సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label అంజలి... Show all posts
Showing posts with label అంజలి... Show all posts

Monday, July 24, 2023

A Great Litterateur.. శ్రీ రమణగారు!



మన తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాన్ని తమ అక్షరాలతో, సినిమాలతో, పాటలతో, గాత్రాలతో వెలుగులద్ది, భాషను పదింతలు అందంగా మార్చి, వైభవాన్ని పెంచిన మహామహులందరూ గత కొన్నేళ్లుగా స్వర్గానికి నిచ్చెన వేసుకుని అక్కడే సమావేశమవుతూ వచ్చారు. అంతవరకూ బానేఉంది. కానీ వారి సాంగత్యాలు సంపూర్ణమవ్వలేదనో ఏమో, మిగిలిన అతి కొద్దిపాటి హేమాహేమీలను కూడా తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. ఇటీవలి వాణి జయరాం గారి నిష్క్రమణ నుంచి తేరుకోక ముందే... నిన్న మొన్నటి శ్రీ రమణగారూ...! ఏమంత వయసైపోయిందని సార్ అంత తొందరపడ్డారు...ఇంకొన్నాళ్ళు ఉంటే మన భాషకు మరింత వైభవాన్ని పెంచేవారు కదా! తెలుగు భాషపై మీకున్న మమకారం, ప్రేమాభిమానాలు, దాని మనుగడ కోసమూ, వ్యాప్తి కోసమూ మీరు చేసిన కృషి.. ఎంతో హర్షనీయం. 

                                

బాపూ గారిని, రమణ గారినీ తలిచినప్పుడల్లా ఠక్కున వెంఠనే గుర్తొచ్చే మరొక వ్యక్తి శ్రీ రమణగారు. నాకు శ్రీరమణ గారంటే ఎంతో గౌరవం, చెప్పలేనంత అభిమానం! సాహిత్యపరంగా నాకు శ్రీ రమణగారు పరిచయం అయ్యింది వెండితెర నవలల ద్వారా. చిన్నప్పుడు మా ఇంట్లో బాపూగారి సినిమాల వెండితెర నవలలు ఉండేవి. ముత్యాల ముగ్గు, వంశ వృక్షం, రాధా కల్యాణం, గోరంత దీపం మొదలైన  వెండితెర నవలలన్నింటికీ నవలీకరణ శ్రీ రమణ గారే చేశారు. ఒక్క బాపూగారి సినిమాలకు మాత్రమే ఇలా నవలీకరణ చేసారేమో ఆయన తెలీదు మరి. కానీ మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఎంతో ఆసక్తికరంగా ఉండేవి అందులోని డైలాగులూ, మాటలూ అవీ.

                                   

ఆయన రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చాకే చాలావరకూ చదివాను కానీ ఒక  కథ మాత్రం విజయవాడలో ఉన్నప్పుడే చదివాను. ఆ ఒక్క కథకే మా ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోయాం! ఒకరోజు నాన్న ఆఫీసు నుంచి ఎవరో ఇచ్చారని A4సైజు పేపర్లలో ఉన్న ఒక కథ జిరాక్స్ చేయించి తెచ్చారు. అందరినీ కూర్చోపెట్టి చదివి వినిపించారు. సైలెంట్గా మొత్తం వినేసాం. ఎంత బావుందో..ఎంత బావుందో అనుకుంటూ. అదే "బంగారు మురుగు" కథ. కథలో బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రాలు -

* "నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం" 

* "మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం...పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం. ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, నాకు తెలిసిందివే" బాగా గుర్తుండిపోయాయి. 

అదో అద్భుతమైన కథ! "పచ్చటి గొడుగు పాతేసినట్లు ఉన్న బాదం చెట్టు" గురించి చదువుతూంటే కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు.. భాస్కరమ్మగారి ఇంట్లో  ఉండేప్పుడు మా దొడ్లో పొద్దున్నే కాకులు బాదంకాయలు పడేసి వెళ్తూ ఉండేవి. అమ్మ మాకు ఆ కాయలు కొట్టి బాదం పప్పులు పెట్టేది. పప్పు విరగకుండా బాదం కాయలు కొట్టుకోవడం బాగా ప్రాక్టీస్ అయ్యింది మా పిల్లలకు. ఇప్పుడు మా సొసైటీలో కూడా మేం వచ్చిన కొత్తల్లో ఎవరో వేసిన రెండు బాదం చెట్లు పెద్ద పెద్ద వృక్షాలై రోజూ బోలెడు కాయలు, ఆకులూ రాలుస్తూ ఉంటాయి. ఆ చెట్ల కోసం నేను రోజూ వాకింగ్ కి అటువైపే వెళ్తూ ఉంటాను. ఆ రకంగా నాకు బంగారు మురుగు కథ గుర్తుకు రాని రోజే లేదు.


కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా నాన్న నవోదయాలో ఒక పుస్తకం కొని తెచ్చారు - "మిథునం". అందులో ’బంగారు మురుగు’ తో సహా ఏడెనిమిది కథలు ఉన్నాయి. అన్నింటిలోకీ చివరిదైన "మిథునం" కథ మరొక అద్భుతం. బాపూ గారి మిథునం దస్తూరీ తిలకం  చాలు ఈ కథ గొప్పతనం కొలవడానికి. అదొక masterpiece అంతే! 

మిథునం లోని జీవిత సత్యం -

"...దానికో లెఖ్ఖ ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు.మనం పుట్టగానె..వీడికి ఇన్ని...దీనికి యిన్ని అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు.వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది! మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి. ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం"

అనామకంగా మిగిలిపోయే ఏభైలూ, వందలూ కథలు రాయక్కర్లేదు, ఏ రచయితకైనా ఇటువంటి ఒక్క కథ చాలు... జన్మ సార్థకం అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క కథా చాలు కథారచయితల జాబితాలో మొదటి అంకె దగ్గర శ్రీ రమణగారిని నిలబెట్టడానికి. ఈ రెండు కథలు నాకు ఎప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన కథలు. భరణిగారు మిథునం సినిమా తీసినట్లు , బంగారు మురుగు ని కూడా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ గా అయినా తీస్తే బావుంటుంది.


నాన్న రేడియోలో రిటైర్ అయ్యి ఇన్నేళ్ళైనా, ఓపిక ఉన్నా లేకున్నా, వేరే ఏ పనిలో ఉన్నా కూడా, రోజూ క్రమం తప్పకుండా వందేమాతరం నుంచీ జైహింద్ దాకా రేడియో వినడం ఆయన ఇప్పటికీ  ఇష్టంతో చేసే పని. ప్రొద్దుటి ప్రసారవిశేషాలలో విన్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని కేసెట్ లో రికార్డ్ చెయ్యడం, ఆ తర్వాత వాటిని సీడీ లోకో, పెన్ డ్రైవ్ లోకో మార్పించి అవి చదివిన వారికో, ఫలానా కార్యక్రమాన్ని సమర్పించినవారికో వాటిని అందించడం కూడా ఆయనకో హాబీ. అలా క్రితం ఏడాది శ్రీరమణగారివి కొన్ని టాక్స్ రేడియోలో ఓ సిరీస్ లో ప్రసారమయ్యాయి. ఎప్పటిలానే నాన్న వాటిని రికార్డ్ చేసారు. చేశాకా వాటిని సీడీగా మార్పించారు. అది అందించడానికి శ్రీ రమణగారికి ఫోన్ చేశారు. ఆయన ఎంతో బాగా మాట్లాడారుట. నాన్నకు ’చాలా సంతోషం, మీరు తెలుసు.. ’ అని చెప్పి, విజయవాడ రోజులు, కాళేశ్వర్రావు మార్కెట్లో కూరలు కొనుక్కోవడం నుంచీ ఎన్నో విజయవాడ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట.  "సిడి తీసుకోవడానికి వస్తాను. అడ్రస్ చెప్పండి" అన్నారట. "అయ్యో భలేవారే. వద్దు. మీ అడ్రస్ చెప్పండి చాలు కొరియర్ చేస్తానని" అడిగి, నాన్న లోకల్ కొరియర్ లో ఆయనకు సిడి పంపించారు. అందాకా అందినట్లు ఆయనే ఫోన్ చేసి చెప్పారట కూడా. చాలా తక్కువ నిడివి గల ఆ రేడియో టాక్స్ బ్లాగ్ లో టపా రాస్తే అందులో పొందుపరచమని నాన్న మొన్న ఈ విషాద వార్త తెలిసిన రోజున అడిగారు. వాటిని తెప్పించుకున్నాను కానీ అతిపెద్ద బ్లాగ్ విరామం వల్ల ఆడియో ఫైల్ ను బ్లాగ్లో ఎలా పెట్టాలో మర్చిపోయాను. ఎలానో గూగిలించి, తెలుసుకుని ఇప్పుడు పెడుతున్నాను.


audio file 1


audio file 2





audio file 3





అనుకోకుండా నిన్న నాకు మరొక ఆణిముత్యం లాంటి వీడియో దొరికింది. గొల్లపూడిగారు శ్రీ రమణగారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఇందులో మిథునం కథ గురించి నేను రమణగారిని అడగాలి అనుకుంతూ ఉండే ప్రశ్నలు గొల్లపూడిగారే అడిగేసారు. అది కూడా చూడండి -




తెలుగు భాష మనుగడకు తోడ్పడిన ఇటువంటి భాషాభిమానులు చాలా చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, దీని గురించి ఎవరు రాస్తారు? అనుకుంటే.. శ్రీ రమణగారు రాయగలరు.. ఆయన ఉన్నారు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మరి ఆయన గొప్పతనాన్ని గురించో, మరేదైనా ముఖ్య విషయాన్ని గురించో రాయడానికి ఎవరున్నారా అని వేళ్ల మీద లెఖ్ఖపెట్టుక్కునే పరిస్థితి! ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తునే ఉంటుంది కాబట్టి భవిష్యత్తుపై ఆశావహ దృక్ఫథంతో  చూస్తూండడమే. ఏదేమైనా శ్రీరమణగారు లేని లోటు పూడ్చలేనిది. Telugu people have lost a great Litterateur! ఆయనకు నా నమస్సుమాంజలి.
స్వర్గంలో మాత్రం దర్బారు నిండుగా ఉందిప్పుడు!!


Sunday, September 27, 2020

"నువ్వు లేవు నీ పాట ఉంది"




"ఇప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది 

నా లోపల లోపల 

ఆరిన కుంపటిలో రగులుతున్న 

ఒకే ఒక స్మృత్యాగ్నికణంలాగ"

 He has left a vacuum that can never be filled by any other voice!! తెలుగు భాష మాత్రమే కాదు, సినీ సంగీతం బ్రతికి ఉన్నంతవరకూ బాలూ గళం ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటుంది. ఆచంద్రార్కము, అమరం అనే పదాలకు బాలూ గళమే సరైన ఉదాహరణ అనిపిస్తోంది ఇవాళ.


తెలుగు పాట కాకపోయినా ఈ తమిళగీతం నాకు ఎంతో ఇష్టమైనది -


"నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించనివేళ

నే కూరుకుపోతున్న చేతకానితనపు వానాకాలపు బురద మధ్య

నీ పాట ఒక్కటే నిజంలాగ 

నిర్మలమైన గాలిలాగ 

నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ

ఇంటి ముందు జూకామల్లెతీగలో అల్లుకుని 

లాంతరు వెలుతుర్లో క్రమ్ముకొని 

నా గుండెల్లో చుట్టుకుని 

గాలిలో ఆకాశంలో

నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని 

నీరవంగా నిజంగా ఉంది

జాలీగా హాయిగా వినబడుతూ ఉంది"


గత రెండు రోజులుగా రేడియోలో రకరకాల ఛానల్స్ లో వినిపిస్తున్న బాలూ పాటలు వింటూంటే నాకు పదే పదే ఈ పైన రాసిన కవితా వాక్యాలు గుర్తుకువస్తున్నాయి. ఒకటా రెండా? ఇది, అది అని ఏ పాటను ప్రత్యేకించి చెప్పాలో తెలియటంలేదు. చిన్నప్పుడు రేడియోలో విన్న"సిరిమల్లె నీవే" నుంచీ ఇటీవలి ’శతమానం భవతి’ లోని "నిలువదే మది నిలువదే" పాట వరకూ ఉదహరించ వీలుకాని వేలకొద్దీ ఎన్నో గొప్ప పాటలు!! దేశం యావత్తూ మత్తెక్కినట్లు ఊగిపోయిన శిఖరాగ్రంలోని "శంకరాభరణం" పాటలు ఓ పక్కన పెడితే; "బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది" అని కాలేజీ పిల్లలందరూ పాడుకున్నా, "ఓలమ్మీ తిక్కరేగిందా" అని యువత ఉర్రూతలూగినా, "ప్రేమా ప్రేమా.." అంటూ ప్రేమికులు పాడుకున్నా, పదాలు ఉదహరించలేని కొన్ని ప్రత్యేకమైన శృంగారగీతాలు మత్తెక్కించినా, "ఆనాటి ఆ స్నేహమానందగీతం" అని నడివయస్సు వాళ్ళు పాడుకున్నా, "అంతర్యామీ అలసితి సొలసితి" అని వయసుమీరినవారు స్వగతాలుగా పాడుకున్నా, ఆ గొప్పతనం ఆ పాటల సాహిత్యానిది మాత్రమే కాదు, ఆ సాహిత్యాన్ని మన మనసుకు హత్తుకునేలా వినిపించిన బాలూగళానిది కూడా! రిక్షా నడిపే శ్రామికుడి మొదలు ఖరీదైన గదుల్లో రిలాక్సయ్యే ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ నిత్యం విని ఆస్వాదించే ఆ మధురగళం బాలూని అందరివాడిగా మార్చేసింది. He is not just a singer, He is Family! అదీ మన తెలుగువారింట మాత్రమే కాదు, తను పాడిన ప్రతి పాటనూ పలికేవారందరికీ బాలూ ఒక కుటుంబసభ్యుడు. అందుకే ఇవాళ తను లేని లోటు అందరినీ బాగా దిగులుపెడుతోంది.


’కరోనా తనని తీసుకుపోయింది ’, ’ఫలానావారిది తప్పు’ అంటూ ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నా, నాకు మాత్రం ఒక్కటే అనిపిస్తోంది - ఇవన్నీ just reasons. Death has to have a reason. It finds its way in any of the directions. "మృత్యుదేవత నేరం తన మీద పెట్టుకోదమ్మా.. ఏదో ఒక వ్యాధి రూపంలో వచ్చి, నేరాన్ని దాని పైకి నెట్టేస్తుంది" అంటూ ఉండేది మా తాతమ్మ. ఘనమైన, వైభవోపేతమైన కళాజీవితం, చివరలో ఓ నెల రోజుల అనారోగ్యం ఆయన destinyలో ఉన్నాయన్నమాట అనిపించింది.


ఆమధ్యన ఒకరు మీ ఫేవొరేట్ సింగర్ ఎవరు అని అడిగితే "హరిహరన్" అని చెప్పాను. మరి మీకు? అని అడిగితే, "ఇంకెవరూ.. బాలూ! నవరసాలనూ అంత బాగా పలికించగల మరో గళం నాకు కనబడదు" అన్నారు ఆవిడ. తర్వాత చాలా సేపు ఆలోచించాను - నిజమే కదా ఎప్పుడూ ఆ కోణంలోంచి చూడలేదు.. ఏ పాట విన్నా ఆ హీరోకో, ఆ సందర్భానికో అతికినట్టు పాడడం ఒక్క బాలూకే సొంతం. తన ప్రతి పాటా తను పాడినట్లు మరొకరు ఎప్పటికీ పాడలేరు అన్నది నూరుశాతం సత్యం. మనసు గదిలో ముందువరుసలో హరిహరన్ నిలబడినా, లోపల్లోపల నాకూ బాలూ అంటే ప్రేమ ఉంది అని అప్పుడు అనిపించింది. బహుశా అందుకేనేమో ఆ రోజు రాత్రి ఫోన్ అప్డేట్స్ లో కమల్ హాసన్ బాలూను చూసి వెళ్లారుట అన్న వార్త చదివినప్పటి నుండీ మనసులో ఏదో దిగులు, సన్నని బాధ నిదురపోనివ్వలేదు. వినకూడదనుకున్న వార్త వినాల్సివచ్చిన రెండు రోజుల తర్వాత ఇప్పటికి ఈ వాక్యాలు రాయగలుగుతున్నాను. 


నాన్న స్నేహితుడైన మూర్తిబాబయ్య (సంగీత దర్శకుడు ఈ.ఎస్.మూర్తి) ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర పనిచెయ్యని క్రితం మొదట్లో కొన్నేళ్ళు బాలూ గారి దగ్గర కూడా ఉన్నారు. అందువల్ల వారి సాన్నిహిత్యం ఎంతో అపురూపమైనది. దూరంగా ఉండే మనలాంటివారికే ఇంత బాధ ఉంటే, కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి, కలిసి పనిచేసినవారికి ఎంత బాధగా ఉంటుంది? నాన్న పలకరిస్తే, "జీవితంలో ఇంత శూన్యంగా ఎప్పుడూ లేదండీ" అన్నారట తను. బాలూ స్వగృహంలో వాళ్ళు కలిసినప్పుడు తీసుకున్న ఈ చిత్రాన్ని షేర్ చేసి, నేను వ్యాసంలో ప్రచురించడానికి అనుమతి ఇచ్చినందుకు బ్లాగ్ముఖంగా మూర్తిబాబయ్యకు ధన్యవాదాలు.



ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో నాన్న పనిచేసినప్పుడు, 1971లో బాలూగారిని నాన్న ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం -



చిన్నప్పటి నుండీ ఎరిగి, మా తెలుగువాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకునే మహామహులంతా ఒక్కొక్కరే మాయమైపోతున్నారు. వేటూరి, బాపూ, రమణ, బాలమురళీకృష్ణ, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం!! ఇలా మన తెలుగుభాషని జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టినవారంతా వెళ్ళిపోతుంటే, ముందుముందు మన తెలుగుతనపు ఘనతని చరిత్రలోనే చదువుకోవాలేమో అనిపిస్తోంది :( 


***                   ***              ***

బాలూ గురించి జానకమ్మ గారి ఆప్యాయమైన మాటలు -



-----------------------------------

** (వ్యాసంలోని కవితా వాక్యాలు దేవరకొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి"లోని "నువ్వు లేవు నీ పాట ఉంది" కవిత నుండి)





Thursday, April 30, 2020

Remembering Irfhan..




చిన్నప్పుడు టీవీ తో ఉన్న గాఢమైన అనుబంధం వల్ల ఆనాటి నటీనటులు, ఆనాటి సీరియల్స్, ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఆ అనుబంధం వల్లే ఆనటి నటీనటుల పట్ల కూడా అభిమానం నిలిచిపోయింది. హిందీ ఛానల్స్ మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎందరో గొప్ప నటులు ఉండేవారు. వారిలో అతికొద్ది మందికే వెండితెరపై వెలిగే అవకాశం దక్కింది.  వారందరిలోకీ ఒక విలక్షణ నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు  ఇర్ఫాన్ ఖాన్! 

ఇర్ఫాన్ ఖాన్ పేరు వినగానే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది "బనేగీ అప్నీ బాత్(Banegi Apni Baat)" అనే టివీ సీరియల్. Madhavan, shefali chaya, Irfhan khan మొదలైన నటులను నాకు పరిచయం చేసిన ఆ సీరియల్ ఎంతో బావుండేది. కథ, కథనం, నటీనటుల అద్భుతమైన అభినయం అన్నీ బావుండేవి. కాలేజీ రోజుల్లో అస్సలు మిస్సవకుండా చూసేవాళ్లం.. నేను, నా స్నేహితురాళ్ళూ. అప్పట్లో ఇర్ఫాన్ ని ఇంకా మరెన్నో సీరియల్స్ లో చూసేదాన్ని. నాకు బాగా గుర్తున్నవి - 'చంద్రకాంత', 'చాణక్య', 'శ్రీకాంత్', 'స్పర్ష్'  సీరియల్స్. మంచి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకునేవాడు ఇర్ఫాన్. మంచి పాత్రలను ఎంత బాగా చేసేవాడో, నెగెటివ్ రోల్స్ లో కూడా అంతే బాగా నటించడం అతడి ప్రత్యేకత. అందుకేనేమో అంతమంది టీవీ ఆర్టిస్టుల్లో బాగా గుర్తుండిపోయాడు. 

సినిమాల్లో అవకాశాలు లేటుగా వచ్చినా అదృష్టవశాత్తూ మంచి memorable roles లభించాయి ఇతనికి. తను నటించిన సినిమాల్లో నేను చూసినవి చాలా తక్కువే. తపన్ సిన్హా తీసిన "ఏక్ డాక్టర్ కీ మౌత్", విశాల్ భరద్వాజ్ తీసిన "మక్బూల్", తెలుగులో విలన్ గా నటించిన "సైనికుడు", Salaam bombay, Slumdog millionaire,  New york, New york, I love you, Life in a - Metro, Life of Pi,  The lunch box, Piku మొదలైనవి గుర్తున్నాయి. అన్నింటిలోనూ Piku బాగా గుర్తుంది. ముఖ్యంగా చిత్రంలో వంద శాతం మార్కులు అమితాబ్ నటనకే అయినా, దీపిక తో పాటూ అంతే దీటుగా నటించిన ఇర్ఫాన్  పాత్ర కూడా గుర్తుండిపోయింది.

తన కృషికీ, కష్టానికీ ఫలితంగా పద్మశ్రీ పురస్కారాన్ని సగర్వంగా అందుకోగలగడం ఒకవిధంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ప్రతిభ ఉండి, ఎంతో కళాసేవ చేసిన ఎందరో మహానుభావులు, కళాకారులు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వెళ్పోయారు. ఇర్ఫాన్ ఇక లేడన్న వార్త చదవగానే బాధతో పాటూ ఒక నిట్టూర్పూ... ఇతని ఆయుష్షు సంగతి తెలిసేనేమో భగవంతుడు పిన్న వయసులోనే ఆ పురస్కారాన్ని ఇర్ఫాన్ కి అందించేశాడనిపించింది.

హాస్పటల్ లో తన అభిమానుల కోసం రికార్డ్ చేసిన తన చివరి సందేశం గురించి చదివి మనసు ఎంతో ఆర్ద్రమైంది..! చివరి క్షాణాలని ఎదుర్కోవడానికి కూడా ఎంతో bravery ఉండాలి. 
అవే చివరి క్షణాలు అని తెలియకుండా వెళ్పోయేవారు దురదృష్టవంతులే కానీ అవే చివరి క్షణాలు అని తెలిసాకా చెప్పే మాటల్లో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈమధ్యన near death experiences గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాను. 

హ్మ్!! ఏదేమైనా ఇర్ఫాన్ ఆత్మకి శాంతి కలుగుగాక! 
ఈ సందర్భంలో H.W.long fellow పద్యంలోని 
నాలుగు వాక్యాలు ...
  
"Lives of great men all remind us
 We can make our lives sublime,
And, departing, leave behind us
Footprints on the sands of time"

Thursday, November 28, 2019

రామ్ గారు !!



బ్లాగ్ మొదలెట్టిన ఏడాది తర్వాతేమో నాన్న గురించి సిరీస్ రాసిన తర్వాత ఒకరోజు ఒక కామెంట్ వచ్చింది. కాకినాడలో మీ అన్నయ్యగారి ఫ్రెండ్ ని. నేను ఫలానా. మీ అన్నయ్య మెయిల్ ఐడీ ఇవ్వగలరా? అని. అలా మొదలైన ఒక చిన్న పరిచయం స్నేహశీలత నిండిన ఒక ఆత్మీయ పరిచయంగా మారింది. పరిచయానికీ, స్నేహానికీ మధ్యన ఎక్కడో ఉండే ఒక మధ్య మెట్టులోనే ఆ పరిచయం ఉండేది. అయితే, ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగే రెండు వాక్యాల పలకరింపుల్లో కూడా ఎంతో స్నేహశీలత, ఆప్యాయత తొంగిచూసేవి. సద్భావన, సచ్ఛీలత, సహృదయత నిండుగా మూర్తీభవించిన మనిషి రామ్ గారు. సుప్రసిధ్ధ రచయిత, ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత శ్రీ ఎం.వీ.ఎల్ గారి అబ్బాయి శ్రీ ఎమ్.వీ.ఎస్.రామ్ ప్రసాద్ గారు. ఇది ఆయన బ్లాగ్ లింక్ -
http://mvl-yuvajyothi.blogspot.com/

దాదాపు నేను రెగులర్ గా బ్లాగ్ రాసినన్నాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. చివర చివరలో ఆఫీసు పని వత్తిడులలో చాలా బిజీ అయిపోయారు ఆయన. నేనూ బ్లాగ్ మూసేసాకా అసలు ముఖ పుస్తకం, బ్లాగులు, బ్లాగిళ్ళు...వేటి వంకా కన్నెత్తయినా చూడని కారణంగా గత ఐదేళ్ళుగా అసలు ఏ పలకరింపులూ లేవు. ఆ స్నేహపరిచయం అలా ఆగిపోయింది. 2017 చివర్లో ఎం.వీ.ఎల్ గారి రచనల పుస్తకావిష్కరణ జరిగిందని, మొదటి పేజీలో కృతజ్ఞతలలో మీ పేరు కూడా ఉందని ఆ పేజీ కాపీ పంపించారు. ధన్యవాదాలు తెలిపాను. అదే చివరి ఈ-మెయిల్. 

ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మాత్రం నాన్నగారింట్లో రామ్ గారూ, అన్నయ్య, నేనూ, మా వారూ అంతా కలిసాము. వారం రోజుల క్రితం అన్నయ్య నుంచి వచ్చిన మెసేజ్ చదివి దిగ్భ్రాంతి చెందాను. రామ్ గారి హఠాన్మరణం గురించి!!! ఎంతో దారుణమైన వార్త! నమ్మశక్యం కాని ఆ వార్తను జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇవాళ పొద్దున్నకి ఆయన భౌతికశరీరం ఇండియా వస్తుందని, ఎయిర్పోర్ట్ కి వెళ్తానని అన్నయ్య రాత్రి చెప్పాడు. బహుశా ఈ సమయానికి ఆయన సొంతఊరైన నూజివీడు లో అంతిమకార్యక్రమాలు జరుగుతూ ఉండిఉంటాయి. ఆ ఊరంటే ఎంతో ప్రేమ రామ్ గారికి. కనీసం ఈరకంగా అయినా ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. 

వాళ్ల నాన్నగారి రచనలను వెతికి, వాటిని ప్రచురణ వరకు తీసుకువెళ్లడమే భగవంతుడు ఆయనకు కేటాయించిన ముఖ్యమైన పనేమో! ఆ రకంగా బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఎంతో ప్రతిభ ఉన్న ఒక మంచి మనిషి ఇలా అర్థాంతరంగా వెళ్పోవడం చాలా బాధాకరం. ఆయన ప్రతి మాట, ప్రతి అక్షరం ఎంతో మాజికల్ గా ఉండేవి. ఆయన శ్రధ్ధ పెట్టలేదు కానీ ఎంతో గొప్ప కవి లేదా రచయిత అయి ఉండేవారు రచనా ప్రపంచంలోకి గనుక వచ్చి ఉంటే!  అక్షరాలతో మేజికల్ గా పదాలల్లడంలో ఆయనకు ఆయనే సాటి. రామ్ గారు పండుగలకు శుభాకాంక్షలు తెలుపడం కూడా గమ్మత్తుగా ఉండేది. తెల్ల కాగితంపై అందమైన చేతి వ్రాత తో, ఏ పండగ అయితే ఆ పండుగకు సంబంధించిన పదాలతో అల్లిన ఒక అద్భుతమైన కవిత పి.డి.ఎఫ్ రూపంలో ఈమయిల్ కు అటాచ్ అయి వచ్చేది. అందులో పన్లు,సెటైర్ లు, ప్రాసలూ అనేకం కలగలిపి ఉండేవి. ఈకాలంలో అటువంటి ప్రజ్ఞాశాలిని అరుదుగా చూస్తాము. It's a great loss. I express my deepest condolences to his family.

క్రితం వారం కలిసినప్పుడు అన్నయ్య, రామ్ గారితో తన మొదటి పరిచయం గురించి చెప్పాడు. కాకినాడలో ఓ పాటల పొటీకి వెళ్ళారుట. రామ్ గారు "బ్రోచేవారెవరురా" పాడితే, అన్నయ్య "ఊహా పథాలలో..." అనే లైట్ మ్యూజిక్ సాంగ్ పాడాడుట. "లిరిక్ చాలా బావుంది.. మీరెవరు?" అంటూ వచ్చి పరిచయం చేసుకున్నారుట రామ్ గారు. ఇంజినీరింగ్ కాలేజీలో రామ్ గారు తనకు సీనియర్ అని అప్పుడు తెలిసిందిట. 

కొన్ని పరిచయాలకి పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు కానీ మనసులో ఆ పరిచయానికి ఓ పేరు ఎప్పుడూ ఉంటుంది. రామ్ గారు అనగానే ఆప్యాయంగా పలకరించే ఓ పెద్దన్నయ్య అనిపించేవారు నాకు. బ్లాగింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎన్నో సలహాలు, సూచనలు అందించేవారు. బ్లాగులో ఫీడ్జిట్ కౌంటర్ ఇస్టాల్ చేసుకోమని ఎన్నో సార్లు చెప్పారు. లింక్ కూడా మెయిల్ చేశారు. అప్పట్లో ఎందుకో అది ఇన్స్టాల్ చేయడం సరిగ్గా తెలియలేదు నాకు. ఇందాకా ప్రయత్నించాను కానీ పనిచేయట్లేదు. వేరే ఏదైనా తప్పకుండా ఇన్స్టాల్
చేయడానికి ఇప్పుడన్నా ఆయన కోరిక మేరకు ప్రయత్నిస్తాను. 

రామ్ గారూ! మీరు ఎప్పుడూ చెప్పేవారు కదా.. రాస్తూనే ఉండమని! తప్పకుండా గుర్తుంచుకుంటానండీ! మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
సెలవు...

Thursday, September 26, 2019

"జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి" దిగిపోయారుగా!!



రెండేళ్ల క్రితం అనుకుంటా అనుకోకుండా మీ రేడియో టాక్ ఒకటి విన్నాను. మీరు ఎలా రాయటం మొదలుపెట్టారు దగ్గర నుంచీ రచనలు ఎలా చెయ్యాలి మొదలైన విషయాలు టూకీగా పది నిమిషాల్లో చెప్పేసారు. ఒక కన్యాశుల్కం, ఒక బారిస్టర్ పార్వతీశం, ఒక బుడుగు, ఒక మిథునం, ఇల్లేరమ్మ కతలు! అలా గుర్తుండిపోతాయి. అంతే!

Satirical Comedy రాయడంలో మీకు మీరే సాటి. ఆలస్యంగా మొదలుపెట్టినా అతి కొద్ది రచనలతోనే తెలుగు పాఠకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించేసుకున్నారు. Your works will live long సుశీల గారూ. నిండైన జీవితాన్ని చూశారు. ధన్యులు.


సాయంత్రం ఎవరో చెప్తే నమ్మలేదు.. నిజం కాదేమో అనుకున్నాను. కానీ రెండో మెసేజ్ వచ్చేసరికీ నమ్మక తప్పలేదు. చెప్పింది చెప్పినట్లు చెయ్యడం మీకు చిన్నప్పటి నుండీ అలవాటే కదండీ! "జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమే" అని ఎంత తేలికగా చెప్పారు ! అలా అన్నట్టుగానే హటాత్తుగా దిగిపోయారు కూడా :((
చాలా రోజుల క్రితం ఫార్వార్డ్ లో వచ్చింది మీ "ప్రయాణం"! ఎంతగానో నచ్చేసి దాచుకున్నాను.. ఇవాళ ఇలా మీరెళ్ళిపోయాకా ఇక్కడ పోస్ట్ చేస్తానని అనుకోలేదు.



ప్రయాణం                     
-- డా. సోమరాజు సుశీల


పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా?
అప్పుడే వచ్చేసిందా?
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసిమురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!

ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!

నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !

అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, 'మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !

అయినా ఏం లోటయిందని ?వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!

ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….
ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !

ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?

పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు… గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…ఎంత హాయిగా వుందో!
ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!
సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!

ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ .. మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!
అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !

ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
 కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.

అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! 

చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.

అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!

***    ****

మీ పుస్తకం - ముగ్గురు కొలంబస్ లు  గురించి నాలుగు మాటలు..

Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )

Sunday, May 19, 2019

తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే రాళ్లపల్లి !


రాళ్లపల్లి అనగానే -
"దర్శకరత్న దాసరి నారాయణరావ్ పక్కన్నేను
నటశేఖర కృష్ణ పక్కన్నేను
నూతన్ పెసాదు పక్కన్నేను
జయప్రద పక్కన్నేను
శరత్ బాబు పక్కన్నేను
రాళ్లపల్లి పక్కన్నేను" అనే డైలాగ్ ఠక్కున గుర్తుకొస్తుంది.
లేడీస్ టైలర్ సినిమాలో 'అడ్డతీగల హనుమంతు' అనే కోయదొర వేషం చిన్నదే అయినా, కథానాయకుడు రాజేంద్రప్రసాద్ కు జోస్యం చెప్పి, అప్పటి నుంచీ మొదలయ్యే మొత్తం కథంతటికీ మూలకారణమవుతాడు. 




కొన్ని దశాబ్దాల పాటు వెండితెరపై రకరకాల పాత్రలను అవలీలగా పోషించి, ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న కళాకారుడు రాళ్ళపల్లి. రాళ్లపల్లి వెంకట నరసింహారావు ది ఒక పెక్యూలియర్ వాయిస్. అదే ఆయన ప్లస్ పాయింట్. పేరు పెద్దగా ఉందని ఒక దర్శకుడు రాళ్లపల్లి అని వేయించారుట టైటిల్స్ లో. అలా ఇంటిపేరుతోనే ప్రసిధ్ధులైపోయారు ఆయన. ఎనిమిదివందలకు పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి సినీపాత్రల వైవిధ్యాల గురించి చెప్పడం నాలాంటి సాధారణ మానవులకు సాధ్యం కాని పని. కానీ ఒక ఇష్టమైన కళాకారుడి గురించి, నాకు గుర్తున్నంత వరకూ, నేను చూసిన చిత్రాలలో ఆయన నటించిన కొన్ని పాత్రలను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాను. 

ఒక నటుడు తన అసలు పేరుతో కాక పోషించిన పాత్రల పేరుతో గుర్తుండిపోయినప్పుడు అసలైన కళాకారుడిగా గుర్తింపబడతాడు. అటువంటి విలక్షణ నటుడు రాళ్లపల్లి. లేడీస్ టైలర్ లో కోయదొర తర్వాత నాకు గుర్తుకొచ్చేది "రెండు రెళ్ళు ఆరు"లో తికమక. ఈ సినిమాలో ఒకే వాక్యాన్ని ఐదారు రకాల భాషల్లోకీ తర్జుమా చేసి చెప్పే చిత్రమైన పాత్రను రాళ్లపల్లికి ఇచ్చారు జంధ్యాల.  పేరు "తికమక". అర్థం ఏమిటని అడిగితే - "అన్నిభాషల్లోనూ!" అంటాడు. "తెలుగు కి ’తి ’, కన్నడానికి ’క ’, మరాఠీ కి ’మ ’, కొంకిణీ కి ’క ’ కలిపి అలా పెట్టుకున్నాను. మిలిటరీలో వంటవాడు గా పనిచేసినప్పుడు అన్ని భాషలూ మాట్లాడే సైనికులతో మాట్లాడడానికి దాదాపు పధ్నాలుగు భారతీయ భాషలు నేర్చుకున్నాను" అని చెప్తాడు. 



ఆ తర్వాత "శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సిన్మాలో సిలోన్ సుబ్బారావు బావ!! ఆ సినిమా చూసినప్పుడల్లా, పట్టు పద్మిని పాత్ర "మా సిలోన్ సుబ్బారావు బావ.." అని అన్నప్పుడల్లా ఘొల్లున నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ "టేకిట్ ఈజీ.." అని చెప్తూంటారు కానీ అలాంటి ఈజీ పాత్రని ఎప్పుడో సృష్టించారు వంశీ. ఎవరెంత వేళాకోళంగా మాట్లాడినా ఏ మాత్రం తొణక్కుండా, తడుముకోకుండా, ఎంతో అవలీలగా, ఏదో ఒక జవాబు ఠక్కున చెప్పేసే ఆ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోయింది. 



బాపూ తీసిన "మంత్రిగారి వియ్యంకుడు" లో అల్లూ రామలింగయ్య అల్లుడుగా రాళ్లపల్లి చేసిన "సిర్కిల్ ఇన్స్పెక్టర్" పాత్ర భలే ఉంటుంది. పేరుతో కాకుండా ఎప్పుడూ "ఏమయ్యా సర్కిలూ" అంటూంటాడు అల్లూ రామలింగయ్య. బాపూ తీసిన మరో చిత్రం ’రాధా కల్యాణం ’లో "ఏమ్మొగుడో...ఏమ్మొగుడో " అనే గమ్మత్తైన పాట ఉంది. నిందాస్తుతి పధ్ధతిలో తాగుబోతు మొగుడుని ముద్దుగా తిడుతూ ఓ భార్య పాడే పాట. అందులో ఆ తాగుబోతు వేషం రాళ్ళపల్లిది. చిన్న వేషం అయినా, చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా అయినా, చాలా ఏళ్లవరకూ ఆ పాట గుర్తుండిపోవడానికి కారణం రాళ్లపల్లి అంటే అతిశయోక్తి కాదు. 

నిన్న పేపర్లో రాళ్లపల్లి గురించిన వార్త చదివాక గుర్తుకొచ్చిన మరికొన్ని సినిమాలు - పాత్రలు - "సితార"( పాత్ర పేరు గుర్తులేదు), "అన్వేషణ"లో సత్యనారాయణ డ్రైవర్ పాండు పాత్ర, "ఏప్రిల్ ఒకటి విడుదల" లో శర్మ గారు, "శుభలేఖ"లో "గుర్నాధం"! ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరిన్ని సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు రాళ్లపల్లి పోషించే ఉంటారు కానీ చిన్నప్పుడు మాకు విశ్వనాథ్, జంధ్యాల, బాపూ, వంశీ ఈ నలుగురు  దర్శకుల సినిమాలే ఎక్కువగా చూపెట్టేవారు. అందువల్ల నాకు ఈ పాత్రలు మాత్రమే బాగా గుర్తుండిపోయాయి. 

మాకు కేబుల్ కనక్షన్ లేదు కాబట్టి ఎప్పుడు ప్రసారమయ్యేదో తెలీదు కానీ ఆమధ్యన యూట్యూబ్ లో ఎక్కడో "బాబాయ్ హోటల్" అనే ఒక టివీ షో చూశాను. ఏదో వంటల కార్యక్రమం. ఇంత పెద్ద వయసులో ఇది కూడా హోస్ట్ చేస్తున్నారా. చాల గ్రేట్ అనుకున్నాను. 


టివీ చూడకపోవడం చాలా అదృష్టకరమైన విషయం అని ఇలాంటి వార్తలు పేపర్లో చదివినప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంతో బాగా హెల్తీగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తుల్ని, చివరి దశల్లో బలహీనంగా, అనారోగ్యంతో ఉన్న క్లిప్పింగ్స్ నీ, చనిపోయిన వీడియోలను చూడలేము. నేనైతే ఇప్పటికీ పేపర్ లో వచ్చిన ఇలాంటి వార్తలను కూడా రెండోసారి చూడడానికి మనసొప్పక పాత పేపర్ల వెనుక దాచేస్తూంటాను. రాళ్లపల్లిపై ఉన్న అభిమానం కొద్దీ ఈ నాలుగు వాక్యాలనూ ఆయనకు నా నివాళిగా రాయాలనిపించి రాయడం. ఒక అనుభవజ్ఞుడైన నటుడిని గుర్తుచేసుకోవడం. అంతే!

కొద్దిగా గూగులిస్తే రాళ్లపల్లి నటించిన కొన్ని సినిమా సీన్ల లింక్స్ రెండు దొరికాయి. క్రింద ఇస్తున్నాను -











Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Wednesday, December 24, 2014

ఒకే ఒక్క చంద్రుడు..


ఏమిటో ఏం రాయాలో నిన్నట్నుండీ తోచట్లేదు.. కానీ రాయాలి.. అయ్యో.. మన బాలచందర్ కదా.. అని! "మన" ఏమిటి? అసలు ఒక సినీ నటుడు, ఓ సినీ దర్శకుడు, ఒక రచయిత, ఈ నటి, ఓ గాయకుడు.. వీళ్ళంతా మనకు అసలు ఎందుకు ప్రియమైనవాళ్లయిపోతారు? వాళ్ళకీ మనకీ ఏమిటి స్నేహం? ఏం బంధుత్వం? ఏమిటి సాన్నిహిత్యం? ఏనాటి బంధమిది? మన ఆలోచనలకు, అభిప్రాయాలకూ, అభిరుచులకూ దగ్గరగా ఉండే సినిమాలు, పాటలూ, రచనలూ మనకు నచ్చుతాయి కాబట్టి అవి తయారుచేసినవారు, రాసినవారు, తెరపై చిత్రించినవారు మనకు పరిచయం లేనివారైనా మనకి దగ్గరైపోతారు. అందుకే స్నేహబాంధవ్యాలు లేకపోయినా మనకు ఆత్మీయులు వీళ్ళంతా. 

వారం క్రితం "క్రిటికల్ కండీషన్లో దర్శకుడు బాలచందర్.." అని వార్త చదివిననాడు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నా కూడా లోపలెక్కడో గుబులు.. ఇలాంటి వార్త ఎప్పుడో వస్తుందని..! మరణం అనివార్యం.. ఎప్పటికైనా ఇలాంటి వార్తలు వినక తప్పదు. వారికి సంపూర్ణమయిన జీవితం, పేరు ప్రఖ్యాతలు.. ఉన్నాయి. ఇటువంటి మరణాన్ని గురించి మనం బాధపడకూడదు. కాకపోతే ఇటువంటి గొప్ప దర్శకుడు ఇక మళ్ళీ పుట్టడు. ఏ కళాకారుడైనా ఇదే సత్యం. ఎవరి క్షేత్రంలో వారిదొక ప్రత్యేకమైన స్థానం. భగవంతుడు వారికిచ్చిన ప్రతిభని సమంగా ఉపయోగించుకుని, కొన్ని అద్భుతాలను సృష్టించి, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిమానుల గుండెల్లో పదిలపరుచుకుని కనుమరుగైపోతారు. జన్మ సార్థకం చేసుకుంటారు. అటువంటి ప్రతి కళాకారుడూ ధన్యుడే. బాలచందర్ కూడా ధన్యుడు!! తెలుగువారు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదికాలాలు నిలిచిపోయేలాంటి సినిమాలు తీసి మనకు ప్రియమైన దర్శకుడిగా నిలిచిపోయారు.

అవార్డులు, బిరుదులూ, ప్రముఖ చిత్రాల జాబితాలూ నెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి. ఈ దర్శకుడితో నాకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ టపాలో రాయదలిచాను. బాలచందర్ అంటే మా ఇంట్లో మనిషి! మాకెవరికీ ఎక్కువ నచ్చని ట్రాజడీలు తీసినా అందరికీ ఇష్టమైన దర్శకుడు. 'బాలచందర్' అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది గలగలమని సరిగమలు పలికే సరిత కంఠం. అసలు నాకెంత ఇష్టమో ఆ వాయిస్. ఆ గళంలో పలికే ప్రతి భావం అద్భుతమే. ఇంకా బాలచందర్ అంటే కమలహాసన్, రజనీకాంత్, ఏసుదాస్, జయప్రద, గీత, ప్రకాష్ రాజ్.. మొదలైన నటులు, ఆ తర్వాత టివీలో ప్రసారమైన "గుప్పెడు మనసు", "ప్రేమి" సీరియల్స్. ఈ టివి సీరియల్స్ రెండూ ప్రతి ఎపిసోడ్ మర్చిపోకుండా, మిస్సవకుండా ప్రతి ఫ్రేమ్ ఎంతో శ్రధ్ధగా చూసిన రోజులు గుర్తుకొస్తాయి.


ఇంకా.. బాలచందర్ అంటే స్త్రీలు.. వారి పట్ల గౌరవం..! ఆయన తీసిన ఏ సినిమా చూసినా స్త్రీలపై గౌరవం పెరుగుతుంది తప్ప స్త్రీని ఒక వ్యాపారాత్మక సాధనం లాగ, ఒక విలాస వస్తువులాగ చూడాలనే ఆలోచనే రాదు. అంతటి గొప్ప కథలు వారివి. అసలవి కథలు కాదు. కల్పనలు కావు. జీవితాలు! నిజమైన జీవితాలు.. సంఘర్షణలు.. సమకాలీన సమాజానికి ప్రతిరూపాలు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, ఇళ్ళల్లో వారెదుర్కొనే ఇబ్బందులు, తరతరాలుగా మూగబోయిన వారి కంఠాలు, వ్యధలు.. బాలచందర్ చిత్రాల్లో కనబడతాయి. నిరుద్యోగం, నీటి కొరత మొదలుకొని మద్యపానం వరకూ సమాజంలోని ఎన్నో సమస్యలను తనదైన కళాత్మకమైన శైలిలో తెరకెక్కించారు బాలచందర్.





అయితే ఈయనతో నాకొక్కటే పేచీ ఉండేది.. క్లైమాక్స్. సినిమా అంతా అద్భుతంగా తీసి చివరికి విషాదాంతం చేసేస్తారు. జీవితాన్ని దగ్గరగా చూపించాలంటే వీషాదాంతమే ఎందుకుండాలనేది నా వాదం. ఈ ప్రశ్న వారిని ఎవరైనా ఏదో ఒక ఇంటర్వ్యూ లోనో అడిగే ఉంటారు. "మరో చరిత్ర" సినిమా క్లైమాక్స్ లో అమ్మానాన్న బయటకు వచ్చేసారుట విషాదాంతం చూడలేక. నా చిన్నప్పుడు చూసిన "కోకిలమ్మ" సినిమా అయితే మళ్ళీ రెండోసారి చూసే సాహసం చెయ్యలేదెప్పుడూ! "గుప్పెడు మనసు" సినిమాలో ధైర్యంగా బిడ్డను కన్న సరిత(పాత్ర పేరు గుర్తులేదు) పిరికిగా ఆత్మహత్య చేసుకోవడం అస్సలు నచ్చదు నాకు. "సింధుభైరవి"లో సుహాసినిలా ఎక్కడికో వెళ్పోయినట్లు చూపించి ఉండచ్చు కదా! "ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమా అంతా చాలా బావుండి, చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు:( "డాన్స్ మాష్టర్" తమిళ్ సాంగ్స్ వినీ వినీ, తెలుగు డబ్బింగ్ మూవీ రిలీజ్ రోజే వెళ్పోయాం చూడ్డానికి.. అది విషాదాంతం. ఇదేమిటి ఇలా అని బాధపడిపోయాం. టాక్ చూసో ఏమో.. రిలీజైన కొన్నాళ్ళలో మళ్ళీ కథ సుఖాంతం చేసిన క్లైమాక్స్ పార్ట్ సినిమాకి ఏడ్ చేసారు. అప్పుడు సూపర్ హిట్ అయిపోయిందా సిన్మా :) 


నాకు బాగా ఇష్టమైన సినిమాలు చాలావరకూ బాలచందర్ తీసినవే. ఇది కథ కాదు,  గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, కోకిలమ్మ, రుద్రవీణ, డాన్స్ మాష్టర్ థియేటర్లో చూసాను. 47 రోజులు, తూర్పు పడమర, అంతులేని కథ, మరో చరిత్ర, సంబరాల రాంబాబు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, కల్కి మొదలైనవి, ఆయన తీసిన కొన్ని ఇతర భాషా చిత్రాలు టివీలో వచ్చినప్పుడు చూసా. 


ఒక చిత్రమేమిటంటే "సింధుభైరవి" సినిమా ఇష్టమైనదే కానీ ఇంతదాకా చూడలేదు నేను. ఆ చిత్రం తాలూకూ డైలాగ్స్ ఉన్న ఆడియో కేసెట్ ఉండేది మా ఇంట్లో. అదే కొన్ని వందలసార్లు విని ఉంటాను. ఉదయ్ కిరణ్ తో తీసిన అబధ్ధం చిత్రం సీడీ కొనుక్కున్నా కానీ అది నచ్చలేదు నాకు. ప్రతి దర్శకుడికీ ఒక పీక్ పిరియడ్ ఉంటుందేమో.. అది దాటిపోయాకా తీసిన సినిమాలు ఎందుకో ఆకట్టుకోలేవు. "తన్నీర్ తన్నీర్" లో అనుకుంటా ఎలక్షన్స్ టైం లో ఒక చెట్టుకి మొదట ఒక పచ్చ జండా ఉంటుంది. తర్వాత ఒకొక్కటి చప్పున అన్ని రంగుల జండాలూ ఆ చెట్టుకి కట్టినట్లు చూపిస్తారు. ఎలక్షన్స్ అయిపోయాకా మళ్ళీ చెట్టు ఖాళీ అయిపోతుంది.(అలా అనే గుర్తు) వాళ్ల పరిస్థితి మళ్ళీ యధాస్థితికి వచ్చేసిందని సింబాలిక్ గా చూపిస్తారు. ఇలాంటి సింబాలిక్ సీన్స్ బాలచందర్ సినిమాల్లో బోలెడు దొరుకుతాయి. "ఇది కథ కాదు" సినిమాలో చిరంజీవి,జయసుధ డైలాగ్ సీన్స్ మధ్యన తల ఊపుతూ ఉన్న బొమ్మ ఒకటి చూపెడుతూ ఉంటారు మధ్య మధ్య. ఇలా చెప్పుకుపోతే వాల్యూమ్స్ రాయచ్చు. బాలచందర్ అంటేనే ఒక పేద్ద సెపరేట్ సబ్జెక్ట్. ఎన్ని థీసీస్ లైనా ప్రెజెంట్ చేయచ్చు ఆయన సినిమాలపైన. 


బాలచందర్ చిత్రాల్లో సంగీతానికి పెద్ద పీట ఉంటుంది. వారి చిత్రాల్లో నాకు బాగా నచ్చే కొన్ని పాటలతో ఈ పోస్ట్ ముగిస్తాను... 


 "గుప్పెడు మనసు" లో మౌనమే నీ భాష..  



'మరో చరిత్ర' నుండి..  కోకిలమ్మలో "పల్లవించవా నా గొంతులో.."  



ఆకలిరాజ్యం నుండి "కన్నెపిల్లవని.."
  



 డాన్స్ మాష్టర్ లో "రేగుతున్నదొక రాగం.."  





 సింధు భైరవి నుంచి "పూమల వాడెనుగా.."  






 "స్వరములు ఏడైనా రాగాలెన్నో.." తూర్పూ పడమర నుండి..  




 ఇది కథ కాదు నుండి "తకధిమి తక.."  





 అంతు లేని కథ నుండి "దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" :



"ఆడవాళ్ళూ మీకు జోహార్లు" లో టైటిల్ సాంగ్ . నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం.  http://www.youtube.com/watch?v=tUULiZT3AbI  <--  యూ ట్యూబ్ movie లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం. 


 "అచ్చమిల్లై అచ్చమిల్లై" అని టివీలో చూశానొకసారి. అందులో పాట ఒకటి..  




 చివరిగా వన్ ఆఫ్ మై ఫేవొరేట్స్ "రుద్రవీణ"..! అందులో ప్రతి పాటా కంఠతా మా ఇంట్లో అందరికీ. అంతలా వినేవాళ్లం. ఆ మొత్తం పాటలున్న లింక్ ఇది:





Sunday, August 31, 2014

ఇక హాయిగా నిద్రో..







ఇప్పుడే వార్త విన్నాను... బాపూ..

ఇన్నాళ్ళకి విముక్తి లభించిందయ్యా నీకీ భవబంధాలనుండీ.. అని చటుక్కున అనిపించింది..

నీ ఆత్మకు ఇప్పుడెంత ప్రశాంతతో కదా!

ఎంత హాయిగా.. ఎంత స్వేచ్ఛగా.. ప్రాణమిత్రుడ్ని కలవడానికి రెక్కలు కట్టుకుని నింగికెగిరి ఉంటావో కదా..

ఇన్నాళ్ళ వియోగాన్ని ఎలా భరించావో కానీ నాకు మాత్రం చెప్పలేనంత దిగులుగా ఉండేది నిన్ను వార్తల్లోనో, పేపర్లోనో చూసినప్పుడల్లా...

అబ్బా ఈ దేవుడింత నిర్దయుడేంటబ్బా.. ఇలా ఒంటరిని చేసేసి చోద్యం ఎందుకు చూస్తున్నాడా అని వాపోయేదాన్ని...

ఏమో.. ఇంకా ఏ స్వామికార్యం నీతో చేయించుకోదలిచాడో నీ రాముడు.. అనుకునేదాన్ని!

పోనీలే.. ఇప్పుడు నిమ్మళమేగా..

ఇంక బెంగెందుకు.. ఇవాళ నేను హాయిగా నిద్దరోతా.

సృష్టి 
మొత్తంలో నాకు తెలిసిన ఇద్దరే ఇద్దరు ప్రాణమిత్రులు ఇక ఒకటయ్యారని సంతోషంతో నిద్దరోతా!!


ఈ జనాలకేమన్నా పిచ్చా..

ఎందుకిలా దు:ఖపడుతున్నారు నువ్వు లేవని??

ఎవరన్నారు నువ్వు లేవనీ..

పక్కింటి లావుపాటి పిన్నిగారిలో

ఆవిడ వెనుకనే నక్కి ఉన్న సన్నపాటి మెగుడుగారిలో

వంటింట్లో అప్పడాల కర్రలో

పొరుగింటి బుడుగ్గాడిలో

ఎదురింటి సీనాగపెసూనాంబలో

కొత్తగా పెళ్ళైయ్యే రాధాగోపాళాల్లో

నీ బొమ్మలాంటి అందమైన అమ్మాయిల్లో

ఆ రైలింజను డ్రైవరులో

ఆఫీసుల్లో ఉండే విగ్గులేని యముళ్ళలో

అవకతవక కంగాళీ సినిమాల "భశుం" కార్డుల్లో..

దేవుడిగూట్లో నవ్వుతూ నిలబడ్డ రాముడిలో...

అన్నింట్లో నువ్వు కనబడుతూనే ఉంటావు కదా...!


ఇన్నింటీలో నువ్వు సజీవమేనన్న నిజం ఈ పిచ్చిజనాలకి అర్థమయినరోజు

నీ కొంటెబొమ్మల పుస్తకంలోంచి ఓ జోకు చదూకుని నవ్వేసుకుంటార్లే..

నువ్వు హాయిగా నీ నేస్తంతో ఇన్నాళ్ళు గుండె పొరల్లో దాచుకుని ఉంచిన కబుర్లన్నీ చెప్పేసుకుని..

ఇక కంటినిండా హాయిగా నిద్రో...


 

Thursday, January 23, 2014

ఆత్మబంధువైన బాటసారి..


హ్మ్!!!!! 
ఏం రాయమంటావు నాగేశ్వర్రావ్! చెప్పు... 

నిన్న పొద్దున్న లేవగానే అలవాటుగా రేడియో పెట్టేసరికీ నీ గురించిన వార్త!! ఈసారి ఎంతమందికని ఫోన్లు చెయ్యను? అమ్మానాన్నలకా? పిన్నికా? పెద్దమ్మకా? మావయ్యకా? అందరికీ నువ్వంటే ఎంత ఆరాధనో నీకు తెలీనిదా? పదిపదిహేను రోజుల క్రితం అనుకుంటా నీకు బాగోలేదనీ..వార్తల్లో చెప్పారనీ అమ్మనాన్న కంగారు పడిపోతే వాళ్లకి పేద్ద పుడ్డింగ్ లా .. "చక్కని జీవితాన్ని గడిపాడు. పిల్లల అభివృధ్ధి చూశాడు. తృప్తిగా జీవితాన్ని గడిపాను అని గర్వంగా చెప్పుకున్నాడు. నాగేశ్వర్రావ్ గురించి బెంగెందుకర్రా..." అంటూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా రేడియోలో వినగానే ఇంకా నిద్రలేవని అమ్మని లేపేసి "వార్తలు విని కంగారడకండి..జాగ్రత్త.." అని చెప్పానే గానీ ఆ తర్వాత మాత్రం నెట్, రేడియో అన్నీ ఆపేసి రోజంతా ఐదారు ఫోన్లు చేసి అమ్మ బుర్ర తినేసాను. ఎందుకేమిటీ? నువ్వేమైనా పరాయివాడినా.. మా ఇంట్లో మనిషివి కదూ...


అసలు మావయ్యకి ఫోన్ చెయ్యాలని ఎన్నిసార్లు ఫోన్ దాకా వెళ్లి.. ఆపేసానో! ఏం మాట్లాడాలో తెలీక. అసలు మా పిల్లలందరికీ మావయ్యంటే నువ్వే కనబడతాడు. నీ మేనరిజంస్ అన్నీ జీర్ణించేసుకుని చేయి తిప్పడం, మాట్టాడ్డం మాత్రమే కాక నీ ఆలోచనలని కూడా తనవి చేసేసుకున్న మహాభిమాని కదూ మా మావయ్య! ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి నిన్ను కలిసాడు.. ఎన్ని ఆల్బమ్స్, ఎన్ని ఫోటోలు, ఎన్ని పేపర్ కట్టింగ్స్.. అన్నీ నీవే! మావయ్యావాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా నీతోనూ, కృష్ణంరాజుతో తీయించుకున్న ఫోటోలు, నీకు రాసిన ఉత్తరాల కాపీలు, వాటి జవాబులు.. ఒకటేమిటి అన్నీ నీ కబుర్లే. ట్రన్స్ఫర్ల వల్ల మావయ్య తిరగని జిల్లా లేదు. వాళ్ళున్నఊరు దగ్గరలో నీ షూటింగ్ ఉందంటే పరిగెత్తుకు వచ్చేసేవాడు కదా మా మావయ్య. 'సీతారామయ్యగారి మనవరాలు' షూటింగ్ అప్పుడు ఒక్క ఉదుటనలో ఎడ్లబండి ఎక్కేసావని.. 'ఈ వయసులో కూడా ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నాడనుకున్నారూ..' అని ఎంత సంబరంగా చెప్పాడో మాకు. 'గాండీవం' సినిమాలో "గోరువంక వాలగానే గోపురానికీ" పాట చూసొచ్చి ఎంత చక్కగా స్టేప్పులేసాడో చూడండి చూడండి..అని సిన్మా చూపించేసాడు మాకు. మరి ఆస్కార్ కమిటీ వాళ్లకి నీ ప్రతిభ గురించి చెప్తూ సుదీర్ఘమైన నలభై పేజీల ఉత్తరం రాసి, వాళ్ల నుండి వచ్చిన జవాబు కాపీ కూడా నీకు పంపాడు కదా! అంత వీరాభిమానికి కాబట్టే నీకులాగ గట్టివాడైపోయాడు మావయ్య. 


ఇంక మావయ్యకు తోడుగా నాన్న కూడా నీ పుస్తకాలు, సీడీలు ఎన్ని కొన్నారనీ! చిన్నప్పుడూ "ఎందుకు నాన్నా నీకంతిష్టం నాగేశ్రావ్..?" అనడిగితే నాన్న ఒకటే చెప్పారు.. "కేవలం హీరోయిక్ రోల్స్ నే కాక వైవిధ్యభరితమైన ఎన్నో పాత్రలు వేసాడు. కష్టపడి పైకొచ్చాడు. శ్రమ విలువ తెలిసినవాడు. మనిషిగా ఎదిగినవాడు. అందుకే నాకిష్టం" అని! టివీలో నువ్వా మధ్యన 'గుర్తుకొస్తున్నాయి..' అంటూ చెప్పిన కార్యక్రమం సిరీస్ తాలూకూ సీడీల సెట్ మొత్తం కొనేసారు కదా! అమ్మ మాత్రం తక్కువ తిందా? మేం స్కుల్లో ఉన్నప్పుడు ఊళ్ళోకొచ్చిన నీ సినిమాలన్నీ ఆదివారాలు మార్నింగ్ షోలకి తీసుకువెళ్ళి మరీ చూపించలేదూ! సందు చివరన ఉండే 'విజయటాకీస్' లో, ఇంకా 'దుర్గాకళామందిర్' లో కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు, తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యుల కథ, మూగమనసులు, గుండమ్మ కథ, గోవుల గోపన్న, మిస్సమ్మ, ప్రేమించి చూడు, నవరాత్రి, డాక్టర్ చక్రవర్తి, దొంగ రాముడు, సువర్ణసుందరి, తోడికోడళ్ళు, అందాల రాముడు... ఎన్ని చూపించిందో.. లైలామజ్ను, దేవదాసు మాత్రం ట్రేజడీలు.. మీకొద్దులే అని చూపెట్టలే! 



ఆ పైన పెట్టినది రాబోయే కొత్త సినిమాలోది..నీ ఫోటోనే! అయినా ఇప్పుడంత తొందరేమొచ్చిందనీ? మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు.. ఆ ధైర్యంతోనే కదా హాయిగా కూర్చున్నాం అందరమూ! ఎంతమంది టాటా చెప్పేసినా అయ్యో..అనో, వయసయిపోయిందనో సరిపెట్టేసుకున్నా కానీ నీ గురించి ఎందుకనో అలా అనుకోలేకపోతున్నాను... ఎందుకంటావ్??? నాగేశ్వర్రావ్ అంటే ఎవర్ గ్రీన్..ఎప్పుడూ యంగ్ మ్యానే నాకు. అయినా నిన్ను నటుడిగా నేనసలెప్పుడు చూసానని? నాకు నువ్వు నటుడిగా కంటే ఓ నాగేశ్వర్రావ్ గానే ఎక్కువ అభిమానం. నీ క్రమశిక్షణ, వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు, నేర్చుకున్న పాఠాలు.. ఎన్ని చెప్పావు.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరికైనా ఎంత ఉపయోగపడతాయవి! ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త, శ్రధ్ధ చూపెట్టేవాడివో ఎన్ని ఇంటర్వ్యూల్లో విన్నానో.. ! ఇవాళ తెలుగుజాతి ఒక గొప్ప నటుడినే కాదు.. ఒక మహామనిషిని కూడా కోల్పోయింది... అందుకే.. ఆ బాధతోనే ఏం రాయాలో తెలీలేదు నిన్నంతా... 


నెట్లో ప్రశాంతంగా నిద్రోతున్న నీ ఫోటో చూడకపోతే ఇవాళ కూడా ఏమీ రాసేదాన్ని కాదేమో... అయినా నువ్వెక్కడికి వెళ్లావని.. మా మనసుల్లో, నీ సినిమా సీడీల్లో, నీ పుస్తకాల్లో, నీ మాటల్లో.. ఇంకా చెప్పాలంటే ఈ సినీరంగం ఉన్నంతవరకూ నువ్వు సజీవమే...! అవును కదూ... 




Saturday, January 18, 2014

तॆरॆ बिना जिंदगी सॆ कॊई...




ఏమిటో...కూడబలుక్కున్నట్లు వరుసగా తారరందరూ గగనతలాలకు ప్రయాణం కడుతూంటే చిత్రంగా ఉంది! వెంఠవెంఠనే నివాళులు రాయడం ఎందుకని ఆగాను గానీ సుచిత్రాసేన్ గురించి నాలుగు వాక్యాలు రాయకపోతే తోచడం లేదు... 


సుచిత్రాసేన్! ఒకప్పటి ప్రఖ్యాత తార! మొట్టమొదటిసారి నాన్న కలక్షన్లో చూశాను సుచిత్రా సేన్ ఫోటోని! అసిత్ సేన్ తీసిన బెంగాలీ చిత్రం "దీప్ జ్వలే జాయ్"(హిందీ "ఖామోషీ") లో సుచిత్రాసేన్ నటన అసలు మరువలేనిది. ప్రేమను తెలుపలేక, దాచుకోలేక ఓ డ్యూటీఫుల్ నర్స్ గా ఆమె పడే తపన,వేదన ఆమె కళ్ళలో కనబడుతుంది. భావాల్ని వ్యక్తీకర్తించడానికి ఆమెకు మాటల అవసరం లేదు. మన సావిత్రి లాగ, మీనాకుమారి లాగ కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో భావాన్ని వ్యక్తపరచగల నేర్పరి. గొప్ప నటి. 


బిమల్ రాయ్ తీసిన "దేవ్ దాస్" చిత్రంలో ఆమె నటన ఎంతో ప్రశంసలనందుకుంది. బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ తో ఎక్కువ చిత్రాలు చేయగా, వాటిల్లో "ఇంద్రాణి", "సప్తపది" మొదలైన చిత్రాలు ప్రఖ్యాతిగాంచాయి. "సాత్ పకే బాంధా" అనే బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు గానూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులనందుకుంది సుచిత్రాసేన్. "ఆంధీ" సినిమాలో నటించే సమయానికి సుచిత్రా సేన్ కు సుమారు నలభై నాలుగేళ్ళు ! అయినా ఎంతో చార్మింగ్ గా, అంతకు పదేళ్ళు యంగ్ గా కనిపిస్తారావిడ ఆ చిత్రంలో! 


సుచిత్రాసేన్ తీసుకునే కొన్ని దృఢమైన నిర్ణయాలు ప్రపంచన్ని ఎంత ఆశ్చర్యపరిచినా ఆమె తన నిర్ణయాలకే కట్టుబడి ఉండేవారు. కారణాలు ఏవైనా రాజ్ కపూర్, సత్యజిత్ రే అంతటి గొప్ప దర్శకుల సినీఅవకాశాలను ఆమె నిరాకరించారు. పాతికేళ్ల ప్రఖ్యాత సినీ జీవితం అనంతరం ఏకాంతవాసం లోకి వెళ్పోయి ప్రతిష్ఠాత్మకమైన 'దాదాసాహెబ్ ఫాల్కే'  పురస్కారాన్ని కూడా వదులుకున్నారు. 


సుచిత్రాసేన్ స్మృతిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పాట... 
ఎన్ని వందల పాటలు చాలా ఇష్టమనిపించినా, అర్థం తెలియని చిన్ననాటి రోజుల నుండీ ఈ పాట మాత్రం, ఆర్.డి.బర్మన్ ట్యూన్ మహిమో ఏమో ఎందుకో నాకు చాలా నచ్చేది.. అర్థం తెలిసి, పాట మధ్యలోని వాక్యాలతో సహా కంఠస్థం వచ్చేసాకా గుల్జార్ మాటల్లోని లోతులు తెలిసాకా.. ఇంకా ఇంకా మనసులో నిలిచిపోయిందీ గీతం...

Thursday, January 16, 2014

జ్ఞాపకాల 'అంజలి'..



