సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 7, 2013

ముగ్గుల పుస్తకం..




 మా మామ్మయ్య(నాన్నమ్మ) నుండి అత్తకూ, అత్త నుండి అమ్మకూ లభ్యమయ్యి, ఆ తర్వాత మా అమ్మ నుండి నేను అపురూపంగా అందుకున్న విలువైన వారసత్వ సంపద "ముగ్గుల పుస్తకం". నామటుకు నాకు అదో పవిత్ర గ్రంథం. అమ్మ ఇచ్చిన గొప్ప వరం. అయితే అది నాదగ్గర ఇప్పుడు యథాతథంగా లేదు.. ఓ తెల్లకాగితాల కొత్త పుస్తకంలోకి ముగ్గులన్నీ బదిలీ కాబడ్డాయి. పాతకాలం లో వాళ్ళు అయిపోయిన కేలెండర్ చింపి, కుట్టి, వాటిలో పెన్సిల్ తో ముగ్గులు వేసిన ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చే సమయానికి చాలా శిధిలావస్థలో ఉంది. ఎన్నో చేతులు మారి, ఎందరో వనితామణుల చేతుల్లోనో నలిగిపోయి.. కొన్ని ముగ్గులు ఎన్ని చుక్కలో కూడా తెలీకుండా.. తయరైంది. అందుకనేనేమో కొత్తగా నే ముగ్గులు వేసుకున్న పుస్తకం మీద అమ్మ ఇలా రాసింది...



విజయవాడలో మా ఇంట్లో వీధి గుమ్మం దాకా  ఓ మూడు నాలుగు పెద్ద ముగ్గులు పట్టేంత స్థలం ఉండేది. నెలపట్టిన రోజు నుంచీ సంక్రాంతి వెళ్ళేదాకా మా సరస్వతి(ఆ ఇంట్లో ఉన్నంతకాలం పని చేసిన పనిమనిషి) రోజూ సందంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి వెళ్ళేది. తడి ఆరకుండా అమ్మ ముగ్గు వేసేది. తడి ఆరితే మళ్ళీ ముగ్గు గాలికి పోతుందని. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సన్నటిపోత తో, చకచకా ముగ్గులు పెట్టేసే అమ్మని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.. తప్పులు రాకుండా అలా ఎలా పెట్టగలదా అని. నేన్నెప్పుడు పెద్దయ్యి ముగ్గులు పెడతానా అని ఎదురుచూసేదాన్ని.


ఇక మా కాకినాడ వెళ్ళినప్పుడు మామ్మయ్య, అత్త, అమ్మ ముగ్గురూ పెట్టేస్తూండేవారు ముగ్గులు. ఆ వీధిలో మా అత్త పేరు ఇప్పటికీ ముగ్గులత్తయ్యగారే ! అత్త ముగ్గుల పుస్తకం ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. పైనవాళ్ళో, పక్కవాళ్లో అడిగి తీస్కెళ్ళేవారు. 9th,10thక్లాస్ ల్లోకి వచ్చాకా నేనూ వాళ్ల ముగ్గుల పక్కన చిన్న చిన్న ముగ్గులుపెట్టేదాన్ని. ఇంటర్ నుంచీ మొత్తం గ్రౌండ్ నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మలాగ మెలికల ముగ్గులూ, వెడల్పు పోత ముగ్గులు కూడా వచ్చేసాయి. లక్ష్మి(అక్కడి ఆస్థాన పనమ్మాయి) వాకిలి తుడిచి, పేడ నీళ్ళతో కళ్లాపిజల్లి వెళ్ళేది. లక్ష్మి పేడ తెచ్చి చేత్తో తీసి బకెట్నీళ్ళలో కలిపేస్తుంటే.. కంపు కొట్టదా.. అలా ఎలా కలుపుతావు? అనడిగేదాన్ని.


ముగ్గుల పుస్తకంలోంచి సాయంత్రమే ఓ ముగ్గు సెలెక్ట్ చేసుకుని, కాయితమ్మీద వేసుకుని, ముగ్గు పెట్టాలన్నమాట. మా గుమ్మంలోనే వీధి లైటు ఉండేది కాబట్టి లైటు బాగానే ఉండేది కానీ దోమలు మాత్రం తెగ కుట్టేవి. అక్కడేమిటో రాక్షసుల్లా ఉండేవి దోమలు. ముగ్గు పెట్టే డ్యూటి నాకిచ్చేసాకా అమ్మవాళ్లు వంట పనుల్లో ఉండేవారు.. అందుకని ముగ్గు పెట్టినంత సేపూ తోడుకి అన్నయ్యనో, నాన్ననో బ్రతిమాలుకునేదాన్ని.


పెద్ద చుక్కల ముగ్గయితే, అన్నయ్య "నే చుక్కలు పెడతా" అని ముగ్గు తీసుకుని చుక్క చుక్కకీ "చిక్కుం చిక్కుం..." అంటూ చుక్కలు పెట్టేవాడు..:) అలా దాదాపు పెళ్లయ్యేవరకు నెలపట్టి ముగ్గులు పెట్టాను. అ తర్వాత నెలంతా కుదరకపోయినా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అపార్ట్మెంట్ ల్లోకి వచ్చాక గుమ్మంలోనే చిన్న ముగ్గుతో సరిపెట్టేసేదాన్ని. మొన్నటిదాకా రెండేళ్లపాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కాస్త ముగ్గుసరదా తీరింది. ఈ ఏడు మళ్ళి మామూలే.. అపార్ట్ మెంట్.. చిన్న చాక్పీస్ ముగ్గు..:( ముగ్గులు వెయ్యటం తగ్గిపొయినా, అమ్మ ఇచ్చిన ముగ్గుల పుస్తకం మాత్రం నాకెప్పటికీ అపురూపమే.

 నా ముగ్గుల పుస్తకంలోంచి మరికాసిన ముగ్గులు...













ఇంకొన్ని ముగ్గులు ఈ టపాల్లో ఉంటాయి..
http://trishnaventa.blogspot.in/2009/06/blog-post_16.html
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_12.html
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_16.html


Sunday, January 6, 2013

జంటగా చూసితీరాల్సిన "మిథునం" !





పదిహేనేళ్ళ క్రితం రాయబడిన ఒక కథ.. కథాజగత్తునే ఒక్క ఊపు ఊపింది. ఎంతోమంది సాహితీప్రియుల ఆత్మీయతనీ, ఆదరణనీ, అభిమానాన్ని సంపాదించుకుంది. నాటక రూపంలో రేడియోలోనూ, రంగస్థలం పైనా చోటు సంపాదించుకుంది. ఆంగ్లానువాదం అయి మళయాళ చలనచిత్రంగా  కూడా రూపుదిద్దుకుంది. బాపూ అందమైన చేతివ్రాతలో దస్తూరీ తిలకమై నిలిచింది. ఎందరో సాహితీమిత్రుల శుభకార్యాల్లో, శుభ సందర్భాల్లో వారివారి బంధుమిత్రులకు అందించే అపురూపమైన కానుకైపోయింది కూడా. అటువంటి బహుళప్రాచుర్యం పొందిన కథను తెరపైకెక్కించే ప్రయోగం చేసారు శ్రీ తనికెళ్ల భరణి గారు. 


ఒక భాష నుండి మరో భాషకు చేసే సాహిత్యానువాదాన్ని అనువాదం అనరు.. "ప్రతిసృష్టి" అంటారు. అసలు రచనలోని సారన్ని మార్చకుండానే తనదైన శైలిలో ఎంతో నేర్పుతో అనువదిస్తాడు అనువాదకుడు. అందువల్ల అది "ప్రతిసృష్టి" అవుతుంది. ఆ విధంగా "మిథునం" సినిమా కూడా భరణి గారి ప్రతిసృష్టి అని చెప్పాలి. కాలానుగుణంగా ఉండటానికి శ్రీరమణ గారి కథ కు కాసిన్ని మార్పులు చేసినా కూడా అసలు కథలోని సారానికి ఏమాత్రం లోటు రానీయలేదు ఆయన. జీవితపు బరువు బాధ్యతలు దింపుకున్న ఓ వృధ్ధ జంట, పల్లెటూరిలోని తమ సొంత ఇంటిలో చివరి రోజులు గడపటం ప్రధాన సారాంశం. వాళ్ల వానప్రస్థం అన్నమాట. ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో అక్షరరూపంలో చూపెట్టారు శ్రీరమణ గారు. అది దృశ్యరూపంలో ఇంకెంత బావుంటుందో కన్నులపండుగగా చూపెట్టారు భరణి గారు.



