సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 29, 2014

రాజా రవివర్మ





"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..." అనే పాటని రేడియోలో చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను కానీ 'రాజా రవివర్మ' అనే ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నారని మొట్ట మొదట నేను 6th క్లాస్ లో ఉండగా తెలిసింది. బెంగుళూరులో ఉంటున్న మా మావయ్యావాళ్ళు ఊరు మారిపోతున్నాం రమ్మని గొడవపెడితే నాన్న మమ్మల్ని బెంగుళూరు, మైసూరు తీసుకువెళ్ళారు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆంధ్రా దాటి వెళ్ళిన మొదటి ప్రయాణం కాబట్టి ఎంతో పదిలంగా గుర్తుండిపోయిందా ట్రిప్. అప్పుడు మైసూర్ మ్యూజియంలో చూసాం రవివర్మ వర్ణచిత్రాల్ని. చాలా ఫోటోలు కూడా తీసుకున్నాం. ఆ ట్రిప్ తాలూకూ అపురూపమైన ఫోటోలను ఫోటో స్టూడియో అతను మాయం చేసేసాడు. అందుకని ఆ ట్రిప్ ఇంకా బాగా గుర్తన్నమాట! తర్వాత మరోసారి 10th క్లాస్ లో ఉండగా మా స్కూల్ వాళ్ళు మైసూరు, బెంగుళూరు, తమిళ్నాడు ట్రిప్ కి తీసుకువెళ్ళినప్పుడు మరోసారి చూసాను. ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఇంట్లోవాళ్ళతో మూడో ప్రపంచయుధ్ధం చేయాల్సివచ్చింది.. సరే సరే గుండ్రాల్లోకి తీసుకువెళ్ళకుండా అసలు సంగతికొచ్చేస్తా... 



ఇవాళ అద్భుత చిత్రకారుడైన 'రాజా రవివర్మ' జయంతి(1848, Apr29th). రవివర్మ గురించిన చిన్న పుస్తకమొకటి ఆ మధ్యన దొరికింది. సుంకర చలపతిరావు గారు రచయిత. చిత్రకళాపరిషత్, విశాఖపట్నం వారి ప్రచురణ. వెల అరవై రూపాయిలు. ఇవాళ ఆ చిత్రకారుడి జయంతి సందర్భంగా ఈ చిన్ని పుస్తకంలోని విశేషాలు రాద్దామని సంకల్పం. రచయిత 'సుంకర చలపతిరావు' గారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ చిత్రకళా విమర్శకుల్లో ఒకరు. చిత్రకళ, శిల్పకళలపై నాలుగువందల పైగా వ్యాసాలు రాసారు. వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు మొదలైన ప్రముఖ ఆంధ్ర చిత్రకారుల ఆత్మకథలను ప్రచురించారు. చిత్రకళకు అందించిన సేవలకు గానూ ఎన్నో సత్కారాలు పొందిన వీరు ప్రస్తుతం 64కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకమండలిలో సభ్యులు. రవివర్మపై తనకు గల అభిమానమే ఈ చిన్న పుస్తక రచనకు కారణమని ఆయన తన ముందుమాటలో చెప్తారు.





ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు:



 భారతీయ పురాణేతిహాసాల నుండి ప్రేరణ పొంది అసలు ఫలానా దేవుడు ఇలా ఉంటాడు అని మనకు ఒక రూపాన్ని చూపెట్టిన తొలి భారతీయ చిత్రకారుడు రాజారవివర్మ. లక్ష్మి, సరస్వతి, రాధామాధవులు మొదలైన దేవతలు కాక, దమయంతి, అహల్య, రాధ, నల-దమయంతి, తిలోత్తమ, మేనక మొదలైన ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనుడు. ప్రత్యేక ఆహ్వానాలపై హైదరాబాదు, పిఠాపురం విచ్చేసి చిత్రాలు గీసారుట ఆయన. మరణించి వందేళ్ళు దాటినా ఆయనను మనం గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే "కళకు మరణం లేదు" అన్న నానుడిని ఆయన నిజం చేసినట్లే! సంస్కృతం, మళయాళం కు సంబంధించి ఇద్దరు పండితులను ప్రత్యేకంగా నియమించుకుని, వారితో పురాణాలు, ఇతిహాసాల్లోని శ్లోకాల అర్థాలు చెప్పించుకునేవారుట రవివర్మ. ఆ శ్లోకాల ఆధారంగా స్కెచ్ వేసుకుని వాటికి రంగులు అద్దేవారుట రవివర్మబాల్యంలో బొగ్గుతో గోడలపై పూలు, జంతువుల చిత్రాలు గీయడం చూసి  ఆయన విద్యాభ్యాసంతో పాటూ చిత్రరచననూ చేర్చారుట. నాయకర్ అనే ఆస్థాన చిత్రకారుడు చిత్రకళలో మెళకువలు నేర్పడానికి నిరాకరిస్తే, ఆయన శిష్యుడైన ఆర్ముగంపిళ్ళై రాత్రివేళల రహస్యంగా తనకు తెలిసిన విద్యను రవివర్మకు నేర్పేవారుట. ఒక బ్రిటిష్ వైస్రాయ్ ఆహ్వానంపై జెన్సన్ అనే బ్రిటిష్ చిత్రకారుడు తిరువాన్కూరు రాజాస్థానానికి వచ్చాడుట. అతను కూడా రవివర్మకు ఆయిల్ పెయింటింగ్ నేర్పించడానికి నిరాకరించాడుట కానీ దూరం నుండి తన చిత్రరచనను రవివర్మ చూడటానికి అంగీకరించాడుట. అలా బ్రెష్ ఉపయోగించే విధానం, రంగులు పూసే పధ్ధతి ఒక నెల రోజులు పరిశీలించాకా తన సొంత శైలిలో చిత్రరచన మొదలుపెట్టారుట ఆయన. ఒక తపస్సులా చిత్రకళ సాధన చేసేవారుట. . స్థానికంగా దొరికే ఆకులు, పువ్వులు,బెరడు, కోడిగుడ్డు సొన, మట్టి,విత్తనాలు, ఆలివ్ నూనె ఉపయొగించి రంగులు సొంతంగా తయారుచేసుకునేవారుట రవివర్మ. 




చిత్రకళ గురించిన "శ్రీ మహావజ్ర భైరావతంత్ర" అనే గ్రంధం ఆయనకు ప్రియమైనదిట. చిత్రకారుడు సత్యవంతుడు, గుణవంతుడు, పవిత్రంగా జీవిస్తూ పాండిత్యం గలవాడై ఉండాలి. అంతేకాక దానశీలత, దైవభక్తి, ఆదర్శప్రాయమైన నడవడి కలిగి కోపిష్ఠి, బధ్ధకస్తుడు కారాదని ఆ గ్రంధంలో చిత్రకారుడికి ఉండవలసిన లక్షణాలు పేర్కొన్నారుట. అదే విధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని మలుచుకున్నారుట రవివర్మ.






మైసూరుకు దగ్గరలో ఉన్న మూకాంబికాదేవిని ఆయన ఆరాధించేవారుట. అమ్మవారిని దర్శించడం కోసం నలభైఒకటి రోజులు కాలినడకన ప్రయాణించి ఆలయాన్ని చేరుకున్నారుట. ఆ తిరుగు ప్రయాణంలోనే ఆయనకు వృత్తిపరమైన అవకాశం వచ్చింది. అది మొదలు జీవం ఉట్టిపడే ఎన్నో కుటుంబాల రూపచిత్రాలు, రాజ దంపతుల చిత్రాలు ఆయన గిసారు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో కూడా ఆయన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రామాయణ, భారత,భాగవతాల్లోని ముఖ్య దృశ్యాలను ఒక పక్క,  రాజ కుటుంబాలకు చెందిన రూపచిత్రాలు ఒక పక్క, ప్రాచీన ప్రబంధాల ముఖ్య దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు, ఉహాచిత్రాలూ ఎన్నో సహజ సుందరంగా చిత్రించి కళాభిమానుల మన్ననలు పొందారు రవివర్మ. తైల వర్ణాల గురించి మనకు తెలియని రోజుల్లో స్వశక్తితో సాధన చేసి, రంగుల్ని తయారు చేసి, ఆ వివరాలు మనకు అందించారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఈ కళాతపస్వి కి కూడా విమర్శలు తప్పలేదు. 




తమ్ముడు రాజవర్మతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేదిట. చిత్రకళారంగంలో ఇరువురూ రామలక్ష్మణలుగా కీర్తి  పొందారుట. తమ్ముడి మరణం తాలూకూ విషాద ఛాయలు ఆయన చిత్రాలపై ప్రభావం చూపాయిట. ఆరోగ్యం క్షీణించి ఎన్నో అసంపూర్ణ చిత్రాలను వదిలేసి 1906,అక్టోబర్ రెండున రవివర్మ కన్నుమూశారుట. " నీ చిత్రాలను స్వర్గంలో ఉన్న దేవతలతో పోల్చిచూడటానికి స్వర్గానికి వెళ్ళావా.." అంటూ ఆయనకు నివాళులర్పింఛారుట తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి. 




మూడు రవివర్మ చిత్రాలను పోస్టల్ స్టాంపులుగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. జె.శశికుమార్ అనే భిమాని ఆయనపై డాక్యుమెంటరీ నిర్మించారు. మళయాళంలో "మరకమన్జు" అనీ, హిందీలో "రంగ్ రసియా" అనీ ఆయన జీవితచరిత్రను తెర కెక్కించారు. ఆయన శత జయంతినీ, శత వర్ధంతినీ అభిమానులు వైభవంగా జరుపుకున్నారు. ఆయన జీవిత చరిత్రపై ఎన్నోఆంగ్ల గ్రంధాలు ప్రచురించబడ్డాయి . వాటిల్లో కొన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ముద్రించబడ్డాయి కూడా. ప్రాక్ పశ్చిమ కళారీతుల్ని జోడించి భారతీయ కళారంగంలో ఓ నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడిగా గుర్తుంచుకోదగ్గ మహోన్నతుడు శ్రీ రాజా రవివర్మ.







పుస్తకంలో ప్రచురించిన కొన్ని చిత్రాలు:










(రవివర్మ చిత్రాలు అంతర్జాలంలో కూడా లభ్యమవుతున్న కారణంగా పుస్తకంలోని ఫోటోలు ఈ టపాలో ప్రచురిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరమైతే తొలగిస్తాను.)

Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..



'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!

Wednesday, April 23, 2014

ఈ పాటతో ఆరొందలు!





ఇవాళ రెండు విశేషాలు.. అన్ని బ్లాగుల్లో కలిపి 882 పోస్ట్ లు ఉన్నా, నాకెంతో ప్రియమైన 'తృష్ణ'లో ఆరొందల స్వగతాలు పూర్తయ్యాయి. ఒక నెల తక్కువ ఐదేళ్ళూగా నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు.


రెండవది.. ఇవాళ సుప్రసిధ్ద గాయని ఎస్.జానకి పుట్టినరోజు! అందుకని స్పెషల్ గా ఆవిడ పాడిన తెలుగు పాటలు కాకుండా నాకు బాగా ఇష్టమైన ఓ తమిళ్ పాటని వినిపిస్తున్నాను. జానకి చాలా బాగా పాడిన పాపులర్ సాంగ్స్ లిస్ట్ లో తప్పక ఉండే పాట ఇది. తమిళంలో భారతీరాజా తీసిన "Alaigal Oyivathillai" (తెలుగులో  "సీతాకోకచిలుక") చిత్రంలోని గీతం ఇది.

చిన్న క్విజ్ కూడా... ఈ పాట 'పల్లవి'ని ఇళయరాజా మళ్ళీ ఎక్కడ, ఏ రూపంలో వాడుకున్నాడో చెప్పగలరా ఎవరైనా?

Tuesday, April 22, 2014

గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే..




"...గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే
కళ్లల్లో బాసలన్నీ రాగాలై సాగెలే..
ముద్దబంతి పూచెనులే.. తేనెజల్లు చిందేనులే..
ఊహలన్నీ ఊరేగెనే నందనాలు విందు చేసెనే.."

ఎందుకో ఈ పాట గుర్తుకు వచ్చింది.. టిపికల్ ఇళయరాజా ట్యూన్.. అద్భుతమైన ఇంటర్లూడ్స్.. ఈ పాటకు తమిళ్ లో యేసుదాస్ గళమే నాకు బాగా నచ్చుతుంది.. 

 తమిళ్ version:

   


  తెలుగు version: 




Monday, April 21, 2014

तुझ बिन सूरज मॆं आग नही रॆ..




కొత్తగా వచ్చిన '2 States' సిన్మాలో పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 


బానే ఉందనిపించిన '2 States'



సిన్మా చూడ్డానికి ఊళ్ళో హాల్స్ కి వెళ్లాలంటే పదిహేను, ఇరవై కిలోమీటర్లు పైమాట. అంత పరుగులెట్టే గొప్ప సిన్మాలు లేవు..టైం వేస్ట్ కూడా. సో, మా ఇంటి దగ్గర హాల్లోకొచ్చిన వాటిల్లో ఏదో ఒకటి చూడటం కుదురుతోందీ మధ్యన. ఇంట్లో అత్తయ్యగారున్నారని పాపని అట్టేపేట్టి, రిలీఫ్ కోసం ఏదో ఒకటిలెమ్మని ఈ సినిమాకెళ్ళాం. షరా మామూలే.. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల, గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేసరికీ సిన్మా మొదలైపోయింది :( 


ఈ చిత్రానికి ఆధారమైన నవల చదవలేదు కానీ 'ట్రైలర్' చూసి అసలు చూడాలనుకోలేదీ సినిమా. కాలేజీపిల్లలను తప్పుదోవ పట్టించేట్లు ఉందనిపించింది! ఫస్ట్ హాఫ్ నిజంగా అలానే ఉంది. ఇళ్ళకి దూరంగా హాస్టల్లో చదువుకునే పిల్లలంతా నిజంగా ఎలా ఉంటారో తెలీదు కానీ ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా భయమేస్తుంది పిల్లల్ని దూరాలు పంపడానికి. పైగా ఈమధ్యన సినిమాల్లో ఇలా పెళ్ళికాని ప్రేమికుల మధ్యన ఇంటిమేట్ సీన్స్ చూపించడం రివాజయిపోయింది. సమాజం ఏమైపోతోందో..నైతిక విలువలు ఎటు పయనిస్తున్నాయో.. అన్న దిగులు కలుగుతుంది ఇలాంటివి చూసినప్పుడు. 


ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అక్కడక్కడ బోరింగ్ అనిపించింది. ఇదేదో కాలేజీ పిల్లల కోసం తీసిన సినిమా.. పొరపాటున వచ్చామా..అనుకున్నాం కానీ సెకెండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎక్కడైతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చూపించాడో, అక్కడ స్టోరీలో డెప్త్ వచ్చింది. "ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు కానీ పెళ్ళాడాలంటే రెండు కుటుంబాలు కలవాలి" అనే డెఫినిషన్తో తెలుగులోనూ, హిందీ లోనూ కూడా డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల పిల్లల మధ్యన ప్రేమ,పెళ్ళి నేపథ్యంతో రీసేంట్ గా చెప్పాలంటే 'చెన్నై ఎక్స్ప్రెస్' లో తమిళమ్మయి-హిందీ అబ్బాయి, దానికన్నా ముందు 'విక్కీ డోనర్' లో పంజాబీ-బెంగాలీ ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ చూపెట్టారు. ఇందులో కొత్తగా ఏముందంటే తండ్రీ కొడుకుల మధ్యన డిస్టర్బ్ద్ రిలేషన్. అది గ్రాడ్యువల్ గా ఎలా బాగయ్యిందో చూపెట్టడం బాగుంది. టివీ సీరియల్స్ తో తలపండిపోయిన రోనిత్ రాయ్ హీరోకి తండ్రిగా బాగా చేసాడు. అమృతా సింగ్ కన్నా వీరోవిన్ తల్లి పాత్రలో రేవతి బాగా మెప్పించింది. 


"ఐ వాంట్ టూ మేరీ యువర్ ఫ్యామిలీ" అని హీరో త్రీ రింగ్స్ తో ప్రొపోజ్ చెయ్యడం చాలా బాగుంది. బాలీవుడ్ కి మరో యంగ్ & ప్రామిసింగ్ హీరో దొరికాడు. పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటే నిలబడగలడు. క్రితం వారం ఏదో పేపర్లో ఇతనిదో పెద్ద ఇంటర్వ్యూ చదివాను. అందులో ఎంతవరకూ నిజాయితీ ఉందో తెలీదు కానీ బాగా మాట్లాడాడు. ఇక 'ఆలియా భట్' గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. చిరునవ్వుతో సహా తల్లిపోలికలు బాగా ఉన్న యంగ్ & ఎనర్జిటిక్, టాలెంటెడ్ తాటాకుబొమ్మ. చివర్లో పెళ్ళికూతురు డ్రెస్ లో అచ్చం బొమ్మలా ఉంది. చిన్నవైనా expressive eyes ఉన్నాయీ అమ్మయికి. But, సినీలోకపు కమర్షియల్ పరుగుపందాల్లో జారిపోకుండా ఉంటుందా అన్నది ప్రశ్నే! 


తమ కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నాలేమీ ఫలించట్లేదని, క్రిష్ కూడా సహకరించట్లేదనిపించి అతనికి దూరంగా జరిగడం నచ్చింది నాకు. ఆ పాయింట్ లో, మళ్ళీ హీరో తండ్రి వచ్చి వెళ్ళాకా క్రిష్ కు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి పాత్రకు ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. అక్కడ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఒక మామూలు కమర్షియల్ సినిమాలా మూడు ఫైట్లు, ఆరు పాటలతో పూర్తి చెయ్యకుండా ప్రేమికులు తల్లిదండ్రుల అనుమతి కోసం పాటుపడడం అనే కాన్సెప్ట్ వల్ల వెయిటేజ్ పెరిగి బానే ఉంది.. పైసా వసూల్.. అనిపించుకుందీ సినిమా. Moreover.. there is love... love that we can feel with our hearts! 


పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 



Friday, April 18, 2014

పాట వెంట పయనం: వర్షం


ఈ నెల 'పాట వెంట పయనం' లో నేపథ్యం.."వర్షం"! ఎండలు మండిపోతున్నాయి కదా అని కాసేపు వాన పాటలు చూస్తే మనసైనా చల్లబడుతుందని...

http://magazine.saarangabooks.com/2014/04/16/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%8A%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF/

Thursday, April 17, 2014

నాన్న చెప్పిన 'ఆవకాయ' కబుర్లు..




హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...

నాన్న మాటల్లో..:

" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. 

కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:
ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు మిరపకాయలు(వెడల్పాటివి) కిరాణాకొట్లో అమ్మేవారు. ఎరుపుదనం, కమ్మదనం వాటి స్పేషాలిటీ. అప్పుడే ఎక్కువకొనేసుకుని ఏడాది పొడుగునా రోజువారీ వాడకానికి దాచేవారుట. వాటిని రెండు మూడూ ఎండలకి లోపల గింజలు గలగలలాడేలా బాగా ఎండనిచ్చి, వాటితో కారం కొట్టించడం మొదటి పని. ప్రతీ ఇంట్లోనూ రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి. చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లోంచీ ఒక రిథిమ్ లో వినిపించేది కారం దంచే చప్పుడు. ఇలానే రాళ్ళుప్పు కూడా ఎండబెట్టి కొట్టించేవారు. మెంతికాయ కోసం మెంతులు కూడా వేయించి గుండ కొట్టించడం మరో పని. వీటితోపాటూ ఆవాలు కూడా. వాటిల్లో మళ్ళీ సన్నావాలు,పెద్దావాలు. సన్న ఆవాల ఆవకాయ అని విడిగా పెట్టేవారుట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఏ ఆవాలు నాణ్యమైనవో తెలుసుకోవడానికి నాలుగు కిరాణా కోట్లూ తిరిగి ఇంట్లో వాళ్ళు సాంపిల్స్ తేవడం ఒక పని.

పప్పునూనె:
దాదాపు నువ్వుల పంటే ఉండేది చాలామందికి. బస్తాల్లో నువ్వులు వచ్చాకా, నూపప్పు డబ్బా అని చిల్లుల డబ్బా ఒకటి ఉండేది. ఆ డబ్బాలో నానబెట్టిన నువ్వులు పోస్తే, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేసేది. చేత్తో పిసిగితే నువ్వుల పై పొట్టు పోయేది. అది బయట పారేసి, ఛాయనూపప్పు ఒక్కటీ బయటకు తీసేసి ఎండబెట్టేవారు. ఆ తర్వాత వాటిని గానుగకి తీసుకువెళ్ళి ఆడించడం. ఈ పనొక్కటీ మా పిల్లలకు అప్పచెప్పేవారు. మేం కూడా గానుగ దగ్గరకు ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే రంగులరాట్నంలా గిరగిరా తిరిగే గానుగ మీద కూచుని తిరగచ్చని సరదా. గానుగెద్దు గిరగిరా తిరుగుతుంటే గానుగ లోంచి విచిత్రమైన ధ్వనులతో సంగీతమొచ్చేది. ఆ గానుగ సింఫనీ చాలా బాగుండేది. ఎందుకో తెలీదు కానీ నువ్వులతో పాటూ బెల్లం కూడా గానుగలో వేసేవారు. గానుగ ద్వారా పప్పు నూనే కాకుండా తెలగపిండి కూడా వచ్చేది. గానుగలోంచి వచ్చిన ఫ్రెష్ పప్పు నూనె వాసన తాగెయ్యాలనిపించేంత తియ్యగా ఉండేది. ఇదంతా బెల్లం మహత్యం అయి ఉండచ్చు.

ఆవకాయ కాయ:
ఇలా సంబారాలన్నీ సమకూర్చుకున్నాకా, అసలు సిసలైన మామిడికాయ ఎంపిక మొదలయ్యేది. పుల్లటి పులుపు, పీచుదనం, ఏడాది పొడుగునా నిలవ ఉండే నాణ్యత ఆవకాయ కోసం వెతికే ఉత్తమ మామిడి లక్షణాలు.
కోతుల తోట అని ఓ పొలం ఉండేది మాకు. అందులో ఒకే ఒక ప్రశస్థమైన మావిడి చెట్టు ఉండేది. అది ఊరగాయల టైం కి కనీసం రెండువేల కాయ కాసేది. ఇంట్లోని నాలుగు కుటుంబాల వాళ్ళకీ విడివిడిగా జాడీలతో పెద్ద పెద్ద కుండలతో ఊరగాయ కి సరిపడా కాయ కాసేది ఆ ఒక్క చెట్టూ! ఇది కాక గోదావరి లంకలో పెద్ద మామిడి తోటే ఉండేది. బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జొన్నల రసాలు, కొబ్బరి మామిడి, ఏనుగు తలకాయ మామిడి, ఇంకా అనేక రకాక జాతుల మామిడి చెట్లు ఉండేవి. వేసంకాలం నాటికి ఈ మామిడి చెట్ల నుండి టాటాకు బుట్టలతో రకరకాల మామిడి పళ్ళు ఇంటికి వచ్చినా, ఊరగాయ కాయ మాత్రం కోతుల తోట లోని ఆ ఒక్క మామిడి చెట్టు నుండే వచ్చేది.



కాయ దింపడం:
పొడుగాటి గడకర్రకి చివర్న తాడుతో చిక్కం(తాడుతో అల్లిన బుట్టలాంటిది. పదిపన్నెండు కాయలు ఒకేసారి పట్టేవిట అందులో.) కట్టేవారు. కాయ క్రింద పడకుండా ఆ చిక్కం లోకే పడేలాగ చెట్టు నుండి వేరు చేసి కాయ కోయడం ఒక కళ. కాయ పరువుకి రావడం అనేవారు. అంటే ఇంకొక నాలుగు రోజులు ఆగితే కాయ పండిపోతుంది. అలా పరువుకి వచ్చిన కాయలు మాత్రమే ఊరగాయకి పనికి వచ్చేవి. ఆ కాయలు మరకత్తిపీటతో(ఆ కాలం పల్లెటూళ్ళలో ప్రతీ ఇంటా ఒక మరకత్తిపీట ఉండేది) ముక్కలు క్రింద కొట్టేవారు. కాయ సైజుని బట్టీ ఎనిమిది గానీ పన్నెండు గానీ ముక్కలయ్యేవి. ప్రతీ ముక్కకీ మధ్యలో డొక్క ఉండితీరాలి. అలా లేకపోతే అది ఆవకాయకి పనికిరాదు. మామిడికాయ కట్ చేసినప్పుడూ ముక్కతో పాటూ జీడి కూడా వస్తుంది కదా, ఆ జీడి, డొక్క పైపొర తీసేసి చిన్న బట్టతో ముక్కను తుడిచి రెడీ చేసేవారు. కాయ పరువానికొచ్చిందేమో, ప్రతి ముక్కా లేత పసుపు రంగులో ఉండేది. 
తెలుపుకీ, పసుపుకీ మధ్య రకం అన్నమాట. ఇక్కడికి ఆవకాయకి ముడిసరుకు రెడీ అయినట్లే. 

ఆవకాయ కలపడం:
నాపరాయితో తాపడం చేసిన అరుగు శుభ్రం చేసుకుని మిరపకాయ,ఉప్పు గుండ, ఆవపిండి పాళ్ళ ప్రకారం కలిపేసి, ఆ గుండ మధ్యలో కొత్తగా తయారయి వచ్చిన పప్పు నూనె కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రం చేసిన మామిడికాయ ముక్కలు వేస్తూ గుచ్చెత్తేవారు. దీంట్లోకి ఎవరు రుచిని బట్టి వాళ్ళూ వెల్లుల్లిపాయ, మెంతులు, శనగలు, లవంగాలు కలుపుకునేవారు విడివిడిగా. లవంగాల ఆవకాయ ముఖ్యంగా రాజుల ఇళ్ళల్లో పెట్టేవారు. ఏడాది పొడుగునా ఎప్పుడు జాడీ లోంచి ఆవకాయ తీసినా మంచి లవంగాల వాసన వస్తూ ఉండటం ఈ లవంగాల ఊరగాయ ప్రత్యేకత. మా ఇంట్లో అయితే పది రకాల ఆవకాయలు పెట్టేవారు. వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లి లేనిది, పెసర ఆవకాయ, నూపప్పు ఆవకాయ, అల్లం ఆవకాయ, శనగల ఆవకాయ, సన్నావాల ఆవకాయ, పచ్చ మెరపకాయలతో పెట్టే పచ్చావకాయ(ఇది విపరీతమైన కారంగా ఉంటాయి ఈ పచ్చమిరపకాయలు), పులిహారావకాయ , బెల్లంపావకాయ.

భోజనాల దగ్గర ఊఅగాయ వడ్డించేప్పుడు ఊరిన వెల్లుల్లిపాయల కోసం పిల్లలం పోట్లాడుకుంటూన్నామని వెళ్ళూల్లిపాయలు దండగా గుచ్చి ఊఅగాయలో వేసేవారు. ఎన్నికావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మిగిలిన దండ మళ్ళీ జాడిలో వేసేసేవారు. ఊరీఊరని ఊరగాయ, వచ్చీరాని కబుర్లు ముచ్చటగా ఉంటాయని అన్నట్లుగా ఉండేది కొత్తావకాయ. పాళ్ళు సరిపోయాయా లేదా అని ఇరుగుపొరుగులు ఆవకాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఓ హాబీలా ఉండేది."

***    ***      ***

ఊరగాయల గురించి ఇదివరకూ రాసిన కబుర్లు..

* మామ్మయ్య ఊరగాయలు:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_04.html
* ఊరగాయ వైరాగ్యం:
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_15.html


Friday, April 11, 2014

శిలకోల కథలు




పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు షాప్ త్వరగా మూసేసారు. అక్కడ నుండి కాస్త దూరంలో ఉన్న మరో విశాలాంధ్ర బ్రాంచ్ కు వెళ్తే అదీ మూసేసారు. అక్కడి నుండి కాళ్ళీడ్చుకుంటూ నవోదయాకు కూడా వెళ్ళాను. వాళ్ళసలు పేరే వినలేదన్నారు. ఏవో వేరే బుక్స్ కొనుక్కుని వచ్చేసా. మళ్ళీ వారం ఈసారి షాపు ఉందో లేదో కనుక్కుని విశాలాంధ్రకు వెళ్ళా. వాళ్ళూ పుస్తకం గురించి తెలీదన్నారు. మార్చ్ ఎండింగ్ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆఖరుకి మళ్ళీ కినిగె ద్వారానే తెప్పించుకున్నా పుస్తకాన్ని. కినిగె ఆర్డర్ ఓ  క్లిక్ దూరమే కానీ నే చేసిన పొరపాటు వల్ల నెట్ బ్యాంకింగ్ లో ఏదో తేడా జరిగి, శ్రీవారు చెయ్యిపెట్టి బాగుచేసేదాకా ఆగవలసి వచ్చింది. అలా కళ్ళు కాయలు కాసాకా ఈ పుస్తకం చేతికొచ్చింది. దీనితో పాటూ మరో మంచి పుస్తకం కూడా తెప్పించుకున్నా.(దాని గురించి ఇంకోసారి రాస్తాను.) ఈ "శిలకోల కథలు" మాత్రం చాలా బాగుంటాయి అని నాకెందుకో ఓ నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తోడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలన్నట్లు మొదటి కథ చదవగానే నాకు అర్థమైపోయింది నేనో మంచి పుస్తకాన్ని చదవబోతున్నానని!


