Monday, April 21, 2014

బానే ఉందనిపించిన '2 States'



సిన్మా చూడ్డానికి ఊళ్ళో హాల్స్ కి వెళ్లాలంటే పదిహేను, ఇరవై కిలోమీటర్లు పైమాట. అంత పరుగులెట్టే గొప్ప సిన్మాలు లేవు..టైం వేస్ట్ కూడా. సో, మా ఇంటి దగ్గర హాల్లోకొచ్చిన వాటిల్లో ఏదో ఒకటి చూడటం కుదురుతోందీ మధ్యన. ఇంట్లో అత్తయ్యగారున్నారని పాపని అట్టేపేట్టి, రిలీఫ్ కోసం ఏదో ఒకటిలెమ్మని ఈ సినిమాకెళ్ళాం. షరా మామూలే.. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల, గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేసరికీ సిన్మా మొదలైపోయింది :( 


ఈ చిత్రానికి ఆధారమైన నవల చదవలేదు కానీ 'ట్రైలర్' చూసి అసలు చూడాలనుకోలేదీ సినిమా. కాలేజీపిల్లలను తప్పుదోవ పట్టించేట్లు ఉందనిపించింది! ఫస్ట్ హాఫ్ నిజంగా అలానే ఉంది. ఇళ్ళకి దూరంగా హాస్టల్లో చదువుకునే పిల్లలంతా నిజంగా ఎలా ఉంటారో తెలీదు కానీ ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా భయమేస్తుంది పిల్లల్ని దూరాలు పంపడానికి. పైగా ఈమధ్యన సినిమాల్లో ఇలా పెళ్ళికాని ప్రేమికుల మధ్యన ఇంటిమేట్ సీన్స్ చూపించడం రివాజయిపోయింది. సమాజం ఏమైపోతోందో..నైతిక విలువలు ఎటు పయనిస్తున్నాయో.. అన్న దిగులు కలుగుతుంది ఇలాంటివి చూసినప్పుడు. 


ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అక్కడక్కడ బోరింగ్ అనిపించింది. ఇదేదో కాలేజీ పిల్లల కోసం తీసిన సినిమా.. పొరపాటున వచ్చామా..అనుకున్నాం కానీ సెకెండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎక్కడైతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చూపించాడో, అక్కడ స్టోరీలో డెప్త్ వచ్చింది. "ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు కానీ పెళ్ళాడాలంటే రెండు కుటుంబాలు కలవాలి" అనే డెఫినిషన్తో తెలుగులోనూ, హిందీ లోనూ కూడా డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల పిల్లల మధ్యన ప్రేమ,పెళ్ళి నేపథ్యంతో రీసేంట్ గా చెప్పాలంటే 'చెన్నై ఎక్స్ప్రెస్' లో తమిళమ్మయి-హిందీ అబ్బాయి, దానికన్నా ముందు 'విక్కీ డోనర్' లో పంజాబీ-బెంగాలీ ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ చూపెట్టారు. ఇందులో కొత్తగా ఏముందంటే తండ్రీ కొడుకుల మధ్యన డిస్టర్బ్ద్ రిలేషన్. అది గ్రాడ్యువల్ గా ఎలా బాగయ్యిందో చూపెట్టడం బాగుంది. టివీ సీరియల్స్ తో తలపండిపోయిన రోనిత్ రాయ్ హీరోకి తండ్రిగా బాగా చేసాడు. అమృతా సింగ్ కన్నా వీరోవిన్ తల్లి పాత్రలో రేవతి బాగా మెప్పించింది. 


"ఐ వాంట్ టూ మేరీ యువర్ ఫ్యామిలీ" అని హీరో త్రీ రింగ్స్ తో ప్రొపోజ్ చెయ్యడం చాలా బాగుంది. బాలీవుడ్ కి మరో యంగ్ & ప్రామిసింగ్ హీరో దొరికాడు. పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటే నిలబడగలడు. క్రితం వారం ఏదో పేపర్లో ఇతనిదో పెద్ద ఇంటర్వ్యూ చదివాను. అందులో ఎంతవరకూ నిజాయితీ ఉందో తెలీదు కానీ బాగా మాట్లాడాడు. ఇక 'ఆలియా భట్' గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. చిరునవ్వుతో సహా తల్లిపోలికలు బాగా ఉన్న యంగ్ & ఎనర్జిటిక్, టాలెంటెడ్ తాటాకుబొమ్మ. చివర్లో పెళ్ళికూతురు డ్రెస్ లో అచ్చం బొమ్మలా ఉంది. చిన్నవైనా expressive eyes ఉన్నాయీ అమ్మయికి. But, సినీలోకపు కమర్షియల్ పరుగుపందాల్లో జారిపోకుండా ఉంటుందా అన్నది ప్రశ్నే! 


తమ కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నాలేమీ ఫలించట్లేదని, క్రిష్ కూడా సహకరించట్లేదనిపించి అతనికి దూరంగా జరిగడం నచ్చింది నాకు. ఆ పాయింట్ లో, మళ్ళీ హీరో తండ్రి వచ్చి వెళ్ళాకా క్రిష్ కు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి పాత్రకు ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. అక్కడ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఒక మామూలు కమర్షియల్ సినిమాలా మూడు ఫైట్లు, ఆరు పాటలతో పూర్తి చెయ్యకుండా ప్రేమికులు తల్లిదండ్రుల అనుమతి కోసం పాటుపడడం అనే కాన్సెప్ట్ వల్ల వెయిటేజ్ పెరిగి బానే ఉంది.. పైసా వసూల్.. అనిపించుకుందీ సినిమా. Moreover.. there is love... love that we can feel with our hearts! 


పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 



Friday, April 18, 2014

పాట వెంట పయనం: వర్షం


ఈ నెల 'పాట వెంట పయనం' లో నేపథ్యం.."వర్షం"! ఎండలు మండిపోతున్నాయి కదా అని కాసేపు వాన పాటలు చూస్తే మనసైనా చల్లబడుతుందని...

http://magazine.saarangabooks.com/2014/04/16/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%8A%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF/

Thursday, April 17, 2014

నాన్న చెప్పిన 'ఆవకాయ' కబుర్లు..




హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...

నాన్న మాటల్లో..:

" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. 

కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:
ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు మిరపకాయలు(వెడల్పాటివి) కిరాణాకొట్లో అమ్మేవారు. ఎరుపుదనం, కమ్మదనం వాటి స్పేషాలిటీ. అప్పుడే ఎక్కువకొనేసుకుని ఏడాది పొడుగునా రోజువారీ వాడకానికి దాచేవారుట. వాటిని రెండు మూడూ ఎండలకి లోపల గింజలు గలగలలాడేలా బాగా ఎండనిచ్చి, వాటితో కారం కొట్టించడం మొదటి పని. ప్రతీ ఇంట్లోనూ రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి. చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లోంచీ ఒక రిథిమ్ లో వినిపించేది కారం దంచే చప్పుడు. ఇలానే రాళ్ళుప్పు కూడా ఎండబెట్టి కొట్టించేవారు. మెంతికాయ కోసం మెంతులు కూడా వేయించి గుండ కొట్టించడం మరో పని. వీటితోపాటూ ఆవాలు కూడా. వాటిల్లో మళ్ళీ సన్నావాలు,పెద్దావాలు. సన్న ఆవాల ఆవకాయ అని విడిగా పెట్టేవారుట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఏ ఆవాలు నాణ్యమైనవో తెలుసుకోవడానికి నాలుగు కిరాణా కోట్లూ తిరిగి ఇంట్లో వాళ్ళు సాంపిల్స్ తేవడం ఒక పని.

పప్పునూనె:
దాదాపు నువ్వుల పంటే ఉండేది చాలామందికి. బస్తాల్లో నువ్వులు వచ్చాకా, నూపప్పు డబ్బా అని చిల్లుల డబ్బా ఒకటి ఉండేది. ఆ డబ్బాలో నానబెట్టిన నువ్వులు పోస్తే, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేసేది. చేత్తో పిసిగితే నువ్వుల పై పొట్టు పోయేది. అది బయట పారేసి, ఛాయనూపప్పు ఒక్కటీ బయటకు తీసేసి ఎండబెట్టేవారు. ఆ తర్వాత వాటిని గానుగకి తీసుకువెళ్ళి ఆడించడం. ఈ పనొక్కటీ మా పిల్లలకు అప్పచెప్పేవారు. మేం కూడా గానుగ దగ్గరకు ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే రంగులరాట్నంలా గిరగిరా తిరిగే గానుగ మీద కూచుని తిరగచ్చని సరదా. గానుగెద్దు గిరగిరా తిరుగుతుంటే గానుగ లోంచి విచిత్రమైన ధ్వనులతో సంగీతమొచ్చేది. ఆ గానుగ సింఫనీ చాలా బాగుండేది. ఎందుకో తెలీదు కానీ నువ్వులతో పాటూ బెల్లం కూడా గానుగలో వేసేవారు. గానుగ ద్వారా పప్పు నూనే కాకుండా తెలగపిండి కూడా వచ్చేది. గానుగలోంచి వచ్చిన ఫ్రెష్ పప్పు నూనె వాసన తాగెయ్యాలనిపించేంత తియ్యగా ఉండేది. ఇదంతా బెల్లం మహత్యం అయి ఉండచ్చు.

ఆవకాయ కాయ:
ఇలా సంబారాలన్నీ సమకూర్చుకున్నాకా, అసలు సిసలైన మామిడికాయ ఎంపిక మొదలయ్యేది. పుల్లటి పులుపు, పీచుదనం, ఏడాది పొడుగునా నిలవ ఉండే నాణ్యత ఆవకాయ కోసం వెతికే ఉత్తమ మామిడి లక్షణాలు.
కోతుల తోట అని ఓ పొలం ఉండేది మాకు. అందులో ఒకే ఒక ప్రశస్థమైన మావిడి చెట్టు ఉండేది. అది ఊరగాయల టైం కి కనీసం రెండువేల కాయ కాసేది. ఇంట్లోని నాలుగు కుటుంబాల వాళ్ళకీ విడివిడిగా జాడీలతో పెద్ద పెద్ద కుండలతో ఊరగాయ కి సరిపడా కాయ కాసేది ఆ ఒక్క చెట్టూ! ఇది కాక గోదావరి లంకలో పెద్ద మామిడి తోటే ఉండేది. బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జొన్నల రసాలు, కొబ్బరి మామిడి, ఏనుగు తలకాయ మామిడి, ఇంకా అనేక రకాక జాతుల మామిడి చెట్లు ఉండేవి. వేసంకాలం నాటికి ఈ మామిడి చెట్ల నుండి టాటాకు బుట్టలతో రకరకాల మామిడి పళ్ళు ఇంటికి వచ్చినా, ఊరగాయ కాయ మాత్రం కోతుల తోట లోని ఆ ఒక్క మామిడి చెట్టు నుండే వచ్చేది.



కాయ దింపడం:
పొడుగాటి గడకర్రకి చివర్న తాడుతో చిక్కం(తాడుతో అల్లిన బుట్టలాంటిది. పదిపన్నెండు కాయలు ఒకేసారి పట్టేవిట అందులో.) కట్టేవారు. కాయ క్రింద పడకుండా ఆ చిక్కం లోకే పడేలాగ చెట్టు నుండి వేరు చేసి కాయ కోయడం ఒక కళ. కాయ పరువుకి రావడం అనేవారు. అంటే ఇంకొక నాలుగు రోజులు ఆగితే కాయ పండిపోతుంది. అలా పరువుకి వచ్చిన కాయలు మాత్రమే ఊరగాయకి పనికి వచ్చేవి. ఆ కాయలు మరకత్తిపీటతో(ఆ కాలం పల్లెటూళ్ళలో ప్రతీ ఇంటా ఒక మరకత్తిపీట ఉండేది) ముక్కలు క్రింద కొట్టేవారు. కాయ సైజుని బట్టీ ఎనిమిది గానీ పన్నెండు గానీ ముక్కలయ్యేవి. ప్రతీ ముక్కకీ మధ్యలో డొక్క ఉండితీరాలి. అలా లేకపోతే అది ఆవకాయకి పనికిరాదు. మామిడికాయ కట్ చేసినప్పుడూ ముక్కతో పాటూ జీడి కూడా వస్తుంది కదా, ఆ జీడి, డొక్క పైపొర తీసేసి చిన్న బట్టతో ముక్కను తుడిచి రెడీ చేసేవారు. కాయ పరువానికొచ్చిందేమో, ప్రతి ముక్కా లేత పసుపు రంగులో ఉండేది. 
తెలుపుకీ, పసుపుకీ మధ్య రకం అన్నమాట. ఇక్కడికి ఆవకాయకి ముడిసరుకు రెడీ అయినట్లే. 

ఆవకాయ కలపడం:
నాపరాయితో తాపడం చేసిన అరుగు శుభ్రం చేసుకుని మిరపకాయ,ఉప్పు గుండ, ఆవపిండి పాళ్ళ ప్రకారం కలిపేసి, ఆ గుండ మధ్యలో కొత్తగా తయారయి వచ్చిన పప్పు నూనె కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు వేస్తూ గుచ్చెత్తేవారు. దీంట్లోకి ఎవరు రుచిని బట్టి వాళ్ళూ వెల్లుల్లిపాయ, మెంతులు, శనగలు, లవంగాలు కలుపుకునేవారు విడివిడిగా. లవంగాల ఆవకాయ ముఖ్యంగా రాజుల ఇళ్ళల్లో పెట్టేవారు. ఏడాది పొడుగునా ఎప్పుడు జాడీ లోంచి ఆవకాయ తీసినా మంచి లవంగాల వాసన వస్తూ ఉండటం ఈ లవంగాల ఊరగాయ ప్రత్యేకత. మా ఇంట్లో అయితే పది రకాల ఆవకాయలు పెట్టేవారు. వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లి లేనిది, పెసర ఆవకాయ, నూపప్పు ఆవకాయ, అల్లం ఆవకాయ, శనగల ఆవకాయ, సన్నావాల ఆవకాయ, పచ్చ మెరపకాయలతో పెట్టే పచ్చావకాయ(ఇది విపరీతమైన కారంగా ఉంటాయి ఈ పచ్చమిరపకాయలు), పులిహారావకాయ , బెల్లంపావకాయ.

భోజనాల దగ్గర ఊఅగాయ వడ్డించేప్పుడు ఊరిన వెల్లుల్లిపాయల కోసం పిల్లలం పోట్లాడుకుంటూన్నామని వెళ్ళూల్లిపాయలు దండగా గుచ్చి ఊఅగాయలో వేసేవారు. ఎన్నికావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మిగిలిన దండ మళ్ళీ జాడిలో వేసేసేవారు. ఊరీఊరని ఊరగాయ, వచ్చీరాని కబుర్లు ముచ్చటగా ఉంటాయని అన్నట్లుగా ఉండేది కొత్తావకాయ. పాళ్ళు సరిపోయాయా లేదా అని ఇరుగుపొరుగులు ఆవకాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఓ హాబీలా ఉండేది."

***    ***      ***

ఊరగాయల గురించి ఇదివరకూ రాసిన కబుర్లు..

* మామ్మయ్య ఊరగాయలు:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_04.html
* ఊరగాయ వైరాగ్యం:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_15.html


Friday, April 11, 2014

శిలకోల కథలు




పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు షాప్ త్వరగా మూసేసారు. అక్కడ నుండి కాస్త దూరంలో ఉన్న మరో విశాలాంధ్ర బ్రాంచ్ కు వెళ్తే అదీ మూసేసారు. అక్కడి నుండి కాళ్ళీడ్చుకుంటూ నవోదయాకు కూడా వెళ్ళాను. వాళ్ళసలు పేరే వినలేదన్నారు. ఏవో వేరే బుక్స్ కొనుక్కుని వచ్చేసా. మళ్ళీ వారం ఈసారి షాపు ఉందో లేదో కనుక్కుని విశాలాంధ్రకు వెళ్ళా. వాళ్ళూ పుస్తకం గురించి తెలీదన్నారు. మార్చ్ ఎండింగ్ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆఖరుకి మళ్ళీ కినిగె ద్వారానే తెప్పించుకున్నా పుస్తకాన్ని. కినిగె ఆర్డర్ ఓ  క్లిక్ దూరమే కానీ నే చేసిన పొరపాటు వల్ల నెట్ బ్యాంకింగ్ లో ఏదో తేడా జరిగి, శ్రీవారు చెయ్యిపెట్టి బాగుచేసేదాకా ఆగవలసి వచ్చింది. అలా కళ్ళు కాయలు కాసాకా ఈ పుస్తకం చేతికొచ్చింది. దీనితో పాటూ మరో మంచి పుస్తకం కూడా తెప్పించుకున్నా.(దాని గురించి ఇంకోసారి రాస్తాను.) ఈ "శిలకోల కథలు" మాత్రం చాలా బాగుంటాయి అని నాకెందుకో ఓ నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తోడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు మొదటి కథ చదవగానే నాకు అర్థమైపోయింది నేనో మంచి పుస్తకాన్ని చదవబోతున్నానని!


రచయిత 'మల్లిపురం జగదీశ్' ఎవరో తెలీదు నాకు. ఉత్తరాంధ్ర సాహిత్యంతో పెద్ద పరిచయమూ లేదు, అక్కడి ఆదివాసీ జీవనం గురించిన అవగాహనా లేదు. ఇదివరలో చదివిన వంశీ 'మన్యంరాణి' వల్ల గిరిజనుల ఆచారాలు, జీవనవిధానం,కట్టుబాట్ల గురించి కాస్త వివరం తెలిసింది; తర్వాత వాడ్రేవు వీరలక్ష్మి గారి 'కొండఫలం' లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించిన మూడు నాలుగు కథలు ఉన్నాయి. ఇప్పుడీ పుస్తకం  చదివితే మాత్రం ఆ గిరిజనులతో ఏం సంబంధం లేకపోయినా వారికి తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి చదువుతుంటే ఒక విధమైన ఆవేశం మనసుని కమ్మేసింది. అభివృధ్ధి ముసుగులో ఇన్ని అన్యాయాలు జరిగాకా ఏ గిరిజనుడు 'పల్లపోడిని' నమ్ముతాడు? అనిపించింది. 'ఇప్పమొగ్గలు' కథలో 'బూది' వేసిన ప్రశ్నలే నా మనసులో కూడా ప్రతిధ్వనించాయి.. 

"వీళ్ళలో చదువుకోనిదెవరు? చదువేం నేర్పింది? ఈ చదువుల్తో ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు..."

"ఛీ..వీళ్ళు మనుషులేనా? అదవిని నమ్ముకుని కొండల్లోనూ, గూడల్లోనూ నివసిస్తున్న తమ వాళ్ల పట్ల ఇంతటి నీచ భావమా? ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం.. పండో, కాయో, మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం.. కొండఫలంలోని కొంత నేస్తానికివ్వడం తమ సాంప్రదాయం. అతిధుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం తమ సంస్కారం." అంటుందామె.
'బాకుడుంబారి' కథలో 'శ్రీధర్' ప్రశ్నలు కలతపెడతాయి. ఆధునిక ప్రపంచంలో ఎన్నో అభివృధ్ధి కార్యకరమాలు జరుగుతున్నా కూడా కూడా వీళ్ళకీ పేదరికం ఏమీటి? విద్య అందుతున్నా ఇలా వెనుకబడే ఉన్నారేమిటి? ఈ ప్రాంతాల వాళ్ల భవిష్యత్తేమిటి? అని ఆవేదన కలుగుతుంది. రచయిత కథలు రాస్తే, చదివిన నా ఆవేదనని ఇలా టపా రూపంలో రాస్తే, ఈ పుస్తకం గురించి మరో నలుగురికి తెలుస్తుందనిపించింది.


అసలివి కాలక్షేపం కథలు కానే కావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులూ, వాళ్ళకు జరిగిన జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టేట్లుగా రచయిత గీసిన ఒక రేఖా చిత్రం. ప్రతి పేజీలో, ప్రతి వాక్యంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న గిరిజనుల నిస్సహాయ జీవితచిత్రాలు కనబడతాయి. ఒక్కో కథలో ఒక్కో సమస్యనూ ఎంతో వైవిధ్యంగా మనముందుంచారు జగదీశ్ గారు. అసలు కథలంటే ఏమిటి? జీవిత చిత్రాలే కదా. యదార్థానికి ప్రతిరూపాలే కదా. ఒక కథ మనసుకి హత్తుకుని రచయిత తాలూకూ భావోద్వేగాన్ని పాఠకుడు అందుకోగలిగినప్పుడు ఆ కథ సజీవమౌతుంది. అజరామరమౌతుంది. అలా లేనప్పుడు అసలు ఏ కథైనా రాసీ ప్రయోజనం ఉందదని నా అభిప్రాయం. ఈ పుస్తకంలో ప్రతీ కథా హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తుంది. ఏదైనా చేసి ఆ కథల్లోని మనుషుల వేదనను తగ్గించాలనిపిస్తుంది. నాలాగే ఈ పుస్తకం చదివినవారందరికీ అనిపిస్తే, "శిలకోల" అనే అనువైన పేరుతో జగదీశ్ చేసిన ఈ సాహితీ సృజన వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరగలదనే నమ్మకం కలిగింది.


జగదీశ్ గారి రచనా శైలి చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చిన్నవే అయినా వాటి వెనుక అర్ధాలు బోలెడున్నాయి. వాక్యాలు సున్నితంగానూ, వాడిగా కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను..

* "ఈ చరిత్రొకటి. అదెక్కడ మొదలౌతుందో కానీ ఏదీ అర్థం కాదు. ఆ మాటంటే మట్టిబుర్రలు, ఒక్కరోజైనా పుస్తకం తీస్తే అర్థమౌతుందని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు."

* "వెర్రీ గుడ్ రా... వెయ్యేళ్ళు వర్థిల్లు.." తెరలు తెరలుగా నొక్కి చెప్పారు. 
అది దీవెనో, శాపమో వాడికే అర్థం కాలేదు.

* ఆడి పెల్లి కర్సులకని పోతులు అమ్మేసాను. కొండ మీద నల్లని తల్లి మా జిలుగుసెట్టూ, సింత సెట్టూ అమ్మేసేను. ఇంకా సాల్లేదని సావుకారి కాడ అప్పు తెచ్చఏను. ఇద ఈ పొద్దు ఆడు పిల్లల్తండ్రైనాడు. ఉజ్జోగస్తుడైనాడు, గానీ అప్పు అలాగే ఉండిపోయింది. నా గోచీ ఇలాగే మిగిలిపోయింది.

* అక్కడక్కడ దిసమొలల్తో అనారోగ్యంతో నింపుకున్న పెద్దపెద్ద పొట్టల్తో ఆటలాడుకుంటున్న ఆదివాసీ బాలలు.. అభివృధ్ధికి ఆనవాళ్ళూగా...

* పింటుగాడు ఆడుతున్న రేడియో లోంచి "మంచి పోషక విలువలు గల ఆహారం" అనే అంశం మీద డాక్టర్ గారి ప్రసంగం వినిపిస్తోంది.

* వాళ్ళనక్కడ చూస్తూంటే కొండ మీద చెట్లను తెచ్చి నగరంలో నాటి నీళ్ళు చిలకరిస్తున్నట్లుంది.

* అడవి...ఎలా ఉండేది?
ఇప్పుడది ఆరిన నిప్పు.
కొండ?
కన్నీటి కుండ.

* ఈ మౌనం ఇప్పటిదా?
దీని వెనుక దాగిన కథలెన్నో!
దశాబ్దాల నాటి వ్యధలెన్నో కదా!!

ఈ వాక్యాలు చాలు ఈ కథల గురించి ఇంకేం రాయక్కర్లేదు నేను. ఇవాళ విచిత్రంగా ఈ కథల్లోని సారం అంతా ఉన్న ఒక కవిత దొరికింది. క్రింద లింక్ లో ఆ కవిత చదవవచ్చు:
శిలకోల చూపు



ఈ పుస్తకంలోని అక్షరాల్లో నాకో విచిత్రం కనబడింది. "క్ష" అక్షరానికి బదులు "ష" వత్తు పడింది. అన్నిచోట్లా! అక్షంతలు, శుభాకాంక్షలు, అక్షరం... అన్నిచోట్లా "క" క్రింద "క్ష" వత్తు బదులు "ష" వత్తు పడింది. టైప్ చేద్దామంటే ఇక్కడ రావట్లేదు నాకు. ఇది ఉద్దేశపూర్వకమో పొరపాటో తెలీలేదు నాకు!


Tuesday, April 8, 2014

తెలిసి రామ చింతనతో ...





"తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా..." అని ఇవాళ రామనామ సంకీర్తన చేయదలచి... నాలాంటి నీలమేఘశ్యామప్రియుల కోసం ఈ కీర్తనలు... 


 తెలిసి రామ చింతనతో.. 
 


 రారా మా ఇంటిదాకా..  


రఘువంశ సుధాంబుధి.. 
 














నను పాలింప నడచి వచ్చితివో.. 
 


 రామా  నన్ను బ్రోవరా...శ్రీరామా.. 
 


 రామ రామ రామ రామ...  



 మరుగేలరా..
   



 బ్రోచేవారెవరురా..
   




 రారా రాజీవలోచన రామా..  

సీతమ్మ మాయమ్మ..
   


*** *** *** 

ఇదివరకూ టపాయించిన మరికొన్ని కీర్తనలు..

నిన్నే నెర నమ్మినానురా.. 
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_19.html 


ఇక కావలసినదేమి.. 
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_07.html 


రాగ సుధా రస.. 
http://trishnaventa.blogspot.in/2010/02/blog-post_20.html

Thursday, April 3, 2014

నా స్వప్నలోకాలు.. mesmerizing tunes..




వాద్య సంగీతానికీ నాకూ ఒక నాస్టాల్జిక్ బంధం! ఊహ తెలిసిననాటి నుండీ వింటూ వచ్చిన పాశ్చాత్య వాద్య సంగీతం నాపై అమితమైన ప్రభవం చూపింది. వివరాలు, ఆర్టిస్ట్ ల పేర్లు తెలియకపోయినా నాన్న వింటూంటే కూడా వినడం, ఆ తర్వాత మళ్ళీ వినాలనిపించినప్పుడు ఫలానా కేసెట్ వెతుక్కుని మళ్ళీ వినడం నాకు అలవాటుగా ఉండేది. ఏ పని చేస్తున్నా ఏదో ఒక వాద్య సంగీతం వినడం పాటలు వినడం కన్నా ఇష్టమైన పని నాకు ఒకప్పుడు. నాన్న దగ్గర ఏ అరలో ఏ కేసెట్ ఉంది, ఏ కేసెట్లో ఏం ఉన్నాయి అనే వివరాలు నాకు తప్ప ఇంట్లో మరెవరికీ ఎక్కువ తెలీదు.


పెళ్లయ్యాకా కంప్లీట్లీ different world లోకి వెళ్పోయాను. పక్కా ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ! అసలు దాదాపు అన్నీ మర్చిపోయాను. బీథోవెన్, వివాల్డీ లు పూర్వ జన్మ స్మృతుల్లా మిగిలిపోయారు. ఇన్నేళ్లకి ఇప్పుడు సంగీతం వినడానికి ఏకాంతం దొరుకుతోంది కానీ నాన్న దగ్గర నుండి ఆ కెసేట్లు తెచ్చుకుని కాపీ చేసుకునే సమయమే ఉండట్లేదు. నిన్న సాయంత్రం వంటింట్లో పనులు చేసుకుంటూ 102.8 fm (వివిధభారతి) పెట్టేసరికీ హఠాత్తుగా  ఒక 'సింఫొనీ ఆర్కెస్ట్రా' వస్తోంది.. చెకోవ్స్కీ దేదో..! ఆ సింఫొనీ ఆర్కెస్ట్రా వరుసగా అలా వింటుంటే పూర్వ స్మృతులన్నీ ఒక్కసారిగా దుమ్ము దులుపుకుని నన్ను చుట్టుముట్టేసాయి. ఆ స్వప్నలోకాల్లో మరోసారి విహరించా...!!


నిన్న కుదర్లేదు కానీ ఇవాళ మధ్యాహ్నం ఇదివరలో కాపీ చేస్కున్న ఓ పాత సీడీ వెతుక్కుని అవన్నీ 'యూట్యూబ్' లో వెదకడం మొదలెట్టా.. కొన్ని దొరికాయి!! ఇదిగో దొరికిందే తడవు ఈ టపాలో భద్రపరిచేద్దామని రాయడం మొదలెట్టా :) వాద్య సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తప్పకుండా వినండి.. ట్యూన్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి.. ఏవో స్వప్న లోకాల్లో విహరింప చేస్తూ.. నూతన ఉత్సాహాన్ని నింపేస్తూ.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లకపోతే అడగండి!


క్రింద ఉన్నవన్నీ నేను ఒకప్పుడు చాలా చాలా ఇష్టంగా ప్రతి noteనీ ఆస్వాదిస్తు మళ్ళీ మళ్ళీ విన్నవే..

This is too good..
Richard Clayderman - Ballade Pour Adeline  


 Pan Pipe Moods - Without You
  

Kenny G - Songbird 
  

YANNI - One man's Dream
 

Yanni- If I could tell you
 


Yanni - Live at the Acropolis (Nostalgia)
  


Beethoven - Moonlight Sonata
   


Antonio Vivaldi - The Four Seasons
 

Wednesday, April 2, 2014

13 భారతీయ భాషల 'తొలి కతలు'





"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ దొరికిన కథలే తొలికతలనే గీతని నిర్ణయించి కథలను వెతికారుట. అలా వెతికి వెతికి ఒక పదమూడు భారతీయ భాషల్లోని కథలను అనువాదం చేయించి ఈ సంకలనంలో అచ్చు వేసారు. 


మిగతా భాషల్లో కన్నా తెలుగులో మొదటి కథ మీద చాలానే భిన్నాభిప్రాయాలున్నాయిట. గురజాడ గారి 'దిద్దుబాటు' కన్నా ముందు భండారు అచ్చమాంబ గారి 'ధన త్రయోదశి' కథ కాక మరో అరవై ఐదు కథలున్నాయిట తెలుగులో. మిగిలినవేమీ అచ్చులో లభ్యం కానందువల్ల ధన త్రయోదశి, దిద్దుబాటు  రెంటినీ తొలి తెలుగు కథలుగా ఎన్నుకున్నారు. ఈ పుస్తకంలో ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళం, తెలుగు, కొంకిణీ, తుళు, కశ్మీరీ మొదలైన భాషల్లోని తొలి కథలున్నాయి. అప్పటి రచయితల్లో సామాజిక స్పృహ బాగానే ఉందనీ, సామాజికమార్పుని అభిలషిస్తూ ఈ కథారచనలు చేసారనే అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. ప్రతి కథకూ ముందర ఆ కథారచయిత పరిచయం, కథ వెనుక అనువాదకుని/అనువాదకురాలు యొక్క పరిచయం కూడా ఇచ్చారు. 


పుస్తకంలో కథలన్నింటినీ క్రానాలజీ ప్రకారం ప్రచురించడం విశేషం. అలా చూస్తే భారతీయ భాషల్లో మొదటిది ఒక ఉర్దూకథ. ఆ తర్వాతది ఇరవై మూడేళ్ళ వయసులో ఠాగూర్ రాసిన 'రేవుకథ'. ఇందులో ఒక రేవు మనకు కథను చెప్తుంది. 'వారసత్వం' అనే మలయాళీ కథ తాను తీసుకున్న గోతిలో తానే పడిన ఓ దొంగ స్వగతం. ఒడియా కథ 'రేవతి', తమిళ కథ 'కుంభమేళాలో చిన్నకోడలు' రెండూ కంట తడి పెట్టిస్తాయి. తెలుగు కథలు రెండిటి భాష గ్రాంధికంగా ఉండి కాస్త చదవడానికి కష్టతరంగానే ఉంది. తుళు కథ కాస్త సరదగా ఉంది. అన్ని కథలనూ ఆయాభాషల నుండి అనువదించగా ఒక్క కాశ్మీరీ కథను మాత్రం ఇంగ్లీషు నుండి అనువదించారుట. 


ఇవన్నీ గొప్ప కథలు అని అనలేము కానీ వైవిధ్యభరితమైన కథలని అనవచ్చు.  సాహిత్యరంగంలో కథాప్రక్రియ ఊపిరి పోసుకుంటున్న తరుణంలో వెలువడ్డవి కాబట్టే వీటికి ప్రాముఖ్యత. భారతీయ భాషల్లోని తొలి కథలనేవి అసలు ఎలా ఉన్నాయి? తమ కథల ద్వారా రచయితలు చెప్పదలిచిన విషయాలు ఈ కథల్లో కనబడతాయా? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.


Tuesday, April 1, 2014

నవలానాయకులు - 4



'కౌముది' లో ప్రచురితమవుతున్న "నవలానాయకులు" శీర్షికలో ఈ నెల నవలానాయకుడు.. "అతడు"! 

అతడెవరో ఏంటో.. క్రింద లింక్ లో చదవండీ.. 
http://www.koumudi.net/Monthly/2014/april/april_2014_navalaa_nayakulu.pdf







Monday, March 31, 2014

ఉగాది శుభాకాంక్షలు



బ్లాగ్మిత్రులందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు..

Thursday, March 27, 2014

గౌతమీ గాథలు


"దేశంలో ఎన్నినదులు లేవు?ఏమిటీ హృదయబంధం?

గోదావరి ఇసుకతిన్నెలు.. పాపికొండలు.. భద్రాద్రి సీతారాములు...
గట్టెక్కిన తరువాత 
కడచిన స్నేహాల వియోగాల సలపరింపులు
సభలు, సాహిత్యాలు, వియ్యాల్లో కయ్యాలూ
కయ్యాల్లో వియ్యాలు!
రక్తంలో ప్రతి అణువూ ఒక కథ చెబుతుంది.."
అంటారొక కథలో రచయిత 'ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి'.


నిజానికివి కథలు కావు. తూర్పుగోదావరి జిల్లాలో రచయిత గడిపిన సాహిత్య జీవితానికి జ్ఞాపకాలు. ఆ అనుభవాలన్నింటికీ ఎంతో ఆసక్తికరంగా కథారూపాన్నందించారాయన. ఆ రోజుల్లో ఎందరో గొప్పగొప్ప సమకాలీన సాహితీవేత్తల స్నేహం, సహచర్యం పొందిన అదృష్టవంతులు హనుమచ్ఛాస్త్రి గారు. ఈ పుస్తకం ద్వారా ఆనాటి సంగతులు, ఆయా రచయితల తాలూకూ కబుర్లు చదవగలగడం మన అదృష్టం. ఆ కాలపు సాహిత్యవాతావరణాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. శ్రీపాద, చెళ్లపిళ్ళ, బాపిరాజు, విశ్వనాథ, పి.గణపతిశాస్త్రి, దేవులపల్లి, భమిడిపాటి మొదలైన ఎందరో మహానుభావుల కబుర్లు, ఆ స్నేహాలు, ఆప్యాయతలు, వారి సంభాషణలు చదవగలగడం నాకైతే చాలా చాలా ఆనందాన్నిచ్చింది.


కొన్నాళ్ళు ఈనాడులో ప్రచురితమయ్యాకా, ఓ ఏడాది తర్వాత ఆంధ్రజ్యోతిలో "గౌతమీ గాథలు" పేరిట ధారావాహికంగా వచ్చాయిట ఇందులోని వ్యాసాలు. మళ్ళీ దాదాపు ముఫ్ఫైఏళ్ల తరువాత క్రిందటేడు పుస్తకరూపంలో ఇవి ప్రచురితమయ్యాయి. రామచంద్రపురం బోర్డ్ నేషనల్ స్కూల్లో తెలుగు, సంస్కృతం అధ్యాపకులుగా ఉంటూ ఎన్నో అభ్యుదయోత్సవాలు, వసంతోత్సవాలు నిర్వహించారు  హనుమచ్ఛాస్త్రిగారు. "ఈ గాథలు స్వీయచరిత్రాత్మకాలు. సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులు తెలియజేస్తాయి.." అంటారు రచయిత కుమారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.


"సుమారు ఏభై ఏళ్ల క్రిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి?వాటి వెనుక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేసాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించారు? అనే బొమ్మ ఈ తరంవారికి చూపడమే నా ముఖ్యోద్దేశం.(4-3-81)" అంటారు రచయిత ముందుమాటలో. చివరలో "రౌద్రి, మాఘ బహుళ సౌమ్యవారం, మహాశివరాత్రి " అనే సంతకమే భలే పులకింతను కలిగించింది. ఈమధ్యన మరికొన్ని పుస్తకాల్లో కూడా ఇలాగే ముందుమాట చివరలో సంవత్సరం, తిథి, వారాలతో కూడిన సంతకాలు చూసి చాలా సంబరపడ్డాను.



పుస్తకంలోని కొన్ని విశేషాలు:

* శ్రీపాద వారిది 'రావణా పట్టుదల' అని కొన్ని ఉదాహరణలు చెప్తూ "ఏటికి ఎదురీత అయిన ఈ పట్టుదలతో ఆయన లోకంలో నెగ్గుకు వచ్చారంటే ఎంత ప్రాణశక్తి వచస్సారం ఖర్చుపెట్టి ఉంటారో అనిపిస్తుంది" అంటారు రచయిత. ఆయన పెట్టిన పత్రిక నడవకపోతే ఓటమినొప్పుకుని, ఆయుర్వేదం తెలుసును కాబట్టి బజార్లో ఆయుర్వేదం కొట్టు పెట్టీ చూర్ణాలు, మాత్రలు, లేహ్యాలూ అమ్మేవారుట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.


* "విస్సన్న చెప్పిన వేదం.." అని మిస్సమ్మ పాటలో వస్తుంది కదా, ఆ నానుడీ ఎలా వచ్చిందో ఓచోట చెప్పారు. 'ఇంద్రగంటి' ఊరి పేరే ఇంటిపేరయిన విస్సన్నగారి పూర్తి పేరు "ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి"ట. ఆయన కోటిపల్లి కోట నివాసి, మహా పండితుడు, గొప్ప ధర్మవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయిందిట.


* అవధానం గురించి చెప్తూ జాతీయోద్యమంతో పాటూ భావకవిత్వం జోరు ఎక్కువై అవధానాల పత్ల మోజు ఎలా తగ్గిందో, రాయప్రోలువారు, వేదుల వారు మంచి కవిత్వం వైపుకి ఎలా తిప్పారో చెప్తూ అసలు అవధానం అంటే ఏమిటి? అవధానం ఎలా చేస్తారు.. మొదలైన వివరాలు విపులంగా చెప్పడమే కాక తాను చూసిన ఒక అష్టావధానానికి చమత్కారముగా ప్రత్యక్ష్యవ్యాఖ్యానం చెప్తారు 'అవధానం' కథలో.


* 'కర్ణాట కలహం' అంటే 'కోరి పోట్లాడటం' ట. ఓసారి శ్రీపాదవారి మందుల కొట్లో జరిగిన సంభాషణ గురించి చెప్తారు రచయిత ఈ కథలో. మెట్లెక్కి వెళ్ళగానే కనబడ్డ భమిడిపాటి కామేశ్వరరావుగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, పి.గణపతి శాస్త్రిగార్లను; ఓ చేత్తో మందులు అందిస్తూనే సాహిత్య గోష్ఠిలో పాల్గొంటున్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారినీ చూస్తే అది 'మందుల కొట్టా? సాహిత్య దుకాణమా?' అని సందేహం వచ్చిందిట రచయితకు. 

కొందరు పండితులను గేలి చేస్తూ వెలువడ్డ ఓ పత్రికను చూసి కామేశ్వరరావుగారు పి.గణపతిగారికొక సలహా ఇస్తారు "పండితులను వెటకారం చెయ్యడం ఈనాటి ఫాషన్. మనకు ఏది లేదో అది ఉన్నవారి మీద అసూయ తెలియకుండానే పుట్టుకు వస్తుంది. ఈనాడు ప్రబంఢాలను తిట్టేవారంతా ముందు అవి అర్థం కాక. తర్వాత సామాజిక స్పృహ, ప్రజావళి,అవగాహన అనేవి పడికట్టు రాళ్ళు. ఆధునిక పరిజ్ఞానానికీ, సదవగాహనకీ, పండితుడవడం అడ్డు రాదు. అవి విలక్షణమైన చిత్త సంస్కారం వల్ల ఏర్పడతాయి కానీ చదువుకున్న భాష వల్ల కాదు. 
ఇంకో చమత్కారం ఉంది.. ఈ పీచు కాగితాల పత్రిక్కి గుర్తింపు కావాలి. దానికొక సంఘర్షణ లేవదియ్యాలి. మీ వంటివారు రంగం లోకి దిగితే ఇంక వారికి కావలసినదేమిటి? దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. మీరు గడుసువారయితే ఒక పని చెయ్యాలి. దీన్నీ దాని రాతల్ని ఖాతరు చెయ్యకుండా రచనల్ని జోరు చెయ్యండి. మీ పరిజ్ఞానం ఎంతటిదో, మీ అవగాహాన ఏమిటో ఋజువు చెయ్యండి. బస్ , అదే దానికి జవాబు".
కృష్ణశాస్త్రి గారు కూడా ఓ విమర్శ గురించి ఇదే మాటన్నారుట ఒకసారి.. "వారికి మేమేం జవాబు చెప్పగలం? మరింత జోరుగా, రెట్టింపు ఉత్సాహంతో వ్రాయడమే వారికి తగిన జవాబు!" అని.

ఈ ఇద్దరు పండితుల మాటలూ ఈనాటికీ ఎంతగా వర్తిస్తాయి.. అనిపించింది నాకు. 


* 'లంకలో లేడిపిల్ల', 'వ్యసనైకమత్యం', 'అల తల వల', 'రైల్వే సుందరి' కథలు ఆకట్టుకుంటాయి.


* 'ఆవకాయ మహోత్సవం' కథలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఆవకాయలు ఎలా పెడతారో చెప్పే ఘట్టం మహా సరదాగా ఉంది. చివర్లో ఆ రోజు తిన్న రకరకాల కొత్తావకాయల దెబ్బకు నిద్రపట్టక కదులుతున్న రచయితకు శ్రీపాదవారు 'ద్రాక్షారిష్టం' ఇచ్చి నిద్ర పట్టించడం నవ్వుతెప్పిస్తుంది.


* 'క్యూ' కథలో ఒక పల్లెటూరి గృహిణి స్వచ్ఛత, నిర్మలత్వం కట్టిపడేస్తాయి. రచయిత అన్నట్లే పట్నవాసపు ప్రలోభాలూ, సంపర్కాలూ కొందరి మనసుల్లోని స్వచ్ఛతని నిజంగా చంపేస్తున్నాయి అనిపిస్తుంది!


అలా అయిదేళ్ళ పాటు అమ్మ గౌతమి వద్దా, గొప్ప గొప్ప సాహితీ సంస్కారాల మధ్యన మెలిగిన తరువాత పినతల్లి పినాకిని పిలుపు అందుకుని 'సింహపురి'కి పయనమయ్యారుట హనుమచ్ఛాస్త్రి గారు. వారి అంతరంగ కథనాలని, అనుభవాలనూ మనకేమో ఈ అపురూపమైన గౌతమీ గాథల రూపంలో అందించారు. 


వారం క్రితం ఒక పుస్తకం కోసం వెళ్తే, కావాల్సినది దొరకలేదు కానీ ఇది దొరికింది. ఎలానూ గోదారమ్మ నాకు దేవకి కదా అని చటుక్కున కొనేసాను. చక్కని తెలుగు, ఇదివరకూ తెలియని కొత్త తెలుగు పదాలు ఎన్నో నేర్చుకోవడానికి దొరుకుతాయీ పుస్తకంలో. నా అంచనాకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందీ పుస్తకం!



Monday, March 24, 2014

ఆదివారం - రెండు సినిమాలు..



ఈ వారమంతా శెలవులని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అది లేకపోతే ఏమి తోచట్లేదు :( నిన్న సాయంత్రం ఆరున్నరకి అనుకున్నాం.. ఏదైనా సినిమాకెళ్దామా చాలారోజులైంది అని. లాస్ట్ 'ఉయ్యాలా జంపాల' అనుకుంటా!  సరే ఏది దొరికితే అది చూద్దాం లే అని మా ఇంటి దగ్గర్లో ఉన్న హాలుకి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ షో ఏడింటికి. మేం డిసైడై తయారయి వెళ్ళేసరికీ ఏడయ్యింది. తీరా అక్కడ ఒక్క పేరూ చూడాలని అనిపించేలా లేదు! ఉన్న నాలుగింటిలో 'రాజా రాణి' అనే పోస్టర్ కాస్త చూడబుల్ గా అనిపించి అడిగితే అది ఫస్ట్ షో లేదన్నాడు. మరేముందయ్యా అంటే.. 'భద్రమ్!' అన్నాడు. సరే ఏదో ఒకటి ఇవ్వు అని టికెట్ తీసుకుని వెళ్ళేసరికీ టైటిల్స్ పడుతున్నాయి. కానీ లాస్ట్ మినిట్ డెసిషన్ నాదే కాబట్టి.. "అసలూ తెర తీసినప్పటి నుండీ తెర పూర్తిగా పడేవరకూ చూస్తేనే సిన్మాచూడటం తాతలనాటి ఆచారం మా ఇంట్లో..." అంటూ నూటొక్కోసారి అయ్యగారిని దెప్పే చాన్స్ పోయింది!




సిన్మా సగం దాకా సస్పెన్స్ బాగానే మెయింటైన్ అయ్యింది. ఒకటి రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. నేపథ్యసంగీతం కూడా ఓకే. కానీ ఎప్పుడైతే ఇన్సురెన్స్ పాలసీ గురించి రివీలయ్యే పాయింట్ వచ్చిందో అప్పుడిక క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అయిపోయింది. అసలు అది తేలే ముందరే నాకు అర్థమైపోయింది ఇలా రిలేషన్ లేని మనుషులని కనక్ట్ చేసే పాయింట్ ఏదో ఉందన్నమాట అని! నాకిలాంటి సస్పెన్స్ సినిమాలంటే భలే సరదా! చిన్నప్పుడు(ఇప్పుడు కూడానూ:)) భయం వేస్తున్నా చెయ్యి అడ్డుపెట్టుకుని వేళ్ల సందుల్లోంచి చూసేసేదాన్ని కానీ చూడ్డం మానేదాన్ని కాదు. సో, సస్పెన్స్ బ్రేక్ అయిపోయాకా ఇంక ఇంట్రస్ట్ పోయింది. పైగా సెకెండ్ హాఫ్ చివర్లో బాగా డ్రాగ్ అయ్యింది. అసలు క్లైమాక్స్ అయితే బోర్ అనిపించింది. ప్రొఫెసర్ గారిని ఇరికించేసారు కల్ప్రిట్ ఫ్రేమ్ లో ఆఖరికి! ఇంకా నయం ఫ్రెండ్ సలీమ్ ని ఇరికించలేదు అని నవ్వుకున్నాం. హీరో పర్లేదు. హీరోయిన్ కూడా బాగానే చేసింది కానీ ఏమిటో బక్కగా ఉఫ్ అంటే ఎగిరిపోయేలా.. పాపం! పెద్ద కళ్లైనా నచ్చలే నాకు! ఫొటోగ్రఫీ బాగుంది. చాలా మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. టైటిల్స్ అయిపోయాయిగా పేరు చూడలేదు :(





రెండో సినిమా:

భద్రమ్ అయిపోయి బయటికి వస్తుంటె అన్నా.. రాజారాణి అనుకున్నాం కదా అది కూడా చూసేసి వెళ్పోదామా అని! అయ్యాగారు టికెట్స్ కొనేసారు. ఓ అరగంట టైమ్ ఉంది. ఇంటికెళ్ళి తిని రావడానికి లేదు. మా ఇంటి నుండి పది,పదిహేను కిలోమీటర్లు దూరమెళ్తే కాని టిఫిన్ సెంటర్స్ లేవు. ఇంక అక్కడే పక్కన పీజ్జా కార్నర్ ఉంటే వెళ్లాం. బహుశా మూడునాలుగేళ్ల తరువాతేమో పీజ్జా తిన్నా! ఇదివరకూ పీజ్జా బేస్ కొనుక్కొచ్చి మరీ ఇంట్లో చేసేదాన్ని!!


టైమ్ అయిపోతోందని గబగబా తినేసి మళ్ళీ హాల్లోకొచ్చాం. అసలు వీకెండ్ లో డకోటా సినిమాక్కూడా టికెట్లు దొరకవు. అలాంటిది హాల్లో బొత్తిగా ఇరవై మంది కూడా లేరు. క్రికెట్ ఎఫెక్ట్ అనుకున్నాం. కమర్షియల్ ఏడ్స్ అయిపోయి కొత్త సినిమా ట్రైలర్స్ మొదలైయ్యాయి. రెండు ట్రైలర్స్ అయ్యాకా 'రాగిణి ఎమ్మెమ్మెస్' అని సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. మళ్ళీ 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' వచ్చింది. ట్రైలర్ క్కూడా మధ్యలో ఏడ్ ఏమిటో అనుకున్నాం! ఇంతలో ఢామ్మని సినిమా మొదలైపోయింది. నాక్కాస్త కంగారేసింది. ఇదేమిటండీ ఏ సినిమా టికెట్టు కొన్నారు? అనడిగా. గబగబా హాలు ఎంట్రన్స్ దగ్గరికెళ్ళి బాబూ ఇదేం సినిమా అనడిగితే 'రాగిణి ఎమ్మెమ్మెస్' అన్నాడతను. నాకు ఇంకా కంగారేసింది. మేము ఫలానా దానికని టికెట్టడిగాం అన్నా. మా టికెట్స్ చూసి సెకెండ్ ఫ్లోర్ లోని స్క్రీన్ కి వెళ్లాలి మీరు అన్నాడు. ఇందాకా టైమ్ అయిపోయిందని స్క్రీన్ నంబర్ సరిగ్గా చూడలేదని అర్థమైంది. మేం గబగబా అసలు హాలుకి వెళ్ళేసరికీ పావుగంట ఆట అయిపోయింది :((




ఈ సినిమా టైటిల్ వేరేది పెట్టాల్సింది. సినిమా బానే ఉంది. not bad.. తప్పకుండా చూసేయక్కర్లేదు కానీ ఓసారికి చూడచ్చు. ముఖ్యంగా థీమ్ బాగుంది. తమిళ్ సినిమా కాబట్టి కొన్ని సీన్స్ కాస్త ఓవర్ అనిపించాయి. ఇద్దరు హీరోలూ పర్వాలేదు. బాగానే చేసారు. నయన తార బాగుంది కానీ క్లోజప్స్ ఎందుకో భయపెట్టాయి. సెకెండ్ హాఫ్ లో కట్టుకున్న ఓ ఎల్లో చీర చాలా నచ్చింది నాకు. ఆ రెండవ హీరోయిన్ ఎవరో కాని  బాగుంది. పెద్ద కళ్ళు, మంచి ఎక్స్ప్రెషన్స్. ఈ అమ్మాయీ సన్నంగానే ఉంది గానీ ఇందాకటి సిన్మాలో హీరోయిన్ కన్నా బాగుంది. నయన తార ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెద్ద లాజికల్ గా లేకపోయినా అందులో ఉన్న డెప్త్, రెండవ హీరో కథలో లేదు. సత్యరాజ్ పాత్ర బాగుంది. చివర్లో కూతురికి "ఇదే నీ ఇల్లు, ఇదే నీ జీవితం.." అని చెప్పడం నచ్చింది నాకు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది కమెడియన్ సంతానం. ఇతని సిన్మా గతంలో కూడా ఒకటి చూసాను. మనిషి బావుంటాడు. డైలాగ్స్ బాగా చెప్తాడు. ఈ సిన్మాకి సగం స్ట్రెంత్ ఇతని పాత్రే! ఇలాంటి యంగ్ కమెడియన్ మన తెలుగులో కూడా ఎవరైనా రాకూడదూ..రొటీన్ ఓల్డ్ రోల్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది.. అనిపించింది. మొత్తానికి ఎలాగోలా భశుం! అనిపించి ఇంటికి చేరాం.


ఏదేమైనా ఓ మంచి సినిమా చూసాం అని satisfy అయ్యేలాంటి తెలుగు సినిమా ఈమధ్యకాలంలో ఏదీ రాలేదు!



Tuesday, March 18, 2014

two new songs...



ఈ పాటలు బావున్నాయి... 
రెండింటిలో మధ్యలో వాడిన violins బాగున్నాయి... 



 Pogadhae Pogadhae  


Mouname Mouname

Saturday, March 15, 2014

ఆ పుస్తకం ఇదే.. 'అతడు - ఆమె'


క్రితం వారంలో నాకు బాగా నచ్చేసిందని ఒక పుస్తకం గురించి "in love...with this book " అని టపా రాసా కదా... ఆ పుస్తకం ఇదే.. 
డా. వుప్పల లక్ష్మణరావు గారి "అతడు - ఆమె" ! అసలు పుస్తకం చదువుతుంటే ఆ క్యారెక్టర్ల మీదా, కథ మీదా, అందులో చర్చించిన పలు అంశాల మీదా ఐదారు వ్యాసాలైనా రాయచ్చనిపించింది. అంత గొప్ప పుస్తకాన్ని ఎక్కువమంది చదివితే బాగుంటుందన్న సదుద్దేశంతో, నాకు వీలయినట్లుగా  పుస్తక పరిచయాన్ని రాసి పుస్తకం.నెట్ కి పంపించాను.. పొద్దున్న పబ్లిష్ అయ్యిందక్కడ..

క్రింద లింక్ లో ఆర్టికల్ చదవండి..



Friday, March 14, 2014

పాట వెంట పయనం : అలుక



'పాట వెంట పయనం'లో ఈసారి "అలుక" మీద పాటలు...

link:
http://wp.me/p3amQG-2pc


Wednesday, March 12, 2014

ఎపుడూ నీకు నే తెలుపనిది..




బ్లాగ్లోకం నాకిచ్చిన  అతితక్కువ స్నేహితుల్లో ఒకరు విజయజ్యోతిగారు. "మహెక్" పేరుతో అదివరకూ రాసిన బ్లాగ్ నే మళ్ళీ ఇప్పుడు "కదంబం" గా మార్చారు. ఈమధ్యన ఆ బ్లాగ్ లో పాటలు, ప్రశ్నలు చూసి డౌట్ వచ్చి "మీరేనా?" అనిడిగితే ఔనన్నారు :) తెలుగు,హిందీ పాటలు, సాహిత్యం విషయంలో మా అభిప్రాయాలు చాలా వరకు బాగా కలుస్తాయి. ఇందాకా ఆ బ్లాగ్లో నే మిస్సయిన టపాలన్నీ చదువుతుంటే "సొంతం" చిత్రంలో పాట కనబడింది. ఆ మధ్యనొకసారి ఆ పాట గురించి రాద్దామని లింక్స్ అవీ దాచి ఉంచాను గానీ బధ్ధకిస్తూ వచ్చాను... ఇప్పుడు ఆవిడ పోస్ట్ చూశాకా రాయాలనిపించి రాస్తున్నా..


"సొంతం" సినిమా నే చూడలేదు కానీ " తెలుసునా తెలుసునా.." పాట + "ఎపుడూ నీకు నే తెలపనిది"  రెండు పాటలూ చాలా బావుంటాయి. 'దేవీ శ్రీ ప్రసాద్' బెస్ట్ సాంగ్స్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన పాటలు. రెండవ పాటకు male version, female version రెండూ ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్క చెరణమే ఉంటాయి. ఈ పాట సందర్భం తెలీదు కానీ ట్యూన్ వింటుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత అర్ద్రంగా ఉంటుంది. ఆ గొప్పతనం 'సిరివెన్నెల' సాహిత్యానిది కూడానూ! రెండూ చరణాల సాహిత్యాన్ని రాస్తున్నా..


పాట: "ఎపుడూ నీకు నే తెలుపనిది.."
చిత్రం: సొంతం(2003)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
పాడినది: సుమంగళి

సాహిత్యం: 

ఎపుడూ నీకు నే తెలుపనిది 
ఇకపై ఎవరికీ తెలియనిది 
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది 
బతికే దారినే మూసి౦ది 
రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది 
హృదయ౦ బాధగా చూసి౦ది 
నిజమే నీడగా మారి౦ది 

1చ: గు౦డెలో ఆశనే తెలుపనే లేదు నా మౌన౦
చూపులో భాషనీ చదవనే లేదు నీ స్నేహ౦
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా
నేస్తమా నీ పరిచయ౦
కల కరిగి౦చేటి కన్నీటి వానే కాదా
(http://www.youtube.com/watch?v=UxmU5Ia2gOw)


2చ: జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా
జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా
ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళూ
మెలకువే రాని కలగంటూ గడపమన్నావు నూరేళ్ళూ
ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కాదా
(పాడినది: మల్లిఖార్జున్ -
https://www.youtube.com/watch?v=xUTSNzW95g0)



ఇదే ట్యూన్ ను దేవీ శ్రీ ప్రసాద్ తాను సంగీతాన్ని అందించిన మరొక తమిళ్ సినిమాలో వాడుకున్నారు. జ్యోతిక, సూర్య నటించిన "మాయావి" అనే చిత్రంలో. తమిళ్ వర్షన్ ఎలా ఉంటుందో అని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తే.. ఇంకా కడుపులోచి దు:ఖం తన్నుకు వచ్చేసింది. 

song: Kadavul thandha 
Movie: మాయావి(2005) 
Lyrics:  Palani Bharathi
Music director: Devi Sri Prasad
Singers: S.P.B Charan, Kalpana

http://www.youtube.com/watch?v=OsW3pWOJJ1k


 


 Tamil సాహిత్యం చాలా బాగుంది. అర్థాన్ని క్రింద బ్లాగ్ లో చదవండి: http://tamilthathuvarasigan.wordpress.com/2012/07/13/maayavi-kadavul-thandha-azhagiya-vazhvu/