సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts

Tuesday, February 18, 2020

కుసుమత్త

                                         
                                


మొన్న ఆదివారం పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేసాడు. "కుసుమత్త ఫోన్ చేసిందే. వాళ్లమ్మాయి పెళ్ళట. అందరూ తప్పకుండా రావాలని చెప్పింది. పిల్లాడి పెళ్ళికి ఎవరూ రాలేదు. అమ్మయి పెళ్ళికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది" అన్నాడు. ఉత్సాహంగా వెళ్దామంటే వెళ్దాం అనేసుకుని కాసేపు కుసుమత్త కబుర్లు చెప్పుకున్నాం. కానీ తారీఖు చూస్తే పరీక్షల సమయంలో.. కుదురుతుందో లేదో తెలీదు! కుసుమత్త ని తల్చుకుంటే చల్లని తెమ్మెర మొహాన్ని తాకినట్లుంటుంది. అంత హాయి కలుగుతుంది మనసుకి. ఇన్నేళ్ళు గడిచిపోయినా అదే ఆప్యాయత, అదే అభిమానం!! ఈనాటి పరిచయాలకి అటువంటి విలువ ఎక్కడ..?!

కొన్ని కారణాల వల్ల ప్రతి రెండు మూడు నెలలకి ఓసారి కాకినాడ వెళ్ళివచ్చిన చిన్ననాటి రోజులు అవి. ఇరుగుపొరుగువాళ్లని అత్త, పిన్ని, అక్క అంటూ వరసలతో ఆప్యాయంగా పిలుచుకునే రోజులు! ఐదో, ఆరో క్లాసు. మా కాకినాడ ఇంట్లో నాలుగు వాటాలు, ముందర వైపు రెండు గదుల చిన్న షెడ్డు ఉండేవి. షేడ్ లోనూ, మూడు వాటాల్లోనూ అద్దెకు ఉండేవారు. చాలా కుటుంబాలవారు ఉద్యోగ రీత్యా మారుతూ ఉండేవారు. ఒకసారి మేము కాకినాడ వెళ్ళినప్పుడు పొద్దున్నే రోజూ వచ్చే కూరలబ్బాయి సైకిల్ మీద వచ్చాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు! మా మామ్మయ్య కూరలు తీసుకుంటూ నన్ను పిలిచింది. "ఒసేయ్ పైకి వెళ్ళి కుసుమత్తని కూరలబ్బాయి వచ్చాడని పిలుచుకురా" అంది. "కుసుమత్త ఎవరు?" అన్నాన్నేను. "ఈమధ్య కొత్తగా వచ్చారు. వెళ్ళు త్వరగా" అంది మళ్ళీ. "కొత్తవాళ్ళా.. నాకు తెలీదుగా...అత్తా అని ఎందుకు పిలవాలి.." అని నేను నసిగాను. "నోరుమూసుకుని వెళ్ళూ...కుసుమత్తా అని పిలువు" అని మామ్మయ్య గట్టిగా ఆర్డర్ వేసింది. ఇంక పిల్లిలా నెమ్మదిగా మెట్లెక్కి వెళ్తే తలుపు వేసి ఉంది. సందులో బట్టలు ఆరేసి ఉన్నాయి, అవి తోసుకుంటూ వెళ్తే వంటింటివైపు తలుపు తీసి ఉంది. ఒకావిడ కనబడింది. "కుసుమత్తా..." అని కిటికీలోంచి పిలిస్తే ఇటు చూసింది. "కూరలబ్బాయి వచ్చాడని మామ్మయ్య చెప్పమంది" అనేసి పరిగెత్తుకుని వచ్చేసా. తను కిందకి వచ్చి కూరలు కొంటూంటే మామ్మయ్య తనతో చెప్పింది.. "మా అబ్బాయివాళ్ళు వస్తారని చెప్పా కదా...ఇది నా మనవరాలు" అని చెప్పింది.

టి.వి లేని రోజులు అవి. అన్నయ్య స్కూలుకి వెళ్పోయాడు. దోడ్లో మొక్కల్లో తిరగడం అయిపోయింది. ఇంక ఏమీ తోచట్లేదు అని పేచీ పెడుతుంటే "పైకి వెళ్ళు..కుసుమత్తతో కబుర్లు చెప్పిరా.." అంది మామ్మయ్య. చేసేదేమీ లేక మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు వేసి ఉంది. కొట్టాలా వద్దా అనుకుంటూ సందులోకి వెళ్తే కిటికీ తలుపు తీసి ఉంది. కుసుమత్త ఏదో కుట్టుకుంటోంది. నన్ను చూసి వచ్చి తలుపు తీసింది నవ్వుతూ. చక్కగా చీర కట్టుకుని అమ్మంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. అది మా మొదటి పరిచయం. అలా భయపడుతూ వెళ్ళినదాన్ని, కాకినాడ వెళ్ళినప్పుడల్లా అన్నానికి తప్పించి మిగతా సమయం అంతా మేడ మీద కుసుమత్త ఇంట్లోనే పొద్దున్నుంచీ సాయంత్రం దాకా గడపడం వరకూ మా స్నేహం పెరిగింది. కుసుమత్తకి అప్పటికి పాతికేళ్ళు ఉంటాయేమో. కొత్తగా పెళ్ళయిన జంట. ఇద్దరే ఉండేవారు. మావయ్యగారికి బ్యాంక్ లో పని. "మావయ్యగారు రాగానే వచ్చేయాలి. అల్లరి చేయకూడదు." అని చెప్పి పైకి పంపించేవారు ఇంట్లో. మావయ్యగారు కూడా చాలా మంచాయన. మాతో(నేను ,తమ్ముడు) బాగా ఆడేవారు. కబుర్లు చెప్పేవారు. మా ఇద్దరికీ చెస్, పేక ఆడటం రెండూ వాళ్ళే నేర్పించారు. నలుగురం కలిసి ఇవే మార్చి మార్చి ఆడుతూ ఉండేవాళ్ళం. బెజవాడ వచ్చాకా కూడా చెస్ బోర్డ్ కొనుక్కుని నేనూ, తమ్ముడూ అడుతూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా మరో కొత్త పేకల సెట్ కూడా ఇచ్చేది కుసుమత్త. 

కుసుమత్తావాళ్ళింట్లో నాకు మరో అట్రాక్షన్ ఉండేది. పుస్తకాలు, వార పత్రికలు. నాకు తెలుగు చదవడం వచ్చాకా అదీ, ఇదీ అని లేదు పుస్తకం, కాయితం  ఏది దొరికితే అది చదివేసేదాన్ని. బజ్జీలు, పిడతకింద పప్పు కట్టి ఇచ్చే కాయితాలు కూడా తిన్నాకా చదివేసి పాడేసేదాన్ని. మా ఇంట్లో వారపత్రికలు ఉండేవి కావు. కాబట్టి అదో కొత్త సరదా నాకు. అన్నీ కాదు కానీ బావున్న సీరియల్స్ చదివేదాన్ని కుసుమత్త ఇంట్లో. వెళ్ళినప్పుడల్లా పాతవి  వెతుక్కుని ఐదారు పుస్తకాలు తెచ్చుకుని సీరియల్ భాగాలన్నీ ఒకేసారి చదివేదాన్ని. ఎదురుచూడక్కర్లేకుండా ఒకేసారి అంత కథ తెలిసిపోతే భలే ఉంటుంది. ఓ పక్క అమ్మ తిడుతూ ఉండేది. నీకెందుకే ఆ పత్రికలు అని. అప్పుడేమో పైనే కుసుమత్త ఇంట్లోనే అన్నీ చదివేసి వచ్చేసేదాన్ని. సాయంత్రాలు పార్క్ కో, ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికో మమ్మల్ని వాళ్లతో పాటూ తీసుకెళ్ళేవారు కుసుమత్తా వాళ్ళు. 

ఒకసారి అమ్మావాళ్లు  బెజవాడ వెళ్పోయారు. ఎందుకో నేనూ, తమ్ముడూ ఉండిపోయాం కాకినాడలో. కుసుమత్తా వాళ్ళింట్లో చుట్టాల పిల్లలెవరో ఉన్నారు అప్పుడు. వాళ్ళని దింపడానికి బెజవాడ వచ్చారు వాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకువచ్చేసారు. వేసవి సెలవలు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. విపరీతమైన ఎండ. వేడి. కుసుమత్త తన చీరొకటి తీసి, తడిపి కిటికీలకు,సీట్లకూ అడ్డుగా కట్టింది. చల్లగా భలే బావుంది. నలుగురు పిల్లలం,వాళ్ళిద్దరూ - మొత్తం ఆరుగురం పేకాట ఆడుకుంటూ, రకరకాల చిరుతిళ్ళు తింటూ బెజవాడ వచ్చేసాం. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము.

ఒక అబ్బాయి మా ఇంట్లో ఉండగానే పుట్టాడు. తర్వాత మావయ్యగారికి ట్రాన్ఫర్ అయి వేరే ఊరు వెళ్పోయారు. తర్వాత అమ్మాయి కూడా పుట్టిందని తెలిసింది. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. అప్పుడప్పుడూ ఉత్తరాలు ఉండేవి. తర్వాత ఏ కబురూ తెలీదు. చాలా ఏళ్ల తర్వాత మాకు బెజవాడలో తెలిసినవాళ్ల అబ్బాయి పెళ్ళి కుదిరితే, ఆ పెళ్ళికూతురు ఫలానా బ్యాంక్ అని తెలిసి, కుసుమత్త మావయ్యగారు కూడా అదే బ్యాంక్ కదా అని అమ్మ ఆ పెళ్ళికూతురుని అడిగి ఎలాగైతేనేం వాళ్ల అడ్రస్ సాధించింది. మా తమ్ముడి పెళ్ళి సమయం అది. శుభలేఖ వేస్తే మొత్తం నలుగురూ వచ్చారు. పెద్దవాళ్ళయి ఇంజినీరింగ్ చదువుతున్న కుసుమత్త పిల్లల్ని చూస్తే చాలా ఆనందం వేసింది. కుసుమత్త ఏ మాత్రం మారలేదు. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత. నా చేతులు పట్టుకుని ఎంత సేపో కబుర్లు చెప్పింది. పిల్లల చదువుల వివరలు అడుగుతూ అమ్మాయి పేరేమిటి అని అడిగాను. చెప్పింది. "అయ్యో... నా పేరు.." అన్నాను. అవునంది. ఆశ్చర్యంతో "నా పేరని తెలుసా?" అన్నాను. "అందుకే పెట్టుకున్నాం." అంది. "నిజమా" అన్నాను. నిజమే అంది. మళ్ళీ అడిగాను "నిజంగానా" అని. "నిజమేరా" అంది. నా జీవితంలోని మెమొరబుల్ ఎమోషనల్ మోమెంట్స్ లో అదీ ఒకటి!! 

రెండుమూడేళ్ళ క్రితం వాళ్ల అబ్బాయి పెళ్ళని పిలిచింది కుసుమత్త. ఫోన్ చేసి మాట్లాడింది కూడా. ముఫై ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ నిండిన స్వరం. అదే అభిమానం..! కానీ అప్పుడు మా అత్తయ్యగారికి ఒంట్లో బాలేక నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ల అమ్మాయి పెళ్ళి. నా పేరు పెట్టిన అమ్మాయి పెళ్ళి! కానీ మా అమ్మాయి పరీక్షల సమయం, వేరే పనులు కూడా ఉన్నాయి.. వెళ్లలేనేమో..:( 

అన్నయ్య తప్పకుండా వెళ్తాడు. వెళ్లలేకపోయినా కుసుమత్త అర్థం చేసుకుంటుంది అని నమ్మకం. ఆనాటి ఆప్యాయతల గట్టిదనం అలాంటిది.

****  ****

వెళ్ళాను. వెళ్లగలిగాను! ఫంక్షన్ హాల్ గుమ్మంలో కుసుమత్త మావయ్యగారు కనబడ్డారు. "ఎవరో చెప్పుకోండి..." అనడిగాను. గుర్తుపట్టలేదు. అన్నయ్యని చూసి గుర్తుపట్టారు. అది కూడా వాట్సప్ లో వాడి ఫోటో చూశారుట, అలా గుర్తుపట్టారు. కుమత్తేదీ అని అడిగితే, ఎటో వెళ్తున్న తనని చూపించారు. గభాలున వెనక్కి వెళ్ళి, భుజాలు పట్టుకుని " నేనెవరో చెప్పుకో" అన్నాను.. నవ్వుతూనే ఆలోచిస్తూ చూసింది.. మళ్ళీ అడిగాను "నేనెవరో చెప్పుకో.." అని...హా...అనేసి గుర్తుపట్టేసిందిభలే అనిపించింది. "హ్మ్మ్...నువ్వు గుర్తుపట్టావు. మావయ్యగారు గుర్తుపట్టలేదు" అన్నాను. "ఎంత మారిపోయావూ.. పదేళ్లవుతోంది నిన్ను చూసి.."అంది. 


పెళ్ళి బాగా జరిగింది. మధ్యాన్నం, రాత్రి రెండు భోజనాలూ బాగున్నాయి. పొద్దున్నేమో చక్కగా సొజ్జప్పం వేశారు. వంకాయ పులుసు పచ్చడి కూడా. ఈ రెండు ఐటెమ్స్ నేనైతే పెళ్ళిళ్ళలో చూడలేదు.  రాత్రి టిఫిన్స్ తో పాటూ లక్కీగా నేను తినదగ్గ ఐటెమ్ దొరికింది -"కొర్రలతో బిసిబెళెబాత్". పెళ్ళయ్యాకా, టైమైపోతోందని పరుగులెడుతూ స్టేషన్ కి వెళ్ళాం. ఎక్కి కూర్చున్నాం. రైలు కదిలింది.



Monday, August 5, 2019

స్నేహితులు




పైన పద్యంలో చెప్పినట్లుగా ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ద్రవించింది మనసు నిన్న. నా ప్రియమైన స్నేహితులందరినీ కలిసిన తరువాత. అచ్చంగా పాతికేళ్ళ తరువాత ఐదేళ్ళపాటు కలిసి చదువుకున్న మా మారిస్ స్టేల్లా కాలేజీ మిత్రురాళ్ళము కొందరం నిన్న బెజవాడలో కలుసుకున్నాం. టీనేజ్ లో విడిపోయిన మేము మళ్ళీ టీనేజీ పిల్లల తల్లులుగా మారాకా జరిగిన ఈ కలయిక మాలో ఎంత అద్భుతమైన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ నింపిందో అసలు మాటల్లో చెప్పలేను. మరీ దూరాల్లో ఉన్న స్నేహితులను వీడియో కాల్స్ చేసి పలకరించాము. అందరి కళ్ళల్లో సంబరం, ఆశ్చర్యం, ఆత్మీయత! ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు అన్నీ మర్చిపోయి, సంసారాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మేము చిన్నపిల్లలమైపోయి అప్పట్లో క్లాస్ లో లాగ గలగలా గట్టిగట్టిగా మాట్లాడుకుని, ఏమే, ఒసేయ్ అని పిలుచుకుంటూ మహా ఆనందపడిపోయాం. మేము ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా నిన్న "ఫ్రెండ్ షిప్ డే " అవ్వడం మరో గొప్ప కోయిన్సిడెన్స్!!

నాది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా సెక్లూడెడ్ లివింగే. నా కొకూన్ లో, నా కంఫర్ట్ జోన్ లో జీవిస్తూ గడపడం నా స్వభావం. మధ్యలో ఒక్క రెండు మూడేళ్ళు మాత్రం మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాటిని మర్చిపోవడానికి ఎక్కువ భాగం ల్యాప్టాప్ ముందర గడిపాను. అదే నేను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకేలాంటి ఆసక్తులు ఉన్న మనుషులందరూ ఒక్కలాగ ఆలోచిస్తారనుకునే పిచ్చి భ్రమలో ఉండి జీవితాంతం మర్చిపోలేని అవమానాల్ని భరించాల్సి వచ్చింది!! దైవికంగా ఇప్పుడు నా మిత్రురాళ్ల కలయికతో ఆ బాధ అంతమైంది. అంత స్నేహమూ, అంత ప్రేమాభిమానాలూ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదు? కనీసం ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళి, సంసార బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగాలూ, వయసుతో పాటూ వచ్చిన ఆరోగ్య సమస్యలూ... ఒకటా రెండా? సవాలక్ష కారణాలు. నామటుకు నేను గుర్తుకొచ్చినప్పుడు తలుచుకోవడం తప్ప ఏనాడూ గట్టిగా కలవడానికి గానీ, కనీసం మాట్లాడడానికి గానీ ప్రయత్నించలేదు. ఏమో...అలా గడిచిపోయాయి రోజులు.. అంతే. 


" बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम..."
అందరమూ పాతికేళ్ల తర్వాత కలిసినా అదే స్నేహభావం, అదే ఆప్యాయత, అందరి కళ్ళల్లో అదే ప్రేమ. ఇది కదా నిజమైన స్నేహం అంటే. చెప్పుడు మాటలు విని అకారణ ద్వేషభావాల్ని పెంచుకుని మనసుని ముక్కలుచేసే వర్చువల్ స్నేహాల్లాంటివి కావవి. అందరమూ మొత్తం ఐదేళ్ళు 9a.m to 4p.m కలిసిమెలసి గడిపినవాళ్ళం.ఒకరిగురించి ఒకరం పూర్తిగా ఎరిగిన మనుషులము.


ఇంటర్ లో మా స్పెషల్ ఇంగ్లీష్(HSC) గ్రూప్ లో మొత్తం నలభై మందిమి. తర్వాత B.A లో కూడా సేమ్ బ్యాచ్. ఎకనామిక్స్ గ్రూప్, Eng.Litt రెండు గ్రూప్స్ నీ కలిసి ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవారు. క్లాస్ లో మొత్తం ఎనభై, తొంభై మందిమి ఉండేవాళ్ళం. ఆ రెండు సబ్జెక్ట్స్ కీ, లాంగ్వేజెస్ కీ రూమ్స్ మారేవాళ్ళం. లంచ్ టైమ్ లో మా లిట్రేచర్ వాళ్లమందరమూ రౌండ్ గా కూచుని ఒకరి బాక్సెస్ ఒకరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ లంచ్ చేసేవాళ్ళం. పాటలు పాడే అమ్మాయిగా నేను అందరికీ బాగా తెలిసేదాన్ని. మేడమ్ రాకపోతే లీజర్ పిరియడ్ లో నాతో పాటలు పాడించుకునేవారు. డిగ్రీలో నాకు తోడు మరొక సింగర్ క్లాస్ లో జాయిన్ అయ్యాకా నాకు కాస్త రెస్ట్ వచ్చింది. తను చాలా బాగా పాడేది. బోల్డు హై పిచ్. ముఖ్యంగా మల్లీశ్వరిలో పాటలు ఎంత బాగా పాడేదో. నేనైతే "ఎందుకే నీకింత తొందర.." పాటని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేదాన్ని. ఆ పాటల వల్లే నాకు మంచి స్నేహితురాలైంది కూడా తర్వాతర్వాత. ఇప్పుడు కెనడాలో ఉంటోందా రాక్షసి.

విజయవాడకు దగ్గరలో ఉన్న ఊళ్ళవాళ్లందరూ నిన్న వచ్చారు. ఇంతకీ నిన్న కలిసిన వాళ్ళల్లో చాలా మటుకు అందరూ మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీలలో టీచింగ్ ప్రెఫెషన్ లోనే ఉన్నారు. చాలావరకూ పి.హెచ్.డీ కేండిడేట్ లే. ప్రెఫెసర్ గిరీలే! వివరాలు అప్రస్తుతం కానీ ఇలా మంచి పొజిషన్స్ లోకి ఎదిగినవాళ్ళు మా బ్యాచ్లో ఇంకా కొందరున్నారు.

దాదాపు అందరూ వర్కింగే అవడం వల్ల పని ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలూ కూడా కామన్ గానే కనబడ్డాయి మాలో! కానీ నాకు ముఖ్యంగా సంతోషం కలిగించిన విషయం పిల్లలు. అందరూ కూడా పిల్లలని చక్కని క్రమశిక్షణతో, ఉన్నతమైన చదువులు చదివించారు. చదివిస్తున్నారు. బుధ్ధిమంతులుగా పెంచుతున్నారు. మన మంచితనం, మన బాధ్యతా నిర్వహణలే మన పిల్లలకూ మార్గదర్శకంగా మారతాయి. ఇవే కదా మనం పిల్లలకు ఇచ్చే ఆస్తులు. 

నేను గమనించిన ఇంకో సరదా విషయం మా మానసిక ఎదుగుదల. ఒకప్పుడు టీనేజ్ ఆలోచనలతో ఉన్న మేమే మాకు తెలుసు. ఇప్పుడు అందరమూ దాదాపు సగం జీవితాన్ని చూసిన, గడిపిన అనుభవంతో ఉన్నాము. అందువల్ల అందరి మాటల్లోనూ లోతైన అవగాహన, చక్కని పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదంతా జీవితంలో నేర్చుకున్న పాఠలు అనేకన్నా మా కాలేజీ మాకు ఇచ్చిన శిక్షణ వల్లనే అనుకోవడమే సబబు. అప్పట్లో అధ్యాపకులు కూడా ఎంతో ఆదర్శవంతంగా, విజ్ఞానవంతులుగా ఉండేవారు. అలానే బోధించేవారు. ఇప్పుడు కూడా క్లాస్ చెప్పేప్పుడూ ఫలానా మేడమ్ మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాము అని కూడా ఒకరిద్దరు స్నేహితురాళ్ళు అన్నారు నిన్న. అందరు అధ్యాపకులనూ పేరు పేరునా తల్చుకున్నాం. నాలుగైదు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. 

