సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, April 5, 2015

విజయవాడ... a rejuvenated experience!




విజయవాడ ప్రయాణం అనేది చాలా సామాన్యమైన విషయం. బెజవాడేమీ అమ్రీకా కూడా కాదు వెళ్లలేకపోవడానికి. కానీ సంసారసాగరంలో పడ్డాకా మళ్ళీ వెళ్ళాడమే కుదర్లేదు. పాతికేళ్ళ పైగా నేను పెరిగి, తిరిగిన నా బెజవాడని వదిలి పన్నెండేళ్ళు అయ్యింది. మధ్యలో ఏవో పనుల మీద రెండుసార్లు వెళ్లాను కానీ అరపూటో, పూటో ఉండి వెళ్ళిన పనయ్యాకా వెనక్కు వచ్చేసానే తప్ప ఉండటానికి వీలవలేదు. ఇన్నాళ్ళకి అనుకోకుండా మొన్న సోమవారం విజయవాడ వెళ్లాను. నెలరోజుల్నుండీ నాన్న అడుగుతూ ఉన్నారు.. "బెజవాడ వెళ్దామని.. మాతో వస్తావా.” అని. అబ్బే నావల్ల కాదు.. ప్రయాణం చెయ్యలేనని చెప్తూ వచ్చాను. ఆదివారం రాత్రి అమ్మ "పెట్టె సర్దుకున్నాం.. ఫలానా ఫలానావాళ్లను కలుస్తామని చెప్తే మాత్రం.. "నేనో.." అన్నను. రాలేనన్నావుగా..మరోసారి వెళ్దువులెమ్మంది అమ్మ. ఆ రాత్రి నిద్రలో.. కలలోనేమో.. బెజవాడ.. చిన్నతనం.. స్నేహితులు..కాలేజీ అన్నీ కనబడుతూ ఉన్నాయి. పైగా తమ్ముడు హాస్టల్ కి వెళ్పోయాకా అమ్మ,నాన్న,నేను ముగ్గురమే దాదాపు పదేళ్ళు కలిసి ఉన్నాం. మా ముగ్గురికీ కలిపి ఎన్నో ఙ్ఞాపకాలు నిండి ఉన్న ఊళ్ళోకీ వాళ్ళిద్దరే వెళ్తుంటే నా మనసు ఊరుకోలేదు. పొద్దున్నే మా పాప రిజల్ట్ తీసుకుని వచ్చాకా పదింటికి మావారిని అడిగాను వెళ్తానని. ఇప్పటికిప్పుడంటే రిజర్వేషనో... అన్నారు. దొరికితేనే వెళ్తానన్నాను. అప్పటికప్పుడు నాకూ, మా పాపకీ ఏ.సి. చైర్ కార్లో రానూ,పోనూ రిజర్వేషన్స్ దొరికేయడం, టికెట్ ఎస్.ఎం.ఎస్ లు నా ఫోన్ లోకి రావడం జరిగిపోయాయి. కానీ తయారవడానికి గంట మాత్రమే సమయం ఉంది! అసలే పొద్దున్నుంచీ ఏదో ఆందోళన.. ఉన్నదాన్ని ఊరుకోక ఏదో ఓ తలనెప్పి తెచ్చుకుంటూ ఉంటాను. ఆ కంగారుతోనే గబగబా వంట చేసి, తిని బయల్దేరాం.


హటాత్తుగా వాతావరణం చల్లబడిపోయింది. కాస్త దూరం వెళ్లగానే పేద్ద వాన మొదలైంది. స్టేషన్ చేరి ట్రైన్ ఎక్కాకా కూడా "ఎందుకు ఇప్పుడు బయల్దేరుతున్నాను.. ఇన్నేళ్ళలో తనని వదిలి ఎప్పుడూ ఏ ఊరు వెళ్లలేదు.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం సర్దుకుంటోంది.. ఇప్పుడీ ఒంటరి ప్రయాణం అవసరమా.. విజయవాడ అనగానే పరిగెట్టేయడమేనా.." అని గందరగోళపడ్డాను. సీట్లో వెనక్కి వాలి పడుకున్నా, చల్లగాలి తగులుతున్నా ఆందోళన తగ్గలేదు. నా కూడా పట్టుకెళ్ళిన పుస్తకాలు తెరవలేదు కానీ ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం చదువుకుని, మృత్యుంజయ మంత్రజపం చేసుకున్నాకా మనసు బాగా శాంతించింది. ఈలోపూ తెచ్చుకున్న టైంపాస్ పజిల్స్ అయిపోయి, అమ్మకానికి వచ్చిన టమాటా సూప్, చిప్స్, బిస్కెట్లు అన్నింటినీ కొనిపించేసి, వాట్ మోర్.. ఇంకా ఎంతసేపు.. బోర్.. అంటూ నా బుర్ర తినడం మొదలెట్టింది అమ్మాయిగారు. ఇక ఓ స్టేషన్లో ట్రైన్ ఆగగానే గబగబా దిగి వెళ్ళి ఓ ’టింకిల్’ కొని తెచ్చి, ప్రస్తుతానికి దీనితో కాలక్షేపం చెయ్యి.. విసిగించకని కాస్త గట్టిగానే చెప్పి, కళ్ళుమూసుకుని పడుకున్నా.


చీకటి పడినా అద్దాల కిటికీలోంచి దూరంగా వరుసగా కనబడుతున్న బోలెడు లైట్లు, ఎత్తైన కొండలు కనబడగానే పాపకు చూపెట్టా.. అదిగో మా ఊరు.. అలా లైట్లు కనబడ్డాయంటే వచ్చేసినట్లే! అని. స్టేషన్లో దిగి సంబరంగా చుట్టూ చూశాను. ఏదో అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చిన భావన..! ఐదో ప్లాట్ఫారం మీంచి చివరకంటా వెళ్ళి ఏడమపక్కకు తిరిగితే బయటకు దారి ఉందని గుర్తు. అలానే వెళ్ళి ఆటో ఎక్కి అమ్మవాళ్ళు దిగిన హోటల్ రూమ్ కు చేరాను. అది మొదలు నా దిగుళ్ళు, భయాలన్నీ మర్చిపోయాను. మళ్ళీ పన్నెండేళ్ల క్రితపు మనిషినైపోయాను.


నే రైలెక్కాకా అమ్మవాళ్లకి నా ప్రయాణం చెప్పడంతో వాళ్ళ ప్లాన్సన్నీ మారిపోయాయి. తను ముఖ్యంగా కలవాలనుకున్న రజని గారిని కలవడం మర్నాటికి వాయిదా వేసారు నాన్న. నేను కాస్త ఫ్రెష్ అయ్యాకా భట్టుమావయ్యగారి ఇంటికి బయల్దేరాం. చీకట్లో ఇల్లు కాస్త వెతుక్కున్నాం కానీ చెట్లను బట్టీ నాన్న గుర్తుపట్టేసారు. భట్టుమావయ్యగారిలో పెద్దగా మార్పేమీ లేదు. సినిమాల్లో ఓల్డ్ అయిన హీరో/హీరోయిన్ తల్లి జుట్టుకు కాస్త(ఓ పాయకు) తెల్లటి రంగు వేసినట్లు.. జుట్టు రంగులో కాస్తంత మార్పు తప్పిస్తే కృష్ణకుమారక్క కూడా అలానే ఉంది. డిజిగ్నేషన్ ప్రకారం ఇప్పుడు తను ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్ అయిపోయింది కానీ నాకు మాత్రం మా చిన్నప్పటి కృష్ణకుమారక్కే! మా చిన్నప్పుడు తను యూనివర్సిటీలో చదువుకునేప్పటి నుండీ అక్కా అనే పిలవడం అలవాటు. ఇంటర్నెట్ నుండీ గుమ్మడి వడియాల దాకా కబుర్లయ్యాకా, ఫలహారాలయ్యాకా, "తనని కూడా తీసుకువచ్చి మిమ్మల్ని, ఇంటినీ, పుస్తకాలనీ చూపెట్టాలని కోరిక.. మళ్ళీ తప్పకుండా వస్తామని" భట్టుమావయ్యగారితో  చెప్పి శెలవు తీసుకుని, బరువైన బహుమతులతో వెనక్కు బయల్దేరాం.


మర్నాడు పొద్దున్నే తయారయి రజనిగారి ఇంటికి వెళ్ళాం. ఈమధ్యన చాలామందిని గుర్తుపట్టట్లేదని చెప్పారు. సో, గుర్తు పడతారో.. పట్టరో అనుకుంటూ వెళ్ళామా.. గుమ్మంలో నాన్న నించోగానే, తన పక్కన ఉన్న కృష్ణ (కూడా ఉంటూ వారికి ఆత్మీయుడైపోయిన రజని గారి సహాయకుడు) కి "ఇతను శ్రీరామ్మూర్తి.. ace announcer!" అని చెప్పారు. తర్వాత అమ్మను చూపెట్టి "ఈవిడ వాళ్ళావిడ.. సీత.. తను ఆశా.. వాళ్ళమ్మాయి(నేను). నా పాట వాళ్ళింట్లో అమ్మాయిగా పుట్టింది." అని చెప్పారు. నన్నేమో మా అమ్మాయి పేరడిగారు. అప్పుడు నాన్న "ఆశా నా ప్రాణా సఖీ" పాట గురించి కృష్ణకు చెప్పారు. రజని గారు పాడిన ఆ లలితగీతం నాన్నకు చాలా ఇష్టం. రజని గారిపై ఎంతో ప్రేమతో, నే పుట్టిన తరువాత నాన్న ఆ పాట నా పేరుగా పెట్టుకున్నారు.


ఇంతకీ అప్పుడు కృష్ణ ఏమో రజనిగారితో "అయితే ఆ పాట పాడండి.." అనడిగాడు. వెంఠనే పాట మొత్తం పాడేసారు రజనిగారు. మధ్యలో ఓ చరణం తడబడితే కృష్ణ వాక్యాలందించాడు. నేను ఆశ్చర్యపోతుంటే అతనే చెప్పాడు "రోజూ పొద్దున్నే వాకింగ్ అయ్యాకా ఓ గంటసేపు పాటలు పాడతారు అయ్యగారు. వారితో పాటూ నన్నూ పాడమంటారు. అలా నాకూ వచ్చేసాయండి" అని! "ఆహా..ఎంత అదృష్టవంతుడివయ్యా" అన్నాను. "నిజమేనండి.. ఇంత గొప్పవారితో, మంచివారితో గడపగలగడం ఎంతో అదృష్టం" అన్నాడతను. అక్కడ ఆయన చుట్టూ ఉన్న హెల్పర్స్ అంతా కూడా ఆయనను చిన్నపిల్లడిని చూసుకుంటున్నట్లు ఎంతో ప్రేమగా చూడడం చాలా ఆనందాన్ని కలిగించింది. గదిలో సుభద్రమ్మగారి(రజనిగారి అర్థాంగి) ఫోటోలు చూసి ఆవిడను తల్చుకున్నాం. మహాగొప్ప ఇల్లాలు ఆవిడ. రాత్రి ఎనిమిదింటికి వెళ్ళినా తినడానికో, తాగడానికో ఏదో పెట్టకుండా పంపేవారు కాదు. ఎన్నిసార్లు వెళ్ళనీ ఎవరినీ ఉత్త చేతులతో అస్సలు పంపేవారు కారావిడ. రజనిగారు ఇటీవల అందుకున్న పురస్కారాలన్నీ చూపించాడు కృష్ణ. ఆ చిన్న గదిలో, ప్రశాంత వాతావరణంలో చుట్టూరా 'Ulysses' మొదలు 'సామల సదాశివంగారి స్మృతిసంచిక' వరకూ రకరకాల పుస్తకాలతో Walden దగ్గర Thoreauలా ఉన్నారీయన అనిపించింది. ఎక్కువగా పుస్తకాలు చదువుకుంటూంటారుట ఇప్పుడు. ఇంతలో వారబ్బాయి హేమచంద్రగారు వచ్చారు. నాన్నవద్ద ఉన్న రజనిగారి రేడియో కార్యక్రమాలు, పాటలూ, సంగీత రూపకాలు అన్నీ కలిపి ఓ ఎనిమిదిగంటల పాటు వచ్చే మెటీరియల్ అంతా అన్నయ్యతో సీడీలు చేయించి తెచ్చి, ఆ కాపీలు వారబ్బాయికి ఇచ్చారు నాన్న. హేమచంద్రగారు ఫేస్ బుక్ లో నా బ్లాగ్ అప్డేట్స్ అన్నీ చూస్తూంటారు కాబట్టి నేను బాగానే తెలుసు. ఈ అమ్మాయి రచయిత్రి.. బాగా రాస్తుందని రజనిగారికి చెప్పారు. ఆయన కూడా బరువు చేతులతోనే పంపించారు మమ్మల్ని! నాకు సుభద్రమ్మగారే గుర్తుకొచ్చారు. వచ్చేసేప్పుడు "మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి తప్పకుండా రమ్మని" నాన్నకు చెప్పారు రజని గారు! వారిద్దరిదీ ఓ ప్రత్యేకమైన అనుబంధం..! భారమై, అంతలోనే ఆనందభరితంగా మారిన మనసులతో ముగ్గురం రజనిగారి వద్ద వీడ్కోలు తీసుకున్నాం. "అంత గొప్ప మనిషి నన్ను గుర్తు పట్టారు..ఇది చాలీ జీవితానికి" అన్నాను బయటకు వచ్చాకా అమ్మానాన్నలతో.



అక్కడనుండి మరొకరి ఇంటికీ వెళ్ళి హోటల్ కు చేరాం. ప్రయాణం బడలిక, తిరుగుడికి నాన్న బాగా అలసిపోయి నీరసపడిపోయారు. మనసు ఉత్సాహంగా ఉన్నా వయసు, శరీరం సహకరించాలి కదా.. అందుకే మిత్రులందరూ ఇంటికి ఆహ్వానించినా రెస్ట్ గా ఉండాలనే హోటల్లో దిగారు ఆయన. భోంచేసాకా అమ్మ,నాన్న కునుకుతీస్తూంటే, ఊరికే ఉండలేక పాపను తీసుకుని బీసెంట్ రోడ్డు చూసి వస్తానని బయల్దేరా! 


బీసెంట్ రోడ్ కీ నాకూ బోలెడు స్నేహం. రామనవమి పందిళ్ళు వేసిన ఆ వీధిలో నడుస్తూంటే అసలు ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. చెప్పినా అక్షరాలు సరిపోవు నా ఆనందాన్ని వర్ణించడానికి. పాపకి ఆ షాపులూ, మేం తిరిగిన గల్లీలు అవీ చూపెడుతూ, వీధి మధ్యలో ఉండే బుల్లి రాములవారి గుడి చూపెట్టి అక్కడ దణ్ణం పెట్టుకుంటూంటే కళ్ళు చమర్చాయి...! బీసెంట్ రోడ్ కు వచ్చినప్పుడల్లా అమ్మ ఆ బుల్లి గుడి దగ్గర ఆగి దణ్ణం పెట్టుకునేది. నేనూ అమ్మ వెనకాల..! ఇన్నేళ్ల తరువాత నేను మళ్ళీ ఆ రామనవమి పందిళ్ళ క్రింద.. అదే రాములవారి ముందు నా కూతురితో నిలబడి ఉన్నాను...

Friday, March 27, 2015

CHAI - The Experience of Indian Tea





కేవలం ఉత్తర భారత దేశంలోనే కాదు ఇవాళ్టి రోజున దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వేకువ ఝామున, సాయంత్రాల్లోనూ.. వీధి సందు మలుపుల్లో, బజార్లలో, ఫంక్షన్ ప్లేసెస్ లో, సందర్శనా స్థలాల్లో ఓ నాలుగు చెక్రాల చెక్క బండి కనిపిస్తుంది. దాని మీద ఓ పక్కగా చిన్న స్టౌ, ఒక పొయ్యి మీద మరుగుతూన్న టీ పొడి, మరో పొయ్యి మీద మరుగుతున్న పాలు, పక్కనే సీసాల్లో పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలూ, టీ బిస్కెట్లు మొదలైనవి కనబడుతూ ఉంటాయి. బ్లాక్, పుదీనా, లెమన్, స్ట్రాంగ్, లైట్ అంటూ ఐదారు రకాల టీలను అవలీలగా క్షణాల్లో కలిపి ఇచ్చేస్తూ ఉంటారు బండి వాళ్ళు. వారిలో చిన్న చిన్న కుర్రాళ్ళు, ఆడవాళ్ళు, వయసు మీరిన తాతలూ కూడా గంటల తరబడి అలా టీలు చేస్తూనే ఉంటారు. ఆ టీ బండివాళ్ల చురుకుదనం చూస్తే ఆశ్చర్యం వేస్తూంటుంది ఒకోసారి. ప్రాంతాలను బట్టి టీ ఇచ్చే కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటి సైజులూ ఉంటాయి. కాలేజీలో ఉండగా మేము కలకత్తా వెళ్ళినప్పుడు మొదటిసారి టీని మట్టి ముంతల్లో తాగడం చూశాను. ఆ పధ్ధతి చాలా నచ్చింది కూడా. వేడి వేడి టీ తో పాటూ కలిసే ఆ మట్టి వాసన, ఆ రుచి చాలా స్పెషల్ గా, డిఫరెంట్ గా తోచాయి నాకు. 


 బేసిగ్గా నేను కాఫీ లవర్ ని. కానీ పదేళ్ళ క్రితం ఓ సందర్భంలో బాగా ఇష్టమైనదాన్ని వదిలేస్తానని అనుకున్నప్పటి నుండీ కాఫీ వదిలేసి టీ వాడకం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆ కాఫీ ఇష్టం అలానే ఉంది కానీ తాగాలనిపించే బలహీనతను, ఆలోచనను దరికి చేరనివ్వను. అందుకు బదులుగా బ్లాక్ టీ, గ్రీన్ టీ, లీఫ్ టీ, డస్ట్ టీ, ఆరెంజ్ టీ, లెమన్ టీ, గులాబీ టీ, ఐస్ టీ, జాస్మిన్ టీ, తులసీ టీ, ఆర్గానిక్ టీ, ఆయుర్వేదిక్ టీ, ఇన్స్టెంట్ టీ అంటూ రకరకాల టీల ప్రయోగాలు చేస్తూ, ఆస్వాదిస్తూ, టీ ప్రేమికురాలిగా మారిపోయాను. ఎక్కడైనా కొత్తరకం టీ రెసిపీ కనిపిస్తే ప్రయత్నించడం హాబీ అయిపోయింది.



కొద్ది రోజుల క్రితం చైనా నుండి వచ్చిన ఫ్రెష్ గ్రీన్ టీ బాక్స్ + ఈ చాయ్ పుస్తకం తీసుకువచ్చారు శ్రీవారు. టీ నీకే గానీ పుస్తకం చూసి ఇచ్చేయాలి అన్నారు. ఎక్కడిదంటే ఫలానా ఫ్రెండ్ ఇచ్చారు.. ఈ పుస్తకం ఆయనకు గిఫ్ట్ గా వచ్చిందిట. నువ్వు చదువుతావని తెచ్చానన్నారు. కట్ చేస్తే ఇన్ని రోజులకి ఆ పుస్తకం చదవడం పూర్తి చేసాను. అది కూడా బుక్ ఇచ్చేయాలని అయ్యగారు తొందరపెడితే బలవంతాన చదివాను. ఈ పుస్తకం ప్రధానాకర్షణ అందులోని పెద్ద పెద్ద కలర్ఫుల్ ఫోటోస్. టీ ప్లాంటేషన్స్, జార్స్, సిటీస్, టీ దుకాణాలు, కలర్ఫుల్ సీల్డ్ టీ పేక్స్.. గట్రాలతో ఉన్న రంగురంగుల బొమ్మలు నిజంగా మనోహరంగా ఉన్నాయి. పుస్తకంలోని ఫోటోలను వాడుకోకూడదనే నిబంధన ప్రకారం అవేమీ ఈ పోస్ట్ లో పెట్టట్లేదు. కవర్ పేజీ మినహా టపాలోని ఫోటోలన్నీ గూగులమ్మ సహాయంతో సేకరించినవి.


2014 లో ప్రచురించబడిన అయిన ఈ పుస్తకానికి ఇద్దరు రచయితలు. రాజన్ కపూర్, రేఖా సరిన్. ఒకరు అవార్డ్ గ్రహీత అయిన ఫోటోగ్రాఫర్, ఒకరు అవార్డ్ గ్రహీత అయిన జర్నలిస్ట్ కమ్ ఎడిటర్. ముందుగా వారిద్దరూ పుస్తకాన్ని అంకితం చేసిన పధ్ధతి, ఆ మాటలు బావున్నాయి..

ఇక ఈ పుస్తకంలో ఏం కబుర్లు ఉన్నాయంటే.. అసలు మొట్టమొదట భారతదేశానికి టీ ఆకు ఎలా వచ్చి చేరింది, ఉత్తమమైన నాణ్యత ఉన్న టీ ఆకుని పండించడానికి కొందరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని పరిశోధనలు ప్రయత్నాలూ చేసారో వివరంగా వివరించారు. టీ తోటలు పెంచే ప్రదేశాలూ.. వాటి వివరాలు, ఆయా ప్రాంతాలు చేసే టీ ఉత్పత్తి, టీ ఆకు రకాలు  వివరాలు; అసలు టీ ఆకు ఎలా తయారవుతుంది? ఆ ఆకుపచ్చని లేత చిగుర్లు మన ఇంటికి చేరే రంగురంగుల టీ పేకెట్లలోకి టీ పొడిలా ఎలా మారతాయి.. మొదలైన వివరాలు వివరించారు రచయుత.


మొదటి అధ్యాయంలో దేశంలో రకరకాల ప్రాంతాల్లో టీ ఉపయోగాలనూ, పధ్ధతులనీ వివరించారు. కాశ్మీరు లోని కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టీ ఆకుతో kahwa అనే టీ తయారు చేస్తారుట. ఏలకులు, దాల్చిన చెక్క నీటిలో మరిగించి, తర్వాత టీ ఆకు కలిపి చివరగా అందులో కుంకుమపువ్వు (కాశ్మీరుప్రాంతంలో saffron పంటలు విరివిగా పండిస్తారు కదా అందుకని) కూడా కలుపుతారుట. ఇక ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది బ్లేక్ టీ పొడి, పాలు, కలిపి దాల్చినచెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు మొదలైన మసాలా మిశ్రమాలతో కలిపి టీ తయారు చేసుకుంటారు. అస్సాం లో అల్లం, బిర్యానీ ఆకు వేసిన స్ట్రాంగ్ గా, ఉప్పగా ఉండే టీ దొరుకుతుందిట. అక్కడ కొన్నిచోట్ల ఎక్కువగా ఉండే మలేరియాను పోగొడుతుందిట ఆలాంటి చాయ్. పంజాబ్ లో బ్రేక్ఫాస్ట్ టీతో పాటుగా స్టఫ్డ్ పరాటాలు కూడా ఉంటాయి. ఇంగ్లీషువారి కేక్లు, సేండ్ విచ్ లాగ. ఇంకా కొన్ని చోట్ల ఆలూ బోండాలు, పకోడీలు, సమోసాలు, పేస్ట్రీ పఫ్ లు మాత్రమే కాక జిలేబీ, రసగుల్లా, గులాబ్ జామూన్ మొదల్లైన స్వీట్లు కూడా టీ తో పాటూ ఆస్వాదిస్తూ ఉంటారు. చెన్నై లో ఒక ప్రాంతంలో ఉన్న మూసా టీ స్టాల్ కు ముఫ్ఫై ఏళ్ళ చరిత్ర ఉందిట. రోజుకు రెండు మూడొండల మంది కష్టమర్లు టీ తాగడానికి అక్కడకు వస్తారుట. కేరళలో దాల్చిన చెక్క, ఏలకుల తో పాటూ నట్ మెగ్ మిరియాలు కూడా వేస్తారుట టీలో. హైదరాబాదీలు ఆస్వాదించే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల గురించి చెప్పేదేముందీ!




తర్వాత టీ తయారీ ఎలా మొదలైందో వివరంగా తెలిపారు. టీ ఉత్పాదనలో  మొదటి స్థానంతో ఏకచ్ఛత్రాధిపత్యాన్నీ పొందుతున్న చైనా గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చెయ్యడానికి ఇండియాలో ఎక్కడ టీ ఉత్పాదనలు చేయవచ్చో ప్రయత్నించడం మొదలుపెట్టారుట బ్రిటిష్ వారు. ఆ వెతుకులాటలో అస్సాం అడవుల్లో చైనా టీ ఆకు కన్నా బలంగా ఉన్న టీ ఆకులను కనుగొన్నారుట. అస్సాం అడవుల్లో 600-700 cm ఎత్తు పెరిగిన టీ చెట్లను, వాటికి ఉన్న 20-22 cm పొడవు, 10 cm వెడల్పు ఉన్న టీ ఆకులను చూసి ఆశ్చర్యపోయారుట. మొదటిసారిగా ఒక స్కాటిష్ వ్యాపారస్థుడు అక్కడి ఆదివాసీలు టీ ఆకులను వాడడం చూశాడుట. చైనాలో కాక వేరే ప్రాంతాల్లో టీ ఆకు పండిచగలిగితే చరిత్ర సృష్టించచ్చని ఉత్సాహపడ్డాడుట కానీ అది ఫలరూపాన్ని పొండటానికి చాలా ఏళ్ళే పట్టిందిట. ఎంతో మంది బ్రిటిష్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తల కృషి ఫలితంగా 1839లో భారత దేశంలో మొట్టమొదటి టీ కంపెనీ.. "అస్సాం టీ కంపెనీ" స్థాపించబడింది. అప్పుడు అస్సాం లోనే కాక దేశంలో ఏ ఏ ఇతర ప్రాంతాల్లో టీ ఆకుని పండిచవచ్చో పరిశోధించడం మొదలుపెట్టారుట. అలా అస్సాం నుండి కలకత్తా, డార్జలింగ్, ఉత్తర హిమాలయాల్లోని కాంగ్రా వేలీ, తర్వాత దక్షిణంలో ఊటీ (నీలగిరీస్), కూనూర్, మున్నార్, చిక్ మంగుళూర్, కూర్గ్ మొదలైన ప్రదేశాల్లో టీ ఉత్పాదనలు మొదలైయ్యాయి. డార్జలింగ్ టీ, ఆర్థడాక్స్ అస్సాం టీస్, కాంగ్రా టీ, దూరాస్ & టెరై, నీల్గిరీ టీ మొదలైన టీ కంపెనీలు మొదలై పాపులర్ అయ్యాయి.




టీ ప్లాంటర్స్ అని పిలవబడే ఎస్టేట్ మేనేజర్లు, టీ గార్డెన్ లో వర్కర్లు, వాళ్ల జీవన విధానాలను గురించి ఒక పూర్తి అధ్యాయం ఉంది. తర్వాత అధ్యాయంలో టీ ఆకులు సేకరించడం మొదలు అవి పేక్ అయ్యేదాకా ఏం ప్రాసెస్ జరుగుతుంది అన్న సంగతులన్నీ విపులంగా వివరించారు. మొదట్లో టీ ఫాక్టరీలలో సరైన సదుపాయాలు లేక టీపొడి తయారీ చాలా కష్టతరంగా ఉండేదట. తర్వాతర్వాత నెమ్మదిగా మార్పులు వచ్చి ఇప్పుడు టీ ఫ్యాక్టరీలు చక్కని కంప్యూటర్ కంట్రోల్డ్ సొఫిస్టికేటేడ్ పరికరాలతో ఉండటం వల్ల టీ పొడి కూడా హైజినిక్ గా చక్కని అంతర్జాతీయ ప్రమాణాలతో గా తయారవుతోందిట. 




మూడు పద్ధతుల్లో టీ ఆకు తయారీ జరుగుతుందిట. మొదట ఆకుపచ్చని ఆకుల ఆక్సిడేషన్ ఆపివేసి గ్రీన్ టీ ఆకును, తర్వాత పార్షియల్ ఆక్సిడేషన్ ప్రక్రియతో బ్లాక్ టీ ఆకును, చివరగా టీ ఆకులను పూర్తిగా ఆక్సిడైజ్ చేసి Orthodox, CTC (crush-tear-and curl) అనే రెండు రకాల టీ ఆకులను తయారు చేస్తారుట. ఈ రకంగా అంచలంచలుగా ఎన్నో వ్యయప్రయాసల తర్వాత తయారైన టీ ఆకు, టీ పొడి "టీ టేస్టర్" దగ్గరకు వెళ్తుంది. అచ్చం ఒక లేబ్ టెక్నీషియన్ లాగ ప్రతి కంపెనీ లోని టీ టేస్టర్స్ తన వద్దకు వచ్చిన టీని పరీక్షించి, దాని నాణ్యతను సర్టిఫై చేస్తారు. ఈ పనికి గాని టీ టేస్టర్ కి ఐదేళ్ల అనుభవం అవసరమై ఉంటుందిట. నాణ్యత గల టీ గా ఎన్నికకాబడ్డ టీ   కి చివరగా ఆక్షన్స్ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఎన్నో ప్రైవేటు సంస్థల మధ్యన జె.థామస్ అనే కంపెని మాత్రం, ఏడాదికి కొన్ని మిలియన్ కిలోగ్రాముల టీ ఆక్షనింగ్ చేస్తూ 150ఏళ్ళగా ప్రముఖ టీ ఆక్షన్ సెంటర్ గా ప్రసిధ్ధి చెంది ఉందిట.


 చివరి అధ్యాయంలో రకరకాల దేశాల్లో టీ ని ఎలా తయారుచేస్తారు, ఎలా ఆస్వాదిస్తారు, టీ ఎన్ని రకాలుగా + ఎలా వాడితే శరీర అందానికీ, శరీరం రిలాక్సవడానికి ఉపయోగపడుతుంది అనే విషయాలు ఉన్నాయి. ఈ అధ్యాయం లో ఇచ్చిన రకరకాల టీలు.. వైట్ టీ, గ్రీన్ టీ, యెల్లో టీ, ఆర్గానిక్ టీ, ఫ్లేవర్డ్ టీ, సెంటెడ్ టి, హెర్బల్ టీ, ఇంస్టెంట్ టీ మొదలైనవాటి రంగులు, అవి ఉంచిన టీ జార్స్, కప్స్, కలర్ ఫుల్ సీల్డ్ పేక్స్ కళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. చిట్టచివరగా రకరకాల టీ ల తయారీలు, కొన్ని రకాల టీలతో చేసుకునే రెసిపీలు ఉన్నాయి. వాటి తాలూకూ రంగురంగుల ఫోటోలు కూడా నయనానందకరంగా ఉన్నాయి.

ఈ పుస్తకం ధర రీత్యా కొనుక్కోమని చెప్పను కానీ ఎక్కడైనా లైబ్రరీలోనో, ఓ హోటల్లోనో లభ్యమైతే తప్పకుండా ఓసారి పేజీలు తిరగేసి ఆనందించతగ్గ పుస్తకం అని మాత్రం చెప్తాను.
http://www.accdistribution.com/us/store/pv/9789381523919/chai/rekha-sarin-rajan-kapoor


చాయ్ బుక్ కబుర్లు అయిపోయాయి. ఇదిగోండి ఓ కప్పు టీ తాగండి..:)




Note: All the photos in this post are sourced from royalty free Google images. No authenticity claimed. No legal or any claims tenable.

Wednesday, March 25, 2015

విలువైన సత్యాలను సరదాగా చెప్పిన సినిమా!


కొన్ని నెలల క్రితం ఓ రోజు ఎఫ్.ఎం వింటూంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" షూటింగ్ కబుర్లు చెప్పారొక ఆర్.జె. హిమాలయాల్లో చలిలో ఎన్ని ఇబ్బందులు పడుతూ షూటింగ్ కొనసాగిస్తున్నారో.. ఆ విశేషాల గురించి నానీ ఏం మాట్లాడాడు అవన్నీ చెప్పారు. అసలు మామూలుగానే నాకు హిమాలయాలు, అక్కడ యోగులూ, రహస్యాలూ లాంటి కబుర్లంటే మహా ఇష్టం. సో, హిమాలయాల్లో అంత ఎత్తున, అంత చలిలో ఏం షూటింగబ్బా...? ఏం కథా? అని కుతూహలం పెరిగింది. అప్పట్నుండీ ఈ సినిమా తాలూకూ కబుర్లు, అప్డేట్స్ ఫాలో అవడం మొదలెట్టాను. 

తర్వాత ఓ రోజు "ఓ కలా" అన్న పాట విని ఎందులోదీ అని వెతికితే ""ఎవడే సుబ్రహ్మణ్యం" లోదని తెలిసింది. ప్లే లిస్ట్లో "చల్ల గాలి" ఇళయరాజా పాట అని చూసి, విన్నాకా అది నాకు బాగా ఇష్టమైన "Thendral Vanthu"  సాంగ్ ట్యూన్ అని తెలిసి సిన్మా చూడాలనే ఇంట్రస్ట్ పెరిగింది. ఉగాది రోజనుకుంటా ఓ ఎఫ్.ఎంస్ లో నానీ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. మొన్న రిలీజ్ రోజున తను ఆఫీస్ నుండి వచ్చాకా అప్పటికప్పుడు అనుకుని, టికెట్లు దొరుకుతాయో లేదో అనుకుంటూ సెకెండ్ షోకి వెళ్ళాం. అసలా అర్థరాత్రే పోస్ట్ రాయాలనిపించింది.. రాయలేకపోయా. నిన్న కూడా కుదర్లేదు. సినీ ప్రేమికులు తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా కాబట్టి ఇవాళ ఎలాగైనా బ్లాగ్ పోశ్ట్ రాయలని కూచున్నా..! 

ఎక్కువేమీ రాయను... నచ్చినవేమిటో చెప్తాను.. 
* ముఖ్యంగా పెద్ద పెద్ద సీరియస్ వేదాంత సూత్రాల్ని చిన్న చిన్న ఉదాహరణలతో తేలికగా చెప్పడం బాగా నచ్చింది నాకు. అయితే ఇన్-డెప్త్ కి వెళ్ళకుండా వాటిని మరీ తేలికగా చూపెట్టేసారేమో అన్న డౌటానుమానం కూడా కలిగింది. మరీ సీరియస్ గా చూపెట్టినా ప్రేక్షకులు చూడకపోవచ్చు..! 

* రిషి పాత్ర చాలా చాలా నచ్చింది. "కళ్ళజోడు పెట్టుకుంటే ఎక్కువ మార్కులు పడతాయని.." అని నానీ అన్నట్లు, ఆ గడ్డం రిషి పాత్రకి గంభీరతనిచ్చింది. ఆ కేరెక్టర్ ని చంపేయడం అంత జస్టిఫైయీంగ్ అనిపించలేదు. ఆ ప్రయాణంలో సుబ్బులో మార్పు ఎలానూ వస్తుంది కాబట్టి ముగ్గురూ కలిసి అక్కడికి వెళ్ళినట్లు చూపెట్టచ్చు కదా.. కానీ మళ్ళి ఏమనిపించిందంటే బహుశా మనిషిని కోల్పోతే గానీ స్నేహం విలువనీ, మనిషి విలువనీ గుర్తించనంత అయోమయపు లోకం తయారైంది అని చెప్పడం డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు! సుబ్బుతో దెబ్బలాడి వెళ్పోయే ముందు "ఇదే ప్రపంచం అయితే ఈ ప్రపంచం నాకక్కర్లేదు.." అనే రిషి డైలాగ్ నచ్చింది నాకు. 

* ప్రస్తుతం స్నేహాన్ని గురించిన నా డెఫినిషన్స్ మారిపోయినా కథలో స్నేహానికి ఇచ్చిన ప్రాముఖ్యత నచ్చింది. ఈమధ్యన Red Fmలో వస్తున్న 'భాగవత ప్రవచనం'లో కుచేలుడి గురించి చెప్తూ, స్నేహం అంటే ఎలా ఉండాలో చాగంటివారు చెప్పిన మాటలు గుర్తువచ్చాయి నాకు సినిమాలో రిషి ని చూస్తూంటే. 

* ఓల్డ్ ఫ్రెండ్ గా షావుకారు జానకి, సీతాకోకచిలుక తోటలో ప్రతాప్ పోతన్, రామయ్య గా కృష్ణంరాజు, సుబ్బు బాస్ గా నాజర్.. ఇలా చిన్నవైనా కీలకమైన పాత్రల్లో సీనియర్ నటుల్ని పెట్టడం బావుంది. కృష్ణంరాజు పాత్ర, ఆయన చెప్పిన ప్రతీ డైలాగ్ బావుంది. సూపర్ కూల్ కేరెక్టర్ రామయ్యది! 

* జీవితపు పరుగుపందాల్లో పడి జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో సులువుగా చెప్పిన విధానం నచ్చింది. సుబ్బు పాత్ర అచ్చం "జిందగీ నా మిలేగీ దొబారా" లో అర్జున్ పాత్రలాంటిది. స్నేహితులతో చేసే అడ్వంచర్ ట్రిప్ లో గ్రాడ్యుయల్ గా అర్జున్ లో ఎలాంటి మార్పులు వస్తాయో..అలానే సుబ్బులో కూడా నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది. అదే హిందీ సినిమాలో నటాషా - కబీర్ ల రిలేషన్ లాంటిదే బాస్ కూతురితో సుబ్బు రిలేషన్ కూడా. రియలైజేషన్ వచ్చాకా కబీర్ పెళ్ళి బ్రేక్ చేసుకున్నట్లే సుబ్బు కూడా తనామెకి కరెక్ట్ కాదని చెప్పేస్తాడు. 

* రాధన్ సంగీతం చాలా బాగుంది. Promising!

* బాల నటి నుండి హీరోయిన్ గా ఎదిగిన మాళవిక నాయర్ కూడా బొద్దుగా, ముద్దుగా బావుంది. అప్పుడప్పుడు నిత్యా మీనన్ లా, అప్పుడప్పుడు శోభన లాగ ఉందీ అమ్మాయి. "జబ్ వియ్ మెట్" లో కరీనా పాత్రలాగ తనకు తోచింది, నచ్చింది చెయ్యడం ఈ అమ్మాయి అలవాటు. ఆ సినిమా చివర్లో షాహిద్ కపూర్ చెప్పిన ఒక డైలాగ్ లాంటిదే సుబ్బూ కూడా చెప్తాడు.. "నువ్వెంత కూలో నీకు తెలీదు.." అంటూ. 

* మరి హీరో గారి గురించి కూడా చెప్పాలి కదా.. నానీ ఒక మామూలు పక్కింటి అబ్బాయి లాగ ఉంటాడు కాబట్టే అంతమంది అభిమానుల్ని పోందగలిగాడన్నది నా అబిప్రాయం. ఈ పాత్ర అతని సహజ ప్రవృత్తికి బాగా సరిపోయినట్లు నాకనిపించింది. కామెడీ పడించడం చాలామంది గొప్ప హీరోలకు కూడా సరిగ్గా రానిది. ప్రేక్షకులను సహజంగా, హాయిగా నవ్వించగలగడం వచ్చిందంటే గొప్ప ఏక్టర్ అయిపోయినట్లే! ఇంకా మంచి కథలు, సినిమాలు వచ్చి ఇతగాడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. 

*ఆ మంచుకొండలు, గుట్టలు, జలపాతాలు, నదులు, చెట్లు, పచ్చదనం, టోటల్ గా సెకెండ్ హాఫ్ లో లొకేషన్స్ చాలా బాగున్నాయి. అర్జెంట్ గా అక్కడికి వెళ్పోవాలనిపించేలా.

 

మన తెలుగు తెరకి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా  ఇలాంటి  ఎన్నో మంచి  చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాను. హిమాలయాల్లో షూటింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు కాబట్టి అక్కడి పార్ట్ ఆఫ్ సినిమాలో కనబడ్డ లోటుపాట్లను లిస్ట్ కట్టడం బావుండదేమో. ఏదేమైనా "ఎవడే సుబ్రహ్మణ్యం" అందరూ చూడాల్సిన ఒక సరదా అయిన మంచి విలువైన సినిమా! అదన్నమాట..:-) 

చివరిగా హరిణి పాట వినేస్తారా మరి.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం..




Friday, March 6, 2015

అక్షరాలు..





అక్షరాలే స్నేహితులు
అక్షరాలే శత్రువులు

ఙ్ఞాపకాలు తియ్యవైనా
ఙ్ఞాపకాలు బరువైనా

అభిమానాల్ని నిలిపినా
లోకువను ఆపాదించినా

అవమానాల్ని రాజేసినా
విరక్తిని మిగిల్చినా

అక్షరాలే కారణభూతాలు
అక్షరాలే దృష్టాంతాలు 

Thursday, March 5, 2015

Millet Fest - 2015


వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు గృహవిఙ్ఞాన విభాగం.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రదర్శన ఈ ఏడు కూడా క్రిందటి నెలాఖరులో జరిగింది. "Millet Fest 2015" ప్రకటన ఆఖరిరోజున అనుకోకుండా పేపర్లో చూసి అప్పటికప్పుడు బయలుదేరాం.  ఆ రోజు పేపర్ చూడకపోతే అదీ మిస్సయిపోదును. ఇది నాలుగవ ప్రదర్శనట. 2013 Fest కబుర్లు Millet Fest - 2013 లో రాసాను. నిరుడు టపా రాయలేదు కానీ వెళ్ళాను. ఈమధ్యన ఒంట్లో బాలేక ప్రతి ఏడూ వెళ్ళే హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ , మరికొన్ని పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా మిస్సయిపోయాను..:(  ఈ Millet Fest మాత్రం ఎలాగైనా చూడాలని బయలుదేరాను. ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి +  చిరుధాన్యాలతో చేయదగిన కొత్త రెసిపీస్ తెలుస్తాయని నా ఆశ. నా అంచనా తప్పలేదు. మరిన్ని కొత్త విషయాలు తెలిసాయి. 

ఈ ప్రదర్శన వివరాలు తెలిపే వెబ్సైట్ కూడా ఉందిట.. మళ్ళీ ఏడు ఎవరైనా ఈ ప్రదర్శనకు వెళ్ళాలనుకుంటే ఈ వెబ్సైట్ చూస్తూండండి.. ప్రదర్శన తారీఖులు తెలుస్తాయి. 



ఈసారి చివరిరోజు ఆదివారం అవడంతో సందర్శకులు బాగా ఉన్నారు. కొనుగోళ్ళు చూస్తూంటే చిరుధాన్యాల పట్ల ఆసక్తి కూడా బాగా పెరిగినట్లు అనిపించింది. ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా! ఇదీ ఒకందుకు మంచిదే. ఏ పదార్థాలు ఎక్కువ తినాలో, ఏది మానేయాలో తెలుసుకోవడం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలో తెలియడమే. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది 'ఆరోగ్య శాఖ' మరియు 'వ్యవసాయ విశ్వవిద్యాలయం' వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శన కాబట్టి ఇందులో పెట్టే వస్తువులు రిలయబుల్ మరియు వారు చెప్పే విషయాలు కూడా నమ్మదగినవీనూ!

మిల్లెట్స్ తో చేసిన వంటలు ఉంచిన ఫుడ్ కోర్ట్ లో కూడా బాగా జనాలు ఉన్నారు. అన్ని పదార్థాలూ బాగా సేల్ అవడం చూసి సంతోషం కలిగింది. వాటిల్లో నేనిదైవరకూ బ్లాగ్ లో రాసిన ఒక హెల్త్ డ్రింక్ "అమృతాహార్" పేరుతో పెట్టారు. ఇంకా రాగి జావ , తేనె కలిపిన సబ్జా గింజల నీరు , సజ్జ ఉప్మా, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ఫ్రూట్ పంచ్, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్.. మొదలైన ఎన్నో రకాల వంటకాలు అమ్మారు. ఇవన్నీ చూసి నాకు కొత్త రెసిపీలకి బోలెడు ఐడియాలు వచ్చాయనేసరికీ పాపం అయ్యగారి ఫేస్ లో కలర్స్ మారాయి :-)


స్టాల్స్ లో ఒకచోట జొన్న రొట్టెలు తయారుచేసే మషీన్ ఒకటి పెట్టారు. అంటే అది చిన్న పరిశ్రమకు ఉపయోగపడేలాంటి పెద్ద పరికరం. భలేగా జొన్న రోటీలు వత్తేస్తోంది ఆ మషీన్.





పిల్లలు సరదాగా స్పూన్ కూడా తినేసేలాగ బియ్యం, జొన్నలు, గోధుమలు, వాము, జీలకర్ర, ఉప్పు మొదలైన వాటితో చేసిన ఈటబుల్ స్పూన్స్ ఒకచోట పెట్టారు. అవి బాగా అమ్ముడౌతున్నాయి. 



జొన్న, రాగి బిస్కెట్స్, లడ్డూలు మురుకులు, టేస్టీ బైట్స్ కాక ఒక చోట మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ తో చేసిన లడ్డూస్ అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు.


ఇంకా.. విజయవాడ కు చెందిన ఒక స్టాల్ నన్నాకర్షించింది. (మా బెజవాడ కదా :)) ఆ వివరాలు..



అన్ని చిరుధాన్యాల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ కొర్రల్లో(foxtail millet) ఉంటుందని తెలిసాకా ఈమధ్యన నేను కొర్రలు, కొర్ర బియ్యం కూడా వాడకం మొదలుపెట్టాను. వీటిల్లో ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు రెండు రకాలు ఉంటాయిట. ఒక స్టాల్ లో దాదాపు కొర్ర బియ్యం లాగానే ఉన్న వరిగలు(proso millet) అమ్ముతూంటే అదో పేకెట్ కొన్నాను. ఏ ఉప్మా ప్రయోగమో చేయచ్చని.







ఒక స్టాల్ లో అన్నంలో కులుపుకునే ఉసిరి పొడి, కాకర పొడి, ఒక హెర్బల్ టీ పౌడర్ కొన్నాను. మంజిష్ఠ, ఏలకులు, జాజికాయ, శొంఠి మొదలైన వాటితో తయారుచేసిన ఈ టీ పౌడర్ కాస్తంత మామూలుగా పెట్టుకునే టీలో కలుపుకోవచ్చు లేదా విడిగా ఈ పౌడర్ తోనే టీ పెట్టుకోవచ్చుట. అధిక ఫైబర్ మరియు Omega 3 fatty acids ఎక్కువగా ఉండే  Flax seeds(అవిసెలు) ఉపయోగాలు తెలిసాకా కొన్ని నెలల క్రితం ఫ్లాక్స్ సీడ్స్ కొన్నా కానీ వాటితో ఏమీ చెయ్యలేదు. కర్వేపాకు పొడిలాగ చేయచ్చు అని ఎక్కడో చదివాను. ఒక చోట ఆ పొడి అమ్ముతుంటే అది కొన్నాను కానీ తర్వాత మా అన్నయ్యతో ఈ సంగతులన్నీ చెప్తుంటే మరో స్టాల్ లో ఉన్న ఒక రీసర్చ్ స్టూడెంట్ విని, మమ్మల్ని పిలిచి, "సారీ ఫర్ ఓవర్ హియరింగ్..అన్చెప్పి, ఈ పొడులూ అవీ వేస్ట్.. దానివల్ల అందులోని పోషకాలన్నీ పోతాయి. ఫ్లాక్స్ సీడ్స్ లోని పోషకాలు డైరెక్ట్ గా శరీరానికి అందాలంటే ఒక్కసారి జస్ట్ డ్రైగా టాస్(toss) చేసి అలానే తినేసేయండి అదే బెస్ట్ అని  చెప్పారు. నిజానికి ఫ్లాక్స్ సీడ్స్ ఉత్తినే తిన్నా బానే ఉంటాయి.


మరో చోట పచ్చి అరటికాయ పొడి అమ్ముతుంటే కొన్నా. ఏక్చువల్ గా అది ఒకటే పేకెట్ సాంపిల్ గా పెట్టారుట. ఆ స్టాల్లో ఉన్న ఒక పరిశోధకుడు(కొంచెం పెద్దాయనే) చెప్పిన విషయం ఏమిటంటే అరటి పండులో ఉన్న షుగర్ అరటి కాయలో ఉండదుట. చాలా పరిశోధనల తరువాత ఇటీవలే అరటికాయను డయాబెటిక్ పేషంట్స్ కూడా తినచ్చని నిర్ధారించారుట. పచ్చి అరటికాయలో ఉండే స్టార్చ్ మంచిదిట. పచ్చి అరటి కాయ నుంచి చేసిన ఈ పొడిని కూరల్లో, సూప్స్ లో, చపాతీ పిండిలో కలుపుకోవచ్చుట. ఇంకా అది ఏమేమి చేస్తుందో.. అలా బోలెడు ఉపయోగాలు చెప్పాకా మాకు కావాలని అడిగితే ఉన్న ఆ ఒక్క పేకెట్ అమ్మేసారు ఆయన. మార్కెట్లోకి వస్తుందన్నారు త్వరలో. ఎప్పుడు వస్తుందో మరి.

ఇదివరకూ కొనని రెండు రెసిపీ బుక్స్, ఎరువు ఎలా తయారు చేసుకోవాలో,  గార్డెన్ కేర్ గురించిన పుస్తకమూ కొన్నాను.





ఇంకా ఊళ్ళో ఉన్న రెండు మిలెట్ ఫుడ్ కోర్ట్స్ గురించి తెలిసింది. ఎప్పుడన్నా వెళ్లచ్చు..




కేవలం సైంధవ లవణం(rock salt) అమ్ముతున్న ఒక స్టాల్ ఉంది. అందులో ప్రదర్శనకు ఉంచిన పెద్ద ఉప్పు గడ్డ భలే ఉంది. ఈ ఉప్పు ఉపయోగాలు క్రింద కాగితంలో...





ఈ విధంగా సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందుకుని సజ్జల ఉప్మా, జొన్న మంచూరియా, జొన్న నూడుల్స్, జొన్న సలాడ్ లు తిని, అమృతాహార్ జావ తాగి మేమూ, అన్నయ్య ఇళ్ళదారి పట్టాం.


ప్రదర్శన తాలూకూ మరిన్ని ఫోటోలు:
http://lookingwiththeheart.blogspot.in/2015/03/millet-fest-2015.html

Sunday, March 1, 2015

తులసి మొక్కలా... 'Dum Laga Ke Haisha'


నిన్న రాత్రి చూసిన ఈ సినిమా పూర్తయ్యేసరికీ విషయం తక్కువ  హంగామా ఎక్కువ అనిపించేట్లు ఉంటున్న ఈ కాలపు సినిమాల మధ్యన ఈ చిత్రం నిజంగా "...వనంలో తులసి మొక్క" అనిపించింది. ఇటువంటి మణిపూసని మనకందించిన దర్శకుడు శరత్ కతారియాను అభినందించి తీరాలి. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ నుండి రావడం గొప్ప ఆశ్చర్యం! ఆ ప్రొడక్షన్ హౌస్ అదృష్టం.  చిత్రాన్ని గురించి ఇంకేమైనా చెప్పేముందు ఈ పాట వినండి(చూడండి)..




ఊ..చూసేసారా?! అమేజింగ్ కదా అసలు. పాట మొదలవగానే అసలు ఏదో లోకంలోకి వెళ్పోయాను నేనైతే. లుటేరా లో "సవార్ లూ.." పాడిన అమ్మాయి మోనాలీ ఠాకుర్ ఈ పాట పాడింది. ఆ పాట కన్నా ఈ పాటలో క్లాసికల్ బేస్ ఉన్న మోనాలీ ట్రైన్డ్ వాయిస్ బాగా తెలిసింది. ట్యూన్ అలాంటిది మరి. చాలా రోజులకి అనూ మాలిక్ కంపోజ్ చేసారు. ఇదే పాటకు మేల్ వర్షన్ Papon అనే పేరుతో ప్రసిద్ధుడైన గాయకుడు అంగరాగ్ మహంతా పాడారు. మనసుని సున్నితంగా తట్టే ఈ పాటకు సాహిత్యాన్ని వరుణ్ గ్రోవర్ అందించారు. నా దృష్టిలో "ఎక్స్ట్రార్డినరీ" పదం ఒక్కటే ఈ పాటకు, అది తయారవడానికి కారణమైనవారందరికీ సమంగా సరిపోతుంది. ప్రముఖ గాయకుడు కుమార్ సానూ కూడా చాలారోజులకి ఒక పాట పాడి, సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

కుమార్ సానూ పాట:





ఇంతకీ ఇదెలాంటి సినిమా అంటే ఎలా చెప్పాలి...
తావి లేని కనకాంబరాల మధ్యన గుబాళించే మల్లె మొగ్గలా..
చుక్కల మధ్య మెరిసిపోయే చందమామలా..
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందమైన పువ్వులా..
ఉంది సినిమా. డెభ్భైలు, ఎనభైల్లో బాలీవుడ్ లో తయారైన మధ్యతరగతి కథలు, తళుకుబెళుకులు లేని అతి మామూలు సదాసీదా కామన్ మేన్ జీవిత కథలతో తయారైన చిత్రాలు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి.  సినిమాల్లో, తద్వారా మనుషుల్లో పెరిగిపోయిన అసహజత్వాలనీ
, ఆర్భాటాలనీ పక్కన పెట్టి ఇలాంటి డౌన్ టూ ఎర్త్ సినిమాను తీయాలనే ఆలోచనకు గొప్ప ధైర్యం కావాలి. ఇమేజ్ నూ, పాపులారిటీను పక్కన పెట్టి తండితో ప్రాక్టికల్ గా చెప్పు దెబ్బలు తినే ఒక నిరాశాపరుడైన, పిరికి అబ్బాయి పాత్రను ఒప్పుకున్నందుకు హీరో ఆయుష్మాన్ ఖురానా మరింత నచ్చేసాడు. "విక్కీ డోనర్" లో కన్నా ఎక్కువగా! (ఒక నటుడిగా మాత్రమే :))

చిత్రకథ తొంభైల కాలం లాంటిది. ఆ కాలం నాటి హిట్ హిందీ చిత్ర గీతాలు తెలిసిన వాళ్ళు, 'శాఖ ట్రైనింగ్' గురించి తెలిసినవాళ్ళూ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యగలరు. బాగా కనక్ట్  అవుతారు. గాయకుడు "కుమార్ సానూ" వీరాభిమాని హీరో. పదవ తరగతి రెండుసార్లు ఫెయిలయి, హరిద్వార్ లో తండ్రి నడిపే ఒక కేసెట్ రికార్డింగ్ సెంటర్ లో పాటలు రికార్డ్ చేసే పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తండ్రి బలవంతం వల్ల బీఎడ్ చదివి టీచరవబోతున్న అమ్మాయిని ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటాడు. గుడిలో జరిగిన పెళ్ళి చూఫుల్లోనే కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్న పెళ్ళికూతురు నచ్చదతనికి. ఒక అమ్మాయి బీయిడీ చదువుకుంది.. 'టీచర్ అవ్వాలన్నది ఆమె చిన్ననాటి కల' అన్న సంగతి ఇంకా నచ్చదతనికి. మరి తను 10th ఫెయిల్ కదా! చాలా అయిష్టంగానే ఒక సామూహిక వివాహవేదిక మీద సంధ్య వర్మ(
భూమీ పెడ్నేకర్) ను పెళ్ళాడతాడు ప్రేమ్ ప్రకాష్ తివారీ(ఆయుష్మాన్ ఖురానా). అదిమొదలు తన అయిష్టాన్నీ ప్రకటించడానికి అతగాడు, భార్యగా తన స్థానాన్ని కాపాడుకోవాలని సంధ్య చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదీ కలిసిరాక ఒకానొక అవమానకరమైన సందర్భంలో అభిమానం దెబ్బతిని అత్తవారిల్లు విడిచి వెళ్పోయి, తర్వాత విడాకుల నోటీసు పంపిస్తుంది సంధ్య. విడాకుల మంజూరుకు ముందు ఓ ఆరునెలలు కలిసి ఉండమని ఆ జంటను కోర్టు ఆదేశిస్తుంది. ఈ ఆరు నెలల్లో ఏమౌతుంది? ఉత్తర దక్షిణ ధృవాల్లా మారిపోయిన ఆ భార్యాభర్తలు కలుస్తారా? అన్నది మిగిలిన చిత్ర కథ.




ఇక చెప్పుకోవాల్సింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్ గురించి. కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉందీ అమ్మాయి. మొదటి సినిమా అయినా నటనలో పి.హెచ్.డి ఇచ్చేయచ్చు. నటిగా మారే ముందు కాస్టింగ్ డైరెక్టర్ ట  అమ్మాయి! ఆ కాన్ఫిడేన్స్, ముఖ కవళికలు, భావ ప్రకటన అన్నీ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో అసలు. కోపంలో ఉన్నప్పుడు హీరో అంటుంటే తప్ప లావు అనే పాయింటే గుర్తుకురాలేదు. అంత అందంగా నటించిందా అమ్మాయి. యాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో మామూలుగా కనబడే చిట్టి పొట్టి దుస్తుల గ్లామరస్ అమ్మాయిలకు విభిన్నంగా!


ఈ ఇద్దరి తర్వాత హీరో తండ్రి పాత్రధారి సంజయ్ మిశ్రా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు " jolly LLB" లో హవాల్దార్ పాత్రలో అలరించిన ఈ నటుడి ప్రతిభకు తగ్గ పాత్రలు ఇంతవరకూ ఎక్కువ దక్కలేదనే చెప్పాలి. హీరో ఇంట్లో ఉండే అతని మేనత్త పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ఒక ఉదయాన ఆవిడ మరిది నుండి ఫోన్ వచ్చే సన్నివేశం చాలా టచ్చింగ్ గా ఉంది. హీరోయిన్ తల్లిగా వేసినావిడ చిన్నప్పుడు దూరదర్శన్లో ఫేమస్ అయిన "బునియాద్" సీరియల్లో ఉన్నారని గుర్తు. ఇక పదవ తరగతి చదివే సంధ్య తమ్ముడు చెప్పే డైలాగ్స్ భలే నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్స్ ఫ్యామిలీస్ రెండింటిలో అందరు కుటుంభ సభ్యుల మధ్యన అన్యోన్యత, దగ్గరతనం బాగా చూపించారు. ఫ్యామిలీ కోర్ట్ లో కుటుంబసభ్యులందరి మధ్యా వాగ్వివాదాలయ్యే సీన్ కూడా భలే నవ్వు తెప్పిస్తుంది. కోర్టులో కలవగానే వియ్యపురాళ్ళిద్దరూ కాగలించుకుని దు:ఖపడే సీన్ కదిలిస్తుంది.


 తొంభైల్లో పాపులర్ పాటల ద్వారా భార్యాభర్తలు తమ నిరసనలు వ్యక్తం చేసుకునే సీన్ సినిమాకే హైలైట్. హాల్లో అంతా పొట్ట చక్కలయ్యేట్టు నవ్వులే నవ్వులు. ఆ పాటలు తెలిసినవాళ్ళు ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సాంగ్స్ అన్నీ కూడా. ప్రేమ్ గదిలో చిందర వందరగా పడిఉన్న కేసెట్ల్స్ ద్వారా అతడి జీవితాన్ని, తాను వచ్చాకా అవి సర్దిన సంధ్య మనస్తత్వాన్నీ సింబాలిక్ గా బాగా చూపెట్టారు. చివర్లో భార్యను ఎత్తుకు పరిగెత్తే పోటీ కూడా భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక అనిపించింది. ఈ పోటీలో బరువుని ఎత్తడం అనే విషయం కన్నా ఇద్దరి మధ్యన ఉండే సంయమనమే విజయాన్ని ఇస్తుంది. పోటీ అయిపోయాకా ఆమెని దింపకుండా ఇంటిదాకా తీసుకుపోయే సీన్ నాకు బాగా నచ్చింది.



ఇంకా.. రెండు మూడు సన్నివేశాల్లో భార్యాభర్తలు లో గొంతుకల్లో గుసగుసగా మాట్లాడుకునే డైలాగ్స్,
వాళ్ళ మధ్యన నిశ్శబ్దం,
వాళ్ల కన్నీళ్ళూ,
వారి వారి స్థానాల్లో వారు కరక్టేననిపించే సందర్భాలూ,
రిక్షలో ప్రయాణాలు,
హరిద్వార్,
ఆ పాత పట్టణపు వాతావరణం,
చిత్ర సన్నివేశాల వెనుక మౌనంగా ప్రవహిస్తూ కనబడే పవిత్ర గంగానది,
ఓ పాటలో కనబడే లక్ష్మణ్ ఝూలా,
వేలితోనో పెన్ను తోనో పాడయిన కేసెట్ లోకి టేప్ చుట్టే సన్నివేశం,
ఇవన్నీ కూడా మనల్ని రకరకాల పాత ఙ్ఞాపకాల్లోకి తీశుకువెళ్ళి సినిమాతో బాగా కనక్ట్ అయ్యేలా చేస్తాయి.


మరో విశేషం ఇటాలియన్ కంపోజర్ Andrea_Guerra అందించిన అద్భుతమైన నేపధ్య సంగీతం.  నటీనటుల భావావేశాల ప్రవాహంలో మనల్నీ కొట్టుకుపోయేలా చేస్తుందీ సంగీతం.

చివరిగా ఏం చెప్పనూ... విభిన్నతకు నాంది పలికే ఓ మంచి నిజాయితీ నిండిన ప్రయత్నమీ చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇలాంటి అతి మామూలు సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే మనం ఇలాంటి సినిమాలని ఆదరించాలి. చివరలో డ్యూయెట్ అనవసరం అనిపించింది. అంత చూసే ఓపిక మన జనాలకి ఉండదు కదా! షూట్ చేసేసిన పాటను మధ్యలో పెట్టే అవకాశం లేక చివరలో ఇరికించి ఉంటారనుకున్నాం
.

చిత్రంలో నాకు బాగా నచ్చిన పాట "Moh Moh Ke Dhage" మేల్ వర్షన్తో post పూర్తి చేస్తాను. 


***    ***

Friday, February 20, 2015

హృదయ తంతృల్ని మీటిన పాట..



నిశ్శబ్దాన్ని ప్రేమిస్తూ, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రశాంత ఏకాంత జీవితం గడిపే ప్రయత్నంలో ఉన్న నన్ను అక్షరాల వెంట పరుగులు పెట్టించడానికి వినపడిందో పాట ఇవాళ..! ఇక మౌనాన్ని వీడక తప్పలేదు. హృదయ తంతృలను కదిపే పాట విన్నప్పుడు, ఆ అనుభూతిని పంచుకోకుంటే మన ఆనందం కూడా సంపూర్ణమవ్వదు కదా..! 

సాయంత్రపు నడకలో రోజూలాగే రేడియో(102.8) వింటూ నడుస్తుంటే "స్వానంద్ కిర్కిరే" ఇంటర్వ్యూ చివరి భాగం మొదలైంది. ఆమధ్యెప్పుడో మొదటి భాగం విన్నాను. తరవాత అదే రోజు విన్నానో మర్చిపోయాను. రెండో భాగం మిస్సయ్యాను. మళ్ళీ ఇన్నాళ్ళకి అదృష్టవశాత్తూ మూడవ, చివరి భాగం వినడం అయ్యిందీవాళ. కార్యక్రమం మధ్యలో ఓ పాట వేసారు. అదే నా మనసుని కదిపింది..


గీత రచయిత, సంభాషణా రచయిత, గాయకుడు, నటుడు అయిన ఈ బహుముఖ ప్రఙ్ఞాశాలి మాటలు కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి. "లుటేరా" చిత్రం కోసం ఈయన పాడిన "మోంటా రే" పాట గురించి ఇదివరకూ ’చలువ పందిరి’ లో రాసాను. ముంబై ఆకాశవాణి వారి మొదటి ఇంటర్వ్యూ లో తన సాహితీ ప్రస్థానం వివరాలు , ఇష్టమైన పాటలు గురించి చెప్పారు. ఇవాళేమో కొన్ని పాటలు ఎలా రాసారు, వాటి వెనుక కథలేమిటో చెప్పారు. నిజానికి ఈ సున్నితమైన భావాల్ని, ప్రేమల్ని, స్నేహాభిమానాలనీ, ఆప్యాయతలూ గట్రాలన్నింటిపై  నమ్మకమే పోయింది. (ఊ.. అచ్చంగా నేనే ఈ మాట అంటున్నది!!) కానీ ఎందుకో ఇవాళ ఈ గీత రచయిత మాటలు వింటుంటే ఇంకా ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి భావాలు మిగిలున్నాయేమో అన్న అనుమానం, ఆశ కలిగాయి. ఎందుకంటే ఒక పాట రాయాలంటే ఇలాంటి సున్నితమైన భావాలను నమ్మాలి.. ఆ భావంలో మమేకమవ్వాలి.. అప్పుడే లలితమైన పాట పుడుతుంది. ఈయన ఇలాంటి పాటలు ఇంకా రాయగలుగుతున్నారంటే మరి సున్నితత్వం ఇంకా బ్రతికే ఉందని నమ్మాలేమో..

ఇంతకీ ఈ పాట నాకు మాత్రమే కొత్తదని, ప్రపంచానికి పాతదేనని ఇంటికొచ్చి నెట్లో వెతికాక తెలిసింది. సినిమా పాట కాదు "సత్యమేవ జయతే" పేరిట టివీలో ప్రసారమైన కార్యక్రమం తాలూకూ పాట అదని. స్వయంగా రచయితే పాడారు. సో.. పాట పాతదే. మూడేళ్ళుగా కేబుల్ కనక్షన్ కి దూరంగా ఉన్నందువల్ల నాకు తెలీదు. తెలిసిన వాళ్ళూ మరోసారి, లేదా ఒకవేళ నాలా ఎవరన్నా తెలియనివాళ్ళు ఉంటే మొదటిసారి,  ఈ హృద్యమైన పాటను ఆస్వాదించండి..


పాటలో "हम नॆ सॊचा नही
तू जॊ उड जायॆगी
यॆ जमी तॆरॆ बिन
सूनी रेह जायॆगी
किसकॆ दुम पॆ सजॆगी मॆरा अंगना.."  అన్న వాక్యాలు వింటుంటే మన పాలగుమ్మి వారు రాసిన "అమ్మ దొంగా" పాటలో 
"ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా.. గూడు నిదురపోవునా.." లైన్స్ గుర్తుకు వచ్చాయి..

Wednesday, January 14, 2015

ఆ పరిమళాలు..




ఊళ్ళో ఏ బజారుకో, గుడికో, పేరంటాలకో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే గుప్పుమని వచ్చేది నైట్ క్వీన్ పువ్వుల పరిమళం.. గభాలున గుండెల నిండా గాలి పీల్చుకుని ఆ మత్తులో తేలాలనే ఆత్రుత తప్ప మరేమీ తోచేది కాదు కొద్ది క్షణాల పాటు. అలా ఆ సుగంధాలనాఘ్రాణిస్తూ అక్కడే గేట్ దగ్గర కాసేపు నిల్చుండిపోయేదాన్ని.. ఒక్కసారి..రెండుసార్లూ కాదు.. మా కాకినాడ ఇంటికెళ్ళినప్పుడల్లా.. ఊరెళ్ళిన ప్రతిమాటూ.. రాత్రిపూట బయటకు వెళ్ళిన ప్రతిసారీ! 

చిన్నప్పుడొకసారి మామ్మయ్యనడిగా "గేట్ దగ్గర కొత్తగా వస్తున్న మంచి వాసన ఎక్కడిదని".. అప్పుడు మా మామ్మయ్య(నానమ్మ) గేట్ దగ్గర గోడ పక్కగా ఉన్న మొక్కల మధ్యనున్న నైట్ క్వీన్ మొక్క, దానికున్న పూలు చూపించి.. "వాటిదే ఆ వాసన" అని చెప్పింది. నక్షత్రాల్లాంటి బుల్లి బుల్లి పూల గుత్తులు చెట్టంతా పూసి ఉన్నాయి. "నైట్ క్వీన్...!" పేరెంత హుందాగా ఉందో అనుకున్నా అప్పుడు. అంతకు ముందు మా గేట్ తీస్తూంటే గేట్ పైన ఉన్న ఇనుప పందిరి మీదకి పాకించిన గిన్నెమాలతి తీగ తాలూకూ పూల సువాసన చాలా లైట్ గా వస్తూండేది. నైట్ క్వీన్ వచ్చాకా ఆ సువాసనను ఈ పూలు డామినేట్ చేసేసాయి. ఆ చిన్నప్పటి నుండీ కోరిక నాకు నైట్ క్వీన్ మొక్క పెంచాలని! అప్పుడు తెలీదు నర్సరీల్లో ఏ మొక్క కావాలన్నా దొరుకుతుందని.


ఈమధ్యనే ఓ నర్సరీలో కనిపిస్తే కుండీలో అయినా పెంచేద్దామని కొని బాల్కనీలో కుండీలో వేసాను. రెండుమూడు నెలల్లో బాగా ఎదిగి మొగ్గ తొడిగింది. రోజూ ఆ మొగ్గలు పెద్దవెపుడౌతాయా..పూలెప్పుడు పూస్తాయా అని చూడ్డమే. వారం క్రితం చిన్న గుత్తి పూసింది. పొద్దున్న కూడా మొగ్గలు చూసి ఫోటో తీశాను..ఎప్పుడు పూస్తాయో అనుకున్నా. ఇందాకా బయట నుండి రాగానే గబగబా బాల్కనీ తెరిచాను.. ఒక్కసారిగా మత్తు ఆవరించేసింది... ఆశ్చర్యంగా ఐదారు గుత్తులు పూసాయి. గుప్పుగుప్పుమనే ఆ పరిమళాలను గుండెల నిండా పిల్చుకోవాలనే ఆత్రం కమ్మేసింది. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ ఇంటి గుమ్మంలో ఎలాగైతే గేట్ తీస్తూ తీస్తూ నిలబడిపోయేదాన్నో అలాగ బాల్కనీ తలుపు దగ్గర నిలబడిపోయాను మైమరచిపోతూ.. ఎన్నాళ్లకెన్నాళ్ళకి.. మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూల వాసన నా బాల్కనీలో!! ఒక్కసారిగా చిన్నప్పటి రోజుల్లోకి.. మామ్మయ్య ఙ్ఞాపకాల్లోకీ వెళ్పోయి... 'కల నిజమాయెగా..కోరిక తీరెగా..' అని పాడేసుకున్నా. ఇంకా ఎంకి పాటలు ఫోల్డర్ తెరిచి.. 'పూల బాసలు తెలుసు ఎంకికీ..' పెట్టుకుని మైమరచిపోతూంటే నన్నో వింతగా చూస్తూండిపోయారు అయ్యగారు!

పూలకి ఫోటో వాట్సప్ లో అమ్మానాన్నలకి "పూలే చూడండి.. వాసన తేలేను..." అని చూడమని పెట్టాను. ఇంకా ఆనందం ఆగక ఫోన్ చేసి "నాన్నా ఇదిగో మామ్మయ్య పెంచిన నైట్ క్వీన్ పూలు నా బాల్కనీలో మళ్ళీ పూసాయి" అంటే నాన్నేమో.. "మా మామ్మయ్య కూడా మా చిన్నప్పుడు నైట్ క్వీన్ చెట్టు పెంచింది తెల్సా... ఇవి మా మామ్మయ్య పెంచిన పూలు.." అన్నారు :)

పొద్దుటి మొగ్గలు

రాత్రికి పూలై..

Monday, January 5, 2015

"నవలా నాయకులు" e-book




2014లో నెల నెలా 'కౌముది'లో ప్రచురితమైన "నవలా నాయకులు" వ్యాసాలు ఈ బుక్ రూపంలో కౌముది గ్రంధాలయంలో చేరాయి. అదివరకూ చదవనివారుంటే వ్యాసాలన్నీ ఒకే చోట చదువుకోవచ్చు. ఈ సదవకాశాన్ని ఇచ్చిన కిరణ్ ప్రభగారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ..
http://www.koumudi.net/books/koumudi_navalaa_nayakulu.pdf