సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 31, 2009

సింహావలోకనం...


"Doctor Zhivago" సినిమాలో ఒక సీన్లో Zhivago(Omar Sharif) రాత్రి పూట కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. అతను కాగితం మీద పెన్ తో రాస్తున్న చప్పుడు తప్ప మనకు ఇంకేమీ వినిపించనంత నిశ్శబ్దం..!! అలాంటి నిశ్శబ్దం లో ఏదన్నా రాయాలనే తపన ఇంకా ఇంకా ఎక్కువౌతూ ఉంటుంది. ఈ పౌర్ణమి పూటా ప్రస్తుతం నేను చేస్తున్నదీ అదే...కాకపోతే పెన్ చప్పుడు బదులు కీప్యాడ్ టకటకలు...!!

రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" (Bird's eye view) అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. నేను కూడా అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. బ్లాగుల గురించి విశ్లేషించే సాహసం నేను చేయదలుచుకోలేదు. ఈ సంవత్సరంలో నాకు నచ్చిన కొన్ని టపాల గురించి మాత్రం రాయాలని...నేను బ్లాగు తెరిచి ఏడు నెలలు...నాకు దొరికిన సమయంలో, నాకు తెలిసిన బ్లాగుల్లో, నేను చదివినవాటిల్లో కొన్నింటిని ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. ఇంతకన్న బాగున్న టపాలు నేను "మిస్" అయి ఉండవచ్చు...కానీ ముందు చెప్పినట్లు ఇవి "బెస్ట్" అని నేననను కానీ నేను చదివినవాటిల్లో నాకు నచ్చినవి అంతే.

నెలలవారీగా ఒకోటీ చెప్పుకు వస్తాను...

ముందుగా పాతవైనా 2008 డిసెంబర్ లో ప్రచురితమైన 3 టపాలను ప్రస్తావించలేకుండా ఉండలేకపోతున్నాను.
"నేను-లక్ష్మి" బ్లాగ్ లో 2008 decలో ప్రచురితమైన "
పిట్టకధ - కొత్త సంవత్సరం"
మనసుకు హత్తుకునే మాటలు, ఉన్నతమైన భావలు, ఆచరింపదగిన మంచి సూత్రాలూ, జీవిత సత్యాలూ ఈ బ్లాగర్ టపాల్లోని ప్రత్యేకతలు.

ఇక "పలకాబలపం" లో 2008 dec టపా "
బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?"
ఈ టపాలో బ్లాగర్లు ఎందుకు బ్లాగుతారో తనదైన శైలిలో చక్కగా వివరిస్తారు అరిపిరాల సత్యప్రసాద్ గారు.
కోతి కొమ్మచ్చి తెచ్చి చదివించి...అంటూ "పుస్తకం.net" లో రాసినా, "నవతరంగం"లో సినిమా కబుర్లు రాసినా చివరి వాక్యం దాకా మనతో చదివించేలా ఉంటాయి ఈ బ్లాగర్ టపాలు. ఈ బ్లాగ్ కు నేను రెగులర్ రీడర్ను కాకపోయినా "అన్నం ఒక్క మెతుకు చూస్తే చాలు.." అన్నట్లుంటాయి ఈయన టపాలు.


"
నా తెలుగు సినీ దర్శకులు"అంటూ dec 2008 లో ఉమా శంకర్ గారు రాసిన టపా నాకు భలే నచ్చేసింది. మురళిగారి బ్లాగ్ల పరిచయం తో నాకు పరిచయమైన ఈయన బ్లాగు నేను తరచూ చూసే బ్లాగుల్లో ఒకటి. ఈయన కొత్తగా మొదలుపెట్టిన బ్లాగ్లో అయినా తరచూ టపాలు రాసి మరిన్ని మంచి టపాలు అందిస్తే బాగుంటుందని ఆశ.

ఇక 2009 టపాల్లోకి వచ్చేస్తే భైరవభట్ల కామేశ్వరరావు గారి "తెలుగు పద్యం" బ్లాగ్లో may '09లో ప్రచురించబడిన "
జుగల్బందీ" గజల్స్ పట్ల, తెలుగు కవిత్వం పట్ల ఆయనకున్న మక్కువను తెలుపుతుంది. కృష్ణశాస్త్రి కవిత చదువుతూ జగ్జీత్ సింగ్ గజల్ వింటూ ఆయన పొందిన భావుకత్వానికి అక్షరరూపం ఈ టపా. ఇందులో ఆయన రాసిన జగ్జీత్ సింగ్ గజల్ లోని సాహిత్యం చిన్నప్పుడు ఒక పుస్తకంలో "కవిత" రూపంలో చదివి బాగుందని నేను రాసుకుని దాచుకున్నా. తరువాత టి.విలో ఒక లైవ్ కాన్సర్ట్ లో జగ్జీత్ సింగ్ పాడుతూండగా రికార్డ్ చెసుకోవటం జరిగింది. ఆ కవిత నాకు చాలా ఇష్టం.


నాకు ఇటివలే పరిచయమైన నిషిగంధ గారి "మానసవీణ"లో may '09లోని "
మనోనేత్రం" కవిత నన్నెంతో ఆకట్టుకుంది. చాలా లేటుగానైనా ఇంత మంచి కవిత్వాన్ని ఆస్వాదించే అవకాశం దొరికినందుకు సంబరపడుతూ ఉంటాను.

కూడలిలో అడుగుపెట్టిన మొదటి రోజు నాకు పరిచయమైన వ్యాఖ్యాతల్లో ఒకరు "సిరిసిరిమువ్వ"గారు. నా ప్రతి టపాకూ వ్యాఖ్య రాయకపోయినా ఈవిడ నా బ్లాగ్ రెగులర్ రీడర్ అని నాకు నమ్మకం. june '09లో తన బ్లాగ్లో రాసిన "
నా ఉపవాస దీక్ష" టపా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.

july '09 లో ప్రచురితమైన "నా స్పందన" బ్లాగర్ లలిత గారి "
కెవ్వ్...వ్వ్...వ్...కేక(గుండెని గుల్ల చేసే సెంటిమెంట్)" టపా గురించి నే చెప్పేకన్నా మీరు చదివి కెవ్వ్...కేక...అనాలంతే..!!


క్వాంటిటీ కన్నా క్వాలిటి ముఖ్యమని ఆవిడ 82 టపాలకు వచ్చిన 2670 వ్యాఖ్యలే తెలుపుతాయి. ఏ విషయన్నైనా సూటిగా, నిర్భయంగా రాయగల ధైర్యం ఉన్న బ్లాగర్ సుజాతగారు. ఇంకా పాడాలా? అని ప్రశ్నించినా, ఆటోగ్రాఫ్ల గురించి ప్రస్తావించి మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళినా, ఓటర్ల తీరుపై విచారం వ్యక్తం చేసినా....ఈవిడే రాయాల్సిందే అని మనకు అనిపిస్తుంది. july '09 లోని "
చందమామల్లాంటి బ్లాగులు" నాకు బాగా నచ్చిన టపా.


జ్యోతిగారు నడుపుతున్న బ్లాగులు, చేస్తున్న కార్యక్రమాలూ చూసి ఈవిడకు ఎన్ని చేతులున్నాయో, 24 గంటలు ఎలా సరిపోతాయి లాంటి ప్రశ్నలు రాక మానవు . ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన "జ్యోతి" బ్లాగ్లోని ఈ Sep ’09 వ్యాసం "
ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు... " నన్నెంతగానో ఆకట్టుకుంది.


ఇక "కొత్తపాళీ" గారి బ్లాగ్ గురించి నేను చెప్పేదేముంది...ఆ బ్లాగ్లో వ్యాఖ్య రాయాలంటే మాటలు వెతుక్కోవాలి, బోలెడు విషయ పరిజ్ఞానం కావాలి. "బ్లాగుల పరిధి ఇప్పుడున్న దానికంటే ఒక వందరెట్లయినా విస్తరించాలి. దైనిక ప్రాతిపదికన జాల విహరణ (browsing the net on a daily basis) చేసే తెలుగు వారి సంఖ్యలో కనీసం 10 శాతం బ్లాగు పాఠకులు కావాలని నా కోరిక " అంటూ ఆయన రాసిన Sep ’09 లోని"
బ్లాగులూ-బ్లాగర్లూ" టపా బ్లాగుల అభివృధ్ధిని గురించిన ఆయన తపనను తెలుపుతుంది.


"స్వర్ణముఖి" బ్లాగర్ చైతన్య వయసులో చిన్నవాడైనా అతనికున్న విషయ పరిజ్ఞానం నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది. "
శరద్చంద్రికోత్సవం"అంటూ oct 2009 లో ఈ ఉత్సవాన్ని గురించి వివరిస్తూ, అతను చూసిన సంగీతసామ్రాట్టుల కచేరిల గురించి రాసిన టపా సంగీతప్రేమికురాలైన నాకు బాగా నచ్చేసింది. చిన్న తేడా వచ్చినప్పుడు నేను అలిగితే, సహనం వహించి నన్ను అర్ధం చేసుకున్న మనిషి..బ్లాగ్లోకం నాకు అందించగా నాకు పరిచయమై నన్ను అప్యాయంగా "అక్కా" అని పిలిచే ఓ మంచి "తమ్ముడు" ఇతను.


వంద టపాల తరువాత నేను విరామం ప్రకటించినప్పుడు నా కోసం "
కవిత" రాసి నా మనసు దోచుకున్న "మనస్వి" జయగారు. Oct '09లో "బుర్రలేని పిల్ల" అని .అనాధ బాలిక గురించి ఆవిడ రాసిన ఒక నిజ జీవిత సంఘటన ఆవిడలోని ఉత్తమ సంస్కారానికీ, మూర్తీభవించిన మానవత్వానికీ ప్రతీక.

ఇక "నాన్న" భాస్కర్ గారి గురించి నే చెప్పేదేముంది...రకరకాల బ్లాగులు నడపడంలో , వంటలలో, సాంకేతిక నైపుణ్యంలో, తెలివితేటల్లో ఆయనకాయనే సాటి. బ్లాగ్లోకానికి నాన్నగారైనా....అలవాట్లు, కొన్ని పోలికలను బట్టి నాకు మా అన్నయ్యను తలపించే అన్నగారు నాకు.
Oct '09లో "
గడిచిపోయిన నిన్నటికీ రాబొయే రేపటికీ మధ్యనున్న నిశ్శబ్దం" అంటూ "బిగ్ బీ" గారి ప్రసంగానికి అనువాదాన్ని రాసిన ఈ టపా నాకిష్టం.


" నాతో నేను నా గురించి" అంటూ వేణూ శ్రీకాంత్ గారు రాసే చిన్ననాటికబుర్లు చదివి బాల్యంలోకి వెళ్ళని బ్లాగర్ ఉండరు. "ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా?" అంటూ నాన్నగారితో షికార్లు, "అంతా మన మంచికే" అంటూ చిన్నతనంలో నేను చదివిన "ట్వింకిల్" కధ...మెలోడియస్ పాటల్ని, ఎన్నో స్మృతులు రాసి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూంటారీయన.
Oct '09లో "
ఐస్ ఐస్ పుల్లైస్.. " అంటు బ్లాగర్లందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళారు. మొదట్లో అక్కడక్కడ ఈయన వ్యాఖ్యలను చదివి నా బ్లాగ్లోకి తొంగి చూడరెందుకో అనుకునేదాన్ని. హఠాత్తుగా ఒకరోజు ఆయన తరచూ చూసే బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగ్ పేరుని చూసి ఆశ్చర్యపోయాను.



"బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" సారధి "గీతాచార్య" ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ తమ్ముడికి కూడా వంద చెతులేమన్నా ఉన్నాయేమో అని నా అనుమానం. Oct '09లో "మరువం" లో ప్రచురితమైన "
అయిబు పాడిన అమ్మ పాట" కధ ఎందరో బ్లాగ్మిత్రుల మన్ననలు పొందింది.


ఇహ బ్లాగర్ల అభిమాన ఆడపడుచు "పరిమళం" గారి బ్లాగ్లో Nov '09లో ప్రచురితమైన "
దివ్యగుణములు" టపా మానవునికి కావాల్సిన పదహారు దివ్యగుణముల గురించి తెలుపుతుంది.


నా "బంగారు పాపాయి" టపా ద్వారా నాకు పరిచయమైన మాలా కుమార్ గారి బ్లాగులన్నీ మధురస్మృతుల సమాహారాలు. Nov '09లో "సాహితి" లో ప్రచురితమైన "
ఊర్వశి" టపా "ముదితల్ నేర్వగలేని విద్య గలదే ముద్దార నేర్పించినన్..." అన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.


చాలామందిలాగే నేను ఈ బ్లాగ్ అభిమానిని. రోజూ దినపత్రికను చూడకపోతే తోచనట్లే, రోజూ బ్లాగ్లోక విహారం మొదలెట్టగానే కొత్త టపా ఉన్నా లేకున్నా, ఓ సారీ "నెమలికన్ను"లోకి తొంగి చూడనిదే బ్లాగులు చూసినట్లే అనిపించదు. జ్ఞాపకాలను నెమరువేసుకోవటంలో ఈయన తరువాతే ఎవరైనా అనిపించి మురిపిస్తాయీయన టపాలు. Nov '09లో ప్రచురించిన "
పోలి స్వర్గం" నాకెంతో నచ్చిన టపా.
చెప్పాపెట్టకుండా అప్పుడప్పుడు మాయమైపోతూ, ఏమయ్యారో అనుకునేలోపూ మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్ష్యమైపోయే ఈయన "సార్ధకనామధేయులే" అనిపిస్తూ ఉంటుంది నాకు.



మన కవితారాణి ఉషగారి కవితాగానాల "మరువపువనం" నుంచి ఎంత వెతికినా ఒక్కదాన్నీ విడదీయలేకపోయాను. అందుకే Dec '09 లో ప్రచురితమైన, నాకు బాగా నచ్చిన "విశ్వామిత్ర" సీరియల్లోని "
చివరి భాగాన్ని" నచ్చిన టపాగా అందిస్తున్నాను.


నా "ఉత్తరాలు" టపా ద్వారా నాకు పరిచయమైన భావనగారి "కృష్ణపక్షం" సున్నితమైన భావోద్వేగాల లేఖాసమూహం.
Dec '09 లో ప్రచురితమైన "
ఒంటరి గూడు" టపా నన్నెంతగానో ఆకట్టుకుంది. రెండు విభిన్న దృక్పధాల మధ్యనున్న సంఘర్షణను, రెండు మనసుల వాదనలనూ వారి వారి దృష్టికోణాల నుంచి చూపించి, మనస్తత్వ విశ్లేషకురాలా? అనిపించేలా రచనలు చేసే భావనగారి "కృష్ణపక్షం" రెగులర్ రీడర్ని నేను .

"లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్" అన్నట్లు ఇటీవలకాలంలో మొదలై ప్రతి టపాతో మనతో "ఆహా" అనిపిస్తున్న బ్లాగ్ "నా గోల".
ఈ బ్లాగ్లో Dec '09 లో ప్రచురితమైన "
నీకు నువ్వు తెలుసా?"
కవిత అద్భుతం. చదివితే మీకే తెలుస్తుంది.

ఇవండీ నాకు నచ్చిన , నాకు తెలిసిన కొన్ని మంచి టపాలు. మీక్కూడా నా "సింహావలోకనం" నచ్చిందనే భావిస్తాను.
ఈ 2009 సంవత్సరానికిక శెలవు మరి....

ఇన్నాళ్ళూ వ్యాఖ్యల రూపంలో నాకు ప్రోత్సాహానిచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ నా వ్యాఖ్యలతో కానీ, టపాలతో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని మనవి...

"బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.."

Wednesday, December 30, 2009

షిర్డీ ప్రయాణం


బాబా పిలుపు వస్తేనే షిరిడీ వెళ్ళే అవకాశం, వీలు కలుగుతుందని భక్తుల నమ్మకం. బాబా కృప వల్ల ఆ పిలుపు మాకు మళ్ళీ మరోసారి వచ్చింది. నేను "అవసరం" అనుకున్న ప్రతిసారీ భగవంతుడు ఏదో ఒక భగవత్ రూపంలో దర్శనభాగ్యం కల్పిస్తూ నాకు తగినంత శక్తిని, పరిస్థితులను అవగాహన చేసుకునే బుధ్ధినీ ప్రసాదిస్తూ వస్తున్నాడు. ఇది నా జీవితంలో చాలాసార్లు అనుభవపూర్వకంగా నేను గమనించిన సత్యం. మనం మర్చిపోయినా మనల్ని భగవంతుడు ఎప్పుడూ ఒంటరిని చేయడు అని నమ్మేలా చేస్తాడు ఆ అంతర్యామి. "ఫుట్ ప్రింట్స్" కధలో కష్టకాలంలో నా ఒక్కడి అడుగుజాడలే ఉన్నాయేమని ఒక భక్తుడు ప్రశ్నిస్తే, ఆ కష్టకాలంలో నిన్నెత్తుకు మోసిను అడుగుజాడలు నావి....నీవి కావు" అని దేవుడు చెప్తాడు అలాగన్నమాట.

సరే ప్రయాణం కబుర్లలోకి వచ్చేస్తే, "షిర్డీ వెళ్దామని" అయ్యవారిని అడిగాను. "గుడ్ ఐడియా" అన్నారు. అప్పటికప్పుడు తత్కాల్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. క్రిస్మస్ శెలవులు కదా జనముంటారని రూమ్ కోసం దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్స్ లోని హోటల్స్ కొన్నింటికి ఫోన్లు చేసారాయన. "ఐదో తారీఖు దాకా ఎక్కడా రూమ్స్ ఖాళీ లేవు సార్.." అన్నారుట వాళ్ళంతా. బొంబాయి నుంచి పాప చిన్నప్పుడు ఓసారిలాగే వెళ్ళి రూమ్ దొరక్క కాస్త ఇబ్బంది పడ్డాం చలిలో. చలికాలం, పాత అనుభవం రీత్యా రెండురోజుల ప్రయాణం కోసం పాపని ఇబ్బంది పెట్టడానికి మా మనసొప్పలేదు. అమ్మానాన్నల వద్ద పాపను దింపి బయల్దేరాము. అమ్మావాళ్ళ కొత్త ఇల్లు దానికి బాగా నచ్చేయటం వల్ల, అమ్మమ్మతాతయ్యల వద్ద అలవాటు ఉండటం వల్ల పాప పెద్దగా పేచి పెట్టలేదు. జాగ్రత్తలు చెప్తూంటే మాత్రం రెండురోజులకు అన్ని చెప్తావేమిటే? అని ఎదురు ప్రశ్న వేసింది.

ఇక రూమ్ గురించి...ఏదో ఒక దిక్కు బాబానే చూపిస్తారులే అని బయల్దేరాం. ట్రైన్లో నిద్రకుపక్రమిస్తూండగా ఒక ఎస్.ఎమ్.ఎస్ వచ్చింది నాకు. "నేనూ,తను ఈ ట్రైన్లోనే ఉన్నాం. మీరే బోగీలో ఉన్నారూ?" అని...మా కజిన్ నుంచి. వెంఠనే ఫోన్ చేసాం. యాదృచ్ఛికంగా నాన్నతో మాట్లాడిన వేరొక కజిన్ మేము షిర్డీ వెళ్తున్నట్లు తెలిసి, ట్రైన్లో ఉన్న వీడికి ఫోన్ చేసాడుట..."అక్కావాళ్ళు మీరున్న రైల్లోనే ఉన్నారని..". ఇంతకూ ట్రైన్లో ఉన్న తమ్ముడు చెప్పిన విషయం ఏమిటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు షిర్డీ వెళ్ళాలని నెల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారట. మా బాబయ్య నెల ముందుగానే రూమ్ బుక్ చేసి ఉంచాడుట. మా ఆశ్చర్యానికి అంతు లేదు...అనుకోకుండా మా కజిన్ నాన్నకు ఫొన్ చేయటం, మా ప్రయాణం గురించి తెలవటం...అంతా మాయనిపించింది. మా కోసం బాబాగారు నెల ముందే రూమ్ రెడి చేసేసారన్నమాట...!!

నాగర్సోల్ లో దిగుదాం అనుకుని ఫోన్ అలారం సెట్ చేసుకున్నాం ఇద్దరు జంటలమూ. ఇక్కడ ఈ కజిన్ గురించి కొంచెం చెప్పాలి. వాడు మా పిన్ని కొడుకు. బొంబాయిలో మేము బోరీవల్లీ వెస్ట్ లో ఉండేప్పుడు వాడు బోరీవల్లీ-ఈస్ట్ లో ఉండేవాడు. వీక్ ఎండ్స్ కలిసి గడిపేవాళ్ళం. తనని వదలలేక వదలలేక నేను డెలివెరీకు వెళ్తూ "నీళ్ళు కాచుకోవటానికి కూడా బధ్ధకించి చన్నీళ్ళు పోసుకునే మనిషి....కాస్త జాగ్రత్తగా చూసుకోమని" వాడికి అప్పగించాను మావారిని...! నా కన్నీళ్ళు చూసి వాడు చలించిపోయి సిన్సియర్గా నేను మళ్ళీ వెళ్ళేంత వరకూ "బావగారికి" తన వీకెండ్స్ అన్నీ ధారపోసాడు. ఎంతగా అంటే ఆ ఏరియాలోని హోటల్స్ అన్నింటిలోని మెనూకార్డులూ బట్టీ వచ్చేంతగా. నాతో ఒక్క సినిమాకూ రాని మనిషి బావమరిదితో వారానికో సినిమా చూసేంతగా...నేను కుళ్ళుకుని దెబ్బలాడేంతగా...అదంతా వేరే కధ..!! ఇంతకూ ఈ బావాబావమరుదులది ఆనాటి మైత్రీ బంధం అన్నమాట.

పొద్దున్నే నూతన దంపతులు, మేము నాగర్సోల్ లో దిగాం. స్వెట్టర్, స్కార్ఫ్, కట్టుకున్నా చలి వణికిస్తోంది. మనకు రైల్లో చలికే జలుబుగారు నేనున్నానని వెతుక్కుని వచ్చేసారు. ముక్కులు దిబ్బడేసి గాలి పిల్చుకోవటమే కష్టమైంది. ఒక టాక్సీ మాట్లాడుకుని షిరిడీ చేరాం. రూమ్ ఖాళీ అవక కొంచెం ఆలస్యమైంది. త్వరగా తయారయి దగ్గర ఉన్న బిస్కెట్లు తలో నాలుగు లాగించి, ఉదయం పదిన్నరకల్లా దర్శనం లైన్లో దూరాం. విపరీతమైన జనం. రోడ్డు చివరిదాకా క్యూ ఉంది. తిరుపతిలో తప్ప ఇదివరకెన్నడు ఇంత జనాన్ని శిరిడీ లో చూడలేదు. రద్దీ టైమ్లో వెళ్ళకపోవటంవల్ల కావచ్చు లేదా జనాల్లో భక్తి పెరిగి ఉండవచ్చు. అనుకున్నాం.

క్యూలో కొన్నిసార్లు నడిచే పనే లేకపోయింది. గుంపుతో పాటుగా మా ప్రేమేయం లేకుండా ముందుకు నెట్టబడిపోయాం...అలానే జోగుతూ, నడుస్తూ, నుంచుని నుంచుని కాళ్ళు నెప్పులు పెడుతూంటే మధ్యాహ్న హారతి టైంకు లోపల క్యూల్లోకి చేరాం. సి.సి.టివీల్లో బాబాను దర్శించుకుంటూ హారతి పాడేసుకున్నాం. శెలవుల టైంలో రాకూడదు బాబోయ్..అనుకున్నాం. ఫ్రీగా విగ్రహానికే ఫొటోలు తీసుకున్న రోజులు ఉన్నాయి మరి. "ఎందుకండీ...ఇలా ఇంతసేపు క్యూలో నిలబెట్టేస్తున్నారు బాబాగారు?" అని అడిగాను తనను.."నీ సహనాన్ని పరీక్షించాలని.." అన్నారు ఠక్కున తను. కాబోలు...అనిపించింది.

ఎట్టకేలకు దాదాపు మధ్యాహ్నం రెండింటికి బాబాగారి విగ్రహం ముందుకు చేరాం. విచిత్రంగా కాళ్ల నెప్పులు,చిరాకు, విసుగు అన్ని మాయమైపోయాయి. అవ్యక్తానందంతో మనసంతా నిండిపోయింది. హుండిలో దక్షిణ వేసేసి, అందరి పేరునా సర్వేజనా సుఖినోభవంతు అనేసుకుని, ఆ నిశ్చలవదనాన్నిచూస్తూ ఆ ప్రశాంత క్షణాలను మనసారా ఆస్వాదించాను. విచిత్రంగా ఎవ్వరూ వెళ్ళు వెళ్ళుమని తొయ్యలేదు. కావాల్సినంత తృప్తిగా దర్శనం చేసుకున్నాం. పొద్దున్న గేటు బయట కొన్న నాలుగు గులాబీలూ బాబాను చెరే టైంకు ఒక్క గులాబీగా మారాయి.(తోపులాటలో మిగతావి రేకులు ఊడిపొయాయి..) ఆ ఒక్క గులాబినే సమాధిపై విసిరాను. అక్కడ వేసిఉన్న దండలోని రెండు గులాబీలు నా చేతికి చిక్కాయి. అవి తీసుకుని సంతృప్తిగా బయటకు నడిచాను.

ఆ ప్రాంగణంలోనే ఓ చెట్టు క్రింద కాసేపు కూర్చుని దర్శనం తాలుకూ "డివైన్ వైబ్రేషన్స్"ను మళ్ళీ మనసంతా నింపుకున్నాను. విభూతి తీసుకుని, కొన్ని కేలండర్స్ కొన్నాం. భోజనం చేసి చావడి,ద్వారకామాయి కూడా చూసి వచ్చాం. అదివరకు నేనేమైనా కొనుక్కునేదాన్ని. ఇప్పుడిక ఏది చూసినా పాపకు కొందామనే దృష్టే. నేనేం కొనుక్కుంటాను..అనే నిర్లిప్తత..! మా కజిన్ వాళ్లది రాత్రి 9.30 రైలు. మాది 7.30 రైలు. ఇక ఐదున్నరకే మేము నాగర్సోల్ బయల్దేరాం. లక్కీగా బస్సు దొరికింది. ఏడింటికల్లా స్టేషన్లో బెంచీ మీద కూర్చున్నాం ఇద్దరం. నా జలుబు బాగా ఎక్కువైపొయింది. జ్వరమొచ్చినట్లు కూడా ఉంది. ఈ రష్ లో, చలిలో పాపను తీసుకురాపోవటమే మంచిదైంది అనుకున్నాం.

ఓ పిల్లాడు కీచైన్స్, పిల్లల ఆట వస్తువులూ అమ్ముతూ అటువచ్చాడు. ఔరంగాబాద్ నుంచి రోజూ వచ్చి అమ్ముకుపోతాడుట. వాడి స్పిరిట్ కు ముచ్చటేసి ఓ నాలుగైదు ఐటెమ్స్ కొనేసాం పాపకు. "సీజన్ టికెట్ కొనుక్కుంటావా?" అని అడిగాను. "బిన్ టికెట్.." అనుకుంటూ వెళ్పోయాడు వాడు. ఆదివారం ఇల్లు చేరి, మళ్ళీ పొలోమని 20kms దూరంలో ఉన్న అమ్మావాళ్ళింటికి వెళ్ళి పాపను తీసుకుని ఇల్లు చేరే సరికీ శరీరపుఇంజెన్లో బ్యాటరీ అంతా అయిపోయింది...! మళ్లీ బ్యాటరీ లోడయ్యాకా ఇదిగో ఇప్పటికి టపా రాయగలిగాను...!!

అదండీ..మా షిర్డీ ప్రయాణం కధ...లోకాస్సమస్తా సుఖినోభవంతు... !!!

Monday, December 28, 2009

ముక్కోటి ఏకాదశి

ఇవాళ "వైకుంఠ ఏకాదశి". దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. విష్ణు ద్వారాలు తెరుచుకుంటాయి అంటారు. ఉత్తరాయణానికి ముందుగా వచ్చే ఏకాదశి ఇది.ఈ రోజున విష్ణు పూజ,ఉపవాసం విశేష ఫలాన్ని ఇస్తాయని పెద్దలు చెబుతారు.ఏకాదశి ముందు రోజు ఒంటి పూట భోజనం చేసి , ఏకాదశినాడు ఉపవసిస్తూ ఉంటారు కొందరు.తిరిగి ద్వాదశినాడు విష్ణువుకు నైవేద్యం పెట్టి సహస్రనామ పారాయణా చేస్తారు. ఇది ఎంతో మహిమాన్వితమైన ఏకాదశి అని పురాణాలలో చెప్పబడింది.ఉపవాసం చేయను కానీ విష్ణు సహస్రనామాలు చదువుకుని నైవేద్యం పెడుతూంటాను నేను.

వారాంతంలో "షిరిడీ యాత్ర" చేసి వచ్చాము.ఆ చలికి విపరీతమైన జలుబు, కాస్త జ్వరం వచ్చేసాయి.అందుమూలంగా "షిరిడీ యాత్ర" కబుర్లను ఓపిక వచ్చాకా ఒకటి రెండు రోజుల్లో వీలుని బట్టి రాసి మిత్రులందరితో పంచుకోవాలని ఆశ...

Friday, December 25, 2009

నా రూప పుట్టినరోజు...


ఆ రోజు నా కింకా గుర్తు....నేను 10th క్లాస్ చదువుతున్నాను.మేము కొత్తగా కట్టిన క్వార్టర్స్ లో 2nd ఫ్లోర్లో దిగాం. పొద్దున్నే నేను మెట్లు దిగి స్కుల్కెళ్తున్నాను. 1st ఫ్లోర్ దగ్గర "నువ్వేక్లాస్" అడిగిందో అమ్మాయి. చెప్పాను. "నువ్వు..?" అడిగాను. "9th.." అంది. ఆ తర్వాత నుంచి తనకు అక్కలు లేరని అలాగే పిలుస్తానని నన్ను "అక్కా" అని పిలిచేది. డిసెంబర్లో తన పుట్టినరోజు వచ్చింది. ఏ సంవత్సరం? అంటే చెప్పింది..."అదేమిటి మనకి నాలుగు నెలలే తేడా..నన్ను అక్కా అని పిలవకు. పేరు పెట్టే పిలువు.." అన్నాను. "వద్దు.నాకిలాగే అలవాటైంది...అక్కా అనే పిలుస్తాను." అంది. తనే "రూప". నా ప్రాణ స్నేహితురాలు. ఇవాళ తన పుట్టిన రోజు.

"స్నేహం" టపాలో రాసిన స్కూల్ ఫ్రెండ్ మాధవి తరువాత నాకు దగ్గరైన స్నేహితురాలు. "కూరల మార్కెట్" టపా లో గుర్తు చేసుకున్న కాలేజీ ఫ్రెండ్ ఎంత సన్నిహితమో..అంతకన్నా ఎక్కువ సన్నిహితమైన స్నేహితురాలు. మేము Friends for life అంతే...! తన గురించి "యాస్మిన్" టపాలో కూడా రాసాను. తనే కాక వాళ్ళమ్మగారితో కూడా నాకు స్నేహమే. ఆంటీ కి నేనంటే చాలా ఇష్టం ఉండేది. ఇంట్లో ఏది చేసినా నాకు తెచ్చి ఇచ్చేవారు, లేదా తనతో పంపేవారు. నన్ను చూసి పనులు నేర్చుకొమ్మని రూపని కోప్పడుతూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు టెక్నికల్ సైడ్ కావటంతో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి వాళ్ళకు. ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో తిరిగి వచ్చారు. తెలుగు మాట్లాడటం,రాయటం తప్ప చదవటం పెద్దగా రాదు తనకి. హిందీ,ఒరియా,బెంగాలీ,ఇంగ్లీష్,మరాఠీ ఐదు భాషలూ బాగా మాట్లాడేది. బాగా రాసేది కూడా. మాకిద్దరికీ "షటిల్ ఆడటం" చాలా ఇష్టం. మా క్వార్టర్స్ లో ఉన్న కోర్ట్ లో మేమిద్దరం రోజూ సాయంత్రాలు షటిల్ ఆడుకునేవాళ్ళం.

తన గురించి చెప్పాలంటే నేను మళ్ళీ అలాంటి స్నేహశీలిని మళ్ళీ నా జీవితంలో చూడలేదు. అందరికీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరితో చిన్నావైనా గొడవలు వస్తూంటాయి. నేనే నా మిగతా స్నేహితులతో చిలిపి తగాదాలకి పోయిన రోజులు ఉన్నాయి. కానీ రూప కి పరిచయమైన ప్రతి వ్యక్తీతో సత్సంబంధాలే. ఎక్కదికి వెళ్ళినా తోకల్లాగ బోలెడు మంది స్నేహితులను పోగేసుకునివచ్చేది. నేను అనేదాన్ని...వాళ్ళందరు తరువాత. ముందు నేనే....అని. "అయ్యో అక్కా....నాకెప్పటికీ నువ్వే ముందు..ఆ తర్వాతే అందరూ.." అందరూ అనేది. మా ఇద్దరికీ ఒక్కసారి కూడా ఏ మనస్పర్ర్ధ రాలేదు. ఇప్పటికీ అలానే ఉన్నాం. మూడేళ్ళ తరువాత వాళ్ళు శోలాపూర్ వెళ్పోయారు. అక్కడ తను ఇంజినీరింగ్ చేసింది. దూరపు బంధువుల్లో ఇంజినీర్ ఒకతను రూప గురించి, తన గుణాల గురించీ విని ఇష్టపడి కావాలని అడిగి పెళ్ళి చేసుకున్నాడు. భార్యను ప్రాణంలా చూసుకోవటం అంటే అతన్ని చూసి తెలుసుకోవాల్సిందే.

రూపా ,నేనూ ఇద్దరం ఒకేలాంటి వాళ్ళం. మా ఇష్టాలూ, అభిరుచులూ, అలవాట్లు, ఆసక్తులు అన్నీ ఒకటే. తనకి తెలుగు పుస్తకాలు చదవటం రాదు, తెలుగు పాత పాటలు,సినిమాలు తెలీవు అంతే. ఇద్దరం కలిసి గ్రీటింగ్స్, పైంటింగ్స్, వేసుకునేవాళ్ళం. తను ఆయిల్ పైంటింగ్స్ చాలా బాగా వేస్తుంది. ముగ్గులు,గోరింటాకులూ పెట్టేవాళ్ళం. నేను కవితలు రాసినా, కొత్తగా ఏదన్నా పాట నేర్చుకున్నా తనే మొదటి ప్రేక్షకురాలు. ఒకరి పుట్టిన రోజులకొకరం అర్ధరాత్రి పన్నేండు దాకా కూర్చుని గోరింటాకులు పెట్టి, విషెస్ చెప్పి నిద్రోయేవాళ్ళం. మా అడ్డా మా "మెట్లు". పైకి వెళ్ళేవళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నవ్వుతూ,పలకరిస్తు వెళ్పోతూ ఉండేవాళ్ళు.మామటుకు మేము రోజూ కాసేపు ఆ మెట్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుని కానీ ఇళ్ళకు కదిలేవాళ్ళం కాదు. పెళ్ళయ్యాకా తను జాబ్ చేసింది, Mtech దిస్టింక్షన్లో పాసయ్యింది. మళ్ళీ కొన్నాళ్ళు లెక్చరర్గా చేసింది. కానీ బాబు పుట్టాకా ఆ ముచ్చట్లు, ఆ చిన్ననాటి అల్లర్లు మిస్సవ్వకుడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో జాబ్ మనేసింది. రాను రానూ ఉత్తరాలూ, మైల్స్ తగ్గిపోయినా, భర్తల ఉద్యోగాల రీత్యా మేం ఎంత దూరాల్లో ఉన్నా ఫోన్ల ద్వారా మేమెప్పుడూ కనెక్టెడే.

కష్ట సుఖాల్ని పంచుకోవటం, ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవటం, ఎంత దూరంలో ఉన్నా టచ్ లో ఉండటం, ఒకరిపట్ల ఒకరికున్న అభిమానాల్ని నిలబెట్టుకోవటం, మాలాగే పెరుగుతున్న మా పిల్లల్ని చూసుకుని మురిసిపోవటం....ఇదే మేమిద్దరం. అర్ధరాత్రి నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకని పొద్దున్నే చేసి "B'day విషేస్" చెప్పాను నా రూపకి. ".....15,16 ఏళ్ళ వయసు నుంచీ ఈ వయసుకి చేరాం..." అన్నాను...తను నవ్వింది....!!


(బ్లాగ్మిత్రులకి...పునద్దర్శనం మళ్ళీ సొమవారం..ప్రస్తుతం ఒక పుణ్య క్షేత్ర దర్శనార్ధం ప్రయాణం..)

Thursday, December 24, 2009

పెదవే పలికిన మాటల్లోనే...

పొద్దున్నే "అమ్మ" గుర్తుకొచ్చింది...ఈ పాట కూడా గురుకొచ్చింది ... అమ్మ మీద చాలానే మంచి పాటలు ఉన్నాయి కానీ కొత్త పాటల్లో ఇది నాకు నచ్చుతుంది. "నానీ" చిత్రం లోని పాట. Tom Hanks నటించిన "Big" చిత్రకధను భారతీకరించి తీసిన సినిమా ఇది. ఇలాంటి కాపీ సినిమాలు చూడలేను. అందుకే చూడలేదు కానీ సినిమాలో ఈ పాట మాత్రం బావుంటుంది.



పాడినది: ఉన్ని కృష్ణన్, సాధనా సర్గమ్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ..
పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కోంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను
ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో .... బజ్జో లాలి జో
బజ్జో లాలి జో.. ..

utube link:
http://www.youtube.com/watch?v=జ౩క్ల౫క్వ్మ్క్ష్త్మ్




Tuesday, December 22, 2009

సంతృప్తి


నా "మార్నింగ్ వాక్" అటకెక్కి సుమారు నాలుగైదు నెలలౌతోంది. కాని దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రోజులో ఎప్పుడో అప్పుడు వీలైనంత నడుస్తూ ఉంటాను. అది కాక మేమిద్దరం తరచూ "నైట్ వాక్స్" కు వెళుతూ ఉంటాము. మార్నింగ్ వాక్లో పొద్దున్నే తెలవారుతున్న సందడినీ, ఉదయిస్తున్న సూర్యుడినీ, ఫ్రెష్ ఏర్ నీ ఎంత ఆస్వాదిస్తామో, రాత్రిపూట సర్దుమణిగిన ట్రాఫిక్ ను, చీకటైనా ఆ నిశ్శబ్దంలోని హాయినీ, అంతే ఆస్వాదిస్తాము మేము. రోజులో జరిగిన విశేషాలో, మిగిలి ఉన్న పెండింగ్ పనుల గురించో, ఎప్పటినించో చెప్పాలనుకుని మర్చిపోయిన సంగతుల గురించో కబుర్లాడుకుంటూ నైట్ వాక్ పూర్తి చేస్తూంటాం మేము.

మొన్న అలానే వెళ్ళొస్తూంటే సందు చివర తెరిచి ఉన్న బేకరి కనిపించింది. మా పాపకు ఏమన్నా కొందామని బేకరీ లోకి వెళ్ళాం. ముందు ఒక పేస్ట్రీ అడిగి, ఆ ట్రేలో మిగిలి ఉన్నవి రెండే అని చూసి రెండూ ఇచ్చేయమని చెప్పి మేము ఇంకా ప్లమ్ కేకా, మఫెట్సా(కప్ కేక్స్) ఏది తీసుకుందాం అని మాట్లాడుకుంటున్నాం...ఇంతలో అద్దాల్లోంచి కనిపించిన రంగురంగుల పెద్ద కేక్స్ పై మా దృష్టి పడింది. గిటార్ షేప్ కేక్, ఇల్లు బొమ్మలాంటి కేక్, చుట్టూరా చెట్లు ఉండి మధ్యలో టెడ్డీ బొమ్మలున్న కేక్స్ ఇలా రకరకాలవి ఉన్నాయి...వాటిని చూస్తు ఏవో మాటాడుకుంటున్న మేము. అతను ఒక్క పేస్ట్రీనే పేక్ చేసి ఇచ్చేసరికీ "ఇదేమిటి? మేము మిగిలిన రెండూ ఇచ్చేయమన్నాం కదా" అన్నాం. "అవునా ? నేను వినలేదండీ. సోరీ" అని అతను మళ్ళీ రెండోది కూడా తీసాడు.ఈసారి మఫెట్స్ బాక్స్ కూడా కలిపి పేక్ చేయమన్నాం. అతను పేక్ చేస్తూ మాతో అన్నాడు..."నేను మీ ఇద్దరి కబుర్లు వినీ ఏవో ఊహల్లోకి వెళ్పోయానండీ...వ్యాపారస్తుడి కన్నా ముందు ఒక మనిషిని కదాండీ...అన్నాడు. మాకు అర్ధం కాలేదు...అయోమయంగా చూశాం.

అతను మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు...నేను మీ ఇద్దరి మాటలూ విని ఒక్క క్షణం అన్నీ మర్చిపోయానండీ.....అని తన కధ చెప్పటం మొదలెట్టాడు... బేకరీ అతను చెప్పిన కధ:
"నేను ఎనిమిదేళ్ళు అమెరికాలో ఉండి వచ్చాను. వ్యాపారం బాగా చేసాను. డబ్బులు సంపాదించాను. నా తండ్రి అప్పులు తీర్చాను. కుటుంబం కోసం డబ్బులు దాచాను. మధ్య మధ్య వస్తూ పోతూ ఉన్నాను. ఎన్ని చేసినా నా మనసుకు ప్రశాంతత దొరకలేదు. ఇక తల్లిదండ్రుల బలవంతం మీద ఇండియా వచ్చేసాను. ఇప్పుడు ఎనిమిదేళ్ళ తరువాత కుటుంబంతో గడుపుతూంటే తెలుస్తోంది నేను కోల్పోయిందేమిటో...! ఒకోసారి షాపు కట్టేసి వెళ్ళాకా మనసారా ఏడ్చేస్తాను. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఎందుకు బాధపడతారు? వచ్చేసారు కదా అంటుంది మా ఆవిడ. ఇప్పుడు నాకో విషయం అర్ధమైంది. మనిషి చేసే పనిలో ఎంత ప్రగతి సాధించినా, ఎంత కూడబెట్టినా ఎవరి కోసం? కుటుంబం కోసమే కదా? ఆ కుటుంబంతో గడపలేకపోతే, ఆ కుటుంబాన్ని సంతోషపెట్టలేకపోతే ఇంక ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటేనే నాకు ప్రశాంతత అని ఇప్పుడు అర్ధమైందమ్మా..." అన్నాడు ఉద్వేగంగా.

"ఇందాకా మీరిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూంటే నాకు చాలా సంతోషం వేసిందమ్మా...అలానే ఉండండి. అన్యోన్యంగా ఉండండి. ఆనందంగా ఉండండి. " అంటూ ఆశీర్వదించేసాడు. మేము మాట్లాడుకున్న మాటలు అతడిని ఎందుకు అంత ఉద్వేగానికి గురి చేసాయో అర్ధంకాలేదు కానీ అతని దీవెన నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది.ఆనందాన్ని, తెలియని సంతృప్తిని ఇచ్చింది. ఈ ఆనందానికి నేనొక్కదాన్నేనా బాధ్యురాలిని? ఎంతమాత్రం కాదు. నన్ను నన్నుగా అర్ధం చేసుకుని అడుగడుగునా నా తోడు నిలుస్తున్న మావారిది కూడాను. ఆ క్షణంలో బహుశా వెయ్యోసారి అనిపించింది....వివాహనికి, సహజీవనానికీ అభిరుచిలు కలిస్తే అదృష్టమే కానీ సంతోషంగా కలిసి బ్రతకటానికి ఇద్దరు మనుషుల మధ్యన కలవాల్సినవి అభిరుచులు కాదు ఒకరినొకరు అర్ధం చేసుకునే మనసులు అని...!!


* <-- ఇది ....కు ఓ చిన్న దిష్టి చుక్క..:)


(రెండు రోజుల క్రితం జరిగిన ఈ చిన్న సంఘటన ఈ టపా అయితే, ఇవాళ పొద్దున్నేనేను చూసిన ప్రియగారి వ్యాఖ్య నేను మళ్ళీ బ్లాగు తెరవటానికి కారణం. ప్రియగారికి ధన్యవాదాలు...)

Friday, December 11, 2009

సిరి సిరి మువ్వల్లె... Shreya Ghoshal

ఓ వారంరోజులు మా పనమ్మాయి "శెలవు" ప్రకటించింది. చేసేదేముంది..? "पिया का घर है..रानी हू मै...रानी हू घर की..." పాడుకుంటూ బాల్కని లో అంట్లు తోమటం మొదలెట్టాను. Fm radio..లేనిదే మనకి పనులు జరగవు కాబట్టీ అది తడవకుండా దాన్ని కాస్త ఎత్తు మీద పెట్టుకున్నా..! "ఏమిటి మేడమ్ము గారు Fm వింటూ అంట్లు తోముకుంటున్నారా...?" అని ఓ జాలి లుక్కిచ్చేసి అయ్యగారు వెళ్పోయారు. ఇక్కడ "అంట్లు తోమటానికీ -- శ్రేయ"కీ లింక్ ఏమిటా అని ఆశ్చర్యపొతున్నారా? అక్కడికే వస్తున్నా...రేడియో లో "సిరి సిరి మువ్వల్లే..చిరుగాలి చినుకల్లే...’ అని మధురంగా పాట మొదలైంది...ఆహా...అని మైమరచిపోయా...! ఇన్నాళ్ళూ శ్రేయ గురించి బ్లాగ్ లో రాయలేదే అని గుర్తొచ్చింది. పనులవ్వగానే వెంఠనే సిస్టం దగ్గరికి చేరా...ఇలా ఈ టపా అయ్యిందా ఆవేశం..!!

పాతికేళ్ళ వయసు. ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నేషనల్ అవార్డులు, తమిళ్,కన్నడ భాషల్లో రెండు south ఫిల్మ్ ఫెర్ లు, నాలుగు IIFA అవార్డ్ లు, ఇంకా ముడు జీ సినీ అవార్డులు, ముడు స్టార్ స్క్రీన్ అవార్డ్ లు, ఇంకా...చాలా ప్రాంతీయ అవార్డు లు...ఇవీ ఆ అమ్మాయి అచీవ్మెంట్స్..!! ముచ్చటేయటం లేదూ..
Zee TV లో Sonu nigam "Sa Re Ga Ma Pa" ప్రోగ్రామ్ host చేసే టైం లో ప్రతి ఎపిసోద్ ను తప్పక చూసేదాన్ని. Sonu మీద, హిందీ పాటల మీద ఇష్టం తో. అప్పటికి Sonu ప్లేబాక్ సింగర్ గా ఇంకా నిలదొక్కుకోలేదు. అయినా ఆ గొంతు విని ఇంట్లో అంతా అభిమానులం అయిపోయాం. అప్పుడు ఒక పిల్లల special episodeలో గెలిచింది "శ్రేయ ఘోషాల్".


శ్రేయ వాయిస్ నచ్చేసి నా సినిమాలో అవకాశం ఇస్తానని "ఇస్మైల్ దర్బార్" అనౌన్స్ చేసేసారు. ఇక తరువాత ఒక్కొక్కటే తన్నుకుంటూ వచ్చేసాయి అవకాశాలు. ప్రతిభకు పరిచయం అవసరం లేదు కదా. హిందీ లోనే కాక మాతృభాష బెంగాలీ తరువాత కన్నడ,తమిళ్,మలయాళ,మరాఠీ,పంజాబీ,తెలుగు మొదలైన భాషల్లో పాటలు పాడింది శ్రేయ.

శ్రేయ ఘోషాల్ పాడిన హిందీ పాటల్లో నాకు చాలా బాగా నచ్చినవి --
* Jadoo hai nashaa hai...(jism)
* Agar tum mil jaavo...(zeher)
* Bairi piyaa badaa bedardii.... (Devdas)
* Dhola re dhola re...( with kavita krishnamurty -- Devdas)

నాలుగూ అద్భుతమైన పాటలు నా దృష్టిలో. వింటూంటే ఏవో లోకాల్లో విహరిస్తున్నట్లే..అంత నచ్చేసింది నాకు శ్రేయ గొంతు.

హిందీ సింగర్స ను తెప్పించి తెలుగు పాటలు పాడించే ప్రయోగాలు ఎప్పటి నించో పరిశ్రమలో ఉన్నా, ఇటీవల మరీ ఎక్కువైయ్యాయి. వాళ్ల అసలు గొంతులు గొప్పవే అయినా భాష రాకపోవటం వల్ల, కొందరి పాటలు విని, ఎందుకిలా తెలుగు పాటలు పాడి ఉన్న పేరు చెడగొట్టుకుంటారు? అనుకున్న సందర్భాలు కోకొల్లలు. చాలా తక్కువ మంది తెలుగులో కూడా బాగా పాడారు అనిపించుకున్నరు. వాళ్ళలో నాకు తెలిసీ "శ్రేయ" ఒకర్తి. కొన్ని పదాలు తను కూడా సరిగ్గా పలకకపోవటమ్ విన్నాను కాని అది రికార్డింగ్ చేసేవాళ్ళు సరి చేయకపోవటమ్ వల్ల అని నేననుకుంటాను.


ఇక తెలుగులో పాడిన పాటల్లో నాకు నచ్చినవి...

* ఇంతకూ నువ్వెవరూ...(స్నీహితుడా)
* తలచి తలచి చూస్తే... (7 G బృందావన్ కాలనీ )
* నువ్వేం మాయ చేసావో కానీ... (ఒక్కడు )
* ప్రేమించే ప్రేమవా ..(నువ్వు నేను ప్రేమ)
* నువ్వే నా శ్వాసా... (ఒకరికిఒకరు)
*వెళ్ళిపోతే ఎలా.... (duet with కీరవాణి-- ఒకరికిఒకరు )
* ప్రతిదినం నీ దర్శనం... (అనుమానాస్పదం -- duet with unni krishnan)
*ఆనందమా ఆరాటమా ..(duet with shankar mahadevan)
* సిరిసిరిమువ్వల్లే చిరుగాలికి చినుకల్లే (పెళ్ళైన కొత్తలో)


నేను Fm లో విని ఈ టపాకు కారణమైన ఈ పాట ఇక్కడ వినండి...




పాడింది: Shreya Ghoshal
సినిమా: పెళ్ళైన కొత్తలో
సంగీతం: అగస్త్య
రచన: వెన్నెలకంటి



సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, కురిసింది గుండెల్లో, వెన్నెలమ్మా...
చిన్నరి పాపల్లే, చిరునవ్వుల సిరిమల్లె, సరిగమలే పాడింది, కూనలమ్మా...
ఎద లోతులో అలజడి రేగె నాలో... మరి మరి ఎందుకో నిలిచెను ప్రేమ నాలో...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

కలలో ఒక రూపమే... కనులకు తెర తీసే... వెలిగించని దీపమే... తొలి జిలుగులు కురిసే...
అయినా మరి ఎందుకో తడబడినది మనసు... ఇది ఎమో ఏమిటో, అది ఎవరికి తెలుసు...
ఒక వింతగ పులకింతగ తొలి తలపే మది చాటుగా సడి చేసినదెందుకు...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

ఎదలో రసవీణలే... సరిగమలే పలికే... ఎదురై విరి వానలే... మధురిమలే చిలికే...
మాటాడే మౌనమే... కలకలములు రేపే ... వెంటాడే స్నేహమే... కలవరములు చూపే...
ఇది ఏమిటో, కథ ఏమిటో... తెలియని ఓ అనుమానమే... తెర తీసినదెందుకో...

సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, కురిసింది గుండెల్లో, వెన్నెలమ్మా...
చిన్నరి పాపల్లే, చిరునవ్వుల సిరిమల్లె, సరిగమలే పాడింది, కూనలమ్మా...
ఎద లోతులో అలజడి రేగె నాలో... మరి మరి ఎందుకో నిలిచెను ప్రేమ నాలో...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

isn't it a lovely song...!!

Tuesday, December 8, 2009

" ఆదివారం -- American Chopsuey "

అనగనగా ఒక ఆదివారం. పాపను తీసుకుని అమ్మనాన్నలను చూడటానికి వెళ్ళాను. ఇంతలో తన ఫోన్...వెళ్ళిన పని త్వరగా అయిపోయింది "లంచ్" కు వెళ్దామా? అని...ఎగిరి ఒక గంతు వేసి...పాపను అమ్మకు అప్పజెప్పి బయలుదేరాను. పాపను మాతో తీసుకువెళ్తే ఏమౌతుందో ఒకటి రెండు అనుభవాల తరువాత జ్ఞానోదయం(వీటి గురించి మరో పోస్ట్ లో) అవటం వల్ల ఎక్కడో అక్కడ పాపను ఉంచి లేక బజ్జోపెట్టో హోటల్కో, సెకెండ్ షోలకో వెళ్తూంటాం. అమ్మమ్మ ఇంట్లో ఉంది కాబట్టి పాప కూడా ఎక్కువ గొడవపెట్టలేదు. "ఈ డ్రెస్సు మీదకు ఈ చెప్పులు వేసుకోవే" అని సలహా కూడా ఇచ్చింది. బసెక్కి అయ్యవారు చెప్పిన చోటికి చేరాను.

ఆ రెస్టారెంట్ నాకు పెద్దగా నచ్చలేదు. ప్రసన్నంగా లేని నా మొహం చూసి ఆయన "ఏదో ఒక ఐటెం తినేసి ఇంకో దాంట్లోకి వెళ్దాంలే.." అన్నారు. ఒక ఆర్డర్ ఇచ్చేసి, కానిచ్చేసి బయటపడ్డాం. నాలుగడుగులు వెయ్యగానే ఒక "చైనీస్ రెస్టౌరెంట్" కనబడింది. నా కాళ్ళు,కళ్ళు అటు పోయాయి...తనకు అర్ధమైపోయింది. నాకు "అమెరికన్ చౌప్సీ" తినాలని బుధ్ధిపుట్టిందని. ఇక్కడ "అమెరికన్ చౌప్సీ" ని గురించి కొంత చెప్పాలి. పెళ్ళికాక ముందు మొదటిసారి మా అన్నయ్య ఇది తినిపించాడు. అది మొదలు నెలకోసారన్నా "ఆ టేస్ట్" నాలుకకు తగలకపోతే నా టేస్ట్ బడ్స్ ఆ "రుచి" కోసం తహతహలాడుతూ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ లో ఈ ఐటెం టేస్ట్ ఎలాఉంటుందో అని టెస్ట్ చేస్తూ ఉంటాను కానీ మొదటిసారి తిన్న చోటనే నాకు ఇది చాలా నచ్చుతుంది. ఇప్పటికీ వీలైనప్పుడల్లా అక్కడకే వెళ్తూంటాం.పెళ్ళయిన కొత్తల్లో "అమెరికన్ చౌప్సీ" కావాలని అడిగితే అదేదో "కొత్తరకం ఐస్క్రీం" అనుకున్నారు పాపం మావారు.

ఇక ఆ "చైనీస్ రెస్టారెంట్" లోకి వెళ్దామని అడుగుపెట్టేసరికీ అది నిండుగా ఉంది. ఏదో పార్టీ జరుగుతోందనీ ఒక పది నిమిషాలు వైట్ చేయమని చెప్పాడు. బయట కుర్చీలు కూడా లేవు. చుర్రుమనే ఎండలో కబుర్లాడుతూ నించున్నాం...పదినిమిషాలు కాస్తా అరగంత అయ్యింది కానీ లోపల ఖాళీ అవ్వలేదు. మళ్ళీ అడిగాము...పది నిమిషాలు..అన్నడు వాడు. నాకింక కోపం వచ్చేసింది. ముందరే అరగంట లేక గంట అని చెప్పచ్చు కదా? బయట తిరిగి మరో గంటలో వస్తాం కాదా? ఎండలో ఇలా నించోపెట్టడం అన్యాయం కదా? అని. మళ్ళీ రోడెక్కాం. ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తప్పుడు ప్రతిరోడ్డు చివరా ఏదో ఒక చైనీస్ రెస్టారెంట్ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఒక్కటీ కనబడట్లేదు...పోనీ ఏదన్నా టిఫిన్ చేసేసి వెళ్పోదామా? అన్నారు తను. "ఊహూ! ఇవాళ అమెరికన్ చౌప్సీ తినాల్సిందే" అన్నాను నేను. "ఎవడు కనిపెట్టాడో ఈ అమెరికన్ చౌప్సీ ని...." గొణుక్కున్నారు అయ్యగారు.

ఆదివారం కావటంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ కిలోమీటర్ నడిచాకా బస్టాప్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాం. సగం దూరం వెళ్ళాకా "దిగు దిగు" అని అర్జెంట్ గా బస్సులోంచి దింపేసారు. ఆ ఏరియాలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉందని తనకు గుర్తు వచ్చిందిట. అది వెతుక్కుంటూ ఓ అరగంట తిరిగాకా మొత్తానికి కనబడింది. హమ్మయ్య ! అనుకుని లోపలికి దూరాం. ఆర్డర్ ఇచ్చాం. పక్క రెండు టేబుల్స్ మీద కాలేజీకుర్రాళ్ళు. అప్పటికి టైం సాయంత్రo నాలుగైంది. "లంచ్ కని బయల్దేరి సాయంత్రం నాలుగింటికి అమెరికన్ చౌప్సీ తినే మొహాలూ మనమూనూ" అని జోకేసుకున్నాం. ఆవురావురని కడుపులో సింహాలు పరిగెడుతూంటే సర్వర్ తెచ్చిన చౌప్సీ అమృతంలాగ అనిపించింది. తినటం పూర్తయ్యిండి.పక్క టేబుల్ దగ్గరకు "నాన్ వెజ్ ఐటెమ్స్" వచ్చాయి. ఆ వాసన గిట్టని నాకు కడుపులో ఒక్కసారిగా తిప్పటం మొదలైంది. బిల్లు కట్టి బైటకు రమ్మని తనకు చెప్పి నేను బయటకు పరిగెత్తా...!


పాపను తీసుకుని రావటానికి వెనక్కు వెళ్ళి, దానికి కాస్తంత అన్నం అక్కడే పెట్టేసి మళ్ళీ ఇల్లు చేరే సరికీ ఆ రోజు తొమ్మిదయింది. "లేటయ్యిండిగా బయట తినేసి వెళ్దామా" అన్నారు తను. అప్రయత్నంగా "బాబోయ్ వద్దు.." అనేసాను. అప్పుడు రాత్రి అన్నం వండుకుని తిని పనులన్నీ అయ్యేసరికీ పదకొండు...ఎంత పని చేసింది "అమెరికన్ చౌప్సీ" అనుకున్నాం...!! ఉత్త పప్పయినా సరే... హాయిగా ఇంట్లో వండుకుని తిన్న సుఖమే సుఖం ఏంతైనా...అనిపించింది నూటొక్కోసారి...!
(అయినా మరో ఆదివారమో ఆపైవారమో "బయటకు" అనేసరికీ రెడీనే.....)


Monday, December 7, 2009

అన్నీ ప్రశ్నలే ?!?


మానవ మస్తిష్కం....
అణుబాంబును తయారు చేయగలిగింది.
చందమామపై అడుగులేయించింది.
తలరాతలను మార్చగలిగింది.
ప్రాణాలను పోయగలిగింది.
ఎన్నో వింతలను సృష్టించగలిగింది....కానీ...

ఈ మానవ మస్తిష్కం....
తనలోని మూర్ఖత్వాన్ని అణగార్చలేకపోతోంది...
తనలోని కౄరత్వాన్ని జయించలేకపోతోంది....
తనలో విచక్షణను పెంచలేకపోతోంది...
సమైక్యతాభావాన్ని బ్రతికించలేకపోతోంది...
ఎందుచేత...??

ఈ మానవ మస్తిష్కానికి....
చరిత్రపుటల్లో గడిచి నిలిచిన వందల ఉద్యమాలు ఏం నేర్పనేలేదా?
శాంతిమార్గాన్ని బోధించిన గంధీమహాత్ముని బోధలసారం అర్ధమైందింతేనా?
సామాన్యమానవుడికి కలుగుతున్న నష్టాన్ని గమనించనేలేదా?
వృత్తుల్లో, పనుల్లో, జీవనాల్లో స్థంభించిపోయిన నిశ్శబ్దపు హాహాకారాలు వినబడవా?
ఎంతో చెమట నిండి ఉన్న, ఏ పాపం ఎరుగని అమాయకుల ఆస్తి నష్టం కనపడదా?
ఎందుచేత...??

అసలు సమస్యకు పరిష్కారం ఆత్మహత్యలు కాదని తెలియదా ఈ మానవ మష్తిష్కానికి?
భగవంతుడు ప్రసాదించిన అందమైన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకిలేదని తెలియదా?
చావే సమస్యలకు పరిష్కారమైతే ప్రపంచ జనాభా ఈపాటికి సగమై ఉండేదేమో కదా..?!
మానవ మష్తిష్కాంలో ఈ కల్లోలం...అస్థిమితం ఎందుచేత?
ఎందుచేత...??

......................................................................
గడిచిన వారాంతంలో జరుగుతున్న ఘటనలతో ఏ రాజకీయాలూ తెలియని ఒక సామాన్యవ్యక్తిగా నా మనసులో చెలరేగిన భావాలివి...ఎగసిన భావోద్వేగాలివి...అందులో మిగిలిన ప్రశ్నలివి....
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవైనా... అవి నాలో మిగిల్చిన వేదన అనంతం...

Sunday, December 6, 2009

ట్రాఫిక్ సిగ్నల్


మధుర్ భండార్కర్ తీసిన, కునాల్ నటించిన "ట్రాఫిక్ సిగ్నల్" గురించి కాదు నేను రాయబోయేది... నిత్యం మనం ప్రయాణీంచే రోడ్డు మీద మనకెదురయ్యే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి...అక్కడ మనకు ఎదురయ్యే, మనల్ని వ్యాకులపరిచే వతావరణం గురించి..!దాదాపు పది పన్నేండేళ్ళక్రితం నేను ఓ పదిరోజులకని ఈ ఊరు వచ్చినప్పుడు మా అన్నయ్య బండి మీద వెళ్తూ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మొదటిసారి లోనయ్యాను ఈ వ్యాకులతకి.

చిరిగిన బట్టలతో దీనంగా, చింపిరి జుట్టుతో, జాలిగొలిపేలాంటి చూపులతో అడుక్కుంటున్న పిల్లలని, వృధ్ధులని...చూసి మొదట చేతికందిన చిల్లర లెఖ్ఖపెట్టకుండా ఇచ్చేసాను. కానీ ప్రతి చోటా ఇదే దృశ్యం. ఇలాంటివారే మరి కొందరు. అప్పుడర్ధమైంది ఇదొక వృత్తిగా మారిందని. గుళ్ళు, సినిమాహాల్స్, ఎక్కువ జనసందోహం ఉండే ప్రాంతాలు, పర్యాటక స్థలాలు మొదలైన ప్రదేశాలతో పాటూ అడుక్కోవటానికి దొరికిన సులువైన,కొత్త ప్రదేశాలు ఈ "ట్రాఫిక్ సిగ్నల్స్". అప్పటి నుంచీ ఈ ఊరొచ్చిన ప్రతిసారీ, ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో చాలా చోట్ల చూస్తూనే ఉన్నాను. ఆ వ్యాకులతను అనుభవిస్తూనే ఉన్నాను. ఒకే రోడ్డులో మళ్ళీ మళ్ళీ వెళ్తూంటే అదే మనుషులు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు..అదే రీతిలో అడుక్కుంటూ..!! ఆఖరికి మొన్న బస్సులో వెళ్తూంటే ఒక సిగ్నల్ దగ్గర ఆగిన బస్సు కిటికీ లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను తాకింది..ఏదో ఆలోచనలో మునిగి ఉన్న నేను అద్దిరిపడ్డాను...చూస్తే ఒకతను...చేయి చాచి డబ్బులు అడుగుతున్నాడు...ఆటోల్లోకే కాదు...బస్సుల్లోకి కూడా చేతులు దూర్చేస్తున్నారే? అని ఆశ్చర్యపోయాను.

విచిత్రమేమిటంటే..ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండేవాళ్ళందరూ మామూలుగా ఉండరు. అతి దరిద్రంగా, అతి బాధాకరంగా, చూడగానే మనసు ద్రవించిపోయే వేషాల్లో ఉంటారు. ఎంతో కొంత ఇచ్చి ముందర కళ్ళ ముందు నుంచి పంపేయాలి బాబోయ్...అనిపించేలా ! అలా కావాలనే ఉంటారేమో వాళ్ళు...అనిపిస్తుంది నాకు. బక్కచిక్కిన ఒక మగవాడిని భుజాన వేసుకున్న ఒక స్త్రీ, గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడిని వీపుక్కట్టుకున్న స్త్రీలు, కళ్ళు,కాళ్ళు లేక మరో మనిషి ఆసరాతో నిలబడి అడుక్కునేవాళ్ళు కొందరు, ఆటో ఆగగానే లోపలికి చేతులు పెట్టేసి డబ్బులు ఇచ్చేదాకా భయపేట్టేసేవాళ్ళు కొందరు, ఆకలి ఆకలి అని కడుపు చూపించి బెదిరించే రౌడి రకపు పిల్లలు కొందరు..ఇలా ఎన్నో రకాల జనాలను చూసి చూసి జుగుప్స కలుగుతుంది. భయం కలుగుతుంది. బాధ కలుగుతుంది. వేదన పెరుగుతుంది.

బాధ ఎందుకు అంటే వాళ్ళకు డబ్బులు వేసి ప్రోత్సహించనూ లేము, అలా అని ఇవ్వకుండా మనసుని ఇబ్బంది పెట్టనూలేము. మనం వృధాచేసే వాటిల్లో ఈ ఒకటి రెండు రూపాయలే ఎంత? అని వేసేస్తూ ఉంటాము.కానీ ఇలా కొన్ని వందల ఒక్క రూపాయిలు అడుక్కునేవాళ్ళకు ఆదాయాన్ని పెంచుతున్నాయి. సోమరితనాన్ని పెంచుతున్నాయి. మరిన్ని దొంగ వేషాలు వెయ్యటానికి పురిగొల్పుతున్నాయి.ఎందుకిలా? అని ప్రశ్నించుకుంటూనే ఉన్నాను...జనాలను భయపెట్టి, బాధపెట్టి డబ్బులు అడుక్కునే ఈ పధ్ధతి ఏమిటి? ఎవరూ దీని గురించి పట్టించుకోరా? అనుకుంటూంటాను.

ఏదో హడావుడిలోనో, రకరకాల ఆలోచనలతో పరధ్యానంగానో, పని వత్తిడిలో హడావిడిగానో ప్రయాణిస్తూ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన ప్రజలకు, ఉన్న వేదననో, లేని వేదననో పెంచేలాగ కనిపించే అడుక్కునే వాళ్ళ వేషభాషలు మరింత కంగారుకు,చికాకుకూ గురి చేస్తాయి. చేస్తున్నాయి. మన ఈ వ్యాకులత, చికాకే వాళ్ళకు డబ్బు ఆర్జించి పెడుతోంది. కొందరు అడుక్కునే పిల్లలను చిన్నవయసు నుంచే మరింత సోమరిగా తయారు చేస్తోంది. సులువుగా డబ్బు సంపాదించే మార్గం ఇదేనని వాళ్ళను నమ్మేలా చేస్తోంది. కానీ ఇది మారాలి. అన్ని చోట్లా మారటం అసంభవం కాబట్టి కనీసం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళనైనా డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగితే ఎంతో బాగుంటుంది.

సిటీల్లో బెగ్గర్స్ ను కంట్రోల్ చేసే "స్పెషల్ డిపార్ట్మెంట్" ఒకటి ఉందని, దానికి ఒక "ఐ.ఏ.యస్.ఆఫీసరు" ఇంచార్జ్ ఉంటారని తెలుసు కానీ దాని పేరూ వివరాలూ నాకు తెలియవు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కలగజేసుకుని ఈ "ట్రాఫిక్ సిగ్నల్" దగ్గరకు బెగ్గర్స్ ను రానీయకుండా అదుపు చేయగలిగితే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ మధ్యన "Times of india" లో మిలియనీర్ బెగ్గర్స్ అంటు ఒక ఆర్టికల్ పడింది. అది దాచి దాని మీద రాద్దామనుకునే లోపూ ఆ పేపర్ మాయమైపోయింది ఇంట్లో. ఈ లోపూ మొన్న బస్సులో వెళ్తూంటే జరిగిన సంఘటన ఈ టపాకు మూలమైంది. ఈ టాపిక్ కు రిలేటెడ్ రెండు ఆర్టికల్స్ నెట్ లో దొరికాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవవచ్చు --
http://timesofindia.indiatimes.com/india/Beggar-in-India-is-a-millionaire-in-Bangladesh/articleshow/3256583.cms

http://www.indianofficer.com/forums/current-issues/5887-beggary-india.html

Thursday, December 3, 2009

"Paa" పాటల కబుర్లు...

ప్రొమోస్ చూసి ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అని కొన్ని సినిమాల కోసం తెగ ఎదురు చూసేవాళ్ళం...నేను ముందు చూసానంటే నేను ముందు చూశాను అని చెప్పుకోవటమే గొప్పనుకునేవాళ్ళం....ఆ రోజులు పోయాయి...
కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి నేనొక సినిమా కోసం ఎదురుచూస్తున్నాను...

అది "Cheeni kum" డైరెక్ట్ చేసిన ఆర్.బాలకృష్ణన్ తీసిన మరొక హృద్యమైన చిత్రం "Paa" కోసం. 'హృద్యమైన' అని చూడకుండానే ఎలా చెప్తున్నానంటే...."చీనీ కమ్" చూసాకా వచ్చిన భరోసాతో."చీనీ కమ్" నాకు చాలా నచ్చేసింది. కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుందని నా సిక్స్త్ సెన్సె చెబుతోంది. అది తప్పో రైటో మళ్ళీ వారం తేలుతుంది.Dec 4th న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆ మధ్యన ఎప్పుడో ఓ సారి చూశాను టి.వి లో.

ఇక "Paa" కధ లోకి వచ్చేస్తే.. దీనిలోని ప్రత్యేకతలేమిటంటే తండ్రి అభిషేక్ బచ్చన్, అతని 13ఏళ్ళ కొడుకుగా అమితాబ్ నటించారు. "ప్రోజీరియా" అనే అతి అరుదైన genetic disorder వల్ల 13ఏళ్ళకే మరో ఐదింతల వయసున్నవాడిలా తయారయ్యే పిల్లవాడి పాత్ర అమితాబ్ ది. ఇంకో విశేషం ఏంటంటే "Mrs. Doubtfire" సినిమాలో రోబిన్ విలియమ్స్ కు మేకప్ చేసిన Stephen Dupuis ఈ సినిమలో అమితాబ్ కు మేకప్ చేసారట.ఆ తండ్రీ కొడుకుల బంధం చుట్టూ కధ తిరగాడుతుందని వినికిడి. పిల్లవాడి తల్లి "విద్యా బాలన్"
గైనకాలజిస్ట్ ట.

ఇవాళ అనుకోకుండా ఈ సినిమాలోని ఒక పాట చూసాను ఏడ్స్ లో.
"गुम सुम गुम...गुम सुम हो क्यो
गुम सुम गुम..गुम सुम हो तुम..."

ఇదేమిటి ఇదేదో తెలిసిన ట్యూన్ లా ఉందే...అని ఆలొచిస్తే గుర్తుకొచ్చేసింది...నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి...
"ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది..."
ఈ పాటలో నాకు బాగా నచ్చేది "లాల్లా లలలల లలలల లలలల... లాల్లా లలలల లలలల లా...." అనే హమ్మింగ్...జానకిగారి గొంతులో "రోలర్ కోస్టర్" తిరిగినట్లు సులువుగా మలుపులు తిరుగుతూ సాగే ఈ రాగం నా మనసుకు ఎంతో హత్తుకుపోతుంది....
ఇళయరాజా తనదైన బాణిలో కట్టిన ట్యూన్ ఇది...ఇన్నాళ్ళకు మళ్ళీ హిందీ పాట కోసం వాడుకున్నారు. కాకపోతే హిందీలో ఇది ఒక కోరల్ సాంగ్ . అందుకని ట్యూన్ బాగున్నా సోలో సాంగ్ కాకపోవటం వల్ల తెలుగు పాటే బాగుంది అద్భుతంగా అనిపించింది.

తన పాటలను తానే మళ్ళీ వాడుకోవటం ఇళయరాజాకు అలవాటే. "అన్వేషణ"లో "ఇలలో కలిసే.." పాట బాణీ ని మళ్ళీ "అభినందన" లో "ఎదుటా నీవే.." కోసం వాడుకున్నారు. అసలు ముందు "అభినందన " కోసమే చేసారుట. అన్వేషణ ముందుగా రిలీజ్ అవటంతో అదే ముందు చేసారనుకుంటాం. ఎక్కడో ఇంటర్వ్యూలో చదివిన గుర్తు.
"చీనీ కమ్" లో కూడా ఒక పాట ఉంది --
"सूनी सूनी खॊयी खॊयी आंखॆ मॆरी डूडॆ तुझॆ ही
कब सॆ... हा कब सॆ
अब आवॊगी तब आवॊगी कब आवोगी पूछॆ मे यही
खुद सॆ... हा खुद सॆ
मै हू यहा..तू है कहा..आहे मॆरी सुन..."
ఈ పాట సినిమాలో వినగానే తెలుగు పాట గుర్తుకొచ్చేసింది.


"మౌనరాగం" సినిమాలో "మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో..ఏలా అదేలా?.."

డబ్బింగ్ పాట కావటం వల్ల సాహిత్యం కొంచెం నవ్వు తెప్పించినా ఈ ట్యూన్ చాలా బాగుంటుంది. కానీ మంచి సాహిత్యం అందటం వల్ల హిందీలో ఈ పాట ఇంకా బాగుంటుంది.

"paa" మిగతా పాటలు కూడా బాగున్నాయి. అన్ని కూర్చుని డౌన్లోడ్ చేసేసా...:)
"हिच्की हिच्की...",
అమితాబ్ తో పాడించిన "मॆरॆ पा..",
"मुडी मुडी कहा कहा मै इत्तॆफाक सॆ...",
"उडी उडी हवा उडी.." బాగున్నాయి.
ఇక "हलकॆ सॆ बॊलॆ..कलकॆ नजारॆ.." వింటుంటే "శ్రీ కనకమహాలక్ష్మీ డాన్స్ ట్రూప్" లో బాగా వాడిన మ్యూజిక్ అని గుర్తుకొచ్చింది. అచ్చం అదే...సినిమా బాగా తెలిసినవాళ్ళకు తెలుస్తుంది. ఆ డైలాగుల కోసం అస్తమానం పెట్టుకుని చూసేవాళ్లం మేము...అందుకని బాగా తెలిసింది నాకు.

ఇదేమిటి నేనేమన్నా "పా" సినిమా పబ్లిసిటీ బోర్డ్ మెంబర్నా...?! తీరా సినిమా బాలేకపోతే మళ్లీ నన్ననేరు...


ఇక ఆపుతా...
ఇంతకీ నేను ఎప్పటికి చూస్తానో..??!!


నెలలోపు చూస్తే గొప్పే. లేకపోతే ఆరునెల్లలో టి.విలో ఎలాగూ వస్తుంది..... :))

Tuesday, December 1, 2009

బంధుత్వాలు


(వీరిలో మా పాపా లేదు..దొరికినవాళ్ళకు తీసాము మళ్లీ వాళ్ల మూడ్ మారకుండా...)

"పుణ్యం కొద్దీ పురుషుడు....దానం కొద్దీ బిడ్డలు...."అంటారు.
మన స్వభావాన్ని బట్టి, ఎంపికను బట్టీ "మిత్రులు" ఏర్పడతారు.
మరి మన రక్త సంబంధం ద్వారా మనకు దగ్గరయ్యే బంధువులు....
బంధువులు "భగవంతుడు ఇచ్చిన మిత్రులు" అని నా అభిప్రాయం. వారే స్నేహితులు, సన్నిహితులు అయితే...అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? పైన రెండు వాక్యాల తాలూకు అదృష్టాలతో పాటూ భగవంతుడు నాకా అదృష్టాన్నికూడా ఇచ్చాడు. మా బంధువులందరం ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉంటాము. కజిన్స్ అందరం సొంత అక్క చెల్లెళ్ళలాగ...సొంత అన్నదమ్ములలాగ...!


పెళ్ళిళ్ళకీ, స్పెషల్ అకేషన్స్ కీ అందరం కలుస్తూ..సరదాగా గడిపేస్తాము. మా నాన్నకు ఒక్కరే అక్క. ఇంకెవరూ చుట్టాలు లేరు...ఆవిడను మా రెండవ మేనమామకు ఇచ్చారు. వాళ్ళ పెళ్ళి సమయానికి అమ్మకు ఒక ఏడాదిట. మిగతావాళ్ళంతా చిన్న చిన్న పిల్లలుట. చిన్నన్నయ్య,చిన్నవదినా అంటూ ఎంతో కలసిపోయారు వాళ్ళంతా. కాబట్టి నాకు రెండు వైపుల నుంచీ ఒకే బంధువులు. అందరం ఒక గూటికి చెందినవాళ్ళమే.

తాతగారి సంతానం నలుగురు అబ్బాయిలు,నలుగురు అమ్మాయిలు. చిన్నప్పుడు అందరం తలో ఊళ్ళో ఉండేవాళ్ళం. కానీ సంవత్సరానికి ఓసారైనా తాతగారి ఆబ్దీకానికి అందరం కలిసేవాళ్ళం. అప్పట్లో తాతగారిల్లంతా మా పిల్లల కేరింతలతో, అల్లర్లతొ దద్దరిల్లుతూ ఉండేది. కాస్త పెద్దయ్యాక శెలవుల్లో పిన్నిలు, పెద్దమ్మల ఊళ్ళు వెళ్ళాలంటే అదో పెద్ద ప్రోసెస్. నాన్న కొంచెం స్త్రిక్ట్. ఎక్కడికీ పంపేవారు కాదు. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినా టైం ప్రకారం వెళ్ళి, చెప్పిన టైం కు వచ్చేయాలి. కాస్త లేటైతే నాకోసం బయల్దేరిపోయేవారు. ఓసారేమైందంటే...అమ్మో అది వేరే కధ...(ఇంకో టపాలో..)

ఈ కధలోకి వచ్చేస్తే, శెలవుల్లో ఊళ్ళు వెళ్ళటానికి ముందు అమ్మని కాకాపట్టాలి. ఆ తరువాత కూడా నాన్న ఒప్పుకునేవారు కాదు. అప్పుడు పిన్ని చేతో, పెద్దమ్మ చేతో మాట్లాడించేవాళ్ళం...వాళ్ళు అడిగితే మొహమాటానికి ఇంక అయిష్టంగా ఒప్పేసుకునేవారు..! గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక నన్ను ఆ ఊరు తీసుకెళ్ళే మనిషి కోసం వెతుకులాట. ముందుగానే బట్టలు సర్దుకుని రెడీగా ఉన్న నేను, బాబయ్యో, అన్నయ్యో ఎవరో ఒకరు దొరికితే వాళ్ళతో వెళ్పోయేదాన్ని..నర్సాపురం, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, జగ్గయ్యపేట...ఇలా ప్రతి ఏడాదీ శెలవుల్లో బానే వెళ్ళేదాన్ని ఊళ్ళు. కొన్నిసార్లు అమ్మావాళ్ళు కూడా వచ్చేవారు.

ట్రాన్ఫర్ మీద ఒక మావయ్య విజయవాడ వచ్చాకా ఇక అందరూ మా ఊరే వచ్చేవారు. అమ్మమ్మను చూడటానికి. అందరం ఒకచోట కలిసి నవ్వులూ, కేరింతలూ, కబుర్లూ...ఆ సందడే వేరుగా ఉండేది. కానీ రాను రానూ చదువులూ, ఉద్యోగాలతో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అందరం కలిసి మూడు నాలుగేళ్ళు దాటిపోవటం మొదలైంది. కుటుంబంలోని ప్రతి పెళ్ళికీ తప్పక కలిసే కజిన్స్ అందరం పెళ్ళిళ్ళయ్యాకా అసలు కలవటమే తక్కువైపోయింది...!! ఉత్తరప్రత్యుత్తరాలు, ఫోనులూ ద్వారా అందరి విశేషాలు అందరికీ తెలుస్తున్నా, కళ్ళరా చూసుకుని కబుర్లాడే అపురూప క్షణాల కోసం అందరం తపించిపోయే పరిస్థితికి వచ్చాం. కాంటాక్ట్ లో ఉండటానికి కజిన్స్ అందరమూ యాహూ గ్రూప్స్ లో ఒక గ్రూప్ తయారుచేసుకుని గ్రూప్ మైల్స్ ద్వారా అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉంటాం.

ఇప్పుడు అనుకోకుండా అమ్మావాళ్ళు ముగ్గురు అప్పచెళ్ళెళ్ళూ, ఒక మవయ్యా ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. ఏడుగురం కజిన్స్ కూడా ప్రస్తుతానికి ఇక్కడికే చేరాం. కానీ విచిత్రం ఏమిటంటే ఒకే ఊళ్ళోని అందరం ఒకచోట కలిసి రెండేళ్ళు అవుతోంది...దూరాలూ, ఉద్యోగాలూ, సమయాభావాలు...భవబంధాలూ...అన్నీ కారణాలే..హలో అంటే హలో అని ఫోనుల్లో మాట్లాడుకోటానికి కూడా నెలలు పడుతోంది. ఈ లోపూ మా పదహారుమంది మనుమలలో పెళ్ళిళ్ళైన వారికి మొత్తం కలిపి ఇరవై పైగా పిల్లలు... వాళ్ళూ పెరిగి పెద్దయిపోతున్నారు. వాళ్ళు పెద్దయ్యాకా "అమ్మమ్మ చెల్లి కూతురు కొడుకుట.." అనుకునే పరిస్థితి వాళ్లకు రాకూడదని మా ప్రయత్నం. మా బంధుత్వాలను, సన్నిహితాలనూ పిల్లలకు కూడా పంచాలని మా ప్రయత్నం. అందుకే ఇక ఏమాత్రం వీలు దొరికినా ఈ మధ్యన కలిసి పిల్లలకు పిల్లలకూ స్నేహాలు పెంచుతున్నాము.

ఇప్పుడు ఈ పిల్లలంతా మమ్మల్ని "కార్తీక్ అమ్మ", "సంకల్ప్ అమ్మమ్మ", "సంజన తాతగారు" అంటూ గుర్తిస్తుంటే మేమంతా చాలా ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వపు స్నేహాలను ఇలాగే మరిన్ని తరాలకు అందివ్వాలని ఆశిస్తున్నాం. మొన్న వీకెండ్ జరిగిన రెండు గృహప్రవేశాలలో మళ్ళీ అనుకోకుండా అందరం కలవటం...మా మా పిల్లలంతా సరదాగా ఆడుకోవటం మనసులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక మాకు "నేటి కలయికలే రేపటి పిల్లల బంధుత్వాలకు పునాదులు" అనే నమ్మకం కుదిరింది.

Monday, November 30, 2009

కొన్ని ఫోటోలు...

మా అమ్మాయికి సవరం పెట్టకుండా నేను వేసిన వాల్జెడ...

మా మరదలికి నేను పెట్టిన గోరింటకు...పండాకా కన్నా ఇలా పెట్టగానే చూసుకుంటే బాగుంటుంది నాకు...

పండిన గోరింటాకు...
ఇవాళ స్కూలు శెలవు కావటంతో మా అమ్మాయి చేసిన కాలక్షేపం పని....


ప్రస్తుతానికి ఈ ఫోటోలను చూడండి.. రేపు మరిన్ని కబుర్లతో...

Wednesday, November 25, 2009

ఈ పూలు ఏమిటో చెప్పుకోండి..?


పూలు ఏమిటో చెప్పుకోండి..?


నేనే చెప్పేస్తాను....ఇవి "కుంకుమ పూలు" (Saffron flowers). ఆ పువ్వు మధ్యలో కనిపిస్తున్నదే మనం వాడే కుంకుమపువ్వు. ఇప్పుడే దూరదర్షన్ లో "కశ్మీర్ నామా" అనే కార్యక్రమం వచ్చింది..దాంట్లో తెల్లని మంచు కురుస్తున్న రోడ్లు....ఇంకా కొన్ని ప్రదేశాలూ అవీ చూపించారు...సన్నగా, తెల్లగా చెట్లని కప్పేస్తూ కురుస్తున్న మంచు ఎంత బాగుందో...

ఇంకా ఇదిగో ఈ కుంకుమ పువ్వుల తోటలు , వాటిని కోయటం అవీ చూపించారు. వంటల్లోకి, పాలలో వాడటం తప్ప ఇంతవరకూ నాకూ తెలీదు ఈ పూలు ఇలా ఉంటాయి అని...ఆశ్చర్యంగా అసలు ఆకు అనేదే కనబడటం లేదు. మట్టి లోంచి ఆ పువ్వు ఒకటే కనిపిస్తోంది. నాకయితే పెద్ద వింతలా ఉంది...అన్దరికీ చూపిద్దామని ఇలా ఫోటో తీసాను కానీ..మన దూరదర్షన్ వాళ్ళ ప్రసారం క్లారిటీ ఇంత బాగుంది...వేరే ఏ చానల్ లోంచి ఫోటో తీసినా అద్భుతంగా వస్తుంది. DD క్వాలిటీ మాత్రం నా చిన్నప్పటి నుంఛీ ఒకలాగే ఉంది...!!

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇది బ్లాగ్మిత్రుల కోసం:
రెండు శుభకార్యాల ఆహ్వానాల నిమిత్తం....నేను సైతం ఒక చిన్న విరామన్ని తీసుకుంటున్నాను...
ఓ నాలుగు రోజుల పాటు మీరంతా హాయిగా, స్వేచ్చగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి...
మళ్ళీ సోమవారానికల్లా పెద్ద సుత్తితో నేను రెడీ అయిపోతాను కదా...
వెళ్ళిన చోట శ్రీలక్ష్మి లెవెల్లో "బ్లాగంటే...." అంటూ ఆహ్వానితులందరికీ బ్లాగ్లోక విశేషాలు చెప్పి
నా బ్లాగ్లోక వియోగభారాన్ని తగ్గించుకోటానికి ప్రయత్నిస్తాను...
అంత సమయం చిక్కకపోతే కనీసం నూతన్ ప్రసాద్ లాగ "మా బ్లాగులు మూడువేలు...."
అనయినా చెప్పే ప్రయత్నం చేసి బ్లాగులందు నా విశ్వాసాన్ని చాటి చెప్పుకుంటాను...

ఉండనేమో అని వ్యాఖ్య రాయటం మానేరు...
రోజంతా బయట పనులున్నా ఇవాళ్టికి ఇంట్లోనే....
రాత్రికి వచ్చిన వ్యాఖ్యలు ప్రచురించుకుని రేపొద్దున్న వెళ్తాను...
సోమవారం దాకా శెలవు మరి.....!!

ఇది చూసి శ్రీవారి వ్యాఖ్య :
"ఈ నాలుగురోజులూ హమ్మయ్యా అని హాయిగా,గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు పాపం వాళ్ళంతా ..." :( :(

Tuesday, November 24, 2009

favourite flowers...


అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో రోడ్డు మీద....ఏదైనా సందులోకి అడుగుపెట్టగానే గుప్పని మత్తెక్కించే ఈ పూల పరిమళం ముక్కుపుటాల్లోంచి మనసులోకి జారుకుంటుంది...గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని అబ్బా...అనుకోని వారుంటారా అనుకుంటూ ఉంటాము మేము. వాసన వచ్చిన మొదలు ఆసందులోనో..ఆ విధిచివరలోనో ఎక్కడో దాగున్న ఆ చెట్టు కోసం కళ్ళు వెతుకుతాయి...పొడుగాటి వృక్షాలు...వాటికి చిన్న చిన్న ముదురాకుపచ్చ ఆకులు...గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న పొడుగు కాడలున్న తెల్లని పూలు....ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం ఈ పువ్వులది.....

ఇవి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పువ్వులు...ఫోటో తీసుకోవటానికి ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఇన్నాళ్ళూ వెతుకుతున్నాను...నిన్న అనుకోకుండా ఒకచోట దొరికాయి...వెంఠనే కెమేరాలో బంధించేసాను..!! కాడ చాలా పొడుగ్గా ఉంటుందని వీటిని మేము "కాగడామల్లి" అంటాము. ఆ మధ్య చిన్నిగారు ఒక టపాలో వీటిని "పొన్నాయి పూలు" అంటారని రాసారు. పేరు ఏదైనా మత్తెక్కించే వీటి సువాసన మాత్రం అమోఘం...!!

చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఈ పూలు ఎక్కద దొరికినా బోలెడు ఏరి తెచ్చేకునేవాళ్ళం...వాటిని నేను నీళ్ళు పోసిన పొడుగాటి గ్లాసులో వేసి ఫ్రిజ్ మీదో , టి.వి మీదో పెట్టేదాన్ని...రెండు మూడు రోజులు పాడవకుండా ఉండేవి అవి...నేనెక్కువ ఏరానంటే నేనెక్కువ ఏరానని గొప్ప చెప్పుకోవటం... అవన్నీ మధురస్మృతులు...

ఒకసారయితే రోడ్డు మీద ఎక్కడొ చిన్న చిన్న మొక్కలు చూసి తవ్వి తెచ్చి నాన్న,తమ్ముడూ వాటిని ఇంటి ముందు నాటారు. మేము ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలయి వాటికి బోలెడు పువ్వులు పూస్తున్నాయిట...అవి పెద్దయ్యే సమయానికి అక్కడ లేమే అనుకుంటూ ఉంటాము...

Monday, November 23, 2009

నా స్వామి పుట్టినరోజు

ఇవాళ నా స్వామి పుట్టినరోజు సందర్భంగా నాలుగు మాటలు....

"Be aware that your Kindness
maybe treated as your weakness
but still be Kind.

Be aware that your help to others
may go unheeded and unnoticed
but still be Helpful.



Be aware that your faith in God and Love for Humanity
manybe taken as Orthodoxy and foolishness
but still have faith in God.

Be aware that Good you do today
will be forgotten tomorrow
but still be Good.

Be aware that honesty and frankness
make you Vulnerable
but still be Frank.

Be aware that virtues and values of life
may mean little for people
but still be Virtuous."

--- Sri Satya Sai Baba.


చాలా ఏళ్ళ క్రితం ఒక పెద్ద చార్ట్ మీద స్వామి చెప్పిన ఈ కొటేషన్ రాసుకున్నాను. అక్షరాలను దిద్దిన రంగు వెలసిపోయినా ఇంకా ఇవాల్టికీ ఆ చార్ట్ నా తలుపుకు అంటించే ఉంది. రాసుకోవటమే కాదు ఇంకా పాటిస్తూనే ఉన్నాను.....అలా చేయటం వల్ల ఎన్ని బాధలు,కష్టాలు ఎదురైనా సరే. స్నేహాన్ని,మంచితనాన్ని, నిజాయితీని, నిష్కపటమైన భావ ప్రకటనని, భగవంతునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఇది నాకు నా స్వామి ప్రసాదించిన జీవనపాఠం.

స్వామి గురించిన నా నమ్మకం నిన్నదో, మొన్నదో కాదు.....ఇంట్లో మా తాతగారి కాలం నుంచీ ఉన్నది. కాకపోతే ఊహ, ఆలోచన ఏర్పడ్డాకా నా అంతట నేను చేసిన కొంత సాధన వల్ల కలిగిన అవగాహన కొంత...నా దృష్టిలో నేను స్వామి పాదాల చెంత చోటు కోసం పరితపించే చిన్ని గడ్డిపువ్వును మాత్రమే ...!!

ఇహలోక బంధాలన్నీ ఇహంలోనేనని....చిట్టచివరికి నేను చేరాల్సిన గమ్యం మరోకటుందని...అది చేరటానికి సాగించాల్సిన పయనం బోలెడని...ఆ మార్గం నాకు చూపే మార్గదర్శి నా స్వామి అని నేనెవరికి చెప్పాలి...??! కొందరి దృష్టిలో నా నమ్మకం గుడ్డిదే కావచ్చు. కానీ రాయిని సైతం భగవంతునిగా కొలిచే మన "పుణ్య భూమి"లో మనిషి గుర్తించాల్సింది మనం పూజిస్తున్నది దేనినని కాదు...అందులో ముఖ్యమైనది మనకు ఉండే " పూర్తి నమ్మకం" అని నా అభిప్రాయం.

అయితే అన్నివేళలా తోడుగా నాకు స్వామి ఉన్నారన్న సత్యాన్ని నేను ప్రాపంచిక బాధల్లో పడి మరచి, కలత చెందిన ప్రతిసారీ ఏదో రూపంలో వచ్చి "నేనున్నను" అని నా స్వామి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సంఘటన నాకు మొన్న జరిగింది...అనుకోకుండా మా ఇంటికి వచ్చిన బంధువొకరు "స్వామి డివోటీ" అవ్వటం...మేము బోలెడు స్వామి కబుర్లు చెప్పుకోవటం...నన్ను నేను తేలిక పరచుకోవటానికి, నేను మరుస్తున్న నా అసలైన ఆధ్యాత్మిక పయనాన్ని గుర్తుచేయటానికి ఎంతో ఉపయోగపడ్డాయి.

ఈ విషయంలో చర్చలూ, వాదనలు చేయదలుచుకోలేదు...అందుకే కామెంట్స్ మోడ్ తీసేసాను.
ఇవాళ కేవలం నా స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని...అంతే..!!




Saturday, November 21, 2009

విశాలనేత్రాలు - 3




(ఈ నవల మొదటి భాగం, రెండవ భాగం తరువాత ఇది ఆఖరి భాగం....)


రామానుజుని ప్రధాన శిష్యులైన గోవిందయతి, యజ్ఞమూర్తి, అనంత సూరి ,దాశరధి మొదలైన ప్రముఖులందరు వ్యాకరణ,వేదాంత, చతుర్వేదాలలో విద్వాంసులు. వారెవరికీ రంగనాయకుని మీద సదభిప్రాయం ఉండదు. సామాన్య రైతు కుమారుడు, ఒక వెలయాలిని వెంటబెట్టుకుని శ్రీరంగం వచ్చి నివసిస్తూ, మద్యపానం,సాముగారడీలు తప్ప భక్తిశ్రధ్ధలేమాత్రం కానరాని అతని పట్ల ఆచార్యులకేందుకంత అనుగ్రహ వాత్సల్యాలో వీరెవరికీ అంతుపట్టదు. శ్రీరంగేశుని దేవాలయానికి వెళ్ళేప్పుడు "దాశరధి" భుజం మీద ఆనించే యతీశ్వరుని చెయ్యి రాను రానూ రంగనాయకుని భుజం మీదకు తిరిగేంతటి పరమాత్మీయ దృష్టిని చూసి శిష్యులందరూ తప్పనిసరిగా అతన్ని గౌరవించడం మొదలుపెడతారు.


ఒకరోజు దేవాలయంలో రామానుజ శిష్యులు పఠిస్తున్న ద్రవిడ వేదపారాయణ దేవాలయం నలుమూలలా మారుమ్రోగుతున్న వేళ తన్మయంతో పులకించిన రంగనాయకుని నోటి వెంట అప్రయత్నంగా ద్రవిడ వేదపాశురం వెలువడుతుంది. అమృతగళం కాకపోయినా ఆ గొంతులో పలికిన మాధుర్య భక్తిభావాలందరినీ ఆశ్చర్యపరుస్తాయి. పారవశ్యంలో అతడు రామానుజుని "సుదీర్ఘ విశాల విలోచనాల దర్శన భాగ్యం" ప్రసాదించమని అడుగుతాడు. మరునిముషమే రామానుజుని గొంతులో పలికిన ద్రావిడ వేద పాశురాల పరంపర, అ వెంఠనే అర్చకుల శ్రీసూక్త పురుషసూక్తాలతో దేవాలయం ప్రతిద్వనిస్తుంది. "అటు చూడమన్న" రామానుజుని నిర్దేశంతో రంగనాధుని నేత్ర యుగళిని దర్శించిన రంగనాయకునికి అపూర్వానుభూతితో అతిలోక విశాలమైన స్వామివారి రమణీయ విలోచన యుగళి కనబడుతుంది. తన్మయత్వంలో మూర్చపోతాడతను. స్వామివారి దివ్యనేత్రాల సందర్శన భాగ్యంతో తన జన్మ ధన్యమైందని భావిస్తాడు. అంతటి తాదాత్మ్యంలో కూడా హేమ ఈ దర్శనభాగ్యానికి నొచుకోలేదని వాపోతాడు.



ఆనాటినుంచీ అతని జీవితమే మారిపోతుంది. మద్యపానం, మైత్రీ సంబంధాలు అన్ని క్రమక్రమంగా సడలిపోతాయి. సంపాదనంతా వైష్ణవ మఠానికి ధారపోస్తున్న అతడిని చూసి హేమసుందరి కలవరపడుతుంది. ఆమెలో మార్పు, పూర్వాశ్రమంలో రామానుజుని భార్య తంజమాంబ వృత్తాంతం, రంగనాయకుని రాకపోకలవల్ల రామానుజుమఠంలో మొదలైయ్యే ఘర్షణలూ,మఠంలోకి అడుగిడనివ్వకుండా హేమారంగనాయకులకు జరిగే అవమానం.....ఏం జరిగినా వీడని రామానుజుని నిశ్చింత , యజ్ఞమూర్తి, దాశరధి ల అంతర్మధనం...ఇవన్నీ నవలలో ఎవరికి వారు చదివి ఆనందించి, అవగాహన చేసుకోవలసిన విషయాలు.



వృధ్ధ శిష్యులెవరికీ దక్కని "అష్టాక్షరీ మంత్రోపదేశం" చెయటానికి రామానుజులే స్వయంగా రంగనాయకుని ఇంత అడుగు పెట్టిన సన్నివేశం చదువుతూంటే పారవశ్యంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ అనాయాస అష్టాక్షరీ మంత్రోపదేశానికి కారణం " హేమరంగనాయకుల పరస్పర తపన,ప్రేమానురాగాలు,మల్లవిద్యపై రంగనాయకునికి గల ఏకాగ్రత, వివాహితులు కాకపోయినా పుణ్యదంపతులవలే జీవించిన వైనం, ఒకరి తప్పిదాలనొకరు క్షమించుకున్న వారి అన్యోన్యత , ఎన్ని కష్టాలొచ్చినా సడలని వారి ప్రేమానుబంధం " అని యతీశ్వరుని ముఖత: విని యజ్ఞమూర్తి ఆశ్చర్యపోతాడు. పరమేశ్వర సాక్షాత్కారం భక్తి, జ్ఞాన,కర్మ యోగల ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని మారుస్తూ, ప్రగాఢమైన మోహావేశాలు కూడా భగవంతుని సాక్షత్కారానికి పెద్ద మెట్టుగా తెలుపుతున్న రామానుజుని ప్రసంగాన్ని విని విడ్డూరపడినా సమర్ధించలేకపోతాడు.



యజ్ఞమూర్తి సంఘర్షణకు ఏం సమాధానం దొరుకుతుంది, మఠం మళ్ళీ పూర్వ వైభవాన్నెలా పొందింది, రంగనాయకుడు ఎలా వైష్ణవ పీఠాధిపతి అయ్యాడు, హేమాసుందరి రంగనాయకుల జీవితం మఠ పరిచర్యలకు ఎలా అంకితమైంది అన్న ప్రశ్నలకు నేను చెప్పగా మిగిలిన చాలా కొద్దిపాటి నవలా పఠనమే సమాధానం... !!

___________________________________________________________________
(మా పాపకు కొంచెం నలతగా ఉన్నందున పొద్దున్నే కుదరదేమో అని ఇప్పుడే ఈ టపా ప్రచురించేస్తున్నాను...)

Friday, November 20, 2009

విశాలనేత్రాలు - 2




(నిన్నటి తరువాయి...)


హేమసుందరి పరిచర్యలకు, ఆమెకు తనపైగల అసూయారహిత మక్కువకు, గాధానురాగానికి రంగనాయకుడు చలించిపోతాడు. ఆమె అడుగుజాడలలో నిలబడటానికి అర్హత ఉందా అన్న సంశయానికి వస్తాడు...శ్రీరంగనాధుని కరుణవల్లనే అటువంటి "సాధ్వీమణి" తనకు లభించిందని ఎంతో ఉప్పొంగిపోతాడు. ఇక ఆలసించకుండా తన మొక్కుబడి తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. కార్తీక పూర్ణిమ నాడు అన్నివిధాలా మంచి ముహుర్తం ఉందని తెలుసుకుని ఆరోజున ఉప్పొంగిన హృదయాలతో దేవాలయానికి బయలుదేరుతారు వారిరువురూ.


కార్తీక పూర్ణిమ నాడు ప్రొద్దుటే సరిగంచు ఉత్తరీయం, కుడి ముంజేతికి శ్రీరంగం మల్లయుధ్ధ ప్రవీణులు అతడిని మెచ్చుకుని బహుకరించిన పైడి కంకణం ధరించి; పుజా ద్రవ్యాలతో, పుష్పాలతో నిండిన బంగారు పళ్ళెంలో మొక్కుబడి అయిన పైడితిలకము, సువర్ణ విలోచన యుగళి పట్టుకుని, పూజాపుష్పాలు వాడకుండా లేత లేత తాటి మొవ్వుల ఆకులతో, శ్రీచందనం చేవకామతో తయారుచేయించిన పెద్ద గొడుగు ఎడమ చేతితో పట్టుకు నడక సాగిస్తాడు రంగనాయకుడు. గొడుగు అంచులకున్న మువ్వల సవ్వడితో హేమ కాలి అందెల ఘలఘలలు కలసిపోతాయి. హేమసుందరి ఆ రోజు లేత చిలకాకుపచ్చ మధుర పట్టు చీర,ఊదా రంగు రవిక, రకరకాల ఆభరణాలు ధరించి, సుదీర్ఘమైన శ్రీచూర్ణ తిలకానికి, చిన్నరి నెలవంక ఆకారంలో కుంకుమ రేఖ దిద్దుకుని, రంగనాయకుని అడుగుజాడల్లో ముందుకు సాగుతుంది.


ఈ దృశ్యమే పుస్తకం అట్టమీద ఉన్న బాపూబొమ్మ. నవలలో ఈ రెండు పేజీలలో వారిద్దరి గూర్చీ, శ్రీరంగనాధస్వామి ఆలయం తాలూకూ వర్ణన అద్భుతం. ఇంతకు మునుపు భక్తులెవ్వరు ఇవ్వని వారి వింత కానుకలను చూసి అర్చకుడు ఆశ్చర్యపడతాడు. హేమాంబ ధనుర్ధాసులన్న కొత్త పేర్లతో ,తండ్రి గోత్రంతో తమ ఇద్దరి పేరా స్వామికి సహస్రనామ పుజ చేయిస్తాడు రంగనాయకుడు. ఆ విధంగా ఆ క్షణాన స్వామివారి సన్నిధిలో తమ వివాహకార్యక్రమం పరిసమాప్తి అయ్యిందని రంగనాయకుడు సంతోషిస్తాడు. హేమ కనుదోయి కొలతలతో చేయించిన స్వామివారి కానుకలు చక్కగా అమరినందుకు వారిద్దరు ఎంతగానో సంతోషిస్తారు. ఇంటికి వెళుతూ అపూర్వ సౌందర్యంతో చూపరుల దృష్టినిట్టే ఆకట్టుకుంటూన్న ఆమె అందం ఎండపొడికి కందుతున్నదని గ్రహించి ఆమెకు గొడుకు అడ్డుపెట్టి నడక సాగిస్తాడు. జనాలు విడ్డూరంగా చూస్తున్నారని హేమ ఎంత వారించినా సిగ్గుపడని అతని అపారమైన ప్రేమ మీద మనకు హఠాత్తుగా ఎంతో గౌరవం ఏర్పడిపోతుంది.


సరిగ్గా అప్పుడే అయిదారుగురు కాషాయాంబరధారులైన యతీశ్వరులు వారికెదురౌతారు. వారిలో ఆజానుబాహుడైన ఒక యతీశ్వరునడు నిశ్చల విశాల నేత్రాలతో, చిరునవ్వుతో రంగనాయకుని పరిశీలిస్తూ కనబడతారు. రంగనాయకుని ఆడుగులు రెండు,మూడు నిముషాలు ఆగిపోతాయి. హేమ కళ్ళ కన్నా సివిశాలమైన, ఠీవి,రాజసం నిండిన ఆ సుదీర్ఘమూర్తి గంభీరదృష్టి అతడిని ఆశ్చర్యపరుస్తుంది. తమని దాటిపోయాకా కూడా వెనుదిరిగి తనను పరిశీలిస్తున్న ఆ నిశ్చల దృషిని అతను అవగాహన చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఆయనే "శ్రీమద్రామానుజ యతీంద్రులు" అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరేసరికీ వీధి అరుగు మీద తనకోసం "శ్రీమద్రామానుజుల మఠం" నుంచి వారు తనను చూడాలంటున్నారని వచ్చిన ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి చూసి మరింత కలవరపడిపోతాడు రంగనాయకుడు. అది అనుగ్రహమా, ఆగ్రహమా అనే సందిగ్ధంలో పడతాడు. రామానుజయతీంద్రుల మఠానికి వెళ్ళాలో వద్దోనని సందేహిస్తూనే మరొక రోజు గడిపిన అతడికి మర్నాడు ఇల్లు చేరేసరికీ మళ్ళీ అరుగు మీద "దాశరధి" ఎదురౌతాడు. ఇక తప్పనిసరిగా అతనితో మఠంలోకి అడుగు పెడతాడు రంగనాయకుడు.


అనేక సందేహాలతో మఠంలోకి అడుగుపెట్టిన రంగనాయకునికి "వచ్చావా నాయనా! ఇన్నాళ్లనుంచీ నీకోసమే ఎదురు చూస్తున్నాను !" అన్న రామానుజుని ఆప్యాయమైన పలకరింపు విడ్డూరంగా తోస్తుంది. ఆ తరువాత రంగనాధస్వామికి సమర్పించిన వింత కానుకల గురించి అడిగి..."ఆ అమ్మాయి నేత్రాలంత విశాలమైనవా?" అని ప్రశ్నిస్తారు. యతీశ్వరుల ఆసక్తికి ఆశ్చర్యపడిన అతను తాను అంతటి చక్కని కన్నులజంట ఎక్కడా చూడలేదనీ..హేమ తన ఇంట కాలుపెడితే ఆమె కన్నుల కొలతలతో స్వామికి మొక్కుబడి చెల్లించుకోవాలనీ అనుకున్నట్లు చెబుతాడు. అప్పుడు రామానుజులు "ఇంతకు ముందు నువ్వు కని విని ఎరుగనంతటి పెద్ద పెద్ద కన్నులున్నవి. చూపించనా?" అని అడుగుతారు. ఈ కొంటె ప్రశ్నకు నిర్ఘాంతపోయిన రంగనాయకుడు తనకా జన్మకు ఇంకేమీ అవసరం లేదనీ, వేరొకరివైపు కన్నెత్తి చూడదలచలేదనీ చెప్తాడు.


ఎంతటి ఆత్మీయులతోనైనా ఎనాడూ ప్రసంగించని మౌనమూర్తి ఈవేళ ఒక సామాన్య మల్లునితో చిరకాల మిత్రునితో మాట్లాడినట్లు సంభాషించటం ఆశ్రమవాసులందరికీ విచిత్రమనిపిస్తుంది. తరువాత నాలుగైదు రోజులకొకసారి, ఆ పై ప్రతిరోజూ రామానుజుని సందర్శించటం మొదలుపెడతాడు రంగనాయకుడు. ఈ రాకపోకలు హేమసుందరిలో అంతులేని ఆవేదనని రేపుతాయి. అటు రంగనాయకుని ఎడల ఆచార్యునికెక్కువౌతున్న మక్కువ మఠవాసులలోనూ అలజడి రేపుతుంది.


ఈ రాకపోకలు రంగనాయకుని జీవితాన్ని ఎంత పెద్ద మలుపు తిప్పాయో....రేపు తెలుసుకుందాం...:) :)

Thursday, November 19, 2009

విశాలనేత్రాలు

పిలకా గణపతి శాస్త్రిగారు సంస్కృతం,తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో పండితులు. కధకులు.నవలా రచయిత. అనువాదకులు. పత్రికా సంపాదకులు. ఆయన రచించిన "విశాల నేత్రాలు" ఆంధ్రపత్రికలో 1965,66ప్రాంతాల్లో బాపూగారి మనోహర చిత్రాలతో ధారావాహికంగా వెలువడింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నవలా బహుమతి లభించింది. చారిత్రాత్మక నవలను "లైఫ్ ఆఫ్ రామానుజ" అనే ఆంగ్ల గ్రంధం, మరికొన్ని సంస్కృత,ఆంగ్ల గ్రంధాలను పరిశీలించి రచించినట్లు "ముందు మాట"లో గణపతి శాస్త్రిగారు చెప్తారు. నాకెంతో ప్రియమైన నవలల్లో ఇది ఒకటి.

నవల కధాంశం మనిషి జీవితంలోని మూడు ప్రధానాంశాల చుట్టూ తిరగాడుతుంది...ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికత. ప్రేమలోంచి భక్తిమార్గంలోకి, ఆపై ఆధ్యాత్మికంగా పయనంగా సాగే రంగనాయకుని జీవితకధ నాకెందుకనో అత్యంత సన్నిహితమైపోయింది. నవలలో నాయికా నాయకులు సరళ స్వభావులైన హేమసుందరీ రంగనాయకులు. లోకం దృష్టిలో సచ్చరిత్రులు కాకపోయినా, వారిద్దరికీ ఒకరిపై ఒకరికి గల తీవ్ర పరస్పరానురాగమే వారిద్దరికీ రామానుజులచే అనాయాసంగా అష్టాక్షరి మంత్రోపదేశం పొందే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. "లివ్ఇన్ రెలేషన్ షిప్స్" అంటూ మెట్రో నగరాల్లో, పట్టణాల్లో కుర్రకారు మోజు చూపుతున్న వివాహ వ్యతిరేక స్వేచ్ఛాజీవన విధానాన్ని ఎప్పుడో 1965 ప్రాంతంలోనే "పిలకా గణపతి శాస్త్రి గారు "విశాల నేత్రాలు" నవలలో ప్రధానాంశంగా స్పృశించారా అనిపిస్తుంది..

క్రీస్తుశకం 11 శతాబ్ది ఉత్తరార్ధంలో, దక్షిణ భారతంలో, ద్రవిడదేశంలో కాంచీరాజ్యం న్యాయమైన ప్రజాపాలనలో ప్రసిధ్ధి కెక్కింది. రాజ్యం లోని నిచుళానగరం నవలికకు పూర్వరంగం. నిచుళానగరంలో శృంగారమంజరి సౌధం తెలియనివారుండరు. ఆమె వద్ద అక్కచెల్లెళ్ళలా పెరిగిన మాణిక్యవల్లి, హేమసుందరి ఆమె కన్న కుమార్తెలు కాదు. వారిద్దరిని ఆమె చిన్నతనం నుంచీ పెంచి పెద్ద చేస్తుంది. వారిద్దరికీ కాంచీరాజ్యంలో ప్రసిధ్ధికెక్కిన నృత్యాచార్యుల వద్ద నృత్యం, వీణా వేణు మృదంగాలలో, గాత్ర సంగీతాలలో చక్కని నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. అయితే ఇద్దరిలోనూ ఇంచుమించుగా ఇరవై నిండిన హేమసుందరి అందంలో మిన్న. పైడిబొమ్మ లాంటి హేమసుందరిని ఎవరైనా ఒక మహారాజు ఒద్దికలో ఉంచాలని, వందల కొద్దీ సువర్ణ నాణాలు గుమ్మరింపించుకోవాలని శృంగారమంజరి ఉవ్విళ్ళూరుతుంది.

అయితే కధనం ప్రకారం ఒక ఏడాది క్రితం హేమసుందరికి, రంగనాయకునికి గోపాలస్వామి కల్యాణమహోత్సవంలో పరిచయం కలుగుతుంది. కర్ణాభరణాలవరకూ విస్తరించిన హేమసుందరి విశాల విలోచన యుగళికి దాసుడౌతాడు రంగనాయకుడు. పై వారిద్దరికీ ఒకరిఎడలొకరికి ప్రగాఢమైన అనురక్తి ఏర్పడుతుంది. రంగనాయకుడు నిచుళాపురం పొలిమెరలో నివసిస్తున్న వెంకటనాయకుని కనిష్ఠపుత్రుడు. తండ్రి చిన్న భూస్వామి.పెద్దగా ఆస్థిపాస్తులు ఏవీ లేనివాడు. అతని అన్నలిద్దరూ తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటూంటారు. సాముగారడీలో ఆరితేరిన రంగనాయకుడు ఇరవై ఐదో ఏడు కూడా నిండని యువకుడు. కండలు తిరిగిన బలిష్థ దేహంతో, విశాలమైన నుదురు,కొనలు తిరిగిన కనుదోయితో, చక్కటి శరిరచ్ఛాయతో ఎంతటి నెరజాణనయినా ఇట్టే ఆకర్షించగల రూపమాతనిది. పొద్దస్తమానం సాముగారడీలే ఆతని ఆరాధ్యదైవాలు.

ఒకానొకరోజు రాత్రిపూట ఆమెను కలవటానికి శృంగారమంజరి భవంతిలోకి దొంగతనంగా అడుగుపెడతాడు. సుందరి విశాల నేత్రాల లోతులలో మునిగి బాహ్యప్రపంచాన్ని విస్మరిస్తాడు...మైమరపులో కావలివాళ్ల కంట పడతాడు. కానీ చాకచక్యంతో నలుగురు పరిచారకులకు దేహశుధ్ధి చేసి చీకట్లో తప్పించుకుంటాడు రంగనాయకుడు. గొడవ చిలికి చిలికి గాలివానై నగరమంతా పెద్ద దుమారాన్ని రేపుతుంది. రంగనాయకుని సాహసం నోటా నొటా హేమసుందరిని దక్కించుకోవాలనుకునే తిరుమలరెడ్డికీ, పట్టణ తలవరికీ తెలిసి, అది రంగనాయకుని ఇంట కూడా పొక్కి పెద్ద రభసగా మారుతుంది. అతను కావాలనుకునే సొత్తు దొరకదేమోనన్న ఉక్రోషం తిరుమలరెడ్డి అతనిపై హత్యాప్రయత్నం చేయించటానికి ఉసిగొల్పుతుంది. తండ్రి నిరాదరణ, తరువాత జరిగిన కొన్ని సంఘటనలు, అడుగడుగునా ఎదురౌతున్న ఆటంకాల నేపధ్యంలో ఊరినుంచి పారిపోవాలనే నిర్ణయానికి వస్తారు నాయికా,నాయకులు.

నిస్సహాయ స్థితిలో శ్రీరంగస్వామిని మనసారా స్మరించుకుని తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరిన పక్షంలో స్వామివారికి "పైడి కనుదోయి, బంగారు తిలకము" కానుకలుగా సమర్పించుకోగలనని మొక్కుకుంటాడు రంగనాయకుడు. ఇద్దరూ కావేరితీరం దాటి శ్రీరంగనగరం చేరుకుంటారు. సుర్య కిరణాల తేజస్సులో తళతఅలాడుతున్న శ్రీరంగనాధుని దేవాలయ శిఖరాల కాంచన కలశాలు, ఏడు ప్రాకారాల్లోనూ ఏపుగా పెరిగిన ఉద్యానవనాలను చూసి రంగనాయకుని మనసు సంతోష పారవశ్యాలతో పులకరిస్తుంది. నగర మధ్యలో ఒక చిన్న భవంతి అద్దెకు తిసుకుని అందులో ప్రవేశిస్తారు వారు.
హేమాంబ,ధనుర్ధానులుగా పేర్లు మార్చుకుంటారు. వివాహపు ఏర్పాట్లు చేస్తున్న రంగనాయకుని సంకల్పాన్ని హేమసుందరి ప్రోత్సహించదు. వారకాంత వివాహానికి తగదని ఆమె నిశ్చల అభిప్రాయం. ఎంత గొడవ పడినా, మళ్లీ పాలునీళ్ళలా ఇట్టే కలసిపొయే ముచ్చటైన అన్యోన్యత వారిది.

రెండునెలల తరువాత ఒకరోజు రంగనాయకుడు కావేరీ తీరంలో అంతర్మధనంలో మునిగి ఉండగా తిరుమలరెడ్డి బంటు సింహాచలం అతనిపై మరోమారు హత్యాయత్నం చేస్తాడు. తానను తాను రక్షించుకునే ప్రయత్నంలో అతడు కొట్టిన దెబ్బలకు ప్రాణాలు విడుస్తాడు సింహచలం. భయంతో మృతశరీరాన్ని కావేరిలో కలిపేసి ఇంటికి వెళ్తాడు రంగనాయకుడు. సింహాచలం కుటుంబానికి తగినంత ధనసాయాన్ని మాత్రం అందేలా చేస్తాడు కానీ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జబ్బుపడిన రంగనాయకునికి తన సాయశక్తులా అతనికి పరిచర్యలు చేసి మాములు మనిషిని చేస్తుంది హేమసుందరి.

ఇక్కడ నుండి కధ విచిత్రమైన మలుపు తిరుగుతుంది. నవల మీద ఉన్న ఇష్టం కొద్దీ కధను క్లుప్తంగా రాసే ప్రయత్నం నేను చెయ్యదలుచుకోలేదు.... రేపు తరువాయి భాగం...