సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts
Showing posts with label కొన్ని పుస్తకాలు. Show all posts

Saturday, June 21, 2014

కొత్తపుస్తకాలు: 1. "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ".


                        


ఈ మధ్యన పనిమీద బజార్లోకి వెళ్ళినప్పుడు అటుగా ఉన్న పుస్తకాల షాపులోకి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొన్నాను. వాటి వివరాలు రాద్దామంటే కుదరట్లేదు..:( కొన్నింటి గురింఛైనా రాద్దామని ఇప్పుడు కూచున్నా. నేను కొనుక్కునే పుస్తకాలు మరెవరికైనా ఆసక్తికరంగా ఉండచ్చు, ఏ సమాచారమో వెతుక్కునేవారికి ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వాటి ఫోటోలు, వివరాలు బ్లాగ్ లో రాస్తూంటాను. ప్రదర్శించుకోవడానికో, ఇన్ని కొనేస్కున్నాను.. అని గొప్పగా ప్రదర్శించడానికి మాత్రం కాదు !! 


ముందు చివరగా కొన్న చిన్న పుస్తకం గురించి... 

కొన్న పుస్తకాలకి బిల్లు వేసేప్పుడు అటు ఇటు చూస్తూంటే కనబడింది ఈ పుస్తకం.. పేరు "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ". డా.దామోదరరావు గారి రచన, విశాంలాంధ్ర వారి ప్రచురణ. వెల నలభై రూపాయిలు మాత్రమే..:) ఇటువంటి పుస్తకం కోసం చాలారోజులుగా వెతుకుతున్నా నేను. చిన్నప్పుడు రేడియోలో వేసేవారు తప్పెట గుళ్ళు, యక్షగానం, బుర్ర కథ, జముకులు, వీర నాట్యం, చిందు భాగోతం మొదలైనవి. నాన్న కోసం రేడియో స్టేషన్ కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ కోసం వచ్చిన పల్లె జనాలు వాళ్ల గజ్జెలు, డప్పులు, ఆ శబ్దాలూ భలే విచిత్రంగా తోచేవి. వాళ్ళకు నాగరీకులతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. చాలా అమాయకంగా కనబడేవారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఈ కళారీతులను ప్రదర్శించుకుని జీవనం సాగించుకునేవారు వారు. ఆకాశవాణి వారు ప్రోగ్రాం వేసి రమ్మంటే వచ్చేవారు. రికార్డింగ్ అయిపోయాకా వెళ్పోయేవారు. కొన్ని కార్యక్రమాలని అవి ప్రదర్శించే ప్రదేశాలకు వెళ్ళి మరీ రికార్డింగ్ చేసుకుని వచ్చేవారు కూడా. నాన్న డ్యూటీలో ఉన్నప్పుడు నాన్న గొంతు వినడానికి ఆ పూట ట్రాన్స్మిషన్ అంతా వినేసేవాళ్లం. అలా కూడా నాకు కొన్ని జానపదాలతో పరిచయం ఉంది.


అది కాకుండా, ఫోక్ మ్యూజిక్ సెక్షన్ (ఎఫ్.ఎం అనేవారు) ఒకటి ఉండేది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో. దానికి కె.వి. హనుమంతరావుగారు అనే రేడియో ప్రయోక్త(ప్రొడ్యూసర్) ఉండేవారు. ఉద్యోగరీట్యానే కాక వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఈ జానపద కళారీతుల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఆయన ఎక్కడేక్కడి నుండో మారుమూల గ్రామాల్లో గాలించి కొన్ని మూలపడిపోతున్న జానపద కళారూపాల్ని ఆకాశవాణికి ఆహ్వానించి రికార్డింగ్ చేసేవారు.  ప్రజలకు అంతరించిపోతున్న ఈ కళారీతులను పరిచయం చేయడం కోసం విజయవాడ , గుంటూరు ,నెల్లూరు మొదలైన పట్నాల్లో విడివిడిగానూ, సామూహికంగానూ కూడా వీటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు హనుమంతరావుగారు. ఆ కార్యక్రమాలకు వ్యాఖ్యానం చెప్పటానికి నాన్న కూడా వెళ్ళేవారు. సామూహిక ప్రదర్శనల్లో అయితే జానపద రామాయణం, జానపద భారతం, జానపద భాగవతం అని ఈ కళారీతులన్నింటినీ కూర్చిఒక పదర్శన తయారు చేసి ప్రదర్శించేవారు. అంటే రామాయణ/భారత/భాగవతాల్లో ఒకో ఘట్టం ఒకో జానపద కళారూపం వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట! అలా అన్నీ మిక్స్ చేసి తయారుచేసిన ప్రదర్శనలు ఎంతో బాగుండేవి అని ఆ ప్రదర్శనలకు వెళ్ళి వచ్చాకా నాన్న చెప్తుండేవారు. కొన్ని విడివిడిగా ప్రదర్శించిన కళారూపాలైతే ఎప్పుడూ పేరు కూడా తెలియనివి ఉండేవిట. "రుంజ" అనే కళారీతి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందిట. మరో అపురూప కళారీతి అయితే కర్నూలు అటవీ ప్రాంతం లోనే ఉండేదిట. శ్రమకూర్చి వాళ్ళని కూడా పట్టణప్రాంతానికి తీసుకువచ్చి ప్రదర్శనలిప్పించేవారు హనుమంతరావు  గారు. 


ఆయన జానపద ప్రయోక్తగా ఉన్న కాలంలో ఢిల్లీ ఆకాశవాణి వారు ఒక ప్రతిపాదన చేసారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే జానపద కళారూపాల తాలూకూ సంగీత పరికరాలనీ, వాద్యాలనీ సేకరించి ఢిల్లీలో ఒక మ్యూజియం లో పదిలపరచాలనే ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆయన అకాల మరణానంతరం ఆ ప్రతిపాదన పూర్తయ్యిందో లేదో తెలీదు మరి. జానపద కళారీతుల గురించిన అటువంటి విశిష్ఠమైన కృషి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగింది. కొన్ని రికార్డింగ్స్ నాన్న దగ్గర ఇంకా ఉన్నాయనుకుంటా కూడా..


ఈ రకమైన పరిచయం వాల్ల కలిగిన ఆసక్తితో మన తెలుగువారి జానపద కళల గురించి మంచి పుస్తకమేదైనా దొరికితే బాగుండు అని పుస్తక ప్రదర్శనల్లో వెతుకుతూ ఉండేదాన్ని. చిన్నదైనా మొత్తానికి ఇది దొరికింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందీ అంటే.. ఒక నలభై తెలుగు జానపద కళారీతుల గురించిన సంక్షిప్త పరిచయం. ప్రాంతాల వారీగా వారి పరిచయాలు, వాటి వివరాలు, చిన్న చిన్న బొమ్మలు. అసలైతే, తెలుగునాట దాదాపు అరవై జానపద కళారూపాలు ఉన్నట్లుగా సుప్రసిధ్ధ జానపద, రంగస్థల ప్రయోక్త ఆచార్య మొదలి నాగభూషణం శర్మ తన పరిశోధన సేకరణలో తెలిపారుట. కానీ ఇప్పుడు వాటిల్లో ఎన్నో అంతరించిపోగా, కొన్నింటి పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవడం విచారకరం. ఈ జానపద కళల పరిరక్షణలో బెంగాలీ వాళ్ళకు ఉన్న శ్రధ్ధాసక్తులను మెచ్చుకుని తీరాలి.


ఈ పుస్తకంలో పరిచయం చేసిన కొన్ని జానపద కళారూపాల పేర్లు:
డప్పు నృత్యం, పులి వేషం, తప్పెట గుళ్ళు, కోలాటం, గరగలు, జంగం కథ, జముకుల కథ, కాకి పదగలు, భామా కలాపం, చిరుతల రామాయణం,  యక్షగానం, బుడబుక్కలు, చిందు భాగోతం, పిచ్చుక గుంట్లు, గురవయ్యలు.. మొదలైనవి. ఇవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ప్రదర్శించేవారు, ఎలా ఆడతారు మొదలైన వివరాలు క్లుప్తంగా ఇచ్చారన్నమాట. క్రింద కొన్ని చిత్రాలు ఉన్నాయి చూడండీ..












ఇంకా కొన్ని మంచి పుస్తకాల గురించి వరుసగా రాస్తాను... ఎదురుచూడండి...:-)

Monday, May 26, 2014

మూలింటామె


నామిని ‘మూలింటామె’ నవల చదివాకా బాపూ రాసిన ఉత్తరం చదివిన తర్వాత బజార్లో కెళ్ళినప్పుడు ముందరా పుస్తకం కొని తెచ్చుకున్నా. అంతకు ముందు 2000లో పబ్లిష్ అయిన నామిని గారి సంకలనం "అమ్మకి జేజే" మాత్రమే చదివాను. 'అమ్మ' గురించి బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన ఒక 17మంది ప్రముఖులతో చెప్పించి, దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి, తరువాత వాటన్నింటినీ అమ్మకి జేజే పొందుపరిచారాయన. ఇవన్నీ వేరే వాళ్ళ వ్యాసలే తప్ప ఆయన రచన కాదు. సో, ఇప్పటిదాకా విలక్షణమైన ఆయన రచనాశైలిని గురించి విన్నా కానీ వీరి రచనలేమీ చదవలేదనే చెప్పాలి. అందువల్ల మొదట వారి రాయలసీమ మాండలీకం చదవడం నాకు పరీక్షగా మారింది.  మామూలుగా ఓ వంద పేజీల పుస్తకం గంట-రెండుగంటల్లో చదివేస్తాను నేను. అలాంటిది ఎంతో నెమ్మదిగా చదివితే తప్ప అసలు మొదట పది పదిహేను పేజీలు నాకు అర్థం కాలేదు :( కానీ ఒక్కసారి కథలో లీనమైన తర్వాత ఇంక భాష పెద్ద సమస్యగా అనిపించలేదు నాకు. అంతటి పట్టు ఆ కథలో ఉంది. అసలా కథకు ఆ మాండలీకమే సగం ప్రాణం అని కూడా అర్థమైంది. కవర్ డిజైన్ కూడా వైవిధ్యంగా బాగుంది.


’మూలింటామె ’ పుస్తకం అమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నా. ఆ రాత్రి ఒంటిగంట దాకా చదివి పెట్టిన పుస్తకం అక్కడే తలగడ క్రింద మరిచిపోయి ఇంటికి వచ్చేసా. అంతదూరం మళ్ళీ ఇప్పట్లో వెళ్ళనని కొరియర్లో వెయ్యమన్నా. మధ్యలో వీకెండ్ వచ్చి ఆ కొరియర్ నాకు అందటానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈలోపూ నాకు ఆ కథపైనే ధ్యాస.. ఏమై ఉంటుంది.. నారాయుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడా? కొనామె సంగతి ఏమౌతుందో? అయ్యో మూలింటామె..ఎలా ఉందో..?  అసలు కొరియర్ మిస్సయిపోతే మళ్ళీ పుస్తకం కొనుక్కోవాలేమో.. అని ఇవే ఆలోచనలు. ఆఖరికి పుస్తకం ఓ సాయంత్రం కొరియర్లో వచ్చింది మొత్తానికి. గభాలున పనులన్నీ పూర్తి చేసేసుకుని పుస్తకం పట్టుకుని కూచున్నా. పూర్తయ్యాకా కథ గురించీ, పాత్రల గురించీ చాలా రాయాలని అనుకున్నా కానీ మాటలు రావట్లే...  ఒక గొప్ప ట్రాజెడీ చదివిన తరువాత కలిగే అనుభూతి మిగిలింది. చెప్పాలంటే there's a feeling of Catharsis.. అని కూడా అనచ్చేమో! మానవ సంబంధాల గురించీ, మనిషి నైజం గురించీ, మనసు లోతుల గురించీ గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా నామిని గారిని గుర్తించాను నేను.


ఒక మనిషి ఏదన్నా తప్పు చేస్తే, మిగతావారు ఆ తప్పుకి కారణాలు వెతకరు. వెనకేసుకు రారు. ఎదుటి మనిషి దృష్టికోణం లోంచి ఆ తప్పు చెయ్యడానికి వాడి వెనుక ఉన్న పరిస్థితులేమిటని అంచనా వేసే ప్రయత్నం అసలే చెయ్యరు. పొరపాటున ఒక్క పొరపాటు దొర్లటం ఆలస్యం.. వీడెప్పుడు పొరపాటు చేస్తాడా అని కాచుక్కూర్చున్న జనం.. ఇన్నాళ్ళకు దొరికాడు కదా అన్నట్లు కాకుల్లా పొడిచేస్తారు. అనాల్సిన మాటలు, అనకూడని మాటలూ, నిఘంటువుల్లో పదాలు వెతొక్కొచ్చి మరీ కడిగిపారేస్తారు. జనాలకూ గొర్రెల మందకూ పెద్ద తేడా లేదు. మొదట నిలబడ్డవాడు ఏది చేస్తే వెనకున్నవాళ్ళు అదే చేస్తారు. జనంలో ఉన్న ఈ బలహీనతను పట్టుకున్నారు నామిని. "మూలింటామె" కథలో జనాలలో, సమాజంలో ఉన్న ఈ బలహీనతను ఎత్తి చూపారు నామిని.


చదువురాని ముసలి అవ్వ మూలింటామె. ఆమె పేరు కుంచమమ్మ. కుంచమమ్మ కూతురు మొగిలమ్మ. కొడుకు నారాయణ సామి నాయుడు. మొగిలమ్మ కూతురు రూపావొతి. మనవరాలిని కొడుక్కిచ్చి సంబంధం కలుపుకుంటుంది కుంచమమ్మ. రూపావొతికి ఇద్దరు బిడ్డలు. ఊళ్ళో ఒక మూలన వాళ్ల అడ్డాపిల్లుండటం వల్ల వాళ్ళూ "మూలింటోళ్ళు" గా పిలవబడుతుంటారు. ఆడ్డాపింట్లోని ముగ్గురాడవాళ్ళూ మొదుటామె, నడిపామె, కొనమ్మిగా పిలవబడుతుంటారు. హటాత్తుగా కొనమ్మి ఇల్లు వదిలి వెళ్పోవడంతో కథ మొదలౌతుంది. కాసేపటికి ఆమె కళాయోడితో తిరప్తి కి పోయిందని తెలిసి ఊరూవాడా ఇంటి ముంగిట్లో పోగవుతారు. మూలింటోళ్ళ బాగుని ఓర్వలేనివాళ్ళంతా అవకాశం దొరగ్గానే నానారకాల మాటలు మొదలొడతారు. ముఖ్యంగా రంజకం, మొలకమ్మ మొదలైనవాళ్లయితే ఇక దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేలుస్తూ మూలింటోళ్ళకు ఊపిరిసలపనివ్వరు. మొదటామె కు మనవరాలంటే పంచప్రాణాలు. చివరిదాకా కొనామె పైనే ప్రాణాలు ఉంచుకుని తిరిగివస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తుందా ముసలి ప్రాణం. కొనామె తిరిగిరాకపోవడం కూడా లోపల్లోపల ఆనందమే ఆమెకు. మనవరాలెంత అభిమానవంతురాలో అని లోలోపల మురుస్తుంది. బీమారం నుండి వచ్చిన తన అక్క పోరు, ఊరోళ్ళ బలవంతం మీద కొడుక్కి మరొక పెళ్ళి చెయ్యక తప్పదు. అయితే, కోడలుగా ఇంటికొచ్చిన పందొసంత తో మాట్లాడదు. కోడలు చేతి చేతి గంజినీళ్ళు కూడా ముట్టదామె. అంత పట్టుదల మూలింటామెది. మనవరాలి స్థానాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని బాధ, కోపం ఒక పక్క ఉండగానే పందొసంత చేసే పనులు ఇంకా చిత్రహింసకు గురిచేస్తాయి ఆమెని. పందొసంత ఇచ్చే అప్పులకూ, చేసే సహాయాలకూ ఆశపడే ఊళ్ళోవాళ్ళంతా ఆమె పబ్లిగ్గా చేసే తప్పులను ఉపేక్షిస్తూ, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన ఉత్తమురాలైన మనవరాలిని పదేపదే దెప్పిపొడవడం సహించలేకపోతుంది మొదటామె.


"మూలింటామె" నవల సమకాలీన సమాజానికొక దర్పణమనిపిస్తుంది నాకు. నారాయణ రెండవ భార్యగా వచ్చిన పందొసంత గురించి చదువుతూంటే కోపం, అసహ్యం, ఆశ్చర్యం, సంభ్రమం లాంటి భావాలన్నీ కట్టగట్టుకుని బుర్రలో నాట్యమాడేస్తాయి. అవును మరి ఇవాళ్టిరోజున బలమున్నవాడిదే పై చేయి. తప్పు చేసినా సరే. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, సగనికి పైగా మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సింబాలిక్ గా ఈ ప్రాత్రను సృష్టించారేమో నామిని అనిపించింది. ఈర్ష్య, అసూయ మొదలైన హేయ గుణాలకు ప్రతీకలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ల మొదలైన పాత్రలైతే, ఇంకా లోకంలో అక్కడక్కడా మిగిలున్న మంచీ,మానవత్వాలకు ప్రతీక చీమంతమ్మ పాత్ర. లోకంలో దుర్బలులైనవారికీ, భయస్తులకీ ప్రతీక మొదుటామె. ఈ ముసలి అవ్వ పాత్ర నాకు ఎంతగా నచ్చిందో చెప్పలేను. ఆమెలో ఆమె చెప్పుకునే స్వగతాలూ, మాటలూ, ఇతరుల ప్రశ్నలకు మనసులోనే చెప్పుకునే సమాధానాలూ చదివి తీరాల్సిందే. మనవరాలి పోటోను ఎదన బెట్టుకుని తెల్లార్లూ మొదుటామె చెప్పుకునే మాటలు విని గుండెలు ఎంత నీరౌతాయో, ఆమెతో చీమంతమ్మ అన్న మాటలు విన్నాకా "ఈ మాత్రం గుండెల్నిండికీ గాలి బీల్చుకోని ఎన్ని జాములైంది మూలింటామెకి!" అన్న వాక్యాలు చదివి మనసు అంత కుదుటపడుతుంది పాఠకులకు.


మొదుటామె వ్యక్తిత్వం, ఆమె జీవితం, ఆమె ముగింపు అన్నీ చదివాకా మొదట్లో చెప్పినట్లు మనసులో ఏదో ప్రక్షాళన జరిగిన భావన కలుగుతుంది. "నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగాని, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కళ్ల కాడా చూట్టుకలాడే పిల్లిని చంపలేదే!" అన్న ఆమె మాటలు పుస్తకం మూసేసిన తర్వాత కూడా చెవుల్లో వినబడుతూ ఉంటాయి. మనవరాలిని అర్థం చేసుకుని క్షమించగలిగిన అంతటి విశాల హృదయం ఎంతో ఎత్తులో ఉండే విద్యావంతుల్లో కూడా కనబడదు. మనసున్న ప్రతి మనిషి మనసునీ తప్పక తాకే కథ ఇది.


Tuesday, April 29, 2014

రాజా రవివర్మ





"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..." అనే పాటని రేడియోలో చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను కానీ 'రాజా రవివర్మ' అనే ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నారని మొట్ట మొదట నేను 6th క్లాస్ లో ఉండగా తెలిసింది. బెంగుళూరులో ఉంటున్న మా మావయ్యావాళ్ళు ఊరు మారిపోతున్నాం రమ్మని గొడవపెడితే నాన్న మమ్మల్ని బెంగుళూరు, మైసూరు తీసుకువెళ్ళారు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆంధ్రా దాటి వెళ్ళిన మొదటి ప్రయాణం కాబట్టి ఎంతో పదిలంగా గుర్తుండిపోయిందా ట్రిప్. అప్పుడు మైసూర్ మ్యూజియంలో చూసాం రవివర్మ వర్ణచిత్రాల్ని. చాలా ఫోటోలు కూడా తీసుకున్నాం. ఆ ట్రిప్ తాలూకూ అపురూపమైన ఫోటోలను ఫోటో స్టూడియో అతను మాయం చేసేసాడు. అందుకని ఆ ట్రిప్ ఇంకా బాగా గుర్తన్నమాట! తర్వాత మరోసారి 10th క్లాస్ లో ఉండగా మా స్కూల్ వాళ్ళు మైసూరు, బెంగుళూరు, తమిళ్నాడు ట్రిప్ కి తీసుకువెళ్ళినప్పుడు మరోసారి చూసాను. ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఇంట్లోవాళ్ళతో మూడో ప్రపంచయుధ్ధం చేయాల్సివచ్చింది.. సరే సరే గుండ్రాల్లోకి తీసుకువెళ్ళకుండా అసలు సంగతికొచ్చేస్తా... 



ఇవాళ అద్భుత చిత్రకారుడైన 'రాజా రవివర్మ' జయంతి(1848, Apr29th). రవివర్మ గురించిన చిన్న పుస్తకమొకటి ఆ మధ్యన దొరికింది. సుంకర చలపతిరావు గారు రచయిత. చిత్రకళాపరిషత్, విశాఖపట్నం వారి ప్రచురణ. వెల అరవై రూపాయిలు. ఇవాళ ఆ చిత్రకారుడి జయంతి సందర్భంగా ఈ చిన్ని పుస్తకంలోని విశేషాలు రాద్దామని సంకల్పం. రచయిత 'సుంకర చలపతిరావు' గారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ చిత్రకళా విమర్శకుల్లో ఒకరు. చిత్రకళ, శిల్పకళలపై నాలుగువందల పైగా వ్యాసాలు రాసారు. వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు మొదలైన ప్రముఖ ఆంధ్ర చిత్రకారుల ఆత్మకథలను ప్రచురించారు. చిత్రకళకు అందించిన సేవలకు గానూ ఎన్నో సత్కారాలు పొందిన వీరు ప్రస్తుతం 64కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకమండలిలో సభ్యులు. రవివర్మపై తనకు గల అభిమానమే ఈ చిన్న పుస్తక రచనకు కారణమని ఆయన తన ముందుమాటలో చెప్తారు.





ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు:



 భారతీయ పురాణేతిహాసాల నుండి ప్రేరణ పొంది అసలు ఫలానా దేవుడు ఇలా ఉంటాడు అని మనకు ఒక రూపాన్ని చూపెట్టిన తొలి భారతీయ చిత్రకారుడు రాజారవివర్మ. లక్ష్మి, సరస్వతి, రాధామాధవులు మొదలైన దేవతలు కాక, దమయంతి, అహల్య, రాధ, నల-దమయంతి, తిలోత్తమ, మేనక మొదలైన ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనుడు. ప్రత్యేక ఆహ్వానాలపై హైదరాబాదు, పిఠాపురం విచ్చేసి చిత్రాలు గీసారుట ఆయన. మరణించి వందేళ్ళు దాటినా ఆయనను మనం గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే "కళకు మరణం లేదు" అన్న నానుడిని ఆయన నిజం చేసినట్లే! సంస్కృతం, మళయాళం కు సంబంధించి ఇద్దరు పండితులను ప్రత్యేకంగా నియమించుకుని, వారితో పురాణాలు, ఇతిహాసాల్లోని శ్లోకాల అర్థాలు చెప్పించుకునేవారుట రవివర్మ. ఆ శ్లోకాల ఆధారంగా స్కెచ్ వేసుకుని వాటికి రంగులు అద్దేవారుట రవివర్మబాల్యంలో బొగ్గుతో గోడలపై పూలు, జంతువుల చిత్రాలు గీయడం చూసి  ఆయన విద్యాభ్యాసంతో పాటూ చిత్రరచననూ చేర్చారుట. నాయకర్ అనే ఆస్థాన చిత్రకారుడు చిత్రకళలో మెళకువలు నేర్పడానికి నిరాకరిస్తే, ఆయన శిష్యుడైన ఆర్ముగంపిళ్ళై రాత్రివేళల రహస్యంగా తనకు తెలిసిన విద్యను రవివర్మకు నేర్పేవారుట. ఒక బ్రిటిష్ వైస్రాయ్ ఆహ్వానంపై జెన్సన్ అనే బ్రిటిష్ చిత్రకారుడు తిరువాన్కూరు రాజాస్థానానికి వచ్చాడుట. అతను కూడా రవివర్మకు ఆయిల్ పెయింటింగ్ నేర్పించడానికి నిరాకరించాడుట కానీ దూరం నుండి తన చిత్రరచనను రవివర్మ చూడటానికి అంగీకరించాడుట. అలా బ్రెష్ ఉపయోగించే విధానం, రంగులు పూసే పధ్ధతి ఒక నెల రోజులు పరిశీలించాకా తన సొంత శైలిలో చిత్రరచన మొదలుపెట్టారుట ఆయన. ఒక తపస్సులా చిత్రకళ సాధన చేసేవారుట. . స్థానికంగా దొరికే ఆకులు, పువ్వులు,బెరడు, కోడిగుడ్డు సొన, మట్టి,విత్తనాలు, ఆలివ్ నూనె ఉపయొగించి రంగులు సొంతంగా తయారుచేసుకునేవారుట రవివర్మ. 




చిత్రకళ గురించిన "శ్రీ మహావజ్ర భైరావతంత్ర" అనే గ్రంధం ఆయనకు ప్రియమైనదిట. చిత్రకారుడు సత్యవంతుడు, గుణవంతుడు, పవిత్రంగా జీవిస్తూ పాండిత్యం గలవాడై ఉండాలి. అంతేకాక దానశీలత, దైవభక్తి, ఆదర్శప్రాయమైన నడవడి కలిగి కోపిష్ఠి, బధ్ధకస్తుడు కారాదని ఆ గ్రంధంలో చిత్రకారుడికి ఉండవలసిన లక్షణాలు పేర్కొన్నారుట. అదే విధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని మలుచుకున్నారుట రవివర్మ.






మైసూరుకు దగ్గరలో ఉన్న మూకాంబికాదేవిని ఆయన ఆరాధించేవారుట. అమ్మవారిని దర్శించడం కోసం నలభైఒకటి రోజులు కాలినడకన ప్రయాణించి ఆలయాన్ని చేరుకున్నారుట. ఆ తిరుగు ప్రయాణంలోనే ఆయనకు వృత్తిపరమైన అవకాశం వచ్చింది. అది మొదలు జీవం ఉట్టిపడే ఎన్నో కుటుంబాల రూపచిత్రాలు, రాజ దంపతుల చిత్రాలు ఆయన గిసారు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో కూడా ఆయన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రామాయణ, భారత,భాగవతాల్లోని ముఖ్య దృశ్యాలను ఒక పక్క,  రాజ కుటుంబాలకు చెందిన రూపచిత్రాలు ఒక పక్క, ప్రాచీన ప్రబంధాల ముఖ్య దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు, ఉహాచిత్రాలూ ఎన్నో సహజ సుందరంగా చిత్రించి కళాభిమానుల మన్ననలు పొందారు రవివర్మ. తైల వర్ణాల గురించి మనకు తెలియని రోజుల్లో స్వశక్తితో సాధన చేసి, రంగుల్ని తయారు చేసి, ఆ వివరాలు మనకు అందించారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఈ కళాతపస్వి కి కూడా విమర్శలు తప్పలేదు. 




తమ్ముడు రాజవర్మతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేదిట. చిత్రకళారంగంలో ఇరువురూ రామలక్ష్మణలుగా కీర్తి  పొందారుట. తమ్ముడి మరణం తాలూకూ విషాద ఛాయలు ఆయన చిత్రాలపై ప్రభావం చూపాయిట. ఆరోగ్యం క్షీణించి ఎన్నో అసంపూర్ణ చిత్రాలను వదిలేసి 1906,అక్టోబర్ రెండున రవివర్మ కన్నుమూశారుట. " నీ చిత్రాలను స్వర్గంలో ఉన్న దేవతలతో పోల్చిచూడటానికి స్వర్గానికి వెళ్ళావా.." అంటూ ఆయనకు నివాళులర్పింఛారుట తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి. 




మూడు రవివర్మ చిత్రాలను పోస్టల్ స్టాంపులుగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. జె.శశికుమార్ అనే భిమాని ఆయనపై డాక్యుమెంటరీ నిర్మించారు. మళయాళంలో "మరకమన్జు" అనీ, హిందీలో "రంగ్ రసియా" అనీ ఆయన జీవితచరిత్రను తెర కెక్కించారు. ఆయన శత జయంతినీ, శత వర్ధంతినీ అభిమానులు వైభవంగా జరుపుకున్నారు. ఆయన జీవిత చరిత్రపై ఎన్నోఆంగ్ల గ్రంధాలు ప్రచురించబడ్డాయి . వాటిల్లో కొన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ముద్రించబడ్డాయి కూడా. ప్రాక్ పశ్చిమ కళారీతుల్ని జోడించి భారతీయ కళారంగంలో ఓ నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడిగా గుర్తుంచుకోదగ్గ మహోన్నతుడు శ్రీ రాజా రవివర్మ.







పుస్తకంలో ప్రచురించిన కొన్ని చిత్రాలు:










(రవివర్మ చిత్రాలు అంతర్జాలంలో కూడా లభ్యమవుతున్న కారణంగా పుస్తకంలోని ఫోటోలు ఈ టపాలో ప్రచురిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరమైతే తొలగిస్తాను.)

Friday, April 11, 2014

శిలకోల కథలు




పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు షాప్ త్వరగా మూసేసారు. అక్కడ నుండి కాస్త దూరంలో ఉన్న మరో విశాలాంధ్ర బ్రాంచ్ కు వెళ్తే అదీ మూసేసారు. అక్కడి నుండి కాళ్ళీడ్చుకుంటూ నవోదయాకు కూడా వెళ్ళాను. వాళ్ళసలు పేరే వినలేదన్నారు. ఏవో వేరే బుక్స్ కొనుక్కుని వచ్చేసా. మళ్ళీ వారం ఈసారి షాపు ఉందో లేదో కనుక్కుని విశాలాంధ్రకు వెళ్ళా. వాళ్ళూ పుస్తకం గురించి తెలీదన్నారు. మార్చ్ ఎండింగ్ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆఖరుకి మళ్ళీ కినిగె ద్వారానే తెప్పించుకున్నా పుస్తకాన్ని. కినిగె ఆర్డర్ ఓ  క్లిక్ దూరమే కానీ నే చేసిన పొరపాటు వల్ల నెట్ బ్యాంకింగ్ లో ఏదో తేడా జరిగి, శ్రీవారు చెయ్యిపెట్టి బాగుచేసేదాకా ఆగవలసి వచ్చింది. అలా కళ్ళు కాయలు కాసాకా ఈ పుస్తకం చేతికొచ్చింది. దీనితో పాటూ మరో మంచి పుస్తకం కూడా తెప్పించుకున్నా.(దాని గురించి ఇంకోసారి రాస్తాను.) ఈ "శిలకోల కథలు" మాత్రం చాలా బాగుంటాయి అని నాకెందుకో ఓ నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తోడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు మొదటి కథ చదవగానే నాకు అర్థమైపోయింది నేనో మంచి పుస్తకాన్ని చదవబోతున్నానని!


రచయిత 'మల్లిపురం జగదీశ్' ఎవరో తెలీదు నాకు. ఉత్తరాంధ్ర సాహిత్యంతో పెద్ద పరిచయమూ లేదు, అక్కడి ఆదివాసీ జీవనం గురించిన అవగాహనా లేదు. ఇదివరలో చదివిన వంశీ 'మన్యంరాణి' వల్ల గిరిజనుల ఆచారాలు, జీవనవిధానం,కట్టుబాట్ల గురించి కాస్త వివరం తెలిసింది; తర్వాత వాడ్రేవు వీరలక్ష్మి గారి 'కొండఫలం' లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించిన మూడు నాలుగు కథలు ఉన్నాయి. ఇప్పుడీ పుస్తకం  చదివితే మాత్రం ఆ గిరిజనులతో ఏం సంబంధం లేకపోయినా వారికి తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి చదువుతుంటే ఒక విధమైన ఆవేశం మనసుని కమ్మేసింది. అభివృధ్ధి ముసుగులో ఇన్ని అన్యాయాలు జరిగాకా ఏ గిరిజనుడు 'పల్లపోడిని' నమ్ముతాడు? అనిపించింది. 'ఇప్పమొగ్గలు' కథలో 'బూది' వేసిన ప్రశ్నలే నా మనసులో కూడా ప్రతిధ్వనించాయి.. 

"వీళ్ళలో చదువుకోనిదెవరు? చదువేం నేర్పింది? ఈ చదువుల్తో ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు..."

"ఛీ..వీళ్ళు మనుషులేనా? అదవిని నమ్ముకుని కొండల్లోనూ, గూడల్లోనూ నివసిస్తున్న తమ వాళ్ల పట్ల ఇంతటి నీచ భావమా? ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం.. పండో, కాయో, మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం.. కొండఫలంలోని కొంత నేస్తానికివ్వడం తమ సాంప్రదాయం. అతిధుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం తమ సంస్కారం." అంటుందామె.
'బాకుడుంబారి' కథలో 'శ్రీధర్' ప్రశ్నలు కలతపెడతాయి. ఆధునిక ప్రపంచంలో ఎన్నో అభివృధ్ధి కార్యకరమాలు జరుగుతున్నా కూడా కూడా వీళ్ళకీ పేదరికం ఏమీటి? విద్య అందుతున్నా ఇలా వెనుకబడే ఉన్నారేమిటి? ఈ ప్రాంతాల వాళ్ల భవిష్యత్తేమిటి? అని ఆవేదన కలుగుతుంది. రచయిత కథలు రాస్తే, చదివిన నా ఆవేదనని ఇలా టపా రూపంలో రాస్తే, ఈ పుస్తకం గురించి మరో నలుగురికి తెలుస్తుందనిపించింది.


అసలివి కాలక్షేపం కథలు కానే కావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులూ, వాళ్ళకు జరిగిన జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టేట్లుగా రచయిత గీసిన ఒక రేఖా చిత్రం. ప్రతి పేజీలో, ప్రతి వాక్యంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న గిరిజనుల నిస్సహాయ జీవితచిత్రాలు కనబడతాయి. ఒక్కో కథలో ఒక్కో సమస్యనూ ఎంతో వైవిధ్యంగా మనముందుంచారు జగదీశ్ గారు. అసలు కథలంటే ఏమిటి? జీవిత చిత్రాలే కదా. యదార్థానికి ప్రతిరూపాలే కదా. ఒక కథ మనసుకి హత్తుకుని రచయిత తాలూకూ భావోద్వేగాన్ని పాఠకుడు అందుకోగలిగినప్పుడు ఆ కథ సజీవమౌతుంది. అజరామరమౌతుంది. అలా లేనప్పుడు అసలు ఏ కథైనా రాసీ ప్రయోజనం ఉందదని నా అభిప్రాయం. ఈ పుస్తకంలో ప్రతీ కథా హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తుంది. ఏదైనా చేసి ఆ కథల్లోని మనుషుల వేదనను తగ్గించాలనిపిస్తుంది. నాలాగే ఈ పుస్తకం చదివినవారందరికీ అనిపిస్తే, "శిలకోల" అనే అనువైన పేరుతో జగదీశ్ చేసిన ఈ సాహితీ సృజన వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరగలదనే నమ్మకం కలిగింది.


జగదీశ్ గారి రచనా శైలి చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చిన్నవే అయినా వాటి వెనుక అర్ధాలు బోలెడున్నాయి. వాక్యాలు సున్నితంగానూ, వాడిగా కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను..

* "ఈ చరిత్రొకటి. అదెక్కడ మొదలౌతుందో కానీ ఏదీ అర్థం కాదు. ఆ మాటంటే మట్టిబుర్రలు, ఒక్కరోజైనా పుస్తకం తీస్తే అర్థమౌతుందని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు."

* "వెర్రీ గుడ్ రా... వెయ్యేళ్ళు వర్థిల్లు.." తెరలు తెరలుగా నొక్కి చెప్పారు. 
అది దీవెనో, శాపమో వాడికే అర్థం కాలేదు.

* ఆడి పెల్లి కర్సులకని పోతులు అమ్మేసాను. కొండ మీద నల్లని తల్లి మా జిలుగుసెట్టూ, సింత సెట్టూ అమ్మేసేను. ఇంకా సాల్లేదని సావుకారి కాడ అప్పు తెచ్చఏను. ఇద ఈ పొద్దు ఆడు పిల్లల్తండ్రైనాడు. ఉజ్జోగస్తుడైనాడు, గానీ అప్పు అలాగే ఉండిపోయింది. నా గోచీ ఇలాగే మిగిలిపోయింది.

* అక్కడక్కడ దిసమొలల్తో అనారోగ్యంతో నింపుకున్న పెద్దపెద్ద పొట్టల్తో ఆటలాడుకుంటున్న ఆదివాసీ బాలలు.. అభివృధ్ధికి ఆనవాళ్ళూగా...

* పింటుగాడు ఆడుతున్న రేడియో లోంచి "మంచి పోషక విలువలు గల ఆహారం" అనే అంశం మీద డాక్టర్ గారి ప్రసంగం వినిపిస్తోంది.

* వాళ్ళనక్కడ చూస్తూంటే కొండ మీద చెట్లను తెచ్చి నగరంలో నాటి నీళ్ళు చిలకరిస్తున్నట్లుంది.

* అడవి...ఎలా ఉండేది?
ఇప్పుడది ఆరిన నిప్పు.
కొండ?
కన్నీటి కుండ.

* ఈ మౌనం ఇప్పటిదా?
దీని వెనుక దాగిన కథలెన్నో!
దశాబ్దాల నాటి వ్యధలెన్నో కదా!!

ఈ వాక్యాలు చాలు ఈ కథల గురించి ఇంకేం రాయక్కర్లేదు నేను. ఇవాళ విచిత్రంగా ఈ కథల్లోని సారం అంతా ఉన్న ఒక కవిత దొరికింది. క్రింద లింక్ లో ఆ కవిత చదవవచ్చు:
శిలకోల చూపు



ఈ పుస్తకంలోని అక్షరాల్లో నాకో విచిత్రం కనబడింది. "క్ష" అక్షరానికి బదులు "ష" వత్తు పడింది. అన్నిచోట్లా! అక్షంతలు, శుభాకాంక్షలు, అక్షరం... అన్నిచోట్లా "క" క్రింద "క్ష" వత్తు బదులు "ష" వత్తు పడింది. టైప్ చేద్దామంటే ఇక్కడ రావట్లేదు నాకు. ఇది ఉద్దేశపూర్వకమో పొరపాటో తెలీలేదు నాకు!


Wednesday, April 2, 2014

13 భారతీయ భాషల 'తొలి కతలు'





"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ దొరికిన కథలే తొలికతలనే గీతని నిర్ణయించి కథలను వెతికారుట. అలా వెతికి వెతికి ఒక పదమూడు భారతీయ భాషల్లోని కథలను అనువాదం చేయించి ఈ సంకలనంలో అచ్చు వేసారు. 


మిగతా భాషల్లో కన్నా తెలుగులో మొదటి కథ మీద చాలానే భిన్నాభిప్రాయాలున్నాయిట. గురజాడ గారి 'దిద్దుబాటు' కన్నా ముందు భండారు అచ్చమాంబ గారి 'ధన త్రయోదశి' కథ కాక మరో అరవై ఐదు కథలున్నాయిట తెలుగులో. మిగిలినవేమీ అచ్చులో లభ్యం కానందువల్ల ధన త్రయోదశి, దిద్దుబాటు  రెంటినీ తొలి తెలుగు కథలుగా ఎన్నుకున్నారు. ఈ పుస్తకంలో ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళం, తెలుగు, కొంకిణీ, తుళు, కశ్మీరీ మొదలైన భాషల్లోని తొలి కథలున్నాయి. అప్పటి రచయితల్లో సామాజిక స్పృహ బాగానే ఉందనీ, సామాజికమార్పుని అభిలషిస్తూ ఈ కథారచనలు చేసారనే అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. ప్రతి కథకూ ముందర ఆ కథారచయిత పరిచయం, కథ వెనుక అనువాదకుని/అనువాదకురాలు యొక్క పరిచయం కూడా ఇచ్చారు. 


పుస్తకంలో కథలన్నింటినీ క్రానాలజీ ప్రకారం ప్రచురించడం విశేషం. అలా చూస్తే భారతీయ భాషల్లో మొదటిది ఒక ఉర్దూకథ. ఆ తర్వాతది ఇరవై మూడేళ్ళ వయసులో ఠాగూర్ రాసిన 'రేవుకథ'. ఇందులో ఒక రేవు మనకు కథను చెప్తుంది. 'వారసత్వం' అనే మలయాళీ కథ తాను తీసుకున్న గోతిలో తానే పడిన ఓ దొంగ స్వగతం. ఒడియా కథ 'రేవతి', తమిళ కథ 'కుంభమేళాలో చిన్నకోడలు' రెండూ కంట తడి పెట్టిస్తాయి. తెలుగు కథలు రెండిటి భాష గ్రాంధికంగా ఉండి కాస్త చదవడానికి కష్టతరంగానే ఉంది. తుళు కథ కాస్త సరదగా ఉంది. అన్ని కథలనూ ఆయాభాషల నుండి అనువదించగా ఒక్క కాశ్మీరీ కథను మాత్రం ఇంగ్లీషు నుండి అనువదించారుట. 


ఇవన్నీ గొప్ప కథలు అని అనలేము కానీ వైవిధ్యభరితమైన కథలని అనవచ్చు.  సాహిత్యరంగంలో కథాప్రక్రియ ఊపిరి పోసుకుంటున్న తరుణంలో వెలువడ్డవి కాబట్టే వీటికి ప్రాముఖ్యత. భారతీయ భాషల్లోని తొలి కథలనేవి అసలు ఎలా ఉన్నాయి? తమ కథల ద్వారా రచయితలు చెప్పదలిచిన విషయాలు ఈ కథల్లో కనబడతాయా? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.


Thursday, March 27, 2014

గౌతమీ గాథలు


"దేశంలో ఎన్నినదులు లేవు?ఏమిటీ హృదయబంధం?

గోదావరి ఇసుకతిన్నెలు.. పాపికొండలు.. భద్రాద్రి సీతారాములు...
గట్టెక్కిన తరువాత 
కడచిన స్నేహాల వియోగాల సలపరింపులు
సభలు, సాహిత్యాలు, వియ్యాల్లో కయ్యాలూ
కయ్యాల్లో వియ్యాలు!
రక్తంలో ప్రతి అణువూ ఒక కథ చెబుతుంది.."
అంటారొక కథలో రచయిత 'ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి'.


నిజానికివి కథలు కావు. తూర్పుగోదావరి జిల్లాలో రచయిత గడిపిన సాహిత్య జీవితానికి జ్ఞాపకాలు. ఆ అనుభవాలన్నింటికీ ఎంతో ఆసక్తికరంగా కథారూపాన్నందించారాయన. ఆ రోజుల్లో ఎందరో గొప్పగొప్ప సమకాలీన సాహితీవేత్తల స్నేహం, సహచర్యం పొందిన అదృష్టవంతులు హనుమచ్ఛాస్త్రి గారు. ఈ పుస్తకం ద్వారా ఆనాటి సంగతులు, ఆయా రచయితల తాలూకూ కబుర్లు చదవగలగడం మన అదృష్టం. ఆ కాలపు సాహిత్యవాతావరణాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. శ్రీపాద, చెళ్లపిళ్ళ, బాపిరాజు, విశ్వనాథ, పి.గణపతిశాస్త్రి, దేవులపల్లి, భమిడిపాటి మొదలైన ఎందరో మహానుభావుల కబుర్లు, ఆ స్నేహాలు, ఆప్యాయతలు, వారి సంభాషణలు చదవగలగడం నాకైతే చాలా చాలా ఆనందాన్నిచ్చింది.


కొన్నాళ్ళు ఈనాడులో ప్రచురితమయ్యాకా, ఓ ఏడాది తర్వాత ఆంధ్రజ్యోతిలో "గౌతమీ గాథలు" పేరిట ధారావాహికంగా వచ్చాయిట ఇందులోని వ్యాసాలు. మళ్ళీ దాదాపు ముఫ్ఫైఏళ్ల తరువాత క్రిందటేడు పుస్తకరూపంలో ఇవి ప్రచురితమయ్యాయి. రామచంద్రపురం బోర్డ్ నేషనల్ స్కూల్లో తెలుగు, సంస్కృతం అధ్యాపకులుగా ఉంటూ ఎన్నో అభ్యుదయోత్సవాలు, వసంతోత్సవాలు నిర్వహించారు  హనుమచ్ఛాస్త్రిగారు. "ఈ గాథలు స్వీయచరిత్రాత్మకాలు. సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులు తెలియజేస్తాయి.." అంటారు రచయిత కుమారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.


"సుమారు ఏభై ఏళ్ల క్రిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి?వాటి వెనుక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేసాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించారు? అనే బొమ్మ ఈ తరంవారికి చూపడమే నా ముఖ్యోద్దేశం.(4-3-81)" అంటారు రచయిత ముందుమాటలో. చివరలో "రౌద్రి, మాఘ బహుళ సౌమ్యవారం, మహాశివరాత్రి " అనే సంతకమే భలే పులకింతను కలిగించింది. ఈమధ్యన మరికొన్ని పుస్తకాల్లో కూడా ఇలాగే ముందుమాట చివరలో సంవత్సరం, తిథి, వారాలతో కూడిన సంతకాలు చూసి చాలా సంబరపడ్డాను.



పుస్తకంలోని కొన్ని విశేషాలు:

* శ్రీపాద వారిది 'రావణా పట్టుదల' అని కొన్ని ఉదాహరణలు చెప్తూ "ఏటికి ఎదురీత అయిన ఈ పట్టుదలతో ఆయన లోకంలో నెగ్గుకు వచ్చారంటే ఎంత ప్రాణశక్తి వచస్సారం ఖర్చుపెట్టి ఉంటారో అనిపిస్తుంది" అంటారు రచయిత. ఆయన పెట్టిన పత్రిక నడవకపోతే ఓటమినొప్పుకుని, ఆయుర్వేదం తెలుసును కాబట్టి బజార్లో ఆయుర్వేదం కొట్టు పెట్టీ చూర్ణాలు, మాత్రలు, లేహ్యాలూ అమ్మేవారుట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.


* "విస్సన్న చెప్పిన వేదం.." అని మిస్సమ్మ పాటలో వస్తుంది కదా, ఆ నానుడీ ఎలా వచ్చిందో ఓచోట చెప్పారు. 'ఇంద్రగంటి' ఊరి పేరే ఇంటిపేరయిన విస్సన్నగారి పూర్తి పేరు "ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి"ట. ఆయన కోటిపల్లి కోట నివాసి, మహా పండితుడు, గొప్ప ధర్మవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయిందిట.


* అవధానం గురించి చెప్తూ జాతీయోద్యమంతో పాటూ భావకవిత్వం జోరు ఎక్కువై అవధానాల పత్ల మోజు ఎలా తగ్గిందో, రాయప్రోలువారు, వేదుల వారు మంచి కవిత్వం వైపుకి ఎలా తిప్పారో చెప్తూ అసలు అవధానం అంటే ఏమిటి? అవధానం ఎలా చేస్తారు.. మొదలైన వివరాలు విపులంగా చెప్పడమే కాక తాను చూసిన ఒక అష్టావధానానికి చమత్కారముగా ప్రత్యక్ష్యవ్యాఖ్యానం చెప్తారు 'అవధానం' కథలో.


* 'కర్ణాట కలహం' అంటే 'కోరి పోట్లాడటం' ట. ఓసారి శ్రీపాదవారి మందుల కొట్లో జరిగిన సంభాషణ గురించి చెప్తారు రచయిత ఈ కథలో. మెట్లెక్కి వెళ్ళగానే కనబడ్డ భమిడిపాటి కామేశ్వరరావుగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, పి.గణపతి శాస్త్రిగార్లను; ఓ చేత్తో మందులు అందిస్తూనే సాహిత్య గోష్ఠిలో పాల్గొంటున్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారినీ చూస్తే అది 'మందుల కొట్టా? సాహిత్య దుకాణమా?' అని సందేహం వచ్చిందిట రచయితకు. 

కొందరు పండితులను గేలి చేస్తూ వెలువడ్డ ఓ పత్రికను చూసి కామేశ్వరరావుగారు పి.గణపతిగారికొక సలహా ఇస్తారు "పండితులను వెటకారం చెయ్యడం ఈనాటి ఫాషన్. మనకు ఏది లేదో అది ఉన్నవారి మీద అసూయ తెలియకుండానే పుట్టుకు వస్తుంది. ఈనాడు ప్రబంఢాలను తిట్టేవారంతా ముందు అవి అర్థం కాక. తర్వాత సామాజిక స్పృహ, ప్రజావళి,అవగాహన అనేవి పడికట్టు రాళ్ళు. ఆధునిక పరిజ్ఞానానికీ, సదవగాహనకీ, పండితుడవడం అడ్డు రాదు. అవి విలక్షణమైన చిత్త సంస్కారం వల్ల ఏర్పడతాయి కానీ చదువుకున్న భాష వల్ల కాదు. 
ఇంకో చమత్కారం ఉంది.. ఈ పీచు కాగితాల పత్రిక్కి గుర్తింపు కావాలి. దానికొక సంఘర్షణ లేవదియ్యాలి. మీ వంటివారు రంగం లోకి దిగితే ఇంక వారికి కావలసినదేమిటి? దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. మీరు గడుసువారయితే ఒక పని చెయ్యాలి. దీన్నీ దాని రాతల్ని ఖాతరు చెయ్యకుండా రచనల్ని జోరు చెయ్యండి. మీ పరిజ్ఞానం ఎంతటిదో, మీ అవగాహాన ఏమిటో ఋజువు చెయ్యండి. బస్ , అదే దానికి జవాబు".
కృష్ణశాస్త్రి గారు కూడా ఓ విమర్శ గురించి ఇదే మాటన్నారుట ఒకసారి.. "వారికి మేమేం జవాబు చెప్పగలం? మరింత జోరుగా, రెట్టింపు ఉత్సాహంతో వ్రాయడమే వారికి తగిన జవాబు!" అని.

ఈ ఇద్దరు పండితుల మాటలూ ఈనాటికీ ఎంతగా వర్తిస్తాయి.. అనిపించింది నాకు. 


* 'లంకలో లేడిపిల్ల', 'వ్యసనైకమత్యం', 'అల తల వల', 'రైల్వే సుందరి' కథలు ఆకట్టుకుంటాయి.


* 'ఆవకాయ మహోత్సవం' కథలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఆవకాయలు ఎలా పెడతారో చెప్పే ఘట్టం మహా సరదాగా ఉంది. చివర్లో ఆ రోజు తిన్న రకరకాల కొత్తావకాయల దెబ్బకు నిద్రపట్టక కదులుతున్న రచయితకు శ్రీపాదవారు 'ద్రాక్షారిష్టం' ఇచ్చి నిద్ర పట్టించడం నవ్వుతెప్పిస్తుంది.


* 'క్యూ' కథలో ఒక పల్లెటూరి గృహిణి స్వచ్ఛత, నిర్మలత్వం కట్టిపడేస్తాయి. రచయిత అన్నట్లే పట్నవాసపు ప్రలోభాలూ, సంపర్కాలూ కొందరి మనసుల్లోని స్వచ్ఛతని నిజంగా చంపేస్తున్నాయి అనిపిస్తుంది!


అలా అయిదేళ్ళ పాటు అమ్మ గౌతమి వద్దా, గొప్ప గొప్ప సాహితీ సంస్కారాల మధ్యన మెలిగిన తరువాత పినతల్లి పినాకిని పిలుపు అందుకుని 'సింహపురి'కి పయనమయ్యారుట హనుమచ్ఛాస్త్రి గారు. వారి అంతరంగ కథనాలని, అనుభవాలనూ మనకేమో ఈ అపురూపమైన గౌతమీ గాథల రూపంలో అందించారు. 


వారం క్రితం ఒక పుస్తకం కోసం వెళ్తే, కావాల్సినది దొరకలేదు కానీ ఇది దొరికింది. ఎలానూ గోదారమ్మ నాకు దేవకి కదా అని చటుక్కున కొనేసాను. చక్కని తెలుగు, ఇదివరకూ తెలియని కొత్త తెలుగు పదాలు ఎన్నో నేర్చుకోవడానికి దొరుకుతాయీ పుస్తకంలో. నా అంచనాకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందీ పుస్తకం!



Saturday, March 15, 2014

ఆ పుస్తకం ఇదే.. 'అతడు - ఆమె'


క్రితం వారంలో నాకు బాగా నచ్చేసిందని ఒక పుస్తకం గురించి "in love...with this book " అని టపా రాసా కదా... ఆ పుస్తకం ఇదే.. 
డా. వుప్పల లక్ష్మణరావు గారి "అతడు - ఆమె" ! అసలు పుస్తకం చదువుతుంటే ఆ క్యారెక్టర్ల మీదా, కథ మీదా, అందులో చర్చించిన పలు అంశాల మీదా ఐదారు వ్యాసాలైనా రాయచ్చనిపించింది. అంత గొప్ప పుస్తకాన్ని ఎక్కువమంది చదివితే బాగుంటుందన్న సదుద్దేశంతో, నాకు వీలయినట్లుగా  పుస్తక పరిచయాన్ని రాసి పుస్తకం.నెట్ కి పంపించాను.. పొద్దున్న పబ్లిష్ అయ్యిందక్కడ..

క్రింద లింక్ లో ఆర్టికల్ చదవండి..



Friday, March 7, 2014

in love.. with this book !



శివరాత్రి ముందర పుస్తకమొకటి మొదలెట్టాను చదవడం.. మధ్యలో నాన్న హాస్పటల్ హడావుడి, తర్వాత ఇంకా ఏవో పనులు...! అసలిలా మధ్యలో ఆపేస్తూ చదవడం ఎంత చిరాకో నాకు. మొదలెడితే ఏకబిగిన అయిపోవాలి. క్రితం జన్మలో(పెళ్ళికాక మునుపు) ఇలాంటి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడిక ఇవన్నీ సెకెండరీ అయిపోయాయి ;(  పాలవాడో, నీళ్లవాడో, సెక్యూరిటీ గార్డో, లేక తలుపు తట్టే పక్కింటివాళ్ళో..వీళ్ళెవరూ కాకపోతే ఇంట్లో పనులో.. కుదురుగా పుస్తకం చదువుకోనియ్యవు. అందులోనూ ఇది ఐదువందల ఎనభై పేజీల పుస్తకం. ఎలాగో కళ్ళని నాలుగొందల అరవైరెండు దాకా లాక్కొచ్చాను.. ఇంకా నూటిరవై ఇవాళేలాగైనా పూర్తి చేసెయ్యాలి. అసలీలాటి పుస్తకమొకటి చదువుతున్నా..ఇంత బాగుందీ అని టపా రాద్దామంటేనే వారం నుండీ కుదర్లేదు.


కాశీభట్ల గారి నవల మొదటిసారి చదివినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో.. ఈ నవల చదివేప్పుడు అంత ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి గొప్ప నవల ఒకటి తెలుగు సాహిత్యంలో ఉందని ఇన్నాళ్ళూ కనుక్కోలేకపోయినందుకు బాధ ఓపక్క, ఇన్నాళ్ళకైనా చదవగలిగాననే సంతోషమొక పక్క చేరి నన్ను ఉయ్యాలూపేస్తున్నాయి. నాకు ఇప్పటిదాకా నచ్చిన తెలుగు నవలలన్నింటినీ పక్కకి నెట్టేసి వాటి స్థానాన్ని ఆక్రమించేసుకుందీ పుస్తకం..! ఎప్పటి కథ.. ఎప్పటి మనుషులు.. ఇంత సమకాలినంగా, ఆ భావాలింత దగ్గరగా ఎందుకనిపిస్తున్నాయి..? అంటే కాలమేదైనా స్త్రీ పురుషుల మనోభావాలు ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయన్నది సత్యమేనా? ఈ రచయిత ఇంకా ఏమేమి రాసారో? ఇప్పుడవి దొరుకుతాయో లేదో..? ఆత్మకథొకటి రాసారుట.. అదన్నా దొరికితే బాగుండు. 


నా టేస్ట్ నచ్చేవారికి తప్పకుండా ఈ నవల నచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది! కొన్ని పదుల ఏళ్ల క్రితం రాసిన భావాలతో ఇంతకా ఏకీభవించగలగడం ఒక సంభ్రమం. అంటే ఇప్పటికీ స్త్రీల పరిస్థితులు, మగవారి అహంకారాలు, మన సమాజపు స్థితిగతులు అలానే ఉండడం కారణమా? అప్పట్లోనే ఎంతో అభ్యుదయం ఉన్నట్లు రాస్తున్నారు.. అప్పట్లో నిజంగా స్త్రీలు అంత డేరింగ్ గా ఉండేవారా? లేదా కేవలం హై సొసైటీలో, డబ్బున్న ఇళ్ళల్లోనే అలా ఉండేవారా..? అసలా రచనా ప్రక్రియే ఒక కొత్త పధ్ధతి కదా. ఆ ప్రక్రియ వల్లనే ఒక సామాన్యమైన కథకు అంతటి డెప్త్, గొప్పతనం, నిజాయితీ అమరింది.

అసలు పెళ్ళికి ముందు ఈ నవల చదివి ఉంటే ఇంతగా నచ్చేది కాదేమో. పదేళ్ల సంసారజీవితం తర్వాత చదివినందువల్ల ఇంత ఆకట్టుకుని ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలిగా ప్రమోట్ అయ్యాకా పూర్వపు అభిప్రాయాల్లో ఎంతగా మార్పు వస్తుందో నాయిక పాత్రలో చూస్తూంటే నన్ను నేను చూసుకుంటున్న భావన! ఆ ప్రధాన నాయిక ఉంది చూడండీ.. అసలు ఏం కేరెక్టర్ అండీ అసలు.. దణ్ణం పెట్టేయచ్చు ఆవిడకి. రచయిత దృష్టిలో ఓ పర్ఫెక్ట్ వుమన్ అలా ఉండాలి అనే పిక్చర్ ఏదో ఉండి ఉంటుంది.. అలానే చిత్రీకరించారా పాత్రని. అసలు 'నవలానాయకుడు' దొరుకుతాడేమో అని మొదలుపెట్టాను చదవడం.. దొరికారు...ఒక్కరు కాదు ముగ్గురు.. ముగ్గురూ నాయికలే!!! ఇండిపెండెంట్, ఐడియల్, అగ్రెసివ్, ఫెరోషియస్, బోల్డ్.. ఇంకా పదాలు వెతుక్కోవాలి ఈ ముగ్గురి కోసం. రచయితకు పాపం మగవారి మీద ఇంత చిన్నచూపెందుకో? ముగ్గురిలో ఒక్క ఆదర్శపురుషుడినీ నిలబెట్టలేదు..:(  కొన్ని పాత్రల్లో లోపాలున్నా కనీసం వాళ్ళ పట్ల ప్రేమ పుడుతుంది కానీ నాకు వీళ్ళపై జాలి కూడా కలగట్లేదు.. బహుశా నాలో ఎక్కడో మగవారి అహంకారంపై, పిరికితనంపై కోపతాపాలేవో దాగుండి ఉంటాయి.. అందుకే వీళ్లకి మార్కులు వెయ్యలేకపోతున్నాను.. అయినా ఇంకా మూడో మనిషి గురించి చదవాలి అతగాడేలాంటివాడో ఏమో. ఎలాంటివాడైనా నాయికను మించినవాడు మాత్రం అవ్వడు. అభ్యుదయ భావాలతో, ఉన్నతమైన లక్షణాలతో ఉన్న స్త్రీ పాత్రలను సృష్టించడమే రచయిత లక్ష్యంగా కనబడుతోంది మరి..


ఈ కథను సినిమాగా తీస్తే ఎంత బాగుంటుందో! వందరోజులు ఖచ్చితంగా ఆడుతుంది. కానీ అంత గొప్పగా, నిజాయితీగా ఎవరన్నా తీయగలరా? ఏమో! సరే మరి మిగిలిన భాగం చదివేసాకా మళ్ళీ అసలు కథేమిటో చెప్తానేం! అంతదాకా ఆగలేక ఈ టపా రాసేస్తున్నానన్నమాట! 

***
ఒకరోజు ముందుగా.. Happy Women's day to all my friends & readers..





Friday, February 7, 2014

"గుల్జార్ కథలు"





బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుల్జార్ కవిత్వం, దర్శకత్వం, చిత్రాలకు సంభాషణలు, గీతరచనలే కాక పిల్లల కోసం కూడా చక్కని సాహిత్యాన్ని అందించారు. అంతేకాక  Half a rupee stories, Raavipaar, धुवाँ పేర్లతో తనను కథా రచయితగా గుర్తుంచుకోదగ్గ మూడు కథా సంకలనాలు కూడా రాసారు. అనుకోకుండా క్రిందటేడు పుస్తకప్రదర్శనలో ‘గుల్జార్ కథలు’.. సి. మృణాళిని గారి అనువాదం అని చూసి వెంఠనే కొనేసాను. గుల్జార్ కు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించిన “धुवाँ”(పొగ) అనే ఉర్దూ కథల సంకలనానికి అనువాదం ఇది. అనువాద పుస్తకంలో మొత్తం 28 కథానికలున్నాయి.

తన కలం పేరును “గుల్జార్” పూర్తిగా సార్థకం చేసుకున్నారనిపించింది ఈ కథానికలు చదివితే నాకు. ఒక తోట ఎలాగైతే వివిధరకాలైన చెట్లు, పూలమొక్కలతో నిండి ఉంటుందో, గుల్జార్ సాహిత్యరచన కూడా అలానే వివిధరకాల శాఖలకు విస్తరించింది. అలానే ఈ పుస్తకంలో కథలు కూడా వైవిధ్యభరితమైన అంశాలతో ఓ తోటను జ్ఞప్తికి తెస్తాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కథానేపథ్యాలకు కూడా ఎల్లలు లేవని నిరూపిస్తారు గుల్జార్. తన సంభాషణలు కూడా ఆయన రాసే కవిత్వంలా ఉంటాయి కాబట్టి ఈ ఉర్దూకథల్లోని వచనం కూడా తప్పకుండా ఓ కవిత్వంలానే ఉండిఉంటాయని నా నమ్మకం. 


గుల్జార్ రాసిన ఈ కథానికల తెలుగు అనువాదం "గుల్జార్ కథలు" గురించిన మిగతా వ్యాసాన్ని  పుస్తకం.నెట్ లో చదవవచ్చు...
లింక్ :
http://pustakam.net/?p=16186


Tuesday, December 31, 2013

అపురూపమైన బహుమతి..






ఇవాళ ఒక నేస్తం నుండి కొరియర్ లో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో పాటూ నాకీ పుస్తకం సర్ప్రైజ్ గిఫ్ట్ గా వచ్చింది..!  ప్రసిధ్ధ కవి, రచయిత, దర్శకుడు గుల్జార్ రచించిన ఒక అరవై హిందీ కవితలు, పక్క పేజిలోనే వాటి అంగ్ల అనువాదాలు ఇందులో ఉన్నాయి. ఆంగ్ల అనువాదకర్త పవన్ కె.వర్మ గారు. ఆయన ఇదివరలో వాజ్పాయ్ కవితలకూ, కైఫీ ఆజ్మీ కవితలకూ ఆంగ్లానువాదం చేసారు.


పుస్తకం నుండి రెండు కవితలు:

अच्छे लगते हैं ये पहाड़ मुझे 
चोटियां बादलों में उड़ती हैं 
पांव बर्फ़ाब बहते पानी में 
कूटते रहते हैं नदियां 
कितनी संजीदगी से जाती हैं 
किस कदर मुसतक़िल-मिज़ाज हैं ये 
अच्छे लगते हैं ये पहाड़ मुझे!!

i like these mountains...
Peaks flying in the clouds
Feet pounding away at the
ice-cold waters of rivers flowing below
How wisely they live
With such stable, unchanging temperaments.
i like these mountains!


***      ***      ***

इक नक़ल तुझे भी भेजूंगा 
ये सोच के ही... 
तन्हाई के नीचे कार्बन पेपर रखके मैं 
ऊंची-ऊंची आवाज़  में बातें करता हूं 

अल्फ़ाज़ उतर आते हैं कागज़  पर लेकिन... 

आवाज़ की शक्ल उतरती नहीं 
रातों  की सियाही दिखती है !!

only because i think
that i will send you a copy too
i keep a carbon paper below my loneliness
and talk loudly all the while.

My words are reproduced on the paper
but not the feel of my voice
At night i only see the ink-like darkness.

***   ***

Thank you friend!

Tuesday, December 24, 2013

'రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ'





1934లో "ఎ సెర్చ్ ఇన్ సిక్రెట్ ఇండియా" పేరుతో ఆంగ్లంలో మొదటి ప్రచురణ జరిగిన ఈ పుస్తకం ప్రతులన్నీ రెండు రోజులకే అయిపోయి మూడో రోజే రెండో ముద్రణ చేసారుట. మరో ఇరవై ఏళ్ళలో 18ముద్రణలు జరిగాయిట. అయితే తెలుగులో రమణ మహర్షి తాలూకూ కొన్ని అధ్యాయాల అనువాదం జరిగిందట కానీ మొత్తం పుస్తకం తెలుగులో రాలేదని.., ఈ పుస్తకం పట్ల ఎంతో ఆకర్షితులైన జొన్నలగడ్డ పతంజలి గారు తానే తెలుగులోకి అనువదించారుట.  2013,మార్చిలో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఒరిజినల్ చదివితే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేదేమో తెలీదు కానీ తెలుగు అనువాదం మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించినందుకు అనువాదకులకు కృతజ్ఞతలు.




అసలు ముందుగా పాల్ బ్రంటన్ కి వేలవేల కృతజ్ఞతలు తెలపాలి. ఎంతో శ్రమ కూర్చి మనమే మర్చిపోతున్న భారతీయ ప్రాచీన సంస్కృతినీ, మనకి తెలియని భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి, వాటినన్నింటినీ గ్రంధస్థం చేసినందుకు! భారతీయయువత ఆయనకు ఒకవిధంగా ఋణపడి ఉండాలి. అసలు పాశ్చాత్యులకు కాదు; ఇటువంటి ఒక మనిషి ఉన్నాడనీ, సత్యాన్వేషణ చేస్తూ, ఆత్మ సాక్షాత్కారం దిశగా పయనిస్తూ మన దేశంలో ఇటువంటి పరిశోధన చేసాడని, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడనీ, పాశ్చాత్య నాగరికత మోజులో కొట్టుకుపోతూ, ఆ జీవనవిధానమే గొప్పదనుకునే నేటితరాలకు ఇటువంటి సంగతులు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక నెల క్రితం దాకా నాకూ "పాల్ బ్రంటన్" పేరు తెలీదు. పుస్తకప్రదర్శనలో టైటిల్ చూడగానే ఎందుకో కొనాలని అనిపించింది.  పుస్తకానికా పేరు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం కూడా రచయిత వివరిస్తారొకచోట. కొన్న పదిహేనురోజులకి మొన్న ఇరవైయ్యో తారుఖున పుస్తకం చదివాను. ఇటువంటి ఒక పరిశోధకుడి గురించి తెలుసుకోవడమే ఒక అద్భుతం. రచయిత గురించిన వివరాలు వెతికితే, అతని పరిశోధనల వివరాలు, జీవిత విశేషాలు, అతను రాసుకున్న నోట్స్ మొదలైన వివరాలన్నీ ఉన్న వెబ్సైట్ దొరికింది..
http://www.paulbrunton.org/



ఇదివరలో "ఒక యోగి ఆత్మకథ", స్వామి పుస్తకాలు, యోగాభ్యాసాల పుస్తకాలు, ఇతర ఆధ్యాత్మిక, తాత్వకపరమైన పుస్తకాలు చదివిఉండటం వల్ల కొన్ని సంగతులు నాకు పరిచితాలు అనిపించి, నేనీ పుస్తకపఠనాన్ని మరింతగా ఆనందించగలిగాను. "అడయారు యోగి బ్రమ" తెలిపిన యోగ సాధన సంబంధిత విషయాలలో కొన్ని నేను 'బీహార్ స్కూల్ ఆఫ్ యోగా'లో యోగా క్లాసులకి వెళ్ళినప్పుడు మా మేడమ్ చెప్పేవారు. వారి వద్ద కొన్ని పుస్తకాలు కూడా కొన్నాను. 'బ్రమ' పాల్ బ్రంటన్ కి చెప్పిన కొన్ని ఆసనాలు, వాటి వివరాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ తెలిసినవే! దురదృష్టవశాత్తూ ఆరోగ్యం సహకరించక కారణంగా కొన్ని ఆసనాలు వెయ్యలేని స్థితి నాది :(  


శ్వాస నియంత్రణ వల్ల ఆయుష్షును పెంచుకోవచ్చనీ, వృధ్ధాప్యాన్ని దూరం పెట్టచ్చనే సంగతులు కూడా మా యోగా మేడమ్ చెప్పేవారు. ఇంకా పుస్తకంలో బ్రమ ఏం చెప్తాడంటే కొన్ని యోగాసనాలు అరోగ్య సంరక్షణకే కాక వాటిపై ఏకాగ్రత, శ్రధ్ధ, మనోబలం తీవ్రంగా పనిచేసి సాధకుడిలోని నిద్రాణమైన శక్తులని మేల్కొలుపుతాయట. శ్వాసని నియంత్రించడం ద్వారా ప్రాణాలు నిపి ఉంచే ఆంతరంగిక శక్తిని నియమ్రించవచ్చునని చెప్తాడతను. కొద్దిసేపు తన హృదయస్పందనని ఆపివేయడం, శ్వాసించడం అపివేసి చూపడం వంటి అద్భుతాలు కూడా రచయితకు చూపిస్తాడతను. యోగశాస్త్ర ప్రావీణ్యం ఉన్న యోగి తన శ్వాసను కొన్ని సంవత్సరాలు బంధించి తద్వారా జీవితకాలాన్ని సుదీర్ఘంగా కొన్ని వందల ఏళ్లవరకూ పొడిగించగలడని బ్రమ చెప్తాడు.


దీర్ఘకాల జీవనానికి ఉన్న మూడో మార్గాన్ని చెప్తూ బ్రమ ఏమంటాడంటే "మనిషి మెదడులో అతిసూక్ష్మరంధ్రం ఉంటుంది. ఈ సూక్ష్మరంధ్రం లోనే అత్మ స్థానం ఏర్పరుచుకుంటుంది. వెన్నుముక చివర కంటికి కనిపించని ఒక అదృశ్య ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి క్షీణించటమే వృధ్ధాప్యానికి కారణం. ఈ ప్రాణశక్తి క్షీణతని ఆపగలిగితే శరీరానికి నూతన జవసత్వాలు నిరంతరాయంగా సమకూరుతూఉంటాయి. కొందరు పరిపూర్ణ యోగులు నిరంతర సాధనతో ఈ ప్రాణశక్తిని వెన్నుముక ద్వారా పైకి తీసుకువచ్చి, మెదడులోని సూక్ష్మరంధ్రంలో నిక్షిప్తం చెయగలిగే శక్తి సాధిస్తారు. ఇటువంటి యోగులు తమ మరణాన్ని తామే నిర్ణయించుకోగలరు.."
దీర్ఘాయువుని పొందే ఈ ప్రక్రియ గురుసహాయం లేకుండా చేస్తే మృత్యువుని ఆహ్వానించినట్లేనని అతడు చెప్తాడు. ఈ శారీరక యోగసాధనతో పాటూ మానసిక యోగసాధన కూడా చేయాలని,అదే ఆధ్యాత్మికౌన్నత్యాన్ని ఇస్తుందనీ కూడా చెప్తాడు. ఇంకా.. వేలమైళ్ల దూరంలో ఉన్న గురువుతో మాట్లాడగలనంటూ బ్రమ చెప్పే మిగిలిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.


దయాల్బాగ్ సత్సంగుల గురించీ, వారి జీవనవిధానాల గురించి చెప్పిన ఆధ్యాయం బాగుంది. ఆప్పట్లో రాధాస్వామి అశ్రమానికి అధిపతిగా ఉన్న శ్రీ స్వరూపానంద్ గారు తెలిపిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. (మా ఇంటికి దగ్గరలో ఈ రాధాసామి సత్సంగ్ కాలనీ ఉండటం వల్ల, మా అపార్ట్మెంట్స్ లో చాలా మంది సంత్సంగీస్ ఉండటం వల్ల వీరిని గురించి తెలిపిన విషయాలు పరిచితమనిపించాయి.) ఇంకా కలకత్తాలో శ్రీ రామకృష్ణపరమహంస శిష్యులలో ముఖ్యులైన మాష్టర్ మహాశయులనే వారిని కలవడం, ఆయన తెలిపిన విశేషాలు చదవడం ఒక చక్కని అనుభూతి. మద్రాస్ లో మౌనయోగి ద్వారా పాల్ బ్రంటన్ పొందిన ప్రశాంతత, కాశీ నగరంలో శ్రీ విశుధ్దానంద చూపే సౌరశాస్త్ర ప్రయోగాలు అద్భుతాలే. ప్రాచీన ఋషులకు తప్ప ఎక్కువమందికి తెలియని ఈ సౌరశాస్త్రం ప్రకారం సూర్యకిరణాలలో ప్రాణశక్తి ఉంటుందిట. ఆ సూక్ష్మశక్తిని లోబరుచుకుని, కిరనాల నుండి ఆ ప్రాణశక్తిని వేరు చేస్తే ఎన్నో అద్భుతాలను చేయవచ్చని ఆయన చెప్తారు.  కాశీ నగరంలోనే కలిసిన జ్యోతిష్కుడు సుధీబాబు చెప్పిన విషయాలు విన్న తరువాత హిందూ జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా మూఢనమ్మకంగా కొట్టివేయలేమనీ అభిప్రాయపడతాడు రచయిత. వంట చేసే మనిషిలోని అయస్కాంత శక్తి అతను వండేవంటలోకీ తద్వారా అది తినే మనిషిలోకీ ప్రవేశిస్తుందనీ ,అందువల్ల వంట చేసే మనిషి ఆలోచనలు కూడా మంచిగా,సక్రమంగా ఉండాలని కూడా ఓ సందర్భంలో సుధీబాబు చెప్తాడు. (ఈ పాయింట్ నాదగ్గర 'ఆయుర్వేదిక్ కుకింగ్' అనే పుస్తకంలో గతంలో చదివాను నేను.) వేల సంవత్సరాల క్రితం భృగు మహర్షి రాసిన "బ్రహ్మచింత" అనే గ్రంధబోధ కూడా రచయితకు సుధీబాబు అందిస్తాడు. ఇలాంటి ఎందరో యోగులు, జ్ఞానులు మొదలైనవారు తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచడం వల్ల ఆ జ్ఞానసంపదంతా ఎవరికి తెలియకుండానే చరిత్రలో కలిసిపోతోందని, భారత దేశ రహస్యాలెన్నో ఎవరికీ తెలియకుండానే శశ్వతంగా సమాధి అవుతున్నాయేమోనని రచయిత విచరపడతారొకచోట. నాకు అది నిజమేననిపించింది.


 అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారితోనూ, అరుణాచలయోగి శ్రీ రమణ మహర్షి తోనూ పాల్ బ్రంటన్ సంభాషణలు మనలోని ఎన్నో ప్రశ్నలకి సైతం సమాధానాలనిస్తాయి. ఒకచోట రచయిత ప్రశ్నలకు 'చంద్రశేఖరస్వామి'వారి సమాధానాలు...

* "...తగిన సమయం వచ్చినప్పుడే భగవంతుడు మానవులకి సద్భుధ్ధిని కలిగిస్తాడు. దేశాల మధ్యన విద్వేషాలు, మనుష్యులలో దుర్భుద్ధీ, లక్షలాది ప్రజల దారిద్ర్యమూ ఉధృతమైనప్పుడు వీటికి విరుగుడుగా భగవత్ప్రేరణా, భగవదాదేశము పొందిన వ్యక్తి తప్పకుండా ఉద్భవిస్తాడు. ప్రతి శతాబ్దంలోనూ ఇది జరుగుతూనే ఉంటుంది. అధ్యాత్మిక అజ్ఞానం వల్ల కలిగే అనర్థం ఎంత తీవ్రమైతే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించే మహనీయుడంత ఎక్కువ శక్తిమంతుడవుతాడు."

** " క్రమం తప్పకుండా ధ్యాన సాధన చెయ్యాలి. ప్రేమ నిండిన హృదయంతో శాశ్వతానందాన్ని గూర్చి విచారణ చెయ్యాలి. ఆత్మ గురించి నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా దానిని చేరతావు. ధ్యానానికి ఉష:కాలం ఉత్తమమైనది. సంధ్యాకాలం కూడా అనుకూలమైనదే. ఆ సమయంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనస్సుని నిశ్చలంగా ఉంచటం తేలికౌతుంది."


వివిధ సంభాషణలో రమణ మహర్షి పాల్ బ్రంటన్ కు చెప్పిన కొన్ని సంగతులు...

* "ఆనందమే మనిషి సహజస్థితి. ఈ ఆనందం నిజమైన నేను లో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా తన సహజస్థితిని కనుక్కోవటానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే! ఈ సహజస్థితికి నాశనం లేదు. అందుకని మనిషి ఈ సహజస్థితిని కనుక్కోగలిగినప్పుడు నిరంతరమైన ఆనందాన్ని అనుభవిస్తాడు." 


** "నేను ఎవరు?" అనే అన్వేషణ ప్రారంభించి ఈ శరీరమూ, ఈ కోరికలూ, ఈ భావాలూ, ఇవన్నీ నేను కాదనీ అర్థం చేసుకోగలిగితే, నీ అన్వేషణకి సమాధానం నీ హృదయపు లోతుల్లోనే నీకు అవగతమౌతుంది. అసంకల్పితంగానే ఒక గొప్ప అనుభవమ్గా అది నీకు దక్కుతుంది. "నేను" గురించి తెలుసుకో. అప్పుడడు సూర్యకాంతి లాగ సత్యం నీకు గోచరిస్తుంది. నీ మనస్సు ఎదుర్కుంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఇంక నీకు సందేహాలంటూ ఏమీ మిగలవు."

*** "తాను స్వాభావికంగా బలహీనుడిననీ, పాపాత్ముడిననీ ఆలోచించడమే మనిషి చేసే పెద్ద తప్పు. స్వాభావికంగా ప్రతిమనిషి మనసులోనూ బలమూ,దైవత్వము నిండి ఉంటాయి. బలహీనంగానూ, పాపమయంగానూ ఉండేవి అత్డి ఆలోచనలూ ,అలవాట్లూ,కోరికలూ మాత్రమే కానీ, మనీషి కాదు."


రమణమహర్షి ముఖ్య శిష్యులలో ఒకరైన యోగి రామయ్య గురించిన కబుర్లు కూడా బాగున్నాయి. ఒక సందర్భంలో రచయిత విచారగ్రస్తుడై ఉన్నప్పుడు రామయ్య యోగి ఆయనని తనతో అరణ్యం మధ్యలో ఒక సరస్సు ప్రాంతానికి తీసుకువెళ్ళి ధ్యానంలో మునిగిపోవడం...క్రమక్రమంగా రామయ్య యోగి తాలూకూ ప్రశాంత తరంగాలు రచయితకు చేరి అతని మనస్సు కల్లోలరహితంగా మారే సన్నివేశం రమణీయం! 'రమణాశ్రమం'లో రచయిత పొందిన అనుభూతులూ, ధ్యానంలో అందుకున్న స్వప్నసాక్షాత్కారాలు మొదలయినవి చదివాకా 'అరుణాచలం' వెళ్లాలనే నా చిరకాల కోరిక మరోసారి గాఢంగా మొదలైంది. 


నేనీ పుస్తకాన్ని మాత్రం పాల్ బ్రంటన్ కళ్లతోనే చదివాను. ప్రతి సంఘటననూ, అనుభూతినీ తార్కికంగా, హేతువాద దృక్పధంతో అర్థం చేసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది. ఒక పాశ్చాత్యుడు చేసిన పరిశోధనల వల్ల మన ప్రాచీన జ్ఞానసంపద గురించి మనకి తెలియడం కాస్తంత విచారకరమైనా, ఎలాగోలా ఇటువంటి నిగూఢ రహస్యాలు, యోగవిజ్ఞానవిషయాలు వెలుగులోకి వచ్చినందువల్ల యువతను సన్మార్గంలోకి మళ్ళించగలిగే సదవకాశం కలిగింది కదా అని ఆనందపడ్డాను. పాల్ బ్రంటన్ కు ఎదురైన సంఘటనలు, దివ్యానుభూతులూ, కలిసిన విశిష్ఠవ్యక్తులూ, చివరికి రమణ మహర్షి దగ్గరకు అతడు చేరే విధానం.. అన్నీ అతడిలో సత్యాన్వేషణ పట్ల ఉన్న ధృఢనిశ్చయానికీ, పూర్వజన్మ సుకృతానికీ ఫలితాలనిపిస్తాయి. మనిషి తీవ్రంగా దేనికొరకైతే అన్వేషిస్తాడో దానిని సాధించడానికి ప్రకృతి కూడా తన వంతు సహకారాన్ని అందిస్తుందన్న సూత్రంలో నిజం లేకపోలేదు! నాకీ పుస్తకం చదివే అవకాశం కలగడం నా అదృష్టమనే భావిస్తున్నాను.
 


తత్వపరమైన విషయాల పట్ల, ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం పూర్తిస్థాయి ఆనందాన్నివ్వగలదు. అలా లేని పక్షంలో పుస్తకప్రియులైనా కూడా ఈ పుస్తకం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.



Saturday, December 14, 2013

పుస్తకాల తీర్థం



ఈ మధ్యన ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్ది సర్ది... 'ఇంక ఉన్నవి చాలు కొనకూడదు బాబూ..!' అనుకున్నా. పుస్తక ప్రదర్శన మొదలయ్యే ముందు రోజు కూడా అదే స్థిరంగా అనుకున్నా..'వెళ్ళకూడదూ వెళ్లకూడదూ...' అని!


ఏడో తారీఖు సాయంత్రం అయ్యేసరికీ మనసు కొట్టుకుంది... మానెయ్యడమా.. అందులోనూ మొదటిరోజు..! 'ఏమండీ...' అన్నా...! 'సరే పదమన్నారు' శ్రీవారు. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాం. పదిహేనొ ఇరవయ్యొ కిలోమీటర్ల దూరం మరి! బుక్ ఫెయిర్ దగ్గరకి చేరేసరికీ ఏడుంపావు!! ఎనిమిదింటికి మూసేస్తారు కదా లోపలికి వెళ్దామా వద్దా అనుకుని.. సర్లే ఇంత దూరం వచ్చాం కదా అని లోపలికి దూరిపోయాం..


విజయవాడలో మా క్వార్టర్స్ పక్కనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండేది. పుస్తక ప్రదర్శన మొదలెట్టిన ఏడాది నుండీ అక్కడ ఉన్నన్నాళ్ళూ ప్రతి ఏడూ సాయంత్రమయ్యేసరికీ చటుక్కున వెళ్పోయి ఓ రౌండ్ వేసి వచ్చేదాన్ని.  ప్రదర్శన ఉన్న పదిరోజుల్లో  వీలయినన్ని విజిట్స్ తప్పక వేసేదాన్ని. కొత్త పుస్తకాల దొంతరలు.. ప్రింట్ వాసన.. తెల్లని పేజీలపై నల్లని ఆక్షరాలు.. ఏదో ఉత్తేజాన్ని పెంచుతూ, ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ.. మహదానందంగా ఉండేదసలు. ఎన్నేళ్ళైనా అదే ఉత్సాహం ఇప్పటికీ. పుస్తకాలను చూస్తే మనసు చిన్నపిల్లై వాటివెంట పరిగెత్తుకుపోతుంది. 


సరే ఇప్పుడు ఈ యేటి బుక్ ఫెయిర్ కబుర్లలోకి వచ్చేస్తే.. లోపలికి అడుగుపెట్టగానే ప్రధాన ఆకర్షణ గ్రౌండ్ మధ్యలో కట్టిన ఎమెస్కో వాళ్ల స్టాల్. మొదటి రోజు కదా ఇంకా కడుతున్నారు. లోపల ఇంకా చిత్రాలను పేర్చుతున్నారు. క్రింద ఫోటోలో ఉన్న పుస్తకం లోని బొమ్మలే లోపల నలువైపులా గోడలకు అమర్చారు.










 స్టాల్స్ కి ఇంకా నంబర్లు మాత్రమే ఉన్నాయి. పేర్లు రాయలేదు. కొన్ని చోట్ల అట్టపెట్టేలు తెరవలేదు. ఇంకా సర్దుకుంటున్నారు. ఈ చిత్రం కూడా అందంగానే ఉంది. ఎంత కష్టపడతారో ఇక్కడకి ఈ బుక్సన్నీ చేర్చడానికీ అనిపించింది. ఇల్లు మారేప్పుడు నాలుగైదు అట్టపెట్టెల పుస్తకాలు సేఫ్ గా చేరేసేసరికే ఆపసోపాలు పడిపోయాం. మరి ఇన్ని వందల, వేల, లక్షల పుస్తకాలు ఒకచోట చేర్చడం..మళ్ళీ అయిపోయాకా అవన్నీ వెనక్కు తీసుకువెళ్లడం... నిజంగా ఎంత శ్రమతో కూడుకున్న పనో! 




ఈసారి స్టాల్స్ ఏ,బి,సి అని బ్లాక్స్ గా డివైడ్ చేసారు. ఒక బ్లాక్ లో ఒక సైడ్ తిరిగామంతే.. విజిల్ వేసుకుంటూ అబ్బాయి వచ్చేసాడు. మొదటిరోజు ప్రదర్శన అయిపోయింది....అయ్యో.. అని నాకు ఏడుపువచ్చినంత పనైంది. నే రాసుకున్న లిస్ట్ లోవి నాలుగంటే నాలుగు పుస్తకాలు కొన్నా అప్పటికి. 'పోన్లే మళ్ళీ వద్దాం.. నెక్స్ట్ వీకెండ్' అన్నారు మావారు. మళ్ళీ ఇంటికి రావడానికి రెండు గంటలు పట్టింది. ఎలాగైనా వెళ్లాలి అని నాలుగు గంటలు కష్టపడితే ముప్పావుగంట ఉండగలిగానా...:( అని ఆ పూటంతా మూడ్ ఆఫ్ అయిపోయింది. 


'మళ్ళీ వీకెండ్ కి ఏ అవాంతరమో వస్తే..వెళ్లడం కుదరకపోతే..' అని భయమేసి మొన్నగురువారం పొద్దున్నే బయల్దేరా ఒక్కదాన్నే. మా ఇంటి నుండి ఇరవై నిమిషాలు బస్టాప్ కి నడక, గంట బస్సు, మళ్ళీ ఓ ఐదారు కిలోమీటర్లు ఆటో.. అప్పుడు బుక్ ఫెయిర్ వస్తుంది. దారిలో ఉండగా నాన్న ఫోన్ చేసి ఎమెస్కొలో "తిలక్"గారి కలక్షన్ వచ్చేసిందిట  తీసుకోమని చెప్పారు. సరే, ఇంక మొదట ఎమెస్కో లోకి దూరాను.  ఆ తర్వాత మొదటిరోజు ఎక్కడ ఆపానో అక్కడి నుండీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. నేషనల్ బుక్ ట్రస్ట్, I&B వాళ్ల పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్, సాహిత్య అకాడమీ, తెలుగు బుక్ హౌస్, నవోదయా, విశాలాంధ్ర...ఆక్స్ఫార్డ్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై నుండి వచ్చిన ఇంగ్లీష్ బుక్స్టాల్స్... ఈసారి క్రిందటేడు కనబడ్డ కొన్ని స్టాల్స్ కనపడ్లేదు. ఈలోపూ వెళ్పోవాల్సిన టైమ్ అయ్యింది. మళ్ళీ మా పాప స్కూల్ నుండి వచ్చేలోగా ఇల్లు చేరాలి.. అప్పటికి టాగూర్ పబ్లిషింగ్ హౌస్ లో ఉన్నా.. ఇంకా మూడవ block పూర్తిగా చూడాలి.. అయినా ఇక బయల్దేరాలి... జై సిండ్రిల్లా.. అనుకుని గబగబ బయట పడ్డా.. చేతుల్లో నిండుగా, బరువుగా ఉన్న సంచీలు సంబరపెడుతున్నా ఇంకా మొత్తం చూడలేదని అసంతృప్తి..!! లక్కీగా నేను ఇల్లు చేరాను.. అప్పుడే పాప ఆటో వచ్చింది. 




ఇంక మిగిలిన పార్ట్ చూట్టం వీకెండ్లో సరిగ్గా కుదరకపోతే తృప్తి ఉండదని.. మళ్ళీ మర్నాడు పొద్దున్నే బయల్దేరా.. అంచలంచలుగా తెరిచే టైమ్ కి చేరిపోయా. మళ్ళీ టాగూర్ పబ్లిషింగ్ హౌస్ దగ్గర నుండి మొదలుపెట్టి నాకిష్టమైన KFI పబ్లికేషన్స్, విజయవాడ స్టాల్స్... ఓ విజయవాడ స్టాల్లో సినిమా పుస్తకాలు బాగున్నాయి. వాటిల్లో ఆదుర్తి సుబ్బారావు గారి మీద పుస్తకమొకటి బాగుంది. షేక్స్పియర్ ప్లేస్ తెలుగులోకి అనువదించినవి ఆరో,ఏడో ఉన్నాయి. ఇవి కొనలేదు కానీ క్రిందటేడు బుక్ ఫెస్ట్ లో సోనెట్స్ కి ట్రాన్స్లేషన్ ఉంటే కొన్నాను. He is my most favourite!! ఎమ్మే ఫైనల్లో లాస్ట్ పేపర్ ఆప్షన్స్ లో "మోడర్న్ లిటిరేచర్" వదిలేసి "షేక్స్పియర్" తీసుకున్నా. ఫ్రెండ్సంతా నవ్వారు అబ్బా ఫోర్టీన్త్ సెంచరీ స్టఫ్ ఏం చదువుతావే అని. కానీ నాకెందుకో మొదట్నుండీ షేక్స్పియర్ అంటే ప్రాణం.......! ఓకె.. మళ్ళీ స్టాల్స్ దగ్గరకు వచ్చేస్తే, క్రితంసారి లాగానే ఈసారి కూడా ఓల్డ్ బుక్స్ కి డిస్కౌంట్ ఉన్న స్టాల్స్ ఉన్నాయి. ఏక్చువల్ గా సాహిత్య అకాడమీ స్టాల్ లో కొన్ని డిస్కౌంట్ బుక్స్ ఉన్నాయి. వీరలక్ష్మి గారు "భారతీయ నవల" లో మెన్షన్ చేసిన నవలలుచాలావరకూ! నేను భైరప్ప గారిదొకటి తీసుకున్నా. 


ఈసారి ఎక్కువగా రావూరి భరద్వాజ గారి పుస్తకాలు, చలం సమగ్ర సాహిత్యం, టాగూర్,శరత్ నవలల అనువాదాలు, ముళ్ళపూడివారి పుస్తకాలు, వంటల పుస్తకాలు ఎక్కువగా కనబడ్డాయి. ఎమెస్కో వాళ్ళు చాగంటివారి భాగవతం, రామాయణం, శివపురాణం ప్రవచనాలు కలిపి డిస్కౌంట్ పెట్టారు. అలానే తిలక్, గురజాడ, జాషువా ముగ్గురి సమగ్ర సాహిత్యంపై డిస్కౌంట్ పెట్టారు. పిల్లల పుస్తకాలు చాలా ఉన్నాయి + బాగున్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల కోరికలను కాదనలేని పేరెంట్స్ వీక్నెస్ ని కనిపెట్టినట్లుగా పిల్లలు కావలనదగ్గ వస్తువులన్నీ స్టాల్స్ లో ఉన్నాయి..:) నే వరుసగా వెళ్ళిన రెండు రోజులూ రెండు మూడు స్కూళ్ళ వారు తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఛోటా భీమ్ స్టోస్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.. మేము బలే..:)







చివరిగా నవోదయాకు మరోసారి వెళ్ళాను. నాకెప్పుడూ షాప్ లో కనబడే ఆయన ఉన్నారీసారి. అడిగిన బుక్సన్నీ గబగబా తీసిచ్చేసారు. నవోదయా కేటలాగ్ ఒకటిచ్చారు. అది ముందరే తీసుకుని ఉంటే వెతుక్కోవాల్సిన అవసరమయ్యేది కాదు. ఇంక లిస్ట్ లో రాసుకున్నవన్నీ దొరికేసాయనుకున్నాకా ఇంక బయల్దేరిపోయాను. రేపే ఆఖరిరోజు ఇంక..


ఈసారి కొన్న పుస్తకాలు..






ఇవండీ ఈయేటి 'పుస్తకాల తీర్థం' ఊసులు...!!!