సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, November 21, 2014

हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती..


రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు.. వరుసైన, పధ్ధతైన క్రమంలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. చివరలో తండ్రిగారైన హరివంశరాయ్ బచ్చన్ ప్రేరణాత్మక కవిత.. "హిమ్మత్ కర్నే వాలోం కీ హార్ నహీ హోతీ.." వినిపించారు తన గంభీరమైన గళంలో!

ఆ చివరి వాక్యాలు...

"संघर्ष करॊ मैदान छॊड मत भागॊ तुम
कुछ कियॆ बिना ही जय जयकार नहीं हॊती
हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती"

సమయానుకూలంగా మా కోసమే చెప్పాడేమో అన్నట్లుగా ఉన్నాయి. ఎంత చక్కని కవితని చెప్పావయ్యా.. లవ్ యూ అమిత్ జీ!! అనుకున్నాం. గబగబా మొత్తం కవిత వెతికి మొదలు నుండీ చివరి దాకా చదివాం. 
నిస్పృహను దులిపేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపే వాక్యాలు..!
ఉత్తేజపూరితమైన ఆ కవిత మొత్తం క్రిందన ..


Thursday, November 20, 2014

కొన్ని రోజులు..



కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి
దూకే జలపాతంలా..

కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి
నిఠారైన నిలువుగీతలా..

కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి
బోలెడు చుక్కల మెలికల ముగ్గులా..

కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి
స్తబ్దుగా నిశీధిలా.. 

కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి 
అచ్చంగా జీవితంలా..


Monday, November 17, 2014

मोहब्बत करनेवाले कम ना होंगे..


ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html)
ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను. నాలాంటి సంగీతప్రియుల కోసం ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.


ఈ గజల్ సాహిత్యాన్ని రాసిన ఉర్దూ కవి పేరు అబ్దుల్ హఫీజ్. 'హోషియార్ పూర్' అనే ఊరివాడవడం వల్ల ఆయనను "హఫీజ్ హోషియార్ పురీ" అని పిలుస్తారు. మెహదీ హసన్ గళమే కాక ఈ గజల్ సాహిత్యం చాలా చాలా బావుంటుంది. ఇదే గజల్ ఇక్బాల్ బానో గారూ, ఫరీదా ఖన్నుమ్ గారూ పాడిన లింక్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ మెహదీ హసన్ పాడినది వింటుంటే మాత్రం గంధర్వ గానం.. అనిపించకమానదు!ఆ ఆలాపనలు.. స్వరం నిలపడం.. ఆహ్.. అంతే!

మెహదీ హసన్ మాటలతో ఉన్న ఓల్డ్ రికార్డింగ్:
http://youtu.be/NQ3rRwSl__8




సాహిత్యం:

मोहब्बत करनेवाले कम ना होंगे
तेरी महफ़िल में लेकिन हम ना होंगे

ज़माने भर के ग़म या इक तेरा ग़म
ये ग़म होगा तो कितने ग़म ना होंगे

अगर तू इत्तफ़ाक़न मिल भी जाये
तेरी फुरक़त के सदमें कम ना होंगे

दिलों की उलझनें बढ़ती रहेंगी
अगर कुछ मशवरे बहम ना होंगे

'हफ़ीज़' उन से मैं जितना बदगुमाँ हूँ
वो मुझ से इस क़दर बरहम ना होंगे

Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html

Thursday, November 6, 2014

శ్రీ శివమహాపురాణము


 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి దేవుడు మాకు మేలే చేసాడు. పెళ్ళయిన ఇన్నేళ్ళకి ఆ మూడువారాలు కాస్త ఖాళీగా తను ఇంట్లో ఉన్నారు. ఆ దెబ్బల వల్ల సత్కాలక్షేపం కూడా జరిగింది. తీరుబడిగా పనులు చేస్కోవడమే కాక తీరుబడిగా పురాణకాలక్షేపం చేసుకుని మహదానందాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నాము.. కుంటున్నాము కూడా! ( బయటకు వెళ్పోవడం మొదలెట్టాకా పురాణపఠనం స్పీడ్ తగ్గి, ఇంకా రెండు ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి.) మధ్యలో కొన్నాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నందున ఆవిడ కూడా పురాణశ్రవణం చేసుకున్నారు. 

