సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 26, 2012

మార్కొనీ జయంతి సందర్భంగా నాన్నగారికి మరో సన్మానం



నిన్న(Apr 25th) రేడియోని కనిపెట్టిన "మార్కొనీ" జయంతి. ఈ "మార్కొనీ జయంతి" సందర్భంగా రేడియోకి విశిష్ఠ సేవలను అందించిన కొందరు రేడియో ప్రముఖులకు కొన్ని స్మారక అవార్డులను గత కొన్నేళ్ళుగా విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్ వారు ఇస్తున్నారు. ఈ ఏటి మార్కొనీ జయంతి సందర్భంగా నిన్నటి రోజున ముగ్గురు రేడియో ప్రముఖులకు సన్మాన పురస్కారాలను అందజేసారు. విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్, హైదరాబాదు త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఎనౌన్సర్ శ్రీ బి.జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ(కళాసుబ్బారావు వేదిక)లో నిన్న సాయంత్రం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముగ్గురు రేడియో ప్రముఖులు - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి, విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ, విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు) అవార్డులు అందజేసారు. మార్కొనీ వంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పురస్కార గ్రహీతలు చెప్పారు.


అవార్డుల వివరాలు:

* విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్, గాయని స్వర్గీయ వి.బి.కనకదుర్గ స్మారక అవార్డ్ - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి,
* న్యూస్ రీడర్ తిరుమలశెట్టి శ్రీరాములు స్మారక అవార్డ్ - విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ,
* ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్ట్ స్వర్గీయ శ్రీ గోపాల్ అవార్డ్ - విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు)


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమణాచారి గారు ఇటీవలే "దేవస్థానం" సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారుట. రచయిత, కవి, విమర్శకుడు, రిటైర్డ్ ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ శ్రీ సుధామ గారు(మన "సుధామధురం" బ్లాగర్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ సుధామగారు స్టేజ్ పై మాట్లాడుతూ మన తెలుగుబ్లాగులు గురించి కూడా చెప్పారు. అందులో వారు నా బ్లాగ్ గురించి కూడా ప్రస్తావించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి శైలజా సుమన్ గారు కూడా తన ప్రసంగంలో పాత రేడియో రోజులను, తన రేడియో జ్ఞాపకాలనూ తలుచుకున్నారు.


ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు శ్రీ పాలక రాజారావు, హైదరాబాద్ దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు, ING Life Insurance Co. Ltd బ్రాంచ్ మేనేజర్ శ్రీ వంకదారు హరికృష్ణ పాల్గొన్నారు.



సుధామ గారు :

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు :

శ్రీ ఏడిదగోపాల్రావు గారు :

ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు(మా నాన్నగారు) :



మా నాన్నగారి గురించి నా బ్లాగ్ లో నేను అదివరకూ రాసిన టపాలు చదవనివారికి ఈ లింక్స్:

http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_21.html

http://trishnaventa.blogspot.com/2010/10/2.html

http://trishnaventa.blogspot.com/2010/10/3.html

http://trishnaventa.blogspot.com/2010/10/4_26.html

http://trishnaventa.blogspot.com/2010/10/5.html

http://trishnaventa.blogspot.in/2010/10/6.html

http://trishnaventa.blogspot.com/2010/11/blog-post.html