సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts
Showing posts with label ప్రదర్శనలు - సభలు -ఫోటోలు. Show all posts

Thursday, March 5, 2015

Millet Fest - 2015


వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు గృహవిఙ్ఞాన విభాగం.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రదర్శన ఈ ఏడు కూడా క్రిందటి నెలాఖరులో జరిగింది. "Millet Fest 2015" ప్రకటన ఆఖరిరోజున అనుకోకుండా పేపర్లో చూసి అప్పటికప్పుడు బయలుదేరాం.  ఆ రోజు పేపర్ చూడకపోతే అదీ మిస్సయిపోదును. ఇది నాలుగవ ప్రదర్శనట. 2013 Fest కబుర్లు Millet Fest - 2013 లో రాసాను. నిరుడు టపా రాయలేదు కానీ వెళ్ళాను. ఈమధ్యన ఒంట్లో బాలేక ప్రతి ఏడూ వెళ్ళే హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ , మరికొన్ని పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా మిస్సయిపోయాను..:(  ఈ Millet Fest మాత్రం ఎలాగైనా చూడాలని బయలుదేరాను. ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి +  చిరుధాన్యాలతో చేయదగిన కొత్త రెసిపీస్ తెలుస్తాయని నా ఆశ. నా అంచనా తప్పలేదు. మరిన్ని కొత్త విషయాలు తెలిసాయి. 

ఈ ప్రదర్శన వివరాలు తెలిపే వెబ్సైట్ కూడా ఉందిట.. మళ్ళీ ఏడు ఎవరైనా ఈ ప్రదర్శనకు వెళ్ళాలనుకుంటే ఈ వెబ్సైట్ చూస్తూండండి.. ప్రదర్శన తారీఖులు తెలుస్తాయి. 



ఈసారి చివరిరోజు ఆదివారం అవడంతో సందర్శకులు బాగా ఉన్నారు. కొనుగోళ్ళు చూస్తూంటే చిరుధాన్యాల పట్ల ఆసక్తి కూడా బాగా పెరిగినట్లు అనిపించింది. ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా! ఇదీ ఒకందుకు మంచిదే. ఏ పదార్థాలు ఎక్కువ తినాలో, ఏది మానేయాలో తెలుసుకోవడం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలో తెలియడమే. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది 'ఆరోగ్య శాఖ' మరియు 'వ్యవసాయ విశ్వవిద్యాలయం' వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శన కాబట్టి ఇందులో పెట్టే వస్తువులు రిలయబుల్ మరియు వారు చెప్పే విషయాలు కూడా నమ్మదగినవీనూ!

మిల్లెట్స్ తో చేసిన వంటలు ఉంచిన ఫుడ్ కోర్ట్ లో కూడా బాగా జనాలు ఉన్నారు. అన్ని పదార్థాలూ బాగా సేల్ అవడం చూసి సంతోషం కలిగింది. వాటిల్లో నేనిదైవరకూ బ్లాగ్ లో రాసిన ఒక హెల్త్ డ్రింక్ "అమృతాహార్" పేరుతో పెట్టారు. ఇంకా రాగి జావ , తేనె కలిపిన సబ్జా గింజల నీరు , సజ్జ ఉప్మా, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ఫ్రూట్ పంచ్, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్.. మొదలైన ఎన్నో రకాల వంటకాలు అమ్మారు. ఇవన్నీ చూసి నాకు కొత్త రెసిపీలకి బోలెడు ఐడియాలు వచ్చాయనేసరికీ పాపం అయ్యగారి ఫేస్ లో కలర్స్ మారాయి :-)


స్టాల్స్ లో ఒకచోట జొన్న రొట్టెలు తయారుచేసే మషీన్ ఒకటి పెట్టారు. అంటే అది చిన్న పరిశ్రమకు ఉపయోగపడేలాంటి పెద్ద పరికరం. భలేగా జొన్న రోటీలు వత్తేస్తోంది ఆ మషీన్.





పిల్లలు సరదాగా స్పూన్ కూడా తినేసేలాగ బియ్యం, జొన్నలు, గోధుమలు, వాము, జీలకర్ర, ఉప్పు మొదలైన వాటితో చేసిన ఈటబుల్ స్పూన్స్ ఒకచోట పెట్టారు. అవి బాగా అమ్ముడౌతున్నాయి. 



జొన్న, రాగి బిస్కెట్స్, లడ్డూలు మురుకులు, టేస్టీ బైట్స్ కాక ఒక చోట మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ తో చేసిన లడ్డూస్ అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు.


ఇంకా.. విజయవాడ కు చెందిన ఒక స్టాల్ నన్నాకర్షించింది. (మా బెజవాడ కదా :)) ఆ వివరాలు..



అన్ని చిరుధాన్యాల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ కొర్రల్లో(foxtail millet) ఉంటుందని తెలిసాకా ఈమధ్యన నేను కొర్రలు, కొర్ర బియ్యం కూడా వాడకం మొదలుపెట్టాను. వీటిల్లో ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు రెండు రకాలు ఉంటాయిట. ఒక స్టాల్ లో దాదాపు కొర్ర బియ్యం లాగానే ఉన్న వరిగలు(proso millet) అమ్ముతూంటే అదో పేకెట్ కొన్నాను. ఏ ఉప్మా ప్రయోగమో చేయచ్చని.







ఒక స్టాల్ లో అన్నంలో కులుపుకునే ఉసిరి పొడి, కాకర పొడి, ఒక హెర్బల్ టీ పౌడర్ కొన్నాను. మంజిష్ఠ, ఏలకులు, జాజికాయ, శొంఠి మొదలైన వాటితో తయారుచేసిన ఈ టీ పౌడర్ కాస్తంత మామూలుగా పెట్టుకునే టీలో కలుపుకోవచ్చు లేదా విడిగా ఈ పౌడర్ తోనే టీ పెట్టుకోవచ్చుట. అధిక ఫైబర్ మరియు Omega 3 fatty acids ఎక్కువగా ఉండే  Flax seeds(అవిసెలు) ఉపయోగాలు తెలిసాకా కొన్ని నెలల క్రితం ఫ్లాక్స్ సీడ్స్ కొన్నా కానీ వాటితో ఏమీ చెయ్యలేదు. కర్వేపాకు పొడిలాగ చేయచ్చు అని ఎక్కడో చదివాను. ఒక చోట ఆ పొడి అమ్ముతుంటే అది కొన్నాను కానీ తర్వాత మా అన్నయ్యతో ఈ సంగతులన్నీ చెప్తుంటే మరో స్టాల్ లో ఉన్న ఒక రీసర్చ్ స్టూడెంట్ విని, మమ్మల్ని పిలిచి, "సారీ ఫర్ ఓవర్ హియరింగ్..అన్చెప్పి, ఈ పొడులూ అవీ వేస్ట్.. దానివల్ల అందులోని పోషకాలన్నీ పోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ లోని పోషకాలు డైరెక్ట్ గా శరీరానికి అందాలంటే ఒక్కసారి జస్ట్ డ్రైగా టాస్(toss) చేసి అలానే తినేసేయండి అదే బెస్ట్ అని  చెప్పారు. నిజానికి ఫ్లాక్స్ సీడ్స్ ఉత్తినే తిన్నా బానే ఉంటాయి.


మరో చోట పచ్చి అరటికాయ పొడి అమ్ముతుంటే కొన్నా. ఏక్చువల్ గా అది ఒకటే పేకెట్ సాంపిల్ గా పెట్టారుట. ఆ స్టాల్లో ఉన్న ఒక పరిశోధకుడు(కొంచెం పెద్దాయనే) చెప్పిన విషయం ఏమిటంటే అరటి పండులో ఉన్న షుగర్ అరటి కాయలో ఉండదుట. చాలా పరిశోధనల తరువాత ఇటీవలే అరటికాయను డయాబెటిక్ పేషంట్స్ కూడా తినచ్చని నిర్ధారించారుట. పచ్చి అరటికాయలో ఉండే స్టార్చ్ మంచిదిట. పచ్చి అరటి కాయ నుంచి చేసిన ఈ పొడిని కూరల్లో, సూప్స్ లో, చపాతీ పిండిలో కలుపుకోవచ్చుట. ఇంకా అది ఏమేమి చేస్తుందో.. అలా బోలెడు ఉపయోగాలు చెప్పాకా మాకు కావాలని అడిగితే ఉన్న ఆ ఒక్క పేకెట్ అమ్మేసారు ఆయన. మార్కెట్లోకి వస్తుందన్నారు త్వరలో. ఎప్పుడు వస్తుందో మరి.

ఇదివరకూ కొనని రెండు రెసిపీ బుక్స్, ఎరువు ఎలా తయారు చేసుకోవాలో,  గార్డెన్ కేర్ గురించిన పుస్తకమూ కొన్నాను.





ఇంకా ఊళ్ళో ఉన్న రెండు మిలెట్ ఫుడ్ కోర్ట్స్ గురించి తెలిసింది. ఎప్పుడన్నా వెళ్లచ్చు..




కేవలం సైంధవ లవణం(rock salt) అమ్ముతున్న ఒక స్టాల్ ఉంది. అందులో ప్రదర్శనకు ఉంచిన పెద్ద ఉప్పు గడ్డ భలే ఉంది. ఈ ఉప్పు ఉపయోగాలు క్రింద కాగితంలో...





ఈ విధంగా సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందుకుని సజ్జల ఉప్మా, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్, జొన్న సలాడ్ లు తిని, అమృతాహార్ జావ తాగి మేమూ, అన్నయ్య ఇళ్ళదారి పట్టాం.


ప్రదర్శన తాలూకూ మరిన్ని ఫోటోలు:
http://lookingwiththeheart.blogspot.in/2015/03/millet-fest-2015.html

Wednesday, December 3, 2014

గులాబీల గుబాళింపు.. 3rd Rose Convention at HICC







మొన్న ఆదివారం పొద్దున్నే న్యూస్ పేపర్లో "రోజ్ కన్వెన్షన్" పేరుతో గులాబీల ప్రదర్శన తాలూకూ ఫోటోలు కనబడ్డాయి. ఆదివారంనాడు మేం తెప్పించుకునే నాలుగు పేపర్లలోనూ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వివరాలతో ఆర్టికల్ ఏమీ లేదు :( నెట్లో వెతికినా టైమింగ్స్ కాదు కదా, ఏ వివరాలూ కనబడలేదు. ఆఖరికి నోవొటెల్ హోటల్ లో ప్రదర్శన జరుగుతోంది అన్న వివరం ఒక్కటీ పట్టుకుని, ఆ అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరాం. పొలోమని మా ఇంటి నుండి రకరకాల వాహనాలు మారి ఓ ముఫ్ఫై ఐదు, నలభై కిలోమీటర్లు అలా.......ఆ..... వెళ్పోతే ఉందన్నమాట ఈ హోటేలు ఉన్న ప్రదేశం. 

రెండూ బస్సులు మారాకా మధ్యలో మూడో చోట, శుక్రవారం నాడు సిటీలో రిలీజ్ చేసిన ఎనభై వోల్వో ఏసి బస్సుల్లో ఒక బస్సు ఎక్కే అవకాశం అదృష్టవశాత్తూ  రాబట్టీ బ్రతికిపోయాం. ఎండలో అలసట లేకుండా Hitex Exhibition center చేరాం. ఆ లోపల మరో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్ళాకా ఈ నోవోటెల్ హోటేలు ఉంది. షేర్ ఆటో అబ్బాయి సగం దాకా తీస్కెళ్ళి ఆపేసాడు. ఇక వాల్కింగ్ చేసుకుంటూ డెస్టినేషన్ చేరాం. మధ్యలో ఎక్కడా ఓ పోస్టర్ గానీ, ప్రదర్శనశాలకు డైరెక్షన్ చెప్తూ వివరం గానీ లేవు. అసలీ ప్రదర్శన ఉన్నట్లే అక్కడ దారిలో కనబడ్డ కొందరికి తెలీదు. ఇదేదో కారుల్లో వచ్చే పెద్ద పెద్దోళ్ళందరికీనేమో మనలాంటి సామాన్యులకి కాదేమో.. అనుకున్నాం. కానీ ఆ దారిలో నడక మాత్రం చాలా బావుంది. ఎండలో రోడ్డుకిరుపక్కలా నీడనిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయి. హోటల్ దగ్గర్లోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైన గులాబీ రంగు కాగితంపువ్వుల కుండీలు ఎంత బావున్నాయి.


ఆ పక్కన మహర్షి విద్యాలయం ప్రాంగణం కనబడింది. కుడిపక్కన ఉన్న ఒక ఫంక్షన్ ప్లేస్ లో ఏదో పెళ్ళికి స్టేజ్ అలంకరణ జరుగుతోంది. క్రోటన్ మొక్కలు, బంతి మొక్కలు వేనుల్లోంచి దింపుతున్నారు.




గులాబీ ప్రదర్శన ఎంట్రీ ఫ్రీ నే! పెట్టినా కొనేవాళ్ళం.. ఇంత దూరం వచ్చాం కదా మరి :) ఎంట్రన్స్ లో వేరే దారి నుండి వస్తూ వస్తూ ఉన్న కొందరు జనాలు కనబడ్డారు. పర్వాలేదు జనం ఉన్నారు అనుకున్నాం. హాలు బయట పెద్ద పెద్ద కుండీల్లో అలంకరించిన గులాబీలు మనసు దోచేసాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా తేబుల్స్ మీద చిన్న చిన్న గాజు సీసాల్లో పెట్టిన రంగురంగుల అందమైన చిన్నా,పెద్దా గులాబీ పువ్వులు రారామ్మని స్వాగతం చెప్పాయి. 




పెద్దగా బాగున్నవి, మంచి ఆకృతిలో ఉన్న గులాబీలకూ ఫోటోలు తీసుకుంటూ ఒక్కో టేబుల్ నుండీ కదులుతున్నాం.. ఇంతలో హాలు మధ్యలో వేల గులాబీలతో నిర్మించిన గులాబీ చార్మినార్ కనబడింది. అందరూ వంతులవారీగా ఫోటోలు తీస్కుంటూన్నారు అక్కడ నిలబడి. ఎందుకనో అది కట్టి అంత అందమైన గులాబీలన్నింటినీ వృధా చేసారనిపించింది. 







ప్రదర్శనలో అన్నింటికన్నా బాగా నచ్చినవి.. చిన్న చిన్న కుండీల్లో ఉన్న గులాబీ వృక్షాలు. అవును వృక్షాలే అవి. సుమారు ఆరడుగుల ఎత్తుకు ఎదిగి చెట్టు నిండా పాతిక, ముఫ్ఫై దాకా పెద్ద పెద్ద గులాబీ పువ్వులు ఉన్నాయి. అలాంటివి ఒక పది రంగుల గులాబీ పువ్వుల కుండీలు మొత్తం ప్రదర్శనకు ఆకర్షణ అనిపించాయి. ఆ చెట్లకు ఏవో పేర్లు కూడా ఉన్నాయి. పువ్వులో రకాలన్నమాట.








ఇంకా ఇకబన, మొరిబన మొదలైన వివిధ రకాల స్కూల్స్ వాళ్ళు ఎరేంజ్ చేసిన ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పాట్స్ హాలు చుట్టూతా పెట్టారు. కాంపటీషన్ పెట్టినట్లున్నారు..ప్రైజెస్ రాసి ఉన్నాయి కొన్నిటిపైన. పింగాణీ
జాడీలు, ఇత్తడి బిందెలు,పళ్ళాలూ కూడా ఇలా ఫ్లవర్ ఎరేంజ్మెంట్స్ లో వాడడం కొత్త ఐడియానిచ్చింది నాక్కూడా. ఇంట్లో వాడకుండా పైన పెట్టేసిన పెద్ద పెద్ద పాతకాలం జాడీలు ఇకపై ఇలా వాడచ్చని ఆనందం కలిగింది.










ఒకచోట ఓ మెంబర్ మరెవరితోనో బాధతో హిందీలో అంటున్న మాటలు వినబడ్డాయి.. "బయట అవన్నీ పెట్టదన్నాను.. మీరెవరూ వినలేదు..అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.." అని! బయట వెళ్పోయేప్పుడు చూశాము.. కొందరు వెళ్పోతున్నవాళ్ళు వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు :( ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. ఎందుకని జనాలకు కొన్ని విషయాల్లో మేనర్స్, సెన్స్ ఉండవు..? అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు? దూరం నుంచి ఆస్వాదించి పోకూడదా? లేదా ఆర్గనైజర్స్ యొక్క అనుమతి అడగకూడదా?.. జవాబు దొరకని ప్రశ్నలివి! 

చివరలో కలిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ తో, గులాబీల తాలూకూ పరిమళాలనూ, ఫోటోలనూ వెంట తీసుకుని ఇంటి దారి పట్టాం.






Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html

Tuesday, February 18, 2014

Horti Expo 2014


ఈ ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ కోసం చాలా ఎదురు చూసాను..! జనవరి వెళ్పోయింది కానీ ప్రదర్శన జాడ లేదు. చూడగా చూడగా మొన్నొకరోజు సిటీలోకెళ్ళి వస్తుంటే ఒక హోర్డింగ్ చూసా..13 నుండి 17వరకూ ఎగ్జిబిషన్ అని. ఆ వీక్ అంతా బోళెడు పనులు.. హడావుడి! ఎక్కడా కుదిరేలా కనబడలే..:( ఆఖరికి ఏలాగైతేనేం మొన్న ఆదివారం మధ్యాహ్నం వెళ్ళివచ్చాం. 




ఈసారి ప్రదర్శన నన్ను బాగా నిరాశ పరిచింది. అసలు ఏం గడబిడ జరిగుతోందో.. ఎందుకు ఆలస్యంగా ఏర్పాటయ్యిందో తెలీదు. ఏడాది ఏడాదికీ తగ్గుతూ వస్తున్న క్వాలిటీ ఈసారి పూర్తిగా పడిపోయింది. చాలా సాధారణంగా ఏవో మొక్కలు,పువ్వులూ అంతే! ప్రత్యేకతలేమీ లేవు. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది. రెండు పుస్తకాల స్టాల్స్ (మొక్కల దగ్గర బుక్సెందుకో..?!), చిరుధాన్యాల తినుబండారాల స్టాల్, రెండుచోట్ల సేంద్రీయ కూరల అమ్మకాలూ ఉన్నాయి. ఎప్పటిలా బయట స్నాక్స్, పాప్కార్న్, బజ్జీలు గట్రా, లోపల నేచరల్ ఫ్లేవర్ తో సాప్ట్ ఐస్క్రీం స్టాల్స్ ఉన్నాయి. ఆ నేచరల్ ఫ్లేవర్ ఐస్క్రిం ఇదివరకు కోన్ లో ఇచ్చేవాడు. వెనిల్లా ఐస్క్రీం కి ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ కలిపి ఇచ్చే ఆ రుచి అద్భుతంగా ఉండేది. ఈసారి క్వాంటిటీ తగ్గి కప్పులోకి వచ్చి, రుచి కూడా బాలేదు :(  హనీ, హెర్బల్ టీ, తులసీ టీ, స్టీవియా స్టాల్స్ మామూలే. స్టీవియా స్టాల్ లో హెర్బ్వియా  పిల్స్  బయట దొరకట్లేదంటే పంపిస్తానని అడ్రస్ తీసుకున్నాడు. 
ఎవరికైనా herbvia కావాలంటే ఈ నంబర్ల లో సంప్రదించవచ్చు: 09000100071/09912629999





జనవరి అయిపోవడంతో ఎప్పుడూ ప్రధానాకర్షణగా నిలిచే బంతులు, చామంతులూ అక్కడక్కడా తప్ప ఎక్కువ లేవు! గులాబీలు కూడా ఎక్కువ కనబడలేదు. మొక్కల ధరలు మాత్రం బయట నర్సరీల రేట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. డెకొరేటివ్ ఫ్లవర్స్, స్టోన్స్, ప్లాస్టిక్ క్రీపర్స్ మొదలైనవి ఉన్న స్టాల్ మాత్రం కిక్కిరిసి ఉంది. 
రెండు మూడు కొత్త మొక్కలేమైనా కొందామన్నా ఆసక్తికరంగా అనిపించలేదు. చివరికి సెంటెడ్ కాగడామల్లె (చెంబేలీ కాదు) ఒకటి కొని నిరుత్సాహంగా బయటకు నడిచా!




ఇది బాగుంది :)


ఈ ప్రదర్శన తాలూకూ మిగిలిన ఫోటోలు క్రింద లింక్ లో..:
http://lookingwiththeheart.blogspot.com/2014/02/horti-expo-2014.html



Thursday, February 13, 2014

సప్తపర్ణి + కేలిగ్రఫీ రామాయణం




ఈ టపాలో రెండు విషయాలు చెప్పాలి.. ఒకటి సప్తపర్ణి గురించి, రెండోది కేలిగ్రఫీ రామాయణం గురించీ! క్రితం వారం హిందూ(న్యూస్ పేపర్) ఫ్రైడే రివ్యూ లో  పూసపాటి పరమేశ్వర రాజు గారి "కేలిగ్రఫీ రామాయణం" గురించిన ఆర్టికల్ ఒకటి వేసారు. చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద కేలిగ్రఫీ పెన్స్ ఉండేవి. ఆ పెన్స్ కి వివిధ సైజుల్లో మార్చుకోవడానికి నిబ్స్ కూడా ఉండేవి. నాన్న ఆ పెన్స్ లో రంగురంగుల ఇంక్స్ మారుస్తూ, వాటితో అందంగా రాయడం, బొమ్మలెయ్యడం చూసి మేము సరదా పడితే మాకేమో కేలిగ్రఫీ () స్కెచ్ పెన్స్ సెట్ కొంటూండేవారు. వాటితో మేము బొమ్మలు, చార్ట్స్ లో కొటేషన్స్ రాస్తూండేవాళ్ళం.  అందువల్ల పేపర్లో కేలిగ్రఫీ రామాయణం అని చదవగానే చూడాలని అనిపించింది. సిటీలో అమ్మావాళ్ళింట్లో ఉన్నా కాబట్టి అనుకున్నదే తడవు వెళ్ళి చూడగలిగాను. 



news paper article

రామాయణం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని, వాటికి కేలిగ్రఫీ స్తైల్లో పైంటింగ్స్ వేసారు పరమేశ్వర రాజు. కొన్ని అర్ధమవుతున్నాయి గానీ కొన్ని పెయింటింగ్స్ abstract paintings లాగ ఉన్నాయి. అయినా అసలు ఇలాంటి ఒక ఐడియా వచ్చినందుకు ఆయనను మెచ్చుకోవాలి. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక బుక్ వేసారు. ప్రతి బొమ్మకూ క్రిందన ఆ ఘట్టం తాలూకూ డిస్క్రిప్షన్ రాసారు కానీ ఖరీదే చాలా ఉంది.. ఏకంగా వెయ్యి రూపాయిలు! ఐదువందలన్నా కొందును గానీ వెయ్యి అనేసరికీ వెనకడుగు వేసేసాను..! ఫోటోలు తీసాను కానీ అవి బ్లాగులో పెట్టడం వారికి ఒప్పుదల కాదేమో అని పెట్టడం లేదు. నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ను బంజారా హిల్స్ రోడ్ నెం.8 లో ఉన్న సప్తపర్ణి లో చూడవచ్చు. ఈ నెల ఇరవై ఆరు దాకా ఉంటుందిట.


ఇప్పుడు నే చెప్పదలుచుకున్న రెండవ సంగతి.. సప్తపర్ణి! ఇది ఒక బుక్ స్టోర్స + కల్చరల్ సెంటర్ ట. నేనిదే మొదటిసారి చూడటం. ఫేస్బుక్ లో కూడా 'సప్తపర్ణి' ఉంది. అక్కడ జరిగే ఈవెంట్స్ ఏడ్స్ అందులో చూడచ్చు. ఇక్కడ వివిధరకాల సాంస్కృతిక ప్రదర్శనలే కాక శాస్త్రీయ సంగీతం క్లాసెస్ కూడా ఉన్నాయి. వోకల్, వయోలిన్, తబలా నేర్పిస్తారుట. ఇంక ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే ఇంకాసేపు అక్కడే ఆ చెట్ల మధ్యన, పచ్చదనం మధ్యన గడపాలనిపించేలా ఉంది. లోపల ఉన్న బుక్ స్టోర్స్ లో ఎక్కువగా పిల్లల పుస్తకాలు ఉన్నాయి. ఏదో బొమ్మలు చూపెడదామని పొరపాటున మా అమ్మాయిని తీసుకువెళ్ళి  అక్కడ బుక్ అయిపోయా నేను. అది కొను..ఇది కొను.. అని గొడవ! పోనీ కొందామా అంటే ధరలన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి. 'పరమపదసోపానపటం' చూసి ముచ్చటపడి రేట్ చూసి బెదిరిపోయా:( ఎనిమిదొందల ఏభైట!! మరి ఆ బుక్ సెంటర్ ఉన్న ఏరియా మహత్యం అది అనుకున్నా!







ప్రదర్శనలేమీ లేకపోయినా ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడపాలనిపించేలా ఉందీ చోటు! 
ఈ చోటులో తీసిన మిగిలిన ఫోటోలు ఇక్కడ: