సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొందరు వ్యక్తులు. Show all posts
Showing posts with label కొందరు వ్యక్తులు. Show all posts

Tuesday, February 18, 2020

కుసుమత్త

                                         
                                


మొన్న ఆదివారం పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేసాడు. "కుసుమత్త ఫోన్ చేసిందే. వాళ్లమ్మాయి పెళ్ళట. అందరూ తప్పకుండా రావాలని చెప్పింది. పిల్లాడి పెళ్ళికి ఎవరూ రాలేదు. అమ్మయి పెళ్ళికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది" అన్నాడు. ఉత్సాహంగా వెళ్దామంటే వెళ్దాం అనేసుకుని కాసేపు కుసుమత్త కబుర్లు చెప్పుకున్నాం. కానీ తారీఖు చూస్తే పరీక్షల సమయంలో.. కుదురుతుందో లేదో తెలీదు! కుసుమత్త ని తల్చుకుంటే చల్లని తెమ్మెర మొహాన్ని తాకినట్లుంటుంది. అంత హాయి కలుగుతుంది మనసుకి. ఇన్నేళ్ళు గడిచిపోయినా అదే ఆప్యాయత, అదే అభిమానం!! ఈనాటి పరిచయాలకి అటువంటి విలువ ఎక్కడ..?!

కొన్ని కారణాల వల్ల ప్రతి రెండు మూడు నెలలకి ఓసారి కాకినాడ వెళ్ళివచ్చిన చిన్ననాటి రోజులు అవి. ఇరుగుపొరుగువాళ్లని అత్త, పిన్ని, అక్క అంటూ వరసలతో ఆప్యాయంగా పిలుచుకునే రోజులు! ఐదో, ఆరో క్లాసు. మా కాకినాడ ఇంట్లో నాలుగు వాటాలు, ముందర వైపు రెండు గదుల చిన్న షెడ్డు ఉండేవి. షేడ్ లోనూ, మూడు వాటాల్లోనూ అద్దెకు ఉండేవారు. చాలా కుటుంబాలవారు ఉద్యోగ రీత్యా మారుతూ ఉండేవారు. ఒకసారి మేము కాకినాడ వెళ్ళినప్పుడు పొద్దున్నే రోజూ వచ్చే కూరలబ్బాయి సైకిల్ మీద వచ్చాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు! మా మామ్మయ్య కూరలు తీసుకుంటూ నన్ను పిలిచింది. "ఒసేయ్ పైకి వెళ్ళి కుసుమత్తని కూరలబ్బాయి వచ్చాడని పిలుచుకురా" అంది. "కుసుమత్త ఎవరు?" అన్నాన్నేను. "ఈమధ్య కొత్తగా వచ్చారు. వెళ్ళు త్వరగా" అంది మళ్ళీ. "కొత్తవాళ్ళా.. నాకు తెలీదుగా...అత్తా అని ఎందుకు పిలవాలి.." అని నేను నసిగాను. "నోరుమూసుకుని వెళ్ళూ...కుసుమత్తా అని పిలువు" అని మామ్మయ్య గట్టిగా ఆర్డర్ వేసింది. ఇంక పిల్లిలా నెమ్మదిగా మెట్లెక్కి వెళ్తే తలుపు వేసి ఉంది. సందులో బట్టలు ఆరేసి ఉన్నాయి, అవి తోసుకుంటూ వెళ్తే వంటింటివైపు తలుపు తీసి ఉంది. ఒకావిడ కనబడింది. "కుసుమత్తా..." అని కిటికీలోంచి పిలిస్తే ఇటు చూసింది. "కూరలబ్బాయి వచ్చాడని మామ్మయ్య చెప్పమంది" అనేసి పరిగెత్తుకుని వచ్చేసా. తను కిందకి వచ్చి కూరలు కొంటూంటే మామ్మయ్య తనతో చెప్పింది.. "మా అబ్బాయివాళ్ళు వస్తారని చెప్పా కదా...ఇది నా మనవరాలు" అని చెప్పింది.

టి.వి లేని రోజులు అవి. అన్నయ్య స్కూలుకి వెళ్పోయాడు. దోడ్లో మొక్కల్లో తిరగడం అయిపోయింది. ఇంక ఏమీ తోచట్లేదు అని పేచీ పెడుతుంటే "పైకి వెళ్ళు..కుసుమత్తతో కబుర్లు చెప్పిరా.." అంది మామ్మయ్య. చేసేదేమీ లేక మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు వేసి ఉంది. కొట్టాలా వద్దా అనుకుంటూ సందులోకి వెళ్తే కిటికీ తలుపు తీసి ఉంది. కుసుమత్త ఏదో కుట్టుకుంటోంది. నన్ను చూసి వచ్చి తలుపు తీసింది నవ్వుతూ. చక్కగా చీర కట్టుకుని అమ్మంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. అది మా మొదటి పరిచయం. అలా భయపడుతూ వెళ్ళినదాన్ని, కాకినాడ వెళ్ళినప్పుడల్లా అన్నానికి తప్పించి మిగతా సమయం అంతా మేడ మీద కుసుమత్త ఇంట్లోనే పొద్దున్నుంచీ సాయంత్రం దాకా గడపడం వరకూ మా స్నేహం పెరిగింది. కుసుమత్తకి అప్పటికి పాతికేళ్ళు ఉంటాయేమో. కొత్తగా పెళ్ళయిన జంట. ఇద్దరే ఉండేవారు. మావయ్యగారికి బ్యాంక్ లో పని. "మావయ్యగారు రాగానే వచ్చేయాలి. అల్లరి చేయకూడదు." అని చెప్పి పైకి పంపించేవారు ఇంట్లో. మావయ్యగారు కూడా చాలా మంచాయన. మాతో(నేను ,తమ్ముడు) బాగా ఆడేవారు. కబుర్లు చెప్పేవారు. మా ఇద్దరికీ చెస్, పేక ఆడటం రెండూ వాళ్ళే నేర్పించారు. నలుగురం కలిసి ఇవే మార్చి మార్చి ఆడుతూ ఉండేవాళ్ళం. బెజవాడ వచ్చాకా కూడా చెస్ బోర్డ్ కొనుక్కుని నేనూ, తమ్ముడూ అడుతూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా మరో కొత్త పేకల సెట్ కూడా ఇచ్చేది కుసుమత్త. 

కుసుమత్తావాళ్ళింట్లో నాకు మరో అట్రాక్షన్ ఉండేది. పుస్తకాలు, వార పత్రికలు. నాకు తెలుగు చదవడం వచ్చాకా అదీ, ఇదీ అని లేదు పుస్తకం, కాయితం  ఏది దొరికితే అది చదివేసేదాన్ని. బజ్జీలు, పిడతకింద పప్పు కట్టి ఇచ్చే కాయితాలు కూడా తిన్నాకా చదివేసి పాడేసేదాన్ని. మా ఇంట్లో వారపత్రికలు ఉండేవి కావు. కాబట్టి అదో కొత్త సరదా నాకు. అన్నీ కాదు కానీ బావున్న సీరియల్స్ చదివేదాన్ని కుసుమత్త ఇంట్లో. వెళ్ళినప్పుడల్లా పాతవి  వెతుక్కుని ఐదారు పుస్తకాలు తెచ్చుకుని సీరియల్ భాగాలన్నీ ఒకేసారి చదివేదాన్ని. ఎదురుచూడక్కర్లేకుండా ఒకేసారి అంత కథ తెలిసిపోతే భలే ఉంటుంది. ఓ పక్క అమ్మ తిడుతూ ఉండేది. నీకెందుకే ఆ పత్రికలు అని. అప్పుడేమో పైనే కుసుమత్త ఇంట్లోనే అన్నీ చదివేసి వచ్చేసేదాన్ని. సాయంత్రాలు పార్క్ కో, ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికో మమ్మల్ని వాళ్లతో పాటూ తీసుకెళ్ళేవారు కుసుమత్తా వాళ్ళు. 

ఒకసారి అమ్మావాళ్లు  బెజవాడ వెళ్పోయారు. ఎందుకో నేనూ, తమ్ముడూ ఉండిపోయాం కాకినాడలో. కుసుమత్తా వాళ్ళింట్లో చుట్టాల పిల్లలెవరో ఉన్నారు అప్పుడు. వాళ్ళని దింపడానికి బెజవాడ వచ్చారు వాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకువచ్చేసారు. వేసవి సెలవలు. సర్కార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. విపరీతమైన ఎండ. వేడి. కుసుమత్త తన చీరొకటి తీసి, తడిపి కిటికీలకు,సీట్లకూ అడ్డుగా కట్టింది. చల్లగా భలే బావుంది. నలుగురు పిల్లలం,వాళ్ళిద్దరూ - మొత్తం ఆరుగురం పేకాట ఆడుకుంటూ, రకరకాల చిరుతిళ్ళు తింటూ బెజవాడ వచ్చేసాం. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము.

ఒక అబ్బాయి మా ఇంట్లో ఉండగానే పుట్టాడు. తర్వాత మావయ్యగారికి ట్రాన్ఫర్ అయి వేరే ఊరు వెళ్పోయారు. తర్వాత అమ్మాయి కూడా పుట్టిందని తెలిసింది. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. అప్పుడప్పుడూ ఉత్తరాలు ఉండేవి. తర్వాత ఏ కబురూ తెలీదు. చాలా ఏళ్ల తర్వాత మాకు బెజవాడలో తెలిసినవాళ్ల అబ్బాయి పెళ్ళి కుదిరితే, ఆ పెళ్ళికూతురు ఫలానా బ్యాంక్ అని తెలిసి, కుసుమత్త మావయ్యగారు కూడా అదే బ్యాంక్ కదా అని అమ్మ ఆ పెళ్ళికూతురుని అడిగి ఎలాగైతేనేం వాళ్ల అడ్రస్ సాధించింది. మా తమ్ముడి పెళ్ళి సమయం అది. శుభలేఖ వేస్తే మొత్తం నలుగురూ వచ్చారు. పెద్దవాళ్ళయి ఇంజినీరింగ్ చదువుతున్న కుసుమత్త పిల్లల్ని చూస్తే చాలా ఆనందం వేసింది. కుసుమత్త ఏ మాత్రం మారలేదు. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత. నా చేతులు పట్టుకుని ఎంత సేపో కబుర్లు చెప్పింది. పిల్లల చదువుల వివరలు అడుగుతూ అమ్మాయి పేరేమిటి అని అడిగాను. చెప్పింది. "అయ్యో... నా పేరు.." అన్నాను. అవునంది. ఆశ్చర్యంతో "నా పేరని తెలుసా?" అన్నాను. "అందుకే పెట్టుకున్నాం." అంది. "నిజమా" అన్నాను. నిజమే అంది. మళ్ళీ అడిగాను "నిజంగానా" అని. "నిజమేరా" అంది. నా జీవితంలోని మెమొరబుల్ ఎమోషనల్ మోమెంట్స్ లో అదీ ఒకటి!! 

రెండుమూడేళ్ళ క్రితం వాళ్ల అబ్బాయి పెళ్ళని పిలిచింది కుసుమత్త. ఫోన్ చేసి మాట్లాడింది కూడా. ముఫై ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ నిండిన స్వరం. అదే అభిమానం..! కానీ అప్పుడు మా అత్తయ్యగారికి ఒంట్లో బాలేక నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ల అమ్మాయి పెళ్ళి. నా పేరు పెట్టిన అమ్మాయి పెళ్ళి! కానీ మా అమ్మాయి పరీక్షల సమయం, వేరే పనులు కూడా ఉన్నాయి.. వెళ్లలేనేమో..:( 

అన్నయ్య తప్పకుండా వెళ్తాడు. వెళ్లలేకపోయినా కుసుమత్త అర్థం చేసుకుంటుంది అని నమ్మకం. ఆనాటి ఆప్యాయతల గట్టిదనం అలాంటిది.

****  ****

వెళ్ళాను. వెళ్లగలిగాను! ఫంక్షన్ హాల్ గుమ్మంలో కుసుమత్త మావయ్యగారు కనబడ్డారు. "ఎవరో చెప్పుకోండి..." అనడిగాను. గుర్తుపట్టలేదు. అన్నయ్యని చూసి గుర్తుపట్టారు. అది కూడా వాట్సప్ లో వాడి ఫోటో చూశారుట, అలా గుర్తుపట్టారు. కుమత్తేదీ అని అడిగితే, ఎటో వెళ్తున్న తనని చూపించారు. గభాలున వెనక్కి వెళ్ళి, భుజాలు పట్టుకుని " నేనెవరో చెప్పుకో" అన్నాను.. నవ్వుతూనే ఆలోచిస్తూ చూసింది.. మళ్ళీ అడిగాను "నేనెవరో చెప్పుకో.." అని...హా...అనేసి గుర్తుపట్టేసిందిభలే అనిపించింది. "హ్మ్మ్...నువ్వు గుర్తుపట్టావు. మావయ్యగారు గుర్తుపట్టలేదు" అన్నాను. "ఎంత మారిపోయావూ.. పదేళ్లవుతోంది నిన్ను చూసి.."అంది. 


పెళ్ళి బాగా జరిగింది. మధ్యాన్నం, రాత్రి రెండు భోజనాలూ బాగున్నాయి. పొద్దున్నేమో చక్కగా సొజ్జప్పం వేశారు. వంకాయ పులుసు పచ్చడి కూడా. ఈ రెండు ఐటెమ్స్ నేనైతే పెళ్ళిళ్ళలో చూడలేదు.  రాత్రి టిఫిన్స్ తో పాటూ లక్కీగా నేను తినదగ్గ ఐటెమ్ దొరికింది -"కొర్రలతో బిసిబెళెబాత్". పెళ్ళయ్యాకా, టైమైపోతోందని పరుగులెడుతూ స్టేషన్ కి వెళ్ళాం. ఎక్కి కూర్చున్నాం. రైలు కదిలింది.



Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )

Saturday, March 23, 2019

అత్తయ్యగారు


ప్రియమైన అత్తయ్యగారికి నమస్కరించి,

మేమంతా కులాసా. మీరు ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో కదా మీకు ఉత్తరం రాసి! మేము బొంబాయి లో ఉన్నప్పుడు మీరు మీ అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నారని వారానికో ఉత్తరం అన్ని విశేషాలతో తప్పనిసరిగా రాసేదాన్ని. మీరెంత మురిసిపోయేవారో ఆ ఉత్తరాలు చదువుకుని. మళ్ళీ ఇన్నాళ్ళకి మీకు ఉత్తరం రాస్తున్నాను.

మిమ్మల్ని తలుచుకోని రోజు లేదండీ. ఏదో ఒక విషయంలో, ఏదో కారణంగా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు. ఒకటా రెండా పదిహేనేళ్ల సాంగత్యం మనది. నిజం చెప్పాలంటే మీ అబ్బాయి కన్నా మీతోనే కదా నేను ఎక్కువగా గడిపినది. కానీ మనం కలిసి ఉన్న ఏడేళ్ళూ కూడా మీరు అత్తగారిగా, నేను కోడలిగానే మసిలాము. మీకు అత్యంత ప్రియమైన అబ్బాయిని నాకు ఇచ్చేసాన్న మీ బాధ నన్ను ఒక కోడలిగా మాత్రమే చూసేలా చేసింది. మిమ్మల్ని సంతృప్తి పరచాలని, మీతో మెప్పించుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో దేవుడికి బాగా తెలుసు. నా ప్రతి పనిలోనూ మీరు వెతికే పొరపాట్లు..నన్ను చాలా బాధ పెట్టినా, అవి ఇప్పుడు నేను ప్రతి పనినీ పర్ఫెక్ట్ గా చేసేలా చేసాయని ఇప్పుడు కదా నాకు అర్థం అయ్యింది! "మీ అమ్మాయికి అభిమానం ఎక్కువ, చిన్న మాట కూడా పడదు" అని మీరు అమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇన్నాళ్ళకు ఒక్క విషయం నాకు బాగా అర్థం అయ్యిందండీ.. ఇష్టం ఉన్నచోట తప్పు కూడా చిన్న పొరపాటులానే అనిపిస్తుంది. ఇష్టం లేని చోట చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులానే తోస్తుంది. ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం లోనే ఉంటుంది.

మనిద్దరి దృష్టికోణం మారడానికి పదేళ్ళు పట్టింది. ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎదురుచూసిన నాకు మీరు ఏకంగా ప్రసంశల శాలువానే కప్పేశారు. మీరు నా మీద ప్రేమగా రాసిన కవితని ఎంత భద్రంగా దాచుకున్నానో!!

జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మనకి చాలా మంచిని చేస్తాయనే సత్యం స్వానుభవం మీదనే ఎవరికైనా అర్థం అవుతుందేమో. ఐదేళ్ల క్రితం నా జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బకి ఏడాది దాటినా నేను నిలదొక్కుకోలేక,  బాధతో విలవిల్లాడిపోతుంటే ఎంత ధైర్యం చెప్పారూ..! అసలు అది ఎంతో పెద్ద సర్ప్రైజ్ నాకు. ఆ సాయంత్రం నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నా పక్కన కూర్చుని, కళ్ల నీళ్ళు తుడిచి.. పదేళ్ళుగా నేను మీ నోటి వెంట విన్నలని తపనపడుతున్న మాటల కన్నా పదిరెట్లు ఎక్కువ మెచ్చుకోలు మాటలు చెప్పి, ఎంతగా ఓదార్చారో! నా జీవితపు చివరి క్షణాల దాకా ఆ మాటలు నేను మర్చిపోనండీ. అంతగా ధైర్యం చెప్పారు. ఈవిడ మనసులో నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాను. నేను మొదటిసారి మీ ప్రేమను అర్థం చేసుకున్నది ఆరోజే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక కోడలిగా నేనేనాడూ నా బాధ్యతను విస్మరించలేదు. మీకూ తెలుసు. కానీ ఆ రోజు నుండీ నా బాధ్యతకు, అభిమానం కూడా తోడైంది.
నేను వినాలని తపించిన మాటలనే కాకుండా, మరో రెండు మూడు ప్రశంసా వాక్యాలు మీ నోట వినడం నిజంగా నా అదృష్టం. నాతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో సంతృప్తిగా మీరన్న మాటలు నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని మిగిల్చాయండీ. ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నాకు ఎదురైన చెడు ఈ విధంగా మిమ్మల్ని నాకు దగ్గర చేసింది.

