సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, August 19, 2009

తూ.గో.ప్రయాణం _ మొదటిరోజు(కాకినాడ,బిక్కవోలు,ద్వారపూడి)

రాత్రి గౌతమీ ఎక్కాము.పాప,నేను ఇరుక్కుని పైన బెర్త్ మీద పడుకున్న మూలాన సరిగ్గా నిద్ర పట్టలేదు...మధ్యలో 3.30amకి మెలకువ వచ్చింది. క్రిందకు దిగి తలుపు దగ్గర నిలబడ్డాను.ఏదో స్టేషన్లో ఆగి ఉంది రైలు.పోర్టర్ వెళ్తూంటే అడిగాను ఏ ఊరని.."విజయవాడ" అన్నాడు.అప్పుడర్ధమైంది నాకు ఎందుకు మెలుకువ వచ్చిందో.నేను 28ఏళ్ళు ఉన్న ఊరది..నా ఊరు!!ఇక్కడ దిగిపోతే ..అనిపించింది ఒక్క క్షణం..రైలు కదిలే దాకా అక్కడే నిలబడ్డా..!ఇంక నిద్ర పట్టలేదు.
తెల్లారాకా గోదావరి బ్రిడ్జి మీంచి కొన్ని ఫొటోలు తీసాను..రైలు కాకినాడ వచ్చి ఆగింది.పాతికేళ్ళపాటు ప్రతి రెండు మూడూ నెలలకీ వెళ్ళిన ఊరది.స్టేషను రాగానే ప్రతిసారి రైలులోంచి అన్నయ్యనో,మావయ్యనో వెతికేవి మా కళ్ళు.నేను రాణీవాసం అనుభవించిన మా ఇల్లు కూడా ఉండేది ఒకప్పుడు.ఇప్పుడిక అక్కడ ఆ మనుషులూ లేరు,ఇల్లూ లేదు...బంధువులింట్లోదిగాం.రిక్షా మీద సరదాతో ఊళ్ళో అంతా రిక్షా ఎక్కి తిరిగాము.అదే రోజు బిక్కవోలు,ద్వారపూడి వెళ్ళాలనుకున్నము.బంధువులేర్పాటు చేసిన ఏ.సి.కారులో బయల్దేరాము.రైలులోని ఇరుకుసీటులో నిద్ర సరిగ్గా లేని పాప హాయిగా నిద్రోయింది కారులో.డ్రైవరు మంచి కుర్రాడు.నచ్చిన చోటల్లా ఫోటొలు తీసుకుంటానంటే కారు ఆపాడు పాపం.పచ్చని పొలాల మధ్య నుంచి కారు వెళ్తూంటే,బయటి వాతావరణానికి,స్వచ్చమైన గాలికీ మనసు పరవశించిపోయింది.

బిక్కవోలులో ఉన్నది "లక్ష్మీగణపతి స్వామివారి ఆలయం".విగ్రహం పెద్దగా ఏటవాలుగా వాలినట్లుంది.ఆకుపచ్చని కళ్ళు,నల్లని విగ్రహంతో వినాయకుడు చూడగానే ముచ్చటగా అనిపించాడు.అక్కడి విశేషం ఏమిటంటే,నిస్వార్ధమైన కోరిక ఏదైనా ఒకటి గణపతి చెవిన వేస్తే అది తప్పక తీరుతుందని నమ్మకమట! ఇక్కడ ఫోటోలు అనుమతించలేదు.బయట ఒక ఫొటో కొన్నాం కానీ ఇప్పుడిక స్కాన్ చేసే ఓపిక లేదు. ప్రశాంతత నిండిన మనసుతో అక్కడ నుంచి ద్వారపూడి బయల్దేరాం.

వీలున్న ప్రతివారు దర్శించవలసిన పుణ్య భూమి ఇది.కొన్ని ఆలయాల సముదాయమే ఈ ద్వారపూడి గుడి.
శ్రీ యస్.ఎల్.కనకరాజ్ అనే ఒకగురుస్వామిగారు ఈ దేవాలయాల సృష్టికర్త.అద్భుతమైన శిల్పాలూ,పెద్ద పెద్ద విగ్రహాలూ కన్నులవిందుగా కనపడుతూంటే భక్తితో పరవశించని మనసుండదేమో అనిపించింది. ముఖద్వారంలో పెద్ద నటరాజ విగ్రహంతో,హనుమ,వీరభద్ర విగ్రహాలతో,భూగర్భ జ్యోతిర్లింగాలతో శివాలయం;దుర్గాదేవి ఆలయం;ఆయ్యప్ప స్వామి గుడి;సాయినాధుని దివ్య మందిరం,ఆ వెనుకనే శ్రీరంగం లోని విగ్రహాన్ని పోలిన ఆనంతపద్మనాభస్వామి వారి అందమయిన విగ్రహం;పాప విమోచన ఆలయం;పంచముఖ ఆంజనేయాలయం;పెద్ద పెద్ద చూడ చక్కని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి,మహానందీశ్వరుల విగ్రహాలూ ఇక్కడ వెలసిన,చూడవలసినా దేవుళ్ళు!!అన్నింటిలోకీ పంచముఖ ఆంజనేయాలయంలో చాలా పవిత్రమైన భావన, ప్రశాంతత నిండిన వైబ్రేషన్స్ అనుభూతి చెందాను నేను...!

మొదట్లో శివాలయానికి ఫొటోలు తీయటమవగానే బ్యాట్రీలు చార్జ్ అయిపొయి ఇక ఫోటోలు తీసే వీలు లేక పోయింది.
రెండవ బ్యాట్రీసెట్ మర్చిపోయాం హడావుడిలో.బయట అమ్ముతున్న ఫోటోల సెట్ కొన్నాం కానీ ఇందాకా రాసినట్లు ఇప్పుడు వాటిని స్కాన్ తీసే ఓపిక లేదు.కాబట్టి మొదటి రోజు ప్రయాణపు ఫొటోల్లో కొన్నింటిని ఇక్కడ పెడుతున్నాను.

(రేపు రాజమండ్రి...గోదావరి కబుర్లు..!!)