సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label నాన్న. Show all posts
Showing posts with label నాన్న. Show all posts

Thursday, December 27, 2012

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 6 !!

while recording for 'gala gala gOdAri' at antarvEdi

రెండు మూడు రోజుల పాటు ఇంట్లో రామం కనబడకపోతే అవార్డ్ ప్రోగ్రాం చేస్తున్నాడని అర్ధమయ్యేది అతని కుటుంబానికి.
తిండీ, నిద్ర మానుకుని అకుంఠిత దీక్షతో అతను చేసిన అవార్డ్ ప్రోగ్రాం ల కథాకమామిషు:


1.1980 - నీలినీడలు ( సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రధమ బహుమతి)
ఐదవ భాగం చివరలో ఈ కార్యక్రమం తాలూకు వివరాలు రాసాను.


2. 1982 - We Two (సృజనాత్మక శబ్దచిత్రం -- ఎంట్రీ)

3. 1983 - లహరి ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
మానవుడి దైనందిన జీవితంతో సంగీతం ఒక అంతర్భాగంగా ఎలా పెనవేసుకుపోతోందో ఉదాహరణలతో సహా వివరించే రూపకం. కార్యక్రమం చివరలో సినిమా ట్రైలర్ మాదిరే ప్రత్యేకంగా తయారుచేసిన ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్రీల్ ప్రతీక ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రోగ్రాం విని మన తెలుగువారు, ప్రముఖ వేణుగాన విద్వాంసులు,అప్పట్లో ఫిల్మ్ డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏల్చూరి విజయరాఘవరావుగారు ఇందులోని కొన్ని అంశాలనూ, కాన్సెప్ట్ నీ స్మగుల్ చేయాలనిపించింది అని మెచ్చుకుంటూ రెండు పేజీల ప్రశంసాపూర్వక ఉత్తరం రాయటం రామానికి ఎంతో ఉత్సాహం ఇచ్చింది.

4.1984 - సారే జహాసే అచ్ఛా (సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రశంసాపత్రం)
చిన్నప్పుడూ social studies లెసన్స్ లో బోలెడన్ని హిందూదేశపటాలు ఉండేవి. వరి,గోధుమ ,తేయాకు పండు ప్రదేశములు, భారత దేశంలో వివిధ నదులు,భారత దేశంలో రైలు మార్గాలు ఇలా ఒకో పటం ఒకో రకం. కానీ అన్నీ భారత దేశ పటాలే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తీసుకుని వివిధ అంశాలు వినబడేలాగ మూడు నిమిషాల వ్యవధిగల భారత దేశ సౌండ్ మ్యాప్ లు వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది రామానికి. అంటే ఆధ్యాత్మిక భారత దేశం, దేశభక్తుల మహామహుల భారత దేశం, ఆకలిదప్పుల భారత దేశం, ప్రకృతి సౌందర్యాల భారత దేశం, పురాతన సంగీత పరంపర గల భారత దేశం, సాంకేతిక వైజ్ఞానిక ప్రగతితో పరిఢవిల్లే భారత దేశం ఇలాంటివన్న మాట. అన్నీ శబ్దమయంగానే. వీటన్నింటితో నిండిన సమగ్ర భారత దేశమే "సారే జహాసే అచ్ఛా" అని తేల్చి చెప్పటం.

5.1985 - ఒక పాట పుట్టింది (సృజనాత్మక రూపకం ఎంట్రీ)
ఆకాశవాణిలోనూ, సినిమాల్లోనూ వందలాది పాటలు తయారవుతూ ఉంటాయి. ఒకో పాటకూ ఒకో చరిత్ర ఉంటుంది. (బాలు గారు ’పాడుతా తీయగా”లో చెప్తున్నట్లు) కానీ ఒక్క పాట తయారవ్వాలంటే ఎందరో వ్యక్తుల శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. పాట వినే సామాన్య శ్రోతకి దాని వెనుక దాగిన తయారీ గురించి తెలిసే అవకాశం తక్కువ. ఎవరో పాట రాసి ఇస్తే, ఎవరో స్వరాలు చేకూరిస్తే, మరొకరు కంఠాన్ని జోడిస్తే, ఇంకొంతమంది వాద్య సహకారాన్ని అందిస్తే , ఒక సాంకేతిక నిపుణుడు రికార్డ్ చేసేస్తే పాట తయారీలో కష్టమేముంది? ఒకో పాటకి ఒకోసారి పదిహేను ఇరవై టేక్స్ దాకా ఎందుకు అవసరం అవుతుంది? దర్శకుడు వివరించిన సన్నివేశానికి ఐదారు రకాలుగా అక్షరాల అల్లిక రచయిత తయారుచేస్తే, అందులో ఒక్కటే ఎలా ప్రాణం పోసుకుంటోంది? సంగీత దర్శకుడు కూడా ఐదారు రకాల బాణిలు వినిపిస్తే అందులో ఒక్కటే ఎలా హిట్ అవుతోంది? గాయకుడికీ, వాద్యబృందానికీ స్వరలిపి ఇచ్చి రిహార్సల్స్ చేసిన తరువాత కూడా ఎక్కువ టేక్స్ ఎందుకు అవసరమౌతున్నాయి? రికార్డింగ్ స్టుడియోలో జరిగే వింతలు విశేషాలూ ఏమిటి? మొదలైన అంశాలన్నీంటినీ సామాన్య శ్రోతకు కూడా అర్ధమయ్యేలాగ వివరిస్తూ ఒక పాట చివరికి ఎలా పుడుతుందో తెలియజేసే సృజనాత్మక రూపకం ఇది. ఈ పాటకు స్వరకర్త విజయరాఘవరావుగారే కావటం వల్ల ఇందులోని నావెల్టీని ఆయన బహుధా ప్రశంసించారు.

ఈ ప్రోగ్రాం ను documentary feature గా పంపించి ఉంటే అవార్డ్ వచ్చి ఉండేదేమో అని తరువాత అనిపించింది రామానికి.

6.1986 - వర్షానందిని (సంగీత రూపకం - ప్రధమ బహుమతి)

7.1986 - నేను కాని నేను (సృజనాత్మక శబ్దచిత్రం - ప్రధమ బహుమతి)
సాధారణంగా సినిమాల్లో పాట రచన పూర్తయ్యాకా స్వరపరచటం ఒక సంప్రదాయ పధ్ధతి కానీ ఒకోసారి దానికి విరుధ్ధంగా ట్యూనే ముందు తయారయి అక్షరాల అమరిక తరువాత జరగటం కూడా మనకు తెలుసు. ఈనాటి పాటల్లో ఎక్కువభాగం ఇలా తయారవుతున్నవే. ఇదే ఒరవడిలో పదహారు శబ్దచిత్రాలను sound effects and musicతో కలిపి ముందుగానే తయారు చేసి ఈ సీరీస్ మొత్తాన్ని రచయిత, రేడియో మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారికి వినిపించి ఆయన స్పందన వచన కవితా రూపంలో రాయించి రివర్స్ లో తయారైన సృజనాత్మక కార్యక్రమం ఇది. దీనికి ఆంగ్లానువాదం తయారుచేసిన ప్రముఖ నైరూప్య వచన కవి శ్రీ "మో" (వేగుంట మోహనప్రసాద్)గారికి ఈ కార్యక్రమం అవార్డ్ రాకముందే ఎంతగానో నచ్చింది. ఈ కార్యక్రమం వింటుంటే ఇటివల వచ్చిన క్రిష్ చిత్రం ’వేదం’ స్క్రీన్ ప్లే లా ఉంటుంది.

8.1987 - స్మృతి (రేడియో నాటకం - ప్రశంసాపత్రం)

9.1988 - నిశ్శబ్దం గమ్యం (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
నిశ్శబ్దంలోంచి పుట్టిన మానవుడు తిరిగి నిశ్శబ్దంలోకే నిష్క్రమిస్తాడు.మధ్యలో మాత్రమే ఎంతో సందడి. అందుకే "రెండు చీకట్ల మధ్యన వెలుగు తోరణం నరుడు" అన్నారు శ్రీకాంతశర్మగారు. ఏనాడో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్ కోసం రాసుకున్న అల్లిబిల్లి ఐడియాల సమాహారమే ఈ శబ్ద చిత్రం. అతి చిన్న నీటి బిందువు నుంచి అతి భీకరమైన మేఘ గర్జన వరకూ, చెక్కిలిపై చెక్కిలి ఆనించి వినిపించే గుసగుస మొదలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే జనఘోష వరకూ, భళ్ళుమని శబ్ద ప్రకంపనలతో మొదలయ్యే వేకువ నుంచి నీరవ నిశీధిలో నక్షత్రాల రోదసీ సంగీతం వరకూ ఎన్ని అంతరాలున్నాయో శబ్ద మూలంగా వివరిస్తూ చివరకు ధ్యానంవల్ల సాధించే నిశ్శబ్దమే మనిషికి ఊరటనిస్తుంది అని ప్రతిపాదించే శబ్ద చిత్రం ఇది.

10.1990 - మెట్లు (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
మనిషి ఉన్నతికి దోహద పడేది మెట్టు. పైకి చేరిన స్థానాన్ని నిలబెట్టుకోలేకాపోతే అధోగతికి తోసేది కూడా ఆ మెట్టే. ఇది ఇందులోని ప్రధాన ఇతివృత్తం. ఎన్నో స్థాయిలు అధిగమించి ప్రేమ సాఫల్యాన్ని పొందుతారు ప్రేమికుల జంట. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కి పదోన్నతులు పొందుతారు. అష్టాంగమార్గాన్ని ప్రబోధించిన గౌతమబుధ్ధుడు కూడా ఓ అర్ధరాత్రివేళ తన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ, త్యజించి, రాజప్రాసాదం మెట్లు దిగి విశాల ప్రపంచంలోకి అడుగిడి, తిరిగి బౌధ్ధభిక్షువుగా అదే సోపానాల వద్దకు రావటం జీవిత పరిణామక్రమంలో సంభవించిన అద్భుత దృశ్యం. ఇన్ని రకాల మెట్లు గురించి వివరిస్తూ ఒక తల్లి తన పసి కుమారుణ్ణి చెయ్యి పట్టుకుని ప్రకృతి మానవుణ్ణి నడిపిస్తున్న రీతిలో కొనసాగిస్తూ చూపటం ఈ సృజనాత్మక రూపకంలో శ్రోతల్ని ఆకట్టుకునే ప్రధానాంశం.


11.1991- గలగల గోదారి (డాక్యుమెంటరీ -- ఎంట్రీ)
నాసికాత్రయంబకం దగ్గర గోముఖం నుంచి బిందు రూపంలో మొదలైయ్యే గోదావరి అంతర్వేది వద్ద సాగరసంగమం చెందేవరకూ గోదావరి సజీవ యాత్ర ఈ డాక్యుమెంటరీలో వినిపిస్తుంది. అదే సంవత్సరంలో యమునా నదిపైన కూడా డాక్యుమెంటరీ ఎంట్రీ రావటంతో గోదావరి చిన్నబోయిందని తెలిసింది. అయితే, ఈ కార్యక్రమం కోసం రామం, శ్రీకాంత శర్మగారు, మిగిలిన టేక్నికల్ టీం నాసిక్ మొదలు కోనసీమ దాకా ఒక నెల రోజులు తిరగటం మాత్రం రామం స్మృతులలో ఒక అందమైన ప్రయాణం.

'mahavishva' recording
12.1992 - మహావిశ్వ (రేడియో నాటకం(సైన్స్ ఫిక్షన్) -- ద్వితీయబహుమతి)


ఆకాశవాణిలో ఈ నాటకానికి ఒక చరిత్ర ఉంది. చాలా అరుదైన సైన్స్ ఫిక్షన్ నాటకం ఇది. స్పెషల్ ఐ.జి.పి, రచయిత, కవి కె.సదాశివరావుగారు ’ఇండియా టుడే ’ తెలుగు మ్యాగజైన్లో రాసిన "మానవ ఫాక్టర్" అనే సైన్స్ ఫిక్షన్ కథ దీనికి మూలం. ఈనాడు మనిషి గ్రహాంతరాల వైపు అడుగు సారిస్తున్నాడు. చంద్రుడి పైన ఎప్పుడో కాలు మోపాడు. మానవ వాస యోగ్యమైన ఇతర గ్రహాలేమైనా ఉన్నాయేమో అని కూడా పరిశోధిస్తున్నాడు. చండ్రుడిపైన, మార్స్ పైన అనతికాలంలో మనిషి నివాసాన్ని ఏర్పరుచుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. భూమి పైన పెరుగుతున్న జనాభా విస్ఫోటనం వల్ల, భూవనరులు తరగిపోవటం వల్ల మనిషి ఇతర గ్రహాల వైపు దృష్టి సారించక తప్పేలాలేదని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇంతే కాక పరస్పర కలహాలు, వాతావరణ కాలుష్యం, అణుయుధ్ధాలు మొదలుగా గల మనిషి స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్న అనర్ధాలు కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. దానా దీనా మానవజాతే అంతరించే ప్రమాదం గానీ, ఈ భూగ్రహం నుంచి ఫలాయనం చేయవలసిన అగత్యం ఏర్పడవచ్చు.


ఈ నేపథ్యం ఆధారంగా ఇప్పటికి 400 సంవత్సరాల తరువాత మానవ మనుగడ ఎలా ఉంటుంది? అప్పటికి గ్రహాంతర వాసానికి అలవాటు పడిపోయిన వైజ్ఞానిక మానవుడు ఎలా ఉంటాడు? రోబోలే సేవకులు, పరిచారికలు ఐతే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన ఆథెన్టిక్ ఇన్ఫర్మేషన్ తో సదాశివరావుగారు చేసిన విచిత్ర కల్పన ఈ కథ. దీనికి రేడియో అనుసరణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు చేయగా, రసవత్తరమైన వైజ్ఞానిక నాటకంగా రెండు నెలలు అవిశ్రాంతమైన కృషి చేసి రామం దీనిని రూపొందించాడు. ఇంత శక్తివంతమైన కథావస్తువుకు అనుగుణమైన సంగీతం సమకూర్చాలి అనే ఉద్దేశంతో అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని చెన్నై నుంచి సినీ ఆర్కెస్ట్రాని తెప్పించి ఒక నాటకానికి కేవలం నేపథ్యసంగీతం రికార్డ్ చేసేందుకు AIR వేలకువేల బడ్జట్ ఖర్చుపెట్టడం అదే మొదలు. ఈ కథాగమనంలో రెండు రోబోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకోసం కూడా ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలను చెన్నై సినీ ఫీల్డ్ నుంచి తెప్పించటం జరిగింది.


జాతీయ బహుమతి ఇవ్వటమే కాకుండా ఈ నాటకాన్ని ఆకాశవాణి ఢిల్లీలో ఒక మోడల్ ప్లే గా కూడా పెట్టడం విజయవాడ స్టేషన్కు గర్వకారణం.


13.1992 - 29minutes - 4th dimension (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
రామానికి వచ్చిన పది జాతీయ బహుమతుల్లో ఈ ప్రోగ్రాం చోటు చేసుకోలేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రాం పట్ల అతనికి ప్రత్యేకమైన అభిమానం. తన ఆలోచనా సరళి, తన ఆత్మ ఇందులో ప్రతి అడుగడుగునా ప్రతిఫలిస్తుందని రామం ఎప్పుడూ అంటాడు. దీని పూర్తి రచన, తయారీ తన స్వభావ సరళికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. శ్రీకాంతశర్మగారి కవితా సంపుటి "నిశ్శబ్దం గమ్యం" నుంచి తనకిష్టమైన కొన్ని కవితలు కూడా తానే ఇందులో చదవటం జరిగింది. సందర్భాన్ని అనుసరించి చలంగారి వాణిని, అలాగే ఒక పసిపాప కంఠాన్ని, ఠాగూర్ రచన "where the mind is without fear",
దానికి రజని తెలుగు అనువాదం "చిత్తమెచట భయ శూన్యమో.."(బృందగాన రూపంలో) ఇందులో వినియోగించటం జరిగింది. మన ప్రియతమ భారతదేశాన్ని ఇంత ఆదర్శవంతమైన దేశంగా మనం ఎప్పటికైనా పుననిర్మించుకోగలమా అని రామం ఆశ. రామం కల కూడా.


14.1995 - మ్యూజిక్ ఫ్యాక్టరీ ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)


15.1996భూమిగీత (సంగీత రూపకం -- ప్రధమబహుమతి)
ఈ సంవత్సరంలోనే Brazil లోని రియో డిజనిరియో లో ఎర్త్ సమిట్ జరిగింది. అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా పాల్గొంది. ఈ భూగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలి్? ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి/ మానవుడి మనుగడ ఏ దిశ వైపు? మొదలైన అనేక అంశాలు అక్కడ చర్చించటం జరిగింది. మన దేశం ప్రధాన పాత్ర వహించింది కూడా. దీని ఆధారంగా రూపొందించిన సంగీతరూపకం ఇది. చక్కని సంగీతం, ఆకర్షణీయమైన సౌండ్ ఎఫెక్ట్స్ గల ఈ రూపకం జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవటమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారం చేయబడింది కూడా.


16.1997 యాత్ర (సృజనాత్మక రూపకం -- మొదటి బహుమతి)
తాత్కాలికంగా తను ప్రేమించిన వ్యక్తికి దూరమైన ఒక వనిత ఒంటరి పయనం సాగిస్తూ రకరకాల ఋతువుల్లో అతనికై అన్వేషణ సాగిస్తూ తీపి జ్ఞాపకాల భూతకాలంలోకి వెళ్తూ, భవిష్యత్తులో తను కలుసుకోబోయే ప్రియుని కోసం భవిష్యత్ కలలు కంటూ ప్రస్తుత వర్తమానం కొనసాగించటం ఈ "యాత్ర"లో ముప్పేటగా సాగిపోతుంది. చిట్టచివరికి వారిద్దరూ కలుసుకోవటంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇందులో అడుగడుగునా సంగీతమే ప్రధాన ఆకర్షణ. ఆ పాటలన్నీ ప్రఖ్యాత గాయని శ్రిమతి ద్వారం లక్ష్మి పాడటం ఓ విశేషం. రామం awards కోసం ఢిల్లీ వెళ్ళిన చివరి యాత్ర కూడా ఇదే.


17. 2000 - శబ్ద2000 (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
నూతన శతబ్దంలోకి అడుగుపెట్టే తరుణంలో 2YK గురించి అనేక ఊహలు, కలలు ఉండేవి. ఈ చారిత్రాత్మక కాలగతిని స్వయంగా అనుభవించినవారందరూ నిజంగా అదృష్టవంతులే. ఒక నూతన శకంలోకి పాదం మోపబోయే భారత దేశం వెనుతిరిగి చూసుకుంటే తన గత చరిత్ర శబ్ద రూపంలో ఎలా వినిపిస్తుందో అని చేసిన కల్పన ఈ "శబ్ద2000".

రామం జాతీయ అవార్డ్ కార్యక్రమాల పరంపర ఇంతటితో ముగిసింది.

**** *** ***

awards
విజయవాడలో అనేక కళాసంస్థలు రామానికి జాతీయ బహుమతులు వస్తున్న తరుణంలో ఎన్నోసార్లు సన్మానాలు, సత్కారాలు చేసాయి. రేడియో మిత్రులు పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు రామానికి ఎనిమిది అవార్డులు వచ్చిన సందర్భంలో విజయవాడలోనే రామం కుటుంబ సభ్యులందరి సమక్షంలో అపూర్వమైన సన్మానం ఏర్పాటు చేసారు. నెల్లూరు "కళామందిర్", విజయవాడ "మధూలిక", "రసతరంగిణి" విజయవాడ, విజయవాడ "రోటరీ", ఢిల్లీలోని "ఢిల్లీ తెలుగు సంఘం" మొదలైన సంస్థలన్నీ కూడా రామానికి సన్మానాలు చేసాయి.


