ప్రసిధ్ధి గాంచిన చారిత్రాత్మక నగరం.మా అమ్మ పుట్టిల్లూ,నేను పుట్టిన ఊరూ అయిన రాజమండ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం.తాతగారు లాయరు చేసారు.ఎంతోమంది వస్తూ పోతూ ఉండే మా తాతగారి ఇల్లంటే కూడా నాకు మహా ప్రీతి.పెద్ద గేటు,15,20 మెట్లు,గేటు నుంచీ పైన ముఖ ద్వారం దాకా పందిరిపైన పాకించిన రేక మాలతి తీగ.... ఆ పైన ఎత్తు మీద ఇల్లూ.చుట్టూతా మొక్కలూ,ఓ పక్కగా నేలలోకి ఉన్న గోడౌన్ ఒకటి మమ్మల్ని(పిల్లల్ల్ని)విశేషంగా ఆకర్షిస్తూ ఉండేది.తాళాలు అడిగి ఆ గోడౌన్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్డే వాళ్ళం.ఇక పైన డాబా మీదకు వెళ్తే చుట్టూరా కొబ్బరి చెట్లు,పైకి పాకిన సన్నజాజి తీగ..రాత్రిపూట ఆ పూల వాసనతో నిండిన డాబా మీద పడుకుని కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెలను చూస్తూ....లోకం మరిచేదాన్ని...!!వర్షం పడిన మర్నాడు క్రిందకు వచ్చి గేటు దగ్గర మెట్ల మీద కూర్చుంటే,మెట్ల నిండా రాలిన రేకమాలతీ పూల పరిమళం అద్భుతంగా తోచేది...ఎన్తసేపైనా ఆ మెట్ల మీదే కూర్చుని ఉండాలన్పించేది.ఎప్పుడైన్నా అందరం కలసినప్పుడు తాతగారి ఎనమన్డుగురి సంతానం తాలూకూ పిల్లల సందడితో,కేరింతలతో ఇల్లంతా మారుమ్రోగుతూ ఉండేది.ఇప్పుడు ఆ ఇల్లూ లేదు..కానీ మావయ్యలు కట్టుకున్న నూతన గృహాలు అక్కడే పక్కపక్కనే ఉంటాయి.ఏళ్ళు గడిచినా మనసు పొరల్లోని ఆ జ్ఞాపకాలు మాత్రం తాజాగా నిన్ననే జరిగినట్లు ఉంటాయి...!
మా రెండవ రోజు ప్రయాణంలో పొద్దున్నే బస్సులో రాజమండ్రీ చేరాం.బంధువులందరినీ పలుకరించేసాకా సాయంత్రానికి గోదారి ఒడ్డుకి చేరాం.ఆరు నెలల క్రితం మేము చేసిన కాశీ ప్రయాణం,గంగా స్నానం గుర్తున్న మా పాప "అమ్మ,ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తామా?" అని అడిగింది!!చిన్నప్పుడు చాలాసార్లు చేసేసాంలే అని చెప్పా!తెడ్డు పడవ అయితే నాకు భయం అని మోటర్ బోటు ఎక్కాం.ఓ ఇరవై నిమిషాలు గోదావరిలో తిప్పాడు బోటు.వీలయినన్ని ఫోటోలే తియ్యాలో,గోదావరి అందాన్ని చూసి పరవశించాలో తెలీలేదు.పాతికేళ్ళు రైలులో అదే దారిలో వెళ్ళిన రెండు బ్రిడ్జిలూ,వాటి క్రింద నుంచి బోటు వెళ్తూంటే భలే సంబరం కలిగింది...!బాగున్నావా...అని పలుకరిస్తున్నట్లు కదిలే ఆ గోదారి తరగల్ని చూస్తే నాకు ఓ కవి గారు రాసిన వాక్యాలు గుర్తు వచ్చాయి....
"గోదావరి గోదావరి గోదావరి పాట
గుండె నుంచి ఉప్పొంగే పున్నమి సెలయేట
పరుగెత్తే తరగ చూడు పావురాయి రెక్క
తల ఎత్తిన నురుగు నవ్వు ఆడును సయ్యాట..."
బోటు దిగాకా ఒడ్దున దగ్గర్లో ఉన్న మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాం.అడుగు పెట్టగానే లోపల ఓ 50మంది వేద పండితులు వేదం చదువుతున్నారు...మావారింక కదలనంటూ అక్కడే కూర్చుండిపోయారు.అది అయ్యాకా దగ్గరలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాం.తరువాత "ఇస్కాన్"కు వెళ్ళాం కానీ ఆ రోజు "కృష్ణాష్టమి"కావటంతో విపరీతమైన జనం ఉన్నారు.బయట నుంచే చూసి,కాసిని ఫొటోలు తీసుకుని రాత్రికి తిరిగి కాకినాడ వచ్చేసాం.
(క్రింద ఉన్నవి రాజమండ్రిలో గోదావరి,ఇస్కాన్ దగ్గర తీసిన ఫోటోలు)