సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 27, 2014

కొత్త పుస్తకాలు: 4. శ్రీకాంతశర్మ సాహిత్యం



ఈ నాలుగవ పుస్తకం నేను కొనలేదు. నాన్నగారికి మిత్రులు శర్మగారు బహుకరిస్తే నే తస్కరించుకు తెచ్చుకున్నా :)
నాన్నగారి మిత్రులు, కవి, రచయిత, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమగ్ర సాహిత్యం వస్తుందని తెలిసినప్పటి నుండీ ఆత్రంగా ఎదురుచూసాము. 'సృజన', 'సమాలోచన' పేర్లతో రెండు భాగాలు ప్రచురింపబడిన ఈ సమగ్ర సాహిత్యాన్ని నవోదయావారు ప్రచురించారు. రెండు సంపుటాలూ కలిపి వెల 2,500/- శర్మగారు తన సప్తతి (డెభ్భైయ్యవ జన్మదినం) సందర్భంగా మే నెల 29న ఈ పుస్తకాలను మార్కెట్లో విడుదల చేసారు. ఆయనకు ఆర్భాటాలు నచ్చని కారణంగా సభా సమావేశాలు పెట్టి విడుదల చెయ్యలేదు. మొదటి భాగం 'సృజన'లో శర్మ గారి కవిత్వ, లలితగీతాల సంపుటిలు, యక్షగానాలు, కథలూ, నవలలు, నాటకాలు, నాటికలు(ఇరుగు-పొరుగు) ఉన్నాయి. రెండవ భాగం 'సమాలోచన'లో సాహిత్యదీపాలు, అలనాటి నాటికలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, మనలో మనమాట, ఇంద్రధనుస్సు, పరిపరి పరిచయాలూ ఉన్నాయి.



ఇందులోని రచనలన్నీ వివిధ పత్రికలలో, సాహిత్య సదస్సులలో, రంగస్థలంపై, రేడియోలో వెలుగు చూసాయి. ఈ మొత్తం ఇరవై పుస్తకాలలో పధ్నాలుగు పుస్తకాలు ఇదివరలో విడివిడిగా వెలువడ్డాయి. కవిత్వంలో అనుభూతిగీతాలూ, శిలామురళి, ఏకాంతకోకిల, ఆలాపన; ఇంకా రెండవ సంపుటిలో సాహిత్య దీపాలు, ఆలోచన, పరిపరిపరిచయాలూ ఇదివరకూ నాన్నగారి వద్ద చదివాను నేను. మిగిలినవి నేను కూడా ఇంకా చదవవలసి ఉంది. ఆసక్తిగల సాహితీమిత్రుల కోసం ముందు పుస్తకం విడుదల గురించి ఈ కొద్దిపాటి వివరాలతో టపా రాస్తున్నాను. 



చిన్నప్పటి నుండీ ఎరిగున్న నాన్నగారి స్నేహితులుగా కాకుండా, ఒక కవిగా నాకు శర్మ గారంటే ఎంతో గౌరవం, అభిమానం. ఒక విజ్ఞాన ఖని ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూంటే ఓ పక్కగా కూచుని వాళ్ళ సాహిత్యపుకబుర్లన్నీ వినడం భలే సరదాగా ఉండేది నాకు. ఇలా శర్మగారు అని రాయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంతశర్మ మావయ్యగారు అని పిలిచేవాళ్ళం ఆయనను. అలానే బావుంటుంది పిలవడం ఇప్పటికీ. మావయ్యగారు పాట రాస్తే సగం పదాలకు అర్థాలు అడిగి తెలుసుకునేవాళ్ళం మేం పిల్లలం. ఇప్పుడు తెలిసినంత కొద్దిపాటి తెలుగు కూడా చిన్నప్పుడు తెలీదు కదా. కొన్ని పాటల్లోని తోతెంచనా, దరిసి, ననలు తొడగవా, తమి పిలుపు మొదలైన పదాలు ఇంకా గుర్తున్నాయి.. అవి తెలుగువా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరంవారి పాండిత్యం, తెలుగు భాషాపరిజ్ఞానము ఇప్పటి తరాలకు సగమన్నా వచ్చేనా అని దిగులు కలుగుతూ ఉంటుంది నాకు. రచనా వ్యాసంగాల కోసం కాదు కానీ గ్రంధస్తమై ఉన్న తెలుగు సాహిత్యాన్ని చదవుకోవడానికన్నా మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది. 


ఎప్పుడో రచనాకాలం దాటిన కొన్ని దశాబ్దాల తరువాత ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొన్ని సమగ్ర సాహిత్యాల్లా కాకుండా, వర్తమానంలో తన సాహిత్యసంపుటిల్లో ఏ ఏ రచనలు కలపాలో, వేటిని తీసివెయ్యాలో మొదలైనవన్నీ శర్మగారు స్వయంగా చూసుకుని అచ్చుకు ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగించింది. "వెనుతిరిగి చూసుకుంటే.." అనే ముందుమాటలో శర్మ గారు చెప్పిన ఈ చివరి మాటలు నాకు బాగా నచ్చాయి..
"నా వ్యక్తిగత విశ్వాసాలు - నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకుని ఏర్పరుచుకున్నవి. ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకీ, చర్యలకీ, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే - ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యం. అందుచేత - సాహిత్య పఠనం, రచన, వ్యాసంగాలలోకి మనసు పెట్టేవాళ్ళు తమ మనస్సులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవలసి రావచ్చు; కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనస్సులోకి వెలుతురు తాకే అవకాశం ముఖ్యం - దానిని మూసి పెట్టకూడదు.
ఈ సందర్భాలలో, ఈ సంపుటాలలోని నా రచనలు ఏ మాత్రమైనా మీకు ఉపకరిస్తే, యాభైయ్యేళ్ళ నా సాహితీ వ్యాసంగం చరితార్థమైందని భావిస్తాను
."



 

ఈ సంపుటాలలోని వ్యాసాలూ, కథలు, నవలలు చదివాకా మరెప్పుడైనా వివరంగా మళ్ళీ రాస్తాను.
మొదటి సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:




 రెండవ  సంపుటిలో ఉన్న విభాగాల క్రమం:


2 comments:

Manasa Chamarthi said...

Thank you so much for these details, Trshna Garu.

It looks slightly expensive but am so sure it will all be worth it.

తృష్ణ said...

@Manasa: Yes it's really worth reading mansaa.