కానీ అసలు మీరు ఎందుకని వెళ్పోయారండీ? ఎందుకంత తొందరపడ్డారు? ఏమంత వయసైందని? మీరు లేకపోతే మీ పిల్లలు ఎలా తట్టుకోగలరనుకున్నారు? ఎంత ప్రేమగా పెంచారు వాళ్లని.. మీ ప్రపంచమంతా వాళ్ళతోనే నింపుకుని, వాళ్ళే లోకమై బ్రతికారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు దిగమింగారో, ఎన్ని అవమానాలు సహించారో మీ అబ్బాయి చెప్పినప్పుడూ, తల్చుకున్నప్పుడూ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మొదట్లో మీ వైఖరి వల్ల మీపై కోపం ఉన్నా కూడా, మీలో ఉన్న ఈ గొప్ప తల్లిప్రేమను చూసి నేను చలించిపోతూ ఉండేదాన్ని. మీపై కొండంత గౌరవం ఉండడానికి కూడా కారణం ఇదే. మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూడలేదండీ. నిజం! ఖాళీగా ఎప్పుడూ ఉండేవారు కాదు. ఓపిక ఉన్నంతవరకూ చివరిదాకా తోచిన సాయం చేశారు. మీరు బాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండిపోండి.. అంటే అలాగే అనేసి, కాస్త బావుండి నడవగలిగే ఓపికరాగానే బ్యాగ్ సర్దేసేవారు. నేను కోప్పడితేనేమో, "అమ్మలా కోప్పడుతున్నావు.. పోనీలేమ్మా. ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా. నేను చేసేదేముందని..పిల్లలకి కాపలా. అంతేగా" అనేసి నా నోరు మూసేసేవారు. వచ్చి వెళ్పోయే ప్రతిసారీ మాత్రం "వస్తాలే. బాధపడకు. ఎప్పటికైనా మీ దగ్గరకు రావాల్సిందాన్నేగా. చివరిరోజులు పెద్దకొడుకు దగ్గరే.." అనేవారు. మాట నిలబెట్టుకున్నారు. చివరికి వచ్చారు. కానీ ఎలా వచ్చారు? కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లుగా... ఎంత పిలిచినా పలకలేనంత నిద్రలోకి వెళ్పోయి, ఎన్ని మాటలు మాట్లాడినా కళ్లు విప్పలేనంత నిద్రలోకి వెళ్పోయి వచ్చారు. మీరు అదృష్టవంతులు. అనాయాస మరణం ఎందరికి దక్కుతుంది?  పది నెలలు అయిపోయాయి అత్తయ్యగారూ... మేమే ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ లోంచి బయటకు రాలేకపోతున్నాం. నిత్యం తలుస్తున్నాం. మీరు నాకు అప్పుడప్పుడూ చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ఎంతగా పనికి వస్తున్నాయో, ఎంత అనుభవంతో చెప్పారో  కదా అని రోజూ అనుకుంటూ ఉంటాను. మిమ్మల్ని తలిచినప్పుడల్లా ఎటువంటి గిల్టీనెస్ నాకు లేకుండా చేసి వెళ్పోయారు. అదీ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.

ఇవాళ మీ పుట్టినరోజు! పదిహేనేళ్ళుగా మీకు పుట్టినరోజుకు చీర పెట్టడం అలవాటు. ఈసారి ఎవరికి పెట్టను? కొని అయితే ఉంచాను. ఎవరికో ఒకరికి పెడతానులెండి. చీర పెట్టినప్పుడల్లా "నా పుట్టినరోజు నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు" అనేవారు. పొద్దున్నుంచీ మీ మాటలు, అలోచనలు, అవే తలపులతో గడిపాను. ఎవరికైనా సరే కడుపునిండా భోజనం పెట్టడం మీకు ఇష్టం కదా అందుకని మీ అబ్బాయితో అన్నదానానికి డబ్బు కట్టించాను. మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.

మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వచనాలు మాకు తప్పక ఉంటాయి. అవే మాకు శ్రీరామరక్ష. చాలా రాసేసాను. ఇంక ఉంటానండీ, missing you...
                                                        ప్రేమతో.. మీ కోడలు.

Thursday, March 14, 2013

నీ స్మృతిలో..




ఏమి రాస్తే సాంత్వన?
ఏమి చేస్తే సాంత్వన?

దిగులు పడితేనా?
వగపు వీడితేనా?

నిన్ను తలిస్తేనా?
నిన్ను మరిస్తేనా?

కన్నీరు చిందిస్తేనా?
చిరునవ్వు నవ్వితేనా?

నీ పుట్టినరోజు 'జయంతి'గా మరిందని దిగులుపడనా?
 జ్ఞాపకాల్లో సైతం నీవు 'సజీవమే'నని తృప్తిపడనా?

ఏమి రాస్తే సాంత్వన?
ఏమి చేస్తే సాంత్వన?


(ఆత్మీయమిత్రుడు, హితుడు, సహోదరుడు శంకర్ స్మృతిలో... ఈ నాలుగు వాక్యాలూ !! )


Wednesday, March 21, 2012

బీరకాయ పీచు చుట్టరికం

చుట్టరికాలు రకరకాలు. మనం ముఖ్యంగా పరిగణించే అమ్మ తరఫువాళ్ళు, నాన్న తరఫువాళ్ళు కాక అమ్మమ్మ,తాతయ్య వైపు చుట్టాలు, నాన్నమ్మ,తాతయ్య వైపు వాళ్ల అన్నదమ్ముల తాలూకా, అక్కచెల్లెళ్ళ తాలూకా చుట్టాలుంటారు కదా వాళ్ళ చుట్టరికాలని బీరకాయ పీచు చుట్టరికం అంటారు. పూర్వకాలపు ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఈ దూరపు చుట్టరికాలు కూడా అందరికీ తెలుస్తూ ఉండేవి. కానీ రానురానూ కుటుంబాలు చిన్నవి అయ్యే కొద్దీ బంధుత్వాలు, చూట్టరికాలు కూడా దూరంగానే జరిగిపోతున్నాయి. ఎప్పుడైనా అందరం కలిసినప్పుడు వీళ్ళు ఫలానా అని మన అమ్మమ్మలో, మావయ్యలో చెప్తే తప్ప మనకెవరూ తెలియదు. అలా అందరం కలిసే సందర్భాలు కూడా తక్కువైపోతున్నాయి రానురానూ.


గృహప్రవేశాలూ, ఇతర చిన్నపాటి వేడుకల్లో కన్నా పెళ్ళిళ్లలో మాత్రం చాలావరకు దూరపు బంధువులను మనం కలుస్తూ ఉంటాము. వేరే ఎక్కడా,ఎప్పుడు మనం వాళ్లను కలవకపోయినా కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళలో మాత్రం కొందరిని తప్పక కలుస్తూంటాము. హలో అంటే హలో అనుకోవటం, ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారని పలకరించుకోవటం మినహా పెద్దగా స్నేహబాంధవ్యాలు ఉండవు వీరితో. అమ్మ ద్వారానో, పిన్ని ద్వారానో వాళ్ల తాలుకూ కబుర్లు వింటుంటాం తప్ప వాళ్ల ఇళ్ళకు కూడా ఎప్పుడు వెళ్లం మనం. కానీ అలా అప్పుడప్పుడు కేవలం పెళ్ళిళ్ళలో మాత్రమే కలిసే కొందరు చుట్టాలు ఎందుకనో గుర్తుండిపోతారు మనకి. అలా నేను చిన్నప్పటి నుండీ చూస్తున్న/ఎరిగిన ఒక బీరకాయ పీచు బంధువు గురించి అమ్మ చెప్పిన వార్త విని ఈ టపా రాయాలనిపించింది.


ఆ బంధువు మా అమ్మమ్మ అక్కయ్యకు మనవడో ఏదో అవుతారు. నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోని అన్ని ముఖ్యమైన పెళ్ళీళ్లకూ హాజరయ్యేవారు. ప్రతీ పెళ్ళి లోనూ ఎక్కడో ఆడుకుంటున్న నన్ను పిలిచి "ఏమే బావున్నావా? ఏం చదువుతున్నావు? " అని పలకరించేవారు. వాళ్ళావిడను పిలిచి "ఇదిగో ఈ అమ్మాయి గుర్తుందా..?" అని నేనెవరో చెప్పేవారు. ఎంత హడావుడి పెళ్ళిలోనైనా కనీసం భోజనాల సమయంలో అయినా సరే ఆయన పలకరింపు అలా అలవాటైపోయింది నాకు. కాస్త ఊహ వచ్చాకా ఏ పెళ్ళిలో అయినా ఆయన కనబడకపోతే "ఫలానావాళ్ళు ఈ పెళ్ళికి రాలేదా?" అని అమ్మని అడిగేంతగా నాకు ఆయన గుర్తుండిపోయారు. నాచిన్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు ఆయనకు.


నాపెళ్ళయాకా నేను కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళు మిస్సయ్యా. చాలారోజులతర్వాత ఒకసారి మాత్రం వాళ్ళను కలిసాను. "మీరిద్దరూ మా ఊరు రండి" అని ఆహ్వానించారు. ఓ పేరున్న హిల్ స్టేషన్లో ఉండేవారు వాళ్ళు. తర్వాత అమ్మ ద్వారా వాళ్ల అమ్మాయికి ఇంటర్ అవ్వగానే పెళ్ళి చేసేశారని విన్నాను. ఇప్పుడు మనవలు కూడాట. ఇక అబ్బాయికి ఇంజినీరింగ్ పూర్తయ్యి ఉద్యోగంలో చేరాడని విన్నాను. ఈమధ్యన ఆయన అమ్మకి ఫోన్ చేసారుట వాళ్ల అబ్బాయి పెళ్లి.. శుభలేఖ మిస్సయినా తప్పకుండా పెళ్ళికి రావాలి అని. మా పిల్లలందరిని పేరుపేరునా అడిగారుట. అమ్మ మళ్ళీ నాకీ సంగతి చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో బీరకాయపీచు చుట్టరికం.. ఇంకా గుర్తుపెట్టుకుని పేరుపేరునా అడగటం, పెళ్ళికి అహ్వానించటం..! ఏళ్లపాటు బంధుత్వాలు నిలిచిఉన్న కొందరు చుట్టాల దగ్గరే సఖ్యత కనిపించదు. అలాంటిది ఇళ్ళకు వెళ్ళటాలు, ఉత్తరప్రత్యుత్తరాలు లేకపోయినా కేవలం పెళ్ళిళ్లలో కలిసిన పరిచయంతోనే ఇంతవరకూ ఈ బీరకాయ పీచు చుట్టరికం నిలిచి ఉండటం...నాకయితే విచిత్రంగానే తోస్తుంది. పైగా నే చిన్నప్పుడు చూసిన పాకే వయసుపిల్లలు ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చి పెళ్ళిళ్ళు అయ్యేంత పెద్దవారయిపోయారని విని ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి !!

Wednesday, March 7, 2012

డా.జంపాల చౌదరి గారి రేడియో ఇంటర్వ్యూ


Rainbow FM లో "
సరదాసమయం" శీర్షిక లో ఈ Feb 21న ప్రసారమైన డా. జంపాల చౌదరి గారి రేడియో ఇంటర్వ్యూ అనుకోకుండా నేను వినటం జరిగింది. పుస్తకం.నెట్లోనూ, నవతరంగం లోనూ ప్రచురితమైన వారి వ్యాసాల ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి డా. జంపాల గారు బ్లాగ్మిత్రులకు పరిచితులే.


తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్మన్, తానా ప్రచురణల కమిటీ కి చైర్మెన్, చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరి గారు ఈ ఇంటర్వ్యూలో చర్చించిన అనేక అంశాలు చాల ఆసక్తికరంగా ఇంటర్వ్యును పూర్తిగా వినేలా చేసాయి. అంతేకాక నేను మిస్సయిన మొదటిభాగాన్ని కూడా సంపాదించి వినాలనిపించింది. అడిగిన వెంఠనే ఈ కార్యక్రమం నాకు అందించిన ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతి
రెడ్డి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


ఈ ఇంటర్వ్యూలో డా. జంపాల గారు తన స్వస్థలం, చదువు, అమెరికా, సినిమాలు, సైకియాట్రీ, సామాజిక సేవ, రాజకీయాలు, సాహిత్యం, పుస్తకాలు, పుస్తకం.నెట్, తానా కార్యకలాపాలు, భారత్-అమెరికా సంబంధాలు... మొదలైన ఎన్నో విభిన్న అంశాలను గురించి మాట్లాడారు. ఈ చర్చలో డా. జంపాల గారి మిత్రులు శ్రీ నవీన్ వాసిరెడ్డిగారు కూడా పాల్గొన్నారు. పరిచయకర్త ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతి రెడ్డి గారు.



ఇంటర్వ్యూ మొత్తం పదకొండు bits ఉంది. వరుసగా విన్నా సరే, లేదా ఏ అంకె మీద కిక్ చేస్తే ఆ భాగం వినబడుతుంది.





డా. జంపాల చౌదరి గారి గురించి... ( పుస్తకమ్.నెట్ సహాయంతో)

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.


Thursday, December 8, 2011

జయ


మన స్నేహితుల్లో కొందరు మిత్రులు మనకు దగ్గరగానే ఉన్నా మనం వాళ్ళను నిర్లక్ష్యం చేస్తాము. పెద్దగా పట్టించుకోము. కాలం గడుస్తున్న కొద్దీ ఎవరిది వీడిపోయే అల్ప స్నేహమో, ఎవరిది చివరిదాకా వెన్నంటి నిలిచే నీడో అర్ధం అవుతుంది. అదృష్టం ఉంటే వాళ్ళు ఇంకా దగ్గరలోనే నిలబడిఉంటారు. అలా నేనూ చాలా ఆలస్యంగా గుర్తించిన ఒక మంచి స్నేహితురాలి గురించి ఈ టపా.

తన పేరు "జయ". నా కాలేజ్ మేట్. నా జూనియర్. రోజూ కాలేజీకి వెళ్ళే సిటీ బస్సులో మొదలైన మా పరిచయం స్నేహంగా మారటానికి మూడేళ్ళు పట్టింది. గాఢంగా మారటానికి ఇంకొన్నేళ్ళు పట్టింది. మొదట్లో తను నా జూనియర్ అన్న చిన్నచూపు... మిగతా స్నేహితులపట్ల ఎక్కువ శ్రధ్ధ ఉండేవి. కాలేజీ బస్ రూట్ లో నాకన్నా నాలుగు స్టాప్ ల ముందర 'వాళ్ళు ముగ్గురూ' ఎక్కేవారు. ఒకరు నా క్లాస్మేట్, నా ప్రాణ స్నేహితురాలు. మిగత ఇద్దరూ మా జూనియర్స్. వాళ్ళు ముగ్గురికీ ఎంతో దోస్తీ ఉండేది. నెమ్మదిగా నా స్నేహితురాలి వల్ల వాళ్ళిద్దరూ నాకు పరిచయం అయ్యారు. నలుగురం కాలేజీలో కలిసి తిరిగేవాళ్ళం. కలిసి లంచ్ తినేవాళ్ళం. సినిమాలకి, ఒకరిళ్ళకి ఒకరం వెళ్ళేవాళ్ళం.

ఒకసారి "జయ" ఇంటికి వళ్ళినప్పుడు తెలిసింది... వాళ్ళ అమ్మగారిదీ రాజమండ్రి అనీ, వాళ్ళ అమ్మగారు, మా పెద్దమ్మ క్లాస్మేట్స్ అనీ, వాళ్ళ మేనమామ నాన్న కొలీగ్ "భట్టుమావయ్యగారు" అని. పెద్దల పేర్లూ, కుటుంబాలూ తెలిసినవే అవ్వటం భలే ఆశ్చర్యం. అప్పటినుండీ మా స్నేహం కాస్త పెరిగింది. మా డిగ్రీ అయ్యాకా నా ప్రాణ స్నేహితురాలు వేరే యూనివర్సిటీలో చేరింది. వాళ్ళ డిగ్రీ అయ్యాకా, జయ ప్రాణ స్నేహితురాలు పెళ్ళయి వేరే దేశం వెళ్ళిపోయింది. జయ కూడా తిరుపతిలో ఎం.ఏ లో చేరింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. తను పీజీ అయ్యాకా B.Ed చేసింది. మళ్ళీ విజయవాడ వచ్చి ఓ కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మళ్ళీ రాకపోకలతో స్నేహం పెరిగింది.

సన్నిహిత స్నేహితులు అందరికీ ఉంటారు. అయితే; ఎంత సన్నిహితంగా ఉన్నా, చనువుగా ఒక మాట అనలేని మొహమాటపు స్నేహాలే ఎక్కువ ఉంటూంటాయి. ఎంత స్నేహితులైనా సరే మనల్ని తిడితే అది మనపై ఉన్న అభిమానం వల్ల ఏర్పడిన చనువుతో అన్నారని అర్ధం చేసుకునేవాళ్ళేంతమంది ఉంటారు? జయను మొదట్లో నేనూ అలానే అర్ధం చేసుకోలేకపోయా. ఒకరోజు ఫోనులో మట్లాడుతుంటే జయ ఎందుకో నన్ను బాగా తిట్టింది. నాకు బాగా కోపం వచ్చింది. "మా ఇంట్లో కూడా నన్నెప్పుడూ ఇలా ఎవరూ తిట్టరు. ఇలా మాట్లాడితే నాకు నచ్చదు...అలాఅయితే నాతో మాట్లాడద్దు" అని ఠక్కున ఫోన్ పెట్టేసాను. ఇంకెప్పుడూ తనతో మాట్లాడకూడదు అనుకున్నాను. సరిగ్గా ఒక వారం తరువాత జయ మళ్ళీ ఫోన్ చేసింది. "ఏమ్మా కోపం తగ్గిందా? మాట్లాడతావా నాతో..?" అంటూ అనునయంగా మాట్లాడింది. నేను కొంచెం మెత్తబడినా పొడిపొడిగానే మాట్టడా. కానీ నా నిరసనను పట్టించుకోకుండా తను ఫ్రీగా మట్లాడినందుకు లోపల్లోపల సంతోషపడ్డాను. ఆ తరువాత తన కో లెక్చరర్ ఒకావిడ ద్వారా తనకు పెళ్ళి సంబంధం రావటం, పెళ్ళి అవగానే తను బొంబాయి వెళ్ళిపోవటం త్వరగా జరిగిపోయాయి. అక్కడే ఇంగ్లీష్ లెక్చరర్ గా చెరింది. అప్పుడప్పుడు ఉత్తరలు రాసుకునేవాళ్ళం.

నా పెళ్ళైన కొన్నాళ్ళకు మేము బొంబాయి వెళ్లటంతో మళ్ళీ మా స్నేహం మొగ్గలు తొడిగింది. ఈసారి మాది టీనేజీ స్నేహం కాదు. జీవితాన్ని అర్ధం చేసుకున్న ఇద్దరు మనుషుల స్నేహం. సంసారంలో ఒడిదొడుకులను చవిచూసిన ఇద్దరు స్త్రీల స్నేహం..! పరిచయమైన అన్నేళ్ళకు జయలోని నిజమైన స్నేహితురాలిని నేను అర్ధం చేసుకోగలిగాను. ఇక ఎప్పుడూ మాకు మాట పట్టింపూ రాలేదు..మేము దూరమైంది లేదు. నాలాంటి పిరికి మనిషిని ఒక లోకల్ ట్రైన్, రెండు బస్సులు మారి "thane"లో వాళ్ళ ఇంటికీ; ఒంటరిగా లోకల్ ట్రైన్స్ లో అంధేరీ, దాదర్, గేట్ వే ఆఫ్ ఇండియా మొదలైన ప్రాంతాలకు వెళ్ళగలిగానంటే అది జయ నేర్పిన ధైర్యమే. మేం బొంబాయిలో ఉన్నన్నాళ్ళూ జయ ఇంకా సన్నిహితమైపోయింది. చదువులో జూనియర్ అయినా, సంసారంలో సీనియర్ కావటం వల్ల ఎన్నో సలహాలూ, సూచనలూ ఇప్పటికీ ఇస్తూంటుంది. మేం బొంబాయి వదిలి వచ్చాకా ఇక మాకు ఉత్తరాలు లేవు. ప్రతి వారాంతం లోనూ ఫోనులే. ఇద్దరు పిల్లలు, ఉద్యోగం... ఉరుకులు పరుగుల బొంబాయి జీవితంలో వారంపదిరోజులకోసారన్నా నాకోసం తప్పక సమయం కేటాయిస్తుందని నాకు గర్వం.


ఆ మధ్యన నా ఆరోగ్యం బాలేనప్పుడు జనాల పలకరింపులు పరామర్శలూ వినలేక నేను చాలా రోజులు ఎవరి ఫోన్లు ఎత్తలేదు. జయ ఫోన్ కూడా రెండు మూడు సార్లు తియ్యలేదు. ఒకరోజు తనే మళ్ళీ చేసింది. మామూలు కబుర్లు మాట్లాడుతోంది. నేను ఏదో చెప్పబోయను. తను అంది..."ఏం చెప్పద్దు. అయిపోయిన విషయమే ఎత్తద్దు. మిగతా విషయాలు మాట్లాడు..." అంది. ఏం చెప్పాలో అని సతమతమౌతున్న నాకు తేలిగ్గా అనిపించింది. అంతవరకూ ఫోన్ చేసిన ప్రతివాళ్ళు జరిగిన విషయం తెలుసుకోవాలని ఆరాటపడ్డారు తప్ప అది తలుచుకోవటం వల్ల నేను పడే వేదనను అర్ధం చేసుకోలేకపోయారు. మనల్ని సరిగ్గా అర్ధం చేసుకున్న స్నేహితులు మాత్రమే ఎన్ని కాలాలు మారినా మన పక్కన తోడై నిలబడతారు అనటానికి జయలాంటి స్నేహితులే ఉదాహరణ.

తన గురించి ఒక్కటే నాకు కంప్లైంట్. ఎంతచెప్పినా మైల్స్ రాయటం నేర్చుకోదు. అసలు కంప్యూటర్ అంటే ఆసక్తే లేదు. నిన్న రాత్రి భట్టుమావయ్యగారి మీద రాసిన పోస్ట్ తనతో నెట్లో ఓపెన్ చేయించేసరికీ జుట్టు పీక్కున్నంత పనైంది. నా స్నేహితుల్లో నా బ్లాగ్ ఇప్పటిదాకా చూడనిది తనొక్కర్తే. నెట్ ఆపరేట్ చేయటం నేర్చుకొమ్మని బాగా తిట్టాను. ఇప్పుడు ఏ ఇగోలూ లేకుండా ఒకరినొకరం నిర్మొహమాటంగా తిట్టుకునేంత స్వేచ్ఛ మా స్నేహానిది. మా స్నేహానికిప్పుడు ఇరవైఏళ్ళు. జయకు నేనేమిటో తెలుసు. నాకు తన స్వచ్ఛమైన మనసు తెలుసు. అందుకే జయ నాకు సన్నిహితురాలు....ఎప్పటికీ.



Tuesday, December 6, 2011

భట్టుమావయ్యగారు


Linda Goodman పూనిన కాలేజీ రోజుల్లో ఇంటికొచ్చినవారందరినీ మీ sunsign ఇదేనా? అని అడగటం హాబిగా ఉండేది. అలా ఒకానొకరోజున భట్టు మావయ్యగారిని మీరు Sagittarius ఏనా? అనడగటం, ఆయన 'ఓసినీ...బానే చెప్పావే' ఆశ్చర్యపోవటం నాకింకా గుర్తే. అప్పటి నుంచీ ప్రతి ఏడూ నేనెక్కడ ఉన్నా డిసెంబర్ 6thన పొద్దున్నే భట్టుమావయ్యగారికి శుభాకాంక్షలు చెప్తూ ఫోన్ చెయ్యటం, 'నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవే..' అనే ఆయన పలకరింపు వినటం నాకు అలవాటైపోయింది. ఇవాళ పొద్దున్న ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడూ మూడు నిమిషాల్లో టాక్ ముగించే భట్టుమావయ్యగారు ఇవాళ పన్నెండు నిమిషాలు మాట్టాడారు. ఆ కాసేపులో ఎన్ని విషయాలు చెప్పారో...చాలా ఆనందమైంది. రాబోయే తరానికి చెందిన ఆలోచనలు ఈనాడు చేయగల గొప్ప మేధావి భట్టుమావయ్యగారు. ఇవాళ ఎలాగోలా టైం కుదుర్చుకుని మావయ్యగారి గురించి బ్లాగ్లో రాయాలని అనుకున్నా...!

భట్టుమావయ్య గారు ఎవరు?
మా చిన్నప్పుడు "భాస్కరమ్మగారింట్లో" ఉండగా మా వాటాలోని రెండు గదులు అద్దెకిచ్చినప్పుడు, అందులో నాలుగైదేళ్ళు ఉన్నారు. అప్పటి నుంచీ నాకు భట్టుమావయ్యగారు తెలుసు. భట్టుమావయ్యగారి పూర్తి పేరు "పన్నాల సుబ్రహ్మణ్య భట్టు". ఒక్కమాటలో చెప్పాలంటే "బహుముఖప్రజ్ఞాశాలి". విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా రిటైరయ్యారు. అనౌన్సర్ గా రిటైరయి ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు భట్టుమావయ్యగారు. పరిస్థితులు మరోలా ఉండుంటే స్టేషన్ డైరెక్టర్ గా రిటైరవ్వాల్సినవారు. అయినా ఆ చింత ఏ కోశానాలేని విశాల దృక్పధం ఆయనది.

70s,80s లోని రేడియో శ్రోతలకు ఈయన భట్టుగారి పేరు సుపరిచితం. చాలా కొత్తకార్యక్రమాలకు ఈయన నాంది పలికారు. శ్రీరజనీకాంతరావుగారు బెజవాడ రేడియోస్టేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో, వ్యంగ్య రచనలు రాయటంలో దిట్ట అయిన భట్టుగారు "చెళుకులు" అనే రేడియో ప్రోగ్రాం ఒకటి చేసారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో వచ్చే ఈ కార్యక్రమం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ధ్వని మాధ్యమంలో ఇలాంటి కార్టూన్ కార్యక్రమం రావటం అదే ప్రధమం. భట్టుగారు రేపు ఉదయం ఎవరి మీద చెళుకులు పేలుస్తారో అని ఊరంతా ఎదురుచూసేది. విజయవాడ నవోదయ పబ్లిషర్స్ వారీ చెళుకులకు పుస్తకరూపాన్ని కూడా అందించారు. మాగంటి వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకం తాలూకూ పిడిఎఫ్ లింక్:
http://www.maganti.org/air/chelukulu.pdf




తరువాత "అనుభవ దీపం" అనే ప్రతీక నాటకం(symbolic play) ఒకటి భట్టుగారు రాసి, ప్రొడ్యూస్ చేసారు. రేడియో చరిత్రలో ఇలాంటి కార్యక్రమం రావటం అదే ప్రధమం. ఈ కార్యక్రమంలోకి శ్రీమతి వి.బి.కనకదుర్గ, శ్రీరంగం గోపలరత్నం గార్లతో పాడించిన పాటలు చాలా బావుంటాయి. "నాదబంధం" అని సంగీత వాయిద్యాల మీద చేసిన కార్యక్రమానికీ, "మార్గ బంధం" అని రోడ్లు తమ స్వగతాలు చెప్పుకుంటున్నట్లుగా చేసిన కార్యక్రమానికీ సృజనాత్మక విభాగంలో జాతీయ పురస్కారాలు వచ్చాయి భట్టుగారికి. హాస్య వ్యంగ్య రచనల్లో దిట్ట భట్టుగారు. "వీరపాండ్య పెసర బొమ్మన్" అనే కధానికను రాసి తరువాత నాటకంగా కూడా తయారుచేసారు. "పెసరల్ ఇన్సైడ్" అని పెసరట్టు + సాఫ్ట్వేర్ నూ కలిపి ఒక వ్యంగ్య కథ పత్రికకు రాసారు. ఈ కథ "ఆహా... ఓహో !" (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు) అనే పుస్తకంలో ప్రచురితమైంది. రేడియోలో పండుగల రోజుల్లో "ప్రత్యేక జనరంజని" ప్రసారం అవుతూ ఉండేది. అలాగ ఒకసారి ఓ పత్రికలో "ఆవు జనరంజని" అని పేరడీ రచన చేసారు. అంటే ఒక ఆవు తాను ఏన్ని సినిమాల్లో ఉన్నదీ, ఏ ఏ పాటలు తన పేరు మీద ఉన్నాయో ఇంటర్వ్యూలో చెప్తున్నట్లుగా అన్నమాట.


నాకు తెలిసిన భట్టుమావయ్యగారు :



రేడియో స్నేహం కాక భట్టుమావయ్యగారితో మరో స్నేహం ఉండి మాకు. అది అమ్మావాళ్ళ పుట్టిల్లు రాజమండ్రి స్నేహం. మా పెద్దమ్మ భట్టుమావయ్యగారి చెల్లెల్లు స్కూల్లో క్లాస్మేట్స్. తర్వాత కాలేజీలో నాకు బాగా మిత్రురాలైన "జయ" పెద్దమ్మ ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి, అంటే భట్టుగారి మేనకోడలు అని తెలుసుకుని మరీ సంబరపడిపోయా. జయ కూ నాకూ ఇరవైఏళ్ళుగా గాఢమైన స్నేహం.




కార్టూన్లు, హాస్య రచనలు, పత్రికలలో ఎన్నోవ్యాసాలు, నాటకాలు, వ్యంగ్య రచనలు ఎన్నో చేసిన భట్టుమావయ్యగారు సరదగా బోలెడు డిగ్రీలు కూడా సంపాదించారు. హిందీలో ఎం.ఏ, జర్నలిజం కోర్స్, ఫిల్మ్స్ కి రిలేటెడ్ డిప్లొమా(పేరు గుర్తులేదు)...మొదలైన కోర్సులు చేసారు. ఆయన చేయటమే కాక ఎంతో మందికి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ చేసేవారు. ఆయన జేబులో ఎప్పుడూ ఏవో పేపర్ కట్టింగ్లు ఉంటూండేవి. "ఇవి మీ అబ్బాయికి ఇవ్వు" అనో, "ఇవి మీ అమ్మాయికి ఉపయోగపడతాయి ఇదిగో" అనో అవసరం ఉన్నవాళ్ల చేతుల్లో పెట్టేసి వెళ్పోతూ ఉండేవారు. తాను చేయటమే కాక ఎంతో మంది ప్రోగ్రాం అఫీసర్లకీ, రేడియో స్టాఫ్ కీ ప్రోగ్రాములు చేయటానికి కొత్త కొత్త ఐడియాలు చాలా ఇస్తూండేవారు.

ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఈయనకు తెలీని విషయాలు ఉన్నాయా అని అశ్చర్యపోతూనే ఉంటాను. భట్టుగారితో పది నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరికైనా రెండు విషయాలు ఇట్టే అర్ధమవుతాయి; ఆయనకు తెలియని విషయం ఏదీ లేదని, ఆయనతో మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనీ. ఎందుకంటే వాటిలోని నిజాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు మరి. అందువల్ల భట్టుగారు సూటిగా మాట్లాడే మాటల్లోని వ్యంగ్యాన్ని మంచి సలహాగా తీసుకుని, ఆయన మాటల్లో దాగున్న ఆప్యాయతని అర్ధం చేసుకున్నవారికన్నా వారి మాటల్ని అపార్ధం చేసుకున్నవారి సంఖ్యే అధికం ఇప్పటికీ...!!

భట్టుగారు మంచి రచయిత, విమర్శకుడు, సంగీతజ్ఞుడు, హాస్య-వ్యంగ్య రచయిత అని చాలామందికి తెలుసు. కానీ ఆయన నలభీములని బహు తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసీ పెసరట్లు వేయటంలో ఆయన్ను మించిన స్పెషలిస్ట్ మరొకరుండరు. పెసలతో, పెసర పప్పుతో పాటు ఎన్ని రకాలుగా పెసరట్లు వేయవచ్చో చెప్పటం వెనుక ఆయన చేసిన ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. మినపప్పు నానబెట్టి, రోట్లో స్వయంగా రుబ్బి, గారెలు ఆవడలు చేసి మిత్రులందరినీ ఆహ్వానీంచి మరీ జనాలతో తినిపించేవారు. మినపప్పు ఎంతసేపు నానితే గారెలు ఏ విధంగా వస్తాయో ఇట్టే చెప్పగలరు భట్టు గారు. ఒకసారి నాకు చేగోణీలు ఎలా చెయ్యాలో కూడా చెప్పారు.





భట్టుగారి పెసరట్ల ప్రతిభ గురించి ముళ్ళపూడి వెంకట రమణగారు "కోతికొమ్మచ్చి" పుస్తకంలో కూడా (30వ పేజి దగ్గర) ప్రస్తావించారు. ఓ పద్యం కూడా రాసారు ఇలా :
"పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ "
ఈ పద్యానికి బాపూ గారు వేసిన బొమ్మతో సహా ఉన్న లేమినేషన్ వీరింట్లో ఉంటుంది.

భట్టుమావయ్యగారి సతీమణి కృష్ణకుమారక్క(ముంజులూరు కృష్ణకుమారి). ప్రస్తుతం బెజవాడ రేడియో స్టేషన్లో 'అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్'. మావయ్యగారు, అక్క...ఇదేం వరస అని విన్నవాళ్లంతా అడిగేవారు. వారి పెళ్ళికి మునుపే కృష్ణక్క మాకు తెలియటం వల్ల తనను కృష్ణకుమారక్క అని పిలిచేవాళ్ళం. ఆ పిలుపు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. తను అంత పెద్ద ఆఫీసరయినా నాకు మాత్రం ఎప్పటికీ తను చిన్నప్పటి కృష్ణకుమారక్క. ఆ దంపతులు ఇద్దరిపై నాకు చాలా ప్రత్యేక అభిమానం. వారిద్దరిని గురించిన ఓ బేతాళప్రశ్న మత్రం ఎప్పుడూ నన్ను దొలిస్తూఉంటుంది...కృష్ణకుమారక్క దొరికిన భట్టుమావయ్యగారు అదృష్టవంతులా? భట్టుమావయ్యగారు దొరికిన కృష్ణక్క అదృష్టవంతురాలా..? అని !!

హమ్మయ్య సాహసం చేసేసా ! నాకు తెలిసినది, తోచినదీ రాసేసాను. ఇప్పుడిక నాకు భట్టుమావయ్యగారు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాల్సిందే !

Wednesday, September 7, 2011

అనుబంధం



మేం ఇప్పుడున్న ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా పక్కన ఒక అపార్ట్ మెంట్ కడుతున్నారు. నాలుగునెలల క్రితం అది పూర్తవటం జనాలు అద్దెకు రావటం జరిగింది. వేసం శెలవుల్లో మా పిల్లని సంగీతంలో చేర్చాను. నాతో పాటే ఆ అపార్ట్మెంట్లో ఒకావిడ కూడా వాళ్ల అబ్బాయిని తీసుకువచ్చి దింపేవారు. ఆవిడను ఎక్కడో చూసినట్లు, బాగా తెలిసినట్లు అనిపించేది.



నెమ్మదిగా మాటలు కలిసాకా పాపని మాఇంటికి పంపండి బాబుతో ఆడుకుంటుంది అనడిగేవారు. అప్పటిదాకా ఒక్కర్తే ఉండటం వల్ల మా అమ్మాయి కూడా వెళ్తానని పేచీ పెట్టేది.నాకేమో కొత్తవాళ్ళింటికి పంపటం ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి కొన్నాళ్ళు దాటేసాను. సంగీతం క్లాసులో వాళ్ళ బాబుతో బాగా స్నేహం కలిసాకా మాపిల్ల ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి ఆడుకుంటానని బాగా మారాం చేస్తే ఇక తప్పక తీసుకెళ్ళాను. కాసేపు మాటలయ్యాకా చుట్టాలను గురించిన మాటలు వచ్చాయి. నువ్వు ఫలానావాళ్ల అమ్మాయివా...నువ్వా? అంది ఆశ్చర్యంగా? వాళ్ళాయన కూడా ఫలానానా ? అని ఆశ్చర్యపోయారు. తీరా తెలిసినదేమిటంటే మా అమ్మకు పెద్దమ్మ మనవరాలు ఈవిడ. నాకు "అక్క" వరస అవుతుంది. అదీగాక వాళ్ళన్నయ్య మా మేనమామకు అల్లుడు.





కాకినాడలో అక్కావాళ్ల అమ్మనాన్నలు ఉంటారు. మేం చిన్నప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి పేరంటాలకు వెళ్ళేవాళ్లం. అలా వాళ్ళు బాగా తెలుసు నాకు. అమ్మావాళ్ల పెద్దనాన్నగారు (అంటే అక్కా వాళ్ల తాతగారు) ఒకప్పుడు కాకినాడలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు. చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళ నుంచి వైద్యానికి మనుషులు వచ్చేవారుట. ఇక వాళ్లయనేమో మా నాన్నగారి అమ్మమ్మగారి వైపు చుట్టాలు. బంధుత్వాలు దూరమే అయినా రాకపోకలుండటం వల్ల బాగా పరిచయస్తులమే.




అదివరకూ వాళ్ళు చాలా దూరంలో ఉండేవారు. అందువల్ల ఇటువైపు వస్తారనీ, వాళ్ళు వీళ్ళేనేమో అనీ నాకు తోచలేదు. చూసి చాలా కాలం అవటం వల్ల గుర్తుపట్టలేదు ఒకర్నొకరం. కానీ ఆవిడను చూసినప్పుడల్లా నాకు గుర్తు వచ్చినది మాత్రం ఈవిడే. (అంటే ఫలానా అక్క లాగా ఉందీవిడ అనుకునేదాన్ని). అక్క కు కూడా నన్ను చూస్తే తెలిసినట్లు, పిల్లను చూస్తే అసలు వదలాలని అనిపించేది కాదుట. బంధుత్వాలు తెలిసాకా ఓహో ఇదే కాబోలు రక్త సంబంధం అంటే...అని డైలాగులు చెప్పేసుకున్నాం. ఇక పిల్లలిద్దరు బాగా కలిసిపోయారు. అక్కావాళ్ల బాబు పేరు "కృష్ణ". మా పాపకన్నా ఓ ఏడు చిన్న. వాడు 1st క్లాస్, ఇది 2nd క్లాస్. ’అదికాదే.. ఒసేయ్" అని వాడంటే, ’రార" అని ఇది చెప్పే కబుర్లు వినితీరాల్సిందే. ఇద్దరికీ తోడు లేని లోటు తీరింది అని మేం కూడా ముచ్చటపడిపోయాం. మ్యూజిక్ క్లాస్కి ఇద్దరూ కలిసివెళ్ళి కలిసి రావాల్సిందే. సైకిళ్ళ మీద ఇద్దరికీ పోటీ. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని.


మేమెవరం ఊరు వెళ్ళినా ఒకరు వచ్చేదాకా ఒకరు కాలుగాలిన పిల్లిలా తిరుగుతారు ఇద్దరూ. పొద్దున్నొకసారి, స్కూలు నుంచి వచ్చాకా ఒకసారిఊకర్నొకరు చూసుకోవాల్సిందే. ఇక వాళ్ళ స్నేహం ఎంత పెనవేసుకుపోయిందంటే రోజూ దెబ్బలాడుకునేంత. ఫోవే ఫో..అంటాడు వాడు. ఇదేమో నాలిక బయట పెట్టి వెక్కిరిస్తుంది. పెద్దవాళ్లం దగ్గర లేకపోతే కొట్టేసుకుంటారు కూడా. మళ్ళీ అంతలోనే కలిసిపోయి కబుర్లాడేసుకుంటారు. ’వీళ్ళ వేవ్ లెంత్ బాగా కలిసిందే.." అంటుంది అక్క. ఫెండ్షిప్ బాండ్ కట్టుకున్నారు. రాఖీ కి బుల్లికృష్ణుడి బొమ్మ ఉన్న రాఖీ దొరికితే కట్టించాను. మొన్న గణేశుడి పందిట్లో వాళ్ళ టీచర్ పిల్లలందరితో శ్లోకాలు అవీ పాడించారు. అప్పుడు చూడాలి వీళ్ళిద్దరి అల్లరినీ..!!



ఒకే కుర్చీలో..








భగవద్గీత శ్లోకాలు చెప్తున్న కృష్ణ







స్టేజ్ మీద పాడుతూండగా


విడదియలేనంతగా అల్లుకుపోయిన వాళ్ల అనుబంధాన్ని చూస్తే కళ్ళు చెమరుస్తాయి. మరో తోడుని పిల్లకు అందించలేకపోయానన్న బాధ మనసుని మెలిపెడుతుంది. భగవంతుడి లీలలు అర్ధం కానివి కదా...వీళ్ళిద్దరూ విడిపోవాల్సిన సమయాన్ని కూడా దగ్గర పడేస్తున్నాడు...! ఇకపై దూరాల్లో ఉన్నా ఎప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలానే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను.

Thursday, July 28, 2011

స్ఫూర్తి

(looking at the brighter side)




మేం ఈ ఇంట్లోకి వచ్చి ఆర్నెల్లు దాటింది. వచ్చినప్పటినుంచీ ఆమెను గమనిస్తున్నాను. ఆమె మా ఇంటి ఎదురుగా చిన్న బడ్డి కొట్టు నడిపే ముసలమ్మ. వయసు ఖచ్చితంగా అరవైకి పైనే. పొద్దున్నే ఆరింటికల్లా కొట్టు తెరిచేస్తుంది. రాత్రి పది,పదిన్నర దాకా తెరిచే ఉంటుంది కొట్టు. మధ్యాన్నం ఓ రెండు గంటలు సేపు మూసేస్తుంది. మా చిన్నప్పుడు బడ్డీ కొట్టు అంటే ఏవో ఓ పది గాజు సీసాలతో పదిరకాల చాక్లెట్లు అమ్మే చిన్న కొట్టు. అంతే . కానీ ఇప్పుడు బడ్డీ కొట్లు కూడా మినీ పచారీ కొట్లు అయిపోయాయి. అర్ధరూపాయి కి రెండు చాక్లేట్ల దగ్గార నుంచీ సర్ఫు పౌడర్లు,బ్రెడ్,పావ్ ల వరకూ అందులో దొరకని వస్తువు ఉండట్లేదు. మా ఇంటెదురు ముసలమ్మ కూడా ఇవన్నీ అమ్ముతుంది. ఎవరు సాయానికి ఉండరు. ఒక్కర్తి ఉంటుంది రాత్రి పూటలు ఒక కిరోసిన్ దీపం పెట్టుకుని . ఆమెకు సాయం ఒక చిన్న ట్రాన్సిస్టర్. అటుగా వెళ్ళే వాళ్ళు సిగరెట్ల కోసం మో, మరేదైనా చిన్న వస్తువు కోసమో రాత్రిళ్ళు అక్కడ ఆగుతూ ఉంటారు. పాలు కూడా అమ్ముతుంది. ఒకరోజు పాలు ఉన్నాయా అంటే ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్లోంచి తెచ్చి ఇచ్చింది. షాంపు పేకెట్లు, చిన్న చిన్న సర్ఫ్ సేచేట్లు..ఇలా చాలా ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి. ముసలమ్మా ఎంత కష్టంలో ఉందో ఇలా కష్టపడుతోంది అనుకునేదాన్ని .

పక్క సందులోనే వాళ్ళ ఇల్లు. కొన్నాళ్ళకు అదే ఆమె సొంత ఇల్లు అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను. డాబా ఇల్లే.అద్దెకు కూడా ఇచ్చిందిట. ఇంతే కాకా సాయంత్రాలు కొట్టు ముందర కుర్చుని ప్లాస్టిక్ బుట్టలు, చాపలు అల్లుతూ ఉంటుంది. ఆమె ఓపికకు నిజంగా అబ్బురం కలుగుతుంది. లేక కాదు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక సంపాదన చెయ్యాలి అనే ఆలోచన అన్నమాట ఆమెది .

*** **** ****
మా పక్క సందులో ఒక చిన్న టిఫిన్ సెంటర్. భార్యాభర్తలిద్దరూ ఇద్దరే నడుపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక ముసలివాడు పని చేస్తూ ఉంటాడు. అతనికి అరవైఐదు పైనే ఉంటాయి. ముస్సలిగా కనబడుతు ఉంటాడు. అటుగా వీధిలో వెళ్తుంటే అక్కడ పని చేస్తూ కనిపిస్తాడు. కప్పులు,ప్లేట్లు కడుగుతాడు. అంట్లు తోముతాడు. వాకిలి చిమ్ముతాడు. ఆ చిన్నపాటి టిఫిన్ సెంటర్ కు అతడే సర్వరు,క్లినారు అన్నమాట. ఎండనక,వాననకా పని చేస్తూనే ఉంటాడు. మొన్నటి ఎండా కాలంలో మందుటెండలో బయట కుర్చుని అంట్లు తోముతున్న ఆ ముసలివాడిని చూస్తే బాధ కలిగేది. ఎంత అవసరం ఉంటే ఇలా కష్టపడతాడు అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడేమో వానల్లో పని చేస్తున్నాడు. అమ్మో ఇది చెయ్యలేనేమో...ఇలా వెళ్ళలేనేమో.. అనుకున్నప్పుడల్లా ఈ ముసలతనే గుర్తు వస్తాడు నాకు. అంత వయసుమీరినవాడు కష్టపడగా లేనిది నేను చెయ్యలేనా అనుకుంటాను మళ్లీ.

*** *** ***



వీళ్లిద్దరిని చూస్తే నాకు విజయవాడలో మా క్వార్టర్స్ లో ఆకుకూరలు అమ్మటానికి వచ్చే ముసలమ్మా గుర్తుకు వస్తుంది. చర్మం మడతలు పడిపోయి , నడుం వంగిపోయిన ఒక ముసలమ్మా తలపై వెదురుబుట్ట నిండా ఆకుకూరలు పెట్టుకుని వాటిపై తడిబట్ట కప్పి తెచ్చేది. 'నానా కాస్త చెయ్యి వెయ్యమ్మా..' అంటే బుట్ట దింపేదాన్ని నేను. ఫ్రెష్గా లేకపోయినా ఏదో ఒకటి కొనకుండా అమ్మ పంపేది కాదు ఆ ముసలమ్మని. ఎందుకే బాలేకపోయినా కొంటావు అంటే..'అంత కష్టపడి ఎండనకా వాననకా అమ్ముకుంటోంది...ఏదో ఓకటి తీసుకుంటే ఆమెకీ తృప్తి..' అనేది అమ్మ. కొన్ని రోజులు కనబడేది కాదు.ఏమయ్యావు అనడిగితే 'పానం బాలేదమ్మా..' అనేది పాపం.

వయసుమీరాకా ఇంత కష్టం పడాలంటే నిజంగా మనం పడగలమా అనిపిస్తుంది ఆలోచిస్తే.. జీవనభృతి కోసమో,అవసరార్ధమో ఇలా అమ్ముకునేవాళ్ళు కొందరైతే, వయసు మీరినా ఏదో ఒక సంపాదన ఉండాలనుకునే మా ఎదురుగా ఉండే బడ్డీకొట్టు ముసలమ్మలు కొందరు. కారణం ఏదైనా మనం ఇలాంటి వాళ్ళ నుండి పొందాల్సిన స్ఫూర్తి ఎంతో ఉంది అనిపిస్తుంది నాకు.

Wednesday, May 4, 2011

మామ్మయ్య - ఊరగాయలు !


 
మా మామ్మయ్య(నాన్నమ్మ) పెట్టే ఊరగాయల గురించి చెప్పేముందు ఆవిడ పాకప్రావీణ్యం గురించి కొంచెం చెప్పాలి. ఆవిడ చేతిలో అద్భుతం ఉండేది. ఏది వండినా రుచి అమోఘమే. ఆవిడ అత్తారింట్లో ప్రతిరోజూ పాతిక మందికి తక్కువకాకుండా వండేదిట. అది కూడా మడి వంట. ఇక పండగలు తద్దినాలు వస్తే వంటింట్లోనే మకాం. ఆవిడ కొబ్బరి పచ్చడి రుబ్బుతూంటే రోట్లో ఉండగానే సగం పచ్చడి అయిపోయేదిట.(అలా తినేసేవారట అటుగా వచ్చినవాళ్ళు). పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట.

ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి. రోజంతా మిల్లాడిస్తూ ఉండండి అని మా మావయ్య జోక్ చేసేవాడు. ఇదంతా మామ్మయ్య పాకప్రావీణ్యం గురించి చెప్పటానికే. ఇక వేసవిలో ఊరగాయల సంగతికొస్తే ఆ రకం పెట్టినా అన్నీ సమపాళ్ళలో కుదిరేవి. ఆవీడ పెట్టినన్ని ఊరగాయల రకాలన్నీ తినగలగటం మా పిల్లల అదృష్టం.


