సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 30, 2019

ఇష్టకామేశ్వరి






శ్రీశైలానికి సుమారు 14,15కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి. మొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్న స్థల పురాణం పుస్తకంలో ఆ ఆలయాన్ని గురించి చదివినప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని! ఆ తర్వాత వెళ్ళినప్పుడు కూడా వర్షాకాలంలో ఆ అడవి మార్గం వైపు ట్రిప్స్ ఉండని కారణంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకలేదు. ఆ తర్వాతి ప్రయాణంలో మాత్రం మొత్తానికి దేవి దర్శనభాగ్యం కలిగింది.

ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్న అటువంటి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి.  ఇదివరలో రెండు మూడు గంటలు పట్టేదిట ఈ ప్రయాణానికి. ఆ దారిలో కాస్త కంకర పోయడం వల్ల గంటన్నరే పడుతోందిట ఇప్పుడు. తారు రోడ్డుపై ఒక అరగంట, నలభై నిమిషాలు ప్రయాణించాకా దారి ఎడమ పక్క ఉన్న అడవిమార్గం వైపుకి మళ్ళుతుంది. కేవలం జీప్ లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించగలవు. ఎగుడుదిగుడుగా, ఎక్కడ జీప్ లోంచి జారి పడిపోతామో అనిపించేలా ఎత్తి కుదిపేస్తున్న జీపులో దాదాపు గంట పైగా ప్రయానించడం ఒక గొప్ప సాహసవంతమైన అనుభూతి!! జీప్ లో వెనుక కూచుని దాటి వచ్చిన రాళ్ళు నిండిన, ఎగుడుదిగుడు ఎత్తుపల్లాల దారిని చూస్తూంటే...బాబోయ్ ఈ దారిలోంచి బయటకు వచ్చామా అనిపిస్తుంది.




ఎంతో చాకచక్యంగా జీప్ నడపగలిగిన అనుభవం ఉన్నవారే ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చగలరు. మొదటిసారి వళ్ళినప్పుడు మనిషికి ’ఏడువందల ఏభై ఫిక్స్డ్ రేట్ ’ అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ తిరిగివచ్చేప్పుడు జీప్ మళ్ళీ తారు రోడ్డు ఎక్కాకా మాత్రం ధర న్యాయమైనదే అనిపించింది. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయణమే అది. హృద్రోగులూ, ఒళ్ళునెప్పులూ, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దారిలో వెళ్లకపోవడం మంచిది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆ రాళ్ళల్లో టైరు చిక్కుకుని ఈ జీప్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతే? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ఈ కీకారణ్యంలోంచి బయటపడగలమా? ఎక్కడో అడవిలో మారుమూల ఉన్న ఆ విగ్రహాన్ని చూడకపోతే ఏమి? అసలిక్కడ ఈ విగ్రహం ఉందని ఎవరు కనిపెట్టారో..? లాంటి ప్రశ్నలు ఈగల్లా ముసిరేస్తాయి ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కానీ గుడి దగ్గర జీప్ ఆగిన తర్వాత, దిగి ఒక్కసారి చుట్టూరా ఉన్న అక్కడి నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాకా, జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇలాంటి ప్రదేశాన్ని చూసి తీరాలి అని వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనిపించి తీరుతుంది.


జీప్ ఆగిన ప్రదేశం నుండి ఒక అర కిలోమీటరు లోపలికి నడవాలి. చుట్టూరా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం, రంగురంగుల అడవిపూలు, తలెత్తి పైకి చూస్తే చెట్ల మధ్య నుండి కనబడే నీలాకాశం, ఎత్తైన చెట్ల తాలూకూ పచ్చని ఆకుల మధ్య నుండి పడుతున్న సూర్యకిరణాలు, మధ్యలో దారికి అడ్డంగా పారుతున్న బుల్లి సెలయేరు, ఆ నీటిలో కదులుతున్న నల్లటి చిన్ని చిన్ని చేపపిల్లలు...పక్కగా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యన ఎత్తుగా పేర్చి ఉన్న రాళ్లపై కాస్త ఎత్తుమీద ఎప్పటిదో వినాయకుడి రాతివిగ్రహం...ఇలాంటి మనోహరమైన ప్రదేశాన్ని చూడగానే - చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న జానపద కథల్లోకి వచ్చేసామా అనిపించింది నాకు!











నిశ్శబ్దంగా ఉన్న ఆ అటవీప్రాంతంలో, పక్షుల కిలకిలారావాల మధ్యన, కాసేపు ఆ నెలయేటి పక్కనే ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పారుతున్న నీళ్ల మధ్యన గబగబా కదిలే ఆ బుల్లి బుల్లి చేపపిల్లలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తిరిగి ఎత్తైన చెట్ల మధ్యన నడుచుకుంటూ గుడివైపుకి వెళ్తుంటే అప్రయత్నంగా "ఆకులో ఆకునై..పూవులో పూవునై..." అన్న పాట గుర్తురాక మానదు! అటువంటి పరిసరాల్లో, ఆ క్షణంలో కలిగే అనుభూతి వర్ణించనలవి కాదు. ప్రపంచానికి దూరంగా, జనావాసంలేని ఈ చోట, వాల్డెన్ దగ్గర థోరూ లాగ కొన్నాళ్ళైనా ఉండిపోగలిగితే ఎంత బావుంటుందో.. అనిపించింది. కానీ ఇలా వెలుతురులో కాక చీకటి పడ్డాకా లైట్లు లేని ఈ ప్రాంతంలో ఏ జంతువో వస్తేనో.. అని భయం కూడా వేసింది.





అడవి మధ్యలో అంత లోపలికి ఆ చిన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎంతో మనోహరంగా ఉండే ఆ చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారో తెలియదు కానీ అక్కడ లభించే ప్రశాంతతని బట్టి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా తోస్తుంది. గుడి ఎదురుగా ఉత్తరముఖంగా ప్రవహించే వాగులో వర్షాకాలంలో బాగా నీళ్ళు నిండి ఉంటాయిట. ఏ గుడి దగ్గరైనా ఉత్తరముఖంగా నదీ ప్రవాహం ఉంటే ఆ ప్రాంతాన్ని దర్శించుకోవడం చాలా మంచిదని ఎక్కడో చదివిన గుర్తు. క్రిందకు దిగి ఆ వాగులో కాళ్ళు కడుక్కుని అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడివారు చెప్పారు. ఆలయం బయట ఒకవైపు పురాతనమైన మహిషాసురమర్దిని విగ్రహం, మరోవైపు గణపతి విగ్రహాలు ఉన్నాయి. గుడి ద్వారం క్రిందుగా ఉన్న చిన్న గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. పద్మాసనంలో ధ్యాన నిమగ్నమై ఉన్న ఈ నల్లటి విగ్రహం అరుదైన క్వార్టజైట్ రాతిపై చెక్కబడింది. చతుర్భుజాలలో పై రెండు చేతులు రెండు కలువ మొగ్గలను పట్టుకుని ఉండగా, ఎడమ చేయి శివలింగాన్నీ, కుడి చేయి రుద్రాక్షమాలనూ పట్టుకుని ఉన్నాయి. అమ్మవారికి స్వయంగా కుంకుమబొట్టు పెట్టే అవకాశం ఉందిక్కడ. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు చిత్రమైన తరంగాలు శరీరంలోకి పాకినట్లు అనిపించింది. అమ్మవారి ముందర వెలిగించిన దీపం తప్ప వెలుతురు లేని ఆ చిన్న గుహలో ఎంతో ప్రశాంతత ఉంది. మనసు చాలా నిశ్చలంగా  మారిపోయి ఇంకాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోయాను. ఎక్కువ జనం లేనందువల్ల ఆ అవకాశం దొరికింది. బయటకు వచ్చేసి ఆలయం ప్రాంగణంలో కూడా గచ్చు మీద చాలా సేపు ప్రశాంతంగా అమ్మనే ధ్యానిస్తూ కూర్చున్నా. అంత ప్రశాంతంగా, ఆనందంగా మునుపెన్నడూ లేదసలు.






గుడి బయట కాస్త దూరంలో కనబడుతున్న ఐదారు గుడిసెలల్లో నివసించే చెంచులే గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట. రోజూ అక్కడకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడకు వచ్చే చాలా మంది భక్తులు, వారిని తీసుకువచ్చే జీప్ డ్రైవర్లు అమ్మవారి ప్రసాదం తినే వెళ్తారుట. మేము కూడా కాస్తంత వేడి వేడి అన్నం ప్రసాదంగా తిని బయల్దేరాం. అటునుండి తిరిగిరావడానికి వెలుతురు ఉండగానే సాధ్యపడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట వరకే  అటు వెళ్ళే వాహనాలు శ్రీశైలం నుండి బయలుదేరతాయిట. ఐదు,ఐదున్నరగంటల ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో అడవిలోంచి బయటకు వచ్చితీరాలి. కాస్త చీకటి పడినా ప్రయాణం అసాధ్యమే ఆ దారిలో. రోడ్డు ఇలా ఉంది కాబట్టే ఆ ఆలయం ఇంకా అంత ప్రశాంతంగా ఉందేమో... మార్గం కనుక బాగుండి ఉంటే ఈపాటికి  అక్కడొక క్యూ కాంప్లెక్స్, బిల్డింగులు, భారీ జన సముదాయాలతో ఆ చల్లని వాతావరణం కూడా వేడిగా మారిపోయి ఉండేదేమో అనిపించింది.

తిరుగు ప్రయాణంలో జీప్ కుదుపులకి నే వీడియో తీస్తున్న కేమెరా క్రింద పడిపోయి, భుజం జీప్లోని రాడ్ కి గుద్దుకుపోయింది. చాలా రోజుల వరకూ ఆ భుజంనొప్పి తగ్గనే లేదు కానీ అమ్మవారిని దర్శించుకున్న చాలారోజుల వరకూ ఆ ప్రయాణం మిగిల్చిన మధురిమలు మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంటాయి. అందుకే ఆ దారమ్మట వెళ్ళే సాహసం మరోసారి చెయ్యాలని కోరిక... అమ్మ దయ ఉంటే సాధ్యం కానిదేది? ఆవిడ పిలుపుకై ఎదురుచూడటమే చెయ్యవలసింది!



క్రిందటేడాది మొదట్లో మళ్ళీ రెండవసారి అక్కడకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈసారి జీప్ లో సీటు ధర ఇంకా పెరిగింది. మనిషికి వెయ్యి రూపాయిలు తీసుకున్నారు. పిల్లలకైనా అదే రేటు. అక్కడకు వెళ్ళే భక్తులు పెరగడం వల్ల ఈసారి కాసిని మార్పులు కనబడ్డాయి అక్కడ. ఇదివరకూ ఒకటో రెండో కనబడే జీప్ లు ఇప్పుడు ఐదారు ఆగి ఉన్నాయి. జీప్ ఆగింది మొదలు గుడి దాకా కొందరు చెంచులు కూర్చుని ఏవేవో వనమూలికల అమ్మకాలు చేస్తున్నారు. దారిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఉండే సెలయేరు ఎండిపోయింది. నీళ్ళు లేవు, చేపలూ లేవు. గుడి వద్ద పువ్వులు, అగరుబత్తీ, కొబ్బరికాయలు మొదలైన అమ్మకాలు, డబ్బులు తీసుకునే చెప్పుల స్టాండు కూడా వెలిసాయి. గుడి ఎదురుగా ఉండే సెలయేట్లో కూడా నీరు బాగా తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం ఏ నిర్మలమైన వాతావరణాన్ని చూసి ముచ్చట పడ్డానో అది కాస్త తగ్గిందనే చెప్పాలి. గుడి దగ్గర క్రితంసారి ఆడుకుంటూ కనపడిన నాలుగైదు చిన్న చిన్న కుక్కపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవి ఐపోయాయి. రక్షణ కోసం వాటిని అక్కడే ఉండనిస్తారుట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం గురించి ఉన్న నమ్మకాలను పక్కన పెడతే; అక్కడ పార్వతీ దేవి తపస్సు చేసిందట అని ఎవరో అన్నారు. అంతేకాక ఎందరో ఋషులు, మునులు, దేవీ ఉపాసకులు తపస్సు చేసిన ప్రాంతం , అతి పురాతనమైన ఆలయం , అమ్మవారిది ఎంతో ప్రత్యేకమైన, మహిమాన్వితమైన విగ్రహం కాబట్టి, అమ్మ దర్శనం ఎంతైనా అభిలషనీయం. డివైన్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న అతికొద్ది స్థలాల్లో ఇదీ ఒకటిగా పరిగణించవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని దట్టమైన అడవిలోకి ఒక అడ్వంచరస్ ట్రిప్ కు వెళ్ళాలనుకునేవారికి కూడా ఈ ట్రిప్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది. ఈ ట్రిప్ కి వర్షాకాలం ముందర గాని పూర్తయిన సమయంలో గానీ వెళ్తే అడవిలోని పచ్చదనాన్ని మరింతగా ఆస్వాదించగలం.