సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, June 2, 2012

Songs of Cliff Richard



ప్రఖ్యాత బ్రిటిష్ పాప్ గాయకుడు
క్లిఫ్ రిచార్డ్(Cliff Richard) పేరు తెలియని వారు ఉండరు. గాయకుడు, స్వరకర్త, నటుడు, మానవతావాది అయిన క్లిఫ్ రిచార్డ్ పాటంటే చెవికోసుకునేవారు అరవైల్లో కుర్రకారు. పాట పాడటంలో అతనిది ఒక విలక్షణమైన శైలి. అతని మెత్తనిగళం నుండి జాలువారిన ఏ పాటైనా జనాదరణ పొందేసేదిట అప్పటి రోజుల్లో. చిన్నప్పుడు నాన్న కేసెట్ పెట్టుకుని వింటుంటే మేం కూడా తనతో పాటే శ్రధ్ధగా అతని పాటలు వింటూ ఉండేవాళ్ళం.

ప్రఖ్యాతి గాంచిన క్లిఫ్ రిచార్డ్ పాడిన మెస్మరైజింగ్ పాటలు కొన్ని...


1)Evergreen tree



--------

2)congratulations


-------------

3)fall in love with you



-----------

4) The twelfth of never


------------

5) miss you nights


-------------
6) spanish harlem


----------

7)we don't talk anymore



-----------------

8)the bachelor boy


---------------------

9)all my love




-------------------

10)Constantly

Wednesday, May 30, 2012

నీరాజనం(1988)

1988లో వచ్చిన "నీరాజనం" సినిమాలో పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయేంత మధురంగా ట్యూన్ చేసారు ఓ.పి.నయ్యర్. ఈ సినిమాలో ఏ పాట వింటున్నా మొత్తం ఇంటర్లూడ్ మ్యూజిక్ తో సహా మనం పాడేసుకునేంత దగ్గరయిపోయాయీ పాటలు. నేనీ సినిమా ఇంతవరకూ చూడలేదు కానీ పాటలన్నీ కంఠస్థం. పాటలు హిట్ అయ్యాకా చివరలో శ్రీ ఎమ్.ఎస్.రామారావు గారితో మళ్ళీ ఓ పాట పాడించారు అని గుర్తు. అందుకే మొదటి కేసెట్ ఎడిషన్ లో ఈ పాట ఉండదు. ఈ పాట విడిగా రికార్డ్ చేసుకున్నాం మేము అప్పట్లో.

కేసెట్ లో అన్ని పాటలు ఒక ఎత్తు ఐతే "
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో " పాట ఒక ఎత్తు. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. నిజంగా షాజహాన్ అంత హాయిగా నిదురించాడో లేదో తెలీదు కానీ ఈ పాట వింటున్నంత సేపు మనం మాత్రం హాయిగా సేదతీరుతాము.



ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..



పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా ..



నీ జీవితజ్యోతీ నీ మధురమూర్తి
ముంతాజ్ సతిసమాధి సమీపాన
నిదురించూ జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా..

----------------


ప్రేమ వెలిసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవనలా







------------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం..



-------------------

ఘల్లు ఘల్లున గుండె ఝల్లునా
పిల్లఈడు తుళ్ళిపడ్డదీ
మనసుతీరగా మాటలాడక మౌనం ఎందుకన్నదీ




-------------------

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మరిచిన మమతొకటి
మరి మరి పిలిచినది
ఒక తియ్యనీ పరితాపమై




---------------------

నాప్రేమకే శలవు నా దారికే శలవు
కాలానికే శలవు దైవానికే శలవు
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శలవు
మదిలోని రూపం మొదలంట చెరిపి
మనసారా ఏడ్చానులే ((నాప్రేమకే))

కనరాని కసితీర కుదిపి కడుపారా నవ్వానులే
అనుకున్న దీవి అది ఎండమావి
ఆ నీరు జలతారులే
నను నీడ తానే ననువీడగానే
మిగిలింది కన్నీరులే ((నాప్రేమకే))



---------

నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏజన్మ కైనా ఇలాగే..





----------------

మమతే మధురం మరపే శిశిరం
ఎదకూ విధికీ జరిగే సమరం



------------------


ఇంకా "ఊహల ఊయలలో", "నేనే సాక్ష్యాము", "నీ వదనం విరిసే కమలం" పాటలు దొరకలేదు...:(
కానీ రాగా.కాం లింక్ లో మొత్తం పది పాటలూ వినచ్చు:






Tuesday, May 29, 2012

ऎ दिलॆ नादान..


కొన్ని పాటలు వింటూంటే మనకు తెలియకుండానే ఆ ట్యూన్ కి మనం ట్యూన్ అయిపోతాం. అలా మనల్ని తన లోకంలోకి తిసుకువెళ్పోయే ఈ పాట "రజియా సుల్తానా" సినిమా లోని "ఏ దిలే నాదాన్..". ఖయ్యాం సమకూర్చిన అద్భుతమైన సంగీతం ఈ పాట సాహిత్యపు అందాన్ని ఇంకా పెంచుతుంది. మొదట్లో వినిపించే సంతూర్, ధుమ్.. ధమ్.. అని వినిపించే ఢోలక్(?), మధ్య మధ్య వినిపించే సెకెన్ నిశ్శబ్దం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.



movie: Razia Sultan(1983)
singer : Lata Mangeshkar
music: khaiyyam
lyrics: jan nisar akhtar

Lyrics:

ऎ दिलॆ नादान
आरजू क्या है
जुस्तजु क्या है

हम भटकतॆ है ..क्यॊं भटकतॆ है
दश्ता-ऒ-सेहरा मॆं
ऐसा लगता है .. मौज प्यासी है
अपनी दरिया मॆं
कैसी उल्झन है..क्यॊं यॆ उल्झन है..
एक साया सा रूबरु क्या है
ऎ दिलॆ नादान(२)



क्या कयामत है..क्या मुसीबत है
केह नही सकतॆ..किस्का अरमा है
जिंन्दजी जैसॆ खॊयी खॊयी है
हैरा हैरा है..
यॆ जमी चुप है..आस्मा चुप है
फिर ये धड्कन सी चारसू क्या है
ऎ दिलॆ नादान(२)




Monday, May 28, 2012

పుచ్చా పూర్ణానందం గారూ - మీసాల సొగసులు



ఒకప్పుడు మనకున్న అతితక్కువ హాస్య రచయితల్లో ఒకరు పుచ్చా పూర్ణానందంగారు. మేము వారిని పూర్ణానందంతాతగారు అనేవాళ్ళం. విజయవాడలో పేరుమోసిన లాయరైన వీరు నటులు, హాస్యరచయిత కూడానూ. పూర్ణానందం గారి అల్లుడు శ్రీ జె.వి.నారయణమూర్తిగారు నాన్నకు ప్రాణ స్నేహితుడు. ఇప్పటికి ఏభైఏళ్ళు వాళ్ల స్నేహానికి. ముందర అలా పూర్ణానందంగారు పరిచయంట. తర్వాత నాన్న రేడియోలో చేరాకా వారితో స్నేహం బలపడిందిట. విజయవాడలో వాళ్ళ పెద్దబ్బాయి ఇల్లు మా ఇంటి దగ్గర ఉండేది. వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అటువైపే ఉన్న మా ఇంటికి వస్తూండేవారు పూర్ణానందంతాతగారు మా చిన్నప్పుడు. అప్పటికి గుబురు మీసాల తాతగారిలానే తెలుసు. పూర్ణానందం గారు గొప్ప హాస్య రచయిత అనీ, ఎంతో సాహితీవిజ్ఞానం గల సరస్వతీపుత్రులని పెద్దయ్యాకా వారి పుస్తకాలు చదివాకా కానీ తెలీలేదు. "మీసాల సొగసులు" ఇంకా 'ఆవకాయ - అమరత్వం', ’ఆషాఢపట్టి’ మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. జంధ్యాల సినిమాలైన ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, హైహై నాయికా, శ్రీవారి శోభనం మొదలైన సినిమాల్లో కూడా నటించారు.





విజయవాడ ఆకాశవాణి కోసం ఆయన రాసి, చదివిన హాస్య ప్రసంగాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మీసాల సొగసులు". అన్నింటికన్నా ముందు ఈ పుస్తకానికి వారు రాసిన మున్నుడి(ముందుమాట) చాలా బావుంటుంది. మనిషి జీవితంలో హాస్యం ఎంత ప్రధానమైనదో, హాస్యం వాల్ల కలిగే ఉపయోగాలేమిటో..అన్నింటి గురించీ ఎందరో మహానుభావుల ఆంగ్ల ఉల్లేఖనాలతో చక్కగా చెప్తారు పూర్ణానందంగారు. పుస్తకం చదువుతుంటే సార్ధక నామధేయులు అనిపించకమానదు. మొత్తం పదిహేను వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం కూడా ఒక విజ్ఞానగని అనిపిస్తుంది నాకు. వ్యాసాల్లో ఉదహరించిన పద్యాలూ, ప్రాచీన కవుల,రచయితల ఉల్లేఖనాలు.. అన్నీ కూడా వారికున్న విద్వత్తునీ, సాహితీ జ్ఞానాన్నీ తెలుపుతాయి. తాంబూలమ్, అతిథుల బెడద, పిల్లి ఎదురొచ్చింది, కాకిగోల, నల్లకోటు, భార్యతో బజారుకెళ్ళకు - మొదలైన ఈ వ్యాసాల పేర్లన్నీ కూడా హాస్యభరితమైనవే. ఈ పుస్తకం ముఖ చిత్రం బాపూ వేసినది. పుస్తకంలోని బొమ్మలు వేసినది కార్టునిస్ట్ శ్రీ బాలి. పుస్తకంలో అక్కడక్కడా చెప్పిన కొన్ని జోక్స్ క్రింద రాస్తున్నాను.. భలే ఉంటాయి..

1) ఒక శిష్యుడు గురువుగారిని భోజనానికి పిలిచాడట. ఎందుకో అతని గయ్యాళి పెళ్ళానికి పులుసుకుండ అతని నెత్తినకొట్టి పగులకొట్టి, కుండ ఖరీదు కుడా ఇమ్మన్నదట.అప్పుడా గురువుగారు
"భాండాని శతసహస్రం భగ్నాని మమ మస్తకే,
అహో గుణవతి భార్యా భాండమూల్యంన యాచతే"
అన్నాడట.
అంటే 'నా నెత్తిన లక్ష కుండలు పగిలాయి కానీ, మా ఆవిడే గుణవంతురాలు,కుండ ఖరీదు అడగలేదూ అని.


2)ఓ గృహస్తు తనని కుమ్మిందని కోపం వచ్చి వాళ్ల పాడి ఆవుని అమ్మేసాడుట భార్య ఊళ్ళో లేనప్పుడు. వాళ్లావిడ వచ్చాకా "ఇదేమిటండి,కొమ్ము విసిరినంత మాత్రాన రెండుపూటలా పాలిచ్చి ఇల్లు గడుపుతున్న పాడిగేదెను అమ్ముకుంటారా? నేను మీతో సర్దుకుపోవటం లేదు?" అందట.


3)పండక్కి వచ్చిన కొత్త అల్లుడ్ని అత్తగారు, "నాయనా, భోజనం పొద్దు పోతుందేమో. అరిశెలు,మినపసున్నుందలూ తీసుకుంటావా?పిల్లలతో చద్ది అన్నం తింటావా? లేదా మీ మామగారి దేవతార్చన అయ్యేసరికీ పన్నెండు దాటుతుండి..వారి పంక్తిన భోంచేస్తావా? అని అడిగితే, "అత్తగారు, మూడూ చేస్తాను" అన్నాడట.


4)ఒక పిచ్చాసుపత్రి సూపరింటెండెంట్ ఓ విజిటర్ కి హాస్పటల్ చూపిస్తున్నాడట.వీళ్ళు వెళ్ళిన చోటికల్లా ఓ ఆడమనిషి వచ్చి చేతులు ఊపుతూ,భయంకరమైన చూపులతో వెంబడిస్తోందట. అప్పుడా విజిటర్ "ఏమండి, ఈమె కొత్త పేషంతా? వాలకం చూస్తే భయమేసేలా ఉంది..ఈమెపై మీకు కంట్రొలు లేదా? " అనడిగాడుట.
అప్పుడు సూపరింటేండెంట్ "లేదండి" అన్నాడుట. విజిటర్ ఏం? అని ప్రశ్నించాడుట..
"ఆమె నా భార్యండి" అన్నాడుట సూపరింటేండెంట్.


*************************************************


"మీసాల సొగసులు" పుస్తకంలో ప్రతీ వ్యాసానికి మొదట్లో ఒక కార్టూన్ ఉంది. ఆ కార్టూన్లు చాలా బాగున్నాయి. వ్యాసాల సారాంశం తెలపటం కన్నా ఈ కార్టూన్లు పెడితే బావుంటుందనిపించింది నాకు. మొత్తం పదిహేను కార్టూన్లు చూసి ఆనందించండి..

































*** *** ***


రేడియోకి పూర్ణానందంగారు చదివిన ఈ పుస్తకంలోని వ్యాసాలు రెండింటిని ఆయన సొంత గళంలో ఇక్కడ వినేయండి:

తాంబూలమ్ :


పిల్లి ఎదురొచ్చింది:


*** *** ***

పూర్ణానందంగారి శత జయంతి సందర్భంగా శ్రీ సుధామ గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.






Thursday, May 24, 2012

"రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు



రేడియో చరిత్ర తెలిసిన నిన్నటితరం వారందరికీ
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు చిరపరిచితులు. సహస్రచంద్ర దర్శన సౌభాగ్యం కలిగిన వీరు వేంకట పార్వతీశకవులలో ఒకరైన శ్రీ వేంకటరవుగారి కుమారులు. రజనిగారి గొప్పతనం గురించి నేనెంత చెప్పినా చంద్రునికో నూలుపోగు చందానే ఉంటుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభాశాలి మన తెలుగువారవ్వటం మన అదృష్టం. ఆయన ఏ బెంగాలీవారో అయ్యుంటే ఇంతకు నాలుగురెట్లు ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చి ఉండేదేమో కూడా..! నా దృష్టిలో రజని గారి సేవలను అందుకున్న "ఆకాశవాణి" అదృష్టవంతురాలు. రేడియోలో ఉదయం ప్రసారమయ్యే "భక్తిరంజని"ని వీరి పేరున "భక్తరజని" అనేవారంటే అందుకు వారి కృషే కారణం. ఇక లలిత సంగీతానికీ, గేయరూపకాలకూ రజనిగారి చేసిన సేవ అనంతం. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతసాహిత్యాలు ఆయన ఉఛ్వాసనిశ్వాసాలు ! సంగీతంలో ఎన్నో రకాల పరిశోధనలూ, ప్రయోగాలు చేసారు. రజనిగారు రవీంద్రసంగీతాల్ని తెలుగులోకి అనువదించి, స్వరపరిచిన విశేషాలు, వారికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చిన విషయం సంగీతప్రియ బ్లాగ్లో ekla chalo re పాట గురించి రాసినప్పుడు రాసాను.


రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao




కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న
"ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర", "శతపత్ర సుందరి", "మువ్వగోపాలపదావళీ", పిల్లల కోసం రాసిన "జేజిమావయ్య పాటలు" మొదలైనవి రజనిగారు సాహిత్య ప్రపంచానికి అందించిన కలికితురాయిలు. "కొండ నుండి కదలి దాకా" అని గోదావరీనది మీద రజనిగారు చేసిన సంగీత రూపకం జపాన్ దేశ పురస్కారాన్ని అందుకుంది. ఇంతటి గొప్ప వ్యక్తి తన స్వీయచరిత్రను ఇంత ఆలస్యంగా రాయటమేమిటో అని ఆశ్చర్యం వేసినా ఇప్పటికైనా వారు పుస్తకం రాసినందుకు చాలా సంతోషించాను నేను.


ఈ ఏటి ఉగాది నాడు(23-3-12) రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు. పుస్తకంలో రజనిగారు తన బాల్యం, పిఠాపురం కవిపండితులు, రేడియో అనుబంధాలు అనుభవాలూ; సాలూరి రాజేశ్వరరావు, శ్రీ గోపీచంద్, బాల సరస్వతి, ఓలేటి, చలం, విశ్వనాథ, శ్రీపాద పినాకపాణి మొదలైన మహామహులతో తనకున్న జ్ఞాపకాలు, తన రచనలు, సత్కారాలూ పురస్కారాలు మొదలైన అంశాలను గురించి తెలిపారు. రేడియో పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.



గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:




భట్టుగారి ప్రసంగం:




చిన్ననాటి నుండీ ఇంట్లో మనిషిలాగ రజనిగారి చుట్టు తిరిగగలగటం, ఇవాళ ఆయన స్వీయచరిత్రను గురించి బ్లాగ్లో రాయ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకం కాపీల కోసం అడ్రస్:

సత్యం ఆఫ్సెట్ ఇంప్రింట్స్
బృందావనం,డో.నం.49-28-5,
మధురానగర్, విశాఖపట్నం -16.
ph-0891-2735878,9849996538


Wednesday, May 23, 2012

"అప్పుడప్పుడు"



దర్శకుడు చంద్ర సిధ్ధార్థ తీసిన "అప్పుడప్పుడు" సినిమా ఆడలేదు కానీ ఆర్.పి.పట్నాయక్ సంగీతం సమకూర్చిన పాటలు బావుంటాయి. అప్పట్లో SSmusic channel లో విజె గా చేసిన శ్రియ రెడ్డి, రాజా('ఆనంద్'ఫేం) ఈ సినిమాలో ప్రధాననటులు. సిడి మీద గీతరచయితలుగా చైతన్య ప్రసాద్, పెద్దాడ మూర్తి పేర్లు ఉంటాయి కానీ ఏ పాట ఎవరు రాసారో తెలీదు..:(

మొత్తం ఆరు పాటల్లో నాలుగు పాటలు నాకు బాగా నచ్చుతాయి. పిక్చరైజేషన్ కూడా అంతగా బావుండదు కానీ వినటానికీ పాటలు బావుంటాయి.


1) ఇదిగో ఇపుడేపెరిగిన ప్రేమో
ఆర్.పి, ఉష




------------------

2)నీ కలలు కావాలి
ఆర్.పి, సునీత




-------------------
3) నీకెంతెల్సు
ఆర్.పి, ఉష




---------------------

4) గుడుగుడు గుంచెం
ఉష,లెనిన్,గాయత్రి,రవివర్మ








Monday, May 21, 2012

కొండఫలం


"మంచి కథ రాసిన తర్వాత ఒక పూలతోటని పెంచి పూలు పూయించినంత ఆనందం కలుగుతుంది" అంటారు వీరలక్ష్మి గారు. పుస్తకం .నెట్ కి నేను రాసిన మొదటి వ్యాసం వాడ్రేవు వీరలక్ష్మిగారి పుస్తకం “ఆకులో ఆకునై….” (http://pustakam.net/?p=2204) అప్పుడు ఈ కథల పుస్తకం గురించి తెలీదు. మొన్నటి పుస్తకప్రదర్శనలో కనబడితే కొనుక్కున్నా. ఇటీవలి కాలంలో నేను చదివిన పుస్తకాలన్నింటిలోకీ బాగా ఆస్వాదించిన పుస్తకం ఇది. కొన్ని రచనలు చదివినప్పుడు ఆ రచయిత ఎవరో మనకి తెలియకపోయినా అవి మన హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. బహుశా మన ఆలోచనల్లో తిరగాడే కొన్ని భావాలకు, అభిప్రాయాలకు భావ సారూప్యం ఉన్న రచనను చదివితే కలిగే ఆనందం ఆ దగ్గరతనానికి కారణం కావచ్చు. అలాంటి దగ్గరితనాన్ని నాకు ఈ "కొండఫలం" కథలు అందించాయి. రచయిత్రి పట్ల అభిమానాన్ని మరింత పెంచాయి.

"నేను చూస్తున్న జీవితంలోని సమస్యల మూలాలను వివరించే ప్రయత్నం నా కథల రూపంలో చేసాను" అంటారు రచయిత్రి. ప్రపంచీకరణ వల్ల సమాజంలో తగ్గిపోతున్న మానవీయ విలువలను నిలబెట్టాల్సినవారు కవులు రచయితలే అనీ, తన ఆలోచన కూడా అదే అని, ఆ విషయమై ఇంకా కథలు రావాల్సి ఉందని వాడ్రేవు వీరలక్ష్మి గారు తన 'ముందుమాట'లో అంటారు. స్త్రీ వాదాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోగలిగితే స్త్రీపురుషుల జీవితాలు ఎంతో ఉన్నతంగా మారగలవనీ, ఒక వంద సంవత్సరాల పాటు ఈ విషయమై కథలు,నవలలు వస్తే తప్ప స్త్రీపురుషుల మధ్య ఉన్న అసమానతలు తీరవంటారు ఆవిడ.

ఈ పుస్తకంలోని కథలన్నీ ఎనభై,తొంభైలలో వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. "కొండఫలం"లో మొత్తం పన్నెండు కథలు ఉన్నాయి. తన అభిమాన రచయిత్రి ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి కథ "ఒక రాత్రి గడవాలి". ఆవిడ రచనలు చదివి తాను ఊహించుకున్నట్లుగా కాక ఒక సాధారణ గృహిణి బాధ్యతలు నెరవేస్తున్న తన అభిమాన రచయిత్రిని చూసి అంతవరకు తెలియని ఎన్నో విషయాలతో పాటూ జీవన విధానంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో తెలుసుకుంటుంది వినీల. గిరిజనుల భూమి సమస్య, వాటివల్ల గిరిజన మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు ఇతివృత్తంగా తీసుకున్న కథ "కొండఫలం". ఇదీ, ఇలాంటి గిరిజన నేపథ్యంలో సాగే "బినామీ" కథా, మరో గిరిజన స్త్రీ కథ "పేరెంట్" మూడూ చదువుతూంటే నాకు వంశీ రాసిన "
మన్యంరాణి" గుర్తుకు వచ్చింది.





ప్రపంచీకరణ వల్ల స్వాతంత్ర్య దినోత్సవమంత ఉధృతమైన ఉద్యమంగా మారిన ప్రేమికుల దినోత్సవం గురించీ, ఇటువంటి దినోత్సవాల ఆకర్షణ వల్ల యువత ఎలా తప్పటడుగు వేస్తోందో తెలియచెప్పే కథ "ప్రేమికుల దినం". ప్రేమ వివాహం చేసుకుని, సంసారంలో ఎదురైన ఒడిదొడుకులను తట్టుకుని, తన అస్థిత్వాన్ని కాపాడుకంటూ, జీవితాన్ని ఒక ఉపయోగకరమైన పనివైపు నిర్దేశించుకున్న ఒక ఉద్యోగిని కథ "జ్ఞానప్రసూన". వివేక్ ఎదురుచూసీ, వెంటపడి పెళ్ళి చేసుకున్న తృషిత తన వైవాహిక జీవితంలో నేర్చుకున్న జీవితపాఠాలు గురించిన కథ "తృషిత" అయితే, ప్రేమవివాహం చేసుకుని ఒకరికొకరు అర్థంకాకున్నా ఒకరినొకరు వదలలేక సంఘర్షణతోనే బ్రతికేస్తున్న మరో జంట సమీర-ప్రమోద్ ల కథ "తెలుసుకొనవె యువతా..."
మావయ్య ఇంట్లో వంటమనిషీ పనిమనిషీ అయిన సత్యవతి ఆత్మవిశ్వాసం, చిన్నప్పుడు కుటుంబం కోసం తన అమ్మమ్మ పడ్డ కష్టాల వెనుక ఉన్న మనోధైర్యం, విలాసవంతమైన జీవితం గడిపే వదిన సువర్చల, రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వృత్తి చేసుకుంటున్న స్త్రీ పట్ల ఆశ్చర్యం - వీటన్నింటి గురించీ ఆలోచిస్తూ, ఎవరినీ కాదనలేని తన బలహీనమైన స్వభావాన్ని తరచుకునే ఒక యువతిలో జరిగే మనసికసంఘర్షణ "ఆ పిలుపు ఇంకా అందలేదు" కథానిక. "కూటి కోసం కూలి కోసం" కథ రకరకాల ఉద్యోగాలు చేసే యువతుల సంఘర్షణ, అమ్మ నుంచి 'అనిమిష' నేర్చుకున్న జీవిత పాఠాలేమిటో తెలుపుతుంది.

ఈ పుస్తకంలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన కథ "ఇలా... ఉన్నాం". డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు; ఇంకా కొలీగ్ శారద, పక్కింటి విజయ, పనిమనిషి నూకాలమ్మా, ఆమె కూతురు రామలక్ష్మి నుండి లలిత ఏం నేర్చుకుందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలో లలితకు వ్యక్తపరిచే సందేహాలూ, ప్రశ్నలు ప్రతిఒక్కరూ తమలో తాము వేసుకునేవేనేమో అనిపిస్తాయి.

