సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 6, 2019

మహాత్మునికీ గాంధీకీ మధ్య

                            
                             


భారతదేశం యావత్తూ మహాత్మునిగా కొనియాడిన బోసినవ్వుల బాపూకి భార్యా, పిల్లలు ఉంటారని, దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించి నిర్దేశించడం మాత్రమే కాక బాపూజీకి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందనే ఆలోచన చిన్నతనంలో ఉండేది కాదు. "గాంధీ" చిత్రం ద్వారా మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి, కస్తూరి బా గురించీ కొన్ని వివరాలు తెలిసాయి. అయితే వారి పిల్లల గురించిన వివరాలు మరెక్కడా చదివిన గుర్తు లేదు. కాలేజీ రోజుల్లో ఒక ఆంగ్ల పత్రికలో వారి మొదటి కుమారుడి గురించి ఆర్టికల్ చదివి, భద్రపరిచిన గుర్తు. అప్పటి నుండీ హరిలాల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. కొన్నేళ్ళ క్రితం నటుడు అక్షయ్ ఖన్నాతో అనిల్ కపూర్ "గాంధీ, మై ఫాదర్" అనే చిత్రం నిర్మించారు. ఒక నవల ఆధారంగా చిత్రాన్ని తీసారని అన్నారు. ఆ నవల నాకు దొరకలేదు కానీ ఇన్నేళ్ళ తెరువాత ప్రముఖ గుజరాతీ రచయిత దినకర్ జోషీ నవల(ప్రకాశవో పరభావో)కు కూచి కామేశ్వరి గారి అనువాదం నాకు లభించింది.  అదే "మహాత్మునికీ గాంధీకీ మధ్య"! బాపూని ఒక సాధారణ తండ్రిలా మనకు చూపెట్టే కథ ఇది. గాంధీ మహాత్ముని పెద్ద కుమారుడైన హరీలాల్ జీవిత కథ. ఒక వ్యధాభరితమైన యదార్థ గాధ. 

ఈ నవల ద్వారా నాకొక మంచి రచయిత పరిచయమయ్యారు. దినకర్ జోషీ గారి వంటి డేడికేటెడ్ రైటర్ గురించి ఇప్పటికైనా నేను తెలుసుకోవడం చాలా ఆనందకరమైన సంగతి. కథా సంకలనాలు, నవలలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు అన్నీ కలిపి ఇప్పటివరకూ జోషీ గారివి 152 పుస్తకాల ప్రచురించబడ్డాయి. ఎనభై వసంతాలు దాటిన వయసులో కూడా సాహిత్యాభివృధ్ధికి ఆయన ఇంకా చేస్తున్న సేవ అపారమైనది. గుజరాతీ రచనలను ఎక్కువమందికి చేరవేయాలనే సదుద్దేశంతో ఆయన "గుజరాతీ సాహిత్య ప్రదాన్ ప్రతిష్ఠాన్ " అనే సంస్థను మొదలుపెట్టారుట. “We talk about Shakespeare, Tennyson…and Dostoevsky, but we don’t read books of our own languages. We lose out on a lot. It doesn’t make sense..” అంటారాయన. ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో, మన సాహిత్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో తెలియచెప్తూ ఆయన అన్న ఈ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఎవరి భాషను వారు నిలబెట్టుకోవడానికి సాహిత్యకారులు, రచయితలు ఎంతటి కృషి చేయ్యవలసి ఉందో ఈ మాటలు చెప్తాయి.

"మహాత్మునికీ గాంధీకీ మధ్య" నవలలో ఏ ఒకరి పక్షాన్నీ వహించకుండా బాపూకీ, వారి కుమారుడికీ మధ్యన నిలబడి, ఇధ్దరి దృష్టికోణాల్లోంచీ వారి వారి జీవితాలను మనకు చూపెట్టి; తుది నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం రచయిత సామర్ధ్యానికి నిదర్శనం. నాకు మాత్రం వారు బాపూ వైపుకి సమానమైన న్యాయం చూపెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారేమో అనే అనిపించింది. వ్యక్తిగతంగా గాంధీజీ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ హరిలాల్ జీవితగాధ చదువుతున్నంత సేపూ హరిలాల్ పై అవ్యాజమైన కరుణ కలుగుతుంది. జాతిని నడిపించిన మహాత్ముడి కుమారుడికా ఈ దురవస్థ? అయ్యో బిడ్డా.. ఎన్ని ఇక్కట్లపాలయ్యావయ్యా అని మనసు దు:ఖపడుతుంది. అతడి బలహీనతలపై జాలి కలుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు చూపే వివేకం, వాటిని అతడు ఎదుర్కున్న నేర్పూ, సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యం వేస్తుంది. చదువుతునంత సేపూ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు గాంధీ గారు అని సరిపెట్టుకోలేకపోయాను. కాస్తంత ఆధారం, రవ్వంత ప్రేమ, కొద్దిపాటి మార్గదర్శకత్వం దొరికి ఉండుంటే అతడి జీవితం ఏ ఉన్నత శిఖరాల వైపుకు పయనించి ఉండేదో అన్న ఆలోచన రాకమానదు.  ఏదేమైనా గాంధీజీ ఒక చోట అన్నట్టు కర్మ ఫలాన్ని మార్చడం ఎవరి తరం?! ఆ తల్లికి ఆ ఆక్రోశం, ఆ తండ్రికా అవమానం, ఆ బిడ్డకా పతనం రాసిపెట్టి ఉన్నాయి..!!

హరిలాల్ మరణవార్తతో, కేవలం వేళ్ళపై మాత్రమే లెఖ్ఖపెటగలిగిన సభ్యుల సమక్షంలో జరిగిన అతని అంత్యక్రియ ఘట్టంతో మొదలౌతుంది హరిలాల్ జీవితగాథ. ఉత్సాహవంతుడైన యువకుడిగా గాంధీ బాటలో సత్యాగ్రహంలో, పలు స్వాతంత్ర్యౌద్యమాల్లో పాల్గొన్న ఎంతో తెలివైన వ్యక్తిగా, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించే ప్రాసంగికుడిగా పాఠకులకు పరిచయమైన హరిలాల్ జీవనపయనం పాఠకుల ఉత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ చివరిదాకా ఆపకుండా నడిపిస్తుంది. అతడి వ్యక్తిత్వ పతనం ఎలా మొదలైంది, ఎటువంటి దీనావస్థలో చివరికి ఒంటరిగా మిగిలాడు అన్న సంగతులు పాఠకుడి కళ్ళని చెమ్మగిల్లకుండా ఆపలేవు. ఆ పతనానికీ, జరిగిన విషయాలన్నింటికీ మూలకారణంగా స్వకర్మనో, తల్లిదండ్రులనో కాక విధిని నిలబెట్టడం అనేది జోషీ గారి విఙ్ఞతకు నిదర్శనం.

పుస్తకం పూర్తయిన తర్వాత అంతర్జాలంలో హరిలాల్ గురించిన మరిన్ని వివరాల కోసం వెతుకుతూంటే ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు దొరికాయి. పలు వార్తాపత్రికల్లో అచ్చయిన గాంధీగారి స్వదస్తూరీ తాలూకూ ఉత్తరాలూ.. కొన్ని సంగతులు.. వాటిని సొమ్ము చేసుకోవడానికి వాటి హక్కుదారులు చూపిన ఉత్సుకత.. వగైరా వగైరా! వాటి వల్ల అర్ధమైంది ఏమిటంటే, హరిలాల్ జీవితంలోని కొన్ని సత్యాలని విపులీకరించకుండా రచయిత ఎంతో శ్రధ్ధతో ఈ కథని తీర్చిదిద్దారని, తద్వారా గాంధీమహాత్మునికి, హరిలాల్ కి కూడా ఎంతో గౌరవాన్ని మిగిల్చినవారయ్యారని!! శ్రీ దినకర్ జోషీ పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ కథ అనే కాదు కానీ కొన్ని చారిత్రక విశేషాలను, మనుషులను గురించి చదివిన ప్రతిసారీ నన్నో ప్రశ్న వేధిస్తూ ఉంటుంది - గతించిన చరిత్ర తెలిసినవాళ్ళ కన్నా తెలియనివాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఎవరిదైనా గాథ రాసేప్పుడు వారి చరిత్రల్లోని లోటుపాట్లని, చీకటి కోణాలను యదార్థం పేరుతో తెలియనివాళ్ళకు తెలియచెప్పి ఆ మనుషులకు అప్పటిదాకా ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టేయడం అనేది ఎంతవరకూ సమంజసం? అని! ఇప్పుడా గతించిన చీకటిని తవ్వుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? సమాజం, మానవాళి మరింతగా ఎదగటానికి మాత్రమే చరిత్ర ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరికీ ఏమాత్రం ఉపయోగకరం కాని గత కాలపు అభ్యంతకరమైన విశేషాలనూ, వివరాలనూ కెలికి, వెలికితీయడమనేది గతించిన వారిని అవమానించడమే కాక వ్యర్థ ప్రయాస అన్నది నా స్వాభిప్రాయం. 

ఈ నవల గురించి మరి కొన్ని వాక్యాలు రాస్తే పుస్తకాభిమానులతో ఈ పుస్తకం చదివించాలన్న నా ఉద్దేశం చప్పబడిపోతుందన్న అభిప్రాయంతో వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ నవల ద్వారా గాంధీగారి గురించి, కస్తూరి బా గురించీ, వారి ఇతర కుటుంబ సభ్యుల గురించీ, మనుషుల్లోని భిన్న స్వభావాల గురించీ ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచిన శ్రీ దినకర్ జోషీ అభినందనీయులు.


Sunday, April 28, 2019

Music Teacher





యాదృచ్ఛికంగా మొన్నొక రోజు ఈ సినిమా చూడడం జరిగింది. పచ్చని కొండలు, లోయలు, వాటి మధ్య సన్నని రోడ్డు, నీలాకాశం, మబ్బులు, మంచు... ఈ దృశ్యాల మీద ఒక అందమైన ఫాంట్ లో వస్తున్న టైటిల్స్, and as a cherry on top - backgroundలో ఒక వీనులవిందైన అర్థవంతమైన పాట!! వీటి మించి ఏం కారణం కావాలి స్క్రీన్ కి అతుక్కుపోవడానికి :) 





కథ, పాత్రలు పక్కన పెడితే మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చినది ఆ కొండలు, మంచు వాతావరణం, drizzling, ఆకుల చివర్ల నుంచి జారుతున్న నీటి బిందువులు, స్క్రీనంతా పరుచుకున్న పచ్చదనం! ఆహ్లాదకరమైన అటువంటి వాతావరణం ఏ కథనైనా బోర్ కొట్టించదు. రెండు ప్రఖ్యాత పాత హిందీ పాటల్ని రీమేక్ చేసారు. మధ్య మధ్య టీ కొట్లో తగిలించిన రేడియో లోంచి పాత పాటలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ పై కనబడుతున్న ఆ రాతి గోడ మీద కూచుని టీ తాగుతూ, వాన తుంపరలని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోతే ఎంత బావుంటుందో , ఆ ప్రాంతంలో నివశించే ప్రజల ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. సిమ్లా అందాలను అంతగా కళ్ళకి కట్టాడు సినిమాటోగ్రాఫర్ కౌశిక్ మొండాల్. కథ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న నాన్ లీనియర్ టెక్నిక్ ప్రేక్షకులలో ఉత్సుకతని చివరిదాకా నిలిపి ఉంచుతుంది. గౌరవ్ శర్మ అందించిన డైలాగ్స్ బాగా గుర్తుండిపోతా
యి.

కథలోకి వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి, కొడుకు, కూతురు ఉంటారు. (చిన్నప్పటి నుంచి బుల్లితెరపైనా, వెండితెరపై కూడా పలురకాల పాత్రల్లో చూసిన నీనా గుప్తా వయసెంతైనా తల్లి పాత్రలో నేనస్సలు ఊహించలేను. కానీ తప్పలేదు.) కొడుకు సంగీతం మాష్టారు. సింగర్ అవ్వాలనే కలతో బొంబాయి వెళ్ళి విఫలయత్నాల తరువాత తండ్రి మరణంతో తిరిగి ఇల్లు చేరతాడు. సంగీతం పాఠాలు చెప్పుకుంటూ, చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుకుంటూ జీవనం గడుపుతుంటాడు. నెరవేరని కలని, బాలీవుడ్ లో పెద్ద గాయకురాలుగా మారిన ఒకప్పటి తన శిష్యురాలిని తలుచుకుంటూ, వీలైనప్పుడల్లా సిగరెట్లు కాలుస్తూ, మౌనంగా విలపిస్తూ కొండల్లో, లోయల్లో తిరుగుతుంటాడు. ఇంతలో ఆ గాయక శిష్యురాలు కాసర్ట్ ఇవ్వడానికి వారి ఊరికి వస్తోందని తెలిసి అందరూ అతడిని పలకరిస్తూ ఉంటారు. ఆమెను కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో అదే రోజు తన చెల్లెలి పెళ్ళి ఫిక్స్ చేస్తాడు సంగీతం మాష్టారు. ఎనిమిదేళ్ళుగా ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఆ శిష్యురాలి గురించి కొన్ని డైలాగులు విన్నాకా అసలు కథ ఏంటా అని ఆసక్తి ఎక్కువౌతుంది. 









ఇక హీరోయిన్ అమృతా బాగ్చీ చాలా బావుంది. ఆమె పళ్ళు మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి కానీ చూడముచ్చటైన మొహం. పెద్ద పెద్ద కళ్ళు, గుబురు జుట్టు ఆమెను చాలా ఇష్టపడేలా చేస్తాయి. అసలా కళ్ళు...they speak volumes! అలాంటి స్వచ్ఛమైన పెద్ద పెద్ద కళ్ళ ను చూస్తూ ఒక జీవితం గడిపేయచ్చు. బాపూ ఉండి ఉంటే తప్పకుండా తన తదుపరి చిత్రంలో ఆమెనే తీసుకునేవారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో మాష్టారికీ, శిష్యురాలికీ మధ్య జరిగిన సంభాషణ మనసుకు హత్తుకుంటుంది. రెండు మూగమనసుల  బాధ అది. we feel that pain. ఆ సన్నివేశంలోని ప్రతి డైలాగ్ గుర్తుండిపోతుంది. "ఎనిమిదేళ్ల పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నా ఉత్తరాలకి జవాబు రాయలేదు" అని బేనీ ప్రశ్నించినప్పుడు, ఒక గాయపడిన ఎక్స్ప్రెషన్ తో "ఆప్ తో జాన్తే హై... గుస్సా కిత్నీ ఖతర్నాక్ చీజ్ హై" అంటుంది జ్యోత్స్న.  కళ్లల్లో నీళ్ళతో "తుమ్హారా ఇంతజార్ కిత్నా సుందర్ హై.." అని అతడంటే, మీకు తెలుసా.. కేవలం మిమ్మల్ని చూడడానికే ఈ ఊళ్ళో కాన్సర్ట్ కి ఒప్పుకున్నానంటుంది.  "ఆప్ కో పతా హై క్యా హువా? ఆప్కీ వో భోలీ సీ, మాసూమ్ సీ జునాయ్ థీ.. వో మర్ గయీ.." అంటుంది. మనసు చచ్చిపోయాకా ఏ బంధాలు మిగులుతాయని?!




ఒక కీలకమైన పాత్ర పోషించిన దివ్యా దత్తా గురించి తప్పక చెప్పుకోవాలి. చిత్ర కథకు ఏ మాత్రం అవసరం లేని ఆమెకూ, సంగీతం మాష్టారికీ మధ్య జరిగే కథ నాకు అస్సలు నచ్చలేదు. కేవలం స్నేహం చూపెట్టి, వారిదొక అందమైన అనుబంధంలా ఉంచేయచ్చు కదా! బేనీ పాత్రని మరింత బలహీనపరచడానికి గీత కథని వాడుకున్నాడేమో దర్శకుడు అని మాత్రం నాకు అనిపించింది. కావాలసింది దొరకలేదని ఏడుస్తూ కూర్చోకుండా ఆమెకు కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కనీసం గీతకు ఆసరా ఇచ్చాడని అతడిపై గౌరవం అన్నా ఉండేది. ఏదీ చెయ్యకుండా కేవలం ఒక అవకాశవాదిగా మాత్రం బేనీ ఉండిపోతాడు. కానీ గీత పాత్ర నాకు చాలా నచ్చింది. ఆమె చేసినది తప్పే అయినా కూడా ముసలి మామగారిని చూసుకుంటూ ఆమె గడిపే ఒంటరి జీవితం, చివర్లో ఆయనకు అంతిమ సంస్కారం కూడా తానే చెయ్యడం, బేనీ జీవితంలో తనకు స్థానం ఉండదని అర్థమయ్యాకా మౌనంగా అక్కడి నుంచి వెళ్పోవడం.. గొప్ప సంస్కారానికి నిదర్శనం. దివ్యా వాయిస్, ఆమె చెప్పే స్లో డైలాగ్స్ లో ఎంతో బరువు, విలువ ఉన్నాయి.  వాటిల్లో కొన్ని..

* " అకేలీ తో హమేషా హీ థీ.. బస్ అబ్ ఖాలీ హో గయీ."

* "రిష్తే జబర్దస్తీ జోడే జా సక్తే హై..లేకిన్ దిల్ నహీ"

* "జిందగీ మే జబ్ వహీ ఖ్వాయిష్ రెహ్ జాయె నా...తో ఇంతెజార్ కర్నా ఔర్ భీ ముష్కిల్ హో జాతా హై"

* "ఏ జో పహాడ్ హైనా, యహా జిత్నా మర్జీ రో లో.. జిత్నా మర్జీ చిల్లాలో, ఆవాజ్ జాకర్ హమ్ తక్ హీ పహుంచ్తీ హై"


చివరిగా, ఇదేమీ అద్భుతమైన సినిమా కాదు. కానీ హిమాచల్ లోయల అందాలు, పాటల్లో సాహిత్యం, మనం మమేకమై అనుభూతి చెందిన కొన్ని క్షణాలు మాత్రం తప్పకుండా మనతో ఉండిపోతాయి. ఈ చిత్రాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన దర్శకుడు సార్థక్ దాస్ గుప్తా సార్థక నామధేయుడై మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.





Saturday, April 27, 2019

వేసవిలో వర్షంలా - జర్సీ




"కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడద్దు అంటే లేదు యుద్ధం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
ఎవరి కోసం మారదద్దం "

చిత్రాన్ని చూసి వారం అవుతున్నా ఇదే పాట పదే పదే అప్రయత్నంగా హమ్ చేస్తున్నాను.
"ఓటమెరుగని ఆట కనగలరా...." పల్లవితో కృష్ణకాంత్ రచించిన ఈ పాట చాలా బావుంది. వెరీ ఇన్స్పిరేషనల్! కానీ డబ్బింగ్ పాటకి లిరిక్స్ రాసినట్లు పొందిక సరిగ్గా కుదరలేదు. నాలుగుసార్లు వింటే గానీ కొన్ని వాక్యాలు తెలీట్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో అనుకుంటా ఈయన రాసిన ఇంకో పాట "నువ్వంటే నా నువ్వు" పాట కూడా చాలా బావుంటుంది. 




ఈ చిత్రాన్ని గురించి వెంఠనే రాయాలనిపించినా... రాద్దామా వద్దా అనే మీమాంసలో ఉండగానే నిన్న మరో మంచి సినిమా చూడడం జరిగింది. ఇక ముందర మన తెలుగు సినిమా గురించి రాయకుండా ఎలా అని మొదలుపెట్టాను. ఈమధ్యన రెండు, మూడు తెలుగు చిత్రాలు చూశాకా, తెలుగులో మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి అని బోలెడు ఆనందం కలిగింది. హీరో గారు కాలు నేల కేసి కొట్టగానే భూకంపాలూ, ఒక్క గుద్దు గుద్దగానే మైలు దూరం వెళ్ళి పడడాలు, గాల్లోకి బళ్ళు ఎగరడాలు.. హీరోలు మారినా అవే దృశ్యాలు ఏళ్ల తరబడి తీసీ, తీసీ వీళ్ళకి విసుగెత్తదా అనిపించేది. కాస్త ట్రెండ్ మారుతోందని ఇన్నాళ్ళకి గట్టిగా అనిపిస్తోంది. నాని టాలెంట్ కి సరిపోయే చిత్రం ఇన్నాళ్లకు వచ్చింది. పాత్రలో నటుడిని కాకుండా పాత్రని చూడగలిగినప్పుడే కదా సత్తా బయటపడేది. జెర్సీ లో "అర్జున్" మాత్రమే కనిపిస్తాడు. ఏవరిదైనా యదార్థ గాథేమో అనిపించే ఈ పాత్రని ప్రేమించకుండా అసలు ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఈ వేసవిలో వర్షంలాంటి ’జెర్సీ ’ మనసు దోచేసింది. దర్శకుడి రెండవ ప్రయత్నం కూడా బావుంది. హ్యాట్రిక్ కోసం ఎదురుచూడాల్సిందే!

ఇది ఒక ఆటగాడి కథ అనేకన్నా, ఒక తండ్రీ కొడుకుల కథ అనాలి. తండ్రీ కొడుకుల మధ్య చూపెట్టిన ప్రతి సన్నివేశం అపురూపంగానే ఉంది. జెర్సీ కొనలేకపోయిన తండ్రికి తాను బాధపడడం లేదని కన్విన్స్ చేయడం కోసం పిల్లాడు చెప్పిన మాటలు, అల్మారాలో పోస్టర్ మార్చినప్పుడు చెప్పే మాటలు,  
"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకొక్కడే. వాడికి మా నాన్న ఉద్యోగం చేస్తాడా, డబ్బులు సంపాదిస్తాడా, సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా?ఇదేం సంబంధం లేదు? వాడికి నేను నాన్న !! అంతే." అనే డైలాగ్ విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఛారిటీ మ్యాచ్ అయ్యాకా కొడుకు చేతులెత్తి అప్లాస్ చెప్తూంటే అర్జున్ మొహంలో కనబడ్డ ఆనందం వర్ణనాతీతం!

ఇంకా - 
"మా ఇంట్లో ఒకళ్ల మీద ఒకళ్ళం అరుచుకోవడం ఉండదు, నేనే అరుస్తాను. నేనే బాధపడతాను. నేనే ఏడుస్తాను"

"అర్జున్ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వలేకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది" 
ఇలా.. చాలా బావున్న డైలాగ్స్ బోలెడున్నాయి.

అర్జున్ ని "బాబూ.." అని హీరోయిన్ పిలవడం భలే తమాషాగా ఉంది. కొన్ని సీన్స్ కూడా బాగా గుర్తుండిపోతాయి. 
* రైల్వే స్టేషన్ లో అరవడం ఐడియా చాలా బావుంది. ఎప్పుడైనా ప్రయత్నించచ్చు.
* "అమ్మ అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు" అని అర్జున్ కొడుకుని అడిగే సీన్ !
* లేడీ జర్నలిస్ట్ కి ఆమె ప్రేమికుడిని వదలద్దని చెప్పే సీన్.
* "మా నాన్న సంకల్పం ఎంత గొప్పదంటే.." అంటూ చివరలో అర్జున్ కొడుకు చెప్పే స్పీచ్.

ఎనభైల్లో కథ అని చెప్పడమే కాక ప్రతి సీన్ లోనూ సెట్టింగ్స్ కూడా చాలా ఏప్ట్ గా వేశారు. ఒక సీన్ లో గోడ దగ్గర బల్ల మీద పాత కాలంనాటి సింగిల్ స్టీరియో టేప్ రికార్డర్. అతి మామూలు సాదా సీదా ఇల్లు. చివరి సీన్ లో గ్రూప్ ఫోటో కోసం తంటాలు పడడం చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనే కోర్సుల్లో చేరుతున్న నేటి తరాలవారికి ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎలా అర్థమౌతాయి. ఐదొందలు సంపాదించాలని అర్జున్ పడే పాట్లు డబ్బుకి విలువే తెలియని ఈతరం యువతకి అర్థమౌతుందా? అనిపించింది. కష్టం తెలీకుండా, కాలు కిందపెట్టనివ్వకుండా, అపురూపంగా పెంచేస్తున్నారు పిల్లల్ని చాలామంది. రూపాయి రూపాయికీ వెతుక్కుని, చెమటోడ్చి సంపాదించినవాళ్ళకే రూపాయి విలువ, మనిషి విలువ తెలుస్తాయి. కష్టపడితేనే సుఖం విలువ అర్థమౌతుంది. 

కారణాలు ఏవైనా, పని ఎలాంటిదైనా, ఒక ఇష్టమైన పని చేయడం ఆపేస్తే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు! భార్య ఎంత తిడుతున్నా స్పందన లేకపోవడం, ఏ పనినీ ఆసక్తిగా చెయ్యలేకపోవడం, కరెంట్ బిల్లు డబ్బుతో నిర్లక్ష్యంగా పేకాట ఆడడం మొదలైనవి చూసి ఈ పాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నాడీ దర్శకుడు? అని ఆశ్చర్యపోయాను. స్టేడియంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన కట్టప్పగారితో "ఈ లోకంలో తప్ప బయట బతకలేనని అర్థమైంది సార్" అన్నప్పుడు నాకు అర్థమైంది ఈ పాయింట్ ని స్ట్రెస్ చెయ్యాలని ఆ క్యారెక్టర్ ని అలా చూపించారన్న మాట అని! 

కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. పుస్తకం అచ్చైన తర్వాతే ఎందుకు జెర్సీ పంపారు? అన్నేళ్లదాకా క్రికెట్ బోర్డ్ వాళ్ళు అర్జున్ కుటుంబాన్ని కాంటాక్ట్ చెయ్యలేదా? ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు మెడికల్ టెస్ట్ లు అవీ చేస్తారు కదా.. మరి అర్జున్ కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఆ మెడికల్ టెస్ట్స్ లో తెలియలేదా? తెలిస్తే అన్ని మ్యాచ్ లు ఎలా ఆడనిచ్చారు? మొదలైన సందేహాలు! ఆట మానేసాడన్న సంగతి మొదటిసారి విన్న అతడి భార్య, మిగతా సన్నిహితుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉండి ఉండచ్చేమో! 
చివరాఖరి సందేహం ఏమిటంటే - ఈ పాత్రని నాని కాకుండా ఎవరో కొత్త వ్యక్తి, ఇంతే బాగా నటించినా కూడా చిత్రాన్ని ఇలానే ఆదరించేవారా?? అని :)

Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 


Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.



Saturday, March 30, 2019

ఇష్టకామేశ్వరి






శ్రీశైలానికి సుమారు 14,15కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి. మొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్న స్థల పురాణం పుస్తకంలో ఆ ఆలయాన్ని గురించి చదివినప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని! ఆ తర్వాత వెళ్ళినప్పుడు కూడా వర్షాకాలంలో ఆ అడవి మార్గం వైపు ట్రిప్స్ ఉండని కారణంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకలేదు. ఆ తర్వాతి ప్రయాణంలో మాత్రం మొత్తానికి దేవి దర్శనభాగ్యం కలిగింది.

ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్న అటువంటి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి.  ఇదివరలో రెండు మూడు గంటలు పట్టేదిట ఈ ప్రయాణానికి. ఆ దారిలో కాస్త కంకర పోయడం వల్ల గంటన్నరే పడుతోందిట ఇప్పుడు. తారు రోడ్డుపై ఒక అరగంట, నలభై నిమిషాలు ప్రయాణించాకా దారి ఎడమ పక్క ఉన్న అడవిమార్గం వైపుకి మళ్ళుతుంది. కేవలం జీప్ లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించగలవు. ఎగుడుదిగుడుగా, ఎక్కడ జీప్ లోంచి జారి పడిపోతామో అనిపించేలా ఎత్తి కుదిపేస్తున్న జీపులో దాదాపు గంట పైగా ప్రయానించడం ఒక గొప్ప సాహసవంతమైన అనుభూతి!! జీప్ లో వెనుక కూచుని దాటి వచ్చిన రాళ్ళు నిండిన, ఎగుడుదిగుడు ఎత్తుపల్లాల దారిని చూస్తూంటే...బాబోయ్ ఈ దారిలోంచి బయటకు వచ్చామా అనిపిస్తుంది.




ఎంతో చాకచక్యంగా జీప్ నడపగలిగిన అనుభవం ఉన్నవారే ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చగలరు. మొదటిసారి వళ్ళినప్పుడు మనిషికి ’ఏడువందల ఏభై ఫిక్స్డ్ రేట్ ’ అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ తిరిగివచ్చేప్పుడు జీప్ మళ్ళీ తారు రోడ్డు ఎక్కాకా మాత్రం ధర న్యాయమైనదే అనిపించింది. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయణమే అది. హృద్రోగులూ, ఒళ్ళునెప్పులూ, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దారిలో వెళ్లకపోవడం మంచిది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆ రాళ్ళల్లో టైరు చిక్కుకుని ఈ జీప్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతే? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ఈ కీకారణ్యంలోంచి బయటపడగలమా? ఎక్కడో అడవిలో మారుమూల ఉన్న ఆ విగ్రహాన్ని చూడకపోతే ఏమి? అసలిక్కడ ఈ విగ్రహం ఉందని ఎవరు కనిపెట్టారో..? లాంటి ప్రశ్నలు ఈగల్లా ముసిరేస్తాయి ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కానీ గుడి దగ్గర జీప్ ఆగిన తర్వాత, దిగి ఒక్కసారి చుట్టూరా ఉన్న అక్కడి నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాకా, జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇలాంటి ప్రదేశాన్ని చూసి తీరాలి అని వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనిపించి తీరుతుంది.


జీప్ ఆగిన ప్రదేశం నుండి ఒక అర కిలోమీటరు లోపలికి నడవాలి. చుట్టూరా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం, రంగురంగుల అడవిపూలు, తలెత్తి పైకి చూస్తే చెట్ల మధ్య నుండి కనబడే నీలాకాశం, ఎత్తైన చెట్ల తాలూకూ పచ్చని ఆకుల మధ్య నుండి పడుతున్న సూర్యకిరణాలు, మధ్యలో దారికి అడ్డంగా పారుతున్న బుల్లి సెలయేరు, ఆ నీటిలో కదులుతున్న నల్లటి చిన్ని చిన్ని చేపపిల్లలు...పక్కగా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యన ఎత్తుగా పేర్చి ఉన్న రాళ్లపై కాస్త ఎత్తుమీద ఎప్పటిదో వినాయకుడి రాతివిగ్రహం...ఇలాంటి మనోహరమైన ప్రదేశాన్ని చూడగానే - చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న జానపద కథల్లోకి వచ్చేసామా అనిపించింది నాకు!











నిశ్శబ్దంగా ఉన్న ఆ అటవీప్రాంతంలో, పక్షుల కిలకిలారావాల మధ్యన, కాసేపు ఆ నెలయేటి పక్కనే ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పారుతున్న నీళ్ల మధ్యన గబగబా కదిలే ఆ బుల్లి బుల్లి చేపపిల్లలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తిరిగి ఎత్తైన చెట్ల మధ్యన నడుచుకుంటూ గుడివైపుకి వెళ్తుంటే అప్రయత్నంగా "ఆకులో ఆకునై..పూవులో పూవునై..." అన్న పాట గుర్తురాక మానదు! అటువంటి పరిసరాల్లో, ఆ క్షణంలో కలిగే అనుభూతి వర్ణించనలవి కాదు. ప్రపంచానికి దూరంగా, జనావాసంలేని ఈ చోట, వాల్డెన్ దగ్గర థోరూ లాగ కొన్నాళ్ళైనా ఉండిపోగలిగితే ఎంత బావుంటుందో.. అనిపించింది. కానీ ఇలా వెలుతురులో కాక చీకటి పడ్డాకా లైట్లు లేని ఈ ప్రాంతంలో ఏ జంతువో వస్తేనో.. అని భయం కూడా వేసింది.





అడవి మధ్యలో అంత లోపలికి ఆ చిన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎంతో మనోహరంగా ఉండే ఆ చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారో తెలియదు కానీ అక్కడ లభించే ప్రశాంతతని బట్టి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా తోస్తుంది. గుడి ఎదురుగా ఉత్తరముఖంగా ప్రవహించే వాగులో వర్షాకాలంలో బాగా నీళ్ళు నిండి ఉంటాయిట. ఏ గుడి దగ్గరైనా ఉత్తరముఖంగా నదీ ప్రవాహం ఉంటే ఆ ప్రాంతాన్ని దర్శించుకోవడం చాలా మంచిదని ఎక్కడో చదివిన గుర్తు. క్రిందకు దిగి ఆ వాగులో కాళ్ళు కడుక్కుని అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడివారు చెప్పారు. ఆలయం బయట ఒకవైపు పురాతనమైన మహిషాసురమర్దిని విగ్రహం, మరోవైపు గణపతి విగ్రహాలు ఉన్నాయి. గుడి ద్వారం క్రిందుగా ఉన్న చిన్న గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. పద్మాసనంలో ధ్యాన నిమగ్నమై ఉన్న ఈ నల్లటి విగ్రహం అరుదైన క్వార్టజైట్ రాతిపై చెక్కబడింది. చతుర్భుజాలలో పై రెండు చేతులు రెండు కలువ మొగ్గలను పట్టుకుని ఉండగా, ఎడమ చేయి శివలింగాన్నీ, కుడి చేయి రుద్రాక్షమాలనూ పట్టుకుని ఉన్నాయి. అమ్మవారికి స్వయంగా కుంకుమబొట్టు పెట్టే అవకాశం ఉందిక్కడ. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు చిత్రమైన తరంగాలు శరీరంలోకి పాకినట్లు అనిపించింది. అమ్మవారి ముందర వెలిగించిన దీపం తప్ప వెలుతురు లేని ఆ చిన్న గుహలో ఎంతో ప్రశాంతత ఉంది. మనసు చాలా నిశ్చలంగా  మారిపోయి ఇంకాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోయాను. ఎక్కువ జనం లేనందువల్ల ఆ అవకాశం దొరికింది. బయటకు వచ్చేసి ఆలయం ప్రాంగణంలో కూడా గచ్చు మీద చాలా సేపు ప్రశాంతంగా అమ్మనే ధ్యానిస్తూ కూర్చున్నా. అంత ప్రశాంతంగా, ఆనందంగా మునుపెన్నడూ లేదసలు.






గుడి బయట కాస్త దూరంలో కనబడుతున్న ఐదారు గుడిసెలల్లో నివసించే చెంచులే గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట. రోజూ అక్కడకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడకు వచ్చే చాలా మంది భక్తులు, వారిని తీసుకువచ్చే జీప్ డ్రైవర్లు అమ్మవారి ప్రసాదం తినే వెళ్తారుట. మేము కూడా కాస్తంత వేడి వేడి అన్నం ప్రసాదంగా తిని బయల్దేరాం. అటునుండి తిరిగిరావడానికి వెలుతురు ఉండగానే సాధ్యపడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట వరకే  అటు వెళ్ళే వాహనాలు శ్రీశైలం నుండి బయలుదేరతాయిట. ఐదు,ఐదున్నరగంటల ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో అడవిలోంచి బయటకు వచ్చితీరాలి. కాస్త చీకటి పడినా ప్రయాణం అసాధ్యమే ఆ దారిలో. రోడ్డు ఇలా ఉంది కాబట్టే ఆ ఆలయం ఇంకా అంత ప్రశాంతంగా ఉందేమో... మార్గం కనుక బాగుండి ఉంటే ఈపాటికి  అక్కడొక క్యూ కాంప్లెక్స్, బిల్డింగులు, భారీ జన సముదాయాలతో ఆ చల్లని వాతావరణం కూడా వేడిగా మారిపోయి ఉండేదేమో అనిపించింది.

తిరుగు ప్రయాణంలో జీప్ కుదుపులకి నే వీడియో తీస్తున్న కేమెరా క్రింద పడిపోయి, భుజం జీప్లోని రాడ్ కి గుద్దుకుపోయింది. చాలా రోజుల వరకూ ఆ భుజంనొప్పి తగ్గనే లేదు కానీ అమ్మవారిని దర్శించుకున్న చాలారోజుల వరకూ ఆ ప్రయాణం మిగిల్చిన మధురిమలు మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంటాయి. అందుకే ఆ దారమ్మట వెళ్ళే సాహసం మరోసారి చెయ్యాలని కోరిక... అమ్మ దయ ఉంటే సాధ్యం కానిదేది? ఆవిడ పిలుపుకై ఎదురుచూడటమే చెయ్యవలసింది!



క్రిందటేడాది మొదట్లో మళ్ళీ రెండవసారి అక్కడకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈసారి జీప్ లో సీటు ధర ఇంకా పెరిగింది. మనిషికి వెయ్యి రూపాయిలు తీసుకున్నారు. పిల్లలకైనా అదే రేటు. అక్కడకు వెళ్ళే భక్తులు పెరగడం వల్ల ఈసారి కాసిని మార్పులు కనబడ్డాయి అక్కడ. ఇదివరకూ ఒకటో రెండో కనబడే జీప్ లు ఇప్పుడు ఐదారు ఆగి ఉన్నాయి. జీప్ ఆగింది మొదలు గుడి దాకా కొందరు చెంచులు కూర్చుని ఏవేవో వనమూలికల అమ్మకాలు చేస్తున్నారు. దారిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఉండే సెలయేరు ఎండిపోయింది. నీళ్ళు లేవు, చేపలూ లేవు. గుడి వద్ద పువ్వులు, అగరుబత్తీ, కొబ్బరికాయలు మొదలైన అమ్మకాలు, డబ్బులు తీసుకునే చెప్పుల స్టాండు కూడా వెలిసాయి. గుడి ఎదురుగా ఉండే సెలయేట్లో కూడా నీరు బాగా తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం ఏ నిర్మలమైన వాతావరణాన్ని చూసి ముచ్చట పడ్డానో అది కాస్త తగ్గిందనే చెప్పాలి. గుడి దగ్గర క్రితంసారి ఆడుకుంటూ కనపడిన నాలుగైదు చిన్న చిన్న కుక్కపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవి ఐపోయాయి. రక్షణ కోసం వాటిని అక్కడే ఉండనిస్తారుట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం గురించి ఉన్న నమ్మకాలను పక్కన పెడతే; అక్కడ పార్వతీ దేవి తపస్సు చేసిందట అని ఎవరో అన్నారు. అంతేకాక ఎందరో ఋషులు, మునులు, దేవీ ఉపాసకులు తపస్సు చేసిన ప్రాంతం , అతి పురాతనమైన ఆలయం , అమ్మవారిది ఎంతో ప్రత్యేకమైన, మహిమాన్వితమైన విగ్రహం కాబట్టి, అమ్మ దర్శనం ఎంతైనా అభిలషనీయం. డివైన్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న అతికొద్ది స్థలాల్లో ఇదీ ఒకటిగా పరిగణించవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని దట్టమైన అడవిలోకి ఒక అడ్వంచరస్ ట్రిప్ కు వెళ్ళాలనుకునేవారికి కూడా ఈ ట్రిప్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది. ఈ ట్రిప్ కి వర్షాకాలం ముందర గాని పూర్తయిన సమయంలో గానీ వెళ్తే అడవిలోని పచ్చదనాన్ని మరింతగా ఆస్వాదించగలం.






Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Friday, March 15, 2019

ఆత్రుత







లిటరల్  గా లాప్టాప్ పై పేరుకున్న దుమ్ముని గుడ్డముక్కతో తుడిచి, ఈ అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ఉదయం నుంచీ మనసులో తిరగాడుతున్న భావాలను అక్షరాలుగా మార్చాలన్న ఆత్రమే దానికి కారణం. క్రింద ఫ్లోర్ లో జరిగిన సహస్రనామ పారాయణ పూర్తయి ఇంట్లోకి అడుగుపెట్టగానే నా కోసం ఎదురుచూస్తున్న కొరియర్ ని చూడగానే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది. 19-27 మధ్య అంటే నెక్స్ట్ వీక్ లో రావాల్సిన పుస్తకం అప్పుడే వచ్చేసింది. ఇదివరకూ కష్టపడి బస్సుల్లో కాసేపూ, కాలినడకన కాసేపూ వెళ్ళి, నాలుగైదు షాపుల్లో వెతికితే కావాల్సిన పుస్తకాలు దొరికేవి. ఇప్పుడు కేవలం ఫోన్ లో ఓ బటన్ నొక్కితే చాలు కావాల్సిన పుస్తకం ఇంటికొచ్చేస్తోంది. ఎంత హాయో! కానీ చదవడానికి సమయం ఏదీ? చదవాలని గత కొన్నేళ్ళుగా కొంటున్న రెండు, మూడు వందల పుస్తకాలు అలా క్యూ లో నిలబడి ఉండగా... మధ్యలో ఎప్పుడో మూడేళ్ల క్రితమేమో నా reading genre మారిపోయింది. సొంత సంపాదనతో కొంటున్నానన్న ఇష్టం వల్లనో, నేను దృష్టి పెట్టిన కొత్త సాహితీ ప్రకియపై ఉన్న మక్కువ వల్లనో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి చాలా వరకూ చదివేస్తున్నాననే చెప్పాలి. ఇప్పుడసలు పాత పుస్తకాలపై ధ్యాస పోవట్లేనే లేదు. నా సాహితీ తృష్ణ కేవలం నా కొత్త సాహితీ ప్రకియపైనే స్థిరంగా నిలిచిపోయింది. ఎందుకో ఇవన్నీ కొన్నాను.. ఇప్పుడిక ఏం ఉపయోగం నాకివి? అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి.  గతమంతా నిరర్థకం, నేటి ఉనికే యదార్థం! అనే స్థితికి చేర్చిన ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని. కానీ పాత పుస్తకాల్లో చాటిచెప్పాల్సిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు ఉన్నాయి. సమయం అనుకూలిస్తే వాటి గురించి రాయాలనే సంకల్పం మాత్రం ఉంది.

ఇంతకీ అసలు చెప్తున్న కథ నాకు వచ్చిన కొత్త పుస్తకం గురించి కదూ.. ఆత్రంగా చదవాలని కవర్ కట్ చేసి పుస్తకం బయటకు తియ్యగానే, ఈమధ్య నాలో బలంగా ఏర్పడిన ఒక లక్ష్యం కళ్లముందు కనబడగానే ఎంతో ఆనందం. ప్రేమగా అట్టని తడిమాను. పేజీలు కాస్త అటు ఇటు తిప్పేసరికీ భోజనాల టైమైంది. తినేస్తే హాయిగా పుస్తకం చదువుకోవచ్చు కదా అని గబగబా ఆ పని పూర్తి చేసి, అంట్లు పెడదామని బాల్కనీ లోకి వెళ్లగానే మిషన్లో ఆరిన బట్టలు కనబడ్డాయి. అయ్యో ఇవి ఆరెయ్యనేలేదు అనుకుని గబగబా ఆపని చేసి, బకెట్టు పెట్టేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లగానే పొద్దున్నే మిషన్ లో వెయ్యకుండా అతి ప్రేమగా నానపెట్టిన తెల్ల బట్టలు కనబడ్డాయి. చచ్చాన్రా దేవుడా అనుకుని గబగబా అవి ఉతికి ఆరేసి లోపలికి వస్తూంటే నిన్న బయటకు వెళ్తూ వెళ్తూ మడతపెట్టకుండా కుర్చీలో పాడేసిన నిన్నటి బట్టల కుప్ప దీనంగా పిలిచింది. లాభంలేదు అనుకుని అవన్నీ మడతలు పెట్టి, అలమార్లలో సర్దేసి హాల్లోకి వచ్చేసరికీ సోఫాలో మావిడల్లం కవర్ కోపంగా చూసింది. క్రితం నెల్లో హార్టీకల్చర్ ఎక్స్పో లో ఎంతో మోజుతో కొన్న అరకేజీ మావిడల్లం! పచ్చడి చేద్దామని ఇప్పటికి నాలుగుసార్లు ఫ్రిజ్ లోంచి తియ్యడం, టైమ్ లేక సాయంత్రమో రాత్రో తిరిగి ఫ్రిజ్ లో పెట్టేయడం. మావిడల్లం కొన్నప్పుడు తాజాది కావడం వల్ల ఇంకా బాగుంది. లేకపోతే ఎండిపోయేదే. ఇవాళన్నా పచ్చడి చేసేయాలి అని దాని పని పట్టాను. ఈలోపూ పనిమనిషి వచ్చే టైమైపోయి, తను వచ్చేసింది. తను పని పూర్తిచేసి వెళ్ళగానే ఇంక రొటీన్ మామూలే. మొక్కల పని, ఆ తర్వాత వాకింగ్, పూజ, మళ్ళీ వంట.. వరుస పనులే. పొద్దున్ననగా పుస్తకం వస్తే రాత్రి దాక చదవడానికి కాదు కదా ఈసారి తిరగెయ్యడానికే టైం లేదు. క్లైమాక్స్ లో ఏమౌతుందో అర్థం కాకుండా ఉన్న సస్పెన్స్ సినిమా ప్రేక్షకుడిలా ఉంది నా ఆత్రుత. రేపటికైనా ఈ పుస్తకం చదవడానికి టైమ్ దొరికితే బాగుండు. 

ఈ పోస్ట్ రాయకుండా ఈ పది నిమిషాలూ పుస్తకం చదవడానికి వాడుకుని ఉండచ్చు. కానీ దుమ్ము పేరుకున్న లాప్టాప్ పై దృష్టి పడగానే ఎందుకనో ఇవాళ రాయాలనిపించింది. కారణాలు లేకుండా ఏమీ జరగవు కదా. తీరిగ్గా ఊసుపోకుండా గడిపేలాంటి సమయం నాకు ఐదేళ్ల క్రితమూ లేదు. ఇప్పుడూ లేదు.  ఒకప్పుడు ఇష్టమైనవి, ఇవే నా తోడు అనుకున్న వాటి కోసం తీరుబడి చేసుకుని, పనిమనిషిని పెట్టుకోకుండా కూడా చాలా పనులే చెయ్యగలిగాను. ఏనాడైతే కొన్ని భ్రమలు బూడిదయ్యాయో, అప్పుడిక తీరుబడిలేని మరో దినచర్యని తయారుచేసుకుని, భగవంతుడు చూపెట్టిన మరో దారిలో నడక మొదలుపెట్టాను.

పుస్తకం చదవడం త్వరగా పూర్తయితే.. ఆ కబుర్లు త్వరలో పంచుకుంటాను.

Tuesday, September 11, 2018

This is Raagam 24x7 DTH..

 
 
"This is Raagam 24x7 DTH - Indian Classical Music Channel" అంటూ పలుమార్లు వినబడే ప్రకటనతో సాగే ఒక రేడియో ఛానల్ "రాగం". 2016, జనవరి26న మొదలైంది ఈ ఛానల్. ఇది ఒక 'AIR Mobile App'. Android, iOS , ఇంకా Windows లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ ఛానల్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఇరవై నాలుగు గంటలూ కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే వస్తుంది. సంగీతప్రియులకు ఇది ఒక మ్యూజికల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలతో పాటూ వాద్య సంగీతం కూడా ఇందులో ప్రసారమవుతుంది. 
 
ఫోన్ లోనో, లేప్టాప్ లోనో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. పొద్దున్నే భక్తి సంగీతం, భజన్స్ వేస్తారు. తర్వాత వీణ, సితార్, వేణువు, జల తరంగిణి, సంతూర్ మొదలైన వాద్య సంగీత కచేరీలు వస్తాయి.

 
వీణ కచేరీ వింటుంటే ఏదో గంధర్వ లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. సంతూర్ వాదన వింటూంటే వర్షంలో తడుస్తున్నట్లు, జల తరంగిణి వింటుంటే ఉత్సాహంగానూ ఉంటుంది. సితార్ వాదన వింటూంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మా ఇంట్లో ఇదివరకటి ఎఫ్.ఎం ల స్థానంలో నిరంతరం ఇదే మోగుతూ ఉంటుంది ఇప్పుడు. మనసు ఏ రకమైన స్థితిలో ఉన్నా ఆహ్లాదకరమైన సాంగత్యాన్ని శాస్త్రీయ సంగీతం తప్ప మరేమి ఇవ్వగలదు?

ఈ కచేరీలలో ఎక్కువగా బాగా పేరున్న సంగీత విద్వాంసుల పాత రికార్డింగ్స్ ఎప్పటివో కూడా వేస్తూ ఉంటారు. అన్ని రేడియో స్టేషన్స్ వారి రికార్డింగ్స్ ఇందులో వంతులవారీగా ప్రసారమవుతూ ఉంటాయి.

మధ్య మధ్య కొన్ని ప్రత్యేకమైన సంగీత రూపకాలు, సంగీత విద్వాంసులతో ఇంటర్వ్యూలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. మనకు తెలియని ఎందరో గొప్ప కళాకారులు ఈ ఇంటర్వ్యూల ద్వారా మనకు పరిచయమౌతారు. ఏ భాష వారి అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఆ అనౌన్స్మెంట్ లకు ఆంగ్లంలో అనువాదం కూడా వస్తుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఇంత చక్కని ఛానల్ ని తయారు చేసిన All India Radio వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
 

ఇదివరకూ దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇలా రకరకాల సంగీతాలు వచ్చే రేడియో ఒకటి ఉండేది. క్లాసికల్, రాక్,జాజ్, వెస్టర్న్, పాత హిందీ పాటలు ఇలా రకరకాలు ఉండేవి. దానికి ఒక ప్రత్యేకమైన ఏంటన్నా కొనుక్కుంటే ఆ ప్రసారాలు వచ్చేవి. అందులో కూడా నిరంతరం శాస్త్రీయ సంగీతం వచ్చే ఛానల్ ఉండేది కానీ అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. నెలకో, ఆర్నెల్లకో పేమెంట్ ఉండి, ఏంటన్నా కూడా ఉండాల్సివచ్చేది ఆ రేడియోకి. ఇప్పుడా అవసరం లేదు. అన్ని యాప్స్ లాగ మొబైల్ లో డౌన్లోడ్ చేసేసుకుంటే, రాగంతో పాటూ మరో పది పదిహేను భాషల AIR వారి రేడియో ఛానల్స్ ఈ యాప్ లో ఉన్నాయి. 
 
 
 

 
 
 
 
 
 
ఈ యాప్ గురించి తెలియని సంగీతప్రియులు ఈ సదుపాయం ఉపయోగించుకుంటారని ఇక్కడ రాస్తున్నాను.

 

Monday, September 10, 2018

C/O కంచరపాలెం - Brilliance in pieces

 

చిన్నప్పటి మాల్గుడి డేస్, స్వామీ సిరీస్ లు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో చూసినప్పుడు , కాలంలో వచ్చిన దమ్ లగాకే హైసా మొదలైన చిత్రాలు చూసినప్పుడు మన తెలుగు చిత్రాల్లో ఇలాంటి వైవిధ్యత ఎప్పటికి వస్తుందో అని చాలా సార్లు అనిపించేది. కానీ ఇటీవల మన తెలుగు చిత్రాలు కొన్నింటిని చూస్తున్నప్పుడు, ఆశ నిజమౌతోందే అని ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. అనుకోకుండా నిన్న చూసిన c/o కంచరపాలం’ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇన్నాళ్లకు మరో కొత్త ఒరవడి తెలుగు చిత్రాల్లోకి ప్రవేశించింది అన్న ఆనందం కలిగింది. చిత్ర దర్శకుడు మహా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు "తెలుగు చిత్రాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో రకరకాల భాషల ప్రేక్షకులు సబ్ టైటిల్స్ తో చూసే రోజులు రావాలి."



జీవన సారాన్నంతటినీ నింపుకున్న టైటిల్స్ లో వచ్చిన "ఏమి జన్మము, ఏమి జీవనము " తత్వం రాసినది "బ్రేట్రాయి సామి దేవుడా" రచించిన శ్రీ ఎడ్ల రామదాసు గారే అని తెలిసి చాలా గొప్పగా అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉందా పాట. మరుగున పడిపోయిన గొప్ప సంగీత కళాకారులు ఎందరున్నారో అనిపించింది
.
చిత్రంలోని అన్ని పాటలు ఉన్న లింక్ ఇది
-
https://www.youtube.com/watch?v=EptptaouHMg


టైటిల్స్ లో శ్రీ ఎడ్ల రామదాసు గారి " ఏమి జన్మము", సినిమా ఓపెనింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ చివరి ఐదు నిమిషాలు కూడా అలానే అద్భుతంగా ఉంది. కానీ మధ్య మధ్యలో మాత్రం గొంతు లోంచి కిందకి దిగని చిన్న చిన్న రాళ్ళు కొన్ని పూర్తిగా కడుపు నింపుకోనియ్యలేదు. సినిమా అనేది చాలా పవర్ ఫుల్ మీడియా. అన్నం తినడం, నిద్ర పోవడం లాంటి ప్రాథమిక అవసరాలను సైతం మరచి సినిమా చూడ్డం కోసం పాటుపడే తత్వం ఉన్నవారం మన ప్రేక్షకులందరమూ! తెరపై ఏది చూస్తే అది చేసెయ్యాలనిపించేంత ఆకర్షణాశక్తి సినిమాది. గతంలో తెలుపు-నలుపు చిత్రాల రోజుల్లో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలన్నా, ఏదన్నా మంచిని చాటి చెప్పాలన్నా, ఒక అన్యాయాన్ని ఎదిరించాలన్నా సినిమాని మాధ్యమంగా ఎన్నుకునేవారు చాలా మంది పెద్దలు. ఉద్దేశాలు పని చేసేవి కూడా. ఇంత గొప్పగా సినిమా ని తీసి, ఇలాంటివి చూపెట్టడం బాలేదనిపించింది నాకు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. నా సొంత బ్లాగ్ కాబట్టి నా ఘోషని నిస్సందేహంగా ఇందులో రాసుకుంటున్నాను.


చిత్రం సాంకేతికంగా ఎంతో అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం, పాటలు రెండూ పరమాద్భుతంగా ఉన్నాయి. కథను, పాత్రలను ఎన్నుకున్న విధానం, ఆర్టిస్టు లు అందరూ ఎలా చిత్రానికి ఎంపికయ్యారో కూడా వారి మాటల్లోనే థ్రిల్లింగ్ గా యుట్యూబ్ లో విన్నాం. ఎంతో కష్టపడి తీసారు. వారి కష్టానికి తగ్గ ఫలితంగా అన్నట్లు మంచి పబ్లిసిటీ కూడా లభించింది. కానీ నా గొంతులో దిగని కొన్ని రాళ్లను గురించి మాత్రం రాయాలనిపించి మొదలుపెట్టాను
.

1)
స్కూలు పిల్లలతో ప్రేమ అనేది చాలా బాధాకరంగా అనిపించింది. అసలే ఈకాలంలో చుట్టూరా ఉన్న సెల్ ఫోన్లూ, టివీలు, యూట్యూబులతో చాలామంది పిలల్లు దారితప్పుతున్నారు. వాటికి తోడు సినిమాల్లో టినేజీ ప్రేమకథలనే భరించలేకపోతుంటే, కొన్ని సినిమాల్లో లాగనే ఇందులో కూడా స్కూలు పిల్లలతో కూడా ప్రేమకథ చూపెట్టడం నాకైతే ఎంత మాత్రం నచ్చలేదు
.

2)
స్వాతంత్రదినోత్సవం నాడు దేశభక్తి గీతాలు పాడకుండా అలాంటి సినిమాపాటలు పాడతారా? అదీ ప్రభుత్వ పాఠశాలలో? ఏమో నేనెప్పూడూ వినలేదు. సీన్ లో లెంపకాయ కొట్టిన పాప తండ్రికి సీట్లోంచి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపించింది
.

3)
లెఖ్ఖ లేనన్ని మందు తాగే సన్నివేశాలు. అలాంటి ఒక్క సన్నివేశం కూడా లేకుండా నేటివిటీ ఉన్న బోలెడు గొప్ప సినిమాలు ఇదివరకూ తీసారు కదా.







4)మరో ముఖ్యమైన తప్పు వినాయకుడి విగ్రహంపై చిన్నపిల్లాడు రాళ్ళు విసిరి పాడుచెయ్యడం
.
ముఫ్ఫై అడుగులు ఎత్తున్న విగ్రహంపై రాళ్ళు విసిరడమే ఒక పొరపాటు. అసలు చిన్నపిల్లాడికి అంత ఎత్తుకు రాయి విసరడం చేత కాదుఇక, ఒకవేళ విసిరినట్లు చూపినా, అది విగ్రహాన్ని నష్టపరచినట్లు చూపకుండా ఉండాల్సింది. దేశంలో ఇన్ని కోట్లమంది పూజించే ఒక దేవుడి విగ్రహాన్ని రాళ్ళు పెట్టి కొట్టి నష్టపరిచినట్లు చూపడం భగవంతుడిని అవమానించినట్లే కదా?
 
 
 
 


బాపుగారి జోక్ లాగ అవకతవక కంగాళీ సినిమాలు చాలా ఉంటాయి. కానీ రాళ్ల మధ్యన వజ్రం ఒకటి దొరికినప్పుడు ఆనందించేలోపే వజ్రంలో చిన్న బీట కనిపిస్తే, దాని మెరుపు తగ్గకపోవచ్చు కానీ దాని విలువ తరిగిపోతుందిగా!!


మా నాన్నగారు తను చేసిన ప్రతి కొత్త ప్రోగ్రామ్ ని పేద్ద సౌండ్ పెట్టుకుని పదే పదే రోజూ కొన్నాళ్ల పాటు వినేవారు. ఏమిటో అన్నిసార్లు ఎలా వింటారో అనుకునేదాన్ని. చిత్రదర్శకుడు మహా ఒక ఇంటర్వ్యూలో చిత్రాన్ని రెండువేలసార్లు చూసుకుని ఉంటాను అంటుంటే అనిపించింది.. ఎవరి సృష్టి వారికి ఆనందం. తల్లి అప్పుడే పుట్టిన తన పిల్లలను పదే పదే చూసుకుని మురిసిపోయినట్లు, ఫీల్డ్ లోని ఆర్టిస్ట్ కైనా అంతేనని అనిపించింది. దర్శకుడి కష్టానికి తగ్గట్లుగా భగవంతుడు మంచి ప్రొడ్యూసర్ ని కూడా సమకూర్చాడు. చిత్రంలో ఒక కీలకమైన పాత్రని పోషించి తనలోని నటనా ప్రతిభను కూడా చూపెట్టారు అమెరికన్ డాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు. గడ్డం- సలీమా ప్రేమకథే కాస్తంత కర్చీఫుకి పని చెప్పింది కూడా.

ప్రేక్షకులు ఉత్సాహంగా చిత్రాన్ని ఆదరించి, యువ దర్శకుడికి మరిన్ని అవకాశాలు వచ్చి, /మా బెజవాడ అబ్బాయి లోపాలు లేని మరిన్ని అద్భుతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.