సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 1, 2009

బంధుత్వాలు


(వీరిలో మా పాపా లేదు..దొరికినవాళ్ళకు తీసాము మళ్లీ వాళ్ల మూడ్ మారకుండా...)

"పుణ్యం కొద్దీ పురుషుడు....దానం కొద్దీ బిడ్డలు...."అంటారు.
మన స్వభావాన్ని బట్టి, ఎంపికను బట్టీ "మిత్రులు" ఏర్పడతారు.
మరి మన రక్త సంబంధం ద్వారా మనకు దగ్గరయ్యే బంధువులు....
బంధువులు "భగవంతుడు ఇచ్చిన మిత్రులు" అని నా అభిప్రాయం. వారే స్నేహితులు, సన్నిహితులు అయితే...అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? పైన రెండు వాక్యాల తాలూకు అదృష్టాలతో పాటూ భగవంతుడు నాకా అదృష్టాన్నికూడా ఇచ్చాడు. మా బంధువులందరం ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉంటాము. కజిన్స్ అందరం సొంత అక్క చెల్లెళ్ళలాగ...సొంత అన్నదమ్ములలాగ...!


పెళ్ళిళ్ళకీ, స్పెషల్ అకేషన్స్ కీ అందరం కలుస్తూ..సరదాగా గడిపేస్తాము. మా నాన్నకు ఒక్కరే అక్క. ఇంకెవరూ చుట్టాలు లేరు...ఆవిడను మా రెండవ మేనమామకు ఇచ్చారు. వాళ్ళ పెళ్ళి సమయానికి అమ్మకు ఒక ఏడాదిట. మిగతావాళ్ళంతా చిన్న చిన్న పిల్లలుట. చిన్నన్నయ్య,చిన్నవదినా అంటూ ఎంతో కలసిపోయారు వాళ్ళంతా. కాబట్టి నాకు రెండు వైపుల నుంచీ ఒకే బంధువులు. అందరం ఒక గూటికి చెందినవాళ్ళమే.

తాతగారి సంతానం నలుగురు అబ్బాయిలు,నలుగురు అమ్మాయిలు. చిన్నప్పుడు అందరం తలో ఊళ్ళో ఉండేవాళ్ళం. కానీ సంవత్సరానికి ఓసారైనా తాతగారి ఆబ్దీకానికి అందరం కలిసేవాళ్ళం. అప్పట్లో తాతగారిల్లంతా మా పిల్లల కేరింతలతో, అల్లర్లతొ దద్దరిల్లుతూ ఉండేది. కాస్త పెద్దయ్యాక శెలవుల్లో పిన్నిలు, పెద్దమ్మల ఊళ్ళు వెళ్ళాలంటే అదో పెద్ద ప్రోసెస్. నాన్న కొంచెం స్త్రిక్ట్. ఎక్కడికీ పంపేవారు కాదు. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినా టైం ప్రకారం వెళ్ళి, చెప్పిన టైం కు వచ్చేయాలి. కాస్త లేటైతే నాకోసం బయల్దేరిపోయేవారు. ఓసారేమైందంటే...అమ్మో అది వేరే కధ...(ఇంకో టపాలో..)

ఈ కధలోకి వచ్చేస్తే, శెలవుల్లో ఊళ్ళు వెళ్ళటానికి ముందు అమ్మని కాకాపట్టాలి. ఆ తరువాత కూడా నాన్న ఒప్పుకునేవారు కాదు. అప్పుడు పిన్ని చేతో, పెద్దమ్మ చేతో మాట్లాడించేవాళ్ళం...వాళ్ళు అడిగితే మొహమాటానికి ఇంక అయిష్టంగా ఒప్పేసుకునేవారు..! గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక నన్ను ఆ ఊరు తీసుకెళ్ళే మనిషి కోసం వెతుకులాట. ముందుగానే బట్టలు సర్దుకుని రెడీగా ఉన్న నేను, బాబయ్యో, అన్నయ్యో ఎవరో ఒకరు దొరికితే వాళ్ళతో వెళ్పోయేదాన్ని..నర్సాపురం, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, జగ్గయ్యపేట...ఇలా ప్రతి ఏడాదీ శెలవుల్లో బానే వెళ్ళేదాన్ని ఊళ్ళు. కొన్నిసార్లు అమ్మావాళ్ళు కూడా వచ్చేవారు.

ట్రాన్ఫర్ మీద ఒక మావయ్య విజయవాడ వచ్చాకా ఇక అందరూ మా ఊరే వచ్చేవారు. అమ్మమ్మను చూడటానికి. అందరం ఒకచోట కలిసి నవ్వులూ, కేరింతలూ, కబుర్లూ...ఆ సందడే వేరుగా ఉండేది. కానీ రాను రానూ చదువులూ, ఉద్యోగాలతో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అందరం కలిసి మూడు నాలుగేళ్ళు దాటిపోవటం మొదలైంది. కుటుంబంలోని ప్రతి పెళ్ళికీ తప్పక కలిసే కజిన్స్ అందరం పెళ్ళిళ్ళయ్యాకా అసలు కలవటమే తక్కువైపోయింది...!! ఉత్తరప్రత్యుత్తరాలు, ఫోనులూ ద్వారా అందరి విశేషాలు అందరికీ తెలుస్తున్నా, కళ్ళరా చూసుకుని కబుర్లాడే అపురూప క్షణాల కోసం అందరం తపించిపోయే పరిస్థితికి వచ్చాం. కాంటాక్ట్ లో ఉండటానికి కజిన్స్ అందరమూ యాహూ గ్రూప్స్ లో ఒక గ్రూప్ తయారుచేసుకుని గ్రూప్ మైల్స్ ద్వారా అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉంటాం.

ఇప్పుడు అనుకోకుండా అమ్మావాళ్ళు ముగ్గురు అప్పచెళ్ళెళ్ళూ, ఒక మవయ్యా ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. ఏడుగురం కజిన్స్ కూడా ప్రస్తుతానికి ఇక్కడికే చేరాం. కానీ విచిత్రం ఏమిటంటే ఒకే ఊళ్ళోని అందరం ఒకచోట కలిసి రెండేళ్ళు అవుతోంది...దూరాలూ, ఉద్యోగాలూ, సమయాభావాలు...భవబంధాలూ...అన్నీ కారణాలే..హలో అంటే హలో అని ఫోనుల్లో మాట్లాడుకోటానికి కూడా నెలలు పడుతోంది. ఈ లోపూ మా పదహారుమంది మనుమలలో పెళ్ళిళ్ళైన వారికి మొత్తం కలిపి ఇరవై పైగా పిల్లలు... వాళ్ళూ పెరిగి పెద్దయిపోతున్నారు. వాళ్ళు పెద్దయ్యాకా "అమ్మమ్మ చెల్లి కూతురు కొడుకుట.." అనుకునే పరిస్థితి వాళ్లకు రాకూడదని మా ప్రయత్నం. మా బంధుత్వాలను, సన్నిహితాలనూ పిల్లలకు కూడా పంచాలని మా ప్రయత్నం. అందుకే ఇక ఏమాత్రం వీలు దొరికినా ఈ మధ్యన కలిసి పిల్లలకు పిల్లలకూ స్నేహాలు పెంచుతున్నాము.

ఇప్పుడు ఈ పిల్లలంతా మమ్మల్ని "కార్తీక్ అమ్మ", "సంకల్ప్ అమ్మమ్మ", "సంజన తాతగారు" అంటూ గుర్తిస్తుంటే మేమంతా చాలా ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వపు స్నేహాలను ఇలాగే మరిన్ని తరాలకు అందివ్వాలని ఆశిస్తున్నాం. మొన్న వీకెండ్ జరిగిన రెండు గృహప్రవేశాలలో మళ్ళీ అనుకోకుండా అందరం కలవటం...మా మా పిల్లలంతా సరదాగా ఆడుకోవటం మనసులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక మాకు "నేటి కలయికలే రేపటి పిల్లల బంధుత్వాలకు పునాదులు" అనే నమ్మకం కుదిరింది.