సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 30, 2014

Meghadutam - Vishwa Mohan Bhatt


భారతీయ తంత్రీవాయిద్యాలైన వీణ, సితార, సంతూర్ మొదలైనవాటికి తోడుగా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, గిటార్, మేండొలిన్ మొదలైన వాయిద్యాలను కూడా శాస్త్రీయ సంగీత వాదనకు జతపరిచారు మన భారతీయ సంగీతకారులు. విచిత్ర వీణ, సరస్వతి వీణ, రుద్ర వీణ మొదలైన రకరకాల వీణలను శాస్త్రీయ సంగీతకారులు ఉపయోగిస్తారు. పాశ్చాత్య వాయిద్యమైన హవాయీన్ గిటార్ ను కొద్దిగా మార్చి "మోహన వీణ" అనే పేరుతో ప్రాచుర్యం లోకి తెచ్చారు హిందుస్తానీ సంగీత కళాకారులు, గ్రామీ అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్ గారు.

శ్రీ విశ్వమోహన్ భట్ గారు వాద్యకారులే కాక సంగీతకారులు కూడా. కాళిదాసు 'మేఘదూతం' లోంచి ఒక పన్నెండు శ్లోకాలను తీసుకుని వాటికి విశ్వమోహన్ భట్ గారితో స్వరాలను ఆడియో కేసెట్ గా చేయించారు 'MUSICTODAY' వాళ్ళు 2002లో. ప్రముఖ గాయకులు హరిహరన్, కవితా కృష్ణమూర్తి, రవీంద్ర సాఠే గార్లు ఆ సంస్కృత శ్లోకాలకు స్వరాలాపన చేసారు. ఇందులో వాడిన వాయిద్యాల్లో 'మోహన వీణ' విశ్వమోహన్ భట్ గారే వాయించారు. మ్యూజిక్ ఎరేంజ్మెంట్ పండిట్ రోనూ మజుందార్ చేసారు. మధ్య మధ్య ఉపయోగించిన సంతూర్ వాదన కూడా చాలా మనోహరంగా ఉంటుంది.


 చాలారోజుల నుండీ ఆ కేసెట్ గురించి పోస్ట్ రాద్దామని.. ఇన్నాళ్ళకు కుదిరింది. లక్కీగా యూ ట్యూబ్ లో కవితా కృష్ణమూర్తి పాడిన ఒక్క ట్రాక్ (On Amrakuta Peak) దొరికింది..




Track list:
1. The Forlorn Yaksha 
Hariharan

2. Invocation To The Cloud 
Hariharan

3.The Path Of The Cloud
Hariharan

4. On Amrakuta Peak
Kavitha Krishna Murthy

5. Ripening Earth
Ravindra Sathe

6. Detour To Ujjain
Vishwa Mohan Bhatt(Instrumental)

7. The River Nirvindhya
Kavitha Krishna Murthy

8. The Mansions Of Ujjain
Kavitha Krishna Murthy

9. The Majesty Of Kailash
Ravindra Sathe

10. The Beautiful Yakshi
Kavitha Krishna Murthy

11. Lovelorn Yaksha
Ravindra Sathe

12. Farewell To The Cloud

Ravindra Sathe

raaga.com వాళ్ల దగ్గర ఈ కేసెట్ ఆడియో లింక్ ఉంది. మొత్తం పన్నెండు ట్రాక్స్ audio క్రింద ఉన్న రెండు లింక్స్ లో దేనిలోనైనా వినవచ్చు:

http://play.raaga.com/worldmusic/album/Kalidasas-Meghdutam-The-Cloud-Messenger-WM00111
or 
http://www.napster.de/artist/various-artists/album/kalidasas-meghdutam-the-cloud-messenger/

Wednesday, October 29, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -2


అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..


(నిన్నటి తరువాయి.. )

దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు.." అని చదివిన గుర్తు. బిక్కవోలు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్లి వచ్చేద్దాం అని డిసైడయ్యాం. 

శనివారం పొద్దున్నే తయారయ్యి ఏడున్నరకల్లా బస్టాండు కి చేరిపోయాం. అప్పటికే ఎండ వేసవిలా చికాకు పెట్టేస్తోంది. బిక్కవోలు మీదుగా వెళ్ళే బస్సు ఎక్కాం. కడియం, ద్వారపూడి రూటు. ఒకవైపు కడియం నర్సరీలు, మరోవైపు ఏదో కాలువ ఉంది. రోడ్డు పొడువునా చాలా దూరం మాతో పాటూ వచ్చిందది. ఆ కాలువకు అటు ఇటు కొన్ని చోట్ల తెల్లని రెల్లుదుబ్బులు, మరి కొన్ని చెట్లు, పొలాలు.. పైన నీలాకాశంలో తెల్లని మబ్బులు.. అసలా అందం వర్ణనాతీతం. ఎండగా ఉన్నా కూడా ఎంత బాగుందో..! 





కడియం సెంటర్లో ఈ అమ్మవారి విగ్రహం ఉంది. బస్సులోంచే రెండు మూడు పిక్స్ తీస్తే ఇది బాగా వచ్చింది..


ద్వారపూడిలో విగ్రహాలు ఇదివరకటి కన్నా ఇంకా కట్టినట్లున్నారు. బయట వైపు కృష్ణార్జునుల గీతోపదేశం విగ్రహం కొత్తది. చాలా బాగా చేసారు. అది ఫోటో తీసేలోపూ బస్సు ముందుకెళ్ళిపోయింది :( కెమేరా అయితే క్లిక్ దొరికుండేది. ఫోన్ కెమేరాకి అందలేదు. సుమారు గంటన్నరకి బిక్కవోలు చేరాం. ఎలానూ వచ్చాం కదా ముందర అన్నగారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. గుడి కిలోమీటర్ దూరం అన్నారు. నడుచుకుపోదాం సరదాగా అని బయదేరాం. దారిలో ఒక ఇల్లు అచ్చం 'లేడీస్ టైలర్' ఇల్లులా ఉంది. మరీ ఎదురుగా ఫోటో తీస్తే బాగోదని ముందుకెళ్ళి పక్కనుండి తీసా..




తర్వాత ఒక ఇంటి ముందు రెండు మూడు గుత్తులతో ద్రాక్ష తీగ ఉంది! భలే భలే అని దానికీ ఫోటో తీసా :)




ఆ పక్కనే నిత్యమల్లి చెట్టు చూసి ఆహా ఓహో అని గంతులేసేసా. గత కొన్నాళ్ళుగా ఈ విత్తనాల కోసం కనబడినవారినీ, కనబడని వారినీ.. అందరినీ అడుగుతున్నా. ఒక మొక్క ఉంటే ఇంక దేవుడికి పూలే పూలు. ఈ పూలు తెల్లవి కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. సరే ఆ విత్తనాలు కాసిని కోసి పొట్లం కట్టా. కాస్త ముందుకి వెళ్లాకా ఓ పక్కగా దడికి అల్లించిన పెద్ద పెద్ద ఆకుల బచ్చలితీగ ఉంది. విత్తనాలు లేవు. చిన్న ముక్క కట్ చేయచ్చు కానీ ఇంక అది పీకలేదు. ఊరెళ్ళేదాకా కాపాడ్డం కష్టమని :)




దారిలో కనబడ్డ విచిత్ర వేషధారి..

కాస్త ముందుకెళ్లగానే రోడ్డుకి కుడిపక్కన లోపలికి ఓ పాత గోపురం కనబడింది. ఏమీటా అని వెళ్లి చూస్తే ఏదో గుడి.. దగ్గరకు వెళ్ళి అడిగాము. 1100 ఏళ్ళ క్రితం కట్టిన పాత శివాలయమట అది. ఎవరు కట్టారో తెలీదుట. అప్పుడే గేటు తెరిచి తుడుస్తున్నాడు ఒకతను. గుడి చుట్టూరా బట్టలు ఆరేసి ఉన్నాయి. అది గుడి అనే స్పృహ లేనట్టే..! ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకున్నాం. చిన్న గుడి.. లోపల బాగా చీకటిగా ఇరుకుగా ఉంది. కాసేపు ఆ గోడలూ అవీ పరీక్షించేసి బయటకు వచ్చేసాం.





లక్ష్మీగణపతి దేవాలయానికి చేరాం. నాలుగేళ్ల క్రితం చూసిప్పుడు గుడి చుట్టూ పొలాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలో గుడి ఉన్నట్లు ఉంది! బయట తెల్ల తామరలు అమ్ముతుంటే కొన్నాం. లోపల చాలామంది అయ్యప్ప భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాస్త ఖాళీ అయ్యాకా మేము దర్శనం చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినలేదేమో గుడిలో పెట్టిన వేడి వేడి పులిహోర ప్రసాదం అమృతంలా అనిపించింది. గుడికి ఒకవైపు వరి పైరు, మరో వైపు చిన్న కొలను దాని చుట్టూ కొబ్బరిచెట్లు.. ఆ దృశ్యం చాలా బాగుందని కెమేరాలో బంధించా! 

best pic of the trip అన్నమాట :)


అక్కడ నుండి కుమారస్వామి గుడి దగ్గరే అని చెప్పారు. దారిలో ఎడమ పక్కన మళ్ళీ పొలాలు. కాస్త దూరంలో ఇందాకా చూసినలాంటి గుడి ఉంది పొలాల మధ్యన. అది కూడా శివాలయమే కానీ మూసేసారు. వెళ్ళేదారి లేదు అన్నారు అక్కడ పొలాల్లో పని చేస్కుంటున్నవారు.






కుమారస్వామి ఉన్నది ఒక శివాలయం.  గుడిలో మొత్తం శివ కుటుంబం ఉంది. చాళుక్యులు కట్టిన గుడిట అది. చాలా విశాలంగా ఉంది ఈ ప్రాంగణం కూడా. ప్రధానద్వారం ఎదురుగా గోలింగేశ్వరుడు పేరుతో శివలింగం ఉంది. ఇంకా మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహాలు, గణపతి విగ్రహం మరో పక్క కుమారస్వామి విగ్రహం ఉన్నాయి. ఈ కుమారస్వామి విగ్రహమే మహిమాన్వితమైనదిట. కానీ లోపల విగ్రహం పక్కగా గోడవారగా అభిషేకం చేసిన తేనె సీసాలూ, కొబ్బరి పీచు తుక్కూ అలానే పడేసి ఉన్నాయి.. ఏమిటో కాస్త బాధనిపించింది. తమిళనాడులో పురాతన ఆలయాలను వాళ్ళు ఎంత బాగా పరిరక్షించుకుంటారో.. మనవాళ్ళకు అసలు శ్రధ్ధే లేదు.. వాటి విలువే తెలుసుకోరు అనిపిస్తుంది కొన్ని ఆలయాల్లో ఇటువంటి అపరిశుభ్రపు వాతావరణాన్ని చూసినప్పుడల్లా! అక్కడే గుమ్మం పక్కగా "రుద్రిణి దేవి" పేరుతో ఒక ప్రతిమ ఉంది. ఆ దేవత ఎవరో.. ఎప్పుడూ వినలేదు పేరు. పూజారి ఇచ్చిన పుట్టమన్ను, విభూతి పెట్టుకుని బయటకు నడిచాం.


పొద్దున్న దిగిన బస్ స్టాప్ వద్దకు వచ్చేసాం. టిఫిన్ తినలేదు, ఎండలో నడిచి నడిచి ఉన్నామేమో బాగా అలసటగా అనిపించింది. కొబ్బరినీళ్ళు తాగి లేత కొబ్బరి తినేసాం. ఉడకపెట్టిన మొక్కజొన్నలు అమ్ముతుంటే చెరోటీ కొనుక్కుని తినేసాం. రెష్ గా ఉందని ఓ బస్సు వదిలేసిన అరగంటకు మరో రెష్ గా ఉన్న బస్సు వచ్చింది. ఇంక అదే ఎక్కేసాం. అరగంట నించున్నాకా సీటు దొరికింది. మొత్తానికలా 'దేవ్డా..' అనుకుంటూ రామిండ్రీ చేరాం. 

నిన్న సాయంత్రం మా బంధువులింటికి వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఇవాళ భోంచేసాకా అమ్మ కోరిక ప్రకారం ఉప్పాడ చీరల కోసం"తాడితోట" అనే చీరల దుకాణాల సముదాయానికి వెళ్ళాం అందరం. ఎప్పుడూ మావయ్యావాళ్ళు వెళ్ళే కొట్లోకి వెళ్ళి పర్సులు ఖాళీ చేసేసి.. హమ్మయ్య ఓ పనైపోయింది అనేస్కున్నాం. ఆ తర్వాత ఓ మాంచి స్వీట్ షాప్ కి వెళ్ళి పూతరేకులూ, తాపేశ్వరం కాజాలు, స్వీట్ బుందీ.. గట్రా గట్రా కొనేసాం. ఇంటికొచ్చి పెట్టెలు సర్దేసి, టిఫినీలు చేసేసి, మావయ్యని స్టేషన్ కు రావద్దని వారించి ఆటో ఏక్కేసాం. రైల్వేస్టేషన్లో పాపిడీ దొరికింది. అది కూడా కొనేస్కుని రైలెక్కేసాం. తత్కాల్లో బుక్ చేస్కోవడం వల్ల నాకు మళ్ళీ అప్పర్ బెర్త్ శిక్ష తప్పలేదు :(  తనకు తోడొచ్చినందుకు అమ్మ థాంక్యూలు చేప్పేసింది. రెండునెల్లుగా నానాగందరగోళాల్లో ఉన్న నాకూ రిలీఫ్ ఇచ్చావని నేనూ అమ్మకి థాంక్స్ చెప్పేసా.  

ఏదో మా ఆసామి ఆఫీసు పని మీద ఊరెళ్లబట్టి అమ్మకు తోడెళ్ళాను గానీ నేనెప్పుడు తన్ను వదిలి ఊరెళ్ళాననీ..?! వదిలేసి వెళ్లడమే... సుఖపడిపోరూ :-))))



Pandit Jasraj's charukesi..



నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు...
సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు. 


పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత విద్వాంసులు..


Tuesday, October 28, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -1




చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా వీలైనన్ని చూడని ప్రదేశాలు చూసిరావాలని అనుకున్నాం మేము. గత ఆరేళ్లలో రెండుసార్లు మా గోదావరి వైపుకి వెళ్ళాను. వేరే పనుల మీద వెళ్ళినా సమయం కుదుర్చుకుని కొన్ని ప్రదేశాలు చూసాం అప్పట్లో. అప్పుడా ప్రయాణం కబుర్లతో రెండు సిరీస్ లు నా బ్లాగ్ లో ఙ్ఞాపకాల గుర్తుగా పదిలపరుచుకున్నాను. 

ఆసక్తి ఉన్నవారి కోసం ఆ లింక్స్:
తూర్పుగోదావరి ప్రయాణం కబుర్లు:

యానాం - పాపికొండలు - పట్టిసీమ ప్రయాణం కబుర్లు:


ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా పదిరోజుల క్రితం మళ్ళీ అమ్మతో వాళ్ల పుట్టింటికి(రాజమండ్రి) బయల్దేరాం. ఎప్పటిలానే ట్రైన్ విజయవాడ చేరేసరికీ మెలకువ వచ్చేసింది. అప్పర్ బెర్త్ మీద ఉన్నందువల్ల క్రిందకిదిగలేకపోయా:( ఇక నిద్రపట్టలేదు. ఐదున్నరవుతూండగా పక్కసీట్లు ఖాళీ అవ్వగానే క్రిందకి దిగి హాయిగా కిటికీ పక్కన సెటిలయ్యా. వెలుతురు వస్తూనే పచ్చని పొలాలు.. వాటి వెనుక రారామ్మని మాకు ఆహ్వానం పలుకుతున్నటుగా వరుసగా నిఠారైన కొబ్బరిచెట్లు.. కొబ్బరాకుల వెనుక నుండి ఎర్రటి సూర్యకిరణాలు.. ఒక్కసారిగా నిద్రలేమి తాలూకూ చికాకు మాయమై మనసంతా హాయిగా అయిపోయింది. గబగబా ఫోన్ తీసి నాలుగు ఫోటోలు క్లిక్కుమనిపించా. 








అదేమిటోగానీ ఇన్నాళ్ళూ ఎక్కడో ఉన్న ప్రాణం ఒక్కసారిగా ఇప్పుడే తనువులో ప్రవేశించినట్లు నూతనోత్సాహంతో మనసంతా నిండిపోయింది. కిటికీలోంచి కనబడుతున్న ప్రతి చెట్టూ, ప్రతి పైరూ, ప్రతి ఆకూ పలకరిస్తున్నట్టే అనిపించింది. సూర్యుడు పైకి వచ్చేసాకా అసలా ఆకుపచ్చని పచ్చదనం చూడగానే ఆనందంతో పాటుగా.. ఈ నేలని ఈ మట్టినీ వదిలి ఆ దూర తీరంలో ఆ పొరుగూరిలో ఎందుకున్నట్లో.. అని పుట్టెడు దిగులు పుట్టింది. ఇలా అప్పుడప్పుడూ వచ్చిపోకపోతే ఇక్కడి మట్టివాసనని కూడా మర్చిపోతామేమో అనే బరువు ఆలోచన కలిగింది. ఇంతలో గోదావరి చూద్దువు లేవమని అమ్మ పాపని లేపి తీసుకువచ్చింది. కాస్త ఊహ వచ్చింది కదా.. కొత్తగా గోదారమ్మని చూస్తోంది అమ్మాయ్..! "అదిగో పాత బ్రిడ్జ్.. ఆ బ్రిడ్జ్ మించే సర్కార్లో కాకినాడ వెళ్ళేవాళ్ళం తెల్సా... చివరచివర్లో ఆ బ్రిడ్జ్ ఊగేది కూడానూ... అదిగో ఆ మధ్యలో కనబడుతున్న ద్వీపంలాంటిది లేనప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాం తెలుసా.. ప్రతిసారీ వెళ్ళీనప్పుడల్లా కాస్త కాస్త చప్పున పెరుగుతూ ఇలా ద్వీపంలా అయిపోయిందిది.. ఇలా కాయిన్స్ నీళ్ళల్లో వేసేవాళ్ళం..." అంటూ గబగబా కబుర్లు చెప్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ... "ఒకటే బ్రిడ్జికి ఎన్ని ఫోటోలు తీస్తావూ.." అని వేళాకోళం చేసింది. ఎన్ని ఫోటోలు తీసుకుంటే తనివితీరుతుందని చెప్పనూ...!?





 రాజమండ్రిలో మావయ్య ఇల్లు చేరాం. ఈసారి కూడా వేరే పని మీద వెళ్ళినా, ఉన్న రెండురోజుల్లో ఏవన్నా చూడని ప్రదేశాలు చూడాలని మా మావయ్య అనుమతితో వాళ్ల మనవరాలిని తీసుకుని బయల్దేరా..! నా పెళ్ళికి తోడపెళ్ళికూతురైన ఆ బుల్లి మేనకోడలు ఇప్పుడు వైజాగ్ లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసేసి నాకు గైడ్ అయ్యేంత పెద్దదైపోయింది.. ఇదే కాలం మహిమ :) 


ఆ రోజు శుక్రవారం. పిఠాపురంలో శక్తిపీఠం చూడాలని ఎప్పటి నుండో కోరిక. బస్ కాంప్లెక్స్ కి వెళ్తే సామర్లకోట వెళ్ళి, అక్కడ నుండి ఆటోలో పిఠాపురం వెళ్ళచ్చని చెప్పారు. కాకినాడ  బస్సు ఎక్కేసాం. దాదాపు గంటన్నరకి సామర్లకోట చేరిపోయాం. ఇంట్లో మేము బయల్దేరడమే లేటయినందువల్ల సామర్లకోట చేరేసరికీ పావుతక్కువ పన్నెండయ్యింది. గుడి పన్నెండింటికి మూసేస్తారేమో, ప్రయాణం వృధా అవుతుందని భయం. అందుకని షేరాటో ఎక్కకుండా డైరెక్ట్ గా పిఠాపురానికి ఆటో మాట్లాడేసుకున్నాం. గుడి చేరేసరికీ పన్నెండూ పది. ఇరవై నిమిషాల్లో చేరాం. చిన్నప్పుడు అమ్మో పిఠాపురం, అమ్మో రాజోలు.. అనుకునేవాళ్ళం. సిటీ దూరాలతో పోలిస్తే ఇవసలు దూరాలే కాదనిపిస్తుందిప్పుడు. ఇక్కడ అమ్మావాళ్ళింటికి నలభై కిలోమీటర్ల దూరం. మూడు బస్సులు మారి, ఒక షేర్ ఆటోలో వెళ్ళాలి. తరచూ వెళ్లట్లేదు కానీ పనున్నప్పుడు పొద్దున్నకెళ్ళి రాత్రికి వచ్చేస్తూ ఉంటాను.




పిఠాపురం గుడి పన్నెండున్నరదాకానని రాసి ఉన్న బోర్డు చూసి హమ్మయ్యా అనుకుని లోనికి అడుగుపెట్టాం. విశాలమైన ప్రాంగణం. దీనినే "పాద గయ"అని కూడా పిలుస్తారుట. ఈశ్వరుడు కుక్కుటేశ్వరస్వామి గా ఇక్కడ వెలిసాడు. అమ్మవారి పేరు పురుహూతిక. అమ్మవారి పీఠభాగం ఇక్కడ పడినందువల్ల ఈ ఊరికి పీఠికాపురం అని పేరు వచ్చి అదే పిఠాపురం అయ్యిందిట. ఈ క్షేత్రం తాలూకూ పురాణకథ ఇక్కడ .

శుక్రవారమైనా జనం ఎక్కువ లేరు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది గుడి. ముందర ప్రాంగణంలో ఉన్న మిగిలిన విగ్రహాలను చూశాము. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద వల్లభస్వామి గుడి అక్కడ ఉంది. శ్రీపాద వల్లభస్వామి ఈ క్షేత్రంలోనే ఆవిర్భవించారని ఇక్కడి స్థలపురాణంట. తెల్ల తామరతో అలంకరించిన విగ్రహం ఎంత బాగుందో చెప్పలేను. ఆలయం బయట పాదుకలు, మరో పక్క శంకరాచార్యులవారి విగ్రహం ఉన్నాయి. ఈ దత్తాత్రేయ అవతారం గురించిన వివరాలు, అక్కడ మిగతా ఫోటోలు క్రింద  లింక్ లో చూడచ్చు.

ఇక్కడ ప్రస్తుతం ఉన్నది అసలు అమ్మవారి శక్తిపీఠం ఉన్న స్థలం కాదట. దానిని గురించి రెండు మూడు కథనాలు విన్నాను. కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం పక్కగా దక్షిణముఖంగా ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అదే అసలు శక్తిరూపం అని అక్కడి అర్చకులు చెప్పారు. పదిరూపాయిలు టికెట్టు కి లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోనిచ్చారు. విగ్రహం పూర్తిగా బయటకు కనబడేలా కుడి పక్కన ఐమూలగా అద్దం అమర్చారు. అందులోంచి అమ్మావారు బాగా కనబడ్డారు. కాసేపు అలా నింఛుని ప్రార్థించి బయటకు వచ్చేసాం. ఆ పక్కగా కొత్తగా కట్టిన అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము గుడి మూసేసారు.

గుడి వెనుక వైపు ఉన్న తటాకాన్ని "పాదగయ" అంటారుట. అక్కడ స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన పుణ్యంట. మరణానంతరం గయుడనే రాక్షసుడి పాదాలు అక్కడ పడినందువల్ల పాదగయ అని పేరు వచ్చిందిట. ఆ రాక్షసుడి కథ  ఇక్కడ ఉంది. ఆ తటాకం పక్కనే గయాసురుడు పడి ఉన్న విగ్రహం, చుట్టూ త్రిమూర్తుల విగ్రహాలు అవీ ఉన్నాయి. 




ఆలయప్రాంగణంలో శారదాదేవి గుడి కడుతున్నారు.

తటాకానికి వెనుకవైపు ఉన్న గోశాల కూడా చూసేసి బయటకు వచ్చేసరికీ పన్నెండున్నర. కాసేపు ఎదురుచూశాకా షేర్ ఆటో దొరికింది. తిరిగి సామర్లకోట వచ్చేసి రాజమండ్రి బస్సు ఎక్కేసాం. సామర్ల కోటలో భీమేశ్వరస్వామిని కూడా చూద్దామనుకున్నా కానీ గుడి నాలుగింటికి గాని తెరవరన్నరని ఇంక బయల్దేరిపోయాం. అయినా అది చిన్నప్పుడోసారి చూసేసాను :)  

"కుక్కుటేశ్వరస్వామి గుడి వీధిలోనే ఇంకా ముందుకి వెళ్తే ఇంద్రుడు నిర్మించిన ఐదు మాధవాలయాలలో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉంది తప్పక చూడాల్సిన గుడి.. అదీ చూసి రండి.." అని మావయ్య చెప్పిన మాటలు మర్చిపోయాం!ఇంటికొచ్చాకా మావయ్య అడిగాకా గానీ గుర్తురాలే:(  ఇంక రేపు ఇంట్లో ఉండండని మిగతా పెద్దలన్నారు కానీ "ఇంత దూరం వచ్చారు కదా వెళ్ళనియ్యండి..ఇంట్లో కూచుని చేసేదేముంది.." అని మావయ్య మమ్మల్ని సపోర్ట్ చేసాడు పాపం. హమ్మయ్య అనుకుని రేపటి ట్రిప్ కి ప్లాస్ మొదలెట్టాం..


***     ***    ***

ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ..
http://lookingwiththeheart.blogspot.in/2014/10/blog-post.html







Wednesday, October 15, 2014

Uyire Uyire, Vennilave Vennilave.. & others


అర్జెంట్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది.. అందుకని ఈ టపాతో ఈ సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను.. నా లిస్ట్ లో మిగిలినవన్నీ కలిపి ఒకే టపాలో ఇరింకించేస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి :)


***   ***    ***


ఇవాళ మొదట బొంబాయి సినిమాలో నాకెంతో ఇష్టమైన + నా ఫేవొరేట్ సింగర్ పాడిన పాట..  Uyire  Uyire..






Minsara Kanavu



తమిళంలో "Minsara Kanavu", తెలుగులో "మెరుపు కలలు", హిందీలో "సప్నే" పేర్లతో వచ్చిన మూడు భాషల్లోని పాటలూ బోల్డంత పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా "Ooh la la la.."!! నాకింకా "Anbendra.."(చర్చ్ లో జీసస్ దగ్గర కాజోల్ పాడే పాట), "Vennilave Vennilave.." పాటలు ఇష్టం. ఇది కూడా హరిహరన్ పాడినదే :)

అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు: http://play.raaga.com/tamil/album/minsara-kanavu-t0000099 


బాగా ఇష్టమైన Vennilave Vennilave.. 




Kandukondain Kandukondain 


ప్రముఖ ఆంగ్లరచయిత్రి జేన్ ఆస్టిన్ నవల 'Sense and Sensibility'  ఆధారంగా తీసిన Kandukondain Kandukondain కూడా తెలుగులో 'ప్రియురాలు పిలిచింది' పేరుతో వచ్చింది. నాకిష్టమైన చిత్రాల్లో ఒకటి..:)
రెండు భాషల్లోని పాటలూ చాలా బావుంటాయి. రెహ్మాన్ ట్యూన్స్ కి వైరముత్తు సాహిత్యం. ఈ చిత్రంలో ఒకటీ, రెండూ అని చెప్పలేనంతగా పాటలు అన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకని అన్ని పాటలూ వరుసగా ఉన్న లింక్ ఇస్తున్నాను. 

 




                                        Rhythm




మళ్ళీ రెహ్మాన్ స్వరాలనందించిన మరో చిత్రం "రిథిమ్". సిన్మా బావుంటుంది. ఇందులో పాటలన్నీ ఫైవ్ ఎలిమెంట్స్(గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు) ని గుర్తు చేసేవిగా స్వరపరిచారు. 

ఈ ఐదు పాటల్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Rhythm-T0000257 

యూట్యూబ్ లో అయితే ఇక్కడ వినచ్చు. 



Julie Ganapathy


బాలూ మహేంద్ర దర్శకత్వం వహించిన "Julie Ganapathy" చిత్రానికి 'Misery' అనే ఆంగ్ల చిత్రం ఆధారం. ఇందులో సరిత, జయరామ్, రమ్యకృష్ణ ముఖ్యతారాగణం. మెలోడియస్ గా ఉండే ఈ చిత్రగీతాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రెండు పాటల్ని అప్పట్లోనే(అంటే సుమారు పంతొమ్మిది ఇరవై ఏళ్ల వయసులోనే) శ్రేయా ఘోషాల్ పాడారు. ఇతర భాషా గాయని అని పట్టుకోలేని విధంగా పాడగలగమే ఈ అమ్మాయిలోని టాలెంట్. మరోటి ఏసుదాస్, ఇంకోటి వారబ్బాయి విజయ్ ఏసుదాస్ పాడారు. చివరి పాట ప్రసన్న పాడారు. ఇది రమ్యకృష్ణ సోలో హాట్ సాంగ్ . ట్యూన్ బావుంటుంది. అందులో ముఫ్ఫై ఐదేళ్ళు దాటిన నటిలా ఏమాత్రం కనబడదీవిడ. అందుకే మరి రెండు మూడేళ్ళకే కనుమరుగయ్యే ఇప్పటి హీరోయిన్స్ లా కాక చాలా ఏళ్ల పాటు దక్షిణాది భాషాచిత్రాలన్నింటిలో తన ప్రతిభను కనబరచగలిగారు. 

ఈ చిత్రంలో పాటలన్నీ క్రింద లింక్ లో వినవచ్చు: http://play.raaga.com/tamil/album/Julie-Ganapathy-T0000469


 *** *** *** 

ఈ సిరీస్ ని మొదటి నుండీ ఫాలో అయినవారెవరైనా ఉంటే.. ఓపిగ్గా చదివినందుకు వాళ్ళకి ధన్యవాదాలు.


Tuesday, October 14, 2014

'Minnale' songs


మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే అటు, ఇటు రెండు పక్కాలా అయ్యేకే ఆపేవాళ్ళం మేము. పాటల కోసం, మాధవన్ కోసం సినిమా చూసాం కానీ భరించడం చాలా కష్టం అయ్యింది. కేవలం పాటల్ని విని ఆస్వాదించాల్సిందే తప్ప కథ జోలికి, సినిమా జోలికీ వెళ్ళకూడని సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా! 

చాలా మొదట్లో మాధవన్ జీ టివీలో "బనేగీ అప్నీ బాత్" అనే సీరియల్ లో వేసేవాడు. అప్పట్లోనే మా ఫ్రెండ్స్ అందరం తెగ మెచ్చేసుకునేవాళ్ళం భలే ఉంటాడు, బాగా ఏక్ట్ చేస్తాడని. ఆ సీరియల్ కూడా బావుండేది. సాగీ..సాగి..సాగీ...ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ టైటిల్ సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నా అప్పట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడీ అబ్బాయ్. ఇతని నవ్వు చాలా బావుంటుంది. Sweet smile!


మళ్ళీ పాటల్లోకి వచ్చేస్తే... ఈ పిక్చర్ థీమ్ మ్యూజిక్ ను ఫోన్లలో కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ పెట్టుకుంటున్నవాళ్ళు ఉన్నారు. 

 థీమ్ మ్యూజిక్ ..



అన్నింటిలోకీ నాకు బాంబే జయశ్రీ పాడిన "వసీగరా.." చాలా చాలా ఇష్టం. ఏ రాగమో కనుక్కోవాలి.. 

 



అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు:



Monday, October 13, 2014

'Duet' songs


పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ కేసెట్ కొనుక్కుని అవే వినేదాన్ని. బాలూ కూడా ఎంతో అద్భుతంగా పాడారా పాటలను. అన్నింటికీ సాహిత్యం వైరముత్తు రాసారుట.


ఈ ఆల్బం కి 'రాజు' ఏ.ఆర్.రెహ్మాన్ అయినా 'మంత్రి' మాత్రం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ గారే! ఆ Sax.. మెస్మరైజింగ్ అసలు!! ఈ ఆల్బంలో టైటిల్ ట్రాక్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న Sax bits రాజు అనే ఆర్టిస్ట్ ప్లే చేసారని వికీ చెప్పింది. మొత్తం పాటలు saxophone instrumental bitsతో పాటుగా వినాలంటే క్రింద ఉన్న రాగా.కామ్ లింక్ లో  వినవచ్చు :  http://play.raaga.com/tamil/album/duet-t0000042


యూట్యూబ్ లింక్స్ నాకు బాగా నచ్చే మూడూ పాటలకి మాత్రమే పెడుతున్నాను.. 

1) ఎన్ కాదలే ఎన్ కాదలే.. 

SPB voice అల్టిమేట్ అసలీపాటలో..




2)Vennilaavin Therileri.. 

amazing interlude bits..
 


3) anjali anjali..

just for the tune.. 
 


ఇంకా ఇవి కూడా సరదాగా బావుంటాయి...
 Kulicha Kuttalam 

Katheerika Gundu Katheerika 

Sunday, October 12, 2014

Veesum Kaatrukku..


"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించేది. ఓ రోజు నాన్న కేసేట్లలో వెతికి ఈ పాట అసలు మాతృక కనిపెట్టాను. ఉల్లాసం సినిమా రాక ముందు "Pocahontas" అనే యేనిమేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. నాకు బాగా నచ్చే యేనిమేషన్స్ లో ఒకటి అది. ఇందులో "Can you paint with all the Colors of the Wind" అనే పాటకు అకాడమీ అవార్డ్ వచ్చింది. చాలా బావుంటుందా పాట . ఇది కాక అందులో "Listen With Your Heart.. you will understand " అనే మరో పాట ఉంది. ఈ పాట పల్లవి, పల్లవి ముందర వచ్చే వేణువాదన tune ఆ పాటలోనిదే. ముందర తమిళ్ సాంగ్ వినేసి, తర్వాత క్రింద ఉన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వినండి.. తెలుస్తుంది మీకు.





Pocahontas - Listen With Your Heart  


ఈ సిన్మాలో ఇంకా Yaro yar yaro... , Muthae muthamma పాటలు బావుంటాయి.


Bright sunday !





