Wednesday, June 4, 2014

నవ్వు వచ్చిందంటే కిలకిల.. ఏడుపొచ్చిందంటే వలవల..



పుట్టినరోజు 'బాలు'డికి జన్మదిన శుభాకాంక్షలు... ! 

బాలు పాడిన వేలకొద్దీ పాటల్లోంచి ఏ పాటలు టపాలో పెడదామా అని ఆలోచిస్తే ఒక పట్టాన ఆలోచన తెగలేదు.. అది..ఇదీ..కాదు..కాదు.. మరోటి..అనుకుంటూ..ఆఖరికి కొన్ని పాత పాటలను పట్టి తెచ్చాను. ఇళయరాజావీ, వంశీవీ, విశ్వనాథ్ వీ అసలు కలపలేదు. ఎందుకంటే వాళ్ల వి అన్ని మంచి పాటలే. ఎంచడం కష్టం. 

ఈ పాటల్లో ప్రత్యేకత ఏంటంటే.. వింటున్నప్పుడు ఏదో లోకంలోకి వెళ్పోయి ప్రతి  పాటతోనూ  కనక్ట్ అయిపోతాం..అలాంటి పాటలివి. ముఖ్యంగా సోలో సాంగ్స్ నే ఎన్నుకున్నాను. మరి వినేసి మీరూ ఆనందించండి..



నవ్వు వచ్చిందంటే కిలకిల..
 ఏడుపొచ్చిందంటే వలవల..
గోదారి పారింది గలగల..
దాని మీద నీరెండ మిలమిలమిల..
(ఈ పాట నాకు చాలా ఇష్టం)
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7231 



ఇది తొలి పాట.. ఒక చెలి పాట..
వినిపించనా ఈ పూటా నా పాట..
(చిత్రం:కన్యాకుమారి, సంగీతం: బాలు)




 నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా..



కలువకు చంద్రుడు ఎంతో దూరం..



 నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వెరే బ్రతుకెందుకు..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7232 



 మేడంటే మేడా కాదు..



మౌనం గానం మధురం (మయూరి)
http://youtu.be/BeuIrSww_SU 


సామజవరగమనా..
  


తకధిమి తక..ధిమితక ధిమి..






సిరిమల్లె నీవే..

 




మన్మధ లీల మధురము కాదా..(టైటిల్ సాంగ్)
http://www.raaga.com/player5/?id=193419&mode=100&rand=0.484851116547361 



 చుట్టు చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..(తూర్పు వెళ్ళే రైలు)
http://www.raaga.com/player5/?id=194907&mode=100&rand=0.791989358374849


 కో అంటే కోయిలమ్మ కోకొ....(తూర్పు వెళ్ళే రైలు)
http://www.raaga.com/player5/?id=194910&mode=100&rand=0.17367210565134883 


 రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
 



వనిత లత కవిత.. మనలేవులే కథత..
ఇవ్వాలి చేయూత.. మనసివ్వడమే మమత.. (
కాంచన గంగ)
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5098 



మనుషులా మమతలా ఏవిరా శాశ్వతం...(రావుగారిల్లు)
http://mio.to/album/28-telugu_movie_songs/30939-Raogarillu__1988_/#/album/28-telugu_movie_songs/30939-Raogarillu__1988_/ 



 చంద్రకాంతిలో చందనశిల్పం..




 సుందరమో సుమధురమో...


నేనొక ప్రేమ పిపాసిని..

 


పల్లవించవా నా గొంతులో..
  



ఆకాశంనీ హద్దురా..
.

Sunday, June 1, 2014

నవలానాయకులు - 6



జూన్ నెల కౌముదిలో.. ఈ నెల నవలానాయకుడు యద్దనపూడి 'కీర్తికిరీటాలు' నాయకుడు "తేజ"..
http://www.koumudi.net/Monthly/2014/june/june_2014_navalaa_nayakulu.pdf

Thursday, May 29, 2014

మాయా మోహము మానదిది..



ఆ మధ్యన నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ సీడీ ఇచ్చారు. ఏంకర్/జర్నలిస్ట్ 'స్వప్న సుందరి' పాడిన క్లాసికల్ ఫ్యూజన్ ఆల్బం అది. భావయామి సీడీలో ఏడు అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. ఫ్యూజన్ మిక్స్ చేసిన స్వరకర్త ప్రాణం కమలాకర్ గారు(వాన, ప్రాణం చిత్ర సంగీత దర్శకులు). వీరు మంచి ప్లూటిస్ట్ కూడా. ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ శ్రీనివాసన్ గారి వద్ద వేణుగానమభ్యసించారు. ఎంతో చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ ఫ్యూజన్ స్వరాలను సమకూర్చారు కమలాకర్ గారు. స్వప్న కూడా అంతే చక్కగా ఆలపించారు కీర్తనలను. 


ఈ సీడీలో నాకు బాగా నచ్చినది రెండ వ కీర్తన "మాయా మోహము". సీడీలో ఉన్న ఈ కీర్తన తాలూకూ ఒరిజినల్ ట్యూన్ అందించినది శ్రీ మల్లాది సూరిబాబు గారు. "జోగ్ రాగ్" లో అనుకుంటా చేసారు. మల్లాది సూరిబాబు గారి ఏ ట్యూన్ అయినా ఎంత బావుంటుందో అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం బాగా వచ్చినవాళ్ళు తప్ప మామూలు గాయకులు ఆ గమకాలను పలకలేరు. శాస్త్రీయ సంగీతం మీద ఉన్న అభిమానంతో స్వప్న ఆల్ ద వే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళి వస్తూ కొన్నాళ్ళు సూరిబాబు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. అందువల్ల నాకీ కీర్తన విOటూంటే సూరిబాబు మావయ్యగారు పాడుతున్నట్లే ఉంది.




 

పూర్తి సాహిత్యం:


మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత నీ చిత్తమే కలది
((మాయా మోహము ))

౧చ: ఎంత వెలుగునకు అంతే చీకటి
ఎంత సంపదకు అంత ఆపద
అంతటనౌషధమపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది
((మాయా మోహము))

౨చ: మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోనే
ఇలలో శ్రీవేంకటేశ నీ కరుణ
గలిగిన మాకెల్ల ఘనతే కలది
((మాయా మోహము))

౩చ: చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆశల మిగిలిన తలపే కలది
((మాయా మోహము))

***   ***   ***


సంగీత దర్శకులు, ఫ్లూటిస్ట్ 'కమలాకర్' గారి స్వప్న చేసిన ఇంటర్వ్యూ: 




Wednesday, May 28, 2014

ఐదేళ్ల పయనం...






ఇవాళ్టికి ఐదేళ్ళు పూర్తవుతుంది నే బ్లాగ్ మొదలుపెట్టి..! 100, 200, 300 అని బ్లాగ్ పోస్ట్లు లెఖ్ఖపెట్టుకుంటుంటాను కానీ బ్లాగ్ పుట్టినరోజు నేనెప్పుడూ చేసుకోలేదు ఈ ఐదేళ్లలో. చాలా పెద్ద పోస్ట్ రాసాను ఇందాకట్నుండీ కూచుని.. కానీ ఎందుకో అనిపించింది...ఎందుకు ఇవన్నీ రాయడం... నేనేమిటో తెలిసినవాళ్ళు... నన్ను అర్థం చేసుకున్నవాళ్ళు నా రాతలని అభిమానంతో చదువుతూనే ఉంటారు. అర్థం చేసుకోనివాళ్లకు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఎలానూ అర్థం చేసుకోరు.. అనిపించి మొత్తం డిలీట్ చేసేసా :-)


నన్ను ప్రోత్సహిస్తూ, నా బ్లాగ్ కబుర్లన్నీ ఓపిగ్గా వింటూ, తోచిన సలహాలిస్తూ సహకరిస్తున్న శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోళెడు థాంక్యూలు. మొదట్లో చదివేవారు కాదు కానీ ఇప్పుడు నా ప్రతి పోస్ట్ కీ ఫస్ట్ రీడర్ తనే. ఏవైనా మార్పులు కూడా చెప్తూంటారు. ఇక ఇప్పుడు ఏం చేసినా, ఏం రాసినా తనకి చూపించడం, తన సలహా తీసుకోవడం అలవాటైపోయాయి నాకు. ఇంకా నేను బ్లాగింగ్ చేస్తుండటానికి కారణం తనే. నే మానేస్తానన్న ప్రతిసారీ ఎన్నో ఉదాహరణలూ, సలహాలూ చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తారు. "తృష్ణ" గా నాకొక ఉనికి ఏర్పడి, నా ఈ బ్లాగ్ పయనంలో విజయాలేమైనా చూసానూ అంటే..అన్నీ తన వల్లే! తన ప్రోత్సాహం వల్లే! 


ఎవరి జీవితంలో అయినా ఐదేళ్ళంటే చాలా విలువైన సమయం.. ఈ సందర్భంగా.. ఈ ఐదేళ్ల పయనంలో నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన నా బ్లాగ్ రీడర్స్ కీ, ఇంకా బ్లాగ్మిత్రులందరికీ మరోసారి మన:పూర్వక ధన్యవాదాలు. 

 

Tuesday, May 27, 2014

రామా లాలీ మేఘశ్యామా లాలీ..


ఒక మధురమైన జోల పాట..
చిన్నప్పుడు మా కోసం అమ్మ పాడేది... 
ఇప్పుడు మా మేనకోడలి కోసం పాడుతోంది.. 
భద్రాచల రామదాసు రచన ఇది... 
క్రింద వీడియోలో పాడినది: సింధు సుచేతన్

 

సాహిత్యం :

రామా లాలీ మేఘశ్యామా లాలీ 
తామరస నయన దశరధ తనయ లాలి (౨) 
చ: అచ్చ వదన ఆటలాడి అలసినావు రా
బొజ్జలో పాలు అరుగుదాక నిదుర పోవురా 
 ((రామా లాలీ..)) 
చ: జోల పాడి జో కొట్టితే ఆలకించేవు 
చాలించి మరి ఊరకుంటే సంజ్ఞ చేసేవు 
((రామా లాలీ..)) 
చ: అద్దాల తొట్టిలోన అమరి వున్నావు  
ముద్దు పాప ఉన్నాడంటే మురిసేవు 
((రామా లాలీ..))
చ: ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతు రా 
ఇంతుల చేతుల కాకాలకు ఎంతో కందేవు
((రామా లాలీ..))

Monday, May 26, 2014

మూలింటామె


నామిని ‘మూలింటామె’ నవల చదివాకా బాపూ రాసిన ఉత్తరం చదివిన తర్వాత బజార్లో కెళ్ళినప్పుడు ముందరా పుస్తకం కొని తెచ్చుకున్నా. అంతకు ముందు 2000లో పబ్లిష్ అయిన నామిని గారి సంకలనం "అమ్మకి జేజే" మాత్రమే చదివాను. 'అమ్మ' గురించి బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన ఒక 17మంది ప్రముఖులతో చెప్పించి, దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి, తరువాత వాటన్నింటినీ అమ్మకి జేజే పొందుపరిచారాయన. ఇవన్నీ వేరే వాళ్ళ వ్యాసలే తప్ప ఆయన రచన కాదు. సో, ఇప్పటిదాకా విలక్షణమైన ఆయన రచనాశైలిని గురించి విన్నా కానీ వీరి రచనలేమీ చదవలేదనే చెప్పాలి. అందువల్ల మొదట వారి రాయలసీమ మాండలీకం చదవడం నాకు పరీక్షగా మారింది.  మామూలుగా ఓ వంద పేజీల పుస్తకం గంట-రెండుగంటల్లో చదివేస్తాను నేను. అలాంటిది ఎంతో నెమ్మదిగా చదివితే తప్ప అసలు మొదట పది పదిహేను పేజీలు నాకు అర్థం కాలేదు :( కానీ ఒక్కసారి కథలో లీనమైన తర్వాత ఇంక భాష పెద్ద సమస్యగా అనిపించలేదు నాకు. అంతటి పట్టు ఆ కథలో ఉంది. అసలా కథకు ఆ మాండలీకమే సగం ప్రాణం అని కూడా అర్థమైంది. కవర్ డిజైన్ కూడా వైవిధ్యంగా బాగుంది.


’మూలింటామె ’ పుస్తకం అమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నా. ఆ రాత్రి ఒంటిగంట దాకా చదివి పెట్టిన పుస్తకం అక్కడే తలగడ క్రింద మరిచిపోయి ఇంటికి వచ్చేసా. అంతదూరం మళ్ళీ ఇప్పట్లో వెళ్ళనని కొరియర్లో వెయ్యమన్నా. మధ్యలో వీకెండ్ వచ్చి ఆ కొరియర్ నాకు అందటానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈలోపూ నాకు ఆ కథపైనే ధ్యాస.. ఏమై ఉంటుంది.. నారాయుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడా? కొనామె సంగతి ఏమౌతుందో? అయ్యో మూలింటామె..ఎలా ఉందో..?  అసలు కొరియర్ మిస్సయిపోతే మళ్ళీ పుస్తకం కొనుక్కోవాలేమో.. అని ఇవే ఆలోచనలు. ఆఖరికి పుస్తకం ఓ సాయంత్రం కొరియర్లో వచ్చింది మొత్తానికి. గభాలున పనులన్నీ పూర్తి చేసేసుకుని పుస్తకం పట్టుకుని కూచున్నా. పూర్తయ్యాకా కథ గురించీ, పాత్రల గురించీ చాలా రాయాలని అనుకున్నా కానీ మాటలు రావట్లే...  ఒక గొప్ప ట్రాజెడీ చదివిన తరువాత కలిగే అనుభూతి మిగిలింది. చెప్పాలంటే there's a feeling of Catharsis.. అని కూడా అనచ్చేమో! మానవ సంబంధాల గురించీ, మనిషి నైజం గురించీ, మనసు లోతుల గురించీ గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా నామిని గారిని గుర్తించాను నేను.


ఒక మనిషి ఏదన్నా తప్పు చేస్తే, మిగతావారు ఆ తప్పుకి కారణాలు వెతకరు. వెనకేసుకు రారు. ఎదుటి మనిషి దృష్టికోణం లోంచి ఆ తప్పు చెయ్యడానికి వాడి వెనుక ఉన్న పరిస్థితులేమిటని అంచనా వేసే ప్రయత్నం అసలే చెయ్యరు. పొరపాటున ఒక్క పొరపాటు దొర్లటం ఆలస్యం.. వీడెప్పుడు పొరపాటు చేస్తాడా అని కాచుక్కూర్చున్న జనం.. ఇన్నాళ్ళకు దొరికాడు కదా అన్నట్లు కాకుల్లా పొడిచేస్తారు. అనాల్సిన మాటలు, అనకూడని మాటలూ, నిఘంటువుల్లో పదాలు వెతొక్కొచ్చి మరీ కడిగిపారేస్తారు. జనాలకూ గొర్రెల మందకూ పెద్ద తేడా లేదు. మొదట నిలబడ్డవాడు ఏది చేస్తే వెనకున్నవాళ్ళు అదే చేస్తారు. జనంలో ఉన్న ఈ బలహీనతను పట్టుకున్నారు నామిని. "మూలింటామె" కథలో జనాలలో, సమాజంలో ఉన్న ఈ బలహీనతను ఎత్తి చూపారు నామిని.


చదువురాని ముసలి అవ్వ మూలింటామె. ఆమె పేరు కుంచమమ్మ. కుంచమమ్మ కూతురు మొగిలమ్మ. కొడుకు నారాయణ సామి నాయుడు. మొగిలమ్మ కూతురు రూపావొతి. మనవరాలిని కొడుక్కిచ్చి సంబంధం కలుపుకుంటుంది కుంచమమ్మ. రూపావొతికి ఇద్దరు బిడ్డలు. ఊళ్ళో ఒక మూలన వాళ్ల అడ్డాపిల్లుండటం వల్ల వాళ్ళూ "మూలింటోళ్ళు" గా పిలవబడుతుంటారు. ఆడ్డాపింట్లోని ముగ్గురాడవాళ్ళూ మొదుటామె, నడిపామె, కొనమ్మిగా పిలవబడుతుంటారు. హటాత్తుగా కొనమ్మి ఇల్లు వదిలి వెళ్పోవడంతో కథ మొదలౌతుంది. కాసేపటికి ఆమె కళాయోడితో తిరప్తి కి పోయిందని తెలిసి ఊరూవాడా ఇంటి ముంగిట్లో పోగవుతారు. మూలింటోళ్ళ బాగుని ఓర్వలేనివాళ్ళంతా అవకాశం దొరగ్గానే నానారకాల మాటలు మొదలొడతారు. ముఖ్యంగా రంజకం, మొలకమ్మ మొదలైనవాళ్లయితే ఇక దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేలుస్తూ మూలింటోళ్ళకు ఊపిరిసలపనివ్వరు. మొదటామె కు మనవరాలంటే పంచప్రాణాలు. చివరిదాకా కొనామె పైనే ప్రాణాలు ఉంచుకుని తిరిగివస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తుందా ముసలి ప్రాణం. కొనామె తిరిగిరాకపోవడం కూడా లోపల్లోపల ఆనందమే ఆమెకు. మనవరాలెంత అభిమానవంతురాలో అని లోలోపల మురుస్తుంది. బీమారం నుండి వచ్చిన తన అక్క పోరు, ఊరోళ్ళ బలవంతం మీద కొడుక్కి మరొక పెళ్ళి చెయ్యక తప్పదు. అయితే, కోడలుగా ఇంటికొచ్చిన పందొసంత తో మాట్లాడదు. కోడలు చేతి చేతి గంజినీళ్ళు కూడా ముట్టదామె. అంత పట్టుదల మూలింటామెది. మనవరాలి స్థానాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని బాధ, కోపం ఒక పక్క ఉండగానే పందొసంత చేసే పనులు ఇంకా చిత్రహింసకు గురిచేస్తాయి ఆమెని. పందొసంత ఇచ్చే అప్పులకూ, చేసే సహాయాలకూ ఆశపడే ఊళ్ళోవాళ్ళంతా ఆమె పబ్లిగ్గా చేసే తప్పులను ఉపేక్షిస్తూ, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన ఉత్తమురాలైన మనవరాలిని పదేపదే దెప్పిపొడవడం సహించలేకపోతుంది మొదటామె.


"మూలింటామె" నవల సమకాలీన సమాజానికొక దర్పణమనిపిస్తుంది నాకు. నారాయణ రెండవ భార్యగా వచ్చిన పందొసంత గురించి చదువుతూంటే కోపం, అసహ్యం, ఆశ్చర్యం, సంభ్రమం లాంటి భావాలన్నీ కట్టగట్టుకుని బుర్రలో నాట్యమాడేస్తాయి. అవును మరి ఇవాళ్టిరోజున బలమున్నవాడిదే పై చేయి. తప్పు చేసినా సరే. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, సగనికి పైగా మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సింబాలిక్ గా ఈ ప్రాత్రను సృష్టించారేమో నామిని అనిపించింది. ఈర్ష్య, అసూయ మొదలైన హేయ గుణాలకు ప్రతీకలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ల మొదలైన పాత్రలైతే, ఇంకా లోకంలో అక్కడక్కడా మిగిలున్న మంచీ,మానవత్వాలకు ప్రతీక చీమంతమ్మ పాత్ర. లోకంలో దుర్బలులైనవారికీ, భయస్తులకీ ప్రతీక మొదుటామె. ఈ ముసలి అవ్వ పాత్ర నాకు ఎంతగా నచ్చిందో చెప్పలేను. ఆమెలో ఆమె చెప్పుకునే స్వగతాలూ, మాటలూ, ఇతరుల ప్రశ్నలకు మనసులోనే చెప్పుకునే సమాధానాలూ చదివి తీరాల్సిందే. మనవరాలి పోటోను ఎదన బెట్టుకుని తెల్లార్లూ మొదుటామె చెప్పుకునే మాటలు విని గుండెలు ఎంత నీరౌతాయో, ఆమెతో చీమంతమ్మ అన్న మాటలు విన్నాకా "ఈ మాత్రం గుండెల్నిండికీ గాలి బీల్చుకోని ఎన్ని జాములైంది మూలింటామెకి!" అన్న వాక్యాలు చదివి మనసు అంత కుదుటపడుతుంది పాఠకులకు.


మొదుటామె వ్యక్తిత్వం, ఆమె జీవితం, ఆమె ముగింపు అన్నీ చదివాకా మొదట్లో చెప్పినట్లు మనసులో ఏదో ప్రక్షాళన జరిగిన భావన కలుగుతుంది. "నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగాని, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కళ్ల కాడా చూట్టుకలాడే పిల్లిని చంపలేదే!" అన్న ఆమె మాటలు పుస్తకం మూసేసిన తర్వాత కూడా చెవుల్లో వినబడుతూ ఉంటాయి. మనవరాలిని అర్థం చేసుకుని క్షమించగలిగిన అంతటి విశాల హృదయం ఎంతో ఎత్తులో ఉండే విద్యావంతుల్లో కూడా కనబడదు. మనసున్న ప్రతి మనిషి మనసునీ తప్పక తాకే కథ ఇది.


Saturday, May 24, 2014

అక్కినేని కోసమే 'మనం'


ఈ సినిమా చూడాలనుకోవడానికి ఏకైక కారణం నాగేశ్వర్రావ్. మరొక్కసారి స్క్రీన్ మీదైనా సజీవంగా నాగేశ్వరావ్ ని చూడాలన్న కోరిక. ఆ కోరిక తీరింది. తెరపై డైలాగులు చెప్తూ, నవ్వుతూ చూస్తున్న అక్కినేనిని చూస్తుంటే మనసులో ఏమూలో ఉండిపోయిన బాధకి కాస్త ఉపశమనం కలిగింది. ఈ ఒక్క ఆనందం కోసం "మనం" చూడచ్చు. 


చిత్ర కథ అద్భుతమైనదేమీ కాదు. మామూలు తెలుగు సినిమాలలోలాగనే అవాస్తవికంగానే ఉంది. కానీ అటువంటి కథని దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా నడిపించిన తీరు ప్రశంసనీయం. మొదటి భాగం కాస్త స్లో గా నడిచింది. రెండవ భాగంలో జరగాల్సిన కథ ఎక్కువగా  ఉండటం వల్ల సెకెండ్ హాఫ్ బాగుంది. నాగేశ్వరరావు ఉన్న ప్రతి సన్నివేశాన్నీ రెండూ కళ్ళూ చాలవన్నంత ఇదిగా, ఆత్రంగా చూశాను నేనైతే. మరి మళ్ళీ ఇంకెప్పుడూ కనపడ్డు కదా :(


నాగార్జున చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కొడుకుతో డాన్స్ చేస్తూంటే, కొడుకు కన్నా తండ్రే బాగున్నాడు అనిపించింది. శ్రియా బాగా చేసింది. ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్ సీన్స్ లో. ఈ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చుతాయి. సమంత కూడా తన వంతు న్యాయం చేసింది. ఎటొచ్చీ నాగచైతన్య పాత్ర గురించే ఆశ్చర్యం వేసింది. అందరి పాత్రలకీ కాస్తో కూస్తో వెయిటేజీ ఉంది కానీ అతని పాత్ర ఎటూ కాకుండా అయినట్లనిపించింది. గత జన్మలో నాగార్జున తండ్రి అన్న ఒక్క పాయింట్ తప్పించి అతని పాత్రలో చిన్న ప్రత్యేకత కూడా లేకపోవడం వల్ల ఆ పాత్రకు అస్సలు వెయిటేజ్ లేకుండా పోయింది. ఎయిర్ హోస్టస్, మహిళా పోలీస్ తో సహా ఆడవాళ్లందర్నీ అలా చూడ్డం నాకసలు నచ్చలేదు. పైగా ఆరోగ్యానికి హానికరం అని చూపెడుతూనే గ్లాసులకి గ్లాసులు తాగేసినట్లు చూపించడం..ప్చ్!!  కానీ తాత, తండ్రి, కొడుకూ ముగ్గురూ ఉన్న సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. థియేటర్లో అంతా కూడా కేకలూ, చప్పట్లు. ANR ఆ వయసులో, అనారోగ్యంతో కూడా అంత ఉత్సాహంగా డైలాగ్స్ చెప్పడం అబ్బురమనిపించింది. నాగేశ్వరావ్ లోని ఆ 'డేడికేటెడ్ ఆర్టిస్ట్' నే నేను ప్రేమించేది. ముగ్గురి పేర్లు అలా మిక్స్ చేసి పెట్టడం బాగుంది.

అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్యసంగీతం బాగుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు ఉన్న సీన్స్ లో పియానో, హార్మోనికా, వయోలిన్స్ కలిపి చేసిన ఒక స్పెషల్ musical bit రిపీటవుతూంటుంది. ఆ థీం మ్యూజిక్ బాగుంది. దాన్నే సినిమా భాషలో 'రికరింగ్ రిథిమ్' లేదా 'Leitmotif' అంటారు.


వెకిలి హాస్యం లేదు. గాల్లో ఎగిరే ఫైటింగ్స్ లేవు. అందుకే సినిమా అయిపోయాకా మనసుకి హాయిగా అనిపించింది. అంతా అంటున్నట్లుగా 'ఫీల్ గుడ్ మూవీ' అన్నమాట. నేను చాలా ఎక్కువగా ఆశించడం వల్లనేమో ఇంకా బాగుండి ఉండచ్చు అనిపించింది కానీ బాలేదని మాత్రం అనిపించలేదు. అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక చివర్లో వచ్చిన షాట్ సూపర్. తాత, తండ్రి, ఇద్దరు మనవలు..మొత్తం నలుగురూ నిలబడిన షాట్. 


చివరలో కనబడ్డ అఖిల్ గురించి ఓ మాట... కుర్రాడు చాకులా ఉన్నాడు! ముఖ్యంగా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోని చూడబోతున్నామన్న ఆశ కలిగింది. 


अब के हम बिछड़े तो..




గజల్ రారాజు మెహదీ హసన్ గజల్స్ లో ఇదొకటి చాలా బావుంటుంది. అసలా సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందో!

तू खुदा है, न मेरा इश्क फरिश्तों जैसा
दोनों इंसान हैं तो क्यों इतने हिजाबों में मिले..!


"अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिले
जिस तरह सूखे हुए फूल किताबों में मिले.."
మొదట ఈ పల్లవిని నేను "జుబేదా" సినిమాలో విన్నా. చివరలో కరిష్మా అంటుందీ వాక్యాలు.. అప్పుడవి బావున్నాయని రాసి పెట్టుకున్నా. తర్వాత ఇది మెహదీ హసన్ గజల్ అని తెలిసింది. కవి శ్రీకాంతశర్మ గారు ఓసారి నాన్నగారి ప్రోగ్రాం(నిశ్శబ్దం గమ్యం) కోసం ఈ గజల్ పల్లవిని ఇలా తెలుగీకరించారు ..

"ఇపుడు విడితే ఏమిలే కలిసేము రేపటి కలలల్లో
పుస్తకములో వాడిపోయిన పూలు మిగిలిన తీరుగా.. 
ఇపుడు విడితే ఏమిలే..."

ఎంత బాగుందో కదా! 
ఏదో చిత్రంలో వాడుకున్నారు కూడా ఈ గజల్ ను. ఇదే పాట గజల్ గాయని ఇక్బాల్ బానో పాడినది కూడా ఉంది కానీ మెహదీ హసన్ స్వరంలో ఉన్న మేజిక్ వేరే కదా.

 

 గజల్: अब के हम बिछड़े तो
పాడినది, స్వరపరిచినది: मेहदी हसन
సాహిత్యం: अहमद फ़राज़

 अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिले
जिस तरह सूखे हुए फूल किताबों में मिले

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये खजाने तुझे मुमकिन है खराबों में मिले
((अब के हम बिछड़े))

तू खुदा है न मेरा इश्क फरिश्तों जैसा
दोनों इंसान हैं तो क्यों इतने हिजाबों में मिले
((अब के हम बिछड़े))

ग़म-ए-दुनियां भी ग़म-ए-यार में शामिल करलो
नशा बहता है शराबों में तो शराबों में मिले
((अब के हम बिछड़े))

अब न वॊ मैं हूँ  न  तू  है  न वो माज़ी है फ़राज़
जैसे तुम साये तमन्ना के सराबों में मिले
((अब के हम बिछड़े))

***     ***     ***
కొన్నేళ్ళ క్రితం 'టివిఎస్ సారెగమ' లో మహమ్మద్ వకీల్ అనే అబ్బాయి ఈ గజల్ పాడాడు. ఆ లింక్ కూడా యూట్యూబ్ లో దొరికింది. చిన్నవాడైనా అతని గొంతు ఎంత బావుంటుందో చెప్పలేను. ఆసక్తి ఉన్నవాళ్ళు అతడు పాడిన గజల్ క్రింద లింక్ల్ వినండి..
https://www.youtube.com/watch?v=52tUWl7PcH0

Thursday, May 15, 2014

పాట వెంట పయనం: అల్లరి పాటలు…!




'సారంగ' పత్రికలో వెలువడుతున్న "పాట వెంట పయనం " లో ఈసారి నేపథ్యం 'అల్లరి పాటలు'..!

link:
http://wp.me/p3amQG-2E4




Monday, May 5, 2014

Monpura




బ్లాగుల్లో ఈమధ్యన మిస్సయిన కొన్ని పాత టపాలు తిరగేస్తూంటే సామాన్య గారి 'అమయ' బ్లాగ్లో ఒక పాట కనబడింది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉన్న ఆ పాట తాలూకూ సినిమా వివరాలను గూగులించాను. అది "Monpura" అనే బంగ్లా సినిమాలోదనీ, ఆ చిత్రం బాంగ్లా సినీచరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందనీ తెలిసింది. చిత్రకథ ఈ మామూలు ప్రేమకథ + విషాదాంతం కూడానూ :( కానీ తన మొదటి సినిమాను దర్శకుడు సృజనాత్మకంగా చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. వందరోజులు ఆడిన ఈ చిత్రం ఐదు జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. "మోన్పురా" దక్షిణ బాంగ్లాదేశ్ లో ఉన్న ఒక అందమైన ద్వీపం. ఈ ప్రాంతం తాలూకూ ఒక జాలరి కుమార్తె విషాదాంత ప్రేమకథే "Monpura" చిత్రకథ.


ఈ చిత్రంలో మొదటగా, ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఫోటోగ్రఫీ, సీనిక్ బ్యూటీ గురించి. చిత్రంలోని పల్లె వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలూ ఆనందపరుస్తాయి. యూట్యూబ్ లో మొత్తం చిత్రం ఉంది. కొన్ని సన్నివేశాల్లో అసలు బ్యాక్గ్రౌండ్ దృశ్యాలూ, ఆ ఏంగిల్స్ చాలా బాగున్నాయి. నాయిక కూడా బావుంది. ’సినిమాటోగ్రాఫర్ కమ్రుల్ హసన్ ఖస్రు’ పనితనాన్ని తప్పక అభినందించాలి. తర్వాత సంగీతం. గ్రామీణ చిత్రకథ కాబట్టి సంగీతం కూడా నేచురల్ గా అనిపించాలని బాంగ్లా ఫోక్ మ్యూజిక్ ఆధారంగా తయారుచేసారుట. ఇక ఈ చిత్రంలో పాటల్ని చూసేద్దామా? మొదటిది సామాన్య గారు బ్లాగ్ లో పెట్టినది. చివరిలో ఉన్న ట్రాజిక్ సాంగ్ మినహా మిగతా నాలుగూ కూడా ఇక్కడ లింక్స్ ఇస్తున్నాను. సుందరమైన ప్రకృతినీ, అందమైన చిత్రీకరణనూ చూసి మీరూ ఆనందించండి..


Jao Pakhi Bolo Tare  


 Nithua Pathare  


 Amar Sonar Moyna Pakhi  
 
 Age jodi Jantam


youtube link for the movie:
https://www.youtube.com/watch?v=-R8FmC2v6Uo 



Friday, May 2, 2014

"తెలుగు వెలుగు" పత్రికలో నా 'రుచి..'





మే నెల తెలుగు వెలుగు పత్రికలో నా కుక్కరీ బ్లాగ్ "రుచి...thetemptation "గురించి "అంతర్జాలంలో అమ్మ చేతి వంట" అనే ఆర్టికల్ లో చోటు దొరికింది. ఆర్టికల్ లో నా బ్లాగుని చేర్చిన మధురకు, 'తెలుగు వెలుగు' పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.






Thursday, May 1, 2014

నవలానాయకులు -5




మే నెల "కౌముది"లో ఈ నెల నవలానాయకుడు "అణ్ణామలై". ప్రముఖ తమిళ రచయిత ఆఖిలన్ రాసిన "చిత్తిరపావై"('చిత్రంలోని సుందరి' అని అర్ధం)1975లో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ జ్ఞానపీఠ్ అవార్డుని అందుకుంది. ఆ నవలను తెలుగులోకి "చిత్రసుందరి" పేరుతో శ్రీ మధురాంతకం రాజారాం అనువదించారు. "చిత్రసుందరి" కథానాయకుడు అణ్ణామలై గురించి క్రింద లింక్ లో చదవచ్చు:

http://www.koumudi.net/Monthly/2014/may/may_2014_navalaa_nayakulu.pdf

Tuesday, April 29, 2014

రాజా రవివర్మ





"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..." అనే పాటని రేడియోలో చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను కానీ 'రాజా రవివర్మ' అనే ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నారని మొట్ట మొదట నేను 6th క్లాస్ లో ఉండగా తెలిసింది. బెంగుళూరులో ఉంటున్న మా మావయ్యావాళ్ళు ఊరు మారిపోతున్నాం రమ్మని గొడవపెడితే నాన్న మమ్మల్ని బెంగుళూరు, మైసూరు తీసుకువెళ్ళారు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆంధ్రా దాటి వెళ్ళిన మొదటి ప్రయాణం కాబట్టి ఎంతో పదిలంగా గుర్తుండిపోయిందా ట్రిప్. అప్పుడు మైసూర్ మ్యూజియంలో చూసాం రవివర్మ వర్ణచిత్రాల్ని. చాలా ఫోటోలు కూడా తీసుకున్నాం. ఆ ట్రిప్ తాలూకూ అపురూపమైన ఫోటోలను ఫోటో స్టూడియో అతను మాయం చేసేసాడు. అందుకని ఆ ట్రిప్ ఇంకా బాగా గుర్తన్నమాట! తర్వాత మరోసారి 10th క్లాస్ లో ఉండగా మా స్కూల్ వాళ్ళు మైసూరు, బెంగుళూరు, తమిళ్నాడు ట్రిప్ కి తీసుకువెళ్ళినప్పుడు మరోసారి చూసాను. ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఇంట్లోవాళ్ళతో మూడో ప్రపంచయుధ్ధం చేయాల్సివచ్చింది.. సరే సరే గుండ్రాల్లోకి తీసుకువెళ్ళకుండా అసలు సంగతికొచ్చేస్తా... 



ఇవాళ అద్భుత చిత్రకారుడైన 'రాజా రవివర్మ' జయంతి(1848, Apr29th). రవివర్మ గురించిన చిన్న పుస్తకమొకటి ఆ మధ్యన దొరికింది. సుంకర చలపతిరావు గారు రచయిత. చిత్రకళాపరిషత్, విశాఖపట్నం వారి ప్రచురణ. వెల అరవై రూపాయిలు. ఇవాళ ఆ చిత్రకారుడి జయంతి సందర్భంగా ఈ చిన్ని పుస్తకంలోని విశేషాలు రాద్దామని సంకల్పం. రచయిత 'సుంకర చలపతిరావు' గారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ చిత్రకళా విమర్శకుల్లో ఒకరు. చిత్రకళ, శిల్పకళలపై నాలుగువందల పైగా వ్యాసాలు రాసారు. వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు మొదలైన ప్రముఖ ఆంధ్ర చిత్రకారుల ఆత్మకథలను ప్రచురించారు. చిత్రకళకు అందించిన సేవలకు గానూ ఎన్నో సత్కారాలు పొందిన వీరు ప్రస్తుతం 64కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకమండలిలో సభ్యులు. రవివర్మపై తనకు గల అభిమానమే ఈ చిన్న పుస్తక రచనకు కారణమని ఆయన తన ముందుమాటలో చెప్తారు.





ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు:



 భారతీయ పురాణేతిహాసాల నుండి ప్రేరణ పొంది అసలు ఫలానా దేవుడు ఇలా ఉంటాడు అని మనకు ఒక రూపాన్ని చూపెట్టిన తొలి భారతీయ చిత్రకారుడు రాజారవివర్మ. లక్ష్మి, సరస్వతి, రాధామాధవులు మొదలైన దేవతలు కాక, దమయంతి, అహల్య, రాధ, నల-దమయంతి, తిలోత్తమ, మేనక మొదలైన ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనుడు. ప్రత్యేక ఆహ్వానాలపై హైదరాబాదు, పిఠాపురం విచ్చేసి చిత్రాలు గీసారుట ఆయన. మరణించి వందేళ్ళు దాటినా ఆయనను మనం గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే "కళకు మరణం లేదు" అన్న నానుడిని ఆయన నిజం చేసినట్లే! సంస్కృతం, మళయాళం కు సంబంధించి ఇద్దరు పండితులను ప్రత్యేకంగా నియమించుకుని, వారితో పురాణాలు, ఇతిహాసాల్లోని శ్లోకాల అర్థాలు చెప్పించుకునేవారుట రవివర్మ. ఆ శ్లోకాల ఆధారంగా స్కెచ్ వేసుకుని వాటికి రంగులు అద్దేవారుట రవివర్మబాల్యంలో బొగ్గుతో గోడలపై పూలు, జంతువుల చిత్రాలు గీయడం చూసి  ఆయన విద్యాభ్యాసంతో పాటూ చిత్రరచననూ చేర్చారుట. నాయకర్ అనే ఆస్థాన చిత్రకారుడు చిత్రకళలో మెళకువలు నేర్పడానికి నిరాకరిస్తే, ఆయన శిష్యుడైన ఆర్ముగంపిళ్ళై రాత్రివేళల రహస్యంగా తనకు తెలిసిన విద్యను రవివర్మకు నేర్పేవారుట. ఒక బ్రిటిష్ వైస్రాయ్ ఆహ్వానంపై జెన్సన్ అనే బ్రిటిష్ చిత్రకారుడు తిరువాన్కూరు రాజాస్థానానికి వచ్చాడుట. అతను కూడా రవివర్మకు ఆయిల్ పెయింటింగ్ నేర్పించడానికి నిరాకరించాడుట కానీ దూరం నుండి తన చిత్రరచనను రవివర్మ చూడటానికి అంగీకరించాడుట. అలా బ్రెష్ ఉపయోగించే విధానం, రంగులు పూసే పధ్ధతి ఒక నెల రోజులు పరిశీలించాకా తన సొంత శైలిలో చిత్రరచన మొదలుపెట్టారుట ఆయన. ఒక తపస్సులా చిత్రకళ సాధన చేసేవారుట. . స్థానికంగా దొరికే ఆకులు, పువ్వులు,బెరడు, కోడిగుడ్డు సొన, మట్టి,విత్తనాలు, ఆలివ్ నూనె ఉపయొగించి రంగులు సొంతంగా తయారుచేసుకునేవారుట రవివర్మ. 




చిత్రకళ గురించిన "శ్రీ మహావజ్ర భైరావతంత్ర" అనే గ్రంధం ఆయనకు ప్రియమైనదిట. చిత్రకారుడు సత్యవంతుడు, గుణవంతుడు, పవిత్రంగా జీవిస్తూ పాండిత్యం గలవాడై ఉండాలి. అంతేకాక దానశీలత, దైవభక్తి, ఆదర్శప్రాయమైన నడవడి కలిగి కోపిష్ఠి, బధ్ధకస్తుడు కారాదని ఆ గ్రంధంలో చిత్రకారుడికి ఉండవలసిన లక్షణాలు పేర్కొన్నారుట. అదే విధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని మలుచుకున్నారుట రవివర్మ.






మైసూరుకు దగ్గరలో ఉన్న మూకాంబికాదేవిని ఆయన ఆరాధించేవారుట. అమ్మవారిని దర్శించడం కోసం నలభైఒకటి రోజులు కాలినడకన ప్రయాణించి ఆలయాన్ని చేరుకున్నారుట. ఆ తిరుగు ప్రయాణంలోనే ఆయనకు వృత్తిపరమైన అవకాశం వచ్చింది. అది మొదలు జీవం ఉట్టిపడే ఎన్నో కుటుంబాల రూపచిత్రాలు, రాజ దంపతుల చిత్రాలు ఆయన గిసారు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో కూడా ఆయన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రామాయణ, భారత,భాగవతాల్లోని ముఖ్య దృశ్యాలను ఒక పక్క,  రాజ కుటుంబాలకు చెందిన రూపచిత్రాలు ఒక పక్క, ప్రాచీన ప్రబంధాల ముఖ్య దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు, ఉహాచిత్రాలూ ఎన్నో సహజ సుందరంగా చిత్రించి కళాభిమానుల మన్ననలు పొందారు రవివర్మ. తైల వర్ణాల గురించి మనకు తెలియని రోజుల్లో స్వశక్తితో సాధన చేసి, రంగుల్ని తయారు చేసి, ఆ వివరాలు మనకు అందించారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఈ కళాతపస్వి కి కూడా విమర్శలు తప్పలేదు. 




తమ్ముడు రాజవర్మతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేదిట. చిత్రకళారంగంలో ఇరువురూ రామలక్ష్మణలుగా కీర్తి  పొందారుట. తమ్ముడి మరణం తాలూకూ విషాద ఛాయలు ఆయన చిత్రాలపై ప్రభావం చూపాయిట. ఆరోగ్యం క్షీణించి ఎన్నో అసంపూర్ణ చిత్రాలను వదిలేసి 1906,అక్టోబర్ రెండున రవివర్మ కన్నుమూశారుట. " నీ చిత్రాలను స్వర్గంలో ఉన్న దేవతలతో పోల్చిచూడటానికి స్వర్గానికి వెళ్ళావా.." అంటూ ఆయనకు నివాళులర్పింఛారుట తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి. 




మూడు రవివర్మ చిత్రాలను పోస్టల్ స్టాంపులుగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. జె.శశికుమార్ అనే భిమాని ఆయనపై డాక్యుమెంటరీ నిర్మించారు. మళయాళంలో "మరకమన్జు" అనీ, హిందీలో "రంగ్ రసియా" అనీ ఆయన జీవితచరిత్రను తెర కెక్కించారు. ఆయన శత జయంతినీ, శత వర్ధంతినీ అభిమానులు వైభవంగా జరుపుకున్నారు. ఆయన జీవిత చరిత్రపై ఎన్నోఆంగ్ల గ్రంధాలు ప్రచురించబడ్డాయి . వాటిల్లో కొన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ముద్రించబడ్డాయి కూడా. ప్రాక్ పశ్చిమ కళారీతుల్ని జోడించి భారతీయ కళారంగంలో ఓ నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడిగా గుర్తుంచుకోదగ్గ మహోన్నతుడు శ్రీ రాజా రవివర్మ.







పుస్తకంలో ప్రచురించిన కొన్ని చిత్రాలు:










(రవివర్మ చిత్రాలు అంతర్జాలంలో కూడా లభ్యమవుతున్న కారణంగా పుస్తకంలోని ఫోటోలు ఈ టపాలో ప్రచురిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరమైతే తొలగిస్తాను.)

Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..



'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!

Wednesday, April 23, 2014

ఈ పాటతో ఆరొందలు!





ఇవాళ రెండు విశేషాలు.. అన్ని బ్లాగుల్లో కలిపి 882 పోస్ట్ లు ఉన్నా, నాకెంతో ప్రియమైన 'తృష్ణ'లో ఆరొందల స్వగతాలు పూర్తయ్యాయి. ఒక నెల తక్కువ ఐదేళ్ళూగా నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు.


రెండవది.. ఇవాళ సుప్రసిధ్ద గాయని ఎస్.జానకి పుట్టినరోజు! అందుకని స్పెషల్ గా ఆవిడ పాడిన తెలుగు పాటలు కాకుండా నాకు బాగా ఇష్టమైన ఓ తమిళ్ పాటని వినిపిస్తున్నాను. జానకి చాలా బాగా పాడిన పాపులర్ సాంగ్స్ లిస్ట్ లో తప్పక ఉండే పాట ఇది. తమిళంలో భారతీరాజా తీసిన "Alaigal Oyivathillai" (తెలుగులో  "సీతాకోకచిలుక") చిత్రంలోని గీతం ఇది.

చిన్న క్విజ్ కూడా... ఈ పాట 'పల్లవి'ని ఇళయరాజా మళ్ళీ ఎక్కడ, ఏ రూపంలో వాడుకున్నాడో చెప్పగలరా ఎవరైనా?

Tuesday, April 22, 2014

గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే..




"...గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే
కళ్లల్లో బాసలన్నీ రాగాలై సాగెలే..
ముద్దబంతి పూచెనులే.. తేనెజల్లు చిందేనులే..
ఊహలన్నీ ఊరేగెనే నందనాలు విందు చేసెనే.."

ఎందుకో ఈ పాట గుర్తుకు వచ్చింది.. టిపికల్ ఇళయరాజా ట్యూన్.. అద్భుతమైన ఇంటర్లూడ్స్.. ఈ పాటకు తమిళ్ లో యేసుదాస్ గళమే నాకు బాగా నచ్చుతుంది.. 

 తమిళ్ version:

   


  తెలుగు version: 




Monday, April 21, 2014

तुझ बिन सूरज मॆं आग नही रॆ..




కొత్తగా వచ్చిన '2 States' సిన్మాలో పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 


బానే ఉందనిపించిన '2 States'



సిన్మా చూడ్డానికి ఊళ్ళో హాల్స్ కి వెళ్లాలంటే పదిహేను, ఇరవై కిలోమీటర్లు పైమాట. అంత పరుగులెట్టే గొప్ప సిన్మాలు లేవు..టైం వేస్ట్ కూడా. సో, మా ఇంటి దగ్గర హాల్లోకొచ్చిన వాటిల్లో ఏదో ఒకటి చూడటం కుదురుతోందీ మధ్యన. ఇంట్లో అత్తయ్యగారున్నారని పాపని అట్టేపేట్టి, రిలీఫ్ కోసం ఏదో ఒకటిలెమ్మని ఈ సినిమాకెళ్ళాం. షరా మామూలే.. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల, గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేసరికీ సిన్మా మొదలైపోయింది :( 


ఈ చిత్రానికి ఆధారమైన నవల చదవలేదు కానీ 'ట్రైలర్' చూసి అసలు చూడాలనుకోలేదీ సినిమా. కాలేజీపిల్లలను తప్పుదోవ పట్టించేట్లు ఉందనిపించింది! ఫస్ట్ హాఫ్ నిజంగా అలానే ఉంది. ఇళ్ళకి దూరంగా హాస్టల్లో చదువుకునే పిల్లలంతా నిజంగా ఎలా ఉంటారో తెలీదు కానీ ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా భయమేస్తుంది పిల్లల్ని దూరాలు పంపడానికి. పైగా ఈమధ్యన సినిమాల్లో ఇలా పెళ్ళికాని ప్రేమికుల మధ్యన ఇంటిమేట్ సీన్స్ చూపించడం రివాజయిపోయింది. సమాజం ఏమైపోతోందో..నైతిక విలువలు ఎటు పయనిస్తున్నాయో.. అన్న దిగులు కలుగుతుంది ఇలాంటివి చూసినప్పుడు. 


ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అక్కడక్కడ బోరింగ్ అనిపించింది. ఇదేదో కాలేజీ పిల్లల కోసం తీసిన సినిమా.. పొరపాటున వచ్చామా..అనుకున్నాం కానీ సెకెండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎక్కడైతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చూపించాడో, అక్కడ స్టోరీలో డెప్త్ వచ్చింది. "ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు కానీ పెళ్ళాడాలంటే రెండు కుటుంబాలు కలవాలి" అనే డెఫినిషన్తో తెలుగులోనూ, హిందీ లోనూ కూడా డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల పిల్లల మధ్యన ప్రేమ,పెళ్ళి నేపథ్యంతో రీసేంట్ గా చెప్పాలంటే 'చెన్నై ఎక్స్ప్రెస్' లో తమిళమ్మయి-హిందీ అబ్బాయి, దానికన్నా ముందు 'విక్కీ డోనర్' లో పంజాబీ-బెంగాలీ ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ చూపెట్టారు. ఇందులో కొత్తగా ఏముందంటే తండ్రీ కొడుకుల మధ్యన డిస్టర్బ్ద్ రిలేషన్. అది గ్రాడ్యువల్ గా ఎలా బాగయ్యిందో చూపెట్టడం బాగుంది. టివీ సీరియల్స్ తో తలపండిపోయిన రోనిత్ రాయ్ హీరోకి తండ్రిగా బాగా చేసాడు. అమృతా సింగ్ కన్నా వీరోవిన్ తల్లి పాత్రలో రేవతి బాగా మెప్పించింది. 


"ఐ వాంట్ టూ మేరీ యువర్ ఫ్యామిలీ" అని హీరో త్రీ రింగ్స్ తో ప్రొపోజ్ చెయ్యడం చాలా బాగుంది. బాలీవుడ్ కి మరో యంగ్ & ప్రామిసింగ్ హీరో దొరికాడు. పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటే నిలబడగలడు. క్రితం వారం ఏదో పేపర్లో ఇతనిదో పెద్ద ఇంటర్వ్యూ చదివాను. అందులో ఎంతవరకూ నిజాయితీ ఉందో తెలీదు కానీ బాగా మాట్లాడాడు. ఇక 'ఆలియా భట్' గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. చిరునవ్వుతో సహా తల్లిపోలికలు బాగా ఉన్న యంగ్ & ఎనర్జిటిక్, టాలెంటెడ్ తాటాకుబొమ్మ. చివర్లో పెళ్ళికూతురు డ్రెస్ లో అచ్చం బొమ్మలా ఉంది. చిన్నవైనా expressive eyes ఉన్నాయీ అమ్మయికి. But, సినీలోకపు కమర్షియల్ పరుగుపందాల్లో జారిపోకుండా ఉంటుందా అన్నది ప్రశ్నే! 


తమ కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నాలేమీ ఫలించట్లేదని, క్రిష్ కూడా సహకరించట్లేదనిపించి అతనికి దూరంగా జరిగడం నచ్చింది నాకు. ఆ పాయింట్ లో, మళ్ళీ హీరో తండ్రి వచ్చి వెళ్ళాకా క్రిష్ కు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి పాత్రకు ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. అక్కడ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఒక మామూలు కమర్షియల్ సినిమాలా మూడు ఫైట్లు, ఆరు పాటలతో పూర్తి చెయ్యకుండా ప్రేమికులు తల్లిదండ్రుల అనుమతి కోసం పాటుపడడం అనే కాన్సెప్ట్ వల్ల వెయిటేజ్ పెరిగి బానే ఉంది.. పైసా వసూల్.. అనిపించుకుందీ సినిమా. Moreover.. there is love... love that we can feel with our hearts! 


పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 



Friday, April 18, 2014

పాట వెంట పయనం: వర్షం


ఈ నెల 'పాట వెంట పయనం' లో నేపథ్యం.."వర్షం"! ఎండలు మండిపోతున్నాయి కదా అని కాసేపు వాన పాటలు చూస్తే మనసైనా చల్లబడుతుందని...

http://magazine.saarangabooks.com/2014/04/16/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%8A%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF/

Thursday, April 17, 2014

నాన్న చెప్పిన 'ఆవకాయ' కబుర్లు..




హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...

నాన్న మాటల్లో..:

" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. 

కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:
ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు మిరపకాయలు(వెడల్పాటివి) కిరాణాకొట్లో అమ్మేవారు. ఎరుపుదనం, కమ్మదనం వాటి స్పేషాలిటీ. అప్పుడే ఎక్కువకొనేసుకుని ఏడాది పొడుగునా రోజువారీ వాడకానికి దాచేవారుట. వాటిని రెండు మూడూ ఎండలకి లోపల గింజలు గలగలలాడేలా బాగా ఎండనిచ్చి, వాటితో కారం కొట్టించడం మొదటి పని. ప్రతీ ఇంట్లోనూ రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి. చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లోంచీ ఒక రిథిమ్ లో వినిపించేది కారం దంచే చప్పుడు. ఇలానే రాళ్ళుప్పు కూడా ఎండబెట్టి కొట్టించేవారు. మెంతికాయ కోసం మెంతులు కూడా వేయించి గుండ కొట్టించడం మరో పని. వీటితోపాటూ ఆవాలు కూడా. వాటిల్లో మళ్ళీ సన్నావాలు,పెద్దావాలు. సన్న ఆవాల ఆవకాయ అని విడిగా పెట్టేవారుట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఏ ఆవాలు నాణ్యమైనవో తెలుసుకోవడానికి నాలుగు కిరాణా కోట్లూ తిరిగి ఇంట్లో వాళ్ళు సాంపిల్స్ తేవడం ఒక పని.

పప్పునూనె:
దాదాపు నువ్వుల పంటే ఉండేది చాలామందికి. బస్తాల్లో నువ్వులు వచ్చాకా, నూపప్పు డబ్బా అని చిల్లుల డబ్బా ఒకటి ఉండేది. ఆ డబ్బాలో నానబెట్టిన నువ్వులు పోస్తే, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేసేది. చేత్తో పిసిగితే నువ్వుల పై పొట్టు పోయేది. అది బయట పారేసి, ఛాయనూపప్పు ఒక్కటీ బయటకు తీసేసి ఎండబెట్టేవారు. ఆ తర్వాత వాటిని గానుగకి తీసుకువెళ్ళి ఆడించడం. ఈ పనొక్కటీ మా పిల్లలకు అప్పచెప్పేవారు. మేం కూడా గానుగ దగ్గరకు ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే రంగులరాట్నంలా గిరగిరా తిరిగే గానుగ మీద కూచుని తిరగచ్చని సరదా. గానుగెద్దు గిరగిరా తిరుగుతుంటే గానుగ లోంచి విచిత్రమైన ధ్వనులతో సంగీతమొచ్చేది. ఆ గానుగ సింఫనీ చాలా బాగుండేది. ఎందుకో తెలీదు కానీ నువ్వులతో పాటూ బెల్లం కూడా గానుగలో వేసేవారు. గానుగ ద్వారా పప్పు నూనే కాకుండా తెలగపిండి కూడా వచ్చేది. గానుగలోంచి వచ్చిన ఫ్రెష్ పప్పు నూనె వాసన తాగెయ్యాలనిపించేంత తియ్యగా ఉండేది. ఇదంతా బెల్లం మహత్యం అయి ఉండచ్చు.

ఆవకాయ కాయ:
ఇలా సంబారాలన్నీ సమకూర్చుకున్నాకా, అసలు సిసలైన మామిడికాయ ఎంపిక మొదలయ్యేది. పుల్లటి పులుపు, పీచుదనం, ఏడాది పొడుగునా నిలవ ఉండే నాణ్యత ఆవకాయ కోసం వెతికే ఉత్తమ మామిడి లక్షణాలు.
కోతుల తోట అని ఓ పొలం ఉండేది మాకు. అందులో ఒకే ఒక ప్రశస్థమైన మావిడి చెట్టు ఉండేది. అది ఊరగాయల టైం కి కనీసం రెండువేల కాయ కాసేది. ఇంట్లోని నాలుగు కుటుంబాల వాళ్ళకీ విడివిడిగా జాడీలతో పెద్ద పెద్ద కుండలతో ఊరగాయ కి సరిపడా కాయ కాసేది ఆ ఒక్క చెట్టూ! ఇది కాక గోదావరి లంకలో పెద్ద మామిడి తోటే ఉండేది. బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జొన్నల రసాలు, కొబ్బరి మామిడి, ఏనుగు తలకాయ మామిడి, ఇంకా అనేక రకాక జాతుల మామిడి చెట్లు ఉండేవి. వేసంకాలం నాటికి ఈ మామిడి చెట్ల నుండి టాటాకు బుట్టలతో రకరకాల మామిడి పళ్ళు ఇంటికి వచ్చినా, ఊరగాయ కాయ మాత్రం కోతుల తోట లోని ఆ ఒక్క మామిడి చెట్టు నుండే వచ్చేది.



కాయ దింపడం:
పొడుగాటి గడకర్రకి చివర్న తాడుతో చిక్కం(తాడుతో అల్లిన బుట్టలాంటిది. పదిపన్నెండు కాయలు ఒకేసారి పట్టేవిట అందులో.) కట్టేవారు. కాయ క్రింద పడకుండా ఆ చిక్కం లోకే పడేలాగ చెట్టు నుండి వేరు చేసి కాయ కోయడం ఒక కళ. కాయ పరువుకి రావడం అనేవారు. అంటే ఇంకొక నాలుగు రోజులు ఆగితే కాయ పండిపోతుంది. అలా పరువుకి వచ్చిన కాయలు మాత్రమే ఊరగాయకి పనికి వచ్చేవి. ఆ కాయలు మరకత్తిపీటతో(ఆ కాలం పల్లెటూళ్ళలో ప్రతీ ఇంటా ఒక మరకత్తిపీట ఉండేది) ముక్కలు క్రింద కొట్టేవారు. కాయ సైజుని బట్టీ ఎనిమిది గానీ పన్నెండు గానీ ముక్కలయ్యేవి. ప్రతీ ముక్కకీ మధ్యలో డొక్క ఉండితీరాలి. అలా లేకపోతే అది ఆవకాయకి పనికిరాదు. మామిడికాయ కట్ చేసినప్పుడూ ముక్కతో పాటూ జీడి కూడా వస్తుంది కదా, ఆ జీడి, డొక్క పైపొర తీసేసి చిన్న బట్టతో ముక్కను తుడిచి రెడీ చేసేవారు. కాయ పరువానికొచ్చిందేమో, ప్రతి ముక్కా లేత పసుపు రంగులో ఉండేది. 
తెలుపుకీ, పసుపుకీ మధ్య రకం అన్నమాట. ఇక్కడికి ఆవకాయకి ముడిసరుకు రెడీ అయినట్లే. 

ఆవకాయ కలపడం:
నాపరాయితో తాపడం చేసిన అరుగు శుభ్రం చేసుకుని మిరపకాయ,ఉప్పు గుండ, ఆవపిండి పాళ్ళ ప్రకారం కలిపేసి, ఆ గుండ మధ్యలో కొత్తగా తయారయి వచ్చిన పప్పు నూనె కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు వేస్తూ గుచ్చెత్తేవారు. దీంట్లోకి ఎవరు రుచిని బట్టి వాళ్ళూ వెల్లుల్లిపాయ, మెంతులు, శనగలు, లవంగాలు కలుపుకునేవారు విడివిడిగా. లవంగాల ఆవకాయ ముఖ్యంగా రాజుల ఇళ్ళల్లో పెట్టేవారు. ఏడాది పొడుగునా ఎప్పుడు జాడీ లోంచి ఆవకాయ తీసినా మంచి లవంగాల వాసన వస్తూ ఉండటం ఈ లవంగాల ఊరగాయ ప్రత్యేకత. మా ఇంట్లో అయితే పది రకాల ఆవకాయలు పెట్టేవారు. వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లి లేనిది, పెసర ఆవకాయ, నూపప్పు ఆవకాయ, అల్లం ఆవకాయ, శనగల ఆవకాయ, సన్నావాల ఆవకాయ, పచ్చ మెరపకాయలతో పెట్టే పచ్చావకాయ(ఇది విపరీతమైన కారంగా ఉంటాయి ఈ పచ్చమిరపకాయలు), పులిహారావకాయ , బెల్లంపావకాయ.

భోజనాల దగ్గర ఊఅగాయ వడ్డించేప్పుడు ఊరిన వెల్లుల్లిపాయల కోసం పిల్లలం పోట్లాడుకుంటూన్నామని వెళ్ళూల్లిపాయలు దండగా గుచ్చి ఊఅగాయలో వేసేవారు. ఎన్నికావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మిగిలిన దండ మళ్ళీ జాడిలో వేసేసేవారు. ఊరీఊరని ఊరగాయ, వచ్చీరాని కబుర్లు ముచ్చటగా ఉంటాయని అన్నట్లుగా ఉండేది కొత్తావకాయ. పాళ్ళు సరిపోయాయా లేదా అని ఇరుగుపొరుగులు ఆవకాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఓ హాబీలా ఉండేది."

***    ***      ***

ఊరగాయల గురించి ఇదివరకూ రాసిన కబుర్లు..

* మామ్మయ్య ఊరగాయలు:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_04.html
* ఊరగాయ వైరాగ్యం:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_15.html


Friday, April 11, 2014

శిలకోల కథలు




పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు షాప్ త్వరగా మూసేసారు. అక్కడ నుండి కాస్త దూరంలో ఉన్న మరో విశాలాంధ్ర బ్రాంచ్ కు వెళ్తే అదీ మూసేసారు. అక్కడి నుండి కాళ్ళీడ్చుకుంటూ నవోదయాకు కూడా వెళ్ళాను. వాళ్ళసలు పేరే వినలేదన్నారు. ఏవో వేరే బుక్స్ కొనుక్కుని వచ్చేసా. మళ్ళీ వారం ఈసారి షాపు ఉందో లేదో కనుక్కుని విశాలాంధ్రకు వెళ్ళా. వాళ్ళూ పుస్తకం గురించి తెలీదన్నారు. మార్చ్ ఎండింగ్ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆఖరుకి మళ్ళీ కినిగె ద్వారానే తెప్పించుకున్నా పుస్తకాన్ని. కినిగె ఆర్డర్ ఓ  క్లిక్ దూరమే కానీ నే చేసిన పొరపాటు వల్ల నెట్ బ్యాంకింగ్ లో ఏదో తేడా జరిగి, శ్రీవారు చెయ్యిపెట్టి బాగుచేసేదాకా ఆగవలసి వచ్చింది. అలా కళ్ళు కాయలు కాసాకా ఈ పుస్తకం చేతికొచ్చింది. దీనితో పాటూ మరో మంచి పుస్తకం కూడా తెప్పించుకున్నా.(దాని గురించి ఇంకోసారి రాస్తాను.) ఈ "శిలకోల కథలు" మాత్రం చాలా బాగుంటాయి అని నాకెందుకో ఓ నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తోడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు మొదటి కథ చదవగానే నాకు అర్థమైపోయింది నేనో మంచి పుస్తకాన్ని చదవబోతున్నానని!


రచయిత 'మల్లిపురం జగదీశ్' ఎవరో తెలీదు నాకు. ఉత్తరాంధ్ర సాహిత్యంతో పెద్ద పరిచయమూ లేదు, అక్కడి ఆదివాసీ జీవనం గురించిన అవగాహనా లేదు. ఇదివరలో చదివిన వంశీ 'మన్యంరాణి' వల్ల గిరిజనుల ఆచారాలు, జీవనవిధానం,కట్టుబాట్ల గురించి కాస్త వివరం తెలిసింది; తర్వాత వాడ్రేవు వీరలక్ష్మి గారి 'కొండఫలం' లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించిన మూడు నాలుగు కథలు ఉన్నాయి. ఇప్పుడీ పుస్తకం  చదివితే మాత్రం ఆ గిరిజనులతో ఏం సంబంధం లేకపోయినా వారికి తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి చదువుతుంటే ఒక విధమైన ఆవేశం మనసుని కమ్మేసింది. అభివృధ్ధి ముసుగులో ఇన్ని అన్యాయాలు జరిగాకా ఏ గిరిజనుడు 'పల్లపోడిని' నమ్ముతాడు? అనిపించింది. 'ఇప్పమొగ్గలు' కథలో 'బూది' వేసిన ప్రశ్నలే నా మనసులో కూడా ప్రతిధ్వనించాయి.. 

"వీళ్ళలో చదువుకోనిదెవరు? చదువేం నేర్పింది? ఈ చదువుల్తో ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు..."

"ఛీ..వీళ్ళు మనుషులేనా? అదవిని నమ్ముకుని కొండల్లోనూ, గూడల్లోనూ నివసిస్తున్న తమ వాళ్ల పట్ల ఇంతటి నీచ భావమా? ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం.. పండో, కాయో, మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం.. కొండఫలంలోని కొంత నేస్తానికివ్వడం తమ సాంప్రదాయం. అతిధుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం తమ సంస్కారం." అంటుందామె.
'బాకుడుంబారి' కథలో 'శ్రీధర్' ప్రశ్నలు కలతపెడతాయి. ఆధునిక ప్రపంచంలో ఎన్నో అభివృధ్ధి కార్యకరమాలు జరుగుతున్నా కూడా కూడా వీళ్ళకీ పేదరికం ఏమీటి? విద్య అందుతున్నా ఇలా వెనుకబడే ఉన్నారేమిటి? ఈ ప్రాంతాల వాళ్ల భవిష్యత్తేమిటి? అని ఆవేదన కలుగుతుంది. రచయిత కథలు రాస్తే, చదివిన నా ఆవేదనని ఇలా టపా రూపంలో రాస్తే, ఈ పుస్తకం గురించి మరో నలుగురికి తెలుస్తుందనిపించింది.


అసలివి కాలక్షేపం కథలు కానే కావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులూ, వాళ్ళకు జరిగిన జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టేట్లుగా రచయిత గీసిన ఒక రేఖా చిత్రం. ప్రతి పేజీలో, ప్రతి వాక్యంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న గిరిజనుల నిస్సహాయ జీవితచిత్రాలు కనబడతాయి. ఒక్కో కథలో ఒక్కో సమస్యనూ ఎంతో వైవిధ్యంగా మనముందుంచారు జగదీశ్ గారు. అసలు కథలంటే ఏమిటి? జీవిత చిత్రాలే కదా. యదార్థానికి ప్రతిరూపాలే కదా. ఒక కథ మనసుకి హత్తుకుని రచయిత తాలూకూ భావోద్వేగాన్ని పాఠకుడు అందుకోగలిగినప్పుడు ఆ కథ సజీవమౌతుంది. అజరామరమౌతుంది. అలా లేనప్పుడు అసలు ఏ కథైనా రాసీ ప్రయోజనం ఉందదని నా అభిప్రాయం. ఈ పుస్తకంలో ప్రతీ కథా హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తుంది. ఏదైనా చేసి ఆ కథల్లోని మనుషుల వేదనను తగ్గించాలనిపిస్తుంది. నాలాగే ఈ పుస్తకం చదివినవారందరికీ అనిపిస్తే, "శిలకోల" అనే అనువైన పేరుతో జగదీశ్ చేసిన ఈ సాహితీ సృజన వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరగలదనే నమ్మకం కలిగింది.


జగదీశ్ గారి రచనా శైలి చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చిన్నవే అయినా వాటి వెనుక అర్ధాలు బోలెడున్నాయి. వాక్యాలు సున్నితంగానూ, వాడిగా కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను..

* "ఈ చరిత్రొకటి. అదెక్కడ మొదలౌతుందో కానీ ఏదీ అర్థం కాదు. ఆ మాటంటే మట్టిబుర్రలు, ఒక్కరోజైనా పుస్తకం తీస్తే అర్థమౌతుందని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు."

* "వెర్రీ గుడ్ రా... వెయ్యేళ్ళు వర్థిల్లు.." తెరలు తెరలుగా నొక్కి చెప్పారు. 
అది దీవెనో, శాపమో వాడికే అర్థం కాలేదు.

* ఆడి పెల్లి కర్సులకని పోతులు అమ్మేసాను. కొండ మీద నల్లని తల్లి మా జిలుగుసెట్టూ, సింత సెట్టూ అమ్మేసేను. ఇంకా సాల్లేదని సావుకారి కాడ అప్పు తెచ్చఏను. ఇద ఈ పొద్దు ఆడు పిల్లల్తండ్రైనాడు. ఉజ్జోగస్తుడైనాడు, గానీ అప్పు అలాగే ఉండిపోయింది. నా గోచీ ఇలాగే మిగిలిపోయింది.

* అక్కడక్కడ దిసమొలల్తో అనారోగ్యంతో నింపుకున్న పెద్దపెద్ద పొట్టల్తో ఆటలాడుకుంటున్న ఆదివాసీ బాలలు.. అభివృధ్ధికి ఆనవాళ్ళూగా...

* పింటుగాడు ఆడుతున్న రేడియో లోంచి "మంచి పోషక విలువలు గల ఆహారం" అనే అంశం మీద డాక్టర్ గారి ప్రసంగం వినిపిస్తోంది.

* వాళ్ళనక్కడ చూస్తూంటే కొండ మీద చెట్లను తెచ్చి నగరంలో నాటి నీళ్ళు చిలకరిస్తున్నట్లుంది.

* అడవి...ఎలా ఉండేది?
ఇప్పుడది ఆరిన నిప్పు.
కొండ?
కన్నీటి కుండ.

* ఈ మౌనం ఇప్పటిదా?
దీని వెనుక దాగిన కథలెన్నో!
దశాబ్దాల నాటి వ్యధలెన్నో కదా!!

ఈ వాక్యాలు చాలు ఈ కథల గురించి ఇంకేం రాయక్కర్లేదు నేను. ఇవాళ విచిత్రంగా ఈ కథల్లోని సారం అంతా ఉన్న ఒక కవిత దొరికింది. క్రింద లింక్ లో ఆ కవిత చదవవచ్చు:
శిలకోల చూపు



ఈ పుస్తకంలోని అక్షరాల్లో నాకో విచిత్రం కనబడింది. "క్ష" అక్షరానికి బదులు "ష" వత్తు పడింది. అన్నిచోట్లా! అక్షంతలు, శుభాకాంక్షలు, అక్షరం... అన్నిచోట్లా "క" క్రింద "క్ష" వత్తు బదులు "ష" వత్తు పడింది. టైప్ చేద్దామంటే ఇక్కడ రావట్లేదు నాకు. ఇది ఉద్దేశపూర్వకమో పొరపాటో తెలీలేదు నాకు!