ప్రముఖ నటి అంజలీ దేవి స్వర్గతి వార్త విన్నప్పుడు వెంఠనే నాన్న గుర్తుకు వచ్చారు. తనకు ఫోన్ చేసి ఎలా చెప్పాలా అనుకుంటూంటే రేడియో వార్తల్లో విన్ననని తనే చెప్పారు..!ఆయనకు ప్రియమైన నటీమణుల జాబితాలో మొదటిస్థానం అంజలీదేవిదే! అప్పటికి వారం రోజులుగా కాస్త నలతగా ఉండి పండుగకు రానని చెప్పినదాన్ని కూడా ఎలాగో తంటాలు పడి ఇంటికి వెళ్ళి నాన్నగారిని కలిసి, కాసేపు గడిపి వచ్చాను. తిరిగి వస్తూ చిన్నప్పటి నుండీ ఆయన దగ్గర వింటూ వచ్చిన అంజలీదేవి జ్ఞాపకాలు కొన్ని మూటకట్టుకు వచ్చాను. కాస్త కూచుని రాసే ఓపిక వచ్చాకా ఆ జ్ఞాపకాల పూలన్నీ ఈ టపాలో గుమ్మరించేస్తున్నా...! పెద్ద వయసు, సంతృప్తికరమైన పూర్ణజీవితాన్ని చూసినావిడ కనుక చింతపడనవసరం లేకపోయినా తెలుగుతెరపై వెలిగిన ఒక మహానటిగా ఆమె  జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకోవాలని నా అభిలాష..



నాన్నావాళ్ళూ చిన్నప్పుడూ వాళ్ళ ఊరు ఖండవిల్లి నుండి ఏడుమైళ్ళు గుర్రబ్బండిలో తణుకు వెళ్ళి సినిమా చూసి వచ్చేవారుట. ఆ కాలంలో సినిమా చూడాలంటే అంత యాతన పడాల్సివచ్చేది. నాన్నకు పదిపన్నెండేళ్ళు ఉన్నప్పుడు చూసిన సినిమాల్లో అంజలీదేవి నటించిన పరదేశి(1951), అనార్కలి(1955), ఇలవేల్పు(1956) చిత్రాలు బాగా గుర్తుండిపోయాయి... రువాత ఎన్ని అంజలి సినిమాలు చూసినా, 'పరదేశి'లో "నేనెందుకు రావాలి ఎవరికోసమో.." అనే పాట, 'అనార్కలి'లో "రావోయీ సిపాయి..’ , 'ఇలవేల్పు' లో "చల్లని రాజా ఓ చందమామ.." పాటలు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి అంటారు నాన్న. డాన్స్  బాగా చేసేది.. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా మంచి క్లోజప్ షాట్స్ ఉండేవి.. పైగా అప్పటి cameramen కెమేరాకి డిఫ్యూజర్లు అవీ వేసి, అంజలి ని బాగా గ్లామరస్ గా చూపించేవారు కూడా అని చెప్తారాయన. అలనాటి అంజలి నుండీ ఇవాళ్టి నిత్యామీనన్ వరకూ తనకెందరో ప్రియమైన నటీమణులున్నా, వారందరిలో తను మొట్టమొదట అభిమానించిన అంజలిదే ప్రధమ స్థానం అంటారు నాన్న!



నాన్న స్కూల్లో చదివే కాలంలోనే మద్రాసు చాలాసార్లు వెళ్ళొస్తుండేవారుట. వీనస్ స్టూడియో తాలూకూ కెమేరా డిపార్ట్మెంట్ లో నాగేశ్వర్రావ్ అనే సమీప బంధువు పనిచేస్తూ ఉండడం వల్ల, తరచూ నెల్లూరు నుండి మద్ర్రాసు వెళ్ళి లా షూటింగులు చూస్తూండేవారిట. అక్కడ ఆళ్వార్ పేట లోని వీనస్ స్టూడియోలో 'అంజలీ పిక్చర్స్' వాళ్ల చిత్రాలు షూటింగ్ జరుగుతూ ఉండేవిట. నాన్న కాలేజీ రోజుల్లో ఉండగా ఒకసారి ఎన్.టి.ఆర్,అంజలీదేవి నటించిన స్వర్ణమంజరి(1962) చిత్రం క్లైమాక్స్ సీన్ షూట్ జరుగుతోందిట. ఓ కొండ కొమ్ము మీద ఎన్.టి.ఆర్ వేళ్ళాడుతూండగా, రాజనాల తన కాలుతోటి హీరో చేతిని తొక్కుతూండడం ఆనాటి సన్నివేశం. క్రింద అగాధమైన లోయ.. అదొక ట్రిక్ షాట్. కొంద కొమ్ము వరకూ సినిమా సెట్, అగాధమైన లోయ మాత్రం పెద్ద అద్దం మీద పెయిటింగ్ చేసి, దాని వెనక కెమేరా పెట్టి ఆ ట్రిక్ షాట్ తీస్తున్నారుట. అలానే ఆ సినిమాలోని మిగిలిన ట్రిక్ షాట్స్ కూడా చూసే అవకాశం అప్పుడు నాన్నకు దొరికిందిట. అంజలీ పిక్చర్స్ వారే "ఫూలోం కీ సేజ్" అనే హిందీ చిత్రాన్ని నిర్మించారుట. అందులో మనోజ్ కుమార్ , వైజయంతిమాల ప్రధాన పాత్రధారులు. ఆ షూటింగ్ కూడా వీనస్ స్టూడియోలోనే తీశారుట. ఆదినారాయనరావు దంపతులు పాల్గొన్న ఆ పిక్చర్ ముహుర్తం షాట్ కి కూడా నాన్న హాజరయ్యారుట.



ఎనభైల తర్వాత బెజవాడ రేడియో స్టేషన్ కొత్త స్తూడియోల్లోకి మారిన తరువాత ఓసారి ఆదినారాయణరావు గారు, అంజలీ దేవీ బెజవాడ వచ్చారుట. ఆ కాలంలో బెజవాడే సినీపరిశ్రమకు ముఖ్య రంగంగా ఉండేది. ఎందుకంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన కీలక రంగాలవారు అక్కడే ఉండేవారు మరి. బెజవాడలో పిక్చర్ కి హిట్ టాక్ వస్తే, ఆ పిక్చర్ సక్సెస్సయినట్లే అనుకునే కాలం. అందుకని సినీరంగ ప్రముఖులు, నటీనటులు బెజవాడే ఎక్కువ వస్తూండేవారు అప్పట్లో. అలాంటి ఒక సందర్భంలో అంజలీదేవి దాంపతుల్ని రేడియో స్టేషన్ కి ఆహ్వానించారుట.  అప్పట్లో విజయచిత్ర మాస పత్రికవాళ్ళు 'సినీ నేపధ్య సంగీతం' అనే అంశం మీద  వ్యాస రచన పోటీ నిర్వహించారు. అందులో మొదటి బహుమతి నాన్న రాసిన వ్యాసానికి వచ్చింది. ఆ పోటీకి న్యాయనిర్ణేతగా ఆదినారాయణరావు గారు వ్యవహరించారని తర్వాత తెలిసింది. ఆ విషయం ఈ సందర్భంలో ప్రస్తావించారుట నాన్న. అప్పటికే ఆదినారాయనరావు గారు పెద్ద వయసులో ఉన్నందువల్ల, ఆయనకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేనందువల్ల ఆయనతో కార్యక్రమం చెయ్యడానికి వీలుపడలేదుట కానీ అంజలీదేవితో మాత్రం వివిధభారతి వాణిజ్యవిభాగంలో, అప్పటికి ప్రజాదరణలో ఉన్న 'ప్రత్యేక జనరంజని' కార్యక్రమాన్ని నాన్న ప్రొడ్యూస్ చేసారుట. అలా తనకత్యంత ప్రియమైన నటీమణిని ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించిందని నాన్న చెప్తారు.


అలనాటి నటీమణుల్లో సావిత్రి నాకు బాగా ఇష్టమైనా, అంజలీదేవి చిత్రాల్లో సంఘం, లవకుశ, అనార్కలి, చెంచు లక్ష్మి, రంగులరాట్నం, బడిపంతులు, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలు బాగా నచ్చుతాయి నాకు. మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా వి.ఐ.పి ల లైన్స్ లో మొదటి వరుసలో అంజలి, జమున, గాయని సుశీల కనబడుతూ ఉండేవారు మాకు. మా తమ్ముడి కోసం పర్తిలో హాస్టల్ కు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆవిడ మనవడి కోసమనుకుంటా అంజలీదేవి కూడా వచ్చేవారు. అలా చాలాసార్లు దగ్గరగా ఆవిడను చూడటం జరిగింది. చిరునవ్వుతో ఎప్పుడూ ప్రసన్నంగా కనబడే ఆమె మొహం చాలా బావుంటుంది.





మూడు,నాలుగేళ్ల క్రితం ఓసారి మా పాపకు పిల్లల కథల సీడీలు అవీ కొంటూంటే అంజలీదేవి ఉన్న షార్ట్ ఫిల్మ్ సీడీ ఒకటి కనబడి అది కొన్నాం. "చిన్నారి పంతులమ్మ" అనే ఆ కథలో మనవరాలి దగ్గర తెలుగు నేర్చుకునే అమ్మమ్మ పాత్ర అంజలిది. ఇంట్లో పెద్దవాళ్ళున్న తీరే వేరని ఆ సీడీ చూసినప్పుడల్లా అనుకుంటూంటాం మేము. బావుంటుంది ఆ కథ కూడా. చాలాసార్లు ఆ సీడీ పెట్టుకుని చూస్తుంటుంది మా పాప. మొన్న శనివారమే ఆ సీడీ పెట్టుకుని చూస్తూంటే దానితో పాటూ మేమిద్దరం కూడా చూసాం మళ్ళీ! వయసు దాచడానికి మేకప్ బాగా వేసేసారు గానీ అంత వయసులో కూడా ఎలా నటించారో.. ఎంత పెద్దావిడైపోయారో ఈవిడ అనుకున్నాం ఆ రోజు.





హ్మ్..!! కాలమెవరి కోసమూ ఆగదు కదా.. ప్రపంచంలోని వింతలనూ, విశేషాలను, చరిత్రనూ, మనుషులనూ, వారి తాలూకూ స్మృతులనూ కూడా తనలో కలిపేసుకుంటూ పోవడమే దానికి తెలుసు..! మొన్న ఎందరో.. నిన్న అంజలి.. రేపు ఇంకెవరో.. ఇదే కాలచక్రం.. ఇదే జీవనగమనం..