ఈ కథను సినిమాగా తీస్తున్నారనగానే నన్ను భయపెట్టినవి రెండే విషయాలు. ఒకటి నటీనటులు, రెండోది ఇల్లు. ఆ పాత్రలు ఎవరు చేస్తారో..ఎలా చేస్తారో అనీ;  అసలలాంటి తోట, పెరడు ఉన్న ఇల్లు దొరుకుతుందా అనీనూ! కానీ బాలూ, లక్ష్మి ఇద్దరూ కూడా తమ పరిధుల్లో ఎక్కడా కూడా వారి నిజరూపాల్లో కనబడక, కథలోలాగ ఎనభైల వయసులో లేకపోయినా, కేవలం అప్పదాసు,బుచ్చిలక్ష్మి లాగానే కనబడటం దర్శకుడి ప్రతిభే ! ఇంక అలాంటి తోట, పెరడు, చెట్లు, పాదులు అన్నీ ఉన్న ఇల్లెక్కడ దొరుకుతుందా అని బెంగపెట్టుకున్నాను నేను. అలాంటిది శ్రీకాకుళంలో దొరికిందిట.. ప్రొడ్యూసర్ ఇల్లేనట అని తెలిసి ఆనందించినదాని కంటే సినిమాలో ఆ ఇల్లు చూశాకా ఇంకా ఎక్కువ సంబరపడ్డాను. "ఆ ఇంట్లో నా కూతురి పెళ్ళి చేసాను. సినిమాకి డబ్బులు రాకపోతే ఇంకో కూతురు పెళ్ళి చేసాననుకుంటాను.." అన్నారట ప్రొడ్యూసర్. అలాంటి పెరడు, చెట్లు, ఇల్లే ఉంటే అప్పదాసేమిటి, ప్రపంచాన్ని వదిలేసి నేనే అక్కడ ఉండిపోతాను..:) ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా అటువంటి ప్రశాంతమైన జీవితం గడపగలమా?





సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోటుంది.. ఫోటోగ్రఫీ. భరణి గారి అన్నగారి కుమారుడే ఫోటోగ్రఫీ చేసాడుట. యూనిట్ అంతా కూడా అంతకు ముందు భరణితో పనిచేసిఉన్నవారవటం తనకు ఉపయోగపడిందని ఓ ఇంటర్వ్యులో భరణి చెప్పారు. మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా, రెండే పాత్రలతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించగలగటం ఎంతో సాహసం. దర్శకత్వంలో కొద్దిపాటి లోటుపట్లు కనబడినా చెప్పదలిచిన విషయాన్ని సమర్థవంతంగానే తెలియజేసారు భరణి. సినిమాలో నాకు బాగా నచ్చినది రేడియో ! పొద్దున్న 'శుభోదయం' నుంచీ రాత్రి 'జైహింద్' అనేదాకా రేడియో కార్యక్రమాల టైం ప్రకారం తమ పనులు కూడా చేసుకునేవాళ్ళు అదివరకూ రేడియో శ్రోతలు. మళ్ళీ ఆ సిగ్నేచర్ ట్యూన్స్ వింటుంటే పాతరోజులు గుర్తుకువచ్చాయి..


అమెరికా పిల్లల కబుర్లు వచ్చినప్పుడు హాలులో నవ్వులు, చివర్లో నిట్టూర్పులూ, ముక్కు చీదిన బరబరలు.. ప్రేక్షకులు ఎంతగా లినమయ్యారో చెప్పాయి. మేం కూడా సినిమా అయ్యాకా కాసేపు అలా కూచుండిపోయాం. బయటకు వచ్చాక కూడా చాలా సేపు మట్లాడుకోలేకపోయాం..! మనసు భారం చేసేసావయ్యా భరణీ అని బాధగా మూల్గినా, అదే సత్యం కదా అని గ్రహించుకుని.. నెమ్మదిగా తేరుకున్నాను. అయితే హాలులో నెంబరింగ్ లేకపోవటం, అతితక్కువ హాల్సు లో విడుదల చేయటం, శనివారం అయినా హాలు నిండకపోవటం కలుక్కుమనిపించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి ఎదుగుతారో.. ఎప్పటికి చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుందో.. అన్న ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను. 



మూలకథలో లేని మార్పులు చేసినా కూడా వృధ్ధజంట అన్యోన్యత, చిలిపి తగదాలు, పరస్పరాఅనురాగం చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది సినిమాలో అనుకున్నా.. అందుకే నాకనిపించింది ఏమిటంటే ప్రతి జంటా జంటగా చూసితీరాల్సిన చిత్రం "మిథునం" అని !





మనసున మొలిచిన సరిగమలే..



"సంకీర్తన" ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా.. కథ పెద్దగా గుర్తులేదు కానీ కొంచెం విశ్వనాథ్ సినిమాలా ఉంటుందని గుర్తు. దర్శకుడు 'గీతాకృష్ణ' విశ్వనాథ్ దగ్గర పనిచేసినందువల్ల ఆ ప్రభావం కనబడిందేమో మరి! ఇళయరాజా పాటలు బావుంటాయి కదా.. అందుకని అవి గుర్తు :)

సినిమాలో అన్ని పాటల్లో నాకు ఈ పాట బావుంటుంది. వేటూరిసాహిత్యం చాలా బావుంటుంది.

సాహిత్యం:

మనసున మొలిచిన సరిగమలే
ఈ గల గల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిను జేరీ
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎదసడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం

కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కుకూ కుకూ కీర్తనా తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా యెత దాగున్నావు
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ



మువ్వల రవళి పిలిచింది.. కవిత బదులు పలికిందీ
కలత నిదుర చెదిరింది.. మనసు కలను వెతింకిందీ
వయ్యరాల గౌతమీ...
వయ్యరాల గౌతమి ఈ కన్యారూప కల్పనా
వసంతాల గీతినీ నన్నే మేలుకొల్పెనా
భావాల పూల రాగల  బాట నీకై వేచేనే
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు


ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా.. కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన.. కుకూ కుకూ కూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం  అవని అధర దరహాసం
మరందాల గానమే...
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు వూహ వాలే ఈ మ్రోల
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు

ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు




Friday, January 4, 2013

పాటల డైరీలు..




8th క్లాస్ లో నేనూ, తమ్ముడు స్కూల్ మారాం. ఆ స్కూల్ పెద్దది. ప్రతి సబ్జెక్ట్ కీ ఒకో టీచర్ వచ్చేవారు. మ్యూజిక్ క్లాస్ ఉండేది. ఆ టీచర్ ఎవరంటే ప్రసిధ్ధ గాయని వింజమూరి లక్ష్మి గారి చెల్లెలు వింజమూరి సరస్వతిగారు. ఆవిడ రేడియోలో పాడటానికి వస్తూండేవారు. కొత్త పిల్లల పరిచయాల్లో నేను ఫలానా అని తెలిసి " ఏదీ ఓ పాట పాడు.." అని ఆడిగేసి నన్ను స్కూల్ 'choir group'లో పడేసారావిడ. అలా ఆవిడ పుణ్యమా అని నాలోని గాయని నిద్రలేచిందన్నమాట :) ఇక ధైర్యంగా క్లాసులో అడగంగానే పాడటం అప్పటి నుంచీ మొదలైంది. 


క్లాసులో మ్యూజిక్ టీచర్ నేర్పే దేశభక్తి గీతాలూ, లలితగీతాలే కాక  సినిమాపాటలు కూడా అడిగేవారు. పాట పాడాలి అంటే నాకు సాహిత్యం చేతిలో ఉండాల్సిందే. ఇప్పటికీ అదే అలవాటు. అందుకని రేడియోలోనో, కేసెట్ లోనో వినే పాటల్లో నచ్చినవి రాసుకుని, దాచుకునే అలవాటు అప్పటినుండి మొదలైంది. ఇప్పుడు ఏ పాట కావాలన్నా చాలావరకూ ఇంటర్నెట్లో దొరుకుతుంది కానీ చిన్నప్పుడు వెతుక్కుని, రాసుకుని దాచుకోవటమే మర్గం.


డైరీల పిచ్చి కాబట్టి పాటలు రాయటం కూడా డైరీల్లో రాసుకునేదాన్ని. తెలుగు, హిందీ ఒకటి, ఇంగ్లీషు ఇలా మూడు భాషల పాటలకి మూడు డైరీలు. ఈ డైరీల్లో పాటలు నింపటం ఒక సరదా పని. కేసేట్లో ఉన్న పాట ఎలా అయిన వెనక్కి తిప్పి తిప్పి  రాయచ్చు కానీ రేడియోలో వచ్చేపాట రాసుకోవటమే కష్టమైన పని. ఏదో ఒక కాయితం మీద గజిబిజిగా రాసేసుకుని తర్వాత ఖాళీలు పూరించుకుంటూ డైరీలో రాసుకునేదాన్ని. అలా రేడియోలో "మన్ చాహే గీత్" లోనో, "భూలే బిస్రే గీత్" లోనో విని  రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. కానీ అలా రాసుకోవటం భలే సరదాగా ఉండేది. ఏదో ముక్క, లేదా ఒకే చరణమో వినటం..ఆ విన్నది బావుందని రాసేసుకోవటం. కొన్నయితే ఇప్పటిదాకా మళ్ళీ వినటానికి దొరకనేలేదు నాకు. కొన్ని పల్లవులు మటుకు రాసుకుని తర్వాత ఇంట్లో నాన్న కేసెట్లలో ఆ పాట ఎక్కడ ఉందో వెతుక్కోవటం చేసేదాన్ని. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలానే దొరికేవి నాకు. కొన్ని పాత సినిమాపాటల పుస్తకాల్లో దొరికేవి. నాన్నవాళ్ల చిన్నప్పుడు సినిమాహాలు దగ్గర అమ్మేవారుట సినిమాల తాలుకు పాటలపుస్తకాలు. అవన్నీ అమ్మ జాగ్రత్తగా బైండ్ చేయించి దాచింది.






