ఇప్పుడే వార్త విన్నాను... బాపూ..
ఇన్నాళ్ళకి విముక్తి లభించిందయ్యా నీకీ భవబంధాలనుండీ.. అని చటుక్కున అనిపించింది..
నీ ఆత్మకు ఇప్పుడెంత ప్రశాంతతో కదా!
ఎంత హాయిగా.. ఎంత స్వేచ్ఛగా.. ప్రాణమిత్రుడ్ని కలవడానికి రెక్కలు కట్టుకుని నింగికెగిరి ఉంటావో కదా..
ఇన్నాళ్ళ వియోగాన్ని ఎలా భరించావో కానీ నాకు మాత్రం చెప్పలేనంత దిగులుగా ఉండేది నిన్ను వార్తల్లోనో, పేపర్లోనో చూసినప్పుడల్లా...
అబ్బా ఈ దేవుడింత నిర్దయుడేంటబ్బా.. ఇలా ఒంటరిని చేసేసి చోద్యం ఎందుకు చూస్తున్నాడా అని వాపోయేదాన్ని...
ఏమో.. ఇంకా ఏ స్వామికార్యం నీతో చేయించుకోదలిచాడో నీ రాముడు.. అనుకునేదాన్ని!
పోనీలే.. ఇప్పుడు నిమ్మళమేగా..
ఇంక బెంగెందుకు.. ఇవాళ నేను హాయిగా నిద్దరోతా.
సృష్టి మొత్తంలో నాకు తెలిసిన ఇద్దరే ఇద్దరు ప్రాణమిత్రులు ఇక ఒకటయ్యారని సంతోషంతో నిద్దరోతా!!
ఈ జనాలకేమన్నా పిచ్చా..
ఎందుకిలా దు:ఖపడుతున్నారు నువ్వు లేవని??
ఎవరన్నారు నువ్వు లేవనీ..
పక్కింటి లావుపాటి పిన్నిగారిలో
ఆవిడ వెనుకనే నక్కి ఉన్న సన్నపాటి మెగుడుగారిలో
వంటింట్లో అప్పడాల కర్రలో
పొరుగింటి బుడుగ్గాడిలో
ఎదురింటి సీనాగపెసూనాంబలో
కొత్తగా పెళ్ళైయ్యే రాధాగోపాళాల్లో
నీ బొమ్మలాంటి అందమైన అమ్మాయిల్లో
ఆ రైలింజను డ్రైవరులో
ఆఫీసుల్లో ఉండే విగ్గులేని యముళ్ళలో
అవకతవక కంగాళీ సినిమాల "భశుం" కార్డుల్లో..
దేవుడిగూట్లో నవ్వుతూ నిలబడ్డ రాముడిలో...
అన్నింట్లో నువ్వు కనబడుతూనే ఉంటావు కదా...!
ఇన్నింటీలో నువ్వు సజీవమేనన్న నిజం ఈ పిచ్చిజనాలకి అర్థమయినరోజు
నీ కొంటెబొమ్మల పుస్తకంలోంచి ఓ జోకు చదూకుని నవ్వేసుకుంటార్లే..
నువ్వు హాయిగా నీ నేస్తంతో ఇన్నాళ్ళు గుండె పొరల్లో దాచుకుని ఉంచిన కబుర్లన్నీ చెప్పేసుకుని..
ఇక కంటినిండా హాయిగా నిద్రో...

మూడేళ్ల క్రితమనుకుంటా ఒకసారి మా పిన్ని వాళ్ళమ్మాయి చెప్పింది.. నర్సాపురంలో నా చిన్నప్పటి క్లాస్ మేట్ ప్రసూన అనీ.. ఆ అమ్మాయికి కూడా బ్లాగ్ ఉంది.. కవితలు అవీ రాస్తుంది అని. అప్పుడు చూశాను రెక్కల సవ్వడి బ్లాగ్. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. మెత్తని మనసు, మనసుని తాకే చక్కని భావకవిత్వం రాస్తుందని అర్థమైంది. తనతో వ్యక్తిగత పరిచయంలేకున్నా అప్పట్నుంచీ బ్లాగ్ లోనే కాక వివిధ జాల పత్రికల్లో తను రాసే కవితలూ, కథలూ కూడా చదువుతూన్నా! ఈ అమ్మాయీ మంచి ఆర్టిస్ట్ కూడా. బొమ్మలు వేస్తుంది. తన కథలకి తానే బొమ్మలు వేసుకోవడం విశేషం. 'వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో తన కవితకు బహుమతి వచ్చింది.
ఒక మెట్టు పైకెళ్ళి ఈ మధ్యన ప్రసూన ఒక నవల రాసింది. 'కినిగె తెలుగు నవలల పోటీ 2014' కోసం ప్రసూన ఈ నవలను రాసింది. ముఖచిత్రం కూడా తనే వేసుకుంది. పేరేమిటంటే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". పేరు తమాషాగా ఉందే అనుకుని.. ఏమి రాసిందా అని ఆసక్తిగా నవల చదివాను. ఇట్స్ డిఫరెంట్..! రొటీన్ లవ్ స్టోరీనో, ఏదో సోషల్ మెసేజ్ ఉన్న నవలికో కాదు. ఇది మన తెలుగు భాష గురించిన కథ. ఇంగ్లీషు చదువుల వల్ల మన పిల్లలకు దూరమైపోతోందేమో అని మనం భయపడుతున్న మన తెలుగు భాష ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి ఎలా తీసుకురావచ్చో.. ఎలా పిల్లలకు తెలుగు నేర్పవచ్చో.. ఒక ఆలోచన చేసి చూపించిందీ నవలలో ప్రసూన. నూతనమైన, ఆచరయోగ్యమైన ఆలోచన.
మార్కులు ఎక్కువ రావనో, వేరే భాష కంపల్సరీ అనో స్కూళ్ళలో తెలుగు భాషే ఉండట్లేదు కొందరు పిల్లలకు. సెకెండ్ లాంగ్వేజ్ స్పానిష్షో, ఫ్రెంచో ఉంటున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. ఇందువల్ల ఇంగ్లీషు, హిందీ, ఇతర ప్రాంతీయ భాషలూ సులువుగా వచ్చేస్తున్నాయి పిల్లలకు కానీ మనదైన తెలుగు భాష మాత్రం సరిగ్గా పలకడానికి కూడా రావట్లేదు. కొందరు పిల్లలకు తెలుగు రాయడం, చదవడం కూడా రాదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్ని పదాలకు అర్థాలే తెలీనివాళ్ళు కొందరైతే, అసలు తెలుగు చదవడమే రాని పిల్లలు కొందరు. మా అమ్మాయి రెండో తరగతి దాకా స్టేట్ సిలబస్ అవ్వడం వల్ల అప్పటిదాకా తెలుగు సబ్జెక్ట్ ఉండేది కానీ మూడవ తరగతిలో సెంట్రల్ స్కూల్ కి మార్చాకా తనకి స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లేదు. వచ్చిన కొద్దిపాటి భాషా మర్చిపోకుండా ఇంట్లో రోజూ న్యూస్ పేపర్ చదివించడం, తెలుగు కథల పుస్తకాలు కొని చదివించడం, గుణింతాలూ, వత్తులూ రాయించడం చేస్తుంటాము మేము. నేనప్పుడప్పుడు అశ్రధ్ధ వహించి వదిలేస్తున్నానని వాళ్ళ నాన్నగారు రోజూ రాత్రి పాప చదువుకునే బెడ్ టైం స్టోరీస్ తెలుగు కథలే చదవాలని రూల్ పెట్టేసారు. ఆ విధంగానైనా తెలుగు మరిచిపోకుండా ఉంటుందని, తెలుగు చదవడం అలవాటవుతుందనీ మా ప్రయత్నం. అచ్చం ఇలానే ప్రసూన కూడా తన మొదటి నవలలో కూడా పిల్లలకు తెలుగు ఎలా నేర్పచ్చు అనే ఆలోచనకి ఓ ప్రణాలికని తెలిపింది.
హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చందన అనే పాప ఉంటుంది. ఊరు నుండి వచ్చిన వాళ్ళ స్వామి తాతయ్యగారు అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ తెలుగు ఎలా నేర్పించారు. తాతా మనవరాలు కలిసి "తెలుగు వెన్నెల" పేరుతో తెలుగు తరగతులను నడిపించి, ఎంతోమంది పిల్లలకు తెలుగు భాష ఎలా నేర్పించారో తెలిపే కథే "తెలుగు వెన్నెల్లో తేనె మనసులు". మన బిజీ స్కెడ్యూల్స్ లోంచి కాస్తంత వెసులుబాటు చేసుకుని మన పిల్లలు మాతృభాష మర్చిపోకుండా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలదే అన్నది ఈ నవలలో అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇదొక్కటే కాక పిల్లలకు నేర్పించాల్సిన చెయ్యవలసిన కొన్ని మంచి అలవాట్లు, విషయాల ప్రస్తావన కూడా కథలో ఉంది. ఇది పిల్లల నవల.. అనుకోవచ్చు. పిల్లలకు మన మాతృభాష పట్ల మక్కువ ఎలా కలిగించాలో పెద్దలకు తెలిపే నవల అనుకోవచ్చు. కథ, కథాగమనం సంగతి ఎలా ఉన్నా, ఇదొక విభిన్నమైన మంచి ప్రయత్నమని ఖచ్చితంగా చెప్పచ్చు. కథలో తాతామనవరాళ్ల మధ్యన ఉన్న గాఢానుబంధం నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు తాతయ్యలంటే మహా ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికీ ఇరువైపుల తాతయ్యలూ ఫోటోల్లో కనిపించారు మరి :(
అయితే, ఈ "తెలుగు వెన్నెల" తరగతులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందులో అమితోత్సాహంతో పాల్గోవడం వంటివి నాకు కొధ్దిగా హైలీ ఐడియలిస్టిక్ గా అనిపించాయి. ఈకాలంలో అసలు కొందరన్నా అలా ఉంటారా అన్నది నాకు సందేహమే! ఉంటారేమో మరి..!! కథాస్థలం హైదరాబాద్ కాకుండా ఏ అమెరికానో, మరో దేశమో అయి ఉంటే పాత్రల్లో తెలుగు భాష పట్ల కనిపించిన ఇంటెన్స్ ఫీలింగ్స్ ఏప్ట్ గా అనిపించేవేమో అనిపించింది నాకు. ప్రసూనకి ఇది మొదటి ప్రయత్నం కాబట్టి కథాగమనంలో లోటుపాట్లు పట్టడం సబబు కాదనిపించింది నాకు.
నే గమనించిన.. నాకు ఇబ్బంది కలిగించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్షర దోషాలు. నవలాంశమే తెలుగు భాష నేర్చుకోవడం అయినప్పుడు మరి అందులో అక్షర దోషాలు దొర్లితే చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. వీటిని సరిచేసే పధ్ధతి ఏదైనా ఉందేమో రచయిత్రి కనుక్కుని అవన్నీ సరిచేస్తే బాగుంటుంది. ఇదొక్కటీ తప్పిస్తే.. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సందేశం బాగుంది. ఇలా ఒక ప్రణాలిక ద్వారా కాకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళం మన పిల్లలకు అప్పుడప్పుడన్నా మాతృభాష పట్ల అభిమానం ఏర్పడే ప్రయత్నాలు చేస్తూంటే బాగుంటుంది. ఈ నవల కినిగె.కాం లో లభ్యమవుతోంది.
బ్లాగ్ముఖంగా ప్రసూన చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తన నుండి ఇంకొన్ని మంచి కథానికలూ, నవలలూ రావాలని కోరుకుంటున్నాను.
"కాస్త హెల్ప్ చెయచ్చు కదా... కనీసం వాటర్ బాటిల్స్ లో నీళ్ళు పట్టడం, కంచాలు, మంచినీళ్ళు పెట్టడంలాంటి చిన్నచిన్న పనులు చేయచ్చు కదా"
"అబ్బా..బోర్ అమ్మా.."
***
"నేను ముగ్గు పెడతా.. నువ్వు పెట్టకు "
"ఆ వంకరటింకర గీతలు బాగోట్లేదు..వద్దే.."
"ఆ...ముగ్గు పెడతా.. ఏదీ వద్దంటావ్..నువ్వింతే ఎప్పుడూ"
***
"ఈ రెండు ముద్దలు ఎక్కువయ్యాయా..? అన్నం పాడేస్తే పాపం!"
"ఇంక ఒక్క స్పూన్ కూడా నేను తినలేను. నాకు చాలు. వద్దంటే వద్దు"
***
"పాలు బలం..తాగాలి.."
"నాకు వద్దు.. వద్దంటే అంతే!"
***
"ఇవాళ్టికి పప్పు వండాను తినెయ్యవే.."
"నాకీ పప్పు వద్దు...! నాన్న ఊరెళ్తే కూర వండవామ్మా? నాన్న ఊరెళ్తే మనం అన్నం తినడం మానేయ్యాలా? "
***
"ఇవాళ ఆ కూర వండు.. పైన కొత్తిమీర చల్లు..కాడలు వెయ్యకు"
"అట్టు మీద ఉల్లిపాయలు వద్దు..."

"వద్దు..వెళ్ళిపో వంటింట్లోంచి.."
" ఊ.. నేను చెక్కు తీస్తా... లేకపోతే ఆ పొటాటో తరుగుతా... ఊ..."
"చెయ్యి కోసుకుంటావ్...వెళ్పో.."
"ఊ... ఎప్పుడూ వద్దంటావ్..."
***
"నేను చపాతీ వత్తుతా..."
"వద్దు.."
"పోనీ కాలుస్తా.."
"వద్దు!! పెద్దయితే ఎలానూ తప్పదు..ఇప్పట్నుంచీ ఎందుకే తాపత్రయం తల్లీ..."
***
"నాన్నా.. అమ్మెప్పుడూ నన్ను తిడుతుంది.."
"ఇప్పుడు నిన్ను తిట్టకపోతే.. రేపు నువ్వు పెద్దయ్యాకా నిన్నెవరూ ఏం అనరు.. నన్నందరూ తిడతారు.. మీ అమ్మ ఇలానే పెంచిందా... ఏం నేర్పలేదా అని"
***
"ఇంతదాకా నీక్కావాల్సింది చూశావు కదా.. రిమోట్ నాకు ఇవ్వు.."
"ఊహూ.. ఇంకొంచెం ఉంది ఉండమ్మా.."
"కొంచెం కొంచెం అని అరగంట నుంచీ నువ్వే చూస్తున్నావు.."
***
"నా సబ్బు నాకు కావాలి.. మీరు వేరేది వాడుకోండి.."
"...."
***
"నువ్వు కొత్త చెప్పులు కొనుక్కున్నావ్.. మరి నాకో.."
"ప్రతీదానికీ నాతో పోటీ ఏమిటే ఇప్పట్నుంచీ..."
"నాకవన్నీ తెలీదు.. నువ్వు ఏది కొనుక్కుంటే అది నాక్కూడా కొనాలంతే"
***
"అబ్బా.. గోల.. సౌండ్ తగ్గించు.."
"తగ్గించాను కదమ్మా... ఇంతకంటే తగ్గిస్తే బావుండదు"
***
"నీకేం తెలీదు ఉండమ్మా... అలా కాదు.. ఇలా చెయ్య్..."
***
ఇలా ఎన్నని రాయను? ప్రతి మాటా, అక్షరం అక్షరం...
టేప్ వెనక్కి రెవైండ్ చేసి వింటునట్లు ఉంది..
ఇప్పుడే ఏమైంది... ఫ్రెంట్ లైస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అనిపిస్తూ ఉంటుంది.. :)
నే కూడా ఇలానే అమ్మని ఎంతగా విసిగించి ఉంటానో కదా అనిపిస్తూ ఉంటుంది... నాకేనా.. అందరు అమ్మాలకూ ఇలానే అనిపిస్తుందా??
***
ఏమైనా.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఏ సిరులందివ్వగలవూ...
ఇదొక తియ్యని వరం కదూ..