సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రయాణాలు. Show all posts
Showing posts with label ప్రయాణాలు. Show all posts

Wednesday, January 8, 2014

'అలంకృత'




ఆమధ్యన వెళ్లిన ఒక నర్సరీ దారిలోనే మరికొంత దూరం వెళ్తే "అలంకృత" రిసార్ట్స్ ఉన్నాయి. స్టే కి వెళ్లకపోయినా, గార్డెన్ చూడటానికి విజిటర్స్ ని పర్మిట్ చేస్తారు. షామీర్పేట్ మండలం, తూముకుంట అనే పల్లె ప్రాంతం ఇది. మొన్నదివారం అక్కడికి వెళ్లాం. 'పచ్చందనమే పచ్చదనమే..' అన్నట్లు.. పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపైకి పాకి వేలాడుతున్నతీగెలూ, రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా ఉంది అలంకృత


అక్కడ రెండు మూడు రోజులు ఉండేవాళ్ళే కాక గార్డెన్ చూడటానికి వచ్చే విజిటర్స్ కూడా చాలామందే ఉన్నారు. నాలుగైదు రకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి లోపల. చాలా చోట్ల ధ్యాన ముద్రలో ఉన్న బుధ్ధభగవానుడి విగ్రహాలు ఆ ప్రాంతంలోని ప్రశాంతతను పెంచాయి. ఓ గంటసేపు ఆ ప్రశాంతతని ఆస్వాదించి తిరిగివచ్చేసాము.


దూరాలు వెళ్లలేని నగరవాసులకు చక్కని ఆటవిడుపు ఈ ప్రదేశం. కొన్ని ఫోటోలు..






violet lotus






ఈ పళ్ళు భలే ఉన్నాయి..










nightqueen


figs?

బాబోయ్..









Friday, July 26, 2013

నాగార్జున కొండ - ఎత్తిపోతల జలపాతం



నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి దాదాపు నెల అయిపోతోంది. ఇప్పటికన్నా బ్లాగ్ లో రాసుకోపోతే మర్చిపోతాను కూడా! జూన్ నెలాఖరులో వరంగల్ ట్రిప్ కన్న ముందరే సాగర్ వెళ్ళాము. వేటూరి గారి "జీవన రాగం" లో నాగార్జున కొండ వర్ణన చదివినప్పటి నుండీ అక్కడికి వెళ్ళాలని నా కోరిక. ఒకానొకరోజు పొద్దున్న ఎనిమిదింటికి బస్సు ఎక్కాం. మంచి డీలక్స్ బస్స్ దొరికింది. ఓ రెండు సిన్మాలు కూడా చూసాం. ఇప్పుడు ఆర్.టి.సి. బస్సులో శాటిలైట్ మూవీసేట. సరే, పన్నెండింటికి నాగార్జునసాగర్ చేరాం. బస్సు దిగాకా, చుట్టుపక్కల తిరగటానికి ఓ ఆటో మాట్లాడుకున్నాం. నాగార్జున కొండ కి వెళ్ళే మోటర్ బోటు రోజుకి రెండు ట్రిప్లు వేస్తుందిట. మధ్యాహ్నం రెండింటికి వేసేది లాస్ట్ ట్రిప్ ట. మేం చేరేసరికీ పన్నెండయ్యింది కాబట్టి భోజనం చేసి ముందు నాగార్జున కొండ కి వెళ్ళే రెండింటి బోటు ఎక్కుదామనుకున్నాం. దారిలోనే నాగార్జున డామ్ చూసేసాం. అప్పటికింకా వర్షాలు ఎక్కువగా పడట్లేదు కనుక రిజర్వాయిర్ లో నీళ్ళు లేవు.






