సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రయాణాలు. Show all posts
Showing posts with label ప్రయాణాలు. Show all posts

Thursday, June 27, 2013

వరంగల్ ప్రయాణం - వెయ్యిస్థంభాల గుడి




రామప్ప గుడి తర్వాత నేను అమితంగా చూడాలని ఉత్సాహపడినది ఈ వెయ్యిస్థంభాల గుడిని. 'హనుమకొండ' వచ్చాకా బస్సు డ్రైవరు ఓ చోట బస్సు ఆపి "ఆ కనబడేదే వెయ్యిస్థంభాల గుడి దిగండి.." అన్నాడు. మళ్ళీ ఏ ఆటో ఎక్కాలో, ఎన్ని మైళ్ళు నడవాలో అని భయపడుతున్న నాకు ఎదురుగా గుడి కనబడేసరికీ సంతోషం కలిగింది. ఇలా రోడ్డు మీదకే ఉందే గుడి అని ఆశ్చర్యం కలిగింది. 


రామప్ప గుడిలా కాక ఇది పూర్తిగా నల్ల రాతిబండలతో చెక్కబడింది. కానీ నిర్మాణం, గోడలపై పువ్వులు, శిల్పాలూ అన్ని అచ్చం రామప్ప గుడిలో మాదిరిగానే ఉన్నాయి. అక్కడ రాసి ఉన్న బోర్డులను బట్టి రామప్ప గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గుడి కట్టి ఉంటారు. శిల్పులు కూడా వాళ్ళే అయి ఉంటారు. లేదా అది కట్టే సమయంలోనే ఇది కూడా మొదలెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ గుడి ఏకంగా డెభ్భైఏళ్ళు కట్టారని విన్నాను. వివరాలడగటానికి ఇక్కడ మాకు గైడ్ ఎవరూ దొరకలేదు కూడా. కానీ ఈ గుడి బాగా శిధిలమైపోయింది. రామప్ప గుడికి కాస్త బాగానే మరమత్తులు జరిగినట్లున్నాయి కానీ ఈ గుడి దుస్థితి(ఇలానే అనాలనిపించింది) చూస్తే చాలా విచారం కలిగింది :(

అత్యంత వైభవమైన చరిత్ర గల ఈ వెయ్యి స్థంభాల గుడి గురించి, కీర్తి ప్రతిష్టల గురించీ విని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను. నెట్లో బ్రౌజింగ్ చేసి ఫోటోలు అవీ చూసేస్తే ఉత్సాహం తగ్గిపోతుందని అలా కూడా చెయ్యలేదు. అందువల్ల వెలవెలబోతున్న గుడిని చూసి చాలా విచారపడ్డాను. ఈ గుడి ముఖ్యంగా శివుడు, సూర్యభగవానుడు, విష్ణువు ఈ ముగ్గురి ఆలయాలు కలిపిన త్రికూటాలయముట. నాలుగో వైపున రామప్ప గుడిలో ఉన్నలాంటి పెద్ద నందీశ్వరుడు అదే రూపంలో, అదే దిక్కులో ఉంటాడు. మొత్తం అలంకారం, మువ్వలు, గొలుసులూ అన్నీ సేమ్ సమ్ అన్నమాట :)





ఆకాశంలో చందమామ కనిపిస్తున్నాడా?


ఇది కూడా శిధిలంగానే ఉంది :(

త్రికూటాలయాల మధ్యలో రంగ మంటపం, పై కప్పులో ఉన్న శిల్పాలు, డిజైన్, చుట్టూరా ఉన్న నాలుగు స్థంభాలు, వాటిపై ఉన్న నగిషీ మొత్తం కూడా రామప్ప గుడిలో లాంటిదే. ఈ గుడి ఎక్కువ సార్లు ఓరుగల్లుని ఆక్రమించిన సుల్తానుల దాడికి గురైనదని విన్నాను. బహుశా రామప్ప గుడి బాగా లోపలికి ఉండటం వల్ల మరీ ఇంతగా దాడికి లోనవలేదేమో! కానీ ఎంత పగులగొట్టినా మిగతా గుళ్ళు గోపురాలు లాగ పూర్తిగా మాత్రం ధ్వంసం అవ్వలేదు ఇది. చాలా పకడ్బందీగా, ఎంతో శ్రమతో కట్టినట్లు తెలుస్తోంది చూస్తుంటే. 


గుడి ముందర ఇరువైపులా ఉండవలసిన గజాలలో ఒకటే ఉంది.అది కూడా శిధిలమైపోయి ఉంది. రెండో వైపు ఏదో త్రవ్వకాల్లో దొరికిన నందీశ్వరుణ్ణి పెట్టినట్లుగా నాకు తోచింది. అంత గొప్ప నిర్మాణం చేసినవారు ఒక వైపు గజాన్ని, మరో వైపు నందిని పెట్టరు గదా.