వీటిల్లో సినిమాపాటలే కాక ఆ సినిమా తాలూకూ కథ క్లుప్తంగా రాసి ఉండేది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు కూడా పెద్ద లిస్ట్ ఉండేది వెనకాల అట్ట మీద. ఎన్నో పాత సినిమాల కథలు, పాటల వివరాలు ఆ పుస్తకాల్లో నాకు దొరికేవి. ఇవి తెలుగు హిందీ రెండు భాషల సినిమాలవీ ఉండేవి. చిన్నప్పుడు శెలవు రోజున ఈ పుస్తకాలను తిరగెయ్యటం నాకో పెద్ద కాలక్షేపంగా ఉండేది. ఈ పుస్తకాల్లో నే వెతికే పాటలు ఉన్నా కూడా నచ్చినపాట స్వదస్తూరీతో డైరీలో రాసుకోవటమే ఇష్టంగా ఉండేది నాకు. అలా డైరీల్లో పాటలసాహిత్యం రాసుకోవటం ఓ చక్కని అనుభూతి.


స్కూల్లో, కాలేజీలో వెతుక్కుని వెతుక్కుని రాసుకున్న నచ్చిన పాటల డైరీలు ఇవే... (ఈ ఫోటొల్లోవన్నీ ఇదివరకెప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల క్రితం రాసుకున్నవి)






ఇప్పుడు రాసే అలవాటు తప్పి రాత కాస్త మారి ఇలా ఉంది.. క్రింద ఫోటోలోది ఇవాళే రాసినది.




 పైన డైరీలో రాసిన తెలుగు పాట తిలక్ గారి "అమృతం కురిసిన రాత్రి" లో "సంధ్య" అనే కవిత. ఆ పుస్తకంలో కొన్నింటికి వారి మేనల్లుడు ఈ.ఎస్.మూర్తి గారు పాతిక ముఫ్ఫైఏళ్లక్రితం ట్యూన్ కట్టారు.(రేడియో ప్రోగ్రాం కోసం) వాటిల్లో ఒకటే ఈ పాట. చాలా బావుంటుంది. "గగనమొక రేకు" పాటని క్రింద లింక్ లో యూట్యూబ్ లో వినవచ్చు:
http://www.youtube.com/watch?v=1E2kYLnz0VI




Wednesday, January 2, 2013

చిన్న ముఖాముఖి..



రెండ్రోజుల క్రితమనుకుంటా జాజిమల్లి బ్లాగర్ 'మల్లీశ్వరి’ గారి వద్ద నుండి ఒక ప్రశ్నాపత్రం వచ్చింది. బ్లాగ్లో మహిళా బ్లాగర్లతో ముఖాముఖి రాస్తున్నానని... ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపమని అడిగారు. 
తోచిన సమాధానాలు రాసి పంపాను.. ఇవాళ ప్రచురించారు:

http://jajimalli.wordpress.com/2013/01/02/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F/

నాకీ సదవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

***

నా బ్లాగ్ తరచూ చదివే పాఠకులు చదువుతారని మాత్రమే ఈ లింక్ ఇస్తున్నాను కాబట్టి కామెంట్ మోడ్ తీసివేస్తున్నాను.

Tuesday, January 1, 2013

ఈరోజు..




క్రిందటి సంవత్సరం ఈరోజున సందడి, సంబరం లేకుండా పాదానికి కుట్లతో,కట్టుతో మంచం మీద ఉన్నా! ఈ ఏడు మా గేటెడ్ కమ్యూనిటీ తాలూకూ బిల్డర్స్ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీలో సరదాగా కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టా. రెండు స్థితులకీ ఎంత తేడానో !! ఈ తేడానే ఏదో ఆశనీ, కొత్త ఉత్సాహాన్నీ నింపింది నాలో. 


అసలు న్యూ ఇయర్ పార్టీలో పాల్గొనటం ఇదే మొదలు మాకు. ప్రతి న్యూ ఇయర్ కీ ఎప్పుడూ ఇంట్లోనే గడుపుతాం. ఈసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మా బిల్డర్స్  ఆహ్వానాలన్నింటికీ తప్పనిసరిగా హాజరుకావాల్సి వస్తోంది. మా కమ్యూనిటీలో మొత్తం ఎనిమిది బిల్డింగ్స్ ప్లాన్ లో ఉన్నాయి. ఆరు పూర్తయ్యాయి. మిగిలినవాటి నిర్మాణం జరుగుతోంది.  ఒకో బిల్డింగ్ కీ ఐదు ఫ్లోర్లు, ఫోరుకి పధ్నాలుగు ఫ్లాట్లు... అంటే దాదాపు ఐదువందలఏభై పైగా కుటుంబాలు ఇక్కడ చేరబోతున్నాయి. ఇదో పల్లెటూరన్నమాట. పిల్లలకీ,పెద్దలకీ స్విమ్మింగ్ పూల్స్; బేడ్మెంటన్ కోర్ట్, ఓపెన్ యెయిర్ పార్టీ ప్లేస్ కాక ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టారు. జిమ్నాసియం, క్లబ్ హౌస్, లైబ్రరీ, బ్యూటీ పార్లర్, యోగా రూమ్ మొదలైన ఎన్నో ఎమినిటీస్ తో షాపింగ్ కాంప్లెక్స్ తయారైంది. నిన్న రాత్రి మా షాపింగ్ కాంప్లెక్స్  ఇనాగరల్ ఫంక్షన్, ప్రస్తుతం ఇక్కడ నివాసముంటున్న రెండువందల కుటుంబాలకి డిన్నర్ ఏర్పాటు చేసారు. ఆ తర్వత న్యూ ఇయర్ పార్టీ అన్నారు.


ఎందుకొచ్చిన గోల.. పోదాం పదవే అంటే "నేనిప్పుడే కదా ఇలాంటి పార్టీ చూడటం.. నా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తున్నారు..ఉందాం.." అని మా పాప పేచీ. ఇక తన కోసం మేమూ తప్పనిసరిగా కూచుండిపోయాం. రోజూ తనతో ఆడుకునే పిల్లలు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే తనకూ చూడాలని ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి ఐదునెలలౌతున్నా నాకు గట్టిగా అరడజను మంది కూడా తెలీదు. రోజూ ఆడుకుంటారు కాబట్టి పిల్లలందరూ ఫ్రెండ్స్. ఏమిటో మా ఇద్దరికీ ఈ గోల.. పార్టీ హడావుడి పడదు. పాప కోసం తను ఉండిపోయారు కానీ మధ్యలో రెండుమూడు సార్లు నేను ఇంటికి వచ్చి వెళ్ళా. ఆ గోలలో ఉండేకన్నా ఓ పుస్తకం చదువుకుందాం అని కూచున్నా కానీ టైం పావుతక్కువ పదకండు అయ్యాకా.. ఒక్కదాన్ని ఇంట్లో ఎందుకు అని మళ్ళీ తాళం పెట్టి అక్కడికే వెళ్పోయా.


ఏవో సినిమాపాటలకీ, పాప్ సాంగ్స్ కీ పిల్లలు, కొందరు పెద్దలు డాన్సులు చేసారు. మాకు వాటిల్లో ఒకటి అరా తప్ప ఏమీ తెలీవు. పైగా గుండెలదిరిపోయేలా సౌండ్. సరే డాన్సులు అయ్యాకా పన్నెండు దాకా తంబోలా ఆడారు అంతా. చివర్లో మ్యూజిక్ పెట్టి పిల్లలను స్టేజ్  మీద డాన్స్ చెయ్యమంటే అంతా వెళ్ళి గెంతులు మొదలెట్టారు. మా పిల్లనీ వెళ్లమన్నాం కానీ అది వెళ్ళలే. క్రిందనే కూచుని చీర్ చేసింది స్నేహితులని. ఆ పిల్లలేమిటో...ఆ డాన్సులేమిటో !! 'వీళ్ళు పిల్లలా..' అనిపించింది. పిల్లని వెళ్లమన్నానే కానీ ఎక్కడ అది కూడా వాళ్లందరితో పిచ్చి గంతులు వేస్తుందో అని బెంగపడ్డా. అది వెళ్లనందుకు మేమిద్దరం సంతోషించాం. పన్నెండు కొట్టగానే కేక్ కోసి పిల్లలంతా కలిసి చుట్టూరా కట్టిన బెలూన్స్ అన్నీ ఒక్కటి మిగల్చకుండా పగులగొట్టేసారు. 


ఆ సందడి, ఫ్లాట్స్ లో ఉండే వాళ్లందరూ ఒకరినొకరు గ్రీట్ చేసుకోవటం బాగా నచ్చింది నాకు. ఇంతవరకూ పరిచయంలేని వాళ్ళు కూడా పలకరించి విషెస్ చెప్పారు నాకు. పెద్దలు కూడా పిల్లల్లా పరిగెట్టి, ఒకరికొకరు కేక్ పూసుకుని నవ్వుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. అదంతా శుభసూచికంగా, ఎంతో ఐకమత్యం, స్నేహభావం ఉన్న వీళ్లందరి మధ్యా మా జీవనం తప్పక సరదాగా గడుస్తుందని నమ్మకం కలిగింది. పిల్ల పేచీ పెట్టకపోతే ఈ ఆనందం, ఆశాభావం మిస్సయ్యేదాన్నేమో అనుకున్నా ! ఒంటిగంట దాటాకా అందరం మా మా ఇళ్ళు చేరి నిద్రలో మునిగిపోయాం. 


ఇవాళ పొద్దున్న కూడా సమీప బంధువుల ఆగమనం,  నే వండినది వాళ్ళు ఆనందంగా కడుపునిండా తినటం కూడా నన్నెంతో సంతృప్తి పరిచాయి. కొత్త సంవత్సరారంభంలో నాలాంటి సామాన్య జీవికి ఇంతకు మించిన ఆశావాద ప్రారంభం మరేముంటుంది ?