పుస్తకంలో కథలన్నీ విభిన్న అంశాలను స్పృశించినా, స్త్రీవాద కథలు అనిపించినా, అంతర్లీనంగా ఇవన్నీ సమకాలీన సమాజంపై రచయిత ఎక్కుపెట్టిన బాణాలు అనిపించింది నాకు. చక్కని శైలి, రచన ద్వారా చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత, అందమైన భావాలు, సున్నితమైన అంశాలపై ప్రశ్నలు ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆద్యంతం చదివించేలా చేస్తాయి. "The pen is mightier than the sword" అన్న వాక్యాన్ని బలపరిచేలా మనలోని ఆలోచనలను ప్రభావితం చేయగల శక్తి ఉన్న వీరలక్ష్మి గారి కలం నుండి ఇంకా ఎన్నెన్నో ఆలోచనాత్మకమైన కథలు, వీలైతే నవలలు చదివే అవకాశం రావాలని ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ అనిపించింది.

Thursday, May 10, 2012

ఏక్లా చలో రే... ఒకడవే పదవోయ్ !


రవీంద్రగీతాల్లో చాలా ప్రఖ్యాతి గాంచిన పాట " ఏక్లా చలో రే... ". ఉదాసీనంగా ఉన్నప్పుడు ఎంతో ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ ఇచ్చే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ గీతాన్ని తెలుగులోకి అనువదించినవారు శ్రీ రజనీకాంతరావుగారు. సంగీతానికీ,సాహిత్యానికీ,రేడియోకీ వీరు చేసిన సేవ అనంతమైనది. వీరికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు గతవారం చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చారు.



మొన్న ఉగాదినాడు రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు కూడా. నా పేరుకి రజనిగారు రాసిన ఒక పాటే ప్రేరణ అని నాన్న చెప్తూంటారు. నాన్న వారికి అత్యంత సన్నిహితులవ్వటం, తద్వారా అంతటి గొప్ప వ్యక్తి గురించి మాకు బాగా తెలియటం నా అదృష్టంగా భావిస్తాను.

రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao


ఇంతకీ ఈ ఏక్లా చలో పాట అనువాదం వెనుక కథ ఏంటంటే . రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కలకత్తా వెళ్ళి రవీంద్ర సంగీతం పాటలు కొన్నింటి నొటేషన్స్ రాసుకుని వచ్చి, హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఎక్లా చలో పాటను "ఎవరూ కేక విని రాకపోయినా" అంటూ రజని గారు అనువదిస్తే, చిత్తరంజన్ గారి సోదరి శాంతాచారి గారు పాడారు. క్రింద లింక్ లో ఆ పాట వినవచ్చు..



Evaru keka vini raakapoyinaa.ravindrasangeetam by Trishnaventa

ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్

మరుమాట లేకున్నా ఓరీ..ఓ అభాగ్యుడా మరి మాటలేకున్నా
మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా
నీ మనసు విప్పి నీవే మర్మమేదో తెల్లముగా ఒకడవే అనవోయ్
ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్


మరి తోడు లేకున్నా ఓరీ..ఓ అభాగ్యుడా తోడులేకున్నా
,మరి అడవి దారిపొయ్యేవేళ ఎవరు రాకున్నా
ముళ్లబాటలోనా నీవే అడుగుల రక్తమ్ము చిమ్మ ఒకడవే పదవోయ్
ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్
అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్

మధుర గాయని Shreya Ghosal బెంగాలీలో పాడిన Ekla Chalo:

Tagore's English translation for this song:
If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou unlucky one,
open thy mind and speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness,
O thou unlucky one,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm,
O thou unlucky one,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

*** **** ****
అమితాబ్ కూడా పాడినది ఈ లింక్ లో వినవచ్చు:
http://www.youtube.com/embed/fNPxEH_qMWc

Thursday, May 3, 2012

వెతుకుతున్న కథ దొరికింది !


ఎప్పుడో ఓ ఈనాడు ఆదివారం పుస్తకంలో పడిన ఒక కథ నాకు బాగా నచ్చింది. దాచానని బాగా గుర్తు. ఎంత వెతికినా కనపడనంత జాగ్రత్తగా వస్తువులు దాచేయటం నాకో దురలవాటు. ఈనాడు లో పడిన కథ అని గుర్తు కానీ నెల , సంవత్సరం గుర్తులేవు కాబట్టి నెట్లో వెతకలేను. కొన్ని కథల తాలూకూ కట్టింగ్స్ దాచిన చోట్లో కూడా దొరకలేదు. ఇన్నాళ్ళూ వెతికివెతికి ఇక పోయిందనే అనుకున్నా. అలమార్ల నిండా నేను నింపిన చెత్త తగ్గించాలనే ఉద్దేశంతో "ఈ పేపర్ కట్టింగ్స్ అన్నీ ఎన్నాళ్ళు దాస్తావు? కాయితాలు కూడా పాతవయిపోతున్నాయి... స్కేన్ చేసేసుకుని సిస్టంలో సేవ్ చేసేస్కొమ్మని" సలహా ఇచ్చారు శ్రీవారు. ఇదేదో ఐడియా బానే ఉంది అనుకుని అలమారలోని నా ఖజానా అంతా ముందర వేసుకుని కూచుని చూస్తూంటే నిన్న కనబడింది 2008 జులై 6 ఈనాడు ఆదివారం పుస్తకం ! పుస్తకంలో "ఆనందమె జీవితమకరందం" కథ ! ఎప్పటిలా నేను కథ పేజీలు కట్ చేయకుండా నేనేకంగా పుస్తకం మొత్తం దాచేయటంతో నాకిన్నాళ్ళు ఈ కథ కాయితాలు దొరకలేదన్నమాట..:)


సరే నాకంతగా నచ్చిన ఆ కథ వివరాల్లోకి వెళ్తే.. రచయిత పేరు "వేదార్థం జ్యోతి". కథ పేరు "ఆనందమె జీవితమకరందం".
ఈనాడు కథల పోటిలో కాన్సొలేషన్ బహుమతి లభించిందట. శాంత, మూర్తి అనే దంపతుల కథ. పెళ్లై అత్తవారింటికి వచ్చిన శాంత ఇంటి ఆవరణలోని పులమొక్కలు, జాజిపులు, వీధి చివరి గుడి, ఉదయమే వినిపించే సుప్రభాతం..గుడిగంటలు... అన్నీ చూసి మురిసిపోతుంది. కానీ ఇద్దరాడపడుచులు, మరిది - వాళ్ల పెళ్ళిళ్ళు పేరంటాలు , అత్తమామలు, అనారోగ్యాలు, ఇద్దరు మగపిల్లలు - వాళ్ల చదువులు మొదలైన బాధ్యతల మధ్యన సతమతమౌతుంది శాంత. మౌనంగా తన పని తాను చేసుకుపోయే భర్త "నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కానీ, లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చెయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం" అని మొదట్లోనే శ్రీకృష్ణునిలా కర్తవ్య బోధ చేస్తాడు. మూర్తితో కలిసి కాఫీ తాగుతూ పేపర్ చదవాలనీ, ఒక్క ఆదివారం అయినా భర్తతో ఏకాంతంగా గడపాలనీ, ఘంటసాల పాటలు వింటు నిద్దరోవాలనే చిన్నచిన్న కోరికలన్నీ ఆమెకు అసాధ్యాలయిపోతాయి. ఇంటెడు జనం, వారి అవసరాలు తీర్చటంతోనే రోజులెలా గడిచాయో తెలియనంత వేగంగా ఆమె నలభై ఏళ్ళ కాపురం గడిచిపోతుంది. అయితే ఏనాడు తన అసంతృప్తిని బయటపడనివ్వదు శాంత. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే అదృష్టం అనుకుంటుంది.


అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేసినా పెళ్ళిళ్లై వెళ్ళిన ఆడపడుచులు, మరిది వారివారి సహాయానికి రమ్మని అడిగినప్పుడల్లా వెళ్లక తప్పదు శాంతకు. ముంబై వెళ్ళి పెద్ద కోడలికి పురుడు పోసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంటుంది. చిన్న కొడుకు అమెరికాలో స్థిరపడి, తమను రమ్మన్నా ఆ యాంత్రిక జీవితానికి భయపడి తమ ఇంట్లోనే ఉండిపోతారు శాంత, మూర్తి. అలా అన్ని బాధ్యతలు తీరాకా పొద్దుటే పూజ చేసుకుని, మూర్తి ఆఫీసుకి వెళ్లగానే పులమాలలు కట్టి వీధి చివరి గుళ్ళో ఇవ్వటం, సాయంత్రం మూర్తి కోసం ఎదురు చూస్తూ ఇంటి ఆవరణలోని పూలసౌరభాలలో మునిగిపోవటం ఎంతో ప్రశాంతతనిస్తాయి శాంతకి. "వృధ్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంతా. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే. ఇప్పుడు మనం ఎవ్వరి గురించీ ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను..అంతే" అన్న మూర్తి మాటలతో సంతృప్తి చెందుతుంది ఆమె. భర్త రిటైర్మెంట్ రోజున మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అంతా వచ్చి మూర్తికి సత్కారం చేసేసరికీ పొంగిపోతారు వారిద్దరూ.


