సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 8, 2014

తెలిసి రామ చింతనతో ...





"తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా..." అని ఇవాళ రామనామ సంకీర్తన చేయదలచి... నాలాంటి నీలమేఘశ్యామప్రియుల కోసం ఈ కీర్తనలు... 


 తెలిసి రామ చింతనతో.. 
 


 రారా మా ఇంటిదాకా..  


రఘువంశ సుధాంబుధి.. 
 














నను పాలింప నడచి వచ్చితివో.. 
 


 రామా  నన్ను బ్రోవరా...శ్రీరామా.. 
 


 రామ రామ రామ రామ...  



 మరుగేలరా..
   



 బ్రోచేవారెవరురా..
   




 రారా రాజీవలోచన రామా..  

సీతమ్మ మాయమ్మ..
   


*** *** *** 

ఇదివరకూ టపాయించిన మరికొన్ని కీర్తనలు..

నిన్నే నెర నమ్మినానురా.. 
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_19.html 


ఇక కావలసినదేమి.. 
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_07.html 


రాగ సుధా రస.. 
http://trishnaventa.blogspot.in/2010/02/blog-post_20.html

Thursday, April 3, 2014

నా స్వప్నలోకాలు.. mesmerizing tunes..




వాద్య సంగీతానికీ నాకూ ఒక నాస్టాల్జిక్ బంధం! ఊహ తెలిసిననాటి నుండీ వింటూ వచ్చిన పాశ్చాత్య వాద్య సంగీతం నాపై అమితమైన ప్రభవం చూపింది. వివరాలు, ఆర్టిస్ట్ ల పేర్లు తెలియకపోయినా నాన్న వింటూంటే కూడా వినడం, ఆ తర్వాత మళ్ళీ వినాలనిపించినప్పుడు ఫలానా కేసెట్ వెతుక్కుని మళ్ళీ వినడం నాకు అలవాటుగా ఉండేది. ఏ పని చేస్తున్నా ఏదో ఒక వాద్య సంగీతం వినడం పాటలు వినడం కన్నా ఇష్టమైన పని నాకు ఒకప్పుడు. నాన్న దగ్గర ఏ అరలో ఏ కేసెట్ ఉంది, ఏ కేసెట్లో ఏం ఉన్నాయి అనే వివరాలు నాకు తప్ప ఇంట్లో మరెవరికీ ఎక్కువ తెలీదు.


పెళ్లయ్యాకా కంప్లీట్లీ different world లోకి వెళ్పోయాను. పక్కా ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ! అసలు దాదాపు అన్నీ మర్చిపోయాను. బీథోవెన్, వివాల్డీ లు పూర్వ జన్మ స్మృతుల్లా మిగిలిపోయారు. ఇన్నేళ్లకి ఇప్పుడు సంగీతం వినడానికి ఏకాంతం దొరుకుతోంది కానీ నాన్న దగ్గర నుండి ఆ కెసేట్లు తెచ్చుకుని కాపీ చేసుకునే సమయమే ఉండట్లేదు. నిన్న సాయంత్రం వంటింట్లో పనులు చేసుకుంటూ 102.8 fm (వివిధభారతి) పెట్టేసరికీ హఠాత్తుగా  ఒక 'సింఫొనీ ఆర్కెస్ట్రా' వస్తోంది.. చెకోవ్స్కీ దేదో..! ఆ సింఫొనీ ఆర్కెస్ట్రా వరుసగా అలా వింటుంటే పూర్వ స్మృతులన్నీ ఒక్కసారిగా దుమ్ము దులుపుకుని నన్ను చుట్టుముట్టేసాయి. ఆ స్వప్నలోకాల్లో మరోసారి విహరించా...!!


నిన్న కుదర్లేదు కానీ ఇవాళ మధ్యాహ్నం ఇదివరలో కాపీ చేస్కున్న ఓ పాత సీడీ వెతుక్కుని అవన్నీ 'యూట్యూబ్' లో వెదకడం మొదలెట్టా.. కొన్ని దొరికాయి!! ఇదిగో దొరికిందే తడవు ఈ టపాలో భద్రపరిచేద్దామని రాయడం మొదలెట్టా :) వాద్య సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తప్పకుండా వినండి.. ట్యూన్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి.. ఏవో స్వప్న లోకాల్లో విహరింప చేస్తూ.. నూతన ఉత్సాహాన్ని నింపేస్తూ.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లకపోతే అడగండి!


క్రింద ఉన్నవన్నీ నేను ఒకప్పుడు చాలా చాలా ఇష్టంగా ప్రతి noteనీ ఆస్వాదిస్తు మళ్ళీ మళ్ళీ విన్నవే..

This is too good..
Richard Clayderman - Ballade Pour Adeline  


 Pan Pipe Moods - Without You
  

Kenny G - Songbird 
  

YANNI - One man's Dream
 

Yanni- If I could tell you
 


Yanni - Live at the Acropolis (Nostalgia)
  


Beethoven - Moonlight Sonata
   


Antonio Vivaldi - The Four Seasons
 

Wednesday, April 2, 2014

13 భారతీయ భాషల 'తొలి కతలు'





"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ దొరికిన కథలే తొలికతలనే గీతని నిర్ణయించి కథలను వెతికారుట. అలా వెతికి వెతికి ఒక పదమూడు భారతీయ భాషల్లోని కథలను అనువాదం చేయించి ఈ సంకలనంలో అచ్చు వేసారు. 


మిగతా భాషల్లో కన్నా తెలుగులో మొదటి కథ మీద చాలానే భిన్నాభిప్రాయాలున్నాయిట. గురజాడ గారి 'దిద్దుబాటు' కన్నా ముందు భండారు అచ్చమాంబ గారి 'ధన త్రయోదశి' కథ కాక మరో అరవై ఐదు కథలున్నాయిట తెలుగులో. మిగిలినవేమీ అచ్చులో లభ్యం కానందువల్ల ధన త్రయోదశి, దిద్దుబాటు  రెంటినీ తొలి తెలుగు కథలుగా ఎన్నుకున్నారు. ఈ పుస్తకంలో ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళం, తెలుగు, కొంకిణీ, తుళు, కశ్మీరీ మొదలైన భాషల్లోని తొలి కథలున్నాయి. అప్పటి రచయితల్లో సామాజిక స్పృహ బాగానే ఉందనీ, సామాజికమార్పుని అభిలషిస్తూ ఈ కథారచనలు చేసారనే అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. ప్రతి కథకూ ముందర ఆ కథారచయిత పరిచయం, కథ వెనుక అనువాదకుని/అనువాదకురాలు యొక్క పరిచయం కూడా ఇచ్చారు. 


పుస్తకంలో కథలన్నింటినీ క్రానాలజీ ప్రకారం ప్రచురించడం విశేషం. అలా చూస్తే భారతీయ భాషల్లో మొదటిది ఒక ఉర్దూకథ. ఆ తర్వాతది ఇరవై మూడేళ్ళ వయసులో ఠాగూర్ రాసిన 'రేవుకథ'. ఇందులో ఒక రేవు మనకు కథను చెప్తుంది. 'వారసత్వం' అనే మలయాళీ కథ తాను తీసుకున్న గోతిలో తానే పడిన ఓ దొంగ స్వగతం. ఒడియా కథ 'రేవతి', తమిళ కథ 'కుంభమేళాలో చిన్నకోడలు' రెండూ కంట తడి పెట్టిస్తాయి. తెలుగు కథలు రెండిటి భాష గ్రాంధికంగా ఉండి కాస్త చదవడానికి కష్టతరంగానే ఉంది. తుళు కథ కాస్త సరదగా ఉంది. అన్ని కథలనూ ఆయాభాషల నుండి అనువదించగా ఒక్క కాశ్మీరీ కథను మాత్రం ఇంగ్లీషు నుండి అనువదించారుట. 


ఇవన్నీ గొప్ప కథలు అని అనలేము కానీ వైవిధ్యభరితమైన కథలని అనవచ్చు.  సాహిత్యరంగంలో కథాప్రక్రియ ఊపిరి పోసుకుంటున్న తరుణంలో వెలువడ్డవి కాబట్టే వీటికి ప్రాముఖ్యత. భారతీయ భాషల్లోని తొలి కథలనేవి అసలు ఎలా ఉన్నాయి? తమ కథల ద్వారా రచయితలు చెప్పదలిచిన విషయాలు ఈ కథల్లో కనబడతాయా? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.


Tuesday, April 1, 2014

నవలానాయకులు - 4



'కౌముది' లో ప్రచురితమవుతున్న "నవలానాయకులు" శీర్షికలో ఈ నెల నవలానాయకుడు.. "అతడు"! 

అతడెవరో ఏంటో.. క్రింద లింక్ లో చదవండీ.. 
http://www.koumudi.net/Monthly/2014/april/april_2014_navalaa_nayakulu.pdf







Monday, March 31, 2014

ఉగాది శుభాకాంక్షలు



బ్లాగ్మిత్రులందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు..

Thursday, March 27, 2014

గౌతమీ గాథలు


"దేశంలో ఎన్నినదులు లేవు?ఏమిటీ హృదయబంధం?

గోదావరి ఇసుకతిన్నెలు.. పాపికొండలు.. భద్రాద్రి సీతారాములు...
గట్టెక్కిన తరువాత 
కడచిన స్నేహాల వియోగాల సలపరింపులు
సభలు, సాహిత్యాలు, వియ్యాల్లో కయ్యాలూ
కయ్యాల్లో వియ్యాలు!
రక్తంలో ప్రతి అణువూ ఒక కథ చెబుతుంది.."
అంటారొక కథలో రచయిత 'ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి'.


నిజానికివి కథలు కావు. తూర్పుగోదావరి జిల్లాలో రచయిత గడిపిన సాహిత్య జీవితానికి జ్ఞాపకాలు. ఆ అనుభవాలన్నింటికీ ఎంతో ఆసక్తికరంగా కథారూపాన్నందించారాయన. ఆ రోజుల్లో ఎందరో గొప్పగొప్ప సమకాలీన సాహితీవేత్తల స్నేహం, సహచర్యం పొందిన అదృష్టవంతులు హనుమచ్ఛాస్త్రి గారు. ఈ పుస్తకం ద్వారా ఆనాటి సంగతులు, ఆయా రచయితల తాలూకూ కబుర్లు చదవగలగడం మన అదృష్టం. ఆ కాలపు సాహిత్యవాతావరణాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. శ్రీపాద, చెళ్లపిళ్ళ, బాపిరాజు, విశ్వనాథ, పి.గణపతిశాస్త్రి, దేవులపల్లి, భమిడిపాటి మొదలైన ఎందరో మహానుభావుల కబుర్లు, ఆ స్నేహాలు, ఆప్యాయతలు, వారి సంభాషణలు చదవగలగడం నాకైతే చాలా చాలా ఆనందాన్నిచ్చింది.


కొన్నాళ్ళు ఈనాడులో ప్రచురితమయ్యాకా, ఓ ఏడాది తర్వాత ఆంధ్రజ్యోతిలో "గౌతమీ గాథలు" పేరిట ధారావాహికంగా వచ్చాయిట ఇందులోని వ్యాసాలు. మళ్ళీ దాదాపు ముఫ్ఫైఏళ్ల తరువాత క్రిందటేడు పుస్తకరూపంలో ఇవి ప్రచురితమయ్యాయి. రామచంద్రపురం బోర్డ్ నేషనల్ స్కూల్లో తెలుగు, సంస్కృతం అధ్యాపకులుగా ఉంటూ ఎన్నో అభ్యుదయోత్సవాలు, వసంతోత్సవాలు నిర్వహించారు  హనుమచ్ఛాస్త్రిగారు. "ఈ గాథలు స్వీయచరిత్రాత్మకాలు. సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులు తెలియజేస్తాయి.." అంటారు రచయిత కుమారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.


"సుమారు ఏభై ఏళ్ల క్రిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి?వాటి వెనుక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేసాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించారు? అనే బొమ్మ ఈ తరంవారికి చూపడమే నా ముఖ్యోద్దేశం.(4-3-81)" అంటారు రచయిత ముందుమాటలో. చివరలో "రౌద్రి, మాఘ బహుళ సౌమ్యవారం, మహాశివరాత్రి " అనే సంతకమే భలే పులకింతను కలిగించింది. ఈమధ్యన మరికొన్ని పుస్తకాల్లో కూడా ఇలాగే ముందుమాట చివరలో సంవత్సరం, తిథి, వారాలతో కూడిన సంతకాలు చూసి చాలా సంబరపడ్డాను.



పుస్తకంలోని కొన్ని విశేషాలు:

* శ్రీపాద వారిది 'రావణా పట్టుదల' అని కొన్ని ఉదాహరణలు చెప్తూ "ఏటికి ఎదురీత అయిన ఈ పట్టుదలతో ఆయన లోకంలో నెగ్గుకు వచ్చారంటే ఎంత ప్రాణశక్తి వచస్సారం ఖర్చుపెట్టి ఉంటారో అనిపిస్తుంది" అంటారు రచయిత. ఆయన పెట్టిన పత్రిక నడవకపోతే ఓటమినొప్పుకుని, ఆయుర్వేదం తెలుసును కాబట్టి బజార్లో ఆయుర్వేదం కొట్టు పెట్టీ చూర్ణాలు, మాత్రలు, లేహ్యాలూ అమ్మేవారుట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.


* "విస్సన్న చెప్పిన వేదం.." అని మిస్సమ్మ పాటలో వస్తుంది కదా, ఆ నానుడీ ఎలా వచ్చిందో ఓచోట చెప్పారు. 'ఇంద్రగంటి' ఊరి పేరే ఇంటిపేరయిన విస్సన్నగారి పూర్తి పేరు "ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి"ట. ఆయన కోటిపల్లి కోట నివాసి, మహా పండితుడు, గొప్ప ధర్మవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయిందిట.


* అవధానం గురించి చెప్తూ జాతీయోద్యమంతో పాటూ భావకవిత్వం జోరు ఎక్కువై అవధానాల పత్ల మోజు ఎలా తగ్గిందో, రాయప్రోలువారు, వేదుల వారు మంచి కవిత్వం వైపుకి ఎలా తిప్పారో చెప్తూ అసలు అవధానం అంటే ఏమిటి? అవధానం ఎలా చేస్తారు.. మొదలైన వివరాలు విపులంగా చెప్పడమే కాక తాను చూసిన ఒక అష్టావధానానికి చమత్కారముగా ప్రత్యక్ష్యవ్యాఖ్యానం చెప్తారు 'అవధానం' కథలో.


* 'కర్ణాట కలహం' అంటే 'కోరి పోట్లాడటం' ట. ఓసారి శ్రీపాదవారి మందుల కొట్లో జరిగిన సంభాషణ గురించి చెప్తారు రచయిత ఈ కథలో. మెట్లెక్కి వెళ్ళగానే కనబడ్డ భమిడిపాటి కామేశ్వరరావుగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, పి.గణపతి శాస్త్రిగార్లను; ఓ చేత్తో మందులు అందిస్తూనే సాహిత్య గోష్ఠిలో పాల్గొంటున్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారినీ చూస్తే అది 'మందుల కొట్టా? సాహిత్య దుకాణమా?' అని సందేహం వచ్చిందిట రచయితకు. 

కొందరు పండితులను గేలి చేస్తూ వెలువడ్డ ఓ పత్రికను చూసి కామేశ్వరరావుగారు పి.గణపతిగారికొక సలహా ఇస్తారు "పండితులను వెటకారం చెయ్యడం ఈనాటి ఫాషన్. మనకు ఏది లేదో అది ఉన్నవారి మీద అసూయ తెలియకుండానే పుట్టుకు వస్తుంది. ఈనాడు ప్రబంఢాలను తిట్టేవారంతా ముందు అవి అర్థం కాక. తర్వాత సామాజిక స్పృహ, ప్రజావళి,అవగాహన అనేవి పడికట్టు రాళ్ళు. ఆధునిక పరిజ్ఞానానికీ, సదవగాహనకీ, పండితుడవడం అడ్డు రాదు. అవి విలక్షణమైన చిత్త సంస్కారం వల్ల ఏర్పడతాయి కానీ చదువుకున్న భాష వల్ల కాదు. 
ఇంకో చమత్కారం ఉంది.. ఈ పీచు కాగితాల పత్రిక్కి గుర్తింపు కావాలి. దానికొక సంఘర్షణ లేవదియ్యాలి. మీ వంటివారు రంగం లోకి దిగితే ఇంక వారికి కావలసినదేమిటి? దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. మీరు గడుసువారయితే ఒక పని చెయ్యాలి. దీన్నీ దాని రాతల్ని ఖాతరు చెయ్యకుండా రచనల్ని జోరు చెయ్యండి. మీ పరిజ్ఞానం ఎంతటిదో, మీ అవగాహాన ఏమిటో ఋజువు చెయ్యండి. బస్ , అదే దానికి జవాబు".
కృష్ణశాస్త్రి గారు కూడా ఓ విమర్శ గురించి ఇదే మాటన్నారుట ఒకసారి.. "వారికి మేమేం జవాబు చెప్పగలం? మరింత జోరుగా, రెట్టింపు ఉత్సాహంతో వ్రాయడమే వారికి తగిన జవాబు!" అని.

ఈ ఇద్దరు పండితుల మాటలూ ఈనాటికీ ఎంతగా వర్తిస్తాయి.. అనిపించింది నాకు. 


* 'లంకలో లేడిపిల్ల', 'వ్యసనైకమత్యం', 'అల తల వల', 'రైల్వే సుందరి' కథలు ఆకట్టుకుంటాయి.


* 'ఆవకాయ మహోత్సవం' కథలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఆవకాయలు ఎలా పెడతారో చెప్పే ఘట్టం మహా సరదాగా ఉంది. చివర్లో ఆ రోజు తిన్న రకరకాల కొత్తావకాయల దెబ్బకు నిద్రపట్టక కదులుతున్న రచయితకు శ్రీపాదవారు 'ద్రాక్షారిష్టం' ఇచ్చి నిద్ర పట్టించడం నవ్వుతెప్పిస్తుంది.


* 'క్యూ' కథలో ఒక పల్లెటూరి గృహిణి స్వచ్ఛత, నిర్మలత్వం కట్టిపడేస్తాయి. రచయిత అన్నట్లే పట్నవాసపు ప్రలోభాలూ, సంపర్కాలూ కొందరి మనసుల్లోని స్వచ్ఛతని నిజంగా చంపేస్తున్నాయి అనిపిస్తుంది!


అలా అయిదేళ్ళ పాటు అమ్మ గౌతమి వద్దా, గొప్ప గొప్ప సాహితీ సంస్కారాల మధ్యన మెలిగిన తరువాత పినతల్లి పినాకిని పిలుపు అందుకుని 'సింహపురి'కి పయనమయ్యారుట హనుమచ్ఛాస్త్రి గారు. వారి అంతరంగ కథనాలని, అనుభవాలనూ మనకేమో ఈ అపురూపమైన గౌతమీ గాథల రూపంలో అందించారు. 


వారం క్రితం ఒక పుస్తకం కోసం వెళ్తే, కావాల్సినది దొరకలేదు కానీ ఇది దొరికింది. ఎలానూ గోదారమ్మ నాకు దేవకి కదా అని చటుక్కున కొనేసాను. చక్కని తెలుగు, ఇదివరకూ తెలియని కొత్త తెలుగు పదాలు ఎన్నో నేర్చుకోవడానికి దొరుకుతాయీ పుస్తకంలో. నా అంచనాకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందీ పుస్తకం!



Monday, March 24, 2014

ఆదివారం - రెండు సినిమాలు..



ఈ వారమంతా శెలవులని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అది లేకపోతే ఏమి తోచట్లేదు :( నిన్న సాయంత్రం ఆరున్నరకి అనుకున్నాం.. ఏదైనా సినిమాకెళ్దామా చాలారోజులైంది అని. లాస్ట్ 'ఉయ్యాలా జంపాల' అనుకుంటా!  సరే ఏది దొరికితే అది చూద్దాం లే అని మా ఇంటి దగ్గర్లో ఉన్న హాలుకి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ షో ఏడింటికి. మేం డిసైడై తయారయి వెళ్ళేసరికీ ఏడయ్యింది. తీరా అక్కడ ఒక్క పేరూ చూడాలని అనిపించేలా లేదు! ఉన్న నాలుగింటిలో 'రాజా రాణి' అనే పోస్టర్ కాస్త చూడబుల్ గా అనిపించి అడిగితే అది ఫస్ట్ షో లేదన్నాడు. మరేముందయ్యా అంటే.. 'భద్రమ్!' అన్నాడు. సరే ఏదో ఒకటి ఇవ్వు అని టికెట్ తీసుకుని వెళ్ళేసరికీ టైటిల్స్ పడుతున్నాయి. కానీ లాస్ట్ మినిట్ డెసిషన్ నాదే కాబట్టి.. "అసలూ తెర తీసినప్పటి నుండీ తెర పూర్తిగా పడేవరకూ చూస్తేనే సిన్మాచూడటం తాతలనాటి ఆచారం మా ఇంట్లో..." అంటూ నూటొక్కోసారి అయ్యగారిని దెప్పే చాన్స్ పోయింది!




సిన్మా సగం దాకా సస్పెన్స్ బాగానే మెయింటైన్ అయ్యింది. ఒకటి రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. నేపథ్యసంగీతం కూడా ఓకే. కానీ ఎప్పుడైతే ఇన్సురెన్స్ పాలసీ గురించి రివీలయ్యే పాయింట్ వచ్చిందో అప్పుడిక క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అయిపోయింది. అసలు అది తేలే ముందరే నాకు అర్థమైపోయింది ఇలా రిలేషన్ లేని మనుషులని కనక్ట్ చేసే పాయింట్ ఏదో ఉందన్నమాట అని! నాకిలాంటి సస్పెన్స్ సినిమాలంటే భలే సరదా! చిన్నప్పుడు(ఇప్పుడు కూడానూ:)) భయం వేస్తున్నా చెయ్యి అడ్డుపెట్టుకుని వేళ్ల సందుల్లోంచి చూసేసేదాన్ని కానీ చూడ్డం మానేదాన్ని కాదు. సో, సస్పెన్స్ బ్రేక్ అయిపోయాకా ఇంక ఇంట్రస్ట్ పోయింది. పైగా సెకెండ్ హాఫ్ చివర్లో బాగా డ్రాగ్ అయ్యింది. అసలు క్లైమాక్స్ అయితే బోర్ అనిపించింది. ప్రొఫెసర్ గారిని ఇరికించేసారు కల్ప్రిట్ ఫ్రేమ్ లో ఆఖరికి! ఇంకా నయం ఫ్రెండ్ సలీమ్ ని ఇరికించలేదు అని నవ్వుకున్నాం. హీరో పర్లేదు. హీరోయిన్ కూడా బాగానే చేసింది కానీ ఏమిటో బక్కగా ఉఫ్ అంటే ఎగిరిపోయేలా.. పాపం! పెద్ద కళ్లైనా నచ్చలే నాకు! ఫొటోగ్రఫీ బాగుంది. చాలా మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. టైటిల్స్ అయిపోయాయిగా పేరు చూడలేదు :(





రెండో సినిమా:

భద్రమ్ అయిపోయి బయటికి వస్తుంటె అన్నా.. రాజారాణి అనుకున్నాం కదా అది కూడా చూసేసి వెళ్పోదామా అని! అయ్యాగారు టికెట్స్ కొనేసారు. ఓ అరగంట టైమ్ ఉంది. ఇంటికెళ్ళి తిని రావడానికి లేదు. మా ఇంటి నుండి పది,పదిహేను కిలోమీటర్లు దూరమెళ్తే కాని టిఫిన్ సెంటర్స్ లేవు. ఇంక అక్కడే పక్కన పీజ్జా కార్నర్ ఉంటే వెళ్లాం. బహుశా మూడునాలుగేళ్ల తరువాతేమో పీజ్జా తిన్నా! ఇదివరకూ పీజ్జా బేస్ కొనుక్కొచ్చి మరీ ఇంట్లో చేసేదాన్ని!!


టైమ్ అయిపోతోందని గబగబా తినేసి మళ్ళీ హాల్లోకొచ్చాం. అసలు వీకెండ్ లో డకోటా సినిమాక్కూడా టికెట్లు దొరకవు. అలాంటిది హాల్లో బొత్తిగా ఇరవై మంది కూడా లేరు. క్రికెట్ ఎఫెక్ట్ అనుకున్నాం. కమర్షియల్ ఏడ్స్ అయిపోయి కొత్త సినిమా ట్రైలర్స్ మొదలైయ్యాయి. రెండు ట్రైలర్స్ అయ్యాకా 'రాగిణి ఎమ్మెమ్మెస్' అని సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. మళ్ళీ 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' వచ్చింది. ట్రైలర్ క్కూడా మధ్యలో ఏడ్ ఏమిటో అనుకున్నాం! ఇంతలో ఢామ్మని సినిమా మొదలైపోయింది. నాక్కాస్త కంగారేసింది. ఇదేమిటండీ ఏ సినిమా టికెట్టు కొన్నారు? అనడిగా. గబగబా హాలు ఎంట్రన్స్ దగ్గరికెళ్ళి బాబూ ఇదేం సినిమా అనడిగితే 'రాగిణి ఎమ్మెమ్మెస్' అన్నాడతను. నాకు ఇంకా కంగారేసింది. మేము ఫలానా దానికని టికెట్టడిగాం అన్నా. మా టికెట్స్ చూసి సెకెండ్ ఫ్లోర్ లోని స్క్రీన్ కి వెళ్లాలి మీరు అన్నాడు. ఇందాకా టైమ్ అయిపోయిందని స్క్రీన్ నంబర్ సరిగ్గా చూడలేదని అర్థమైంది. మేం గబగబా అసలు హాలుకి వెళ్ళేసరికీ పావుగంట ఆట అయిపోయింది :((




ఈ సినిమా టైటిల్ వేరేది పెట్టాల్సింది. సినిమా బానే ఉంది. not bad.. తప్పకుండా చూసేయక్కర్లేదు కానీ ఓసారికి చూడచ్చు. ముఖ్యంగా థీమ్ బాగుంది. తమిళ్ సినిమా కాబట్టి కొన్ని సీన్స్ కాస్త ఓవర్ అనిపించాయి. ఇద్దరు హీరోలూ పర్వాలేదు. బాగానే చేసారు. నయన తార బాగుంది కానీ క్లోజప్స్ ఎందుకో భయపెట్టాయి. సెకెండ్ హాఫ్ లో కట్టుకున్న ఓ ఎల్లో చీర చాలా నచ్చింది నాకు. ఆ రెండవ హీరోయిన్ ఎవరో కాని  బాగుంది. పెద్ద కళ్ళు, మంచి ఎక్స్ప్రెషన్స్. ఈ అమ్మాయీ సన్నంగానే ఉంది గానీ ఇందాకటి సిన్మాలో హీరోయిన్ కన్నా బాగుంది. నయన తార ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెద్ద లాజికల్ గా లేకపోయినా అందులో ఉన్న డెప్త్, రెండవ హీరో కథలో లేదు. సత్యరాజ్ పాత్ర బాగుంది. చివర్లో కూతురికి "ఇదే నీ ఇల్లు, ఇదే నీ జీవితం.." అని చెప్పడం నచ్చింది నాకు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది కమెడియన్ సంతానం. ఇతని సిన్మా గతంలో కూడా ఒకటి చూసాను. మనిషి బావుంటాడు. డైలాగ్స్ బాగా చెప్తాడు. ఈ సిన్మాకి సగం స్ట్రెంత్ ఇతని పాత్రే! ఇలాంటి యంగ్ కమెడియన్ మన తెలుగులో కూడా ఎవరైనా రాకూడదూ..రొటీన్ ఓల్డ్ రోల్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది.. అనిపించింది. మొత్తానికి ఎలాగోలా భశుం! అనిపించి ఇంటికి చేరాం.


ఏదేమైనా ఓ మంచి సినిమా చూసాం అని satisfy అయ్యేలాంటి తెలుగు సినిమా ఈమధ్యకాలంలో ఏదీ రాలేదు!



Tuesday, March 18, 2014

two new songs...



ఈ పాటలు బావున్నాయి... 
రెండింటిలో మధ్యలో వాడిన violins బాగున్నాయి... 



 Pogadhae Pogadhae  


Mouname Mouname

Saturday, March 15, 2014

ఆ పుస్తకం ఇదే.. 'అతడు - ఆమె'


క్రితం వారంలో నాకు బాగా నచ్చేసిందని ఒక పుస్తకం గురించి "in love...with this book " అని టపా రాసా కదా... ఆ పుస్తకం ఇదే.. 
డా. వుప్పల లక్ష్మణరావు గారి "అతడు - ఆమె" ! అసలు పుస్తకం చదువుతుంటే ఆ క్యారెక్టర్ల మీదా, కథ మీదా, అందులో చర్చించిన పలు అంశాల మీదా ఐదారు వ్యాసాలైనా రాయచ్చనిపించింది. అంత గొప్ప పుస్తకాన్ని ఎక్కువమంది చదివితే బాగుంటుందన్న సదుద్దేశంతో, నాకు వీలయినట్లుగా  పుస్తక పరిచయాన్ని రాసి పుస్తకం.నెట్ కి పంపించాను.. పొద్దున్న పబ్లిష్ అయ్యిందక్కడ..

క్రింద లింక్ లో ఆర్టికల్ చదవండి..



Friday, March 14, 2014

పాట వెంట పయనం : అలుక



'పాట వెంట పయనం'లో ఈసారి "అలుక" మీద పాటలు...

link:
http://wp.me/p3amQG-2pc


Wednesday, March 12, 2014

ఎపుడూ నీకు నే తెలుపనిది..




బ్లాగ్లోకం నాకిచ్చిన  అతితక్కువ స్నేహితుల్లో ఒకరు విజయజ్యోతిగారు. "మహెక్" పేరుతో అదివరకూ రాసిన బ్లాగ్ నే మళ్ళీ ఇప్పుడు "కదంబం" గా మార్చారు. ఈమధ్యన ఆ బ్లాగ్ లో పాటలు, ప్రశ్నలు చూసి డౌట్ వచ్చి "మీరేనా?" అనిడిగితే ఔనన్నారు :) తెలుగు,హిందీ పాటలు, సాహిత్యం విషయంలో మా అభిప్రాయాలు చాలా వరకు బాగా కలుస్తాయి. ఇందాకా ఆ బ్లాగ్లో నే మిస్సయిన టపాలన్నీ చదువుతుంటే "సొంతం" చిత్రంలో పాట కనబడింది. ఆ మధ్యనొకసారి ఆ పాట గురించి రాద్దామని లింక్స్ అవీ దాచి ఉంచాను గానీ బధ్ధకిస్తూ వచ్చాను... ఇప్పుడు ఆవిడ పోస్ట్ చూశాకా రాయాలనిపించి రాస్తున్నా..


"సొంతం" సినిమా నే చూడలేదు కానీ " తెలుసునా తెలుసునా.." పాట + "ఎపుడూ నీకు నే తెలపనిది"  రెండు పాటలూ చాలా బావుంటాయి. 'దేవీ శ్రీ ప్రసాద్' బెస్ట్ సాంగ్స్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన పాటలు. రెండవ పాటకు male version, female version రెండూ ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్క చెరణమే ఉంటాయి. ఈ పాట సందర్భం తెలీదు కానీ ట్యూన్ వింటుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత అర్ద్రంగా ఉంటుంది. ఆ గొప్పతనం 'సిరివెన్నెల' సాహిత్యానిది కూడానూ! రెండూ చరణాల సాహిత్యాన్ని రాస్తున్నా..


పాట: "ఎపుడూ నీకు నే తెలుపనిది.."
చిత్రం: సొంతం(2003)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
పాడినది: సుమంగళి

సాహిత్యం: 

ఎపుడూ నీకు నే తెలుపనిది 
ఇకపై ఎవరికీ తెలియనిది 
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది 
బతికే దారినే మూసి౦ది 
రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది 
హృదయ౦ బాధగా చూసి౦ది 
నిజమే నీడగా మారి౦ది 

1చ: గు౦డెలో ఆశనే తెలుపనే లేదు నా మౌన౦
చూపులో భాషనీ చదవనే లేదు నీ స్నేహ౦
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా
నేస్తమా నీ పరిచయ౦
కల కరిగి౦చేటి కన్నీటి వానే కాదా
(http://www.youtube.com/watch?v=UxmU5Ia2gOw)


2చ: జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా
జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా
ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళూ
మెలకువే రాని కలగంటూ గడపమన్నావు నూరేళ్ళూ
ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కాదా
(పాడినది: మల్లిఖార్జున్ -
https://www.youtube.com/watch?v=xUTSNzW95g0)



ఇదే ట్యూన్ ను దేవీ శ్రీ ప్రసాద్ తాను సంగీతాన్ని అందించిన మరొక తమిళ్ సినిమాలో వాడుకున్నారు. జ్యోతిక, సూర్య నటించిన "మాయావి" అనే చిత్రంలో. తమిళ్ వర్షన్ ఎలా ఉంటుందో అని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తే.. ఇంకా కడుపులోచి దు:ఖం తన్నుకు వచ్చేసింది. 

song: Kadavul thandha 
Movie: మాయావి(2005) 
Lyrics:  Palani Bharathi
Music director: Devi Sri Prasad
Singers: S.P.B Charan, Kalpana

http://www.youtube.com/watch?v=OsW3pWOJJ1k


 


 Tamil సాహిత్యం చాలా బాగుంది. అర్థాన్ని క్రింద బ్లాగ్ లో చదవండి: http://tamilthathuvarasigan.wordpress.com/2012/07/13/maayavi-kadavul-thandha-azhagiya-vazhvu/





Friday, March 7, 2014

in love.. with this book !



శివరాత్రి ముందర పుస్తకమొకటి మొదలెట్టాను చదవడం.. మధ్యలో నాన్న హాస్పటల్ హడావుడి, తర్వాత ఇంకా ఏవో పనులు...! అసలిలా మధ్యలో ఆపేస్తూ చదవడం ఎంత చిరాకో నాకు. మొదలెడితే ఏకబిగిన అయిపోవాలి. క్రితం జన్మలో(పెళ్ళికాక మునుపు) ఇలాంటి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడిక ఇవన్నీ సెకెండరీ అయిపోయాయి ;(  పాలవాడో, నీళ్లవాడో, సెక్యూరిటీ గార్డో, లేక తలుపు తట్టే పక్కింటివాళ్ళో..వీళ్ళెవరూ కాకపోతే ఇంట్లో పనులో.. కుదురుగా పుస్తకం చదువుకోనియ్యవు. అందులోనూ ఇది ఐదువందల ఎనభై పేజీల పుస్తకం. ఎలాగో కళ్ళని నాలుగొందల అరవైరెండు దాకా లాక్కొచ్చాను.. ఇంకా నూటిరవై ఇవాళేలాగైనా పూర్తి చేసెయ్యాలి. అసలీలాటి పుస్తకమొకటి చదువుతున్నా..ఇంత బాగుందీ అని టపా రాద్దామంటేనే వారం నుండీ కుదర్లేదు.


కాశీభట్ల గారి నవల మొదటిసారి చదివినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో.. ఈ నవల చదివేప్పుడు అంత ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి గొప్ప నవల ఒకటి తెలుగు సాహిత్యంలో ఉందని ఇన్నాళ్ళూ కనుక్కోలేకపోయినందుకు బాధ ఓపక్క, ఇన్నాళ్ళకైనా చదవగలిగాననే సంతోషమొక పక్క చేరి నన్ను ఉయ్యాలూపేస్తున్నాయి. నాకు ఇప్పటిదాకా నచ్చిన తెలుగు నవలలన్నింటినీ పక్కకి నెట్టేసి వాటి స్థానాన్ని ఆక్రమించేసుకుందీ పుస్తకం..! ఎప్పటి కథ.. ఎప్పటి మనుషులు.. ఇంత సమకాలినంగా, ఆ భావాలింత దగ్గరగా ఎందుకనిపిస్తున్నాయి..? అంటే కాలమేదైనా స్త్రీ పురుషుల మనోభావాలు ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయన్నది సత్యమేనా? ఈ రచయిత ఇంకా ఏమేమి రాసారో? ఇప్పుడవి దొరుకుతాయో లేదో..? ఆత్మకథొకటి రాసారుట.. అదన్నా దొరికితే బాగుండు. 


నా టేస్ట్ నచ్చేవారికి తప్పకుండా ఈ నవల నచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది! కొన్ని పదుల ఏళ్ల క్రితం రాసిన భావాలతో ఇంతకా ఏకీభవించగలగడం ఒక సంభ్రమం. అంటే ఇప్పటికీ స్త్రీల పరిస్థితులు, మగవారి అహంకారాలు, మన సమాజపు స్థితిగతులు అలానే ఉండడం కారణమా? అప్పట్లోనే ఎంతో అభ్యుదయం ఉన్నట్లు రాస్తున్నారు.. అప్పట్లో నిజంగా స్త్రీలు అంత డేరింగ్ గా ఉండేవారా? లేదా కేవలం హై సొసైటీలో, డబ్బున్న ఇళ్ళల్లోనే అలా ఉండేవారా..? అసలా రచనా ప్రక్రియే ఒక కొత్త పధ్ధతి కదా. ఆ ప్రక్రియ వల్లనే ఒక సామాన్యమైన కథకు అంతటి డెప్త్, గొప్పతనం, నిజాయితీ అమరింది.

అసలు పెళ్ళికి ముందు ఈ నవల చదివి ఉంటే ఇంతగా నచ్చేది కాదేమో. పదేళ్ల సంసారజీవితం తర్వాత చదివినందువల్ల ఇంత ఆకట్టుకుని ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలిగా ప్రమోట్ అయ్యాకా పూర్వపు అభిప్రాయాల్లో ఎంతగా మార్పు వస్తుందో నాయిక పాత్రలో చూస్తూంటే నన్ను నేను చూసుకుంటున్న భావన! ఆ ప్రధాన నాయిక ఉంది చూడండీ.. అసలు ఏం కేరెక్టర్ అండీ అసలు.. దణ్ణం పెట్టేయచ్చు ఆవిడకి. రచయిత దృష్టిలో ఓ పర్ఫెక్ట్ వుమన్ అలా ఉండాలి అనే పిక్చర్ ఏదో ఉండి ఉంటుంది.. అలానే చిత్రీకరించారా పాత్రని. అసలు 'నవలానాయకుడు' దొరుకుతాడేమో అని మొదలుపెట్టాను చదవడం.. దొరికారు...ఒక్కరు కాదు ముగ్గురు.. ముగ్గురూ నాయికలే!!! ఇండిపెండెంట్, ఐడియల్, అగ్రెసివ్, ఫెరోషియస్, బోల్డ్.. ఇంకా పదాలు వెతుక్కోవాలి ఈ ముగ్గురి కోసం. రచయితకు పాపం మగవారి మీద ఇంత చిన్నచూపెందుకో? ముగ్గురిలో ఒక్క ఆదర్శపురుషుడినీ నిలబెట్టలేదు..:(  కొన్ని పాత్రల్లో లోపాలున్నా కనీసం వాళ్ళ పట్ల ప్రేమ పుడుతుంది కానీ నాకు వీళ్ళపై జాలి కూడా కలగట్లేదు.. బహుశా నాలో ఎక్కడో మగవారి అహంకారంపై, పిరికితనంపై కోపతాపాలేవో దాగుండి ఉంటాయి.. అందుకే వీళ్లకి మార్కులు వెయ్యలేకపోతున్నాను.. అయినా ఇంకా మూడో మనిషి గురించి చదవాలి అతగాడేలాంటివాడో ఏమో. ఎలాంటివాడైనా నాయికను మించినవాడు మాత్రం అవ్వడు. అభ్యుదయ భావాలతో, ఉన్నతమైన లక్షణాలతో ఉన్న స్త్రీ పాత్రలను సృష్టించడమే రచయిత లక్ష్యంగా కనబడుతోంది మరి..