మద్రాసు తెలుగు అకాడమీ వారు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను సన్మానిస్తూ ఉగాది పురస్కారాలు అందజేయటం ప్రతి ఏటా ఒక ఆనవాయితీ. "ఆకాశవాణి"లో "ట్రెండ్ సెట్టర్" గా ఈ సంస్థవారు 2000సంవత్సరంలో రామానికి మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో మాజీ గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవిగారి చేతుల మీదుగా 'ఉగాది పురస్కారాన్ని' అందజేసారు.


Ugadi puraskar


విజయవాడ రేడియో కేంద్రానికి మూల స్థంభాలుగా చెప్పుకునే నండూరి సుబ్బారావు, సి.రామ్మోహనరావు స్మారక బహుమతులు కూడా రామానికి లభించాయి. ఇటీవలే హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా "వాచస్పతి పురస్కారాన్ని" కూడా అందుకోవటం జరిగింది.



Sri.K.Vishwanath giving 'vachaspati Award' to ramam



ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి శనివారం ప్రసారం చేసే "ఈవారం అతిథి" కార్యక్రమంలో జంట రేడియో మిత్రులైన శ్రీ ఇంద్రగంటి శ్రికాంత శర్మ గారినీ, రామాన్ని కలిపి ఒకేసారి పరిచయం చేసారు. అలాగే రైన్ బో ఎఫ్.ఎం లో "సరదా సమయం"లో ఓ గంట సేపు రామం అవార్డ్ కార్యక్రమాల ఆడియో క్లిప్పింగ్స్ తో ఓ పరిచయ కార్యక్రమం ప్రసారమైంది.


రామాయణ మహాకావ్య ఆవిర్భావానికి మూల కారకుడైన వాల్మీకి మహర్షిలాగ రామం ఆకాశవాణి విజయ పరంపరకు మూలం, ప్రేరణ - ప్రముఖ వాగ్గేయకారులు, కవి, రచయిత, గాయకులు, స్వర శిల్పి, రేడియో మాంత్రికుడు "రజని" (డా. బాలాంత్రపు రజనీకాంతరావు) అని రామం ఇప్పటికీ వినమ్రంగా చెప్పుకుంటూ ఉంటాడు. రజని రచించిన ’ఆదికావ్య అవతరణ” సంగీత రూపకాన్ని రంగస్థలంపై నృత్యరూపకంగా చేసిన ప్రదర్శనలో వాల్మీకి వేషం రామం ధరించటం యాదృచ్ఛికం. జాతీయ, అంతర్జాతీయ బహుమతులు రేడియోకి సంపాదించి పెట్టిన రజని పరిపాలనా కాలం విజయవాడ కేంద్రానికి ఎప్పుడూ ఒక స్వర్ణయుగం అని రేడియో శ్రోతలు ఇప్పటికీ అభివర్ణిస్తూఉంటారు. అందుకే ఆయన వర్ణచిత్రాన్ని తన గదిలో అలకరించుకున్నాడు రామం. ఈనాటికీ 90ఏళ్ళ వృధ్ధాప్యంలో కూడా పిలిస్తే పలికే దైవంలాగ సంగీత సాహిత్య రంగాల్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా తక్షణం నివృత్తి చేస్తూనే ఉన్నారాయన. నేటికీ పాటే ఆయన ప్రాణం. రామం లాంటి ఎందరో శిష్యప్రశిష్యగణం ఆయన ఆయురారోగ్యాల కోసం నిత్యం ప్రార్ధిస్తూనే ఉంటారు.


Dr.B.Rajanikantha Rao

**** *** ***
ముఫ్ఫై ఏళ్ళ సుదీర్ఘ ఆకాశవాణి అవిశ్రాంత జీవితం తరువాత 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు రామం. గ్రాండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో అన్ని సెక్షన్ల నుంచీ వచ్చిన విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్టాఫ్ అందరూ రామాన్ని "అజాతశత్రువు" అని కొనియాడారు. ఆ ఫంక్షన్ లో ఇతర కేంద్రాలనుంచి కూడా రేడియోమిత్రులు వచ్చి పాల్గొన్నారు. అతని సుస్వభావానికి, సహృదయతకూ లభించిన గౌరవం అది.

ఇదీ రామం కథ. ఇది రామం ఒక్కడి కథే కాదు సీతారాముల కథ. విజయపథంలో నిరంతరం కొనసాగే ప్రతి పురుషుని వెనుకా ఒక స్త్రీ ఉంటుందని నానుడి. అలానే 65ఏళ్ల రామం జీవనయానం వెంట జంటగా నడుస్తూ, తన సహకారాన్ని అందిస్తున్నది అతని సహధర్మచారిణి, మీదుమిక్కిలి అతని స్నేహితురాలు, సహజ శాంత స్వభావురాలు, చప్పుడు చెయ్యని వెన్నెల లాంటి సీతామహాలక్ష్మి అనే "సీత".


(కథ...సంపూర్ణం)


Friday, October 12, 2012

"దేవరకొండ బాలగంగాధర తిలక్" -- "శిఖరారోహణ"


ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ రచనలతో తనదైనటువంటి గాఢముద్రను వేసిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి జీవితం,సాహిత్యం గురించి కవి, రచయిత, విమర్శకుడు శ్రీ ఇంద్రగంటి శ్రికాంతశర్మ గారు ఒక పుస్తకం రాసారు. పుస్తకం పేరు "దేవరకొండ బాలగంగాధర్ తిలక్". సాహిత్య అకాదెమీ వారి ప్రచురణ. (వెల నలభై రూపాయిలు). శర్మగారు చిన్నప్పుడు తణుకులో తాను తిలక్ గారిని కలుస్తుండే రోజుల నుండీ ప్రారంభించి, తిలక్ జీవితం, తిలక్ జీవనదృక్పథం , సాహిత్య వ్యక్తిత్వం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు మొదలైన తిలక్ ఇతర రచనలన్నింటి గురించీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. పుస్తకం చివరలో మార్క్సిస్టు విమర్శకులు "అర్వీయార్" గారి వ్యాసం "తిలక్ కవిత్వంలో విషాద అలంకారికత" అనే అనుబంధాన్ని కూడా జత చేసారు. 


తిలక్ గురించి శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాల సారం: 

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమకాలానికి చెందిన కవి, కథకుడు, నాటకరచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్(1921-1966). అందమైన రూపం, ఆ రూపాన్ని మించిన అందమైన మనసు; సున్నితత్వం,భావుకత కలగలిసిన వ్యక్తిత్వం వారిది. ప్రారంభంలో భావకవిత్వాన్ని రాసినా ఆ తర్వాత ఆనాటి అభ్యుదయోద్యమప్రభావాన అభ్యుదయ గీతాలను, వచన పద్యాలనూ రాసారు. ఆదర్శవంతమైన నాటకాలనూ, ఉత్తమమైన కథలనూ కూడా తిలక్ రాసారు. ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "అమృతం కురిసిన రాత్రి"; ఇంకా "గోరువంకలు", "తిలక్ కథలు" ; "సుప్తశిల", "సుశీల పెళ్ళి" నాటికలు మొదలైన రచనలు సాహిత్యాభిమానుల మన్ననలనందుకున్నాయి. 


సాహిత్యంలో తన ముందు తరానికి చెందిన కాల్పనికతకు, తన కాలం నాటి సామ్యవాద ధోరణికీ సమన్వయాన్ని సమకూరుస్తూ తనకు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న కవి శ్రీ తిలక్. మద్రాసులో ఇంటర్ చదివిన తిలక్ ఆ తర్వాత మరెక్కడా చదవలేదు. పధ్నాలుగు పదిహేనేళ్ల వయసు నుండే పద్య రచనను ప్రారంభించిన తిలక్ అభ్యుదయ రచనోద్యమకాలంలో కవిగా , సోషలిస్ట్ గా మారారు. డిగ్రీలు చదవకపోయినా తమ ఇంట్లోని ఐదారువేల పుస్తకాల వల్ల తిలక్ తెలుగు,ఇంగ్లీషుల్లో మంచి చదువరి అయ్యారు. స్వస్థలమైన తణుకులోనే ఉండిపోయారు. తిలక్ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ప్రభావంతో కాల్పనిక సౌందర్యమూ, శ్రీశ్రీ ప్రభావంతో సామాజిక వాస్తవికత చోటు చేసుకున్నాయి. కవిత్వంలో తిలక్ ది ప్రత్యేకమైన శైలి. తెలుగు,సంస్కృత, అన్యదేశ సమాసాలు ఆయన రచనలలో కనబడతాయి. ఆయన కథల్లో మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేసేవరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందేమో అనిపించింది నాకు. 

తిలక్ సొంత గళంలో ఆయన "వెన్నెల" కవితనిఇదివరకూ బ్లాగ్లో పెట్టాను.. http://trishnaventa.blogspot.in/2009/11/blog-post_17.html

***   ***    *** 

 శిఖరారోహణ: 

'ముందుమాట'లో శ్రీకాంత శర్మ గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలగంగాధర్ తిలక్ జీవన సాహిత్యాల గురించి ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. తను ఆకాశవాణిలో పనిచేసే కాలంలో శర్మగారే రచించిన ఈ డాక్యుమెంటరీ పేరు "శిఖరారోహణ". దీనికి ప్రయోక్తగా శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి(మా నాన్నగారు) వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఆనాటి ప్రముఖ రచయితలు శ్రీ సోమసుందర్, ఆర్.ఎస్.సుదర్శనం, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తిలక్ సోదరులు గంగాధర రామారావు పాల్గొన్నారు. ఆకాశవాణి కళాకారులు పద్యాలు, వచన కవిత్వం చదివారు. గంట నిడివి ఉన్న ఈ కార్యక్రమం 1983లో ప్రసారమైంది. తిలక్ కవిత్వం పై ఆసక్తి ఉన్న పాఠకులు ఈ కార్యక్రమాన్ని క్రింద లింక్ లో వినగలరు.. 