ఆ మర్నాడు అంతా కూచుని చెప్పిన మాటలకి ఆ దంపతులిద్దరి ఆనందం ఆవిరైపోతుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేసుకునే చిన్నాడపడుచు తమ వద్దకు వచ్చి ఉండమంటుంది. వాళ్లాయన కొత్తగా పెట్టే షాపులో నమ్మకంగా పనిచేసేవాడు కావాలనీ రిటైరయిపోయాడు కాబట్టి అన్నగారిని తమతో రమ్మని అడుగుతుంది పెద్దాదపడుచు. తాము జీతమీయక్కర్లేని పనిమనుషులమా? అనుకుంటుంది శాంత. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా ఇక్కడ ఉండేంచేస్తారు? ఇల్లమ్మేసి నా వాటా ఇచ్చేసి పిల్లలవద్దకు వెళ్ళిపొండన్న మరిది మాటలు అభ్యర్ధనో, ఆర్డరో అర్ధం కాదు వాళ్ళకు. ఇన్నేళ్ళుగా ఇంట్లో జరిగిన శుభాశుభాలకు డబ్బెలా వచ్చిందో పట్టించుకోని మరిది ఇప్పుడు వాటా అడగటం చూసి ఆశ్చర్యపోతుంది శాంత. ఇంతలో చిన్నకొడుకు కల్పించుకుని అమ్మానాన్నలు కుటుంబం కోసం తమ జీవితాలను హారతి కర్పూరాలను చేసారనీ, వాళ్ళేం పోగొట్టుకున్నరో,ఎన్ని త్యాగాలు చేసారో ఎవరికీ తెలియని విషయాలు కావనీ, ఎవరి పంచనో ఉండాల్సిన అగత్యం వాళ్ళకు లేదనీ, ఇల్లు అమ్మే ప్రసక్తే లేదనీ గట్టిగా చెప్తాడు. అంతగా అయితే ఇంటికి లెఖ్ఖగట్టి ముగ్గురి వాటాల ధర అన్నదమ్ములమిద్దరం ఇచ్చేస్తామనీ చెప్తాడు. ఇంతలో పెద్దకొడుకు కూడా లేచి తమ ఇంటి పక్క ఉన్న ఖాళీ స్థలం కొని మ్యూజిక్ స్టోర్స్ పెడుతున్నామనీ, తన స్నేహితుడు అన్నీ చూసుకుంటాడనీ, తండ్రి పర్యవేక్షణ చేస్తే చాలనీ, అలా వారిద్దరూ ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చనీ చెప్తాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపొయినట్లు కనబడుతున్న పిల్లలిద్దరినీ చూసి మురిసిపోతారు శాంత, మూర్తి.


ఈ కథ అంతం కాస్త నాటకీయంగా అనిపించినా కథకు ఎన్నుకున్న అంశం, పాత్రల మధ్యన జరిగే సంభాషణలూ, రచయిత కథ రాసిన విధానం నాకు నచ్చాయి. జీవితంలో దశలవారిగా స్త్రీ ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని చక్కగా రాసారు రచయిత. ఎవరో మరి..



Wednesday, May 2, 2012

ఒంటరి మరణం..





ఒంటరి జననం.. ఒంటరి మరణం. ఇది మనిషి ప్రతి నిత్యం గుర్తుంచుకోవాల్సిన సత్యం. మరణమెంత అనివార్యమో తన రాక కూడా అంత ఊహింపరానిది. తెలివిలో ఉన్నా తెలివిలో లేకపోయినా ఎవరు తోడుగా కానీ పక్కనగానీ లేని ఒంటరి మరణం దుర్భరం. ఇవాళ న్యూస్ పేపర్లో బాలీవుడ్ సినిమాల్లో ఒకప్పటి ప్రఖ్యాత తల్లి పాత్రధారి "అచలా సచ్ దేవ్" మరణవార్త విని మనసు చిన్నబోయింది.. !


బాల నటిగా నటన ప్రారంభించిన ఆమె ఆమె పెద్ద హీరోయిన్ ఏమీ కాదు కానీ చాలా మంది హీరోలకు తల్లిగా నటించింది. అయితే చివరి రోజుల్లో ఇంట్లో కాలుజారి పడిపోయాకా తెలివి కోల్పోయి తెలియని స్థితిలోకి వెళ్పోయిందిట. మరణ సమయంలో అమెకు తోడుగా బంధువులు ఎవరూ లేరుట. కొడుకు,మనవలు..అంతా ఎక్కడో ఇతర దేశంలో ఉన్నాడుట. గతంలో తమకు ఆమె పెద్ద మొత్తాని డొనేట్ చేసినందుకో ఏమో ఒక సంస్థవారు ఓ మనిషిని తోడుగా పెట్టారుట ఆమెను చూసుకోవటానికి. ఆమె ఇచ్చిన డబ్బుతో ఆ సంస్థ "అచలా సచ్ దేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యూకేషన్" పేరుమీద ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారుట. అందులో గిరిజన విద్యార్ధులకు హాస్పటల్లో రోగులను ఎలా చూసుకోవాలో నేర్పిస్తారుట. ఒక రకంగా నర్స్ కోర్స్ లాంటిదన్నమాట. ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన శ్రీమతి సచ్ దేవ్ కు చివరిలో అదే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మనిషి తోడుగా నిలబడింది.


పేపర్లో ఈవిడ గురించి చదవగానే నాకు మా నాన్నమ్మ గుర్తుకు వచ్చింది. తనూ అలానే బాత్రూమ్ లో రెండవసారి జారిపడిన తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలివిలేని స్థితికి వెళ్పోయి కోమాలోనే పది పదిహేను రోజులు హాస్పటల్లో ఉంది. అయితే అప్పుడు మేమంతా నాన్నమ్మ పక్కనే ఉన్నాము. నేను రోజూ వాక్ మాన్ లో భజనలు పెట్టి ఇయర్ ఫోన్స్ తన చెవిలో పెట్టేదాన్ని. రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ నవ్వుతూ ఉండేవారు.. "ఆవిడ వింటారనేనా పెడుతున్నారు?" అని. తను సబ్కాన్షియస్ గా వింటుందని ఏదో పిచ్చి నమ్మకం నాకు. చివరివరకు అలానే పెట్టాను. తనకు చేయాల్సిన మిగతా పనులన్నీ అమ్మ ఎంతో జాగ్రత్తగా చేసేది. అదో చేదు జ్ఞాపకం..
చివరి క్షణాల్లో మా నాన్నమ్మకు మేమున్నాము. పాపం ఆవిడకు ఎవరూ లేరే అని బాధ కలిగింది ఇవాళ ఈ వార్త చూడగానే.

to lighten the heavy mood.. 'అచలా సచ్ దేవ్' గుర్తుగా చాలా పాపులర్ అయిన ఈ పాట విందామేం..

Monday, April 30, 2012

ఏం పెళ్ళిళ్ళో...!!


ఈ ఏడు బొత్తిగా పెళ్ళిళ్ళకే వెళ్ళకపోవటానికి నేనేమీ గ్రహాంతరవాసిని కాదు కానీ మా ఇరుపక్షాల కజిన్స్ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయి వాళ్లంతా పిల్లల్ని ఎత్తే స్టేజ్ కి వచ్చేయటంతో ఈ సీజన్లో బొత్తిగా పెళ్ళిపిలుపులే లేకుండా పోయాయి. ఈ ఏడు అసలు ఏ పెళ్ళికీ వెళ్లలేదు అని మేమిద్దరమూ చింతింస్తూ ఉండగా ఒక్కసారిగా ఇదేనెలలో ఐదారు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పెళ్ళిళ్ళు తగిలాయి. ఏ పెళ్ళిపిలుపూ రాకపోతే రాలేదని బాధ...తీరా ఎవరన్నా పిలిస్తే వెళ్ళాలని బాధ. బాధ ఎందుకంటే దూరాలు వెళ్ళాలని. ఇప్పుడు చాలామటుకు అన్నీ ఎక్కడో ఊరి చివర ఉండే సువిశాలమైన ఏసీ కల్యానమంటపాల్లో పెళ్ళిళ్ళు. అక్కడికి వెళ్తే బానే ఉంటుంది కానీ వెళ్ళేదెలా? ఆటోల్లో వెళ్ళేదూరాలు కూడా కాదు, పట్టుచీరలూ గట్రా కట్టుకుని బస్సుల్లో ఎక్కలేము. కనీసం అక్కడికి వెళ్ళేదాకా అన్నా కట్టుకున్న బట్టలు నలక్కుండా ఉండాలి కదా ! ఏదో ఈ సిటీలో ఉన్న పుణ్యానికీ, అదృష్టవశాత్తూ మేం బస్టాపులో నించున్న సమయానికి ఏసీ బస్సులో, లేక డీలక్స్ బస్సులో రాబట్టి మా గండం గడిచింది.


