Friday, July 26, 2013

నాగార్జున కొండ - ఎత్తిపోతల జలపాతం



నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి దాదాపు నెల అయిపోతోంది. ఇప్పటికన్నా బ్లాగ్ లో రాసుకోపోతే మర్చిపోతాను కూడా! జూన్ నెలాఖరులో వరంగల్ ట్రిప్ కన్న ముందరే సాగర్ వెళ్ళాము. వేటూరి గారి "జీవన రాగం" లో నాగార్జున కొండ వర్ణన చదివినప్పటి నుండీ అక్కడికి వెళ్ళాలని నా కోరిక. ఒకానొకరోజు పొద్దున్న ఎనిమిదింటికి బస్సు ఎక్కాం. మంచి డీలక్స్ బస్స్ దొరికింది. ఓ రెండు సిన్మాలు కూడా చూసాం. ఇప్పుడు ఆర్.టి.సి. బస్సులో శాటిలైట్ మూవీసేట. సరే, పన్నెండింటికి నాగార్జునసాగర్ చేరాం. బస్సు దిగాకా, చుట్టుపక్కల తిరగటానికి ఓ ఆటో మాట్లాడుకున్నాం. నాగార్జున కొండ కి వెళ్ళే మోటర్ బోటు రోజుకి రెండు ట్రిప్లు వేస్తుందిట. మధ్యాహ్నం రెండింటికి వేసేది లాస్ట్ ట్రిప్ ట. మేం చేరేసరికీ పన్నెండయ్యింది కాబట్టి భోజనం చేసి ముందు నాగార్జున కొండ కి వెళ్ళే రెండింటి బోటు ఎక్కుదామనుకున్నాం. దారిలోనే నాగార్జున డామ్ చూసేసాం. అప్పటికింకా వర్షాలు ఎక్కువగా పడట్లేదు కనుక రిజర్వాయిర్ లో నీళ్ళు లేవు.






బోట్ ఎక్కే ప్రదేశం దగ్గరే ఏ.పి.టూరిజం ఆఫీసు,గెస్ట్ హౌస్ ఉన్నాయి. ముందు కాస్త టిఫిన్ తినేసి టికెట్ కొనటానికి నుంచున్నాం. వీకెండ్స్ లొ బిజీగా ఉండే ఈ ప్రాంతానికి జనం లేకపోతే అప్పుడప్పుడు ట్రిప్ కాన్సిల్ చేస్తుంటారుట. జనాన్ని చూసే ట్కెట్లివ్వడం మొదలుపెడతారు కాబోలు. రెండున్నరకేమో టికెట్ళుచ్చారు కానీ బోట్ మూడింటికి గానీ రాలేదు. ఈలోపూ అక్కడే ఉన్న బెంచీల మీద కృష్ణమ్మని, నీలాకాశాన్ని, తెల్లని మబ్బుల్నీ చూస్తూ కూచున్నాం. మూడేళ్ళ తర్వతేమో కృష్ణమ్మని దగ్గరగా చూడ్డం.. ఆ నోళ్లని అలా చూస్తూంటే ఏదో కొత్త ప్రాణం నాలో ప్రవేశించినట్లు అనిపించింది. నాకు గోదారమ్మ దేవకి,  కృష్ణమ్మ యశోద మరి ! నల్లని నీళ్ళు..చూట్టూరా కొండలు.. ఎండవేళైనా ప్రశాంతంగా ఉంది అక్కడ. మూడింటికి మోటార్ బోటు వచ్చింది. పాపికొండలు బోట్ ట్రిప్ లాగానే ఈ నాగార్జున కొండ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్పీకర్లు,పాటలు మొదలైన హంగామా కూడా లేదు. బోటు, నీళ్ళు, గాలి హోరు, దురంగా కనబడే కొండలు, వాటిపై పచ్చదనం, ఆకాశం, మనం అంతే.






 బోటు స్టార్ట్ అయిన కాసేపటికి మా పక్కగా ఎగురుతున్న ఓ పక్షిని చూసి చాలా సరదాపడ్డాం. చూడ్డానికి గోరింకలాగ ఉంది. తెల్లని పక్షి, నల్లని తల, పొడుగాటి పసుపచ్చ ముక్కు. కానీ ఒడ్డుకి దూరంగా ఈ నీళ్ళలో అంత కష్టపడి ఎందుకు వస్తోందో తెలీలా. నీళ్ల దగ్గరగా రావడం మళ్ళీ పైకెగిరిపోవడం. తమాషా అనిపించింది. కాసేపటికి మరో నాలుగు పక్షులు కనబడ్డాయి ఇలానే ఎగురుతూ.. వాటికి ఫోటోలు తీస్తూ అలా కాసేపు గడిచాకా అవి నోళ్లు తెరుచుకు ఎగరడం గమనించాను. అప్పుడు అర్థమైంది అవి చేపల కోసం వస్తున్నాయని. నోరు తెరుచుకుని నీళ్ళ దగ్గరగా వచ్చి ఠక్కున చేపను పట్టుకుని వెళ్పోతున్నాయి. వాలటానికి ఏమీ లేని నీటి మధ్యకు వచ్చి వెతికి వెతికి అలా చేపను పట్టడం ఎంత కష్టమో అసలు..! అలా వాటిని చూస్తూండగానే నాగార్జున కొండ దగ్గర పడింది. టైం నాలుగైంది. కృష్ణానది మధ్యలో ఉన్న ఆ చిన్నద్వీపం లో ఏముందో చూడాలని మనసు తొందరపడింది.


నాగార్జునకొండ:

ఈ నాగార్జున కొండ ప్రాంతంలోనే "మహాయాన బుధ్ధిజ"మనే బౌధ్ధమత శాఖ పుట్టి పెరిగిందట. కనిష్కుల పాలనలో మహాయానబౌధ్ధమతానికి బాగా ఆదరణ ఉండేదిట.  తర్వాత ప్రముఖ బౌధ్ధాచార్యుడు 'ఆచార్య నాగార్జున' పర్యవేక్షణాలో ఈ మతం బాగా ప్రచారాన్ని పొందిందని, పూర్వం 'శ్రీపర్వత'మని పిలిచే ఈ కొండ ప్రాంతంలోనే ఆచార్యుడు నివసించారు కాబట్టి ఆయన పేరుపైనే ఈ ప్రాంతాన్ని నాగార్జున కొండ అనే పిలుస్తారు. ఈయన శాతవాహనుల కాలం వారని అంటారు. బౌధ్ధమతం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా బౌధ్ధారామాలు ఉండేవిట. కాలక్రమంలో ఆ నిర్మాణాలన్నీ కృష్ణమ్మఒడిలో చేరిపోగా కొన్ని కట్టడాలనూ, వస్తువులనూ పురావస్తు శాఖవారు త్రవ్వకాల ద్వారా వెలికి తీసి ఈ నాగార్జున కొండ మీద మ్యూజియంలో భద్రపరిచారు.


పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనం దాటి వెళ్తే లోపల మ్యూజియం ఉంది. రాతి యుగానికీ, కనిష్కులకాలానికీ ,శాతవాహనుల కాలానికి చెందిన కట్టడాల నమూనాలూ, శిల శాసనాలు, విగ్రహాలు, బౌధ్ధ నిర్మాణాలు, శకలాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. ఎప్పటివో కదా..చాలా వరకు విగ్రహాలు శిధిలమైపోయి ఉన్నాయి:( ఎంతో శ్రమ కూర్చి ఆ శిధిలాలన్నీ అక్కడికి చేరవేసినట్లు తెలుస్తోంది. లోపల కొందరు విద్యార్థులు అక్కడ కూచుని ఏవో వివరలు రాసుకుంటున్నారు కూడా. గబ గబా మ్యూజియం చూసేసి చుట్టూరా ఉన్న ఉద్యానవనం కూడా చూద్దామని బయల్దేరాం. ఓ పక్కగా మూలకి క్యాంటీన్ ఉంది. అక్కడ నుంచి కృష్ణానది వ్యూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. సూర్య కిరణాలూ, మబ్బుల వెలుగునీడలతో మిలమిలా మెరుస్తున్న నీళ్ళు, చుట్టూరా గీత గీసినట్లు ఒకే హైట్ లో ఉన్న కొండలు.. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న బెంచి మీద చాలా సేపు కూర్చుండిపోయాం.




 ఆ తర్వాత దిగువన కనబడుతున్న స్నానాలరేవు కి చేరాం. రాజుల కాలంనాటి ఆ కట్టడాలు పాడవకుండా పైన కాస్తంత ఫినిషింగ్ వర్క్ చేసి ఉంచారు మెట్లని. చాలా బాగుంది ఆ కట్టడం. అక్కడ దిగువగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళపై కూర్చుని కృష్ణమ్మనీ, ఆకాశాన్నీ, వెండిమబ్బులనీ చూస్తుంటే ఎంతసేపైనా గడిపేయచ్చనిపించింది. తిరిగి వెళ్ళేప్పుడు మాతో పాటూ మ్యూజియం సిబ్బంది కూడా వచ్చేసారు. రాత్రికి అక్కడ ఇద్దరు గార్డులు ఉంటారుట అంతే. మరి వానా వరదా వస్తే మీరంతా ఇక్కడికి ఎలా వస్తారు  అని సిబ్బందిని అడిగాం.  ఉద్యోగాలు కదా వీలయినంతవరకూ మానకుండా అలానే వస్తాం.. అన్నారు వాళ్ళు. ఐదున్నరకి బయల్దేరితే ఆరున్నరకి మళ్ళీ ఒడ్డు చేరాం.


ఎత్తిపోతల జలపాతం:


ఎలాగైనా ఈ ట్రిప్ లో ఎత్తిపోతల జలపాతం దగ్గరకు వెళ్ళాలని. బోట్ లేటుగా ప్రయాణమైనందున అన్నీ లేటయిపోయాయి. సాగర్ దగ్గర్లో ఉన్న "అనుపు" అనే ప్రదేశాన్ని కూడా చూడాలని కోరిక. కానీ చీకటి పడుతోందని ముందు ఎత్తిపొతల బయల్దేరాం. మాకు దొరికిన ఆటో అతను కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అరగంటలో ఎత్తిపోతల జలపాతం వద్దకు చేరాం. ఖాళీగా ఉంది ప్రదేశం. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ప్రతి కోతీ విచిత్రంగా పిల్లకోతుల్ని వీపుపైనో, పొట్టక్రిందో అంటిపెట్టుకుని నడుస్తున్నాయి. చంద్రవంక కొండల్లో నుండి ఈ జలపాతం ప్రవహిస్తూ వచ్చి, ఇక్కడి నుంచి కిందకు జారి కృష్ణానదిలో కలుస్తుందిట. మేం వెళ్ళేసరికీ సరిగ్గా సూర్యాస్తమయం అయ్యి చీకట్లు ముసురుతున్నాయి. గలగల మనే నీటి చప్పుడు.. జలపాతం దగ్గరపడేకొద్దీ హోరు ఎక్కువైంది. తెల్లని నీళ్ళు అలా పైనుండి జలజల పడుతుంటే భలేగా అనిపిచింది. కొద్దిగా పక్కగా మరొక చిన్న జలపాతం ఉంది. అసలు జలపాతాలే చాలా అద్భుతమైన దృశ్యాలు. ఇంతకు మునుపు చిన్న చిన్న జలపాతాలని చూశాను. అన్నింటికన్నా ఇదే పెద్దది. ఇప్పుడు అనుమతివ్వట్లేదుట గానీ ఇదివరకూ క్రిందకు వెళ్లనిచ్చేవారుట.



అక్కడ కొద్ది దురంలో దత్తాత్రేయుడి గుడి ఉంది. క్రిందకు బాగా నడవాలి. మీకు ఆలస్యమైపోతుంది పైగా చీకట్లో పాముపుట్ర ఉంటాయి. వద్దన్నాడు ఆతోఅతను. సర్లేమ్మని ఇక బస్టాండ్ కు బయల్దేరాం. మధ్యలో సత్యనారాయణస్వామి గుడి ఉంది. అక్కడ ఆగి స్వామిని దర్శించుకుని, బస్టాండ్ చేరేసరికీ ఎనిమిదవుతోంది. పొద్దున్న వచ్చేప్పుడు దొరికినట్లు డీలక్స్ బస్ దొరుకుతుందేమో అని ఎదురుచూస్తు కూర్చున్నాం. మధ్యలో రెండు మామూలు బస్సులు వచ్చాయి కానీ మేం ఎక్కలేదు. ఖాళీ అయిపోతున్నా ఆ ప్రాంతంలో కూర్చోటానిక్కూడా భయమేసింది నాకు. తొమ్మిదిన్నర దాటి పదవుతూండగా వచ్చింది డీలక్స్ బస్సు. ఊరు చేరేసరికీ ఒంటిగంట. అక్కడ్నుంచీ ఎం.బి.ఎస్ వచ్చేసరికి రెండు. మధ్యలో రెండు మూడు పోలీస్ స్టేషన్లు వస్తాయి.. భయం లేదని తను చెప్తున్నా, పార్క్ చేసిన బండి తీసుకుని ఇంటికి వెళ్తుంటే భలే భయమేసింది నాకు. దారి పొడుగునా క్షణక్షణంలో శ్రీదేవిలా దేవుడా దేవుడా.. అనుకుంటూ కూర్చున్నా:) ట్రాఫిక్ లేకపోవడం వల్ల మామూలుగా గంటపట్టే రూట్ లో అరగంటకే ఇల్లు చేరాం! 'అనుపు', ఎత్తిపోతల దగ్గరున్న 'దత్తాత్రేయస్వామి గుడి' చూట్టానికి మళ్ళీ వెళ్ళాలి.. ఎప్పటికవుతుందో...!!


ఈ ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడచ్చు:


Thursday, July 25, 2013

'తొవ్వ ముచ్చట్లు' - చిల్లోడి కొండప్ప




పొద్దుటి పేపరు ఇప్పుడు తిరగేస్తుంటే ఈ ఆసక్తికరమైన ఆర్టికల్ కనబడింది. జయధీర్ తిరుమలరావు గారు రాసిన "తొవ్వ ముచ్చట్లు" అనే పుస్తకం గురించిన వ్యాసం. అందులో అరకులోయ దగ్గరలో ఉన్న 'సొంపి' గ్రామానికి చెందిన "చిల్లోడి కొండప్ప" అనే గిరిజన వైద్యుడి గురించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యాసం చాలా నచ్చింది నాకు. వీలైతే ఈ పుస్తకం కొనుక్కోవాలి.

ఎవరికైనా ఉపయోగపడుతుందని లేదా నాలా ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతారని ఇక్కడ లింక్ ఇస్తున్నాను..

ఇవాళ్టి ఆంధ్రజ్యోతి అనుబంధం నవ్య మొదటి పేజీ ఆర్టికల్:
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/07/25/ArticleHtmls/25072013101022.shtml?Mode=1

తడిసిన జ్ఞాపకం..




ప్రియాతి ప్రియమైన నీకు...
ఇన్నేళ్ల తరువాత ఈ పిలుపేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? మరి ఇలా తప్ప మరోలా మనం ఒకరినొకరం సంబోధించి ఎరుగుదుమా?! మనుషులం దూరం అయిపోయినా నువ్వు నా దగ్గరగానే ఉన్నావుగా ! ఇలా తప్ప మరోలా ఎలా పిలువను నిన్ను? ఎప్పుడన్నా నీకు నేను గుర్తుకు వస్తానేమో.. ఒక్కసారన్నా నీ ఉత్తరం వస్తుందేమో అని ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నాను.. నువ్వు రాయలేదని నేను ఊరుకోలేనుగా.. అందుకే ఇవాళన్నా నిన్ను పలకరిద్దామని మొదలెట్టాను...

కానీ..ఎక్కడ మొదలెట్టాలో తెలీట్లేదే...
సిటి బస్సులో మన మొదటి పరిచయం అయిన దగ్గర నుంచా?
ఆ పరిచయం చిగురులు తొడిగి అందమైన స్నేహంగా మారిన దగ్గరనుంచా?
కాలేజీ అయిన దగ్గర నుంచా?
నువ్వు యూనివర్సిటీకి వేరే ఊరెళ్ళిన దగ్గరనుంచా?
నీ పెళ్ళి అయిన దగ్గర నుంచా.. నా పెళ్ళి అయిన దగ్గర నుంచా?
సంసారంలో కొట్టుకుపోయి నన్ను నేను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఉద్యోగబాధ్యతల్లో పడి నువ్వు నన్ను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు...


"గొప్ప స్నేహితురాలివి నువ్వు..." అన్న నీ మాటలు.. కడగళ్ల వాకిట్లో నే నిలబడినప్పుడల్లా నా చెవులకు వినబడి నాకు ఓదార్పునిస్తునే ఉంటాయి. రేడియోలోనో, సిస్టంలోనో ఏ స్నేహగీతమో వినబడినప్పుడల్లా నీ జ్ఞాపకం నన్ను తడుముతూనే ఉంటుంది. తను నాకు తోడుగా నిలబడ్డ ప్రతిసారీ... 'don't worry yaar..something best is in store for you' అన్న నీ మాటలు వినబడి కళ్ళు చెమ్మగిల్లుతాయి. చీర కట్టుకున్నప్పుడల్లా.. మొదటిసారి నువ్వు,నేను చీరలు కట్టుకుని కాలేజీలో అడుగుపెట్టి ఆపసోపాలు పడిన రోజు గుర్తుకొచ్చి నవ్వుకుంటాను. ఇప్పుడు గుల్జార్ పాటలు వింటూ మైమరిచే నేను.. అప్పట్లో గుల్జార్ గొప్పని నువ్వూ, జావేద్ అఖ్తర్ గొప్పని నేను చేసుకున్న వాదనలు తల్చుకుని నవ్వుకుంటాను :) వర్షం వచ్చినప్పుడు... నువ్వు, నేనూ ఒకే గొడుగులో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన మధురక్షణాలు తలుచుకుంటాను. "నిన్ను మర్చిపోయిన స్నేహితురాలిని అంతగా తలుచుకోవాలా..." అని తనన్నప్పుడల్లా... నువ్వు నాకెంత ప్రియమైనదావివో తనకు చెప్పలేక సతమతమౌతాను...



శలవులకు నువ్వు వచ్చినప్పుడు నీకిష్టమని జిలేబీ చేసి; అప్పటికి నేనింకా సంపాదించట్లేదని అమ్మను రిక్షాకు డబ్బులడగటానికి నామోషీ వేసి, మీ ఇంటికి నేను నడుచుకుంటూ వచ్చివెళ్ళినప్పుడు నీ కళ్లలో కనబడ్డ ఆనందం, గర్వం.. చెమ్మగిల్లిన నీ కళ్ళు.. నాకింకా జ్ఞాపకమే. మన స్నేహానికి శ్రీకారం చుట్టిన ఎన్.సి.సీ కేంప్ నుండి నువ్వు నాకు రాసిన మొదటి ఉత్తరం, ఆ తర్వాత కాలేజీలో కూడా క్లాసు జరుగుతుండగా మనం రోజూ రాసుకున్న కాగితపు కబుర్లు, ఫోన్ లో గంటల కొద్దీ పంచుకున్న ఊసులు, ఇచ్చిపుచ్చుకున్న గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మార్చుకున్న అలవాట్లు గుర్తున్నాయా? నువ్వు ఎన్.సి.సీ కేంప్ లకు, డిబెట్లకు వెళ్ళినప్పుడు మిస్సయిన నోట్స్ లన్నీ నేను రాసిపెడుతుంటే క్లాసులో అంతా ఎంత కుళ్ళుకునేవారో.. నీకొచ్చిన ఫస్ట్ ప్రైజ్ లు,బహుమతులు చూసి నేనంత సంతోషపడేదాన్నో! మన సాన్నిహిత్యాన్ని చూసి కాలేజీలో ఉన్న నీ ఫ్యాన్స్ ఎంత అసూయపడేవారో గుర్తుందా? ఎవరితోనూ పంచుకోని సంగతులు, స్వవిషయాలూ నువ్వు నాతో చెప్పుకున్నప్పుడు నేనంటే ఎంత నమ్మకమో అని సంతృప్తిగా ఉండేది. నీతో కలిసి సినిమాలకు వెళ్లటం, మీ ఇంటికి రావటం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది నాకు. నీలాంటి టాపర్, బ్రిలియంట్ స్టూడెంట్ నా క్లోజ్ ఫ్రెండ్ కదా అని నేను గర్వంగా అంటుంటే, నువ్వేమో నీలాంటి నిజాయితీగల నమ్మకమైన స్నేహితురాలు దొరకటం నా అదృష్టం అనేదానివి..! యూనివర్సిటీ హాస్టల్లో చేరిన కొత్తల్లో "ఇక్కడందరూ అవసరాల కోసమే స్నేహం చేస్తారు. నిజాయితీగా ఏదీ ఆశించకుండా స్నేహం చేసేవారు ఒక్కరూ లేరు... యు ఆర్ మై గ్రేటేస్ట్ ఫ్రెండ్.. మై డియర్.. ఐ మిస్ యూ ఎ లాట్..." అని నువ్వు రాసిన వాక్యాలు నేను మర్చుపోలేదింకా.. ఆ ఉత్తరంతో నువ్వు పంపిన నీ బ్లాక్&వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా అడ్రస్ బుక్ లో ఇంకా అలానే ఉంది...


సరే గానీ, అసలు ఇప్పుడెందుకు ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయని అడుగుతావా?  అలా అడిగితే ఏం చెప్పను? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన స్నేహితురాలిని గుర్తుకుతెచ్చుకోవటానికి కారణాలు ఉంటాయా? తెలిసీ తెలియని వయసులో మనం పంచుకున్న మధురక్షణాలు, చెప్పుకున్న ఊసులు, చేసుకున్న వాగ్దానాలు, కలిసి పొందిన ఆనందాలు నా మనసులో ఇంకా సజీవమేననీ.. అవి మన మధ్య పెరిగిన దూరాన్ని నాకు కనబడనియ్యవని ఎవరికైనా ఎలా చెప్పను? ఇంత పిచ్చేమిటే నీకూ అని నవ్వుతారు కదా! ఒక్కసారి నీకు ఫోన్ చేసి ఎలా ఉన్నావే? అని అడగాలని, నిన్ను చూడాలనీ ఉందని నీకు ఎలా చెప్పను?


ఇంతసేపూ కూర్చుని రాసిన ఈ ఉత్తరం నీకు పోస్ట్ చేసాకా, నీ జవాబు రాకపోతే?? అందుకే ఇన్నేళ్ళుగా నీకు రాసి కూడా పోస్ట్ చెయ్యని ఉత్తరాల్లాగ, ఈ ఉత్తరాన్ని కూడా నీకు పోస్ట్ చెయ్యకుండానే దాచేస్తున్నా...



Wednesday, July 17, 2013

రెండు కొత్త సినిమాలు



విడిగా రాయటం కుదరట్లేదని ఈమధ్యన చూసిన రెండు సినిమాల గురించి ఒకే టపాలో రాసేస్తున్నా..

1. Lootera - a beautiful painting !

నిజంగా ఒక అందమైన చిత్రం ఇది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పైంటింగ్ లాగ ఉంది. ఫోటోగ్రఫీ అద్భుతం. 1950s ప్రాంతానికి సంబంధించిన ఒక బెంగాలి జమిందారు, అతని కూమార్తె తాలుకూ కథ "లుటేరా". ఆ కథకు తోడుగా, ప్రఖ్యాత ఆంగ్ల కథకుడు ఓ.హెన్రీ కథానిక "The Last Leaf" కధను ఈ సినిమా రెండవ భాగంలో వాడుకున్నారు. 


ఈనాటి ఫాస్ట్ ఫార్వార్డ్ కాలంలో ఇలాంటి స్లో సినిమాను తీసినందుకు దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. విక్రమాదిత్య మోత్వానికి తన రెండవ సినిమా కూడా అవార్డుల వర్షం కురిపించేస్తుంది అనిపించింది. అసలు చిత్రం షూటింగ్ కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయిట. షూటింగ్ కాన్సిల్ అయి, బోల్డు డబ్బు వృధాపోయిందిట. అయినా మళ్ళీ మంచు ప్రాంతపు లొకేషన్ సెట్టింగ్స్ వేసి మరీ పూర్తిచేసారుట సినిమాను. 


కథాంశం పాత తరానికి చెందినది కాబట్టి నాయికా నాయకుల వస్త్రధారణ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా వాడారు. నాయిక "పాఖీ" పాత్రను 'సోనాక్షి సిన్హా' గుర్తుండిపోయేలా, సమర్థవంతంగా పోషించింది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనచ్చు. అసలీ కాలంలో కనబడుతున్న తాటాకుబొమ్మల్లాంటి వీరోవిన్నుల్ని చూసి చూసి కళ్ళు కూడా సన్నబడిపోయాయేమో, తెరపై నిండుగా, బొద్దుగా, ముద్దుగా, సిన్మా మొత్తం చీరకట్టులో కనబడ్డ ముద్దుగుమ్మ నిజంగా మనసుని దోచేసింది. ఆమె ముక్కు మాత్రం కాస్త చెక్కేసినట్లు ఉంది గానీ పిల్ల అందంగానే ఉంది. నాయకుడు పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ ఉన్నది కాబట్టి 'రన్వీర్ సింగ్' మొహం సరిగ్గా సరిపోయింది అతని పాత్రకి. 


పరమ స్లో టేకింగ్! కొన్ని సీన్స్ లో నాకే బోర్ కొట్టింది ఇంకా కెమేరా కదపడేంటి? ఏం చెప్తాడు ఇంకా? అని. (ముఖ్యంగా కొలను దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సీన్ లో.) కొత్త సినిమాల్లోని హడావుడి డైలాగులతో, షాట్స్ తో, ఫైటింగులతో, సీన్ లో అంతమంది ఎందుకున్నారో కూడా తెలియని గుంపు బంధుత్వాలతో, లేనిపోని ఆర్భాటాలతో విసిగిపోయి ఉన్నామేమో చిత్రం లోని స్లో టేకింగ్ ని, అతితక్కువ పాత్రల్ని కూడా ఎంజాయ్ చేసాము మేము. స్టేజ్ ఫిఫ్టీస్ లోది కదా అందుకని టెకింగ్ కూడా అప్పటి సినిమాల మాదిరిగా తీసారేమో అనుకున్నా. 


సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది', పాటల రచయిత 'అమితాబ్ భట్టాచార్య' ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట గురించి ఈ టపాలో చూడవచ్చు: http://samgeetapriyaa.blogspot.in/2013/07/sawaar-loon.html


ఈ 'మన్నర్జియా' పాట కూడా బాగుంది..

అసలు ట్రాజడీల జోలికి వెళ్ళని నేను ఒక రొమాంటిక్ ట్రాజెడిని మొదటిసారి ఎంజాయ్ చేసాను. బహుశా హీరో చెడ్డవాడు కాదు, ఆమెను మోసం చెయ్యలేదు నిజంగానే ఆమెను ప్రేమించాడు అన్న సాటిస్ఫాక్షన్ వల్లనేమో! ఇంత మంచి సినిమాను నాకు చెప్పకుండానే టికెట్లు బుక్ చేసేసి చూపించినందుకు 'తుమ్ పర్ లగాయీ మేరీ సారీ షికాయెతే మాఫ్' అనేసా శ్రీవారితో :-) 

ఈ సినిమా ట్రైలర్:


2. సాహసం - విఠలాచార్య రంగుల సినిమా 



ఈమధ్యన చూసిన రెండవ సినిమా గోపీచంద్ నటించిన "సాహసం". ఈ సినిమా కోసం నేనైతే ఎదురుచూసాననే చెప్పాలి. చిన్నప్పుడు "ట్రెజర్ ఐలాండ్" చదివిన రోజుల్నుండీ నాకు ఎడ్వంచర్స్ అంటే మహా ఇష్టం. హీరో గోపీచంద్ + ఇలాంటి థీం అనగానే బాగుంటుందేమో అని ఆశ. పైగా ఈ దర్శకుడు గతంలో తీసిన సినిమాలు కూడా నా ఆశను నిలబెట్టి ఉంచాయి. నేను ఇలా ఎక్కువగా ఆశ పడిపోవటం వల్ల కాస్త నిరుత్సాహపడ్డాను కానీ మొత్తమ్మీద సినిమా బాగుంది. 


మన 'జానపద బ్రహ్మ' విఠలాచార్య సినిమాలు చూసినప్పుడల్లా.. అసలు ఈయనకు ఇప్పటి టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందుబాటులో ఉండి ఉంటే స్పీల్బర్గ్ ను మించిన అద్భుతాలు సృష్టించేవాడు కదా అనుకుంటూ ఉంటాను. ఇంకా, ఇప్పుడెవరూ ఇలాంటి సినిమాలు తియ్యరేమని దిగులుపడుతుండేదాన్ని. ఇన్నాళ్లకి ఆ సరదా తీరింది. ఈ సినిమా రెండవ భాగంలో గుడి లోపల సీన్లు చాలా బాగా వచ్చాయి. మళ్ళీ విఠలాచర్య సినిమా చూసినంత ఆనందం కలిగింది. ఆ తలుపులు, పాత నిర్మాణాలూ, సెట్టింగ్స్ అంతా కూడా అద్భుతంగా వచ్చాయి. 


'శ్రీ' చాలా రోజులకు సంగీతాన్ని అందించారు బాగుంటాయి పాటలు అనుకున్నా కానీ పాటలు పెద్ద గొప్పగా లేవు. అసలు ఆ పాటలు కూడా ఏదో పేట్టాలి కాబట్టి పెట్టినట్లు ఉన్నాయి. అవి లేకపోయినా బాగుండేది సినిమా. అయితే 'నేపథ్యసంగీతం' మాత్రం చాలా బాగా చేసారు. సన్నివేశాలకు ప్రాణం పోసేది నేపథ్యసంగీతమే మరి! 


ఈ సినిమాలో వీరోవిన్ను ని మొదటిసారి కాస్త భరించగలిగాననిపించింది. వెకిలి కామిడీ ట్రాక్ లేకపోవటం హాయి నిచ్చింది. పెద్ద సెక్యూరిటి ఆఫీసర్ గా అలీని పెట్టడం బాగుంది కానీ అంత పెద్ద ఆఫీసర్ అని చెప్తూ అలా పిరికివాడిగా చూపించటం నచ్చలేదు నాకు. 


సినిమా అయ్యాకా ఒక దిగులు మొదలైంది.. ఇది బాగుంది కదా అని ఇలాంటివే మరో పాతిక సినిమాలు వచ్చేస్తాయేమో అని !!


'SAWAAR LOON'





ఇటీవల విడుదలైన "లుటేరా" సినిమాలో 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. గాయని మోనాలి ఠాకుర్ కూడా బాగా పాడింది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, పాటల రచయిత అమితాబ్ భట్టాచార్య ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. క్రింద లింక్ లో ఆ పాట చూడచ్చు: 

 

 SAWAAR LOON పాట విన్నప్పుడల్లా ఏదో పాత పాట అనిపించేది. ఈ  పాట పల్లవి + ఇంటర్ల్యూడ్స్ చివర్న వచ్చే 'టింగ్..టి..టింగ్..టి..టింగ్' అనే బెల్స్ దేవనంద్ పాట "మై జిందగి కా సాథ్ నిభాతా చలా గయా" పాటలో ఉంటాయి..అలాంటివి. ఆలోచించగా.. చించగా.. చివరికి అసలు మూలం ఏమిటో తట్టింది.. ఈపాట "పరఖ్" సినిమాలోని "మిలా హై కిసీ కా ఝుంకా" పాటని గుర్తు చేసింది..కాపీ అనను కానీ inspiration అయి ఉండచ్చు.  మీకూ అనిపించిందేమో చెప్పండి... 





Monday, July 15, 2013

ఇద్దరికి నివాళి..




గతవారంలో మరణించిన ఇద్దరు ప్రముఖులకు నివాళి ఈ టపా. 

మొదటివారు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ గొప్ప 'విలన్' పాత్రధారుల్లో ఒకరు "ప్రాణ్". ఏ విలన్ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి, అతి భయంకరమైన కౄరుడిగా, నీచమైన జీవిగా, అసహ్యం కలిగేలా నటించగలగడం అతని టాలెంట్. స్టైలిష్ గా ఒక సిగరెట్ కాల్చినా, కళ్ళల్లోనే క్రౌర్యాన్ని చూపించినా, విషపు నవ్వు నవ్వినా ప్రాణ్ లాగ ఇంకెవరూ నటించలేరనిపిస్తుంది. అసలు మంచివాడిలా, అతిమంచివాడిలా, దేశోధ్దారకుడిలా నటించటం కన్నా ఇలా చెడ్డవాడిలా, అందరూ అసహ్యించుకునేలా నటించగలగటమే నిజమైన ప్రతిభ అని నా ఉద్దేశం. అసలలాంటి నెగెటివ్ రోల్స్ చేసి చేసి antagonist పాత్రధారుల్లో ఉండే చెడంతా(అంటే వాళ్ల సహజమైన nature లో ఉండే చెడంతా) బయటకు వెళ్పోయి వాళ్ళు ప్యూరిఫైడ్ అయిపోతారని చదివిన గుర్తు. అలా అయినా కాకపోయినా వ్యక్తిగా ప్రాణ్ చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను. 2002 లో జీటీవిలో "Jeena Isi Ka Naam Hai " అని ఫారూఖ్ షేక్ హోస్ట్ చేసిన ఒక షో వచ్చేది. అందులో ఓసారి ప్రాణ్ గురించి కూడా షో చేసారు. ఆ షో ద్వారానే అనుకుంటా నాకు ప్రాణ్ గురించి ఎక్కువగా తెలిసింది. ఇలాంటి షోలు, ఇంటర్వ్యూస్ చెయ్యకపోతే ఎప్పటికీ విలాన్ పాత్రధారులంతా నిజంగా దుర్మార్గులనో, నీచమైనవాళ్లనో అభిప్రాయం మన మనసుల్లో ఉండిపోతుంది.  

ప్రాణ్ నటించిన సినిమాల్లోని కొన్ని గుర్తుండిపోయే పాత్రల్ని గురించిన ఆర్టికల్ ఒకటి రీడిఫ్ లో వచ్చింది.. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఆర్టికల్ క్రింద లింక్ లో చదవచ్చు: 
http://www.rediff.com/movies/slide-show/slide-show-1-the-most-memorable-roles-of-pran/20130713.htm 

ఆయనకు చాలా ఆలస్యంగా అందించారని సినీపరిశ్రమలో కొందరు ఆవేదన వ్యక్తపరిచారు కానీ బ్రతికుండగా ఇచ్చారు కదా అని నేనైతే ఆనందించాను. మే నెలలో ప్రాణ్ ఇంట్లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించినప్పటి వీడియో క్లిప్పింగ్:

 

 ****    ****    ****

 నా రెండవ నివాళి.. "బోస్ కార్పొరేషన్" ఫౌండర్ అమర్ బోస్  గారికి. ఒక భారతీయ పేరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత అయనది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనుకునేవారు, ఏదన్నా ప్రత్యేకంగా సాధించాలి అనుకునేవారు ఇలాంటి ప్రఖ్యాత వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందాలి అనుకుంటుంటాను నేను.

ఆయన మరణవార్త, ఆయన వ్యక్తిత్వానికి గురించిన కొన్ని వివరాల తాలుకు ఆర్టికల్ క్రింద లింక్ లో:
http://www.rediff.com/money/report/tech-acoustics-pioneer-and-founder-of-bose-corporation-dies-at-83/20130713.htm 

 బోస్ గారి గురించిన చిన్న వీడియో క్లిప్పింగ్ ఇక్కడ: 





Thursday, July 4, 2013

“జల్తే హై జిస్కే లియే”


సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.


ఈ సినిమాలో  “జల్తే హై జిస్కే లియే” అనే ‘ఫోన్ పాట’ నాకు చాలా ఇష్టం. అధీర్ ప్రేమను అంగీకరించి ఇంటికి వచ్చిన వెంఠనే తల్లి తనకు ఒక హరిజనుడితో వివాహాన్ని కుదిర్చిందని తెలిసి సుజాత బాధపడే సమయంలో అధీర్ ఈ ప్రేమగీతాన్ని ఆమెకు ఫోన్ లో వినిపిస్తాడు. కన్నీరు నిండిన కళ్ళతో, బాధతో అధీర్ ఉత్సాహంగా పాడే ఈ పాటను మౌనంగా వింటుంది సుజాత. అప్పటి సినిమాల్లో ‘ఫోన్ లో పాట’ ఒక ప్రయోగమే అయ్యుంటుంది.





పాట వాక్యార్థం వాకిలి పత్రికలో చూడండి:
http://vaakili.com/patrika/?p=3295


Monday, July 1, 2013

అవసరమా?




సందర్భానుసారం రంగులు మారే నైజాలే అందరివీ..
సంజాయిషీలు అవసరమా?

అడగటానికి చాలానే ఉంటాయి ప్రశ్నలన్నీ..
అన్నింటికీ జవాబులు అవసరమా?

జీవనసమరంలో విసిగివేసారిన ప్రాణాలే అన్నీ..
కారణాన్వేషణ అవసరమా?

విరిగిపోయినా, అతుకులతో నడిచిపోయేవే మనసులన్నీ..
అతకడం అవసరమా?

తెంచుకుంటే తెగిపోయేంత అల్పంకావీ బంధాలన్నీ.. 
ముడేసుకోవటం అవసరమా?

ఎప్పటికైనా అపార్థాలను మిగిల్చేవే మాటలన్నీ.. 
మాటలు అవసరమా?



Sunday, June 30, 2013

లోపాలున్నా, మనసుని తాకిన 'Raanjhanaa'





సినీభాషలో ఏ లోపాలు లేని వాడే హీరో. ఈ రోజుల్లోని సినిమా కథల్లో లోపాలున్న హీరోలయితే అస్సలు కనబడరు. అందరూ హీమేన్లే. మరి, తనలో లోపాలున్నా సినిమా చూసిన చాలాసేపటి వరకూ.. ఇంకా అతని గురించే ఆలోచించేలా చెయ్యగలిగాడు ఈ "Raanjhanaa". ఈ చిత్రం విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలు గడించిందని వినికిడి.


బనారస్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కుందన్. ఎనిమిదేళ్ల వయసులో నమాజ్ చేస్తున్న "జోయా" ను మొదటిసారి చూసినప్పటి నుండీ ఆమె అంటే పిచ్చి ప్రేమ కలుగుతుంది అతనికి. ఇలా స్కూలు పిల్లల మధ్యన ప్రేమ చూపించే పిల్లలను పాడుచేస్తున్నారు అనుకునే లోపూ స్కూలు వయసులోనే ఆమెను ఒప్పించటానికి బ్లేడ్ తో తన చెయ్యి కోసేసుకుంటాడు కుందన్. స్కూల్ డ్రస్సులో ఉన్న జోయా అతని ప్రేమను అంగీకరిస్తుంది కానీ నేను ఇంకా బాగా తిట్టుకున్నా. ఇదేం సినిమా బాబోయ్.. ఇలాంటివి సినిమాల్లో చూపించి అగ్నికి అజ్యం పోస్తున్నారే.. అని! 


తర్వాత ఇంట్లోవాళ్ళు జోయాను వేరే ఊరు పంపించి చదివిస్తారు. ఓ ఎనిమిదేళ్ల తరువాత జోయా మళ్ళీ బనారస్ వస్తుంది. అప్పటికి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. ఆమె లేకపోయినా జోయా తలపుల్లోనే గడుపుతూ, ఆమె ఇంటి చూట్టూ తిరుగుతూ ఇంట్లోవాళ్లని మచ్చిక చేసుకుంటాడు కుందన్. జోయా కోసమే ఎదురుచూసే అతనికి ఆమె తనని గుర్తుపట్టకపోవటం పెద్ద షాక్. మెల్లగా ఆమెతో మళ్ళీ స్నేహం కలిపి మనసులో మాట చెప్తాడు మళ్ళీ. చిన్నతనాన్ని మర్చిపొమ్మనీ, తాను యూనివర్సిటీలో వేరే మనిషిని ప్రేమిస్తున్నాననీ, అతను లేకుండా బ్రతకలేననీ చెప్తుండి జోయా. ఇది ఇంకా పెద్ద షాక్ కుందన్ కి.


వేదనతో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకుని, అసలు జోయానింక కలవనని చెప్పినా, నెమ్మదిగా తేరుకుని, జోయా తండ్రిని ఆమె ప్రేమికుడితో పెళ్ళీకి ఒప్పిస్తాడు కుందన్. తనని చిన్నప్పటి నుండీ ఇష్టపడే బిందియాను పెళ్ళాడతానని ఇంట్లో ఒప్పుకుంటాడు. సరిగ్గా పెళ్ళి జరిగే సమయానికి జోయా ప్రేమికుడు ముస్లిం కాదని, హిందువే నని తెలిసి, పట్టరానికోపంతో జోయా ఇంటికి వెళ్ళి, న్యూస్పేపర్లోని ఋజువు చూపించి ఆ పెళ్ళి ఆగిపోవటానికి కారకుడౌతాడు. ఈలోపూ జోయా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందని, ఆమె బంధువులు కొట్టిన దెబ్బలకి జస్జీత్(ఆమె ప్రేమికుడు) కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెల్సుకుంటాడు. జస్జీత్ ను వెతికి హాస్పటల్లో చేరుస్తాడు. ఈ హడావుడిలో తన పెళ్ళి సంగతి మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికీ కోపంతో ఉన్న తండ్రి కుందన్ ను గెంటివేస్తాడు. 


జోయా దగ్గరకు వెళ్ళి ఆమె తనను అసహ్యించుకుంటున్నా, ఆగిపోయిన పెళ్ళి జరిపించాలనే ఉద్దేశంతో జస్జీత్ ఇంటికి తీసుకువెళ్తాడు ఆమెను. కానీ అక్కడ జస్జీత్ మరణం గురించి తెలుసుకుని అపరాధభావంతో కుమిలిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరకు గంగా తీరంలో కూచుని ఉండగా ఒకాయన ఓ మాట చెప్తాడు కుందన్ కి.. "ప్రపంచంలో ఏ పుణ్యస్థలానికీ హత్యానేరాన్ని క్షమింపగలిగే శక్తి లేదు. ఇక్కడ గంగ ఒడ్డున ముక్తి కోసం కూచోవటం కాదు..వెళ్ళు.. వెళ్ళి ఏది చెయ్యాలో అది చెయ్యి." అని! అప్పుడు మళ్ళీ జోయాను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె తనను క్షమించాలనే ఏకైన లక్ష్యంతో ఆమె అసహ్యాన్ని భరిస్తూ అక్కడే ఓ టీ కొట్టులో పనిచేస్తుంటాడు. విద్యార్థి నాయకుడిగా జస్జీత్ స్థాపించిన రాజకీయ పార్టీ తరఫున జోయా పనిచేస్తూంటే, తానూ ఆ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెడతాడు. 


ఇక్కడ్నుంచీ ప్రేమకథ హటాత్తుగా రాజకీయ కథనంగా మారిపోతుంది. కొన్ని సంఘటనల కారణంగా పార్టిలో కుందన్ ప్రముఖమైన వ్యక్తిగా మారిపోతాడు. జోయా ఇది సహించలేకపోతుంది. జస్జీత్ మరణానికి కారకుడిని నాయకుడిని చేసేస్తున్నారా? అని మిత్రులతోనూ, జస్జీత్ స్థానంలో కూచుని నన్ను దక్కించుకుందామనుకుంటున్నావా? అని కుందన్ తోనూ దెబ్బలాడుతుంది. ఆ ఆవేశంలోనే విద్యార్థుల పార్టీని తమవైపు తిప్పుకోవాలనుకుంటున్న సి.ఎం. మాటలను విని కుందన్ ప్రాణాలకి హాని తలపెడుతుంది.


కుందన్ ఏమౌతాడు? జోయా అతడిని క్షమిస్తుందా? అతడి ప్రేమలో స్వచ్ఛతను అర్థం చేసుకోగలుగుతుందా? ఈ కథ ఎలా ముగుస్తుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే "Raanjhanaa" చూడాలి మరి. ఈ కథకు ఈ ముగింపు సబబేనా? అన్న ప్రశ్న కలిగినా నచ్చకపోవటం మాత్రం జరగలేదు. 

హిందీ జగ్రత్తగా నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ధనుష్, 'కుందన్' పాత్రకు సరైన న్యాయం చేసాడు. impressive work! ఇదివరకూ ఇతని సినిమాలేం చూడలేదు నేను. ఇక జోయా గా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేసింది సోనమ్ కపూర్. చిలిపితనం, మంకుపట్టు, అహంకారం, వయసుతో పెరిగే పరిణితి.. అన్నిరకాల భావాలనూ జోయాగా చక్కగా చూపెట్టింది ఈ అమ్మాయి. చిత్రం చివరిభాగంలో సోనమ్ నటన ఆకట్టుకుంటుంది. చిన్న పాత్రే అయినా జస్జీత్ గా అభయ్ డియోల్ అలరిస్తాడు.


కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. రెహ్మాన్ పాటల కన్నా సీన్స్ కి సరిపడా ఇమోషన్స్ ప్రేక్షకుల్లో కూడా కలిగేలా చేసిన నేపథ్యసంగీతం చాలా బాగుంది. మొత్తమ్మీద తీసిపారేయాల్సిన సినిమా మాత్రం కాదు. కథలో, పాత్రల్లో ఏ లోపాలున్నా, మనసుని తాకే ఒక విభిన్నమైన ప్రేమకథగా మాత్రం గుర్తుండిపోతుంది. అప్పుడెప్పుడో చూసిన "Gangster" ఇలానే చాలా కాలం మనసుని కదిలించివేసింది!!

movie trailer:

 

Friday, June 28, 2013

వరంగల్ ప్రయాణం - భద్రకాళి ఆలయం


హనుమకొండలో ఉన్న వెయ్యి స్థంభాల గుడి నుండి వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి ఆటోలో పావుగంటలో చేరిపోయాం. సూర్యుడు అస్తమించే సమయం. పొద్దున్నుండీ విసిగించిన ఎండ తగ్గుమొహం పట్టింది. కొండల వల్లనేమో ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంది వేసవిలాగ. వెయ్యి స్థంభాల గుడి శిధిలాలను చూసి భారమైన మనసుతో అన్యమనస్కంగా ఉన్నాను. గుడి రెండో వైపు గేటు వద్ద మేమెక్కిన ఆటో ఆగింది. ఆ ఎంట్రన్స్ లో కుడివైపు గోడమీద నవదుర్గలు, చివర్లో గుడిలోని భద్రకాళి అమ్మవారి చిత్రాలు చాలా అందంగా పెయింట్ చేసి ఉన్నాయి. 







ఈ వైపున ముందర శిరిడీబాబాగారి గుడి ఉంది. లోనికివెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. విశాలంగా బాగా కట్టారు గుడి. బయటకు వచ్చి అమ్మవారి గుడివైపు వెళ్తుంటే ఎడమ పక్కన పూలకొట్ల వెనకాల ఏదో నది కనబడింది. ఏమిటని అడిగితే అది "భద్రకాళి చెరువు" అని చెప్పారు. నిశ్చలమైన నీళ్ళు, పైన గుంపులు గుంపులుగా తెల్లని మబ్బులు, ఇంటికెళ్పోతున్న సూర్యుడు, దూరంగా కొండలు.. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చెప్పలేను! గబగబా నాలుగు ఫోటోలు తీసేసాను.



కాస్త ముందుకి వెళ్ళగానే దూరంగా నదిలో మనుషులు కనబడ్డారు. బోటింగేమో అనుకున్నా. కానీ కాదు.. వాళ్లంతా పేద పేద్ద ధర్మోకోల్ ముక్కల మీద నిశ్శబ్దంగా కూచుని చేపలు పడుతున్న జాలరివాళ్ళు. అప్పుడప్పుడు ఓయ్.. అన్న పిలుపులూ, చిన్నచిన్న మాటలూ వినబడుతున్నాయి. అవి కూడా వినటానికి చాలా బాగున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశమేమో చెప్పలేనంత ప్రశాంతంగా మారిపోయింది మనసు.

దూరంగా అక్కడక్కడ కనిపించేది ధర్మోకోల్ మీద మనుషులు


ఇక ఈ గుడి కథ చెప్తాను. ఓసారి ఏదో పుస్తకంలో చదివాను గణేష్ రావు గారనే ఆయన కర్నాటక నుండి ఇక్కడకు వచ్చి గుడి పక్కనే చిన్న గదిలో ఉండిపోయి, శిధిలావస్థలో ఉన్న ఈ గుడిని బాగు చేసి, మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసారని. రెండేళ్ల క్రితమెప్పుడో ఆయన కాలంచేసేదాకా ఆయనే గుడి ధర్మకర్త అని. ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన ఎంతటి గొప్ప భక్తులో అదంతా రాసుకొచ్చారు. (ఎక్కడ చదివానో గుర్తురాట్లే.) so, అప్పటినుండీ ఈ గుడి చూడాలని. అసలు ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉందిట. కాకతీయుల కాలం కంటే ముందే చాళుక్యుల పాలనలో నిర్మాణం జరిగిందిట. కాకతీయుల కాలంలో మళ్ళీ వైభవంగా పూజలందుకొందిట "భద్రేశ్వరి". వాళ్ళే ఇప్పుడున్న చెరువు కూడా తవ్వించారుట. అయితే కాకతియ సామ్రాజ్య పతనం తర్వాత మళ్ళీ ప్రాభవాన్ని కోల్పోయిందిట గుడి. మళ్ళీ 1950లో గణేష్ రావు గారు పునరుధ్ధరించారు.అప్పటిదాకా అమ్మవారి విగ్రహం భయానకంగా బయటకు వేళ్లాడే నాలుకతో ఉండేదట. అప్పుడు ఆ నాలుకపై బీజాక్షరాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారుట. గుడిలో చండీ యంత్రం ప్రతిష్ఠించి, ప్రతి ఏడూ శరన్నవరాత్రులు అవి జరుపటం మొదలుపెట్టారుట. ఈ అభివృధ్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖవారు కూడా తగినంత సహాయం అందించారుట.


అసలు కాకతీయులు శివారాధకులు. అయినా అమ్మవారిని కూడా వివిధరూపాల్లో పూజించేవారుట. ఈ సంగతి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని గురించి తెలిపే "ప్రతాపరుద్ర చరిత్రము", "సిధ్ధేస్వర చ్రిత్రము", "ప్రతాపరుద్రీయమ్" అనే గ్రంధాలలో తెలుపబడిందిట. కాకతీయ శిల్పాలలో చాలాచోట్ల దుర్గ, మహిషాసురమర్దిని విగ్రహాలు కనబడతాయి. రామప్ప గుడి వద్ద ఎక్స్కవేషన్స్ లో దొరికినదని పెట్టిన ఒక మహిషాసురమర్దిని విగ్రహం చూసాం. ఇదే అది..


ఈ భద్రకాళి అమ్మవారి మహిమ తాలుకూ కథ ఒకటి విన్నాం. ప్రతాపరుద్రుని కాలంలో ఒక విద్వాంసుడు కొలువుకి వచ్చి తనని వాదనలో ఓడించమని అడిగాడుట. చివర్లో అతను "ఇవాళ ఏకాదశి,రేపు అమావస్య. కాదంటారా?" అన్నాడట. ఔనంటే ఆ పండితుడి మాట నెగ్గుతుంది. కాదని అంటే ఓడిపోతారు. అప్పుడు ఏదైతే అయ్యిందని రేపు "పౌర్ణమి" అన్నారుట. ఆ రాత్రికి ప్రతాపరుద్రుడి కొలువులోని విద్వాంసుడు భద్రకాళి ఆలయానికి వెళ్ళి దేవిని స్తుతించాడుట. తల్లి ప్రసన్నమై అతని మాటలు నిజం చేస్తానని మాట ఇచ్చిందిట. మర్నాడు రాత్రి పౌర్ణమి లాగ వెలిగిన చంద్రుడ్ని చూసి ఆ వచ్చిన పండితుడు ఇది దైవశక్తి అని ఓటమి ఒప్పుకుని  వెళ్పోయాడుట. ఆ రోజుల్లో దైవభక్తి కూడా అంత స్వచ్ఛంగా, పవర్ఫుల్ గా ఉండేది మరి! అప్పట్లో ఈ గుడి వద్ద చాలామంది ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేవారుట కూడా. భద్రకాళి చెరువుకి పక్కగా ఒక కొండ ఉండేదిట. అక్కడ ఒక గణేషుడి విగ్రహం ఉండేదిట. కాలంతరంలో కొండతో పాటుగా అది కూడా అంతరించిపోయిందిట. గుడి ఎదురుగా చిన్న కొండ మీద ఉన్న శివపార్వతుల విగ్రహాలు కూడా ప్రాచీనమైనవే అంటారు. వాటి అందం పాడుచేస్తూ తెల్లరంగు వేసారు ఎందుకో..!



గుడిలో అమ్మవారి విగ్రహం తొమ్మిదడుగుల పొడుగు, తొమ్మిదడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా ఉంది. ఎక్కువ జనం లేనందువల్ల సావకాసమైన, ప్రశాంతమైన దర్శనభాగ్యం కలిగింది. గుడి ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం, శిష్యులతో ఉన్న విగ్రహాలు బాగున్నాయి.




మరి ఆ తర్వాత, పొద్దున్నుంచీ తిరిగినతిరుగుడికి అలసిసొలసి, పొద్దున్నుంచీ తిండిలేక కడుపులో ఏనుగులు పరిగెడుతుంటే ఊళ్ళో ఉన్న మా పిన్నీవాళ్ళింటికి వెళ్పోయాం. రాత్రి లక్కీగా ఏ.సి. బస్ దొరికింది. హాయిగా బజ్జుని ఇల్లు చేరేసరికీ అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది. ఇదింకా నయం అంతకు ముందు సాగర్ వెళ్ళినప్పుడైతే అర్ధరాత్రి రెండున్నర! బండి మీదైనా అంత రాత్రి వెళ్లాలంటే నాకేమో భయం!! ఆ కథేమిటో మళ్ళీ వారం చెప్తానేం.... Happy weekend :-)

(అంటే "నాగర్జునసాగర్" ట్రిప్ కబుర్లన్న మాట.)



Thursday, June 27, 2013

వరంగల్ ప్రయాణం - వెయ్యిస్థంభాల గుడి




రామప్ప గుడి తర్వాత నేను అమితంగా చూడాలని ఉత్సాహపడినది ఈ వెయ్యిస్థంభాల గుడిని. 'హనుమకొండ' వచ్చాకా బస్సు డ్రైవరు ఓ చోట బస్సు ఆపి "ఆ కనబడేదే వెయ్యిస్థంభాల గుడి దిగండి.." అన్నాడు. మళ్ళీ ఏ ఆటో ఎక్కాలో, ఎన్ని మైళ్ళు నడవాలో అని భయపడుతున్న నాకు ఎదురుగా గుడి కనబడేసరికీ సంతోషం కలిగింది. ఇలా రోడ్డు మీదకే ఉందే గుడి అని ఆశ్చర్యం కలిగింది. 


రామప్ప గుడిలా కాక ఇది పూర్తిగా నల్ల రాతిబండలతో చెక్కబడింది. కానీ నిర్మాణం, గోడలపై పువ్వులు, శిల్పాలూ అన్ని అచ్చం రామప్ప గుడిలో మాదిరిగానే ఉన్నాయి. అక్కడ రాసి ఉన్న బోర్డులను బట్టి రామప్ప గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గుడి కట్టి ఉంటారు. శిల్పులు కూడా వాళ్ళే అయి ఉంటారు. లేదా అది కట్టే సమయంలోనే ఇది కూడా మొదలెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ గుడి ఏకంగా డెభ్భైఏళ్ళు కట్టారని విన్నాను. వివరాలడగటానికి ఇక్కడ మాకు గైడ్ ఎవరూ దొరకలేదు కూడా. కానీ ఈ గుడి బాగా శిధిలమైపోయింది. రామప్ప గుడికి కాస్త బాగానే మరమత్తులు జరిగినట్లున్నాయి కానీ ఈ గుడి దుస్థితి(ఇలానే అనాలనిపించింది) చూస్తే చాలా విచారం కలిగింది :(

అత్యంత వైభవమైన చరిత్ర గల ఈ వెయ్యి స్థంభాల గుడి గురించి, కీర్తి ప్రతిష్టల గురించీ విని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను. నెట్లో బ్రౌజింగ్ చేసి ఫోటోలు అవీ చూసేస్తే ఉత్సాహం తగ్గిపోతుందని అలా కూడా చెయ్యలేదు. అందువల్ల వెలవెలబోతున్న గుడిని చూసి చాలా విచారపడ్డాను. ఈ గుడి ముఖ్యంగా శివుడు, సూర్యభగవానుడు, విష్ణువు ఈ ముగ్గురి ఆలయాలు కలిపిన త్రికూటాలయముట. నాలుగో వైపున రామప్ప గుడిలో ఉన్నలాంటి పెద్ద నందీశ్వరుడు అదే రూపంలో, అదే దిక్కులో ఉంటాడు. మొత్తం అలంకారం, మువ్వలు, గొలుసులూ అన్నీ సేమ్ సమ్ అన్నమాట :)





ఆకాశంలో చందమామ కనిపిస్తున్నాడా?


ఇది కూడా శిధిలంగానే ఉంది :(

త్రికూటాలయాల మధ్యలో రంగ మంటపం, పై కప్పులో ఉన్న శిల్పాలు, డిజైన్, చుట్టూరా ఉన్న నాలుగు స్థంభాలు, వాటిపై ఉన్న నగిషీ మొత్తం కూడా రామప్ప గుడిలో లాంటిదే. ఈ గుడి ఎక్కువ సార్లు ఓరుగల్లుని ఆక్రమించిన సుల్తానుల దాడికి గురైనదని విన్నాను. బహుశా రామప్ప గుడి బాగా లోపలికి ఉండటం వల్ల మరీ ఇంతగా దాడికి లోనవలేదేమో! కానీ ఎంత పగులగొట్టినా మిగతా గుళ్ళు గోపురాలు లాగ పూర్తిగా మాత్రం ధ్వంసం అవ్వలేదు ఇది. చాలా పకడ్బందీగా, ఎంతో శ్రమతో కట్టినట్లు తెలుస్తోంది చూస్తుంటే. 


గుడి ముందర ఇరువైపులా ఉండవలసిన గజాలలో ఒకటే ఉంది.అది కూడా శిధిలమైపోయి ఉంది. రెండో వైపు ఏదో త్రవ్వకాల్లో దొరికిన నందీశ్వరుణ్ణి పెట్టినట్లుగా నాకు తోచింది. అంత గొప్ప నిర్మాణం చేసినవారు ఒక వైపు గజాన్ని, మరో వైపు నందిని పెట్టరు గదా.





గుడి ఆవరణలో ఉన్న పేధ్ధ రావి చెట్టు చాలా బాగుంది. నాకెందుకో చెట్లన్నింటిలోకీ రావిచెట్టు ఇష్టం. 




గుడికి కనక్ట్ అవుతు నందీశ్వరుడి వెనకాల ఒక అద్భుతమైన నాట్య మంటపం ఉండేదట. లెఖ్ఖకు చెప్పే వెయ్యి స్థంభాలు ఆ మంటపంలోని నూరుకు పైగా ఉన్న స్థంభాలతో పూర్తి అవుతాయిట. కానీ అది బాగా శిధిమైపోయిందని అక్కడో గోడ కట్టేసి పునర్నిర్మాణం జరుపుతున్నారు. మొత్తం చూడడానికి అది ఎప్పటికి పూర్తి అవుతుందో! అసలు ఎప్పటికన్నా పూర్తి చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే కాకతీయుల భవన నిర్మాణం తాలూకూ టెక్నాలజీ చాలా గట్టిది, క్లిష్టమైనది. రామప్ప గుడిలో చూశాం కదా. అలాగనే ఇదీ ఉంది కాబట్టి ఇక్కడా సేమ్ టెక్నాలజీ వాడి ఉంటారు... తడి ఇసుక, దానిపై పీఠం మొదలైనవి. అలా చెయ్యగలరో లేదో.. అలాకాక మళ్ళీ మరోలా అంటే మనవాళ్ళు ఎలా కడతారో ఏమో!! నేనా గోడవారగా వెళ్ళి గోడ వెనుకకి చెయ్యి బయటకు పెట్టి ఓ రెండు ఫోటోలు తీసాను. "ఫోటోల సంగతి దేవుడెరుగు అంత ఎత్తు మీంచి కాలు జారితే..." అని ఇంటాయన కంగారుపెట్టకపోతే ఇంకొన్ని ఫోతోలు తీద్దును. ఇంటికొచ్చాకా ఆ ఫోటోలు చూస్తే ఆ నాట్య మంటపం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. ఇలా వచ్చాయి ఆ ఫోటోలు..

Place under reconstruction

place under reconstruction

ఇంకా గుడి చుట్టూరా అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి. 




 ఓ పక్కగా శిధిలాలు, ఇంకా తలుపులు వేసేసిన ఏవో శిధిలాలు ఉన్నాయి. గుహలో ఏమో అవి..



తీర్థప్రసాదలు తీసుకుని ఓ గట్టు మీద కాసేపు కూచుని, మేం అనుకున్న చివరి మజిలీ వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి బయల్దేరాం..

(రేపు 'భద్రకాళి ఆలయం' గురించి..)