సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, April 28, 2019

Music Teacher





యాదృచ్ఛికంగా మొన్నొక రోజు ఈ సినిమా చూడడం జరిగింది. పచ్చని కొండలు, లోయలు, వాటి మధ్య సన్నని రోడ్డు, నీలాకాశం, మబ్బులు, మంచు... ఈ దృశ్యాల మీద ఒక అందమైన ఫాంట్ లో వస్తున్న టైటిల్స్, and as a cherry on top - backgroundలో ఒక వీనులవిందైన అర్థవంతమైన పాట!! వీటి మించి ఏం కారణం కావాలి స్క్రీన్ కి అతుక్కుపోవడానికి :) 





కథ, పాత్రలు పక్కన పెడితే మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చినది ఆ కొండలు, మంచు వాతావరణం, drizzling, ఆకుల చివర్ల నుంచి జారుతున్న నీటి బిందువులు, స్క్రీనంతా పరుచుకున్న పచ్చదనం! ఆహ్లాదకరమైన అటువంటి వాతావరణం ఏ కథనైనా బోర్ కొట్టించదు. రెండు ప్రఖ్యాత పాత హిందీ పాటల్ని రీమేక్ చేసారు. మధ్య మధ్య టీ కొట్లో తగిలించిన రేడియో లోంచి పాత పాటలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ పై కనబడుతున్న ఆ రాతి గోడ మీద కూచుని టీ తాగుతూ, వాన తుంపరలని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోతే ఎంత బావుంటుందో , ఆ ప్రాంతంలో నివశించే ప్రజల ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. సిమ్లా అందాలను అంతగా కళ్ళకి కట్టాడు సినిమాటోగ్రాఫర్ కౌశిక్ మొండాల్. కథ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న నాన్ లీనియర్ టెక్నిక్ ప్రేక్షకులలో ఉత్సుకతని చివరిదాకా నిలిపి ఉంచుతుంది. గౌరవ్ శర్మ అందించిన డైలాగ్స్ బాగా గుర్తుండిపోతా
యి.

కథలోకి వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి, కొడుకు, కూతురు ఉంటారు. (చిన్నప్పటి నుంచి బుల్లితెరపైనా, వెండితెరపై కూడా పలురకాల పాత్రల్లో చూసిన నీనా గుప్తా వయసెంతైనా తల్లి పాత్రలో నేనస్సలు ఊహించలేను. కానీ తప్పలేదు.) కొడుకు సంగీతం మాష్టారు. సింగర్ అవ్వాలనే కలతో బొంబాయి వెళ్ళి విఫలయత్నాల తరువాత తండ్రి మరణంతో తిరిగి ఇల్లు చేరతాడు. సంగీతం పాఠాలు చెప్పుకుంటూ, చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుకుంటూ జీవనం గడుపుతుంటాడు. నెరవేరని కలని, బాలీవుడ్ లో పెద్ద గాయకురాలుగా మారిన ఒకప్పటి తన శిష్యురాలిని తలుచుకుంటూ, వీలైనప్పుడల్లా సిగరెట్లు కాలుస్తూ, మౌనంగా విలపిస్తూ కొండల్లో, లోయల్లో తిరుగుతుంటాడు. ఇంతలో ఆ గాయక శిష్యురాలు కాసర్ట్ ఇవ్వడానికి వారి ఊరికి వస్తోందని తెలిసి అందరూ అతడిని పలకరిస్తూ ఉంటారు. ఆమెను కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో అదే రోజు తన చెల్లెలి పెళ్ళి ఫిక్స్ చేస్తాడు సంగీతం మాష్టారు. ఎనిమిదేళ్ళుగా ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఆ శిష్యురాలి గురించి కొన్ని డైలాగులు విన్నాకా అసలు కథ ఏంటా అని ఆసక్తి ఎక్కువౌతుంది. 









ఇక హీరోయిన్ అమృతా బాగ్చీ చాలా బావుంది. ఆమె పళ్ళు మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి కానీ చూడముచ్చటైన మొహం. పెద్ద పెద్ద కళ్ళు, గుబురు జుట్టు ఆమెను చాలా ఇష్టపడేలా చేస్తాయి. అసలా కళ్ళు...they speak volumes! అలాంటి స్వచ్ఛమైన పెద్ద పెద్ద కళ్ళ ను చూస్తూ ఒక జీవితం గడిపేయచ్చు. బాపూ ఉండి ఉంటే తప్పకుండా తన తదుపరి చిత్రంలో ఆమెనే తీసుకునేవారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో మాష్టారికీ, శిష్యురాలికీ మధ్య జరిగిన సంభాషణ మనసుకు హత్తుకుంటుంది. రెండు మూగమనసుల  బాధ అది. we feel that pain. ఆ సన్నివేశంలోని ప్రతి డైలాగ్ గుర్తుండిపోతుంది. "ఎనిమిదేళ్ల పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నా ఉత్తరాలకి జవాబు రాయలేదు" అని బేనీ ప్రశ్నించినప్పుడు, ఒక గాయపడిన ఎక్స్ప్రెషన్ తో "ఆప్ తో జాన్తే హై... గుస్సా కిత్నీ ఖతర్నాక్ చీజ్ హై" అంటుంది జ్యోత్స్న.  కళ్లల్లో నీళ్ళతో "తుమ్హారా ఇంతజార్ కిత్నా సుందర్ హై.." అని అతడంటే, మీకు తెలుసా.. కేవలం మిమ్మల్ని చూడడానికే ఈ ఊళ్ళో కాన్సర్ట్ కి ఒప్పుకున్నానంటుంది.  "ఆప్ కో పతా హై క్యా హువా? ఆప్కీ వో భోలీ సీ, మాసూమ్ సీ జునాయ్ థీ.. వో మర్ గయీ.." అంటుంది. మనసు చచ్చిపోయాకా ఏ బంధాలు మిగులుతాయని?!




ఒక కీలకమైన పాత్ర పోషించిన దివ్యా దత్తా గురించి తప్పక చెప్పుకోవాలి. చిత్ర కథకు ఏ మాత్రం అవసరం లేని ఆమెకూ, సంగీతం మాష్టారికీ మధ్య జరిగే కథ నాకు అస్సలు నచ్చలేదు. కేవలం స్నేహం చూపెట్టి, వారిదొక అందమైన అనుబంధంలా ఉంచేయచ్చు కదా! బేనీ పాత్రని మరింత బలహీనపరచడానికి గీత కథని వాడుకున్నాడేమో దర్శకుడు అని మాత్రం నాకు అనిపించింది. కావాలసింది దొరకలేదని ఏడుస్తూ కూర్చోకుండా ఆమెకు కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కనీసం గీతకు ఆసరా ఇచ్చాడని అతడిపై గౌరవం అన్నా ఉండేది. ఏదీ చెయ్యకుండా కేవలం ఒక అవకాశవాదిగా మాత్రం బేనీ ఉండిపోతాడు. కానీ గీత పాత్ర నాకు చాలా నచ్చింది. ఆమె చేసినది తప్పే అయినా కూడా ముసలి మామగారిని చూసుకుంటూ ఆమె గడిపే ఒంటరి జీవితం, చివర్లో ఆయనకు అంతిమ సంస్కారం కూడా తానే చెయ్యడం, బేనీ జీవితంలో తనకు స్థానం ఉండదని అర్థమయ్యాకా మౌనంగా అక్కడి నుంచి వెళ్పోవడం.. గొప్ప సంస్కారానికి నిదర్శనం. దివ్యా వాయిస్, ఆమె చెప్పే స్లో డైలాగ్స్ లో ఎంతో బరువు, విలువ ఉన్నాయి.  వాటిల్లో కొన్ని..

* " అకేలీ తో హమేషా హీ థీ.. బస్ అబ్ ఖాలీ హో గయీ."

* "రిష్తే జబర్దస్తీ జోడే జా సక్తే హై..లేకిన్ దిల్ నహీ"

* "జిందగీ మే జబ్ వహీ ఖ్వాయిష్ రెహ్ జాయె నా...తో ఇంతెజార్ కర్నా ఔర్ భీ ముష్కిల్ హో జాతా హై"

* "ఏ జో పహాడ్ హైనా, యహా జిత్నా మర్జీ రో లో.. జిత్నా మర్జీ చిల్లాలో, ఆవాజ్ జాకర్ హమ్ తక్ హీ పహుంచ్తీ హై"


చివరిగా, ఇదేమీ అద్భుతమైన సినిమా కాదు. కానీ హిమాచల్ లోయల అందాలు, పాటల్లో సాహిత్యం, మనం మమేకమై అనుభూతి చెందిన కొన్ని క్షణాలు మాత్రం తప్పకుండా మనతో ఉండిపోతాయి. ఈ చిత్రాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన దర్శకుడు సార్థక్ దాస్ గుప్తా సార్థక నామధేయుడై మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.





Saturday, April 27, 2019

వేసవిలో వర్షంలా - జర్సీ




"కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడద్దు అంటే లేదు యుద్ధం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
ఎవరి కోసం మారదద్దం "

చిత్రాన్ని చూసి వారం అవుతున్నా ఇదే పాట పదే పదే అప్రయత్నంగా హమ్ చేస్తున్నాను.
"ఓటమెరుగని ఆట కనగలరా...." పల్లవితో కృష్ణకాంత్ రచించిన ఈ పాట చాలా బావుంది. వెరీ ఇన్స్పిరేషనల్! కానీ డబ్బింగ్ పాటకి లిరిక్స్ రాసినట్లు పొందిక సరిగ్గా కుదరలేదు. నాలుగుసార్లు వింటే గానీ కొన్ని వాక్యాలు తెలీట్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో అనుకుంటా ఈయన రాసిన ఇంకో పాట "నువ్వంటే నా నువ్వు" పాట కూడా చాలా బావుంటుంది. 




ఈ చిత్రాన్ని గురించి వెంఠనే రాయాలనిపించినా... రాద్దామా వద్దా అనే మీమాంసలో ఉండగానే నిన్న మరో మంచి సినిమా చూడడం జరిగింది. ఇక ముందర మన తెలుగు సినిమా గురించి రాయకుండా ఎలా అని మొదలుపెట్టాను. ఈమధ్యన రెండు, మూడు తెలుగు చిత్రాలు చూశాకా, తెలుగులో మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి అని బోలెడు ఆనందం కలిగింది. హీరో గారు కాలు నేల కేసి కొట్టగానే భూకంపాలూ, ఒక్క గుద్దు గుద్దగానే మైలు దూరం వెళ్ళి పడడాలు, గాల్లోకి బళ్ళు ఎగరడాలు.. హీరోలు మారినా అవే దృశ్యాలు ఏళ్ల తరబడి తీసీ, తీసీ వీళ్ళకి విసుగెత్తదా అనిపించేది. కాస్త ట్రెండ్ మారుతోందని ఇన్నాళ్ళకి గట్టిగా అనిపిస్తోంది. నాని టాలెంట్ కి సరిపోయే చిత్రం ఇన్నాళ్లకు వచ్చింది. పాత్రలో నటుడిని కాకుండా పాత్రని చూడగలిగినప్పుడే కదా సత్తా బయటపడేది. జెర్సీ లో "అర్జున్" మాత్రమే కనిపిస్తాడు. ఏవరిదైనా యదార్థ గాథేమో అనిపించే ఈ పాత్రని ప్రేమించకుండా అసలు ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఈ వేసవిలో వర్షంలాంటి ’జెర్సీ ’ మనసు దోచేసింది. దర్శకుడి రెండవ ప్రయత్నం కూడా బావుంది. హ్యాట్రిక్ కోసం ఎదురుచూడాల్సిందే!

ఇది ఒక ఆటగాడి కథ అనేకన్నా, ఒక తండ్రీ కొడుకుల కథ అనాలి. తండ్రీ కొడుకుల మధ్య చూపెట్టిన ప్రతి సన్నివేశం అపురూపంగానే ఉంది. జెర్సీ కొనలేకపోయిన తండ్రికి తాను బాధపడడం లేదని కన్విన్స్ చేయడం కోసం పిల్లాడు చెప్పిన మాటలు, అల్మారాలో పోస్టర్ మార్చినప్పుడు చెప్పే మాటలు,  
"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకొక్కడే. వాడికి మా నాన్న ఉద్యోగం చేస్తాడా, డబ్బులు సంపాదిస్తాడా, సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా?ఇదేం సంబంధం లేదు? వాడికి నేను నాన్న !! అంతే." అనే డైలాగ్ విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఛారిటీ మ్యాచ్ అయ్యాకా కొడుకు చేతులెత్తి అప్లాస్ చెప్తూంటే అర్జున్ మొహంలో కనబడ్డ ఆనందం వర్ణనాతీతం!

ఇంకా - 
"మా ఇంట్లో ఒకళ్ల మీద ఒకళ్ళం అరుచుకోవడం ఉండదు, నేనే అరుస్తాను. నేనే బాధపడతాను. నేనే ఏడుస్తాను"

"అర్జున్ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వలేకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది" 
ఇలా.. చాలా బావున్న డైలాగ్స్ బోలెడున్నాయి.

అర్జున్ ని "బాబూ.." అని హీరోయిన్ పిలవడం భలే తమాషాగా ఉంది. కొన్ని సీన్స్ కూడా బాగా గుర్తుండిపోతాయి. 
* రైల్వే స్టేషన్ లో అరవడం ఐడియా చాలా బావుంది. ఎప్పుడైనా ప్రయత్నించచ్చు.
* "అమ్మ అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు" అని అర్జున్ కొడుకుని అడిగే సీన్ !
* లేడీ జర్నలిస్ట్ కి ఆమె ప్రేమికుడిని వదలద్దని చెప్పే సీన్.
* "మా నాన్న సంకల్పం ఎంత గొప్పదంటే.." అంటూ చివరలో అర్జున్ కొడుకు చెప్పే స్పీచ్.

ఎనభైల్లో కథ అని చెప్పడమే కాక ప్రతి సీన్ లోనూ సెట్టింగ్స్ కూడా చాలా ఏప్ట్ గా వేశారు. ఒక సీన్ లో గోడ దగ్గర బల్ల మీద పాత కాలంనాటి సింగిల్ స్టీరియో టేప్ రికార్డర్. అతి మామూలు సాదా సీదా ఇల్లు. చివరి సీన్ లో గ్రూప్ ఫోటో కోసం తంటాలు పడడం చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనే కోర్సుల్లో చేరుతున్న నేటి తరాలవారికి ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎలా అర్థమౌతాయి. ఐదొందలు సంపాదించాలని అర్జున్ పడే పాట్లు డబ్బుకి విలువే తెలియని ఈతరం యువతకి అర్థమౌతుందా? అనిపించింది. కష్టం తెలీకుండా, కాలు కిందపెట్టనివ్వకుండా, అపురూపంగా పెంచేస్తున్నారు పిల్లల్ని చాలామంది. రూపాయి రూపాయికీ వెతుక్కుని, చెమటోడ్చి సంపాదించినవాళ్ళకే రూపాయి విలువ, మనిషి విలువ తెలుస్తాయి. కష్టపడితేనే సుఖం విలువ అర్థమౌతుంది. 

కారణాలు ఏవైనా, పని ఎలాంటిదైనా, ఒక ఇష్టమైన పని చేయడం ఆపేస్తే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు! భార్య ఎంత తిడుతున్నా స్పందన లేకపోవడం, ఏ పనినీ ఆసక్తిగా చెయ్యలేకపోవడం, కరెంట్ బిల్లు డబ్బుతో నిర్లక్ష్యంగా పేకాట ఆడడం మొదలైనవి చూసి ఈ పాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నాడీ దర్శకుడు? అని ఆశ్చర్యపోయాను. స్టేడియంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన కట్టప్పగారితో "ఈ లోకంలో తప్ప బయట బతకలేనని అర్థమైంది సార్" అన్నప్పుడు నాకు అర్థమైంది ఈ పాయింట్ ని స్ట్రెస్ చెయ్యాలని ఆ క్యారెక్టర్ ని అలా చూపించారన్న మాట అని! 

కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. పుస్తకం అచ్చైన తర్వాతే ఎందుకు జెర్సీ పంపారు? అన్నేళ్లదాకా క్రికెట్ బోర్డ్ వాళ్ళు అర్జున్ కుటుంబాన్ని కాంటాక్ట్ చెయ్యలేదా? ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు మెడికల్ టెస్ట్ లు అవీ చేస్తారు కదా.. మరి అర్జున్ కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఆ మెడికల్ టెస్ట్స్ లో తెలియలేదా? తెలిస్తే అన్ని మ్యాచ్ లు ఎలా ఆడనిచ్చారు? మొదలైన సందేహాలు! ఆట మానేసాడన్న సంగతి మొదటిసారి విన్న అతడి భార్య, మిగతా సన్నిహితుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉండి ఉండచ్చేమో! 
చివరాఖరి సందేహం ఏమిటంటే - ఈ పాత్రని నాని కాకుండా ఎవరో కొత్త వ్యక్తి, ఇంతే బాగా నటించినా కూడా చిత్రాన్ని ఇలానే ఆదరించేవారా?? అని :)

Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 


Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.