ఆ విధంగా ఏవో తంటాలు పడుతూ ఈ ఒక్క వారంలోనే ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చూసివచ్చాం. నిన్నరాత్రి కూడా ఒక రిసెప్షన్కి వెళ్ళి వచ్చాం. (పెళ్ళి వేరే ఊళ్ళో అయ్యింది) నేను సిటీలో పెళ్ళిళ్ళకి వెళ్ళి రెండేళ్ళు పైనే అయ్యింది. క్రిందటేడు గుడివాడలో ఓ పెళ్ళివాళ్ళు చాలా సాంప్రదాయకుటుంబానికి చెందినవాళ్ళవటంతో చక్కగా పందిళ్ళు వేయించి, బఫేల జోలికి పోకుండా హాయిగా బల్లలు అవీ వేసి కూచోపెట్టి అరిటాకులో భోజనాలు పెట్టారు. నాకసలు ఈ బఫే భోజనాలంటే పరమ చిరాకు. క్యూలో నిలబడి ప్లేటిచ్చుకుని అడుక్కుని తినటం ఏంటో.. అనుకుంటూ ఉంటాను. నా పెళ్ళిలో కూడా ఆఫీసువాళ్లకి బఫే పెట్టినా, చుట్టాలందరికీ చక్కగా టేబుల్స్ వేసి కూచోబెట్టి టిఫిన్, భోజనం పెట్టాలని ఖచ్చితంగా నాన్నతో చెప్పేసాను. సరే ఇంతకీ నే వెళ్ళిన పెళ్ళిళ్ళ గురించి కదా చెప్తున్నాను...ఈ సిటీల్లో పెళ్ళిళ్లు చూసి కాస్త ఎక్కువకాలమే అవ్వటం వల్ల నాకు ప్రతి చోటా ఆశ్చర్యమే ఎదురైంది.


ఓ మోస్తరు మామూలు పెళ్ళిళ్ళలో కూడా అలంకరణలకీ, ఆర్భాటానికీ జనాలు పెడుతున్న ఖర్చు విపరీతంగా తోచింది. వేలంవెర్రిలా కూడా అనిపించింది. వాళ్ల సరదా కోసం అనుకుందామంటే అసలు లోపలున్నవాళ్లకి బయటకు వచ్చి కల్యాణమంటపానికి ఏం అలంకరణ చేసారో చూసుకునే సమయమే ఉండదు. మరి ఈ బయట రోడ్డు పొడుగునా ఉన్న విపరీతమైన అలంకరణ,చెట్లకీ పుట్టలకీ లైటింగులు ఎవరికోసం? దారేపొయేవాళ్లకు చూపించుకోవటానికా? వీధిలో వెళ్ళేవాళ్ల కోసమా? తెలీదు. ఇక లోపల పెళ్ళి జరుగుతున్నంత సేపు సన్నాయి, బాజాభజంత్రీలు ఎప్పుడో పోయాయి...పాట కచేరీలు కొత్త ఫేషన్. సినిమా పాటలు కొందరైనా వింటారు. కానీ శాస్త్రీయంగా త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు , వాద్య సంగీతం పెట్టుకునేవారు కొందరుంటారు. అవి ఎంతమంది వింటారు అన్నది వాళ్లకి అప్రస్తుతం. పాడేవాళ్లకీ, వాయిద్యకారులకీ పైకమందుతుంది. వాళ్లపని వారు చేసుకుపోతారు. కానీ నాలాంటి ప్రాణులు కొందరు మాత్రం అయ్యో ఈ సంగీతాన్ని ఎవరూ విని ఆస్వాదించటంలేదే అని వాపోతారు. మొన్నటి పెళ్ళిలో ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పట్టుపరికిణీ,ఓణీలు వేసుకుని కీర్తనలు పాడారు. ఎంతబాగా పాడుతున్నారో...కానీ పట్టుమని పదిమందైనా వింటున్నారోలేదో అని బాధ వేసింది నాకు. విలువ తెలియని చోట కళను ప్రదర్శించటం ఆ కళకు అవమానం కాదా.. అనిపించింది.



ఇక భోజనాల సంగతి తలుచుకోకపోతేనే మంచిదేమో. అక్కడ జరిగే వేస్టేజిని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. చిన్న పెళ్ళి అయినా పెద్ద పెళ్ళి అయినా ఐటెమ్స్ తగ్గుతున్నాయి కానీ అందరి భోజనాలు దాదాపు ఇదే స్టైల్లో ఉంటున్నాయి. ముందర స్టార్టర్స్ లో పానీపురీ, చాట్లు, రగడాలు, మంచూరియాలు, నూడిల్స్, సూప్ మొదలైనవి తిన్నాకా ఇక భోజనం ఎందుకో నాకు అర్ధం కాదు. సరే భోజనం తినాలి కదా అని ఆ వైపుకి వెళ్ళాం. దోశ, పూరీ, పెసరట్టు ఉప్మా మొదలైన టిఫిన్స్ అన్నీ ఒకవైపు వేడివేడిగా వేసేసి నాలుగురకాల చట్నీలతో వడ్డించేస్తున్నారు. ఆ తర్వాత రోటిలు, నాన్లు, పూరీలూ వాటికో ఐదారురకాల కూరలు; ఆ తర్వాత వైట్ రైస్, సాంబార్, కూరలు మొదలైనవి. అవి అయ్యాయా, ఇక ఓ ఐదారు రకాల స్వీట్స్ ఓ పక్క, నాలుగైదు రకాల ఐస్క్రీంలు ఒకపక్క. ఇవన్ని అయ్యాయ అంటే ఓ పది రకాల ఫ్రూట్స్ వరుసగా ! అసలు మనిషన్నవాడెవడన్నా ఇన్ని రకాలూ ఒకేసారి తినగలడా? లేదు కదా. అయినా కొందరు జనాలు ఆతృత కొద్దీ చాలా రకాలు ప్లేట్లో వేసుకోవటం సగం తిని పడేయటం చేస్తున్నారు. ప్లేట్స్ పడేసే డస్టబిన్ దగ్గర, తినటానికి మధ్యలో వేసిన గుండ్రని టేబుల్స్ మీదా సగం సగం తిని వదిలేసిన ప్లేట్సే. అసలు ఎంత తింటారో తెలీకుండా అలా అన్నేసి ప్లేట్లలో ఎందుకు పెట్టించుకుంటారో, పెట్టించుకున్నది ఎందుకు పడేస్తారో వాళ్లకే తెలవాలి. కొందరమో తగుమోతాదుల్లో ఈ నానారకాల చెత్తల్నీ కడుపులో నింపేసుకుని కదల్లేక మెదల్లేక పాపం కూర్చుండిపోయేవారు కొందరు. ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలీకుండా ఇలా పెళ్ళి భోజనాలు తినేయటం వల్ల ఆనక ఎసిడిటీలు, ఇన్డైజెషన్ లు !! వీటన్నింటికన్నా భోజనాల దగ్గర జరిగే వేస్టేజే నాకు బాధను కలిగించింది. దేశంలో తిండిలేక మలమల మాడేవారు కొందరైతే, ఇలా పెళ్ళిళ్ళ పేరుతో భోజనపదార్ధాలను వ్యర్ధపరిచేది ఇంకొందరు.

జీవితాంతం గుర్తుంపోయే మధురక్షణాలను పదిలపరుచుకోవటం చాలా మంచిదే. ఎవరి తాహతను బట్టి వారు ఖర్చు చెయ్యటం కూడా సరదానే. కాదనను. కానీ అది శృతి మించితే... నష్టం ఎవరికి? పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్లు ఒకళ్లను చూసి ఒకళ్ళు తాహతకు మించి ఆర్భాటాలకు పోవటం ఎంతవరకు సమంజసం..? ఈ ఖర్చుల్లో సగమైనా వధువరుల పేరున దాచితే వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లోనో లేదా ఏ ఫర్నిచర్ కొనుక్కోవటానికో ఉపయోగపడుతుంది కదా..! ఏంపెళ్ళిల్లో ఏమిటో...!

Thursday, April 26, 2012

మార్కొనీ జయంతి సందర్భంగా నాన్నగారికి మరో సన్మానం



నిన్న(Apr 25th) రేడియోని కనిపెట్టిన "మార్కొనీ" జయంతి. ఈ "మార్కొనీ జయంతి" సందర్భంగా రేడియోకి విశిష్ఠ సేవలను అందించిన కొందరు రేడియో ప్రముఖులకు కొన్ని స్మారక అవార్డులను గత కొన్నేళ్ళుగా విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్ వారు ఇస్తున్నారు. ఈ ఏటి మార్కొనీ జయంతి సందర్భంగా నిన్నటి రోజున ముగ్గురు రేడియో ప్రముఖులకు సన్మాన పురస్కారాలను అందజేసారు. విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్, హైదరాబాదు త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఎనౌన్సర్ శ్రీ బి.జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ(కళాసుబ్బారావు వేదిక)లో నిన్న సాయంత్రం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముగ్గురు రేడియో ప్రముఖులు - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి, విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ, విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు) అవార్డులు అందజేసారు. మార్కొనీ వంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పురస్కార గ్రహీతలు చెప్పారు.


అవార్డుల వివరాలు:

* విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్, గాయని స్వర్గీయ వి.బి.కనకదుర్గ స్మారక అవార్డ్ - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి,
* న్యూస్ రీడర్ తిరుమలశెట్టి శ్రీరాములు స్మారక అవార్డ్ - విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ,
* ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్ట్ స్వర్గీయ శ్రీ గోపాల్ అవార్డ్ - విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు)


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమణాచారి గారు ఇటీవలే "దేవస్థానం" సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారుట. రచయిత, కవి, విమర్శకుడు, రిటైర్డ్ ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ శ్రీ సుధామ గారు(మన "సుధామధురం" బ్లాగర్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ సుధామగారు స్టేజ్ పై మాట్లాడుతూ మన తెలుగుబ్లాగులు గురించి కూడా చెప్పారు. అందులో వారు నా బ్లాగ్ గురించి కూడా ప్రస్తావించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి శైలజా సుమన్ గారు కూడా తన ప్రసంగంలో పాత రేడియో రోజులను, తన రేడియో జ్ఞాపకాలనూ తలుచుకున్నారు.


ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు శ్రీ పాలక రాజారావు, హైదరాబాద్ దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు, ING Life Insurance Co. Ltd బ్రాంచ్ మేనేజర్ శ్రీ వంకదారు హరికృష్ణ పాల్గొన్నారు.



సుధామ గారు :

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు :

శ్రీ ఏడిదగోపాల్రావు గారు :

ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు(మా నాన్నగారు) :



మా నాన్నగారి గురించి నా బ్లాగ్ లో నేను అదివరకూ రాసిన టపాలు చదవనివారికి ఈ లింక్స్:

http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_21.html

http://trishnaventa.blogspot.com/2010/10/2.html

http://trishnaventa.blogspot.com/2010/10/3.html

http://trishnaventa.blogspot.com/2010/10/4_26.html

http://trishnaventa.blogspot.com/2010/10/5.html

http://trishnaventa.blogspot.in/2010/10/6.html

http://trishnaventa.blogspot.com/2010/11/blog-post.html




Tuesday, April 24, 2012

MANGO MELA 2012


మామిడిపళ్ళు పండించటానికి ఎక్కువగా వాడుతున్న "కార్బైడ్" వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతున్నందువల్ల కార్బైడ్ వాడకంపై నిషేధం విధించిన విషయం అందరికీ విదితమే. అందువల్ల ప్రతిఏడూ వేసవిలో ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కనబడే మామిడిపళ్ళు కనబడ్డమే మానేసాయి. హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక మామిడిపళ్ళ మేళా ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన "కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయం" ఈ మేళా లోని ప్రత్యేకత. ఈనెల 1౩ నుంచీ మే నెల పధ్నాలుగు వరకు ఒక నెల పాటు ఈ మామిడిపళ్ల మేళా జరుగుతుందిట.

పేపర్లో చదివి ఈ మేళా ప్రారంభించిన రోజు మేము వెళ్ళాము. అప్పటికి ఇంకా అన్ని ప్రాంతాల నుండీ పళ్ళు రాలేదు. మొదటిరోజు అయినా జనం కూడా బాగా ఉన్నారు. ఆ రోజు వచ్చినపళ్ళు వచ్చినట్లే అయిపోయాయి. కొందరు అక్కడికక్కడే మావిడిపళ్ళు కొనుక్కుని తినేస్తుంటే ఆశ్చర్యం కలిగింది కూడా.






మళ్లీ ఓ వారం తరువాత వెళ్ళాము. కాస్త అన్ని స్టాల్స్ రకరకాల మామిడిపళ్ళతో నిండి ఉన్నాయి. మామిడిపళ్ళ రకాలు కూడా ఎక్కువ కనబడ్డాయి. జిల్లాలవారీగా ఈ ఎగ్జిబిషన్ లో మామిడిపళ్ళ విక్రయం జరుగుతుందిట. ఒక వారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, ఖమ్మం మొదలైన జిల్లాల నుండి పళ్ళు వస్తాయిట. నిన్నటితో ఈ జిల్లాల అమ్మకం అయిపోతుందనుకుంటా.







మాకు బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖ, పంచదారకలస, భూలోకసుందరి(బాగా ఎర్రగా ఉన్న ఈ పళ్ల గురించి వినలేదు నేను..:)), పెద్దరసాలు,చిన్న రసాలు, పచ్చడి కాయలు మొదలైనవి కనబడ్డాయి. పచ్చడి కాయల కోసం మార్కెట్ లోకి ప్రత్యేకం వెళ్ళక్కర్లేదు మళ్ళీ అని అక్కడే పచ్చడి కాయలు కొనేసాను. ఆవకాయకు ముక్కలు కొట్టి ఇస్తున్నారు కూడా.






ఇవాళ్టి నుంచీ పదిరోజులు గుంటూరు, నెల్లూరు, మెదక్,నిజామాబాద్ మొదలైన జిల్లాల నుంచీ, ఆ తర్వాత చివరిలో నల్గొండ, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, నల్గొండ మొదలైన జిల్లాల నుండి వచ్చిన మామిడిపళ్ళ అమ్మకం జరుగుతుందిట. ఇక మేళా లో మొదట్లో ఓ పక్కగా తెర్రెస్ గార్డేన్ లో మొక్కలు ఎలా పెంచవచ్చు, ఏ ఏ రకాలు పెంచవచ్చు చెబుతు కొన్ని మొక్కలు పెట్టారు. విత్తనాలూ, గార్డెనింగ్ పరికరాలు కూడా అమ్మకానికి పెట్టారు. జనాలు చూడటానికి పెంచిన కొన్ని బుజ్జి బుజ్జి మొక్కలు భలే ముద్దుగా ఉన్నాయి. వంకాయ, మిరప, కాకర, క్యాబేజ్, ఇంకా ఆకుకూరల మొక్కలతో పాటుగా మామిడి,అరటి,నిమ్మ మొదలైన పెద్ద పెద్ద చెట్లు టెరెస్స్ పై ఎలా పెంచవచ్చో చూపెట్టారు.



















మేళా లో ఓ పక్క సమోసా,చాట్,టీ లాంటివి ఉన్న స్టాల్, మరోపక్క ఫ్రెష్ ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ కూడా ఉన్నాయి. ఇలాంటిదే ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ జనవరిలో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టారు. మేమూ సీతాఫలం ఐస్క్రీం తిన్నాం. చాలా బాగుంది ఫ్లేవర్.



ఇక్కడ మామిడిపళ్ళ ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. స్టాల్స్ వాళ్ళు ఇస్తున్న ఈ మేళా లోగోతో తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు కూడా బాగున్నాయి. ఈ మ్యాంగో మేళా ఇంకా మరో ఇరవై రోజుల పాటు ఉంటుంది కాబట్టి కార్బైడ్ రహిత మామిడిపళ్ళు కావాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ మామిడి మేళాకి వెళ్ళి కొనుక్కోవచ్చు.


Friday, April 20, 2012

పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి - భానుమతి పాట



మా చిన్నప్పుడు నాన్నగారు రేడియోకి చేసిన కార్యక్రమాలు కొన్ని ఇంట్లో కూడా వింటూ ఉండేవారు. అలా మేము బాగా విన్న కార్యక్రమాల్లో బాగా గురుండిపోయిన పాటలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి "పండంటి సంసారం" చిత్రానికి భానుమతి పాడిన పాట. ఎంతో వేదాంతం నిండిన ఈ పాటను ఆత్రేయ రాసారు. కె.వి.మహాదేవన్ సంగీతం. ఈ సినిమా కథ తెలీదు కానీ, ఆస్తి కోసం భానుమతిని పిచ్చిదని నమ్మించటానికి చూపే సందర్భంలో భానుమతి ఈ పాట పాడుతుంది అని అమ్మ చెప్పిన గుర్తు. చక్కని అర్ధం ఉన్న ఈ పాట విని మీరూ ఆనందించేయండి... 


 పాట: పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి 
 సినిమా: పండంటి సంసారం 
సాహిత్యం: ఆత్రేయ సంగీతం: 
కె.వి.మహదేవన్ 
పాడినది: భానుమతి
 


సాహిత్యం:


చావే ఎరుగని ఇంటినుంచి ఆవాలు తెమ్మన్నాడుట బుద్ధుడు 
అలాగే మచ్చుకు ఏ పిచ్చిలేని ఒక మనిషిని చూపండి ఈనాడు 


ప: పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి 
ఏ పిచ్చీ లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి 
((పిచ్చి)) 

1చ: మనసుంటేనే పిచ్చి, మతి ఉంటేనే పిచ్చి(2) 
మంచితనం అన్నింటిని మించిన పిచ్చి ((పిచ్చి)) 


2చ: వెర్రిమొర్రిగా ప్రేమించడమూ కుర్రవాళ్ల పిచ్చి 
కస్సుబుస్సుమని ఖండించటమూ కన్నవాళ్ళ పిచ్చి 
భక్తి పిచ్చి, ముక్తి పిచ్చి, విరక్తి పిచ్చి, 
పదవుల పిచ్చి, పెదవుల పిచ్చి, మధువుల పిచ్చి... ((పిచ్చి)) 


3చ: చీకటివెలుగులు కష్టసుఖాలు సృష్టించటమే దేవుడి పిచ్చి 
ఆ దేవుడి కోసం దేవులాడటం మనుషుల పిచ్చి ((పిచ్చి)) 


4చ: ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలని పిచ్చి 
వాడ్ని లేనివాడిగా చేయాలని లేనివాడికి పిచ్చి 
ఉన్నది లేదు లేనిది ఉంది అన్నది పిచ్చి 
నేనన్నది పిచ్చని అన్నవారికే ఉన్నది పిచ్చి ((పిచ్చి))



బాపూ ప్రాణం పోసిన "మన్యంరాణి"






పుస్తకాల షాపులో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే ఒకచోట కనబడింది తెల్లని అట్టమీద అందమైన బాపూ బొమ్మ. ఏమిటా అని చూస్తే అది సినీదర్శకుడు వంశీ రాసిన "మన్యంరాణి" నవల. పుస్తకం తెరిచి, లోపల ఉన్న బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో తీసిన ఫోటోల్లోవి. "మన్యంరాణి" నవల ఏదో పత్రికలో సీరియల్ గా వచ్చినట్లు, ఆ తర్వాత పుస్తకంగా రిలీజయినట్లు తెలుసుగానీ ఈ బొమ్మలు ఆ నవల తాలూకూ అని ఆ ఫోటోలని తీసినప్పుడు నాకు తెలీదు. పుస్తకం ఖరీదు చూస్తే 250/- ! కొనాలా వద్దా అని ఆలోచన... కాసేపు మిగతా పుస్తకాలు చూసేసి, కావాల్సినవి కొనేసాకా మళ్ళీ "మన్యంరాణి" దగ్గరకు వెళ్ళా. ఆర్ట్ పేపర్ మీద అందమైన ప్రింట్ తో బాపూ గీసిన అందమైన రంగురంగుల బొమ్మలు.. ప్రతి పేజీకీ సైడ్ బార్(మార్జిన్లా) గీసి అందులో కూడా చిన్న చిన్న బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆఖరుకి కొనేసాను. అంతగా కొనుక్కోవాలనిపించేలా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన అక్షర క్రియేషన్స్ వారు అభినందనీయులు.


గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో నే తీసిన ఈ నవల తాలూకూ ఫోటోలు:










ఇక ఈ నవల కథా కమామిషు ఏంటా అని అంతర్జాలంలో వెతికితే, పుస్తకం.నెట్లో జంపాల గారు రాసిన వ్యాసం , ఈ పుస్తకఆవిష్కరణ సమయంలో వంశీ చెప్పిన మాటలు కనబడ్డాయి. తాను చిన్నప్పటినుండి `తిరిగిన రంపచోడవరం,మారేడుమిల్లి, గోకవరం మొదలైన ప్రాంతాలలో తనకెదురైన అనుభవాలను అక్షరీకరించి మన్యంరాణి నవల రచించినట్లు; రంపచోడవరం దగ్గర ఉన్న తన సొంతఊరు చుట్టుపక్కల పలు ప్రాంతాలలో,ఎన్నో మారుమూల ప్రాంతాలలో, ట్రైబల్‌ ఏరియాలో కూడా తాను తిరిగాననీ, ఆ అడవి చూస్తుంటే...ఈ నవల ఆలోచన కలిగాయి అని వంశీ చెప్పారు.




వంశీ చేసిన ఈ పరిశోధనాత్మక ప్రయాణాల వల్లనే ఈ నవలలో గిరిజనుల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు,నమ్మకాలు మొదలైనవాటి గురించిన మంచి వివరణాత్మక వర్ణన సాధ్యమైంది అనిపించింది. ఈ నవల ద్వారా గిరిజనుల గురించి, ఆయా పల్లెల గురించీ ఎన్నో విషయాలు తెలిసాయి. కథ చదువుతుంటే అడవుల్లో నానాటికీ అంతరించిపోతున్న వృక్షసంపదల గురించి, మాయమౌతున్న అరుదైన పశుపక్ష్యాది జాతుల గురించి రచయిత పడే ఆవేదన స్పష్టంగా కనబడుతుంది. నవలలో చెప్పిన రకరకాల పక్షి జాతులు, ఎన్నో రకాల చెట్లు, పూతీగెలు, వివిధరకాల పళ్ళ గురించిన వివరాలు ఎంతో పరిశోధన చేస్తేనే తెలుస్తాయి. అరుదైన ఇంతటి విషయ సేకరణ చేయటం సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా వంశీ వర్ణించిన అడవి అందాలు కళ్ళకు కట్టినట్లుగా, ఆ ప్రాంతానికి వెళ్ళి చూడాలి అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం వంశీని అభినందించకుండా ఉండలేము.





అయితే, బాపూ గీసిన ఇంత అందమైన చిత్రాలకు సరిపోయే దీటైన కథ కూడా ఉంటే మన్యంరాణి ఒక అద్భుతమైన నవలగా మిగిలిపోయేదే. కానీ కథలో ఎక్కువైన నాటకీయత, చివర్లో అతకలేదనిపించిన ముగింపు కథను తేల్చేసాయి. కథకు ప్రాణంపోసేంతటి అందమైన బొమ్మలను బాపూ గీసినా, వాటికి దీటుగా నిలబడేంతటి గొప్ప కథ నవలలో లేకపోవటం నన్నెంతో నిరాశకు గురిచేసింది. కథలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన అందమైన నాయిక "కొమరం రాజమ్మ"కు ప్రత్యేకమైన వ్యక్తిత్వమేమీ లేకపోవటం, తన అందాన్ని అద్దంలోనో, కొలనులోనో చూసుకోవటం తప్ప కథనంలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. నవలలో నాకు నచ్చిన ఏకైక పాత్ర "కొమరం లచ్చన్న". ఈ లచ్చన్న మావే కథలో హీరో ! అడవితల్లిపై ఆ ముసలిగిరిజనుడికి ఉన్న ప్రేమాభిమానాలు, వన సంపదను రక్షించాలనే అతని తాపత్రయం, తోటి గిరిజనులకు అతను అందించే ఉచిత వైద్యసేవ అతడిని గుర్తుంచుకునేలా చేస్తాయి. ఇంతకు మించి కథలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.






పేజీల్లో మధ్య మధ్య ముఖ్యమైన సన్నివేసాలకు బాపు వేసిన అద్భుతమైన బొమ్మలే ఈ నవలకి ప్రాణం పోశాయి. ఆ బొమ్మలే నేనీ పుస్తకం కొనుక్కునేలా చేసాయి. ఇంతటి పరిశోధన జరిపాకా తనకు లభించిన సమాచారాన్ని ఇలా నవలలా కాకుండా, గిరిజనుల జీవనాన్ని గురించిన ఒక సమాచారాత్మక పుస్తకంగా వంశీ రాసి ఉంటే ఎంతో బాగుండేది. ఆయన సేకరించిన వివరాలకు సాహిత్యంలో సుస్థిర స్థానం దొరికిఉండేది అనిపించింది నాకైతే..!