గిఫ్ట్స్ ఎక్ఛెంజ్ చేసుకుని, నెక్స్ట్ మీట్ లోపూ మరికొందరు మిత్రులని వెతికిపట్టుకోవాలనే నిశ్చయంతో, భారమైన హృదయాలతో, కళ్లల్లో నీళ్ళతో, కౌగిలింతలతో వీడ్కోలు చెప్పుకున్నాం. ఏడాదిలో ఒక్కసారైనా ఇలా కలుస్తూ ఉందామర్రా! అని గట్టిగా చెప్పుకున్నాం. అప్పటికే లేటయిపోవడం వల్ల ఇంక వేరే ఎవరినీ కలవకుండానే ఇంటిదారి పట్టాను. దారిలో కృష్ణా బ్యారేజ్ దాటాకా అదేదో పవిత్ర సంగమంట. కృష్ణా,గోదావరుల కలయికా స్థలం. పార్క్ లా డేవలప్ చేశారు. అది మాత్రం చూశాము. రాత్రి ఇల్లు చేరేసరికీ పన్నెండైంది. ఆదివారం కాబట్టి ఇలా కలవడం సాధ్యమైంది అందరికీ. కానీ మరొక్కసారి టీనేజ్ లోకి వెళ్ళి వచ్చినట్లు ఉన్న magical intoxication లోంచి మాత్రం ఎవ్వరమూ ఇంకా బయటకురాలేదు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మా కాలేజీ వాట్సప్ గ్రూప్ లో ఇందాకటిదాకా టింగ్ టింగ్ మని వస్తున్న మెసేజెస్ అందుకు సాక్ష్యం :-)

 స్నేహసుగంధాల మత్తులో, ఈ జ్ఞాపకాలతో మరోసారి మేమందరమూ కలిసే వరకూ బహుసంతోషంతో బతికేయచ్చు అని మాత్రం ధీమాగా అనిపించింది.









Wednesday, January 14, 2015

ఆ పరిమళాలు..




ఊళ్ళో ఏ బజారుకో, గుడికో, పేరంటాలకో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే గుప్పుమని వచ్చేది నైట్ క్వీన్ పువ్వుల పరిమళం.. గభాలున గుండెల నిండా గాలి పీల్చుకుని ఆ మత్తులో తేలాలనే ఆత్రుత తప్ప మరేమీ తోచేది కాదు కొద్ది క్షణాల పాటు. అలా ఆ సుగంధాలనాఘ్రాణిస్తూ అక్కడే గేట్ దగ్గర కాసేపు నిల్చుండిపోయేదాన్ని.. ఒక్కసారి..రెండుసార్లూ కాదు.. మా కాకినాడ ఇంటికెళ్ళినప్పుడల్లా.. ఊరెళ్ళిన ప్రతిమాటూ.. రాత్రిపూట బయటకు వెళ్ళిన ప్రతిసారీ! 

చిన్నప్పుడొకసారి మామ్మయ్యనడిగా "గేట్ దగ్గర కొత్తగా వస్తున్న మంచి వాసన ఎక్కడిదని".. అప్పుడు మా మామ్మయ్య(నానమ్మ) గేట్ దగ్గర గోడ పక్కగా ఉన్న మొక్కల మధ్యనున్న నైట్ క్వీన్ మొక్క, దానికున్న పూలు చూపించి.. "వాటిదే ఆ వాసన" అని చెప్పింది. నక్షత్రాల్లాంటి బుల్లి బుల్లి పూల గుత్తులు చెట్టంతా పూసి ఉన్నాయి. "నైట్ క్వీన్...!" పేరెంత హుందాగా ఉందో అనుకున్నా అప్పుడు. అంతకు ముందు మా గేట్ తీస్తూంటే గేట్ పైన ఉన్న ఇనుప పందిరి మీదకి పాకించిన గిన్నెమాలతి తీగ తాలూకూ పూల సువాసన చాలా లైట్ గా వస్తూండేది. నైట్ క్వీన్ వచ్చాకా ఆ సువాసనను ఈ పూలు డామినేట్ చేసేసాయి. ఆ చిన్నప్పటి నుండీ కోరిక నాకు నైట్ క్వీన్ మొక్క పెంచాలని! అప్పుడు తెలీదు నర్సరీల్లో ఏ మొక్క కావాలన్నా దొరుకుతుందని.


ఈమధ్యనే ఓ నర్సరీలో కనిపిస్తే కుండీలో అయినా పెంచేద్దామని కొని బాల్కనీలో కుండీలో వేసాను. రెండుమూడు నెలల్లో బాగా ఎదిగి మొగ్గ తొడిగింది. రోజూ ఆ మొగ్గలు పెద్దవెపుడౌతాయా..పూలెప్పుడు పూస్తాయా అని చూడ్డమే. వారం క్రితం చిన్న గుత్తి పూసింది. పొద్దున్న కూడా మొగ్గలు చూసి ఫోటో తీశాను..ఎప్పుడు పూస్తాయో అనుకున్నా. ఇందాకా బయట నుండి రాగానే గబగబా బాల్కనీ తెరిచాను.. ఒక్కసారిగా మత్తు ఆవరించేసింది... ఆశ్చర్యంగా ఐదారు గుత్తులు పూసాయి. గుప్పుగుప్పుమనే ఆ పరిమళాలను గుండెల నిండా పిల్చుకోవాలనే ఆత్రం కమ్మేసింది. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ ఇంటి గుమ్మంలో ఎలాగైతే గేట్ తీస్తూ తీస్తూ నిలబడిపోయేదాన్నో అలాగ బాల్కనీ తలుపు దగ్గర నిలబడిపోయాను మైమరచిపోతూ.. ఎన్నాళ్లకెన్నాళ్ళకి.. మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూల వాసన నా బాల్కనీలో!! ఒక్కసారిగా చిన్నప్పటి రోజుల్లోకి.. మామ్మయ్య ఙ్ఞాపకాల్లోకీ వెళ్పోయి... 'కల నిజమాయెగా..కోరిక తీరెగా..' అని పాడేసుకున్నా. ఇంకా ఎంకి పాటలు ఫోల్డర్ తెరిచి.. 'పూల బాసలు తెలుసు ఎంకికీ..' పెట్టుకుని మైమరచిపోతూంటే నన్నో వింతగా చూస్తూండిపోయారు అయ్యగారు!

పూలకి ఫోటో వాట్సప్ లో అమ్మానాన్నలకి "పూలే చూడండి.. వాసన తేలేను..." అని చూడమని పెట్టాను. ఇంకా ఆనందం ఆగక ఫోన్ చేసి "నాన్నా ఇదిగో మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూలు నా బాల్కనీలో మళ్ళీ పూసాయి" అంటే నాన్నేమో.. "మా మామ్మయ్య కూడా మా చిన్నప్పుడు నైట్ క్వీన్ చెట్టు పెంచింది తెల్సా... ఇవి మా మామ్మయ్య పెంచిన పూలు.." అన్నారు :)

పొద్దుటి మొగ్గలు

రాత్రికి పూలై..

Thursday, April 17, 2014

నాన్న చెప్పిన 'ఆవకాయ' కబుర్లు..




హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...

నాన్న మాటల్లో..:

" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. 

కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:
ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు మిరపకాయలు(వెడల్పాటివి) కిరాణాకొట్లో అమ్మేవారు. ఎరుపుదనం, కమ్మదనం వాటి స్పేషాలిటీ. అప్పుడే ఎక్కువకొనేసుకుని ఏడాది పొడుగునా రోజువారీ వాడకానికి దాచేవారుట. వాటిని రెండు మూడూ ఎండలకి లోపల గింజలు గలగలలాడేలా బాగా ఎండనిచ్చి, వాటితో కారం కొట్టించడం మొదటి పని. ప్రతీ ఇంట్లోనూ రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి. చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లోంచీ ఒక రిథిమ్ లో వినిపించేది కారం దంచే చప్పుడు. ఇలానే రాళ్ళుప్పు కూడా ఎండబెట్టి కొట్టించేవారు. మెంతికాయ కోసం మెంతులు కూడా వేయించి గుండ కొట్టించడం మరో పని. వీటితోపాటూ ఆవాలు కూడా. వాటిల్లో మళ్ళీ సన్నావాలు,పెద్దావాలు. సన్న ఆవాల ఆవకాయ అని విడిగా పెట్టేవారుట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఏ ఆవాలు నాణ్యమైనవో తెలుసుకోవడానికి నాలుగు కిరాణా కోట్లూ తిరిగి ఇంట్లో వాళ్ళు సాంపిల్స్ తేవడం ఒక పని.

పప్పునూనె:
దాదాపు నువ్వుల పంటే ఉండేది చాలామందికి. బస్తాల్లో నువ్వులు వచ్చాకా, నూపప్పు డబ్బా అని చిల్లుల డబ్బా ఒకటి ఉండేది. ఆ డబ్బాలో నానబెట్టిన నువ్వులు పోస్తే, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేసేది. చేత్తో పిసిగితే నువ్వుల పై పొట్టు పోయేది. అది బయట పారేసి, ఛాయనూపప్పు ఒక్కటీ బయటకు తీసేసి ఎండబెట్టేవారు. ఆ తర్వాత వాటిని గానుగకి తీసుకువెళ్ళి ఆడించడం. ఈ పనొక్కటీ మా పిల్లలకు అప్పచెప్పేవారు. మేం కూడా గానుగ దగ్గరకు ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే రంగులరాట్నంలా గిరగిరా తిరిగే గానుగ మీద కూచుని తిరగచ్చని సరదా. గానుగెద్దు గిరగిరా తిరుగుతుంటే గానుగ లోంచి విచిత్రమైన ధ్వనులతో సంగీతమొచ్చేది. ఆ గానుగ సింఫనీ చాలా బాగుండేది. ఎందుకో తెలీదు కానీ నువ్వులతో పాటూ బెల్లం కూడా గానుగలో వేసేవారు. గానుగ ద్వారా పప్పు నూనే కాకుండా తెలగపిండి కూడా వచ్చేది. గానుగలోంచి వచ్చిన ఫ్రెష్ పప్పు నూనె వాసన తాగెయ్యాలనిపించేంత తియ్యగా ఉండేది. ఇదంతా బెల్లం మహత్యం అయి ఉండచ్చు.

ఆవకాయ కాయ:
ఇలా సంబారాలన్నీ సమకూర్చుకున్నాకా, అసలు సిసలైన మామిడికాయ ఎంపిక మొదలయ్యేది. పుల్లటి పులుపు, పీచుదనం, ఏడాది పొడుగునా నిలవ ఉండే నాణ్యత ఆవకాయ కోసం వెతికే ఉత్తమ మామిడి లక్షణాలు.
కోతుల తోట అని ఓ పొలం ఉండేది మాకు. అందులో ఒకే ఒక ప్రశస్థమైన మావిడి చెట్టు ఉండేది. అది ఊరగాయల టైం కి కనీసం రెండువేల కాయ కాసేది. ఇంట్లోని నాలుగు కుటుంబాల వాళ్ళకీ విడివిడిగా జాడీలతో పెద్ద పెద్ద కుండలతో ఊరగాయ కి సరిపడా కాయ కాసేది ఆ ఒక్క చెట్టూ! ఇది కాక గోదావరి లంకలో పెద్ద మామిడి తోటే ఉండేది. బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జొన్నల రసాలు, కొబ్బరి మామిడి, ఏనుగు తలకాయ మామిడి, ఇంకా అనేక రకాక జాతుల మామిడి చెట్లు ఉండేవి. వేసంకాలం నాటికి ఈ మామిడి చెట్ల నుండి టాటాకు బుట్టలతో రకరకాల మామిడి పళ్ళు ఇంటికి వచ్చినా, ఊరగాయ కాయ మాత్రం కోతుల తోట లోని ఆ ఒక్క మామిడి చెట్టు నుండే వచ్చేది.



కాయ దింపడం:
పొడుగాటి గడకర్రకి చివర్న తాడుతో చిక్కం(తాడుతో అల్లిన బుట్టలాంటిది. పదిపన్నెండు కాయలు ఒకేసారి పట్టేవిట అందులో.) కట్టేవారు. కాయ క్రింద పడకుండా ఆ చిక్కం లోకే పడేలాగ చెట్టు నుండి వేరు చేసి కాయ కోయడం ఒక కళ. కాయ పరువుకి రావడం అనేవారు. అంటే ఇంకొక నాలుగు రోజులు ఆగితే కాయ పండిపోతుంది. అలా పరువుకి వచ్చిన కాయలు మాత్రమే ఊరగాయకి పనికి వచ్చేవి. ఆ కాయలు మరకత్తిపీటతో(ఆ కాలం పల్లెటూళ్ళలో ప్రతీ ఇంటా ఒక మరకత్తిపీట ఉండేది) ముక్కలు క్రింద కొట్టేవారు. కాయ సైజుని బట్టీ ఎనిమిది గానీ పన్నెండు గానీ ముక్కలయ్యేవి. ప్రతీ ముక్కకీ మధ్యలో డొక్క ఉండితీరాలి. అలా లేకపోతే అది ఆవకాయకి పనికిరాదు. మామిడికాయ కట్ చేసినప్పుడూ ముక్కతో పాటూ జీడి కూడా వస్తుంది కదా, ఆ జీడి, డొక్క పైపొర తీసేసి చిన్న బట్టతో ముక్కను తుడిచి రెడీ చేసేవారు. కాయ పరువానికొచ్చిందేమో, ప్రతి ముక్కా లేత పసుపు రంగులో ఉండేది. 
తెలుపుకీ, పసుపుకీ మధ్య రకం అన్నమాట. ఇక్కడికి ఆవకాయకి ముడిసరుకు రెడీ అయినట్లే. 

ఆవకాయ కలపడం:
నాపరాయితో తాపడం చేసిన అరుగు శుభ్రం చేసుకుని మిరపకాయ,ఉప్పు గుండ, ఆవపిండి పాళ్ళ ప్రకారం కలిపేసి, ఆ గుండ మధ్యలో కొత్తగా తయారయి వచ్చిన పప్పు నూనె కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు వేస్తూ గుచ్చెత్తేవారు. దీంట్లోకి ఎవరు రుచిని బట్టి వాళ్ళూ వెల్లుల్లిపాయ, మెంతులు, శనగలు, లవంగాలు కలుపుకునేవారు విడివిడిగా. లవంగాల ఆవకాయ ముఖ్యంగా రాజుల ఇళ్ళల్లో పెట్టేవారు. ఏడాది పొడుగునా ఎప్పుడు జాడీ లోంచి ఆవకాయ తీసినా మంచి లవంగాల వాసన వస్తూ ఉండటం ఈ లవంగాల ఊరగాయ ప్రత్యేకత. మా ఇంట్లో అయితే పది రకాల ఆవకాయలు పెట్టేవారు. వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లి లేనిది, పెసర ఆవకాయ, నూపప్పు ఆవకాయ, అల్లం ఆవకాయ, శనగల ఆవకాయ, సన్నావాల ఆవకాయ, పచ్చ మెరపకాయలతో పెట్టే పచ్చావకాయ(ఇది విపరీతమైన కారంగా ఉంటాయి ఈ పచ్చమిరపకాయలు), పులిహారావకాయ , బెల్లంపావకాయ.

భోజనాల దగ్గర ఊఅగాయ వడ్డించేప్పుడు ఊరిన వెల్లుల్లిపాయల కోసం పిల్లలం పోట్లాడుకుంటూన్నామని వెళ్ళూల్లిపాయలు దండగా గుచ్చి ఊఅగాయలో వేసేవారు. ఎన్నికావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మిగిలిన దండ మళ్ళీ జాడిలో వేసేసేవారు. ఊరీఊరని ఊరగాయ, వచ్చీరాని కబుర్లు ముచ్చటగా ఉంటాయని అన్నట్లుగా ఉండేది కొత్తావకాయ. పాళ్ళు సరిపోయాయా లేదా అని ఇరుగుపొరుగులు ఆవకాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఓ హాబీలా ఉండేది."

***    ***      ***

ఊరగాయల గురించి ఇదివరకూ రాసిన కబుర్లు..

* మామ్మయ్య ఊరగాయలు:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_04.html
* ఊరగాయ వైరాగ్యం:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_15.html


Friday, February 7, 2014

ఆబ్దీకం


స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!


మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల మధ్య పదిహేను ఇరవైఏళ్ళ అంతరం ఉన్నా వాళ్ల ఆబ్దీకాలకు మధ్యన ఒక రోజే తేడా! ఏడాదికోమాటు తాతయ్య ఆబ్దీకానికి, ఆ తర్వాత ఇద్దరి ఆబ్దీకాలకీ మా కజిన్స్ అందరం మావయ్య ఇంట్లో తప్పనిసరిగా కలిసేవాళ్లం. ఈ వంకతో అయినా అందరం ఓసారి కలుస్తున్నాం అని తృప్తి ఉండేది మాకు. రాన్రానూ చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ మా అందరిమధ్యన దూరాలను కూడా పెంచేసాయి. మా ఇంట్లో అయితే నాన్న ఏడాదికి మూడు ఆబ్దీకాలు పెట్టేవారు. కొడుకుల్లేని వాళ్ల అమ్మమ్మకు ఏకైక మనవడిగా వాళ్ల అమ్మమ్మ,తాతయ్యలదీ, వాళ్ల నాన్నగారిదీ! ఆ తరవాత పదిహేనేళ్ళుగా మా మామ్మయ్య(నాన్నమ్మ)దీ మొత్తం కలిపి నాలుగు! ఎప్పుడైనా శెలవు రోజైతే ఆబ్దీకం భోజనం తినేవాళ్లం తప్ప స్కూలుకి, కాలేజీలకీ వెళ్పోయేవాళ్లం కాబట్టి మాకు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి పెద్దగా అవగాహాన ఉండేది కాదు. మంత్రం చెప్పే ఆయన, ఇద్దరు భోక్తలు మొత్తం ముగ్గురు బ్రాహ్మలు వచ్చేవారని మాత్రం గుర్తు. అప్పట్లో పప్పు రుబ్బటానికి రుబ్బురోలే కాబట్టి వంటావిడ రుబ్బలేకపోతేనో, రావడం లేటు చేస్తేనో "నేనే పప్పు రుబ్బానని.." అమ్మ చెప్తే ఓహో అనేవాళ్లం తప్ప ఆ కష్టం ఏపాటిదో ఊహకైనా తెలిసేది కాదు! ఆబ్దీకాలైన ప్రతిసారీ "నా కూతుర్ని పెద్ద కొడుక్కో, ఒక్కడో కొడుక్కే ఇవ్వను బాబూ.." అని అమ్మ అంటూండడం మాత్రం బాగా గుర్తుంది! 


కట్ చేస్తే... నేను ఓ ఇంటి పెద్దకోడల్నే అయ్యాను!! దురదృష్టవశాత్తూ ఏడేళ్ల క్రితం మా మావగారు కాలం చేసారు. మడిబట్ట ఎలా కట్టుకుంటారో కూడా తెలీదప్పటికి నాకు. అప్పటికి మా పాపకు రెండేళ్ళూ, నాకు ఒక మిస్కేరేజ్ అయ్యి రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. చణ్ణీళ్ల స్నానాలు, మడిబట్టలు.. నెలా నెలా మాసికాలు.. ఆ కార్యక్రమాలు.. మళ్ళీ అందులో గోదారిజిల్లా రూల్స్ వేరు..కృష్ణాజిల్లా రూల్స్ వేరు... అంతా గందరగోళంలా ఉండేది. అమ్మ, అత్త, మామ్మయ్య, తాతమ్మా.. అంతా ఇంతేనా? ఇలానే తడిబట్టలు, మడిబట్టలు, కట్టుకుని ఉండేవారా? ఒక్క చీరనే కట్టుకుని ఎలా ఉండాలి? వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తూంటారు కదా...అయినా ఇంతేనా..  మడిబట్ట మార్చేదాకా మధ్యలో బాత్రూం లోకి కూడా వెళ్లకూడదా... ఇవేమి రూల్స్? ఎవరు పెట్టారు? ఇలానే ఎందుకు చెయ్యాలి? చదువులూ, ఉద్యోగాలూ, సమాజం..మార్పు.. ఇవన్నీ పుస్తకాలకీ, సినిమాలకీ, కాయితాలకీ, కవితలకే పరిమితమా? సవాలక్ష సందేహాలు... 


మావగారి సంవత్సరీకాలు కాశీలో చేసాం. గయా వెళ్లాం.. అక్కడ కూడా కొన్ని విధులు పూర్తిచేసాం. వచ్చాకా కాశీసమారాధన మొదలైన కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత నుండీ ఏడాదికోమాటు ఆబ్దీకాలు ఇంట్లోనే జరుపుతున్నాం. "అమ్మా.." అని ఆప్యాయంగా పిలిచే మావగారి పిలుపు.. "కాస్త చాయ్ పెట్టిస్తావామ్మా..", "చపాతీలు ఇలా వత్తాలి..", "టమాటా పచ్చడి నే రోట్లో రుబ్బితే అంతా వచ్చి రుచి చూసాకా చివరికింత ముద్ద మిగిలేది.." అంటూండే ఆయన మాటల్ని తలుచుకుంటూండగానే ఏడేళ్ళు గడిచిపోయాయి. కానీ అబ్దీకం వస్తోందంటే అది పూర్తయ్యేదాకా గుబులు మాత్రం పోవట్లే..! ఎవరితోనూ మాటపడకుండా కార్యక్రమం పూర్తిచెయ్యాలి. అత్తగారు తృప్తిపడాలి. వచ్చినవాళ్ళు కడుపునిండా భోజనం చేసి వెళ్లాలి. పెద్దకోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఇదీ నా తాపత్రయం. ప్రతి అబ్దీకానికీ అమ్మ, పిన్ని, అత్త.. ఇలా అంతా గుర్తుకువస్తారు..! పది మంది, మహా అయితే ఓ పదిహేను మందికే నేను అతలాకుతలం అయిపోతుంటే, గ్రైండర్లు లేని రోజుల్లో ప్రతి ఆబ్దీకానికీ నలభైకి తక్కువకాకుండా బంధువులకి చేసిపెట్టిన పెద్దవాళ్లను తల్చుకుంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. 


నిన్న మా మామగారి ఏడవ ఆబ్దీకం జరిపాము.ఈమధ్యన రెండేళ్ళుగా ఆరోగ్యం బాగోక నే వడ్డన చెయ్యలేక వంటావిడనే వడ్డనకి కూడా మాట్లాడుకుంటున్నాం. నిన్న భోజనం చేస్తుంటే మా సీతత్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సీతత్త మా మేనమామ భార్య. మా అమ్మమ్మా తాతయ్యల ఆబ్దీకాలకి వాళ్ల ఎనమండుగురు సంతానం, వారి పిల్లలు అంతా కలిపి రెండు మూడు బ్యాచ్ లలో భోజనాలు చేసేవారు. అందరికీ దగ్గరుండి వడ్డన చేస్తూ, "ఇదిగో నువ్వీ గారెలు తిను", "పరమాన్నం బావుంది మరికాస్త వేయించుకో", "కొబ్బరిపచ్చడి కావాలా?" , "ఈ కూర వేయించుకో..వద్దనకు", "తాతగారి ప్రసాదం తినాలి.." అంటూ నవ్వుతూ అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టించి, చివరికెప్పుడో నాలుగింటికి తను భోజనం చేసి మడిబట్ట మార్చుకుని వచ్చేది తను. నేను వడ్డన చెయ్యకపోయినా బ్రాహ్మల భోజనం అయ్యి, వారి విస్తళ్ళు తీసి, నేలంతా తుడిచేసరికే చుక్కలు కనబడ్డాయి నాకు.


అసలు ఈ కాలంలో అప్పటి ఓపికలు ఎందుకు ఉండట్లేదు? మా పరిస్థితే ఇలా ఉంటే అసలు ముందుతరాల మాటేమిటి? ఒకవేళ ముందు తరాలవాళ్ళు తల్లిదండ్రులకి ఇలా కార్యక్రమాలు నిర్వహించలేకపోతే...?  అసలు కొడుకే లేకపోతే..? ఎవరు ఇవన్నీ జరిపిస్తారు? ఎవరో ఒక బంధువులు చేస్తే కొడుకు చేసినంత శ్రధ్ధగా చేస్తారా? వాళ్ళు ఈ శ్రార్థకర్మలన్నీ విధిగా జరపలేకపోతే మరి చనిపోయినవాళ్లకు ఏం నష్టం జరగదా? అసలు ఇవన్నీ ఇలానే చెయ్యాలా? ఎవరి చేసినా చెయ్యకపోయినా చనిపోయాకా మనకి ఏం తెలుస్తుందసలు? ఇలా అల్లిబిల్లిగా ముసురుకున్నాయి ఆలోచనలతో మనసు బరువైపోయింది... 


ఇంతలో "పెద్దమ్మా నాకు కలర్ చాక్పీస్ ఇయ్యవా? నే బొమ్మ వేస్తా" అని మా మరిది కూతురు, "బెద్దమ్మా..నాక్కూడా ఇంకో స్లేట్ ఈయ్.. నే కూడా మంఛి బొమ్మ వేస్తా.." అన్న దాని తమ్ముడి ముద్దుముద్దు మాటలతో ఆలోచనాలోకం నుండి బయటపడి వాళ్ల కేరింతలకు నా నవ్వులను జత చేసేసా! 

Thursday, January 9, 2014

ఏకాంతం..





ఒంటరితనానికీ ఏకాంతానికీ చాలా తేడా ఉంది.. రెండూ నిశ్శబ్దంలో జనించేవే అయినా ఒంటరితనం దు:ఖ్ఖాన్ని పెంచితే, ఏకాంతం ఆ భారాన్ని తగ్గిస్తుంది. మనలో మనం, మనతో మనం ఉండేలా చేసి మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజులో కొద్దిపాటి ఏకాంత ప్రశాంత క్షణాలు గడిపినా అవి జీవితాన్ని స్థిరంగా గడపడానికి సరిపోయేంతటి ఇంధనాన్ని మనకి అందివ్వగలవు.

చాలా ఏళ్ల క్రితం మాట... మేము విజయవాడ రేడియో క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఓ మూడేళ్ళూ సెకెండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మా బాల్కనీ వీధివైపు రోడ్డు కనబడేలా ఉండేది. మా బ్లాక్ లోపలికి ఉండడం వల్ల మా బాల్కనీ లోంచి గేటు దాకా ఉన్న పొడుగాటి రోడ్డూ, లోపల్నుండి బయటకు వెళ్తూ,వస్తూ ఉండే జనం కనబడుతూ ఉండేవారు. అంతే కాక చుట్టూ ఉండే పెద్ద పెద్ద చెట్లూ, పక్షులు, ఆకాశం అన్నీ కలిపి ఓ మంచి వ్యూ ఉండేది. 10th, ఇంటర్ రెండేళ్ళూ స్కూలు, కాలేజీ అయ్యి రాగానే ఆ బాల్కనీ లో ఉండే ఉయ్యాల లోనే నా మకాం ఉండేది. టేప్ రికార్డర్ కూడా అక్కడే పెట్టేసుకుని పాటలు వింటూ, ఆ ఉయ్యాల లో కూచుని అక్కడే కాఫీ, టిఫిన్, చదువు, తిండి..అన్ని అక్కడే! ఎండనీ, వర్షాన్నీ , చలినీ కాలాల మార్పులన్నింటినీ ఆ ఉయ్యాలలో కూచునే గమనిస్తూ ఉండేదాన్ని. ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం నాకెంతో హాయిని ఇచ్చేవి. ముఖ్యంగా రాత్రి పూటలు ఏ వాద్య సంగీతమో, భూలే బిస్రే గీత్ నో వింటూ గడిపే ఏకాంతాలకు తిరుగేలేదు.. అవన్నీ మరువలేని మధురస్మృతులు నాకు..!


ఆ ఇల్లు వదిలాకా మళ్ళీ ఇన్నేళ్ళలో అలాంటి బాల్కనీ వ్యూ దొరకలేదు నాకు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న ఇంటి బాల్కనీ లోంచి మళ్ళీ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వచ్చింది. ఈసారి ఇది వీధి వైపు కాదు పొలాలవైపు. మనుషులసలు కనబడరు. ఉయ్యాల వెయ్యలేదు కానీ బీన్ బ్యాగ్ ఒకటి అక్కడ వేసేసి ఉంచా. పొద్దున్నే టీ తాగుతూ ఆ మంచునీ, ఎర్రబారుతున్న ఆకాశాన్నీ చూడడం ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది కానీ పొద్దుటే పని హడావుడిలో ఎక్కువసేపు కూచోవడం కుదరదు. మధ్యాహ్నమో సాయంత్రమో మాత్రం ఏ పుస్తకమో పట్టుకునో, ఖాళీగానో కనీసం ఓ గంట అయినా ఇక్కడ గడుపుతాను. తీ తాగుతూ మౌనంగా ఉన్న ఆకాశాన్నీ, వలయాకరంలో తిరుగుతున్న ఇరవైముఫ్ఫై దాకా ఉండే పావురాల గుంపునీ చూడటం ఒక వ్యాపకమైపోయింది నాకు. ఒక్కరోజు కూడా మానకుండా రోజూ ఆ పావురాలు అలా ఆటలాడుకుంటాయి. కోతలైపోయి, ఎండిపోయిన వరిపొలాలపై గుంపుగా చేరి కాసేపు కూచుంటాయి. మళ్ళీ పైకెగిరి ఓ రౌండ్ తిరుగుతాయి. గుంపుగా అన్నీ కలిసే తిరుగుతాయి చిత్రంగా. ఒకసారి కాదు ఓ గంట పైగా అలా తిరుగుతూనే ఉంటాయి. చూసేందుకు మనకి విసుగు రావాలి కానీ తిరిగేందుకు వాటికి రాదేమో!


"పద పదవే వయ్యారి గాలిపటమా.." అంటూ దూరంగా ఆకాశంలో మూడు నాలుగు గాలిపటాలు పోటీ పడుతూ ఎగురుతూ ఉంటాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల అరుపులూ, కేరింతలు..! పక్కనే పల్లెలోంచి అప్పుడప్పుడు మైకుల్లోంచి పాటలు, ఉపన్యాసాలు, భజనలు వినబడుతూ ఉంటాయి. టైం ప్రకారం రోజులో నాలుగైదుసార్లు ’అల్లా హో అక్బర్...’ కూడా వినబడుతుంది. గంటకోసారి ఏదో ఒక రైలు పక్కనున్న రైల్వే ట్రాక్ మీంచి కుయ్యిమని వెళ్తూ నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది కానీ అలా వెళ్ళే రైలుని చూడ్డం కూడా బాగుంటుంది. ప్రపంచంతో, ట్రాఫిక్ హోరుతో, మనుషులతో ఏమాత్రం సంబంధం లేని ఈ ఏకాంతం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు చేరువయ్యింది.. ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తూ..!! 


చీకూ చింతా లేని ఆ చిన్నప్పటి రోజుల్లోని ప్రశాంతత ఇప్పుడు మనసుకు లేకపోయినా, ఇన్నాళ్ళకు నాతో నేను గడిపగలిగే కొన్ని ఏకాంతపు క్షాణాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూంటాను రోజూ.. ఇప్పుడు కూడా బాల్కనీలో కూచునే ఈ టపా రాస్తున్నా! చీకటి పడితే మాత్రం ఇక్కడ ఉండలేం..దోమలు పీకేస్తాయి.. ఇంక లోపలికి పోవాలి మరి... !!




Monday, October 21, 2013

"అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .."





మరేమో ఇవాళ అట్లతద్ది కదా.. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ "మునుపు రేడియోలో అట్లతద్ది పాటలు వేసేవారు 'జనరంజని'లో అయినా... ఇవాళ ఒక్క పాటా వెయ్యలేదే.." అంది. సరే నే వినిపిస్తానుండు అని నెట్లో వెతికి ఫోన్లోనే రెండు పాటలు వినిపించా.. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు బ్లాగ్లో పెడితే అమ్మాలాగా అట్లతద్ది పాటలు వినాలనుకునేవారెవరన్నా వింటారు కదా.. అని అవుడియా వచ్చింది. అదన్నమాట..:)


నేను అట్లతద్ది నోములాంటివి ఏమీ నోచలేదు కానీ అమ్మ ప్రతి ఏడూ గోరింటాకు పెట్టేది. అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఎంత సరదాగా అట్లతద్ది చేసుకునేవారో చెప్పేది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అని ఫ్రెండ్స్ అందరూ అరుచుకుంటూ వెళ్ళి ఉయ్యాలలూ అవీ ఉగడం, అమ్మమ్మ అట్లు చేయడం మొదలైన కబుర్లు ప్రతి ఏడూ అప్పుడే వింటున్నట్లు మళ్ళీ కొత్తగా వినేవాళ్లం!
అట్లతద్ది నోము కథ లింక్ దొరికింది..చూడండి:
http://www.teluguone.com/devotional/content/atla-taddi-nomu-113-1441.html 


పాత సినిమాల్లో అట్లతద్ది పాటలు కాసిని ఉన్నాయి గానీ నాకు మూడ్నాలుగే దొరికాయి.. అవే పెడుతున్నాను..

 
1) రక్త సింధూరం చిత్రంలో పాట "అల్లిబిల్లి పిల్లల్లారా ఇల్లా రండి మీరు.. ఇలా రండి అట్లాతద్ది కన్నెనోము నోచాలండి.. నేడే నోచాలండి.." సుశీల బృందం పాడారు..ఆరుద్ర రచన ..

2) పవిత్రబంధం చిత్రంలో ఓ పాట ఉంది.. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుకమీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే.." అని!


3) "అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అంటూ పాడిపంటలు సినిమాలో మరో పాట ఉంది కాని అది ఓ పట్నం అమ్మాయిని ఉడికిస్తూ పాడే పాట. అందుకని అట్లతద్ది కన్నా ఎక్కువ తెలుగుతనం ఉట్టిపడేలా ఎలా ఉండాలో చెప్పేపాట ఇది.
పాట ఇక్కడ వినండి:
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3112 



4) బొబ్బిలి యుధ్ధం లో "ముత్యాల చెమ్మచెక్క.." పాట అట్లతద్ది పాట అవునో కాదో గుర్తులేదు కానీ అందులో "ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె.." అనే వాక్యం ఉంటుంది.. కాబట్టి బాగుంటుందని ఆ పాటని కూడా జతచేస్తున్నానిక్కడ :)

Friday, June 14, 2013

ఎలక..!





నాల్రోజుల బట్టి రాత్రిళ్ళు ఏవో చప్పుళ్ళు వినిపిస్తూ పూర్వ స్మృతులను గుర్తుచేస్తున్నాయి. ఇక్కడా.. ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడేమిటీ.. అబ్బే అదయ్యుండదులే.... అని సర్ది చెప్పుకుంటూ వచ్చా కానీ నిన్న రాత్రి మరీ గట్టిగా శబ్దమై మెలకువ వచ్చేసింది. ఫ్రిజ్ ఉన్న గదిలోంచి శబ్దం అని కనిపెట్టి నెమ్మదిగా వెళ్ళి లైట్ వేసాను. ఫ్రిజ్ పక్కన గోడ దగ్గర ఉన్న క్యారమ్స్ బోర్డ్ వెనకాల నుండి శబ్దం. నెమ్మదిగా భయపడుతూనే బోర్డ్ కాస్త కదిపి వెనకవైపు చూశాను. అనుకున్నంతా అయ్యింది.. అదే.. అదే.. 'ఎలక'.. పెద్దదే.. ఇంతింత గుడ్లు వేసుకుని నన్నే చూస్తోంది. ఠక్కున బోర్డ్ వెనక్కి పెట్టేసి లైట్ ఆర్పేసాను.


బెజవాడ వదిలాకా, పెళ్ళయ్యాకా ఈ ఎలకల బాధ తప్పింది. ఇన్నేళ్ళూగా ఏ ఇంట్లోనూ తగల్లేదు. మళ్ళీ ఇప్పుడే.. ఇప్పుడేమిటి దారి? అమ్మలా తరమగలనా? ఎలకల్లేవనే ధైర్యంతో ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు వదిలేస్తున్నానీ మధ్యన. ఇంటివాళ్ళు గూళ్ళకు వుడ్వర్క్ కూడా చేయించలేదు. ఒక్క గూట్లోకి దూరినా బట్టలు, పుస్తకాలు అన్నీ నాశనం..:( అసలిప్పటికే ఏం కొరికేసిందో ఏమిటో! ఇలా ఆలోచిస్తూ తనతోనూ "ఏమండి ఎలకండి.." అన్నా. మూడో అంతస్తులోకి ఎలకెలా వచ్చిందీ? ఇన్నాళ్ళూ లేదుగా?" అన్నారు. "వస్తాయండి.. మా బెజవాడ క్వార్టర్స్ లో రెండో అంతస్తులోకి కూడా వచ్చేవి.. తెల్సా?! ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడైతే నేనూ, అమ్మా కలిసి..."  "ఆపు..ఆపు.. చరిత్ర తవ్వకు. ఎలాగోలా ఎలకని వెళ్లగొడదాంలే.." అనేసారు శ్రీవారు. ఏమిటో అశాంతం చెప్పనివ్వరు కదా..


మేము బెజవాడలో నివాసమున్నక్వార్టర్స్ కట్టక ముందర అక్కడ చెట్లు పుట్టలతో అడవిలా ఉండేదట. అందుకే ఎప్పుడూ ముంగిసలు, పాములు, కప్పలు, ఎలకలు, పందికొక్కులు, చెట్లపై గుంపులుగా గబ్బిలాలు.. ఒకటేమిటీ సమస్త జీవరాసులు మాతో కలిసి కాపురముంటూండేవి. మేం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఎంతగా కన్నాల్లో కర్రలు,గుడ్డముక్కలు కుక్కినా ఇంట్లోకి ఎలకలు తెగ వచ్చేవి. అవి మహా తెలివైనవి. బోనులో కూడా పడేవి కాదు. అప్పుడన్నీ చెక్క బోనులు కదా..పెట్టిన బజ్జీనో, పకోడీనో తినేసి, వాటిని కొరికేసి పారిపోయేవి. అందుకని మా అమ్మ "ఎలక" అనే జీవి కనబడటం ఆలస్యం యుధ్ధానికి రెడీ అయిపోయి నన్ను పిలిచేసేది. చప్పుడుని బట్టి ఎలక ఎక్కడ ఉందో గమనించి, దాన్ని కెలికి, హాల్లోకి వచ్చేలా చేసి, మిగతా గదుల తలుపులన్నీ వేసేసి అటు అమ్మ, ఇటు నేను కర్రలతో నిలబడి ఎలకని హాల్లో ఉన్న తలుపు గుండా బయటకు పారిపోయేలా చెయ్యటానికి బోల్డన్ని కసరత్తులు చేసేవాళ్లం. ఈ పనికి అర్ధరాత్రి అపరాత్రి ఉండేది కాదు. రాత్రి ఒంటిగంట అయినా సరే "ఎలకొచ్చిందే.." అని అమ్మ నిద్ర లేపేసేది. ఇంక మేమిద్దరం కర్రలతో రెడీ అయిపోయేవాళ్లం. అమ్మా,నేనూ ఎలకలని తరమడంలో బాగా అనుభవం గడించామనే చెప్పాలి. నిన్నరాత్రి ఇంట్లో ఎలకని చూసినప్పటి నుండీ ఆ పాత రోజులన్నీ తలుచుకుని, మళ్ళీ ఇప్పుడేమేమి యుధ్ధప్రయత్నాలు చెయ్యాలా అని పొద్దున్నుంచీ తెగ ఆలోచిస్తున్నా..


ఎందుకైనా మంచిదని అమ్మకి ఫోన్ చేసా. "మాకు బాగానే వస్తూంటాయే.. ఇప్పుడు 'రేట్ బిస్కెట్ల్స్' అని వస్తున్నాయి. అవి కొని పెట్టు." అని సలహా ఇచ్చింది అమ్మ. మా కమ్యూనిటీలో కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్లోంచి అది కొని తెచ్చా. ఇంక ఈ రాత్రికి పెట్టాలి. ఏమైన సరే దాన్ని తరిమేదాకా నిద్ర ఉండదు నాకు..




Saturday, March 16, 2013

పనసచెట్టు - పనస పొట్టు




అనగనగా మా ఊరు. మా ఊరి పెరటితోటలో పెద్ద పనసచెట్టు. దాని నిండా ఎప్పుడూ గంపెడు పనసకాయలు ఉండేవి. పైన ఫోటోలో ఉన్నట్లు బుజ్జి బుజ్జి కాయలు కూర కు వాడేవారు. శెలవులయిపోయి బెజవాడ వెళ్పోయేప్పుడు మా సామానుతో పాటు ఓ గోనె బస్తా.. దాన్నిండా బుజ్జి బుజ్జి పనసకాయలు, ఓ పెద్ద పనసకాయ ఉండేవి. చిన్నవి కూర కాయలని ఇరుగుపొరుగులకి పంచేసి, పెద్ద కాయ మాత్రం అమ్మ కోసి తొనలు పంచేది.


మా చెట్టు పనసకాయలో అరవై డభ్భై దాకా తొనలు ఉండేవి. కొన్ని కాయల్లో వందా దాకా తొనలు ఉండేవి. మహా తియ్యగా ఉంటాయని అందరూ చెప్పుకునేవారు. అలా ఎందుకు అంటున్నానంటే నేనెప్పుడూ పనసకాయ తిని ఎరుగను ! నాకా వాసనే గిట్టదు..:( ముక్కు మూసేసుకుంటాను. మా అన్నయ్య నాతో ఒక్క పనస తొన అయినా తినిపించాలని పనసతొనలు పట్టుకుని నా వెనకాల తిరిగేవాడు.. ముక్కు మూసుకుని ఇల్లంతా పరిగెట్టించేదాన్ని తప్ప ఒక్కనాడు రుచి చూడలేదు. అందుకే అన్నారు "ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి.." అని గేలి చేసినా సరే! పనసకాయ కోసే దరిదాపులకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు నా కూతురు వాళ్ల నాన్నతో కలిసి నన్ను ఆటపట్టిస్తూ పనసతొనలు తింటుంది. బజార్లో కూర కోసం పనసపొట్టు, పాప కోసం పనస తొనలు కొంటుంటే నాకు మా పెరట్లోని చెట్టు గుర్తుకు వస్తుంది.. ఎంత పెద్ద చెట్టో ఎన్ని కాయలు కాసేదో.. ! కాలజాలంలో ఇల్లు, పెరడు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడిలా కొనుక్కుని తింటున్నాం కదా అని మనసు చివుక్కు మంటుంది..:( నువ్వు ఒక్క పనసచెట్టు గురించి ఇంతగా అనుకుంటున్నావా..? మాకు పనస తోట ఉండేది.. తెల్సా అన్నారు నాన్న!


 పనసతొనలు తినను కానీ పనస పొట్టు కూర మాత్రం చక్కగా చేస్తాను, తింటాను. ఇంతకీ ఇప్పుడు సంగతేంటంటే మా అన్నాయ్ మాంగారూ ఊర్నుండి కూర పనసకాయ తెచ్చిచ్చారు. వద్దనలేను కదా.. తెచ్చేసా ! 
కానీ ఎట్టా పొట్టు చెయ్యాలి? నా దగ్గర కత్తి లేదు కత్తిపీటా లేదు :(
"చాకుతో పనసపొట్టు తీసే మొహం నేనూను..:( " అనేస్కుని.. 
మొత్తానికి సక్సెస్ఫుల్ గా పొట్టు తీసి, ముక్కలు చేసి గ్రైండర్ లో వేసి పొట్టు చేసేసానోచ్ !!! 












తీరా పావు వంతు కాయ కొడితేనే బోలెడు పొట్టు వచ్చింది.. నే కూరకి కాస్త తీసి, మిగిలింది ఎవరికి దానం చెయ్యాలా అని ఆలోచన..?! ఎక్కడ తెలుగువాళ్ళే తక్కువ..పనసపొట్టు కావాలా అని ఎవర్ని అడుగుతాం?
ఇంకా ముప్పాతిక కాయ ఉంది ! అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే, పనసపొట్టు ఎవరిక్కావాలో చెప్పండి బాబు చెప్పండి...


***    ***    ***

పనసపొట్టు కూర గురించి ఇక్కడ రాసా..  
http://ruchi-thetemptation.blogspot.in/2011/11/blog-post_23.html 





Monday, January 7, 2013

ముగ్గుల పుస్తకం..




 మా మామ్మయ్య(నాన్నమ్మ) నుండి అత్తకూ, అత్త నుండి అమ్మకూ లభ్యమయ్యి, ఆ తర్వాత మా అమ్మ నుండి నేను అపురూపంగా అందుకున్న విలువైన వారసత్వ సంపద "ముగ్గుల పుస్తకం". నామటుకు నాకు అదో పవిత్ర గ్రంథం. అమ్మ ఇచ్చిన గొప్ప వరం. అయితే అది నాదగ్గర ఇప్పుడు యథాతథంగా లేదు.. ఓ తెల్లకాగితాల కొత్త పుస్తకంలోకి ముగ్గులన్నీ బదిలీ కాబడ్డాయి. పాతకాలం లో వాళ్ళు అయిపోయిన కేలెండర్ చింపి, కుట్టి, వాటిలో పెన్సిల్ తో ముగ్గులు వేసిన ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చే సమయానికి చాలా శిధిలావస్థలో ఉంది. ఎన్నో చేతులు మారి, ఎందరో వనితామణుల చేతుల్లోనో నలిగిపోయి.. కొన్ని ముగ్గులు ఎన్ని చుక్కలో కూడా తెలీకుండా.. తయరైంది. అందుకనేనేమో కొత్తగా నే ముగ్గులు వేసుకున్న పుస్తకం మీద అమ్మ ఇలా రాసింది...



విజయవాడలో మా ఇంట్లో వీధి గుమ్మం దాకా  ఓ మూడు నాలుగు పెద్ద ముగ్గులు పట్టేంత స్థలం ఉండేది. నెలపట్టిన రోజు నుంచీ సంక్రాంతి వెళ్ళేదాకా మా సరస్వతి(ఆ ఇంట్లో ఉన్నంతకాలం పని చేసిన పనిమనిషి) రోజూ సందంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి వెళ్ళేది. తడి ఆరకుండా అమ్మ ముగ్గు వేసేది. తడి ఆరితే మళ్ళీ ముగ్గు గాలికి పోతుందని. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులు పెట్టేది. సన్నటిపోత తో, చకచకా ముగ్గులు పెట్టేసే అమ్మని చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.. తప్పులు రాకుండా అలా ఎలా పెట్టగలదా అని. నేన్నెప్పుడు పెద్దయ్యి ముగ్గులు పెడతానా అని ఎదురుచూసేదాన్ని.


ఇక మా కాకినాడ వెళ్ళినప్పుడు మామ్మయ్య, అత్త, అమ్మ ముగ్గురూ పెట్టేస్తూండేవారు ముగ్గులు. ఆ వీధిలో మా అత్త పేరు ఇప్పటికీ ముగ్గులత్తయ్యగారే ! అత్త ముగ్గుల పుస్తకం ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. పైనవాళ్ళో, పక్కవాళ్లో అడిగి తీస్కెళ్ళేవారు. 9th,10thక్లాస్ ల్లోకి వచ్చాకా నేనూ వాళ్ల ముగ్గుల పక్కన చిన్న చిన్న ముగ్గులుపెట్టేదాన్ని. ఇంటర్ నుంచీ మొత్తం గ్రౌండ్ నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మలాగ మెలికల ముగ్గులూ, వెడల్పు పోత ముగ్గులు కూడా వచ్చేసాయి. లక్ష్మి(అక్కడి ఆస్థాన పనమ్మాయి) వాకిలి తుడిచి, పేడ నీళ్ళతో కళ్లాపిజల్లి వెళ్ళేది. లక్ష్మి పేడ తెచ్చి చేత్తో తీసి బకెట్నీళ్ళలో కలిపేస్తుంటే.. కంపు కొట్టదా.. అలా ఎలా కలుపుతావు? అనడిగేదాన్ని.


ముగ్గుల పుస్తకంలోంచి సాయంత్రమే ఓ ముగ్గు సెలెక్ట్ చేసుకుని, కాయితమ్మీద వేసుకుని, ముగ్గు పెట్టాలన్నమాట. మా గుమ్మంలోనే వీధి లైటు ఉండేది కాబట్టి లైటు బాగానే ఉండేది కానీ దోమలు మాత్రం తెగ కుట్టేవి. అక్కడేమిటో రాక్షసుల్లా ఉండేవి దోమలు. ముగ్గు పెట్టే డ్యూటి నాకిచ్చేసాకా అమ్మవాళ్లు వంట పనుల్లో ఉండేవారు.. అందుకని ముగ్గు పెట్టినంత సేపూ తోడుకి అన్నయ్యనో, నాన్ననో బ్రతిమాలుకునేదాన్ని.


పెద్ద చుక్కల ముగ్గయితే, అన్నయ్య "నే చుక్కలు పెడతా" అని ముగ్గు తీసుకుని చుక్క చుక్కకీ "చిక్కుం చిక్కుం..." అంటూ చుక్కలు పెట్టేవాడు..:) అలా దాదాపు పెళ్లయ్యేవరకు నెలపట్టి ముగ్గులు పెట్టాను. అ తర్వాత నెలంతా కుదరకపోయినా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అపార్ట్మెంట్ ల్లోకి వచ్చాక గుమ్మంలోనే చిన్న ముగ్గుతో సరిపెట్టేసేదాన్ని. మొన్నటిదాకా రెండేళ్లపాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి కాస్త ముగ్గుసరదా తీరింది. ఈ ఏడు మళ్ళి మామూలే.. అపార్ట్ మెంట్.. చిన్న చాక్పీస్ ముగ్గు..:( ముగ్గులు వెయ్యటం తగ్గిపొయినా, అమ్మ ఇచ్చిన ముగ్గుల పుస్తకం మాత్రం నాకెప్పటికీ అపురూపమే.

 నా ముగ్గుల పుస్తకంలోంచి మరికాసిన ముగ్గులు...













ఇంకొన్ని ముగ్గులు ఈ టపాల్లో ఉంటాయి..
http://trishnaventa.blogspot.in/2009/06/blog-post_16.html
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_12.html
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_16.html


Friday, January 4, 2013

పాటల డైరీలు..




8th క్లాస్ లో నేనూ, తమ్ముడు స్కూల్ మారాం. ఆ స్కూల్ పెద్దది. ప్రతి సబ్జెక్ట్ కీ ఒకో టీచర్ వచ్చేవారు. మ్యూజిక్ క్లాస్ ఉండేది. ఆ టీచర్ ఎవరంటే ప్రసిధ్ధ గాయని వింజమూరి లక్ష్మి గారి చెల్లెలు వింజమూరి సరస్వతిగారు. ఆవిడ రేడియోలో పాడటానికి వస్తూండేవారు. కొత్త పిల్లల పరిచయాల్లో నేను ఫలానా అని తెలిసి " ఏదీ ఓ పాట పాడు.." అని ఆడిగేసి నన్ను స్కూల్ 'choir group'లో పడేసారావిడ. అలా ఆవిడ పుణ్యమా అని నాలోని గాయని నిద్రలేచిందన్నమాట :) ఇక ధైర్యంగా క్లాసులో అడగంగానే పాడటం అప్పటి నుంచీ మొదలైంది. 


క్లాసులో మ్యూజిక్ టీచర్ నేర్పే దేశభక్తి గీతాలూ, లలితగీతాలే కాక  సినిమాపాటలు కూడా అడిగేవారు. పాట పాడాలి అంటే నాకు సాహిత్యం చేతిలో ఉండాల్సిందే. ఇప్పటికీ అదే అలవాటు. అందుకని రేడియోలోనో, కేసెట్ లోనో వినే పాటల్లో నచ్చినవి రాసుకుని, దాచుకునే అలవాటు అప్పటినుండి మొదలైంది. ఇప్పుడు ఏ పాట కావాలన్నా చాలావరకూ ఇంటర్నెట్లో దొరుకుతుంది కానీ చిన్నప్పుడు వెతుక్కుని, రాసుకుని దాచుకోవటమే మర్గం.


డైరీల పిచ్చి కాబట్టి పాటలు రాయటం కూడా డైరీల్లో రాసుకునేదాన్ని. తెలుగు, హిందీ ఒకటి, ఇంగ్లీషు ఇలా మూడు భాషల పాటలకి మూడు డైరీలు. ఈ డైరీల్లో పాటలు నింపటం ఒక సరదా పని. కేసేట్లో ఉన్న పాట ఎలా అయిన వెనక్కి తిప్పి తిప్పి  రాయచ్చు కానీ రేడియోలో వచ్చేపాట రాసుకోవటమే కష్టమైన పని. ఏదో ఒక కాయితం మీద గజిబిజిగా రాసేసుకుని తర్వాత ఖాళీలు పూరించుకుంటూ డైరీలో రాసుకునేదాన్ని. అలా రేడియోలో "మన్ చాహే గీత్" లోనో, "భూలే బిస్రే గీత్" లోనో విని  రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. కానీ అలా రాసుకోవటం భలే సరదాగా ఉండేది. ఏదో ముక్క, లేదా ఒకే చరణమో వినటం..ఆ విన్నది బావుందని రాసేసుకోవటం. కొన్నయితే ఇప్పటిదాకా మళ్ళీ వినటానికి దొరకనేలేదు నాకు. కొన్ని పల్లవులు మటుకు రాసుకుని తర్వాత ఇంట్లో నాన్న కేసెట్లలో ఆ పాట ఎక్కడ ఉందో వెతుక్కోవటం చేసేదాన్ని. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలానే దొరికేవి నాకు. కొన్ని పాత సినిమాపాటల పుస్తకాల్లో దొరికేవి. నాన్నవాళ్ల చిన్నప్పుడు సినిమాహాలు దగ్గర అమ్మేవారుట సినిమాల తాలుకు పాటలపుస్తకాలు. అవన్నీ అమ్మ జాగ్రత్తగా బైండ్ చేయించి దాచింది.






వీటిల్లో సినిమాపాటలే కాక ఆ సినిమా తాలూకూ కథ క్లుప్తంగా రాసి ఉండేది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు కూడా పెద్ద లిస్ట్ ఉండేది వెనకాల అట్ట మీద. ఎన్నో పాత సినిమాల కథలు, పాటల వివరాలు ఆ పుస్తకాల్లో నాకు దొరికేవి. ఇవి తెలుగు హిందీ రెండు భాషల సినిమాలవీ ఉండేవి. చిన్నప్పుడు శెలవు రోజున ఈ పుస్తకాలను తిరగెయ్యటం నాకో పెద్ద కాలక్షేపంగా ఉండేది. ఈ పుస్తకాల్లో నే వెతికే పాటలు ఉన్నా కూడా నచ్చినపాట స్వదస్తూరీతో డైరీలో రాసుకోవటమే ఇష్టంగా ఉండేది నాకు. అలా డైరీల్లో పాటలసాహిత్యం రాసుకోవటం ఓ చక్కని అనుభూతి.


స్కూల్లో, కాలేజీలో వెతుక్కుని వెతుక్కుని రాసుకున్న నచ్చిన పాటల డైరీలు ఇవే... (ఈ ఫోటొల్లోవన్నీ ఇదివరకెప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల క్రితం రాసుకున్నవి)






ఇప్పుడు రాసే అలవాటు తప్పి రాత కాస్త మారి ఇలా ఉంది.. క్రింద ఫోటోలోది ఇవాళే రాసినది.




 పైన డైరీలో రాసిన తెలుగు పాట తిలక్ గారి "అమృతం కురిసిన రాత్రి" లో "సంధ్య" అనే కవిత. ఆ పుస్తకంలో కొన్నింటికి వారి మేనల్లుడు ఈ.ఎస్.మూర్తి గారు పాతిక ముఫ్ఫైఏళ్లక్రితం ట్యూన్ కట్టారు.(రేడియో ప్రోగ్రాం కోసం) వాటిల్లో ఒకటే ఈ పాట. చాలా బావుంటుంది. "గగనమొక రేకు" పాటని క్రింద లింక్ లో యూట్యూబ్ లో వినవచ్చు:
http://www.youtube.com/watch?v=1E2kYLnz0VI




Tuesday, September 4, 2012

పుట్టినరోజు


" అమెరికా ప్రెసిడెంట్ పుట్టినరోజు ఎప్పుడో తెలిస్తే, ఆయనకు కూడా తలంటు పోసేసి, హేపీ బర్త్ డే చెప్పేసి వస్తుంది మీఅమ్మ" అనేవారు నాన్న. " పాలవాడిదీ, పేపరబ్బాయిదీ కూడా పుట్టినరోజులు కనుక్కోవే.." అనీ, " అసలుజంధ్యాలకు చెప్పు నాన్నా.. శ్రీలక్ష్మితో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నెక్స్ట్ సినిమాకి తయారుచేసుకుంటారు" అనీ అనేవాళ్లంమేము. అలా మేం ఎన్ని వేళాకోళాలు చేసినా అమ్మ మాత్రం ఇప్పటికీ తన హాబీ కంటిన్యూ చేస్తూనే ఉంది. అదేమిటంటేతనకు తెలిసిన బంధుమిత్రులందరి పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ గుర్తు ఉంచుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పటం. మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డో, ఇన్లాండ్ కవరో లేదా కనీసం కార్డ్ ముక్క లో అయినా విషెస్ రాసేసేది. ఇప్పుడుఫోన్లు చేస్తోంది. అంతే తేడా.

సన్నిహిత మిత్రులకూ, సమీప బంధువులకూ శుభాకాంక్షలు చాలా మంది చెప్తారు. కానీ అమ్మ వెరైటీగా పక్కింట్లో ఖాళీచేసి వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని "వదినగారూ మీ రెండోవాడి పుట్టినరోజు రేపు. మా అందరి విషెస్చెప్పండి..." అంటూ కార్డ్ రాసి పోస్ట్ చేసేది. ఇది విజయవాడలో మా పక్కన ఉండి వెళ్ళిపోయినవాళ్ళ సంగతి మాత్రమే. కాకినాడలో మా పై ఇంట్లో అద్దెకు ఉండి వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని కూడా శుభాకాంక్షలు తెలపటం మాకునవ్వు తెప్పించేది. ఒకళ్ళు బ్యాంక్లో చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీలేదు. విజయవాడలో మాకు తెలిసినవాళ్లఅబ్బాయి పెళ్ళి కుదిరితే, పెళ్ళికూతురు కూడా అదే బ్యాంక్ అని తెలిసి, అమ్మ వాళ్ల బ్యాంక్ కు వెళ్ళి అమ్మాయినిపరిచయం చేసుకుని ఫలానావాళ్ళు తెలుసా? ఫలానా సంవత్సరంలో ఫలానా ఊళ్ళో చేసారు.. అంటూ వివరాలు చెప్పి పెళ్ళికూతురు ద్వారా మొత్తానికి వాళ్ల అడ్రసు సంపాదించింది. చిన్నప్పుడు వేళాకోళం చేసినా పెద్దయ్యాకా నాకూ పిచ్చిఅంటుకుంది. చాలా ఏళ్ళపాటు బంధుమిత్రులందరికీ స్వయంగా గ్రీటింగ్స్ తయారు చేసి మరీ పంపేదాన్ని. ఈమధ్యఈమధ్యనే విసుగెత్తి చాలావరకూ పంపటం మానేసాను. అతిమంచితనానికి పోయి విషేస్ చెప్తే జవాబివ్వనివారుకొందరైతే, ఏదో అవసరం ఉండి వంకతో పలకరిస్తున్నాననుకుని అపార్ధాలు చేసుకునేవారు కొందరు. అమ్మ మాత్రంఇప్పటికీ అక్కచెళ్ళెళ్ళ,అన్నయ్యల పిల్లలవీ, వాళ్ళ మనవలవీ, సన్నిహిత మిత్రులందరివీ పుట్టినరోజులన్నీ గుర్తుఉంచుకుని అందరికీ ఫోన్ చేసి విషెస్ చెప్తుంటుంది.

ఊళ్ళోవాళ్ళ సంగతి ఇలా ఉంటే ఇక ఇక ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు అమ్మ ఎలా చేస్తుంది? మా అందరికీ డేట్స్ ప్రకారం, తిథుల ప్రకారం రెండు పుట్టినరోజులూ జరిపేది. అలా ఏటా మాకు రెండుపుట్టినరోజులు చేసుకోవటం అలవాటేపోయింది. అంతేకాక నాకూ, నాన్నకూ స్పెషల్గా మూడు పుట్టినరోజులు ఉన్నాయి. ఎలాగంటే ఓసారి ఒకాయన మాఇంట్లోవాళ్లజాతకాలన్నీ వేసి, నాన్న పుట్టినరోజు ఎప్పుడూ చేసుకునే రోజు కాదనీ, ఆయన పుట్టిన సంవత్సరంలో ఫలానానెలలో ఫలానాతారీఖనీ చెప్పారు. కానీ అప్పటికి నలభైఏళ్లపైగా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్న తారీఖునిమార్చలేక అదీ, కొత్తగా తెలిసిన తారీఖుదీ, తిథుల ప్రకారం కలిపి నాన్నకు మూడు పుట్టినరోజులూ చేసేయటంమొదలెట్టింది అమ్మ. ఇక నేనేమో అసలు అధికమాసంలో పుట్టానుట. కానీ అధికమాసం అస్తమానం రాదుకదా...వచ్చినప్పుడు మూడూ చేసేసేది అమ్మ. అందుకని నావీ మూడు పుట్టినరోజులే!

విధంగా రెండేసి,మూడేసి పుట్టినరోజులు జరుపుకునే సరదాని మా అందరి నరనరాల్లో జీర్ణింపచేసింది మా అమ్మ. నాపెళ్ళి కుదిరిన తర్వాత జాతకాల నిమిత్తం అబ్బాయి జాతకం పంపారు పెళ్ళివారు. మరో వారంలో అబ్బాయి పుట్టినరోజని కాయితంలో చూసి అందరం హడావిడి పడిపోయాం. నేనేమో కష్టపడి నాన్న కేసెట్లన్నీ వెతికి
వివాల్డీ, మొజార్ట్ దగ్గరనుండీ ఎల్.సుబ్రహ్మణ్యం వరకూ నానారకాల సంగీతాలతో ఒక సీడీ తయారుచేసి అబ్బాయికి పంపించాను. ఏంఅంటాడో అని ఆత్రంగా ఎదురుచూస్తూంటే అబ్బాయి ఫోన్ వచ్చింది... "సీడీ విన్నాను..బాగుంది. కానీ నాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు..." అన్నాడు. దాందేముంది పెళ్లయాకా మాకులాగానే రెండుకాకపోయినా ఒక్క పుట్టినరోజన్నా చేద్దాంలే అనుకున్నా నేను. తీరా పెళ్లయ్యాకా చూస్తే సెలబ్రేషన్ సంగతటుంచి అసలుపుట్టినరోజుకి అయ్యగారు కొత్త బట్టలు కూడా కొనుక్కోరని తెలిసి అవాక్కయ్యాను. 'రేపు మీ పుట్టినరోజండి..' అని నేనేగుర్తుచేసాను. అంతలో మరో కొత్త విషయం చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చారు..

తన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో డౌట్ ఉందని చెప్పేసరికీ ముచ్చెమటలు పోసాయి నాకు. పుట్టినరోజు అంటే అదోఅద్భుతమైన రోజని నమ్ముతూ సంవత్సరం అంతా రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను నేను. ఊరందరికీపుట్టినరోజులు చేసేస్తుంది మా అమ్మ. అలాంటిది శ్రీవారి డేట్ ఆఫ్ బర్తే డౌటంటే... ఎలా? అని తెగ బాధ పడిపోయాను. అప్పుడిక లాభం లేదని విక్రమార్కుడి చెల్లెల్లు అవతారం ఎత్తేసాను. మా అత్తగారి ఊళ్ళో ఆయన హాస్పటల్లో పుట్టారోకనుక్కుని, అక్కడికి మనిషిని పంపి, నానా తంటాలు పడి మొత్తానికి నెలరోజుల్లో శ్రీవారి అసలైన పుట్టినరోజుకనుక్కున్నా. అదృష్టవశాత్తు పాత రిజిస్టర్లు ఇంకా హాస్పటల్లోవాళ్ల దగ్గర ఉండటం వల్ల అది సాధ్యమైంది. హమ్మయ్య! అనుకుని అప్పటినుండీ చక్కగా తన పుట్టినరోజు కూడా నేనే చేసేసుకుంటున్నా. అంటే పట్టుబట్టి సెలబ్రేట్ చేసేది నేనేకాబట్టి విధంగా ఇదీ నా పుట్టినరోజు క్రిందే లెఖ్ఖలోకి వస్తుందన్నమాట..:)

ఇంతకీ అసలు చెప్పొచ్చేదేమిటంటే
ఇవాళ నా పుట్టినరోజు! ఇది అధికబాధ్రపదం కాబట్టి నా నిజమైన తిథులపుట్టినరోజుకూడా నిన్ననే అయ్యింది. ఇంకా ఎప్పుడూ చేసుకునే తిథులపుట్టిన్రోజు మళ్ళీ నెల్లో ఇంకోటి ఉంది :)