సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 22, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 2 !!


మొదటిభాగం తరువాత
..

Oct 21,11.30p.m
ఫోటోలో భాస్కర్ తో పాటూ ఉన్నది అతని సన్నిహిత మిత్రుడు "నారయణమూర్తి". ఇతను ప్రముఖ న్యాయవాది, హాస్య రచయిత, రంగస్థల,సినీ నటులు అయిన శ్రీ పుచ్ఛా పూర్ణానందంగారి అల్లుడు. నలభై ఐదేళ్ళు అయినా చెక్కు చెదరని వాళ్ళ స్నేహం గాఢానురాగాలతో ఇప్పటికీ కొనసాగుతోంది.

అక్కగారి వివాహం అవ్వగానే బావగారు బాగా చేరువయ్యారు. బావ, అతనింటి సభ్యులు అందరూ అతన్ని "ఖండవిల్లి రామం" అని పిలిచేవారు. తండ్రి లేని లోటు అప్పటికి తీరింది. బావ ప్రోత్సాహంతో డిగ్రీ అవ్వగానే మద్రాసులోని గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు అప్లై చేసాడు భాస్కర్. తను గీసిన పైంటింగ్స్, మిగిలిన ఆర్ట్ వర్క్లో ఉన్న టేలంట్ చూసి ఇంటర్వ్యూ లో "డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్" బాగా ఇంప్రెస్స్ అయ్యి ’ఇతనికి తప్పకుండా సీత్ ఇవ్వండి" అని చెప్పి వెళ్ళాడు. దాదాపు అరగంట సేపు సాగిన ఇంటర్వ్యూలో తన దగ్గరున్న ఆర్ట్ మెటీరియల్ చూపించటానికే ఎక్కువ టైం పట్టింది. ఫోటోగ్రఫీ అంటే భాస్కర్ కు ఎంతో ఇష్టం. ఒక మామూలు హేండ్ కెమేరాతో ఎన్నో రకాల ట్రిక్ ఫోటోలు తీసేవాడు. అవన్నీ చూసి బోర్డ్ సభ్యులందరూ ఫొటోగ్రఫీ సెక్షన్ లో సీట్ తీసుకోమని బలవంతపెడితే, నాకు సంగీతం మీద ఆసక్తి ఎక్కువ. అందుకని సౌండ్ రికార్డింగ్ సెక్షన్ లోనే చేరతానని భాస్కర్ పట్టు పట్టాడు. ఎప్పటికైనా విజయా గార్డెన్స్ లో సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ లాగ మంచి పేరు తెచ్చుకోవాలని అప్పట్లో తన కోరిక. (ఆ కోరిక రేడియోలో జాతీయ బహుమతులు సంపాదించుకున్న తరువాత కొంతవరకు తీరింది.) అతని ఆశయాలు, కోరికలు తీరేలాగ 1965లో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో D.F.Tech(sound recording & sound engineering) లో సీటు వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళో గోడ మీద మూగ బొమ్మలు వేసుకునే కుర్రాడికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీటు రావటం ! తన అదృష్టానికి తానే మురిసిపోయాడు భాస్కర్. అక్కడికి కూడా తోడుగా ఉండి వండిపెట్టటానికి వాళ్ళ అమ్మమ్మ వస్తానని పట్టుపట్టింది. కానీ మద్రాసు లాంటి మహానగరంలో చిన్నపాటి ఇల్లు అది సంసారానికి అనువుగా దొరకక రాలేకపోయింది. అక్కడితో హాస్టల్లో ఒంటరి జీవితం మొదలైంది.
Madras film Institute van

1968 దాకా మూడేళ్ళు ఒక అద్భుత ప్రపంచంలో విహరించాడు అతను. హాస్టల్లో మొదటిరోజే తన వాయిద్యాలతో, సంగీతంతో తమిళ స్నేహితులను, అభిమానులనూ సంపాదించుకున్నాడు. వాళ్ల ఇన్స్టిట్యూట్ కేంపస్ లోనే ఉన్న "కేటరింగ్ ఇన్స్టిట్యూట్" లో కూడా స్నేహితులను సంపాదించుకున్నాడు భాస్కర్. ఇక్కడ స్నేహితులందరూ "శ్రీరామ్మూర్తి" అనే పిలిచేవారు. కాలేజీమిత్రులందరూ కలిసి ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ తయారుచేసుకున్నారు. బుల్బుల్ వాయించటమే కాక గ్రూప్ కు సారధ్యం కూడా వహించి మద్రాసు అనేక చోట్ల ప్రోగ్రామ్లు ఇచ్చేవారు.

playing Bulbul

ఒకసారి మద్రాస్ ఐ.ఐ.టి.లో అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు జరిగినప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీరామ్మూర్తి బుల్బుల్ తీసుకుని సంగీత విభాగంలో పోటికి వెళ్ళాడు. మద్రాసు మహానగరంలోని అనేక కాలేజీల నుంచి సంగీత కళాకారులు పియానో, ట్రంపెట్, సాక్సోఫోన్, జాజ్ డ్రమ్స్ లాంటి పెద్ద పెద్ద ఇస్ట్రుమెంట్స్ తీసుకువచ్చారు. అప్పటికి ఊళ్ళో 'లవ్ ఇన్ టోక్యో' హిందీ సినిమా విజయవంతంగా ఆడుతోంది. తాను ఆశా పారేక్ ఫాన్ కావటం వల్ల ఆ సినిమాలోని "సాయోనారా.." పాట రేడియోలో వచ్చినప్పుడల్లా విని నేర్చుకుని ఆ పాటే ఐ.ఐ.టి లో బుల్బుల్ మీద వాయించాడు. గొప్ప అప్లాజ్ వచ్చింది. ఐటమ్ అయిపోగానే వెళ్పోతుంటే ఆడియన్స్ "వన్స్ మోర్" అని కేకలు వేసారు. కాంపిటీషన్లో వన్స్ మోర్ ఏంటీ అని వెళ్పోతుంటే, ఆడియన్స్ ఊరుకోలేదు. అప్పుడు నిర్వాహకులే మళ్ళీ రిక్వస్ట్ చేసి రెండోసారి ఆ పాట వాయించమన్నారు. అప్పుడూ గ్రేట్ అప్లాజ్ వచ్చింది. అదో తీపి జ్ఞాపకం.

cover page painted by ramam


ఫైనల్ ఇయర్లో థీసీస్ సమర్పించాల్సివచ్చినప్పుడు, తనకి బాగా ఇష్టమైన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" మీద థీసీస్ సబ్మిట్ చేసాడు శ్రీరామ్మూర్తి. ప్రముఖ సౌండ్ రికార్డిస్ట్, మన తెలుగువారైన "వల్లభ జోస్యుల శివరాం"గారు ఎగ్జామినర్గా వచ్చారు. థీసీస్ చాలా బాగుందని 75% (డిస్టింక్షన్) ఇచ్చారు. ఫైనల్ ఇయర్ పరీక్షలో భాగంగా స్టూడేంట్స్ మూడు షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సి వచ్చేది. వాటిల్లో ఒక దానికి కోసం శ్రీరామ్మూర్తి "థ హౌస్" అనే కథ రాసి, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా కూడా అవార్డ్ తీసుకున్నాడు అతను. దానికి ఆధారం హాస్టల్ పరిసరాల్లో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇల్లు, షూటింగ్ తాలుకు ఫోటోలు.


with students shooting for 'The House'

'The house' behind the tree'

House in a different angle

అలా సౌండ్ రికార్డింగ్ లో డిప్లొమా పూర్తి చేసాడు. మద్రాసు ఫిలిం చాంబర్ హాల్లో ఏ.వీ.ఎం.చెట్టియార్ చేతుల మీదుగా "బెస్ట్ స్టూడెంట్" అవార్డ్ అందుకున్నాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రకరకాల భాషల, ప్రాంతాల వీ వందలకొద్దీ సినిమాలు చూసి చూసి అతనికి ఎన్నో ఆలోచనలు వస్తూండేవి. ఓ పాకెట్ నోట్ బుక్స్ పెట్టుకుని తనకు వచ్చిన ఆలోచనలనీ, ఐడియాలనీ వాటిల్లో రాసుకునేవాడు. సినిమాలు చూస్తూ కూడా మధ్యలో వచ్చిన ఏవో ఏబ్స్ట్రాక్ట్ ఐడియాస్ జేబులోని చిన్న స్పైరల్ నోట్ బుక్లో ఆ చీకట్లోనే రాసుకునేవాడు. ఫిల్మ్ కోర్స్ పూర్తయ్యాకా సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాలనే కోరికతో ఓ ఏడుగురు స్నేహితులు మద్రాసులోనే ఒక ఏడాది ఉండిపోయారు. ఆ మిత్రులు అంతా కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిన్న కవిత ఆధరంగా "క్లౌడ్స్ అండ్ వేవ్స్" అని ఒక చిల్డ్రెన్స్ షార్ట్ ఫిల్మ్ తీసారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి గారు మొదలైనవారంతా వచ్చి చూసి ప్రశంసలందించారు. అతని జీవితంలో అదొక స్వర్ణయుగం.


Oct 22, 11.45a.m
ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోయిన వాళ్ల గ్రూప్ ఆశలు నిరాశలే ఐనాయి. అప్పట్లో దూరదర్శన్ లాంటి సంస్థలు కూడా లేవు. సినీ పరిశ్రమలో అప్రంటిస్ గా చేరితే రెండొందలు కన్నా జీతం రాదు. ఉద్యోగం లేకున్నా అప్పటికే ఒక సంవత్సరం పాటు బావగారు ధన సహాయం చేస్తు వచ్చారు. ఆ పై ఆర్ధికంగా పోషించటానికి వెనుక ఎవరూ లేని నిస్సహాయత ఏదో సాధించాలన్న శ్రీరామ్మూర్తి ఉత్సాహాన్నీ, సృజనాత్మకతనూ నీరుకార్చేసాయి. భాస్కర్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో కుటుంబరీత్యా స్థితిమంతుడైనప్పటికీ అతనికి పెద్దగా స్థిరాస్థులేమీ అందలేదు. బావగారు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. అక్క, బావ అక్కడ ఉన్నారని, పిల్లవాడి వంతు వచ్చిన డబ్బుతో కాకినాడలో ఇల్లు కొని స్థిరపడ్డారు అమ్మ, అమ్మమ్మ. అలా కాకినాడ తో అనుబంధం మొదలైంది.


ఇంటి నుంచి వచ్చేయమని వత్తిడి ఎక్కువవటంతో ఎటూ తోచని పరిస్థితిలో బలవంతాన1968లో పెట్టె,బేడా సర్దుకుని కాకినాడ వెళ్పోయాడు శ్రీరామ్మూర్తి.. తన స్నేహితులకు మల్లె తనకు తండ్రి అండ ఉండి ఉంటే, ఇంకొన్నాళ్ళు మద్రాసులో ఉండగలిగితే వాళ్ళకు లాగే తానూ సినీ పరిశ్రమలో ఉండిపోయేవాడిని కదా అనుకుంటాడు ఇవాళ్టికి కూడా. అతని స్నేహితులు చాలా మంది గొప్ప గొప్ప స్థానాలో, పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నారు. అతని రూట్స్ ఇప్పటికీ మద్రాసులోనే ఉంటాయి. మద్రాసు పేరు చెబితేనే ఉత్సాహంతో తన మనసు అక్కడికి పరుగులు తీస్తుంది.

ఒక మహా వైభవాన్ని చూసిన మనిషికి, ఏవేవో చెయ్యాలని కలలు కన్న మనిషికి, తనది అనుకునే ప్రపంచం నుంచి వేరు పడిన మనిషికి ఇక ప్రపంచంలో ఏ మూల ఉన్నా పెద్ద తేడా కనబడదు. ఏ పనైనా ఒకటే. అదే నిర్లిప్తతతో పెద్దల తృప్తి కోసం చదువుతో సంబంధం లేని కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు కొన్నాళ్ళు చేసాడు అతను. నేనేమిటి ఇలాంటి పన్లేమిటి అనుకున్న సందర్భాలెన్నో...! తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్లుగా ఇక్కడ జీవితం రామాన్ని మరో దారిలోకి తిసుకువెళ్ళింది.
(రెండవ భాగం పూర్తి...)


Thursday, October 21, 2010

"పుస్తకం.నెట్"లో మరపురాని మనీషి


ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి”. తిరుమల రామచంద్ర గారు రచించిన ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.






రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!


Oct 21, 11.30a.m
రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ !!

temple in khandavilli



పశ్చిమగోదావరి జిల్లా, తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం. అతి చిన్న పల్లేటూరు. ఊళ్ళో "శిష్ఠావారిల్లు" అంటే బోలెడు గౌరవం. వీధి నుంచి వీధి వరకూ వ్యాపించిన ప్రహారి గోడతో పెద్ద ఇల్లు. ఇంటి తాలుకు కధలో ప్రస్తుతానికి నేను రాయబోయేది "రామం" ఒక్కడి గురించే. శిష్ఠా పురుషోత్తంగారి నాలుగవ కుమారుడు "సత్యనారయణ". ఆయన ఏకైన కుమారుడు భాస్కర శ్రీరామ్మూర్తి. ఊళ్ళో అందరూ రావుడు అని పిలిచేవారు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం "రాంబాణం" అని పిలిచేది. మనవడు పాకుతూంటే మోకాళ్ళు గీసుకుపోతున్నాయని దొడ్దంతా గచ్చు చేయించిన వెర్రి అప్యాయత ఆమెది.


తెల్లటి తెలుపుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం రాముడిది. దురదృష్టశాత్తు మూడవ ఏటనే తండ్రిని పోగొట్టుకున్న అతనికి ఇంట్లో ఆదరించే అందరూ ఆడవాళ్ళే. నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఇద్దరక్కలు, మేనత్త. నాన్న,అన్న, తమ్ముడు, మావయ్యా.... ఇలా బంధాలూ లేవు. తెలియవు. తండ్రి ప్రేమ కానీ, మరో మగదిక్కు కాని లేని ఒంటరి పయనం అక్కడ నుంచే మొదలయ్యింది. తండ్రిని కోల్పోయిన మనవలనూ, లంకంత ఇంట్లో ఒంటరైన కుమార్తెకు తోడుగా ఉండటానికి రాముడి అమ్మమ్మ కూడా ఇంటికి వచ్చి, ఇంటివారి అనుమతితో గదిలో తన వంట తాను వండుకుంటూ అక్కడే ఉండిపోయారు. అమ్మమ్మకూ రాముడికీ ఎంతో అనుబంధం. నిత్యం పాతిక మందికి పైగా ఉండే ఇంట్లోని మనుషులకు వండి పెట్టే అమ్మ ఇంటి పనులతో, అత్తమామల సేవతో సతమతమౌతూ ఉంటే, రావుడికి అమ్మమ్మ బాగా చేరువైపోయింది. ఆవిడకు మనవడే లోకం. అలా తండ్రి లేని లోటు తప్పించి, ఇంట్లోని ఆడవారందరి చేతుల్లో గారంగా, అపురూపంగా గడిచిందతని బాల్యం.

తండ్రి కొని ఉంచిన గ్రామఫోన్ రావుడి ముఖ్య వినోద సాధనం. తణుకు వెళ్ళి ఆయన కొని తెచ్చుకున్న కర్ణాటక సంగీత గ్రామఫోన్ రికార్డులు, డ్రామా సెట్లు, హాస్య గీతాలు రావుడి మొదటి సంపద. తెలిసీ తెలియని జ్ఞానంతో మళ్ళీ మళ్ళీ అవన్నీ ప్లే చేసి వినేవాడు అతను. సంగీతం పట్ల ఆతని ఆసక్తి అక్కడ మొదలైంది. హై స్కూల్లో చేరాకా సైన్స్ పాఠాలు బాగా వంటబట్టాయి అతనికి. మధ్యాహ్నం అందరూ నిద్దరోతూంటే పాత సామాను పడేసిన తడికల గాదె లో దూరి, పాత సామానుతో సైన్స్ ఎక్స్పరిమెంట్లన్నీ చేసేవాడు. ఎండలో అద్దం పెట్టి, చిన్న్ చిన్న ఫిల్మ్ ముక్కలు ఆధారంగా గోడ మీద మూగ సినిమా సొంతంగా వేసేవాడు. అమ్మ నిద్రపోతుంటే మూగ సినిమా, మెళుకువగా ఉంటే గ్రామఫోన్ కూడా జోడించి నిజం సినిమా వేయటం.



ఊళ్ళోకి సినిమా వస్తే, సినిమా ప్రదర్శన గురించి మైకులో చెప్తూ జీప్ తిరిగేది. దాని వెనుక మిగతా పిల్లలతో పాటూ తానూ పరిగెత్తుతూ వెళ్ళేవాడు రావుడు. సినిమాల మీద కూడా అప్పుడే సరదా మొదలైంది. రావుడు ఎస్.ఎస్.ఎల్.సిలోకి వచ్చేదాకా కిర్సనాయిలు దీపాలే చదువుకి ఆధారం.

అప్పటిదాకా ఎవరింట్లోనూ రేడియో లేని ఊళ్ళో, రాముడు హైస్కూలుకు వచ్చే నాటికి వాళ్ల ఎదురిల్లైన మునుసబుగారి ఇంట్లో బ్యాటరీ రేడియో వెలిసింది. ప్రొద్దుటి పూట వాళ్ళ ఇంట్లోంచి రేడియో సిలోన్, తరువాత పురానే ఫిల్మోంకా లోక్ ప్రియ్ సంగీత్, శ్రోతల ఫర్మాయిషీ ఫిలిం గీతాలు వినిపిస్తుంటే గోడ పక్క నించుని అబ్బురంగా వింటూండేవాడు రావుడు. అదే రేడియోతో అతని మొదటి పరిచయం. మరో ఇరవైఏళ్ల తరువాత అదే జీవితంగా మారుతుందని అప్పుడతనికి తెలియదు. హైస్కూల్ చదువయ్యాకా కాలేజీ కోసం నెల్లూరు వెళ్లాడు అతను.


1961లో డిగ్రీ పూర్తయ్యేవరకూ నెల్లూరే అతడి వాసం. అతడికి తోడుగా వండిబెట్టడానికి అమ్మమ్మ తోడు వచ్చింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే బుధ్ధుడికి బోధి వృక్షం లాగ రాముడికి నెల్లూరు విజ్ఞాన కేంద్రం అయ్యింది. అతని మనోవికాశానికి నాంది నెల్లూరే. సినిమాలు, పుస్తకాలు, పత్రికలు, స్నేహితులు అన్నీ అక్కడే పరిచయం. కమ్ సెప్టెంబర్, బేబీ ఎలిఫెంట్ వాక్, లవ్ ఈజ్ బ్లూ వంటి వెస్ట్రన్ మ్యూజిక్ రికార్డ్లు వినటం, కొనటం అక్కడే మొదలైంది.సొంతంగా బొమ్మలు వెయ్యటం, బుల్బుల్, షాహిబాజా, మౌత్ ఆర్గాన్, మాన్డొలీన్ మొదలైన సంగీత వాయిద్యాలను సొంతంగా నేర్చుకున్నదీ ఇక్కడే. తను బుల్బుల్ వాయించుకోవటానికి అప్పుడప్పుడు వాయిద్యాన్ని అరువుగా ఇచ్చే లాయరుగారు, అతను బాగా వాయించడం చూసి ఇన్స్ట్రుమెంట్ నువ్వే ఉంచేసుకో అని బహుమతిగా ఇచ్చేసారు.నలభై ఐదు సంవత్సరాల వయసున్న బుల్బుల్ ఇప్పటికీ భాస్కర్ దగ్గర ఉంది. ఇంకా వాయిస్తూనే ఉంటాడు.




అందుకే ఊరంటే అతనికి ఎంతో ప్రేమ, మమకారం. వాళ్ళ వి.ఆర్.కాలేజీ ఎదురుగా ఉండే లీలామహల్లో వచ్చిన ప్రతి సినిమా విడువకుండా చూసేవాడు. ఇంగ్లీషు సినిమాల పరిచయమూ అక్కడే. ఖండవిల్లి రాముడు కాస్తా స్నేహితుల పిలుపుతో "భాస్కర్"గా మారాడిక్కడ. నెల్లూరులో ఉండగానే మద్రాసులో ఒక సినీ స్టూడియోలో పనిచేసే బంధువు ద్వారా తరచూ సినిమా షూటింగులు చూస్తూ ఉండేవాడు. సినిమా అతని మీద బలమైన ముద్ర వేసింది. ఎలాగైనా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి, మంచి టెక్నీషియన్ అయిపోవాలని ఉవ్విళ్ళూరేవాడు భాస్కర్.


(మొదటి భాగం పూర్తి..)

Tuesday, October 19, 2010

శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ (1976)



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఊళ్ళోకి వచ్చిన పాత సినిమాలన్నీ తీసుకెళ్ళి చూపించేది. బాపు తీసిన "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" అని ఒక సినిమా ఉందే..అది చాలా బావుంటుంది. చూపిద్దామంటే రావట్లేదు" అంటూ ఉండేది. అలా ఆ సినిమా గురించి వినీ వినీ చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఎంచేతనో ఆ సినిమాను హాలులో చూడ్డం మాత్రం కుదరలేదు. చాలా ఏళ్ళకు టి.వి లో ఏదో చానల్లో వస్తే చూశాను. ఈ మధ్యన సీడీ కూడా దొరికింది. చక్రపాణి, నాగిరెడ్డి గార్లు నిర్మాతలు. చక్రపాణిగారు నిర్మించిన తుది చిత్రం కావటం వల్ల ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిచ్చారు. విజయావారు తీసిన గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్ మొదలైన అన్ని చిత్రాలూ విజయవంతంగా ప్రదర్శింపబడినవే. సినిమాకు బాపు, చక్రపాణి కలిపి దర్శకత్వం వహించారు. ఆద్యంతం చక్కని హాస్యంతో, ఆదర్శవంతమైన సందేశంతో, అందమైన పాటలతో, నటీనటుల సమతుల్యమైన నటనతో మనల్ని ఆకట్టుకుంటుంది "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్".


బ్రతుకు తెరువు కోసం పట్నానికి వచ్చిన మాథ్యూస్(కృష్ణ) కు ఉద్యోగం దొరకదు. తప్పనిసరి పరిస్థితుల్లో మతము, పేరు మార్చుకుని "ముత్తయ్య"గా మారతాడు. శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్లో సర్వర్ గా చేరి, ఆ తరువాత హోటల్ యజమాని(జగ్గయ్య) కుమార్తె రాజేశ్వరి(జయప్రద)కు పంతులు గా మారతాడు. నిప్పులు కడిగే ఆచారం ఉన్న ఆ ఇంట్లో, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం కోసం క్రిష్టియన్ అయిన మాథ్యూస్ పడే పాట్లు హాస్యాన్ని పుట్టిస్తాయి. ముత్తయ్య చెల్లెల్లితో పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న పెళ్ళికొడుకు తండ్రి(అల్లు రామలింగయ్య) తన కుమార్తెను ముత్తయ్యకు ఇచ్చి వివాహం చేయాలనే ఉద్దేశంతో పట్నం వస్తాడు. స్నేహితుడు నర్సింహాన్నే(పద్మనాభం) ముత్తయ్యగా మామగారికి పరిచయం చేస్తాడు ముత్తయ్య. తారుమారైన పేర్లతో, పాత్రలతో కథ రసవత్తరంగా మారుతుంది. అల్లు రామలింగయ్య కుమార్తెగా రమాప్రభ, ముత్తయ్యగా వేషం ధరించిన సద్బ్రాహ్మణుడైన స్నేహితునిగా పద్మనాభం, అతడినే అల్లుడిగా భావిస్తూ అల్లు రామలింగయ్య చేసే హడావుడి...ఈ ముగ్గురూ పండించే హాస్యం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.


రాజేశ్వరితో వివాహం కుదర్చాలని బామ్మ పడే తాపత్రయం, రాజేశ్వరి చూపే చొరవ వలన ముత్తయ్య పడే ఇబ్బంది అన్నీ చివరికి ఏమౌతుందో అన్న కలవరాన్ని రేపుతాయి. రాజేశ్వరి ప్రేమ ఫలిస్తుందా? ఆమె తండ్రి పెళ్ళికి ఒప్పుకుంటాడా? అసలు విషయం తెలిసాకా ముత్తయ్య చెల్లెలి పెళ్ళి జరుగుతుందా? పద్మనాభం, రమాప్రభల పెళ్ళి కుదురుతుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే "శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్" సినిమా చూడాల్సిందే. సినిమాలో ముఖ్యంగా ఆకట్టుకునేవి పాటలు. పెండ్యాల నాగేశ్వర రావుగారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీతప్రేమికుల పెదాలపై నాట్యమాడుతూ ఉంటాయి. ముఖ్యంగా "ఆకాశపందిరిలో.." పాటను ఆ కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా చిత్రీకరించారని చెప్పాలి. చిత్రీకరణలో బాపూ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. బాలు అద్భుతంగా పాడిన "నా పేరు బికారి" , సుశీల గళంలో "ఆకాశ పందిరిలో" రెండు పాటలూ ఎన్నిసార్లు విన్నా విసుగురావు. ఈ రెండు పాటలనూ దేవులపల్లి వారు రాయటం మరో విశేషం. గుర్తుండిపోయే సాహిత్యంతో పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన "రాకోయీ అనుకోని అతిథి" పాటలో జయప్రద భావ ప్రకటన, నటన మెప్పిస్తాయి.


ఈ సినిమా చూడటానికి ఆన్లైన్ లింక్స్ ఇక్కడ ఇన్నాయి.




"ఆకాశపందిరిలో.."







"రాకోయీ అనుకోని అతిథి.."





" నా పేరు బికారి.."


పరికిణీ !!




పరికిణీ


"....స్వప్నాల డాబా మీద
నాలుగు చెరుగులూ పరిచి
కుర్రకారు గుండెల్ని
’పిండి’ వడియాలు పెట్టేసిన
జాణ - ఓణీ !!
ఓణీ... పరికిణీ...
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి ...
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్ధం !! "


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మా ఆవిడకి మంత్రాలొచ్చు !!


ఏడ్చే పసివాడికి
పాలసీసా అయిపోతుంది !
అత్తగారి నడ్డి కింద
పీటైపోతుంది.
మామగారికి కాఫీ
ప్లాస్కయి పోతుంది...
రాత్రి పదగ్గదిలో
నాకు - రగ్గైపోతుంది
ప్రొద్దున్నే వాకిట్లో
ముగ్గై పోతుంది..
మా ఆవిడకి మంత్రాలొచ్చు...


౮౮౮౮౮ ౮౮౮౮౮ ౮౮౮౮౮


మధ్యతరగతి నటరాజు


30 - ఫస్ట్ నైట్ !!


చీర


మూసీనది


నవర’సావిత్రి’


రేఖ


స్వర్గం నుంచి నాన్నకి !



...ఇంతకన్నా ఈ పుస్తకానికి వేరే పరిచయాలవసరం లేదు.
చదివే ప్రతి కవిత మనసుని కదిలిస్తుంది. సామాన్య మధ్యతరగతి బ్రతుకుల్ని ఫ్రేమ్ లో బిగించి చూపిస్తుంది.
అక్షరాన్ని ప్రేమించే ఎవరైనా చదివి తీరాల్సిన పుస్తకం...తనికెళ్ళ భరణి గారి "పరికిణీ".



Friday, October 15, 2010

దసరా శుభాకాంక్షలు

ఇదివరకెప్పుడో వేసిన "Durga eyes"

బ్లాగ్మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.