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Thursday, December 27, 2012

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 6 !!

while recording for 'gala gala gOdAri' at antarvEdi

రెండు మూడు రోజుల పాటు ఇంట్లో రామం కనబడకపోతే అవార్డ్ ప్రోగ్రాం చేస్తున్నాడని అర్ధమయ్యేది అతని కుటుంబానికి.
తిండీ, నిద్ర మానుకుని అకుంఠిత దీక్షతో అతను చేసిన అవార్డ్ ప్రోగ్రాం ల కథాకమామిషు:


1.1980 - నీలినీడలు ( సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రధమ బహుమతి)
ఐదవ భాగం చివరలో ఈ కార్యక్రమం తాలూకు వివరాలు రాసాను.


2. 1982 - We Two (సృజనాత్మక శబ్దచిత్రం -- ఎంట్రీ)

3. 1983 - లహరి ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
మానవుడి దైనందిన జీవితంతో సంగీతం ఒక అంతర్భాగంగా ఎలా పెనవేసుకుపోతోందో ఉదాహరణలతో సహా వివరించే రూపకం. కార్యక్రమం చివరలో సినిమా ట్రైలర్ మాదిరే ప్రత్యేకంగా తయారుచేసిన ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్రీల్ ప్రతీక ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రోగ్రాం విని మన తెలుగువారు, ప్రముఖ వేణుగాన విద్వాంసులు,అప్పట్లో ఫిల్మ్ డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏల్చూరి విజయరాఘవరావుగారు ఇందులోని కొన్ని అంశాలనూ, కాన్సెప్ట్ నీ స్మగుల్ చేయాలనిపించింది అని మెచ్చుకుంటూ రెండు పేజీల ప్రశంసాపూర్వక ఉత్తరం రాయటం రామానికి ఎంతో ఉత్సాహం ఇచ్చింది.

4.1984 - సారే జహాసే అచ్ఛా (సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రశంసాపత్రం)
చిన్నప్పుడూ social studies లెసన్స్ లో బోలెడన్ని హిందూదేశపటాలు ఉండేవి. వరి,గోధుమ ,తేయాకు పండు ప్రదేశములు, భారత దేశంలో వివిధ నదులు,భారత దేశంలో రైలు మార్గాలు ఇలా ఒకో పటం ఒకో రకం. కానీ అన్నీ భారత దేశ పటాలే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తీసుకుని వివిధ అంశాలు వినబడేలాగ మూడు నిమిషాల వ్యవధిగల భారత దేశ సౌండ్ మ్యాప్ లు వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది రామానికి. అంటే ఆధ్యాత్మిక భారత దేశం, దేశభక్తుల మహామహుల భారత దేశం, ఆకలిదప్పుల భారత దేశం, ప్రకృతి సౌందర్యాల భారత దేశం, పురాతన సంగీత పరంపర గల భారత దేశం, సాంకేతిక వైజ్ఞానిక ప్రగతితో పరిఢవిల్లే భారత దేశం ఇలాంటివన్న మాట. అన్నీ శబ్దమయంగానే. వీటన్నింటితో నిండిన సమగ్ర భారత దేశమే "సారే జహాసే అచ్ఛా" అని తేల్చి చెప్పటం.

5.1985 - ఒక పాట పుట్టింది (సృజనాత్మక రూపకం ఎంట్రీ)
ఆకాశవాణిలోనూ, సినిమాల్లోనూ వందలాది పాటలు తయారవుతూ ఉంటాయి. ఒకో పాటకూ ఒకో చరిత్ర ఉంటుంది. (బాలు గారు ’పాడుతా తీయగా”లో చెప్తున్నట్లు) కానీ ఒక్క పాట తయారవ్వాలంటే ఎందరో వ్యక్తుల శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. పాట వినే సామాన్య శ్రోతకి దాని వెనుక దాగిన తయారీ గురించి తెలిసే అవకాశం తక్కువ. ఎవరో పాట రాసి ఇస్తే, ఎవరో స్వరాలు చేకూరిస్తే, మరొకరు కంఠాన్ని జోడిస్తే, ఇంకొంతమంది వాద్య సహకారాన్ని అందిస్తే , ఒక సాంకేతిక నిపుణుడు రికార్డ్ చేసేస్తే పాట తయారీలో కష్టమేముంది? ఒకో పాటకి ఒకోసారి పదిహేను ఇరవై టేక్స్ దాకా ఎందుకు అవసరం అవుతుంది? దర్శకుడు వివరించిన సన్నివేశానికి ఐదారు రకాలుగా అక్షరాల అల్లిక రచయిత తయారుచేస్తే, అందులో ఒక్కటే ఎలా ప్రాణం పోసుకుంటోంది? సంగీత దర్శకుడు కూడా ఐదారు రకాల బాణిలు వినిపిస్తే అందులో ఒక్కటే ఎలా హిట్ అవుతోంది? గాయకుడికీ, వాద్యబృందానికీ స్వరలిపి ఇచ్చి రిహార్సల్స్ చేసిన తరువాత కూడా ఎక్కువ టేక్స్ ఎందుకు అవసరమౌతున్నాయి? రికార్డింగ్ స్టుడియోలో జరిగే వింతలు విశేషాలూ ఏమిటి? మొదలైన అంశాలన్నీంటినీ సామాన్య శ్రోతకు కూడా అర్ధమయ్యేలాగ వివరిస్తూ ఒక పాట చివరికి ఎలా పుడుతుందో తెలియజేసే సృజనాత్మక రూపకం ఇది. ఈ పాటకు స్వరకర్త విజయరాఘవరావుగారే కావటం వల్ల ఇందులోని నావెల్టీని ఆయన బహుధా ప్రశంసించారు.

ఈ ప్రోగ్రాం ను documentary feature గా పంపించి ఉంటే అవార్డ్ వచ్చి ఉండేదేమో అని తరువాత అనిపించింది రామానికి.

6.1986 - వర్షానందిని (సంగీత రూపకం - ప్రధమ బహుమతి)

7.1986 - నేను కాని నేను (సృజనాత్మక శబ్దచిత్రం - ప్రధమ బహుమతి)
సాధారణంగా సినిమాల్లో పాట రచన పూర్తయ్యాకా స్వరపరచటం ఒక సంప్రదాయ పధ్ధతి కానీ ఒకోసారి దానికి విరుధ్ధంగా ట్యూనే ముందు తయారయి అక్షరాల అమరిక తరువాత జరగటం కూడా మనకు తెలుసు. ఈనాటి పాటల్లో ఎక్కువభాగం ఇలా తయారవుతున్నవే. ఇదే ఒరవడిలో పదహారు శబ్దచిత్రాలను sound effects and musicతో కలిపి ముందుగానే తయారు చేసి ఈ సీరీస్ మొత్తాన్ని రచయిత, రేడియో మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారికి వినిపించి ఆయన స్పందన వచన కవితా రూపంలో రాయించి రివర్స్ లో తయారైన సృజనాత్మక కార్యక్రమం ఇది. దీనికి ఆంగ్లానువాదం తయారుచేసిన ప్రముఖ నైరూప్య వచన కవి శ్రీ "మో" (వేగుంట మోహనప్రసాద్)గారికి ఈ కార్యక్రమం అవార్డ్ రాకముందే ఎంతగానో నచ్చింది. ఈ కార్యక్రమం వింటుంటే ఇటివల వచ్చిన క్రిష్ చిత్రం ’వేదం’ స్క్రీన్ ప్లే లా ఉంటుంది.

8.1987 - స్మృతి (రేడియో నాటకం - ప్రశంసాపత్రం)

9.1988 - నిశ్శబ్దం గమ్యం (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
నిశ్శబ్దంలోంచి పుట్టిన మానవుడు తిరిగి నిశ్శబ్దంలోకే నిష్క్రమిస్తాడు.మధ్యలో మాత్రమే ఎంతో సందడి. అందుకే "రెండు చీకట్ల మధ్యన వెలుగు తోరణం నరుడు" అన్నారు శ్రీకాంతశర్మగారు. ఏనాడో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్ కోసం రాసుకున్న అల్లిబిల్లి ఐడియాల సమాహారమే ఈ శబ్ద చిత్రం. అతి చిన్న నీటి బిందువు నుంచి అతి భీకరమైన మేఘ గర్జన వరకూ, చెక్కిలిపై చెక్కిలి ఆనించి వినిపించే గుసగుస మొదలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే జనఘోష వరకూ, భళ్ళుమని శబ్ద ప్రకంపనలతో మొదలయ్యే వేకువ నుంచి నీరవ నిశీధిలో నక్షత్రాల రోదసీ సంగీతం వరకూ ఎన్ని అంతరాలున్నాయో శబ్ద మూలంగా వివరిస్తూ చివరకు ధ్యానంవల్ల సాధించే నిశ్శబ్దమే మనిషికి ఊరటనిస్తుంది అని ప్రతిపాదించే శబ్ద చిత్రం ఇది.

10.1990 - మెట్లు (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
మనిషి ఉన్నతికి దోహద పడేది మెట్టు. పైకి చేరిన స్థానాన్ని నిలబెట్టుకోలేకాపోతే అధోగతికి తోసేది కూడా ఆ మెట్టే. ఇది ఇందులోని ప్రధాన ఇతివృత్తం. ఎన్నో స్థాయిలు అధిగమించి ప్రేమ సాఫల్యాన్ని పొందుతారు ప్రేమికుల జంట. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కి పదోన్నతులు పొందుతారు. అష్టాంగమార్గాన్ని ప్రబోధించిన గౌతమబుధ్ధుడు కూడా ఓ అర్ధరాత్రివేళ తన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ, త్యజించి, రాజప్రాసాదం మెట్లు దిగి విశాల ప్రపంచంలోకి అడుగిడి, తిరిగి బౌధ్ధభిక్షువుగా అదే సోపానాల వద్దకు రావటం జీవిత పరిణామక్రమంలో సంభవించిన అద్భుత దృశ్యం. ఇన్ని రకాల మెట్లు గురించి వివరిస్తూ ఒక తల్లి తన పసి కుమారుణ్ణి చెయ్యి పట్టుకుని ప్రకృతి మానవుణ్ణి నడిపిస్తున్న రీతిలో కొనసాగిస్తూ చూపటం ఈ సృజనాత్మక రూపకంలో శ్రోతల్ని ఆకట్టుకునే ప్రధానాంశం.


11.1991- గలగల గోదారి (డాక్యుమెంటరీ -- ఎంట్రీ)
నాసికాత్రయంబకం దగ్గర గోముఖం నుంచి బిందు రూపంలో మొదలైయ్యే గోదావరి అంతర్వేది వద్ద సాగరసంగమం చెందేవరకూ గోదావరి సజీవ యాత్ర ఈ డాక్యుమెంటరీలో వినిపిస్తుంది. అదే సంవత్సరంలో యమునా నదిపైన కూడా డాక్యుమెంటరీ ఎంట్రీ రావటంతో గోదావరి చిన్నబోయిందని తెలిసింది. అయితే, ఈ కార్యక్రమం కోసం రామం, శ్రీకాంత శర్మగారు, మిగిలిన టేక్నికల్ టీం నాసిక్ మొదలు కోనసీమ దాకా ఒక నెల రోజులు తిరగటం మాత్రం రామం స్మృతులలో ఒక అందమైన ప్రయాణం.

'mahavishva' recording
12.1992 - మహావిశ్వ (రేడియో నాటకం(సైన్స్ ఫిక్షన్) -- ద్వితీయబహుమతి)


ఆకాశవాణిలో ఈ నాటకానికి ఒక చరిత్ర ఉంది. చాలా అరుదైన సైన్స్ ఫిక్షన్ నాటకం ఇది. స్పెషల్ ఐ.జి.పి, రచయిత, కవి కె.సదాశివరావుగారు ’ఇండియా టుడే ’ తెలుగు మ్యాగజైన్లో రాసిన "మానవ ఫాక్టర్" అనే సైన్స్ ఫిక్షన్ కథ దీనికి మూలం. ఈనాడు మనిషి గ్రహాంతరాల వైపు అడుగు సారిస్తున్నాడు. చంద్రుడి పైన ఎప్పుడో కాలు మోపాడు. మానవ వాస యోగ్యమైన ఇతర గ్రహాలేమైనా ఉన్నాయేమో అని కూడా పరిశోధిస్తున్నాడు. చండ్రుడిపైన, మార్స్ పైన అనతికాలంలో మనిషి నివాసాన్ని ఏర్పరుచుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. భూమి పైన పెరుగుతున్న జనాభా విస్ఫోటనం వల్ల, భూవనరులు తరగిపోవటం వల్ల మనిషి ఇతర గ్రహాల వైపు దృష్టి సారించక తప్పేలాలేదని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇంతే కాక పరస్పర కలహాలు, వాతావరణ కాలుష్యం, అణుయుధ్ధాలు మొదలుగా గల మనిషి స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్న అనర్ధాలు కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. దానా దీనా మానవజాతే అంతరించే ప్రమాదం గానీ, ఈ భూగ్రహం నుంచి ఫలాయనం చేయవలసిన అగత్యం ఏర్పడవచ్చు.


ఈ నేపథ్యం ఆధారంగా ఇప్పటికి 400 సంవత్సరాల తరువాత మానవ మనుగడ ఎలా ఉంటుంది? అప్పటికి గ్రహాంతర వాసానికి అలవాటు పడిపోయిన వైజ్ఞానిక మానవుడు ఎలా ఉంటాడు? రోబోలే సేవకులు, పరిచారికలు ఐతే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన ఆథెన్టిక్ ఇన్ఫర్మేషన్ తో సదాశివరావుగారు చేసిన విచిత్ర కల్పన ఈ కథ. దీనికి రేడియో అనుసరణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు చేయగా, రసవత్తరమైన వైజ్ఞానిక నాటకంగా రెండు నెలలు అవిశ్రాంతమైన కృషి చేసి రామం దీనిని రూపొందించాడు. ఇంత శక్తివంతమైన కథావస్తువుకు అనుగుణమైన సంగీతం సమకూర్చాలి అనే ఉద్దేశంతో అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని చెన్నై నుంచి సినీ ఆర్కెస్ట్రాని తెప్పించి ఒక నాటకానికి కేవలం నేపథ్యసంగీతం రికార్డ్ చేసేందుకు AIR వేలకువేల బడ్జట్ ఖర్చుపెట్టడం అదే మొదలు. ఈ కథాగమనంలో రెండు రోబోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకోసం కూడా ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలను చెన్నై సినీ ఫీల్డ్ నుంచి తెప్పించటం జరిగింది.


జాతీయ బహుమతి ఇవ్వటమే కాకుండా ఈ నాటకాన్ని ఆకాశవాణి ఢిల్లీలో ఒక మోడల్ ప్లే గా కూడా పెట్టడం విజయవాడ స్టేషన్కు గర్వకారణం.


13.1992 - 29minutes - 4th dimension (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
రామానికి వచ్చిన పది జాతీయ బహుమతుల్లో ఈ ప్రోగ్రాం చోటు చేసుకోలేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రాం పట్ల అతనికి ప్రత్యేకమైన అభిమానం. తన ఆలోచనా సరళి, తన ఆత్మ ఇందులో ప్రతి అడుగడుగునా ప్రతిఫలిస్తుందని రామం ఎప్పుడూ అంటాడు. దీని పూర్తి రచన, తయారీ తన స్వభావ సరళికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. శ్రీకాంతశర్మగారి కవితా సంపుటి "నిశ్శబ్దం గమ్యం" నుంచి తనకిష్టమైన కొన్ని కవితలు కూడా తానే ఇందులో చదవటం జరిగింది. సందర్భాన్ని అనుసరించి చలంగారి వాణిని, అలాగే ఒక పసిపాప కంఠాన్ని, ఠాగూర్ రచన "where the mind is without fear",
దానికి రజని తెలుగు అనువాదం "చిత్తమెచట భయ శూన్యమో.."(బృందగాన రూపంలో) ఇందులో వినియోగించటం జరిగింది. మన ప్రియతమ భారతదేశాన్ని ఇంత ఆదర్శవంతమైన దేశంగా మనం ఎప్పటికైనా పుననిర్మించుకోగలమా అని రామం ఆశ. రామం కల కూడా.


14.1995 - మ్యూజిక్ ఫ్యాక్టరీ ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)


15.1996భూమిగీత (సంగీత రూపకం -- ప్రధమబహుమతి)
ఈ సంవత్సరంలోనే Brazil లోని రియో డిజనిరియో లో ఎర్త్ సమిట్ జరిగింది. అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా పాల్గొంది. ఈ భూగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలి్? ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి/ మానవుడి మనుగడ ఏ దిశ వైపు? మొదలైన అనేక అంశాలు అక్కడ చర్చించటం జరిగింది. మన దేశం ప్రధాన పాత్ర వహించింది కూడా. దీని ఆధారంగా రూపొందించిన సంగీతరూపకం ఇది. చక్కని సంగీతం, ఆకర్షణీయమైన సౌండ్ ఎఫెక్ట్స్ గల ఈ రూపకం జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవటమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారం చేయబడింది కూడా.


16.1997 యాత్ర (సృజనాత్మక రూపకం -- మొదటి బహుమతి)
తాత్కాలికంగా తను ప్రేమించిన వ్యక్తికి దూరమైన ఒక వనిత ఒంటరి పయనం సాగిస్తూ రకరకాల ఋతువుల్లో అతనికై అన్వేషణ సాగిస్తూ తీపి జ్ఞాపకాల భూతకాలంలోకి వెళ్తూ, భవిష్యత్తులో తను కలుసుకోబోయే ప్రియుని కోసం భవిష్యత్ కలలు కంటూ ప్రస్తుత వర్తమానం కొనసాగించటం ఈ "యాత్ర"లో ముప్పేటగా సాగిపోతుంది. చిట్టచివరికి వారిద్దరూ కలుసుకోవటంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇందులో అడుగడుగునా సంగీతమే ప్రధాన ఆకర్షణ. ఆ పాటలన్నీ ప్రఖ్యాత గాయని శ్రిమతి ద్వారం లక్ష్మి పాడటం ఓ విశేషం. రామం awards కోసం ఢిల్లీ వెళ్ళిన చివరి యాత్ర కూడా ఇదే.


17. 2000 - శబ్ద2000 (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
నూతన శతబ్దంలోకి అడుగుపెట్టే తరుణంలో 2YK గురించి అనేక ఊహలు, కలలు ఉండేవి. ఈ చారిత్రాత్మక కాలగతిని స్వయంగా అనుభవించినవారందరూ నిజంగా అదృష్టవంతులే. ఒక నూతన శకంలోకి పాదం మోపబోయే భారత దేశం వెనుతిరిగి చూసుకుంటే తన గత చరిత్ర శబ్ద రూపంలో ఎలా వినిపిస్తుందో అని చేసిన కల్పన ఈ "శబ్ద2000".

