Sunday, October 5, 2014

"మలరే మౌనమా.."



ఒకప్పుడు రికార్డ్ చేయించుకుని మరీ చాలా ఎక్కువగా విన్న తమిళ్ సాంగ్స్ లో ఒకటి.. "మలరే మౌనమా.."!! విద్యాసాగర్ అందించిన అతి మంచి పాటల్లో ఒకటి. బాలూ, జానకీ స్వరాలు ఈ పాటకి ప్రాణం అనడమే సబబు.


 ఈ పాట గురించిన కొన్ని వివరాలు.. ఒక తమిళపాటల వీరాభిమాని మాటలు క్రింద లింక్ లో చదవచ్చు... http://bharadhibimbham.blogspot.in/2006/05/malare-mounama-duet-of-this-decade-i.html


మనసుకు హాయి కమ్మేసేలాంటి ఈ పాట మరి వినేద్దామా..

 


ఈ వైరముత్తుసాహిత్యానికి అర్థం మాత్రం నాకు తెలీదు..:(
ఎవరైనా చెప్తే సంతోషం...




Wednesday, October 1, 2014

నవలానాయకులు - 10



కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సత్యచరణ్". శ్రీ బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ నవల "అరణ్యక్"కు శ్రీ సూరంపూడి సీతారామ్ గారు "వనవాసి" పేరుతో బహు చక్కని తెలుగు అనువాదాన్ని అందించారు. సౌందర్యారాధకులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైపోయేటటువంటి నవల ఇది.

క్రింద లింక్ లో వ్యాసాన్ని చదవవచ్చు:
http://www.koumudi.net/Monthly/2014/october/oct_2014_navalaa_nayakulu.pdf

Monday, September 22, 2014

ముగ్గురు కొలంబస్ లు


కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వేసుకోగలం. అలాంటి ఉల్లాసకరమైన రచనలు చెయ్యగల తెలుగు హాస్య రచయితలు బహుతక్కువ మంది ఉన్నారు. వారిలో డా.సోమరాజు సుశీల గారు ఒకరు. పూర్వం మన దర్శక,రచయిత శ్రీ జంధ్యాలగారి రచనల్లో కనిపించే సున్నితమైన వ్యంగ్యంతో కూడిన హాస్యం వీరి రచనల్లోనూ కనిపిస్తుంది. ఏ ఒక్క కథనూ చిన్న నవ్వు నవ్వకుండా, ఓ ఆలోచనలోకి దిగకుండా పూర్తిచెయ్యలేము. ఆ కథల్లో అప్పుడప్పుడూ కనబడే జీవిత సత్యాలను చదువుతుంటే ఓ కన్నీటి పొర కూడా అడ్డుపడుతుంది. రచనావ్యాసంగాన్ని ఎంతో ఆలస్యంగా మొదలుపెట్టినా, ఒక్క ఇల్లేరమ్మ కథలతోటే ఎంతో ప్రఖ్యాతి గడించి, మంచి రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో పెద్ద పీట వేసుక్కూర్చుండిపోయారు సుశీల గారు.



తన అనుభవాలతో పారిశ్రామిక కథలైన "చిన్న పరిశ్రమలు పెద్ద కథలు(1999)" , తర్వాత సుశీలగారు ఆత్మకథారూపంలో రచించిన  "ఇల్లేరమ్మ కథలు(2000)", "దీపశిఖ(2009)" ఎంతో ఆదరణ పొందాయి. ప్రతి తెలుగువారింటా తప్పక ఉండవలసిన పుస్తకాల జాబితాలో చేరిపోవాల్సినటువంటి రచనలివి. ఇనాళ్ళకు మళ్ళీ అదే పంథాలో రచించిన "ముగ్గురు కొలంబస్ లు (2014)" సాహిత్యాభిమానులందరూ చదివి తీరాల్సిన పుస్తకం. ఎంతో ఉల్లాసాన్నీ, ఆనందాన్నీ, తృప్తినీ మనకందించే పుస్తకం. "సోమరాజు సుశీల రచనలు చదువుతుంటే ఏదో అవలీలగా రాసేసారనిపిస్తుంది. కానీ చాలా ఆలోచించి, ఒకటికి రెండుసార్లు తిప్పి తిప్పి రాస్తే గానీ ఆ క్లుప్తత రాదని గ్రహించడం అంత సామాన్యం కాదు. సున్నితమైన హాస్యం తగుపాళ్ళలో మేళవించి, చిక్కటి సీరియస్ నెస్ లని పల్చని చేయడం రచయిత్రికి బాగా తెలుసు. అందుకే సోమరాజు సుశీల కథల్లో అక్షరాలు శాటిన్ మీద ముత్యాల్లా పరుగులు తీస్తాయి. డా.సోమరాజు సుశీల కథల్ని అభిమానించే చాలామంది పాఠకుల్లో నేనూ ఒక్కణ్ణి.." అంటారు శ్రీరమణగారు 'దీపశిఖ' ముందుమాటలో. నాదీ అదే మాట.


ఏవో పన్నుల్లో బిజీగా ఉండి ఈమధ్యన నెట్ ఎక్కువ చూడట్లేదు. చాలా ఆలస్యంగా ఇటీవలే పుస్తకం.నెట్ లో "ముగ్గురు కొలంబస్ లు" పుస్తకానికి జంపాల చౌదరి గారి ముందుమాట ' అంతా మనవాళ్ళే ' చదివాను. వెంఠనే నవోదయాకి ఫోన్ చేసి పుస్తకం గురించి అడిగితే రావడం, కాపీలు అయిపోవడం కూడా అయిపోయింది అన్నారు. వారమంతా రెండుమూడుమాట్లు చేస్తూనే ఉన్నాం కాపీలు తెప్పించారా? అని. ఈలోపూ నాకు తొందర ఎక్కువై మావారిని బయల్దేరదీసి జంపాలగారు తన వ్యాసంలో ఇచ్చిన "ఉమా బుక్స్, 58, న్యూ బోయినపల్లి" అడ్రసు వెతుక్కుంటూ కొలంబస్సుల్లా మేమూ వెళ్ళాం. వీధి అదే కానీ ఎక్కడా ఉమాబుక్స్ అన్న బోర్డు కనబడలే. బయట అడిగితే ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్సూ లేదన్నారు. 58 నంబరు ఇంటి సందులో అటుఇటు రెండుమూడుసార్లు తిరిగాం. నే లోపలికి వెళ్ళి అడుగుదామంటే .. రెడిడెన్స్ లాగుంది డిస్టర్బ్  చేస్తే బాగోదేమో.. అని మావారు సందేహించారు. అంత దూరం నుండీ ఉసూరంటూ వెనక్కి వచ్చేసాం. ఇంటికొచ్చాకా నాకనుమానం వచ్చి ఇల్లేరమ్మ కథలు పుస్తకం తీసి చూస్తే అది సుశీల గారి ఇంటి అడ్రసే!! అయ్యో.. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఉంటే ఆవిడని కలిసేవాళ్ళం.. అని మావారిని ఆడిపోసేసుకున్నా.. పాపం! మరో నాల్రోజులకి కాపీలు వచ్చాయని తెలిసాకా మొన్న శుక్రవారం మళ్ళీ పొలోమని మూడు బస్సులు అవీ మారి నవోదయాకెళ్ళి, ఎలాగో వెళ్లా కదా అని మరో నాలుగుపుస్తకాలు జతపరిచి ఓ ఐదు పుస్తకాలు కొని తెచ్చేసుకున్నా. మరో నాలుగడుగులేసి విశాలాంధ్రకు కూడా వెళ్దామనుకున్నా కానీ మరీ పర్సు ఖాళీ అయిపోతే పాపం మావారు చిన్నబుచ్చుకుంటారని ఆ సాహసం చెయ్యలేదు..:)


ఇంతకీ ఈ పుస్తకంలో సుశీలగారు ఏం రాసారూ అంటే.. ఆవిడా, వారి శ్రీవారు, అత్తగారూ.. ముగ్గురూ కలిసి వాళ్లమ్మాయి ఇంటికి అమెరికా వెళ్ళి వచ్చిన విధానాన్ని, అక్కడి వింతలూ విశేషాలనూ, అమెరికన్ల జీవన విధానాలనీ హాస్యభరితంగా తెలియబరిచారు. ".. చెమర్చే కన్నుల్లోవి ఏ భాష్పాలో తెలియని అయోమయంలో రోజులు గడిపేస్తున్న అమ్మానాన్నలకు.." అన్న వాక్యం చదవగానే నా కళ్ళ వెంట మా అమ్మానాన్నల కంటి తడి కదిలింది. ఒక గడియారానికి అమెరికా టైం సెట్ చేసి ప్రతి వారాంతం తమ్ముడి ఫోన్ కోసం చెవులు(కళ్ళు కాదు) కాయలు కాసే ఎదురుచూపు + వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియని సందిగ్థం.. కలగలిసిన వాళ్ల ఆత్రం.. నా మదిలో మెదిలాయి. అమెరికాలో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ పుస్తకం చదివితే ఇది తమ కథేనని తప్పకుండా ఫీల్ అవుతారు.


నామటుకు నేను ఈ పుస్తకంలో చాలా సారూప్యాల్ని వెతుక్కున్నాను. సుశీలగారిలానే పుట్టినరోజుల్ని అమితంగా ఇష్టపడడం, తెలుగు ఇంగ్లీషు రెండు పుట్టినరోజుల్ని కొత్తబట్టలతో జరుపుకోవడం, కూరల షాపింగ్ అంటే కొట్టుకుపోవడం, వండివార్చడం..భోజనం విషయాలు, మాటనేసి అయ్యో ఎందుకన్నానని తర్వాత ఫీలవ్వడం, కూతురి కబుర్లు, ముఖ్యంగా చిన్నతనంలో అమ్మని ఏడిపించిన సంఘటనలు..మాటలు.. ఇవన్నీ చదువుతుంటే అచ్చంగా నా గురించి నేనే చదువుకుంటున్న భావన. ఇక వారి అత్తగార్ని గురించి చదివితే మా అత్తగారు గుర్తొచ్చి అందరు మొగపిల్లల తల్లులూ ఇంతేనన్నమాట అనుకున్నా. వాళ్లమ్మగారి గురించి చెప్తూంటే నా పెళ్లయి వెళ్పోయాకా ఎలా ఉండేదని మా అమ్మ చెప్పేదో అవే మాటలు గుర్తొచ్చాయ్!


ఓ చోట "ఒకవేళ దైవం రక్షించకో, రక్షించో మన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైపోతే మేం ఏది లాభమనుకుంటే అటువైపు మాట్లాడచ్చు. మాకా వెసులుబాటు ఉంది.." అంటారు సుశీల గారు. మా మావగారిది కృష్ణాజిల్లా అయినా, ఆయన పదమూడే ఏటే వాళ్ల కుటుంబమంతా హైదరాబాద్ వలస వచ్చేసారు. మావారిక్కడే పెరిగడం వల్ల యాదృచ్ఛికంగా నేనూ అదేమాట అనేదాన్ని..! ఇంకా ఆవిడ శ్రీవారు ముసుగు తన్ని పడుకోవడం, దుప్పట్లోంచే రేడియో వినడం మొదలైనవి చదివితే ఆయన అచ్చంగా నాన్నకు మారురూపేమో అనుకున్నా. ఇప్పటికీ తెల్లారింది మొదలు, రాత్రి జైహింద్ చెప్పేదాకా నాన్న ట్రాన్సిస్టర్ ఆయన పక్కన మోగుతూనే ఉంటుంది. ఆబ్బబ్బా మరీ అన్నీ వినేయాలా.. కట్టేయ్ నాన్నా అని విసుక్కుంటూ ఉంటా నేను వెళ్ళినప్పుడల్లా. అనౌన్సర్ గా తన జీవితంలో మూడొంతుల భాగం రేడియో స్టేషన్లోనే గడిపారు మరి.. రేడియో వినడం ఏలా మానతారు?! ఇంక ఆయనను బయటకు తీసుకువెళ్ళాలంటే సుశీల గారు పడే పాట్లన్నీ మా అమ్మా పడుతుంది పాపం. ఆయన ఇల్లు కదిలి వెళ్ళాలంటే ప్రళయం రావాలి. అన్ని ప్రయాణాలూ రిజర్వేషన్లు చేయించుకోవడం కేన్సిల్ చేయించుకోవడం.. ఇదే పని అమ్మకి. ఇంకా సుశీల గారి అభిప్రాయాలు కొన్ని చదువుతూంటే, ఆరే..ఇలాగే కదా నేనూ అనుకునేది అనుకున్నా చాలాసార్లు. అలాగ చాలా సారూప్యాలు దొరికాయీ పుస్తకంలో నాకు.


సుశీల గారి అమ్మాయి పక్కింటి అమ్మాయి కేరెన్, ఆ అమ్మాయి చదివిన యూనివర్సిటీ మెడికల్ స్కూళ్లో మెడిసన్ చదివే కుర్రాడు, అతని తండ్రీ, ఫార్మసీ స్కూల్ డీన్ అయిన కార్పెంటర్ ఆయనా; జీన్ అనే కాంట్రాక్టర్ జీవితాలను గురించి, ఏణ్ణార్థం పిల్లని ఎంతో డీసిప్లీన్డ్ పెంచుతున్న వాళ్ళమ్మాయి గురించీ తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది.


పుస్తకం మీరు తప్పకుండా కొని చదవండి. పుస్తకంలో బాగా నచ్చిన చాలా వాక్యాలు రాయాలనున్నా.. కొన్ని వాక్యాలు మాత్రం కోట్ చేసి ఆపేస్తాను..

* "మా కన్నతల్లి తన చేతులతో చెరువుమట్టితో వినాయకుడిని చెయ్యకుండానే చవితిపండుగలు, బొమ్మల కొలువులమర్చకుండానే దసరా పండుగలూ, చుక్కల ముగ్గులు పెట్టకుండానే సంక్రాంతి పండుగలూ అలా ఎన్నో సందడి ళేకుండా వచ్చి వెళ్ళిపోవడం చూడడానికి అలవాటుపడిపోయాం."

* "మారిపోతున్న మన దేశకాల పరిస్థితుల్లో నిరాదరణకు గురౌతున్నది పెద్దవాళ్ళే. "

* " జీవితంతో పోరాడుతూ డీలా పడకుండా పదిమందికీ సంతోషాన్ని పంచుతున్న కేరన్ లాంటి అరుదైన వ్యక్తుల గురించి అనవసరపు బెంగలు పెట్టుకుణే అధికారం నాకెవరిచ్చారు?"

* "ఇంతేనా ఈ దేశం గొప్ప. ఈ మాత్రానికేనా ఇళ్ళూ వాకిళ్ళూ, అమ్మలు. నాన్నలూ, అందర్నీ వదిలేసుకుని చలికి వణుక్కుంటూ, పనులు చేసుకుంటూ, బట్టలుతుక్కుంటూ, వారానికోసారి వండుకుంటూ, పిల్లలకోసం ఆరటపడుతూ, ఉద్యోగాల కోసం జాగ్రత్తపడుతూ మెతుకు మిగల్చకుండా, డాలర్ చేజారకుండా...ఇదేనా అమెరికా జీవితం.. ఈ భాగ్యానికేనా మన దేశంలో తల్లలంతా బిడ్డలు పుట్టినప్పటినుంచీ నోములూ వ్రతాలూ చేసి వెంకటేశ్వరుడి హుండీలో చదువు బిళ్ళలేసి, కళ్ళల్లో వత్తులేసుకుని చదివించీ,ఇళ్ళువాకళ్ళు తాకట్టు పెట్టి ఇక్కడికి పంపేది? నిజమే ఇక్కడుంటే అంతా స్వాతంత్రమే. అదేమిటని అడిగే అమ్మలుండరు. ఎండుకని అడిగే అత్తలుండరు. ఆరాలు తీసే చుట్టాలుండరు. గదమాయించే పెద్దవాళ్ళుండరు."

* "వెడితే విసుక్కోకుండా అతిధ్యమివ్వగల నంబర్లు ఓ ముఫ్ఫై పైగా దొరికాయి.."

* "మన ఇండియాలో అమ్మలుంటారు, నాన్నలుంటారు, అన్నదమ్ములుంటారు, భార్యలుంటారు, భర్తలుంటారు. అక్కడ కూడా వాళ్ళంతా ఉంటారు. వీళ్ళు కాకుండా మాజీ భర్తలు, భార్యలు, భావి భర్తలు, భార్యలు, అప్పటికే వాళ్ళు కన్న పిల్లలు ఇట్లా తామరతంపరగా అనంతమయిన పరివారాలుంటాయి.."

* "దేశమేదయినా, పధ్దతులలో తేడాలున్నా మానవస్వభావం మాత్రం ఒకటే అనిపించింది."

*" కొన్ని యూనివర్సలు సత్యాలుంటాయి. అవేమిటంటే ఎక్కడున్నా అల్లుళ్ళు బంగారు తండ్రులు, కొడుకులు చవటవాజమ్మలూ... కూతుళ్ళు అపర లక్ష్మీసరస్వతి అవతారాలు..కోడళ్ళ గురించి మాట్లాడకపోవడమే శ్రేయోదాయకం. వసుదైక కుటుంబం అంటే అదే కాబోలు."

*" భూతల స్వర్గంలాంటి ప్రదేశంలో సన్నటి సెలయేటి ఒడ్డున ఒక చిన్న గూడు. అన్నపూర్ణ లాంటి భార్య. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి. ఏవరైనా ఏం చేసుకుంటారు లక్షలూ, కోట్లు.."

సుశీల గారు పుస్తకం చివర్లో రాసిన వాక్యం మాత్రం సూపర్!
విమానం దిగాకా ఎయిర్పోట్ లో ఫ్రూటీ తాగాకా..
"ఖాళీ డొక్కులు ఎక్కడ పారేయాలో తెలియక "ట్రాష్ కాన్ కహా హై" అని ఎవర్నో అడిగా. "ఎక్కడైన పడేయండి పర్వాలేదు" అంటూ ఒక తెలుగాయన కాబోలు నవ్వుతూ చెప్పాడు.
విన్నారా! మన దేశం కదా. మనిష్టవే ఇష్టం.
బోలో స్వతంత్ర భారత్ కీ జై! "

Saturday, September 20, 2014

tribute..

తెలుగువాళ్ళు గర్వించదగ్గ గొప్ప కళాకారుడు..
ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నా..:(

Wednesday, September 10, 2014

ఊ.. అన్నా... ఆ.. అన్నా...ఉలికి ఉలికి పడతావెందుకు..



 
పొద్దున్నే ఈ పాట గుర్తుకు వచ్చిందెందుకో ..:)
రేడియోలో చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం...!


వేటూరి రచన చాలా బాగుంటుంది..
చిత్రం: దారి తప్పిన మనిషి 


సంగీతం.. విజయ భాస్కర్ అని allbestsongs.comలో ఉంది..
(
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8017)

యూట్యూబ్ లింక్:

Tuesday, September 2, 2014

నవలానాయకులు - 9


కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు రావిశాస్త్రి గారి 'అల్పజీవి' సుబ్బయ్య.

వ్యాసం క్రింద లింక్ లో:
http://www.koumudi.net/Monthly/2014/september/sept_2014_navalaa_nayakulu.pdf


Sunday, August 31, 2014

ఇక హాయిగా నిద్రో..







ఇప్పుడే వార్త విన్నాను... బాపూ..

ఇన్నాళ్ళకి విముక్తి లభించిందయ్యా నీకీ భవబంధాలనుండీ.. అని చటుక్కున అనిపించింది..

నీ ఆత్మకు ఇప్పుడెంత ప్రశాంతతో కదా!

ఎంత హాయిగా.. ఎంత స్వేచ్ఛగా.. ప్రాణమిత్రుడ్ని కలవడానికి రెక్కలు కట్టుకుని నింగికెగిరి ఉంటావో కదా..

ఇన్నాళ్ళ వియోగాన్ని ఎలా భరించావో కానీ నాకు మాత్రం చెప్పలేనంత దిగులుగా ఉండేది నిన్ను వార్తల్లోనో, పేపర్లోనో చూసినప్పుడల్లా...

అబ్బా ఈ దేవుడింత నిర్దయుడేంటబ్బా.. ఇలా ఒంటరిని చేసేసి చోద్యం ఎందుకు చూస్తున్నాడా అని వాపోయేదాన్ని...

ఏమో.. ఇంకా ఏ స్వామికార్యం నీతో చేయించుకోదలిచాడో నీ రాముడు.. అనుకునేదాన్ని!

పోనీలే.. ఇప్పుడు నిమ్మళమేగా..

ఇంక బెంగెందుకు.. ఇవాళ నేను హాయిగా నిద్దరోతా.

సృష్టి 
మొత్తంలో నాకు తెలిసిన ఇద్దరే ఇద్దరు ప్రాణమిత్రులు ఇక ఒకటయ్యారని సంతోషంతో నిద్దరోతా!!


ఈ జనాలకేమన్నా పిచ్చా..

ఎందుకిలా దు:ఖపడుతున్నారు నువ్వు లేవని??

ఎవరన్నారు నువ్వు లేవనీ..

పక్కింటి లావుపాటి పిన్నిగారిలో

ఆవిడ వెనుకనే నక్కి ఉన్న సన్నపాటి మెగుడుగారిలో

వంటింట్లో అప్పడాల కర్రలో

పొరుగింటి బుడుగ్గాడిలో

ఎదురింటి సీనాగపెసూనాంబలో

కొత్తగా పెళ్ళైయ్యే రాధాగోపాళాల్లో

నీ బొమ్మలాంటి అందమైన అమ్మాయిల్లో

ఆ రైలింజను డ్రైవరులో

ఆఫీసుల్లో ఉండే విగ్గులేని యముళ్ళలో

అవకతవక కంగాళీ సినిమాల "భశుం" కార్డుల్లో..

దేవుడిగూట్లో నవ్వుతూ నిలబడ్డ రాముడిలో...

అన్నింట్లో నువ్వు కనబడుతూనే ఉంటావు కదా...!


ఇన్నింటీలో నువ్వు సజీవమేనన్న నిజం ఈ పిచ్చిజనాలకి అర్థమయినరోజు

నీ కొంటెబొమ్మల పుస్తకంలోంచి ఓ జోకు చదూకుని నవ్వేసుకుంటార్లే..

నువ్వు హాయిగా నీ నేస్తంతో ఇన్నాళ్ళు గుండె పొరల్లో దాచుకుని ఉంచిన కబుర్లన్నీ చెప్పేసుకుని..

ఇక కంటినిండా హాయిగా నిద్రో...


 

Tuesday, August 19, 2014

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు




మూడేళ్ల క్రితమనుకుంటా ఒకసారి మా పిన్ని వాళ్ళమ్మాయి చెప్పింది.. నర్సాపురంలో నా చిన్నప్పటి క్లాస్ మేట్ ప్రసూన అనీ.. ఆ అమ్మాయికి కూడా బ్లాగ్ ఉంది.. కవితలు అవీ రాస్తుంది అని. అప్పుడు చూశాను రెక్కల సవ్వడి బ్లాగ్. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. తనతో వ్యక్తిగత పరిచయంలేకున్నా అప్పట్నుంచీ బ్లాగ్ లోనే కాక వివిధ జాల పత్రికల్లో తను రాసే కవితలూ, కథలూ కూడా చదువుతూన్నా! ఈ అమ్మాయీ మంచి ఆర్టిస్ట్ కూడా. బొమ్మలు వేస్తుంది. తన కథలకి తానే బొమ్మలు వేసుకోవడం విశేషం. 'వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో తన కవితకు బహుమతి వచ్చింది.

ఒక మెట్టు పైకెళ్ళి ఈ మధ్యన ప్రసూన ఒక నవల రాసింది. 'కినిగె తెలుగు నవలల పోటీ 2014' కోసం ప్రసూన నవలను రాసింది. ముఖచిత్రం కూడా తనే వేసుకుంది. పేరేమిటంటే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". పేరు తమాషాగా ఉందే అనుకుని.. ఏమి రాసిందా అని ఆసక్తిగా నవల చదివాను. ఇట్స్ డిఫరెంట్..! రొటీన్ లవ్ స్టోరీనో, ఏదో సోషల్ మెసేజ్ ఉన్న నవలికో కాదు. ఇది మన తెలుగు భాష గురించిన కథ. ఇంగ్లీషు చదువుల వల్ల మన పిల్లలకు దూరమైపోతోందేమో అని మనం భయపడుతున్న మన తెలుగు భాష ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి ఎలా తీసుకురావచ్చో.. ఎలా పిల్లలకు తెలుగు నేర్పవచ్చో.. ఒక ఆలోచన చేసి చూపించిందీ నవలలో ప్రసూన. నూతనమైన, ఆచరయోగ్యమైన ఆలోచన.


 
మార్కులు ఎక్కువ రావనో, వేరే భాష కంపల్సరీ అనో స్కూళ్ళలో తెలుగు భాషే ఉండట్లేదు కొందరు పిల్లలకు. సెకెండ్ లాంగ్వేజ్ స్పానిష్షో, ఫ్రెంచో ఉంటున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. ఇందువల్ల ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషలూ సులువుగా వచ్చేస్తున్నాయి పిల్లలకు కానీ మనదైన తెలుగు భాష మాత్రం సరిగ్గా పలకడానికి కూడా రావట్లేదు. కొందరు పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కూడా రాదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్ని పదాలకు అర్థాలే తెలీనివాళ్ళు కొందరైతే, అసలు తెలుగు చదవడమే రాని పిల్లలు కొందరు. మా అమ్మాయి రెండో తరగతి దాకా స్టేట్ సిలబస్ అవ్వడం వల్ల అప్పటిదాకా తెలుగు సబ్జెక్ట్ ఉండేది కానీ మూడవ తరగతిలో సెంట్రల్ స్కూల్ కి మార్చాకా తనకి స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేదు. వచ్చిన కొద్దిపాటి భాషా మర్చిపోకుండా ఇంట్లో రోజూ న్యూస్ పేపర్ చదివించడం, తెలుగు కథల పుస్తకాలు కొని చదివించడం, గుణింతాలూ, వత్తులూ రాయించడం చేస్తుంటాము మేము. నేనప్పుడప్పుడు అశ్రధ్ధ వహించి వదిలేస్తున్నానని వాళ్ళ నాన్నగారు రోజూ రాత్రి పాప చదువుకునే బెడ్ టైం స్టోరీస్ తెలుగు కథలే చదవాలని రూల్ పెట్టేసారు. ఆ విధంగానైనా తెలుగు మరిచిపోకుండా ఉంటుందని, తెలుగు చదవడం అలవాటవుతుందనీ మా ప్రయత్నం. అచ్చం ఇలానే ప్రసూన కూడా తన మొదటి నవలలో కూడా పిల్లలకు తెలుగు ఎలా నేర్పచ్చు అనే ఆలోచనకి ఓ ప్రణాలికని తెలిపింది.

 
హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చందన అనే పాప ఉంటుంది. ఊరు నుండి వచ్చిన వాళ్ళ స్వామి తాతయ్యగారు అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ తెలుగు ఎలా నేర్పించారు. తాతా మనవరాలు కలిసి "తెలుగు వెన్నెల" పేరుతో తెలుగు తరగతులను నడిపించి, ఎంతోమంది పిల్లలకు తెలుగు భాష ఎలా నేర్పించారో తెలిపే కథే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". మన బిజీ స్కెడ్యూల్స్ లోంచి కాస్తంత వెసులుబాటు చేసుకుని మన పిల్లలు మాతృభాష మర్చిపోకుండా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలదే అన్నది ఈ నవలలో అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇదొక్కటే కాక పిల్లలకు నేర్పించాల్సిన చెయ్యవలసిన కొన్ని మంచి అలవాట్లు, విషయాల ప్రస్తావన కూడా కథలో ఉంది. ఇది పిల్లల నవల.. అనుకోవచ్చు. పిల్లలకు మన మాతృభాష పట్ల మక్కువ ఎలా కలిగించాలో పెద్దలకు తెలిపే నవల అనుకోవచ్చు. కథ, కథాగమనం సంగతి ఎలా ఉన్నా, ఇదొక విభిన్నమైన మంచి ప్రయత్నమని ఖచ్చితంగా చెప్పచ్చు.  కథలో తాతామనవరాళ్ల మధ్యన ఉన్న గాఢానుబంధం నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు తాతయ్యలంటే మహా ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికీ ఇరువైపుల తాతయ్యలూ ఫోటోల్లో కనిపించారు మరి :(


అయితే, ఈ "తెలుగు వెన్నెల" తరగతులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందులో అమితోత్సాహంతో పాల్గోవడం వంటివి నాకు కొధ్దిగా హైలీ ఐడియలిస్టిక్ గా అనిపించాయి. ఈకాలంలో అసలు కొందరన్నా అలా ఉంటారా అన్నది నాకు సందేహమే! ఉంటారేమో మరి..!! కథాస్థలం హైదరాబాద్ కాకుండా ఏ అమెరికానో, మరో దేశమో అయి ఉంటే పాత్రల్లో తెలుగు భాష పట్ల కనిపించిన ఇంటెన్స్ ఫీలింగ్స్ ఏప్ట్ గా అనిపించేవేమో అనిపించింది నాకు. ప్రసూనకి ఇది మొదటి ప్రయత్నం కాబట్టి కథాగమనంలో లోటుపాట్లు పట్టడం సబబు కాదనిపించింది నాకు.




నే గమనించిన.. నాకు ఇబ్బంది కలిగించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్షర దోషాలు. నవలాంశమే తెలుగు భాష నేర్చుకోవడం అయినప్పుడు మరి అందులో అక్షర దోషాలు దొర్లితే చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. వీటిని సరిచేసే పధ్ధతి ఏదైనా ఉందేమో రచయిత్రి కనుక్కుని అవన్నీ సరిచేస్తే బాగుంటుంది. ఇదొక్కటీ తప్పిస్తే.. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సందేశం బాగుంది. ఇలా ఒక ప్రణాలిక ద్వారా కాకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళం మన పిల్లలకు అప్పుడప్పుడన్నా మాతృభాష పట్ల అభిమానం ఏర్పడే ప్రయత్నాలు చేస్తూంటే బాగుంటుంది. ఈ నవల కినిగె.కాం లో లభ్యమవుతోంది.




బ్లాగ్ముఖంగా ప్రసూన చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తన నుండి ఇంకొన్ని మంచి కథానికలూ, నవలలూ రావాలని కోరుకుంటున్నాను.


Tuesday, August 12, 2014

It's all coming back to me..:-)


"కాస్త హెల్ప్ చెయచ్చు కదా... కనీసం వాటర్ బాటిల్స్ లో నీళ్ళు పట్టడం, కంచాలు, మంచినీళ్ళు పెట్టడంలాంటి చిన్నచిన్న పనులు చేయచ్చు కదా"

"అబ్బా..బోర్ అమ్మా.."

***
 

"నేను ముగ్గు పెడతా.. నువ్వు పెట్టకు "
"ఆ వంకరటింకర గీతలు బాగోట్లేదు..వద్దే.."
"ఆ...ముగ్గు పెడతా.. ఏదీ వద్దంటావ్..నువ్వింతే ఎప్పుడూ"

***

"ఈ రెండు ముద్దలు ఎక్కువయ్యాయా..? అన్నం పాడేస్తే పాపం!"
"ఇంక ఒక్క స్పూన్ కూడా నేను తినలేను. నాకు చాలు. వద్దంటే వద్దు"

***

"పాలు బలం..తాగాలి.."
"నాకు వద్దు.. వద్దంటే అంతే!"


***


"ఇవాళ్టికి పప్పు వండాను తినెయ్యవే.."

"నాకీ పప్పు వద్దు...! నాన్న ఊరెళ్తే కూర వండవామ్మా? నాన్న ఊరెళ్తే మనం అన్నం తినడం మానేయ్యాలా? "



***

"ఇవాళ ఆ కూర వండు.. పైన కొత్తిమీర చల్లు..కాడలు వెయ్యకు"

 
"అట్టు మీద ఉల్లిపాయలు వద్దు..."
 




 

"వద్దు..వెళ్ళిపో వంటింట్లోంచి.."

" ఊ.. నేను చెక్కు తీస్తా... లేకపోతే ఆ పొటాటో తరుగుతా... ఊ..."

"చెయ్యి కోసుకుంటావ్...వెళ్పో.."

"ఊ... ఎప్పుడూ వద్దంటావ్..."

***

 

"నేను చపాతీ వత్తుతా..."

"వద్దు.."

"పోనీ కాలుస్తా.."

"వద్దు!! పెద్దయితే ఎలానూ తప్పదు..ఇప్పట్నుంచీ ఎందుకే తాపత్రయం తల్లీ..."

 

 
***
 

 

"నాన్నా.. అమ్మెప్పుడూ నన్ను తిడుతుంది.."

"ఇప్పుడు నిన్ను తిట్టకపోతే.. రేపు నువ్వు పెద్దయ్యాకా నిన్నెవరూ ఏం అనరు.. నన్నందరూ తిడతారు.. మీ అమ్మ ఇలానే పెంచిందా... ఏం నేర్పలేదా అని"

 

***


"ఇంతదాకా నీక్కావాల్సింది చూశావు కదా.. రిమోట్ నాకు ఇవ్వు.."

"ఊహూ.. ఇంకొంచెం ఉంది ఉండమ్మా.."

"కొంచెం కొంచెం అని అరగంట నుంచీ నువ్వే చూస్తున్నావు.."

 

***


"నా సబ్బు నాకు కావాలి.. మీరు వేరేది వాడుకోండి.."
"...."

***


"నువ్వు కొత్త చెప్పులు కొనుక్కున్నావ్.. మరి నాకో.."

"ప్రతీదానికీ నాతో పోటీ ఏమిటే ఇప్పట్నుంచీ..."

"నాకవన్నీ తెలీదు.. నువ్వు ఏది కొనుక్కుంటే అది నాక్కూడా కొనాలంతే"

***

 

"అబ్బా.. గోల.. సౌండ్ తగ్గించు.."

"తగ్గించాను కదమ్మా... ఇంతకంటే తగ్గిస్తే బావుండదు"


***

 

"నీకేం తెలీదు ఉండమ్మా... అలా కాదు.. ఇలా చెయ్య్..."

***

ఇలా ఎన్నని రాయను? ప్రతి మాటా, అక్షరం అక్షరం...
టేప్ వెనక్కి రెవైండ్ చేసి వింటునట్లు ఉంది..
ఇప్పుడే ఏమైంది... ఫ్రెంట్ లైస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అనిపిస్తూ ఉంటుంది.. :)

నే కూడా ఇలానే అమ్మని ఎంతగా విసిగించి ఉంటానో కదా అనిపిస్తూ ఉంటుంది... నాకేనా.. అందరు అమ్మాలకూ ఇలానే అనిపిస్తుందా??
 

***

ఏమైనా.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఏ సిరులందివ్వగలవూ...
ఇదొక తియ్యని వరం కదూ..