 


పైన కార్యక్రమం వినలేనివారికి ఇదే కార్యక్రమంలో "అమృతం కురిసిన రాత్రి" లోని "వానలో నీతో" అనే కవిత ఒక్కటీ విడతీసి క్రింద లింక్ లో ఇస్తున్నాను. ఇందులో కవిత చదివిన గళం నాన్నగారిది. 

Thursday, April 26, 2012

మార్కొనీ జయంతి సందర్భంగా నాన్నగారికి మరో సన్మానం



నిన్న(Apr 25th) రేడియోని కనిపెట్టిన "మార్కొనీ" జయంతి. ఈ "మార్కొనీ జయంతి" సందర్భంగా రేడియోకి విశిష్ఠ సేవలను అందించిన కొందరు రేడియో ప్రముఖులకు కొన్ని స్మారక అవార్డులను గత కొన్నేళ్ళుగా విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్ వారు ఇస్తున్నారు. ఈ ఏటి మార్కొనీ జయంతి సందర్భంగా నిన్నటి రోజున ముగ్గురు రేడియో ప్రముఖులకు సన్మాన పురస్కారాలను అందజేసారు. విజయవాడ కృష్ణవేణీ కియేషన్స్, హైదరాబాదు త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఎనౌన్సర్ శ్రీ బి.జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ(కళాసుబ్బారావు వేదిక)లో నిన్న సాయంత్రం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ముగ్గురు రేడియో ప్రముఖులు - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి, విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ, విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు) అవార్డులు అందజేసారు. మార్కొనీ వంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ పురస్కారాలను అందుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పురస్కార గ్రహీతలు చెప్పారు.


అవార్డుల వివరాలు:

* విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్, గాయని స్వర్గీయ వి.బి.కనకదుర్గ స్మారక అవార్డ్ - రేడియో నాటక కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారికి,
* న్యూస్ రీడర్ తిరుమలశెట్టి శ్రీరాములు స్మారక అవార్డ్ - విశ్రాంత న్యూస్ రీడర్ శ్రీ ఏడిదగోపాల్రావు గారికీ,
* ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్ట్ స్వర్గీయ శ్రీ గోపాల్ అవార్డ్ - విశ్రాంత అనౌన్సర్ శ్రీ ఎస్.బి. శ్రీరామ్మూర్తి గారికి(మా నాన్నగారు)


ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమణాచారి గారు ఇటీవలే "దేవస్థానం" సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారుట. రచయిత, కవి, విమర్శకుడు, రిటైర్డ్ ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ శ్రీ సుధామ గారు(మన "సుధామధురం" బ్లాగర్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ సుధామగారు స్టేజ్ పై మాట్లాడుతూ మన తెలుగుబ్లాగులు గురించి కూడా చెప్పారు. అందులో వారు నా బ్లాగ్ గురించి కూడా ప్రస్తావించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి శైలజా సుమన్ గారు కూడా తన ప్రసంగంలో పాత రేడియో రోజులను, తన రేడియో జ్ఞాపకాలనూ తలుచుకున్నారు.


ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు శ్రీ పాలక రాజారావు, హైదరాబాద్ దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు, ING Life Insurance Co. Ltd బ్రాంచ్ మేనేజర్ శ్రీ వంకదారు హరికృష్ణ పాల్గొన్నారు.



సుధామ గారు :

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు :

శ్రీ ఏడిదగోపాల్రావు గారు :

ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు(మా నాన్నగారు) :



మా నాన్నగారి గురించి నా బ్లాగ్ లో నేను అదివరకూ రాసిన టపాలు చదవనివారికి ఈ లింక్స్:

http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_21.html

http://trishnaventa.blogspot.com/2010/10/2.html

http://trishnaventa.blogspot.com/2010/10/3.html

http://trishnaventa.blogspot.com/2010/10/4_26.html

http://trishnaventa.blogspot.com/2010/10/5.html

http://trishnaventa.blogspot.in/2010/10/6.html

http://trishnaventa.blogspot.com/2010/11/blog-post.html




Friday, June 3, 2011

ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...




ఒక పువ్వుని చూసి సంతోషించటం నేర్పావు
ఒక పాట విని ఆస్వాదించటం నేర్పావు
వర్షపు జల్లుల్లో పులకించటం నేర్పావు


పుస్తకంలో ఆప్తమిత్రుడ్ని చూపెట్టావు
ఎదుటి మనిషి బాధను గుర్తించటం నేర్పావు
తల వంచుకోవటంలోని ఉపయోగాలు చెప్పావు


మనిషిలానే కాక మనసుతో కూడా బ్రతకాలని చూపెట్టావు
బ్రతుకుబడిలో నువు నేర్చుకున్న పాఠాలు మాకూ నేర్పావు


అన్యోన్యతకు ఉదాహరణై నిలిచావు
ఆప్యాయతకు అర్ధాన్ని చూపెట్టావు

ఇంతకంటే విలువైన ఆస్తులు ఎవరివ్వగలరు?
ఇంతకు మించిన విలువలు ఎవరు నేర్పగలరు?

ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...
పుట్టినరోజు శుభాకాంక్షలు.






Monday, November 1, 2010

కొసమెరుపు : నాన్న స్వరం + పైంటింగ్స్



నాన్నగారి వాయిస్ వినిపించమని కొందరు బ్లాగ్మిత్రులు అడిగినందువల్ల కథ అయిపోయినా, ఈ చిన్న కొసమెరుపు దానికి జోడిస్తున్నాను.
నాన్న చేసిన "29minutes in 4th dimension" అనే కార్యక్రమంలో నాన్న చదివిన కొన్ని కవితలు ఇక్కడ పెడుతున్నాను. ఈ కవితలు నాన్నగారి రేడియోమిత్రులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "నిశ్శబ్దం గమ్యం" అనే కవితా సంపుటిలోనివి.


మౌనం ఖరీదైనది..  


2)మెలికలు తిరిగిన ..  

3)కుప్పించి ఎగసి ..


***  
నాలుగైదు వాయిద్యాలు వాయించటం, మిమిక్రీ చేయటం, ఫొటోగ్రఫీ, ఏడ్స్ కు రాయటం-వాయిస్ ఇవ్వటం, కవితలు రాయటం, బొమ్మలతో జోక్స్ రాయటం, పైంటింగ్స్ వేయటం మొదలైన హాబీ లన్నింటిలో నాన్న ఎక్కువగా చేసినది పైంటింగ్స్ వేయటమే. చాలావరకూ ఎందరికో బహుమతులుగా ఇవ్వటానికి మాత్రమే వేసారు ఆయన. ఇంట్లో మిగిలిన అతికొద్ది నాన్న పైంటింగ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను.











నాన్న గీసిన ఈ రేఖాచిత్రం ఒక పత్రికలో ప్రచురితమైనప్పుడు ఒక అభిమాని ఆ బొమ్మను ఇలా వెల్డింగ్ చేయించి తీసుకువచ్చి ప్రెజెంట్ చేసారు. (మా చిన్నప్పుడు నాన్న వేసిన బొమ్మలు, బొమ్మలతో రాసిన జోక్స్ కొన్ని పత్రికలలో ప్రచురితమయ్యేవి.)




నాన్న బయటకు వెళ్ళినా, ఆఫీసుకు వెళ్ళినా భుజానికి ఎప్పుడూ ఒక బేగ్ ఉండేది. అందులో ఒక స్కెచ్ బుక్స్ ఉంటూ ఉండేవి. ఎక్కడైనా మంచి సీనరీ or మంచి కన్స్ట్రక్షన్ కనబడితే ఒక రఫ్ స్కెచ్ గీసేసుకునేవారు. సరదగా Doodling కూడా చేస్తూండేవారు. వాటిని మళ్ళీ వేయటానికి నేనూ, తమ్ముడూ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ స్కెచ్ బుక్స్లోని కొన్ని బొమ్మలు..






======================================

Small Note:

మౌనంగా ఆగిపోవటం "తృష్ణ" కు రాని పని...:)
There won't be any posts in this blog for some days..!
till then..Keep smiling...bye bye :)


Wednesday, October 27, 2010

రావుడు నుంచీ "రామం" వరకూ... నాన్న కథ - 5 !!



looking at his own creation at mutyalampaDu Art Gallery


Oct 27, 2:30p.m
విజయచిత్ర పత్రిక మొదలెట్టినప్పటి నుంచీ అప్టుడేట్ గా అన్ని సంచికలూ వరుస ప్రకారం క్రమం తప్పకుండా బైండ్ చేయించి పదిలపరిచేది రామం సతీమణి సీత. తన చిన్నప్పటినుంచీ సినిమా హాళ్ళలో రామం కొని పదిలపరిచిన రెండొందలకు పైగా సినిమా పాటల పుస్తకాలు కూడా సీతే బైండ్ చేయించిండి. ఇవన్నీ కాక రామం స్వయంగా వివిధభారతి పోగ్రామ్ల కోసం ఉద్యోగంలో చేరకముందే దాదపు మూడువేల తెలుగు సినిమాపాటల రెడీ రికనర్(జంత్రీ), సినీ సంగీతదర్శకుల వ్యక్తిగత జంత్రీ, గేయ రచయితల జంత్రీ, శీర్షిక గీతాల జంత్రీ ఇవన్నీ సర్వకాల సర్వావస్థల్లో రామం భుజానికి తగిలించుకునే సంచీలో సిధ్ధంగా ఉండేవి. "సీతామాలక్ష్మి" సినిమాలో "అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే.." అన్నట్టు ఆ ముఫ్ఫై సంవత్సరాలలో ఎప్పుడు రామాన్ని కదిపినా పాటే. హిందీ, తెలుగు సినిమా పాటల్లో ఓపినింగ్ మ్యూజిక్ బిట్ గానీ, చరణాల మధ్యన వచ్చే ఇంటర్ల్యూడ్ మ్యూజిక్ గానీ, ఏది చెప్పినా ఆ పాట మొత్తం చెప్పే చాకచక్యం ఆ రోజుల్లో(ఇప్పటికీ) రామం సొంతం. ఈ సంగీత పరిజ్ఞానమంతా రేడియో కార్యక్రమాల తయారీకి ఎంతో దోహదపడేది. సినిమాపాటలతోనేకాక సినీపరిశ్రమకు చెందిన సాంకేతిక సమాచారాన్ని కూడా తనను విశేషంగా అభిమానించే రేడియో శ్రోతలకు అందించాలనే సదుద్దేశంతో యువవాణి విభాగంలో కూడా "వెండితెర వెలుగు జిలుగులు" శీర్షికతో కొన్ని సీరీస్ ప్రసారం చేసాడు రామం.(తన రేడియో శ్రోతల్ని "శబ్దమిత్రులు" అని సంబోధించి, వారికి మొట్టమొదట ఆ పేరు పెట్టినవాడు రామమే). సినిమాలలో విశాల పరిధి, నిడివి గల చిత్రాలను ’సినిమా స్కోప” అని పిలిచినట్లే తను నూతనంగా ప్రయోగాత్మకంగా శ్రోతల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమానికి "రేడియోస్కోప్ మల్టి కలర్ ప్రోగ్రాం" అని నామకరణం చేసిందీ రామమే. వీటన్నింటిలోనూ ఈనాటి ప్రైవేట్ ఎఫ్.ఎమ్ ఏంకర్ల వడి వేగం ఆనాడే రామం గొంతులో పలకటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ వినూత్న ప్రయోగాన్నైనా ఎంతో అభిమానంగా, ఆనందంగా స్వీకరించేవారు ఆనాటి రామం శ్రోతలు.






తన ముఫ్ఫై ఏళ్ళ రేడియో ప్రస్థానంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు చేయటానికి రామానికి అవకాశం వచ్చింది. అందునా సినీ, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు విజయవాడ కేంద్ర బిందువు కావటంతో ఎంతో మంది ప్రముఖులు విజయవాడ రేడియో కేంద్రానికి వస్తూ ఉండేవారు. రామం వివిధభారతి వాణీజ్యవిభాగంలో పనిచేయటం వల్ల ఇటువంటి ఎందరో ప్రముఖులను రేడియో శ్రోతలకు పరిచయం చేసే మహాభాగ్యం కలిగింది. అందులో కొన్ని వివిధభారతి కోసం మాత్రమే చేసిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు. 1971లో రామం హైదరాబాద్ వివిధభారతి కేంద్రంలో కేజువల్ అనౌన్సర్గా చేస్తున్నప్పుడు "సంబరాల రాంబాబు" చిత్రం ప్రదర్శిస్తున్నకాలంలో గాయకుడు బాలు హైదరాబాద్ రావటం తటస్థించింది. ఆ సందర్భంగా గాయకుడు బాలుతో రామం చేసిన పరిచయ కార్యక్రమం(ప్రత్యేక జనరంజని) హైదరాబాద్ వాణిజ్యవిభాగంలో ప్రసరమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ అదే మొదటి పరిచయకార్యక్రమం. బాలు రేడియోలో పాల్గొన్న తొలి తెలుగు పరిచయ కార్యక్రమం కూడా అదే.


interview with kamal hasan

interviews with Daasari, Bharani, Sirivennela, actress Roja


అలాగే తను విజయవాడ కేంద్రానికి మారాకా సినీరంగానికి చెందిన సావిత్రి, అంజలి, విజయ నిర్మల, కె.విశ్వనాథ్, జగ్గయ్య, ముళ్ళపూడి, కమల్ హాసన్, పద్మనాభం, సిరివెన్నెల, తనికెళ్ల భరణి, దాసరి, రోజా, సంగీతదర్శకులు పెండ్యాల, మాష్టర్ వేణూ; ఇతర కళారంగాలకు చెందినవారిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ప్రముఖ నాట్యాచార్యులు నటరాజరామకృష్ణ, విజయచిత్ర కెమేరామేన్ కె.ఆర్.వి.భక్త("అందాలరాశి" చిత్రనిర్మాత) మొదలైన ఎందరెందరో ప్రముఖులతో ఇంటర్వ్యూ లు రికార్డ్ చేసి, ప్రసారం చేసే అవకాశం లభించింది. విజయవాడ కేంద్రానికి లేదా ఊళ్ళోకి ఏ ప్రముఖులొచ్చినా రేడియోలో వారిని పరిచయం చెయ్యటానికి రామానికే ఎక్కువ ఆహ్వానాలు లభించటం ఒక పక్క ఆనందాన్ని కలగజేసినా రాను రానూ శలవురోజు అయినా, డ్యూటీ ముగించికుని వచ్చి నిద్రోతున్నా కేంద్రానికి దగ్గరగా క్వార్టర్స్ లోనే ఉండటంవల్ల ఈ పిలుపుల తాకిడి మరీ ఎక్కువై, కొంత బాధాకరంగా పరిణమించాయి అనటం అతిశయోక్తి కాదు. దీనికి తోడు ప్రొఫెషనల్ జెలసీ ఉండనే ఉండేది. అందుకే కొన్నిసార్లు తప్పించుకోక తప్పేది కాదు.


interview with Sri V.A.K.Rangarao


*** *** ***

ఆకాశవాణి జాతీయ అవార్డ్ ల పరంపర లోకి రామం ప్రవేశించటం విచిత్రంగా జరిగింది. వారం వారం వివిధభారతి శ్రోతల కోసం అతను రూపొందించే ఒకానొక కార్యక్రమంలో "సినిమా ట్రైలర్" అనే వినూత్న ప్రయోగాన్ని రామం ఒకసారి చేసాడు. (ఈ "సినిమా ట్రైలర్" నే "సాహిత్యాభిమాని బ్లాగర్ "శివ"గారు ఆ మధ్యన వారి బ్లాగ్లో టపాగా పెట్టారు.) అది మొట్టమొదటిసారి రూపొందించినప్పుడు దానిలో వ్యాఖ్యానం ప్రముఖ రచయిత, కవి, రేడియోమిత్రులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు చదివారు. ఆ ప్రోగ్రాం ఎడిటింగ్ చేస్తూండగా అప్పట్లో హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ శ్రీనివాసన్ గారు అనుకోకుండా వచ్చి విని, "ఇదేదో ఇన్నోవేటివ్ ఐడియాలా ఉందయ్యా. దీన్ని నేషనల్ అవార్డ్ కు పంపకూడదు" అన్నరు. కానీ రామం పట్టించుకోలేదు. మళ్ళీ కొంతకాలం తరువాత ఆయనే వచ్చి "ఏం చేసావ్ నే చెప్పిన ఐడియా?" అని రెట్టించారు. ఇక తప్పదనుకుని ఆ చిన్న ఐడియా చుట్టూ మరికొన్ని నూతన ప్రయోగాలను జోడించి ఓ అరగంట ప్రోగ్రాం చేసాడు రామం. ఈసారి ఒక మార్పు కోసం సినిమా ట్రైలర్ వ్యాఖ్యానం కో-అనౌన్సర్, గాయకుడు, హాస్యప్రియుడు అయిన మల్లాది సూరిబాబుగారితో చదివించాడు. అదే రామానికి మొట్టమొదటి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన "నీలినీడలు". విజయవాడ కేంద్రానికి కూడా ఇన్నోవేటివ్(సృజనాత్మక) విభాగంలో తొలి జాతీయ బహుమతి.


రామానికి ఈ పంధా నచ్చి ఆ దారిలోనే అనేక సృజనాత్మక కార్యక్రమలకు రూపకల్పన చేసాడు రామం. ఇంచుమించు ప్రతిసారీ ఢిల్లీ న్యాయనిర్ణేతలకు(జ్యూరీకి) కూడా ఆ కాన్సెప్ట్ నచ్చి అవార్డ్లు ఇస్తూ వచ్చారు. మధ్య మధ్య రైతులు పంట మార్పిడీ చేసినట్లు ఒకోసారి మార్పు కోసం ఓ మంచి నాటకాన్నీ, మరోసారి మంచి సంగీతరూపకాన్ని, ఇంకోసారి మంచి ఇతివృత్తంతో ఉన్న డాక్యుమెంటరీనీ రూపొందించి పోటీలకు పంపేవాడు రామం. అన్ని విభాగాలలో బహుమతులను సొంతం చేసుకున్నాడు అతను. అవార్డ్ ఇచ్చిన ప్రతిసారీ 'for best sound recording and music mixing' అని సైటేషన్ చదివి అవార్డ్ ఇచ్చేవారు. దాని కోసమే తాను ఢిల్లీ దాకా వెళ్ళేవాడు. కేవలం రెండు మూడు మైకులతో రికార్డింగ్ చేసే చిరకాల ఆకాశవాణి పధ్ధతికి స్వస్తి చెప్పి ఏడెనిమిది చానల్స్లో మ్యూజిక్ రికార్డింగ్ చేసి, సింగిల్ ట్రాక్ పైనే మల్టీఛానల్ రికార్డింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగ ఎంతో శ్రమించేవాడు సౌండ్ ఇంజినీర్ రామం. ఇందుకోసం రికార్డింగ్ స్టూడియోలో ఎన్నో మార్పులు చేర్పులూ, కొత్త పరికరాలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసాడు రామం. దానికి ప్రతిఫలం ఢిల్లోలో దక్కేది. 'ఇది ఆకాశవాణి రికార్డింగ్ కాదు, బయట కమర్షియల్ స్టూడియోలో రికార్డ్ చేసినది' అని ఢిల్లీ పెద్దలు అనుమానం వ్యక్తపరిచేవారు కూడా.


ఈ అవార్డ్ కార్యక్రమాల పరంపర 1980 నుంచీ 2000 వరకూ నిరవధికంగా కొనసాగింది. మిగిలిన అవార్డ్ ప్రోగ్రాముల వివరాలు....


(తదుపరి భాగంలో...)


Tuesday, October 26, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 4 !!

మూడవ భాగం తరువాయి...

recording of a children's play produced by ramam

Oct 26, 8.30a.m
ఆ విధంగా వివిధభారతిలో వైవిధ్యమైన కార్యక్రమాల ద్వారా " When God closes one door, he opens another.." అన్న సూక్తిని నిజం చేస్తూ మద్రాస్ లో దాగుండిపోయిన కలలో కొన్నింటినన్నా రేడియో ద్వారా తీర్చుకునే సువర్ణావకాశాన్ని భగవంతుడు రామానికి అందించాడు. డైలీ డ్యూటిలతో పాటూ తనకు మొదటి నుంచీ ఇష్టమైన పిల్లల కార్యక్రమాలు అనేకం సమర్పించే అవకశాలు వచ్చాయి. ప్రముఖ ఆకాశవాణి కళాకారులు, హాస్య రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు అప్పట్లో పిల్లల కార్యక్రమం ప్రొడ్యూసర్ గా ఉండటం వల్ల రామంలోని పిల్లల పట్ల ఆసక్తిని గమనించి అనేక పిల్లల కార్యక్రమాలు రూపొందించే ఫ్రీ హాండ్ ఇచ్చారు. అందులో భాగంగా అనేక వారాలు సీరియల్గా వచ్చిన ఉపనిషత్ కథలు ఒకటి. ఇంటి చుట్టూ పిల్లలని పోగేసి ఓపిగ్గా వాళ్ళతో రిహార్సల్స్ చేయించి చక్కని సంగీతానికి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి ఈ సీరియల్స్ రూపొందించేవాడు రామం. అలాంటిదే మరో సీరియల్ "అల్లరి గోపి". అల్లరి చేసే ఓ కొంటె పిల్లాడిని ఓ సీతాకోకచిలుక తన మాయాజాలంతో అణుమాత్రంగా మార్చేసి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించి అతని మానసిక పరివర్తన తేవటం ఇందులో ఇతివృత్తం. ఈ సీరియల్ లో ఉపయోగించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల ఇది పిల్లల పసి మనసుపైన చరగని ముద్ర వేసింది. తరువాత ఇది రష్యన్ భాషలో కూడా రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ఏళ్ళ తరువాత ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో ప్రముఖ హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్ దర్శకత్వంలో "హనీ ఐ ష్రంక్ ద కిడ్స్" అనే పేరు మీద ఈ నాటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకపోయినా అద్భుతమైన పిల్లల చిత్రంగా రావటం.


అలాంటిదే "అల్లాఉద్దీన్ అద్భుతదీపం" నాటిక. పేరు పొందిన సినిమా సంస్థల్లాగ, రామం చేతిలో ఒక చురుకైన పిల్లల బృందం ఎప్పుడు తయారుగా ఉండేది. వాళ్ళు ఏ నాటకానికైనా సిధ్దమే. మెత్తని మైనంలాగ మలచుకునే అవకాశం ఉన్న పిల్లలు. అంతేకాక ఇంకా కొత్త కొత్త పిల్లలకు కూడా రామం ద్వారా అవకాశాలు దొరుకుతూ ఉండేవి. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రెంటాల గోపాలకృష్ణగారి కుమార్తె, ప్రస్తుత ప్రముఖ బ్లాగర్, రచయిత, కవయిత్రి, మిత్రులు రెంటాల కల్పనగారు కూడా దాదాపు పదేళ్ళ ప్రాయంలో రామం రూపొందించిన ఒక సీరియల్ లో పాల్గొన్న స్వీట్ మెమొరీని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. "టాం సాయర్" సీరియల్ తాలూకూ క్రింది ఫోటోలో కల్పనగారు కూడా ఉన్నారు.


Team of ramam's 'Tom sawyer' Radio play


ఈ సీరియల్ వెనుక చిన్న కథ ఉంది. రామం పుట్టి పెరిగిన ఖండవిల్లి గ్రామానికి డైలీ న్యూస్ పేపర్ రావాలంటే మధ్యాహ్నం మూడు గంటలు దాటేది. అప్పుడే ఆ రోజు పేపర్ చదువుకోవటం. అలాగే రామం వాళ్ళ ఇంట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీలు కూడా రెగులర్ గా తెప్పించేవారు. అప్పట్లో వారపత్రిక వెల పావలా. ఆ కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అనేక పిల్లల సీరియల్స్ వస్తూండేవి. మద్దిపట్ల సూరిగారి అనువాదం "పథేర్ పాంచాలి", జూల్స్ వెర్న్ నవల "సాగర గర్భంలో సాహస యాత్ర", మార్క్ ట్వైన్ రచించిన సుప్రసిధ్ధ పిల్లల నవల "టాం సాయర్", ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు" వంటి అనేక రోమాంచితమైన రచనలు వచ్చేవి. ఏ ఇతర ప్రచార సాధనాలూ లేని ఆ ఊళ్ళో రామానికి ఈ వారపత్రికలే ముఖ్యమైన ఆకర్షణలు. ప్రతి పరిణితి చెందిన వ్యక్తిలోనూ ఒక పసి బాలుడు దాగి ఉంటాడు అని మార్క్ ట్వైన్ చెప్పినట్లు ఈ రచనలన్నీ రామం హృదయం మీద చెరగని ముద్ర వేసాయి. అందులోనూ వీరోచిత కృత్యాలతో నిండిన బాల నాయకుడు "టాం సాయర్" రామానికి ఆదర్శప్రాయుడైయ్యాడు. ఈ క్రెడిట్ అంతా మార్క్ ట్వైన్ పిల్లల కోసం రాసిన నవలాన్నీ అద్భుతంగా అనువాదం చేసిన నండూరి రామ్మోహనరావు గారికే దక్కుతుంది. దాదాపు 15,20 ఏళ్ళ తరువాత రామం రేడియోలో స్థిరపడ్డాక "టాం సాయర్" సీరియల్ పిల్లల కోసం ప్రసారం చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. అదృష్టవశాత్తు ఆ అవకాశం అతనికే దక్కింది. ఏ కథైతే తను చిన్నతనంలో తన మనసుకి అయస్కాంతంలా అతుక్కుపోయిందో దాన్నే మళ్ళీ పిల్లల సీరియల్గా శబ్ద రూపంలో స్వయంగా రూపొందించే అవకాశం దక్కటం రేడియో తనకు ప్రసాదించిన అపూర్వమైన అదృష్టంగా రామం ఇప్పటికీ భావిస్తాడు.


పది వారాల పాటు దిగ్విజయంగా పిల్లల ప్రశంసలు పొందుతూ ప్రసారమైన ఈ సీరియల్ పూర్తి నీడివి మూడున్నర గంటలు. అంటే ఓ రాజ్కపూర్ సినిమా అంత. ఇది రామం కలలలో ఒకటి. అందుకే ఇందులో తన పిల్ల బృందంతో పాటూ కొన్ని పెద్ద వయసు పాత్రలను లబ్ధప్రతిష్ఠులైన సీతారత్నమ్మగారిలాంటి రేడియో కళాకారులు కొందరు పాలుపంచుకున్నారు. అప్పట్లో రేడియో శబ్ద మాంత్రికులుగా పేరుగాంచిన సీ.రామ్మోహన్రావు, నండూరి సుబ్బారావుగారు వంటి చెయ్యి తిరిగిన కళాకారుల చేత "పొట్టిబావా బాగా చేస్తున్నావోయ్.." అని ప్రత్యేక ప్రశంసలు పొందటం రామం జీవితంలో నేషనల్ అవార్డ్స్ కంటే అపూర్వమైన అనుభూతి. నండూరి రామ్మోహన్ రావుగారి నవలను రేడియోకి అనువదించి అద్భుతమైన సంభాషణలు రాసిన ప్రముఖ రచయిత, సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు కూడా ఎంతో అభివందనీయులు. ఈ సీరియల్లో వాడిన డజన్ల కొద్దీ సౌండ్ ఎఫెక్ట్స్, కథా గమనానికి అనువైన నేపధ్య సంగీతం కోసం రామం ఎంతో శ్రమించాడు. అంతే కాక "టాం సాయర్" పోలీ పెద్దమ్మ, పిల్లి నటించిన సీన్ లో ’పిల్లి ’ రామమే. అర్ధరాత్రి టాం సాయర్, హక్ భయపడే కుక్కల సీన్ లో ’కుక్క ’ కూడా రామమే. ఇవన్నీ కాక అవసరార్ధం ఎన్నో చిన్న చిన్న పాత్రలు కూడా రామమే ధరించాల్సివచ్చింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా "టాం సాయర్" సీరియల్లోని ఏదో కొంత భాగాన్ని గీతా పారాయణంలాగ తరచు వింటూ ఉండటం ఇప్పటికీ రామం నిత్య కృత్యాల్లో ఒకటి. ఇక ఆ సీరియల్లోని సీన్లు, డైలాగులన్నీ ఇంటిల్లిపాదికీ కంఠతావచ్చు. "టాం సాయర్", "హకల్ బెరిఫిన్" రెండు ఆంగ్ల చిత్రాల కంటే ఈ శబ్దరూపకమే బాగా వచ్చిందని రామం ఘట్టి అభిప్పిరాయం(బుడుగ్గడిలాగ).



జర్నలిస్ట్, ప్రఖ్యాత సైన్స్ రైటర్ పురాణపండ రంగనాథ్ గారు రేడియోకి ఎన్నో శాస్త్రీయ రచనలు చేస్తూ ఉండేవారు. అలాగే పిల్లల కోసం కూడా ఎన్నో సైన్స్ నాటకాలు రాసారు. అందులో ఒక స్టేజ్ నాటకం పేరు "రోపోడా"(రోగాలు పోగొట్టే డాక్టర్?) దురదృష్టవశాత్తు బాల్యంలోనే వృధ్ధాప్యం దాపురించిన ఓ పిల్లవాడు ఒక విచిత్రమైన కాలయంత్రం ద్వారా తిరిగి యవ్వనాన్ని పొందటం ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసన్, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రయాగ వేదవతిగార్ల నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో ఈ నాటకాన్ని నిర్వహించి, కలా నిజమా అని భ్రమించేలాగ ఓ కాలయంత్రాన్ని కృత్రిమంగా సృష్టించి పత్రికల ప్రశంసలు పొందాడు రామం. ఇంతా చెస్తే ఆ యంత్రం తయారిలో వాడిన భాగాలన్నీ రేడియో స్టేషన్లోని ఇంజినీరింగ్ విభాగంలో పనికిరాకుండా పడేసిన పరికరాలే. మళ్ళీ ఇదే నాటకాన్ని అదే బృందంతో శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్లోని బహిరంగ రంగస్థలంపై అనేకమంది సాంకేతిక నిపుణులు, సైంటిస్ట్ ల్లు, సామాన్య ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించి వారి మెప్పును కూడా పొందటం జరిగింది. ఈ క్రింది ఫోటోలోనిదే ఆ యంత్రం.







దీని తరువాత, పిల్లల కార్యక్రమాల్ని పర్యవేక్షించే శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారి ప్రేరణతో తానే ఒక పిల్లల సంగీత కథారూపకం "చింటూ - బిజ్జూ" రూపొందించి సీరియల్గా ప్రసారం చేసాడు రామం. ఇందులో కథనం, పాటలూ, మిమిక్రీ అన్ని రామమే. దీని నిడివి ఒక గంట.


*** *** ***


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫైనలియర్ పరీక్షాంశంగా సబ్మిట్ చేసిన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" అనే థీసీస్ లో ఒక చాప్టర్ "బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్స్"( సినిమాలలో నేపథ్యసంగీతం). రామానికి ఇష్టమైన సబ్జక్ట్స్ లో ఒకటి. విజయచిత్ర పత్రికవారు ఇదే అంశం పైన నిర్వహించిన పోటిలో రామానికి ప్రధమ బహుమతి లభించింది. దాని న్యాయ నిర్ణేత ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు(ప్రముఖ నటి అంజలీదేవి భర్త). ఇదే అంశంపై ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో రెండువారాలు ధారావాహికగా ప్రచురితమైంది. తనకెంతో ఇష్టమైన ఇదే అంశం మీద తను రాసిన మరో ప్రత్యేక వ్యాసం ఆంధ్రప్రభవారు అరవైఏళ్ళ తెలుగు సినీ చరిత్రను పురస్కరించుకుని ప్రచురించిన "మోహిని" లో చోటుచేసుకుంది.


ఇవన్నీ కాక తొలినాటి మూకీల నుంచి, నేటి DTS వరకూ తెలుగు చలనచిత్ర నేపథ్యసంగీతానికి సంబంధించిన అనేక ఆడియో క్లిప్పింగ్స్ తో ఆ పరిణామక్రమం ప్రేక్షక శ్రోతలు సులువుగా అర్ధమయ్యే రీతిలో సోదాహరణాత్మకంగా వివరించే స్టేజ్ షోలు అనేకం విజయవాడ, నెల్లూరు, భీమవరం మొదలైన చోట్ల స్వయంగా నిర్వహించి ఆహూతుల మన్ననలు అందుకున్నాడు రామం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన పత్రికలవారు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే కారణంగా అకాశవాణి తరచూ బయటఊళ్ళలో నిర్వహించే OBలు(స్టేజ్ షోలు) ఎన్నింటికో రామాన్నే ప్రత్యేక వ్యాఖ్యాతగా తీసుకెళ్ళేవారు.

గాయకులు బాలు నిర్వహణలో కొనసాగిన "పాడుతా తీయగా" విజేతలతో (ఉష, పార్థసారథి,రామాచారి) విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోకి కూడా రామం వ్యాఖ్యాతగా, అనుసంధానకర్తగా తన పాత్ర విజయవంతంగా పోషించి, ఆ షోలో బాలు రాని లోటును తీర్చాడని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు పొందాడు. ఆ క్రెడిట్ విజయవాడ "రసమంజరి" సంస్థ వారిదే.

*** *** ***
జాతీయ స్థాయిలో మొట్టమొదటి సైన్స్ సీరియల్ ప్రొడ్యూస్ చేసేందుకు ఢిల్లీ నుంచి పిలుపు అందుకున్నాడు రామం. మూడు నెలలు అక్కడ ఉండి ఢిల్లీలో పనిచేయటం మరపురాని అనుభూతి తనకు. తరువాత మళ్ళీ 1990లో నూతనంగా ప్రారంభించిన తెలుగు విదేశీ ప్రసారవిభాగం ఇ.ఎస్.డి.లో ప్రారంభ అనౌన్సర్ గా ఏ.బి.ఆనంద్ గారితో పాటు కలిసి పనిచేయటానికి ఆహ్వానం రావటం అతనికి ఢిల్లీ దాకా ఉన్న గుర్తింపుకి మచ్చుతునక. ఈ కారణాలతో ఢిల్లీ ఆకాశవాణి భవన్లో పని చేయటం వల్ల ఢిల్లీ అంటే కూడా ప్రేమ ఏర్పడింది అతనికి.

(ఇంకా ఉంది...)

Saturday, October 23, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 3 !!

రెండవ భాగం తరువాయి...

ramam performing first programme
శ్రీరామ్మూర్తి లాంటి వాళ్లకోసమే అన్నట్లు ఆకాశవాణిలో "యువవాణి" విభాగం కొత్తగా దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రతి శుక్రవారం ఉదయం విజయవాడ కేంద్రo నుంచి ఒక యువ శ్రోత తనకు నచ్చిన ఎనిమిది పాటలు వ్యాఖ్యానంతో సహా వినిపించే ప్రత్యేక అవకాశం వచ్చింది. దానిలో భాగంగానే శ్రీరామ్మూర్తికీ ఒక ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. తను మద్రాస్ లో ఉండగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కోసం తయారుచేసి పెట్టుకున్న స్క్రిప్ట్ లు ఎప్పుడు అతని దగ్గర రెడిగా ఉండేవి. అందులో ఒకటి "మూడ్స్ అండ్ మ్యూజిక్". ఒకరోజు సాయంత్రం విజయవాడ కేంద్రంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్, ప్రముఖ కర్ణాటక సంగీట విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారితో ఈవెనింగ్ వాక్ చేస్తూ ఈ కాన్సెప్ట్ గురించి చెప్పే అవకాశం దొరికింది శ్రీరామ్మూర్తికి. అది ఎంతో శ్రధ్ధగా విన్న ఓలేటిగారు "బావుంది. ఇది మా స్టేషన్కే కొత్త ఐడియా.యువవాణిలో ఓ అరగంట దీని మీద ప్రోగ్రామ్ చేయండి" అని, అప్పటి యువవాణి విభాగం అధినేత శంకరనారయణగారికి( ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారి సొదరుడు) పరిచయం చేసారు. ఆ ప్రోగ్రాం పేరు "భావనా సంగీతం". ఎవరో కుర్రకళాకారుడు అని తీసిపారేయక తానే స్వయంగా లైబ్రరికి వచ్చి కావాల్సిన రికార్ద్లన్నీ తీయించి ఇచ్చి, ఆ ప్రోగ్రాంకి పరిచయ వాక్యాలు కూడా తానే చదివి దగ్గరుండి ఆ కార్యక్రమం తయారు చేయించారు శ్రీ ఓలేటి. విజయవాడ, హైదరబాద్ రెండు కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారమైన ఈ కార్యక్రమానికి ప్రముఖుల ప్రశంసలు లభించటమే కాక B-high grade కూడా లభించింది. అప్పట్లో అదొక రికార్డ్. అందుకే ఆ కార్యక్రమం మళ్ళీ ఎన్నోసార్లు ప్రసారం చేసారు విజయవాడవారు.


aparanji arts, E.S.murthy from left
ఇక రేడియోనే తన తదుపరి మజిలీ అని నిర్ణయించుకున్నాడు శ్రీరామ్మూర్తి. కాకినాడ తిరిగి వచ్చి తన మిత్రుడు, గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్, దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి మేనల్లుడు అయిన ఈ.ఎస్.మూర్తి తో కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో యువవాణి కార్యక్రమాలు ఇచ్చాడు. అవన్నీ పున: పున: ప్రసారం అవుతూనే ఉండేవి. (ఆ తరువాత కాలంలో ఈ.ఎస్.మూర్తి తన మద్రాసు ప్రస్థానంలో కొంతకాలం బాలు దగ్గర, ఎంతో కాలం సంగీత దర్శకులు ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా పనిచేసారు.) కార్యక్రమానికి వెళ్ళిన ప్రతిసారీ విజయవాడ కేంద్ర ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు రఘురాం గారు ఈ కాకినాడ బేచ్ ని గేట్ దాకా సాగనంపి మళ్ళీ మంచి ప్రోగ్రాం తీసుకురండి అని వీడ్కోలు పలికేవారు. టాలెంట్ ఉన్న యువశక్తిని ప్రోత్సహించే సుగుణం ఆనాటి పెద్దల్లోనే ఉండేది. ఈ ప్రోత్సాహమే 1970లో విశాఖపట్నంలోనూ, 71లో హైదరబాద్ వివిధభారతిలో కేజువల్ అనౌన్సర్ గా పని చేసే అవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న కాలంలో ప్రముఖ వేణుగాన విద్వాంసులు కీ.శే. ఎన్.ఎస్.శ్రీనివాసన్, వారి సతీమణి, నాటక విదుషీమణీ శ్రీమతి శారదా శ్రీనివాసన్ చూపిన ఆదరణ, వాత్సల్యం అతని జీవితంలో ఎప్పటికీ మరువలేనివి.




రామానికి పదేళ్లప్పుడు జరిగిన వాళ్ళ అక్క పెళ్ళి తరువాత చేరువైన బావగారి కుటుంబం అతని కుటుంబంగా మారింది. బంధుత్వాలు, వాటి ఆప్యాయతలూ ఎరుగని ఒంటరితో మచ్చిక చేసారు వారంతా. 1970లో తన బావగారి చెల్లెల్లినే ఇచ్చి పెళ్ళి చేస్తానన్నారు మామగారు. సరైన ఉద్యోగం లేదని రామం తాత్సారం చేసినా ఇరిపక్షాల వత్తిడితో వివాహానికి అంగీకారం తెలిపాడు అతను. ఇద్దరి పేర్లు, మనసులు కలిసాయి. సీతారాములు ఒకటైయ్యారు. సంసారసాగరం మొదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఎంతో సహనవతి, అనుకూలవతి సీత. అన్యోన్యదాంపత్యం అంటే వాళ్ళిద్దరిదే అనిపించేది అందరికీ. రేడియోనే జీవితంగా బ్రతికే అతని మనసుని అర్ధం చేసుకుని, పిల్లల చదువులు మొదలు ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకునేది సీత. ఇల్లు మారితే "డ్యూటీ అయ్యాకా ఆఫీసు నుంచి ఫలానా అడ్రస్కు వచ్చేయండి" అంటే అక్కడికి వెళ్ళటం మినహా రామం మరేమీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

పర్మనెంట్ అనౌన్సర్ గా సెలక్ట్ అయిన తరువాత శ్రీరామ్మూర్తి ప్రస్థానం ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి మారింది.1972 నుంచీ 2002 వరకూ పర్మనెంట్ సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ గా శ్రీరామ్మూర్తి జీవితం నిరాటంకంగా కొనసాగింది. అనౌన్సర్ గా డైలీ షిఫ్ట్లు చేస్తూనే సినిమా సంగీతం పైన, లలిత సంగీతం పైన, వాద్య సంగీతాల పైన ఎన్నో కార్యక్రమాలు "రామం" పేరుతో రూపొందించాడు అతను. వారానికో శీర్షిక ఎంచుకుని అనువైన పాటలు, ఆకట్టుకునే వ్యాఖ్యానంతో "సరాగమాల" కార్యక్రమం కొనసాగింది కొన్ని సంవత్సరాలు. తన కాలేజీరోజుల్లో "ఆంధ్రసచిత్రవారపత్రిక"లో సినిమా సంగీతం పైన సరాగమాల పేరుతో వి.ఏ.కె.రంగారావు గారు నిర్వహించిన కార్యక్రమానికి గుర్తుగా ఆ పేరే ఈ కార్యక్రమనికి కూడా పెట్టుకున్నాడు రామం. తరువాత రేడియో సిలోన్ లో "అమీన్ సయానీ" వారం వారం సమర్పించే బినాకా గీత్ మాలా క్రమం తప్పకుండా విని ఆయన ఒరవడిని ఆకళింపుచేసుకున్న రామం ఆయన అడుగుజాడల్లోనే తెలుగులో కూడా అలాంటి కార్యక్రమం శ్రోతలకు అందించాలని "ఇంద్రధనసు" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు అతను.


ప్రతివారం ఒక సంగీత వాయిద్యాన్ని పరిచయం చేస్తూ దాని రూపురేఖలు, పుట్టు పూర్వోత్తరాలూ వివరిస్తూ, దాన్ని శాంపిల్ గా వినిపిస్తూ, అదే వాయిద్యాన్ని వివిధ సంగీత దర్శకులు తెలుగు పాటల్లో ఎలా వినియోగించారో శోదాహరణాత్మకంగా చెబుతూ "ఇంద్రధనసు" కార్యక్రమాన్ని రూపొందించేవాడు రామం. వారం వారం వందలాది శ్రోతల ఉత్తరాలు ఉత్తరాల కార్యక్రమాన్ని ముంచెత్తేవి. రేడియో స్టార్ రామాన్ని చూడటానికి విజయవాడ కేంద్రానికి, కొందరు రామం ఇంటికి కూడా వస్తూనే ఉండేవారు. ఇక గ్రీటింగ్ కార్డ్లు, బహుమతులు, పార్సిల్స్ లెఖ్ఖే లేదు. భారతీయ వాయిద్యాలైన వీణ, వేణువు, సితార్, సంతుర్, షహనాయ్ వంటి వాయిద్యాలే కాకుండా పాశ్చాత్య వాయిద్యాలైన ఎకార్డియన్, గిటార్, ట్రంపెట్, సాక్సో ఫోన్, మాన్డొలీన్, మౌత్ ఆర్గాన్ వంటి అనేక వాద్యాల గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించే ఈ కార్యక్రమం తెలుగు సినీగీతాల కూర్పుతో 25వారాల పాటు దిగ్విజయంగా కొనసాగింది. 25వ వారం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసాడు రామం. (హిందీలో అమీన్ సయానీ దాదాపు 25 సంవత్సరాల పాటు నిర్వహించిన బినకా గీత్ మాలా నే దీనికి స్ఫూర్తి.) ఆఖరు రోజు శ్రొతలందరూ ఆనంద భాష్పాలతో కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. ఆ రోజును ఇప్పటికీ తలుచుకుంటున్న శ్రోతలు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రోతలు ఆ వీడ్కోలు కార్యక్రమంలో ప్రత్యక్ష్యంగా పాల్గోవాలని రేడియో రామం ఒక ఇంద్రజాలం చేసాడు. అది ఆకాశవాణి చరిత్రలోనే వినూత్న ప్రయోగం.


అదేమిటంటే, అరగంట ప్రోగ్రాం కొద్ది నిమిషాల్లో పూర్తవుతుందనగా శ్రోతలని రేడియో సెట్ల దగ్గరకు ఆహ్వానించాడు రామం. మీ ఎడమ చేయి రేడియో సెట్ మీద పెట్టి, కుడి చేయి గాల్లో ఎడమ నుంచి కుడికి మూడుసార్లు అడ్డంగా కదపండి అని 1,2,3 చెప్పాడు రామం. నలభై కిలోమీటర్ల పరిధిలో వివిధ భరతి వింటున్న శ్రోతలందరూ రామం చెప్పినట్లే మంత్ర ముగ్ధుల్లా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ తో అతను చెప్పినట్లే చేసారు. "చూసారా..మీకు తెలీకుండానే ఇంద్రధనసు కు వీడ్కోలు చెప్పేసారు.." అని నవ్వుతూ చమత్కరించాడు రామం. ఆ కాసేపూ తను ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ అయ్యాడు. వివిధభారతి శ్రోతలంతా ప్రేక్షకులయ్యారు. ఈ ట్రిక్లో పాల్గొన్న శ్రోతలు మహదానందంతో మళ్ళీవారం ఉత్తరాల వర్షం కురిపించారు. ఆ రకంగా ఇంద్రధనసు ఆకాశవాణిలో చరిత్ర సృష్టించింది.


దాని తరువాత కొన్ని సంవత్సరాలపాటు "సంగీత ప్రియ" కార్యక్రమం రాజ్యమేలింది. ఇందులో ముఖ్యమైన ఆకర్షణ "singing partners" అనే అంశం. ఈనాటి టి.వి. "పాడుతా తీయగా"కు 30 ఏళ్లకు ముందే రామం ఈ అంశాన్ని ప్రవేశపెట్టాడు. అటు సినీమా ఫీల్డ్ కు వెళ్ళలేకపోయినా, ఇటు రేడియో సంగీతానికి అర్హత పొందలేకపోయినా, ఇంట్లో అద్భుతంగా పాటలు పాడే యువ కళాకారుల్ని వెతికి పట్టుకుని వారిచేత వివిధభారతిలో అద్భుతమైన పాటలు పాడించిన ఘనత రామానిదే. దానితో పాటూ కొంతమంది వాద్య కళాకారులను కూడా సంగీతప్రియ ద్వారా పరిచయం చేసాడు రామం. కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ రేడియోలో ప్రవేశించక ముందే వివిధభారతిలోని సంగీతప్రియ ద్వారా శ్రోతలను చేరిందంటే ఆశ్చర్యపడక తప్పదు.

రాత్రి పన్నెండు దాకా స్క్రిప్ట్ రాసుకుని, పొద్దున్న రేడియో స్టేషన్ తెరిచ గానే రికార్డింగ్ మొదలుపెట్టి, పదింటికల్లా పూర్తి చేసి టేప్ అప్పజెప్పి వచ్చేవాడు. ఇలాంటి అన్ని ప్రోగ్రాంల వెనుకా అన్ని సంవత్సరలూ రామం సతీమణి సీత అందించిన సహకారమే అతన్ని ముందుకు నడిపించింది - ఎందుకంటే తన ప్రతి కార్యక్రమానికీ ప్రధమ శ్రోత, క్రిటిక్ సీతే కనుక. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికల్లా వివిధభారతి శోతల్ని రేడియో దగ్గరకి లాక్కొచ్చి కూచోపెట్టిన ఖండవిల్లి రావుడు, "రేడియో రామం" గా స్థిరపడిపోయాడు.

(మూడవ భాగం పూర్తి...)