రామం జాతీయ అవార్డ్ కార్యక్రమాల పరంపర ఇంతటితో ముగిసింది.

**** *** ***

awards
విజయవాడలో అనేక కళాసంస్థలు రామానికి జాతీయ బహుమతులు వస్తున్న తరుణంలో ఎన్నోసార్లు సన్మానాలు, సత్కారాలు చేసాయి. రేడియో మిత్రులు పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు రామానికి ఎనిమిది అవార్డులు వచ్చిన సందర్భంలో విజయవాడలోనే రామం కుటుంబ సభ్యులందరి సమక్షంలో అపూర్వమైన సన్మానం ఏర్పాటు చేసారు. నెల్లూరు "కళామందిర్", విజయవాడ "మధూలిక", "రసతరంగిణి" విజయవాడ, విజయవాడ "రోటరీ", ఢిల్లీలోని "ఢిల్లీ తెలుగు సంఘం" మొదలైన సంస్థలన్నీ కూడా రామానికి సన్మానాలు చేసాయి.


మద్రాసు తెలుగు అకాడమీ వారు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను సన్మానిస్తూ ఉగాది పురస్కారాలు అందజేయటం ప్రతి ఏటా ఒక ఆనవాయితీ. "ఆకాశవాణి"లో "ట్రెండ్ సెట్టర్" గా ఈ సంస్థవారు 2000సంవత్సరంలో రామానికి మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో మాజీ గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవిగారి చేతుల మీదుగా 'ఉగాది పురస్కారాన్ని' అందజేసారు.


Ugadi puraskar


విజయవాడ రేడియో కేంద్రానికి మూల స్థంభాలుగా చెప్పుకునే నండూరి సుబ్బారావు, సి.రామ్మోహనరావు స్మారక బహుమతులు కూడా రామానికి లభించాయి. ఇటీవలే హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా "వాచస్పతి పురస్కారాన్ని" కూడా అందుకోవటం జరిగింది.



Sri.K.Vishwanath giving 'vachaspati Award' to ramam



ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి శనివారం ప్రసారం చేసే "ఈవారం అతిథి" కార్యక్రమంలో జంట రేడియో మిత్రులైన శ్రీ ఇంద్రగంటి శ్రికాంత శర్మ గారినీ, రామాన్ని కలిపి ఒకేసారి పరిచయం చేసారు. అలాగే రైన్ బో ఎఫ్.ఎం లో "సరదా సమయం"లో ఓ గంట సేపు రామం అవార్డ్ కార్యక్రమాల ఆడియో క్లిప్పింగ్స్ తో ఓ పరిచయ కార్యక్రమం ప్రసారమైంది.


రామాయణ మహాకావ్య ఆవిర్భావానికి మూల కారకుడైన వాల్మీకి మహర్షిలాగ రామం ఆకాశవాణి విజయ పరంపరకు మూలం, ప్రేరణ - ప్రముఖ వాగ్గేయకారులు, కవి, రచయిత, గాయకులు, స్వర శిల్పి, రేడియో మాంత్రికుడు "రజని" (డా. బాలాంత్రపు రజనీకాంతరావు) అని రామం ఇప్పటికీ వినమ్రంగా చెప్పుకుంటూ ఉంటాడు. రజని రచించిన ’ఆదికావ్య అవతరణ” సంగీత రూపకాన్ని రంగస్థలంపై నృత్యరూపకంగా చేసిన ప్రదర్శనలో వాల్మీకి వేషం రామం ధరించటం యాదృచ్ఛికం. జాతీయ, అంతర్జాతీయ బహుమతులు రేడియోకి సంపాదించి పెట్టిన రజని పరిపాలనా కాలం విజయవాడ కేంద్రానికి ఎప్పుడూ ఒక స్వర్ణయుగం అని రేడియో శ్రోతలు ఇప్పటికీ అభివర్ణిస్తూఉంటారు. అందుకే ఆయన వర్ణచిత్రాన్ని తన గదిలో అలకరించుకున్నాడు రామం. ఈనాటికీ 90ఏళ్ళ వృధ్ధాప్యంలో కూడా పిలిస్తే పలికే దైవంలాగ సంగీత సాహిత్య రంగాల్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా తక్షణం నివృత్తి చేస్తూనే ఉన్నారాయన. నేటికీ పాటే ఆయన ప్రాణం. రామం లాంటి ఎందరో శిష్యప్రశిష్యగణం ఆయన ఆయురారోగ్యాల కోసం నిత్యం ప్రార్ధిస్తూనే ఉంటారు.


Dr.B.Rajanikantha Rao

**** *** ***
ముఫ్ఫై ఏళ్ళ సుదీర్ఘ ఆకాశవాణి అవిశ్రాంత జీవితం తరువాత 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు రామం. గ్రాండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో అన్ని సెక్షన్ల నుంచీ వచ్చిన విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్టాఫ్ అందరూ రామాన్ని "అజాతశత్రువు" అని కొనియాడారు. ఆ ఫంక్షన్ లో ఇతర కేంద్రాలనుంచి కూడా రేడియోమిత్రులు వచ్చి పాల్గొన్నారు. అతని సుస్వభావానికి, సహృదయతకూ లభించిన గౌరవం అది.

ఇదీ రామం కథ. ఇది రామం ఒక్కడి కథే కాదు సీతారాముల కథ. విజయపథంలో నిరంతరం కొనసాగే ప్రతి పురుషుని వెనుకా ఒక స్త్రీ ఉంటుందని నానుడి. అలానే 65ఏళ్ల రామం జీవనయానం వెంట జంటగా నడుస్తూ, తన సహకారాన్ని అందిస్తున్నది అతని సహధర్మచారిణి, మీదుమిక్కిలి అతని స్నేహితురాలు, సహజ శాంత స్వభావురాలు, చప్పుడు చెయ్యని వెన్నెల లాంటి సీతామహాలక్ష్మి అనే "సీత".


(కథ...సంపూర్ణం)


Tuesday, December 25, 2012

"వాకిలి" లో కాస్త చోటు..



బ్లాగ్ రాయటం మొదలుపెట్టాకా, బ్లాగ్లోకపు గోడల్ని దాటి ఒకసారి "నవతరంగం"లో, మూడు నాలుగుసార్లు "పుస్తకం.నెట్" లో, మరో నాలుగు వ్యాసాలు "చిత్రమాలిక"లో రాసాకా.. ఎందుకో ఇక్కడే నా బ్లాగ్ గూట్లోనే ఉండిపోయా....

ఇన్నాళ్ళకి మళ్ళీ మరో అడుగు వేసాను... అది కూడా "వాకిలి" ప్రోత్సాహంతోనే ! "వాకిలి e-పత్రిక" వాళ్ళు నన్ను కాలమ్ రాయమని అడిగినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను...

మరి నాతో పాటూ మొదటి సంచికలో, నే వేసిన "చలువ పందిరి" క్రింద నా పాటల కబుర్లు విందురుగాని రండి...

http://vaakili.com/patrika/?cat=28

వాకిలిలో నాకూ కాస్తంత చోటిచ్చి, నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.

Wednesday, December 19, 2012

ఈ సంవత్సరం కొన్న పుస్తకాల కబుర్లు



ఉన్నవి చాలు ఇక కొత్తవి ఎందుకని పుస్తకాలు కొనటం మానేసి, సంసార సాగరంలో పడ్డాకా ఖాళీ దొరక్క సినిమాలు చూడ్డం మానేసి ఏళ్ళు గడిచాయి. అయితే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా మళ్ళీ ఈ రెండు అభిరుచులకీ సమయం కేటాయించటం మొదలయ్యింది. ప్రస్తుతానికి ఈ టపాలో పుస్తకాల గురించి చెప్తానేం.. బ్లాగుల్లో అక్కడా అక్కడా రకరకాల పుస్తకాల గురించి చదువుతుంటే మళ్ళీ విజయవాడ పుస్తకప్రదర్శన రోజులూ, మొదలుపెట్టింది మొదలు ప్రతి ఏడూ విడువకుండా వెళ్లటం అన్నీ గుర్తొచ్చి... మళ్ళీ పుస్తకాలు కొనాలనే కోరిక బయల్దేరింది. బుర్రలో ఆలోచన పుట్టిందే మొదలు పుస్తకాల షాపులవెంట పడి తిరగటం మళ్ళీ అలవాటైపోయింది. చిన్నప్పటి నుండీ ఎవరు ఎప్పుడు బహుమతిగా డబ్బులు ఇచ్చినా దాచుకుని, వాటిని పుస్తకాల మీద ఖర్చుపెట్టడం నాకు అలవాటు. ఇప్పటికీ అదే అలవాటు. ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి బహుమతులు కూడా కాస్త బరువుగానే ఉంటున్నాయి నే కొనే పుస్తకాలకు మల్లే..:)

క్రిందటేడు పుస్తక ప్రదర్శనలో పెద్ద పెట్టున పుస్తకాలు కొన్నాననే చెప్పాలి. క్రింద ఫోటొలోవి మొదటి విడతలో కొన్నవి. చివర్లో మరోసారి వెళ్ళినప్పుడు మరికాసిని అంటే ఓ ఐదారు పుస్తకాలు కొన్నా. వాటికి ఫోటో తియ్యనేలేదు :( వాటిల్లో ఓ పది పుస్తకాలు చదివి ఉంటాను. మిగిలినవి అలానే ఉన్నాయి..




ఆ తర్వత ఓసారి మార్చిలొనొ ఏప్రిల్ లోనో విశాలాంధ్రలో క్రింద ఫోటోలో పుస్తకాలు కొన్నా..



అవి సగమన్నా చదవకుండా మళ్ళీ ఎవరికోసమో పుస్తకాలు కొనటానికి వెళ్ళి అప్పుడు మరో పదో ఎన్నో తీసుకున్నా. ఓసారి ఏదో గిఫ్ట్ కొందామని Landmarkకి వెళ్ళి అక్కడ "త్రీ ఫర్ టూ" ఆఫర్ నడుస్తోందని మూడు కాక మూడు కాక మరో రెండు కలిపి ఐదు బుక్స్ కొనేసా. వాటిల్లో ఓ మూడు చదివా. 





మా అమ్మావాళ్ళింటి ముందరే కోటి వెళ్ళే బస్సులు ఆగుతాయి. కోటికి గంట ప్రయాణమైనా అక్కడికి వెళ్తే ఈజీగా కోటీ వెళ్ళొచ్చని నాకు సంబరం. ఓసారి ఇంటికెళ్ళినప్పుడు ఏం తోచక కోటీ వెళ్ళొస్తానని బయల్దేరి మళ్ళీ కొన్ని పుస్తకాలు వెంటేసుకొచ్చా. ఇల్లు మారేప్పుడు అట్టపెట్టిలోకెళ్ళిన ఈ కొత్త పుస్తకాలన్నీ ఇంకా వాటిల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఇల్లు మరినప్పుడే అవి బయటకు వస్తాయి. అన్ని పేర్లు గుర్తులేవు కానీ కొన్ని పేర్లు గుర్తున్నాయి.. గోదావరి కథలు, ఓహెన్రీ కథలకి తెలుగు అనువాదం, సోమరాజు సుశీల గారి దీపశిఖ, కొత్తగా ప్రచురించిన రవీంద్రుడి కథలు, రవీంద్రుడి నవలలకు తెలుగు అనువాదాలు కొన్ని..  

ఆ తర్వాత ఇటీవలే మావారు ఎవరికోసమో పుస్తకం కొనటానికి వెళ్తూ పొరపాటున నన్ను కూడా నవోదయాకు తీసుకువెళ్ళారు. అప్పటికే నన్ను గుర్తుపట్టడం వచ్చేసిన షాపులో ఆయన "మేడం ఇవొచ్చాయి.. అవొచ్చాయి.." అని నాతో ఓ సహస్రం బిల్లు కట్టించేసుకున్నారు. అగ్రహారం కథలు, ఏకాంత కోకిల, వాడ్రేవు వీరలక్ష్మి గారి మా ఊళ్ళో వాన, ఒరియా కథల పుస్తకం ఉల్లంఘన, మొదలైనవి కొన్నా.  అప్పుడే నవోదయా ఆయన చెప్పారు పుస్తకప్రదర్శన డిసెంబర్ పధ్నాలుగు నుండీ అని. ఎందుకు సామీ ఈవిడకు చెప్తారు...అని పాపం మావారు అదోలా చూసారు నన్ను :))




ఇక ఈ ఏడు పుస్తక ప్రదర్శన కబుర్లు:

డిసెంబరు వచ్చింది.. ఈ ఏడు పుస్తక ప్రదర్శన కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం. ఎలా వెళ్ళాలా అని మధనపడుతుంటే క్రితం వారాంతంలో అమ్మావాళ్ళింటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఐసరబజ్జా దొరికింది ఛాన్స్ అని అయ్యగారిని గోకటం మొదలెట్టా..:) పాపం సరేనని మొన్నాదివారం  తీస్కెళ్ళారు. పన్నెండింటికి వాళ్ళు ప్రదర్శన ప్రారంభించగానే దూరేసాం లోపలికి. 


గేట్లో న్యూ రిలీజెస్ అని రాసిన పేర్లు చదువుతూంటే మావారు ఎవరినో చూసి నవ్వుతు చెయ్యి ఊపటం గమనించి ఎవరా అని చూస్తే ఎవరో చైనీస్ అమ్మాయి చేతిలో ల్యాప్టాప్ పట్టుకుని చూసుకుంటోంది. నేను పెళ్ళిపుస్తకంలో దివ్యవాణిలా మొహం పెట్టాను. "ఆ అమ్మాయి తన ల్యాపి లోంచి నీకు ఫోటో తీస్తోంది..అందుకే నవ్వుతూ చెయ్యి ఊపాను" అన్నారు తను. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చూసా.. అప్పుడా అమ్మాయి కూడా నవ్వుతు నాకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత చూసాం లోపల "Falun Dafa"  అనే సెల్ఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్ తాలుకూ స్టాల్ ఉంది. అందులో బోలెడుమంది చైనీస్ అమ్మాయిలు సీరియస్గా మెడిటేషన్ చేసేస్తున్నారు. ఈ 'కల్టివేషన్ ప్రాక్టీస్' వివరాలు కూడా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. ఆ వెబ్సైట్లో వివరాలు చదవాలి.


పైన రాసినట్లు ఈ ఏడాదంతా పుస్తకాలు కొంటూనే ఉన్నా కాబట్టి కొత్తగా కొనాల్సినవి చాలా తక్కువగా కనబడ్డాయి. అయినా పుస్తకాల కొనుగొలుకు అంతం ఎక్కడ? కనబడ్డవేవో కొన్నాను.. క్రితం ఏడు కొనలేకపోయిన "Living with the Himalayan Masters"కి తెలుగు సేత దొరికింది. అమ్మకు గిఫ్ట్ ఇద్దామని వి.ఎస్.ఆర్ మూర్తి గారి "ప్రస్థానమ్" కొన్నాను.




నవోదయా షాపాయన హలో మేడమని పలకరిస్తే ఆ స్టాల్లో దూరి మృణాళినిగారు తెలుగులోకి అనువదించిన "గుల్జార్ కథలు", నా దగ్గర లేని శరత్ నవల "చంద్రనాథ్", ఎప్పటి నుంచో కొందామనుకున్న "స్వేచ్ఛ", పిలకా గణపతి శాస్త్రి గారి "ప్రాచీనగాథాలహరి" కొన్నా. తర్వాత ఓ చోట కొన్ని ఆరోగ్య సంబంధిత పుస్తకాలూ తీస్కున్నా. వీటిలో "చిరుధాన్యాల" గురించిన చిన్న పుస్తకం బావుంది.





"హాసం" పత్రికలో తనికెళ్ల భరణి గారివి "ఎందరో మహానుభావులు" పేరుతో వ్యాసలు వచ్చేవి. అవి చదివాకే నాకు ఆయనపై మరింత గౌరవాభిమానాలు పెరిగాయి. ఆ ఆర్టికల్ కట్టింగ్స్ అన్నీ దాచుకున్నా కూడా. ఆ సంకలనం కనబడగానే తీసేస్కున్నా. తర్వాత అమ్మ బైండింగ్ చేయించి దాచిన పత్రికల్లోని నవలలో "ఉదాత్త చరితులు" అన్న పేరు బాగా గుర్తు నాకు. ఈ నవల ఆ బైండింగ్స్ లోనిదే అనిపించి అది కూడా కొన్నా.



స్కూల్లో ఉండగా నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఇంగ్లీష్ నవలలు బాగా చదివేది. స్కూల్ బస్సులో రోజూ వెళ్ళేప్పుడు వెచ్చేప్పుడు బస్సులోకూడా చదువుతూ ఉండేది. అలా ఓసారి తను "రూట్స్" అనే నవల చదివింది. చాలా గొప్ప నవల చదువు అని అప్పుడప్పుడు కథ చెప్పేది. అప్పట్లో నాకు పుస్తక పఠనం పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత చాలా సార్లు "రూట్స్" కొనాలనుకున్నా కానీ కొననేలేదు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండు మూడేళ్ల నుండీ రూట్స్ కి తెలుగు అనువాదం చూస్తున్నా కానీ కొనలేదు. అందుకని ఈసారి తెలుగు అనువాదం "ఏడు తరాలు" కొన్నా.



Oxford University Press వాళ్ల స్టాల్లో పిల్లలకి మంచి పుస్తకాలు దొరుకుతాయి. క్రితం ఏడాది కొన్న మేథమేటిక్స్ వర్క్బుక్స్ మా పాపకి చాలా పనికివచ్చాయి. అందుకని ఈసారి కూడా ఇంగ్లీష్ + మేథ్స్ బుక్స్ కొన్ని తీసుకున్నాము. వాటితో పాటు లోపల సీడిలు కూడా ఉన్నాయి. ఇవి కాక పిల్ల కోసమని మరికొన్ని కొన్నా నేను. "ఫన్నీ కార్టూన్ ఏనిమల్స్" అనే పుస్తకంలో పెన్సిల్ స్కెచెస్ బాగా నచ్చి, పిల్లతో పాటు నేను వేద్దామని కొన్నా :) క్రింద ఫోటోలో బుక్స్ లో "పారిపోయిన బఠాణీ" అనే పిల్లల నవల మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. చిన్నప్పుడు బోలెడన్ని సార్లు అదే కథ చదివేదాన్ని నేను. కథ గుర్తుండి ఎప్పుడూ పాపకి చెప్తూంటాను కానీ అసలు పుస్తకం ఇంట్లో కనబడట్లేదు. ఒక చోట పిల్లలపుస్తకాల మధ్యన "పారిపోయిన బఠాణీ" కనబడగానే పట్టలేని ఆనందం కలిగింది.




పుస్తక ప్రదర్శనలో ఏదో ఒక పోస్టర్ కొనటం చిన్నప్పటి నుండీ నాకు అలవాటు. ఒక చోట త్రీడీ పోస్టర్స్ అమ్ముతున్నారు. రాథాకృష్ణులది ఒకటి కొన్నా. క్రింద ఉన్న మూడు ఫోటోలూ ఒకే పోస్టర్ వి.





ఇంకా కొత్తగా నాకు పింగళి గారి పాటలపై రామారావుగారు రాసిన రెండవ భాగం కనబడింది. మొదటిది ఎప్పుడో వచ్చింది. ఈ రెండూ మాత్రం కొనాల్సిన జాబితాలో ఉన్నాయి..:) ఎప్పుడో తర్వాతన్నా తీసుకోవచ్చు కదా అని ఊరుకున్నా.


ఇంకా.. పాత ఇంగ్లీష్ నవలలు ఏభైకి, అరవైకి రెండు చోట్ల అమ్ముతున్నారు. మంచివి ఎన్నుకుని టైమ్ పాస్ కీ, ప్రయాణాల్లో చదవటానికి కొనుక్కోవచ్చు. పిల్లల పుస్తకాలు కూడా ఓల్డ్ స్టాక్ అనుకుంటా తక్కువ ధరకి అమ్ముతున్నారు. అవి కూడా కొన్ని కొంటే,  ఇంటికి పిల్లలెవరైనా వస్తే ఇవ్వటానికి పనికివస్తాయి అనిపించింది.

చివరాఖరుగా పుస్తకాల షాపువాళ్ళిచ్చిన తాలుకూ రంగురంగుల క్లాత్ కవర్లు..బిల్లులు, ప్రదర్శన టికెట్లు :-)



Friday, November 30, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ - 3






పట్టిసీమ :

మూడవరోజు ఎక్కడికెళ్ళాలో ప్లాన్ లేదు కాబట్టి కాస్త ఆలస్యంగా లేచాము. ఆ రోజు రాత్రికే కాకినాడలో అత్తయ్యగారిని కలిసి, రైలు ఎక్కాలి. అంతర్వేది, అదీ ఇది అని రకరకాలు అనుకుని చివరకు "పట్టిసీమ" వెళ్ళొచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాము. పోలవరం బస్సులు ఎక్కమని మావయ్య చెప్పాడు. బస్టాండ్ లో మేం వెళ్ళిన సమయానికి పోలవరమ్ బస్సులేమీ లేవు. "తాళ్లపూడి" బస్సు ఉంది, అది ఎక్కమని టికెట్ కౌంటర్లో చెప్తే అది ఎక్కాము. ఆ బస్సు గోదావరి దాటి "కొవ్వూరు" మీదుగా గంటన్నర కి తాళ్లపూడి చేరింది. ఎర్రబస్సులెక్కి చాలా కాలమైంది. పైగా రోడ్డు కూడా బాగోలేదు. అక్కడ నుండి షేర్ ఆటోలో పట్టిసం వెళ్లటానికి అరగంట పట్టింది. ఆ రోడ్డు మరీ దారుణంగా ఉంది. అన్నీ గొయ్యిలే. పిల్ల ఇబ్బంది పడింది పాపం. దగ్గరే కదా వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుందని తెలిస్తే ఏ టాక్సీనో మాట్లాడుకుని ఉందుమే అనుకున్నాం.  


పట్టిసీమకు వెళ్ళే రేవు దగ్గర షేరాటో దిగి రేవుకి వెళ్లాం. పేద్ద ఆంజనేయస్వామి విగ్రహం, అందమైన రేవు ఆహ్లాదాన్ని కలిగించాయి. అక్కడే జీళ్ళు చేసి అమ్ముతూంటే వాటి ఫోటోలు తీసా. దేవాలయానికి లడ్డూ ప్రసాదం కూడా అక్కడే చేస్తున్నారు. అవతల ఒడ్డుకు వెళ్ళిన పడవ రావటానికి కాసేపు ఆగాము. మేం  ఎక్కిన పడవలో మోటారు ఉంది కానీ అది మేము కాశీలో  ఎక్కిన తెడ్డు పడవలాగానే ఉంది. చెయ్యి పెడితే నీళ్ళు అందుతున్నాయి. పడవ వెళ్తుంటే వంగి నీళ్ళలో చెయ్యిపెట్టడం భలే తమాషాగా ఉంటుంది. కనుచూపు మేరదాకా చుట్టూరా అంతా నీళ్ళు, దూరంగా కనబడుతున్న పాపికొండలు, ఎదురుగా చిన్న కొండ మీద వీరేశ్వరస్వామి ఆలయం.. ఎంతో అందమైన దృశ్యం అది. ఈ మొత్తం ప్రయాణంలో మేము బాగా సంతోషంగా ఎక్కువసేపు గడిపిన ప్రదేశం ఇది.
















అవతల ఒడ్డు ఒక ద్వీపంలాగ ఉంది. పడవ లేకపోతే అవతలి ఒడ్డుకు మళ్ళీ వెళ్ళలేము. తిరిగి వెంఠనే వెళ్లకుండా రెండు మూడు ట్రిప్స్ వదిలేసి ఓ గంట సేపు అక్కడ గడిపాము. మిట్టమధ్యాన్నం ఒంటిగంట అవుతోంది. ఎండబాగా ఉంది కానీ నదీతీరం కాబట్టి చల్లగా ఉంది. తడిసిన ఇసుక సముద్రపు ఒడ్డును గుర్తుకు తెచ్చింది. గోదావరి అంచు, ఇసుక తప్ప ఇంకేమీ లేదక్కడ. మా పాప నీళ్లలో ఆడుతుంటే, లోతులేని ప్రాంతం చూపెట్టి అక్కడ ఆడుకోవచ్చన్నాడు పడవబ్బాయ్. ఇక అక్కడికి వెళ్ళి మేం కూడా మా మా లోకాల్లో ములిగిపోయాం. పిల్ల ఒడ్దునే ఇసుక గూళ్ళు కడుతూ కూచుంది. తనేమో కాస్త నీళ్లలోపలికి వెళ్ళారు. నేనేమో white డ్రస్ పాడవుతుందని మరీ నీళ్లలోపలికి వెళ్లలేదు. ఒడ్డునే కాస్త పాదాలవరకు నీళ్ళల్లో మునిగేలా చూసుకుని ఆ అంచమ్మటే నడుచుకుంటూ అటూ ఇటూ తిరిగాను. 


ఆ గోదావరి తీరం అంచున చాలా బుజ్జి బుజ్జి చేపల గుంపులు తెగ తిరిగేస్తున్నాయి కానీ ఎన్నిసార్లు ఫోటో తీసినా ఫోటోలోకి రాలేదవి. క్లిక్ మనేలోపూ పారిపోతున్నాయి. నా పాదాల మధ్యన  బుజ్జి బుజ్జి చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే అలా నీళ్ళల్లో నడవటం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళీ కాస్త ఇవతలకి వచ్చి తడి ఇసుకలో నా పాదాలగుర్తులు కనబడేలా నడిచి వాటికి ఫోటో తీస్కున్నా :) అలా ఎంతోసేపు ముగ్గురం సరదాగా పట్టిసీమలో గడిపాము.








ఆ ప్రకృతిలో, నిశ్శబ్దంలో మమేకమవ్వాలని చేసే ప్రయత్నంలో నాకు Thoreau తన "Walden" ఎంత ఉద్వేగంతో రాసి ఉంటాడో అర్థమైంది. ఇటీవల ఓ పుస్తకంలో చదివిన నది నేర్పే పాఠాలు కూడా గుర్తుకువచ్చాయి.  ఈ చిన్నచిన్న ఆనందాలన్నీ ఆస్వాదించగలుగుతూ ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది. కానీ ఇక్కడుండేవాళ్ళు ఇలా అనుకోరేమో... సిటీ రణగొణధ్వనుల మధ్యనుంచి, ఆదరాబాదర జీవితాల నుండీ వచ్చాం కాబట్టి ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగిందేమో అని కూడా అనిపించింది.

మేం వెనక్కి తిరిగి రాజమండ్రి వచ్చేసరికీ నాలుగున్నర. పాపకి అన్నం పేక్ చేసుకుని, ఇద్దరు మావయ్యల దగ్గరా శెలవు తీసుకుని బస్సు ఎక్కేసరికీ ఆరున్నర. కాకినాడ చేరేసరికీ పావుతక్కువ ఎనిమిది. ఈ చివరి కాసేపు మాత్రం హడావుడి అయ్యింది. మేమింకా రాలేదని అత్తగారికి కంగారు. అత్తయ్యగారిని తీసుకుని రైల్వేస్టేషన్ చేరేసరికీ సరిగ్గా ట్రైన్ వచ్చే టైం అయ్యింది. మర్నాడు పొద్దున్న ఇక్కడ రైలు దిగి ఇల్లు చేరేసరికీ పొద్దున్న ఏడున్నర. ఎనిమిదింటికి పిల్ల స్కూల్ ఆటో వస్తుంది. అప్పటి నుండీ మళ్ళీ నా మామూలు తకధిమి తకతైలు మొదలైపోయాయి !! ఎన్నాళ్ళకో అరుదుగా దొరికిన ఈ అందమైన అనుభూతిని, ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతనీ మర్చిపోకూడదని ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నా..!


***              ***               ***


మరికొన్ని ఫోటోలు ఇక్కడ: