సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, February 3, 2010

కారణ జన్ములు...

క్రితం వారం అనుకుంటా ఒక హోటల్ కు డిన్నర్ కు వెళ్తే అక్కడ "దర్శకులు విశ్వనాథ్"గారిని చూడటం జరిగింది. బాగా దగ్గర నుంచి అదే చూడటం. అదివరకులా కాక బాగా సన్నబడ్డారు. వయసు ప్రభావం...వాకింగ్ స్టిక్ కూడా ఉంది చేతిలో..!ఆయన కుటుంబంతో కాబోలు ఉన్నారు. భోజనం అయిపోయి వెళ్పోతున్నారు. అందుకని ఇంక దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. కాకపోతే అన్ని గొప్ప సినిమాల సృష్టికర్త ను అలా "ఓల్డ్ ఏజ్"లో చూడలేకపోయాననే చెప్పాలి...ఏదో సినిమా మళ్ళీ తీస్తున్నారని వినికిడి.

ఆ తరువాత "వేటూరి"గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చానల్స్ వాళ్ళు ఆయనతో ఇంటర్వ్యూ లు ప్రసారం చేసారు. చాలా బాగా ,ఓపికగా మాట్లాడారు. ముఖ్యంగా తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, జాతీయ స్థాయిలో తెలుగు భాష ఎంతటి నిరాదరణకు,అలక్ష్యానికీ గురౌతోందో చక్కగా వివరించారు. ఆత్రేయగారి "నేనొక ప్రేమ పిపాసిని.." పాట గొప్పతనాన్ని ప్రతి వాక్యం, పదం గుర్తుచేసుకుంటూ చెప్పారు.
ఆయన ఇంకా రాస్తున్న కొత్త సినిమా పాటల వివరాలు చెప్పారు. చానల్ వాళ్ళు ఆయన రాసిన "సాంగ్స్ బిట్స్" వినిపించారు. అంతా బాగుంది కానీ,అయ్యో ఎంతటి మాహా రచయిత పెద్దవారైపోయారే అనిపించింది...

ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి "ఎనభై ఒకటి" సంవత్సరాలట.ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి 81సంవత్సరాలట. ఆ అద్భుత గాయనికి సాటిలేరెవరూ అనుకున్నాను.

అక్కినేని అవార్డ్ సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూంటే 87ఏళ్ల మనిషి ఆరోగ్యం పట్ల ఎంత శ్రధ్ధ తీసుకుంటారో అని అబ్బురం కలిగింది. ఆయన డిసిప్లీన్ , ఆరోగ్యం పట్ల ఆయన చూపే జాగ్రత్త చాలా మందికి మార్గదర్శకం కావాలి అనుకుంటూ ఉంటాను అస్తమానం.

ఈ మహామహులందరూ కారణ జన్ములు. ఎవరికి వారే "యునీక్" అనిపించింది. బాగా రాసేవారూ, పాటలు పాడేవారూ ,బాగా నటించేవారూ, సినిమాలు తీసేవారు చాలా మంది ఉన్నారు.. ఇంకా వస్తారు కానీ , పైన రాసిన మహామహులందరిని రీప్లెస్ చేసేవారు మాత్రం ఎవ్వరూ ఉండరు...పుట్టరు అనిపించింది. ఇటువంటి మహానుభావులెందరికోసమో నేమో త్యాగయ్యగారు అన్నారు..."ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు.." అని.

****************************
బ్లాగ్మిత్రులకు:
నా సిస్టం బాగవకపోవటం వల్ల బ్లాగులు చూసి చాలా కాలమైంది...! నాకొక బ్లాగుందని నేనే మర్చిపోతానేమో అని ఇన్నాళ్ళకు ఇలా ఓ టపా రాసే ప్రయత్నం చేసాను. తరచూ చూసే బ్లాగులు చూడకపోయినా నాకు బాధే. బ్లాగుల
పట్ల నాకున్న మక్కువ అటువంటిది. వీలున్నప్పుడెప్పుడో మిస్సయిన టపాలన్ని చదువుతాను.
టపాలు తగ్గిపోయినా "తృష్ణ"ను మర్చిపోకండేం...!