సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 12, 2012

"దేవరకొండ బాలగంగాధర తిలక్" -- "శిఖరారోహణ"


ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ రచనలతో తనదైనటువంటి గాఢముద్రను వేసిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి జీవితం,సాహిత్యం గురించి కవి, రచయిత, విమర్శకుడు శ్రీ ఇంద్రగంటి శ్రికాంతశర్మ గారు ఒక పుస్తకం రాసారు. పుస్తకం పేరు "దేవరకొండ బాలగంగాధర్ తిలక్". సాహిత్య అకాదెమీ వారి ప్రచురణ. (వెల నలభై రూపాయిలు). శర్మగారు చిన్నప్పుడు తణుకులో తాను తిలక్ గారిని కలుస్తుండే రోజుల నుండీ ప్రారంభించి, తిలక్ జీవితం, తిలక్ జీవనదృక్పథం , సాహిత్య వ్యక్తిత్వం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు మొదలైన తిలక్ ఇతర రచనలన్నింటి గురించీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. పుస్తకం చివరలో మార్క్సిస్టు విమర్శకులు "అర్వీయార్" గారి వ్యాసం "తిలక్ కవిత్వంలో విషాద అలంకారికత" అనే అనుబంధాన్ని కూడా జత చేసారు. 


తిలక్ గురించి శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాల సారం: 

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమకాలానికి చెందిన కవి, కథకుడు, నాటకరచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్(1921-1966). అందమైన రూపం, ఆ రూపాన్ని మించిన అందమైన మనసు; సున్నితత్వం,భావుకత కలగలిసిన వ్యక్తిత్వం వారిది. ప్రారంభంలో భావకవిత్వాన్ని రాసినా ఆ తర్వాత ఆనాటి అభ్యుదయోద్యమప్రభావాన అభ్యుదయ గీతాలను, వచన పద్యాలనూ రాసారు. ఆదర్శవంతమైన నాటకాలనూ, ఉత్తమమైన కథలనూ కూడా తిలక్ రాసారు. ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "అమృతం కురిసిన రాత్రి"; ఇంకా "గోరువంకలు", "తిలక్ కథలు" ; "సుప్తశిల", "సుశీల పెళ్ళి" నాటికలు మొదలైన రచనలు సాహిత్యాభిమానుల మన్ననలనందుకున్నాయి. 


సాహిత్యంలో తన ముందు తరానికి చెందిన కాల్పనికతకు, తన కాలం నాటి సామ్యవాద ధోరణికీ సమన్వయాన్ని సమకూరుస్తూ తనకు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న కవి శ్రీ తిలక్. మద్రాసులో ఇంటర్ చదివిన తిలక్ ఆ తర్వాత మరెక్కడా చదవలేదు. పధ్నాలుగు పదిహేనేళ్ల వయసు నుండే పద్య రచనను ప్రారంభించిన తిలక్ అభ్యుదయ రచనోద్యమకాలంలో కవిగా , సోషలిస్ట్ గా మారారు. డిగ్రీలు చదవకపోయినా తమ ఇంట్లోని ఐదారువేల పుస్తకాల వల్ల తిలక్ తెలుగు,ఇంగ్లీషుల్లో మంచి చదువరి అయ్యారు. స్వస్థలమైన తణుకులోనే ఉండిపోయారు. తిలక్ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ప్రభావంతో కాల్పనిక సౌందర్యమూ, శ్రీశ్రీ ప్రభావంతో సామాజిక వాస్తవికత చోటు చేసుకున్నాయి. కవిత్వంలో తిలక్ ది ప్రత్యేకమైన శైలి. తెలుగు,సంస్కృత, అన్యదేశ సమాసాలు ఆయన రచనలలో కనబడతాయి. ఆయన కథల్లో మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేసేవరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందేమో అనిపించింది నాకు. 

తిలక్ సొంత గళంలో ఆయన "వెన్నెల" కవితనిఇదివరకూ బ్లాగ్లో పెట్టాను.. http://trishnaventa.blogspot.in/2009/11/blog-post_17.html

***   ***    *** 

 శిఖరారోహణ: 

'ముందుమాట'లో శ్రీకాంత శర్మ గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలగంగాధర్ తిలక్ జీవన సాహిత్యాల గురించి ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. తను ఆకాశవాణిలో పనిచేసే కాలంలో శర్మగారే రచించిన ఈ డాక్యుమెంటరీ పేరు "శిఖరారోహణ". దీనికి ప్రయోక్తగా శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి(మా నాన్నగారు) వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఆనాటి ప్రముఖ రచయితలు శ్రీ సోమసుందర్, ఆర్.ఎస్.సుదర్శనం, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తిలక్ సోదరులు గంగాధర రామారావు పాల్గొన్నారు. ఆకాశవాణి కళాకారులు పద్యాలు, వచన కవిత్వం చదివారు. గంట నిడివి ఉన్న ఈ కార్యక్రమం 1983లో ప్రసారమైంది. తిలక్ కవిత్వం పై ఆసక్తి ఉన్న పాఠకులు ఈ కార్యక్రమాన్ని క్రింద లింక్ లో వినగలరు.. 

 


పైన కార్యక్రమం వినలేనివారికి ఇదే కార్యక్రమంలో "అమృతం కురిసిన రాత్రి" లోని "వానలో నీతో" అనే కవిత ఒక్కటీ విడతీసి క్రింద లింక్ లో ఇస్తున్నాను. ఇందులో కవిత చదివిన గళం నాన్నగారిది. 

Tuesday, October 9, 2012

నా ఉదయాలు..




రివ్వున వీస్తున్న పవనాలు మనసుని చల్లబరుస్తాయి
పచ్చదనంతో మెరుస్తున్న పైర్లు తలలుపుతూ శుభోదయం చెప్తాయి
కరెంట్ తీగ మీద వాలిన నీలిరంగు పిట్ట నా అందం చూడమంటుంది
హడావుడిగా పరిగెడుతున్న తొండ తలఊపి హలో చెప్తుంది.




పువ్వుల చుట్టూ తిరగాడే రంగురంగుల సీతాకోకచిలుకలు.. 
నా కెమేరాకు అందకుండా కవ్విస్తాయి
మంచుతో తడిసిన గడ్డిపరకలు తళుక్కుమంటుంటాయి
మబ్బుల మధ్యనుండి తొంగి చూస్తున్న సూరీడు 
అప్పుడే రానా.. వద్దా.. అని ఊగిసలాడుతూంటాడు
 తోటలోని ఎర్రని,తెల్లని గులాబీలు విరగబూసి 
నన్ను చూడు..నన్ను చూడు అంటూ గోముగా పిలుస్తూంటాయి



ఈ అందాలతో పనిలేదన్నట్లు ఆ పూరిపాకలోని పాప.. 
తనలోకంలో తాను కేరింతలు కొడుతుంటుంది
ఎర్రని చిగుర్లతో వేపచెట్లు నోరారా పలకరిస్తాయి కానీ
చేతులు చాచుకుని కూచున్న చింతచెట్లు ఎందుకో భయపెడతాయి!


ముళ్లచెట్టు మధ్యన నీలిపూలు మనోహరంగా కనబడతాయి
విరగబూసిన నందివర్థనాలు వెన్నెలని తలపిస్తాయి
నాకు తోడుగా చెవిలో కబుర్లాడుతున్న రేడియో జాకీ
కమ్మని పాటలతో నా ఆనందం పరవళ్ళుతొక్కుతుంది..


అలా.. ఈ ప్రకృతితో నేనూ మమేకమై పరవశించేవేళ
కుయ్యి మన్న రైలు కూతతో ఉలిక్కిపడతాను!
సందుచివర్లో కనబడుతున్న స్కూలు బస్సులు
ఇక చాలు ఈ లోకంలోకి వచ్చేయమని తొందరపెడతాయి
ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...





Monday, October 8, 2012

అమ్మ విలువను గుర్తుచేసిన "English Vinglish"


"मुझॆ प्यार की कमी नही हैं..कमी है तॊ सिर्फ थॊडी इज्जत की..." అంటుంది శశి. ఈ సినిమాలోని female protagonist ! మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఈ ఒక్క పాయింట్ మీదే మొత్తం సినిమా నిలబడి ఉంటుంది. అదే ప్రేక్షకుల మనసులకూ సినిమాకూ వారధి కూడా. Toronto Film Festival లో ఈ చిత్రం ప్రీమియర్ చేయబడినప్పుడు, చివర్లో "standing ovation" ఇచ్చారుట అక్కడి ప్రేక్షకులు. అంతటి మర్యాదను పొందే పూర్తి అర్హతలున్న సినిమా ఇది.


సినిమా చూస్తున్నంత సేపూ కథ తో పాటూ మనమూ కనక్ట్ అయి చూసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ప్రతి ఒక్కరూ సినిమాలోని పాత్రలతో(శశి లో, ఆమె భర్త లో, కూతురిలో) తమను తాము identify చేసుకునే సినిమా "English Vinglish". తొంభై శాతం ప్రతి భారతీయ కుటుంబం లోనూ జరిగిన, జరుగుతున్న కథే ఈ సినిమాలోనూ కనబడుతుంది. ఇల్లాలిని లోకువగా చూడటం. ఇంటెడు చాకిరీ చేసి, అందరు అవసరాలను చూసే అమ్మని కొందరు పిల్లలు లక్ష్యపెట్టరు. ఇంటినీ, కుటుంబాన్ని తీర్చిదిద్దే భార్యను కొందరు లోకువ కట్టేస్తారు. సినిమాలో "శశి"కి ఇంగ్లీషు రాదని భర్త, కూతురు హేళన చేసి లోకువ కట్టేస్తూంటారు. కానీ కొన్ని ఇళ్ళల్లో ఇంగీషు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఇల్లాల్ని లోకువ కట్టేస్తూ ఉంటారు. శశి అన్నట్లు చాలా చోట్ల ప్రేమ ఉంటుంది కానీ గౌరవమే ఉండదు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి ఎక్కించడానికి కారణం తన తల్లి అంటారు దర్శకురాలు "గౌరి షిండే"(ఈవిడ "చీనీ కమ్", "పా" దర్శకుడు బాల్కీ భార్య).

"I made this film to say sorry to my mother." అంటున్న గౌరి ఇంటర్వ్యూ క్రింద లింక్ లో.
http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/I-am-a-better-director-than-Balki-Gauri-Shinde/articleshow/16697950.cms


నేను కూడా బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో మా అమ్మ గురించి  ఓ టపా  రాసాను! ఎందుకంటే నాకు అమ్మ విలువ పెళ్ళయ్యాకా కానీ తెలీలే. అసలు పెళ్ళాయ్యాకా కానీ ఏ అమ్మాయికీ అమ్మ పూర్తిగా అర్ధం కాదేమో అనుకుంటాను నేను. ఎన్నో సందర్భాలో "అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా"  అమ్మ పట్ల నాకు గౌరవం పెరిగిపోయేది. మనకు తెలీకుండానే మనం అమ్మని ఎన్ని వందలసార్లు బాధపెట్టి ఉంటామో అనుభవం లోకి వచ్చాకా కానీ తెలీదు. ఎందుకంటే మనం కసిరినా, కోప్పడినా,తిట్టినా, అరిచినా, మాట్లడకుండా ఉన్నా... మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!

ఈ కొత్త దర్శకురాలి మీద ఆశలు పెట్టుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుందీ సినిమా. ప్రతి పాత్ర తమ తమ పరిమితుల్లో ఉండి, ఎవర్నీ ఎవరూ డామినేట్ చేయకుండా  తమతమ పాత్రల్లో(చిన్నవైనా) ఒదిగిపోయారు నటులందరూ. Female protagonist గా శ్రీదేవి డామినేట్ చేసేస్తోంది అని ఒక్కచోట కూడా అనిపించదు. చక్కని కథనంతో, ఆకట్టుకునే డైలాగ్స్ తో, మనసును హత్తుకునే సన్నివేశాలతో మనల్ని బాగా ఆకట్టుకుంటుందీ సినిమా. మనుషుల్లో వస్తున్న మర్పుని గమనించి అందుకు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. బరువైన థీం ని లైట్ గా చూపించటం కొత్త పంథా ఏమో మరి. "బర్ఫీ" అలానే ఉంది. ఇప్పుడు ఇదీ అలానే తీసారు. చాలాచోట్ల మానసు భారంగా అయిపోయినా, వెంఠనే నెక్స్ట్ ఫ్రేమ్ లో మన మూడ్ లైట్ అయిపోతుంది. సినిమా అయ్యాకా ప్రతిభావంతురాలైన ఈ దర్శకురాల్ని అభినందించకుండా ఉండలేం మనం.



 శ్రీదేవి కట్టిన సాదాసీదా కాటన్ చీరలు చాలా బాగున్నాయి.
ఈ సినిమాకి ప్రాణం శ్రీదేవి నటన అన్న సంగతి సినిమా మొదటిభాగంలోనే మనకి అర్ధమైపోతుంది. నటనకు పూర్తి అవకాశం ఉన్న అంతటి శక్తివంతమైన protagonist పాత్ర దొరకటం శ్రీదేవి అదృష్టం అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ, అన్ని రకాల హావభావాలనూ అద్భుతంగా కనబరిచి తన సత్తాను మరోసారి చాటుకుంది శ్రీదేవి. మాధురీ దీక్షిత్ లాగ, కరిష్మా కపూర్ లాగ పేలవమైన సినిమాల్లో కాక పదిహేనేళ్ల తర్వాత వెండితెరపై ఇటువంటి విజయవంతమైన సినిమాతో కనబడటం మంచి విషయం. కానీ రంగుల ప్రపంచపు ప్రలోభాల్లో పడి మళ్ళీ ఓ ఆంటిలానో, అక్కగానో, తల్లిగానో స్థిరపడకుండా ఇకపై తెలివైన పాత్రల్ని ఎంచుకుంటుందా లేదా అన్నది బేతాళ ప్రశ్నే..!

అయితే శ్రీదేవిని ఒక కొత్త నటిలా నేను చూడగలిగాను తప్ప ఆమెలో పాత శ్రీదేవిని ఒక్క క్షణం కూడా పోల్చలేకపోయాను . somehow i felt pitiful to see a skinny sridevi. అందమైన పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేం బాలేదనిపించింది. ఏభైలకి దగ్గర పడుతున్న ఏ స్త్రీ అయినా, శరీరాకృతి కోసం ఎంత శ్రమించినా.. జీవనసంఘర్షణ తాలూకూ ఆనవాళ్ళని దాచిపెట్టలేదేమో!!! ఏదేమైనా Beauty has to wither some day..కదా...అనుకున్నా!



సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంగతులు:

* సినిమా మొదట్లో అందరికీ అన్నీ సమకూరుస్తూ తన కోసం కలుపుకున్న కాఫీ తాగుతు పేపర్ కూడా చదువుకునే తీరిక దొరకదు శశికి. పిల్లాడితో ఆమె సమయం గడపటం, వాళ్ల మధ్యన అనుబంధం లాంటి చిన్న చిన్న డీటైల్స్ చూపించటం బాగుంది. మళ్ళీ భర్త అమెరికా వచ్చిన మర్నాడు అతను కాఫీ అనగానే చదువుతున్న పేపర్ ఆపేసి కాఫీ కోసం వెళ్తుంది శశి. చివరలో "వీళ్ళు నా ముఖ్యమైన స్నేహితులు" అని శశి చూపిస్తే "నీక్కూడా స్నేహితులా " అన్నట్లు చూసే చూపు..  అలాంటి మరి రెండు సన్నివేశాల ద్వారా టిపికల్ భర్తల స్వభావాన్ని బాగా చూపించారు.

* శశి వెళ్ళే ఇంగ్లీష్ క్లాస్ లో స్టూడెంట్స్ బాగున్నారు. ప్రపంచంలో ఎన్నిరకాలవాళ్ళున్నారో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు అనిపించింది.


*శశిని ఇష్టపడే ఫ్రెంచ్ దేశీయుడు క్లాస్ లో నిర్భయంగా తన భావాలను చెప్పటం బావుంది. అతనిలోని నిజాయితీ ఆ పాత్రకు నిండుతనాన్ని ఇచ్చింది.

* క్లాసులు అయ్యేకొద్దీ భాష నేర్చుకుంటున్న వాళ్లలో ధైర్యం, వాళ్ళ నడకలో పెరిగే కాన్ఫిడెన్స్ బాగా చూపెట్టారు.



* "మగవాడు వంట చేస్తే కళ అంటారు.. అదే ఆడది చేస్తే అది తన బాధ్యత అంతే అంటారు.." అనే డైలాగ్ ; అలానే "పిల్లలకు తల్లిదండ్రుల లోటుపాట్లను ఎత్తిచూపి వేళాకోళం చేసే హక్కు ఎక్కడుంది?" అని శశి ఆవేదన పడే సన్నివేశం కళ్ళు తడిచేస్తుంది.

* శశి తన కుటుంబం నుండి గౌరవాన్ని కోరుకుంటోంది అని చెప్పటం కోసం తగినన్ని కారణాలు చూపించారే తప్ప భర్తను గానీ పిల్లని గానీ తక్కువగా చూపెట్టలేదు. అలా వాళ్ళ పాత్రలను మర్యాదపూర్వకంగా నిలబెట్టి ఉంచటం బావుంది.

*సినిమా చివరలో నూతన వధూవరులకు శశి చెప్పే వాక్యాలు చాలా బాగున్నాయి. అవి భార్యాభర్తలకే కాదు స్నేహితులకీ, మరే బంధమైనా నిలబడటానికి ఉపయోగపడేలా ఉన్నాయి.



కథ పెద్దగా లేకపోవటం వల్ల సినిమా కొన్ని సన్నివేశాల్లో సాగదీస్తున్నట్లు స్లోగా నడిచింది. అయినాకూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. కుటుంబం మొత్తం వెళ్ళి హాయిగా చూసిరావచ్చు. ప్రేమించటంతో పాటూ అమ్మను,భార్యనూ గౌరవిస్తూ కూడా ఉండాలి అనే సంగతి ఓసారి గుర్తుచేసుకుని కూడా రావచ్చు.




Thursday, October 4, 2012

నీవల్లే.. నీవల్లే..



రేపు శెలవు అంటే ఇవాళ రాత్రి ఏవన్నా సిడీలు(సినిమాలు) పెట్టుకుని చూడటం మాకు అలవాటు. పొద్దున్నే లేచి పరుగులు పెట్టక్కర్లేదని. అలాగ మొన్న వికెండ్ లో ఒక రోజు రాత్రి ఏదన్నా సీడీ పెట్టండి కాసేపు చూద్దాం.. అని నేను వంటింట్లోకి వెళ్పోయా.

త్వర త్వరగా వంటిల్లు క్లీన్ చేసేసుకుని హాల్లోకి వచ్చేసరికీ అయ్యగారు సీరియస్ గా "Rudali" సినిమా చూసేస్తున్నారు. ఇదేమిటీ విధివైపరీత్యం అని హాచ్చర్యపడిపోయేసా. భాషాభేదం లేదు కానీ అసలు సీరియస్ సినిమాల జోలికే తను పోరు. "సినిమా అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి" అన్నది తన సిధ్ధాంతం. అలాంటిది Rudali లాంటి గంభీరమైన సినిమా..అదీ వీకెండ్ లోనా? నాకే చూడాలనిపించలేదు. పాటలు బావుంటాయి కదా అని పెట్టాను అన్నారు. అది నిజమేననుకోండి కానీ ఇప్పుడా... అని నేను నిరాసక్తంగా కూచున్నా. సరే ఏదోఒకటిలే..ఆయనతో కలిసి చూడాలనే కదా నా కోరిక అని సగం అయిపోవస్తున్న సినిమాని నేనూ చూడ్డం మొదలెట్టా.

"దిల్ హూం హుం కరే.." పాట మొదలయ్యింది. జై భూపేన్ హజారికా.. అహా..ఓహో... అనేసుకున్నాం. "ఝూటి మూటి మితవా ఆవన్ బోలే..", "బీతేనా..బీతేనా రైనా..", "సమైయో... ధీరే చలో.." అన్నీ అయిపోయాయి. రాజ్ బబ్బర్ గురించీ, రాఖీ గురించీ, డింపుల్ టేలెంట్ గురించీ చర్చలు అయిపోయాయి. సినిమా అయిపోవచ్చింది. అదేమిటీ ఇంకా ఆ పాట రాలేదు అన్నారు తను. "ఏ పాట?" అన్నా నేను. అదే లతా పాట "యారా సీలీ సీలీ.." అన్నారు తను. "నేనొచ్చేసరికీ సినిమా సగం అయిపోయింది. మీరు ఏవన్నా సీన్స్ ఫాస్ట్ చేసేప్పుడు మిస్సయి ఉంటారు. వెనక్కి తిప్పి చూడండి.." అన్నా. అయ్యో నేను ఆ పాట కోసమే ఈ సినిమా పెట్టాను. ఏం పాట అసలు..ఏం పాట అసలు... లతా ఎంత అద్భుతంగా పాడుతుంది.." అంటూ మళ్ళీ సినిమా మొదటినుంచీ పెట్టారు. కాస్త కాస్త ఫాస్ట్ చేస్కుంటూ ఇద్దరం మళ్ళీ సీరియస్ గా సినిమా రెండోసారి చూట్టం పూర్తిచేసాం. సినిమా రెండోసారి అయిపోయింది కానీ పాట కనబడలేదు.

"ఇదేమిటీ పాట లేదు.." అన్నాన్నేను. కాసేపాగి..."అసలా పాట ఏ సినిమాలోదో కూడా మర్చిపోయావు నువ్వు?" అన్నారు. నాకప్పటికి కూడా గుర్తు రాలేదు. "యారా సీలీ సీలీ..పాట "Lekin" సినిమాలోది కదా..ఎలా మర్చిపోయావు? ఇంత సీరియస్ సినిమా రెండోసారి కూడా చూపించేసావు" అన్నారు. "ఇది మరీ బావుంది. ఈ సినిమా కావాలని పెట్టుకున్నది మీరు... పోనీలే అని చూస్తూ కూర్చున్నందుకు నన్నంటారేం?" అన్నా నేను. "రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడైనా గుర్తుకు రాలేదా నీకు? పాటలన్నీ నా నోటిమీదుంటాయి అంటావుగా.." అన్నారు. "అవునవును.. అలానే ఉండేవి పెళ్లయ్యేవరకూ..." అన్నాను. "సరేలే ఇప్పుడు చరిత్రలెందుకు.. వీకెండ్ పూటా ఇలాంటి సినిమా నాకు రెండుసార్లు చూపించేసావు.." అన్నారు. "అసలు రెండిటిలోనూ "డింపుల్.." ఉంది అందుకే కన్ఫ్యూజ్ అయ్యా.." అన్నా నేను. అలా నీవల్లే.. నీవల్లే.. అని కాసేపు అనేసుకున్నాకా.. మళ్ళీ Rudali సినిమా గుర్తుకొచ్చి ఇద్దరం పడీ పడీ నవ్వుకున్నాం.

అయినా నిజంగా అంత ఇష్టమైన పాట ఏ సినిమాలోదో కూడా గుర్తులేనంత మరపు వచ్చేసిందా? అని నాలో నేనే కాసేపు మధనపడిపోయా! ఈ చిలిపిజగడానికి మూలకారణమైన ఆ అద్భుతమైన పాట ఇదే...

 

Wednesday, October 3, 2012

Manna Dey's "कुछ ऐसे भी पल होते है.."


ప్రముఖ హిందీ గాయకుడు  మన్నాడే ది ఒక విలక్షణమైన గళం. "आजा सनम ...", "तु प्यर क सगर है ", "लागा चुनरी मॆं दाग..", "प्यार हुआ इक्रार हुआ..", "ये मेरॆ प्यारॆ वतन..", "ज़िंदगी कैसी है पहॆली हायॆ.."सुर ना सजॆ क्या गावू मैं..." మొదలైన పాటలు మన్నాడే కి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. క్లాసికల్ టచ్ ఉన్న హిందీ పాటలు ఎక్కువగా పాడారు ఈయన. ఒక ప్రత్యేకమైన మూసలో ఉండిపోకుండా అన్నిరకాల పాటలు పాడగలగటం మన్నాడే గొప్పతనమే కానీ ఆయన గొంతులోని ఈ versatility వల్ల ఒకోసారి ఇది మన్నాడే పాడినదా?కాదా? అని సందేహం వస్తుంటుంది.

సినిమా పాటలే కాక ప్రైవేట్ పాటలు కూడా చాలా పాడారు మన్నాడే. వాటిల్లో "कुछ ऐसे भी पल होते है.." పాట చాలా బావుంటుంది. నాన్నగారి పాత కేసెట్లలో ఉన్న ఈ పాటను రాసుకుని నేర్చుకున్నా నేను. ఇవాళ అనుకోకుండా యూట్యూబ్ లో దొరికింది. ఈ పాట సాహిత్యం కూడా ఎంతో బావుంటుంది. గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. మీరూ వినండి..


lyrics:
 ప: कुछ ऐसे भी पल होते है(२) 
जब रात कॆ गेहरॆ सन्नाटॆ 
गेहरी सी नींद मॆं सॊतॆ हैं 
तब मुस्कानें कॆ दर्द यहां 
बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं 

౧చ: जब छा जाती है खामोशी 
 तब शोर मचाती है धड़कन 
 एक मेला जैसा लगता है 
 बिखरा बिखरा ये सूनापन 
 यादों के साए ऐसे में
 करने लगते है आलिंगन 
 चुभने लगते है साँसों में 
 बिखरे सपनें का हर दर्पण 
 फिर भी जागे ये दो नैना 
 सपनें का बोझ संजोता है ((ప)) 

 २చ:यु ही हर रात ढ़लती है 
 यु ही हर दिन ढलजाता है 
 हर साँझ यु ही ये बिरही मन 
 पतझर में फूल खिलाता है 
 आखिर ये कैसा बंधन है 
 आखिर ये कैसा नाता है 
 जो जुड़ तो गया अनजाने में 
 पर टूट नहीं अब पाता है 
 और हम उलझे इस बंधन में
 दिन भर ये नैन भिगोते है ((ప))


Saturday, September 29, 2012

ఆకాశవాణి సంగీత సమ్మేళన్

Add caption

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య మానవుడి దాకా తీసుకువెళ్ళటానికి రేడియో సరైన మాధ్యమమని గుర్తించిన రేడియో అధికారులు, మన దేశపు శాస్త్రీయ సంగీత వారసత్వ సంపదను ప్రజలకు అందించే ప్రయత్నం "సంగీత సమ్మేళన్" ద్వారా ప్రారంభించారు. 1954 అక్టోబర్ లో ఢిల్లీ లోనూ, మద్రాసు లోనూ కూడా ఒకేసారి మొదటి రేడియో సంగీత సమ్మేళన్ కార్యక్రమాలు జరిగాయి. ఉత్తర దేశంలో ఢిల్లీ లోనూ, దక్షిణాదిలో మద్రాసులోనూ ఈ కచేరిలు ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్యకారులు ఆ కచేరీలలో పాల్గొన్నారు. ఆ కచేరీలను రేడియోలో దేశవ్యాప్తంగా ప్రసారం చేసినప్పుడు అనూహ్యమైన స్పందన లభించింది.


ఆ స్పందనను చూసిన ఆకాశవాణి ఇకపై ఈ రేడియో సంగీత సమ్మేళన కార్యక్రమాలను వార్షికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యుజికల్ స్కూల్స్ కూ, అన్ని రకాల ప్రాంతీయ వాయిద్యకారులకూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానాలు అందాయి. జాతీయ సమైక్యత ముఖ్య ఉద్దేశంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కచేరీలు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది. కాలక్రమంలో ఈ సంగీత సమ్మేళనాలకు ప్రజాదరణ పెరిగింది. కచేరీలు జరిగే ప్రాంతాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవైకు పైగా ప్రముఖ పట్టణాల్లో ఈ కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కచేరీలు జరుగుతాయి. కానీ అదివరకట్లా లైవ్ ప్రసారలు కాకుండా, కచేరీలను రికార్డింగ్ చేసి, తరువాత ఢిల్లీ నుంచి ఒక నెల పైగా జాతీయ స్థాయిలో ప్రసారం చేయటం మొదలెట్టారు.


ప్రతి సంవత్సరం ఆహూతులైన ప్రేక్షకుల మధ్యన సెప్టెంబర్ నెలలో కచేరీలు జరుగుతాయి. అక్టోబర్, నవంబర్లలో వాటిని రేడియోలో ప్రసారం చేస్తారు. రోజూ రాత్రి పది నుంచీ పదకొండు వరకూ, శని,ఆదివారాల్లో రాత్రి తొమ్మిదిన్నర నుంచీ పదకొండున్నర దాకా, ఆదివారం ఉదయం అదనంగా పది నుంచీ పన్నెండు దాకా ఆ కచేరిలను ప్రసారం చేస్తారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఉత్తమ సంగీత విద్వాంసుల మరియు ఔత్సహిక కళాకారుల గాత్ర , వాద్య సంగీతాలను దేశవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులందరూ పరిచయం చేసుకోవటానికి ఆకాశవాణి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. వీటన్నిటితో పాటూ ప్రతి ఏటా సంగీట సమ్మేళనానికి సంబంధించిన కళాకరుల ఛాయా చిత్రాలు, జీవిత చరిత్ర, ఆ కచేరీ ఎప్పుడు ఎక్కడు ఏర్పాటు చేసినదీ మొదలైన పూర్తి వివరాలతో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన చక్కని రంగుల బ్రోచర్ ను కూడా ఆకాశవాణి ప్రచురిస్తుంది. కచేరీలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరిమితంగా ఈ బ్రోచర్లు లభిస్తాయి. కొన్ని చోట్ల కచేరీ సమయాలలో సభికులకు పరిమితంగా అందచేయటం కూడా జరుగుతుంది. ఇంతటి విలువైన ఆకర్షణీయమైన బ్రోచర్ లను ఎలాగైనా సంపాదించి సంగీతాభిమానులు అపురూపంగా దాచుకునే అలవాటు కూడా ఉంది.


ఈ సంవత్సరం "సంగీత సమ్మేళన్" రేడియో కార్యక్రమాలు నిన్న రాత్రి నుంచీ ప్రారంభం అయ్యాయి. తొలి సంగీత కచేరీ మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతుల నాగస్వర యుగళంతో మొదలైంది. ఈ కచేరీ సెప్టెంబర్ నెల్లో వారణాసిలో ఏర్పాటు చేయబడటం మన ఆంధ్రులకు గర్వకారణం. కచేరీ ప్రసార సమయంలో ఆయా కళాకారుల యొక్క జీవిత సంగ్రహం వివారించి, వారు వినిపిస్తున్న అంశాలు (రాగం,తాళం, వాగ్గేయకారులు వగైరా వివరాలు.) కూడా చెప్పటం వల్ల సంగీతం తెలిసినవారికీ, తెలియనివారికీ కూడా చక్కని సమాచారం అందుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ చానల్స్ వచ్చాయి కాబట్టి, ఈ ప్రసారాలు ఆలిండియా రేడియో ద్వారా, అన్ని ఆకాశవాణి కేంద్రల నుంచీ ఏక కాలంలో ప్రసారమౌతాయని ఈనాటి రేడియో శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి శాటిలైట్ ద్వారా కూడా ప్రసారాలు ప్రారంభించటంవల్ల ఆకాశవాణి కేంద్రాలు లేని దూరదూర ప్రాంతాలవారు కూడా డి.టి.హెచ్ ద్వారా ఈ సంగీత ప్రసారాలను వినే అరుదైన అవకాశం ఉంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య మానవుడి దాకా తీసుకువెళ్ళటానికి ఆకాశవాణి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన అవసరం ఉంది.

Thursday, September 27, 2012

"నికషం"


తపన దిగంతం, నేనూ-చీకటి, కాశీభట్ల వేణుగోపాల్ కథలు చదివిన తర్వాత కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనల పట్ల ఎంతో ఆసక్తి,అభిమానం కలిగాయి. వారి ఇతర రచనలన్నీ పుస్తక ప్రదర్శనలో కొనుక్కున్నా. తర్వాత "పాలపిట్ట"లో వారి కొత్త నవల "నికషం" ధారావాహికగా ప్రచురితమౌతున్నట్లు బ్లాగ్మిత్రులు కొత్తపాళీగారు ఒక వ్యాఖ్యలో చెప్పారు. అప్పటినుంచీ ఆ నవల ఎప్పుడు పుస్తకరూపంలో వస్తుందా అని ఎదురుచూసి కినిగె  ద్వారా "నికషం" కొనుక్కున్నా.


"ప్రపంచంలో ప్రతి మనిషి లోపలా మరొక భయంకరమైన మనిషి దాగి ఉంటాడు. నాగరికత ముసుగులో బ్రతికేస్తు ఉంటాం అంతే! ఆ ముసుగు తొలగించుకుని బాగా దగ్గరగా వెళ్తే ఎవరం ఎవరినీ భరించలేం"... ఇవి ఎప్పుడో పదేళ్ల క్రితం నేను రాసుకున్న కొన్ని వాక్యాలు. కాశీభట్ల వేణుగోపాల్ గారి "నికషం" చదివాకా అప్రయత్నంగా  ఆ వాక్యాలు గుర్తుకువచ్చాయి. అచ్చం నా ఈ భావనలాగానే, మనిషి లోపల ఉండే అంతర్గత, అనావిష్కృత పార్శ్వాలను,వ్యతిరేక అంతర్భాగాన్నీ మనకు వేణుగోపాల్ గారు తన రచనలలో పరిచయం చేస్తారు. మనలో దాగిఉన్న మనకు తెలియని మరో కొత్త వ్యక్తిని చూపగల అద్దం వేణుగోపాల్ గారి రచన. నిజానికి ఆ మనిషి అపరిచితుడేమీ కాదు. మన అంతర్గతాల్లోకి తొంగి చూసుకుంటే కనబడతాడు. వేణుగోపాల్ గారి రచనలు చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనం మనలోని ఆ మరో మనిషిని గుర్తుపడతాం. కానీ సభ్య సమాజంలో నాగరికత ముసుగులో సాంఘీభావంతో మెలుగుతూ ఉంటాం కాబట్టి మనం అతడిని ఎరుగనట్లే ప్రవర్తిస్తాం. అయితే, ఆ లోపలి మనిషిలో ఉన్న వ్యతిరేక అంతర్భాగాన్ని మనం స్వీకరించగలమా? దాని మంచి చెడులను మనం నిర్ణయించగలమా? అసలు నీతీ నిజాయితీలను కొలిచే గీటురాయి ఏది? మనిషిలోని అనావిష్కృత పార్శ్వాలను మంచి చెడుల తూకంతో తూచగలమా? అన్న ప్రశ్నలకు రూపమే "నికషం". (నికషం అంటే 'గీటురాయి’ అని నిఘంటువు చెప్పింది.)


Mysticism, symbolic characters,Stream of consciousness technique, abstract pictures అన్నింటినీ కలిపితే కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనలౌతాయి. "నికషం" లో కూడా ఇవన్నీ మనకు కనబడతాయి. నవల చివర్న(బహుశా పరిచయవాక్యాలేమో) తల్లావఝ్ఝుల పతంజలి శాస్త్రిగారి వ్యాసంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది_ "మంచి పుస్తకం ఆలోచింపజేస్తుంది. అఖరివాక్యం నిన్ను మృదువుగా మౌనం లోకి వదిలిపెట్టాలి. సాహిత్యానికే కాదు. ఇది గొప్ప సినిమాలకి కూడా వర్తిస్తుంది.." అంటారు ఆయన.నవల చివరలో డా.వి.చంద్రశేఖరరావుగారి పరిచయవాక్యాలు కూడా బాగున్నాయి. ("ద్రోహవృక్షం" కథా సంపుటి రచయిత)


"నికషం" చదువుతుంటే సమాంతరంగా ఎన్నో ఆలోచనలు, అస్పష్ట నైరూప్య చిత్రాలు మనసులో కదలాడుతూ వచ్చాయి. నా దృష్టిలో ఏ రచన అయినా కథావస్తువు ముఖ్యం కాదు. ఆ రచన ద్వారా రచయిత ఏం చెప్పదలచుకున్నాడు అన్న విషయం ముఖ్యం. ఆ thought పాఠకుడి వరకూ చేరిందా లేదా అన్నది ముఖ్యం. ఏ పాఠకుడు రచయిత ఆలోచనాపధ్ధతికి చేరువగా వెళ్తాడో అతడికి రచయిత అంతరంగం అవగతమౌతుంది. అలా పుస్తకం చదివిన కొందరి మనసుల్లోకైనా రచయిత ఉద్దేశం వెళ్ళిననాడు ఆ రచనకు పరిపూర్ణత చేకూరినట్లే.


"నికషం"లో నచ్చినవి; గమనించినవి:

 * "దిగంతం"లో నిరుపేద కార్మికుడి దయనీయ పరిస్థితులను ఎంత సహజంగా చిత్రీకరించారో, నికషం లో కూడా sophisticated upper middle class living గురించి కూడా అంత సహజమైన పరిశీలనాత్మకమైన వర్ణన కనబడుతుంది.

* కథా వస్తువు వెనకాల ఉన్న deep mystic instinct

* నిర్భయమైన రచనా శైలి

* చిన్న చిన్న విషయాల పట్ల కూడా రచయితకు ఉన్న పరిశీలన శక్తి

* అన్ని రచనల్లోలాగే చాలా కేజువల్ గా వాడేసే సంయుక్తాక్షరాలు ఒకోసారి చదవటానికి కష్టంగా ఉన్నా చాలా తమాషాగా ఉంటాయి.

* నవలలో ఒక చోట "మనిషికీ మనిషికీ మధ్య ఆకాశం" అంటారు. మనుషుల మధ్యన దూరాన్ని ఆకాశంతో పోల్చటం నచ్చింది నాకు.

* కథకుడు, అతని భార్య కావేరిల మధ్యన చూపిన ఆదర్శవంతమైన అనుబంధం ముచ్చటగా ఉంది. ఇద్దరు మనుషులు ఇంతకంటే ఎక్కువ దగ్గరగా ఎక్కడా ఉండరేమో అన్నట్లు.

* "మనకు తెలీని దాని గురించి ఆలోచించటమంత బుధ్ధి తక్కువ ఇక ఉండదు" అనే వాక్యం రెండు చోట్ల,రెండు సందర్భాల్లో వాడారు రచయిత.

* కావేరి, ప్రియ పేర్లు వారికి ఇష్టమేమో, వేణుగోపాల్ గారి కథల్లో ఈ పేర్లు చదివిన గుర్తు.


నచ్చనిది: 

ఈమధ్యన సినిమాల్లో పొగ త్రాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం" అంటూ వార్నింగులు చూపిస్తూనే సన్నివేశాల్లో వ్యక్తులు తాగినట్లు, సిగరెట్ కాల్చినట్లు చూపిస్తున్నారు. ఈ సన్నివేశాలు అవసరమా? అసలు ఎందుకని చూపెట్టాలి ఇలా? అనుకుంటూ ఉంటాను నేను. అలానే ఇటువంటి ప్రయోగాత్మక రచనలు తెలుగులో రావాలి అని కోరుకుంటుంటే, ప్రతి రచనలోనూ మద్యపానం, మాంసాహారం గురించిన ప్రస్తావన చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఆ ప్రస్తావన లేకుండా కూడా నవల,కథలు రాయచ్చు కదా అనిపించింది నాకు. ఇదొక్కటే నాకు వేణుగోపాల్ గారి రచనల్లో అస్సలు నచ్చని విషయం.


my word:

తాత్వికమైన అన్వేషణ కనబడుతూ, మనిషి లోపలి మనిషిని తట్టిలేపేటువంటి ప్రయోగాత్మకమైన రచనలు ఇంకా ఇంకా తెలుగులో రావలని ఈ నవల చదువుతున్నంత సేపు నాకు అనిపించింది.


Wednesday, September 26, 2012

"పానీ దా రంగ్ వేక్ కే..."


ఈ మధ్యకాలంలో నాకు తోడైన ఏకైక నేస్తం ఎఫ్.ఎమ్! రోజంతా పనులు చేసుకుంటూ పాటలు వింటూ ఉండేదాన్ని. చాలా కొత్త కొత్త పాటలు వస్తూ ఉండేవి. అందులో బాగున్నవి పల్లవులు రాసి పెట్టుకుని, మా కజిన్స్ ని కాపీ చేసి పంపమని అడిగి తెప్పించుకునేదాన్ని. అలా తెప్పించుకున్నవాటిల్లో ఒకటి ఈ "పానీ దా రంగ్ వేక్ కే..."పాట. సంగీతం, సాహిత్యం రెండూ బాగున్నాయి. పాటలో కనిపించే నటుడే గాయకుడు కూడా అవటం విశేషం.

పాట: Pani Da Rang
సినిమా: Vicky Donor
సంగీతం: Abhishek, Akshay
గాయకుడు:Ayushman Khurana
నటులు: Ayushman Khurana, Yami Gautam



lyrics:

Pani da rang Vekh Ke
Pani da rang Vekh ke
Pani da rang Vekh ke

ankhiyaanch hanju rudd de
ankhiyaanch hanju rudd de
mahiya na aaya mera mahiya na aaya
mahiya na aaya mera mahiya na aaya
ranjhna na aaya mera mahiya na aaya
ranjhna na aaya mera mahiya na aaya
aankha da noor vekh ke
aankha da noor vekh keee..
ankhiyanch..hanju rudd de.. a
nkhiyanch..hanju rudd de..

Kamli ho gayi tere bina ajaa ranjhan mere
kamli ho gayi tere bina.. ajaa ranjhan mere
baarish barkha sabkuch pae gayi aaya nai jind mere
baarish barkha sabkuch pae gayi aaya nai jind mere
aankha da noor vekh ke
aankha da noor vekh keee..
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..

Kothe uthe bai ke ankhiya milonde..
na jana humey to kabhi chod t
ere utte marda pyar tainu kardaa..
milega tujhe na koi aur
tu bhi aa sabko chodke
tu bhi aa sabko chodke
meri aakhiyaach hanju rudd de,
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..
ankhiyanch..hanju rudd de..

ఈ సాహిత్యానికి అర్ధం కావాలంటె ఈ లింక్ లోకి చూసేయండి:
http://youtu.be/iznY-m5UrJs

Monday, September 24, 2012

శ్రావ్యమైన గజల్ "బర్ఫీ"





మంచి గజల్ వినటానికి శ్రావ్యంగా ఉంటుంది. కానీ ప్రతి గజల్ సాహిత్యంలోనూ అంతర్లీనంగా ఒక వేదన దాగి ఉంటుంది. అయినా కూడా ఏదైనా మంచి శ్రావ్యమైన గజల్ విన్నంత సేపూ హాయిగా ఎక్కడెక్కడో తేలిపోతాము. అచ్చం అలాంటి భావనే "బర్ఫీ " సినిమా చూస్తున్నంతసేపూ నాకు కలిగింది.
శ్రావ్యమైన గజల్ లా..
 ఐస్క్రీం అంత చల్లగా
వెన్నలాగ స్వచ్ఛంగా తెల్లగా
పట్టులాగ మృదువుగా
నెయ్యి అంత కమ్మగా 
చాక్లేట్ లాగ తియ్యగా..
ఉంది సినిమా.

హాయిగా తమదైన లోకంలో తిరగాడే బర్ఫీ,ఝిల్మిల్,శ్రుతి లతో పాటూ వెనక వెనకే తిరుగుతూ, బర్ఫీ చేసే చిలిపి పనులను చూస్తూ నవ్వుకుంటూ గడిపేసా నేనూ. ఒక భారమైన కథను ఎంతో హృద్యంగా, మన మనసులు బరువెక్కకుండా కథనానికి హాస్యపు రంగు వేసి lighter vein లో చూపించటం ఈ దర్శకుడిలోని అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి సబ్జెక్ట్ తో కోషిష్, ఖామోషీ, బ్లాక్ మొదలైన సినిమాలు వచ్చినా, మనకు నచ్చినా ఆ సినిమాలు చూస్తే మనసులు మరింత భారం అవుతాయి తప్ప తేలికవ్వవు. బర్ఫీ సినిమా చూస్తే మాత్రం కళ్ళు చెమ్మగిల్లినా మనసు తేలికౌతుంది. రెగులర్ ఫార్ములాసినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ వైవిధ్యమైన సినిమాలు నచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతితో, ఆనందంతో హాల్ లోంచి బయటకు వస్తారు.


 అనురాగ్ తీసిన సినిమాల్లో "Kites"  నన్ను చాలా disappoint చేసినా "Life in a... Metro", "Gangster" రెండూ కూడా నాకు బాగా నచ్చాయి. Gangster చూసిన కొన్నిరోజులపాటు అసలు నేను అదే సినిమా గురించి ఆలోచించాను. ఇతని గురించిన మరిన్ని వివరాల కోసం వికీ లోకి వెళ్లిన నేను అనురాగ్ ఆరోగ్యం గురించిన విషయాలు చదివి షాక్ అయ్యాను..! great guy..


And apart from all the other things in the film, Ranbir is amazing ! షమ్మీకపూర్ చిలిపితనాన్ని,అల్లరిని; రాజ్ కపూర్ నటననూ; శశికపూర్, రిషి కపూర్ నీతూసింగ్ ల అందం,హావభావాలు అన్నీ తనలో కలిపేసుకున్న ఈ ప్రతిభావంతుడైన కుర్రాడికి ఉజ్వలమైన భవిష్యత్తు తప్పక ఉందని మరోసారి గట్టిగా అనిపించింది. మొదటి సినిమా(Saawariya) ఫ్లాప్ అయినా అందులో కూడా పరిణితి ఉన్న నటుడిలానే కనిపించాడీ కుర్రాడు. "Rockstar" అయితే పూర్తిగా ఇతని సినిమానే. ఇక బర్ఫీ లో మూగ,చెవిటి కుర్రాడిలాక ఇతను కనబరిచిన నటన అత్యుత్తమం అనే చెప్పాలి. Silence speaks volumes అన్నట్లుగానే కేవలం facial expressions తోనే ఒక పేరాగ్రాఫ్ డైలాగ్ ఇవ్వగలిగిన ఇంప్రెషన్ ని ఇతను ప్రేక్షకుల్లో కలిగించాడు. 





 

పొగరు నిండిన కళ్ళతో నాకస్సలు నచ్చేది కాదు ప్రియాంక. అలాంటిది "What's Your Raashee?" లో పన్నెండు పాత్రల్లో జీవం నింపి నన్ను ఆశ్చర్యపరిచింది. "Fashion" లో మోడల్ గా నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె "Don 2" లో ఏక్షన్ హీరోయిన్ గా అందరినీ(నన్నూ) ఆకట్టుకుంది. ఇక "బర్ఫీ"లో ఒక డీగ్లామరైజ్డ్ పాత్రలో ఆమె నటనకు huge applause ఇవ్వాలనిపించింది. అందం,నటన,గ్లామర్ మూడూ ఉన్న చోట మరి ఆ మాత్రం గర్వం,పొగరు ఉండవా అనుకున్నా..!”వసంతకోకిల ’ సినిమాలో శ్రీదేవి పాత్ర కన్నా కష్టమైనది, ఎక్కువ లోతైనది బర్ఫీలో ’ఝిల్మిల్ ’ పాత్ర.. అటువంటి చాలెంజింగ్ పాత్రలో ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేకుండా ఒదిగిపోయింది ప్రియాంక.


చాలీచాలని బట్టలతో, హీరోతో డాన్సులు మాత్రం చేసే టిపికల్ తెలుగు హీరోయిన్ లాగ, ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో మాత్రమే ఇన్నాళ్ళు చూసిన ఇలియానా ను బర్ఫీలో ఒక బరువైన పాత్రలో చూడటం ఓ పేద్ద సర్ప్రైజ్ నాకు. నటీనటుల నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తెలిసిన దర్శకులు ఉండటం కూడా చాలా ముఖ్యమని మరోసారి ఇలియానా ఋజువు చేసింది. ఎర్రని బొట్టు, కళ్లనిండా కాటుక ఆ అమ్మాయి మొహానికి ఎంత అందాన్ని ఇచ్చిందో! కాటుక నిండిన ఆ పెద్ద పెద్ద కళ్ళని చూస్తే బాపూ ఈ అమ్మయితో ఓ సినిమా తీసేస్తాడేమో అనిపించింది. బస్సులో బర్ఫీ,ఝిల్మిల్ ల మధ్యన కూచున్నప్పుడు తన మొహంలో చూపిన భావాలు, బర్ఫీ మనసులో ఝిల్మిల్ ఉందని అర్ధమైనప్పుడు ఆమె కళ్ళతో కనబరిచే భావాలు నిజంగా ప్రశంసాపూర్వకంగా ఉన్నాయి.

 

గుర్తుండిపోయే కొన్ని సన్నివేశాల గురించి: 

చిన్నదైనా రూపా గంగూలీ(టివీ మహాభారత్ సీరియల్లో ద్రౌపది) పాత్ర గుర్తుండిపోతుంది. ఆమె కూతురికి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సన్నివేశం; బర్ఫీ మొదటిసారి శృతిని చూసే సన్నివేశం; శృతి ని పెళ్ళాడతానని అడగటానికి వచ్చి మళ్ళి తనంతట తానే వెళ్పోతూ ఆమెకు తాను తగనని బర్ఫి చెప్పే సన్నివేశం; బర్ఫీ ఝిల్మిల్ కోసం వచ్చి నిరాశతో వెనుతిరిగినప్పుడు ఝిల్మిల్ పిలుస్తోందని శృతి చెప్పే సన్నివేశం; ఝిల్మిల్ 'ముస్కాన్' తాతగారి వేలు వదిలాకా మళ్ళీ బర్ఫీ వేలు పట్టుకునే సన్నివేశం; చివరలో బర్ఫీ పక్కన ఝిల్మిల్ ఒదిగి పడుకునే సన్నివేశం.. మొదలైన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ గుర్తుండిపోతాయి. నాకు బాగా నచ్చింది బర్ఫీ తనకు ముఖ్యమని నమ్మిన మిత్రులందరినీ ల్యాంప్ పోస్ట్ దగ్గర పరీక్షించే సన్నివేశం. శృతి కూడా బర్ఫీ వేలు వదిలి ఆమడ దూరం పరిగెడుతుంది కానీ ఝిల్మిల్ అలానే నించుంటుంది. నిజంగా కళ్ళు చెమర్చాయి ఆ సన్నివేశంలో నాకు. స్వచ్ఛమైన ప్రేమకీ, స్నేహానికీ నిదర్శనం ఈ సన్నివేశం. మిన్ను విరిగి మీదపడ్డా మనల్ని వదిలివెళ్లని ఒక్క స్నేహం ఉన్నా చాలు కదా జీవితానికి అనిపించింది!! సినిమా చివరలో శృతి చెప్పే మాటలు కూడా అవే కదా. "నాది షరతులతో నిండిన పిరికి ప్రేమ... వాళ్ల ప్రేమ స్వచ్ఛమైనది.. నిబంధనారహితమైనది(Unconditional)...అందుకే వాళ్ల ప్రేమ గెలిచింది..." అంటుంది. 


 డైలాగులు ఎక్కువగా లేని ఈ సినిమాకి నేపధ్యసంగీతమే ప్రాణం. ప్రతి ఫ్రేం లోనూ కూడా వెనుక నుంచి వినబడే నేపథ్యసంగీతం మనసును ఆకట్టుకుంటుంది. ప్రీతమ్(సంగీత దర్శకుడు),అనురాగ్ ల జోడీ ఇంతకు ముందులాగనే బాగా కుదిరింది. "గేంగ్ స్టర్" కూడా ప్రీతమ్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందించాడు. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అసలు స్టన్నింగ్ విజువల్స్ అన్నమాట. వెంఠనే డార్జలింగ్ కి వెళ్పోవాలి అన్నంత అందమైన లొకేషన్స్ చూపెట్టారు. కథ ఎలాంటిదైన ప్రేక్షకుల్లో ఉత్సాహం,ఆతృత తగ్గకుండా ఉండేలాంటి కథనం ఉంటేనే సినిమా ఆకట్టుకుంటుంది. దర్శకుడివే కథ,స్క్రీన్ ప్లే కూడా. అందువల్ల మూడు విభాగాల్లోనూ కూడా అనురాగ్ సమతుల్యం చూపెడుతూ వచ్చాడు. మొత్తమ్మీద ఇది ఒక్కరి సినిమా కాదు.. పూర్తి టీమ్ వర్క్ ఈ సినిమా విజయానికి కారణం. 


బర్ఫీ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యిందని తెలిసాకా, ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈ దర్శకుడి ఆరోగ్యం బాగుండి, ఇతను మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని మనసారా కోరుకున్నా!


Saturday, September 15, 2012

Is life beautiful?


Is life beautiful?

yes Of course...! But if it comes to the telugu film.."Life is beautiful"..i felt.. some colours are really missing ! అందుకే ఆ జీవితం నాకు పెద్దగా అందంగా కనబడలేదు:(

మళ్లీ మరోసారి స్టుడెంట్స్ ..కాలేజ్ లైఫ్ చుట్టూ మనల్ని తిప్పే ఈ కథకు కాసింత ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతఅయ్యింది. కొత్త పిల్లలు(నటులు) తమవంతు కృషిని, శ్రమను తెరపై చూపెట్టగలిగారు కానీ ఎందుకో నాకు సినిమాలో ఏదో మిస్సయింది అనిపించింది నాకు. చాలారోజులకు అమల ను చూద్దాం అని ఉత్సాహపడిన నాకు తన పాత్ర ఎక్కువలేకపోవటం నిరుత్సాహాన్ని కలిగించింది. బహుశా నేను సినిమా నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానేమో అనిపించింది.

శేఖర్ కమ్ముల మొదటి సినిమాను చూడలేదు కానీ 'ఆనంద్', 'గోదావరి', 'హేపిడేస్' మూడు బాగా నచ్చాయి నాకు. ఆవకాయ్ బిర్యాని, లీడర్ పర్వాలేదు అనుకున్నా. ఇక ఈసారి అమల, కొత్త నటులు, రెఫ్రెషింగ్ థీమ్,కాన్సెప్ట్ కూడా బాగుంది....ఇవన్నీ విని,చదివి ఎక్కువే ఆశ పడిపోయాను. mother sentiment, చిన్న పాప నటన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో పాప మాటలు బాగున్నాయి. కంట తడి తెప్పించాయి..! కానీ సంగీతం కూడా శేఖర్ పాత సినిమాల ధోరణిలోనే కాస్త డల్ గా అనిపించింది.

ఇక నాకు అస్సలు నచ్చని విషయం చిన్నపిల్లలా ప్రేమ వ్యవహారాలూ. పదహారు,పదిహేడు వయసు పిల్లలతో తీసే ప్రేమ సినిమాలు అంటే నాకు భలే కోపం అసలు. ఎందుకని ఇలా ? చివరికి ఏం నీతి చెప్తే ఏమిటి? సినిమా అంతా చూపిస్తున్నారా లేదా? మన ఇంట్లో మనం మన ఇళ్ళల్లో అ వయసులో అలాంటి వ్యవహారాల్లోకి దిగితే సహించగలమా? ఎంసెట్ కి ప్రిపెరయ్యే పిల్లలు, డిగ్రి చదివే పిల్లలు.. కాలం అలానే ఉంది ప్రపంచాన్ని చూసి మాట్లాడు తల్లీ అనొచ్చు ఎవరన్నా! కానీ ఎందుకో నాకైతే చిన్న పిల్లలతో అలా సినిమాల్లో ప్రేమ,దోమ చూపిస్తే నచ్చదు. అసలు 'శ్రియ' లాంటి సీనియర్ నటిని ఆ చిన్న పిల్లాడి పక్కన చూస్తేనే నాకు వికారం వచ్చింది. 'u too brutus?' అన్నట్లు 'u too sekhar?' అని అడగాలనిపించింది. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన జంధ్యాల చదువుకునే పిల్లలతో తీసిన సినిమాలనే నేను విమర్శించేదాన్ని. ఏదో కొత్త రకంగా తీస్తున్నాడని, తెలుగు తెరకు మరో విభిన్న దర్శకుడు దొరికాడేమో అని సరదాపడ్డాను. ప్చ్..!

తన టార్గెట్ ప్రేక్షకులు మధ్యతరగతి యువత అని ఒక ఎఫ్ ఎం.రేడియోలో శేఖర్ చెప్పినట్లు ఈ సినిమా యువతకు బాగా నచ్చవచ్చు. But i feel sekhar has definetly lost his magic somewhere around "happy days" itself! ఇకపోతే, "Beauty lies in the eyes of the beholder " అన్నట్లు చూసే కళ్ళను బట్టే కదా.. నా కళ్ళలోనే ఏదన్నా దోషం ఉందేమో మరి..అందుకేనేమో నాకు ఈ 'లైఫ్' బ్యూటిఫుల్ గా ఉన్నా కాస్త రంగు తక్కువగానే కనపడింది..

Tuesday, September 4, 2012

పుట్టినరోజు


" అమెరికా ప్రెసిడెంట్ పుట్టినరోజు ఎప్పుడో తెలిస్తే, ఆయనకు కూడా తలంటు పోసేసి, హేపీ బర్త్ డే చెప్పేసి వస్తుంది మీఅమ్మ" అనేవారు నాన్న. " పాలవాడిదీ, పేపరబ్బాయిదీ కూడా పుట్టినరోజులు కనుక్కోవే.." అనీ, " అసలుజంధ్యాలకు చెప్పు నాన్నా.. శ్రీలక్ష్మితో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నెక్స్ట్ సినిమాకి తయారుచేసుకుంటారు" అనీ అనేవాళ్లంమేము. అలా మేం ఎన్ని వేళాకోళాలు చేసినా అమ్మ మాత్రం ఇప్పటికీ తన హాబీ కంటిన్యూ చేస్తూనే ఉంది. అదేమిటంటేతనకు తెలిసిన బంధుమిత్రులందరి పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ గుర్తు ఉంచుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పటం. మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డో, ఇన్లాండ్ కవరో లేదా కనీసం కార్డ్ ముక్క లో అయినా విషెస్ రాసేసేది. ఇప్పుడుఫోన్లు చేస్తోంది. అంతే తేడా.

సన్నిహిత మిత్రులకూ, సమీప బంధువులకూ శుభాకాంక్షలు చాలా మంది చెప్తారు. కానీ అమ్మ వెరైటీగా పక్కింట్లో ఖాళీచేసి వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని "వదినగారూ మీ రెండోవాడి పుట్టినరోజు రేపు. మా అందరి విషెస్చెప్పండి..." అంటూ కార్డ్ రాసి పోస్ట్ చేసేది. ఇది విజయవాడలో మా పక్కన ఉండి వెళ్ళిపోయినవాళ్ళ సంగతి మాత్రమే. కాకినాడలో మా పై ఇంట్లో అద్దెకు ఉండి వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని కూడా శుభాకాంక్షలు తెలపటం మాకునవ్వు తెప్పించేది. ఒకళ్ళు బ్యాంక్లో చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీలేదు. విజయవాడలో మాకు తెలిసినవాళ్లఅబ్బాయి పెళ్ళి కుదిరితే, పెళ్ళికూతురు కూడా అదే బ్యాంక్ అని తెలిసి, అమ్మ వాళ్ల బ్యాంక్ కు వెళ్ళి అమ్మాయినిపరిచయం చేసుకుని ఫలానావాళ్ళు తెలుసా? ఫలానా సంవత్సరంలో ఫలానా ఊళ్ళో చేసారు.. అంటూ వివరాలు చెప్పి పెళ్ళికూతురు ద్వారా మొత్తానికి వాళ్ల అడ్రసు సంపాదించింది. చిన్నప్పుడు వేళాకోళం చేసినా పెద్దయ్యాకా నాకూ పిచ్చిఅంటుకుంది. చాలా ఏళ్ళపాటు బంధుమిత్రులందరికీ స్వయంగా గ్రీటింగ్స్ తయారు చేసి మరీ పంపేదాన్ని. ఈమధ్యఈమధ్యనే విసుగెత్తి చాలావరకూ పంపటం మానేసాను. అతిమంచితనానికి పోయి విషేస్ చెప్తే జవాబివ్వనివారుకొందరైతే, ఏదో అవసరం ఉండి వంకతో పలకరిస్తున్నాననుకుని అపార్ధాలు చేసుకునేవారు కొందరు. అమ్మ మాత్రంఇప్పటికీ అక్కచెళ్ళెళ్ళ,అన్నయ్యల పిల్లలవీ, వాళ్ళ మనవలవీ, సన్నిహిత మిత్రులందరివీ పుట్టినరోజులన్నీ గుర్తుఉంచుకుని అందరికీ ఫోన్ చేసి విషెస్ చెప్తుంటుంది.

ఊళ్ళోవాళ్ళ సంగతి ఇలా ఉంటే ఇక ఇక ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు అమ్మ ఎలా చేస్తుంది? మా అందరికీ డేట్స్ ప్రకారం, తిథుల ప్రకారం రెండు పుట్టినరోజులూ జరిపేది. అలా ఏటా మాకు రెండుపుట్టినరోజులు చేసుకోవటం అలవాటేపోయింది. అంతేకాక నాకూ, నాన్నకూ స్పెషల్గా మూడు పుట్టినరోజులు ఉన్నాయి. ఎలాగంటే ఓసారి ఒకాయన మాఇంట్లోవాళ్లజాతకాలన్నీ వేసి, నాన్న పుట్టినరోజు ఎప్పుడూ చేసుకునే రోజు కాదనీ, ఆయన పుట్టిన సంవత్సరంలో ఫలానానెలలో ఫలానాతారీఖనీ చెప్పారు. కానీ అప్పటికి నలభైఏళ్లపైగా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్న తారీఖునిమార్చలేక అదీ, కొత్తగా తెలిసిన తారీఖుదీ, తిథుల ప్రకారం కలిపి నాన్నకు మూడు పుట్టినరోజులూ చేసేయటంమొదలెట్టింది అమ్మ. ఇక నేనేమో అసలు అధికమాసంలో పుట్టానుట. కానీ అధికమాసం అస్తమానం రాదుకదా...వచ్చినప్పుడు మూడూ చేసేసేది అమ్మ. అందుకని నావీ మూడు పుట్టినరోజులే!

విధంగా రెండేసి,మూడేసి పుట్టినరోజులు జరుపుకునే సరదాని మా అందరి నరనరాల్లో జీర్ణింపచేసింది మా అమ్మ. నాపెళ్ళి కుదిరిన తర్వాత జాతకాల నిమిత్తం అబ్బాయి జాతకం పంపారు పెళ్ళివారు. మరో వారంలో అబ్బాయి పుట్టినరోజని కాయితంలో చూసి అందరం హడావిడి పడిపోయాం. నేనేమో కష్టపడి నాన్న కేసెట్లన్నీ వెతికి
వివాల్డీ, మొజార్ట్ దగ్గరనుండీ ఎల్.సుబ్రహ్మణ్యం వరకూ నానారకాల సంగీతాలతో ఒక సీడీ తయారుచేసి అబ్బాయికి పంపించాను. ఏంఅంటాడో అని ఆత్రంగా ఎదురుచూస్తూంటే అబ్బాయి ఫోన్ వచ్చింది... "సీడీ విన్నాను..బాగుంది. కానీ నాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు..." అన్నాడు. దాందేముంది పెళ్లయాకా మాకులాగానే రెండుకాకపోయినా ఒక్క పుట్టినరోజన్నా చేద్దాంలే అనుకున్నా నేను. తీరా పెళ్లయ్యాకా చూస్తే సెలబ్రేషన్ సంగతటుంచి అసలుపుట్టినరోజుకి అయ్యగారు కొత్త బట్టలు కూడా కొనుక్కోరని తెలిసి అవాక్కయ్యాను. 'రేపు మీ పుట్టినరోజండి..' అని నేనేగుర్తుచేసాను. అంతలో మరో కొత్త విషయం చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చారు..

తన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో డౌట్ ఉందని చెప్పేసరికీ ముచ్చెమటలు పోసాయి నాకు. పుట్టినరోజు అంటే అదోఅద్భుతమైన రోజని నమ్ముతూ సంవత్సరం అంతా రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను నేను. ఊరందరికీపుట్టినరోజులు చేసేస్తుంది మా అమ్మ. అలాంటిది శ్రీవారి డేట్ ఆఫ్ బర్తే డౌటంటే... ఎలా? అని తెగ బాధ పడిపోయాను. అప్పుడిక లాభం లేదని విక్రమార్కుడి చెల్లెల్లు అవతారం ఎత్తేసాను. మా అత్తగారి ఊళ్ళో ఆయన హాస్పటల్లో పుట్టారోకనుక్కుని, అక్కడికి మనిషిని పంపి, నానా తంటాలు పడి మొత్తానికి నెలరోజుల్లో శ్రీవారి అసలైన పుట్టినరోజుకనుక్కున్నా. అదృష్టవశాత్తు పాత రిజిస్టర్లు ఇంకా హాస్పటల్లోవాళ్ల దగ్గర ఉండటం వల్ల అది సాధ్యమైంది. హమ్మయ్య! అనుకుని అప్పటినుండీ చక్కగా తన పుట్టినరోజు కూడా నేనే చేసేసుకుంటున్నా. అంటే పట్టుబట్టి సెలబ్రేట్ చేసేది నేనేకాబట్టి విధంగా ఇదీ నా పుట్టినరోజు క్రిందే లెఖ్ఖలోకి వస్తుందన్నమాట..:)

ఇంతకీ అసలు చెప్పొచ్చేదేమిటంటే
ఇవాళ నా పుట్టినరోజు! ఇది అధికబాధ్రపదం కాబట్టి నా నిజమైన తిథులపుట్టినరోజుకూడా నిన్ననే అయ్యింది. ఇంకా ఎప్పుడూ చేసుకునే తిథులపుట్టిన్రోజు మళ్ళీ నెల్లో ఇంకోటి ఉంది :)


Sunday, August 19, 2012

ఇదీ కథ !




.....ఎక్కడ నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు... అసలు నా బ్లాగ్ నేను మళ్ళీ ఇన్నాళ్లకు.. దాదాపు రెండు నెలల తర్వాత చూసుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది ! మూడేళ్ళ మూడు నెలల ప్రియమైన బుజ్జాయి నా ఈ బ్లాగ్. అసలు ఇన్నాళ్ళు రాయకపోవటం అటుంచి అసలు చూసుకోవటం కూడా కుదరలేదు :( ఆ మధ్యన ఒకసారి నెట్ సెంటర్ కి వచ్చినా బ్లాగ్ చూసుకోవటం కుదరలేదు. జీవితం ఎంతో చిత్రంగా మలుపులు తిప్పుతూ వేగంగా తనప్రవాహంతో పాటుగా ఎటు తీసుకుపోతోందో తెలీకుండా రోజులు గడిచిపోతున్నాయి. బ్లాగ్ రాయలేకపొతున్నానన్న బాధ ఉన్నా.. బావుంది.. ఇలానే బావుంది.

గడిచిన మూడు నెలల కాలంలో రకరకాల సమస్యలు; ఆ తర్వాత ప్రియబ్లాగ్మిత్రుడు, తమ్ముడు శంకర్ హఠాన్మరణం... అన్నీ ఒక్కసారిగా జీవితాన్నీ,మనసునీ కుదిపేసాయి. ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేసాయి... ఏం జరుగుతోందో తెలీని అయోమయంలో,వేదనలో కొట్టుకుపోతున్న సమయంలో చీకటి వెనుక ఓ వెలుగురేఖ కనపడింది. కష్టకాలంలో అభయమిచ్చి నేనున్నానని తెలిపే భగవంతుడు నిజంగా మాకొక వరాన్నే అందించాడు. ఎటువంటి రికమెండేషన్ లేకుండా మేము నాలుగునెలలుగా ఎదురుచూస్తున్న మంచి స్కూల్ లో పాపకు సీట్ వచ్చింది. అప్పటికి మేము ఆశ వదిలేసుకుని పాపను పాత స్కూల్లోనే చేర్చేసాము. చేర్చిన పదిరోజులకి, చివరిసారి రిజల్ట్ కోసం చాలా నిస్తేజంగా నేను ఆ స్కూల్ కి వెళ్ళాను. నోటీస్ బోర్డ్ లో చివరి సీట్ మా పాపకు వచ్చినట్లు చూడగానే కళ్లవెంట నీళ్ళు జలజలా కారాయి..! తనకు ఫోన్ చేసాను కానీ నోట మాట రావట్లేదు చెప్పటానికి.. ఆ ఆనందం మరవలేనిది ! ఇక పాప భవిష్యత్తు గురించిన బెంగ లేదు !


ఆ తర్వాత జీవితంలో ఎంతో కాలంగా మేము ఎదురుచూస్తున్న మార్పులన్నీ ఒకదాని వెనుక ఒకటి వాటంతట అవే జరిగిపోయాయి. మరో పదిరోజుల్లో పాపస్కూల్ కు దగ్గరగా ఇల్లు మారటం, పాపని కొత్త స్కూల్లో చేర్చటం, పొద్దుటే నాకు కేరేజీలు కట్టే హడావుడి.. మొదలైపోయింది. అయితే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వీలయినన్నాళ్ళు ఇంటర్నెట్ కానీ, కేబుల్ కనక్షన్ కానీ పెట్టించుకోకూడదు అని. న్యూస్ పేపర్ మాత్రం వేయించుకుంటున్నాం. పని చేసుకుంటూ వినటానికి రేడియో, ఎఫ్.ఎంలు ఉన్నాయి. ఖాళీ దొరికితే చూడటానికి సీడిలు, చదవటానికి పుస్తకాలు ఉన్నాయి. ఇక టివి,నెట్ కనక్షన్ అనవసరం అనిపించింది. నెట్ సెంటర్ కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కావాలన్నా వెళ్లలేనంత దూరం. నేనయితే ఆలోచనలకు కూడా ఖాళీ అనేది ఉండకూడదు అని పనిమనిషిని కూడా పెట్టుకోలేదు. రోజంతా పనులతోనే గడిచిపోతోంది. ప్రస్తుతానికి పాప వచ్చాకా మిస్సయిన రెండు నెలల పాఠాలూ, హోంవర్క్ చేయించటం సరిపోతోంది. కొన్నాళ్ళపాటు ఇలానే ఉండాలని కోరిక. అయితే అమ్మావాళ్ళే నలభై కిలోమీటర్ల దూరం అయిపోయారు. తరచూ వెళ్లటం చాలా కష్టం ఇకపై..!


నా మొక్కలు ఓ పదిహేను కుండీలు తెచ్చుకున్నాను. ఇంక లారీలో పట్టలేదని మరో పదో పన్నెండో ఉండిపోయాయి... ఎప్పటికి తెచ్చుకుంటానో అని వాటిని రోజూ తలుచుకుంటూ ఉంటాను. మొత్తం సామానంతా కొత్తింట్లో సర్దేసరికీ విరక్తి వచ్చింది. అసలు ఎందుకు ఇంత సామాను పెంచుకున్నానా అని నన్ను నేనే తిట్టేసుకున్నాను. ఏదీ పడేయలేను...ఉంచలేను. నిజం చెప్పాలంటే మూడొంతులు సామానంతా నేను పోగేసినదే!! నాలుగైదు పెద్ద అట్టపెట్టల పుస్తకాలు అన్నీ నావే. పుస్తకాల అట్టపెట్టెలు తెరవకుండా ఇంకా అలానే ఉంచేసాను. అసలు నేను చనిపోతే నా తాలూకు సామానంతా ఏమౌతుందా అని ప్రశ్న కలిగింది..?! పాకల్లో ఉండేవాళ్లకు ఇంత సామాను ఉండదు కదా? అయినా వాళ్ళు బ్రతకటం లేదా? మరి నాకెందుకు ఇంత సామాను? ఈసారి సమయం లేకపోయింది కానీ మళ్ళీ ఇల్లు మారే సమయానికి వీలయినంత సామాను ఎలిమినేట్ చేసేయాలని నిర్ణయించుకున్నాను.









ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం అవటం వల్ల మా ఇంటి చుట్టురా చాలా వరకూ పెద్దపెద్ద చెట్లు, పొలాలు, కూరగాయల పొలాలు ఉన్నాయి. అసలు సిటిలో ఉన్న భావనే లేదు. ఇటువంటి ప్రశాంత పల్లెవాతావరణంలో ఉండగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాకింగ్ కి ఆదివారాలు కూడా మానకుండా తప్పనిసరిగా వెళ్తున్నాను. పొద్దుటే కాలుష్యంలేని చల్లని గాలి, చుట్టూరా పచ్చదనం చూస్తుంటే అసలు కొత్త ఉత్సాహం మనసంతా నిండిపోతుంది. చుట్టురా బోలెడు రకల మొక్కలు.. అన్నీ ఆకుపచ్చ రంగువే కానీ అందులోనే ఎన్ని రంగులో.. అసలు ఆకుపచ్చ రంగులో ఇన్ని షేడ్స్ ఎలా ఉన్నాయబ్బా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ చుట్టుపక్కలమొక్కలన్నీ చూస్తుంటే. "ఎన్నెన్నో వర్ణాలు.." అని పాడాలనిపిస్తుంది. క్రమం తప్పని ఉదయపు నడక, రోజంతా శరీరానికి కావాల్సినంత శ్రమ ఇక నిద్రలేమిని దూరం చేసేసాయి. నిద్రపోయే సమయానికి ఆటోమెటిక్ గా కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు. టివీ, ఇంటర్నెట్ ఉంటే ఎంత సమయం వృధా అయిపోయేదో కదా అనుకుంటూ ఉంటాము మేమిద్దరమూ.


ఇప్పుడు మాదేమో గేటేడ్ కమ్యూనిటీ. ఇక్కడి మనుషులనూ, ఫ్లాట్స్ ని చూసినప్పుడల్లా బ్లాగ్మిత్రులు కృష్ణప్రియ గారి గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు గుర్తుకువస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనుషులను వారివారి ఫ్లాట్ల నంబర్లతోనే గుర్తిస్తారు. అవన్నీ మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే కబుర్లు ! మా ఇంటి చుట్టూరా ఉన్న పొలాల ఫోటోలు కొన్ని తీసాను అవి ఇక్కడ -http://lookingwiththeheart.blogspot.in/2012/08/blog-post.html చూడండి.. ఇంకా తీద్దామంటే ఇల్లుమారిన తర్వాత కెమేరా ఛార్జర్ ఇంకా దొరకలేదు..:( అది దొరికితే మరికొన్ని తీయగలుగుతాను. ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఇంకా ఎక్కువ కాయగూరల పొలాలు ఉన్నాయి. చాలా బావున్నాయి. మొన్నసారి వెళ్ళినప్పుడు కెమేరా మర్చిపోయాను. మళ్ళీ ఎప్పుడన్నా బ్లాగ్ రాసినప్పుడూ ఆ ఫోటోలు పెడతాను..


ఇదీ కథ ! ఇందుమూలంగా నాకర్ధమైందేమిటంటే మనకి జీవితంలో ఏది ఎప్పుడు అవసరమో అది భగవంతుడే ఇస్తాడు. అవసరం లేనిది ప్రాకులాడినా రాదు. మనకు అవసరం ఉన్నది వద్దన్నా మనకు దక్కకుండా ఎక్కడికీ పోదు..!! రాసే అలవాటు పోయి వేలు నెప్పెడుతోంది టైప్ చేస్తుంటే..:) ఇలా పచ్చదనంతో పాటుగా సాగుతోంది జీవితం... ఇక్కడ మజిలీ ఎన్నాళ్ళో..ఏమో.. !!