సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 27, 2014

కొత్త పుస్తకాలు: 4. శ్రీకాంతశర్మ సాహిత్యం



ఈ నాలుగవ పుస్తకం నేను కొనలేదు. నాన్నగారికి మిత్రులు శర్మగారు బహుకరిస్తే నే తస్కరించుకు తెచ్చుకున్నా :)
నాన్నగారి మిత్రులు, కవి, రచయిత, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమగ్ర సాహిత్యం వస్తుందని తెలిసినప్పటి నుండీ ఆత్రంగా ఎదురుచూసాము. 'సృజన', 'సమాలోచన' పేర్లతో రెండు భాగాలు ప్రచురింపబడిన ఈ సమగ్ర సాహిత్యాన్ని నవోదయావారు ప్రచురించారు. రెండు సంపుటాలూ కలిపి వెల 2,500/- శర్మగారు తన సప్తతి (డెభ్భైయ్యవ జన్మదినం) సందర్భంగా మే నెల 29న ఈ పుస్తకాలను మార్కెట్లో విడుదల చేసారు. ఆయనకు ఆర్భాటాలు నచ్చని కారణంగా సభా సమావేశాలు పెట్టి విడుదల చెయ్యలేదు. మొదటి భాగం 'సృజన'లో శర్మ గారి కవిత్వ, లలితగీతాల సంపుటిలు, యక్షగానాలు, కథలూ, నవలలు, నాటకాలు, నాటికలు(ఇరుగు-పొరుగు) ఉన్నాయి. రెండవ భాగం 'సమాలోచన'లో సాహిత్యదీపాలు, అలనాటి నాటికలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, మనలో మనమాట, ఇంద్రధనుస్సు, పరిపరి పరిచయాలూ ఉన్నాయి.



ఇందులోని రచనలన్నీ వివిధ పత్రికలలో, సాహిత్య సదస్సులలో, రంగస్థలంపై, రేడియోలో వెలుగు చూసాయి. ఈ మొత్తం ఇరవై పుస్తకాలలో పధ్నాలుగు పుస్తకాలు ఇదివరలో విడివిడిగా వెలువడ్డాయి. కవిత్వంలో అనుభూతిగీతాలూ, శిలామురళి, ఏకాంతకోకిల, ఆలాపన; ఇంకా రెండవ సంపుటిలో సాహిత్య దీపాలు, ఆలోచన, పరిపరిపరిచయాలూ ఇదివరకూ నాన్నగారి వద్ద చదివాను నేను. మిగిలినవి నేను కూడా ఇంకా చదవవలసి ఉంది. ఆసక్తిగల సాహితీమిత్రుల కోసం ముందు పుస్తకం విడుదల గురించి ఈ కొద్దిపాటి వివరాలతో టపా రాస్తున్నాను. 



చిన్నప్పటి నుండీ ఎరిగున్న నాన్నగారి స్నేహితులుగా కాకుండా, ఒక కవిగా నాకు శర్మ గారంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక విజ్ఞాన ఖని ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూంటే ఓ పక్కగా కూచుని వాళ్ళ సాహిత్యపుకబుర్లన్నీ వినడం భలే సరదాగా ఉండేది నాకు. ఇలా శర్మగారు అని రాయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంతశర్మ మావయ్యగారు అని పిలిచేవాళ్ళం ఆయనను. అలానే బావుంటుంది పిలవడం ఇప్పటికీ. మావయ్యగారు పాట రాస్తే సగం పదాలకు అర్థాలు అడిగి తెలుసుకునేవాళ్ళం మేం పిల్లలం. ఇప్పుడు తెలిసినంత కొద్దిపాటి తెలుగు కూడా చిన్నప్పుడు తెలీదు కదా. కొన్ని పాటల్లోని తోతెంచనా, దరిసి, ననలు తొడగవా, తమి పిలుపు మొదలైన పదాలు ఇంకా గుర్తున్నాయి.. అవి తెలుగువా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరంవారి పాండిత్యం, తెలుగు భాషాపరిజ్ఞానము ఇప్పటి తరాలకు సగమన్నా వచ్చేనా అని దిగులు కలుగుతూ ఉంటుంది నాకు. రచనా వ్యాసంగాల కోసం కాదు కానీ గ్రంధస్తమై ఉన్న తెలుగు సాహిత్యాన్ని చదవుకోవడానికన్నా మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది. 


ఎప్పుడో రచనాకాలం దాటిన కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొన్ని సమగ్ర సాహిత్యాల్లా కాకుండా, వర్తమానంలో తన సాహిత్యసంపుటిల్లో ఏ ఏ రచనలు కలపాలో, వేటిని తీసివెయ్యాలో మొదలైనవన్నీ శర్మగారు స్వయంగా చూసుకుని అచ్చుకు ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగించింది. "వెనుతిరిగి చూసుకుంటే.." అనే ముందుమాటలో శర్మ గారు చెప్పిన ఈ చివరి మాటలు నాకు బాగా నచ్చాయి..
"నా వ్యక్తిగత విశ్వాసాలు - నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకుని ఏర్పరుచుకున్నవి. ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకీ, చర్యలకీ, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే - ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యం. అందుచేత - సాహిత్య పఠనం, రచన, వ్యాసంగాలలోకి మనసు పెట్టేవాళ్ళు తమ మనస్సులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవలసి రావచ్చు; కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనస్సులోకి వెలుతురు తాకే అవకాశం ముఖ్యం - దానిని మూసి పెట్టకూడదు.
ఈ సందర్భాలలో, ఈ సంపుటాలలోని నా రచనలు ఏ మాత్రమైనా మీకు ఉపకరిస్తే, యాభైయ్యేళ్ళ నా సాహితీ వ్యాసంగం చరితార్థమైందని భావిస్తాను
."



 

ఈ సంపుటాలలోని వ్యాసాలూ, కథలు, నవలలు చదివాకా మరెప్పుడైనా వివరంగా మళ్ళీ రాస్తాను.
మొదటి సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:




 రెండవ  సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:


Wednesday, June 25, 2014

కొత్తపుస్తకాలు: ౩. స్వరలహరి


మన తెలుగు సినీ సంగీతదర్శకుల గురించి ఒక రచయిత లేదా ఓ అభిమాని వ్యాసమో పుస్తకమో రాస్తే ఒకలా ఉంటుంది. అదే ఆయా సంగీతదర్శకులతో కలిసి పనిచేసి, స్నేహం కలిగిన ఓ గాయకుడు రాస్తే విభిన్నంగా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ప్రయత్నమే ఈ పుస్తకం. సినీ సంగీతాకాశంలో తన స్వరాలతో ఓ అందమైన ఇంద్రధనస్సుని సృష్టించుకున్న స్వర్గీయ శ్రీ పి.బి.శ్రీనివాస్ రచన ఈ "స్వరలహరి". నేపథ్యగాయకుడు కాక మునుపు శ్రీ పి.బి.శ్రీనివాస్ పత్రికారంగంలో వివిధ కలంపేర్లతో రచనలు చేసేవారుట. భాష మీద పట్టు, చదివించే గుణం, మధ్య మధ్య వాడిన ఛలోక్తులు ఆయన ఎంత మంచి రచయితో తెలియజేస్తాయి. పి.బి తన వ్యాసాలలో చేసిన తమాషా ప్రయోగాలు తిరుపతి లడ్డూలోని జీడిపప్పులా, కలకండ పలుకుల్లా పాథకుల్ని ఆకట్టుకుంటాయి అని సంపాదకులు డా.కొంపల్లె రవిచంద్రన్ అంటారు.


1963-1964 ప్రాంతంలో జ్యోతి మాస పత్రికలోధారావాహికగా వెలువరించిన ఈ వ్యాసాలను గ్రంధరూపంలోకి తెచ్చింది "కళాతపస్వి క్రియేషన్స్". అన్ని విశాలాంధ్ర బుక్ హౌసుల్లోనూ లభ్యమౌవుతున్న ఈ పుస్తకం వెల కేవలం నూటఏభై రూపాయలు. ఆయన స్వర్గస్థులవ్వకముందరే పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నారుట కానీ సాధ్యమవలేదుట. ఈ ప్రయత్నం ప్రధమ వర్ధంతి లోపునన్నా పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేసారు ప్రచురణకర్తలు. వ్యాసాల మధ్యన ప్రచురించిన ఎన్నో అరుదైన, అపురూపమైన ఫోటోలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ పుస్తకంలో పి.బి. ఒక పదకొండు మంది సంగీత దర్శకుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుల వివరాలూ, పాటల ,సినిమాల వివరాలే  కాక వ్యతిగతంగా వారెలా తనకు పరిచయమో, వారితో జరిగిన కొన్ని సంఘటనలు, వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఘటనల ఉదాహరణలు, వారి అలవాట్లను గురించి ఎంతో చక్కగా వివరిస్తారు పి.బి ఈ వ్యాసాల్లో. ఈ వివరాలే ఈ పుస్తకానికో ప్రత్యేకతను తెచ్చాయి. వ్యాసం పూతయిన తరువాత ప్రతి సంగీత దర్శకుడి తాలూకూ చిన్న బయోడేటా కూడా ఒక పేజీలో అందించడం బాగుంది.

నేను ఎక్కువ వివరాలు రాయను కానీ ఒక్కో దర్శకుడి గురించి పి.బి. చెప్పిన ఒకటి రెండు విశేషాలు రాస్తాను.


హాయిగా పాడుదునా? (సాలూరి రాజేశ్వరరావు)
సాలూరివారు మంచి క్రియాత్మక హాస్యప్రదర్శనాప్రియులు(ప్రాక్టికల్ జోకర్) కూడానట. ఒకసారీ ఏవో రిహార్సల్స్ అయ్యాకా ఒక ఆంగ్ల చిత్రానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్నారుట అందరూ. రాజేశ్వరరావుగారి కారు సర్వీసింగ్ కి వెళ్ళిందిట. నేను పికప్ చేసుకుంటాను ముమ్మల్నని పి.బి అడిగితే, మీకెందుకు శ్రమ, చిన్న పనిచూసుకుని నేనే ఆటో రిక్షా మీద థియేటర్ వద్దకు వచ్చేస్తానని చెప్పారుట. పి.బి., అసిస్టెంట్స్ థియేటర్ వద్ద చాలా సేపు నించుని నుంచుని అలసిపోయి సాలూరివారు లేకుండా సినిమా చూడాలనిపించక వెనక్కివెళ్పోతుంటే అప్పుడు వచ్చారుట. సినిమా అయ్యాకా చెప్పారుట.. మీతో ఆటో రిక్షాలో వస్తానన్నాను కదా. ఆటో కోసం టాక్సీ వేసుకుని  ఊరంతా వెతికి ఈ ఆటో దొరికి వచ్చేసరికీ ఇంత లేటయ్యింది. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను లేకపోతే రాకపోదును అన్నారుట.


వేణు -గానలోలుడు
మాష్టర్ వేణు గా పిలవబడే మద్దూరి వేణుగోపాల్ కు హార్మోనియం,పియానో, సితార్,గిటార్,దిల్రుబా,మేండొలీన్, ఎకార్డియన్, ఫ్లూట్,సెల్లో,ఉడొఫోన్,జలతరంగిణి,హేమండ్ ఆర్గన్ మొదలైన పదిపదిహేను వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉండేదిట. ఎవరైనా ముఖ్య వాయిద్యగాళ్ళు రికార్డింగ్కి రాలేకపోతే తానే ఆ స్థానాన్ని భర్తీ చేసేసేవారుట. నౌషాద్ కు వీరాభిమానిట. నౌషాద్ సంగీతం ముందర ఎవరి సంగీతం రక్తి కట్టదని ఆయనకొక నిశ్చితాభిప్రాయం ఉండేదిట.


 సుసర్ల దక్షిణామూర్తి:
లతా మంగేష్కర్ చేత ప్రప్రధమంగా తెలుగు సింహళ భాషలలో పాడించిన ఘనత సుసర్లవారిది. భానుమతికి భానుమతి చేతే "అందంలో పందెమేస్తా" అని పాడించారు.  "చల్లని రాజా ఓ చందమామ", "జననీ శివకామినీ" మొదలైన హిట్స్ ఇచ్చారు. చక్కని పాటలెన్నో పాడి ప్లేబాక్ సింగర్ గా కూడా పేరు గడించారు.


పాటల టంకశాల ఘంటసాల
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని  పధ్ధెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చారుట ఘంటసాల. తర్వాత ఒక నాటక కంపెనీని నడుపుతూ  నష్టాల్లో ఉండగా సముద్రాల రాఘవాచారిగారు వీరి గొంతు బాగుందని మద్రాసు రామ్మన్నారుట. నాటక కంపెనీ మూసేసి ఇరవై రూపాయిలతో మద్రాసు చేరుకున్నారుట ఘంటసాల.


సప్తస్వరాల ఉయ్యాల
తెలుగువారు ఎక్కువగా పాడుకునే సినిమా పాటల్లో ఎక్కువభాగం పెండ్యాల నాగేశ్వరరావు గారివేనట. జగదేకవీరునికథ లో శివశంకరీ పాటకు నాయకుని గానానికి శిల కరిగిపోవలసి ఉంది.మీరెలా కరిగిస్తారోమరి అన్నారుట దర్శకులు కె.వి.రెడ్డిగారు. అహర్నిశలూ శ్రమించి ఆ పాటకు  బాణీ రూపొందించారుట ఆయన.


ఇంకా ఈ పుస్తకంలో...
* స్వరపరాయణ ఆదినారాయణ రావు గారు,
* రసికజన మనోభిరామ అశ్వత్థామ(సుప్రసిధ్ధ వైణికురాలు గాయిత్రి వీరి కుమార్తె),
* స్వరాల రాజు టి.వి.రాజు(పూతి పేరు తోటకూఅ వెంకటరాజు),
* జంట స్వరాలు(ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి),
* స్వరసప్తాచలపతి తాతినేని చలపతి,
*జనం నోట తనపాట పలికించిన చిలక కె.వి.మహాదేవన్ (పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్)
మొదలైన సంగీతకారుల గూర్చిన కబుర్లు ఉన్నాయి.

ఇలా ఇందరు మహానుభావుల గురించిన ఎన్నో కబుర్లు ఉన్న ఈ పుస్తకం మరి దాచుకోవలసిన తాయిలమే కదా!

Monday, June 23, 2014

కొత్త పుస్తకాలు :2. నివేదన


 రెండవ పుస్తకం కూడా చిన్నదే..
"నివేదన" పేరుతో వెలువడిన ఈ పుస్తకంలో "కొరొ జాగొరితొ"(where the mind is without fear..) అనే రవీంద్రుని కవితకు తెలుగులో లభ్యమయిన ఒక వంద అనువాదాలు ఉన్నాయి. నోబుల్ పురస్కారాన్ని అందుకున్న "గీతాంజలి" కావ్యమాలలోనిదీ గేయం. ఇదివరకూ కొన్ని అనువాదాలతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని మరిన్ని లభ్యమైన అనువాదాలు కలిపి పునర్ముద్రణ చేసారు. గీతాంజలి తెలుగులోకి అనువాదమై శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకరూపాన్ని నివాళిగా అందించారు "సంస్కృతి" సంస్థ వారు. వెల వంద రూపాయిలు.




క్లాస్ గుర్తులేదు కానీ ఈ కవిత చిన్నప్పుడు ఇంగ్లీష్ పొయిట్రీ టెక్స్ట్ లో ఉండేది. తర్వాత రేడియోలో రజని గారి పాట వినడమే. గత వంద సంవత్సరాలలో దాదాపు ఒక వందమంది రచయితలు ఈ కవితకు తమ తమ అనువాదాన్ని అందించారుట.  ఒక్క కవితకు ఇందరు అనువాదాన్ని అందించడం అనేది ప్రపంచ సాహిత్యంలోనే చాలా అరుదైన విషయం కదా. ఈ పుస్తకంలో మన బ్లాగ్మిత్రులు అనురాధ గారి అనువాదం కూడా చోటు చేసుకోవడం మరో విశేషం.


నివేదన లోని అనువాదకులు కొందరి పేర్లు: చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, తిరుమల రామచంద్ర, ఆచంట జానకీరామ్, బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, శంకరంబాడి సుందరాచారి, కొంగర జగ్గయ్య, మో, ఓల్గా, గుర్రం జాషువా, రావూరి భరద్వాజ, వాడ్రేవు చినవీరభద్రుడు మదలైనవారు. అసలిలా ఒకేచోట ఇందరి అనువాదాలు చేర్చాలన్న ఆలోచన బి.ఎస్.ఆర్.కృష్ణ గారికి వచ్చిందిట. ఈ పుస్తకం గురించిన ప్రకటన చదివినప్పుడు ఒకే కవితకు వందమంది ఏం రాస్తారు?ఎలా రాస్తారు? అనుకున్నా కానీ ఒకే కవితకి ఇందరి అనువాదాలూ, ఇందరి అభిప్రాయాలూ, పదాల పొందిక, వారి వారి వొకాబులరీ ఇవన్నీ చదువుతుంటే కూడా భలే సరదాగా ఉంది. వీటిల్లో ఒక్కటి కూడా ఇదివరకూ తెలియవు కానీ రజని గారు ఈ గేయాన్ని తెలుగులోకి అనువదించి స్వరపరిచి, గానం చేసిన అనువాదమొక్కటే నాకు చిన్నప్పటి నుండీ తెలుసు. ప్రస్తుతం మా PCకి ఆయొచ్చి నిద్దరోతున్నందున ఆ గానాన్ని ఈ టపాలో వినిపించలేకపోతున్నాను :( సాహిత్యం మాత్రం రాస్తాను..

రజని గారి తెలుగు అనువాదం :

చిత్తమెచట భయశూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమో
గృహప్రాంగణ తలములు ప్రాచీరమ్ముల
దివారాత్ర మృత్తికా రేణువుల
క్షుద్ర ఖందములు కావో!

వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరిసి వెలువడునో
కర్మధార యెట అజస్ర సహస్ర స్రోతమ్మై
చరితార్థంబై, అనివారిత స్రోతమ్మై
దేశదేశముల దెసదెస లంటునో
తుచ్ఛాచారపు మరుప్ర్రాంతమ్ముల
వివేక స్రోతస్విని యొటనింకదొ 
శతవిధాల పౌరుషయత్నమెచ్చట
నిత్యము నీ ఇచ్ఛావిధి నెగడునో

అట్టి స్వర్గతలి భారతభూస్థలి
నిజహస్తమ్మున నిర్దయాహతిని
జాగరితను గావింపవో పితా!
సర్వకర్మ సుఖదు:ఖ విధాతా!

ఇంత క్లిష్టమైన పదాలు ఎలా వాడారో.. అనీ, రజని గారి  తెలుగు భాషా పరిజ్ఞానం ఎంత గొప్పదో అనీ ఆశ్చర్యం వేసేది చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడల్లా. పుస్తకంలో  అనువాదం క్రింద అయన పరిచయంలో ఈ గేయానికి స్వరాలను అందించిన స్వరకర్తగా కూడా పరిచయం చేసి ఉంటే బాగుండేది. 


రజనిగారు - రవీంద్రసంగీతం:

"టాగూర్ రత్న" అవార్డ్ గ్రహీత, వాగ్గేయకారులు శ్రీ రజనీకాంతరావు గారు కొన్ని రవీంద్రగీతాలకు స్వరాలను అందించారు. రజనిగారు 1961 లో టాగూర్ సెంటినరీ సెలబ్రేషన్స్( 1861- 1961) సందర్భంగా కొందరు ఆకాశవాణి కళాకారులను కలకత్తా పంపి నొటేషన్స్ తెప్పించి , హైదరాబాద్లో వాటికి తాన అనువాదాలతో పాటూ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు, డా.బెజవాడ గోపాలరెడ్డి తదితరులతో అనువాదాలు చేయించి, నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ తెలుగు అనువాదక రవీంద్రగీతాలను రవీంద్రుడు కూర్చిన అవే బాణీలలో ఆకాశవాణిలో రికార్డ్ చేసారు. ఈ గేయాలను గురించిన సిరీస్ నా 'సంగీతప్రియ' బ్లాగ్లో ఒక్కొక్కటే రాస్తున్నాను.



ఇంతే కాక ఈ గీతం పట్ల చాలా ప్రేమతో నాన్నగారు దీనికో ప్రత్యేకమైన ఫాంట్ వెతికి, టాగూర్ చిత్రంతో కలిపి ప్రింటవుట్ తీయించి ఫ్రేమ్ చేయించుకుని తన గదిలో పెట్టుకున్నారు కొన్నేళ్ల క్రితమే. క్రింద ఫోటో అదే..




***      ***     ***

మూడవది భలే పుస్తకం.. అది సినీసంగీతానికి సంబంధించినది. దాని గురించి రేపు రాస్తానేం..



Saturday, June 21, 2014

కొత్తపుస్తకాలు: 1. "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ".


                        


ఈ మధ్యన పనిమీద బజార్లోకి వెళ్ళినప్పుడు అటుగా ఉన్న పుస్తకాల షాపులోకి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొన్నాను. వాటి వివరాలు రాద్దామంటే కుదరట్లేదు..:( కొన్నింటి గురింఛైనా రాద్దామని ఇప్పుడు కూచున్నా. నేను కొనుక్కునే పుస్తకాలు మరెవరికైనా ఆసక్తికరంగా ఉండచ్చు, ఏ సమాచారమో వెతుక్కునేవారికి ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వాటి ఫోటోలు, వివరాలు బ్లాగ్ లో రాస్తూంటాను. ప్రదర్శించుకోవడానికో, ఇన్ని కొనేస్కున్నాను.. అని గొప్పగా ప్రదర్శించడానికి మాత్రం కాదు !! 


ముందు చివరగా కొన్న చిన్న పుస్తకం గురించి... 

కొన్న పుస్తకాలకి బిల్లు వేసేప్పుడు అటు ఇటు చూస్తూంటే కనబడింది ఈ పుస్తకం.. పేరు "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ". డా.దామోదరరావు గారి రచన, విశాంలాంధ్ర వారి ప్రచురణ. వెల నలభై రూపాయిలు మాత్రమే..:) ఇటువంటి పుస్తకం కోసం చాలారోజులుగా వెతుకుతున్నా నేను. చిన్నప్పుడు రేడియోలో వేసేవారు తప్పెట గుళ్ళు, యక్షగానం, బుర్ర కథ, జముకులు, వీర నాట్యం, చిందు భాగోతం మొదలైనవి. నాన్న కోసం రేడియో స్టేషన్ కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ కోసం వచ్చిన పల్లె జనాలు వాళ్ల గజ్జెలు, డప్పులు, ఆ శబ్దాలూ భలే విచిత్రంగా తోచేవి. వాళ్ళకు నాగరీకులతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. చాలా అమాయకంగా కనబడేవారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఈ కళారీతులను ప్రదర్శించుకుని జీవనం సాగించుకునేవారు వారు. ఆకాశవాణి వారు ప్రోగ్రాం వేసి రమ్మంటే వచ్చేవారు. రికార్డింగ్ అయిపోయాకా వెళ్పోయేవారు. కొన్ని కార్యక్రమాలని అవి ప్రదర్శించే ప్రదేశాలకు వెళ్ళి మరీ రికార్డింగ్ చేసుకుని వచ్చేవారు కూడా. నాన్న డ్యూటీలో ఉన్నప్పుడు నాన్న గొంతు వినడానికి ఆ పూట ట్రాన్స్మిషన్ అంతా వినేసేవాళ్లం. అలా కూడా నాకు కొన్ని జానపదాలతో పరిచయం ఉంది.


అది కాకుండా, ఫోక్ మ్యూజిక్ సెక్షన్ (ఎఫ్.ఎం అనేవారు) ఒకటి ఉండేది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో. దానికి కె.వి. హనుమంతరావుగారు అనే రేడియో ప్రయోక్త(ప్రొడ్యూసర్) ఉండేవారు. ఉద్యోగరీట్యానే కాక వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఈ జానపద కళారీతుల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఆయన ఎక్కడేక్కడి నుండో మారుమూల గ్రామాల్లో గాలించి కొన్ని మూలపడిపోతున్న జానపద కళారూపాల్ని ఆకాశవాణికి ఆహ్వానించి రికార్డింగ్ చేసేవారు.  ప్రజలకు అంతరించిపోతున్న ఈ కళారీతులను పరిచయం చేయడం కోసం విజయవాడ , గుంటూరు ,నెల్లూరు మొదలైన పట్నాల్లో విడివిడిగానూ, సామూహికంగానూ కూడా వీటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు హనుమంతరావుగారు. ఆ కార్యక్రమాలకు వ్యాఖ్యానం చెప్పటానికి నాన్న కూడా వెళ్ళేవారు. సామూహిక ప్రదర్శనల్లో అయితే జానపద రామాయణం, జానపద భారతం, జానపద భాగవతం అని ఈ కళారీతులన్నింటినీ కూర్చిఒక పదర్శన తయారు చేసి ప్రదర్శించేవారు. అంటే రామాయణ/భారత/భాగవతాల్లో ఒకో ఘట్టం ఒకో జానపద కళారూపం వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట! అలా అన్నీ మిక్స్ చేసి తయారుచేసిన ప్రదర్శనలు ఎంతో బాగుండేవి అని ఆ ప్రదర్శనలకు వెళ్ళి వచ్చాకా నాన్న చెప్తుండేవారు. కొన్ని విడివిడిగా ప్రదర్శించిన కళారూపాలైతే ఎప్పుడూ పేరు కూడా తెలియనివి ఉండేవిట. "రుంజ" అనే కళారీతి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందిట. మరో అపురూప కళారీతి అయితే కర్నూలు అటవీ ప్రాంతం లోనే ఉండేదిట. శ్రమకూర్చి వాళ్ళని కూడా పట్టణప్రాంతానికి తీసుకువచ్చి ప్రదర్శనలిప్పించేవారు హనుమంతరావు  గారు. 


ఆయన జానపద ప్రయోక్తగా ఉన్న కాలంలో ఢిల్లీ ఆకాశవాణి వారు ఒక ప్రతిపాదన చేసారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే జానపద కళారూపాల తాలూకూ సంగీత పరికరాలనీ, వాద్యాలనీ సేకరించి ఢిల్లీలో ఒక మ్యూజియం లో పదిలపరచాలనే ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆయన అకాల మరణానంతరం ఆ ప్రతిపాదన పూర్తయ్యిందో లేదో తెలీదు మరి. జానపద కళారీతుల గురించిన అటువంటి విశిష్ఠమైన కృషి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగింది. కొన్ని రికార్డింగ్స్ నాన్న దగ్గర ఇంకా ఉన్నాయనుకుంటా కూడా..


ఈ రకమైన పరిచయం వాల్ల కలిగిన ఆసక్తితో మన తెలుగువారి జానపద కళల గురించి మంచి పుస్తకమేదైనా దొరికితే బాగుండు అని పుస్తక ప్రదర్శనల్లో వెతుకుతూ ఉండేదాన్ని. చిన్నదైనా మొత్తానికి ఇది దొరికింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందీ అంటే.. ఒక నలభై తెలుగు జానపద కళారీతుల గురించిన సంక్షిప్త పరిచయం. ప్రాంతాల వారీగా వారి పరిచయాలు, వాటి వివరాలు, చిన్న చిన్న బొమ్మలు. అసలైతే, తెలుగునాట దాదాపు అరవై జానపద కళారూపాలు ఉన్నట్లుగా సుప్రసిధ్ధ జానపద, రంగస్థల ప్రయోక్త ఆచార్య మొదలి నాగభూషణం శర్మ తన పరిశోధన సేకరణలో తెలిపారుట. కానీ ఇప్పుడు వాటిల్లో ఎన్నో అంతరించిపోగా, కొన్నింటి పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవడం విచారకరం. ఈ జానపద కళల పరిరక్షణలో బెంగాలీ వాళ్ళకు ఉన్న శ్రధ్ధాసక్తులను మెచ్చుకుని తీరాలి.


ఈ పుస్తకంలో పరిచయం చేసిన కొన్ని జానపద కళారూపాల పేర్లు:
డప్పు నృత్యం, పులి వేషం, తప్పెట గుళ్ళు, కోలాటం, గరగలు, జంగం కథ, జముకుల కథ, కాకి పదగలు, భామా కలాపం, చిరుతల రామాయణం,  యక్షగానం, బుడబుక్కలు, చిందు భాగోతం, పిచ్చుక గుంట్లు, గురవయ్యలు.. మొదలైనవి. ఇవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ప్రదర్శించేవారు, ఎలా ఆడతారు మొదలైన వివరాలు క్లుప్తంగా ఇచ్చారన్నమాట. క్రింద కొన్ని చిత్రాలు ఉన్నాయి చూడండీ..












ఇంకా కొన్ని మంచి పుస్తకాల గురించి వరుసగా రాస్తాను... ఎదురుచూడండి...:-)

Thursday, June 12, 2014

పాట వెంట పయనం: నృత్యగీతాలు




సారంగ వారపత్రికలో ప్రచురితమవుతున్న 'పాట వెంట పయనం'లో ఈసారి నేపథ్యం "నృత్యగీతాలు"..

క్రింద లింక్ లో వ్యాసాన్ని చూడవచ్చు..
http://wp.me/p3amQG-2Kw

Wednesday, June 11, 2014

కాస్త ఉప్పు తక్కువైనా రుచి బానే ఉంది!



మొన్న శనివారం రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వస్తున్నాం.. సమయం 10:10 అయ్యింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న సినిమా హాల్ దగ్గరకు వచ్చాకా ఏదైనా సినిమాకి టికెట్లు దొరికితే వెళ్దామా అనుకున్నాం. మరి మొదలైపోయినా పర్లేదా అన్నారు అయ్యగారు. ఓకే పదమన్నాను. ఆ హాల్లో సెకెండ్ షో టైం పదింపావు, పది ఇరవై అలా ఉంటుంది. మూడు స్క్రీన్స్ హౌస్ఫుల్ ఉన్నాయి. నాలుగో దాంట్లో టికెట్స్ ఉన్నాయన్నాడు కౌంటర్లో. అదే "ఉలవచారు బిర్యాని" సినిమా. శనివారానికి నిన్న అంటే శుక్రవారం రిలీజయినట్లుంది ఆ సినిమా. "కొత్త సినిమాకి వీకెండ్ టికెట్లు ఉన్నాయా...? ఎలా ఉందయ్యా సినిమా..?" అనడిగితే పర్లేదండి బానే ఉందని చెప్పాడు టికెట్లబ్బాయ్. గబగబా హాల్లోకి ఎంటరయ్యేసరికీ ఆట మొదలయిపోయి ఓ పెళ్ళిచూపుల సీన్ జరుగుతోంది. 

 ఈ సినిమా చూసెయ్యాలని ఆశేమీ పడలేదు కానీ చూడద్దనేమీ అనుకోలేదు. పూర్వాపరాలు కొంత తెలుసు. ప్రకాష్ రాజ్ సొంత సినిమా అనీ, డైరెక్టర్ కూడా అతనే అనీ, ఒరిజినల్ ఒక మళయాళీ చిత్రమనీ,  ప్రకాష్ రాజ్ రైట్స్ తీసుకుని త్రిభాషా చిత్రంగా.. ఒకేసారి మూడు భాషల్లోనూ చిత్రీకరించారనిన్నీ, ఇంకా... ఇళయరాజా సంగీతం సమకూర్చారనీ తెలుసు.(అబ్బో ఎన్ని తెలుసో కదా :)) అంతకు ముందు అతను దర్శకత్వం వహించిన సినిమాలు చూడలేదు కానీ ఒక మంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ అంటే ఓ మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రకాష్ రాజ్ ను చూస్తున్నప్పుడు నాకు బాలీవుడ్ నటుడు నానాపాటేకర్ గుర్తుకు వస్తాడు. ఒకేలాంటి ఇంటెన్సివ్ ఏక్టింగ్ ఇద్దరిదీ. కాంట్రవర్సీస్ లో కూడా ఇద్దరూ సమానులే :)


ఇంక సినిమాలోకి వచ్చేస్తే... మొదట నన్నాకట్టుకున్నది ఇళయరాజా టచ్! మొదటి నుండీ చివరిదాకా అలా మనసుని తాకుతూ ఉంది. చిరపరిచితమైన ఆ ట్యూన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ బిట్స్, పాటల మధ్యన ఇంటర్లూడ్స్.. అన్నీ ఏదో లోకంలోకి తీసుకుపోతూ ఉంటాయి. పాటలు పెద్ద గొప్పగా లేవు :( కైలాష్ ఖేర్ తో పాడించిన పాట లిరిక్స్ బాగున్నాయి కానీ అతని గొంతు ఆ songకు నప్పలేదు. అంతకన్నా అసలు ఇళయరాజా పాడాల్సింది ఆ పాట. రెండవది "తీయగా తీయగా.." క్యాచీగా ఉంది. మూడోది ఓ మాదిరి. నాలుగోది సాహిత్యం బాగుంది. మొదటి రెండు వాక్యాలూ నాకు బాగా నచ్చాయి..

" రాయలేని లేఖనే మార్చటం ఎలా
తీయలేని రాగమే మరవటం ఎలా "

ఈ రెండు వాక్యాలు వినగానే కడుపు నిండిపోయింది. నాలుగింటిలో ఇది బాగుంది. సాహిత్యం చాలా బాగుంది. క్రింద లిస్ట్ లో ఆఖరి పాట..



ఇదేమీ అద్భుతమైన సినిమా అనను కానీ సినిమాలో గుర్తుండిపోయే సీన్స్ కొన్ని ఉన్నాయి. క్లాసిక్ టచ్ ఉన్న సీన్స్. డైరెక్టర్ టేస్ట్ తెలిపే సీన్స్. మణీరత్నం సినిమాలో కనబడేలాంటి సీన్స్ కొన్ని. ఆదివాసి జగ్గయ్య ను ఇంటికి తీసుక్కురావడం, కొన్ని సన్నివేశాల్లో అతని ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకంగా చూపెట్టడం. అలా అతన్ని ఇన్వాల్వ్ చెయ్యడం బాగుంది. స్నేహ డైలాగ్స్ కొన్ని బాగా నచ్చాయి నాకు. అలానే బ్రహ్మాజీ పాత్ర బాగుంది. బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ ల మధ్యన హాస్యం, ఇంట్లో వాళ్లందరి మధ్య నడిచే సంభాషణలూ బాగున్నాయి. వాళ్ళింట్లో డైనింగ్ టేబుల్ మధ్యన పెట్టిన బుల్లి బుల్లి జాడీలు బాగున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే రెండు మూడు సన్నివేశాల్లో ఆ జాడీలు అలానే ఉన్నాయి. మారిపోలేదు. 


నాకసలు అర్థం కానిది ఒక్కటే.. తెలుగులో ఈ Title(ఉలవచారు బిర్యాని) ఎందుకు పెట్టారా? అని. వేరే ఏదైనా పెట్టాల్సింది. అసలా పేరు పెట్టినందుకు ఓసారయినా బిర్యానీనో, ఉలవచారునో వాళ్ళు తింటున్నట్లయినా చూపలేదు. దోశ దోశ.. అని పిలుచుకున్నారు.. కనీసం ఆ కుట్టుదోశ పేరైనా పెట్టాల్సింది.


ట్రైలర్ చూసినప్పుడు "చీనీ కమ్" లాంటి సినిమానేమో అనుకున్నా. అలా తీసినా బాగుండేది. దోశ, కేక్ మేకింగ్ తప్పితే ఎక్కడా మళ్ళీ ఏ రెసిపీ గురించీ మాటలే ఉండవు. మొదటి భాగం ఎంత చకచకా గడిచిందో, రెండవ భాగం అంత స్లో అయిపోయింది సినిమా. ఆ పార్ట్ పట్ల శ్రధ్ధ తీసుకుని ఉంటే చాలా మంచి చిత్రంగా మిగిలి ఉండేది. రెండవ ప్రపంచ యుధ్ధం, ఆ రెయిన్బో కేక్ మేకింగ్ అదీ బాగా వచ్చింది. అలానే ఆదివాసి జగ్గయ్య వెనక్కి వెళ్పోయే సీన్ లో ఏ తెలుగు హీరోనో ఉండి ఉంటే దుమ్ము రేపేసి, అక్కడున్నవాళ్ళందరినీ చితగ్గొట్టేసి, కార్లు ఎగరగొట్టేసి జగ్గయ్యను ఎలాగైనా రష్కించేసేవాడు కదా అనిపించింది..:) అలాంటివి చూసినప్పుడు తిట్టుకుంటాం గానీ నిజంగా అలా మనుషుల్ని పడగొట్టేసి, తుక్కు రేగ్గొట్టేసి, జనాలూ.. 'అమ్మో వీడికి దూరంగా ఉండాలి' అనుకునేలాంటి హీమేన్ ఒకడుండాలి అనిపిస్తూ ఉంటుంది. 'భీమ్ బాయ్ భీం బాయ్..ఇక్కడన్యాయం జరుగుతోంది చూడు' అనగానే వచ్చేసి అక్కడివాళ్ళందరినీ చితగ్గొట్టేసేలాంటి హీమేన్ మనందరికీ కావాలి కదూ..!!




ఇంక స్నేగ..అదే మన స్నేహ గురించి ఎం చెప్పాలి? ఇంకా స్లిమ్ అయిపోయి బోళ్డు అందంగా ఉందిప్పుడు. మంచి మంచి కాటన్ డ్రస్ లు వేసేసుకుంది. కథ మొదట్లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు దోశ ఆర్డర్ ఇచ్చినప్పుడు వేసుకున్న కాటన్ డ్రెస్(పై ఫోటో లోది) నాకెంత నచ్చిందో. ముఖ్యంగా ఆ  గ్రీన్ చున్నీ..భలే ఉంది. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసాడు కానీ చివర్లో వాళ్ళీద్దర్నీ పక్కపక్కన చూస్తే.... మన స్నేగ పక్కన ఇతనేమిటీ.. రామ రామ... అనుకున్నా! 

ఓ పెళ్ళికాని అమ్మాయిగా స్నేహ పడే వేదన నిజంగా ఆలోచింపచేస్తుంది. దేశంలో ఎంత అభివృధ్ధి జరిగినా, ఎంత సంపాదన ఉన్నా, మన దేశంలో ఆడపిల్లకి పెళ్ళి అవ్వలేదు అంటే అదేదో ఘోరం, నేరం అన్నట్లు చూస్తారు ఇవాళ్టికీనూ! తన కాళ్ళపై తాను కాన్ఫిడెంట్ గా బ్రతికే అమ్మాయిని కూడా పెళ్ళి తప్ప జీవితానికింకో పరమార్థం లేదు అనుకునేలా చేసేస్తారు జనాలు. పెళ్ళి అనేది ఎవరికైనా జీవితంలో ఓ ముఖ్య ఘట్టం, ఓ భాగం తప్ప పెళ్ళే జీవితం కాదు అని ఈ దేశంలో ప్రజలు ఎప్పటికి నమ్ముతారో కదా అనిపించింది.


చివరికి ఎలానో కథ కంచికి తెచ్చి 'భశుం' అనిపించారు మొత్తానికి. హమ్మయ్య అనుకుని లేచి బయటకు నడిచాం. సినిమా ఇంకా బాగుండి ఉండవచ్చు కానీ హటాత్తుగా అప్పటికప్పుడు అనుకుని హాల్లోకి వెళ్ళి కూచుని డబ్బునీ, సమయాన్నీ నష్టపోలేదని మాత్రం అనిపించింది. నెమరేసుకోవడానికి కొన్ని చక్కని సన్నివేశాలు మిగిలాయి. 

హమ్మయ్య! మూడు రోజుల్నుండీ కుదరలేదు..ఇప్పటికి రాసాను :-)

Friday, June 6, 2014

రంగోబోతీ...రంగోబోతీ..




ఎందుకనో ఇందాకా "రంగోబోతీ... రంగోబోతీ.." పాట గుర్తుకు వచ్చింది. నెట్ల్ వెతుక్కుని చూసాను.. చదువుకునే రోజుల్లో ఎక్కువగా విన్న ఆర్.పి పాటలు.. మధురమైన ఉష గొంతు.. ఆ సినిమాలూ అన్నీ గుర్తుకువచ్చి.. కాసేపు ఎక్కడికో...వెళ్పోయా :-) 

ఒక పెక్యూలియర్ వాయిస్ ఆర్.పి.ది. నాకయితే బాగా నచ్చేది. "రంగోబోతీ.." ఓ ఒరియా జానపద గీతమని విన్నాం కానీ అప్పట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒరిజినల్ ఎప్పుడూ వినలేదు. ఇందాకా అది కూడా వెతుక్కుని విన్నాను.. బావుంది..అచ్చంగా అదే ట్యూన్. రీనిక్స్ లో ఏమీ మార్చలేదు. 


 ఆ ఒరిజినల్ ఒరియా జానపదం.. 

 


క్రింద ఉన్నది "శ్రీరామ్" సినిమా కోసం పట్నాయక్ చేసిన రీమిక్స్. ఈ సినిమాలో 'బాంబే జయశ్రీ' పాడిన 'తియతీయని కలలను కనడమే తెలుసు' పాట కూడా చాలా బావుంటుంది.


song: రంగోబోతీ..
singers: పట్నాయక్,  ఉష

 

Wednesday, June 4, 2014

నవ్వు వచ్చిందంటే కిలకిల.. ఏడుపొచ్చిందంటే వలవల..



పుట్టినరోజు 'బాలు'డికి జన్మదిన శుభాకాంక్షలు... ! 

బాలు పాడిన వేలకొద్దీ పాటల్లోంచి ఏ పాటలు టపాలో పెడదామా అని ఆలోచిస్తే ఒక పట్టాన ఆలోచన తెగలేదు.. అది..ఇదీ..కాదు..కాదు.. మరోటి..అనుకుంటూ..ఆఖరికి కొన్ని పాత పాటలను పట్టి తెచ్చాను. ఇళయరాజావీ, వంశీవీ, విశ్వనాథ్ వీ అసలు కలపలేదు. ఎందుకంటే వాళ్ల వి అన్ని మంచి పాటలే. ఎంచడం కష్టం. 

ఈ పాటల్లో ప్రత్యేకత ఏంటంటే.. వింటున్నప్పుడు ఏదో లోకంలోకి వెళ్పోయి ప్రతి  పాటతోనూ  కనక్ట్ అయిపోతాం..అలాంటి పాటలివి. ముఖ్యంగా సోలో సాంగ్స్ నే ఎన్నుకున్నాను. మరి వినేసి మీరూ ఆనందించండి..



నవ్వు వచ్చిందంటే కిలకిల..
 ఏడుపొచ్చిందంటే వలవల..
గోదారి పారింది గలగల..
దాని మీద నీరెండ మిలమిలమిల..
(ఈ పాట నాకు చాలా ఇష్టం)
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7231 



ఇది తొలి పాట.. ఒక చెలి పాట..
వినిపించనా ఈ పూటా నా పాట..
(చిత్రం:కన్యాకుమారి, సంగీతం: బాలు)




 నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా..



కలువకు చంద్రుడు ఎంతో దూరం..



 నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వెరే బ్రతుకెందుకు..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7232 



 మేడంటే మేడా కాదు..



మౌనం గానం మధురం (మయూరి)
http://youtu.be/BeuIrSww_SU 


సామజవరగమనా..
  


తకధిమి తక..ధిమితక ధిమి..






సిరిమల్లె నీవే..

 




మన్మధ లీల మధురము కాదా..(టైటిల్ సాంగ్)
http://www.raaga.com/player5/?id=193419&mode=100&rand=0.484851116547361 



 చుట్టు చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..(తూర్పు వెళ్ళే రైలు)
http://www.raaga.com/player5/?id=194907&mode=100&rand=0.791989358374849


 కో అంటే కోయిలమ్మ కోకొ....(తూర్పు వెళ్ళే రైలు)
http://www.raaga.com/player5/?id=194910&mode=100&rand=0.17367210565134883 


 రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
 



వనిత లత కవిత.. మనలేవులే కథత..
ఇవ్వాలి చేయూత.. మనసివ్వడమే మమత.. (
కాంచన గంగ)
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5098 



మనుషులా మమతలా ఏవిరా శాశ్వతం...(రావుగారిల్లు)
http://mio.to/album/28-telugu_movie_songs/30939-Raogarillu__1988_/#/album/28-telugu_movie_songs/30939-Raogarillu__1988_/ 



 చంద్రకాంతిలో చందనశిల్పం..




 సుందరమో సుమధురమో...


నేనొక ప్రేమ పిపాసిని..

 


పల్లవించవా నా గొంతులో..
  



ఆకాశంనీ హద్దురా..
.

Sunday, June 1, 2014

నవలానాయకులు - 6



జూన్ నెల కౌముదిలో.. ఈ నెల నవలానాయకుడు యద్దనపూడి 'కీర్తికిరీటాలు' నాయకుడు "తేజ"..
http://www.koumudi.net/Monthly/2014/june/june_2014_navalaa_nayakulu.pdf