ఈ కథను సినిమాగా తీస్తే ఎంత బాగుంటుందో! వందరోజులు ఖచ్చితంగా ఆడుతుంది. కానీ అంత గొప్పగా, నిజాయితీగా ఎవరన్నా తీయగలరా? ఏమో! సరే మరి మిగిలిన భాగం చదివేసాకా మళ్ళీ అసలు కథేమిటో చెప్తానేం! అంతదాకా ఆగలేక ఈ టపా రాసేస్తున్నానన్నమాట! 

***
ఒకరోజు ముందుగా.. Happy Women's day to all my friends & readers..





Thursday, March 6, 2014

My favourite songs of Madhuri...




వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కదా.. పాత పాటలేవో చూడాలని మనసైంది. ఎప్పుడూ కేసేట్లు, సీడీలు వెతుక్కుని వినడమే కదా ఈసారి యూట్యూబ్ లో చూద్దాం.. చక్కగా ఓ పదం కొడితే అవే వస్తాయి పాటలు అని వెతుక్కుని చూస్తున్నానా.. ఇంతలో ఓ ఐడియా వెలిగింది... ఇవన్నీ వరుసగా మాలకట్టి బ్లాగ్ పోస్ట్ లో పెడితేనో.. అని!

ఇదిగో.. ఇవే నే వెతుక్కుని చూసిన పాటలు.. నాకెంతో ఇష్టమైన మాధురీ దీక్షిత్ పాటలు... తన నవ్వంటే నాకు మరీ ఇష్టం...! ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ ఓ జమానాలో  ఫ్రెండ్స్ అందరమూ కేసెట్లు అరిగేలా విన్న హిట్ సాంగ్స్ ఈ పాటలన్నీ.:)



Tridev:  మై తేరీ మొహొబ్బత్ మే...




రామ్ లఖన్:బడా దుఖ్ దీనా..
   



Parinda: తుమ్ సే మిల్ కే ఐసా లగా..  


Parinda: ప్యార్ కే మోడ్ పే చోడోగే జో బాహే మేరీ...  


Tezaab: కెహ్దొ కే తుమ్ హో మేరీ వర్నా...  



Dil:ముఝె నీంద్ న ఆయే..  


Saajan:బహుత్ ప్యార్ కర్తే హై తుమ్ కో సనమ్...  


Khal nayak:పాల్కీ మే హోకే సవార్..  


anjaam: chane ke khet mein..
Hum apke hai kaun:మాయని మాయని..  


Dil to pagal hai: అరెరె అరె యే క్య హోగయా..  


Mrutyudand: తుమ్ బిన్ మన్ కీ బాత్ అధూరీ...  


pukar:కేసరా సరా సరా...  


 Lajja:బడి ముష్కిల్ బాబా బడీ ముష్కిల్...  


Devdas:కాహే ఛేడ్ ఛేడ్ మోహె..
   


 Devdas:డోలా రే డోలా రే...
   

Tuesday, March 4, 2014

క్రియేటివిటీ !


ఏవో పాటలు వెతుకుతుంటే యూట్యూబ్ లో కనబడింది ఈ ఏడ్.. బాగా నచ్చేసింది నాకు. మూడు నిమిషాల్లో ఎంత పెద్ద కథనైనా ఇట్టే ఇమడ్చటమే కదా క్రియేటివిటీ అంటే!


Saturday, March 1, 2014

చలువపందిరి: चलॊ एकबार फिर सॆ...


"చలువపందిరి" లో ఈ నెల "గుమ్ రాహ్" చిత్రంలోని సాహిర్ పాట..'चलॊ एकबार फिर सॆ...' గురించి రాసాను.



పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో ....
http://vaakili.com/patrika/?p=5142


నవలానాయకులు-3




కౌముది వెబ్ పత్రికలో ఈ నెల నవలానాయకుడు.."విశాలనేత్రాలు" నుండి 'రంగనాయకుడు' ! 



link:
http://www.koumudi.net/Monthly/2014/march/march_2014_navalaa_nayakulu.pdf

Friday, February 28, 2014

ఒక నిన్న...



27-2-14,
గురువారం
శివరాత్రి!

పొదున్నే హడావుడిగా తెమిలి ముగ్గురం హాస్పటల్ కు చేరుకున్నాం. అప్పుడే నాన్నను లోపలికి తీసుకువెళ్ళారని అన్నయ్య చెప్పాడు. ఓ ముప్పావుగంట అయ్యాకా అన్నయ్యని పిలిచారు. 'ఇదివరకు పెట్టిన స్టెంట్స్ బాగానే ఉన్నాయి. కొత్త ప్రమాదాలేమీ లేవు. హీ ఈజ్ ఓకే' అని చెప్పారుట డాక్టర్. హమ్మయ్య! అని ఊపిరితీసుకున్నాం.


 పొద్దుట ఏంజియో తీస్తారని నిన్ననే చెప్పారు. గతకొన్నాళ్ళుగా ఎదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్న నాన్న మొన్న రాత్రి బాగోలేదని చెప్తే ఎమర్జన్సీ ఎడ్మిషన్ చేసారుట. నేనొట్టి కంగారుమనిషినని రాత్రి చెప్పకుండా నిన్న పొద్దున్న తను ఊరు నుండి వచ్చాకా అప్పుడు అమ్మ చెప్పింది ఇలా అని..! ఆఫీసు పనిలో బిజీగా ఉండి అన్నయ్య కేబ్ మాట్లాడితే వాళ్ళిద్దరే వెళ్లారుట హాస్పటల్కి. రాత్రంతా అమ్మ ఒక్కర్తే కంగారుగా గడిపింది పాపం! ముగ్గురు పిల్లలం ఉన్నాం.. ఏం లాభం? చాలాదూరంలో తమ్ముడు, ఆఫీసులో పీకల్లోతు పనిలో అన్నయ్య, విషయం తెలియక నేను.. ముగ్గురం ఉపయోగపడలేదు. అంతేనేమో ఒక స్టేజ్ వచ్చాకా.. భార్యాభర్తలిద్దరే ఒకరికి ఒకరు తోడు.. అదీ ఇద్దరిలో ఒకరైనా ఆరోగ్యంగా ఉంటే రెండోవారిని చూసుకోవడానికి ఉంటుంది! సరే, కాసేపుండి తను ఆఫీసుకెళ్ళిపోయారు. పాపను రూం లోకి అలో చెయ్యమని హాస్పటల్ స్టాఫ్ చెప్పేసారు. ఓ ల్యాపీ ఇస్తే ఏవో కార్టూన్స్ చూసుకుంటుందిలే అని పాపను అన్నయ్య వాడితో ఆఫీసుకు తీస్కెళ్ళాడు.


ఆ పూటకి అమ్మకు తోడుగా నేను ఉండిపోయాను హాస్పటల్లో. రకరకాల సందర్భాల్లో గతంలో చుట్టిన నానారకాల ప్రదక్షిణల మూలంగా హాస్పటల్ అంటేనే పరమ చిరాకు, భయం నాకు. అయినా ఇప్పుడు పూర్వంలా లేవు హాస్పటల్స్ కూడా. ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్. విశాలమైన రూమ్స్, సోఫాలు, ఏసీ, టివీ, ఫోన్ చేస్తే టిఫిను, కాఫీ-టీలు, భోజనాలు క్షణాల్లో ప్రత్యక్ష్యమౌతున్నాయి. మధ్యలో డ్యూటీ నిమిత్తమై కిలకిల్లాడే మళయాళీ నర్సులు! పేషేంట్ రోగం సంగతెలా ఉన్నా వాళ్ళకీ, వాళ్ళ వెంటనున్నవాళ్ళకీ వైభోగమే! పచ్చకాగితం పవరది...!! ఇంత పెద్ద హాస్పటలూ పేషేంట్స్ తో కిటకిటలాడిపోతోంది. రూమ్స్ ఖాళీ లేవుట అస్సలు :(  ఐసీయూ లో పేషంట్స్, బయట హాల్లో వాళ్ల తాలూకా మనుషులు వెయిట్ చేస్తున్నవారెందరో! రకరకాల కథలు..కన్నీళ్ళూ.. అనారోగ్యాలూ.. వాటికి వందరకాల ఆధునిక వైద్యాలూ! కేథ్ రూమ్ బయట ఆ అరగంటలో నాలుగు కథలు విన్నా! దినచర్యల్లో, తినే ఆహారంలో మార్పులే ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలకు దారితీస్తున్నాయి అనిపించింది.


చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే బైపాస్ సర్జరీనే మార్గం. ఇప్పుడేమో ఇక్కడ గంటకు నాలుగు ఏంజియోగ్రాములు తీస్తున్నారు.. ఎక్సరేలు, స్కానింగ్ లు చేసినట్లు! అసలు వీటిల్లో ఎన్ని అత్యవసరమో తెలీదు. మొన్న మా బంధువులొకరు విజయవాడలో ఏంజియో పదిహేనువేలన్నారని కాకినాడ వెళ్ళి తొమ్మిదివేలకు చేయించుకు వచ్చారు. స్టెంట్స్ కి కూడా హాస్పటల్ ని బట్టి, పేషంట్ ని బట్టి రకరకాల రేట్లు. ఏంజియోలు మాత్రం తప్పవు.. స్టెంట్స్ అక్కర్లేని కేసులు కొన్ని.. అప్పటికప్పుడు స్టెంట్స్ వేయాల్సిన కేసులు కొన్ని.. అవి వేయడం కోసమే చేస్తున్న ఆంజియోలు కొన్ని! మళ్ళీ ఆ స్టెంట్స్ లో మూడు నాలుగు రకాలు. హాస్పటల్లో ఒక రేటు, బయట కొంటే ఒక రేటు, ఏజెంట్ ద్వారా ఎక్కడ్నుంచైనా తెప్పించుకుంటే ఒక రేటు, డయాబెటిక్ పేషేంట్స్ కి కోటెడ్ స్టెంట్స్ అంటూ అవో రకం..! ఈ వైద్యాలకు పేదా, గొప్పా తేడాలేమీ లేవు. ఎవరికైనా అదే గుండె, అదే సమస్య, అదే స్టెంట్ మరి! మనసు లేకుండా మనుషులు ఉండగలరు కానీ గుండే లేకుండా మనుషులు ఉండలేరు కదా మరి!!


సరే ఇక నాన్నకు కొత్త ఇబ్బందులేమీ లేవు.. మందులు కాస్త మార్చి ఇస్తామన్నారు మా డాక్టరు. నాన్నకు రూమ్ కు తీసుకువచ్చాకా అమ్మా, నేను కాసేపు శరీరాలూ, ఆరోగ్యాలూ, డాక్టర్లు,ఖర్చులు గురించి కాసేపు మాట్టాడేసుకున్నాం. కరెంట్ పోయిందని నేను మూడో అంతస్థులో ఉన్న ఆ రూమ్ అద్దం కిటికీ తెరిచాను. క్రిందన చిన్న మురికివాడ ఉంది. రేకు టాపులతో ఓ పదిపదిహేను ఇళ్ళు ఉన్నాయ్. మధ్యన ఓ చిన్న గుడి కూడానూ. పిల్లల్లు, పెద్దలు ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. నీళ్ళు పట్టేవాళ్ళూ, అంట్లు తోముకునేవాళ్ళూ, ఉన్న ఆ కొద్దిపాటివాకిలీ తుడిచేవాళ్ళూ.. ఓ పక్కగా శివరాత్రి అనేమో మైక్లో పెద్దగా సినిమా పాటలు పెట్టారు. నే గమనించినదేమిటంటే అన్ని ఇళ్ళల్లో ఈ క్లీనింగ్ పని ఆడవాళ్ళే చేస్తున్నారు. వంట, అంట్లు తోమడం, ఇల్లు-పరిసరాలు శుభ్రం చేయడం, చంటి పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఇవన్నీ ఎక్కడైనా ఆడవారి పనులే...ఎక్కడైనా ఇంతే కదా అని నవ్వొచ్చింది! అభ్యుదయం, సమానత్వం, వంకాయ, బీరకాయ పది శాతం జనాభాలో మాత్రమే నాకు కనబడుతుంది. చదువులేనివాళ్ళు ఇళ్ళలో చాకిరీ చేస్తే, చదువుకున్నవాళ్ళు ఆఫీసుల్లో+ఇళ్ళల్లో రెండుచోట్లా చాకిరీ చేస్తున్నారు. డబ్బు, సౌఖ్యం ఉన్నా శారీరిక శ్రమ కూడా రెట్టింపు ఉంటోంది కదా..ఇంతకన్నా పూర్వకాలం అమ్మమ్మలూ,మామ్మలే నయమేమో ఇంటిపనులయ్యాకా కాస్తైనా విశ్రాంతి దొరికేది వాళ్ళకి! ఇంటాబయటా పనులతో సతమతమయ్యే నేటి మహిళల పరిసరాల్లో 'స్ట్రెస్ అండ్ స్ట్రైన్' తప్ప 'రెస్ట్' అనే పదం ఎక్కడైనా కనబడుతోందా..?! ఈలోపూ మళ్ళీ కరెంట్ రావడంతో ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి కిటికీ మూసేసి ఇవతలకొచ్చేసా !


కాసేపు నే ప్రస్తుతం చదువుతున్న పుస్తకం తాలూకూ కథనీ, రచయిత గురించి అమ్మానాన్నలకు చిన్న సైజు లెక్చర్ ఇచ్చేసా! సాయంత్రం తను అన్నయ్య వద్దనుండి పాపను తీసుకుని హాస్పటల్ కి వచ్చాకా, నాన్నని రేపు డిస్చార్జ్ చేస్తారని తెలుసుకున్నాకా మళ్ళీ ముగ్గురం ఇంటిదారి పట్టాం. ఎంతరాత్రైనా గుడికి తీసుకువెళ్ళాల్సిందే నాన్నా అని పిల్ల ఆర్డర్! దారిలో శివాలయానికి వెళ్ళి హరహర మహాదేవా! అని పొద్దుటి నుండీ ఎక్కువైపోయిన హృదయభారాన్ని అక్కడే దింపేసి, కొంత ప్రశాంతతని  మళ్ళీ మనసులో నింపుకిని, కాసిని క్షణాలక్కడ గడిపి పదవుతుంటే ఇల్లు చేరాం! అప్పుడు మళ్ళీ పొద్దుట చెయ్యని పూజాకార్యక్రమాలు పూర్తిచేసి, ఇంటిలోని ఈశ్వరుణ్ణి స్తుతించేసరికీ పొద్దుటి నుండీ అలుముకున్న అలజడంతా ఒక్కసారిగా దూరమయినట్లయ్యింది. అలా హడావుడిలో కూడా లోటు లేకుండా తన పూజలు తాను జరిపించుకున్నాడీవాళ శివయ్య!!

నిన్న ఇవాళ్టికి నిన్నే కానీ నిన్నటికి ఇవాళే కదా! 

రెహ్మాన్ కొత్త ఆల్బమ్ పాట



రెహ్మాన్ స్వరాలనందించిన కొత్త ఆల్బమ్ ఒకటి "రౌనక్" పేరుతో రాబోతోంది. అందులో శ్రేయా ఘోషాల్ మధురంగా ఆలపించగా మొదటి పాటను నిన్న రిలీజ్ చేసారు. ఈ ఆల్బంలోని గీతాలకు ఒక యూనియన్ మినిస్టర్ సాహిత్యాన్ని అందించడం విశేషం. ఆల్బమ్ తాలూకూ మిగతా వివరాలు ఇక్కడ చదవచ్చు.




పాట కన్నా సంగీతం నన్ను బాగా అలరించింది. ముఖ్యంగా రెహ్మాన్ గిటార్స్ వాడిన తీరు నాకు బాగా నచ్చింది..
మరి శ్రేయా స్వరమధురిమలనూ, రెహ్మాన్ జాదూనీ మరోసారి ఆస్వాదించేద్దామా...

Tuesday, February 18, 2014

Horti Expo 2014


ఈ ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ కోసం చాలా ఎదురు చూసాను..! జనవరి వెళ్పోయింది కానీ ప్రదర్శన జాడ లేదు. చూడగా చూడగా మొన్నొకరోజు సిటీలోకెళ్ళి వస్తుంటే ఒక హోర్డింగ్ చూసా..13 నుండి 17వరకూ ఎగ్జిబిషన్ అని. ఆ వీక్ అంతా బోళెడు పనులు.. హడావుడి! ఎక్కడా కుదిరేలా కనబడలే..:( ఆఖరికి ఏలాగైతేనేం మొన్న ఆదివారం మధ్యాహ్నం వెళ్ళివచ్చాం. 




ఈసారి ప్రదర్శన నన్ను బాగా నిరాశ పరిచింది. అసలు ఏం గడబిడ జరిగుతోందో.. ఎందుకు ఆలస్యంగా ఏర్పాటయ్యిందో తెలీదు. ఏడాది ఏడాదికీ తగ్గుతూ వస్తున్న క్వాలిటీ ఈసారి పూర్తిగా పడిపోయింది. చాలా సాధారణంగా ఏవో మొక్కలు,పువ్వులూ అంతే! ప్రత్యేకతలేమీ లేవు. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది. రెండు పుస్తకాల స్టాల్స్ (మొక్కల దగ్గర బుక్సెందుకో..?!), చిరుధాన్యాల తినుబండారాల స్టాల్, రెండుచోట్ల సేంద్రీయ కూరల అమ్మకాలూ ఉన్నాయి. ఎప్పటిలా బయట స్నాక్స్, పాప్కార్న్, బజ్జీలు గట్రా, లోపల నేచరల్ ఫ్లేవర్ తో సాప్ట్ ఐస్క్రీం స్టాల్స్ ఉన్నాయి. ఆ నేచరల్ ఫ్లేవర్ ఐస్క్రిం ఇదివరకు కోన్ లో ఇచ్చేవాడు. వెనిల్లా ఐస్క్రీం కి ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ కలిపి ఇచ్చే ఆ రుచి అద్భుతంగా ఉండేది. ఈసారి క్వాంటిటీ తగ్గి కప్పులోకి వచ్చి, రుచి కూడా బాలేదు :(  హనీ, హెర్బల్ టీ, తులసీ టీ, స్టీవియా స్టాల్స్ మామూలే. స్టీవియా స్టాల్ లో హెర్బ్వియా  పిల్స్  బయట దొరకట్లేదంటే పంపిస్తానని అడ్రస్ తీసుకున్నాడు. 
ఎవరికైనా herbvia కావాలంటే ఈ నంబర్ల లో సంప్రదించవచ్చు: 09000100071/09912629999





జనవరి అయిపోవడంతో ఎప్పుడూ ప్రధానాకర్షణగా నిలిచే బంతులు, చామంతులూ అక్కడక్కడా తప్ప ఎక్కువ లేవు! గులాబీలు కూడా ఎక్కువ కనబడలేదు. మొక్కల ధరలు మాత్రం బయట నర్సరీల రేట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. డెకొరేటివ్ ఫ్లవర్స్, స్టోన్స్, ప్లాస్టిక్ క్రీపర్స్ మొదలైనవి ఉన్న స్టాల్ మాత్రం కిక్కిరిసి ఉంది. 
రెండు మూడు కొత్త మొక్కలేమైనా కొందామన్నా ఆసక్తికరంగా అనిపించలేదు. చివరికి సెంటెడ్ కాగడామల్లె (చెంబేలీ కాదు) ఒకటి కొని నిరుత్సాహంగా బయటకు నడిచా!




ఇది బాగుంది :)


ఈ ప్రదర్శన తాలూకూ మిగిలిన ఫోటోలు క్రింద లింక్ లో..:
http://lookingwiththeheart.blogspot.com/2014/02/horti-expo-2014.html



Friday, February 14, 2014

పాట వెంట పయనం : ప్రేమభరితమైన యుగళగీతాలు







ఇవాళ 'Valentine's day' కదా అని ఈసారి "పాట వెంట పయనం"లో కొన్ని romantic duets గురించిన కబుర్లు...

క్రింద లింక్ లో వ్యాసం చూడవచ్చు...
http://wp.me/p3amQG-2if


Thursday, February 13, 2014

సప్తపర్ణి + కేలిగ్రఫీ రామాయణం




ఈ టపాలో రెండు విషయాలు చెప్పాలి.. ఒకటి సప్తపర్ణి గురించి, రెండోది కేలిగ్రఫీ రామాయణం గురించీ! క్రితం వారం హిందూ(న్యూస్ పేపర్) ఫ్రైడే రివ్యూ లో  పూసపాటి పరమేశ్వర రాజు గారి "కేలిగ్రఫీ రామాయణం" గురించిన ఆర్టికల్ ఒకటి వేసారు. చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద కేలిగ్రఫీ పెన్స్ ఉండేవి. ఆ పెన్స్ కి వివిధ సైజుల్లో మార్చుకోవడానికి నిబ్స్ కూడా ఉండేవి. నాన్న ఆ పెన్స్ లో రంగురంగుల ఇంక్స్ మారుస్తూ, వాటితో అందంగా రాయడం, బొమ్మలెయ్యడం చూసి మేము సరదా పడితే మాకేమో కేలిగ్రఫీ () స్కెచ్ పెన్స్ సెట్ కొంటూండేవారు. వాటితో మేము బొమ్మలు, చార్ట్స్ లో కొటేషన్స్ రాస్తూండేవాళ్ళం.  అందువల్ల పేపర్లో కేలిగ్రఫీ రామాయణం అని చదవగానే చూడాలని అనిపించింది. సిటీలో అమ్మావాళ్ళింట్లో ఉన్నా కాబట్టి అనుకున్నదే తడవు వెళ్ళి చూడగలిగాను. 



news paper article

రామాయణం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని, వాటికి కేలిగ్రఫీ స్తైల్లో పైంటింగ్స్ వేసారు పరమేశ్వర రాజు. కొన్ని అర్ధమవుతున్నాయి గానీ కొన్ని పెయింటింగ్స్ abstract paintings లాగ ఉన్నాయి. అయినా అసలు ఇలాంటి ఒక ఐడియా వచ్చినందుకు ఆయనను మెచ్చుకోవాలి. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక బుక్ వేసారు. ప్రతి బొమ్మకూ క్రిందన ఆ ఘట్టం తాలూకూ డిస్క్రిప్షన్ రాసారు కానీ ఖరీదే చాలా ఉంది.. ఏకంగా వెయ్యి రూపాయిలు! ఐదువందలన్నా కొందును గానీ వెయ్యి అనేసరికీ వెనకడుగు వేసేసాను..! ఫోటోలు తీసాను కానీ అవి బ్లాగులో పెట్టడం వారికి ఒప్పుదల కాదేమో అని పెట్టడం లేదు. నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ను బంజారా హిల్స్ రోడ్ నెం.8 లో ఉన్న సప్తపర్ణి లో చూడవచ్చు. ఈ నెల ఇరవై ఆరు దాకా ఉంటుందిట.


ఇప్పుడు నే చెప్పదలుచుకున్న రెండవ సంగతి.. సప్తపర్ణి! ఇది ఒక బుక్ స్టోర్స + కల్చరల్ సెంటర్ ట. నేనిదే మొదటిసారి చూడటం. ఫేస్బుక్ లో కూడా 'సప్తపర్ణి' ఉంది. అక్కడ జరిగే ఈవెంట్స్ ఏడ్స్ అందులో చూడచ్చు. ఇక్కడ వివిధరకాల సాంస్కృతిక ప్రదర్శనలే కాక శాస్త్రీయ సంగీతం క్లాసెస్ కూడా ఉన్నాయి. వోకల్, వయోలిన్, తబలా నేర్పిస్తారుట. ఇంక ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే ఇంకాసేపు అక్కడే ఆ చెట్ల మధ్యన, పచ్చదనం మధ్యన గడపాలనిపించేలా ఉంది. లోపల ఉన్న బుక్ స్టోర్స్ లో ఎక్కువగా పిల్లల పుస్తకాలు ఉన్నాయి. ఏదో బొమ్మలు చూపెడదామని పొరపాటున మా అమ్మాయిని తీసుకువెళ్ళి  అక్కడ బుక్ అయిపోయా నేను. అది కొను..ఇది కొను.. అని గొడవ! పోనీ కొందామా అంటే ధరలన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి. 'పరమపదసోపానపటం' చూసి ముచ్చటపడి రేట్ చూసి బెదిరిపోయా:( ఎనిమిదొందల ఏభైట!! మరి ఆ బుక్ సెంటర్ ఉన్న ఏరియా మహత్యం అది అనుకున్నా!







ప్రదర్శనలేమీ లేకపోయినా ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడపాలనిపించేలా ఉందీ చోటు! 
ఈ చోటులో తీసిన మిగిలిన ఫోటోలు ఇక్కడ: 



Friday, February 7, 2014

ఆబ్దీకం


స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!


మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల మధ్య పదిహేను ఇరవైఏళ్ళ అంతరం ఉన్నా వాళ్ల ఆబ్దీకాలకు మధ్యన ఒక రోజే తేడా! ఏడాదికోమాటు తాతయ్య ఆబ్దీకానికి, ఆ తర్వాత ఇద్దరి ఆబ్దీకాలకీ మా కజిన్స్ అందరం మావయ్య ఇంట్లో తప్పనిసరిగా కలిసేవాళ్లం. ఈ వంకతో అయినా అందరం ఓసారి కలుస్తున్నాం అని తృప్తి ఉండేది మాకు. రాన్రానూ చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ మా అందరిమధ్యన దూరాలను కూడా పెంచేసాయి. మా ఇంట్లో అయితే నాన్న ఏడాదికి మూడు ఆబ్దీకాలు పెట్టేవారు. కొడుకుల్లేని వాళ్ల అమ్మమ్మకు ఏకైక మనవడిగా వాళ్ల అమ్మమ్మ,తాతయ్యలదీ, వాళ్ల నాన్నగారిదీ! ఆ తరవాత పదిహేనేళ్ళుగా మా మామ్మయ్య(నాన్నమ్మ)దీ మొత్తం కలిపి నాలుగు! ఎప్పుడైనా శెలవు రోజైతే ఆబ్దీకం భోజనం తినేవాళ్లం తప్ప స్కూలుకి, కాలేజీలకీ వెళ్పోయేవాళ్లం కాబట్టి మాకు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి పెద్దగా అవగాహాన ఉండేది కాదు. మంత్రం చెప్పే ఆయన, ఇద్దరు భోక్తలు మొత్తం ముగ్గురు బ్రాహ్మలు వచ్చేవారని మాత్రం గుర్తు. అప్పట్లో పప్పు రుబ్బటానికి రుబ్బురోలే కాబట్టి వంటావిడ రుబ్బలేకపోతేనో, రావడం లేటు చేస్తేనో "నేనే పప్పు రుబ్బానని.." అమ్మ చెప్తే ఓహో అనేవాళ్లం తప్ప ఆ కష్టం ఏపాటిదో ఊహకైనా తెలిసేది కాదు! ఆబ్దీకాలైన ప్రతిసారీ "నా కూతుర్ని పెద్ద కొడుక్కో, ఒక్కడో కొడుక్కే ఇవ్వను బాబూ.." అని అమ్మ అంటూండడం మాత్రం బాగా గుర్తుంది! 


కట్ చేస్తే... నేను ఓ ఇంటి పెద్దకోడల్నే అయ్యాను!! దురదృష్టవశాత్తూ ఏడేళ్ల క్రితం మా మావగారు కాలం చేసారు. మడిబట్ట ఎలా కట్టుకుంటారో కూడా తెలీదప్పటికి నాకు. అప్పటికి మా పాపకు రెండేళ్ళూ, నాకు ఒక మిస్కేరేజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. చణ్ణీళ్ల స్నానాలు, మడిబట్టలు.. నెలా నెలా మాసికాలు.. ఆ కార్యక్రమాలు.. మళ్ళీ అందులో గోదారిజిల్లా రూల్స్ వేరు..కృష్ణాజిల్లా రూల్స్ వేరు... అంతా గందరగోళంలా ఉండేది. అమ్మ, అత్త, మామ్మయ్య, తాతమ్మా.. అంతా ఇంతేనా? ఇలానే తడిబట్టలు, మడిబట్టలు, కట్టుకుని ఉండేవారా? ఒక్క చీరనే కట్టుకుని ఎలా ఉండాలి? వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తూంటారు కదా...అయినా ఇంతేనా..  మడిబట్ట మార్చేదాకా మధ్యలో బాత్రూం లోకి కూడా వెళ్లకూడదా... ఇవేమి రూల్స్? ఎవరు పెట్టారు? ఇలానే ఎందుకు చెయ్యాలి? చదువులూ, ఉద్యోగాలూ, సమాజం..మార్పు.. ఇవన్నీ పుస్తకాలకీ, సినిమాలకీ, కాయితాలకీ, కవితలకే పరిమితమా? సవాలక్ష సందేహాలు... 


మావగారి సంవత్సరీకాలు కాశీలో చేసాం. గయా వెళ్లాం.. అక్కడ కూడా కొన్ని విధులు పూర్తిచేసాం. వచ్చాకా కాశీసమారాధన మొదలైన కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత నుండీ ఏడాదికోమాటు ఆబ్దీకాలు ఇంట్లోనే జరుపుతున్నాం. "అమ్మా.." అని ఆప్యాయంగా పిలిచే మావగారి పిలుపు.. "కాస్త చాయ్ పెట్టిస్తావామ్మా..", "చపాతీలు ఇలా వత్తాలి..", "టమాటా పచ్చడి నే రోట్లో రుబ్బితే అంతా వచ్చి రుచి చూసాకా చివరికింత ముద్ద మిగిలేది.." అంటూండే ఆయన మాటల్ని తలుచుకుంటూండగానే ఏడేళ్ళు గడిచిపోయాయి. కానీ అబ్దీకం వస్తోందంటే అది పూర్తయ్యేదాకా గుబులు మాత్రం పోవట్లే..! ఎవరితోనూ మాటపడకుండా కార్యక్రమం పూర్తిచెయ్యాలి. అత్తగారు తృప్తిపడాలి. వచ్చినవాళ్ళు కడుపునిండా భోజనం చేసి వెళ్లాలి. పెద్దకోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఇదీ నా తాపత్రయం. ప్రతి అబ్దీకానికీ అమ్మ, పిన్ని, అత్త.. ఇలా అంతా గుర్తుకువస్తారు..! పది మంది, మహా అయితే ఓ పదిహేను మందికే నేను అతలాకుతలం అయిపోతుంటే, గ్రైండర్లు లేని రోజుల్లో ప్రతి ఆబ్దీకానికీ నలభైకి తక్కువకాకుండా బంధువులకి చేసిపెట్టిన పెద్దవాళ్లను తల్చుకుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. 


నిన్న మా మామగారి ఏడవ ఆబ్దీకం జరిపాము.ఈమధ్యన రెండేళ్ళుగా ఆరోగ్యం బాగోక నే వడ్డన చెయ్యలేక వంటావిడనే వడ్డనకి కూడా మాట్లాడుకుంటున్నాం. నిన్న భోజనం చేస్తుంటే మా సీతత్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీతత్త మా మేనమామ భార్య. మా అమ్మమ్మా తాతయ్యల ఆబ్దీకాలకి వాళ్ల ఎనమండుగురు సంతానం, వారి పిల్లలు అంతా కలిపి రెండు మూడు బ్యాచ్ లలో భోజనాలు చేసేవారు. అందరికీ దగ్గరుండి వడ్డన చేస్తూ, "ఇదిగో నువ్వీ గారెలు తిను", "పరమాన్నం బావుంది మరికాస్త వేయించుకో", "కొబ్బరిపచ్చడి కావాలా?" , "ఈ కూర వేయించుకో..వద్దనకు", "తాతగారి ప్రసాదం తినాలి.." అంటూ నవ్వుతూ అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టించి, చివరికెప్పుడో నాలుగింటికి తను భోజనం చేసి మడిబట్ట మార్చుకుని వచ్చేది తను. నేను వడ్డన చెయ్యకపోయినా బ్రాహ్మల భోజనం అయ్యి, వారి విస్తళ్ళు తీసి, నేలంతా తుడిచేసరికే చుక్కలు కనబడ్డాయి నాకు.


అసలు ఈ కాలంలో అప్పటి ఓపికలు ఎందుకు ఉండట్లేదు? మా పరిస్థితే ఇలా ఉంటే అసలు ముందుతరాల మాటేమిటి? ఒకవేళ ముందు తరాలవాళ్ళు తల్లిదండ్రులకి ఇలా కార్యక్రమాలు నిర్వహించలేకపోతే...?  అసలు కొడుకే లేకపోతే..? ఎవరు ఇవన్నీ జరిపిస్తారు? ఎవరో ఒక బంధువులు చేస్తే కొడుకు చేసినంత శ్రధ్ధగా చేస్తారా? వాళ్ళు ఈ శ్రార్థకర్మలన్నీ విధిగా జరపలేకపోతే మరి చనిపోయినవాళ్లకు ఏం నష్టం జరగదా? అసలు ఇవన్నీ ఇలానే చెయ్యాలా? ఎవరి చేసినా చెయ్యకపోయినా చనిపోయాకా మనకి ఏం తెలుస్తుందసలు? ఇలా అల్లిబిల్లిగా ముసురుకున్నాయి ఆలోచనలతో మనసు బరువైపోయింది... 


ఇంతలో "పెద్దమ్మా నాకు కలర్ చాక్పీస్ ఇయ్యవా? నే బొమ్మ వేస్తా" అని మా మరిది కూతురు, "బెద్దమ్మా..నాక్కూడా ఇంకో స్లేట్ ఈయ్.. నే కూడా మంఛి బొమ్మ వేస్తా.." అన్న దాని తమ్ముడి ముద్దుముద్దు మాటలతో ఆలోచనాలోకం నుండి బయటపడి వాళ్ల కేరింతలకు నా నవ్వులను జత చేసేసా! 

"గుల్జార్ కథలు"





బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుల్జార్ కవిత్వం, దర్శకత్వం, చిత్రాలకు సంభాషణలు, గీతరచనలే కాక పిల్లల కోసం కూడా చక్కని సాహిత్యాన్ని అందించారు. అంతేకాక  Half a rupee stories, Raavipaar, धुवाँ పేర్లతో తనను కథా రచయితగా గుర్తుంచుకోదగ్గ మూడు కథా సంకలనాలు కూడా రాసారు. అనుకోకుండా క్రిందటేడు పుస్తకప్రదర్శనలో ‘గుల్జార్ కథలు’.. సి. మృణాళిని గారి అనువాదం అని చూసి వెంఠనే కొనేసాను. గుల్జార్ కు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించిన “धुवाँ”(పొగ) అనే ఉర్దూ కథల సంకలనానికి అనువాదం ఇది. అనువాద పుస్తకంలో మొత్తం 28 కథానికలున్నాయి.

తన కలం పేరును “గుల్జార్” పూర్తిగా సార్థకం చేసుకున్నారనిపించింది ఈ కథానికలు చదివితే నాకు. ఒక తోట ఎలాగైతే వివిధరకాలైన చెట్లు, పూలమొక్కలతో నిండి ఉంటుందో, గుల్జార్ సాహిత్యరచన కూడా అలానే వివిధరకాల శాఖలకు విస్తరించింది. అలానే ఈ పుస్తకంలో కథలు కూడా వైవిధ్యభరితమైన అంశాలతో ఓ తోటను జ్ఞప్తికి తెస్తాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కథానేపథ్యాలకు కూడా ఎల్లలు లేవని నిరూపిస్తారు గుల్జార్. తన సంభాషణలు కూడా ఆయన రాసే కవిత్వంలా ఉంటాయి కాబట్టి ఈ ఉర్దూకథల్లోని వచనం కూడా తప్పకుండా ఓ కవిత్వంలానే ఉండిఉంటాయని నా నమ్మకం. 


గుల్జార్ రాసిన ఈ కథానికల తెలుగు అనువాదం "గుల్జార్ కథలు" గురించిన మిగతా వ్యాసాన్ని  పుస్తకం.నెట్ లో చదవవచ్చు...
లింక్ :
http://pustakam.net/?p=16186


Saturday, February 1, 2014

చలువపందిరి: मोन्टा रे!





గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.

ఈ పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో చదవవచ్చు:
http://vaakili.com/patrika/?p=4913


నవలానాయకులు - 2


కౌముదిలో ప్రచురితమౌతున్న "నవలానాయకులు" శీర్షిక లో ఈ నెల కోడూరి కౌసల్యాదేవి గారి 'శాంతినికేతన్' నవలా నాయకుడు 'రాజా' పరిచయం ఇక్కడ చదవవచ్చు:

http://www.koumudi.net/Monthly/2014/february/feb_2014_navalaa_nayakulu.pdf



Friday, January 31, 2014

రెండు శాంతకుమారి పాటలు..



తెలుగు వెండితెరపై చల్లని తల్లిగా పేరుపొందిన పి. శాంతకుమారి నటిగానే కాక గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న అభినేత్రి. నవ్వుతూ ఉండే శాంత స్వరూపం ఆమెది. అందుకే ఆ పేరు పెట్టారేమో! ఆవిడ అసలు పేరు సుబ్బమ్మట. నలుపు తెలుపు చిత్రాల్లో "అమ్మ" అంటే శాంతకుమారే గుర్తుకు వస్తారు. వదిన, అమ్మ మొదలైన పాత్రల్లో వేయకముందు హీరోయిన్ పాత్రలు కూడా ఆమె చేసారు. నాగేశ్వరరావు కు హీరోయిన్ గా 'మాయలోకం' అనే చిత్రంలో నటించి, 'జయభేరి'లో వదిన పాత్ర వేసి, మళ్ళీ 'అర్థాంగి' లో సవతి తల్లి పాత్ర వేసారామె.


చిన్న వయసులోనే శాస్త్రియ సంగీతంతో పాటూ, వయోలిన్ వాదన కూడా అభ్యసించిన శాంతకుమారి తన చక్కని స్వరంతో ఎన్నో సినీగీతాలను ఆలపించారు. దర్శక,నిర్మాత పి.పుల్లయ్య గారిని వివాహమడిన శాంతకుమారి, ఆయన ప్రోత్సాహంతో చాల ఏళ్లపాటు తన నటనను కొనసాగించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లోనే కాక, తాను నటించిన ఇతర చిత్రాల్లో కూడా శాంతకుమారి పాటలు పాడారు. సారంగధర, కృష్ణప్రేమ, ధర్మదేవత, ధర్మపత్ని మొదలైన చిత్రాల్లో ఆవిడ గానం చేసారు కానీ అవన్నీ చాలా పాత చిత్రాలవ్వడం వల్ల అంతర్జాలంలో ఆవిడ పాటలు చాలావరకు లభ్యమవడం లేదు :( 


'సిరిసంపదలు', 'శ్రీ వేంకటేశ్వర మహత్యం' ఈ రెండు చిత్రాల్లో పాడిన పాటలు మాత్రం దొరికాయి. రెండు పాటలూ చాలా బాగుంటాయి. వాటిల్నిక్రిందన చూడవచ్చు..


'శ్రీ వేంకటేశ్వర మహత్యం' చిత్రంలో వకుళాదేవి పాత్ర పోషించారామె.
పాట: ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ

 


 పాట: చిట్టి పొట్టి పాపలు చిరుచిరు నవ్వుల పువ్వులు 
చిత్రం: సిరిసంపదలు