
తనకు తెలిసిన విజ్ఞానాన్ని,ప్రపంచాన్ని బిడ్దకు తెలియచెయ్యాలని తపన పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి సక్రమమైన మార్గంలోకి వెళితే తన జివితానికి సార్ధకత కలిగిందని పులకిస్తుంది మాతృహృదయం.ఆ సార్ధకతని నేనూ పొందాలని తాపత్రయపడే సగటు తల్లిని నేను.నేలపై పాకే పసిపాపను చూసి ఇది ఎప్పుడు నడుస్తుందొ..అనుకున్నాను.నడిచింది.పాపాయి బుడి బుడి నడకలను చూసి..ఇది ఎప్పుడు పలుకుతుందో అనుకున్నాను..ఇంకొన్నాళ్లకి పలికింది.."హృదయం ఎక్కడ ఉన్నది..అమ్మ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని సొంత కవిత్వం కూడా పాడింది!! ఇప్పుడు పలకపై "అ,ఆ లు " దిద్దుతోంది...నిన్న రాత్రి "ఆ నుంచి అం అ:" వరకూ తప్పుల్లేకుండా రాసింది...ఏమిటో ఆనందం..."తెలియని ఆనందం.."అని పాడాలనిపించింది. ఈ భావాలు ప్రతి తల్లి మనసులో పొంగేవే...ప్రతి తల్లిని సంతొషపరిచేవే...కానీ ఏదన్నా సరే మనదాకా వచ్చి మనం అనుభవిస్తేనే ఆ భావం మనకు పూర్తిగా అవగతమయ్యేది,అర్ధమయ్యేది...అనిపించింది.
అందుకేనేమో అన్నారు అమ్మతనంలో కమ్మతనం వర్ణనాతీతం అని!!