రచయిత 'మల్లిపురం జగదీశ్' ఎవరో తెలీదు నాకు. ఉత్తరాంధ్ర సాహిత్యంతో పెద్ద పరిచయమూ లేదు, అక్కడి ఆదివాసీ జీవనం గురించిన అవగాహనా లేదు. ఇదివరలో చదివిన వంశీ 'మన్యంరాణి' వల్ల గిరిజనుల ఆచారాలు, జీవనవిధానం,కట్టుబాట్ల గురించి కాస్త వివరం తెలిసింది; తర్వాత వాడ్రేవు వీరలక్ష్మి గారి 'కొండఫలం' లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించిన మూడు నాలుగు కథలు ఉన్నాయి. ఇప్పుడీ పుస్తకం  చదివితే మాత్రం ఆ గిరిజనులతో ఏం సంబంధం లేకపోయినా వారికి తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి చదువుతుంటే ఒక విధమైన ఆవేశం మనసుని కమ్మేసింది. అభివృధ్ధి ముసుగులో ఇన్ని అన్యాయాలు జరిగాకా ఏ గిరిజనుడు 'పల్లపోడిని' నమ్ముతాడు? అనిపించింది. 'ఇప్పమొగ్గలు' కథలో 'బూది' వేసిన ప్రశ్నలే నా మనసులో కూడా ప్రతిధ్వనించాయి.. 

"వీళ్ళలో చదువుకోనిదెవరు? చదువేం నేర్పింది? ఈ చదువుల్తో ఎవరు మాత్రం సుఖంగా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు..."

"ఛీ..వీళ్ళు మనుషులేనా? అదవిని నమ్ముకుని కొండల్లోనూ, గూడల్లోనూ నివసిస్తున్న తమ వాళ్ల పట్ల ఇంతటి నీచ భావమా? ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం.. పండో, కాయో, మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం.. కొండఫలంలోని కొంత నేస్తానికివ్వడం తమ సాంప్రదాయం. అతిధుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం తమ సంస్కారం." అంటుందామె.
'బాకుడుంబారి' కథలో 'శ్రీధర్' ప్రశ్నలు కలతపెడతాయి. ఆధునిక ప్రపంచంలో ఎన్నో అభివృధ్ధి కార్యకరమాలు జరుగుతున్నా కూడా కూడా వీళ్ళకీ పేదరికం ఏమీటి? విద్య అందుతున్నా ఇలా వెనుకబడే ఉన్నారేమిటి? ఈ ప్రాంతాల వాళ్ల భవిష్యత్తేమిటి? అని ఆవేదన కలుగుతుంది. రచయిత కథలు రాస్తే, చదివిన నా ఆవేదనని ఇలా టపా రూపంలో రాస్తే, ఈ పుస్తకం గురించి మరో నలుగురికి తెలుస్తుందనిపించింది.


అసలివి కాలక్షేపం కథలు కానే కావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులూ, వాళ్ళకు జరిగిన జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టేట్లుగా రచయిత గీసిన ఒక రేఖా చిత్రం. ప్రతి పేజీలో, ప్రతి వాక్యంలో తరతరాలుగా అణిచివేయబడుతున్న గిరిజనుల నిస్సహాయ జీవితచిత్రాలు కనబడతాయి. ఒక్కో కథలో ఒక్కో సమస్యనూ ఎంతో వైవిధ్యంగా మనముందుంచారు జగదీశ్ గారు. అసలు కథలంటే ఏమిటి? జీవిత చిత్రాలే కదా. యదార్థానికి ప్రతిరూపాలే కదా. ఒక కథ మనసుకి హత్తుకుని రచయిత తాలూకూ భావోద్వేగాన్ని పాఠకుడు అందుకోగలిగినప్పుడు ఆ కథ సజీవమౌతుంది. అజరామరమౌతుంది. అలా లేనప్పుడు అసలు ఏ కథైనా రాసీ ప్రయోజనం ఉందదని నా అభిప్రాయం. ఈ పుస్తకంలో ప్రతీ కథా హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తుంది. ఏదైనా చేసి ఆ కథల్లోని మనుషుల వేదనను తగ్గించాలనిపిస్తుంది. నాలాగే ఈ పుస్తకం చదివినవారందరికీ అనిపిస్తే, "శిలకోల" అనే అనువైన పేరుతో జగదీశ్ చేసిన ఈ సాహితీ సృజన వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరగలదనే నమ్మకం కలిగింది.


జగదీశ్ గారి రచనా శైలి చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చిన్నవే అయినా వాటి వెనుక అర్ధాలు బోలెడున్నాయి. వాక్యాలు సున్నితంగానూ, వాడిగా కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను..

* "ఈ చరిత్రొకటి. అదెక్కడ మొదలౌతుందో కానీ ఏదీ అర్థం కాదు. ఆ మాటంటే మట్టిబుర్రలు, ఒక్కరోజైనా పుస్తకం తీస్తే అర్థమౌతుందని నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు."

* "వెర్రీ గుడ్ రా... వెయ్యేళ్ళు వర్థిల్లు.." తెరలు తెరలుగా నొక్కి చెప్పారు. 
అది దీవెనో, శాపమో వాడికే అర్థం కాలేదు.

* ఆడి పెల్లి కర్సులకని పోతులు అమ్మేసాను. కొండ మీద నల్లని తల్లి మా జిలుగుసెట్టూ, సింత సెట్టూ అమ్మేసేను. ఇంకా సాల్లేదని సావుకారి కాడ అప్పు తెచ్చఏను. ఇద ఈ పొద్దు ఆడు పిల్లల్తండ్రైనాడు. ఉజ్జోగస్తుడైనాడు, గానీ అప్పు అలాగే ఉండిపోయింది. నా గోచీ ఇలాగే మిగిలిపోయింది.

* అక్కడక్కడ దిసమొలల్తో అనారోగ్యంతో నింపుకున్న పెద్దపెద్ద పొట్టల్తో ఆటలాడుకుంటున్న ఆదివాసీ బాలలు.. అభివృధ్ధికి ఆనవాళ్ళూగా...

* పింటుగాడు ఆడుతున్న రేడియో లోంచి "మంచి పోషక విలువలు గల ఆహారం" అనే అంశం మీద డాక్టర్ గారి ప్రసంగం వినిపిస్తోంది.

* వాళ్ళనక్కడ చూస్తూంటే కొండ మీద చెట్లను తెచ్చి నగరంలో నాటి నీళ్ళు చిలకరిస్తున్నట్లుంది.

* అడవి...ఎలా ఉండేది?
ఇప్పుడది ఆరిన నిప్పు.
కొండ?
కన్నీటి కుండ.

* ఈ మౌనం ఇప్పటిదా?
దీని వెనుక దాగిన కథలెన్నో!
దశాబ్దాల నాటి వ్యధలెన్నో కదా!!

ఈ వాక్యాలు చాలు ఈ కథల గురించి ఇంకేం రాయక్కర్లేదు నేను. ఇవాళ విచిత్రంగా ఈ కథల్లోని సారం అంతా ఉన్న ఒక కవిత దొరికింది. క్రింద లింక్ లో ఆ కవిత చదవవచ్చు:
శిలకోల చూపు



ఈ పుస్తకంలోని అక్షరాల్లో నాకో విచిత్రం కనబడింది. "క్ష" అక్షరానికి బదులు "ష" వత్తు పడింది. అన్నిచోట్లా! అక్షంతలు, శుభాకాంక్షలు, అక్షరం... అన్నిచోట్లా "క" క్రింద "క్ష" వత్తు బదులు "ష" వత్తు పడింది. టైప్ చేద్దామంటే ఇక్కడ రావట్లేదు నాకు. ఇది ఉద్దేశపూర్వకమో పొరపాటో తెలీలేదు నాకు!


Tuesday, April 8, 2014

తెలిసి రామ చింతనతో ...





"తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా..." అని ఇవాళ రామనామ సంకీర్తన చేయదలచి... నాలాంటి నీలమేఘశ్యామప్రియుల కోసం ఈ కీర్తనలు... 


 తెలిసి రామ చింతనతో.. 
 


 రారా మా ఇంటిదాకా..  


రఘువంశ సుధాంబుధి.. 
 














నను పాలింప నడచి వచ్చితివో.. 
 


 రామా  నన్ను బ్రోవరా...శ్రీరామా.. 
 


 రామ రామ రామ రామ...  



 మరుగేలరా..
   



 బ్రోచేవారెవరురా..
   




 రారా రాజీవలోచన రామా..  

సీతమ్మ మాయమ్మ..
   


*** *** *** 

ఇదివరకూ టపాయించిన మరికొన్ని కీర్తనలు..

నిన్నే నెర నమ్మినానురా.. 
http://trishnaventa.blogspot.in/2011/05/blog-post_19.html 


ఇక కావలసినదేమి.. 
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_07.html 


రాగ సుధా రస.. 
http://trishnaventa.blogspot.in/2010/02/blog-post_20.html

Thursday, April 3, 2014

నా స్వప్నలోకాలు.. mesmerizing tunes..




వాద్య సంగీతానికీ నాకూ ఒక నాస్టాల్జిక్ బంధం! ఊహ తెలిసిననాటి నుండీ వింటూ వచ్చిన పాశ్చాత్య వాద్య సంగీతం నాపై అమితమైన ప్రభవం చూపింది. వివరాలు, ఆర్టిస్ట్ ల పేర్లు తెలియకపోయినా నాన్న వింటూంటే కూడా వినడం, ఆ తర్వాత మళ్ళీ వినాలనిపించినప్పుడు ఫలానా కేసెట్ వెతుక్కుని మళ్ళీ వినడం నాకు అలవాటుగా ఉండేది. ఏ పని చేస్తున్నా ఏదో ఒక వాద్య సంగీతం వినడం పాటలు వినడం కన్నా ఇష్టమైన పని నాకు ఒకప్పుడు. నాన్న దగ్గర ఏ అరలో ఏ కేసెట్ ఉంది, ఏ కేసెట్లో ఏం ఉన్నాయి అనే వివరాలు నాకు తప్ప ఇంట్లో మరెవరికీ ఎక్కువ తెలీదు.


పెళ్లయ్యాకా కంప్లీట్లీ different world లోకి వెళ్పోయాను. పక్కా ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ! అసలు దాదాపు అన్నీ మర్చిపోయాను. బీథోవెన్, వివాల్డీ లు పూర్వ జన్మ స్మృతుల్లా మిగిలిపోయారు. ఇన్నేళ్లకి ఇప్పుడు సంగీతం వినడానికి ఏకాంతం దొరుకుతోంది కానీ నాన్న దగ్గర నుండి ఆ కెసేట్లు తెచ్చుకుని కాపీ చేసుకునే సమయమే ఉండట్లేదు. నిన్న సాయంత్రం వంటింట్లో పనులు చేసుకుంటూ 102.8 fm (వివిధభారతి) పెట్టేసరికీ హఠాత్తుగా  ఒక 'సింఫొనీ ఆర్కెస్ట్రా' వస్తోంది.. చెకోవ్స్కీ దేదో..! ఆ సింఫొనీ ఆర్కెస్ట్రా వరుసగా అలా వింటుంటే పూర్వ స్మృతులన్నీ ఒక్కసారిగా దుమ్ము దులుపుకుని నన్ను చుట్టుముట్టేసాయి. ఆ స్వప్నలోకాల్లో మరోసారి విహరించా...!!


నిన్న కుదర్లేదు కానీ ఇవాళ మధ్యాహ్నం ఇదివరలో కాపీ చేస్కున్న ఓ పాత సీడీ వెతుక్కుని అవన్నీ 'యూట్యూబ్' లో వెదకడం మొదలెట్టా.. కొన్ని దొరికాయి!! ఇదిగో దొరికిందే తడవు ఈ టపాలో భద్రపరిచేద్దామని రాయడం మొదలెట్టా :) వాద్య సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తప్పకుండా వినండి.. ట్యూన్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి.. ఏవో స్వప్న లోకాల్లో విహరింప చేస్తూ.. నూతన ఉత్సాహాన్ని నింపేస్తూ.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లకపోతే అడగండి!


క్రింద ఉన్నవన్నీ నేను ఒకప్పుడు చాలా చాలా ఇష్టంగా ప్రతి noteనీ ఆస్వాదిస్తు మళ్ళీ మళ్ళీ విన్నవే..

This is too good..
Richard Clayderman - Ballade Pour Adeline  


 Pan Pipe Moods - Without You
  

Kenny G - Songbird 
  

YANNI - One man's Dream
 

Yanni- If I could tell you
 


Yanni - Live at the Acropolis (Nostalgia)
  


Beethoven - Moonlight Sonata
   


Antonio Vivaldi - The Four Seasons
 

Wednesday, April 2, 2014

13 భారతీయ భాషల 'తొలి కతలు'





"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ దొరికిన కథలే తొలికతలనే గీతని నిర్ణయించి కథలను వెతికారుట. అలా వెతికి వెతికి ఒక పదమూడు భారతీయ భాషల్లోని కథలను అనువాదం చేయించి ఈ సంకలనంలో అచ్చు వేసారు. 


మిగతా భాషల్లో కన్నా తెలుగులో మొదటి కథ మీద చాలానే భిన్నాభిప్రాయాలున్నాయిట. గురజాడ గారి 'దిద్దుబాటు' కన్నా ముందు భండారు అచ్చమాంబ గారి 'ధన త్రయోదశి' కథ కాక మరో అరవై ఐదు కథలున్నాయిట తెలుగులో. మిగిలినవేమీ అచ్చులో లభ్యం కానందువల్ల ధన త్రయోదశి, దిద్దుబాటు  రెంటినీ తొలి తెలుగు కథలుగా ఎన్నుకున్నారు. ఈ పుస్తకంలో ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళం, తెలుగు, కొంకిణీ, తుళు, కశ్మీరీ మొదలైన భాషల్లోని తొలి కథలున్నాయి. అప్పటి రచయితల్లో సామాజిక స్పృహ బాగానే ఉందనీ, సామాజికమార్పుని అభిలషిస్తూ ఈ కథారచనలు చేసారనే అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే. ప్రతి కథకూ ముందర ఆ కథారచయిత పరిచయం, కథ వెనుక అనువాదకుని/అనువాదకురాలు యొక్క పరిచయం కూడా ఇచ్చారు. 


పుస్తకంలో కథలన్నింటినీ క్రానాలజీ ప్రకారం ప్రచురించడం విశేషం. అలా చూస్తే భారతీయ భాషల్లో మొదటిది ఒక ఉర్దూకథ. ఆ తర్వాతది ఇరవై మూడేళ్ళ వయసులో ఠాగూర్ రాసిన 'రేవుకథ'. ఇందులో ఒక రేవు మనకు కథను చెప్తుంది. 'వారసత్వం' అనే మలయాళీ కథ తాను తీసుకున్న గోతిలో తానే పడిన ఓ దొంగ స్వగతం. ఒడియా కథ 'రేవతి', తమిళ కథ 'కుంభమేళాలో చిన్నకోడలు' రెండూ కంట తడి పెట్టిస్తాయి. తెలుగు కథలు రెండిటి భాష గ్రాంధికంగా ఉండి కాస్త చదవడానికి కష్టతరంగానే ఉంది. తుళు కథ కాస్త సరదగా ఉంది. అన్ని కథలనూ ఆయాభాషల నుండి అనువదించగా ఒక్క కాశ్మీరీ కథను మాత్రం ఇంగ్లీషు నుండి అనువదించారుట. 


ఇవన్నీ గొప్ప కథలు అని అనలేము కానీ వైవిధ్యభరితమైన కథలని అనవచ్చు.  సాహిత్యరంగంలో కథాప్రక్రియ ఊపిరి పోసుకుంటున్న తరుణంలో వెలువడ్డవి కాబట్టే వీటికి ప్రాముఖ్యత. భారతీయ భాషల్లోని తొలి కథలనేవి అసలు ఎలా ఉన్నాయి? తమ కథల ద్వారా రచయితలు చెప్పదలిచిన విషయాలు ఈ కథల్లో కనబడతాయా? అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.


Tuesday, April 1, 2014

నవలానాయకులు - 4



'కౌముది' లో ప్రచురితమవుతున్న "నవలానాయకులు" శీర్షికలో ఈ నెల నవలానాయకుడు.. "అతడు"! 

అతడెవరో ఏంటో.. క్రింద లింక్ లో చదవండీ.. 
http://www.koumudi.net/Monthly/2014/april/april_2014_navalaa_nayakulu.pdf