గుడి ఆవరణలో ఉన్న పేధ్ధ రావి చెట్టు చాలా బాగుంది. నాకెందుకో చెట్లన్నింటిలోకీ రావిచెట్టు ఇష్టం. 




గుడికి కనక్ట్ అవుతు నందీశ్వరుడి వెనకాల ఒక అద్భుతమైన నాట్య మంటపం ఉండేదట. లెఖ్ఖకు చెప్పే వెయ్యి స్థంభాలు ఆ మంటపంలోని నూరుకు పైగా ఉన్న స్థంభాలతో పూర్తి అవుతాయిట. కానీ అది బాగా శిధిమైపోయిందని అక్కడో గోడ కట్టేసి పునర్నిర్మాణం జరుపుతున్నారు. మొత్తం చూడడానికి అది ఎప్పటికి పూర్తి అవుతుందో! అసలు ఎప్పటికన్నా పూర్తి చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే కాకతీయుల భవన నిర్మాణం తాలూకూ టెక్నాలజీ చాలా గట్టిది, క్లిష్టమైనది. రామప్ప గుడిలో చూశాం కదా. అలాగనే ఇదీ ఉంది కాబట్టి ఇక్కడా సేమ్ టెక్నాలజీ వాడి ఉంటారు... తడి ఇసుక, దానిపై పీఠం మొదలైనవి. అలా చెయ్యగలరో లేదో.. అలాకాక మళ్ళీ మరోలా అంటే మనవాళ్ళు ఎలా కడతారో ఏమో!! నేనా గోడవారగా వెళ్ళి గోడ వెనుకకి చెయ్యి బయటకు పెట్టి ఓ రెండు ఫోటోలు తీసాను. "ఫోటోల సంగతి దేవుడెరుగు అంత ఎత్తు మీంచి కాలు జారితే..." అని ఇంటాయన కంగారుపెట్టకపోతే ఇంకొన్ని ఫోతోలు తీద్దును. ఇంటికొచ్చాకా ఆ ఫోటోలు చూస్తే ఆ నాట్య మంటపం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. ఇలా వచ్చాయి ఆ ఫోటోలు..

Place under reconstruction

place under reconstruction

ఇంకా గుడి చుట్టూరా అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి. 




 ఓ పక్కగా శిధిలాలు, ఇంకా తలుపులు వేసేసిన ఏవో శిధిలాలు ఉన్నాయి. గుహలో ఏమో అవి..



తీర్థప్రసాదలు తీసుకుని ఓ గట్టు మీద కాసేపు కూచుని, మేం అనుకున్న చివరి మజిలీ వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి బయల్దేరాం..

(రేపు 'భద్రకాళి ఆలయం' గురించి..)



Wednesday, June 26, 2013

వరంగల్ ప్రయాణం - రామప్ప గుడి





ఈ వేసవిలో ఏ ప్రయాణాలు కుదరలేదు. ఇక శెలవులు అయిపోతుంటే రెండు షార్ట్ ట్రిప్స్ కు వెళ్ళాము. అందులో ఒకటి వరంగల్ జిల్లా ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో మూడు చారిత్రాత్మక ప్రదేశాలను మాత్రమే చూడగలిగాము. వరంగల్ కు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప గుడి, హనుమకొండలో గల వేయిస్థంభాల గుడి, వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయం.


రామప్ప గుడి ప్రయాణం:

గొప్ప శిల్పకళా నైపుణ్యం, ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఈ గుడి చూడాలన్నది నా చిరకాల కోరిక. చిన్నప్పటి నుండీ ఎన్నోసార్లు పేపర్లలో, పుస్తకాలలో ఈ గుడి గురించిన వివరాలు, నిర్మాణ విశేషాలూ చదివి నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. వరంగల్లో పిన్నీవాళ్ళు మూడేళ్ళుగా ఉంటున్నారు. బాబయ్యకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని, మేం వెళ్పోయేలోపన్నా రమ్మని పిన్ని ఎప్పటినుండో అడుగుతోంది. పుణ్యం, పురుషార్థం రెండూ కల్సివస్తాయని, ఇన్నాళ్లకైనా రామప్ప గుడి చూపించమని మావారిని బయల్దేరదీసాను. పొద్దున్నే ఏడున్నరకి రైలెక్కితే పదిన్నరకి వరంగల్లో దింపింది. "రైల్లో ఉన్నాం.. వస్తున్నాం, చూడాల్సినవన్ని చూసేసి వస్తాము.. మా కోసం ఏమీ వడద్దని.. " రైల్లోంచే పిన్నికి ఫోన్ చేసాను.

రైలు దిగి అక్కడ గేట్లో ఉన్న గార్డ్ ని వెళ్లాల్సినవాటి వివరాలు అడిగాము. రామప్ప గుడి ఓ వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. వెయ్యి స్థంభాల గుడి హనుమకొండలో ఉంది. భద్రకాళి ఆలయం ఇక్కడే ఉంది. ఈ రెండు దగ్గర దగ్గరే. కాబట్టి ముందు బస్సెక్కి రామప్ప గుడికి వెళ్పోండి. రైల్వేస్టేషన్ ఎదురుగా బస్టాండ్ ఉందని చెప్పాడు. అసలు హనుమకొండ నుండి త్వరగా వెళ్తారు. ట్రైన్ కన్నా బస్సులో హనుమకొండ వెళ్ళాల్సింది మీరు అన్నాడా గార్డ్. రైల్వే స్టేషన్ కు వెళ్ళే ముందు JBSలో ఆగి ఎంక్వైరీలో వరంగల్ బస్సులు ఇప్పుడు లేవు. హనుమకొండ బస్సు ఉంది కానీ హనుమకొండ నుండి వరంగల్ గంట ప్రయాణం అని చెప్పారు. అందుకని రైలెక్కేసాం.(వరంగల్, హనుమకొండ పక్కపక్కనే అని వెళ్లాకా కానీ తెలీలేదు మాకు.) 'అసలు ఇన్నాళ్ళుగా పిన్నీవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు కదా రైల్లో వచ్చేప్పుడన్నా అవన్నీ ఎక్కడెక్కడున్నాయో కనుక్కోవచ్చు కదా.. ఇవన్నీ వరంగల్లో ఉన్నాయి.. వరంగల్ వెళ్లాలి అనుకోవటమే గానీ  కనీసం నెట్లో అన్నా వెతకలేదు డిస్టెన్స్.. ఇప్పుడు ఎలా వెళ్లాలో, ఎప్పటికి చేరతామో..' అని నా సహజ ధోరణిలో తెగ కంగారు పడిపోయాను. సుపర్ కూల్ అయ్యగారేమో "కంగారెందుకు పడతావ్? ఏదో ఒక మార్గం దొరుకుతుంది..బస్సులు ఉంటాయిలే. కనుక్కుని వెళ్ళొద్దాం.." అని అభయమిచ్చారు. బస్టాండ్ కు వెళ్లామో లేదో 'ఏటూరినాగారం' బస్సొకటి బయల్దేరుతోంది. 'రామప్ప గుడి వైపే వెళ్తుంది. ఎక్కండి' అని చెప్తే.. అది ఎక్కేసాం. కండక్టరేమో "జంగాలపల్లి" అనే పల్లేటూరి దగ్గర బస్సు దిగి "పాలంపేట" వెళ్ళాలి మీరు. అక్కడ గుడి ఉంది. జంగాలపల్లి లో ఆటో గానీ షేరింగ్ జీప్ గాని ఎక్కాలి మీరు.. అని చెప్పాడు. మధ్యలో సుమారు ఓ గంటన్నరకి అంటే 11.45 కి జంగాలపల్లి లో మమ్మల్ని దించేసి బస్సు వెళ్పోయింది. అదో చిన్న పల్లెటూరి జంక్షన్. అటుగా వెళ్ళే షేరింగ్ ఆటోలో, షేరింగ్ జీప్ లో ఎక్కాలిట "పాలం పేట" వెళ్లడానికి.  బండి నిండే బయల్దేరరు కదా షేరింగ్ వాళ్ళు. పన్నెండింటికి ఒక జీప్ బయల్దేరింది. మధ్యలో "ములుగు" అనే పల్లెటూరు కూడా వచ్చింది. దారిలో ఇంకా ఇంకా జనం ఎక్కుతూనే ఉన్నారు. ఒక్క జీప్ లో పంచెలు,కర్రలు పట్టుకున్న 'ముసలి యువకుల'తో సహా(ముసలివాళ్లైనా భలే ఏక్టివ్ గా ఉన్నారు వాళ్ళంతా.అందుకే ముసలి యువకులు అన్నా!) మొత్తం ఇరవై మందిని కుక్కాడు డ్రైవరు. అంత ఇరుకులో, గతుకుల రోడ్డులో చిరాకుగా ఉండగా డ్రైవరు పెట్టిన "సౌందర్య లహరి.." అనే పాట విని చచ్చేంత నవ్వు వచ్చింది..:)


అరగంట తరువాత మధ్యాహ్నం12.30కి జీప్ ఓ చోట ఆపి అదిగో ఆ కనబడేదే "రామప్ప గుడి". ఈ దారి గుండా నడుచుకుపొండి.. తిరిగి వచ్చేప్పుడు వెనుకవైపు మరో దారి ఉంది. అటు రండి. అక్కడ బస్సులు దొరుకుతాయి మీకు. అదే అసలు దారి.. ఇది దగ్గరని ఇటు దింపాను" అనేసి  చెరో పది తీసుకుని వెళ్పోయాడు. జీప్ వెళ్పోయాకా ఆ సున్సాన్ ప్రదేశంలో మేం తప్ప ఎవ్వరూ లేరు! సన్నటి మట్టి రోడ్డూ, చుర్రని బోలెడు ఎండ, చుట్టూ పొలాలు.. కీచురాళ్లరొద, దూరంగా చెట్ల మధ్య నుండి సినిమా సెట్టింగా నిజమా అన్నట్టు కనబడుతున్న రామప్ప గుడి. ఏ కారులోనో వచ్చి ఉంటే సుఖంగా ప్రయాణం జరిగేది కానీ ఈ ఎడ్వంచరస్ ఎక్స్పీరియన్స్ దక్కేది కాదు కదా అనుకున్నాం. ఆంధ్రదేశంలో గొప్పగా చెప్పుకోదగ్గ ప్రఖ్యాత గుడి. ఇలా ఎక్కడో మూలన ఎవరికి పట్టనట్లు పడి ఉండేంటి? అనిపించింది. దగ్గరగా వెళ్ళే కొద్దీ గుడి వద్ద కొందరు మనుషులు కనబడ్డారు. 'హమ్మయ్య పర్వాలేదు' అని ధైర్యం వచ్చింది నాకు. గబగబా కెమేరా తీసి బ్యాట్రీలు వేసా.





ఎన్నో ఏళ్ళుగా చూడాలనుకుంటున్న చారిత్రాత్మక గుడి. దగ్గరగా చూస్తూంటే మనసు పరిపరివిధాల పోయింది.. ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో గంతులు వేసింది. ఎంత అద్భుతంగా ఉందీ!! నలభైఏళ్ళపాటు కట్టారుట. ఎంతమంది శిల్పులు, ఎంతమంది కూలీలు అహోరాత్రాలూ శ్రమించి ఉంటారు? ఎన్ని వందల ఏనుగులు ఎన్ని వందల రాళ్లను మోసి ఉంటాయి? అక్కడ ఒక గైడ్ గుడి చరిత్ర చెప్తానంటే సరేనన్నాము. ఏ.పి.టూరిజం వాళ్ళు లోకల్ మనుషులు ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నియమించారుట. గైడ్ వల్లనే ఈ గుడి విజిట్ ని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది మాకు. మొన్న ఏప్రిల్ నెలకి ఈ గుడి కట్టి ఎనిమిది వందల ఏళ్ళు అయ్యిందట. అష్టమ శతాబ్ది ఉత్సవాలు జరిగాయిట. ఆ ఉత్సవ సంచిక అతనే అమ్ముతుంటే కొన్నాము. ముఫ్ఫై రూపాయిలకి ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన ఆ పుస్తకం అపురూపంగా తోచింది నాకు. ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు గంటలు ఎలా గడిచాయో తెలీకుండా గడిచిపోయాయి.






రామప్ప గుడి విశేషాలు:

ఎనిమిదివందల ఏళ్ల క్రితం కాకతీయ రాజైన "గణపతి దేవుని" సేనాని "రేచర్ల రుద్రయ్య" నిర్మించాడు ఈ గుడి, దీని పక్కనే ఒక చెరువును. గుడి ప్రధాన శిల్పి  కర్నాటక కు చెందిన "రామప్ప". అద్భుతమైన శిలా నైపుణ్యంతో నలభైఏళ్ల పాటు ఈ గుడిని నిర్మించాడు రామప్ప. మొదట "రుద్రేశ్వరాలయం" అని పిలవబడేది కానీ తర్వాతర్వాత రామప్ప పేరు మీద రామప్ప గుడి, రామప్ప కొలను అని పిలువబడ్డాయి. గుడి ఆవరణలో రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం ఉంది. కన్నడ,తెలుగు రెండు భాషల్లోనూ లిపి ఉందిట. ఇప్పుడు బాగా కనబట్టం లేదు కానీ మండపం ఉంది. ఆ శిలాశాసనం ప్రకారం శాలివాహన శకం 1135వ సంవత్సరం, శ్రీముఖ సంవత్సరం, చైత్ర మాసం, శుక్ల పక్షం, అష్తమి తిధి, పుష్యమీ నక్షత్రం, ఆదివారం(31-3-1213 క్రీ.శ) నాటికి గుడి నిర్మాణం పూర్తయ్యిందని ఉందిట.
రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం

గుడిలోని రుద్రుడు "రామలింగేశ్వరుడు"గా పిలువబడతాడు. దక్షిణ, ఉత్తర శిల్పకళా నైపుణ్యాలు రెంటిని కలిపి కట్టించారు ఈ గుడి. గుడిపై చెక్కిన శిల్పాలు కూడా వివిధ సంస్కృతులకీ, వాస్తు, నీతి, గణిత, శృంగార, భవన శాస్రాలకీ, చరిత్రకి అద్దం పట్టేలా ఉన్నాయి. శివ, విష్ణు తత్వాల ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ రుద్రాక్షలను వైష్ణవనామాల్లా చెక్కటం అద్భుతంగా తోచింది నాకు.

శివ, విష్ణు తత్వాల ఏకత్వo

గుడి నిర్మాణానికి వాడిన శిల ఎరుపు, నలుపు రంగుల మిశ్రితం. ఆ ప్రాంతం చుట్టూరా ఉన్న కొండల్లో ఈ రకం శిలలు కనబడతాయిట. శివలింగానికీ, స్థంభాలపై ఉన్న ప్రతిమలకీ, బయట ఉన్న నందీశ్వరుడికీ, గుడి మధ్య ఉన్న రంగమండపంలో ఉన్న నాలుగు స్థంభాలకీ నల్లటి శిలను వాడారు. ఎక్కడి నుండి తెచ్చారో! అసలు ఇప్పుడు కూడా నునుపుగా ఉన్న ఆ పాలిషింగ్ కు,  ఆ డిటైల్డ్ వర్క్ కు ఏ మషీన్లు లేని అప్పటి కాలంలో ఎంత సమయం పట్టిందో! పునాదుల్లో పది, పదిహేను అడుగుల లోతు తవ్వి, అది ఇసుకతో నింపి, దానిని తడిపి, అందిపైన పీఠము వేసి, మరో లేయర్ వేసి.. అలా కట్టారుట గుడి. గుడి పై భాగంలో వాడిన ఇటుకలు నీటిలో తేలగల తేలికైన ఇటుకలుట. ఆ గోపురం బరువుకి గుడి కృంగిపోకుండా అలాంటి ఇటుకలను వాడారుట. గుడి పక్కనే ఒక చిన్న సాంపిల్ గుడిలాంటిది ఉంది. ముందు అది కట్టి ఆ మోడల్ లో ఇది కట్టారు అని గైడ్ చెప్పాడు. మరో పక్క ఉండే రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయిట. ఒకటి మాత్రం పునర్నిర్మిస్తున్నారు. ఆ గుడి తవ్వకాల్లోంచి వచ్చిన ఇసుక కుప్పలుగా పోసి ఉంది పక్కనే. ప్రధానాలయానికి మరో పక్క మరో చిన్న గుడి ఉంది. అది ప్రసాదాలు చేయటానికి వాడేవారుట.


స్థంభాలపై చెక్కిన ప్రతిమలు

ప్రసాదాలు చేయటానికి వాడేవారుట




కాకతీయుల పతనం తర్వాత ఐదువందల ఏళ్ల పాటు ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎవ్వరూ పట్టించుకొనేలేదట. ఈలోపూ దోచుకునేవాళ్ళు దోచుకుని, పగులగొట్టేవారు పగులగట్టగా ఇప్పుడున్నది మిగిలిందిట. 1985 నుండీ టూరిజంవాళ్ళ పర్యవేక్షణలో ఉందిట. గుడి మూడు ద్వారాల వద్ద అటు ఇటు ఉన్న స్థంభాలపై చెక్కిన పన్నెండు నల్లటి శిల్పాలు అప్పటి మహిళల వస్త్రాలంకారాలనూ, శిల్పి  యొక్క కళానైపుణ్యాన్నీ చూపుతాయి. ఎలా చెక్కారో గానీ ఒక శిల్పంపై మెడలోని హారం తాలూకూ నీడ కూడా కనబడుతుంది. శివలింగానికి ఎదురుగా బయట ఉన్న మండపంలో ఉన్న నందీశ్వరుడు కాకతీయుల శిలానైపుణ్యానికి ప్రతీక అనవచ్చు. మువ్వలు, అలంకారం, నందీశ్వరుడి కళ్ళు అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. శివాలయాల్లో అన్ని చోట్లా కనబడే నంది విగ్రహంలా కాక ఇది ప్రత్యేకంగా శివుడు పిలిస్తే లేవటానికి రెడీగా ఉన్నట్లుగా చెక్కారు. గర్భగుడి ద్వారం వద్ద పేరిణి నృత్యభంగిమల పక్కన ఒక కృష్ణవిగ్రహం ఉంది. కృష్ణుడి పక్క చెట్టు తడితే వేణువాదనలాంటి స్వరం వినిపిస్తుంది. కళ్ల నీళ్ళు వచ్చాయి అది వింటుంటే. ఇక గర్భగుడిలో శివలింగం మీద లైట్ లేకపోయినా కూడా సూర్యరశ్మి పడి వెలుతురు ఉన్నంత వరకూ లింగం కనబడుతూనే ఉంటుందిట. నిజంగా రామప్ప అనే కళాకారుడు, మహా శిల్పి ఉండి ఉంటే అంతటి అద్భుతసృష్టి చేసిన మహానుభావుడికి మొక్కాలనిపించింది. ఇటువంటి గుడికి ఎలాంటి ప్రచారం, ఆదరణ లేనందుకు బోలెడు దు:ఖం కలిగింది.



నంది మంటపం

అందులోని నందీశ్వరుడు

నమూనా గుడి


స్వరం వినబడ్డ కృష్ణవిగ్రహం ఇదే..


ఆలయం మధ్యలో ఒక రంగ మంటపం ఉంది. కాకతీయుల కాలంలో శివలింగం ముందర నాట్యానికి వాడేవారట ఆ మంటపాన్ని. గుండ్రంగా ఉన్న ఆ మంటపానికి నలువైపులా నాలుగు పెద్ద పెద్ద నల్లని స్థంభాలు, వాటిపై చెక్కిన అపురూపమైన శిల్పాలను ఎంత సేపు చూసినా తనివితీరలేదు. నిజమో కాదో తెలీదు కానీ ఈ నల్లరాతిచెక్కడాలను చూసే నారాయణ రెడ్డి గారు "ఈ నల్లని రాలలో" అనే పాట రాసారుట. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా వివిధ నాట్యభంగిమల్లో చిత్రాలు చెక్కారు. అవన్నీ గణపతిదేవిని బావమరిది అయిన "జాయపసేనాని" రాసిన "నృత్యరత్నావళి" అనే నాట్యగ్రంధం ఆధారంగా చెక్కారుట. అవన్నీ కూడా మరుగున పడిన "పేరిణి శివతాండవ నృత్యం" తాలుకూ నాట్యభంగిమలుట. సైనికులు యుధ్ధానికి వెళ్ళేప్పుడు వారిని ఉత్తేజపరచటం కోసం కాకతీయులు ఈ నృత్యప్రదర్శన జరిపించేవారుట. ప్రముఖ నాట్యాచార్యులు కీ.శే. శ్రీ నటరాజ రామకృష్ణ గారు  ఈ గుడిలో ఈ నృత్యభంగిమలు చూసి, మూడేళ్ళు అక్కడ ఉండి వాటిపై పరిశోధన చేసి మరుగునపడిపోయిన ఈ "పేరిణీ శివతాండవనృత్యాన్ని" పునరుధ్ధరించారుట. ఏభై ఏళ్లకు పైన వీరి పరిశోధన, అధ్యయనం, పుస్తకరచన నడిచిందిట. పరిశోధనానంతరం 17-2-1985 శివరాత్రినాడు రామప్పగుడిలో రుద్రుడిని అభిషేకించి, పదివేల నూనెదీపాలు వెలిగించి, తన శిష్యబృందంతో శ్రీ నటరాజ రామకృష్ణ గారు అక్కడ పేరిణి శివతాండవ నృత్య ప్రదర్శన ఇప్పించారుట. ఆయన కష్టపడి చెసిన ప్రచారానికి జనాలు తండోపతండాలుగా వచ్చారుట ఆ నృత్యాన్ని చూడటానికి.

పేరిణి శివతాండవ నృత్యభంగిమలు

రంగమంటపం నలువైపులా   స్థంభాల్లో ఒకటి
గుడి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న విరిగిన శిలలు, శిధిలాల గుట్టలూ వదిలి అసలు వెనుదిరగాలనిపించలేదు. పోగొట్టుకున్న బొమ్మేదో ఇన్నేళ్లకు దొరికినట్లు, ఇక అసలు వదిలిపెట్టలేనట్లు అనిపించింది. అప్పటికే మూడున్నరవుతోంది. ఆకలి దంచేస్తోంది. రామప్ప చెరువు చూడలేదింక. అక్కడికి దగ్గర్లో లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారుట. అది బావుంటుందిట. ఈసారెప్పుడైనా మళ్ళి వస్తే అటు వెళ్లాలి. రామప్పగుడి రెండో వైపు ద్వారం నుండి రెండు కిలోమీటర్లు నడిస్తే మెయిన్ రోడ్డు వచ్చింది. రెండు కిరాణాకొట్లు, చిన్నచిన్న పాకలు తప్ప మనుష్య సంచారం లేదా రోడ్డుపై. అదృష్టవశాత్తు ఒక ఆటో దొరికితే వంద రూపాయలకి మాట్లాడుకుని మళ్ళీ జంగాలపల్లి చేరి, హనుమకొండ బస్సు ఎక్కాం. హనుమకొండ బస్సు ఎక్కితే "వెయ్యిస్థంభల గుడి" సులువుగా చేరచ్చు అని ఆటో అబ్బాయి చెప్పాడు. హనుమకొంద వెళ్తూంటే బస్సులో పట్టిన కలత నిద్రలో ఏవేవో కోట గోడలు, నృత్యాలూ, అస్పష్ట దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి..!

గుడి ఆవరణలో శిధిలాలు 
గుడి ఆవరణలో శిధిలాలు 


('వెయ్యిస్థంభాల గుడి' గురించి రేపు...) 

Monday, April 1, 2013

వేములవాడ - నాంపల్లి





వేములవాడ:

సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రము - ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలంలో ఉంది. ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటూ... మొన్నవారాంతలో వెళ్ళివచ్చాము. ఆర్ టి.సి.బస్సులో హైదరాబాద్ నుండి సుమారు మూడున్నర గంటల ప్రయాణం. సిధ్ధిపేట, సిరిసిల్ల ల మీదుగా బస్సు వెళుతుంది. "దక్షిణ కాశీ"గా పిలవబడే వేములవాడలో  శివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి పేరుతో కొలువై, భక్తులచే "రాజన్న"గా పిలుపునందుకుంటున్నాడు. అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. వేములవాడ ఆలయం ఎంతో పురాతనమైనదిగా చెప్తారు. ఆ ప్రాంతంలో దొరికిన శిలాశాసనాలలో ఈ ఊరి పేరు "లేంబులవాటిక" అని ఉన్నదట. తర్వత అది "లేములవాడ" అయి, ఇప్పుడు "వేములవాడ" అయ్యిందిట. ఈ ఊరిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు క్రీ.శ.750 నుండీ క్రీ.శ.973 దాకా రాజ్యమేలారని అక్కడి శిలాశాసనాలు తెలుపుతాయి. పంపన, వగరాజు, భీమన మొదలైన మహాకవులు కళాపోషకులు,సాహితీప్రియులైన చాళుక్యుల ఆస్థానంలోవారేనట.






ఇక్కడి ప్రధానాలయ ప్రాంగణంలోని ధర్మకుండము ప్రముఖమైనది. ఇందులో స్నానం గ్రహచార భాధలను,సమస్త బాధలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కానీ పవిత్రమైన ఈ ధర్మకుండాన్ని భక్తులు పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు కనబడలేదు :( 

సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం, ఇంకా కాస్త పక్కగా బాల రాజేశ్వరాలయం,విఠలేశ్వరాలయం, కోటిలింగాలు, సోమేశ్వరాలయం, బాలాత్రిపురసుందరీదేవి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శివలింగానికి ఎడమ పక్కన లక్ష్మీగణపతి విగ్రహం, కుడివైపున అమ్మవారి విగ్రహం ఉన్నాయి. గుడి బయట ఊళ్ళో మరిన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో వేణుగోపాలస్వామి ఆలయం బాగా పెద్దగా కనబడింది.

మేం వెళ్లిననాడు జనం బాగా ఉన్నారు. ఊరు పన్నెండింటికి వెళ్ళాం. దర్శనం అయి బయటకు వచ్చేసరికీ రెండున్నర అయ్యింది. జనం ఉన్నా అదృష్టవశాత్తు ఆ రోజున ఎవరో పీఠాధిపతి వచ్చారు. అయన వచ్చాకా కాసేపు క్యూ నిలిపివేసారు. అందువల్ల ఆయన ఆలయంలో ఉన్నంత సేపు, వేదపఠనాల మధ్యన మాకు చక్కగా దర్శనం అయ్యింది. 






 గుడి బయట దాదాపు చాలా కొట్లలో బెల్లం అచ్చులు అమ్ముతున్నారు. స్వామివారికి మొక్కు తీర్చుకోవటానికి బెల్లం తూకం వేస్తారుట. ఇంకా గుడి చుట్టు ఆవులను,దూడలనూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. అది కూడా మొక్కేనట.

గుడి బయట ఒకామె అప్పుడే కుట్టిన విస్తరాకు




నాంపల్లి :

వేములవాడ వస్తోందనగా బస్సులోంచి ఒక చిన్న కొండ, దానిపై ఒక గుడి కనబడ్డాయి. రాజన్న దర్శనం అయ్యాకా, ఆ కొండ మీద గుడికి వెళ్దామన్నాను. వెములవాడ పక్కనే ఉన్న 'నాంపల్లి’ అనే గ్రామంలో ఆ గుడి ఉందట. 'లక్ష్మీనరసింహస్వామి' ఆలయంట. వేములవాడ దేవస్థానంవారిదేట ఆ గుడి కూడా. కొంతదాకా ఆటోలు వెళ్తాయి. తర్వాత మెట్లు ఎక్కాలి అని చెప్పారు. ఎండ విపరీతంగా ఉంది. అయినా కొండపై గుడి చూడాలనే ఉత్సాహంలో బయల్దేరాం.


view from the hill









 కొంతదాకా పైకి ఎక్కాకా కృషుడు కాళీమర్దనం చేస్తున్నట్లున్న పెద్ద నాగవిగ్రహం ఉన్న చోటన ఆటోలు ఆగుతాయి. ఆశ్చర్యం కలిగించేంతటి గొప్ప నిర్మాణం అది. చాలా అందంగా ఉంది. ప్లాన్ చేసి, కట్టిన ఇంజినీరుని తప్పక మెచ్చుకోవాలి. ఆ నాగపడగ  లోపలికి దారి ఉంది. రూపాయి టికెట్టు. టికెట్టు కనీసం ఐదు రూపాయలు చేయండి లేదా ద్వారం మూసేయండి అని ఆలయంవారు వినతిపత్రం ఇచ్చుకున్నారుట. అక్కడ మైంటైనెన్స్ కన్నా డబ్బులు మిగలాలి కదా! అక్కడ నుండీ ఈ వంద మెట్లు ఉంటాయి పైకి. మెట్లు స్టీప్ గానే ఉన్నాయి. చెప్పులు క్రింద వదిలేయటం వల్ల ఎండలో పైకెక్కటం కష్టమే అయ్యింది. ఇక్కడి నరసింహస్వామివారు స్వయంభూ ట. చలికాలంలో అయితే ఈ కొండపైకి రావటం చక్కని అనుభూతిగా మిగలగలదు.


ఇంటికొచ్చాకా నెట్లో వెతికితే ఈ గుడి విశేషాలు ఇక్కడ దొరికాయి:
http://www.youtube.com/watch?v=WA9IcbhaFpY



Monday, March 25, 2013

కోటేశ్వర్ మందిర్



ఆమధ్యన మా పాప స్కూల్ వాళ్ళు ఊళ్ళోనే ఒకచోటకి విహారయాత్రకి తీసుకువెళ్ళారు. 'ఏదో గుడి అమ్మా..చాలా బావుంది' అని చెప్పింది వచ్చాకా. నిన్న ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళాం. సికింద్రాబాద్ లో ఒక మిలటరీ ఏరియాలో కాస్త ఎత్తు మీద ఉంటుందా శివాలయం. పేరు "కోటేశ్వర్ మందిర్". ఆర్మీవాళ్ల పర్యవేక్షణలో ఎంతో శుభ్రంగా, అందంగా ఉంది ఆలయం. సువిశాలమైన ప్రదేశం, అటవీ ప్రాంతమట. మాకు కనబడలేదు కానీ అప్పుడప్పుడు నెమళ్ళు కూడా ఉంటాయట అక్కడ. 

శివలింగం ఉన్న గర్భగుడి వెనకాల వైపున ఒక గుహలో మంచు శివలింగం ఉంది. చాలా బావుంది. 'శివపురాణం'లో ఈ గుడి ప్రస్తావన ఉందిట. జనసందోహం లేని ఇలాంటి ఆలయాలకు వెళ్లతం నాకు చాలా ఇష్టం. ప్రకృతి ఒడిలో ఉన్న ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతటి ఉత్తేజాన్ని,కొత్త శక్తినీ ఇస్తుందో! 


ఆ గుడి తాలూకూ చారిత్రాత్మక చరిత్ర  క్రింద ఫోటోలో చదవవచ్చు..



గుడి తాలూకూ మిగిలిన ఫోటోలు.. అక్కడెవరూ అభ్యంతరం పెట్టలేదు.. కొందరు ఫోటోలు తీసుకుంటుంటే నేనూ మొబైల్తో తీసాను...


ఆలయం మెట్ల పక్కన ఉన్న గణేశుడు


ఈ ఇత్తడి గంటలు, గుడి వెనకాల తళతలలాడేలా తోమి బోర్లించిన ఇత్తడి బకెట్టు, ఇత్తడి పూజ సామగ్రీ ముచ్చటగొలిపాయి.


ఆలయం లోపల ఉన్న ఈ గంటలు చాలా అందంగా ఉన్నాయి..


హనుమ..

గుడి వెనకాల ఉన్న గుహ

మంచు లింగం


గర్భగుడిలో శివలింగం

గుడి పైన ఉన్న శివుని విగ్రహం


గుడి వెనకాల ఒక గేటుకి కట్టి ఉన్న చిన్నచిన్న రేకుడబ్బాల్లో సన్నజాజి తీగలు వేసారు. అన్నింటిలో చిన్నచిన్న కొమ్మలకే మొగ్గలు వచ్చి సన్నజాజిపువ్వులు ఉన్నాయి. అసలే నా ఫేవొరేట్ పువ్వులాయే.. భలే సరదా వేసింది వాటిని చూస్తే!