కాకినాడలో మా ఇంట్లోని వంటింట్లో ఓ మెష్ డోర్ ఉన్న గూడు ఉండేది. దాన్నిండా చిన్నవి, పెద్దవి రకరకల సైజుల్లో జాడీలు ఓ ముఫ్ఫై పైనే ఉండేవి. ఆ జాడీల ఆకారాలు కూడా రకరకాలుగా ముద్దుగా ఉండేవి. గుర్తు కోసం నేనో రెండు జాడిలు తెచ్చుకున్నాను కూడా. మాకు నెల నెలా సామర్లకోట నుండి పప్పు నూనె తెచ్చే ఆదినారాయణ ఊరగాయలు పెట్టే సమయానికి సైకిలు మీద ఫ్రెష్ పప్పు నూనెతో వచ్చేసేవాడు. మా పిన్నివాళ్ల అత్తగారు అయితే ఊరగాయలకు మావిడికాయలు చెట్టు నుండి దగ్గరుండి మరి కోయించుకునేవారు మొన్నమొన్నటిదాకా. పప్పునూనె కూడా గానుగలో దగ్గరుండి ఆడించుకునేవారు.


ఇక నాన్న ఆవకాయలకు ముక్కలు కొట్టేవారు. ఇంట్లోని మహిళలేమో మాగయకు తరిగగేసేవారు. అటు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా రానిచ్చేవారు కాదు. మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది. దాంతో మావిడికాయను చెక్కితే మాగాయకు ముక్కలు వచ్చేవి.(ఇప్పటి పీలర్ లాగన్నమాట). పెరట్లోనేమో పనమ్మాయి లక్ష్మి తాలూకూ కొందరు ఆడవాళ్ళు వచ్చి కారం కొట్టేవారు. ఆ రోకళ్ళ చప్పుడు భలేగా ఉండేది. అటువైపు అసలు వెళ్లనిచ్చేవారు కాదు ఘాటుకి తుమ్ములు వస్తాయని. వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే వొలుచుకునేవారు.



ఇక మా మామ్మయ్య పెట్టే ఆవకాయ రకాలు ఏమిటంటే:

1) వెల్లుల్లి ఆవకాయ
2)ఉత్తి ఆవకాయ (వెల్లుల్లి తిననివాళ్ళ కోసం)
3)పులిహార ఆవకాయ (కావాల్సినప్పుడల్లా కాస్తంత తీసుకుని పులిహోర పోపు పెట్టుకుంటారు)
4)అల్లం ఆవకాయ (దీంట్లో అవపిండి ఉండదు)
4)పచ్చావకాయ (పచ్చ మెరపకాయలతో పెడతారు)
5)పెసర ఆవకాయ (దీంట్లో అవపిండి బదులు పెసరపిండి వాడతారు)
6)బెల్లం ఆవకాయ
7)సన్న ఆవాల ఆవకాయ (ప్రత్యేకం సన్న ఆవపిండితో పెడతారు.ఘాటు ఎక్కువగా ఉంటుంది)
8)శనగల ఆవకాయ (ఎండిన శనగలు వెస్తారు. కొన్నాళ్ళకు అవి ఊరి తినటానికి బావుంటాయి)
9)నువ్వుపిండి ఆవకాయ(దీంట్లోనూ అవపిండి బదులు నువ్వుపిండి వాడతారు)
10)మావిడి పిందెలతో అవకాయ (కేరళావాళ్ళు ఎక్కువ చేస్తారు దీన్ని)

మాగాయ రకాలు:
1)నూనె మాగాయ
2) తొక్కు మాగాయ
3) ఎండు మాగాయ
4)తురుము మాగాయ/ కోరు మాగాయ
5)ఉల్లిమాగాయ(వెల్లుల్లి తో)

ఇవి కాక మెంతిపిండి ఎక్కువ వేసి చేసే
* మెంతికాయ
* చెంప మెంతికాయ ఆవిడ స్పెషల్స్.


ప్రతి ఏడాదీ ఈ రకాలన్నీ చెయ్యకపోయినా ఒకో ఏడూ వీటిలో సగం పైనే కవర్ చేసేది మామ్మయ్య. నెమ్మది నెమ్మదిగా ఓపిక తరిగేకొద్దీ రకాలూ తగ్గి రెండు,మూడు రకాలు మాత్రమే పెట్టే స్టేజ్ కి వచ్చేసింది చివరిరోజుల్లో.


మా ఇంట్లో ఆవకాయ తినటం తక్కువవటం వల్ల అమ్మ ఎప్పుడు ఇన్ని రకాలు ప్రయత్నించలేదు. ఇప్పుడిక డాక్టర్లు ఊరగాయలు తినద్దంటున్నారని అసలు పెద్ద ఎత్తున ప్రయత్నాలే లేవు. ఏదో శాస్త్రానికి నాలుగైదు రకాలు పెడుతోంది మా పిల్లల కోసం. మేము కూడా డైట్ కంట్రోల్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అంటూ చాలావరకూ ఊరగాయలకు దూరంగా ఉండిపోతున్నాం. తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను.

Thursday, April 7, 2011

మూర్తిబాబయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు


ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మూర్తిబాబయ్యకు నా బ్లాగ్ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని, "మాయదారి కుటుంబం", "గమ్యం" మొదలైన చిత్రాలకి సంగీతాన్ని అందించిన ".ఎస్. మూర్తి"గారిని మేము ఆప్యాయంగా "మూర్తిబాబయ్య" అని పిలుచుకుంటాం.

కవి శ్రీ బాల గంగాధరతిలక్ గారి మేనల్లుడు తను. నాన్నకు చిరకాల మిత్రుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణి విభాగం మొదలుపెట్టిన కొత్తలో నాన్న, మూర్తిబాబయ్య మరికొందరు మిత్రులు కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో కార్యక్రమలు నిర్వహించారు. కార్యక్రమాలకు పాటలు రాసి, బాణీ కట్టి, గిటార్ వాయిస్తూ వాటిని తనే పాడేవాడు మూర్తిబాబయ్య.

గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్ అయిన తను కథలు. కవితలు కూడా రాసేవాడు. గాయకుడు బాలు దగ్గర కొన్నేళ్ళు పనిచేసిన తరువాత సంగీతదర్శకుడు "ఎస్..రాజ్ కుమార్" వద్ద చాలా ఏళ్ళు కంపోజింగ్ గిటారిస్ట్ గా ఉన్నాడు మూర్తి బాబయ్య. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మల్టీ టాలెంటెడ్ అనిపించే మూర్తిబాబయ్య పలు కారణాలవల్ల తెర వెనుకనే ఉండిపోయాడు. సరైన అవకాశాలు వచ్చి ఉంటే తప్పకుండా ఎంతో పేరు వచ్చిఉండేదని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తను సుమారు అరవై దాకా రాసిన సినిమా పాటల్లో ఎన్నో పాపులర్ అయ్యాయి. వాటిలో నిన్నే ప్రేమిస్తా" సినిమాలో "ప్రేమా ఎందుకనీ", "సూర్యవంశం" సినిమాలో "కిలకిల నవ్వుల" పాటల సాహిత్యాలు బాగా ఇష్టం నాకు. తను రాసిన పాటల్లో కొన్నింటిని లింక్ లో మీరు వినవచ్చు: http://www.raaga.com/channels/telugu/lyricist/ES._Murthy.html


చాలా ఏళ్ళ క్రితం అంటే పాప్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బంస్ జనాలలో పాపులర్ కాని రోజుల్లో తను చేసిన "చిలిపి ఊహలు" అనే ప్రైవేట్ ఆల్బం నాకు బాగా ఇష్టమైనది. అందులోని ఎనిమిది పాటలు తనే రాసాడు. కేసెట్ కు సంగీతాన్ని బి.ఆర్.సురేష్ గారు అందించారు. పాటలు వీలైతే నా "సంగీతప్రియ" బ్లాగ్ ద్వారా వినిపించాలని నా కోరిక. ప్రైవేట్ ఆల్బంస్ కు ఎంతో ఆదరణ ఉన్న రోజుల్లో "సీడీ" రూపంలో ఆల్బం ను మళ్ళీ రిలీజ్ చెయ్యమని నేను కోరుతూ ఉంటాను.

మూర్తిబాబయ్యవాళ్ల అమ్మాయి "నిషి"(నిశాంతి) కూడా మధ్యనే తన మొదటి చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. "LBW"(Life before Wedding) అనే చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర ధరించింది. బొంబాయిలో 'ఫిల్మ్ డైరెక్షన్లో' కోర్సు పూర్తి చేసిన నిషికి సినిమా డైరెక్షన్ పట్ల ఎక్కువ మక్కువ. నాగేష్ కుకునూర్, ప్రకాష్ కోవెలమూడి వద్దా, మరికొందరి వద్దా అసిస్టెంట్ గా కూడా పని చేసింది. తను ఎన్నుకున్న ఫీల్డ్ లో నిషీ ఎన్నో విజయాల్ని చూడాలని ఆకాంక్షిస్తున్నాను.

మధ్యనే cinegoer.com అనే వెబ్సైట్ వారు మూర్తిబాబయ్యను ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూలో తన కెరీర్, రాసిన పాటల వివరాలు మొదలైనవాటి గురించి చెప్పాడు మూర్తిబాబయ్య. ఇంటర్వ్యూ తాలూకు యూట్యూబ్ లింక్స్ క్రింద ఉన్నాయి. ఆసక్తి గలవారు చూడవచ్చు.
Part-1)
http://www.youtube.com/watch?v=fjPuiMWpV8s&feature=player_embedded

Part-2)
http://www.youtube.com/watch?v=h3JCNaXs-Jc&feature=fvwrel

Part-3)
http://www.youtube.com/watch?v=BUPyF_5tYP4&feature=relmfu