సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రయాణాలు. Show all posts
Showing posts with label ప్రయాణాలు. Show all posts

Saturday, March 30, 2019

ఇష్టకామేశ్వరి






శ్రీశైలానికి సుమారు 14,15కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి. మొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొనుక్కున్న స్థల పురాణం పుస్తకంలో ఆ ఆలయాన్ని గురించి చదివినప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని! ఆ తర్వాత వెళ్ళినప్పుడు కూడా వర్షాకాలంలో ఆ అడవి మార్గం వైపు ట్రిప్స్ ఉండని కారణంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకలేదు. ఆ తర్వాతి ప్రయాణంలో మాత్రం మొత్తానికి దేవి దర్శనభాగ్యం కలిగింది.

ఎత్తుపల్లాలు, రాళ్ళు రప్పలు ఉన్న అటువంటి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి.  ఇదివరలో రెండు మూడు గంటలు పట్టేదిట ఈ ప్రయాణానికి. ఆ దారిలో కాస్త కంకర పోయడం వల్ల గంటన్నరే పడుతోందిట ఇప్పుడు. తారు రోడ్డుపై ఒక అరగంట, నలభై నిమిషాలు ప్రయాణించాకా దారి ఎడమ పక్క ఉన్న అడవిమార్గం వైపుకి మళ్ళుతుంది. కేవలం జీప్ లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించగలవు. ఎగుడుదిగుడుగా, ఎక్కడ జీప్ లోంచి జారి పడిపోతామో అనిపించేలా ఎత్తి కుదిపేస్తున్న జీపులో దాదాపు గంట పైగా ప్రయానించడం ఒక గొప్ప సాహసవంతమైన అనుభూతి!! జీప్ లో వెనుక కూచుని దాటి వచ్చిన రాళ్ళు నిండిన, ఎగుడుదిగుడు ఎత్తుపల్లాల దారిని చూస్తూంటే...బాబోయ్ ఈ దారిలోంచి బయటకు వచ్చామా అనిపిస్తుంది.




ఎంతో చాకచక్యంగా జీప్ నడపగలిగిన అనుభవం ఉన్నవారే ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చగలరు. మొదటిసారి వళ్ళినప్పుడు మనిషికి ’ఏడువందల ఏభై ఫిక్స్డ్ రేట్ ’ అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ తిరిగివచ్చేప్పుడు జీప్ మళ్ళీ తారు రోడ్డు ఎక్కాకా మాత్రం ధర న్యాయమైనదే అనిపించింది. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయణమే అది. హృద్రోగులూ, ఒళ్ళునెప్పులూ, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ దారిలో వెళ్లకపోవడం మంచిది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆ రాళ్ళల్లో టైరు చిక్కుకుని ఈ జీప్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతే? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ఈ కీకారణ్యంలోంచి బయటపడగలమా? ఎక్కడో అడవిలో మారుమూల ఉన్న ఆ విగ్రహాన్ని చూడకపోతే ఏమి? అసలిక్కడ ఈ విగ్రహం ఉందని ఎవరు కనిపెట్టారో..? లాంటి ప్రశ్నలు ఈగల్లా ముసిరేస్తాయి ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కానీ గుడి దగ్గర జీప్ ఆగిన తర్వాత, దిగి ఒక్కసారి చుట్టూరా ఉన్న అక్కడి నిశ్శబ్దమైన, ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాకా, జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారన్నా ఇలాంటి ప్రదేశాన్ని చూసి తీరాలి అని వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనిపించి తీరుతుంది.


జీప్ ఆగిన ప్రదేశం నుండి ఒక అర కిలోమీటరు లోపలికి నడవాలి. చుట్టూరా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం, రంగురంగుల అడవిపూలు, తలెత్తి పైకి చూస్తే చెట్ల మధ్య నుండి కనబడే నీలాకాశం, ఎత్తైన చెట్ల తాలూకూ పచ్చని ఆకుల మధ్య నుండి పడుతున్న సూర్యకిరణాలు, మధ్యలో దారికి అడ్డంగా పారుతున్న బుల్లి సెలయేరు, ఆ నీటిలో కదులుతున్న నల్లటి చిన్ని చిన్ని చేపపిల్లలు...పక్కగా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యన ఎత్తుగా పేర్చి ఉన్న రాళ్లపై కాస్త ఎత్తుమీద ఎప్పటిదో వినాయకుడి రాతివిగ్రహం...ఇలాంటి మనోహరమైన ప్రదేశాన్ని చూడగానే - చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న జానపద కథల్లోకి వచ్చేసామా అనిపించింది నాకు!











నిశ్శబ్దంగా ఉన్న ఆ అటవీప్రాంతంలో, పక్షుల కిలకిలారావాల మధ్యన, కాసేపు ఆ నెలయేటి పక్కనే ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పారుతున్న నీళ్ల మధ్యన గబగబా కదిలే ఆ బుల్లి బుల్లి చేపపిల్లలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తిరిగి ఎత్తైన చెట్ల మధ్యన నడుచుకుంటూ గుడివైపుకి వెళ్తుంటే అప్రయత్నంగా "ఆకులో ఆకునై..పూవులో పూవునై..." అన్న పాట గుర్తురాక మానదు! అటువంటి పరిసరాల్లో, ఆ క్షణంలో కలిగే అనుభూతి వర్ణించనలవి కాదు. ప్రపంచానికి దూరంగా, జనావాసంలేని ఈ చోట, వాల్డెన్ దగ్గర థోరూ లాగ కొన్నాళ్ళైనా ఉండిపోగలిగితే ఎంత బావుంటుందో.. అనిపించింది. కానీ ఇలా వెలుతురులో కాక చీకటి పడ్డాకా లైట్లు లేని ఈ ప్రాంతంలో ఏ జంతువో వస్తేనో.. అని భయం కూడా వేసింది.





అడవి మధ్యలో అంత లోపలికి ఆ చిన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎంతో మనోహరంగా ఉండే ఆ చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారో తెలియదు కానీ అక్కడ లభించే ప్రశాంతతని బట్టి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదిగా తోస్తుంది. గుడి ఎదురుగా ఉత్తరముఖంగా ప్రవహించే వాగులో వర్షాకాలంలో బాగా నీళ్ళు నిండి ఉంటాయిట. ఏ గుడి దగ్గరైనా ఉత్తరముఖంగా నదీ ప్రవాహం ఉంటే ఆ ప్రాంతాన్ని దర్శించుకోవడం చాలా మంచిదని ఎక్కడో చదివిన గుర్తు. క్రిందకు దిగి ఆ వాగులో కాళ్ళు కడుక్కుని అమ్మవారిని దర్శించుకోవాలని అక్కడివారు చెప్పారు. ఆలయం బయట ఒకవైపు పురాతనమైన మహిషాసురమర్దిని విగ్రహం, మరోవైపు గణపతి విగ్రహాలు ఉన్నాయి. గుడి ద్వారం క్రిందుగా ఉన్న చిన్న గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. పద్మాసనంలో ధ్యాన నిమగ్నమై ఉన్న ఈ నల్లటి విగ్రహం అరుదైన క్వార్టజైట్ రాతిపై చెక్కబడింది. చతుర్భుజాలలో పై రెండు చేతులు రెండు కలువ మొగ్గలను పట్టుకుని ఉండగా, ఎడమ చేయి శివలింగాన్నీ, కుడి చేయి రుద్రాక్షమాలనూ పట్టుకుని ఉన్నాయి. అమ్మవారికి స్వయంగా కుంకుమబొట్టు పెట్టే అవకాశం ఉందిక్కడ. అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు చిత్రమైన తరంగాలు శరీరంలోకి పాకినట్లు అనిపించింది. అమ్మవారి ముందర వెలిగించిన దీపం తప్ప వెలుతురు లేని ఆ చిన్న గుహలో ఎంతో ప్రశాంతత ఉంది. మనసు చాలా నిశ్చలంగా  మారిపోయి ఇంకాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోయాను. ఎక్కువ జనం లేనందువల్ల ఆ అవకాశం దొరికింది. బయటకు వచ్చేసి ఆలయం ప్రాంగణంలో కూడా గచ్చు మీద చాలా సేపు ప్రశాంతంగా అమ్మనే ధ్యానిస్తూ కూర్చున్నా. అంత ప్రశాంతంగా, ఆనందంగా మునుపెన్నడూ లేదసలు.






గుడి బయట కాస్త దూరంలో కనబడుతున్న ఐదారు గుడిసెలల్లో నివసించే చెంచులే గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట. రోజూ అక్కడకు వచ్చే భక్తుల కోసం నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడకు వచ్చే చాలా మంది భక్తులు, వారిని తీసుకువచ్చే జీప్ డ్రైవర్లు అమ్మవారి ప్రసాదం తినే వెళ్తారుట. మేము కూడా కాస్తంత వేడి వేడి అన్నం ప్రసాదంగా తిని బయల్దేరాం. అటునుండి తిరిగిరావడానికి వెలుతురు ఉండగానే సాధ్యపడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట వరకే  అటు వెళ్ళే వాహనాలు శ్రీశైలం నుండి బయలుదేరతాయిట. ఐదు,ఐదున్నరగంటల ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో అడవిలోంచి బయటకు వచ్చితీరాలి. కాస్త చీకటి పడినా ప్రయాణం అసాధ్యమే ఆ దారిలో. రోడ్డు ఇలా ఉంది కాబట్టే ఆ ఆలయం ఇంకా అంత ప్రశాంతంగా ఉందేమో... మార్గం కనుక బాగుండి ఉంటే ఈపాటికి  అక్కడొక క్యూ కాంప్లెక్స్, బిల్డింగులు, భారీ జన సముదాయాలతో ఆ చల్లని వాతావరణం కూడా వేడిగా మారిపోయి ఉండేదేమో అనిపించింది.

తిరుగు ప్రయాణంలో జీప్ కుదుపులకి నే వీడియో తీస్తున్న కేమెరా క్రింద పడిపోయి, భుజం జీప్లోని రాడ్ కి గుద్దుకుపోయింది. చాలా రోజుల వరకూ ఆ భుజంనొప్పి తగ్గనే లేదు కానీ అమ్మవారిని దర్శించుకున్న చాలారోజుల వరకూ ఆ ప్రయాణం మిగిల్చిన మధురిమలు మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంటాయి. అందుకే ఆ దారమ్మట వెళ్ళే సాహసం మరోసారి చెయ్యాలని కోరిక... అమ్మ దయ ఉంటే సాధ్యం కానిదేది? ఆవిడ పిలుపుకై ఎదురుచూడటమే చెయ్యవలసింది!



క్రిందటేడాది మొదట్లో మళ్ళీ రెండవసారి అక్కడకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈసారి జీప్ లో సీటు ధర ఇంకా పెరిగింది. మనిషికి వెయ్యి రూపాయిలు తీసుకున్నారు. పిల్లలకైనా అదే రేటు. అక్కడకు వెళ్ళే భక్తులు పెరగడం వల్ల ఈసారి కాసిని మార్పులు కనబడ్డాయి అక్కడ. ఇదివరకూ ఒకటో రెండో కనబడే జీప్ లు ఇప్పుడు ఐదారు ఆగి ఉన్నాయి. జీప్ ఆగింది మొదలు గుడి దాకా కొందరు చెంచులు కూర్చుని ఏవేవో వనమూలికల అమ్మకాలు చేస్తున్నారు. దారిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఉండే సెలయేరు ఎండిపోయింది. నీళ్ళు లేవు, చేపలూ లేవు. గుడి వద్ద పువ్వులు, అగరుబత్తీ, కొబ్బరికాయలు మొదలైన అమ్మకాలు, డబ్బులు తీసుకునే చెప్పుల స్టాండు కూడా వెలిసాయి. గుడి ఎదురుగా ఉండే సెలయేట్లో కూడా నీరు బాగా తగ్గిపోయింది. రెండేళ్ల క్రితం ఏ నిర్మలమైన వాతావరణాన్ని చూసి ముచ్చట పడ్డానో అది కాస్త తగ్గిందనే చెప్పాలి. గుడి దగ్గర క్రితంసారి ఆడుకుంటూ కనపడిన నాలుగైదు చిన్న చిన్న కుక్కపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవి ఐపోయాయి. రక్షణ కోసం వాటిని అక్కడే ఉండనిస్తారుట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం గురించి ఉన్న నమ్మకాలను పక్కన పెడతే; అక్కడ పార్వతీ దేవి తపస్సు చేసిందట అని ఎవరో అన్నారు. అంతేకాక ఎందరో ఋషులు, మునులు, దేవీ ఉపాసకులు తపస్సు చేసిన ప్రాంతం , అతి పురాతనమైన ఆలయం , అమ్మవారిది ఎంతో ప్రత్యేకమైన, మహిమాన్వితమైన విగ్రహం కాబట్టి, అమ్మ దర్శనం ఎంతైనా అభిలషనీయం. డివైన్ వైబ్రేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న అతికొద్ది స్థలాల్లో ఇదీ ఒకటిగా పరిగణించవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని దట్టమైన అడవిలోకి ఒక అడ్వంచరస్ ట్రిప్ కు వెళ్ళాలనుకునేవారికి కూడా ఈ ట్రిప్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా మిగులుతుంది. ఈ ట్రిప్ కి వర్షాకాలం ముందర గాని పూర్తయిన సమయంలో గానీ వెళ్తే అడవిలోని పచ్చదనాన్ని మరింతగా ఆస్వాదించగలం.






Sunday, April 5, 2015

విజయవాడ... a rejuvenated experience!




విజయవాడ ప్రయాణం అనేది చాలా సామాన్యమైన విషయం. బెజవాడేమీ అమ్రీకా కూడా కాదు వెళ్లలేకపోవడానికి. కానీ సంసారసాగరంలో పడ్డాకా మళ్ళీ వెళ్ళాడమే కుదర్లేదు. పాతికేళ్ళ పైగా నేను పెరిగి, తిరిగిన నా బెజవాడని వదిలి పన్నెండేళ్ళు అయ్యింది. మధ్యలో ఏవో పనుల మీద రెండుసార్లు వెళ్లాను కానీ అరపూటో, పూటో ఉండి వెళ్ళిన పనయ్యాకా వెనక్కు వచ్చేసానే తప్ప ఉండటానికి వీలవలేదు. ఇన్నాళ్ళకి అనుకోకుండా మొన్న సోమవారం విజయవాడ వెళ్లాను. నెలరోజుల్నుండీ నాన్న అడుగుతూ ఉన్నారు.. "బెజవాడ వెళ్దామని.. మాతో వస్తావా.” అని. అబ్బే నావల్ల కాదు.. ప్రయాణం చెయ్యలేనని చెప్తూ వచ్చాను. ఆదివారం రాత్రి అమ్మ "పెట్టె సర్దుకున్నాం.. ఫలానా ఫలానావాళ్లను కలుస్తామని చెప్తే మాత్రం.. "నేనో.." అన్నను. రాలేనన్నావుగా..మరోసారి వెళ్దువులెమ్మంది అమ్మ. ఆ రాత్రి నిద్రలో.. కలలోనేమో.. బెజవాడ.. చిన్నతనం.. స్నేహితులు..కాలేజీ అన్నీ కనబడుతూ ఉన్నాయి. పైగా తమ్ముడు హాస్టల్ కి వెళ్పోయాకా అమ్మ,నాన్న,నేను ముగ్గురమే దాదాపు పదేళ్ళు కలిసి ఉన్నాం. మా ముగ్గురికీ కలిపి ఎన్నో ఙ్ఞాపకాలు నిండి ఉన్న ఊళ్ళోకీ వాళ్ళిద్దరే వెళ్తుంటే నా మనసు ఊరుకోలేదు. పొద్దున్నే మా పాప రిజల్ట్ తీసుకుని వచ్చాకా పదింటికి మావారిని అడిగాను వెళ్తానని. ఇప్పటికిప్పుడంటే రిజర్వేషనో... అన్నారు. దొరికితేనే వెళ్తానన్నాను. అప్పటికప్పుడు నాకూ, మా పాపకీ ఏ.సి. చైర్ కార్లో రానూ,పోనూ రిజర్వేషన్స్ దొరికేయడం, టికెట్ ఎస్.ఎం.ఎస్ లు నా ఫోన్ లోకి రావడం జరిగిపోయాయి. కానీ తయారవడానికి గంట మాత్రమే సమయం ఉంది! అసలే పొద్దున్నుంచీ ఏదో ఆందోళన.. ఉన్నదాన్ని ఊరుకోక ఏదో ఓ తలనెప్పి తెచ్చుకుంటూ ఉంటాను. ఆ కంగారుతోనే గబగబా వంట చేసి, తిని బయల్దేరాం.


హటాత్తుగా వాతావరణం చల్లబడిపోయింది. కాస్త దూరం వెళ్లగానే పేద్ద వాన మొదలైంది. స్టేషన్ చేరి ట్రైన్ ఎక్కాకా కూడా "ఎందుకు ఇప్పుడు బయల్దేరుతున్నాను.. ఇన్నేళ్ళలో తనని వదిలి ఎప్పుడూ ఏ ఊరు వెళ్లలేదు.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం సర్దుకుంటోంది.. ఇప్పుడీ ఒంటరి ప్రయాణం అవసరమా.. విజయవాడ అనగానే పరిగెట్టేయడమేనా.." అని గందరగోళపడ్డాను. సీట్లో వెనక్కి వాలి పడుకున్నా, చల్లగాలి తగులుతున్నా ఆందోళన తగ్గలేదు. నా కూడా పట్టుకెళ్ళిన పుస్తకాలు తెరవలేదు కానీ ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం చదువుకుని, మృత్యుంజయ మంత్రజపం చేసుకున్నాకా మనసు బాగా శాంతించింది. ఈలోపూ తెచ్చుకున్న టైంపాస్ పజిల్స్ అయిపోయి, అమ్మకానికి వచ్చిన టమాటా సూప్, చిప్స్, బిస్కెట్లు అన్నింటినీ కొనిపించేసి, వాట్ మోర్.. ఇంకా ఎంతసేపు.. బోర్.. అంటూ నా బుర్ర తినడం మొదలెట్టింది అమ్మాయిగారు. ఇక ఓ స్టేషన్లో ట్రైన్ ఆగగానే గబగబా దిగి వెళ్ళి ఓ ’టింకిల్’ కొని తెచ్చి, ప్రస్తుతానికి దీనితో కాలక్షేపం చెయ్యి.. విసిగించకని కాస్త గట్టిగానే చెప్పి, కళ్ళుమూసుకుని పడుకున్నా.


చీకటి పడినా అద్దాల కిటికీలోంచి దూరంగా వరుసగా కనబడుతున్న బోలెడు లైట్లు, ఎత్తైన కొండలు కనబడగానే పాపకు చూపెట్టా.. అదిగో మా ఊరు.. అలా లైట్లు కనబడ్డాయంటే వచ్చేసినట్లే! అని. స్టేషన్లో దిగి సంబరంగా చుట్టూ చూశాను. ఏదో అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చిన భావన..! ఐదో ప్లాట్ఫారం మీంచి చివరకంటా వెళ్ళి ఏడమపక్కకు తిరిగితే బయటకు దారి ఉందని గుర్తు. అలానే వెళ్ళి ఆటో ఎక్కి అమ్మవాళ్ళు దిగిన హోటల్ రూమ్ కు చేరాను. అది మొదలు నా దిగుళ్ళు, భయాలన్నీ మర్చిపోయాను. మళ్ళీ పన్నెండేళ్ల క్రితపు మనిషినైపోయాను.


నే రైలెక్కాకా అమ్మవాళ్లకి నా ప్రయాణం చెప్పడంతో వాళ్ళ ప్లాన్సన్నీ మారిపోయాయి. తను ముఖ్యంగా కలవాలనుకున్న రజని గారిని కలవడం మర్నాటికి వాయిదా వేసారు నాన్న. నేను కాస్త ఫ్రెష్ అయ్యాకా భట్టుమావయ్యగారి ఇంటికి బయల్దేరాం. చీకట్లో ఇల్లు కాస్త వెతుక్కున్నాం కానీ చెట్లను బట్టీ నాన్న గుర్తుపట్టేసారు. భట్టుమావయ్యగారిలో పెద్దగా మార్పేమీ లేదు. సినిమాల్లో ఓల్డ్ అయిన హీరో/హీరోయిన్ తల్లి జుట్టుకు కాస్త(ఓ పాయకు) తెల్లటి రంగు వేసినట్లు.. జుట్టు రంగులో కాస్తంత మార్పు తప్పిస్తే కృష్ణకుమారక్క కూడా అలానే ఉంది. డిజిగ్నేషన్ ప్రకారం ఇప్పుడు తను ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్ అయిపోయింది కానీ నాకు మాత్రం మా చిన్నప్పటి కృష్ణకుమారక్కే! మా చిన్నప్పుడు తను యూనివర్సిటీలో చదువుకునేప్పటి నుండీ అక్కా అనే పిలవడం అలవాటు. ఇంటర్నెట్ నుండీ గుమ్మడి వడియాల దాకా కబుర్లయ్యాకా, ఫలహారాలయ్యాకా, "తనని కూడా తీసుకువచ్చి మిమ్మల్ని, ఇంటినీ, పుస్తకాలనీ చూపెట్టాలని కోరిక.. మళ్ళీ తప్పకుండా వస్తామని" భట్టుమావయ్యగారితో  చెప్పి శెలవు తీసుకుని, బరువైన బహుమతులతో వెనక్కు బయల్దేరాం.


మర్నాడు పొద్దున్నే తయారయి రజనిగారి ఇంటికి వెళ్ళాం. ఈమధ్యన చాలామందిని గుర్తుపట్టట్లేదని చెప్పారు. సో, గుర్తు పడతారో.. పట్టరో అనుకుంటూ వెళ్ళామా.. గుమ్మంలో నాన్న నించోగానే, తన పక్కన ఉన్న కృష్ణ (కూడా ఉంటూ వారికి ఆత్మీయుడైపోయిన రజని గారి సహాయకుడు) కి "ఇతను శ్రీరామ్మూర్తి.. ace announcer!" అని చెప్పారు. తర్వాత అమ్మను చూపెట్టి "ఈవిడ వాళ్ళావిడ.. సీత.. తను ఆశా.. వాళ్ళమ్మాయి(నేను). నా పాట వాళ్ళింట్లో అమ్మాయిగా పుట్టింది." అని చెప్పారు. నన్నేమో మా అమ్మాయి పేరడిగారు. అప్పుడు నాన్న "ఆశా నా ప్రాణా సఖీ" పాట గురించి కృష్ణకు చెప్పారు. రజని గారు పాడిన ఆ లలితగీతం నాన్నకు చాలా ఇష్టం. రజని గారిపై ఎంతో ప్రేమతో, నే పుట్టిన తరువాత నాన్న ఆ పాట నా పేరుగా పెట్టుకున్నారు.


ఇంతకీ అప్పుడు కృష్ణ ఏమో రజనిగారితో "అయితే ఆ పాట పాడండి.." అనడిగాడు. వెంఠనే పాట మొత్తం పాడేసారు రజనిగారు. మధ్యలో ఓ చరణం తడబడితే కృష్ణ వాక్యాలందించాడు. నేను ఆశ్చర్యపోతుంటే అతనే చెప్పాడు "రోజూ పొద్దున్నే వాకింగ్ అయ్యాకా ఓ గంటసేపు పాటలు పాడతారు అయ్యగారు. వారితో పాటూ నన్నూ పాడమంటారు. అలా నాకూ వచ్చేసాయండి" అని! "ఆహా..ఎంత అదృష్టవంతుడివయ్యా" అన్నాను. "నిజమేనండి.. ఇంత గొప్పవారితో, మంచివారితో గడపగలగడం ఎంతో అదృష్టం" అన్నాడతను. అక్కడ ఆయన చుట్టూ ఉన్న హెల్పర్స్ అంతా కూడా ఆయనను చిన్నపిల్లడిని చూసుకుంటున్నట్లు ఎంతో ప్రేమగా చూడడం చాలా ఆనందాన్ని కలిగించింది. గదిలో సుభద్రమ్మగారి(రజనిగారి అర్థాంగి) ఫోటోలు చూసి ఆవిడను తల్చుకున్నాం. మహాగొప్ప ఇల్లాలు ఆవిడ. రాత్రి ఎనిమిదింటికి వెళ్ళినా తినడానికో, తాగడానికో ఏదో పెట్టకుండా పంపేవారు కాదు. ఎన్నిసార్లు వెళ్ళనీ ఎవరినీ ఉత్త చేతులతో అస్సలు పంపేవారు కారావిడ. రజనిగారు ఇటీవల అందుకున్న పురస్కారాలన్నీ చూపించాడు కృష్ణ. ఆ చిన్న గదిలో, ప్రశాంత వాతావరణంలో చుట్టూరా 'Ulysses' మొదలు 'సామల సదాశివంగారి స్మృతిసంచిక' వరకూ రకరకాల పుస్తకాలతో Walden దగ్గర Thoreauలా ఉన్నారీయన అనిపించింది. ఎక్కువగా పుస్తకాలు చదువుకుంటూంటారుట ఇప్పుడు. ఇంతలో వారబ్బాయి హేమచంద్రగారు వచ్చారు. నాన్నవద్ద ఉన్న రజనిగారి రేడియో కార్యక్రమాలు, పాటలూ, సంగీత రూపకాలు అన్నీ కలిపి ఓ ఎనిమిదిగంటల పాటు వచ్చే మెటీరియల్ అంతా అన్నయ్యతో సీడీలు చేయించి తెచ్చి, ఆ కాపీలు వారబ్బాయికి ఇచ్చారు నాన్న. హేమచంద్రగారు ఫేస్ బుక్ లో నా బ్లాగ్ అప్డేట్స్ అన్నీ చూస్తూంటారు కాబట్టి నేను బాగానే తెలుసు. ఈ అమ్మాయి రచయిత్రి.. బాగా రాస్తుందని రజనిగారికి చెప్పారు. ఆయన కూడా బరువు చేతులతోనే పంపించారు మమ్మల్ని! నాకు సుభద్రమ్మగారే గుర్తుకొచ్చారు. వచ్చేసేప్పుడు "మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి తప్పకుండా రమ్మని" నాన్నకు చెప్పారు రజని గారు! వారిద్దరిదీ ఓ ప్రత్యేకమైన అనుబంధం..! భారమై, అంతలోనే ఆనందభరితంగా మారిన మనసులతో ముగ్గురం రజనిగారి వద్ద వీడ్కోలు తీసుకున్నాం. "అంత గొప్ప మనిషి నన్ను గుర్తు పట్టారు..ఇది చాలీ జీవితానికి" అన్నాను బయటకు వచ్చాకా అమ్మానాన్నలతో.



అక్కడనుండి మరొకరి ఇంటికీ వెళ్ళి హోటల్ కు చేరాం. ప్రయాణం బడలిక, తిరుగుడికి నాన్న బాగా అలసిపోయి నీరసపడిపోయారు. మనసు ఉత్సాహంగా ఉన్నా వయసు, శరీరం సహకరించాలి కదా.. అందుకే మిత్రులందరూ ఇంటికి ఆహ్వానించినా రెస్ట్ గా ఉండాలనే హోటల్లో దిగారు ఆయన. భోంచేసాకా అమ్మ,నాన్న కునుకుతీస్తూంటే, ఊరికే ఉండలేక పాపను తీసుకుని బీసెంట్ రోడ్డు చూసి వస్తానని బయల్దేరా! 


బీసెంట్ రోడ్ కీ నాకూ బోలెడు స్నేహం. రామనవమి పందిళ్ళు వేసిన ఆ వీధిలో నడుస్తూంటే అసలు ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. చెప్పినా అక్షరాలు సరిపోవు నా ఆనందాన్ని వర్ణించడానికి. పాపకి ఆ షాపులూ, మేం తిరిగిన గల్లీలు అవీ చూపెడుతూ, వీధి మధ్యలో ఉండే బుల్లి రాములవారి గుడి చూపెట్టి అక్కడ దణ్ణం పెట్టుకుంటూంటే కళ్ళు చమర్చాయి...! బీసెంట్ రోడ్ కు వచ్చినప్పుడల్లా అమ్మ ఆ బుల్లి గుడి దగ్గర ఆగి దణ్ణం పెట్టుకునేది. నేనూ అమ్మ వెనకాల..! ఇన్నేళ్ల తరువాత నేను మళ్ళీ ఆ రామనవమి పందిళ్ళ క్రింద.. అదే రాములవారి ముందు నా కూతురితో నిలబడి ఉన్నాను...

Wednesday, October 29, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -2


అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..


(నిన్నటి తరువాయి.. )

దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు.." అని చదివిన గుర్తు. బిక్కవోలు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్లి వచ్చేద్దాం అని డిసైడయ్యాం. 

శనివారం పొద్దున్నే తయారయ్యి ఏడున్నరకల్లా బస్టాండు కి చేరిపోయాం. అప్పటికే ఎండ వేసవిలా చికాకు పెట్టేస్తోంది. బిక్కవోలు మీదుగా వెళ్ళే బస్సు ఎక్కాం. కడియం, ద్వారపూడి రూటు. ఒకవైపు కడియం నర్సరీలు, మరోవైపు ఏదో కాలువ ఉంది. రోడ్డు పొడువునా చాలా దూరం మాతో పాటూ వచ్చిందది. ఆ కాలువకు అటు ఇటు కొన్ని చోట్ల తెల్లని రెల్లుదుబ్బులు, మరి కొన్ని చెట్లు, పొలాలు.. పైన నీలాకాశంలో తెల్లని మబ్బులు.. అసలా అందం వర్ణనాతీతం. ఎండగా ఉన్నా కూడా ఎంత బాగుందో..! 





కడియం సెంటర్లో ఈ అమ్మవారి విగ్రహం ఉంది. బస్సులోంచే రెండు మూడు పిక్స్ తీస్తే ఇది బాగా వచ్చింది..


ద్వారపూడిలో విగ్రహాలు ఇదివరకటి కన్నా ఇంకా కట్టినట్లున్నారు. బయట వైపు కృష్ణార్జునుల గీతోపదేశం విగ్రహం కొత్తది. చాలా బాగా చేసారు. అది ఫోటో తీసేలోపూ బస్సు ముందుకెళ్ళిపోయింది :( కెమేరా అయితే క్లిక్ దొరికుండేది. ఫోన్ కెమేరాకి అందలేదు. సుమారు గంటన్నరకి బిక్కవోలు చేరాం. ఎలానూ వచ్చాం కదా ముందర అన్నగారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. గుడి కిలోమీటర్ దూరం అన్నారు. నడుచుకుపోదాం సరదాగా అని బయదేరాం. దారిలో ఒక ఇల్లు అచ్చం 'లేడీస్ టైలర్' ఇల్లులా ఉంది. మరీ ఎదురుగా ఫోటో తీస్తే బాగోదని ముందుకెళ్ళి పక్కనుండి తీసా..




తర్వాత ఒక ఇంటి ముందు రెండు మూడు గుత్తులతో ద్రాక్ష తీగ ఉంది! భలే భలే అని దానికీ ఫోటో తీసా :)




ఆ పక్కనే నిత్యమల్లి చెట్టు చూసి ఆహా ఓహో అని గంతులేసేసా. గత కొన్నాళ్ళుగా ఈ విత్తనాల కోసం కనబడినవారినీ, కనబడని వారినీ.. అందరినీ అడుగుతున్నా. ఒక మొక్క ఉంటే ఇంక దేవుడికి పూలే పూలు. ఈ పూలు తెల్లవి కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. సరే ఆ విత్తనాలు కాసిని కోసి పొట్లం కట్టా. కాస్త ముందుకి వెళ్లాకా ఓ పక్కగా దడికి అల్లించిన పెద్ద పెద్ద ఆకుల బచ్చలితీగ ఉంది. విత్తనాలు లేవు. చిన్న ముక్క కట్ చేయచ్చు కానీ ఇంక అది పీకలేదు. ఊరెళ్ళేదాకా కాపాడ్డం కష్టమని :)




దారిలో కనబడ్డ విచిత్ర వేషధారి..

కాస్త ముందుకెళ్లగానే రోడ్డుకి కుడిపక్కన లోపలికి ఓ పాత గోపురం కనబడింది. ఏమీటా అని వెళ్లి చూస్తే ఏదో గుడి.. దగ్గరకు వెళ్ళి అడిగాము. 1100 ఏళ్ళ క్రితం కట్టిన పాత శివాలయమట అది. ఎవరు కట్టారో తెలీదుట. అప్పుడే గేటు తెరిచి తుడుస్తున్నాడు ఒకతను. గుడి చుట్టూరా బట్టలు ఆరేసి ఉన్నాయి. అది గుడి అనే స్పృహ లేనట్టే..! ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకున్నాం. చిన్న గుడి.. లోపల బాగా చీకటిగా ఇరుకుగా ఉంది. కాసేపు ఆ గోడలూ అవీ పరీక్షించేసి బయటకు వచ్చేసాం.





లక్ష్మీగణపతి దేవాలయానికి చేరాం. నాలుగేళ్ల క్రితం చూసిప్పుడు గుడి చుట్టూ పొలాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలో గుడి ఉన్నట్లు ఉంది! బయట తెల్ల తామరలు అమ్ముతుంటే కొన్నాం. లోపల చాలామంది అయ్యప్ప భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాస్త ఖాళీ అయ్యాకా మేము దర్శనం చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినలేదేమో గుడిలో పెట్టిన వేడి వేడి పులిహోర ప్రసాదం అమృతంలా అనిపించింది. గుడికి ఒకవైపు వరి పైరు, మరో వైపు చిన్న కొలను దాని చుట్టూ కొబ్బరిచెట్లు.. ఆ దృశ్యం చాలా బాగుందని కెమేరాలో బంధించా! 

best pic of the trip అన్నమాట :)


అక్కడ నుండి కుమారస్వామి గుడి దగ్గరే అని చెప్పారు. దారిలో ఎడమ పక్కన మళ్ళీ పొలాలు. కాస్త దూరంలో ఇందాకా చూసినలాంటి గుడి ఉంది పొలాల మధ్యన. అది కూడా శివాలయమే కానీ మూసేసారు. వెళ్ళేదారి లేదు అన్నారు అక్కడ పొలాల్లో పని చేస్కుంటున్నవారు.






కుమారస్వామి ఉన్నది ఒక శివాలయం.  గుడిలో మొత్తం శివ కుటుంబం ఉంది. చాళుక్యులు కట్టిన గుడిట అది. చాలా విశాలంగా ఉంది ఈ ప్రాంగణం కూడా. ప్రధానద్వారం ఎదురుగా గోలింగేశ్వరుడు పేరుతో శివలింగం ఉంది. ఇంకా మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహాలు, గణపతి విగ్రహం మరో పక్క కుమారస్వామి విగ్రహం ఉన్నాయి. ఈ కుమారస్వామి విగ్రహమే మహిమాన్వితమైనదిట. కానీ లోపల విగ్రహం పక్కగా గోడవారగా అభిషేకం చేసిన తేనె సీసాలూ, కొబ్బరి పీచు తుక్కూ అలానే పడేసి ఉన్నాయి.. ఏమిటో కాస్త బాధనిపించింది. తమిళనాడులో పురాతన ఆలయాలను వాళ్ళు ఎంత బాగా పరిరక్షించుకుంటారో.. మనవాళ్ళకు అసలు శ్రధ్ధే లేదు.. వాటి విలువే తెలుసుకోరు అనిపిస్తుంది కొన్ని ఆలయాల్లో ఇటువంటి అపరిశుభ్రపు వాతావరణాన్ని చూసినప్పుడల్లా! అక్కడే గుమ్మం పక్కగా "రుద్రిణి దేవి" పేరుతో ఒక ప్రతిమ ఉంది. ఆ దేవత ఎవరో.. ఎప్పుడూ వినలేదు పేరు. పూజారి ఇచ్చిన పుట్టమన్ను, విభూతి పెట్టుకుని బయటకు నడిచాం.


పొద్దున్న దిగిన బస్ స్టాప్ వద్దకు వచ్చేసాం. టిఫిన్ తినలేదు, ఎండలో నడిచి నడిచి ఉన్నామేమో బాగా అలసటగా అనిపించింది. కొబ్బరినీళ్ళు తాగి లేత కొబ్బరి తినేసాం. ఉడకపెట్టిన మొక్కజొన్నలు అమ్ముతుంటే చెరోటీ కొనుక్కుని తినేసాం. రెష్ గా ఉందని ఓ బస్సు వదిలేసిన అరగంటకు మరో రెష్ గా ఉన్న బస్సు వచ్చింది. ఇంక అదే ఎక్కేసాం. అరగంట నించున్నాకా సీటు దొరికింది. మొత్తానికలా 'దేవ్డా..' అనుకుంటూ రామిండ్రీ చేరాం. 

నిన్న సాయంత్రం మా బంధువులింటికి వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఇవాళ భోంచేసాకా అమ్మ కోరిక ప్రకారం ఉప్పాడ చీరల కోసం"తాడితోట" అనే చీరల దుకాణాల సముదాయానికి వెళ్ళాం అందరం. ఎప్పుడూ మావయ్యావాళ్ళు వెళ్ళే కొట్లోకి వెళ్ళి పర్సులు ఖాళీ చేసేసి.. హమ్మయ్య ఓ పనైపోయింది అనేస్కున్నాం. ఆ తర్వాత ఓ మాంచి స్వీట్ షాప్ కి వెళ్ళి పూతరేకులూ, తాపేశ్వరం కాజాలు, స్వీట్ బుందీ.. గట్రా గట్రా కొనేసాం. ఇంటికొచ్చి పెట్టెలు సర్దేసి, టిఫినీలు చేసేసి, మావయ్యని స్టేషన్ కు రావద్దని వారించి ఆటో ఏక్కేసాం. రైల్వేస్టేషన్లో పాపిడీ దొరికింది. అది కూడా కొనేస్కుని రైలెక్కేసాం. తత్కాల్లో బుక్ చేస్కోవడం వల్ల నాకు మళ్ళీ అప్పర్ బెర్త్ శిక్ష తప్పలేదు :(  తనకు తోడొచ్చినందుకు అమ్మ థాంక్యూలు చేప్పేసింది. రెండునెల్లుగా నానాగందరగోళాల్లో ఉన్న నాకూ రిలీఫ్ ఇచ్చావని నేనూ అమ్మకి థాంక్స్ చెప్పేసా.  

ఏదో మా ఆసామి ఆఫీసు పని మీద ఊరెళ్లబట్టి అమ్మకు తోడెళ్ళాను గానీ నేనెప్పుడు తన్ను వదిలి ఊరెళ్ళాననీ..?! వదిలేసి వెళ్లడమే... సుఖపడిపోరూ :-))))



Tuesday, October 28, 2014

రాజమండ్రి-పాదగయ క్షేత్రం-బిక్కవోలు కుమారస్వామి -1




చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా వీలైనన్ని చూడని ప్రదేశాలు చూసిరావాలని అనుకున్నాం మేము. గత ఆరేళ్లలో రెండుసార్లు మా గోదావరి వైపుకి వెళ్ళాను. వేరే పనుల మీద వెళ్ళినా సమయం కుదుర్చుకుని కొన్ని ప్రదేశాలు చూసాం అప్పట్లో. అప్పుడా ప్రయాణం కబుర్లతో రెండు సిరీస్ లు నా బ్లాగ్ లో ఙ్ఞాపకాల గుర్తుగా పదిలపరుచుకున్నాను. 

ఆసక్తి ఉన్నవారి కోసం ఆ లింక్స్:
తూర్పుగోదావరి ప్రయాణం కబుర్లు:

యానాం - పాపికొండలు - పట్టిసీమ ప్రయాణం కబుర్లు:


ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా పదిరోజుల క్రితం మళ్ళీ అమ్మతో వాళ్ల పుట్టింటికి(రాజమండ్రి) బయల్దేరాం. ఎప్పటిలానే ట్రైన్ విజయవాడ చేరేసరికీ మెలకువ వచ్చేసింది. అప్పర్ బెర్త్ మీద ఉన్నందువల్ల క్రిందకిదిగలేకపోయా:( ఇక నిద్రపట్టలేదు. ఐదున్నరవుతూండగా పక్కసీట్లు ఖాళీ అవ్వగానే క్రిందకి దిగి హాయిగా కిటికీ పక్కన సెటిలయ్యా. వెలుతురు వస్తూనే పచ్చని పొలాలు.. వాటి వెనుక రారామ్మని మాకు ఆహ్వానం పలుకుతున్నటుగా వరుసగా నిఠారైన కొబ్బరిచెట్లు.. కొబ్బరాకుల వెనుక నుండి ఎర్రటి సూర్యకిరణాలు.. ఒక్కసారిగా నిద్రలేమి తాలూకూ చికాకు మాయమై మనసంతా హాయిగా అయిపోయింది. గబగబా ఫోన్ తీసి నాలుగు ఫోటోలు క్లిక్కుమనిపించా. 








అదేమిటోగానీ ఇన్నాళ్ళూ ఎక్కడో ఉన్న ప్రాణం ఒక్కసారిగా ఇప్పుడే తనువులో ప్రవేశించినట్లు నూతనోత్సాహంతో మనసంతా నిండిపోయింది. కిటికీలోంచి కనబడుతున్న ప్రతి చెట్టూ, ప్రతి పైరూ, ప్రతి ఆకూ పలకరిస్తున్నట్టే అనిపించింది. సూర్యుడు పైకి వచ్చేసాకా అసలా ఆకుపచ్చని పచ్చదనం చూడగానే ఆనందంతో పాటుగా.. ఈ నేలని ఈ మట్టినీ వదిలి ఆ దూర తీరంలో ఆ పొరుగూరిలో ఎందుకున్నట్లో.. అని పుట్టెడు దిగులు పుట్టింది. ఇలా అప్పుడప్పుడూ వచ్చిపోకపోతే ఇక్కడి మట్టివాసనని కూడా మర్చిపోతామేమో అనే బరువు ఆలోచన కలిగింది. ఇంతలో గోదావరి చూద్దువు లేవమని అమ్మ పాపని లేపి తీసుకువచ్చింది. కాస్త ఊహ వచ్చింది కదా.. కొత్తగా గోదారమ్మని చూస్తోంది అమ్మాయ్..! "అదిగో పాత బ్రిడ్జ్.. ఆ బ్రిడ్జ్ మించే సర్కార్లో కాకినాడ వెళ్ళేవాళ్ళం తెల్సా... చివరచివర్లో ఆ బ్రిడ్జ్ ఊగేది కూడానూ... అదిగో ఆ మధ్యలో కనబడుతున్న ద్వీపంలాంటిది లేనప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాం తెలుసా.. ప్రతిసారీ వెళ్ళీనప్పుడల్లా కాస్త కాస్త చప్పున పెరుగుతూ ఇలా ద్వీపంలా అయిపోయిందిది.. ఇలా కాయిన్స్ నీళ్ళల్లో వేసేవాళ్ళం..." అంటూ గబగబా కబుర్లు చెప్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ... "ఒకటే బ్రిడ్జికి ఎన్ని ఫోటోలు తీస్తావూ.." అని వేళాకోళం చేసింది. ఎన్ని ఫోటోలు తీసుకుంటే తనివితీరుతుందని చెప్పనూ...!?





 రాజమండ్రిలో మావయ్య ఇల్లు చేరాం. ఈసారి కూడా వేరే పని మీద వెళ్ళినా, ఉన్న రెండురోజుల్లో ఏవన్నా చూడని ప్రదేశాలు చూడాలని మా మావయ్య అనుమతితో వాళ్ల మనవరాలిని తీసుకుని బయల్దేరా..! నా పెళ్ళికి తోడపెళ్ళికూతురైన ఆ బుల్లి మేనకోడలు ఇప్పుడు వైజాగ్ లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసేసి నాకు గైడ్ అయ్యేంత పెద్దదైపోయింది.. ఇదే కాలం మహిమ :) 


ఆ రోజు శుక్రవారం. పిఠాపురంలో శక్తిపీఠం చూడాలని ఎప్పటి నుండో కోరిక. బస్ కాంప్లెక్స్ కి వెళ్తే సామర్లకోట వెళ్ళి, అక్కడ నుండి ఆటోలో పిఠాపురం వెళ్ళచ్చని చెప్పారు. కాకినాడ  బస్సు ఎక్కేసాం. దాదాపు గంటన్నరకి సామర్లకోట చేరిపోయాం. ఇంట్లో మేము బయల్దేరడమే లేటయినందువల్ల సామర్లకోట చేరేసరికీ పావుతక్కువ పన్నెండయ్యింది. గుడి పన్నెండింటికి మూసేస్తారేమో, ప్రయాణం వృధా అవుతుందని భయం. అందుకని షేరాటో ఎక్కకుండా డైరెక్ట్ గా పిఠాపురానికి ఆటో మాట్లాడేసుకున్నాం. గుడి చేరేసరికీ పన్నెండూ పది. ఇరవై నిమిషాల్లో చేరాం. చిన్నప్పుడు అమ్మో పిఠాపురం, అమ్మో రాజోలు.. అనుకునేవాళ్ళం. సిటీ దూరాలతో పోలిస్తే ఇవసలు దూరాలే కాదనిపిస్తుందిప్పుడు. ఇక్కడ అమ్మావాళ్ళింటికి నలభై కిలోమీటర్ల దూరం. మూడు బస్సులు మారి, ఒక షేర్ ఆటోలో వెళ్ళాలి. తరచూ వెళ్లట్లేదు కానీ పనున్నప్పుడు పొద్దున్నకెళ్ళి రాత్రికి వచ్చేస్తూ ఉంటాను.




పిఠాపురం గుడి పన్నెండున్నరదాకానని రాసి ఉన్న బోర్డు చూసి హమ్మయ్యా అనుకుని లోనికి అడుగుపెట్టాం. విశాలమైన ప్రాంగణం. దీనినే "పాద గయ"అని కూడా పిలుస్తారుట. ఈశ్వరుడు కుక్కుటేశ్వరస్వామి గా ఇక్కడ వెలిసాడు. అమ్మవారి పేరు పురుహూతిక. అమ్మవారి పీఠభాగం ఇక్కడ పడినందువల్ల ఈ ఊరికి పీఠికాపురం అని పేరు వచ్చి అదే పిఠాపురం అయ్యిందిట. ఈ క్షేత్రం తాలూకూ పురాణకథ ఇక్కడ .

శుక్రవారమైనా జనం ఎక్కువ లేరు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది గుడి. ముందర ప్రాంగణంలో ఉన్న మిగిలిన విగ్రహాలను చూశాము. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద వల్లభస్వామి గుడి అక్కడ ఉంది. శ్రీపాద వల్లభస్వామి ఈ క్షేత్రంలోనే ఆవిర్భవించారని ఇక్కడి స్థలపురాణంట. తెల్ల తామరతో అలంకరించిన విగ్రహం ఎంత బాగుందో చెప్పలేను. ఆలయం బయట పాదుకలు, మరో పక్క శంకరాచార్యులవారి విగ్రహం ఉన్నాయి. ఈ దత్తాత్రేయ అవతారం గురించిన వివరాలు, అక్కడ మిగతా ఫోటోలు క్రింద  లింక్ లో చూడచ్చు.

ఇక్కడ ప్రస్తుతం ఉన్నది అసలు అమ్మవారి శక్తిపీఠం ఉన్న స్థలం కాదట. దానిని గురించి రెండు మూడు కథనాలు విన్నాను. కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం పక్కగా దక్షిణముఖంగా ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అదే అసలు శక్తిరూపం అని అక్కడి అర్చకులు చెప్పారు. పదిరూపాయిలు టికెట్టు కి లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోనిచ్చారు. విగ్రహం పూర్తిగా బయటకు కనబడేలా కుడి పక్కన ఐమూలగా అద్దం అమర్చారు. అందులోంచి అమ్మావారు బాగా కనబడ్డారు. కాసేపు అలా నింఛుని ప్రార్థించి బయటకు వచ్చేసాం. ఆ పక్కగా కొత్తగా కట్టిన అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము గుడి మూసేసారు.

గుడి వెనుక వైపు ఉన్న తటాకాన్ని "పాదగయ" అంటారుట. అక్కడ స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన పుణ్యంట. మరణానంతరం గయుడనే రాక్షసుడి పాదాలు అక్కడ పడినందువల్ల పాదగయ అని పేరు వచ్చిందిట. ఆ రాక్షసుడి కథ  ఇక్కడ ఉంది. ఆ తటాకం పక్కనే గయాసురుడు పడి ఉన్న విగ్రహం, చుట్టూ త్రిమూర్తుల విగ్రహాలు అవీ ఉన్నాయి. 




ఆలయప్రాంగణంలో శారదాదేవి గుడి కడుతున్నారు.

తటాకానికి వెనుకవైపు ఉన్న గోశాల కూడా చూసేసి బయటకు వచ్చేసరికీ పన్నెండున్నర. కాసేపు ఎదురుచూశాకా షేర్ ఆటో దొరికింది. తిరిగి సామర్లకోట వచ్చేసి రాజమండ్రి బస్సు ఎక్కేసాం. సామర్ల కోటలో భీమేశ్వరస్వామిని కూడా చూద్దామనుకున్నా కానీ గుడి నాలుగింటికి గాని తెరవరన్నరని ఇంక బయల్దేరిపోయాం. అయినా అది చిన్నప్పుడోసారి చూసేసాను :)  

"కుక్కుటేశ్వరస్వామి గుడి వీధిలోనే ఇంకా ముందుకి వెళ్తే ఇంద్రుడు నిర్మించిన ఐదు మాధవాలయాలలో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉంది తప్పక చూడాల్సిన గుడి.. అదీ చూసి రండి.." అని మావయ్య చెప్పిన మాటలు మర్చిపోయాం!ఇంటికొచ్చాకా మావయ్య అడిగాకా గానీ గుర్తురాలే:(  ఇంక రేపు ఇంట్లో ఉండండని మిగతా పెద్దలన్నారు కానీ "ఇంత దూరం వచ్చారు కదా వెళ్ళనియ్యండి..ఇంట్లో కూచుని చేసేదేముంది.." అని మావయ్య మమ్మల్ని సపోర్ట్ చేసాడు పాపం. హమ్మయ్య అనుకుని రేపటి ట్రిప్ కి ప్లాస్ మొదలెట్టాం..


***     ***    ***

ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ..
http://lookingwiththeheart.blogspot.in/2014/10/blog-post.html







Friday, July 11, 2014

షిర్డీ - భీమశంకర్




 
 


హాలిడేస్ అన్నీ అయిపోయాయి.. ఎక్కడికీ వెళ్ళలేదు.. స్కూళ్ళు మొదలయిపోయాయి.. మళ్ళీ నెలాఖరు వచ్చేస్తే పరీక్షలు వచ్చేస్తాయనీ, వీకెండ్ కనీసం షిర్డీ అయినా తీసుకువెళ్ళమని అయ్యగారి చెవిలో ఇల్లుకట్టేస్కుని మరీ పోరేసాం పిల్లా, నేనూ.  షిర్డీ కి టికెట్స్ బుక్ చేసానని అయ్యగారు ఫోన్ చెయ్యగానే ముందర నెట్ ఓపెన్ చేసి ఇంతకు ముందు చూడని నియరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని వెతికాను. కాస్త దూరమైనా వెళ్లదగిన ప్రాంతంగా "భీమశంకర్" కనిపించింది. సుమారు 180-200kms దూరం షిర్డీ నుండి. 200kms లోపూ అయితే ఒకపూటలో వెళ్ళిరావచ్చు. సో, ఈసారి బాబాగారి దర్శనం అయ్యాకా భీమశంకరానికి వెళ్దామని అని గాఠ్ఠిగా చెప్పేసి, గ్రీన్ సిగ్నల్ సంపాదించేసుకున్నా. ఈ జీవితకాలంలో వీలయినన్ని పుణ్యక్షేత్రాలే కాక వీలయినన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలూ చూడాలని నాకో బలమైన కోరిక ఉంది. ఇదివరకూ శిర్డీ వెళ్ళినప్పుడే నాసిక్-త్రయంబక్, మరోసారి ఘృష్ణేశ్వర్ వెళ్ళాం. ఇప్పుడు 'భీమశంకరం' కూడా జ్యోతిర్లింగం అని చదివాకా, చిన్న ప్రయాణమైనా ఈ ట్రిప్ లో మరో జ్యీతిర్లింగం చూసే అవకాశం వదులుకోవాలనిపించలేదు. అవసరమైతే సండే కూడా ప్రయాణం ఎక్స్టెండ్ చేసుకుందాం అని కూడా అనుకున్నాం.


రెండు రోజుల క్రితమే బుక్ చేసుకోవడం వల్ల క్రితం గురువారం సాయంత్రం ప్రయాణం సమయానికి RAC లోకి మాత్రమే వచ్చాయి టికెట్లు. లక్కీగా మా ఇంటివెనక రైల్వే షేషన్లో ఇప్పుడు వెళ్లాల్సిన రైలు ఆగుతుంది. ఎక్కి కూర్చున్నాం. సైడ్ లోయర్ సీట్లు రెండూ వచ్చాయి. చాల్లేమ్మని ముగ్గురం అందిమీదే కూచున్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళు వేరే బోగీలోకి వెళ్పోతూ అప్పర్ బెర్త్ ఒకటి ఇచ్చేసారు. ఇంకేముంది.. నన్ను పైకెక్కించేసి పిల్లా, వాళ్ళ నాన్నా క్రింద దాంట్లో ఎడ్జస్ట్ అయిపోయారు. హాయిగా కాసేపు పుస్తకం చదువుకున్నా. కాస్త నిద్రపట్టే సమయానికి క్రింద ఉన్న ఫ్యామిలీ తాలూకూ రెండేళ్ల పిల్లాడు పేచీలు మొదలెట్టాడు. పిల్లాడి కూడా ఉన్న నలుగురికీ, మాకూ కూడా చుక్కలు చూపించాడు ఆ పిల్లాడు చాలాసేపు. ఇహ ఆ రాత్రి నిద్ర లేదు :(

పొద్దున్నే నాగర్సోల్ లో దిగి షేరింగ్ జీప్ లో శిర్డీ చేరాం. జనం ఎక్కువగా ఉండరనే శుక్రవారం పెట్టుకున్నాం ప్రయాణం. త్వరగా ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాం. గంట అవ్వకుండానే చాలా చక్కని దర్శనం అయింది. క్యూలో వెళ్ళేప్పుడు మందిరంలోకి వెళ్ళగానే కుడివైపు లైన్ లోనే ఉంటే బాబాగారి ముందర వైపు ఉండే హాల్లోంచి బయటకు వెళ్ళచ్చు. ఎక్కువ సేపు దర్శనం అవుతుంది. అలా బాబాగారిని చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ బయటకు వచ్చేసాం. ఇక "భీమశంకరం" గురించి కనుక్కున్నాం. పూనా, ముంబై, ఔరంగాబాద్ల నుండి బస్సులు ఉంటాయిట. విడిగా ఇక్కడ్నుంచి వెళ్ళిరావడానికి పది గంటలు పడుతుందిట. పొద్దున్నే బయల్దేరితే సాయంత్రానికి రావచ్చు. షేరింగ్ టాక్సీలు, మనుషులు కూడా దొరుకుతాయి అని చెప్పారు. కానీ మాకు మర్నాడు సాయంత్రమే రిటర్న్ ట్రైన్. టైం సరిపోదు. ఇప్పుడే వెళ్తే రాత్రికి లేట్ అయినా వచ్చేసి రూమ్ లో పడుకోవచ్చు..అనుకున్నాం. మా ఒక్కళ్ళకే అంటే టాక్సీకి బాగా ఎక్కువే పడింది కానీ ఇంత షార్ట్ ట్రిప్ లో టైం వేస్ట్ అవకూడదని ఇంక భోం చేసేసి ఒంటిగంటన్నరకి భీమశంకరం బయల్దేరిపోయాం. బయట బోలెడు ఎండ. రాత్రి రైల్లో నిద్రలేదేమో కారులో ఏసీ ఉండటంతో హాయిగా ముగ్గురం నిద్రపోయాం. మూడున్నరకి అయ్యగారి ఆఫీసు ఫోన్లకి మెలకువ వచ్చింది. నాలుగున్నర దాకా ఎండగానే ఉంది. అప్పటి నుండీ తోవ కొండపైకెక్కడం మొదలయ్యింది.




సహ్యాద్రీ కొండల మధ్యలో.. అంటే ఏదో కొండల మధ్యలో గుడి ఉంటుందేమో అనుకున్నా కానీ మరీ పై పైకి పోతుంటే డౌటొచ్చి డ్రైవర్ని అడిగాం గుడి కొండ మీద ఉంటుందా? అని. కొండెక్కి మళ్ళీ కాస్త క్రిందకి మెట్లు దిగాలి అన్నాడతను. ఇంకా డ్రైవర్ ఏం చెప్పాడంటే, గుడి ఉన్న కొండ క్రింద ప్రదేశంలోనే బొంబాయి ఉందిట. మెట్ల దారి ఉందిట, కొందరు ట్రెక్కింగ్ కూడా చేస్తారుట.





ఈ డ్రైవర్ మరీ సైలెంట్ మనిషి. నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానమే ఇస్తున్నాడు. కానీ నెమ్మదస్తుడు. మంచివాడు. చాలా జాగ్రత్తగా, నేర్పుగా డ్రైవింగ్ చేసాడు. సరే ఇంక కొండ దారి పైపైకి పోతోంది. ఒకే కొండ కాకుండా కొన్ని కొండల సముదాయాలు అవన్నీ. సో పైకి వెళ్తూంటే క్రిందకి వెళ్పోయిన కొండలు, లోయలు, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. హటాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎండంతా పోయి మబ్బులు, చల్లగాలి, చినుకు మొదలైంది. కార్లో ఏసీ ఆపించేసి గ్లాస్ దించేసాం. చిరుజల్లు అలా విండో లోంచి మీద పడుతూ ఉంటే బావుంటుంది..:)


దారిలో గోనె గోంగళ్ళు కప్పుకుని మేకలు తోలుకెళ్ళే కాపర్లు, పొలం దున్నుకునే రైతులు కనబడ్డారు. ఆ కొండ ప్రాంతాన్నే వాలు ఎక్కువ లేని చోట్ల కాస్త కాస్త మేర చదును చేసేసి ఏవో పంటలు వేసేసారు. కొండల పైనుండి చూస్తే అక్కడక్కడ ఆకుపచ్చ తివాచీలు పరచినట్లు పచ్చని పంటలు. ఎంతో అందంగా ఉందా ప్రదేశం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా కనబడింది దారిలో.


 ఐదయ్యేసరికీ వాతావరణం ఇంకా మారిపోయింది. తెలీకుండానే బాగా ఎత్తులోకి చేరిపోయాం. ఐదున్నర అవ్వకుండానే ఏడున్నరలా ఉంది చీకటి. చుట్టూరా దట్టంగా మబ్బులు.. రోడ్డుకిరుపక్కలా అడవిలో ఉన్నట్లు పెద్ద పెద్ద చెట్లు.. ఆ చెట్ల మధ్యన లీలగా కనబడుతున్న దారి. ఓ చోట దారి పక్కగా నిలబడి గోనె గొంగళి కప్పుకున్న ఒకతను అలాంటివే ప్లాస్టిక్ కవరలు అమ్ముతున్నాడు. గాలికి గొడుగులు ఎగిరిపోతాయని అక్కడందరూ ఇవే వాడతారుట. తల మీంచి కప్పేసుకుని అడుగున రెండు కొసలు కలిపి ముందువైపుకి ముడి వేసేసుకుంటున్నారు. సరదాగా ఉన్నాయని మేమూ కొన్నాం ఆ కవర్లు.

మధ్యలో ఒక చోట మాత్రం దిగకుండా ఉండలేకపోయాం. కొండదారి కాస్త పక్కగా మళ్ళి చెట్లు అవీ ఉన్నాయి. బోలెడు మబ్బులు ఉన్నాయక్కడ. దిగి అక్కడ మబ్బుల మధ్యన నిలబడి కారబ్బాయితో రెండు ఫోటోలు తీయించుకునేంతలో వర్షం పెద్దదయిపోయింది. గబగబా కార్లో కొచ్చేసాం. ఆగేందుకు టైం కూడా లేదు. మళ్ళీ గుడి చూసాకా, పైకి వచ్చినంత దూరం వెనక్కి క్రిందకి వెళ్ళాలి చీకట్లో అనుకునేసరికీ నాకు భయం వేసింది. కానీ ఆ వాతావరణం, ఆ చల్ల గాలి, మబ్బులు అసలు ఏవేవో లోకాల్లోకి తీస్కెళ్ళిపోయాయి మమ్మల్ని. భయం మర్చిపోయా.


గుడి వద్దకు చేరేసరికీ సాయంత్రం ఐదున్నర. నాలుగ్గంటల్లో తీస్కువచ్చాడు డ్రైవర్. అక్కడకి చేరేప్పటికీ వర్షం ఇంకా పెరిగిపోయింది. నాలుగడుగులు వేస్తే మెట్లదారిలో షెల్టర్ ఉంటుందని చెప్పారు. అందుకని ఇక ఆగకుండా గుడివైపు వెళ్పోయాం. ఇందాకా సరదాకి కొన్న ఆ ప్లాస్టిక్ కవర్లే మాకు గొడుగులయ్యాయి. షెల్టర్ ఉన్న మెట్లదాకా చేరేసరికీ తల మీద కవర్ వల్ల తల తప్ప మొత్తం తడిసిపోయాం. పిల్ల చలికి వణికిపోయింది. వర్షం వల్ల ఇంకా చీకటిగా అయిపోయింది. మెట్లకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు అడవిలాగ. ఆట్టే మెట్లు లేవు కానీ తిరుపతి మెట్లదారి గుర్తుకు వచ్చింది. మనుషులు తిరుగుతున్నారు కాబట్టి భయమెయ్యలేదు. గుడి దాకా వచ్చేసరికీ కాస్త చలి, వణుకు తగ్గాయి. ఇంత పైకి దారి పెట్టి మళ్ళీ క్రిందకి గుడి ఎందుకు కట్టారో అని డౌట్ వచ్చింది. అసలీ గుడి ఎవరు కట్టారో? వర్షం వల్ల చాలా కొట్లన్నీ మూసేసారు. స్థలపురాణం పుస్తకం ఎక్కడా కనబడ్లేదు. గుడి పదమూడవ శతాబ్దం నాటిదని వికీలో రాసారు. స్థల పురాణం అక్కడ చదవవచ్చు.
 
 

ఏడెనిమిది నిమిషాల్లో క్రింద గుడి వద్దకు చేరాం. వానవల్లో ఏమో ఎక్కువ జనం లేరు. ఆర్భాటం లేని చిన్న గుడి. నల్లరాతి కట్టడం. గర్భగుడిలోకి రానిస్తున్నారు. అన్ని జ్యోతిర్లింగాలయాలలో మల్లె శివలింగం వెనుక వైపుకి పెద్ద అద్దం ఉంది. గర్భగుడి బయట ఉన్న భక్తులకు శివలింగం,అలంకారాలూ కనబడేలాగ. లోపలికి వెళ్ళి స్వయంగా పూలు,బిల్వపత్రాలు అవీ మనం పెట్టుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇదివరకూ కాశీలో, ఘృష్ణేశ్వర్ లో, త్రయంబకం లో కూడా ఇలాగే స్వయంగా శివలింగం వద్ద స్వయంగా అభిషేకం, పూజ చేసుకునే అవకాశం దొరికాయి మాకు. శ్రీశైలంలో మాత్రం కుదరలేదు. ఏ తోపుడూ హడావుడీ లేనందువల్ల కాసేపు అక్కడే గడిపి బయటకు వచ్చేసాం. గుడి కట్టిన రాతి మహిమో, గుడిలోపలి దేవుడి మహిమో తెలీదు కానీ కొన్ని గుళ్ళలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడా అలానే అనిపించింది. అన్ని గుళ్ళలో అప్పటికి వర్షం కాస్త నెమ్మళించింది. బయట నందీశ్వరుడు ఉన్న చోట పెద్ద గంట ఉంది. అది బాజీరావుపేష్వా అక్కడ పెట్టించారుట. పోర్చుగీస్ మీద తన విజయానికి గుర్తుగా ఇది + మరో నాలుగు పెద్ద గంటలు మరో నాలుగు శివాలయాల్లో పెట్టించాట్ట ఆయన. గంట మీద పదిహేడవ శతాబ్దపు సంవత్సరం కూడా రాసి ఉంది. చిన్న గుడిలా ఉండి "కమలజ" పేరుతో అమ్మవారు ఉన్నారు. పార్వతీదేవి రూపంట. గుడి వెనుక భీమా నది ప్రవహించేదిట. వర్షం వల్ల, సమయాభావం వల్ల ఇక చుట్టుపక్కల తిరిగి ఓ మారు పరిశీలించే అవకాశం లేకపోయింది. ఓ పక్కగా పొడుగాటి గోపురమున్న గుడి క్రిందన శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఇందాకా వర్షమని ఫోటోలు తియ్యడానికి లేకపోయింది. ఇప్పుడు బయటకు వస్తూంటే కాసిని తీసాను.


ఆ పెద్ద పెద్ద చెట్లు, కనుచూపుమేరలో మనిషి కనబడకుండా అలుముకున్న మబ్బులు, గాలికి కదిలే ఆకుల అలగలలు తప్ప మరే ఇతర సందడి లేని నిశ్శబ్దంలో ఎక్కువ ఎత్తులేని తేలికపాటి మెట్లు ఎక్కుతుంటే అసలు మనసు తేలికైపోయి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పడం కష్టం. సమయం ఉంటే అడవిలాగ కనబడుతున్నా ఆ చెట్లమధ్యన కాసేపు తిరగాలనిపించింది. ఎంత బాగుందో కదా..అని క్షణక్షణం అనుకుంటూనే ఉన్నాం నడుస్తున్నంత మేరా!


ఈలోపూ పక్కగా ఉన్న చిన్న కొట్లో ఆవిరిపై ఉడకపెట్టిన మొక్కజొన్నకండెలు అమ్ముతున్నారు. గబగబా కొనుక్కుని లాగించేసాం. ఆ చలిలో వెచ్చవెచ్చగా ఉన్న ఆ మొక్కజొన్న రుచి అమృతంలా తోచింది.


మరో పక్క కొట్లో అల్లం టీ పెడుతుంటే అది కొనుక్కుని తాగాం. ఆ కొట్టబ్బాయిని అడిగాను..ఈ గుడి ఎవరు కట్టారో తెలుసా? అని. ఏమో తెలీదు కానీ ఛత్రపతి శివాజీ పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారుట అన్నాడు. ఆ టీ కొట్లో శివాజీ ఏనుగు మీద ఉంటే చుట్టూరా బోలెడు మంది జనం ఉన్న పెద్ద పెయింటింగ్ ఒకటి ఉంది. ఇంకానేమో శంకరాచార్యులవారు వచ్చి ఇది జ్యోతిర్లింగ క్షేత్రమని నిర్ధారణ చేసాకా ఎక్కువ జనం దర్శనానికి రావడం మొదలయ్యిందని అతను చెప్పాడు.
 

కారుదాకా నడుస్తున్నామా చూట్టూరా మంచు కాదు మబ్బులే. అసలు రోడ్డు కనబడట్లే. మబ్బుల్లో నడుస్తున్నామని భలే సంబరపడిపోయాం. వర్షాలు మొదలయిన ఆరునెలల పాటు అక్కడ వాతావరణం రోజూ ఇలానే ఉంటుందని ఇందాకా టీ కొట్టబ్బాయి చెప్పాడు. ఎప్పుడూ ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉండగలిగే వీళ్ళెంత అదృష్టవంతులో అనిపించింది. అంత అందమైన ప్రకృతిని వదలలేక వదలలేక వదిలి..
మళ్ళీ భవసాగరాలలో ఈదడానికి మనసుని రీఛార్జ్ అయ్యిందని తృప్తి పడుతూ.. కారెక్కాం. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి నాలుగ్గంటలు ఎలా.. అనుకుంటుంటే డ్రైవర్ హాట్ బ్లోయర్ ఆన్ చేసాడు. వెచ్చటి గాలి తగిలే సరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. పిల్ల కూడా కాస్త కుదుటపడింది. మనసులోనే అతగాడ్ని పదికాలాలు చల్లగా ఉండు నాయినా అని దీవించేసాను. తిరుగుదారిలో మళ్ళీ కొండ దిగే సమయానికి మళ్ళీ మునుపున్న వాతావరణం వెలుతురు వచ్చేసాయి. ఆ మబ్బులు, మసకచీకటి అన్నీ మాయమైపోయాయి. ఎత్తు దిగిపోయాం కదా! కానీ ఏదో కొత్త ప్రపంచంలోంచి బయటకు వచ్చినట్లయి.. అదంతా కలా నిజమా? అని ఆశ్చర్యం వేసింది. దారిలో ఎందుకైనా మంచిదని పిల్లకి పేరాసెట్మాల్ సిరప్ కొన్నాం. ఇందాకా వచ్చేప్పుడు ఏసీ చల్లదనానికి ఎలా నిద్రపోయామో అలా ఇప్పుడు వెచ్చదనానికి మళ్ళీ అలానే నిద్రపోయాం. ఆరున్నరకి బయల్దేరి సరిగ్గా నాలుగ్గంటల్లో శిర్డీ వచ్చేసాం. పగలు పూట వెళ్తే అక్కడ కాసేపు గడిపి బాగా ఎంజాయ్ చేయచ్చనిపించింది నాకు.


శనివారం పొద్దున్నే మళ్ళీ ఓసారి బాబాగారి దర్శనం చేసుకున్నాం. మేం బయటకు వచ్చేసమయానికి రష్ పెరిగిపోయింది. వీకెండ్ రష్! కొత్తగా మొదలెట్టినట్లున్నారు దర్శనాల క్యూలో లడ్డూ ప్రసాదం పంచుతున్నారు సంస్థానం వాళ్ళు. ఫ్రెష్ గా బాగున్నాయి లడ్డూస్! ఇంక భోం చేసి, కాస్తంత షాపింగ్ చేసేసి, రూంకొచ్చి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ రైలెక్కడానికి బయల్దేరిపోయాం. టికెట్ల పొజిషన్ చూస్తే మళ్ళీ RAC ! అబ్బా ఇరుక్కుని వెళ్లలేం.. థార్డ్ ఏసి లో దొరుకుతాయేమో చూడమన్నా అయ్యగారిని. స్లీపర్ క్లాస్ కన్ఫర్మ్ అవ్వడం కష్టం కానీ థార్డ్ ఏసి లో ఉన్నాయని మూడు సీట్లు ఇచ్చేసారు టిసిగారు. నెట్లో చూస్తే అన్నీ క్లాసులూ ఫుల్.. ఇప్పుడెలా దొరికాయి.. అనే సందేహాలన్నీ పక్కనెట్టేసి.. ఆహా బాబాగారి దయ అనుకుంటూ చల్లగా ఏసీలో పడుకుని రిలాక్స్ అయిపోయాం. చిన్నప్పుడు ఎన్ని వందలసార్లు రైళ్ళలో తిరిగాము.. ఇప్పుడేమిటో అంత బాధ! ఏమైనా ఓపికలుండగానే తిరగాలనుకున్న నాలుగు ఉళ్ళూ తిరిగెయ్యాలి. తర్వాతర్వాత వెళ్లడం కుదిరినా ముక్కుతూ ములుగుతూ ఏం తిరుగుతాం.. అనిపించింది. ఇదివరకూ ఓసారి నేనన్నమాటలే నాకు గుర్తుకొచ్చాయి.. సుఖం ఎలా ఉంటుందో తెలీనప్పుడు ఎన్ని కష్టాలైనా పడగలం. ఒక్కసారి సుఖాలకి అలవాటుపడ్డాకా.. మళ్ళీ కష్టపడాలంటే మహా బాధగా ఉంటుంది!