పొద్దున్నే లేవడం లేటైనా వాకింగ్ మానలేక గబగబా తెమిలి బయల్దేరా. మిష్టర్ సూర్యదేవ్ అప్పుడే ఎదురైపోయాడు. వెలుతురు రాకుండా వాకింగ్ చేస్తే బావుంటుంది కానీ ఇలా మిష్టర్ సూర్యదేవ్ వంక చూస్తూ ఆ వెచ్చని చూపులు తనువుని తాకుతూండగా నడవడం కూడా భలేగా ఉంటుంది. లేటవడం కూడా బావుంది అనుకున్నా. ఓ ఎఫ్.ఎం లో గణేష సుప్రభాతం పాడుతున్న బాలమురళీకృష్ణగారి గాత్రం తాలూకూ బేస్ వైబ్రేషన్ నెమ్మదిగా ఇయర్ఫోన్స్ లోంచి మెదడుని తాకుతోంది.

నిన్నసలు రోజు మొదలవ్వడమే చిరాగ్గా మొదలైంది. ఒక సంఘటన చాలా బాధపెట్టేసింది. సాయంత్రం దాకా ఫీలయ్యీ ఫీలయ్యి..లయ్యీ..ఈ.... ఇక లాభం లేదనుకుని 'ఓ సామీ ఎలాగూ దీపావళి వస్తోంది కదా కాస్తలా షాపింగ్ కి తీసుకుపోదురూ' అని బ్రతిమాలా అయ్యవారిని. ఏదో పొదుపు చేసేద్దామనుకున్నప్పుడే ఖర్చులు ఇంకా పెరుగుతాయి..(నెలకి రెండు పండగలు వస్తాయి) కదా... పాపం జేబులు తడుముకుంటూ బయల్దేరారు! నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నాతో పాటూ అరడజను షాపులు తిప్పేసాకా, 'అమ్మా ఇంక వెళ్పోదామని' పిల్ల పేచీ మొదలెట్టే సమయానికి, ఆఖరికి రోడ్డు మీద ఓ పక్కగా గుట్టగా పోసి అమ్మేస్తున్న టాప్స్ లోంచి య్యగారి అనుమతితో రెండు సెలక్ట్ చేసి షాపింగ్ పూర్తి చేసా. అంతకు ముందే పిల్లకి బాగా నచ్చిన ఫ్రాక్ కొనేసాం కాబట్టి 'అమ్మా నువ్వు రెండు కొనుక్కున్నావ్..' అని పోటీకి రాలేదని. బస్సులో కూచున్నాకా 'హమ్మయ్య హేపీనా..' అనడిగారు అయ్యవారు. 'ఏదీ ఇంకా ఒక టాప్ మీదకి మ్యాచింగ్ పటియాలా బాటమ్,చున్నీ కొనుక్కోవాలి కదా..' అన్నా. 'హతవిధీ!!' అని తలకొట్టుకున్నారు పాపం :) ఏదేమైనా మూడ్ బాలేనప్పుడు షాపింగ్ చెయ్యడమే మంచి ఉపాయం...! ఇంటికొచ్చి భోం చేసి, సంగీతప్రియలో పాట పోస్ట్ పెట్టి, పురాణం చదువుకుని పడుకునేసరికీ సమయం రెండు గంటలు చూపించింది. (ఈ పురాణ పఠనం గురించి ఓ పోస్ట్ రాయాలని నెలరోజుల్నుంచీ అనుకుంటున్నా!! ఎప్పటికవుతుందో) అందుకే ఇవాళ పొద్దున్న లేవలేకపోయా. అదన్నమాట.

సరే మళ్ళీ పొద్దుటి వాకింగ్ దగ్గరికొచ్చేస్తే.. కొత్త రూట్ లో వెళ్దాం అని వేరే సందులోకి తిరిగాను. ఇదివరకూ అక్కదంతా ఖాళీ జాగా ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు రెడీ అయిపోతున్నాయి..అక్కడుండే చెట్లు మొక్కలు అన్నీ కొట్టేసారు :( 


సెక్యూరిటీ గార్డ్ గుడిసె అనుకుంటా..బాగుంది కదా..

ఓ ఇంటి ముందర కాశీరత్నం తీగ కనబడింది. ఈ ఎర్రటి నాజూకైన పూలు నాకెంత ఇష్టమో చెప్పలేను. బెజవాడలో మా క్వార్టర్ గుమ్మానికి పక్కగా క్రీపర్ పెంచి ఎంతమందికి ఈ విత్తనాలు పంచానో..! చిన్నప్పుడు భాస్కరమ్మగారింటి వెనక పెరట్లో పిచ్చిమొక్కలతో పాటూ ఎన్ని తోగలు పెరిగేవో.. ఈ తీగ కనబడితే చాలు నేను నాస్టాల్జిక్ అయిపోతాను. నెమ్మదిగా ఆ గుమ్మం దాకా వెళ్ళి నాలుగు విత్తనాలు కోసేసుకుని చున్నీ చివర ముడి వేసేసాను. ఇంట్లో ఎవరూ లేచిన అలికిడి లేదు. ఎవరైనా కనబడితే అడిగే కోసుకుందును. గొప్ప ఆనందంతో వేరే సందులోకి వెళ్ళా. అక్కడ ఉండే ఓ ఇండిపెండెట్ హౌస్ నాకు బాగా ఇష్టం. చుట్టూరా చక్కగా  బోలెడు కూరగాయల  మొక్కలు వేస్తూంటారు వాళ్ళు. సీజనల్ కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. పపాయా పిందెలు చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా వంకాయ, కాలిఫ్లవర్, చిక్కుడు వేసారు. కన్నులారా ఆ మొక్కల్ని చూస్తూ ఆ సందు దాటాను.





వంకాయలు కనబడుతున్నాయా?



సత్సంగ్ కాలనీ లో ఫస్ట్ సిటీ బస్సు ఆగి ఉంది. వాళ్ల కాలనీ బయట పెంచే మొక్కలు కూడా చాలా బావుంటాయి చూడ్డానికి. అవి చూడడానికే అటువైపు వెళ్తుంటాను నేను. అప్పుడే లోపల్నుండి పాల బెల్లు ఔంవినపడింది. వాళ్లవన్నీ ఖచ్చితమైన పధ్దతులు. మా గేటేడ్ కమ్యూనిటీలో కూడా ఉన్నారు బోలెడుమంది సత్సంగీస్. పొద్దుటే నాలుగున్నరకే ప్రయర్ కి వెళ్టూంటారు. అక్కడ రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నా రోజూ నాకెదురయ్యే జంట దూరంగా వెళ్పోతూ కనబడ్డారు. నేను లేట్ కదా ఇవాళా. చెవిలో గణేశ సుప్రభాతం అయిపోయి 'ఢోల్ బాజే' పాట ఎప్పుడు మొదలయ్యిందో గమనించలేదు కానీ అది పూర్తయ్యి 'నీ జతగా నేనుండాలి..' మొదలయ్యింది. ఎదురుగా ఉన్న మిష్టర్ సూర్యదేవ్ చూపుల వేడి ఎక్కువయ్యింది. ఇక ఈ పూటకి ఎనర్జీ బానే వచ్చేసింది వాకింగ్ చాలెమ్మనుకుని ఇంటిదారి పట్టాను.

బ్లాగ్ ముట్టుకుని చాలారోజులైందనిపించి ఈ ఉదయపు నడక కబుర్లన్నీ ఇక్కడ ఇలా నమోదు చేసా. సరే మరిక కబుర్లయిపోయాయి.. మీ పనుల్లో మీరుండండి..:-)

Saturday, October 11, 2014

Intha Siru Pennai ..


'లలలాల లాలాల... లాలాలలాలాలా..' అనే హమ్మింగ్ అలా చెవుల్లో అప్పుడప్పుడూ నాకు వినబడుతూ ఉంటుంది..భలే బావుంటుంది. ఇది " Intha Siru Pennai  .. " అనే పాటలోది. ప్రభుదేవా , మీనా నటించిన Naam Iruvar Namakku Iruvar అనే చిత్రం లోనిది. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఈ సిన్మా గురించి తెలియవు. 

కార్తీక్ రాజా సంగీతం. హరిహరన్, విభాశర్మ పాడారీ పాట.

ఈ పాట క్రింద లింక్ లో వినచ్చు: 
http://7starmusiq.com/audio-player-popup-3.asp?MovieID=689&SongsId=4463

క్రింద లింక్ లో చూడచ్చు:
https://www.youtube.com/watch?v=SMHPVTrW1XI

Friday, October 10, 2014

May madham songs


వినీత్, సోనాలి కులకర్ణీ జంటగా "May Madham" పేరుతో వచ్చిన ఈ సినిమాని తెలుగులో 'హృదయాంజలి' పేరుతో డబ్బింగ్ చేసారు. తర్వాత అక్షయ్ ఖన్నా,సోనాలి బేంద్రే లతో హిందీలో రీమేక్ చేసారు. నాకు అసలు సినిమాలోని తమిళ్ సాంగ్స్ బాగా నచ్చుతాయి. వైరముత్తు సాహిత్యాన్ని అందించిన ఈ పాటలకు రెహ్మాన్ సంగీతాన్నందించారు. ఇందులో పాటలన్నీ బోలెడన్నిసార్లు రిపీటవుతూ ఉండేవి ఛానల్స్ లో. 

అన్నింటికన్నా ఎక్కువగా మనం పొద్దుటే వినే సుప్రభాతం ట్యూన్ తో మొదలయ్యే "Marghazhi Poove" బాగా హిట్ సాంగ్. నాకు మాత్రం బాలూ పాడిన "మిన్నలే.." మహా ఇష్టం. బాలూ గొంతులో ఉన్న ఎక్స్ప్రెషన్, ఆర్తి, వేదన మరెవరి వాయిస్ లోనూ పలకవని నాకో గాఠ్ఠి నమ్మకం. ఈ పాట మొత్తంలో వెనకాల రిపీట్ అయ్యే బోలెడు వయోలిన్స్ కలిపి చేసిన బిట్ అద్భుతంగా ఉంటుంది. తెలుగు ఆల్బం లో ఇది లేదనుకుంటా. 

1) minnalae..
  


 2)"En Mel Vizhunda... " అని మొదలయ్యే ఈ పాట చాలా నెమ్మదిగా మెలోడియస్ గా ఉంటుంది. "ఎదపై జారిన ప్రియ చినుకా ఎక్కడ దాగావిన్నాళ్ళూ.. గుండె తెరెచిన చిరు కవితా ఎక్కడ దాగావిన్నాళ్ళూ.."(http://www.youtube.com/watch?v=k26s8DBOqzw ) అని పాట తెలుగులో. తమిళానికి సరైన అనువాదం అవునో కాదో తెలీదు కానీ ఇది ఒక్కటీ మాత్రం తెలుగులో కూడా నచ్చింది నాకు. భువనచంద్ర సాహిత్యం అనుకుంటా.  
















3) తెలుగులో "మానస వీణ మౌన స్వరాన.."(http://www.youtube.com/watch?v=33VasJ-EbHM) అని మొదలయ్యే ఈ పాట తమిళంలో "Marghazhi Poove.." అని మొదలౌతుంది. ఇప్పుడంటే ఓ మంచి నటిగా సోనాలీ కులకర్ణీ బాగా తెలుసు కానీ అప్పట్లో ఎవరో కొత్త హీరోయిన్ అనుకునేవాళ్ళం :) ఈ పాటలో  పిక్చరైజేషన్ బావుంటుంది.

 

Thursday, October 9, 2014

Thenmerkku paruvakkaatru... + Porale Ponnuthayi..


"కరుత్తమ్మ" అనే చిత్రంలో దాదాపు అన్ని పాటలూ బాగుండేవి. సినిమా కూడా టివీలో వచ్చినప్పుడు చూసిన గుర్తు. కాస్త భారమైన సినిమా అయినా బావుంటుంది. భారతీరాజా సినిమా. ఇది "వనిత" పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసారని గుర్తు. రెహ్మాన్ సంగీతం. 'Porale Ponnuthayi' పాట తెలుగులో "పూదోట పూసిందంట" అని ఉండేది. ఇది sad version కూడా ఉంది కానీ నేను హేపీ వర్షన్ నే వినిపిస్తాను:) మిగతావాటి తెలుగు వర్షన్స్ గుర్తులేవు.

ఈ సినిమాలో మహేశ్వరి మీద పిక్చరైజ్ చేసిన " Thenmerkku.." అనే మరో పాట కూడా నాకు బాగా ఇష్టం. మిగిలిన వాటిల్లో "Pacha Kili Paadum" ( http://www.youtube.com/watch?v=FKdv48FL5Qw), "Kaadu Potta Kaadu" ( http://www.youtube.com/watch?v=4T0aPXIl3tM) బావుంటాయి. ఈ పాటల్లో కనబడే పల్లె వాతావరణం, పచ్చదనం ముఖ్యంగా ఆకట్టుకుంటాయి. 


1) Thenmerkku paruvakkaatru... 
 ఈ పాటలో వర్షాన్ని బాగా చూపిస్తారు. రెహ్మాన్ అందించిన ట్యూన్ కూడా మర్చిపోలేనిది.

 



2) Porale Ponnuthayi.. 
ఈ పాటకు గానూ రెండు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఒకటి వైరముత్తు సాహిత్యానికీ, మరోటి గాయని స్వర్ణలతకీ. రెహ్మాన్ పైకి తెచ్చిన మరో మంచి గాయని స్వర్ణలత. 

Wednesday, October 8, 2014

menamma... + pulveli pulveli..



ఇవాళ ఒకే సినిమాలోవి రెండు పాటలు.. తెలుగులో 'ఆశ ఆశ ఆశ' పేరుతో డబ్బింగ్ చేసిన ఈ తమిళ్ మూవీ పేరు "ఆశై". అజిత్ హీరో. అప్పట్లో అజిత్ సినిమాలన్నీ చూసేసేవాళ్లం.. మరి బావుంటాడు కదా :) ఈ సిన్మాలో వీరోవిన్ బావుంటుంది కానీ పేరు గుర్తులేదు. 

సరే పాటల్లోకొచ్చేస్తే "మీనమ్మా..." అనే పాట, "pulveli pulveli.." అనే పాట రెండూ చాలా బాగుంటాయి. ఇంకోటి అజిత్ ది సోలో సాంగ్ ఒకటి ఉంది .అది కూడా బావుంటుందని గుర్తు. ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో ఈ రెండు పాటలు షేర్ చేస్తున్నాను. దేవా సంగీతం. ఈయన బాణీలు కూడా చాలా మెలోడియస్ & మెమొరబుల్. 

1)"మీనమ్మా... "
ఈ పాట ఇంటర్ల్యూడ్స్ లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే బిట్ చాలా బావుంటుంది.

  


2) ఈ పాటకి తెలుగులో "మెల్లగా మెల్లగా తట్టి..." పల్లవి అని గుర్తు. 




Tuesday, October 7, 2014

Thendral Vanthu Theendum Pothu... ఇళయ్ మైకం


  
 భాష తెలీదు.. ఒక్క ముక్క అర్థం కాదు కానీ ఆ రాగం.. ఆ పదాలు.. ఎందుకో మనసుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. రికార్డ్ అయిన కేసెట్స్ వచ్చాకా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పుకుని వినేదాన్ని..! 

ఇళయరాజా ఏం చేసినా మహాప్రసాదం. పాడినా అంతే. ఆయన గళం నచ్చనివారూ ఉన్నారు. కానీ నాకు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఇష్టమే. "కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక తిరుగుతున్నవి.. ముంచే మైకమో మురిపించే మోహమో.." అని పాడినప్పుడు కూడా :) 

 ఈ పాటలో జానకి స్వరం.. ఇళయరాజా బాణీ.. రెండూ మహదానందాన్ని  కలిగించేవే..i just love this song..

Monday, October 6, 2014

Malargale Malargalae..



సన్ టివిలో "Pepsi Ungal choice" ప్రతీ వారం చూసిన రోజుల్లో 'ఉమ' అనే అమ్మాయి హోస్ట్ చేసేదా కార్యక్రమాన్ని. బోలెడుమంది ఫాన్స్ ఉండేవారా అమ్మాయికి. ముద్దుగా బావుండేది ఆ అమ్మాయి కూడా. అందులో నచ్చిన పాటలన్నీ లిస్ట్ రాసుకుని, పేర్లు గుర్తుండకపోతే నటీనటుల పేర్లు రాసిపెట్టి, అప్పట్లో మద్రాసులో చదువుకుంటున్న మా కజిన్కి ఆ లిస్ట్ పంపించి ఆ పాటలన్నీ రికార్డ్ చేయించుకున్నాను. వాటిల్లో కొన్నింటిని ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యాలని. ఒకటి నిన్న పోస్ట్ చేసా కదా. ఇది మరొకటి.. "Malargale Malargalae" అని రెహ్మాన్ స్వరపరిచినది. అందువల్ల ఇష్టం. specially tune & interludes..

 ఇదిగో ఇదే పాట.. 

Sunday, October 5, 2014

"మలరే మౌనమా.."



ఒకప్పుడు రికార్డ్ చేయించుకుని మరీ చాలా ఎక్కువగా విన్న తమిళ్ సాంగ్స్ లో ఒకటి.. "మలరే మౌనమా.."!! విద్యాసాగర్ అందించిన అతి మంచి పాటల్లో ఒకటి. బాలూ, జానకీ స్వరాలు ఈ పాటకి ప్రాణం అనడమే సబబు.


 ఈ పాట గురించిన కొన్ని వివరాలు.. ఒక తమిళపాటల వీరాభిమాని మాటలు క్రింద లింక్ లో చదవచ్చు... http://bharadhibimbham.blogspot.in/2006/05/malare-mounama-duet-of-this-decade-i.html


మనసుకు హాయి కమ్మేసేలాంటి ఈ పాట మరి వినేద్దామా..

 


ఈ వైరముత్తుసాహిత్యానికి అర్థం మాత్రం నాకు తెలీదు..:(
ఎవరైనా చెప్తే సంతోషం...




Wednesday, October 1, 2014

నవలానాయకులు - 10



కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సత్యచరణ్". శ్రీ బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ నవల "అరణ్యక్"కు శ్రీ సూరంపూడి సీతారామ్ గారు "వనవాసి" పేరుతో బహు చక్కని తెలుగు అనువాదాన్ని అందించారు. సౌందర్యారాధకులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైపోయేటటువంటి నవల ఇది.

క్రింద లింక్ లో వ్యాసాన్ని చదవవచ్చు:
http://www.koumudi.net/Monthly/2014/october/oct_2014_navalaa_nayakulu.pdf

Monday, September 22, 2014

ముగ్గురు కొలంబస్ లు


కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వేసుకోగలం. అలాంటి ఉల్లాసకరమైన రచనలు చెయ్యగల తెలుగు హాస్య రచయితలు బహుతక్కువ మంది ఉన్నారు. వారిలో డా.సోమరాజు సుశీల గారు ఒకరు. పూర్వం మన దర్శక,రచయిత శ్రీ జంధ్యాలగారి రచనల్లో కనిపించే సున్నితమైన వ్యంగ్యంతో కూడిన హాస్యం వీరి రచనల్లోనూ కనిపిస్తుంది. ఏ ఒక్క కథనూ చిన్న నవ్వు నవ్వకుండా, ఓ ఆలోచనలోకి దిగకుండా పూర్తిచెయ్యలేము. ఆ కథల్లో అప్పుడప్పుడూ కనబడే జీవిత సత్యాలను చదువుతుంటే ఓ కన్నీటి పొర కూడా అడ్డుపడుతుంది. రచనావ్యాసంగాన్ని ఎంతో ఆలస్యంగా మొదలుపెట్టినా, ఒక్క ఇల్లేరమ్మ కథలతోటే ఎంతో ప్రఖ్యాతి గడించి, మంచి రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో పెద్ద పీట వేసుక్కూర్చుండిపోయారు సుశీల గారు.



తన అనుభవాలతో పారిశ్రామిక కథలైన "చిన్న పరిశ్రమలు పెద్ద కథలు(1999)" , తర్వాత సుశీలగారు ఆత్మకథారూపంలో రచించిన  "ఇల్లేరమ్మ కథలు(2000)", "దీపశిఖ(2009)" ఎంతో ఆదరణ పొందాయి. ప్రతి తెలుగువారింటా తప్పక ఉండవలసిన పుస్తకాల జాబితాలో చేరిపోవాల్సినటువంటి రచనలివి. ఇనాళ్ళకు మళ్ళీ అదే పంథాలో రచించిన "ముగ్గురు కొలంబస్ లు (2014)" సాహిత్యాభిమానులందరూ చదివి తీరాల్సిన పుస్తకం. ఎంతో ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ, తృప్తినీ మనకందించే పుస్తకం. "సోమరాజు సుశీల రచనలు చదువుతుంటే ఏదో అవలీలగా రాసేసారనిపిస్తుంది. కానీ చాలా ఆలోచించి, ఒకటికి రెండుసార్లు తిప్పి తిప్పి రాస్తే గానీ ఆ క్లుప్తత రాదని గ్రహించడం అంత సామాన్యం కాదు. సున్నితమైన హాస్యం తగుపాళ్ళలో మేళవించి, చిక్కటి సీరియస్ నెస్ లని పల్చని చేయడం రచయిత్రికి బాగా తెలుసు. అందుకే సోమరాజు సుశీల కథల్లో అక్షరాలు శాటిన్ మీద ముత్యాల్లా పరుగులు తీస్తాయి. డా.సోమరాజు సుశీల కథల్ని అభిమానించే చాలామంది పాఠకుల్లో నేనూ ఒక్కణ్ణి.." అంటారు శ్రీరమణగారు 'దీపశిఖ' ముందుమాటలో. నాదీ అదే మాట.


ఏవో పన్నుల్లో బిజీగా ఉండి ఈమధ్యన నెట్ ఎక్కువ చూడట్లేదు. చాలా ఆలస్యంగా ఇటీవలే పుస్తకం.నెట్ లో "ముగ్గురు కొలంబస్ లు" పుస్తకానికి జంపాల చౌదరి గారి ముందుమాట ' అంతా మనవాళ్ళే ' చదివాను. వెంఠనే నవోదయాకి ఫోన్ చేసి పుస్తకం గురించి అడిగితే రావడం, కాపీలు అయిపోవడం కూడా అయిపోయింది అన్నారు. వారమంతా రెండుమూడుమాట్లు చేస్తూనే ఉన్నాం కాపీలు తెప్పించారా? అని. ఈలోపూ నాకు తొందర ఎక్కువై మావారిని బయల్దేరదీసి జంపాలగారు తన వ్యాసంలో ఇచ్చిన "ఉమా బుక్స్, 58, న్యూ బోయినపల్లి" అడ్రసు వెతుక్కుంటూ కొలంబస్సుల్లా మేమూ వెళ్ళాం. వీధి అదే కానీ ఎక్కడా ఉమాబుక్స్ అన్న బోర్డు కనబడలే. బయట అడిగితే ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్సూ లేదన్నారు. 58 నంబరు ఇంటి సందులో అటుఇటు రెండుమూడుసార్లు తిరిగాం. నే లోపలికి వెళ్ళి అడుగుదామంటే .. రెడిడెన్స్ లాగుంది డిస్టర్బ్  చేస్తే బాగోదేమో.. అని మావారు సందేహించారు. అంత దూరం నుండీ ఉసూరంటూ వెనక్కి వచ్చేసాం. ఇంటికొచ్చాకా నాకనుమానం వచ్చి ఇల్లేరమ్మ కథలు పుస్తకం తీసి చూస్తే అది సుశీల గారి ఇంటి అడ్రసే!! అయ్యో.. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఉంటే ఆవిడని కలిసేవాళ్ళం.. అని మావారిని ఆడిపోసేసుకున్నా.. పాపం! మరో నాల్రోజులకి కాపీలు వచ్చాయని తెలిసాకా మొన్న శుక్రవారం మళ్ళీ పొలోమని మూడు బస్సులు అవీ మారి నవోదయాకెళ్ళి, ఎలాగో వెళ్లా కదా అని మరో నాలుగుపుస్తకాలు జతపరిచి ఓ ఐదు పుస్తకాలు కొని తెచ్చేసుకున్నా. మరో నాలుగడుగులేసి విశాలాంధ్రకు కూడా వెళ్దామనుకున్నా కానీ మరీ పర్సు ఖాళీ అయిపోతే పాపం మావారు చిన్నబుచ్చుకుంటారని ఆ సాహసం చెయ్యలేదు..:)


ఇంతకీ ఈ పుస్తకంలో సుశీలగారు ఏం రాసారూ అంటే.. ఆవిడా, వారి శ్రీవారు, అత్తగారూ.. ముగ్గురూ కలిసి వాళ్లమ్మాయి ఇంటికి అమెరికా వెళ్ళి వచ్చిన విధానాన్ని, అక్కడి వింతలూ విశేషాలనూ, అమెరికన్ల జీవన విధానాలనీ హాస్యభరితంగా తెలియబరిచారు. ".. చెమర్చే కన్నుల్లోవి ఏ భాష్పాలో తెలియని అయోమయంలో రోజులు గడిపేస్తున్న అమ్మానాన్నలకు.." అన్న వాక్యం చదవగానే నా కళ్ళ వెంట మా అమ్మానాన్నల కంటి తడి కదిలింది. ఒక గడియారానికి అమెరికా టైం సెట్ చేసి ప్రతి వారాంతం తమ్ముడి ఫోన్ కోసం చెవులు(కళ్ళు కాదు) కాయలు కాసే ఎదురుచూపు + వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియని సందిగ్థం.. కలగలిసిన వాళ్ల ఆత్రం.. నా మదిలో మెదిలాయి. అమెరికాలో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ పుస్తకం చదివితే ఇది తమ కథేనని తప్పకుండా ఫీల్ అవుతారు.


నామటుకు నేను ఈ పుస్తకంలో చాలా సారూప్యాల్ని వెతుక్కున్నాను. సుశీలగారిలానే పుట్టినరోజుల్ని అమితంగా ఇష్టపడడం, తెలుగు ఇంగ్లీషు రెండు పుట్టినరోజుల్ని కొత్తబట్టలతో జరుపుకోవడం, కూరల షాపింగ్ అంటే కొట్టుకుపోవడం, వండివార్చడం..భోజనం విషయాలు, మాటనేసి అయ్యో ఎందుకన్నానని తర్వాత ఫీలవ్వడం, కూతురి కబుర్లు, ముఖ్యంగా చిన్నతనంలో అమ్మని ఏడిపించిన సంఘటనలు..మాటలు.. ఇవన్నీ చదువుతుంటే అచ్చంగా నా గురించి నేనే చదువుకుంటున్న భావన. ఇక వారి అత్తగార్ని గురించి చదివితే మా అత్తగారు గుర్తొచ్చి అందరు మొగపిల్లల తల్లులూ ఇంతేనన్నమాట అనుకున్నా. వాళ్లమ్మగారి గురించి చెప్తూంటే నా పెళ్లయి వెళ్పోయాకా ఎలా ఉండేదని మా అమ్మ చెప్పేదో అవే మాటలు గుర్తొచ్చాయ్!


ఓ చోట "ఒకవేళ దైవం రక్షించకో, రక్షించో మన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైపోతే మేం ఏది లాభమనుకుంటే అటువైపు మాట్లాడచ్చు. మాకా వెసులుబాటు ఉంది.." అంటారు సుశీల గారు. మా మావగారిది కృష్ణాజిల్లా అయినా, ఆయన పదమూడే ఏటే వాళ్ల కుటుంబమంతా హైదరాబాద్ వలస వచ్చేసారు. మావారిక్కడే పెరిగడం వల్ల యాదృచ్ఛికంగా నేనూ అదేమాట అనేదాన్ని..! ఇంకా ఆవిడ శ్రీవారు ముసుగు తన్ని పడుకోవడం, దుప్పట్లోంచే రేడియో వినడం మొదలైనవి చదివితే ఆయన అచ్చంగా నాన్నకు మారురూపేమో అనుకున్నా. ఇప్పటికీ తెల్లారింది మొదలు, రాత్రి జైహింద్ చెప్పేదాకా నాన్న ట్రాన్సిస్టర్ ఆయన పక్కన మోగుతూనే ఉంటుంది. ఆబ్బబ్బా మరీ అన్నీ వినేయాలా.. కట్టేయ్ నాన్నా అని విసుక్కుంటూ ఉంటా నేను వెళ్ళినప్పుడల్లా. అనౌన్సర్ గా తన జీవితంలో మూడొంతుల భాగం రేడియో స్టేషన్లోనే గడిపారు మరి.. రేడియో వినడం ఏలా మానతారు?! ఇంక ఆయనను బయటకు తీసుకువెళ్ళాలంటే సుశీల గారు పడే పాట్లన్నీ మా అమ్మా పడుతుంది పాపం. ఆయన ఇల్లు కదిలి వెళ్ళాలంటే ప్రళయం రావాలి. అన్ని ప్రయాణాలూ రిజర్వేషన్లు చేయించుకోవడం కేన్సిల్ చేయించుకోవడం.. ఇదే పని అమ్మకి. ఇంకా సుశీల గారి అభిప్రాయాలు కొన్ని చదువుతూంటే, ఆరే..ఇలాగే కదా నేనూ అనుకునేది అనుకున్నా చాలాసార్లు. అలాగ చాలా సారూప్యాలు దొరికాయీ పుస్తకంలో నాకు.


సుశీల గారి అమ్మాయి పక్కింటి అమ్మాయి కేరెన్, ఆ అమ్మాయి చదివిన యూనివర్సిటీ మెడికల్ స్కూళ్లో మెడిసన్ చదివే కుర్రాడు, అతని తండ్రీ, ఫార్మసీ స్కూల్ డీన్ అయిన కార్పెంటర్ ఆయనా; జీన్ అనే కాంట్రాక్టర్ జీవితాలను గురించి, ఏణ్ణార్థం పిల్లని ఎంతో డీసిప్లీన్డ్ పెంచుతున్న వాళ్ళమ్మాయి గురించీ తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది.


పుస్తకం మీరు తప్పకుండా కొని చదవండి. పుస్తకంలో బాగా నచ్చిన చాలా వాక్యాలు రాయాలనున్నా.. కొన్ని వాక్యాలు మాత్రం కోట్ చేసి ఆపేస్తాను..

* "మా కన్నతల్లి తన చేతులతో చెరువుమట్టితో వినాయకుడిని చెయ్యకుండానే చవితిపండుగలు, బొమ్మల కొలువులమర్చకుండానే దసరా పండుగలూ, చుక్కల ముగ్గులు పెట్టకుండానే సంక్రాంతి పండుగలూ అలా ఎన్నో సందడి ళేకుండా వచ్చి వెళ్ళిపోవడం చూడడానికి అలవాటుపడిపోయాం."

* "మారిపోతున్న మన దేశకాల పరిస్థితుల్లో నిరాదరణకు గురౌతున్నది పెద్దవాళ్ళే. "

* " జీవితంతో పోరాడుతూ డీలా పడకుండా పదిమందికీ సంతోషాన్ని పంచుతున్న కేరన్ లాంటి అరుదైన వ్యక్తుల గురించి అనవసరపు బెంగలు పెట్టుకుణే అధికారం నాకెవరిచ్చారు?"

* "ఇంతేనా ఈ దేశం గొప్ప. ఈ మాత్రానికేనా ఇళ్ళూ వాకిళ్ళూ, అమ్మలు. నాన్నలూ, అందర్నీ వదిలేసుకుని చలికి వణుక్కుంటూ, పనులు చేసుకుంటూ, బట్టలుతుక్కుంటూ, వారానికోసారి వండుకుంటూ, పిల్లలకోసం ఆరటపడుతూ, ఉద్యోగాల కోసం జాగ్రత్తపడుతూ మెతుకు మిగల్చకుండా, డాలర్ చేజారకుండా...ఇదేనా అమెరికా జీవితం.. ఈ భాగ్యానికేనా మన దేశంలో తల్లలంతా బిడ్డలు పుట్టినప్పటినుంచీ నోములూ వ్రతాలూ చేసి వెంకటేశ్వరుడి హుండీలో చదువు బిళ్ళలేసి, కళ్ళల్లో వత్తులేసుకుని చదివించీ,ఇళ్ళువాకళ్ళు తాకట్టు పెట్టి ఇక్కడికి పంపేది? నిజమే ఇక్కడుంటే అంతా స్వాతంత్రమే. అదేమిటని అడిగే అమ్మలుండరు. ఎండుకని అడిగే అత్తలుండరు. ఆరాలు తీసే చుట్టాలుండరు. గదమాయించే పెద్దవాళ్ళుండరు."

* "వెడితే విసుక్కోకుండా అతిధ్యమివ్వగల నంబర్లు ఓ ముఫ్ఫై పైగా దొరికాయి.."

* "మన ఇండియాలో అమ్మలుంటారు, నాన్నలుంటారు, అన్నదమ్ములుంటారు, భార్యలుంటారు, భర్తలుంటారు. అక్కడ కూడా వాళ్ళంతా ఉంటారు. వీళ్ళు కాకుండా మాజీ భర్తలు, భార్యలు, భావి భర్తలు, భార్యలు, అప్పటికే వాళ్ళు కన్న పిల్లలు ఇట్లా తామరతంపరగా అనంతమయిన పరివారాలుంటాయి.."

* "దేశమేదయినా, పధ్దతులలో తేడాలున్నా మానవస్వభావం మాత్రం ఒకటే అనిపించింది."

*" కొన్ని యూనివర్సలు సత్యాలుంటాయి. అవేమిటంటే ఎక్కడున్నా అల్లుళ్ళు బంగారు తండ్రులు, కొడుకులు చవటవాజమ్మలూ... కూతుళ్ళు అపర లక్ష్మీసరస్వతి అవతారాలు..కోడళ్ళ గురించి మాట్లాడకపోవడమే శ్రేయోదాయకం. వసుదైక కుటుంబం అంటే అదే కాబోలు."

*" భూతల స్వర్గంలాంటి ప్రదేశంలో సన్నటి సెలయేటి ఒడ్డున ఒక చిన్న గూడు. అన్నపూర్ణ లాంటి భార్య. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి. ఏవరైనా ఏం చేసుకుంటారు లక్షలూ, కోట్లు.."

సుశీల గారు పుస్తకం చివర్లో రాసిన వాక్యం మాత్రం సూపర్!
విమానం దిగాకా ఎయిర్పోట్ లో ఫ్రూటీ తాగాకా..
"ఖాళీ డొక్కులు ఎక్కడ పారేయాలో తెలియక "ట్రాష్ కాన్ కహా హై" అని ఎవర్నో అడిగా. "ఎక్కడైన పడేయండి పర్వాలేదు" అంటూ ఒక తెలుగాయన కాబోలు నవ్వుతూ చెప్పాడు.
విన్నారా! మన దేశం కదా. మనిష్టవే ఇష్టం.
బోలో స్వతంత్ర భారత్ కీ జై! "