మాకో అలవాటు ఉంది..(చాలామందికి ఉండే ఉంటుంది) చాలా బాగున్న పుస్తకం కలిసి చదవడం. ఒకళ్లతర్వాత ఒకళ్ళం తలో ఛాప్టర్ చదవడం. ప్రసాద్ గారి నాహం కర్తా హరి: కర్తా, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ, ఆ కుటుంబంతో ఒక రోజు, మోహన్ కందా గారి పుస్తకం... ఇలా కొన్ని పుస్తకాలు కంబైండ్ స్టడీ చేసాం. ఆమధ్యన కోటీలో పాత పుస్తకాల స్టాల్స్ దగ్గర ఏవో పుస్తకాలు కొంటుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి "శ్రీ శివమహాపురాణము" దొరికింది. పుస్తకం కొత్తగానే ఉన్నా పాతపుస్తకాల దగ్గర పెట్టీ మూడొందల ఏభైకే అమ్మేస్తున్నారు. క్రిందటి పుస్తకప్రదర్శనలో చాగంటివారి భాగవత,రామాయణ, శివమహాపురాణా ప్రవచనాల పుస్తకాలను మూడింటినీ కలిపి డిస్కౌంట్లో అమ్మారు. అప్పటికే చాలా కొనేసినందువల్ల ఇక అవి తీసుకోలేకపోయాము. మూడింటిలో అమ్మ దగ్గర భాగవతప్రవచనం ఉంది. (సగభాగం ఇంకా పూర్తి చెయ్యాల్సి ఉంది.)  మిగతావి కూడా కొనుక్కోవాలని మనసులో ఓ మూల కోరిక ఉంది. ఇప్పుడిలా అనుకోకుండా "శ్రీ శివమహాపురాణం" కొనడం జరిగింది. భగవత్ కృప!


కాకినాడలోని అయ్యప్పస్వామి గుడిలో మండలం రోజులు చాగంటివారు చెప్పిన ప్రవచనాలుట ఇవి. (టివీలో వచ్చే ఉంటాయి.) వాటికి పుణ్య దంపతులు శ్రీ పురిఘళ్ళ సత్యానంద శర్మ, శ్రీమతి భాస్కరం గార్లు అక్షరూపాన్ని అందించారు. ఆకర్షణీయమైన బాపూ బొమ్మలతో ఎమెస్కో బుక్స్ వాళ్ళు ప్రచురించారు. వినడం కన్నా పుస్తకం చదవడమే ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని మాకనిపించింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలను గురించి , వాటి చరిత్ర, కొన్ని ప్రదేశాల్లో ఉన్న విగ్రహామూర్తులను గురించీ చదువుతుంటే అసలు ఇప్పటిదాకా చూసిన కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. శివుడంటే ఇదివరకటి కంటే ఎక్కువగా ఆరాధన కలిగింది. నా రాముడితో సమానంగా నా మనస్సులో స్థానాన్నధిస్టించాడు ఈశ్వరుడు :)


పుస్తకంలో ముందర కొందరు నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. శివుని అనుగ్రహం వల్ల తరించిపోయిన మహాపురుషులైనవారీ నాయనార్లు. ఒక్కొక్కరి కథా ఒకో పాఠం అని చెప్పాలి. తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యాలనూ, వాటి చరిత్రనూ, ప్రాముఖ్యతనూ తెలియజేసారు. మాకు ఇప్పటికి శ్రీశైలంలో మల్లికార్జునుడు, త్ర్యంబకంలోని త్ర్యంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఘృష్ణేశ్వర్ లోని ఘుష్ణేశ్వరుడు, భీమశంకర్ లోని భీమేశ్వరుడూ ఐదు క్షేత్రాల్లోని శివలింగాలను చూసే సదవకాశం కలిగింది. అరుణాచల పర్వతం విశిష్ఠత, రమణ మహర్షి చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయం గురించీ చదువుతుంటే మాత్రం రెక్కలు కట్టుకుని ఆ కొండకు ఎగరి వెళ్ళాలనిపించింది. ఆ దర్శనం, గిరిప్రదక్షిణ ఎప్పటికి ప్రాప్తమో..


పుస్తకంలోని కొన్ని తెలియని, తెలిసిన మంచి విషయములు:

* మన శరీరంలో ఉండే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన్, నాగ, కూర్మ, క్రుకుర, ధనంజయ, దేవదత్తములనే పది వాయువులు, వాటి పనులూ చెప్పారు. శివుడి ఆజ్ఞ వలననే వాయువు జీవుల శరీరములందు ఉండి ఈ పదిరకముల వివిధ కర్మలనూ చేస్తాడుట.

* పూర్వం స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించి కట్టె వెలిగించి, మడిబట్ట కట్టుకుని అన్నం వండడం కూడా గౌరవంగా చేసేవారు. 

* "పిల్లలను పోటో పరీక్షలకు తయారుచేస్తున్నాం. కానీ పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్దచేస్తున్నాం. వాడు రోడ్డుమీదికి వెడితే వాడి కన్నులు చెదరగొట్టి పాపభూయిష్టమైన నడవడి వైపుకి తీసుకువెళ్ళే వాల్ పోస్టర్లు! ఏషాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడుచెయ్యగలిగిన పుస్తకాలు! ఎన్ని ఛానళ్ళు నొక్కినా అన్నింటిలో వ్యగ్రతతో కూడిన విశేషములు! మీరు వానికి మురికినీరు పట్టించి వాడు వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే వాడు ఎలా బ్రతుకుతాడు?ఈవేళ సమాజానికి భాద్యత లేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదు. పెద్దలకు బాధ్యత లేదు...." 
"పురాణముల ప్రయోజనం మీ బాధ్యతలను గుర్తు చెయ్యడం. పురాణం ఎప్పటిదోనని, అది పనికిమాలినదని మీరు అనవద్దు. అది ఎప్పటికీ నవీనమే. అది మీ బాధ్యతను మీకు గుర్తుచేస్తుంది. లోక సంక్షేమము ఎక్కడ ఉందో దానిని మీకు జ్ఞాపకము చేస్తుంది."

* తల్లిదండ్రులు ఏ ఏ సంస్కారములతో ఉన్నారో వి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కారరూపంలో సుఖమును గానీ, దు:ఖమును గానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుధ్ధి కొరకు, భావపరిపుష్టి కొరకుమనవాళ్ళు పూర్వం కొంతకాలం భార్యాభర్తలు దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమయిన తరువాత సంతానము కనేవారు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించినట్లయితే, నిష్ఠ లోపించినట్లయితే సంతానమునందు వ్యగ్రతతో కూడినవారు జన్మిస్తారు. కాబట్టి సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. ఇంత చేసినా దుర్మార్గుడో, దుర్మార్గురాలో పుడితే అది బిడ్డ ప్రారబ్ధం. దాని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది.

* ప్రదూషవేళ (కాలము స్ఫుటముగా మార్పు చెందే రెండు సంధ్యాసమయాలూ) జరుగుతూండే శివుడి ఆనందతాండవం సమయంలో శివస్వరూపాన్ని చూసే అధికారం నలుగురికే ఉందిట. నందీశ్వరుడు, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు.

* కావ్య కంఠగణపతి ముని కథ కమనీయం.

* మధురమైన ముత్తుస్వామి దీక్షితులు జీవిత కథ..

* శంకరాచార్యులవారు, శ్రీ చంద్రశేఖర పరమచార్యుల వారి గురించిన కొన్ని తెలియని విశేషాలు..

* భృగుమహర్షి కుమారుడైన భార్గవుడు మహాపురుషుడిగా ఎలా మారాడు, శుక్రాచార్యుడన్న పేరు ఎలా ప్రకాశించిందో తెలిపే కథ విచిత్రమైనది. ఈశ్వరుడి కృపాకటాక్షాలను తెలిపేదీనూ!

* శివకోటి, రామ కోటి రాసిన పుస్తకాలలో ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపము అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తికి ప్రసరించే లక్షణం ఉంది. ఊళ్ళో ఎవరికయినా ఆపద వచ్చినట్లయితే ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. స్తూపంలో ఉన్న శక్తి బయటకు తరంగములుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకా కష్టం పోతుందో ఆ శక్తి అందులోంచి మీ మనసు లోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుధ్ధిని మారుస్తుంది. కాబట్టి ఉళ్ళో ఉన్నవాళ్ళు ప్రమాత్మ ప్రు రాసిఉన్న స్తూపం కట్టుకోవాలి. రాననాం ఎంత గొప్పదో శివనామమూ అంతే గొప్పది.



* స్కందోత్పత్తి - కుమారసంభవం:
కాళిదాసు రచించిన "కుమారసంభవం" పేరు వినడమే తప్ప కథ తెలియదు. ఇంతకుమునుపెక్కడా కూడా కుమారస్వామి జననానికి సంబంధించిన కథ వినలేదు కూడా. మొత్తం పుస్తకంలో మేము ఆసక్తికరంగా చదివిన వృత్తాంతమిది. పార్వతీపరమేశ్వరులిద్దరి దయ,కారుణ్యము ఒకచోట ప్రోగు చెస్తే ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడుట. ఇది గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమయినదిట. ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ స్త్రీ వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని, అవి ఔషధాలుగా మారి లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. అందుకే స్కందోత్పత్తి గర్భిణి వినాలని శాస్త్రం చెప్పిందిట. ఆయురారోగ్యాలూ, వంశాభివృధ్ధి, ధనం, దీర్ఘమైన ఆరోగ్యం మొదలైనవి సుబ్రహ్మణ్యారాధన వల్ల కలుగుతాయిట.


ఇలా చెప్పుకుపోతే ఎన్నో కథలు, వింతలూ, విశేషాలూ..! మధ్యమధ్య చాగంటివారు ఉదహరించిన వివిధ సంస్కృత శ్లోకాలూ, శివానందలహరి, భాగవతం మొదలైనవాటి నుండి తీసుకున్న పద్యాలన్నీ కూడా మధురమైన భక్తితత్వంతో నిండి ఉన్నాయి.


ఇంకో మూడు,నాలుగు రోజుల్లో పారాయణ పూర్తవుతుంది. చదువుతున్న కాలంలో ఎదురైన చిన్న చిన్న విశేషాలు:

* గత రెండునెలల కాలం కూడా మాకెంతో పరీక్షాసమయం. కొన్ని చికాకులూ, సమస్యలతో సతమతమై అయోమయావస్థలో ఉన్న మాకు శివానుగ్రహం వల్లనే ఈ పురాణపఠనం చేసే సదవకాసాశం కలిగి, తద్వారా మా భారాలని తేలిక చేసుకోగలిగే మనస్థితిని శంకరుడే కల్పించాడని మేమిద్దరం కూడా విశ్వసిస్తున్నాం. 

* సెప్టెంబర్ లో ఒకనాడు మా అత్తగారు హాస్పటల్లో సీరియస్ గా ఉన్న రోజున.. ఆ అర్థరాత్రి పూట ఒక్కదాన్నీ హాల్లో కూచుని ఈ పుస్తకాన్ని కాగలించుకుని శివా..శివా.. శివా.. అన్న ఒక్క నామాన్ని మాత్రమే జపిస్తూ గడిపిన గంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వరానుగ్రహం వల్లనే ఆవిడ అప్పటికప్పుడు మామూలై ఆ పూటే మా ఇంటికి రాగలిగారని మేం నమ్మాము.

* సరిగ్గా శరన్నవరాత్రుల్లోనే "గౌరీపూజ", "అమ్మవారి రూపములు" ఛాప్టర్లు చదవడం చిత్రమనిపించింది. 

* నిన్న ఏదో పని మీద ఓ ఆఫీసుకి వెళ్తే అక్కడ మావారికి తెలిసినాయన, "పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి వచ్చాను.. ప్రసాదమిదిగో.." అని ఇచ్చారుట. మేం వెళ్ళలేకపోతున్నామని శివుడు ప్రసాదం పంపాడని మురిసిపోయాం ఇద్దరం.

ఇవి చిన్న విశేషాలే అయినా మా మనసులని ఎంతో ప్రభావితం చేసినవి. ఆసక్తి ఉన్నవారు తప్పక ఈ శివమహాపురాణపఠనాన్ని చేసి ఈశ్వరానుభూతిని పొందవలసినదని మనవి.

***

లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ
చీకాకున్ బడనీ మహాత్ముడననీ..
మూకీభా వమునన్ తిట్టనీ త్రోయనీ
నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!
(శంకరాచార్యులు)


మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!

Tuesday, November 4, 2014

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..



ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:
(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) 





తులసీ స్తోత్రం:
http://youtu.be/Dxptk_6cgss



తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :
http://youtu.be/cAvzwnc16Ag




తులసీ వివాహం :
 https://www.youtube.com/watch?v=iWs142GBCVs



తులసీ హారతి:
http://youtu.be/T9JH9h0qL6M

Saturday, November 1, 2014

Kishori Amonkar - Drishti songs


image from google


1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా హిందుస్తానీ శాస్త్రీయ బాణిలోనే ఉంటుంది. సాహిత్యం వసంత్ దేవ్. 



ఈ చిత్రంలో రెండు పాటలు యూట్యూబ్ లో దొరికాయి.. రెండూ చాలా బావుంటాయి. 

1.)మేఘా ఝర్ ఝర్ బర్సత్ రే.. 
ఇది ఏ రాగమో గానీ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట.. 
(సంగీతం మరియు గాయకురాలు: కిశోరీ ఆమోంకర్) 



 2) ఏక్ హి సంగ్ హోతే.. జో హమ్ తుమ్.. కాహే బిఛురారే... (ఈ పాట క్రింద ఇచ్చిన గానా.కామ్ లింక్ లో క్లియర్ గా ఉంది) ఈ పాట వింటుంటే 'రుడాలీ' లో "సునియో జీ అర్జ్ మ్హారీ.. " పాట గుర్తుకు వస్తుంది.. బహుశా రెండూ ఒకటే రాగమై ఉంటాయి. 

  

 'ఆలాప్' తో పాటూ చిత్రంలో అన్ని పాటలూ gaana.com లింక్ లో వినచ్చు: http://gaana.com/album/drishti-hindi



నవలానాయకులు - 11


ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. సందర్భానుసారం, పరిస్థితుల దృష్ట్యా అవి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని అతడు చేసే/చేసిన పనుల వల్ల అంచనా వెయ్యడం అనేది సబబు కాదు. అసలలా ఎందుకు చేసాడు అనే కారణాలను అన్వేషించడం, వాటిని తెలుసుకున్న తరువాత ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సరైన పని అని ఈ నవల ద్వారా రచయిత తెలియపరుస్తారు. ప్రపంచమంతా కౄరుడు, నిర్దయుడు, పాషాణహృదయుడు, రక్తపిపాసి, రాక్షసుడు అని ముద్ర వేసిన మంగోల్ జాతి నాయకుడు "టెమూజిన్" కథను ఒక కొత్త కోణంలో మనకి చూపెడుతూ ఒక మహోన్నతమైన మానవతావాదిగా అతగాడిని మనకి పరిచయం చేసారు ప్రముఖ అభ్యుదయ కవి, కథారచయిత, నాటక కర్త శ్రీ తెన్నేటి సూరి. "ఛెంఘిజ్ ఖాన్" లోని కౌర్యం వెనుక కారణాలు చరిత్రని తవ్వితే గానీ బయటపడవు. ఈ నవలా నాయకుడి జీవితాన్ని గురించిన వివరాలు క్రింద లింక్ లో:
http://koumudi.net/Monthly/2014/november/nov_2014_navalaa_nayakulu.pdf






దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ నవల ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకం గా తయారైంది. శ్రీకాంతశర్మ గారు ఆ పాత్రపై ఎంతో అభిమానంతో నాటకరూపాన్ని అందించారు. నాన్నగారు శబ్దరూపాన్ని ఇచ్చారు. రికార్డింగ్ సమయంలోనూ, ఆ తరవాత ఎన్నో ప్రశంసలను అందుకుందీ నాటకం. గుర్రపు డెక్కల చప్పుడు, అరుపులు, కోలాహలాలూ, ఆర్తనాదాలు, హుంకారాలు, యుధ్ధపు వాతావరణం మొదలైన ఎఫెక్ట్స్ శబ్ద రూపంలో తేవడం కోసం నాన్న ఎంతగానో శ్రమించారు.  పూర్తయిన ఈ నాటకం కేసెట్ ను ఎన్నోసార్లో నాన్న వింటుంటే వినీ వినీ విసిగిపోయి అబ్బా..ఆపేద్దూ గోల అని మేము విసుక్కున్న రోజులు నాకు బాగా గుర్తు :) 
..వెరీ నాస్టాల్జిక్.. అబౌట్ దిస్ ప్లే!!

నవల చదివిన ప్రతిసారీ చాలా రోజుల వరకూ యాసుఖై, యూలన్, టెమూజిన్, సుబూటిన్, చమూగా, కరాచర్,బుర్టీ, కూలన్.. మొదలైన పాత్రలు మదిలో మెదులుతూ కలవరపెడతాయి. అసలు వీళ్ళ మూలాలేమిటి.. వీరందరి నిజమైన చరిత్ర తెలిస్తే బాగుండు.. అని మనసంతా గోబీ ఎడారి చూట్టూ ప్రదక్షిణలు చేస్తుంది!!!