథల ఉద్దేశం. ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం".  "ప్రేమను గురించి కథల్లో, కవితల్లో, పత్రికల్లో ప్రచురించబడేదంతా శుధ్ధ అసత్యం. ప్రేమ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి."  అంటాడు ప్రధాన పాత్రధారి మాణిక్ ముల్లా.


మాణిక్ ముల్లా మాటల్లో ప్రేమకు తన నిర్వచనం చెప్తాడు రచయిత. "ప్రేమించాలి. కానీ ఆ ప్రేమ సంకుచితంగా ఉండకూడదు. దాని వల్ల సంఘానికి మేలు కూడా జరగాలి. కానీ ప్రేమ ఆర్థిక సంబంధాలవల్ల అనుశాసితమౌతుంది." అంటాడు.  మళ్ళీ మరోచోట నిజమైన ప్రేమ ఎటువంటిదో చెప్తూ " ప్రేమ ఆత్మ లోతుల్లో నిద్రించిన సౌందర్యాన్ని మేల్కొలుపుతుంది. మానవునిలో విచిత్రమైన పవిత్రతనూ, నైతిక నిష్ఠనూ, వెలుతుర్నీ నింపుతుంది....కానీ సంప్రదాయం, సాంఘిక పరిస్థితులూ వగైరాల వల్ల ఆ ప్రేమను సరైన రూపంలో దర్శించలేకపోతున్నాం. సంఘర్షణ చెయ్యలేక నిస్సహాయత, పిరికితనమనే బంగారు నీరు పోసి దానిని మెరిసేట్టు చేయటానికి ప్రయత్నిస్తున్నాము. కల్పనా జగత్తులో మెదిలిన భావాలలో ఇంద్రధనస్సులూ, పూవులు, స్వప్నాలూ ఉంటాయి గానీ సాహసం, పురుషార్థం ఉండవు. ఆ స్వప్నాలను యదార్థమైన సాంఘిక జీవితంలోకి దింపాలి. సాంఘిక జీవితపు పునాదులూ ఎరువూ లేని భావన నిలువలేదు. ఎండిపోతుంది." అంటాడు.


కథాక్రమానికి  మాణిక్ ముల్లా ఇచ్చే వివరణ:

ఏడు రోజులపాటు మాణిక్ ముల్లా చెప్పే కథాక్రమం నడుస్తుంది. అతని మాటల్లోనే చెప్పాలంటే - అవి సూర్యుడి ఏడు గుర్రాలకు ప్రతీకలు. అయితే ఇవి ఒట్టి ప్రేమ కథలు కాదు. నిమ్న మధ్యతరగతి జీవనచిత్రాలు. మధ్యతరగతి జీవితాల్లో ప్రేమ కంటే ఆర్థిక సంఘర్షణ, నైతికమైన విశృంఖల విహారం వ్యాపించి ఉన్నాయి. అందువల్లనే అనాచారం, నిరాశ, చీకటి మధ్యతరగతి జీవితాల్లో నిండిపోయాయి. ఏడు గుర్రాలు సూర్యుని రథాన్ని ఏ విధంగా ముందుకు లాక్కు పోతున్నాయో అదే విధంగా విశ్వాసము,సాహసము,సత్య నిష్థ మొదలైనవి ఆత్మను ముందుకు లాక్కుని పోతున్నవి. కానీ ఈ అనైతిక భ్రష్టమైన జీవితపు సందుల్లో నుండి నడవటం వల్ల రథం శిధిలమైపోయింది. అయినా ఈ సూర్యుని రథం ముందుకు పోవలసిందే. ఆరుగుర్రాలు గాయపడినా ఏదో గుర్రం మాత్రం మిగిలే ఉంది. అదే భవిష్యత్తును సూచించే గుర్రం. తన్నా, జమున, సత్తి..ఈ ముగ్గురికీ కలిగిన ఏ పాపమెరుగని పిల్లలే ఆ ఏడో గుర్రానికి ప్రతీకలు. ఆ బిడ్డల జీవనాలు సుఖమయం కావాలి. వాళ్ల జీవితాల్లో వెలుతురు, అమృతం నిండాలి. ఆ ఏడో గుర్రం మన కనురెప్పల్లోకి స్వప్నాలను పంపిస్తుంది. మనం దోవ బాగు చేస్తే ఆ దోవన ఆ గుర్రం పయనిస్తుంది. అ గుర్రం మీద మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అంటాడు మాణీక్ ముల్లా.
ఈ విషయాలన్నీ గుర్తుంచుకునే తను చెప్పే కథా క్రమానికి సూర్యుని ఏదో గుర్రం అని నామకరణం చేసాడు మాణిక్ ముల్లా" అంటాడు కథకుడు.


ఇంతకు మించి కథ గురించి చెప్తే ఉత్సాహం తగ్గిపోతుంది. అరవైఏళ్ల తరువాత చదివినా కూడా సమకాలీనంగా అనిపించటంమే ఈ రచనలోని గొప్పతనం. సినిమాచూసాకా ఈ నవలను ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చిన శ్యామ్ బెనెగల్ ను ప్రశంసించకుండా ఉండలేము. రచయిత శైలి ఏమాత్రం పాడవకుండా, పాత్రల మనోభావాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చిత్రికరణ జరిగింది. నటీనటులందరూ డీడీ సీరియల్స్ లో మనం చిన్నప్పుడు చూసినవాళ్ళే అవటం వల్ల పాత్రలన్నీ పరిచితమైనవే అనిపిస్తాయి. ముఖ్యంగా రజత్ కపూర్ నటన, వాయిస్ రెండూ చాలా బావుంటాయి. చిత్రం చివరలో అతను చెప్పే ఒక చిన్న కవిత చాలా బావుంది..

"मैं क्या जिया
मुझकॊ तो जिंदगी नॆ जिया
बुंद बुंद कर पिया..
पीकर..पथ पर खाली छॊड दिया "



యూట్యూబ్ లో ఈ చిత్రం తాలూకూ రెండు భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.




చిత్రం మొదటిభాగం:
http://www.youtube.com/watch?v=OAj4C4lYmms

చిత్రం రెండవ భాగం:
http://www.youtube.com/watch?v=4Kun9KGul9s&feature=relmfu



Wednesday, October 31, 2012

స్కూల్ ప్రాజక్ట్





"ఏదన్నా వెహికిల్ మోడల్ చేసి పంపమని" పిల్లకి స్కూల్లో ప్రాజక్ట్ వర్క్ ఇచ్చారు. అసలు శలవుల్లో ఇచ్చిన ప్రాజక్ట్ వర్కులన్నీ పూర్తిచెయ్యమని తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పి పంపితే సగమే పూర్తి చేసుకు వచ్చింది పిల్ల. అవన్నీ ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున్న కూచుని అతికష్టం మీద పూర్తిచేసా. ఈ ఒక్కటీ నావల్ల కాదని ఈ వెహికిల్ ప్రాజెక్ట్ ని వదిలేసా. క్లాస్ లో కొందరు మోటార్ బైక్, సైకిల్ అలా చేసుకువచ్చారుట. "రేపే లాస్ట్ డే..ఎలాగన్నా చేసి తెమ్మన్నారు EVSసార్.. కార్డ్ బోర్డ్ తో చెయ్యాలి" అని నిన్న స్కూల్ నుండి వస్తూనే పిల్ల గొడవ.  అంతకు ముందు రోజే అన్ని ప్రాజక్ట్స్ చేసిన మీదట "నావల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లీ, మీ నాన్న వచ్చాకా చూసుకోండి" అనేసా నేను.

అయ్యగారు ఆఫీసు నుండి వచ్చాకా బేరం పెట్టింది పిల్ల. అలానే చేసేద్దాం అని అభయమిచ్చేసారు ఈయన.  "ఇదిగో..పువ్వులు, ఆకులు అంటే చేస్తాను కానీ ఈ వెహికిల్స్ అవీ నాకు రావు నావల్ల కాదు. మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పేసా. నిన్న రాత్రి పిల్ల బజ్జున్నాకా ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లారు. కాసేపయ్యాకా పెద్ద పెద్ద థర్మొకోల్ షీట్లు, కార్డ్ బోర్డ్ తెచ్చారు. నెట్లో ఏవో వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే "ఫార్ములా వన్" మోడల్స్ డెస్క్ టాప్ మీద పెట్టి చేసేద్దాం..రా.. అన్నారు. నాకు బోలెడు కోపం వచ్చింది. అసలు నేను చెయ్యనన్నా కదా,ఇప్పుడీ ఫార్ములా కార్లెవరు చేస్తారు? నావల్ల కాదు. ఏ సైకిలో చేసేయచ్చు కదా" అన్నాను. అందరిలా మనమూ చెయ్యటమేంటి వెరైటీ గా ఉంటుంది. హెల్ప్ చెయ్యి.." అన్నారు. నిజం చెప్పద్దూ.. ఆ మోడల్ కార్లు చూస్తే నాకూ సరదా వేసింది. ఈజీగా ఉన్న ఓ మోడల్ కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి, ఆ ప్రకారం ఇద్దరం చిన్నపిల్లల్లా కూచుని ఆ మోడల్ చెయ్యటం మొదలెట్టాం. నాకు తృప్తి కలగలేదు కానీ ఏదో ఓ మాదిరిగా చేసాం.  టైమ్ ఉంటే ఇంకా బాగా చేద్దుము అనుకున్నాం.


మొత్తం అయ్యాకా రంగు వేద్దాం అని వెతికితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ టైర్లకి కావాల్సిన బ్లాక్ కలర్ మాత్రం లేదు. ఫ్యాబ్రిక్ కలర్స్,పోస్టర్ కలర్స్ అన్ని వెతికాం, ఆఖరుకి పిల్ల వేసుకునే వాటర్ కలర్స్ లో కూడా బ్లాగ్ కలర్ అయిపోయింది. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది ! ఇక పొద్దున్న ఆరున్నరకే ఏ షాపన్నా తెరుస్తారేమో అని బయల్దేరారు తను. మా ఏరియా నుంచి మార్కెట్ రోడ్డు చాలా దూరం. ఎనిమిదింటికే పాప ఆటో వచ్చేస్తుంది. పది నిమిషాల తక్కువ ఎనిమిదికి కలర్స్ బాక్స్ తీసుకొచ్చారు. అప్పుడు టైర్లకి గబగబా బ్లేక్ కలర్ వేసాను. కానీ ఎంత ఫ్యాన్ క్రింద పెట్టినా పది నిమిషాల్లో ఎక్కడ ఆర్తాయి? ఇంతలో ఆటో వచ్చేసింది. పిల్ల వెళ్పోయింది. "ఆటో స్కూల్ గేట్ దాకా వెళ్ళటానికి టైం పడుతుంది.. ఈలోపు ఆరబెట్టేస్తాను.. పట్టుకెళ్ళండి" అన్నా. ఆఫీసుకి లేటయిపోతుంది ఇప్పుడిక కుదరదు.రేపు పంపు..అంతే" అన్నారు. నాకు బోలెడు కోపం,బాధ,ఉక్రోషం అన్నీ వచ్చేసాయి. "రేపు పంపేదానికి నిన్న రాత్రంతా అంత కష్టపడటం ఎందుకు?పొద్దున్నే మీరు రంగుల కోసం ఊరంతా తిరగటం ఎందుకు? పైగా ఇవాళే లాస్ట్ డే అని వాళ్ల సార్ చెప్పరుట.. రేపటికి ఇస్తేఒప్పుకోరేమో... మనదంతా వృధా ప్రయాస అయిపోతుంది.." అని నేను గొడవ పెట్టాను. ఏమయినా ఆఫీసుకి వెళ్పోవాలి అని తను తయారైపోయారు. ఈ మోడల్ చెయ్యటం కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డామో తలుచుకుంటే నాకు చాలా బాధ కలిగింది. మూడ్ అంతా దిగులుగా అయిపోయింది.


 అంతలో నాకు తటాలున ఒక ఐడియా వచ్చింది. పట్టుకెళ్ళి క్లాసులో ఇమ్మని స్కూల్ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తే..? అని. వెంఠనే చేసాం. ముందు కుదరదన్నాడు. తర్వాత డబ్బులిస్తాం రమ్మంటే సరేనన్నాడు. ఓ అరగంటలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఈ హడావుడిలో పిల్లకి ఇవాళ హాఫ్డే అని మర్చిపోయి కేరేజ్ కూడా ఇచ్చేసాను నేను. (నెలలో లాస్ట్ వర్కింగ్ డే హాఫ్ డే వాళ్ళకి.) మధ్యాహ్నం బెల్లు కొడితే ఎవరో అనుకుని తలుపు తెరిస్తే పిల్ల ! అప్పుడు గుర్తుకొచ్చింది హాఫ్ డే సంగతి. ఇంతకీ సార్ ఏమన్నారు అనడిగితే "బావుందన్నారు. అందరి వెహ్కిల్ మోడల్స్ క్లాస్ లోనే గూట్లో పెట్టారు. నాది ఏక్టివిటీ రూమ్ లో పెట్టించమని పంపారు" అని చెప్పింది. ఇంకేముంది.. నా మొహంలో వంద చిచ్చుబుడ్లు, వెయ్యి మతాబలూ ఒక్కసారిగా వెలిగిపోయాయి. వెంఠనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా. "వెరీ గుడ్ వెరీ గుడ్!" అన్నారు. లోపల్లోపల మాత్రం "బ్రతికానురా దేవుడా!" అనుకుని ఉంటారు..:-)




Tuesday, October 30, 2012

కన్నులదా.. ఆశలదా..




ఈమధ్య రేడియోలో విన్న ఈ పాట ఎందులోదా అని వెతికితే "3" సినిమాలోదని గూగులమ్మ చెప్పింది. నాకు ఈ ట్యూన్ బాగా నచ్చింది. పాటలో ఎక్కువగా వాడిన గిటార్, వయోలిన్ బిట్స్ చాలా బాగున్నాయి.

సంగీతం: అనిరుధ్ధ్ రవిచందర్
సాహిత్యం: భువనచంద్ర
పాడినది: ధనుష్, శృతి హాసన్

http://www.raaga.com/play/?id=334560



 




సాహిత్యం:

ప: కన్నులదా.. ఆశలదా..
బుగ్గలదా.. ముద్దులదా..
పెనవేసుకున్న పెదవులదా
నువ్వు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవే కదా
కలలా కదిలే వలపుల చిలకా
అందని అందం నీవే కదా

చ: ఏదెదో పాడుతు, నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్ని చేయకు
గుండెల్లో ఆడుతు, కళ్లల్లో సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకూ
హృదయం హృదయం కలిసెనమ్మా.. వయసే విరిసెనమ్మా
అమృతం పొంగి అణువణువూ.. తలపే కురిసెనమ్మా
ముద్దుల్నే పేర్చవా, ముచ్చట్లే ఆడవా,
నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా

కన్నులదో.. బుగ్గలదో..
ముద్దులదో.. నవ్వులదో..
మదిలో మెదిలే వలపుల మొలక..
నాలో ప్రాణం నీవే కదా!


Monday, October 29, 2012

అతను




నిన్న మేము బస్సులో ఎక్కేసరికీ లేడీస్ సీట్లు ఖాళీ లేవు. లేడీస్ సీట్ లో కూచున్న ఒకతన్ని వెనక ఖాళీగా ఉన్న సీట్ చూపెట్టి వెనక్కు కూచోమని అనడిగా. వెంఠనే అవతల పక్క సీట్లో ఉన్న ఆయన "అతన్ని లేపకండి.. ఇక్కడ కూచోండి" అని తన సీట్ ఖాళీ చేసి వెనక్కు వెళ్పోయాడు. మా పాప వాళ్ల నాన్న దగ్గర కూచుంది. నేను సీట్లో కూచున్నాకా ఇందాకటి మనిషి చేతిపై గాయం ఉండటం చూసాను. కట్టు లేదు కానీ దూది అంటుకుపోయి ఉంది అరచేతి వెనుకవైపు. ఎవరైనా రిలెటివ్స్ ఏమో  అందుకనే అతన్ని లేపవద్దన్నారు అనుకున్నా. అంతేతప్ప అతడిని పెద్దగా పరీక్షగా చూడలేదు.

నే కూచున్న సీట్ కాళ్ళ దగ్గర ఒక పాత, చిరిగిన రగ్గు ఉంది. ఎవరిదో ఇలా పడేసారు..అనుకున్నా. బ్యాగ్ లోంచి పుస్తకం తీసి అందులో మునిగిపోయా. కాసేపటికి నా పక్క సీట్ ఖాళీ అయ్యింది. ఇక పుస్తకం మూసి కిటికీ వైపు జరిగి బయటకు చూస్తూ కూచున్నా. అంతకు ముందు జరిగిన సంఘటనల వల్ల మనసు చిరాగ్గా ఉంది. ఎందుకో నే తల తిప్పేసరికీ ఇందాకటి దెబ్బ తగిలినతను నెమ్మదిగా నా సీట్ క్రింద ఉన్న రగ్గు లాగుతున్నాడు. ఇదేమిటి ఈ పాత రగ్గుని లాగుతున్నాడు? అని అప్పుడతన్ని బాగా పరీక్షగా చూశా. పాత మాసిన బట్టలు, ఎవరినీ పట్టించుకోకుండా తన లోకంలో తానున్నట్లున్నాడు. ఈ రగ్గు ఇతనిదా అని ఆశ్చర్యపోయా. ఇందాకా బస్సు ఎక్కిన హడావుడిలో అతన్ని సరిగ్గా చూడలేదు.. అనుకున్నా. అప్పటికి బస్సు సగం పైగా ఖాళీ అయిపోయింది. అతను నెమ్మదిగా సీట్లోంచి లేచి ఎవరినీ చూడకుండా, ఏ సంకోచం ప్రకటించకుండా బస్సులోని అటు ఇటు సీట్ల మధ్యన ఉండే నడవలో ఆ దుమ్ముకొట్టుకుపొయిన పాతరగ్గు కప్పుకుని పడుకుండిపోయాడు. అతనలా పడుకుంటుంటే బస్సులో కండక్టర్ తో సహా ఆతన్నిఎవరూ ఏమీ అనకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా వెనుక సీట్ ఖాళీగా ఉందని కండక్టర్ అక్కడే కూర్చున్నాడు.  లేచి వెనుక సీట్లో పడుకో అన్నాడు అతనితో. అతని ఓసారి కండక్టర్ వైపు మళ్ళీ లేవలేనన్నట్లు చూసి.. పక్కకు వత్తిగిల్లి పడుకుండిపోయాడు. కండక్టర్ ఇంక ఏమీ అనలేదు. లోకంతో ప్రమేయం లేకుండా ఎంత హాయిగా పడుకుండిపోయాడో!

బహుశా అతను రోజూ అదే బస్సులో వెళ్తుంటాడేమో. ఈ రూట్లో వెళ్ళే కొంతమందికి అతను తెలుసేమో. ఇందాకా నాకు సీట్ ఇచ్చిన వ్యక్తి కూడా అందుకనే అతన్ని లేపవద్దన్నాడేమో అని అప్పుడనిపించింది. ఎక్కడో తిరుగుతున్న నా ఆలోచనలన్నీ ఆ వ్యక్తి వైపుకి తిరిగాయి. అతనికెవరన్నా ఉన్నారో లేదో? ఇల్లూ వాకిలీ ఉందో లేదో? ఆ దెబ్బ ఎలా తగిలిందో? మతిస్థిమితం కాస్త ఉండే ఉంటుంది...మరీ పిచ్చివాడిలా లేడు కానీ ఇలా బస్సు మధ్యలో ఎలా పడుకుండిపోయాడు?.... ఇలా ఆలోచిస్తుంటే అంతకు ముందు నుంచీ నన్ను ఇబ్బంది పెడ్తున్న వేరే ఆలోచనలు మాయమైపోయాయి. ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలీకుండా, జీవితానికి ఏ ఆధారం లేకుండా, నా అనేవాళ్ళు లేకుండా ఉన్న ఇతనిలాంటివాళ్ళు ఈ ఊళ్ళో, దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో బోలెడు మంది ఉంటారు కదా.. అలాంటివాళ్ల బ్రతుకులు ఎంత దయనీయమైనవి! మరి నాకున్న లోటేమిటి? నా చుట్టూ నా కోసం నా వాళ్ళు బోలెడుమంది. ఇతనిలా చిరిగిపోయిన రగ్గు కప్పుకునే పరిస్థితి అసలే లేదు. ఉన్నంతలో దేనికీ లోటు లేదు.  అతనిలా దిక్కులేని పరిస్థితి కాదు. మరెందుకు నేను బాధ పడుతున్నాను? చిన్న చిన్న సమస్యలను భూతద్దం లోంచి ఎందుకు చూస్తున్నాను? పెద్ద కష్టం వచ్చేసినట్లు ఎందుకు మనసు కష్టపెట్టుకుంటున్నాను? ఓపిగ్గా ఆలోచిస్తే ఏ సమస్యకైనా ఏదో ఒక మార్గం దొరుకుతుంది కదా! అలా అనుకోగానే ఇందాకటి నుంచీ ఉన్న చికాకు మాయమైపోయింది. మనసు తేలికైపోయింది.. కిటికీ బయట నుంచి వీస్తున్న చల్లగాలి ఆహ్లాదాన్ని పెంచింది.

 హఠాత్తుగా మరో ఆలోచన వచ్చింది. బహూశా నా ఆలోచనలో మార్పు తేవటం కోసమే అతను ఇలా బస్సులో కనబడ్డాడేమో అని. ఏదేమైనా ఈ చిన్న సంఘటన నా ఆలోచనల్లో పెద్ద మార్పునే తెచ్చింది !

Saturday, October 27, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారి "మా ఊరు" కబుర్లు - పాటలు




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి మరణ వార్త యావత్ సంగీతలోకాన్నీ, వారి అభిమానులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంగీతజ్ఞుడు స్వరపరిచిన లలితగీతాలబాణీలు తెలుగువారికి చిరస్మరణీయాలు. ముఖ్యంగా లలిత సంగీతానికి పాలగుమ్మివారు అందించిన సేవ అనంతం.  ఆయన పాటలు చాలా వరకూ వారి వెబ్సైట్ 'http://palagummiviswanadham.com/’ లో వినటానికి, కొన్ని డౌన్లోడ్ కు కూడా విశ్వనాథంగారు ఉండగానే అందుబాటులో పెట్టడం హర్షించదగ్గ విషయం. 


గత నవంబర్ లో దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేసిన ’మా ఊరు’ అనే కార్యక్రమంలో విశ్వనాథంగారు కూడా పాల్గొన్నారు. ఆయనపై అభిమానం కొద్దీ మా నాన్నగారు ఆ కార్యక్రమాన్ని బయట రికార్డ్ చేయించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఉన్న బిట్ వరకూ ఎడిట్ చేసి ఆ కార్యక్రమ్మాన్ని ఇక్కడ పెడుతున్నాను. విశ్వనాథం గారు పాడిన ’మా ఊరు ఒక్కసారి పోవాలి..’ పాట కూడా ఇందులో ఉంది. ఆ కార్యక్రమానికి సిగ్నేచర్ ట్యూన్ క్రింద ఈ పాటనే పెట్టుకున్నారు.



ఆయన పాడిన ఇతర లలిత గీతాల్లో "అమ్మదొంగ..’, "ఎన్నిసారులు అన్నదో..’ , "ఎంత సుందరమైనదో..’ మొదలైనవి నాకు ఇష్టమైన పాటలు.  

1) శ్రీమతి బి.వరహాలుగారు పాడిన ’అమ్మదొంగ..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:
http://samgeetapriyaa.blogspot.in/2012/10/blog-post_27.html


2) ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని తీరులు విన్నదో..
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/ennissarulu.mp3


3) ఎంత సుందరమైనది భగవానుడొసగిన బహుమతి...
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/enthasundaramainadi-palgummi.mp3




గుడిపూడి శ్రీహరి గారు రచించిన "పాలగుమ్మి విశ్వనాథం గారి ఆత్మకథ" చాలా బావుంటుంది. ఆ పుస్తకం సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ళు ప్రచురణ. అప్పట్లో పుస్తకం రిలీజైందని తెలిసిన వెంఠనే అన్నయ్యను సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ల షాపుకి పంపి తెప్పించుకున్నాం. ఈ ఆత్మకథను చాలా ఆసక్తికరంగా రాసారు శ్రీహరి గారు. ముఖ్యంగా విశ్వనాథంగారి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూపిన తెగువ,ధైర్యం, వారు పడ్డ ఇక్కట్లు చదువుతూంటే కళ్ళు చెమరుస్తాయి.

సంగీతం పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఇటువంటి కళాకారులు చాలా అరుదు, అవసరం అనే చెప్పాలి.


శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..."




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి స్మృత్యర్థం ..

ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత గీతాల్లో "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే "నాకు చాలా ఇష్టమైన పాట. 

రాత్రిపూట పిల్లలను జోకొడుతూ "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగ.." అని పాడే తల్లులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నామటుకు నేనే చిన్నప్పుడు ఫ్యామిలీ గేదరింగ్స్ లో.. ఈ పాట తప్పక పాడేదాన్ని. నేను పాడకపోతే " అమ్మదొంగా నువ్వు పాడకుంటే నాకు బెంగ .." అని మా మావయ్యా పాడేవాడు :) 

బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో ఈ పాట గురించి ఒక టపా కూడా రాసాను. అది వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట. అదే బాగా ప్రచారంలోకి వచ్చింది కూడా. కానీ ఇదే పాటను శ్రీమతి ’బి.వరహాలు’ అనే గాయని విజయవాడ రేడియోస్టేషన్ కొరకు పాడారు. వరహాలు గారి మధురమైన స్వరంలో అది కూడా బావుంటుంది.


శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:





సాహిత్యం:
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)

కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!
====================

అమ్మదొంగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట క్రింద వినవచ్చు. ఇది నేను ఎప్పుడో టివిలో వస్తుంటే చేసుకున్న రికార్డింగ్.

 

Thursday, October 25, 2012

"తల్లీ! నిన్ను దలంచి"



తెలుగువారికి మాత్రమే సొంతమైన "పద్య"సంపద గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తనివితీరదు. మాధుర్యం, తెలుగుతనం ఉట్టిపడే మీగడతరకలు మన తెలుగుపద్యాలు. గతంలో "తెలుగు పద్యాలా? బాబోయ్ !" అని చక్కని తెలుగు పద్యాల గురించిన పుస్తకం గురించి రాసాను కదా.. ఇప్పుడు అలాంటిదే మరిన్ని ఎక్కువ తెలుగు పద్యాలతో ఉన్న మరో మంచి పుస్తకం దొరికింది. ప్రముఖ కథకుడు, కవి, విమర్శకుడు శ్రీ పాపినేని శివశంకర్ గారి "తల్లీ! నిన్ను దలంచి". అమెరికాలో "తెలుగునాడి" పత్రికలో ధారావాహికంగా సాహిత్యాభిమానులను అలరించిన ఈ పద్య విశ్లేషణలకు మరిన్ని పద్యవిశ్లేషణలను జోడించి "తల్లీ! నిన్ను దలంచి" పుస్తకం తయారుచేసారుట. 


ప్రముఖ ప్రాచీనకవులు నుండీ ఇరవైయ్యవ శతాబ్దం తొలిపాదం వరకూ రచింపబడిన పద్యాల్లో కొన్ని, కొన్ని చాటువులు, కొన్ని చమత్కార పద్యాలు కలిపి మొత్తం ఓ నూటపది మధురమైన పద్యాలకు అర్థవిశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి పద్యానికీ అర్థవిశ్లేషణలతో పాటూ పద్యరచన సంబంధిత కొన్ని చారిత్రక విశేషాలను కూడా తెలిపారు శివశంకర్ గారు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, భర్తృహరి, శ్రీనాథుడు, పోతన, శ్రీకృష్ణదేవరాయులు, తెనాలి రామకృష్ణుడు, వేమన మొదలైనవారి పద్యాలను మనము ఈ పుస్తకంలో చూస్తాము. అట్ట ముందువెనుల భాగాల్లో బాపూ గీసిన అందమైన చిత్రాలతో,  ప్రతి పద్యానికీ  శ్రీ కొల్లోజు గారు వేసిన అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం కాపీలు "విశాలాంథ్ర"లో దొరుకుతున్నాయి. వెల: రెండువందల ఏభై రూపాయిలు.

"ప్రాచీన భాషగా తెలుగుకు గౌరవం లభించిన సందర్భంగా ఈ చిరుకానుకను తెలుగు రసజగత్తుకు సమర్పిస్తున్నాము" అన్నారు ముందుమాటలో వల్లూరు శివప్రసాద్ గారు. అప్పట్లో ఈ పద్య విశ్లేషణలను ప్రోత్సాహించిన జంపాల చౌదరి గారికీ, ఈ పుస్తకం ప్రచురణకు కారణమైన మిత్రులు శ్రీ వల్లూరు శివప్రసాద్ గారికీ, గ్రంథసేకరణలో సహాయ పడిన ఇతర మిత్రులందరకూ శివశంకర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, పద్యకవిత్వాన్ని ఎక్కువ మంది ఎందుకు ఆస్వాదించలేరో చెప్తూ, ప్రాచీన కవిత్వంలోని విశేషగుణాలను కూడా తెలిపారు తన ముందుమాటలో. "ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దేవియమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్థిత్వవేదన నిజం.ఆత్మనివేదనలో నుంచి వచ్చిన ఏ భావోద్వేగాన్నీ మనం తక్కువ చేసి చూడనక్కరలేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించటానికి అడ్దం కాబోదని నా అవగాహన" అంటారు పాపినేని శివశంకర్ గారు.

పుస్తకంలోని కొన్ని మధురపద్యాలు: (అర్థాలు రాయటం లేదు)

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి, జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ ! భగవతీ ! పూర్ణేందుబింబాననా !
(చాటువు)
(-ఎవరు రాసారో తెలియని పద్యాన్ని చాటువు అంటారుట. చాటువు అంటే 'ప్రియమైన మాట' అని అర్ధంట. )


శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హారపమ్క్తులం
జారుతరమ్బులయ్యె, వికసన్నవ కైరవ గమ్ధబంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధామ్శు వికీర్యమాణ క
ర్పురపరాగ పాండురుచిపూరము లంబర పూరితంబులై
(నన్నయ, శ్రీమదాంధ్రమహాభారతము)
 --శరత్కాల రాత్రులను వర్ణించే పద్యమిది.


కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితర వైభవముల్ పదివేలు మానసమ్
బంటునె? మానుషమ్బు గలయట్టి మనుష్యున కెట్టి వానికిన్
కంతకుడైన శాత్రవుcడొకండు తనంతటివాcడు గల్గినన్
(శ్రీనాధుడు, కాశీఖండము)


కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వొన్నతిం బొందరే
వారేరీ సిరి మూటకట్టుకుని పోవంజాలరే భూమిపై
పేరైనం గలదే శిబి ప్రముఖులున్ బ్రితిన్ యశ:కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
(బమ్మెర పొతన, శ్రీమహాభాగవతము)
- పలురాజుల గర్వాన్ని, భయాన్నీ, స్వార్థాన్నీ , వాళ్ళు చివరకు ఏం పట్టుకెళ్లారు? అని ప్రశ్నించే ఈ పద్యం నాకు బాగా నచ్చింది.


చనవిచ్చినాడని - సకియరో నీవు
పలుమాటలకు నెట్లు - పాలుపడ వద్దు
పొలతి నమ్మగరాదు - పురుషుల నెపుడు
పలురీతి కృష్ణ స - ర్పమ్ములై యుండ్రు
కొంచక కృష్ణకు - కూర్మితో నుండు
వంచన సేయకు వనిత యెప్పుడును
(తాళ్ళపాక తిమ్మక్క, సుభద్రా కల్యాణము)
- ఇవి రుక్మిణి సుభద్రకు అప్పగింతల సమయంలో చెప్పిన మాటలట.


నారదులైరి సన్మునులు, నాక మహీజములయ్యె భూజముల్
శారదలైరి భామినులు, శంకర శైలములయ్యె గోత్రముల్
పారదమయ్యె నీరధులు, పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సితవర్ణములయ్యెను బండు వెన్నెలన్
(మెల్ల, రామాయణము)
-- శరత్కాలపు వెన్నెలలో మునులు, చెట్లు, స్త్రీలు, కొండలు, సముద్రాలూ, పాములూ, మబ్బులు మొదలైనవి ఎలా మారిపోతాయో తెలిపే అందమైన వర్ణన ఇది.


చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
(మారన వెంకయ్య, భాస్కర శయకము)
-- చదువు ఎలా చదువుకోవాలో తెలిపే పద్యం ఇది.


తప్పు లెన్నువారు తండోపతందము
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరో
విశ్వదాభిరామ! వినురవేమ!
(వేమన)


బొంకనివాcడె యోగ్యుc డరిబృందము లెత్తినచోటc  జివ్వకున్
జంకనివాcడె జోదు, రభసమ్బున నర్థి కరంబు సాcచినన్
గొంకనివాcడె దాత, మిముc గొల్చి భజించిన వాcడె పో నిరా
తంక మనస్కుc డెన్నcగను దాశరథీ! కరునాపయొనిథీ!
(కంచర్ల గోపన్న, దాశరథి శతకము)
- యోగ్యత, వీరత్వం, భక్తి, దానగుణం మొదలైన మానవగుణాలకు నిర్వచనాలు చెప్తాడు గోపన్న ఈ పద్యంలో.


బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
(తిరుపతి వేంకటకవులు, పాండవోద్యోగము)


ఆశ్చర్యం కలిగించిన విషయం:
"సిరికిం జెప్పడు.." పద్యం విశ్లేషిస్తూ శ్రీనాధుడికీ, పోతనకూ జరిగినట్లుగా చెప్పుకునే సంభాషణ తాలూకూ కథ గురించి కూడా చెప్తారు శివశంకర్ గారు. కానీ ఈ కథకు కాళ్ళే కాదు కళ్ళు కూడా లేవంటారు ఆయన. శ్రీనాధుడికి దగ్గుబల్లి పోతన, దుగ్గన అనే బావమరదులున్నట్లు వేరే గ్రంథాల వల్ల తెలిసిందనీ; శ్రీనాధుడి కాలానికీ, పోతన కాలానికీ నడుమ దశాబ్దాల కాలవ్యవధి ఉందనీ, అంత కాలవ్యత్యాసం ఉంటే ఈ పద్యం గురించి వారిద్దరూ ఎలా సంభాషించుకున్నరో శ్రీమహావిష్ణువుకే తెలవాలి అని చమత్కరిస్తారు శివశంకర్ గారు. తెలుగు సాహిత్యచరిత్ర గురించి ఏమీ తెలియనందున ఈ సంగతి నన్ను ఆశ్చర్యపరచింది.






Wednesday, October 24, 2012

శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం


శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం



 

 బ్లాగ్మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Monday, October 22, 2012

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి




ప్రముఖ భారతీయ సంస్కృత పండితుడు, కవి కాళిదాసు రచించిన "శ్యామలా దండకం" బహుళ ప్రచారాన్ని పొందింది. కాళిదాసుచే లిఖింపబడిన మరో అందమైన స్తుతి "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". కాళి కి సేవకుడు కాబట్టి "కాళిదాసు" అనే పేరు కాళిదాసుకి స్థిరపడింది అంటారు. కాళికాదేవి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించిన వెంఠనే ఆశువుగా కాళిదాసు చేసిన దేవీ స్తుతే ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". ఈ రచనలో కాళిదాసు ఉపయోగించిన పదజాలం క్లిష్టమైనది కావటం వలన ఇది ఎక్కువ ప్రచారంలోకి రాలేదేమో మరి. 

'వేగవంతమైన ఆడగుర్రము పరుగు కంటే తీవ్రమైన వేగము కల కవిత్వ ధాటిని తనకు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి ప్రసాదించుగాక' అని ప్రార్ధిస్తూ అశువుగా చెప్పిన స్తుతి ఇది. అందుకనే అశ్వధాటితో చెప్పబడినది అని కూడా అంటారు. పది శ్లోకాలు గల ఈ స్తుతిని "దేవీ దశశ్లోకి" అని, "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" అని కూడా అంటారు. 

 ఈమధ్యన కొన్న ఒక (స్తోత్రాలు,అష్టకాలు ఉన్న) పుస్తకంలో "అంబాష్టకమ్" పేరుతో ఉన్న ఈ స్తుతి 'శంకరాచార్య విరచితం' అని రాసారు. అందువల్ల ఈ స్తోత్ర రచన ఎవరు చేసారన్నది కూడా సందిగ్థమేనన్నమాట అనుకున్నా. 
సందిగ్థత సంగతి ఎలా ఉన్నా ఈ స్తోత్రం మాత్రం చాలా బావుటుంది. నాకు ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" గురించి ఎలా తెలిసిందో, ఆఖరికి ఎలా దొరికిందో ఈ టపాలో  రాసాను..:)


దేవి ప్రణవ శ్లోకీ స్తుతిని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/play/?id=39246



క్రింద రాసినవి నాకు దొరికిన పుస్తకం లోని "దేవీ దశశ్లోకి" పద్యాలు:


చేటీభవన్నిఖిల ఖేటీ కదంబవవనవాటీషు నాకిపటలీ
కోటీర చారుతర కోటీమణీకిరణ కోటీకరంబితపదా
పాటీరగంధ కుచశాఠీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతాం
ఘోటీకులా దధికధాటీ ముదారముఖవీటీరసేనతనుతాం

బాలా మృతాంశునిభఫాలా మనాగరుణచేలా నితంబఫలకే
కోలాహలక్ష పితకాలామ రాకుశల కీలాల శోషణరవి:
స్థులాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబవిపినే
శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాలముఖ సత్రాశన ప్రకర శుత్రాణ కారి చరణా
చత్రా నిలా తిరయ పత్రాభిరామ గుణ మిత్రా మరీ సమవధూ
కు త్రాన సహన్మమణి చిత్రాకృతి స్వరిత పుత్రాది దానవ పుణా

ద్వైపాయన ప్రభృతి  శాపాయుధ త్రిదివ సోపానధూళిచరణా
పాపాపహశ్వమను జాపానులీన జనతా పాపనోదనిపుణా
నీపాలయా సురభిధూపాలకా దురితకూపా దుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణిదీపాయితా భగవతీ

యా ళీభి రాత్తతను రాళీ లసత్ప్రియ కపాలీషు ఖేలతి భవ
వ్యాలీనకుల్య సితచూళీభరా చరణధూళీలసన్మునిగణా
యాళీభ్రుతిశ్రవసి తాళీదలంవహతి యాళీకశోభితిలకా
సాళీ కరోతు మమ కాళీ మన: స్వపదనాళీకసేవనవిధౌ

న్యంకాకరే వపుషి కంకాలరక్త పుషి కంకాదిపక్షివిషయే
త్వం కామనా మయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజాం
శంకాశిలానిశితటంకాయ మానపద సంకాశా మానసుమనో
ఝంకారి భ్రుంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలాం


ఇంధానకీరమణిబంధా భవే హృదయబంధా వతిన రసికా
సంధావతీ భువన సమ్ధారనేశ్యమృతసింధా వుదార నిలయా
గంధాను భావముహ రంధాళి పీతకచ బంధా సమర్పయతు మే
సంధామ భానురపి రుంధాన మాశు పదసమ్ధాన మస్య సుగతా

దాసాయమానసుమహాసా కదంబవనవాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసావిధుతమధుమాసా రవిందమధురా
కాసారసూనతతి భాసాభిరామతను రాసారశీతకరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయే దుపరతం

జంభారికుంభిపృథు కుంభాపహాసికుచ సంభావ్య హారలతికా
రంభా కరీంద్ర కరడంభాపహోరు గతిడింబానురంజితపదా
శంభా వుదారపరికుంభాంకురత్పులకడంభానురాగపిశునా
శంభా సురాభరణగుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా

దాక్షాయనీ దనుజ శిక్షావిదౌ వితతదీక్షా మనోహరగుణా
భిక్షాశినో నటన వీక్షావినోదముఖి: దక్షాద్వర ప్రహరణా
వీక్షాం విదేహి మయి దక్షా స్వకీయజనపక్షా విపక్షవిముఖీ
యక్షేశసేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా

వందారు లోకవర సంధాయనీ విమలకుందావదాత రదనా
బృందార బృందమణి బృందారవింద మకరందాభిషిక్త చరణా
మందానిలాకలిత మందారదామభి రమందాభిరామమకుటా
మందాకినీ జవనభిందానవాచ మరవిందాననా దిశతుమే