బోట్ ఎక్కే ప్రదేశం దగ్గరే ఏ.పి.టూరిజం ఆఫీసు,గెస్ట్ హౌస్ ఉన్నాయి. ముందు కాస్త టిఫిన్ తినేసి టికెట్ కొనటానికి నుంచున్నాం. వీకెండ్స్ లొ బిజీగా ఉండే ఈ ప్రాంతానికి జనం లేకపోతే అప్పుడప్పుడు ట్రిప్ కాన్సిల్ చేస్తుంటారుట. జనాన్ని చూసే ట్కెట్లివ్వడం మొదలుపెడతారు కాబోలు. రెండున్నరకేమో టికెట్ళుచ్చారు కానీ బోట్ మూడింటికి గానీ రాలేదు. ఈలోపూ అక్కడే ఉన్న బెంచీల మీద కృష్ణమ్మని, నీలాకాశాన్ని, తెల్లని మబ్బుల్నీ చూస్తూ కూచున్నాం. మూడేళ్ళ తర్వతేమో కృష్ణమ్మని దగ్గరగా చూడ్డం.. ఆ నోళ్లని అలా చూస్తూంటే ఏదో కొత్త ప్రాణం నాలో ప్రవేశించినట్లు అనిపించింది. నాకు గోదారమ్మ దేవకి,  కృష్ణమ్మ యశోద మరి ! నల్లని నీళ్ళు..చూట్టూరా కొండలు.. ఎండవేళైనా ప్రశాంతంగా ఉంది అక్కడ. మూడింటికి మోటార్ బోటు వచ్చింది. పాపికొండలు బోట్ ట్రిప్ లాగానే ఈ నాగార్జున కొండ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్పీకర్లు,పాటలు మొదలైన హంగామా కూడా లేదు. బోటు, నీళ్ళు, గాలి హోరు, దురంగా కనబడే కొండలు, వాటిపై పచ్చదనం, ఆకాశం, మనం అంతే.






 బోటు స్టార్ట్ అయిన కాసేపటికి మా పక్కగా ఎగురుతున్న ఓ పక్షిని చూసి చాలా సరదాపడ్డాం. చూడ్డానికి గోరింకలాగ ఉంది. తెల్లని పక్షి, నల్లని తల, పొడుగాటి పసుపచ్చ ముక్కు. కానీ ఒడ్డుకి దూరంగా ఈ నీళ్ళలో అంత కష్టపడి ఎందుకు వస్తోందో తెలీలా. నీళ్ల దగ్గరగా రావడం మళ్ళీ పైకెగిరిపోవడం. తమాషా అనిపించింది. కాసేపటికి మరో నాలుగు పక్షులు కనబడ్డాయి ఇలానే ఎగురుతూ.. వాటికి ఫోటోలు తీస్తూ అలా కాసేపు గడిచాకా అవి నోళ్లు తెరుచుకు ఎగరడం గమనించాను. అప్పుడు అర్థమైంది అవి చేపల కోసం వస్తున్నాయని. నోరు తెరుచుకుని నీళ్ళ దగ్గరగా వచ్చి ఠక్కున చేపను పట్టుకుని వెళ్పోతున్నాయి. వాలటానికి ఏమీ లేని నీటి మధ్యకు వచ్చి వెతికి వెతికి అలా చేపను పట్టడం ఎంత కష్టమో అసలు..! అలా వాటిని చూస్తూండగానే నాగార్జున కొండ దగ్గర పడింది. టైం నాలుగైంది. కృష్ణానది మధ్యలో ఉన్న ఆ చిన్నద్వీపం లో ఏముందో చూడాలని మనసు తొందరపడింది.


నాగార్జునకొండ:

ఈ నాగార్జున కొండ ప్రాంతంలోనే "మహాయాన బుధ్ధిజ"మనే బౌధ్ధమత శాఖ పుట్టి పెరిగిందట. కనిష్కుల పాలనలో మహాయానబౌధ్ధమతానికి బాగా ఆదరణ ఉండేదిట.  తర్వాత ప్రముఖ బౌధ్ధాచార్యుడు 'ఆచార్య నాగార్జున' పర్యవేక్షణాలో ఈ మతం బాగా ప్రచారాన్ని పొందిందని, పూర్వం 'శ్రీపర్వత'మని పిలిచే ఈ కొండ ప్రాంతంలోనే ఆచార్యుడు నివసించారు కాబట్టి ఆయన పేరుపైనే ఈ ప్రాంతాన్ని నాగార్జున కొండ అనే పిలుస్తారు. ఈయన శాతవాహనుల కాలం వారని అంటారు. బౌధ్ధమతం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా బౌధ్ధారామాలు ఉండేవిట. కాలక్రమంలో ఆ నిర్మాణాలన్నీ కృష్ణమ్మఒడిలో చేరిపోగా కొన్ని కట్టడాలనూ, వస్తువులనూ పురావస్తు శాఖవారు త్రవ్వకాల ద్వారా వెలికి తీసి ఈ నాగార్జున కొండ మీద మ్యూజియంలో భద్రపరిచారు.


పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనం దాటి వెళ్తే లోపల మ్యూజియం ఉంది. రాతి యుగానికీ, కనిష్కులకాలానికీ ,శాతవాహనుల కాలానికి చెందిన కట్టడాల నమూనాలూ, శిల శాసనాలు, విగ్రహాలు, బౌధ్ధ నిర్మాణాలు, శకలాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. ఎప్పటివో కదా..చాలా వరకు విగ్రహాలు శిధిలమైపోయి ఉన్నాయి:( ఎంతో శ్రమ కూర్చి ఆ శిధిలాలన్నీ అక్కడికి చేరవేసినట్లు తెలుస్తోంది. లోపల కొందరు విద్యార్థులు అక్కడ కూచుని ఏవో వివరలు రాసుకుంటున్నారు కూడా. గబ గబా మ్యూజియం చూసేసి చుట్టూరా ఉన్న ఉద్యానవనం కూడా చూద్దామని బయల్దేరాం. ఓ పక్కగా మూలకి క్యాంటీన్ ఉంది. అక్కడ నుంచి కృష్ణానది వ్యూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. సూర్య కిరణాలూ, మబ్బుల వెలుగునీడలతో మిలమిలా మెరుస్తున్న నీళ్ళు, చుట్టూరా గీత గీసినట్లు ఒకే హైట్ లో ఉన్న కొండలు.. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న బెంచి మీద చాలా సేపు కూర్చుండిపోయాం.




 ఆ తర్వాత దిగువన కనబడుతున్న స్నానాలరేవు కి చేరాం. రాజుల కాలంనాటి ఆ కట్టడాలు పాడవకుండా పైన కాస్తంత ఫినిషింగ్ వర్క్ చేసి ఉంచారు మెట్లని. చాలా బాగుంది ఆ కట్టడం. అక్కడ దిగువగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళపై కూర్చుని కృష్ణమ్మనీ, ఆకాశాన్నీ, వెండిమబ్బులనీ చూస్తుంటే ఎంతసేపైనా గడిపేయచ్చనిపించింది. తిరిగి వెళ్ళేప్పుడు మాతో పాటూ మ్యూజియం సిబ్బంది కూడా వచ్చేసారు. రాత్రికి అక్కడ ఇద్దరు గార్డులు ఉంటారుట అంతే. మరి వానా వరదా వస్తే మీరంతా ఇక్కడికి ఎలా వస్తారు  అని సిబ్బందిని అడిగాం.  ఉద్యోగాలు కదా వీలయినంతవరకూ మానకుండా అలానే వస్తాం.. అన్నారు వాళ్ళు. ఐదున్నరకి బయల్దేరితే ఆరున్నరకి మళ్ళీ ఒడ్డు చేరాం.


ఎత్తిపోతల జలపాతం:


ఎలాగైనా ఈ ట్రిప్ లో ఎత్తిపోతల జలపాతం దగ్గరకు వెళ్ళాలని. బోట్ లేటుగా ప్రయాణమైనందున అన్నీ లేటయిపోయాయి. సాగర్ దగ్గర్లో ఉన్న "అనుపు" అనే ప్రదేశాన్ని కూడా చూడాలని కోరిక. కానీ చీకటి పడుతోందని ముందు ఎత్తిపొతల బయల్దేరాం. మాకు దొరికిన ఆటో అతను కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అరగంటలో ఎత్తిపోతల జలపాతం వద్దకు చేరాం. ఖాళీగా ఉంది ప్రదేశం. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ప్రతి కోతీ విచిత్రంగా పిల్లకోతుల్ని వీపుపైనో, పొట్టక్రిందో అంటిపెట్టుకుని నడుస్తున్నాయి. చంద్రవంక కొండల్లో నుండి ఈ జలపాతం ప్రవహిస్తూ వచ్చి, ఇక్కడి నుంచి కిందకు జారి కృష్ణానదిలో కలుస్తుందిట. మేం వెళ్ళేసరికీ సరిగ్గా సూర్యాస్తమయం అయ్యి చీకట్లు ముసురుతున్నాయి. గలగల మనే నీటి చప్పుడు.. జలపాతం దగ్గరపడేకొద్దీ హోరు ఎక్కువైంది. తెల్లని నీళ్ళు అలా పైనుండి జలజల పడుతుంటే భలేగా అనిపిచింది. కొద్దిగా పక్కగా మరొక చిన్న జలపాతం ఉంది. అసలు జలపాతాలే చాలా అద్భుతమైన దృశ్యాలు. ఇంతకు మునుపు చిన్న చిన్న జలపాతాలని చూశాను. అన్నింటికన్నా ఇదే పెద్దది. ఇప్పుడు అనుమతివ్వట్లేదుట గానీ ఇదివరకూ క్రిందకు వెళ్లనిచ్చేవారుట.



అక్కడ కొద్ది దురంలో దత్తాత్రేయుడి గుడి ఉంది. క్రిందకు బాగా నడవాలి. మీకు ఆలస్యమైపోతుంది పైగా చీకట్లో పాముపుట్ర ఉంటాయి. వద్దన్నాడు ఆతోఅతను. సర్లేమ్మని ఇక బస్టాండ్ కు బయల్దేరాం. మధ్యలో సత్యనారాయణస్వామి గుడి ఉంది. అక్కడ ఆగి స్వామిని దర్శించుకుని, బస్టాండ్ చేరేసరికీ ఎనిమిదవుతోంది. పొద్దున్న వచ్చేప్పుడు దొరికినట్లు డీలక్స్ బస్ దొరుకుతుందేమో అని ఎదురుచూస్తు కూర్చున్నాం. మధ్యలో రెండు మామూలు బస్సులు వచ్చాయి కానీ మేం ఎక్కలేదు. ఖాళీ అయిపోతున్నా ఆ ప్రాంతంలో కూర్చోటానిక్కూడా భయమేసింది నాకు. తొమ్మిదిన్నర దాటి పదవుతూండగా వచ్చింది డీలక్స్ బస్సు. ఊరు చేరేసరికీ ఒంటిగంట. అక్కడ్నుంచీ ఎం.బి.ఎస్ వచ్చేసరికి రెండు. మధ్యలో రెండు మూడు పోలీస్ స్టేషన్లు వస్తాయి.. భయం లేదని తను చెప్తున్నా, పార్క్ చేసిన బండి తీసుకుని ఇంటికి వెళ్తుంటే భలే భయమేసింది నాకు. దారి పొడుగునా క్షణక్షణంలో శ్రీదేవిలా దేవుడా దేవుడా.. అనుకుంటూ కూర్చున్నా:) ట్రాఫిక్ లేకపోవడం వల్ల మామూలుగా గంటపట్టే రూట్ లో అరగంటకే ఇల్లు చేరాం! 'అనుపు', ఎత్తిపోతల దగ్గరున్న 'దత్తాత్రేయస్వామి గుడి' చూట్టానికి మళ్ళీ వెళ్ళాలి.. ఎప్పటికవుతుందో...!!


ఈ ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడచ్చు:


Friday, June 28, 2013

వరంగల్ ప్రయాణం - భద్రకాళి ఆలయం


హనుమకొండలో ఉన్న వెయ్యి స్థంభాల గుడి నుండి వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి ఆటోలో పావుగంటలో చేరిపోయాం. సూర్యుడు అస్తమించే సమయం. పొద్దున్నుండీ విసిగించిన ఎండ తగ్గుమొహం పట్టింది. కొండల వల్లనేమో ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంది వేసవిలాగ. వెయ్యి స్థంభాల గుడి శిధిలాలను చూసి భారమైన మనసుతో అన్యమనస్కంగా ఉన్నాను. గుడి రెండో వైపు గేటు వద్ద మేమెక్కిన ఆటో ఆగింది. ఆ ఎంట్రన్స్ లో కుడివైపు గోడమీద నవదుర్గలు, చివర్లో గుడిలోని భద్రకాళి అమ్మవారి చిత్రాలు చాలా అందంగా పెయింట్ చేసి ఉన్నాయి. 







ఈ వైపున ముందర శిరిడీబాబాగారి గుడి ఉంది. లోనికివెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. విశాలంగా బాగా కట్టారు గుడి. బయటకు వచ్చి అమ్మవారి గుడివైపు వెళ్తుంటే ఎడమ పక్కన పూలకొట్ల వెనకాల ఏదో నది కనబడింది. ఏమిటని అడిగితే అది "భద్రకాళి చెరువు" అని చెప్పారు. నిశ్చలమైన నీళ్ళు, పైన గుంపులు గుంపులుగా తెల్లని మబ్బులు, ఇంటికెళ్పోతున్న సూర్యుడు, దూరంగా కొండలు.. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చెప్పలేను! గబగబా నాలుగు ఫోటోలు తీసేసాను.



కాస్త ముందుకి వెళ్ళగానే దూరంగా నదిలో మనుషులు కనబడ్డారు. బోటింగేమో అనుకున్నా. కానీ కాదు.. వాళ్లంతా పేద పేద్ద ధర్మోకోల్ ముక్కల మీద నిశ్శబ్దంగా కూచుని చేపలు పడుతున్న జాలరివాళ్ళు. అప్పుడప్పుడు ఓయ్.. అన్న పిలుపులూ, చిన్నచిన్న మాటలూ వినబడుతున్నాయి. అవి కూడా వినటానికి చాలా బాగున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశమేమో చెప్పలేనంత ప్రశాంతంగా మారిపోయింది మనసు.

దూరంగా అక్కడక్కడ కనిపించేది ధర్మోకోల్ మీద మనుషులు


ఇక ఈ గుడి కథ చెప్తాను. ఓసారి ఏదో పుస్తకంలో చదివాను గణేష్ రావు గారనే ఆయన కర్నాటక నుండి ఇక్కడకు వచ్చి గుడి పక్కనే చిన్న గదిలో ఉండిపోయి, శిధిలావస్థలో ఉన్న ఈ గుడిని బాగు చేసి, మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసారని. రెండేళ్ల క్రితమెప్పుడో ఆయన కాలంచేసేదాకా ఆయనే గుడి ధర్మకర్త అని. ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన ఎంతటి గొప్ప భక్తులో అదంతా రాసుకొచ్చారు. (ఎక్కడ చదివానో గుర్తురాట్లే.) so, అప్పటినుండీ ఈ గుడి చూడాలని. అసలు ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉందిట. కాకతీయుల కాలం కంటే ముందే చాళుక్యుల పాలనలో నిర్మాణం జరిగిందిట. కాకతీయుల కాలంలో మళ్ళీ వైభవంగా పూజలందుకొందిట "భద్రేశ్వరి". వాళ్ళే ఇప్పుడున్న చెరువు కూడా తవ్వించారుట. అయితే కాకతియ సామ్రాజ్య పతనం తర్వాత మళ్ళీ ప్రాభవాన్ని కోల్పోయిందిట గుడి. మళ్ళీ 1950లో గణేష్ రావు గారు పునరుధ్ధరించారు.అప్పటిదాకా అమ్మవారి విగ్రహం భయానకంగా బయటకు వేళ్లాడే నాలుకతో ఉండేదట. అప్పుడు ఆ నాలుకపై బీజాక్షరాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారుట. గుడిలో చండీ యంత్రం ప్రతిష్ఠించి, ప్రతి ఏడూ శరన్నవరాత్రులు అవి జరుపటం మొదలుపెట్టారుట. ఈ అభివృధ్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖవారు కూడా తగినంత సహాయం అందించారుట.


అసలు కాకతీయులు శివారాధకులు. అయినా అమ్మవారిని కూడా వివిధరూపాల్లో పూజించేవారుట. ఈ సంగతి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని గురించి తెలిపే "ప్రతాపరుద్ర చరిత్రము", "సిధ్ధేస్వర చ్రిత్రము", "ప్రతాపరుద్రీయమ్" అనే గ్రంధాలలో తెలుపబడిందిట. కాకతీయ శిల్పాలలో చాలాచోట్ల దుర్గ, మహిషాసురమర్దిని విగ్రహాలు కనబడతాయి. రామప్ప గుడి వద్ద ఎక్స్కవేషన్స్ లో దొరికినదని పెట్టిన ఒక మహిషాసురమర్దిని విగ్రహం చూసాం. ఇదే అది..


ఈ భద్రకాళి అమ్మవారి మహిమ తాలుకూ కథ ఒకటి విన్నాం. ప్రతాపరుద్రుని కాలంలో ఒక విద్వాంసుడు కొలువుకి వచ్చి తనని వాదనలో ఓడించమని అడిగాడుట. చివర్లో అతను "ఇవాళ ఏకాదశి,రేపు అమావస్య. కాదంటారా?" అన్నాడట. ఔనంటే ఆ పండితుడి మాట నెగ్గుతుంది. కాదని అంటే ఓడిపోతారు. అప్పుడు ఏదైతే అయ్యిందని రేపు "పౌర్ణమి" అన్నారుట. ఆ రాత్రికి ప్రతాపరుద్రుడి కొలువులోని విద్వాంసుడు భద్రకాళి ఆలయానికి వెళ్ళి దేవిని స్తుతించాడుట. తల్లి ప్రసన్నమై అతని మాటలు నిజం చేస్తానని మాట ఇచ్చిందిట. మర్నాడు రాత్రి పౌర్ణమి లాగ వెలిగిన చంద్రుడ్ని చూసి ఆ వచ్చిన పండితుడు ఇది దైవశక్తి అని ఓటమి ఒప్పుకుని  వెళ్పోయాడుట. ఆ రోజుల్లో దైవభక్తి కూడా అంత స్వచ్ఛంగా, పవర్ఫుల్ గా ఉండేది మరి! అప్పట్లో ఈ గుడి వద్ద చాలామంది ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేవారుట కూడా. భద్రకాళి చెరువుకి పక్కగా ఒక కొండ ఉండేదిట. అక్కడ ఒక గణేషుడి విగ్రహం ఉండేదిట. కాలంతరంలో కొండతో పాటుగా అది కూడా అంతరించిపోయిందిట. గుడి ఎదురుగా చిన్న కొండ మీద ఉన్న శివపార్వతుల విగ్రహాలు కూడా ప్రాచీనమైనవే అంటారు. వాటి అందం పాడుచేస్తూ తెల్లరంగు వేసారు ఎందుకో..!



గుడిలో అమ్మవారి విగ్రహం తొమ్మిదడుగుల పొడుగు, తొమ్మిదడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా ఉంది. ఎక్కువ జనం లేనందువల్ల సావకాసమైన, ప్రశాంతమైన దర్శనభాగ్యం కలిగింది. గుడి ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం, శిష్యులతో ఉన్న విగ్రహాలు బాగున్నాయి.




మరి ఆ తర్వాత, పొద్దున్నుంచీ తిరిగినతిరుగుడికి అలసిసొలసి, పొద్దున్నుంచీ తిండిలేక కడుపులో ఏనుగులు పరిగెడుతుంటే ఊళ్ళో ఉన్న మా పిన్నీవాళ్ళింటికి వెళ్పోయాం. రాత్రి లక్కీగా ఏ.సి. బస్ దొరికింది. హాయిగా బజ్జుని ఇల్లు చేరేసరికీ అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది. ఇదింకా నయం అంతకు ముందు సాగర్ వెళ్ళినప్పుడైతే అర్ధరాత్రి రెండున్నర! బండి మీదైనా అంత రాత్రి వెళ్లాలంటే నాకేమో భయం!! ఆ కథేమిటో మళ్ళీ వారం చెప్తానేం.... Happy weekend :-)

(అంటే "నాగర్జునసాగర్" ట్రిప్ కబుర్లన్న మాట.)