బాల్యపు అమాయకత్వం, చురుకు వయసు ఆశలు,ఆశయాలు, స్మృతులు, కలలు, కోరికలు, మాటలు, పాటలు అన్నీ కలగలిస్తే ఓ మనిషి అస్తిత్వం తయారవుతుంది. అయితే వేళ్ల సందుల్లోంచి జారిపోయే ఇసుకలాగ ఏళ్ళు గడిచేకొద్దీ జీవనసమరంలో ఈ అస్తిత్వాన్ని, ఒక్కొక్క అనుభూతినీ కోల్పోతూంటాడు మనిషి. నేను నేనేనా? అని తనని తాను ప్రశ్నించుకునే సందర్భాలు బోలెడు. సంసార సాగరంలో నేను కూడా నన్ను నేను మర్చిపోయి కొట్టుకుపోతున్న తరుణంలో అనుకోకుండా మొదలెట్టిన ఈ బ్లాగ్ ప్రయాణం కోల్పోయిన నా అనుభూతులను చాలావరకూ వెతికి తెచ్చి నన్నే నాకు కొత్తగా పరిచయం చేసింది. ఇవాళ్టికి ఈ పయనానికి రెండేళ్ళు..!
ఈ రెండేళ్ళలో మామూలుగా అయితే ఎంతో కొంత భారంగా గడవాల్సిన సమయాలు బ్లాగ్ మూలంగా త్వరగా, కాస్తంత తేలికగా గడిచిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. ఇష్టమైన విషయాలను గురించి రాసే ప్రతి టపా మనసుని ఎంతో హాయిలో ముంచుతుంది. అదే హాయి ఒడిదొడుకుల జీవితాన్ని అలవోకగా గడిపేయటానికి శక్తినిచ్చింది. బ్లాగింగ్ ఒక వ్యసనం అంటారు అందరూ. కానీ ఇదొక "ఆటవిడుపు" అంటాను నేను. మొదట్లో ఏది రాస్తే చదువుతారు? అని ఉండేది. అప్పుడు "ఎవరన్నా చదువుతారో లేదో, వ్యాఖ్యలు రాస్తారో లేదో" అన్న ధ్యాసే ఉండేది. కాని నెమ్మదిగా "ఏది రాస్తే నాకు తృప్తి?" అనే ఆలోచన మొదలైంది. నా సంతృప్తి కోసం నేను రాసుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత "ఏది రాస్తే ఉపయోగకరం?" అనే ఆలోచన మొదలైంది. మన తర్వాత కూడా మన రాతలు నిలిచిపోయే ఈ అంతర్జాల ప్రపంచంలో ఎప్పుడెవరు చూసినా "ఇది ఉపయోగకరం అనో, బావుంది అనో, ఉత్సాహాన్ని నింపింది అనో.. అనుకోవాలి" అనిపిస్తోంది ఈ మధ్యన.
నిజం చెప్పాలంటే బ్లాగింగ్ నాకు ఇచ్చిన ఆనందం తక్కువ, నేర్పిన పాఠాలు ఎక్కువ. ఎంతో కష్టపడి ఇష్టంగా రాసిన టపాలకు స్పందన లభించనప్పుడు కోపం వచ్చేది. నావల్ల కాదని బ్లాగింగ్ మానేసి పారిపోదామనిపించేది. కానీ దేనికైనా పారిపోవటం పరిష్కారం కాదు కదా. "ఇప్పుడు వ్యాఖ్యలు రాకపోతే నష్టం ఏమిటి? ఎవ్వరూ చూడరు. పోనీ మానెయ్యమను. రాయదల్చుకున్నది రాసుకుంటూ ఫో. ఇప్పుడు కాకపోయినా ఎవరో ఒకరికి ఏదో రిఫరెన్స్ అవసరం అయితే అప్పుడు నువ్వు రాసింది పనికిరావచ్చు కదా. రాయటం అనేది తృప్తినిస్తున్నప్పుడు, మరేమీ చెయ్యలేనప్పుడు.. ఇదైనా చేసుకుంటూ పోవటమే " అని సమాధానపరుచుకున్నా. " ऎ हॊंसला कैसॆ झुकॆ..ऎ आर्जू कैसॆ रुकॆ...मंजिल मुष्किल तो क्या.. बुंद्ला साहिल तो क्या.." అని పాడుకుంటూ రాసేసుకోవటం మొదలుపెట్టా.
చాలా రోజుల తర్వాత ఈ మధ్యన నా బ్లాగ్ చూసిన అన్నయ్య అడిగాడు "ఏంటి దేనికోసం వెతుకుతున్నావో అది దొరికేసిందా?" అని. అవునని నవ్వాను. ఎవరైనా గమనించారో లేదో మరి..అదివరకూ "తృష్ణ... a woman's search for identity" అని ఉండేది. ఈ మధ్యనే "తృష్ణ ... జీవితాన్ని ప్రతిక్షణం జీవించాలని" అని మారిపోయింది. నేను బజ్ మొదలెట్టినప్పుడు బజ్ కి కేప్షన్ పెట్టి అదే బావుందని బ్లాగ్ కు కూడా పెట్టేసా. ఇప్పుడు ఇక నాకు ఏ ప్రశ్నలూ లేవు. ఏ వెతుకులాట లేదు. నిన్న లేదు. రేపు లేదు. ఇవాళ..ఈ క్షణమే శాశ్వతం. అంతే. జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం ఒక్కటే నేను ప్రతినిత్యం చేసేది. ఇది ఈమధ్య కాలంలో నేను అలవర్చుకున్న సత్యం.
చివరిగా ఒక చిన్న కోరిక... నా బ్లాగ్ చాలా మంది చదువుతామని చెప్తారు. కానీ అలా అప్పుడప్పుడు చదివేవాళ్ళు, కొంత కాలం నుంచీ చదివేవాళ్ళు కాకుండా మొదటి నుంచీ అంటే కూడలికి లంకె వేసిన దగ్గర నుంచీ నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటికీ మానకుండా చదివేవాళ్ళు ఒక్కరైనా అని నాకు సందేహం. మొదటినుంచీ కాకపోయినా కొంత కాలం నుంచీ చదువుతున్నా మొత్తం నా నాలుగు బ్లాగులు చదివేవాళ్ళు, నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటి వరకు పాతవన్నీ చదివినవాళ్ళు ఒక్కరైనా ఉన్నారేమో చెప్తారా ? అలా ఒక్కరున్నా నా అక్షరాలకు ప్రాణం ఉన్నట్లే.