సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 20, 2014

tribute..

తెలుగువాళ్ళు గర్వించదగ్గ గొప్ప కళాకారుడు..
ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నా..:(

Wednesday, September 10, 2014

ఊ.. అన్నా... ఆ.. అన్నా...ఉలికి ఉలికి పడతావెందుకు..



 
పొద్దున్నే ఈ పాట గుర్తుకు వచ్చిందెందుకో ..:)
రేడియోలో చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం...!


వేటూరి రచన చాలా బాగుంటుంది..
చిత్రం: దారి తప్పిన మనిషి 


సంగీతం.. విజయ భాస్కర్ అని allbestsongs.comలో ఉంది..
(
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8017)

యూట్యూబ్ లింక్:

Tuesday, September 2, 2014

నవలానాయకులు - 9


కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు రావిశాస్త్రి గారి 'అల్పజీవి' సుబ్బయ్య.

వ్యాసం క్రింద లింక్ లో:
http://www.koumudi.net/Monthly/2014/september/sept_2014_navalaa_nayakulu.pdf


Sunday, August 31, 2014

ఇక హాయిగా నిద్రో..







ఇప్పుడే వార్త విన్నాను... బాపూ..

ఇన్నాళ్ళకి విముక్తి లభించిందయ్యా నీకీ భవబంధాలనుండీ.. అని చటుక్కున అనిపించింది..

నీ ఆత్మకు ఇప్పుడెంత ప్రశాంతతో కదా!

ఎంత హాయిగా.. ఎంత స్వేచ్ఛగా.. ప్రాణమిత్రుడ్ని కలవడానికి రెక్కలు కట్టుకుని నింగికెగిరి ఉంటావో కదా..

ఇన్నాళ్ళ వియోగాన్ని ఎలా భరించావో కానీ నాకు మాత్రం చెప్పలేనంత దిగులుగా ఉండేది నిన్ను వార్తల్లోనో, పేపర్లోనో చూసినప్పుడల్లా...

అబ్బా ఈ దేవుడింత నిర్దయుడేంటబ్బా.. ఇలా ఒంటరిని చేసేసి చోద్యం ఎందుకు చూస్తున్నాడా అని వాపోయేదాన్ని...

ఏమో.. ఇంకా ఏ స్వామికార్యం నీతో చేయించుకోదలిచాడో నీ రాముడు.. అనుకునేదాన్ని!

పోనీలే.. ఇప్పుడు నిమ్మళమేగా..

ఇంక బెంగెందుకు.. ఇవాళ నేను హాయిగా నిద్దరోతా.

సృష్టి 
మొత్తంలో నాకు తెలిసిన ఇద్దరే ఇద్దరు ప్రాణమిత్రులు ఇక ఒకటయ్యారని సంతోషంతో నిద్దరోతా!!


ఈ జనాలకేమన్నా పిచ్చా..

ఎందుకిలా దు:ఖపడుతున్నారు నువ్వు లేవని??

ఎవరన్నారు నువ్వు లేవనీ..

పక్కింటి లావుపాటి పిన్నిగారిలో

ఆవిడ వెనుకనే నక్కి ఉన్న సన్నపాటి మెగుడుగారిలో

వంటింట్లో అప్పడాల కర్రలో

పొరుగింటి బుడుగ్గాడిలో

ఎదురింటి సీనాగపెసూనాంబలో

కొత్తగా పెళ్ళైయ్యే రాధాగోపాళాల్లో

నీ బొమ్మలాంటి అందమైన అమ్మాయిల్లో

ఆ రైలింజను డ్రైవరులో

ఆఫీసుల్లో ఉండే విగ్గులేని యముళ్ళలో

అవకతవక కంగాళీ సినిమాల "భశుం" కార్డుల్లో..

దేవుడిగూట్లో నవ్వుతూ నిలబడ్డ రాముడిలో...

అన్నింట్లో నువ్వు కనబడుతూనే ఉంటావు కదా...!


ఇన్నింటీలో నువ్వు సజీవమేనన్న నిజం ఈ పిచ్చిజనాలకి అర్థమయినరోజు

నీ కొంటెబొమ్మల పుస్తకంలోంచి ఓ జోకు చదూకుని నవ్వేసుకుంటార్లే..

నువ్వు హాయిగా నీ నేస్తంతో ఇన్నాళ్ళు గుండె పొరల్లో దాచుకుని ఉంచిన కబుర్లన్నీ చెప్పేసుకుని..

ఇక కంటినిండా హాయిగా నిద్రో...


 

Tuesday, August 19, 2014

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు




మూడేళ్ల క్రితమనుకుంటా ఒకసారి మా పిన్ని వాళ్ళమ్మాయి చెప్పింది.. నర్సాపురంలో నా చిన్నప్పటి క్లాస్ మేట్ ప్రసూన అనీ.. ఆ అమ్మాయికి కూడా బ్లాగ్ ఉంది.. కవితలు అవీ రాస్తుంది అని. అప్పుడు చూశాను రెక్కల సవ్వడి బ్లాగ్. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. తనతో వ్యక్తిగత పరిచయంలేకున్నా అప్పట్నుంచీ బ్లాగ్ లోనే కాక వివిధ జాల పత్రికల్లో తను రాసే కవితలూ, కథలూ కూడా చదువుతూన్నా! ఈ అమ్మాయీ మంచి ఆర్టిస్ట్ కూడా. బొమ్మలు వేస్తుంది. తన కథలకి తానే బొమ్మలు వేసుకోవడం విశేషం. 'వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో తన కవితకు బహుమతి వచ్చింది.

ఒక మెట్టు పైకెళ్ళి ఈ మధ్యన ప్రసూన ఒక నవల రాసింది. 'కినిగె తెలుగు నవలల పోటీ 2014' కోసం ప్రసూన నవలను రాసింది. ముఖచిత్రం కూడా తనే వేసుకుంది. పేరేమిటంటే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". పేరు తమాషాగా ఉందే అనుకుని.. ఏమి రాసిందా అని ఆసక్తిగా నవల చదివాను. ఇట్స్ డిఫరెంట్..! రొటీన్ లవ్ స్టోరీనో, ఏదో సోషల్ మెసేజ్ ఉన్న నవలికో కాదు. ఇది మన తెలుగు భాష గురించిన కథ. ఇంగ్లీషు చదువుల వల్ల మన పిల్లలకు దూరమైపోతోందేమో అని మనం భయపడుతున్న మన తెలుగు భాష ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి ఎలా తీసుకురావచ్చో.. ఎలా పిల్లలకు తెలుగు నేర్పవచ్చో.. ఒక ఆలోచన చేసి చూపించిందీ నవలలో ప్రసూన. నూతనమైన, ఆచరయోగ్యమైన ఆలోచన.


 
మార్కులు ఎక్కువ రావనో, వేరే భాష కంపల్సరీ అనో స్కూళ్ళలో తెలుగు భాషే ఉండట్లేదు కొందరు పిల్లలకు. సెకెండ్ లాంగ్వేజ్ స్పానిష్షో, ఫ్రెంచో ఉంటున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. ఇందువల్ల ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషలూ సులువుగా వచ్చేస్తున్నాయి పిల్లలకు కానీ మనదైన తెలుగు భాష మాత్రం సరిగ్గా పలకడానికి కూడా రావట్లేదు. కొందరు పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కూడా రాదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్ని పదాలకు అర్థాలే తెలీనివాళ్ళు కొందరైతే, అసలు తెలుగు చదవడమే రాని పిల్లలు కొందరు. మా అమ్మాయి రెండో తరగతి దాకా స్టేట్ సిలబస్ అవ్వడం వల్ల అప్పటిదాకా తెలుగు సబ్జెక్ట్ ఉండేది కానీ మూడవ తరగతిలో సెంట్రల్ స్కూల్ కి మార్చాకా తనకి స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేదు. వచ్చిన కొద్దిపాటి భాషా మర్చిపోకుండా ఇంట్లో రోజూ న్యూస్ పేపర్ చదివించడం, తెలుగు కథల పుస్తకాలు కొని చదివించడం, గుణింతాలూ, వత్తులూ రాయించడం చేస్తుంటాము మేము. నేనప్పుడప్పుడు అశ్రధ్ధ వహించి వదిలేస్తున్నానని వాళ్ళ నాన్నగారు రోజూ రాత్రి పాప చదువుకునే బెడ్ టైం స్టోరీస్ తెలుగు కథలే చదవాలని రూల్ పెట్టేసారు. ఆ విధంగానైనా తెలుగు మరిచిపోకుండా ఉంటుందని, తెలుగు చదవడం అలవాటవుతుందనీ మా ప్రయత్నం. అచ్చం ఇలానే ప్రసూన కూడా తన మొదటి నవలలో కూడా పిల్లలకు తెలుగు ఎలా నేర్పచ్చు అనే ఆలోచనకి ఓ ప్రణాలికని తెలిపింది.

 
హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చందన అనే పాప ఉంటుంది. ఊరు నుండి వచ్చిన వాళ్ళ స్వామి తాతయ్యగారు అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ తెలుగు ఎలా నేర్పించారు. తాతా మనవరాలు కలిసి "తెలుగు వెన్నెల" పేరుతో తెలుగు తరగతులను నడిపించి, ఎంతోమంది పిల్లలకు తెలుగు భాష ఎలా నేర్పించారో తెలిపే కథే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". మన బిజీ స్కెడ్యూల్స్ లోంచి కాస్తంత వెసులుబాటు చేసుకుని మన పిల్లలు మాతృభాష మర్చిపోకుండా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలదే అన్నది ఈ నవలలో అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇదొక్కటే కాక పిల్లలకు నేర్పించాల్సిన చెయ్యవలసిన కొన్ని మంచి అలవాట్లు, విషయాల ప్రస్తావన కూడా కథలో ఉంది. ఇది పిల్లల నవల.. అనుకోవచ్చు. పిల్లలకు మన మాతృభాష పట్ల మక్కువ ఎలా కలిగించాలో పెద్దలకు తెలిపే నవల అనుకోవచ్చు. కథ, కథాగమనం సంగతి ఎలా ఉన్నా, ఇదొక విభిన్నమైన మంచి ప్రయత్నమని ఖచ్చితంగా చెప్పచ్చు.  కథలో తాతామనవరాళ్ల మధ్యన ఉన్న గాఢానుబంధం నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు తాతయ్యలంటే మహా ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికీ ఇరువైపుల తాతయ్యలూ ఫోటోల్లో కనిపించారు మరి :(


అయితే, ఈ "తెలుగు వెన్నెల" తరగతులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందులో అమితోత్సాహంతో పాల్గోవడం వంటివి నాకు కొధ్దిగా హైలీ ఐడియలిస్టిక్ గా అనిపించాయి. ఈకాలంలో అసలు కొందరన్నా అలా ఉంటారా అన్నది నాకు సందేహమే! ఉంటారేమో మరి..!! కథాస్థలం హైదరాబాద్ కాకుండా ఏ అమెరికానో, మరో దేశమో అయి ఉంటే పాత్రల్లో తెలుగు భాష పట్ల కనిపించిన ఇంటెన్స్ ఫీలింగ్స్ ఏప్ట్ గా అనిపించేవేమో అనిపించింది నాకు. ప్రసూనకి ఇది మొదటి ప్రయత్నం కాబట్టి కథాగమనంలో లోటుపాట్లు పట్టడం సబబు కాదనిపించింది నాకు.




నే గమనించిన.. నాకు ఇబ్బంది కలిగించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్షర దోషాలు. నవలాంశమే తెలుగు భాష నేర్చుకోవడం అయినప్పుడు మరి అందులో అక్షర దోషాలు దొర్లితే చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. వీటిని సరిచేసే పధ్ధతి ఏదైనా ఉందేమో రచయిత్రి కనుక్కుని అవన్నీ సరిచేస్తే బాగుంటుంది. ఇదొక్కటీ తప్పిస్తే.. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సందేశం బాగుంది. ఇలా ఒక ప్రణాలిక ద్వారా కాకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళం మన పిల్లలకు అప్పుడప్పుడన్నా మాతృభాష పట్ల అభిమానం ఏర్పడే ప్రయత్నాలు చేస్తూంటే బాగుంటుంది. ఈ నవల కినిగె.కాం లో లభ్యమవుతోంది.




బ్లాగ్ముఖంగా ప్రసూన చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తన నుండి ఇంకొన్ని మంచి కథానికలూ, నవలలూ రావాలని కోరుకుంటున్నాను.


Tuesday, August 12, 2014

It's all coming back to me..:-)


"కాస్త హెల్ప్ చెయచ్చు కదా... కనీసం వాటర్ బాటిల్స్ లో నీళ్ళు పట్టడం, కంచాలు, మంచినీళ్ళు పెట్టడంలాంటి చిన్నచిన్న పనులు చేయచ్చు కదా"

"అబ్బా..బోర్ అమ్మా.."

***
 

"నేను ముగ్గు పెడతా.. నువ్వు పెట్టకు "
"ఆ వంకరటింకర గీతలు బాగోట్లేదు..వద్దే.."
"ఆ...ముగ్గు పెడతా.. ఏదీ వద్దంటావ్..నువ్వింతే ఎప్పుడూ"

***

"ఈ రెండు ముద్దలు ఎక్కువయ్యాయా..? అన్నం పాడేస్తే పాపం!"
"ఇంక ఒక్క స్పూన్ కూడా నేను తినలేను. నాకు చాలు. వద్దంటే వద్దు"

***

"పాలు బలం..తాగాలి.."
"నాకు వద్దు.. వద్దంటే అంతే!"


***


"ఇవాళ్టికి పప్పు వండాను తినెయ్యవే.."

"నాకీ పప్పు వద్దు...! నాన్న ఊరెళ్తే కూర వండవామ్మా? నాన్న ఊరెళ్తే మనం అన్నం తినడం మానేయ్యాలా? "



***

"ఇవాళ ఆ కూర వండు.. పైన కొత్తిమీర చల్లు..కాడలు వెయ్యకు"

 
"అట్టు మీద ఉల్లిపాయలు వద్దు..."
 




 

"వద్దు..వెళ్ళిపో వంటింట్లోంచి.."

" ఊ.. నేను చెక్కు తీస్తా... లేకపోతే ఆ పొటాటో తరుగుతా... ఊ..."

"చెయ్యి కోసుకుంటావ్...వెళ్పో.."

"ఊ... ఎప్పుడూ వద్దంటావ్..."

***

 

"నేను చపాతీ వత్తుతా..."

"వద్దు.."

"పోనీ కాలుస్తా.."

"వద్దు!! పెద్దయితే ఎలానూ తప్పదు..ఇప్పట్నుంచీ ఎందుకే తాపత్రయం తల్లీ..."

 

 
***
 

 

"నాన్నా.. అమ్మెప్పుడూ నన్ను తిడుతుంది.."

"ఇప్పుడు నిన్ను తిట్టకపోతే.. రేపు నువ్వు పెద్దయ్యాకా నిన్నెవరూ ఏం అనరు.. నన్నందరూ తిడతారు.. మీ అమ్మ ఇలానే పెంచిందా... ఏం నేర్పలేదా అని"

 

***


"ఇంతదాకా నీక్కావాల్సింది చూశావు కదా.. రిమోట్ నాకు ఇవ్వు.."

"ఊహూ.. ఇంకొంచెం ఉంది ఉండమ్మా.."

"కొంచెం కొంచెం అని అరగంట నుంచీ నువ్వే చూస్తున్నావు.."

 

***


"నా సబ్బు నాకు కావాలి.. మీరు వేరేది వాడుకోండి.."
"...."

***


"నువ్వు కొత్త చెప్పులు కొనుక్కున్నావ్.. మరి నాకో.."

"ప్రతీదానికీ నాతో పోటీ ఏమిటే ఇప్పట్నుంచీ..."

"నాకవన్నీ తెలీదు.. నువ్వు ఏది కొనుక్కుంటే అది నాక్కూడా కొనాలంతే"

***

 

"అబ్బా.. గోల.. సౌండ్ తగ్గించు.."

"తగ్గించాను కదమ్మా... ఇంతకంటే తగ్గిస్తే బావుండదు"


***

 

"నీకేం తెలీదు ఉండమ్మా... అలా కాదు.. ఇలా చెయ్య్..."

***

ఇలా ఎన్నని రాయను? ప్రతి మాటా, అక్షరం అక్షరం...
టేప్ వెనక్కి రెవైండ్ చేసి వింటునట్లు ఉంది..
ఇప్పుడే ఏమైంది... ఫ్రెంట్ లైస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అనిపిస్తూ ఉంటుంది.. :)

నే కూడా ఇలానే అమ్మని ఎంతగా విసిగించి ఉంటానో కదా అనిపిస్తూ ఉంటుంది... నాకేనా.. అందరు అమ్మాలకూ ఇలానే అనిపిస్తుందా??
 

***

ఏమైనా.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఏ సిరులందివ్వగలవూ...
ఇదొక తియ్యని వరం కదూ..
 

Friday, August 1, 2014

నవలానాయకులు - 8




కౌముది పత్రికలో ప్రచురితమౌతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "పార్వతీశం". మొక్కపాటి వారి 'బారిష్టర్ పార్వతీశం' నవల నుండి! వ్యాసం క్రింద లింక్ లో: 

http://www.koumudi.net/Monthly/2014/august/august_2014_navalaa_nayakulu.pdf

Thursday, July 31, 2014

मैं हर एक पल का शायर हूँ...





ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, ఒకే ట్యూన్ లో , రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని "టేండమ్ సాంగ్స్" అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ సాధారణంగా మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉంటుంటాయి. "కభీ కభీ"లో రెండు వర్షన్స్ ముఖేష్ పాడినవే. నిన్న 'కభీ కభీ' లో పాట పోస్ట్ చేసా కదా.. ఇవాళ దాని జంట పాటను షేర్ చేస్తున్నాను. 

నిన్నటి "మై పల్ దో పల్ కా షాయర్ హూ.." పాట గ్లూమీగా ఉంటే ఇదే సినిమాలో సాహిత్యం మార్పుతో అదే ట్యూన్ లో సినిమా చివర్లో మరో పాట వస్తుంది.. " మై హర్ ఎక్ పల్ కా షాయర్ హూ.." అని. అది హేపీ టోన్ లో ఉంటుంది.  పాట కూడా వినేయండి మరి..


చిత్రం: కభీ కభీ

 
పాడినది: ముఖేష్

సాహిత్యం: సాహిర్ లుధియాన్వీ

సంగీతం: ఖయ్యాం



lyrics: 

मैं हर एक पल का शायर हूँ
हर एक पल मेरी कहानी है
हर एक पल मेरी हस्ती है
हर एक पल मेरी जवानी है((ప))

रिश्तों का रूप बदलता है.. बुनियादे ख़तम नहीं होती
ख्वाबों की और उमँगों की मियादें ख़तम नहीं होती
एक फूल में तेरा रूप बसा.. एक फूल में मेरी जवानी है
एक चेहरा तेरी निशानी है.. एक चेहरा मेरी निशानी है ((ప))

तुझको मुझको जीवन अमृत अब इन हाथों से पीना है
इनकी धड़कन में बसना है इनकी साँसों में जीना है
तू अपनी अदाएं बक्श इन्हें में अपनी वफ़ायें देता हूँ
जो अपने लिए सोची थी कभी.. वो सारी दुआएँ देता हूँ((ప))





Wednesday, July 30, 2014

मैं पल दो पल का शायर हूँ..


कल और आयेंगे नग्मों की खिलती कलियाँ चुननेवाले
मुझ से बेहतर कहनेवाले तुम से बेहतर सुननेवाले
कल कोई मुझको याद करे क्यों कोई मुझको याद करे
मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे

పొద్దున్నే పదే పదే ఈ ప్వాక్యాలు గుర్తొస్తే పాట పెట్టుకుని విన్నా...कल कोई मुझको याद करे.. क्यों कोई मुझको याद करे.. मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे..:-) అద్భుతమైన కఠిన సత్యం కదా!! నేను...నేను..నేను.. అనుకునే పిచ్చివాడా... ఇదే జరిగేది.. ఇదే సత్యం అని ఎంత చక్కగా చెప్పారో...!!
కవి "సాహిర్" రాసిన అద్భుతమైన సాహిత్యాల్లో ఈ పాట ఒకటి...
పాట మొదట్లో వచ్చే వాక్యాలు.. ఆ పొడూగాటి చెట్లు అన్నీ అద్భుతమే నాకు..

చిత్రం: కభీ కభీ
పాడినది: ముఖేష్
 సాహిత్యం: సాహిర్ లుధియాన్వీ
సంగీతం: ఖయ్యాం

 


 సాహిత్యం:

मैं पल दो पल का शायर हूँ

पल दो पल मेरी कहानी हैं
पल दो पल मेरी हस्ती है
पल दो पल मेरी जवानी हैं((ప))

मुझ से पहले कितने शायर आये और आकर चले गए

कुछ आहे भर कर लौट गए कुछ नग्में गा कर चले गए
वो भी एक पल का किस्सा थे मैं भी एक पल का किस्सा हूँ
कल तुम से जुदा हो जाऊंगा वो आज तुम्हारा हिस्सा हूँ ((ప))

कल और आयेंगे नग्मों की खिलती कलियाँ चुननेवाले

मुझ से बेहतर कहनेवाले तुम से बेहतर सुननेवाले
कल कोई मुझको याद करे क्यों कोई मुझको याद करे
मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बरबाद करे((ప))


Wednesday, July 23, 2014

"బారిష్...."


 
మధ్యన Fmsలో ఎక్కువగా వస్తున్న "బారిష్...." అనే పాట చాలా బావుంది. చిత్రం పేరు 'YAARIYAN' ట. నాకు ట్యూన్, లిరిక్స్ రెండూ నచ్చాయి.

పాట: బారిష్..
పాడినది: మొహమ్మద్ ఇర్ఫాన్,
అడిషనల్ వోకల్: గజేంద్ర వర్మ
సంగీతం: మిథున్
సాహిత్యం: మిధున్




female version link:
singer: Tulsi kumar
http://youtu.be/LnbqusICm88



link for yaariyan audio songs and downloads:
http://www.songspkshare.com/yaariyan-2014-songs-pk-hindi-movie-songs-mp3-download/68/

Thursday, July 17, 2014

పాట వెంట పయనం - సినీ జానపదగీతాలు


'సారంగ' జాల వారపత్రికలో ప్రచురిరమవుతున్న "పాట వెంట పయనం" శీర్షికలో ఈసారి నేపథ్యం "జానపద గీతాలు"!
క్రింద లింక్ లో వ్యాసాన్ని, కొన్ని సినీ జానపదగీతాలను చూడవచ్చు..
 

http://wp.me/p3amQG-2QB



Friday, July 11, 2014

షిర్డీ - భీమశంకర్




 
 


హాలిడేస్ అన్నీ అయిపోయాయి.. ఎక్కడికీ వెళ్ళలేదు.. స్కూళ్ళు మొదలయిపోయాయి.. మళ్ళీ నెలాఖరు వచ్చేస్తే పరీక్షలు వచ్చేస్తాయనీ, వీకెండ్ కనీసం షిర్డీ అయినా తీసుకువెళ్ళమని అయ్యగారి చెవిలో ఇల్లుకట్టేస్కుని మరీ పోరేసాం పిల్లా, నేనూ.  షిర్డీ కి టికెట్స్ బుక్ చేసానని అయ్యగారు ఫోన్ చెయ్యగానే ముందర నెట్ ఓపెన్ చేసి ఇంతకు ముందు చూడని నియరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని వెతికాను. కాస్త దూరమైనా వెళ్లదగిన ప్రాంతంగా "భీమశంకర్" కనిపించింది. సుమారు 180-200kms దూరం షిర్డీ నుండి. 200kms లోపూ అయితే ఒకపూటలో వెళ్ళిరావచ్చు. సో, ఈసారి బాబాగారి దర్శనం అయ్యాకా భీమశంకరానికి వెళ్దామని అని గాఠ్ఠిగా చెప్పేసి, గ్రీన్ సిగ్నల్ సంపాదించేసుకున్నా. ఈ జీవితకాలంలో వీలయినన్ని పుణ్యక్షేత్రాలే కాక వీలయినన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలూ చూడాలని నాకో బలమైన కోరిక ఉంది. ఇదివరకూ శిర్డీ వెళ్ళినప్పుడే నాసిక్-త్రయంబక్, మరోసారి ఘృష్ణేశ్వర్ వెళ్ళాం. ఇప్పుడు 'భీమశంకరం' కూడా జ్యోతిర్లింగం అని చదివాకా, చిన్న ప్రయాణమైనా ఈ ట్రిప్ లో మరో జ్యీతిర్లింగం చూసే అవకాశం వదులుకోవాలనిపించలేదు. అవసరమైతే సండే కూడా ప్రయాణం ఎక్స్టెండ్ చేసుకుందాం అని కూడా అనుకున్నాం.


రెండు రోజుల క్రితమే బుక్ చేసుకోవడం వల్ల క్రితం గురువారం సాయంత్రం ప్రయాణం సమయానికి RAC లోకి మాత్రమే వచ్చాయి టికెట్లు. లక్కీగా మా ఇంటివెనక రైల్వే షేషన్లో ఇప్పుడు వెళ్లాల్సిన రైలు ఆగుతుంది. ఎక్కి కూర్చున్నాం. సైడ్ లోయర్ సీట్లు రెండూ వచ్చాయి. చాల్లేమ్మని ముగ్గురం అందిమీదే కూచున్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళు వేరే బోగీలోకి వెళ్పోతూ అప్పర్ బెర్త్ ఒకటి ఇచ్చేసారు. ఇంకేముంది.. నన్ను పైకెక్కించేసి పిల్లా, వాళ్ళ నాన్నా క్రింద దాంట్లో ఎడ్జస్ట్ అయిపోయారు. హాయిగా కాసేపు పుస్తకం చదువుకున్నా. కాస్త నిద్రపట్టే సమయానికి క్రింద ఉన్న ఫ్యామిలీ తాలూకూ రెండేళ్ల పిల్లాడు పేచీలు మొదలెట్టాడు. పిల్లాడి కూడా ఉన్న నలుగురికీ, మాకూ కూడా చుక్కలు చూపించాడు ఆ పిల్లాడు చాలాసేపు. ఇహ ఆ రాత్రి నిద్ర లేదు :(

పొద్దున్నే నాగర్సోల్ లో దిగి షేరింగ్ జీప్ లో శిర్డీ చేరాం. జనం ఎక్కువగా ఉండరనే శుక్రవారం పెట్టుకున్నాం ప్రయాణం. త్వరగా ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాం. గంట అవ్వకుండానే చాలా చక్కని దర్శనం అయింది. క్యూలో వెళ్ళేప్పుడు మందిరంలోకి వెళ్ళగానే కుడివైపు లైన్ లోనే ఉంటే బాబాగారి ముందర వైపు ఉండే హాల్లోంచి బయటకు వెళ్ళచ్చు. ఎక్కువ సేపు దర్శనం అవుతుంది. అలా బాబాగారిని చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ బయటకు వచ్చేసాం. ఇక "భీమశంకరం" గురించి కనుక్కున్నాం. పూనా, ముంబై, ఔరంగాబాద్ల నుండి బస్సులు ఉంటాయిట. విడిగా ఇక్కడ్నుంచి వెళ్ళిరావడానికి పది గంటలు పడుతుందిట. పొద్దున్నే బయల్దేరితే సాయంత్రానికి రావచ్చు. షేరింగ్ టాక్సీలు, మనుషులు కూడా దొరుకుతాయి అని చెప్పారు. కానీ మాకు మర్నాడు సాయంత్రమే రిటర్న్ ట్రైన్. టైం సరిపోదు. ఇప్పుడే వెళ్తే రాత్రికి లేట్ అయినా వచ్చేసి రూమ్ లో పడుకోవచ్చు..అనుకున్నాం. మా ఒక్కళ్ళకే అంటే టాక్సీకి బాగా ఎక్కువే పడింది కానీ ఇంత షార్ట్ ట్రిప్ లో టైం వేస్ట్ అవకూడదని ఇంక భోం చేసేసి ఒంటిగంటన్నరకి భీమశంకరం బయల్దేరిపోయాం. బయట బోలెడు ఎండ. రాత్రి రైల్లో నిద్రలేదేమో కారులో ఏసీ ఉండటంతో హాయిగా ముగ్గురం నిద్రపోయాం. మూడున్నరకి అయ్యగారి ఆఫీసు ఫోన్లకి మెలకువ వచ్చింది. నాలుగున్నర దాకా ఎండగానే ఉంది. అప్పటి నుండీ తోవ కొండపైకెక్కడం మొదలయ్యింది.




సహ్యాద్రీ కొండల మధ్యలో.. అంటే ఏదో కొండల మధ్యలో గుడి ఉంటుందేమో అనుకున్నా కానీ మరీ పై పైకి పోతుంటే డౌటొచ్చి డ్రైవర్ని అడిగాం గుడి కొండ మీద ఉంటుందా? అని. కొండెక్కి మళ్ళీ కాస్త క్రిందకి మెట్లు దిగాలి అన్నాడతను. ఇంకా డ్రైవర్ ఏం చెప్పాడంటే, గుడి ఉన్న కొండ క్రింద ప్రదేశంలోనే బొంబాయి ఉందిట. మెట్ల దారి ఉందిట, కొందరు ట్రెక్కింగ్ కూడా చేస్తారుట.





ఈ డ్రైవర్ మరీ సైలెంట్ మనిషి. నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానమే ఇస్తున్నాడు. కానీ నెమ్మదస్తుడు. మంచివాడు. చాలా జాగ్రత్తగా, నేర్పుగా డ్రైవింగ్ చేసాడు. సరే ఇంక కొండ దారి పైపైకి పోతోంది. ఒకే కొండ కాకుండా కొన్ని కొండల సముదాయాలు అవన్నీ. సో పైకి వెళ్తూంటే క్రిందకి వెళ్పోయిన కొండలు, లోయలు, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. హటాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎండంతా పోయి మబ్బులు, చల్లగాలి, చినుకు మొదలైంది. కార్లో ఏసీ ఆపించేసి గ్లాస్ దించేసాం. చిరుజల్లు అలా విండో లోంచి మీద పడుతూ ఉంటే బావుంటుంది..:)


దారిలో గోనె గోంగళ్ళు కప్పుకుని మేకలు తోలుకెళ్ళే కాపర్లు, పొలం దున్నుకునే రైతులు కనబడ్డారు. ఆ కొండ ప్రాంతాన్నే వాలు ఎక్కువ లేని చోట్ల కాస్త కాస్త మేర చదును చేసేసి ఏవో పంటలు వేసేసారు. కొండల పైనుండి చూస్తే అక్కడక్కడ ఆకుపచ్చ తివాచీలు పరచినట్లు పచ్చని పంటలు. ఎంతో అందంగా ఉందా ప్రదేశం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా కనబడింది దారిలో.


 ఐదయ్యేసరికీ వాతావరణం ఇంకా మారిపోయింది. తెలీకుండానే బాగా ఎత్తులోకి చేరిపోయాం. ఐదున్నర అవ్వకుండానే ఏడున్నరలా ఉంది చీకటి. చుట్టూరా దట్టంగా మబ్బులు.. రోడ్డుకిరుపక్కలా అడవిలో ఉన్నట్లు పెద్ద పెద్ద చెట్లు.. ఆ చెట్ల మధ్యన లీలగా కనబడుతున్న దారి. ఓ చోట దారి పక్కగా నిలబడి గోనె గొంగళి కప్పుకున్న ఒకతను అలాంటివే ప్లాస్టిక్ కవరలు అమ్ముతున్నాడు. గాలికి గొడుగులు ఎగిరిపోతాయని అక్కడందరూ ఇవే వాడతారుట. తల మీంచి కప్పేసుకుని అడుగున రెండు కొసలు కలిపి ముందువైపుకి ముడి వేసేసుకుంటున్నారు. సరదాగా ఉన్నాయని మేమూ కొన్నాం ఆ కవర్లు.

మధ్యలో ఒక చోట మాత్రం దిగకుండా ఉండలేకపోయాం. కొండదారి కాస్త పక్కగా మళ్ళి చెట్లు అవీ ఉన్నాయి. బోలెడు మబ్బులు ఉన్నాయక్కడ. దిగి అక్కడ మబ్బుల మధ్యన నిలబడి కారబ్బాయితో రెండు ఫోటోలు తీయించుకునేంతలో వర్షం పెద్దదయిపోయింది. గబగబా కార్లో కొచ్చేసాం. ఆగేందుకు టైం కూడా లేదు. మళ్ళీ గుడి చూసాకా, పైకి వచ్చినంత దూరం వెనక్కి క్రిందకి వెళ్ళాలి చీకట్లో అనుకునేసరికీ నాకు భయం వేసింది. కానీ ఆ వాతావరణం, ఆ చల్ల గాలి, మబ్బులు అసలు ఏవేవో లోకాల్లోకి తీస్కెళ్ళిపోయాయి మమ్మల్ని. భయం మర్చిపోయా.


గుడి వద్దకు చేరేసరికీ సాయంత్రం ఐదున్నర. నాలుగ్గంటల్లో తీస్కువచ్చాడు డ్రైవర్. అక్కడకి చేరేప్పటికీ వర్షం ఇంకా పెరిగిపోయింది. నాలుగడుగులు వేస్తే మెట్లదారిలో షెల్టర్ ఉంటుందని చెప్పారు. అందుకని ఇక ఆగకుండా గుడివైపు వెళ్పోయాం. ఇందాకా సరదాకి కొన్న ఆ ప్లాస్టిక్ కవర్లే మాకు గొడుగులయ్యాయి. షెల్టర్ ఉన్న మెట్లదాకా చేరేసరికీ తల మీద కవర్ వల్ల తల తప్ప మొత్తం తడిసిపోయాం. పిల్ల చలికి వణికిపోయింది. వర్షం వల్ల ఇంకా చీకటిగా అయిపోయింది. మెట్లకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు అడవిలాగ. ఆట్టే మెట్లు లేవు కానీ తిరుపతి మెట్లదారి గుర్తుకు వచ్చింది. మనుషులు తిరుగుతున్నారు కాబట్టి భయమెయ్యలేదు. గుడి దాకా వచ్చేసరికీ కాస్త చలి, వణుకు తగ్గాయి. ఇంత పైకి దారి పెట్టి మళ్ళీ క్రిందకి గుడి ఎందుకు కట్టారో అని డౌట్ వచ్చింది. అసలీ గుడి ఎవరు కట్టారో? వర్షం వల్ల చాలా కొట్లన్నీ మూసేసారు. స్థలపురాణం పుస్తకం ఎక్కడా కనబడ్లేదు. గుడి పదమూడవ శతాబ్దం నాటిదని వికీలో రాసారు. స్థల పురాణం అక్కడ చదవవచ్చు.
 
 

ఏడెనిమిది నిమిషాల్లో క్రింద గుడి వద్దకు చేరాం. వానవల్లో ఏమో ఎక్కువ జనం లేరు. ఆర్భాటం లేని చిన్న గుడి. నల్లరాతి కట్టడం. గర్భగుడిలోకి రానిస్తున్నారు. అన్ని జ్యోతిర్లింగాలయాలలో మల్లె శివలింగం వెనుక వైపుకి పెద్ద అద్దం ఉంది. గర్భగుడి బయట ఉన్న భక్తులకు శివలింగం,అలంకారాలూ కనబడేలాగ. లోపలికి వెళ్ళి స్వయంగా పూలు,బిల్వపత్రాలు అవీ మనం పెట్టుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇదివరకూ కాశీలో, ఘృష్ణేశ్వర్ లో, త్రయంబకం లో కూడా ఇలాగే స్వయంగా శివలింగం వద్ద స్వయంగా అభిషేకం, పూజ చేసుకునే అవకాశం దొరికాయి మాకు. శ్రీశైలంలో మాత్రం కుదరలేదు. ఏ తోపుడూ హడావుడీ లేనందువల్ల కాసేపు అక్కడే గడిపి బయటకు వచ్చేసాం. గుడి కట్టిన రాతి మహిమో, గుడిలోపలి దేవుడి మహిమో తెలీదు కానీ కొన్ని గుళ్ళలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడా అలానే అనిపించింది. అన్ని గుళ్ళలో అప్పటికి వర్షం కాస్త నెమ్మళించింది. బయట నందీశ్వరుడు ఉన్న చోట పెద్ద గంట ఉంది. అది బాజీరావుపేష్వా అక్కడ పెట్టించారుట. పోర్చుగీస్ మీద తన విజయానికి గుర్తుగా ఇది + మరో నాలుగు పెద్ద గంటలు మరో నాలుగు శివాలయాల్లో పెట్టించాట్ట ఆయన. గంట మీద పదిహేడవ శతాబ్దపు సంవత్సరం కూడా రాసి ఉంది. చిన్న గుడిలా ఉండి "కమలజ" పేరుతో అమ్మవారు ఉన్నారు. పార్వతీదేవి రూపంట. గుడి వెనుక భీమా నది ప్రవహించేదిట. వర్షం వల్ల, సమయాభావం వల్ల ఇక చుట్టుపక్కల తిరిగి ఓ మారు పరిశీలించే అవకాశం లేకపోయింది. ఓ పక్కగా పొడుగాటి గోపురమున్న గుడి క్రిందన శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఇందాకా వర్షమని ఫోటోలు తియ్యడానికి లేకపోయింది. ఇప్పుడు బయటకు వస్తూంటే కాసిని తీసాను.


ఆ పెద్ద పెద్ద చెట్లు, కనుచూపుమేరలో మనిషి కనబడకుండా అలుముకున్న మబ్బులు, గాలికి కదిలే ఆకుల అలగలలు తప్ప మరే ఇతర సందడి లేని నిశ్శబ్దంలో ఎక్కువ ఎత్తులేని తేలికపాటి మెట్లు ఎక్కుతుంటే అసలు మనసు తేలికైపోయి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పడం కష్టం. సమయం ఉంటే అడవిలాగ కనబడుతున్నా ఆ చెట్లమధ్యన కాసేపు తిరగాలనిపించింది. ఎంత బాగుందో కదా..అని క్షణక్షణం అనుకుంటూనే ఉన్నాం నడుస్తున్నంత మేరా!


ఈలోపూ పక్కగా ఉన్న చిన్న కొట్లో ఆవిరిపై ఉడకపెట్టిన మొక్కజొన్నకండెలు అమ్ముతున్నారు. గబగబా కొనుక్కుని లాగించేసాం. ఆ చలిలో వెచ్చవెచ్చగా ఉన్న ఆ మొక్కజొన్న రుచి అమృతంలా తోచింది.


మరో పక్క కొట్లో అల్లం టీ పెడుతుంటే అది కొనుక్కుని తాగాం. ఆ కొట్టబ్బాయిని అడిగాను..ఈ గుడి ఎవరు కట్టారో తెలుసా? అని. ఏమో తెలీదు కానీ ఛత్రపతి శివాజీ పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారుట అన్నాడు. ఆ టీ కొట్లో శివాజీ ఏనుగు మీద ఉంటే చుట్టూరా బోలెడు మంది జనం ఉన్న పెద్ద పెయింటింగ్ ఒకటి ఉంది. ఇంకానేమో శంకరాచార్యులవారు వచ్చి ఇది జ్యోతిర్లింగ క్షేత్రమని నిర్ధారణ చేసాకా ఎక్కువ జనం దర్శనానికి రావడం మొదలయ్యిందని అతను చెప్పాడు.
 

కారుదాకా నడుస్తున్నామా చూట్టూరా మంచు కాదు మబ్బులే. అసలు రోడ్డు కనబడట్లే. మబ్బుల్లో నడుస్తున్నామని భలే సంబరపడిపోయాం. వర్షాలు మొదలయిన ఆరునెలల పాటు అక్కడ వాతావరణం రోజూ ఇలానే ఉంటుందని ఇందాకా టీ కొట్టబ్బాయి చెప్పాడు. ఎప్పుడూ ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉండగలిగే వీళ్ళెంత అదృష్టవంతులో అనిపించింది. అంత అందమైన ప్రకృతిని వదలలేక వదలలేక వదిలి..
మళ్ళీ భవసాగరాలలో ఈదడానికి మనసుని రీఛార్జ్ అయ్యిందని తృప్తి పడుతూ.. కారెక్కాం. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి నాలుగ్గంటలు ఎలా.. అనుకుంటుంటే డ్రైవర్ హాట్ బ్లోయర్ ఆన్ చేసాడు. వెచ్చటి గాలి తగిలే సరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. పిల్ల కూడా కాస్త కుదుటపడింది. మనసులోనే అతగాడ్ని పదికాలాలు చల్లగా ఉండు నాయినా అని దీవించేసాను. తిరుగుదారిలో మళ్ళీ కొండ దిగే సమయానికి మళ్ళీ మునుపున్న వాతావరణం వెలుతురు వచ్చేసాయి. ఆ మబ్బులు, మసకచీకటి అన్నీ మాయమైపోయాయి. ఎత్తు దిగిపోయాం కదా! కానీ ఏదో కొత్త ప్రపంచంలోంచి బయటకు వచ్చినట్లయి.. అదంతా కలా నిజమా? అని ఆశ్చర్యం వేసింది. దారిలో ఎందుకైనా మంచిదని పిల్లకి పేరాసెట్మాల్ సిరప్ కొన్నాం. ఇందాకా వచ్చేప్పుడు ఏసీ చల్లదనానికి ఎలా నిద్రపోయామో అలా ఇప్పుడు వెచ్చదనానికి మళ్ళీ అలానే నిద్రపోయాం. ఆరున్నరకి బయల్దేరి సరిగ్గా నాలుగ్గంటల్లో శిర్డీ వచ్చేసాం. పగలు పూట వెళ్తే అక్కడ కాసేపు గడిపి బాగా ఎంజాయ్ చేయచ్చనిపించింది నాకు.


శనివారం పొద్దున్నే మళ్ళీ ఓసారి బాబాగారి దర్శనం చేసుకున్నాం. మేం బయటకు వచ్చేసమయానికి రష్ పెరిగిపోయింది. వీకెండ్ రష్! కొత్తగా మొదలెట్టినట్లున్నారు దర్శనాల క్యూలో లడ్డూ ప్రసాదం పంచుతున్నారు సంస్థానం వాళ్ళు. ఫ్రెష్ గా బాగున్నాయి లడ్డూస్! ఇంక భోం చేసి, కాస్తంత షాపింగ్ చేసేసి, రూంకొచ్చి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ రైలెక్కడానికి బయల్దేరిపోయాం. టికెట్ల పొజిషన్ చూస్తే మళ్ళీ RAC ! అబ్బా ఇరుక్కుని వెళ్లలేం.. థార్డ్ ఏసి లో దొరుకుతాయేమో చూడమన్నా అయ్యగారిని. స్లీపర్ క్లాస్ కన్ఫర్మ్ అవ్వడం కష్టం కానీ థార్డ్ ఏసి లో ఉన్నాయని మూడు సీట్లు ఇచ్చేసారు టిసిగారు. నెట్లో చూస్తే అన్నీ క్లాసులూ ఫుల్.. ఇప్పుడెలా దొరికాయి.. అనే సందేహాలన్నీ పక్కనెట్టేసి.. ఆహా బాబాగారి దయ అనుకుంటూ చల్లగా ఏసీలో పడుకుని రిలాక్స్ అయిపోయాం. చిన్నప్పుడు ఎన్ని వందలసార్లు రైళ్ళలో తిరిగాము.. ఇప్పుడేమిటో అంత బాధ! ఏమైనా ఓపికలుండగానే తిరగాలనుకున్న నాలుగు ఉళ్ళూ తిరిగెయ్యాలి. తర్వాతర్వాత వెళ్లడం కుదిరినా ముక్కుతూ ములుగుతూ ఏం తిరుగుతాం.. అనిపించింది. ఇదివరకూ ఓసారి నేనన్నమాటలే నాకు గుర్తుకొచ్చాయి.. సుఖం ఎలా ఉంటుందో తెలీనప్పుడు ఎన్ని కష్టాలైనా పడగలం. ఒక్కసారి సుఖాలకి అలవాటుపడ్డాకా.. మళ్ళీ కష్టపడాలంటే మహా బాధగా ఉంటుంది!

 


Tuesday, July 1, 2014

నవలానాయకులు - 7


కౌముది మాస పత్రికలో ప్రచురితమౌతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సాంబయ్య" పరిచయం క్రింద లింక్ లో: 
http://www.koumudi.net/Monthly/2014/july/july_2014_navalaa_nayakulu.pdf



Friday, June 27, 2014

కొత్త పుస్తకాలు: 4. శ్రీకాంతశర్మ సాహిత్యం



ఈ నాలుగవ పుస్తకం నేను కొనలేదు. నాన్నగారికి మిత్రులు శర్మగారు బహుకరిస్తే నే తస్కరించుకు తెచ్చుకున్నా :)
నాన్నగారి మిత్రులు, కవి, రచయిత, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమగ్ర సాహిత్యం వస్తుందని తెలిసినప్పటి నుండీ ఆత్రంగా ఎదురుచూసాము. 'సృజన', 'సమాలోచన' పేర్లతో రెండు భాగాలు ప్రచురింపబడిన ఈ సమగ్ర సాహిత్యాన్ని నవోదయావారు ప్రచురించారు. రెండు సంపుటాలూ కలిపి వెల 2,500/- శర్మగారు తన సప్తతి (డెభ్భైయ్యవ జన్మదినం) సందర్భంగా మే నెల 29న ఈ పుస్తకాలను మార్కెట్లో విడుదల చేసారు. ఆయనకు ఆర్భాటాలు నచ్చని కారణంగా సభా సమావేశాలు పెట్టి విడుదల చెయ్యలేదు. మొదటి భాగం 'సృజన'లో శర్మ గారి కవిత్వ, లలితగీతాల సంపుటిలు, యక్షగానాలు, కథలూ, నవలలు, నాటకాలు, నాటికలు(ఇరుగు-పొరుగు) ఉన్నాయి. రెండవ భాగం 'సమాలోచన'లో సాహిత్యదీపాలు, అలనాటి నాటికలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, మనలో మనమాట, ఇంద్రధనుస్సు, పరిపరి పరిచయాలూ ఉన్నాయి.



ఇందులోని రచనలన్నీ వివిధ పత్రికలలో, సాహిత్య సదస్సులలో, రంగస్థలంపై, రేడియోలో వెలుగు చూసాయి. ఈ మొత్తం ఇరవై పుస్తకాలలో పధ్నాలుగు పుస్తకాలు ఇదివరలో విడివిడిగా వెలువడ్డాయి. కవిత్వంలో అనుభూతిగీతాలూ, శిలామురళి, ఏకాంతకోకిల, ఆలాపన; ఇంకా రెండవ సంపుటిలో సాహిత్య దీపాలు, ఆలోచన, పరిపరిపరిచయాలూ ఇదివరకూ నాన్నగారి వద్ద చదివాను నేను. మిగిలినవి నేను కూడా ఇంకా చదవవలసి ఉంది. ఆసక్తిగల సాహితీమిత్రుల కోసం ముందు పుస్తకం విడుదల గురించి ఈ కొద్దిపాటి వివరాలతో టపా రాస్తున్నాను. 



చిన్నప్పటి నుండీ ఎరిగున్న నాన్నగారి స్నేహితులుగా కాకుండా, ఒక కవిగా నాకు శర్మ గారంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక విజ్ఞాన ఖని ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూంటే ఓ పక్కగా కూచుని వాళ్ళ సాహిత్యపుకబుర్లన్నీ వినడం భలే సరదాగా ఉండేది నాకు. ఇలా శర్మగారు అని రాయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంతశర్మ మావయ్యగారు అని పిలిచేవాళ్ళం ఆయనను. అలానే బావుంటుంది పిలవడం ఇప్పటికీ. మావయ్యగారు పాట రాస్తే సగం పదాలకు అర్థాలు అడిగి తెలుసుకునేవాళ్ళం మేం పిల్లలం. ఇప్పుడు తెలిసినంత కొద్దిపాటి తెలుగు కూడా చిన్నప్పుడు తెలీదు కదా. కొన్ని పాటల్లోని తోతెంచనా, దరిసి, ననలు తొడగవా, తమి పిలుపు మొదలైన పదాలు ఇంకా గుర్తున్నాయి.. అవి తెలుగువా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరంవారి పాండిత్యం, తెలుగు భాషాపరిజ్ఞానము ఇప్పటి తరాలకు సగమన్నా వచ్చేనా అని దిగులు కలుగుతూ ఉంటుంది నాకు. రచనా వ్యాసంగాల కోసం కాదు కానీ గ్రంధస్తమై ఉన్న తెలుగు సాహిత్యాన్ని చదవుకోవడానికన్నా మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది. 


ఎప్పుడో రచనాకాలం దాటిన కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొన్ని సమగ్ర సాహిత్యాల్లా కాకుండా, వర్తమానంలో తన సాహిత్యసంపుటిల్లో ఏ ఏ రచనలు కలపాలో, వేటిని తీసివెయ్యాలో మొదలైనవన్నీ శర్మగారు స్వయంగా చూసుకుని అచ్చుకు ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగించింది. "వెనుతిరిగి చూసుకుంటే.." అనే ముందుమాటలో శర్మ గారు చెప్పిన ఈ చివరి మాటలు నాకు బాగా నచ్చాయి..
"నా వ్యక్తిగత విశ్వాసాలు - నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకుని ఏర్పరుచుకున్నవి. ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకీ, చర్యలకీ, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే - ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యం. అందుచేత - సాహిత్య పఠనం, రచన, వ్యాసంగాలలోకి మనసు పెట్టేవాళ్ళు తమ మనస్సులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవలసి రావచ్చు; కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనస్సులోకి వెలుతురు తాకే అవకాశం ముఖ్యం - దానిని మూసి పెట్టకూడదు.
ఈ సందర్భాలలో, ఈ సంపుటాలలోని నా రచనలు ఏ మాత్రమైనా మీకు ఉపకరిస్తే, యాభైయ్యేళ్ళ నా సాహితీ వ్యాసంగం చరితార్థమైందని భావిస్తాను
."



 

ఈ సంపుటాలలోని వ్యాసాలూ, కథలు, నవలలు చదివాకా మరెప్పుడైనా వివరంగా మళ్ళీ రాస్తాను.
మొదటి సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:




 రెండవ  సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:


Wednesday, June 25, 2014

కొత్తపుస్తకాలు: ౩. స్వరలహరి


మన తెలుగు సినీ సంగీతదర్శకుల గురించి ఒక రచయిత లేదా ఓ అభిమాని వ్యాసమో పుస్తకమో రాస్తే ఒకలా ఉంటుంది. అదే ఆయా సంగీతదర్శకులతో కలిసి పనిచేసి, స్నేహం కలిగిన ఓ గాయకుడు రాస్తే విభిన్నంగా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ప్రయత్నమే ఈ పుస్తకం. సినీ సంగీతాకాశంలో తన స్వరాలతో ఓ అందమైన ఇంద్రధనస్సుని సృష్టించుకున్న స్వర్గీయ శ్రీ పి.బి.శ్రీనివాస్ రచన ఈ "స్వరలహరి". నేపథ్యగాయకుడు కాక మునుపు శ్రీ పి.బి.శ్రీనివాస్ పత్రికారంగంలో వివిధ కలంపేర్లతో రచనలు చేసేవారుట. భాష మీద పట్టు, చదివించే గుణం, మధ్య మధ్య వాడిన ఛలోక్తులు ఆయన ఎంత మంచి రచయితో తెలియజేస్తాయి. పి.బి తన వ్యాసాలలో చేసిన తమాషా ప్రయోగాలు తిరుపతి లడ్డూలోని జీడిపప్పులా, కలకండ పలుకుల్లా పాథకుల్ని ఆకట్టుకుంటాయి అని సంపాదకులు డా.కొంపల్లె రవిచంద్రన్ అంటారు.


1963-1964 ప్రాంతంలో జ్యోతి మాస పత్రికలోధారావాహికగా వెలువరించిన ఈ వ్యాసాలను గ్రంధరూపంలోకి తెచ్చింది "కళాతపస్వి క్రియేషన్స్". అన్ని విశాలాంధ్ర బుక్ హౌసుల్లోనూ లభ్యమౌవుతున్న ఈ పుస్తకం వెల కేవలం నూటఏభై రూపాయలు. ఆయన స్వర్గస్థులవ్వకముందరే పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నారుట కానీ సాధ్యమవలేదుట. ఈ ప్రయత్నం ప్రధమ వర్ధంతి లోపునన్నా పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేసారు ప్రచురణకర్తలు. వ్యాసాల మధ్యన ప్రచురించిన ఎన్నో అరుదైన, అపురూపమైన ఫోటోలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ పుస్తకంలో పి.బి. ఒక పదకొండు మంది సంగీత దర్శకుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుల వివరాలూ, పాటల ,సినిమాల వివరాలే  కాక వ్యతిగతంగా వారెలా తనకు పరిచయమో, వారితో జరిగిన కొన్ని సంఘటనలు, వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఘటనల ఉదాహరణలు, వారి అలవాట్లను గురించి ఎంతో చక్కగా వివరిస్తారు పి.బి ఈ వ్యాసాల్లో. ఈ వివరాలే ఈ పుస్తకానికో ప్రత్యేకతను తెచ్చాయి. వ్యాసం పూతయిన తరువాత ప్రతి సంగీత దర్శకుడి తాలూకూ చిన్న బయోడేటా కూడా ఒక పేజీలో అందించడం బాగుంది.

నేను ఎక్కువ వివరాలు రాయను కానీ ఒక్కో దర్శకుడి గురించి పి.బి. చెప్పిన ఒకటి రెండు విశేషాలు రాస్తాను.


హాయిగా పాడుదునా? (సాలూరి రాజేశ్వరరావు)
సాలూరివారు మంచి క్రియాత్మక హాస్యప్రదర్శనాప్రియులు(ప్రాక్టికల్ జోకర్) కూడానట. ఒకసారీ ఏవో రిహార్సల్స్ అయ్యాకా ఒక ఆంగ్ల చిత్రానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్నారుట అందరూ. రాజేశ్వరరావుగారి కారు సర్వీసింగ్ కి వెళ్ళిందిట. నేను పికప్ చేసుకుంటాను ముమ్మల్నని పి.బి అడిగితే, మీకెందుకు శ్రమ, చిన్న పనిచూసుకుని నేనే ఆటో రిక్షా మీద థియేటర్ వద్దకు వచ్చేస్తానని చెప్పారుట. పి.బి., అసిస్టెంట్స్ థియేటర్ వద్ద చాలా సేపు నించుని నుంచుని అలసిపోయి సాలూరివారు లేకుండా సినిమా చూడాలనిపించక వెనక్కివెళ్పోతుంటే అప్పుడు వచ్చారుట. సినిమా అయ్యాకా చెప్పారుట.. మీతో ఆటో రిక్షాలో వస్తానన్నాను కదా. ఆటో కోసం టాక్సీ వేసుకుని  ఊరంతా వెతికి ఈ ఆటో దొరికి వచ్చేసరికీ ఇంత లేటయ్యింది. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను లేకపోతే రాకపోదును అన్నారుట.


వేణు -గానలోలుడు
మాష్టర్ వేణు గా పిలవబడే మద్దూరి వేణుగోపాల్ కు హార్మోనియం,పియానో, సితార్,గిటార్,దిల్రుబా,మేండొలీన్, ఎకార్డియన్, ఫ్లూట్,సెల్లో,ఉడొఫోన్,జలతరంగిణి,హేమండ్ ఆర్గన్ మొదలైన పదిపదిహేను వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉండేదిట. ఎవరైనా ముఖ్య వాయిద్యగాళ్ళు రికార్డింగ్కి రాలేకపోతే తానే ఆ స్థానాన్ని భర్తీ చేసేసేవారుట. నౌషాద్ కు వీరాభిమానిట. నౌషాద్ సంగీతం ముందర ఎవరి సంగీతం రక్తి కట్టదని ఆయనకొక నిశ్చితాభిప్రాయం ఉండేదిట.


 సుసర్ల దక్షిణామూర్తి:
లతా మంగేష్కర్ చేత ప్రప్రధమంగా తెలుగు సింహళ భాషలలో పాడించిన ఘనత సుసర్లవారిది. భానుమతికి భానుమతి చేతే "అందంలో పందెమేస్తా" అని పాడించారు.  "చల్లని రాజా ఓ చందమామ", "జననీ శివకామినీ" మొదలైన హిట్స్ ఇచ్చారు. చక్కని పాటలెన్నో పాడి ప్లేబాక్ సింగర్ గా కూడా పేరు గడించారు.


పాటల టంకశాల ఘంటసాల
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని  పధ్ధెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చారుట ఘంటసాల. తర్వాత ఒక నాటక కంపెనీని నడుపుతూ  నష్టాల్లో ఉండగా సముద్రాల రాఘవాచారిగారు వీరి గొంతు బాగుందని మద్రాసు రామ్మన్నారుట. నాటక కంపెనీ మూసేసి ఇరవై రూపాయిలతో మద్రాసు చేరుకున్నారుట ఘంటసాల.


సప్తస్వరాల ఉయ్యాల
తెలుగువారు ఎక్కువగా పాడుకునే సినిమా పాటల్లో ఎక్కువభాగం పెండ్యాల నాగేశ్వరరావు గారివేనట. జగదేకవీరునికథ లో శివశంకరీ పాటకు నాయకుని గానానికి శిల కరిగిపోవలసి ఉంది.మీరెలా కరిగిస్తారోమరి అన్నారుట దర్శకులు కె.వి.రెడ్డిగారు. అహర్నిశలూ శ్రమించి ఆ పాటకు  బాణీ రూపొందించారుట ఆయన.


ఇంకా ఈ పుస్తకంలో...
* స్వరపరాయణ ఆదినారాయణ రావు గారు,
* రసికజన మనోభిరామ అశ్వత్థామ(సుప్రసిధ్ధ వైణికురాలు గాయిత్రి వీరి కుమార్తె),
* స్వరాల రాజు టి.వి.రాజు(పూతి పేరు తోటకూఅ వెంకటరాజు),
* జంట స్వరాలు(ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి),
* స్వరసప్తాచలపతి తాతినేని చలపతి,
*జనం నోట తనపాట పలికించిన చిలక కె.వి.మహాదేవన్ (పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్)
మొదలైన సంగీతకారుల గూర్చిన కబుర్లు ఉన్నాయి.

ఇలా ఇందరు మహానుభావుల గురించిన ఎన్నో కబుర్లు ఉన్న ఈ పుస్తకం మరి దాచుకోవలసిన తాయిలమే కదా!

Monday, June 23, 2014

కొత్త పుస్తకాలు :2. నివేదన


 రెండవ పుస్తకం కూడా చిన్నదే..
"నివేదన" పేరుతో వెలువడిన ఈ పుస్తకంలో "కొరొ జాగొరితొ"(where the mind is without fear..) అనే రవీంద్రుని కవితకు తెలుగులో లభ్యమయిన ఒక వంద అనువాదాలు ఉన్నాయి. నోబుల్ పురస్కారాన్ని అందుకున్న "గీతాంజలి" కావ్యమాలలోనిదీ గేయం. ఇదివరకూ కొన్ని అనువాదాలతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని మరిన్ని లభ్యమైన అనువాదాలు కలిపి పునర్ముద్రణ చేసారు. గీతాంజలి తెలుగులోకి అనువాదమై శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకరూపాన్ని నివాళిగా అందించారు "సంస్కృతి" సంస్థ వారు. వెల వంద రూపాయిలు.




క్లాస్ గుర్తులేదు కానీ ఈ కవిత చిన్నప్పుడు ఇంగ్లీష్ పొయిట్రీ టెక్స్ట్ లో ఉండేది. తర్వాత రేడియోలో రజని గారి పాట వినడమే. గత వంద సంవత్సరాలలో దాదాపు ఒక వందమంది రచయితలు ఈ కవితకు తమ తమ అనువాదాన్ని అందించారుట.  ఒక్క కవితకు ఇందరు అనువాదాన్ని అందించడం అనేది ప్రపంచ సాహిత్యంలోనే చాలా అరుదైన విషయం కదా. ఈ పుస్తకంలో మన బ్లాగ్మిత్రులు అనురాధ గారి అనువాదం కూడా చోటు చేసుకోవడం మరో విశేషం.


నివేదన లోని అనువాదకులు కొందరి పేర్లు: చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, తిరుమల రామచంద్ర, ఆచంట జానకీరామ్, బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, శంకరంబాడి సుందరాచారి, కొంగర జగ్గయ్య, మో, ఓల్గా, గుర్రం జాషువా, రావూరి భరద్వాజ, వాడ్రేవు చినవీరభద్రుడు మదలైనవారు. అసలిలా ఒకేచోట ఇందరి అనువాదాలు చేర్చాలన్న ఆలోచన బి.ఎస్.ఆర్.కృష్ణ గారికి వచ్చిందిట. ఈ పుస్తకం గురించిన ప్రకటన చదివినప్పుడు ఒకే కవితకు వందమంది ఏం రాస్తారు?ఎలా రాస్తారు? అనుకున్నా కానీ ఒకే కవితకి ఇందరి అనువాదాలూ, ఇందరి అభిప్రాయాలూ, పదాల పొందిక, వారి వారి వొకాబులరీ ఇవన్నీ చదువుతుంటే కూడా భలే సరదాగా ఉంది. వీటిల్లో ఒక్కటి కూడా ఇదివరకూ తెలియవు కానీ రజని గారు ఈ గేయాన్ని తెలుగులోకి అనువదించి స్వరపరిచి, గానం చేసిన అనువాదమొక్కటే నాకు చిన్నప్పటి నుండీ తెలుసు. ప్రస్తుతం మా PCకి ఆయొచ్చి నిద్దరోతున్నందున ఆ గానాన్ని ఈ టపాలో వినిపించలేకపోతున్నాను :( సాహిత్యం మాత్రం రాస్తాను..

రజని గారి తెలుగు అనువాదం :

చిత్తమెచట భయశూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమో
గృహప్రాంగణ తలములు ప్రాచీరమ్ముల
దివారాత్ర మృత్తికా రేణువుల
క్షుద్ర ఖందములు కావో!

వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరిసి వెలువడునో
కర్మధార యెట అజస్ర సహస్ర స్రోతమ్మై
చరితార్థంబై, అనివారిత స్రోతమ్మై
దేశదేశముల దెసదెస లంటునో
తుచ్ఛాచారపు మరుప్ర్రాంతమ్ముల
వివేక స్రోతస్విని యొటనింకదొ 
శతవిధాల పౌరుషయత్నమెచ్చట
నిత్యము నీ ఇచ్ఛావిధి నెగడునో

అట్టి స్వర్గతలి భారతభూస్థలి
నిజహస్తమ్మున నిర్దయాహతిని
జాగరితను గావింపవో పితా!
సర్వకర్మ సుఖదు:ఖ విధాతా!

ఇంత క్లిష్టమైన పదాలు ఎలా వాడారో.. అనీ, రజని గారి  తెలుగు భాషా పరిజ్ఞానం ఎంత గొప్పదో అనీ ఆశ్చర్యం వేసేది చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడల్లా. పుస్తకంలో  అనువాదం క్రింద అయన పరిచయంలో ఈ గేయానికి స్వరాలను అందించిన స్వరకర్తగా కూడా పరిచయం చేసి ఉంటే బాగుండేది. 


రజనిగారు - రవీంద్రసంగీతం:

"టాగూర్ రత్న" అవార్డ్ గ్రహీత, వాగ్గేయకారులు శ్రీ రజనీకాంతరావు గారు కొన్ని రవీంద్రగీతాలకు స్వరాలను అందించారు. రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కొందరు ఆకాశవాణి కళాకారులను కలకత్తా పంపి నొటేషన్స్ తెప్పించి , హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఈ గేయాలను గురించిన సిరీస్ నా 'సంగీతప్రియ' బ్లాగ్లో ఒక్కొక్కటే రాస్తున్నాను.



ఇంతే కాక ఈ గీతం పట్ల చాలా ప్రేమతో నాన్నగారు దీనికో ప్రత్యేకమైన ఫాంట్ వెతికి, టాగూర్ చిత్రంతో కలిపి ప్రింటవుట్ తీయించి ఫ్రేమ్ చేయించుకుని తన గదిలో పెట్టుకున్నారు కొన్నేళ్ల క్రితమే. క్రింద ఫోటో అదే..




***      ***     ***

మూడవది భలే పుస్తకం.. అది సినీసంగీతానికి సంబంధించినది. దాని గురించి రేపు రాస్తానేం..



Saturday, June 21, 2014

కొత్తపుస్తకాలు: 1. "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ".


                        


ఈ మధ్యన పనిమీద బజార్లోకి వెళ్ళినప్పుడు అటుగా ఉన్న పుస్తకాల షాపులోకి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొన్నాను. వాటి వివరాలు రాద్దామంటే కుదరట్లేదు..:( కొన్నింటి గురింఛైనా రాద్దామని ఇప్పుడు కూచున్నా. నేను కొనుక్కునే పుస్తకాలు మరెవరికైనా ఆసక్తికరంగా ఉండచ్చు, ఏ సమాచారమో వెతుక్కునేవారికి ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వాటి ఫోటోలు, వివరాలు బ్లాగ్ లో రాస్తూంటాను. ప్రదర్శించుకోవడానికో, ఇన్ని కొనేస్కున్నాను.. అని గొప్పగా ప్రదర్శించడానికి మాత్రం కాదు !! 


ముందు చివరగా కొన్న చిన్న పుస్తకం గురించి... 

కొన్న పుస్తకాలకి బిల్లు వేసేప్పుడు అటు ఇటు చూస్తూంటే కనబడింది ఈ పుస్తకం.. పేరు "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ". డా.దామోదరరావు గారి రచన, విశాంలాంధ్ర వారి ప్రచురణ. వెల నలభై రూపాయిలు మాత్రమే..:) ఇటువంటి పుస్తకం కోసం చాలారోజులుగా వెతుకుతున్నా నేను. చిన్నప్పుడు రేడియోలో వేసేవారు తప్పెట గుళ్ళు, యక్షగానం, బుర్ర కథ, జముకులు, వీర నాట్యం, చిందు భాగోతం మొదలైనవి. నాన్న కోసం రేడియో స్టేషన్ కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ కోసం వచ్చిన పల్లె జనాలు వాళ్ల గజ్జెలు, డప్పులు, ఆ శబ్దాలూ భలే విచిత్రంగా తోచేవి. వాళ్ళకు నాగరీకులతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. చాలా అమాయకంగా కనబడేవారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఈ కళారీతులను ప్రదర్శించుకుని జీవనం సాగించుకునేవారు వారు. ఆకాశవాణి వారు ప్రోగ్రాం వేసి రమ్మంటే వచ్చేవారు. రికార్డింగ్ అయిపోయాకా వెళ్పోయేవారు. కొన్ని కార్యక్రమాలని అవి ప్రదర్శించే ప్రదేశాలకు వెళ్ళి మరీ రికార్డింగ్ చేసుకుని వచ్చేవారు కూడా. నాన్న డ్యూటీలో ఉన్నప్పుడు నాన్న గొంతు వినడానికి ఆ పూట ట్రాన్స్మిషన్ అంతా వినేసేవాళ్లం. అలా కూడా నాకు కొన్ని జానపదాలతో పరిచయం ఉంది.


అది కాకుండా, ఫోక్ మ్యూజిక్ సెక్షన్ (ఎఫ్.ఎం అనేవారు) ఒకటి ఉండేది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో. దానికి కె.వి. హనుమంతరావుగారు అనే రేడియో ప్రయోక్త(ప్రొడ్యూసర్) ఉండేవారు. ఉద్యోగరీట్యానే కాక వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఈ జానపద కళారీతుల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఆయన ఎక్కడేక్కడి నుండో మారుమూల గ్రామాల్లో గాలించి కొన్ని మూలపడిపోతున్న జానపద కళారూపాల్ని ఆకాశవాణికి ఆహ్వానించి రికార్డింగ్ చేసేవారు.  ప్రజలకు అంతరించిపోతున్న ఈ కళారీతులను పరిచయం చేయడం కోసం విజయవాడ , గుంటూరు ,నెల్లూరు మొదలైన పట్నాల్లో విడివిడిగానూ, సామూహికంగానూ కూడా వీటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు హనుమంతరావుగారు. ఆ కార్యక్రమాలకు వ్యాఖ్యానం చెప్పటానికి నాన్న కూడా వెళ్ళేవారు. సామూహిక ప్రదర్శనల్లో అయితే జానపద రామాయణం, జానపద భారతం, జానపద భాగవతం అని ఈ కళారీతులన్నింటినీ కూర్చిఒక పదర్శన తయారు చేసి ప్రదర్శించేవారు. అంటే రామాయణ/భారత/భాగవతాల్లో ఒకో ఘట్టం ఒకో జానపద కళారూపం వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట! అలా అన్నీ మిక్స్ చేసి తయారుచేసిన ప్రదర్శనలు ఎంతో బాగుండేవి అని ఆ ప్రదర్శనలకు వెళ్ళి వచ్చాకా నాన్న చెప్తుండేవారు. కొన్ని విడివిడిగా ప్రదర్శించిన కళారూపాలైతే ఎప్పుడూ పేరు కూడా తెలియనివి ఉండేవిట. "రుంజ" అనే కళారీతి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందిట. మరో అపురూప కళారీతి అయితే కర్నూలు అటవీ ప్రాంతం లోనే ఉండేదిట. శ్రమకూర్చి వాళ్ళని కూడా పట్టణప్రాంతానికి తీసుకువచ్చి ప్రదర్శనలిప్పించేవారు హనుమంతరావు  గారు. 


ఆయన జానపద ప్రయోక్తగా ఉన్న కాలంలో ఢిల్లీ ఆకాశవాణి వారు ఒక ప్రతిపాదన చేసారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే జానపద కళారూపాల తాలూకూ సంగీత పరికరాలనీ, వాద్యాలనీ సేకరించి ఢిల్లీలో ఒక మ్యూజియం లో పదిలపరచాలనే ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆయన అకాల మరణానంతరం ఆ ప్రతిపాదన పూర్తయ్యిందో లేదో తెలీదు మరి. జానపద కళారీతుల గురించిన అటువంటి విశిష్ఠమైన కృషి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగింది. కొన్ని రికార్డింగ్స్ నాన్న దగ్గర ఇంకా ఉన్నాయనుకుంటా కూడా..


ఈ రకమైన పరిచయం వాల్ల కలిగిన ఆసక్తితో మన తెలుగువారి జానపద కళల గురించి మంచి పుస్తకమేదైనా దొరికితే బాగుండు అని పుస్తక ప్రదర్శనల్లో వెతుకుతూ ఉండేదాన్ని. చిన్నదైనా మొత్తానికి ఇది దొరికింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందీ అంటే.. ఒక నలభై తెలుగు జానపద కళారీతుల గురించిన సంక్షిప్త పరిచయం. ప్రాంతాల వారీగా వారి పరిచయాలు, వాటి వివరాలు, చిన్న చిన్న బొమ్మలు. అసలైతే, తెలుగునాట దాదాపు అరవై జానపద కళారూపాలు ఉన్నట్లుగా సుప్రసిధ్ధ జానపద, రంగస్థల ప్రయోక్త ఆచార్య మొదలి నాగభూషణం శర్మ తన పరిశోధన సేకరణలో తెలిపారుట. కానీ ఇప్పుడు వాటిల్లో ఎన్నో అంతరించిపోగా, కొన్నింటి పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవడం విచారకరం. ఈ జానపద కళల పరిరక్షణలో బెంగాలీ వాళ్ళకు ఉన్న శ్రధ్ధాసక్తులను మెచ్చుకుని తీరాలి.


ఈ పుస్తకంలో పరిచయం చేసిన కొన్ని జానపద కళారూపాల పేర్లు:
డప్పు నృత్యం, పులి వేషం, తప్పెట గుళ్ళు, కోలాటం, గరగలు, జంగం కథ, జముకుల కథ, కాకి పదగలు, భామా కలాపం, చిరుతల రామాయణం,  యక్షగానం, బుడబుక్కలు, చిందు భాగోతం, పిచ్చుక గుంట్లు, గురవయ్యలు.. మొదలైనవి. ఇవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ప్రదర్శించేవారు, ఎలా ఆడతారు మొదలైన వివరాలు క్లుప్తంగా ఇచ్చారన్నమాట. క్రింద కొన్ని చిత్రాలు ఉన్నాయి చూడండీ..












ఇంకా కొన్ని మంచి పుస్తకాల గురించి వరుసగా రాస్తాను... ఎదురుచూడండి...:-)

Thursday, June 12, 2014

పాట వెంట పయనం: నృత్యగీతాలు




సారంగ వారపత్రికలో ప్రచురితమవుతున్న 'పాట వెంట పయనం'లో ఈసారి నేపథ్యం "నృత్యగీతాలు"..

క్రింద లింక్ లో వ్యాసాన్ని చూడవచ్చు..
http://wp.me/p3amQG-2Kw

Wednesday, June 11, 2014

కాస్త ఉప్పు తక్కువైనా రుచి బానే ఉంది!



మొన్న శనివారం రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వస్తున్నాం.. సమయం 10:10 అయ్యింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న సినిమా హాల్ దగ్గరకు వచ్చాకా ఏదైనా సినిమాకి టికెట్లు దొరికితే వెళ్దామా అనుకున్నాం. మరి మొదలైపోయినా పర్లేదా అన్నారు అయ్యగారు. ఓకే పదమన్నాను. ఆ హాల్లో సెకెండ్ షో టైం పదింపావు, పది ఇరవై అలా ఉంటుంది. మూడు స్క్రీన్స్ హౌస్ఫుల్ ఉన్నాయి. నాలుగో దాంట్లో టికెట్స్ ఉన్నాయన్నాడు కౌంటర్లో. అదే "ఉలవచారు బిర్యాని" సినిమా. శనివారానికి నిన్న అంటే శుక్రవారం రిలీజయినట్లుంది ఆ సినిమా. "కొత్త సినిమాకి వీకెండ్ టికెట్లు ఉన్నాయా...? ఎలా ఉందయ్యా సినిమా..?" అనడిగితే పర్లేదండి బానే ఉందని చెప్పాడు టికెట్లబ్బాయ్. గబగబా హాల్లోకి ఎంటరయ్యేసరికీ ఆట మొదలయిపోయి ఓ పెళ్ళిచూపుల సీన్ జరుగుతోంది. 

 ఈ సినిమా చూసెయ్యాలని ఆశేమీ పడలేదు కానీ చూడద్దనేమీ అనుకోలేదు. పూర్వాపరాలు కొంత తెలుసు. ప్రకాష్ రాజ్ సొంత సినిమా అనీ, డైరెక్టర్ కూడా అతనే అనీ, ఒరిజినల్ ఒక మళయాళీ చిత్రమనీ,  ప్రకాష్ రాజ్ రైట్స్ తీసుకుని త్రిభాషా చిత్రంగా.. ఒకేసారి మూడు భాషల్లోనూ చిత్రీకరించారనిన్నీ, ఇంకా... ఇళయరాజా సంగీతం సమకూర్చారనీ తెలుసు.(అబ్బో ఎన్ని తెలుసో కదా :)) అంతకు ముందు అతను దర్శకత్వం వహించిన సినిమాలు చూడలేదు కానీ ఒక మంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ అంటే ఓ మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రకాష్ రాజ్ ను చూస్తున్నప్పుడు నాకు బాలీవుడ్ నటుడు నానాపాటేకర్ గుర్తుకు వస్తాడు. ఒకేలాంటి ఇంటెన్సివ్ ఏక్టింగ్ ఇద్దరిదీ. కాంట్రవర్సీస్ లో కూడా ఇద్దరూ సమానులే :)


ఇంక సినిమాలోకి వచ్చేస్తే... మొదట నన్నాకట్టుకున్నది ఇళయరాజా టచ్! మొదటి నుండీ చివరిదాకా అలా మనసుని తాకుతూ ఉంది. చిరపరిచితమైన ఆ ట్యూన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ బిట్స్, పాటల మధ్యన ఇంటర్లూడ్స్.. అన్నీ ఏదో లోకంలోకి తీసుకుపోతూ ఉంటాయి. పాటలు పెద్ద గొప్పగా లేవు :( కైలాష్ ఖేర్ తో పాడించిన పాట లిరిక్స్ బాగున్నాయి కానీ అతని గొంతు ఆ songకు నప్పలేదు. అంతకన్నా అసలు ఇళయరాజా పాడాల్సింది ఆ పాట. రెండవది "తీయగా తీయగా.." క్యాచీగా ఉంది. మూడోది ఓ మాదిరి. నాలుగోది సాహిత్యం బాగుంది. మొదటి రెండు వాక్యాలూ నాకు బాగా నచ్చాయి..

" రాయలేని లేఖనే మార్చటం ఎలా
తీయలేని రాగమే మరవటం ఎలా "

ఈ రెండు వాక్యాలు వినగానే కడుపు నిండిపోయింది. నాలుగింటిలో ఇది బాగుంది. సాహిత్యం చాలా బాగుంది. క్రింద లిస్ట్ లో ఆఖరి పాట..



ఇదేమీ అద్భుతమైన సినిమా అనను కానీ సినిమాలో గుర్తుండిపోయే సీన్స్ కొన్ని ఉన్నాయి. క్లాసిక్ టచ్ ఉన్న సీన్స్. డైరెక్టర్ టేస్ట్ తెలిపే సీన్స్. మణీరత్నం సినిమాలో కనబడేలాంటి సీన్స్ కొన్ని. ఆదివాసి జగ్గయ్య ను ఇంటికి తీసుక్కురావడం, కొన్ని సన్నివేశాల్లో అతని ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకంగా చూపెట్టడం. అలా అతన్ని ఇన్వాల్వ్ చెయ్యడం బాగుంది. స్నేహ డైలాగ్స్ కొన్ని బాగా నచ్చాయి నాకు. అలానే బ్రహ్మాజీ పాత్ర బాగుంది. బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ ల మధ్యన హాస్యం, ఇంట్లో వాళ్లందరి మధ్య నడిచే సంభాషణలూ బాగున్నాయి. వాళ్ళింట్లో డైనింగ్ టేబుల్ మధ్యన పెట్టిన బుల్లి బుల్లి జాడీలు బాగున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే రెండు మూడు సన్నివేశాల్లో ఆ జాడీలు అలానే ఉన్నాయి. మారిపోలేదు. 


నాకసలు అర్థం కానిది ఒక్కటే.. తెలుగులో ఈ Title(ఉలవచారు బిర్యాని) ఎందుకు పెట్టారా? అని. వేరే ఏదైనా పెట్టాల్సింది. అసలా పేరు పెట్టినందుకు ఓసారయినా బిర్యానీనో, ఉలవచారునో వాళ్ళు తింటున్నట్లయినా చూపలేదు. దోశ దోశ.. అని పిలుచుకున్నారు.. కనీసం ఆ కుట్టుదోశ పేరైనా పెట్టాల్సింది.


ట్రైలర్ చూసినప్పుడు "చీనీ కమ్" లాంటి సినిమానేమో అనుకున్నా. అలా తీసినా బాగుండేది. దోశ, కేక్ మేకింగ్ తప్పితే ఎక్కడా మళ్ళీ ఏ రెసిపీ గురించీ మాటలే ఉండవు. మొదటి భాగం ఎంత చకచకా గడిచిందో, రెండవ భాగం అంత స్లో అయిపోయింది సినిమా. ఆ పార్ట్ పట్ల శ్రధ్ధ తీసుకుని ఉంటే చాలా మంచి చిత్రంగా మిగిలి ఉండేది. రెండవ ప్రపంచ యుధ్ధం, ఆ రెయిన్బో కేక్ మేకింగ్ అదీ బాగా వచ్చింది. అలానే ఆదివాసి జగ్గయ్య వెనక్కి వెళ్పోయే సీన్ లో ఏ తెలుగు హీరోనో ఉండి ఉంటే దుమ్ము రేపేసి, అక్కడున్నవాళ్ళందరినీ చితగ్గొట్టేసి, కార్లు ఎగరగొట్టేసి జగ్గయ్యను ఎలాగైనా రష్కించేసేవాడు కదా అనిపించింది..:) అలాంటివి చూసినప్పుడు తిట్టుకుంటాం గానీ నిజంగా అలా మనుషుల్ని పడగొట్టేసి, తుక్కు రేగ్గొట్టేసి, జనాలూ.. 'అమ్మో వీడికి దూరంగా ఉండాలి' అనుకునేలాంటి హీమేన్ ఒకడుండాలి అనిపిస్తూ ఉంటుంది. 'భీమ్ బాయ్ భీం బాయ్..ఇక్కడన్యాయం జరుగుతోంది చూడు' అనగానే వచ్చేసి అక్కడివాళ్ళందరినీ చితగ్గొట్టేసేలాంటి హీమేన్ మనందరికీ కావాలి కదూ..!!




ఇంక స్నేగ..అదే మన స్నేహ గురించి ఎం చెప్పాలి? ఇంకా స్లిమ్ అయిపోయి బోళ్డు అందంగా ఉందిప్పుడు. మంచి మంచి కాటన్ డ్రస్ లు వేసేసుకుంది. కథ మొదట్లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు దోశ ఆర్డర్ ఇచ్చినప్పుడు వేసుకున్న కాటన్ డ్రెస్(పై ఫోటో లోది) నాకెంత నచ్చిందో. ముఖ్యంగా ఆ  గ్రీన్ చున్నీ..భలే ఉంది. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసాడు కానీ చివర్లో వాళ్ళీద్దర్నీ పక్కపక్కన చూస్తే.... మన స్నేగ పక్కన ఇతనేమిటీ.. రామ రామ... అనుకున్నా! 

ఓ పెళ్ళికాని అమ్మాయిగా స్నేహ పడే వేదన నిజంగా ఆలోచింపచేస్తుంది. దేశంలో ఎంత అభివృధ్ధి జరిగినా, ఎంత సంపాదన ఉన్నా, మన దేశంలో ఆడపిల్లకి పెళ్ళి అవ్వలేదు అంటే అదేదో ఘోరం, నేరం అన్నట్లు చూస్తారు ఇవాళ్టికీనూ! తన కాళ్ళపై తాను కాన్ఫిడెంట్ గా బ్రతికే అమ్మాయిని కూడా పెళ్ళి తప్ప జీవితానికింకో పరమార్థం లేదు అనుకునేలా చేసేస్తారు జనాలు. పెళ్ళి అనేది ఎవరికైనా జీవితంలో ఓ ముఖ్య ఘట్టం, ఓ భాగం తప్ప పెళ్ళే జీవితం కాదు అని ఈ దేశంలో ప్రజలు ఎప్పటికి నమ్ముతారో కదా అనిపించింది.


చివరికి ఎలానో కథ కంచికి తెచ్చి 'భశుం' అనిపించారు మొత్తానికి. హమ్మయ్య అనుకుని లేచి బయటకు నడిచాం. సినిమా ఇంకా బాగుండి ఉండవచ్చు కానీ హటాత్తుగా అప్పటికప్పుడు అనుకుని హాల్లోకి వెళ్ళి కూచుని డబ్బునీ, సమయాన్నీ నష్టపోలేదని మాత్రం అనిపించింది. నెమరేసుకోవడానికి కొన్ని చక్కని సన్నివేశాలు మిగిలాయి. 

హమ్మయ్య! మూడు రోజుల్నుండీ కుదరలేదు..ఇప్పటికి రాసాను :-)