సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, August 2, 2019

ఇప్పపూలు

  


                                                  

ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని  తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత. "ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి. ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద, గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..! వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు, దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.

2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో ఒక  కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావుజీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన, సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు. పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.." అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.

కథాన్వేషణలో 1930 మొదలు 1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా, ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.

ఈ పుస్తకంలోని ముందుమాటలు చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం, శృంగారం, స్త్రీవాదం, కుటుంబ సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం, నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ, గోండు, పరిధాను, బంజార, సవర, మేరియా, చెంచు, కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.

సంకలనంలోని మొదటిదైన "చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది. ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..! " అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను, దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక, తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్ మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.

వాడ్రేవు వీరలక్ష్మి గారి "కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది. "అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం" రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు ’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది. ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి, యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం, ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి. "ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..", "అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..", "గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.

ఇటువంటి గుర్తుండిపోయే కథల ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో, పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా, ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం పట్ల వారి తపన వెల్లడౌతాయి.


Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )

Sunday, May 19, 2019

తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే రాళ్లపల్లి !


రాళ్లపల్లి అనగానే -
"దర్శకరత్న దాసరి నారాయణరావ్ పక్కన్నేను
నటశేఖర కృష్ణ పక్కన్నేను
నూతన్ పెసాదు పక్కన్నేను
జయప్రద పక్కన్నేను
శరత్ బాబు పక్కన్నేను
రాళ్లపల్లి పక్కన్నేను" అనే డైలాగ్ ఠక్కున గుర్తుకొస్తుంది.
లేడీస్ టైలర్ సినిమాలో 'అడ్డతీగల హనుమంతు' అనే కోయదొర వేషం చిన్నదే అయినా, కథానాయకుడు రాజేంద్రప్రసాద్ కు జోస్యం చెప్పి, అప్పటి నుంచీ మొదలయ్యే మొత్తం కథంతటికీ మూలకారణమవుతాడు. 




కొన్ని దశాబ్దాల పాటు వెండితెరపై రకరకాల పాత్రలను అవలీలగా పోషించి, ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న కళాకారుడు రాళ్ళపల్లి. రాళ్లపల్లి వెంకట నరసింహారావు ది ఒక పెక్యూలియర్ వాయిస్. అదే ఆయన ప్లస్ పాయింట్. పేరు పెద్దగా ఉందని ఒక దర్శకుడు రాళ్లపల్లి అని వేయించారుట టైటిల్స్ లో. అలా ఇంటిపేరుతోనే ప్రసిధ్ధులైపోయారు ఆయన. ఎనిమిదివందలకు పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి సినీపాత్రల వైవిధ్యాల గురించి చెప్పడం నాలాంటి సాధారణ మానవులకు సాధ్యం కాని పని. కానీ ఒక ఇష్టమైన కళాకారుడి గురించి, నాకు గుర్తున్నంత వరకూ, నేను చూసిన చిత్రాలలో ఆయన నటించిన కొన్ని పాత్రలను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాను. 

ఒక నటుడు తన అసలు పేరుతో కాక పోషించిన పాత్రల పేరుతో గుర్తుండిపోయినప్పుడు అసలైన కళాకారుడిగా గుర్తింపబడతాడు. అటువంటి విలక్షణ నటుడు రాళ్లపల్లి. లేడీస్ టైలర్ లో కోయదొర తర్వాత నాకు గుర్తుకొచ్చేది "రెండు రెళ్ళు ఆరు"లో తికమక. ఈ సినిమాలో ఒకే వాక్యాన్ని ఐదారు రకాల భాషల్లోకీ తర్జుమా చేసి చెప్పే చిత్రమైన పాత్రను రాళ్లపల్లికి ఇచ్చారు జంధ్యాల.  పేరు "తికమక". అర్థం ఏమిటని అడిగితే - "అన్నిభాషల్లోనూ!" అంటాడు. "తెలుగు కి ’తి ’, కన్నడానికి ’క ’, మరాఠీ కి ’మ ’, కొంకిణీ కి ’క ’ కలిపి అలా పెట్టుకున్నాను. మిలిటరీలో వంటవాడు గా పనిచేసినప్పుడు అన్ని భాషలూ మాట్లాడే సైనికులతో మాట్లాడడానికి దాదాపు పధ్నాలుగు భారతీయ భాషలు నేర్చుకున్నాను" అని చెప్తాడు. 



ఆ తర్వాత "శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సిన్మాలో సిలోన్ సుబ్బారావు బావ!! ఆ సినిమా చూసినప్పుడల్లా, పట్టు పద్మిని పాత్ర "మా సిలోన్ సుబ్బారావు బావ.." అని అన్నప్పుడల్లా ఘొల్లున నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ "టేకిట్ ఈజీ.." అని చెప్తూంటారు కానీ అలాంటి ఈజీ పాత్రని ఎప్పుడో సృష్టించారు వంశీ. ఎవరెంత వేళాకోళంగా మాట్లాడినా ఏ మాత్రం తొణక్కుండా, తడుముకోకుండా, ఎంతో అవలీలగా, ఏదో ఒక జవాబు ఠక్కున చెప్పేసే ఆ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోయింది. 



బాపూ తీసిన "మంత్రిగారి వియ్యంకుడు" లో అల్లూ రామలింగయ్య అల్లుడుగా రాళ్లపల్లి చేసిన "సిర్కిల్ ఇన్స్పెక్టర్" పాత్ర భలే ఉంటుంది. పేరుతో కాకుండా ఎప్పుడూ "ఏమయ్యా సర్కిలూ" అంటూంటాడు అల్లూ రామలింగయ్య. బాపూ తీసిన మరో చిత్రం ’రాధా కల్యాణం ’లో "ఏమ్మొగుడో...ఏమ్మొగుడో " అనే గమ్మత్తైన పాట ఉంది. నిందాస్తుతి పధ్ధతిలో తాగుబోతు మొగుడుని ముద్దుగా తిడుతూ ఓ భార్య పాడే పాట. అందులో ఆ తాగుబోతు వేషం రాళ్ళపల్లిది. చిన్న వేషం అయినా, చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా అయినా, చాలా ఏళ్లవరకూ ఆ పాట గుర్తుండిపోవడానికి కారణం రాళ్లపల్లి అంటే అతిశయోక్తి కాదు. 

నిన్న పేపర్లో రాళ్లపల్లి గురించిన వార్త చదివాక గుర్తుకొచ్చిన మరికొన్ని సినిమాలు - పాత్రలు - "సితార"( పాత్ర పేరు గుర్తులేదు), "అన్వేషణ"లో సత్యనారాయణ డ్రైవర్ పాండు పాత్ర, "ఏప్రిల్ ఒకటి విడుదల" లో శర్మ గారు, "శుభలేఖ"లో "గుర్నాధం"! ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరిన్ని సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు రాళ్లపల్లి పోషించే ఉంటారు కానీ చిన్నప్పుడు మాకు విశ్వనాథ్, జంధ్యాల, బాపూ, వంశీ ఈ నలుగురు  దర్శకుల సినిమాలే ఎక్కువగా చూపెట్టేవారు. అందువల్ల నాకు ఈ పాత్రలు మాత్రమే బాగా గుర్తుండిపోయాయి. 

మాకు కేబుల్ కనక్షన్ లేదు కాబట్టి ఎప్పుడు ప్రసారమయ్యేదో తెలీదు కానీ ఆమధ్యన యూట్యూబ్ లో ఎక్కడో "బాబాయ్ హోటల్" అనే ఒక టివీ షో చూశాను. ఏదో వంటల కార్యక్రమం. ఇంత పెద్ద వయసులో ఇది కూడా హోస్ట్ చేస్తున్నారా. చాల గ్రేట్ అనుకున్నాను. 


టివీ చూడకపోవడం చాలా అదృష్టకరమైన విషయం అని ఇలాంటి వార్తలు పేపర్లో చదివినప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంతో బాగా హెల్తీగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తుల్ని, చివరి దశల్లో బలహీనంగా, అనారోగ్యంతో ఉన్న క్లిప్పింగ్స్ నీ, చనిపోయిన వీడియోలను చూడలేము. నేనైతే ఇప్పటికీ పేపర్ లో వచ్చిన ఇలాంటి వార్తలను కూడా రెండోసారి చూడడానికి మనసొప్పక పాత పేపర్ల వెనుక దాచేస్తూంటాను. రాళ్లపల్లిపై ఉన్న అభిమానం కొద్దీ ఈ నాలుగు వాక్యాలనూ ఆయనకు నా నివాళిగా రాయాలనిపించి రాయడం. ఒక అనుభవజ్ఞుడైన నటుడిని గుర్తుచేసుకోవడం. అంతే!

కొద్దిగా గూగులిస్తే రాళ్లపల్లి నటించిన కొన్ని సినిమా సీన్ల లింక్స్ రెండు దొరికాయి. క్రింద ఇస్తున్నాను -











Monday, May 6, 2019

మహాత్మునికీ గాంధీకీ మధ్య

                            
                             


భారతదేశం యావత్తూ మహాత్మునిగా కొనియాడిన బోసినవ్వుల బాపూకి భార్యా, పిల్లలు ఉంటారని, దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించి నిర్దేశించడం మాత్రమే కాక బాపూజీకి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందనే ఆలోచన చిన్నతనంలో ఉండేది కాదు. "గాంధీ" చిత్రం ద్వారా మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి, కస్తూరి బా గురించీ కొన్ని వివరాలు తెలిసాయి. అయితే వారి పిల్లల గురించిన వివరాలు మరెక్కడా చదివిన గుర్తు లేదు. కాలేజీ రోజుల్లో ఒక ఆంగ్ల పత్రికలో వారి మొదటి కుమారుడి గురించి ఆర్టికల్ చదివి, భద్రపరిచిన గుర్తు. అప్పటి నుండీ హరిలాల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. కొన్నేళ్ళ క్రితం నటుడు అక్షయ్ ఖన్నాతో అనిల్ కపూర్ "గాంధీ, మై ఫాదర్" అనే చిత్రం నిర్మించారు. ఒక నవల ఆధారంగా చిత్రాన్ని తీసారని అన్నారు. ఆ నవల నాకు దొరకలేదు కానీ ఇన్నేళ్ళ తెరువాత ప్రముఖ గుజరాతీ రచయిత దినకర్ జోషీ నవల(ప్రకాశవో పరభావో)కు కూచి కామేశ్వరి గారి అనువాదం నాకు లభించింది.  అదే "మహాత్మునికీ గాంధీకీ మధ్య"! బాపూని ఒక సాధారణ తండ్రిలా మనకు చూపెట్టే కథ ఇది. గాంధీ మహాత్ముని పెద్ద కుమారుడైన హరీలాల్ జీవిత కథ. ఒక వ్యధాభరితమైన యదార్థ గాధ. 

ఈ నవల ద్వారా నాకొక మంచి రచయిత పరిచయమయ్యారు. దినకర్ జోషీ గారి వంటి డేడికేటెడ్ రైటర్ గురించి ఇప్పటికైనా నేను తెలుసుకోవడం చాలా ఆనందకరమైన సంగతి. కథా సంకలనాలు, నవలలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు అన్నీ కలిపి ఇప్పటివరకూ జోషీ గారివి 152 పుస్తకాల ప్రచురించబడ్డాయి. ఎనభై వసంతాలు దాటిన వయసులో కూడా సాహిత్యాభివృధ్ధికి ఆయన ఇంకా చేస్తున్న సేవ అపారమైనది. గుజరాతీ రచనలను ఎక్కువమందికి చేరవేయాలనే సదుద్దేశంతో ఆయన "గుజరాతీ సాహిత్య ప్రదాన్ ప్రతిష్ఠాన్ " అనే సంస్థను మొదలుపెట్టారుట. “We talk about Shakespeare, Tennyson…and Dostoevsky, but we don’t read books of our own languages. We lose out on a lot. It doesn’t make sense..” అంటారాయన. ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో, మన సాహిత్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో తెలియచెప్తూ ఆయన అన్న ఈ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఎవరి భాషను వారు నిలబెట్టుకోవడానికి సాహిత్యకారులు, రచయితలు ఎంతటి కృషి చేయ్యవలసి ఉందో ఈ మాటలు చెప్తాయి.

"మహాత్మునికీ గాంధీకీ మధ్య" నవలలో ఏ ఒకరి పక్షాన్నీ వహించకుండా బాపూకీ, వారి కుమారుడికీ మధ్యన నిలబడి, ఇధ్దరి దృష్టికోణాల్లోంచీ వారి వారి జీవితాలను మనకు చూపెట్టి; తుది నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం రచయిత సామర్ధ్యానికి నిదర్శనం. నాకు మాత్రం వారు బాపూ వైపుకి సమానమైన న్యాయం చూపెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారేమో అనే అనిపించింది. వ్యక్తిగతంగా గాంధీజీ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ హరిలాల్ జీవితగాధ చదువుతున్నంత సేపూ హరిలాల్ పై అవ్యాజమైన కరుణ కలుగుతుంది. జాతిని నడిపించిన మహాత్ముడి కుమారుడికా ఈ దురవస్థ? అయ్యో బిడ్డా.. ఎన్ని ఇక్కట్లపాలయ్యావయ్యా అని మనసు దు:ఖపడుతుంది. అతడి బలహీనతలపై జాలి కలుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు చూపే వివేకం, వాటిని అతడు ఎదుర్కున్న నేర్పూ, సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యం వేస్తుంది. చదువుతునంత సేపూ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు గాంధీ గారు అని సరిపెట్టుకోలేకపోయాను. కాస్తంత ఆధారం, రవ్వంత ప్రేమ, కొద్దిపాటి మార్గదర్శకత్వం దొరికి ఉండుంటే అతడి జీవితం ఏ ఉన్నత శిఖరాల వైపుకు పయనించి ఉండేదో అన్న ఆలోచన రాకమానదు.  ఏదేమైనా గాంధీజీ ఒక చోట అన్నట్టు కర్మ ఫలాన్ని మార్చడం ఎవరి తరం?! ఆ తల్లికి ఆ ఆక్రోశం, ఆ తండ్రికా అవమానం, ఆ బిడ్డకా పతనం రాసిపెట్టి ఉన్నాయి..!!

హరిలాల్ మరణవార్తతో, కేవలం వేళ్ళపై మాత్రమే లెఖ్ఖపెటగలిగిన సభ్యుల సమక్షంలో జరిగిన అతని అంత్యక్రియ ఘట్టంతో మొదలౌతుంది హరిలాల్ జీవితగాథ. ఉత్సాహవంతుడైన యువకుడిగా గాంధీ బాటలో సత్యాగ్రహంలో, పలు స్వాతంత్ర్యౌద్యమాల్లో పాల్గొన్న ఎంతో తెలివైన వ్యక్తిగా, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించే ప్రాసంగికుడిగా పాఠకులకు పరిచయమైన హరిలాల్ జీవనపయనం పాఠకుల ఉత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ చివరిదాకా ఆపకుండా నడిపిస్తుంది. అతడి వ్యక్తిత్వ పతనం ఎలా మొదలైంది, ఎటువంటి దీనావస్థలో చివరికి ఒంటరిగా మిగిలాడు అన్న సంగతులు పాఠకుడి కళ్ళని చెమ్మగిల్లకుండా ఆపలేవు. ఆ పతనానికీ, జరిగిన విషయాలన్నింటికీ మూలకారణంగా స్వకర్మనో, తల్లిదండ్రులనో కాక విధిని నిలబెట్టడం అనేది జోషీ గారి విఙ్ఞతకు నిదర్శనం.

పుస్తకం పూర్తయిన తర్వాత అంతర్జాలంలో హరిలాల్ గురించిన మరిన్ని వివరాల కోసం వెతుకుతూంటే ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు దొరికాయి. పలు వార్తాపత్రికల్లో అచ్చయిన గాంధీగారి స్వదస్తూరీ తాలూకూ ఉత్తరాలూ.. కొన్ని సంగతులు.. వాటిని సొమ్ము చేసుకోవడానికి వాటి హక్కుదారులు చూపిన ఉత్సుకత.. వగైరా వగైరా! వాటి వల్ల అర్ధమైంది ఏమిటంటే, హరిలాల్ జీవితంలోని కొన్ని సత్యాలని విపులీకరించకుండా రచయిత ఎంతో శ్రధ్ధతో ఈ కథని తీర్చిదిద్దారని, తద్వారా గాంధీమహాత్మునికి, హరిలాల్ కి కూడా ఎంతో గౌరవాన్ని మిగిల్చినవారయ్యారని!! శ్రీ దినకర్ జోషీ పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ కథ అనే కాదు కానీ కొన్ని చారిత్రక విశేషాలను, మనుషులను గురించి చదివిన ప్రతిసారీ నన్నో ప్రశ్న వేధిస్తూ ఉంటుంది - గతించిన చరిత్ర తెలిసినవాళ్ళ కన్నా తెలియనివాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఎవరిదైనా గాథ రాసేప్పుడు వారి చరిత్రల్లోని లోటుపాట్లని, చీకటి కోణాలను యదార్థం పేరుతో తెలియనివాళ్ళకు తెలియచెప్పి ఆ మనుషులకు అప్పటిదాకా ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టేయడం అనేది ఎంతవరకూ సమంజసం? అని! ఇప్పుడా గతించిన చీకటిని తవ్వుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? సమాజం, మానవాళి మరింతగా ఎదగటానికి మాత్రమే చరిత్ర ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరికీ ఏమాత్రం ఉపయోగకరం కాని గత కాలపు అభ్యంతకరమైన విశేషాలనూ, వివరాలనూ కెలికి, వెలికితీయడమనేది గతించిన వారిని అవమానించడమే కాక వ్యర్థ ప్రయాస అన్నది నా స్వాభిప్రాయం. 

ఈ నవల గురించి మరి కొన్ని వాక్యాలు రాస్తే పుస్తకాభిమానులతో ఈ పుస్తకం చదివించాలన్న నా ఉద్దేశం చప్పబడిపోతుందన్న అభిప్రాయంతో వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ నవల ద్వారా గాంధీగారి గురించి, కస్తూరి బా గురించీ, వారి ఇతర కుటుంబ సభ్యుల గురించీ, మనుషుల్లోని భిన్న స్వభావాల గురించీ ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచిన శ్రీ దినకర్ జోషీ అభినందనీయులు.


Sunday, April 28, 2019

Music Teacher





యాదృచ్ఛికంగా మొన్నొక రోజు ఈ సినిమా చూడడం జరిగింది. పచ్చని కొండలు, లోయలు, వాటి మధ్య సన్నని రోడ్డు, నీలాకాశం, మబ్బులు, మంచు... ఈ దృశ్యాల మీద ఒక అందమైన ఫాంట్ లో వస్తున్న టైటిల్స్, and as a cherry on top - backgroundలో ఒక వీనులవిందైన అర్థవంతమైన పాట!! వీటి మించి ఏం కారణం కావాలి స్క్రీన్ కి అతుక్కుపోవడానికి :) 





కథ, పాత్రలు పక్కన పెడితే మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చినది ఆ కొండలు, మంచు వాతావరణం, drizzling, ఆకుల చివర్ల నుంచి జారుతున్న నీటి బిందువులు, స్క్రీనంతా పరుచుకున్న పచ్చదనం! ఆహ్లాదకరమైన అటువంటి వాతావరణం ఏ కథనైనా బోర్ కొట్టించదు. రెండు ప్రఖ్యాత పాత హిందీ పాటల్ని రీమేక్ చేసారు. మధ్య మధ్య టీ కొట్లో తగిలించిన రేడియో లోంచి పాత పాటలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ పై కనబడుతున్న ఆ రాతి గోడ మీద కూచుని టీ తాగుతూ, వాన తుంపరలని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోతే ఎంత బావుంటుందో , ఆ ప్రాంతంలో నివశించే ప్రజల ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. సిమ్లా అందాలను అంతగా కళ్ళకి కట్టాడు సినిమాటోగ్రాఫర్ కౌశిక్ మొండాల్. కథ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న నాన్ లీనియర్ టెక్నిక్ ప్రేక్షకులలో ఉత్సుకతని చివరిదాకా నిలిపి ఉంచుతుంది. గౌరవ్ శర్మ అందించిన డైలాగ్స్ బాగా గుర్తుండిపోతా
యి.

కథలోకి వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి, కొడుకు, కూతురు ఉంటారు. (చిన్నప్పటి నుంచి బుల్లితెరపైనా, వెండితెరపై కూడా పలురకాల పాత్రల్లో చూసిన నీనా గుప్తా వయసెంతైనా తల్లి పాత్రలో నేనస్సలు ఊహించలేను. కానీ తప్పలేదు.) కొడుకు సంగీతం మాష్టారు. సింగర్ అవ్వాలనే కలతో బొంబాయి వెళ్ళి విఫలయత్నాల తరువాత తండ్రి మరణంతో తిరిగి ఇల్లు చేరతాడు. సంగీతం పాఠాలు చెప్పుకుంటూ, చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుకుంటూ జీవనం గడుపుతుంటాడు. నెరవేరని కలని, బాలీవుడ్ లో పెద్ద గాయకురాలుగా మారిన ఒకప్పటి తన శిష్యురాలిని తలుచుకుంటూ, వీలైనప్పుడల్లా సిగరెట్లు కాలుస్తూ, మౌనంగా విలపిస్తూ కొండల్లో, లోయల్లో తిరుగుతుంటాడు. ఇంతలో ఆ గాయక శిష్యురాలు కాసర్ట్ ఇవ్వడానికి వారి ఊరికి వస్తోందని తెలిసి అందరూ అతడిని పలకరిస్తూ ఉంటారు. ఆమెను కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో అదే రోజు తన చెల్లెలి పెళ్ళి ఫిక్స్ చేస్తాడు సంగీతం మాష్టారు. ఎనిమిదేళ్ళుగా ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఆ శిష్యురాలి గురించి కొన్ని డైలాగులు విన్నాకా అసలు కథ ఏంటా అని ఆసక్తి ఎక్కువౌతుంది. 









ఇక హీరోయిన్ అమృతా బాగ్చీ చాలా బావుంది. ఆమె పళ్ళు మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి కానీ చూడముచ్చటైన మొహం. పెద్ద పెద్ద కళ్ళు, గుబురు జుట్టు ఆమెను చాలా ఇష్టపడేలా చేస్తాయి. అసలా కళ్ళు...they speak volumes! అలాంటి స్వచ్ఛమైన పెద్ద పెద్ద కళ్ళ ను చూస్తూ ఒక జీవితం గడిపేయచ్చు. బాపూ ఉండి ఉంటే తప్పకుండా తన తదుపరి చిత్రంలో ఆమెనే తీసుకునేవారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో మాష్టారికీ, శిష్యురాలికీ మధ్య జరిగిన సంభాషణ మనసుకు హత్తుకుంటుంది. రెండు మూగమనసుల  బాధ అది. we feel that pain. ఆ సన్నివేశంలోని ప్రతి డైలాగ్ గుర్తుండిపోతుంది. "ఎనిమిదేళ్ల పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నా ఉత్తరాలకి జవాబు రాయలేదు" అని బేనీ ప్రశ్నించినప్పుడు, ఒక గాయపడిన ఎక్స్ప్రెషన్ తో "ఆప్ తో జాన్తే హై... గుస్సా కిత్నీ ఖతర్నాక్ చీజ్ హై" అంటుంది జ్యోత్స్న.  కళ్లల్లో నీళ్ళతో "తుమ్హారా ఇంతజార్ కిత్నా సుందర్ హై.." అని అతడంటే, మీకు తెలుసా.. కేవలం మిమ్మల్ని చూడడానికే ఈ ఊళ్ళో కాన్సర్ట్ కి ఒప్పుకున్నానంటుంది.  "ఆప్ కో పతా హై క్యా హువా? ఆప్కీ వో భోలీ సీ, మాసూమ్ సీ జునాయ్ థీ.. వో మర్ గయీ.." అంటుంది. మనసు చచ్చిపోయాకా ఏ బంధాలు మిగులుతాయని?!




ఒక కీలకమైన పాత్ర పోషించిన దివ్యా దత్తా గురించి తప్పక చెప్పుకోవాలి. చిత్ర కథకు ఏ మాత్రం అవసరం లేని ఆమెకూ, సంగీతం మాష్టారికీ మధ్య జరిగే కథ నాకు అస్సలు నచ్చలేదు. కేవలం స్నేహం చూపెట్టి, వారిదొక అందమైన అనుబంధంలా ఉంచేయచ్చు కదా! బేనీ పాత్రని మరింత బలహీనపరచడానికి గీత కథని వాడుకున్నాడేమో దర్శకుడు అని మాత్రం నాకు అనిపించింది. కావాలసింది దొరకలేదని ఏడుస్తూ కూర్చోకుండా ఆమెకు కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కనీసం గీతకు ఆసరా ఇచ్చాడని అతడిపై గౌరవం అన్నా ఉండేది. ఏదీ చెయ్యకుండా కేవలం ఒక అవకాశవాదిగా మాత్రం బేనీ ఉండిపోతాడు. కానీ గీత పాత్ర నాకు చాలా నచ్చింది. ఆమె చేసినది తప్పే అయినా కూడా ముసలి మామగారిని చూసుకుంటూ ఆమె గడిపే ఒంటరి జీవితం, చివర్లో ఆయనకు అంతిమ సంస్కారం కూడా తానే చెయ్యడం, బేనీ జీవితంలో తనకు స్థానం ఉండదని అర్థమయ్యాకా మౌనంగా అక్కడి నుంచి వెళ్పోవడం.. గొప్ప సంస్కారానికి నిదర్శనం. దివ్యా వాయిస్, ఆమె చెప్పే స్లో డైలాగ్స్ లో ఎంతో బరువు, విలువ ఉన్నాయి.  వాటిల్లో కొన్ని..

* " అకేలీ తో హమేషా హీ థీ.. బస్ అబ్ ఖాలీ హో గయీ."

* "రిష్తే జబర్దస్తీ జోడే జా సక్తే హై..లేకిన్ దిల్ నహీ"

* "జిందగీ మే జబ్ వహీ ఖ్వాయిష్ రెహ్ జాయె నా...తో ఇంతెజార్ కర్నా ఔర్ భీ ముష్కిల్ హో జాతా హై"

* "ఏ జో పహాడ్ హైనా, యహా జిత్నా మర్జీ రో లో.. జిత్నా మర్జీ చిల్లాలో, ఆవాజ్ జాకర్ హమ్ తక్ హీ పహుంచ్తీ హై"


చివరిగా, ఇదేమీ అద్భుతమైన సినిమా కాదు. కానీ హిమాచల్ లోయల అందాలు, పాటల్లో సాహిత్యం, మనం మమేకమై అనుభూతి చెందిన కొన్ని క్షణాలు మాత్రం తప్పకుండా మనతో ఉండిపోతాయి. ఈ చిత్రాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన దర్శకుడు సార్థక్ దాస్ గుప్తా సార్థక నామధేయుడై మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.





Saturday, April 27, 2019

వేసవిలో వర్షంలా - జర్సీ




"కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడద్దు అంటే లేదు యుద్ధం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
ఎవరి కోసం మారదద్దం "

చిత్రాన్ని చూసి వారం అవుతున్నా ఇదే పాట పదే పదే అప్రయత్నంగా హమ్ చేస్తున్నాను.
"ఓటమెరుగని ఆట కనగలరా...." పల్లవితో కృష్ణకాంత్ రచించిన ఈ పాట చాలా బావుంది. వెరీ ఇన్స్పిరేషనల్! కానీ డబ్బింగ్ పాటకి లిరిక్స్ రాసినట్లు పొందిక సరిగ్గా కుదరలేదు. నాలుగుసార్లు వింటే గానీ కొన్ని వాక్యాలు తెలీట్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో అనుకుంటా ఈయన రాసిన ఇంకో పాట "నువ్వంటే నా నువ్వు" పాట కూడా చాలా బావుంటుంది. 




ఈ చిత్రాన్ని గురించి వెంఠనే రాయాలనిపించినా... రాద్దామా వద్దా అనే మీమాంసలో ఉండగానే నిన్న మరో మంచి సినిమా చూడడం జరిగింది. ఇక ముందర మన తెలుగు సినిమా గురించి రాయకుండా ఎలా అని మొదలుపెట్టాను. ఈమధ్యన రెండు, మూడు తెలుగు చిత్రాలు చూశాకా, తెలుగులో మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి అని బోలెడు ఆనందం కలిగింది. హీరో గారు కాలు నేల కేసి కొట్టగానే భూకంపాలూ, ఒక్క గుద్దు గుద్దగానే మైలు దూరం వెళ్ళి పడడాలు, గాల్లోకి బళ్ళు ఎగరడాలు.. హీరోలు మారినా అవే దృశ్యాలు ఏళ్ల తరబడి తీసీ, తీసీ వీళ్ళకి విసుగెత్తదా అనిపించేది. కాస్త ట్రెండ్ మారుతోందని ఇన్నాళ్ళకి గట్టిగా అనిపిస్తోంది. నాని టాలెంట్ కి సరిపోయే చిత్రం ఇన్నాళ్లకు వచ్చింది. పాత్రలో నటుడిని కాకుండా పాత్రని చూడగలిగినప్పుడే కదా సత్తా బయటపడేది. జెర్సీ లో "అర్జున్" మాత్రమే కనిపిస్తాడు. ఏవరిదైనా యదార్థ గాథేమో అనిపించే ఈ పాత్రని ప్రేమించకుండా అసలు ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఈ వేసవిలో వర్షంలాంటి ’జెర్సీ ’ మనసు దోచేసింది. దర్శకుడి రెండవ ప్రయత్నం కూడా బావుంది. హ్యాట్రిక్ కోసం ఎదురుచూడాల్సిందే!

ఇది ఒక ఆటగాడి కథ అనేకన్నా, ఒక తండ్రీ కొడుకుల కథ అనాలి. తండ్రీ కొడుకుల మధ్య చూపెట్టిన ప్రతి సన్నివేశం అపురూపంగానే ఉంది. జెర్సీ కొనలేకపోయిన తండ్రికి తాను బాధపడడం లేదని కన్విన్స్ చేయడం కోసం పిల్లాడు చెప్పిన మాటలు, అల్మారాలో పోస్టర్ మార్చినప్పుడు చెప్పే మాటలు,  
"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకొక్కడే. వాడికి మా నాన్న ఉద్యోగం చేస్తాడా, డబ్బులు సంపాదిస్తాడా, సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా?ఇదేం సంబంధం లేదు? వాడికి నేను నాన్న !! అంతే." అనే డైలాగ్ విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఛారిటీ మ్యాచ్ అయ్యాకా కొడుకు చేతులెత్తి అప్లాస్ చెప్తూంటే అర్జున్ మొహంలో కనబడ్డ ఆనందం వర్ణనాతీతం!

ఇంకా - 
"మా ఇంట్లో ఒకళ్ల మీద ఒకళ్ళం అరుచుకోవడం ఉండదు, నేనే అరుస్తాను. నేనే బాధపడతాను. నేనే ఏడుస్తాను"

"అర్జున్ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వలేకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది" 
ఇలా.. చాలా బావున్న డైలాగ్స్ బోలెడున్నాయి.

అర్జున్ ని "బాబూ.." అని హీరోయిన్ పిలవడం భలే తమాషాగా ఉంది. కొన్ని సీన్స్ కూడా బాగా గుర్తుండిపోతాయి. 
* రైల్వే స్టేషన్ లో అరవడం ఐడియా చాలా బావుంది. ఎప్పుడైనా ప్రయత్నించచ్చు.
* "అమ్మ అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు" అని అర్జున్ కొడుకుని అడిగే సీన్ !
* లేడీ జర్నలిస్ట్ కి ఆమె ప్రేమికుడిని వదలద్దని చెప్పే సీన్.
* "మా నాన్న సంకల్పం ఎంత గొప్పదంటే.." అంటూ చివరలో అర్జున్ కొడుకు చెప్పే స్పీచ్.

ఎనభైల్లో కథ అని చెప్పడమే కాక ప్రతి సీన్ లోనూ సెట్టింగ్స్ కూడా చాలా ఏప్ట్ గా వేశారు. ఒక సీన్ లో గోడ దగ్గర బల్ల మీద పాత కాలంనాటి సింగిల్ స్టీరియో టేప్ రికార్డర్. అతి మామూలు సాదా సీదా ఇల్లు. చివరి సీన్ లో గ్రూప్ ఫోటో కోసం తంటాలు పడడం చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనే కోర్సుల్లో చేరుతున్న నేటి తరాలవారికి ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎలా అర్థమౌతాయి. ఐదొందలు సంపాదించాలని అర్జున్ పడే పాట్లు డబ్బుకి విలువే తెలియని ఈతరం యువతకి అర్థమౌతుందా? అనిపించింది. కష్టం తెలీకుండా, కాలు కిందపెట్టనివ్వకుండా, అపురూపంగా పెంచేస్తున్నారు పిల్లల్ని చాలామంది. రూపాయి రూపాయికీ వెతుక్కుని, చెమటోడ్చి సంపాదించినవాళ్ళకే రూపాయి విలువ, మనిషి విలువ తెలుస్తాయి. కష్టపడితేనే సుఖం విలువ అర్థమౌతుంది. 

కారణాలు ఏవైనా, పని ఎలాంటిదైనా, ఒక ఇష్టమైన పని చేయడం ఆపేస్తే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు! భార్య ఎంత తిడుతున్నా స్పందన లేకపోవడం, ఏ పనినీ ఆసక్తిగా చెయ్యలేకపోవడం, కరెంట్ బిల్లు డబ్బుతో నిర్లక్ష్యంగా పేకాట ఆడడం మొదలైనవి చూసి ఈ పాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నాడీ దర్శకుడు? అని ఆశ్చర్యపోయాను. స్టేడియంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన కట్టప్పగారితో "ఈ లోకంలో తప్ప బయట బతకలేనని అర్థమైంది సార్" అన్నప్పుడు నాకు అర్థమైంది ఈ పాయింట్ ని స్ట్రెస్ చెయ్యాలని ఆ క్యారెక్టర్ ని అలా చూపించారన్న మాట అని! 

కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. పుస్తకం అచ్చైన తర్వాతే ఎందుకు జెర్సీ పంపారు? అన్నేళ్లదాకా క్రికెట్ బోర్డ్ వాళ్ళు అర్జున్ కుటుంబాన్ని కాంటాక్ట్ చెయ్యలేదా? ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు మెడికల్ టెస్ట్ లు అవీ చేస్తారు కదా.. మరి అర్జున్ కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఆ మెడికల్ టెస్ట్స్ లో తెలియలేదా? తెలిస్తే అన్ని మ్యాచ్ లు ఎలా ఆడనిచ్చారు? మొదలైన సందేహాలు! ఆట మానేసాడన్న సంగతి మొదటిసారి విన్న అతడి భార్య, మిగతా సన్నిహితుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉండి ఉండచ్చేమో! 
చివరాఖరి సందేహం ఏమిటంటే - ఈ పాత్రని నాని కాకుండా ఎవరో కొత్త వ్యక్తి, ఇంతే బాగా నటించినా కూడా చిత్రాన్ని ఇలానే ఆదరించేవారా?? అని :)

Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 


Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.



Saturday, March 30, 2019

ఇష్టకామేశ్వరి






శ్రీశైలానికి సుమారు 14,15కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి. మొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్న స్థల పురాణం పుస్తకంలో ఆ ఆలయాన్ని గురించి చదివినప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని! ఆ తర్వాత వెళ్ళినప్పుడు కూడా వర్షాకాలంలో ఆ అడవి మార్గం వైపు ట్రిప్స్ ఉండని కారణంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకలేదు. ఆ తర్వాతి ప్రయాణంలో మాత్రం మొత్తానికి దేవి దర్శనభాగ్యం కలిగింది.

ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్న అటువంటి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి.  ఇదివరలో రెండు మూడు గంటలు పట్టేదిట ఈ ప్రయాణానికి. ఆ దారిలో కాస్త కంకర పోయడం వల్ల గంటన్నరే పడుతోందిట ఇప్పుడు. తారు రోడ్డుపై ఒక అరగంట, నలభై నిమిషాలు ప్రయాణించాకా దారి ఎడమ పక్క ఉన్న అడవిమార్గం వైపుకి మళ్ళుతుంది. కేవలం జీప్ లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించగలవు. ఎగుడుదిగుడుగా, ఎక్కడ జీప్ లోంచి జారి పడిపోతామో అనిపించేలా ఎత్తి కుదిపేస్తున్న జీపులో దాదాపు గంట పైగా ప్రయానించడం ఒక గొప్ప సాహసవంతమైన అనుభూతి!! జీప్ లో వెనుక కూచుని దాటి వచ్చిన రాళ్ళు నిండిన, ఎగుడుదిగుడు ఎత్తుపల్లాల దారిని చూస్తూంటే...బాబోయ్ ఈ దారిలోంచి బయటకు వచ్చామా అనిపిస్తుంది.




ఎంతో చాకచక్యంగా జీప్ నడపగలిగిన అనుభవం ఉన్నవారే ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చగలరు. మొదటిసారి వళ్ళినప్పుడు మనిషికి ’ఏడువందల ఏభై ఫిక్స్డ్ రేట్ ’ అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ తిరిగివచ్చేప్పుడు జీప్ మళ్ళీ తారు రోడ్డు ఎక్కాకా మాత్రం ధర న్యాయమైనదే అనిపించింది. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయణమే అది. హృద్రోగులూ, ఒళ్ళునెప్పులూ, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దారిలో వెళ్లకపోవడం మంచిది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆ రాళ్ళల్లో టైరు చిక్కుకుని ఈ జీప్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతే? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ఈ కీకారణ్యంలోంచి బయటపడగలమా? ఎక్కడో అడవిలో మారుమూల ఉన్న ఆ విగ్రహాన్ని చూడకపోతే ఏమి? అసలిక్కడ ఈ విగ్రహం ఉందని ఎవరు కనిపెట్టారో..? లాంటి ప్రశ్నలు ఈగల్లా ముసిరేస్తాయి ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కానీ గుడి దగ్గర జీప్ ఆగిన తర్వాత, దిగి ఒక్కసారి చుట్టూరా ఉన్న అక్కడి నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాకా, జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇలాంటి ప్రదేశాన్ని చూసి తీరాలి అని వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనిపించి తీరుతుంది.


జీప్ ఆగిన ప్రదేశం నుండి ఒక అర కిలోమీటరు లోపలికి నడవాలి. చుట్టూరా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం, రంగురంగుల అడవిపూలు, తలెత్తి పైకి చూస్తే చెట్ల మధ్య నుండి కనబడే నీలాకాశం, ఎత్తైన చెట్ల తాలూకూ పచ్చని ఆకుల మధ్య నుండి పడుతున్న సూర్యకిరణాలు, మధ్యలో దారికి అడ్డంగా పారుతున్న బుల్లి సెలయేరు, ఆ నీటిలో కదులుతున్న నల్లటి చిన్ని చిన్ని చేపపిల్లలు...పక్కగా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యన ఎత్తుగా పేర్చి ఉన్న రాళ్లపై కాస్త ఎత్తుమీద ఎప్పటిదో వినాయకుడి రాతివిగ్రహం...ఇలాంటి మనోహరమైన ప్రదేశాన్ని చూడగానే - చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న జానపద కథల్లోకి వచ్చేసామా అనిపించింది నాకు!











నిశ్శబ్దంగా ఉన్న ఆ అటవీప్రాంతంలో, పక్షుల కిలకిలారావాల మధ్యన, కాసేపు ఆ నెలయేటి పక్కనే ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పారుతున్న నీళ్ల మధ్యన గబగబా కదిలే ఆ బుల్లి బుల్లి చేపపిల్లలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తిరిగి ఎత్తైన చెట్ల మధ్యన నడుచుకుంటూ గుడివైపుకి వెళ్తుంటే అప్రయత్నంగా "ఆకులో ఆకునై..పూవులో పూవునై..." అన్న పాట గుర్తురాక మానదు! అటువంటి పరిసరాల్లో, ఆ క్షణంలో కలిగే అనుభూతి వర్ణించనలవి కాదు. ప్రపంచానికి దూరంగా, జనావాసంలేని ఈ చోట, వాల్డెన్ దగ్గర థోరూ లాగ కొన్నాళ్ళైనా ఉండిపోగలిగితే ఎంత బావుంటుందో.. అనిపించింది. కానీ ఇలా వెలుతురులో కాక చీకటి పడ్డాకా లైట్లు లేని ఈ ప్రాంతంలో ఏ జంతువో వస్తేనో.. అని భయం కూడా వేసింది.





అడవి మధ్యలో అంత లోపలికి ఆ చిన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎంతో మనోహరంగా ఉండే ఆ చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారో తెలియదు కానీ అక్కడ లభించే ప్రశాంతతని బట్టి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా తోస్తుంది. గుడి ఎదురుగా ఉత్తరముఖంగా ప్రవహించే వాగులో వర్షాకాలంలో బాగా నీళ్ళు నిండి ఉంటాయిట. ఏ గుడి దగ్గరైనా ఉత్తరముఖంగా నదీ ప్రవాహం ఉంటే ఆ ప్రాంతాన్ని దర్శించుకోవడం చాలా మంచిదని ఎక్కడో చదివిన గుర్తు. క్రిందకు దిగి ఆ వాగులో కాళ్ళు కడుక్కుని అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడివారు చెప్పారు. ఆలయం బయట ఒకవైపు పురాతనమైన మహిషాసురమర్దిని విగ్రహం, మరోవైపు గణపతి విగ్రహాలు ఉన్నాయి. గుడి ద్వారం క్రిందుగా ఉన్న చిన్న గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. పద్మాసనంలో ధ్యాన నిమగ్నమై ఉన్న ఈ నల్లటి విగ్రహం అరుదైన క్వార్టజైట్ రాతిపై చెక్కబడింది. చతుర్భుజాలలో పై రెండు చేతులు రెండు కలువ మొగ్గలను పట్టుకుని ఉండగా, ఎడమ చేయి శివలింగాన్నీ, కుడి చేయి రుద్రాక్షమాలనూ పట్టుకుని ఉన్నాయి. అమ్మవారికి స్వయంగా కుంకుమబొట్టు పెట్టే అవకాశం ఉందిక్కడ. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు చిత్రమైన తరంగాలు శరీరంలోకి పాకినట్లు అనిపించింది. అమ్మవారి ముందర వెలిగించిన దీపం తప్ప వెలుతురు లేని ఆ చిన్న గుహలో ఎంతో ప్రశాంతత ఉంది. మనసు చాలా నిశ్చలంగా  మారిపోయి ఇంకాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోయాను. ఎక్కువ జనం లేనందువల్ల ఆ అవకాశం దొరికింది. బయటకు వచ్చేసి ఆలయం ప్రాంగణంలో కూడా గచ్చు మీద చాలా సేపు ప్రశాంతంగా అమ్మనే ధ్యానిస్తూ కూర్చున్నా. అంత ప్రశాంతంగా, ఆనందంగా మునుపెన్నడూ లేదసలు.






గుడి బయట కాస్త దూరంలో కనబడుతున్న ఐదారు గుడిసెలల్లో నివసించే చెంచులే గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట. రోజూ అక్కడకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడకు వచ్చే చాలా మంది భక్తులు, వారిని తీసుకువచ్చే జీప్ డ్రైవర్లు అమ్మవారి ప్రసాదం తినే వెళ్తారుట. మేము కూడా కాస్తంత వేడి వేడి అన్నం ప్రసాదంగా తిని బయల్దేరాం. అటునుండి తిరిగిరావడానికి వెలుతురు ఉండగానే సాధ్యపడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట వరకే  అటు వెళ్ళే వాహనాలు శ్రీశైలం నుండి బయలుదేరతాయిట. ఐదు,ఐదున్నరగంటల ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో అడవిలోంచి బయటకు వచ్చితీరాలి. కాస్త చీకటి పడినా ప్రయాణం అసాధ్యమే ఆ దారిలో. రోడ్డు ఇలా ఉంది కాబట్టే ఆ ఆలయం ఇంకా అంత ప్రశాంతంగా ఉందేమో... మార్గం కనుక బాగుండి ఉంటే ఈపాటికి  అక్కడొక క్యూ కాంప్లెక్స్, బిల్డింగులు, భారీ జన సముదాయాలతో ఆ చల్లని వాతావరణం కూడా వేడిగా మారిపోయి ఉండేదేమో అనిపించింది.

తిరుగు ప్రయాణంలో జీప్ కుదుపులకి నే వీడియో తీస్తున్న కేమెరా క్రింద పడిపోయి, భుజం జీప్లోని రాడ్ కి గుద్దుకుపోయింది. చాలా రోజుల వరకూ ఆ భుజంనొప్పి తగ్గనే లేదు కానీ అమ్మవారిని దర్శించుకున్న చాలారోజుల వరకూ ఆ ప్రయాణం మిగిల్చిన మధురిమలు మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంటాయి. అందుకే ఆ దారమ్మట వెళ్ళే సాహసం మరోసారి చెయ్యాలని కోరిక... అమ్మ దయ ఉంటే సాధ్యం కానిదేది? ఆవిడ పిలుపుకై ఎదురుచూడటమే చెయ్యవలసింది!



క్రిందటేడాది మొదట్లో మళ్ళీ రెండవసారి అక్కడకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈసారి జీప్ లో సీటు ధర ఇంకా పెరిగింది. మనిషికి వెయ్యి రూపాయిలు తీసుకున్నారు. పిల్లలకైనా అదే రేటు. అక్కడకు వెళ్ళే భక్తులు పెరగడం వల్ల ఈసారి కాసిని మార్పులు కనబడ్డాయి అక్కడ. ఇదివరకూ ఒకటో రెండో కనబడే జీప్ లు ఇప్పుడు ఐదారు ఆగి ఉన్నాయి. జీప్ ఆగింది మొదలు గుడి దాకా కొందరు చెంచులు కూర్చుని ఏవేవో వనమూలికల అమ్మకాలు చేస్తున్నారు. దారిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఉండే సెలయేరు ఎండిపోయింది. నీళ్ళు లేవు, చేపలూ లేవు. గుడి వద్ద పువ్వులు, అగరుబత్తీ, కొబ్బరికాయలు మొదలైన అమ్మకాలు, డబ్బులు తీసుకునే చెప్పుల స్టాండు కూడా వెలిసాయి. గుడి ఎదురుగా ఉండే సెలయేట్లో కూడా నీరు బాగా తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం ఏ నిర్మలమైన వాతావరణాన్ని చూసి ముచ్చట పడ్డానో అది కాస్త తగ్గిందనే చెప్పాలి. గుడి దగ్గర క్రితంసారి ఆడుకుంటూ కనపడిన నాలుగైదు చిన్న చిన్న కుక్కపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవి ఐపోయాయి. రక్షణ కోసం వాటిని అక్కడే ఉండనిస్తారుట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం గురించి ఉన్న నమ్మకాలను పక్కన పెడతే; అక్కడ పార్వతీ దేవి తపస్సు చేసిందట అని ఎవరో అన్నారు. అంతేకాక ఎందరో ఋషులు, మునులు, దేవీ ఉపాసకులు తపస్సు చేసిన ప్రాంతం , అతి పురాతనమైన ఆలయం , అమ్మవారిది ఎంతో ప్రత్యేకమైన, మహిమాన్వితమైన విగ్రహం కాబట్టి, అమ్మ దర్శనం ఎంతైనా అభిలషనీయం. డివైన్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న అతికొద్ది స్థలాల్లో ఇదీ ఒకటిగా పరిగణించవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని దట్టమైన అడవిలోకి ఒక అడ్వంచరస్ ట్రిప్ కు వెళ్ళాలనుకునేవారికి కూడా ఈ ట్రిప్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది. ఈ ట్రిప్ కి వర్షాకాలం ముందర గాని పూర్తయిన సమయంలో గానీ వెళ్తే అడవిలోని పచ్చదనాన్ని మరింతగా ఆస్వాదించగలం.






Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Friday, March 15, 2019

ఆత్రుత







లిటరల్  గా లాప్టాప్ పై పేరుకున్న దుమ్ముని గుడ్డముక్కతో తుడిచి, ఈ అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ఉదయం నుంచీ మనసులో తిరగాడుతున్న భావాలను అక్షరాలుగా మార్చాలన్న ఆత్రమే దానికి కారణం. క్రింద ఫ్లోర్ లో జరిగిన సహస్రనామ పారాయణ పూర్తయి ఇంట్లోకి అడుగుపెట్టగానే నా కోసం ఎదురుచూస్తున్న కొరియర్ ని చూడగానే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది. 19-27 మధ్య అంటే నెక్స్ట్ వీక్ లో రావాల్సిన పుస్తకం అప్పుడే వచ్చేసింది. ఇదివరకూ కష్టపడి బస్సుల్లో కాసేపూ, కాలినడకన కాసేపూ వెళ్ళి, నాలుగైదు షాపుల్లో వెతికితే కావాల్సిన పుస్తకాలు దొరికేవి. ఇప్పుడు కేవలం ఫోన్ లో ఓ బటన్ నొక్కితే చాలు కావాల్సిన పుస్తకం ఇంటికొచ్చేస్తోంది. ఎంత హాయో! కానీ చదవడానికి సమయం ఏదీ? చదవాలని గత కొన్నేళ్ళుగా కొంటున్న రెండు, మూడు వందల పుస్తకాలు అలా క్యూ లో నిలబడి ఉండగా... మధ్యలో ఎప్పుడో మూడేళ్ల క్రితమేమో నా reading genre మారిపోయింది. సొంత సంపాదనతో కొంటున్నానన్న ఇష్టం వల్లనో, నేను దృష్టి పెట్టిన కొత్త సాహితీ ప్రకియపై ఉన్న మక్కువ వల్లనో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి చాలా వరకూ చదివేస్తున్నాననే చెప్పాలి. ఇప్పుడసలు పాత పుస్తకాలపై ధ్యాస పోవట్లేనే లేదు. నా సాహితీ తృష్ణ కేవలం నా కొత్త సాహితీ ప్రకియపైనే స్థిరంగా నిలిచిపోయింది. ఎందుకో ఇవన్నీ కొన్నాను.. ఇప్పుడిక ఏం ఉపయోగం నాకివి? అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి.  గతమంతా నిరర్థకం, నేటి ఉనికే యదార్థం! అనే స్థితికి చేర్చిన ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని. కానీ పాత పుస్తకాల్లో చాటిచెప్పాల్సిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. సమయం అనుకూలిస్తే వాటి గురించి రాయాలనే సంకల్పం మాత్రం ఉంది.

ఇంతకీ అసలు చెప్తున్న కథ నాకు వచ్చిన కొత్త పుస్తకం గురించి కదూ.. ఆత్రంగా చదవాలని కవర్ కట్ చేసి పుస్తకం బయటకు తియ్యగానే, ఈమధ్య నాలో బలంగా ఏర్పడిన ఒక లక్ష్యం కళ్లముందు కనబడగానే ఎంతో ఆనందం. ప్రేమగా అట్టని తడిమాను. పేజీలు కాస్త అటు ఇటు తిప్పేసరికీ భోజనాల టైమైంది. తినేస్తే హాయిగా పుస్తకం చదువుకోవచ్చు కదా అని గబగబా ఆ పని పూర్తి చేసి, అంట్లు పెడదామని బాల్కనీ లోకి వెళ్లగానే మిషన్లో ఆరిన బట్టలు కనబడ్డాయి. అయ్యో ఇవి ఆరెయ్యనేలేదు అనుకుని గబగబా ఆపని చేసి, బకెట్టు పెట్టేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లగానే పొద్దున్నే మిషన్ లో వెయ్యకుండా అతి ప్రేమగా నానపెట్టిన తెల్ల బట్టలు కనబడ్డాయి. చచ్చాన్రా దేవుడా అనుకుని గబగబా అవి ఉతికి ఆరేసి లోపలికి వస్తూంటే నిన్న బయటకు వెళ్తూ వెళ్తూ మడతపెట్టకుండా కుర్చీలో పాడేసిన నిన్నటి బట్టల కుప్ప దీనంగా పిలిచింది. లాభంలేదు అనుకుని అవన్నీ మడతలు పెట్టి, అలమార్లలో సర్దేసి హాల్లోకి వచ్చేసరికీ సోఫాలో మావిడల్లం కవర్ కోపంగా చూసింది. క్రితం నెల్లో హార్టీకల్చర్ ఎక్స్పో లో ఎంతో మోజుతో కొన్న అరకేజీ మావిడల్లం! పచ్చడి చేద్దామని ఇప్పటికి నాలుగుసార్లు ఫ్రిజ్ లోంచి తియ్యడం, టైమ్ లేక సాయంత్రమో రాత్రో తిరిగి ఫ్రిజ్ లో పెట్టేయడం. మావిడల్లం కొన్నప్పుడు తాజాది కావడం వల్ల ఇంకా బాగుంది. లేకపోతే ఎండిపోయేదే. ఇవాళన్నా పచ్చడి చేసేయాలి అని దాని పని పట్టాను. ఈలోపూ పనిమనిషి వచ్చే టైమైపోయి, తను వచ్చేసింది. తను పని పూర్తిచేసి వెళ్ళగానే ఇంక రొటీన్ మామూలే. మొక్కల పని, ఆ తర్వాత వాకింగ్, పూజ, మళ్ళీ వంట.. వరుస పనులే. పొద్దున్ననగా పుస్తకం వస్తే రాత్రి దాక చదవడానికి కాదు కదా ఈసారి తిరగెయ్యడానికే టైం లేదు. క్లైమాక్స్ లో ఏమౌతుందో అర్థం కాకుండా ఉన్న సస్పెన్స్ సినిమా ప్రేక్షకుడిలా ఉంది నా ఆత్రుత. రేపటికైనా ఈ పుస్తకం చదవడానికి టైమ్ దొరికితే బాగుండు. 

ఈ పోస్ట్ రాయకుండా ఈ పది నిమిషాలూ పుస్తకం చదవడానికి వాడుకుని ఉండచ్చు. కానీ దుమ్ము పేరుకున్న లాప్టాప్ పై దృష్టి పడగానే ఎందుకనో ఇవాళ రాయాలనిపించింది. కారణాలు లేకుండా ఏమీ జరగవు కదా. తీరిగ్గా ఊసుపోకుండా గడిపేలాంటి సమయం నాకు ఐదేళ్ల క్రితమూ లేదు. ఇప్పుడూ లేదు.  ఒకప్పుడు ఇష్టమైనవి, ఇవే నా తోడు అనుకున్న వాటి కోసం తీరుబడి చేసుకుని, పనిమనిషిని పెట్టుకోకుండా కూడా చాలా పనులే చెయ్యగలిగాను. ఏనాడైతే కొన్ని భ్రమలు బూడిదయ్యాయో, అప్పుడిక తీరుబడిలేని మరో దినచర్యని తయారుచేసుకుని, భగవంతుడు చూపెట్టిన మరో దారిలో నడక మొదలుపెట్టాను.

పుస్తకం చదవడం త్వరగా పూర్తయితే.. ఆ కబుర్లు త్వరలో పంచుకుంటాను.