సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 25, 2014

కొత్తపుస్తకాలు: ౩. స్వరలహరి


మన తెలుగు సినీ సంగీతదర్శకుల గురించి ఒక రచయిత లేదా ఓ అభిమాని వ్యాసమో పుస్తకమో రాస్తే ఒకలా ఉంటుంది. అదే ఆయా సంగీతదర్శకులతో కలిసి పనిచేసి, స్నేహం కలిగిన ఓ గాయకుడు రాస్తే విభిన్నంగా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ప్రయత్నమే ఈ పుస్తకం. సినీ సంగీతాకాశంలో తన స్వరాలతో ఓ అందమైన ఇంద్రధనస్సుని సృష్టించుకున్న స్వర్గీయ శ్రీ పి.బి.శ్రీనివాస్ రచన ఈ "స్వరలహరి". నేపథ్యగాయకుడు కాక మునుపు శ్రీ పి.బి.శ్రీనివాస్ పత్రికారంగంలో వివిధ కలంపేర్లతో రచనలు చేసేవారుట. భాష మీద పట్టు, చదివించే గుణం, మధ్య మధ్య వాడిన ఛలోక్తులు ఆయన ఎంత మంచి రచయితో తెలియజేస్తాయి. పి.బి తన వ్యాసాలలో చేసిన తమాషా ప్రయోగాలు తిరుపతి లడ్డూలోని జీడిపప్పులా, కలకండ పలుకుల్లా పాథకుల్ని ఆకట్టుకుంటాయి అని సంపాదకులు డా.కొంపల్లె రవిచంద్రన్ అంటారు.


1963-1964 ప్రాంతంలో జ్యోతి మాస పత్రికలోధారావాహికగా వెలువరించిన ఈ వ్యాసాలను గ్రంధరూపంలోకి తెచ్చింది "కళాతపస్వి క్రియేషన్స్". అన్ని విశాలాంధ్ర బుక్ హౌసుల్లోనూ లభ్యమౌవుతున్న ఈ పుస్తకం వెల కేవలం నూటఏభై రూపాయలు. ఆయన స్వర్గస్థులవ్వకముందరే పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నారుట కానీ సాధ్యమవలేదుట. ఈ ప్రయత్నం ప్రధమ వర్ధంతి లోపునన్నా పూర్తయినందుకు ఆనందం వ్యక్తం చేసారు ప్రచురణకర్తలు. వ్యాసాల మధ్యన ప్రచురించిన ఎన్నో అరుదైన, అపురూపమైన ఫోటోలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఈ పుస్తకంలో పి.బి. ఒక పదకొండు మంది సంగీత దర్శకుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. కేవలం సంగీత దర్శకుల వివరాలూ, పాటల ,సినిమాల వివరాలే  కాక వ్యతిగతంగా వారెలా తనకు పరిచయమో, వారితో జరిగిన కొన్ని సంఘటనలు, వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఘటనల ఉదాహరణలు, వారి అలవాట్లను గురించి ఎంతో చక్కగా వివరిస్తారు పి.బి ఈ వ్యాసాల్లో. ఈ వివరాలే ఈ పుస్తకానికో ప్రత్యేకతను తెచ్చాయి. వ్యాసం పూతయిన తరువాత ప్రతి సంగీత దర్శకుడి తాలూకూ చిన్న బయోడేటా కూడా ఒక పేజీలో అందించడం బాగుంది.

నేను ఎక్కువ వివరాలు రాయను కానీ ఒక్కో దర్శకుడి గురించి పి.బి. చెప్పిన ఒకటి రెండు విశేషాలు రాస్తాను.


హాయిగా పాడుదునా? (సాలూరి రాజేశ్వరరావు)
సాలూరివారు మంచి క్రియాత్మక హాస్యప్రదర్శనాప్రియులు(ప్రాక్టికల్ జోకర్) కూడానట. ఒకసారీ ఏవో రిహార్సల్స్ అయ్యాకా ఒక ఆంగ్ల చిత్రానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్నారుట అందరూ. రాజేశ్వరరావుగారి కారు సర్వీసింగ్ కి వెళ్ళిందిట. నేను పికప్ చేసుకుంటాను ముమ్మల్నని పి.బి అడిగితే, మీకెందుకు శ్రమ, చిన్న పనిచూసుకుని నేనే ఆటో రిక్షా మీద థియేటర్ వద్దకు వచ్చేస్తానని చెప్పారుట. పి.బి., అసిస్టెంట్స్ థియేటర్ వద్ద చాలా సేపు నించుని నుంచుని అలసిపోయి సాలూరివారు లేకుండా సినిమా చూడాలనిపించక వెనక్కివెళ్పోతుంటే అప్పుడు వచ్చారుట. సినిమా అయ్యాకా చెప్పారుట.. మీతో ఆటో రిక్షాలో వస్తానన్నాను కదా. ఆటో కోసం టాక్సీ వేసుకుని  ఊరంతా వెతికి ఈ ఆటో దొరికి వచ్చేసరికీ ఇంత లేటయ్యింది. మీరు ఎదురు చూస్తుంటారని వచ్చాను లేకపోతే రాకపోదును అన్నారుట.


వేణు -గానలోలుడు
మాష్టర్ వేణు గా పిలవబడే మద్దూరి వేణుగోపాల్ కు హార్మోనియం,పియానో, సితార్,గిటార్,దిల్రుబా,మేండొలీన్, ఎకార్డియన్, ఫ్లూట్,సెల్లో,ఉడొఫోన్,జలతరంగిణి,హేమండ్ ఆర్గన్ మొదలైన పదిపదిహేను వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉండేదిట. ఎవరైనా ముఖ్య వాయిద్యగాళ్ళు రికార్డింగ్కి రాలేకపోతే తానే ఆ స్థానాన్ని భర్తీ చేసేసేవారుట. నౌషాద్ కు వీరాభిమానిట. నౌషాద్ సంగీతం ముందర ఎవరి సంగీతం రక్తి కట్టదని ఆయనకొక నిశ్చితాభిప్రాయం ఉండేదిట.


 సుసర్ల దక్షిణామూర్తి:
లతా మంగేష్కర్ చేత ప్రప్రధమంగా తెలుగు సింహళ భాషలలో పాడించిన ఘనత సుసర్లవారిది. భానుమతికి భానుమతి చేతే "అందంలో పందెమేస్తా" అని పాడించారు.  "చల్లని రాజా ఓ చందమామ", "జననీ శివకామినీ" మొదలైన హిట్స్ ఇచ్చారు. చక్కని పాటలెన్నో పాడి ప్లేబాక్ సింగర్ గా కూడా పేరు గడించారు.


పాటల టంకశాల ఘంటసాల
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని  పధ్ధెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చారుట ఘంటసాల. తర్వాత ఒక నాటక కంపెనీని నడుపుతూ  నష్టాల్లో ఉండగా సముద్రాల రాఘవాచారిగారు వీరి గొంతు బాగుందని మద్రాసు రామ్మన్నారుట. నాటక కంపెనీ మూసేసి ఇరవై రూపాయిలతో మద్రాసు చేరుకున్నారుట ఘంటసాల.


సప్తస్వరాల ఉయ్యాల
తెలుగువారు ఎక్కువగా పాడుకునే సినిమా పాటల్లో ఎక్కువభాగం పెండ్యాల నాగేశ్వరరావు గారివేనట. జగదేకవీరునికథ లో శివశంకరీ పాటకు నాయకుని గానానికి శిల కరిగిపోవలసి ఉంది.మీరెలా కరిగిస్తారోమరి అన్నారుట దర్శకులు కె.వి.రెడ్డిగారు. అహర్నిశలూ శ్రమించి ఆ పాటకు  బాణీ రూపొందించారుట ఆయన.


ఇంకా ఈ పుస్తకంలో...
* స్వరపరాయణ ఆదినారాయణ రావు గారు,
* రసికజన మనోభిరామ అశ్వత్థామ(సుప్రసిధ్ధ వైణికురాలు గాయిత్రి వీరి కుమార్తె),
* స్వరాల రాజు టి.వి.రాజు(పూతి పేరు తోటకూఅ వెంకటరాజు),
* జంట స్వరాలు(ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి),
* స్వరసప్తాచలపతి తాతినేని చలపతి,
*జనం నోట తనపాట పలికించిన చిలక కె.వి.మహాదేవన్ (పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్)
మొదలైన సంగీతకారుల గూర్చిన కబుర్లు ఉన్నాయి.

ఇలా ఇందరు మహానుభావుల గురించిన ఎన్నో కబుర్లు ఉన్న ఈ పుస్తకం మరి దాచుకోవలసిన తాయిలమే కదా!

No comments: