సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, December 27, 2014

yes.. ఇంకా ఉంది..



"It is not what life takes away from you that counts, 
It is what you make of what is left with you" - 
Hubert humphrey 

చాలా రోజుల్నుండీ కొనాలనుకుంటున్న ఒక సబ్జక్ట్ తాలూకూ పుస్తకం కనబడింది.. ఆ పుస్తకం వెనకాల పైన రాసిన కొటేషన్ చూడగానే 'పబ్లికేషన్స్ డివిజన్'(పుస్తక ప్రదర్శన) లో ఆ పుస్తకం కొనేసాను. కొన్న పుస్తకాలు ఒక్కొక్కటే ఇందాకా సర్దుతూంటే ఈ పుస్తకం చూసి మళ్ళీ పని ఆపి ఇది చదవడంలో మునిగిపోయాను.. 

 పుస్తకం సంగతి పక్కన పెడితే ఈ కోట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. జీవితంలో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో - 'ఇంకేం ఉంది.. అసలు ఇంకా ఏమైనా మిగిలిందా? ' అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కారణంతో ఆ సందర్భాన్నీ, ఆ నిరాశనీ దాటి ముందుకు వెళ్తూ ఉంటాము. ఒక్కో రోజూ మర్నాటికి పాతగా, నిన్న ఒక అఙ్ఞానంలా తోస్తూ ఉంటుంది. ఇలానే ప్రస్తుతం నిన్నలన్నీ పాతగా, చిన్నతనంలా, తెలియనితనంలో ఉన్న పసిపిల్లల్లా అనిపిస్తున్నాయి..! Iam seeing the brighter side..
 yes.. ఇంకా ఉంది.. జీవితం ఇంకా ఉంది.. నాకు నేను మిగిలినంతలోనే మళ్ళీ మొదలుపెడతాను.. పయనాన్ని మళ్ళీ సాగిస్తాను..ఆశతో.. నడుస్తాను.. మళ్ళీ..


Wednesday, December 24, 2014

ఒకే ఒక్క చంద్రుడు..


ఏమిటో ఏం రాయాలో నిన్నట్నుండీ తోచట్లేదు.. కానీ రాయాలి.. అయ్యో.. మన బాలచందర్ కదా.. అని! "మన" ఏమిటి? అసలు ఒక సినీ నటుడు, ఓ సినీ దర్శకుడు, ఒక రచయిత, ఈ నటి, ఓ గాయకుడు.. వీళ్ళంతా మనకు అసలు ఎందుకు ప్రియమైనవాళ్లయిపోతారు? వాళ్ళకీ మనకీ ఏమిటి స్నేహం? ఏం బంధుత్వం? ఏమిటి సాన్నిహిత్యం? ఏనాటి బంధమిది? మన ఆలోచనలకు, అభిప్రాయాలకూ, అభిరుచులకూ దగ్గరగా ఉండే సినిమాలు, పాటలూ, రచనలూ మనకు నచ్చుతాయి కాబట్టి అవి తయారుచేసినవారు, రాసినవారు, తెరపై చిత్రించినవారు మనకు పరిచయం లేనివారైనా మనకి దగ్గరైపోతారు. అందుకే స్నేహబాంధవ్యాలు లేకపోయినా మనకు ఆత్మీయులు వీళ్ళంతా. 

వారం క్రితం "క్రిటికల్ కండీషన్లో దర్శకుడు బాలచందర్.." అని వార్త చదివిననాడు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నా కూడా లోపలెక్కడో గుబులు.. ఇలాంటి వార్త ఎప్పుడో వస్తుందని..! మరణం అనివార్యం.. ఎప్పటికైనా ఇలాంటి వార్తలు వినక తప్పదు. వారికి సంపూర్ణమయిన జీవితం, పేరు ప్రఖ్యాతలు.. ఉన్నాయి. ఇటువంటి మరణాన్ని గురించి మనం బాధపడకూడదు. కాకపోతే ఇటువంటి గొప్ప దర్శకుడు ఇక మళ్ళీ పుట్టడు. ఏ కళాకారుడైనా ఇదే సత్యం. ఎవరి క్షేత్రంలో వారిదొక ప్రత్యేకమైన స్థానం. భగవంతుడు వారికిచ్చిన ప్రతిభని సమంగా ఉపయోగించుకుని, కొన్ని అద్భుతాలను సృష్టించి, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిమానుల గుండెల్లో పదిలపరుచుకుని కనుమరుగైపోతారు. జన్మ సార్థకం చేసుకుంటారు. అటువంటి ప్రతి కళాకారుడూ ధన్యుడే. బాలచందర్ కూడా ధన్యుడు!! తెలుగువారు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదికాలాలు నిలిచిపోయేలాంటి సినిమాలు తీసి మనకు ప్రియమైన దర్శకుడిగా నిలిచిపోయారు.

అవార్డులు, బిరుదులూ, ప్రముఖ చిత్రాల జాబితాలూ నెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి. ఈ దర్శకుడితో నాకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ టపాలో రాయదలిచాను. బాలచందర్ అంటే మా ఇంట్లో మనిషి! మాకెవరికీ ఎక్కువ నచ్చని ట్రాజడీలు తీసినా అందరికీ ఇష్టమైన దర్శకుడు. 'బాలచందర్' అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది గలగలమని సరిగమలు పలికే సరిత కంఠం. అసలు నాకెంత ఇష్టమో ఆ వాయిస్. ఆ గళంలో పలికే ప్రతి భావం అద్భుతమే. ఇంకా బాలచందర్ అంటే కమలహాసన్, రజనీకాంత్, ఏసుదాస్, జయప్రద, గీత, ప్రకాష్ రాజ్.. మొదలైన నటులు, ఆ తర్వాత టివీలో ప్రసారమైన "గుప్పెడు మనసు", "ప్రేమి" సీరియల్స్. ఈ టివి సీరియల్స్ రెండూ ప్రతి ఎపిసోడ్ మర్చిపోకుండా, మిస్సవకుండా ప్రతి ఫ్రేమ్ ఎంతో శ్రధ్ధగా చూసిన రోజులు గుర్తుకొస్తాయి.


ఇంకా.. బాలచందర్ అంటే స్త్రీలు.. వారి పట్ల గౌరవం..! ఆయన తీసిన ఏ సినిమా చూసినా స్త్రీలపై గౌరవం పెరుగుతుంది తప్ప స్త్రీని ఒక వ్యాపారాత్మక సాధనం లాగ, ఒక విలాస వస్తువులాగ చూడాలనే ఆలోచనే రాదు. అంతటి గొప్ప కథలు వారివి. అసలవి కథలు కాదు. కల్పనలు కావు. జీవితాలు! నిజమైన జీవితాలు.. సంఘర్షణలు.. సమకాలీన సమాజానికి ప్రతిరూపాలు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, ఇళ్ళల్లో వారెదుర్కొనే ఇబ్బందులు, తరతరాలుగా మూగబోయిన వారి కంఠాలు, వ్యధలు.. బాలచందర్ చిత్రాల్లో కనబడతాయి. నిరుద్యోగం, నీటి కొరత మొదలుకొని మద్యపానం వరకూ సమాజంలోని ఎన్నో సమస్యలను తనదైన కళాత్మకమైన శైలిలో తెరకెక్కించారు బాలచందర్.





అయితే ఈయనతో నాకొక్కటే పేచీ ఉండేది.. క్లైమాక్స్. సినిమా అంతా అద్భుతంగా తీసి చివరికి విషాదాంతం చేసేస్తారు. జీవితాన్ని దగ్గరగా చూపించాలంటే వీషాదాంతమే ఎందుకుండాలనేది నా వాదం. ఈ ప్రశ్న వారిని ఎవరైనా ఏదో ఒక ఇంటర్వ్యూ లోనో అడిగే ఉంటారు. "మరో చరిత్ర" సినిమా క్లైమాక్స్ లో అమ్మానాన్న బయటకు వచ్చేసారుట విషాదాంతం చూడలేక. నా చిన్నప్పుడు చూసిన "కోకిలమ్మ" సినిమా అయితే మళ్ళీ రెండోసారి చూసే సాహసం చెయ్యలేదెప్పుడూ! "గుప్పెడు మనసు" సినిమాలో ధైర్యంగా బిడ్డను కన్న సరిత(పాత్ర పేరు గుర్తులేదు) పిరికిగా ఆత్మహత్య చేసుకోవడం అస్సలు నచ్చదు నాకు. "సింధుభైరవి"లో సుహాసినిలా ఎక్కడికో వెళ్పోయినట్లు చూపించి ఉండచ్చు కదా! "ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమా అంతా చాలా బావుండి, చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు:( "డాన్స్ మాష్టర్" తమిళ్ సాంగ్స్ వినీ వినీ, తెలుగు డబ్బింగ్ మూవీ రిలీజ్ రోజే వెళ్పోయాం చూడ్డానికి.. అది విషాదాంతం. ఇదేమిటి ఇలా అని బాధపడిపోయాం. టాక్ చూసో ఏమో.. రిలీజైన కొన్నాళ్ళలో మళ్ళీ కథ సుఖాంతం చేసిన క్లైమాక్స్ పార్ట్ సినిమాకి ఏడ్ చేసారు. అప్పుడు సూపర్ హిట్ అయిపోయిందా సిన్మా :) 


నాకు బాగా ఇష్టమైన సినిమాలు చాలావరకూ బాలచందర్ తీసినవే. ఇది కథ కాదు,  గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, కోకిలమ్మ, రుద్రవీణ, డాన్స్ మాష్టర్ థియేటర్లో చూసాను. 47 రోజులు, తూర్పు పడమర, అంతులేని కథ, మరో చరిత్ర, సంబరాల రాంబాబు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, కల్కి మొదలైనవి, ఆయన తీసిన కొన్ని ఇతర భాషా చిత్రాలు టివీలో వచ్చినప్పుడు చూసా. 


ఒక చిత్రమేమిటంటే "సింధుభైరవి" సినిమా ఇష్టమైనదే కానీ ఇంతదాకా చూడలేదు నేను. ఆ చిత్రం తాలూకూ డైలాగ్స్ ఉన్న ఆడియో కేసెట్ ఉండేది మా ఇంట్లో. అదే కొన్ని వందలసార్లు విని ఉంటాను. ఉదయ్ కిరణ్ తో తీసిన అబధ్ధం చిత్రం సీడీ కొనుక్కున్నా కానీ అది నచ్చలేదు నాకు. ప్రతి దర్శకుడికీ ఒక పీక్ పిరియడ్ ఉంటుందేమో.. అది దాటిపోయాకా తీసిన సినిమాలు ఎందుకో ఆకట్టుకోలేవు. "తన్నీర్ తన్నీర్" లో అనుకుంటా ఎలక్షన్స్ టైం లో ఒక చెట్టుకి మొదట ఒక పచ్చ జండా ఉంటుంది. తర్వాత ఒకొక్కటి చప్పున అన్ని రంగుల జండాలూ ఆ చెట్టుకి కట్టినట్లు చూపిస్తారు. ఎలక్షన్స్ అయిపోయాకా మళ్ళీ చెట్టు ఖాళీ అయిపోతుంది.(అలా అనే గుర్తు) వాళ్ల పరిస్థితి మళ్ళీ యధాస్థితికి వచ్చేసిందని సింబాలిక్ గా చూపిస్తారు. ఇలాంటి సింబాలిక్ సీన్స్ బాలచందర్ సినిమాల్లో బోలెడు దొరుకుతాయి. "ఇది కథ కాదు" సినిమాలో చిరంజీవి,జయసుధ డైలాగ్ సీన్స్ మధ్యన తల ఊపుతూ ఉన్న బొమ్మ ఒకటి చూపెడుతూ ఉంటారు మధ్య మధ్య. ఇలా చెప్పుకుపోతే వాల్యూమ్స్ రాయచ్చు. బాలచందర్ అంటేనే ఒక పేద్ద సెపరేట్ సబ్జెక్ట్. ఎన్ని థీసీస్ లైనా ప్రెజెంట్ చేయచ్చు ఆయన సినిమాలపైన. 


బాలచందర్ చిత్రాల్లో సంగీతానికి పెద్ద పీట ఉంటుంది. వారి చిత్రాల్లో నాకు బాగా నచ్చే కొన్ని పాటలతో ఈ పోస్ట్ ముగిస్తాను... 


 "గుప్పెడు మనసు" లో మౌనమే నీ భాష..  



'మరో చరిత్ర' నుండి..  కోకిలమ్మలో "పల్లవించవా నా గొంతులో.."  



ఆకలిరాజ్యం నుండి "కన్నెపిల్లవని.."
  



 డాన్స్ మాష్టర్ లో "రేగుతున్నదొక రాగం.."  





 సింధు భైరవి నుంచి "పూమల వాడెనుగా.."  






 "స్వరములు ఏడైనా రాగాలెన్నో.." తూర్పూ పడమర నుండి..  




 ఇది కథ కాదు నుండి "తకధిమి తక.."  





 అంతు లేని కథ నుండి "దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" :



"ఆడవాళ్ళూ మీకు జోహార్లు" లో టైటిల్ సాంగ్ . నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం.  http://www.youtube.com/watch?v=tUULiZT3AbI  <--  యూ ట్యూబ్ movie లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం. 


 "అచ్చమిల్లై అచ్చమిల్లై" అని టివీలో చూశానొకసారి. అందులో పాట ఒకటి..  




 చివరిగా వన్ ఆఫ్ మై ఫేవొరేట్స్ "రుద్రవీణ"..! అందులో ప్రతి పాటా కంఠతా మా ఇంట్లో అందరికీ. అంతలా వినేవాళ్లం. ఆ మొత్తం పాటలున్న లింక్ ఇది:





Wednesday, December 17, 2014

కిటికీ బయటి వెన్నెల



కథలు రకరకాలు. ఉల్లాసాన్ని, ఆనందాన్నీ కలిగించే కథలు చాలానే కనిపిస్తూంటాయి కానీ ఆలోచింపచేసే కథలు అరుదుగా కనబడతాయి. వాడ్రేవు వీరలక్ష్మిగారి కథలు చదివినప్పుడల్లా నాకు ఆలోనలతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతూంటుంది.. దైనందిక జీవితంలో సామాన్యంగా మనం తక్కువగా ఆలోచించే విషయాలపై కథ రాయాలనే ఆలోచన వీరికి ఎలా కలుగుతుందా.. అని! అయితే ఈ విషయాలు తేలికపాటివి కావు. సమాజంలో మార్పు రావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, అంశాలూనూ. 


వాడ్రేవు వీరలక్ష్మి గారి మూడవ కథాసంపుటి "కిటికీ బయటి వెన్నెల" చదువుతుంటే నాకు అందులో ప్రకృతి, చెట్లు, పువ్వులు తాలూకా సున్నిత భావుకత్వం కన్నా కథల్లో దాగున్న విషయాంశాలూ, వాటిల్లో చర్చించిన గంభీరమైన సమస్యలు ఎక్కువగా ఆలోచింపజేసాయి. బహుశా నా మనసు సున్నితత్వాన్నీ, భావుకత్వాన్నీ దాటి సమాజంలోని సమస్యలను చూసే స్థాయికి ఎదిగి ఉంటుంది! వీరలక్ష్మి గారి "ఆకులో ఆకునై"తో మొదలైన నా అంతర్జాల సాహిత్య వ్యాసాలు పరిణితి చెందుతూ నాలో నాకే ఒక కొత్త కోణాన్ని చూపెడుతున్నాయనుకుంటాను నేను! నాకు లభ్యమైన 'కొండఫలం' , 'మా ఊళ్ళో కురిసిన వాన' , 'భారతీయ నవల' మొదలైన ఆవిడ పుస్తకాల గురించి రాసాను కానీ "సత్యాన్వేషి చలం" గురించి ఇంకా రాసే సాహసం చెయ్యలేదు నేను. అందుకు గానూ ముందు చలం రచనలన్నీ చదవాల్సి ఉంది. చదవగలనో  లేదో ప్రస్తుతానికి తెలీదు. ఇంకా వీరలక్ష్మి గారి 'ఉత్సవ సౌరభం', 'సాహిత్యానుభవం' పుస్తకాలు సంపాదించవలసి ఉంది. 


"జీవితానికి పరిమళం అద్దిన కథలు" అంటూ సత్యవతి గారు ఈ కథానికలకు రాసిన ముందుమాట అసలు ఇంకేమీ రాయక్కర్లేనంతగా, రాయడానికేమీ మిగలనంతగా బాగుంది! వీటిలో మూడు కథల్ని ముందరే చదివాను. "కిటికీ బయటి వెన్నెల" 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక' లో , "బరువు భారాలు" ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో, "గీతల్ని చెరపవచ్చు" నవ్య పత్రికలోనూ చదివాను. నాలుగు నెలల క్రితం నవ్య పత్రికలో ప్రచురితమైన ఆ కథ బాగుందని నే రాసినప్పుడు, త్వరలో మూడవ సంపుటి రాబోతోందని చెప్పి సభకు ఆహ్వానించారు వీరలక్ష్మిగారు. ఆ తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంగా "కిటికీ బయటి వెన్నెల" పుస్తకావిష్కరణకు రావలసిందని సాదరంగా ఆహ్వానించారావిడ. నే కూడా పొంగిపోయాను.. కానీ సరిగ్గా సమయానికి ఆరోగ్యం బాగోలేక ఆ సభకు వెళ్లలేకపోయాను :( ఆలస్యంగానన్నా పుస్తకం ఇన్నాళ్ళకు చదవగలిగాను.. నా అభిమాన రచయిత్రి స్వయంగా పంపించబట్టి. ఆవిడ సంబోధన చూసినప్పుడల్లా అనుకుంటాను.. ఆవిడ అక్షరాల్లాగానే మనసు, మాట కూడా మెత్తన అని. ఏదో ముఖస్తుతి కోసం చెప్తున్న మాటలు కావివి. పెద్దగా పరిచయం లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పలకరించగలగడం కొందరికే సాధ్యపడుతుంది. 


ఈ కథాసంకలనంలోని పాత్రలు నిత్యం మన చుట్టూ కనబడేవారే. అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ కథల్లో పాత్రల ఆలోచనలు కూడా మన ఆలోచనాధోరణి లాగానే ఉంటాయి. ప్రతి కథా ఒకో సమస్యను, వాటి విభిన్న దృక్కోణాలనూ చూపెడుతుంది. సమస్యలన్నీ కూడా ఎక్కువశాతం స్త్రీలవే. పాత్రలు, వాళ్ల ఆలోచనలూ మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు చదువుతుంటే ఈ సమస్యపై ఎవరైనా ఎక్కువ దృష్టి పెడితే బాగుండును.. సమస్య తీరవచ్చు లేదా ఏదైనా పరిష్కారం దొరకచ్చేమో అనిపిస్తుంది. కొన్నింటిలో ఆశావాహమైన ముగింపు పాఠకులకు కూడా చీకటిలో మిణుకుమనే నక్షత్రంలా దారి చూపగలదు.


'పునరుత్థానం' కథలో అన్ని రకాలుగా చిన్నాభిన్నమైపోయిన తన జీవితాన్ని ఆదిలక్ష్మి బాగుచేసుకున్న తీరు మోడులోంచి చిగురించే ఆకుపచ్చని ఆశలా తోస్తుంది. రచయిత్రి చెప్పినట్లు బతుకు బరువైనప్పుడల్లా ఎవరో ఒక ఆదిలక్ష్మి మనకు ప్రేరణ అవ్వగలదేమో.
'ఈ విషానికి ఈ తేనె చాలు' కథానికలో వింధ్య, అనురాధల జీవితాలు ఆలోచింపజేస్తాయి. వింధ్యను నిర్వేదం నుండి బయటకు లాగడానికి అనురాధ పడే తాపత్రయం, ప్రయత్నాలు బాగున్నాయి కానీ చివరలో వినోద మాటలు ఎందుకనో పూర్తిగా ఒప్పుకోలేకపొయాను. 

'దిశానిర్దేశకులు' అన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ. కాలేజీ స్టూడెంట్స్ పై సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక అధ్యాపకురాలి కన్నా బాగా ఎవరు చెప్పగలరు? విద్యార్థులను ఈ రాంగ్ నోషన్స్ నుండి, సినిమా ప్రభావం నుండీ తప్పించగలిగితే దేశ భవిష్యత్తు ఎంతో బాగుపడగలదు అని నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను. "తన్మయి"లో బామ్మ తాయారు కథ వెనుకటి కాలంలోని ఎందరో నిస్సహాయ స్త్రీల వేదనకు అద్దం పడుతుంది.


"కిటికీ బయటి వెన్నెల" కథ చదివితే నాకు మా పాత ఇంటి ఎదురు వీధిలో మా బాల్కనీ వైపుకు కనబడే మరో బాల్కనీలో రోజూ కనబడుతుండే ఆంటీ గుర్తుకువచ్చారు. రచయిత్రి లాగనే నేనూ ఆ బాల్కనీ లోంచి కనబడే సన్నివేశాలనూ, మనుషులనూ బట్టి ఫలానా కాబోలు.. బహుశా ఇలా జరిగిందేమో అనుకుంటూ ఉండేదాన్ని. ఏ మాత్రం పరిచయం లేకపోయినా రోజూ చూడ్డం వల్ల ఓ వారమెపుడైనా కనబడకపోతే ఏ ఊరెళ్ళారో.. ఎలా ఉన్నారో.. అనుకుంటూ ఉండేదాన్ని. వినాయకచవితి పందిట్లో కనబడితే దగ్గరకు వెళ్ళి పలకరించి నేను ఫలానా అని చెప్తే.. అవును ఇల్లు ఖాళీ చేసేసారుటగా అన్నారావిడ!

'నీడ' కథలో ఈ వాక్యాలు బాగా నచ్చాయి "...ముఖ్యంగా సమాజ సేవ చెయ్యడానికి మనం ఎందుకు ముందుకొస్తున్నామో ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి సార్. లోకాన్ని మనం ఒక్కళ్ళం బాగుచెయ్యలేం. కానీ బాగుచెయ్యాలన్న తపనలో మన లోపల కల్మషాలు పోవాలి. పోతాయి కూడా. ఎప్పుడంటే - హృదయం పనిచేసినపుడు, హృదయం మాత్రమే పనిచేసినపుడు.. "


"ఆ రాత్రి" కథలో  "...కానీ ఇది మరెందరో ఆడపిల్లల భద్రతను దెబ్బ తియ్యడం లేదూ.." అన్న రజని ప్రశ్న పుస్తకం మూశాకా కూడా పదే పదే నా మనసులో తిరిగింది. నిజమే! ఇదే అసలు చాలా నేరాలకు మూల కారణం. కానీ ఎవరు మారుస్తారు ఈ అలవాట్లనీ, ఈ సమాజాన్నీ, ఈ పధ్ధతులనీ??


మనుషుల్ని మనుషుల్లా చాలామంది చూస్తారు. కానీ రచయిత్రి తన సునిశితమైన పరిశీలనాదృష్టితో మనిషి మనసులోని భావాల్ని కూడా చదవగలరు. మనుషుల్లో ఇంకా దయ, మానవత అనేవి పుష్కలంగా ఉన్నాయనీ, అవసరమైనప్పుడు అవి తప్పక బయటకు వస్తాయని "గీతల్ని చెరుపుకోవచ్చు" కథ ద్వారా ఒక ఆశావహ దృక్పధాన్ని చూపెడతారు రచయిత్రి. "ఈ విభజన రేఖలూ, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడు వాటిని చెరిపేసి, మనుషుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది" అంటారావిడ. మానవత్వం పై , మనుషులపై ఎంత నమ్మకమో వీరికి అనిపించక మానదు ఈ కథ చదివితే.


ఒక బస్సు ప్రయాణంలో పూర్తయిన ఈ కథల పుస్తకం పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయా.. స్టాప్ వచ్చింది దిగమని శ్రీవారు వెనుకనుండి కదిపేవరకూ!! "బాధలన్నీ పాత గాధలైపోయెనే.." అని బుక్ కవర్ పై ఓ చివర్న రాసినట్లుగా పాతవైనా మెరుపు తగ్గని కథలు ఇవి. మరిన్ని ఆలోచనాత్మకమైన కథల్ని వీరలక్ష్మిగారి నుంచి ఆశిస్తున్నాను..

***    ***     ***

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి.
('ఆకులో ఆకునై', 'మా ఊళ్ళో కురిసిన వాన' రెండు పుస్తకాల్లో ఉన్నాయి నాకెంతో ఇష్టమైన ఈ వాక్యాలు. ఇవొక్కటే చాలు నేనావిడ అభిమానినని గర్వంగా చెప్పుకోవడానికి.)

***    ***    ***

Monday, December 15, 2014

Holy Chants on Lord Ganesha & తోటకాష్టకమ్


క్రితం ఏడాదిలో అనుకుంటా మా అన్నయ్య Sacred Chants, Holy Chants సీరీస్ సీడీలు కొన్ని కొన్నాడు. ఫ్యూజన్ మ్యూజిక్ పధ్దతిలో చేసిన కొన్ని స్తోత్రాలూ, అష్టకాలు ఇందులో ఉన్నాయి. వినడానికి చాలా బావుండి, మనసులో అలజడిగా ఉన్నప్పుడు ప్రశాంతత నింపే విధంగా ఉన్నాయి సీడీలు. అన్నయ్య కొన్న చాలా రోజులకి ఈమధ్యనే అవి కాపీ చేసుకుని తెచ్చుకున్నా నేను. వాకింగ్ కి వెళ్ళినప్పుడు, వంటింట్లో పని చేస్కునేప్పుడు ఎఫ్.ఎం లు వినడం మానేసి ఇవే పెట్టుకుని వింటున్నా! చాలా బావుంటోంది. 

gaana.com లో చాలావరకూ ఈ సీడీలన్నీ వినడానికి దొరుకుతున్నాయి. Holy Chants సిరీస్ లో గణేషుడి మీద చేసిన ఆల్బం చాలా బాగుంది. ఆ లింక్ క్రింద ఇస్తున్నాను. ఇందులో ఎనిమిదవదైన 'Ganesha Stavarajaha' చాలా బావుంది. పాడినది - G. Gayatri Devi, Saindhavi, R. Shruti.

'Holy Chants on Lord Ganesha' మొత్తం సీడీ క్రింద లింక్ లో వినవచ్చు:
http://gaana.com/album/holy-chants-on-lord-ganesha


***


Sacred Chants

Sacred Chants series యూట్యూబ్ లో కూడా చాలానే లింక్స్ ఉన్నాయి.



***    ***


మామూలుగా నాకు తోటకాష్టకమ్ బాగా నచ్చుతుంది.  అష్టకాలు అవీ చదివేప్పుడు ఇది కూడా చదువుతూ ఉంటాము మేము. శంకరాచర్యులవారి శిష్యులైన తోటకాచార్యుడు ఆశువుగా చెప్పినదే ఈ తోటకాష్టకమ్. ఎక్కడో గుర్తురావట్లే కానీ ఈ తోటకాచార్యులవారి కథ ఈమధ్యనే చదివాం కూడా. ఈ ఫ్యూజన్ తోటకాష్టకం బాగుంది, North Indians పలికే విధానం అదే గానీ "భవ షంకర" "దేషిక మే రణం" మొదలైన పదాలే వినడానికి కష్టంగా ఉంది :( 





తోటకాష్టకమ్:
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే 
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం 
కరుణావరుణాలయ పాలయమాం భవసాగరదుఃఖవిదూనహృదం 
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవశంకర దేశిక మే శరణం ll

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే 
కలయేశ్వరజీవవివేకవిదం భవశంకర దేశిక మే శరణం

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసికౌతుకితా 
మమవారయ మోహమహాజలధిం భవశంకర దేశిక మే శరణం

సుకృతే ధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా 
అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశిక మే శరణం 

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః 
అహిమాంశురివాత్ర విభాసిగురో భవశంకర దేశిక మే శరణం 

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోపి సుధీః 
శరణాగతవత్సల తత్త్వనిధే భవశంకర దేశిక మే శరణం

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తిగురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం ll

Monday, December 8, 2014

సంగీత కళాశిఖామణికి సంగీత నివాళి..


image from - google

సంగీత కళాశిఖామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత నివాళి.._/\_

సంగీత విద్వాంసులు ఉన్నారు..ఇంకా పుడతారు... 
కానీ ఇటువంటి మహా విద్వాంసులు ఇక పుట్టబోరేమో...:(
ఈ అద్భుతమైన కచేరీ వినిపిస్తూ, నేను వింటూ ఆనందించడం మినహా ఏమీ చెయ్యగలను... చాలా అల్పురాలిని!



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డా.పప్పు వేణుగోపాలరావు గారితో శ్రీ కృష్ణమూర్తి గారి సంభాషణ... చివరలో యూనివర్సిటీవారికి ఆయన చెప్పిన సలహా వాళ్ళు పాటించారో లేదో తెలీదు మరి..

Friday, December 5, 2014

आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा..


మధుర గాయకుడు హరిహరన్ స్వయంగా స్వరపరిచిన "Horizon(1988)" అనే గజల్స్ ఆల్బం ఉండేది మా ఇంట్లో. హరిహరన్ వాయిస్ మొదటిసారి విన్నది అందులోనే నేను. ఆ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది గజల్స్ ఉంటాయి. అన్ని బాణీలూ హరిహరన్ వే .అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. గజల్స్ మధ్యన వచ్చే సంతూర్ వాదన వింటుంటే మనసు ఎటో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అంత బాగా స్వరపరిచారు హరిహరన్. ఆ కేసెట్లో మొదటి గజల్ "ఆజ్ భీ హై మెరే కద్మోం కే నిషా ఆవారా.." ! సాహిత్యాన్ని రాసినది ముమ్తాజ్ రషీద్

మొదటిసారి విన్న గజల్, అదీ హరిహరన్ వాయిస్ అవడంతో నాకు తెలిసిన గజల్స్ అన్నింటిలోకీ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనదైపోయింది. కాస్త ఉదాసీనమైన సాహిత్యమని నేను వినడం మానేసాను కానీ ఇప్పటికీ చాలాసార్లు అప్రయత్నంగా నానోటి వెంట ఈ గజల్ వచ్చేస్తుంటుంది. ఇందులో "जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद.. कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा" అన్న వాక్యాలు పాడుకుంటే లోపల దాగున్న వేదనేదో తేలికైనట్లు అనిపిస్తుంది. ఈ గజల్ లో సాహిత్యం కన్నా హరిహరన్ తీసే గమకాలు నాకు చాలా ఇష్టం. మళ్ళి మళ్ళీ విన్నప్పుడు బాగా తెలుస్తాయి. 


Ghazal: Aaj bhi hai mere..
Lyrics: Mumtaz Rashid
Singer & Composer: Hariharan





సాహిత్యం:
ప: आज भी है मॆरॆ कदमॊं कॆ निशा आवारा
तॆरी गिलयॊं में भटकतॆ थॆ जहा आवारा
((आज भी है मॆरॆ..))

1
చ: तुझसॆ क्या बिछ्डॆ तॊ यॆ हॊगई अपनी हालत..
यॆ हॊगई अपनी हालत..
जैसॆ हॊ जाऎ हवावों में धुवां आवारा(२)
((तॆरी गिलयॊं में..))


2చ: मॆरॆ शॆरॊं की थी पेह्चान उसी कॆ दम सॆ..
उसी कॆ दम सॆ..
उसकॊ खॊ कर हुए बॆ­नाम­ निशा आवारा(२)
((तॆरी गिलयॊं में...))


3చ: जिसकॊ भी चाहा उसॆ टूट कॆ चाहा राशिद..
उसॆ टूट कॆ चाहा राशिद..
कम मिलॆंगॆ तुम्हॆं हम जैसॆ यहां आवारा(२)
((तॆरी गिलयॊं में...))


***   ***

ఈ ఆల్బమ్ లో మిగిలిన గజల్స్ లో
* फूल कॆ आस पास रेह्तॆ हैं
* हमनॆ काटी हैं तॆरी याद मॆं रातॆं अक्सर
* शराब ला.. शराब दॆ
* बन नही पाया..
* क्या खबर थी..
మొదలైనవవి చాలా బావుంటాయి. మొత్తమ్ ఆల్బమ్ ని క్రింద లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/ghazals­by­hariharan­horizon­g0000381


 

Wednesday, December 3, 2014

గులాబీల గుబాళింపు.. 3rd Rose Convention at HICC







మొన్న ఆదివారం పొద్దున్నే న్యూస్ పేపర్లో "రోజ్ కన్వెన్షన్" పేరుతో గులాబీల ప్రదర్శన తాలూకూ ఫోటోలు కనబడ్డాయి. ఆదివారంనాడు మేం తెప్పించుకునే నాలుగు పేపర్లలోనూ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వివరాలతో ఆర్టికల్ ఏమీ లేదు :( నెట్లో వెతికినా టైమింగ్స్ కాదు కదా, ఏ వివరాలూ కనబడలేదు. ఆఖరికి నోవొటెల్ హోటల్ లో ప్రదర్శన జరుగుతోంది అన్న వివరం ఒక్కటీ పట్టుకుని, ఆ అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరాం. పొలోమని మా ఇంటి నుండి రకరకాల వాహనాలు మారి ఓ ముఫ్ఫై ఐదు, నలభై కిలోమీటర్లు అలా.......ఆ..... వెళ్పోతే ఉందన్నమాట ఈ హోటేలు ఉన్న ప్రదేశం. 

రెండూ బస్సులు మారాకా మధ్యలో మూడో చోట, శుక్రవారం నాడు సిటీలో రిలీజ్ చేసిన ఎనభై వోల్వో ఏసి బస్సుల్లో ఒక బస్సు ఎక్కే అవకాశం అదృష్టవశాత్తూ  రాబట్టీ బ్రతికిపోయాం. ఎండలో అలసట లేకుండా Hitex Exhibition center చేరాం. ఆ లోపల మరో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్ళాకా ఈ నోవోటెల్ హోటేలు ఉంది. షేర్ ఆటో అబ్బాయి సగం దాకా తీస్కెళ్ళి ఆపేసాడు. ఇక వాల్కింగ్ చేసుకుంటూ డెస్టినేషన్ చేరాం. మధ్యలో ఎక్కడా ఓ పోస్టర్ గానీ, ప్రదర్శనశాలకు డైరెక్షన్ చెప్తూ వివరం గానీ లేవు. అసలీ ప్రదర్శన ఉన్నట్లే అక్కడ దారిలో కనబడ్డ కొందరికి తెలీదు. ఇదేదో కారుల్లో వచ్చే పెద్ద పెద్దోళ్ళందరికీనేమో మనలాంటి సామాన్యులకి కాదేమో.. అనుకున్నాం. కానీ ఆ దారిలో నడక మాత్రం చాలా బావుంది. ఎండలో రోడ్డుకిరుపక్కలా నీడనిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయి. హోటల్ దగ్గర్లోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైన గులాబీ రంగు కాగితంపువ్వుల కుండీలు ఎంత బావున్నాయి.


ఆ పక్కన మహర్షి విద్యాలయం ప్రాంగణం కనబడింది. కుడిపక్కన ఉన్న ఒక ఫంక్షన్ ప్లేస్ లో ఏదో పెళ్ళికి స్టేజ్ అలంకరణ జరుగుతోంది. క్రోటన్ మొక్కలు, బంతి మొక్కలు వేనుల్లోంచి దింపుతున్నారు.




గులాబీ ప్రదర్శన ఎంట్రీ ఫ్రీ నే! పెట్టినా కొనేవాళ్ళం.. ఇంత దూరం వచ్చాం కదా మరి :) ఎంట్రన్స్ లో వేరే దారి నుండి వస్తూ వస్తూ ఉన్న కొందరు జనాలు కనబడ్డారు. పర్వాలేదు జనం ఉన్నారు అనుకున్నాం. హాలు బయట పెద్ద పెద్ద కుండీల్లో అలంకరించిన గులాబీలు మనసు దోచేసాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా తేబుల్స్ మీద చిన్న చిన్న గాజు సీసాల్లో పెట్టిన రంగురంగుల అందమైన చిన్నా,పెద్దా గులాబీ పువ్వులు రారామ్మని స్వాగతం చెప్పాయి. 




పెద్దగా బాగున్నవి, మంచి ఆకృతిలో ఉన్న గులాబీలకూ ఫోటోలు తీసుకుంటూ ఒక్కో టేబుల్ నుండీ కదులుతున్నాం.. ఇంతలో హాలు మధ్యలో వేల గులాబీలతో నిర్మించిన గులాబీ చార్మినార్ కనబడింది. అందరూ వంతులవారీగా ఫోటోలు తీస్కుంటూన్నారు అక్కడ నిలబడి. ఎందుకనో అది కట్టి అంత అందమైన గులాబీలన్నింటినీ వృధా చేసారనిపించింది. 







ప్రదర్శనలో అన్నింటికన్నా బాగా నచ్చినవి.. చిన్న చిన్న కుండీల్లో ఉన్న గులాబీ వృక్షాలు. అవును వృక్షాలే అవి. సుమారు ఆరడుగుల ఎత్తుకు ఎదిగి చెట్టు నిండా పాతిక, ముఫ్ఫై దాకా పెద్ద పెద్ద గులాబీ పువ్వులు ఉన్నాయి. అలాంటివి ఒక పది రంగుల గులాబీ పువ్వుల కుండీలు మొత్తం ప్రదర్శనకు ఆకర్షణ అనిపించాయి. ఆ చెట్లకు ఏవో పేర్లు కూడా ఉన్నాయి. పువ్వులో రకాలన్నమాట.








ఇంకా ఇకబన, మొరిబన మొదలైన వివిధ రకాల స్కూల్స్ వాళ్ళు ఎరేంజ్ చేసిన ఫ్లవర్ ఎరేంజ్మెంట్ పాట్స్ హాలు చుట్టూతా పెట్టారు. కాంపటీషన్ పెట్టినట్లున్నారు..ప్రైజెస్ రాసి ఉన్నాయి కొన్నిటిపైన. పింగాణీ
జాడీలు, ఇత్తడి బిందెలు,పళ్ళాలూ కూడా ఇలా ఫ్లవర్ ఎరేంజ్మెంట్స్ లో వాడడం కొత్త ఐడియానిచ్చింది నాక్కూడా. ఇంట్లో వాడకుండా పైన పెట్టేసిన పెద్ద పెద్ద పాతకాలం జాడీలు ఇకపై ఇలా వాడచ్చని ఆనందం కలిగింది.










ఒకచోట ఓ మెంబర్ మరెవరితోనో బాధతో హిందీలో అంటున్న మాటలు వినబడ్డాయి.. "బయట అవన్నీ పెట్టదన్నాను.. మీరెవరూ వినలేదు..అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.." అని! బయట వెళ్పోయేప్పుడు చూశాము.. కొందరు వెళ్పోతున్నవాళ్ళు వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు :( ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. ఎందుకని జనాలకు కొన్ని విషయాల్లో మేనర్స్, సెన్స్ ఉండవు..? అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు? దూరం నుంచి ఆస్వాదించి పోకూడదా? లేదా ఆర్గనైజర్స్ యొక్క అనుమతి అడగకూడదా?.. జవాబు దొరకని ప్రశ్నలివి! 

చివరలో కలిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ తో, గులాబీల తాలూకూ పరిమళాలనూ, ఫోటోలనూ వెంట తీసుకుని ఇంటి దారి పట్టాం.






Monday, December 1, 2014

నవలా నాయకులు - 12



కౌముదిలో 'నవలా నాయకులు' సిరీస్ లో ఆఖరి ఆర్టికల్...’చివరకు మిగిలేది’ నుండి..
http://www.koumudi.net/Monthly/2014/december/dec_2014_navalaa_nayakulu.pdf


ఇన్ని నెలలూ ఆర్టికల్ రాసిన వెంఠనే.. 'చదువుతా విని ఎలా ఉందో చెప్పండని' ఫోన్లో నాన్ననూ, ఇంట్లో మావారినీ కూచోపెట్టి అన్ని ఆర్టికల్స్ వాళ్ళకి వినిపించిన తర్వాతే పంపేదాన్ని! అలా ఓపిగ్గా వినీ నాకు ప్రోత్సాహాన్ని అందించిన వారిద్దరికీ బోలెడు థాంక్యూలు :) మొదట్లో కొన్ని నెలలు నెలలో మూడు ఆర్టికల్స్ రాసిన సమయంలో కూడా ఎంతో ఓపిగ్గా నన్ను, నా clumsinessనీ భరించిన శ్రీవారికి ఈ సిరీస్ తాలూకూ నాకొచ్చిన ప్రశంసలన్నీ చెందుతాయి. 

నాపై నమ్మకంతో ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కౌముది ఎడిటర్ కిరణ్ ప్రభ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు.

Friday, November 21, 2014

हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती..


రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు.. వరుసైన, పధ్ధతైన క్రమంలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. చివరలో తండ్రిగారైన హరివంశరాయ్ బచ్చన్ ప్రేరణాత్మక కవిత.. "హిమ్మత్ కర్నే వాలోం కీ హార్ నహీ హోతీ.." వినిపించారు తన గంభీరమైన గళంలో!

ఆ చివరి వాక్యాలు...

"संघर्ष करॊ मैदान छॊड मत भागॊ तुम
कुछ कियॆ बिना ही जय जयकार नहीं हॊती
हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती"

సమయానుకూలంగా మా కోసమే చెప్పాడేమో అన్నట్లుగా ఉన్నాయి. ఎంత చక్కని కవితని చెప్పావయ్యా.. లవ్ యూ అమిత్ జీ!! అనుకున్నాం. గబగబా మొత్తం కవిత వెతికి మొదలు నుండీ చివరి దాకా చదివాం. 
నిస్పృహను దులిపేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపే వాక్యాలు..!
ఉత్తేజపూరితమైన ఆ కవిత మొత్తం క్రిందన ..


Thursday, November 20, 2014

కొన్ని రోజులు..



కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి
దూకే జలపాతంలా..

కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి
నిఠారైన నిలువుగీతలా..

కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి
బోలెడు చుక్కల మెలికల ముగ్గులా..

కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి
స్తబ్దుగా నిశీధిలా.. 

కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి 
అచ్చంగా జీవితంలా..


Monday, November 17, 2014

मोहब्बत करनेवाले कम ना होंगे..


ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html)
ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను. నాలాంటి సంగీతప్రియుల కోసం ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.


ఈ గజల్ సాహిత్యాన్ని రాసిన ఉర్దూ కవి పేరు అబ్దుల్ హఫీజ్. 'హోషియార్ పూర్' అనే ఊరివాడవడం వల్ల ఆయనను "హఫీజ్ హోషియార్ పురీ" అని పిలుస్తారు. మెహదీ హసన్ గళమే కాక ఈ గజల్ సాహిత్యం చాలా చాలా బావుంటుంది. ఇదే గజల్ ఇక్బాల్ బానో గారూ, ఫరీదా ఖన్నుమ్ గారూ పాడిన లింక్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ మెహదీ హసన్ పాడినది వింటుంటే మాత్రం గంధర్వ గానం.. అనిపించకమానదు!ఆ ఆలాపనలు.. స్వరం నిలపడం.. ఆహ్.. అంతే!

మెహదీ హసన్ మాటలతో ఉన్న ఓల్డ్ రికార్డింగ్:
http://youtu.be/NQ3rRwSl__8




సాహిత్యం:

मोहब्बत करनेवाले कम ना होंगे
तेरी महफ़िल में लेकिन हम ना होंगे

ज़माने भर के ग़म या इक तेरा ग़म
ये ग़म होगा तो कितने ग़म ना होंगे

अगर तू इत्तफ़ाक़न मिल भी जाये
तेरी फुरक़त के सदमें कम ना होंगे

दिलों की उलझनें बढ़ती रहेंगी
अगर कुछ मशवरे बहम ना होंगे

'हफ़ीज़' उन से मैं जितना बदगुमाँ हूँ
वो मुझ से इस क़दर बरहम ना होंगे

Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html

Thursday, November 6, 2014

శ్రీ శివమహాపురాణము


 రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి దేవుడు మాకు మేలే చేసాడు. పెళ్ళయిన ఇన్నేళ్ళకి ఆ మూడువారాలు కాస్త ఖాళీగా తను ఇంట్లో ఉన్నారు. ఆ దెబ్బల వల్ల సత్కాలక్షేపం కూడా జరిగింది. తీరుబడిగా పనులు చేస్కోవడమే కాక తీరుబడిగా పురాణకాలక్షేపం చేసుకుని మహదానందాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నాము.. కుంటున్నాము కూడా! ( బయటకు వెళ్పోవడం మొదలెట్టాకా పురాణపఠనం స్పీడ్ తగ్గి, ఇంకా రెండు ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి.) మధ్యలో కొన్నాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నందున ఆవిడ కూడా పురాణశ్రవణం చేసుకున్నారు. 

మాకో అలవాటు ఉంది..(చాలామందికి ఉండే ఉంటుంది) చాలా బాగున్న పుస్తకం కలిసి చదవడం. ఒకళ్లతర్వాత ఒకళ్ళం తలో ఛాప్టర్ చదవడం. ప్రసాద్ గారి నాహం కర్తా హరి: కర్తా, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ, ఆ కుటుంబంతో ఒక రోజు, మోహన్ కందా గారి పుస్తకం... ఇలా కొన్ని పుస్తకాలు కంబైండ్ స్టడీ చేసాం. ఆమధ్యన కోటీలో పాత పుస్తకాల స్టాల్స్ దగ్గర ఏవో పుస్తకాలు కొంటుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి "శ్రీ శివమహాపురాణము" దొరికింది. పుస్తకం కొత్తగానే ఉన్నా పాతపుస్తకాల దగ్గర పెట్టీ మూడొందల ఏభైకే అమ్మేస్తున్నారు. క్రిందటి పుస్తకప్రదర్శనలో చాగంటివారి భాగవత,రామాయణ, శివమహాపురాణా ప్రవచనాల పుస్తకాలను మూడింటినీ కలిపి డిస్కౌంట్లో అమ్మారు. అప్పటికే చాలా కొనేసినందువల్ల ఇక అవి తీసుకోలేకపోయాము. మూడింటిలో అమ్మ దగ్గర భాగవతప్రవచనం ఉంది. (సగభాగం ఇంకా పూర్తి చెయ్యాల్సి ఉంది.)  మిగతావి కూడా కొనుక్కోవాలని మనసులో ఓ మూల కోరిక ఉంది. ఇప్పుడిలా అనుకోకుండా "శ్రీ శివమహాపురాణం" కొనడం జరిగింది. భగవత్ కృప!


కాకినాడలోని అయ్యప్పస్వామి గుడిలో మండలం రోజులు చాగంటివారు చెప్పిన ప్రవచనాలుట ఇవి. (టివీలో వచ్చే ఉంటాయి.) వాటికి పుణ్య దంపతులు శ్రీ పురిఘళ్ళ సత్యానంద శర్మ, శ్రీమతి భాస్కరం గార్లు అక్షరూపాన్ని అందించారు. ఆకర్షణీయమైన బాపూ బొమ్మలతో ఎమెస్కో బుక్స్ వాళ్ళు ప్రచురించారు. వినడం కన్నా పుస్తకం చదవడమే ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని మాకనిపించింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలను గురించి , వాటి చరిత్ర, కొన్ని ప్రదేశాల్లో ఉన్న విగ్రహామూర్తులను గురించీ చదువుతుంటే అసలు ఇప్పటిదాకా చూసిన కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. శివుడంటే ఇదివరకటి కంటే ఎక్కువగా ఆరాధన కలిగింది. నా రాముడితో సమానంగా నా మనస్సులో స్థానాన్నధిస్టించాడు ఈశ్వరుడు :)


పుస్తకంలో ముందర కొందరు నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. శివుని అనుగ్రహం వల్ల తరించిపోయిన మహాపురుషులైనవారీ నాయనార్లు. ఒక్కొక్కరి కథా ఒకో పాఠం అని చెప్పాలి. తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యాలనూ, వాటి చరిత్రనూ, ప్రాముఖ్యతనూ తెలియజేసారు. మాకు ఇప్పటికి శ్రీశైలంలో మల్లికార్జునుడు, త్ర్యంబకంలోని త్ర్యంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఘృష్ణేశ్వర్ లోని ఘుష్ణేశ్వరుడు, భీమశంకర్ లోని భీమేశ్వరుడూ ఐదు క్షేత్రాల్లోని శివలింగాలను చూసే సదవకాశం కలిగింది. అరుణాచల పర్వతం విశిష్ఠత, రమణ మహర్షి చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయం గురించీ చదువుతుంటే మాత్రం రెక్కలు కట్టుకుని ఆ కొండకు ఎగరి వెళ్ళాలనిపించింది. ఆ దర్శనం, గిరిప్రదక్షిణ ఎప్పటికి ప్రాప్తమో..


పుస్తకంలోని కొన్ని తెలియని, తెలిసిన మంచి విషయములు:

* మన శరీరంలో ఉండే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన్, నాగ, కూర్మ, క్రుకుర, ధనంజయ, దేవదత్తములనే పది వాయువులు, వాటి పనులూ చెప్పారు. శివుడి ఆజ్ఞ వలననే వాయువు జీవుల శరీరములందు ఉండి ఈ పదిరకముల వివిధ కర్మలనూ చేస్తాడుట.

* పూర్వం స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించి కట్టె వెలిగించి, మడిబట్ట కట్టుకుని అన్నం వండడం కూడా గౌరవంగా చేసేవారు. 

* "పిల్లలను పోటో పరీక్షలకు తయారుచేస్తున్నాం. కానీ పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్దచేస్తున్నాం. వాడు రోడ్డుమీదికి వెడితే వాడి కన్నులు చెదరగొట్టి పాపభూయిష్టమైన నడవడి వైపుకి తీసుకువెళ్ళే వాల్ పోస్టర్లు! ఏషాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడుచెయ్యగలిగిన పుస్తకాలు! ఎన్ని ఛానళ్ళు నొక్కినా అన్నింటిలో వ్యగ్రతతో కూడిన విశేషములు! మీరు వానికి మురికినీరు పట్టించి వాడు వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే వాడు ఎలా బ్రతుకుతాడు?ఈవేళ సమాజానికి భాద్యత లేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదు. పెద్దలకు బాధ్యత లేదు...." 
"పురాణముల ప్రయోజనం మీ బాధ్యతలను గుర్తు చెయ్యడం. పురాణం ఎప్పటిదోనని, అది పనికిమాలినదని మీరు అనవద్దు. అది ఎప్పటికీ నవీనమే. అది మీ బాధ్యతను మీకు గుర్తుచేస్తుంది. లోక సంక్షేమము ఎక్కడ ఉందో దానిని మీకు జ్ఞాపకము చేస్తుంది."

* తల్లిదండ్రులు ఏ ఏ సంస్కారములతో ఉన్నారో వి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కారరూపంలో సుఖమును గానీ, దు:ఖమును గానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుధ్ధి కొరకు, భావపరిపుష్టి కొరకుమనవాళ్ళు పూర్వం కొంతకాలం భార్యాభర్తలు దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమయిన తరువాత సంతానము కనేవారు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించినట్లయితే, నిష్ఠ లోపించినట్లయితే సంతానమునందు వ్యగ్రతతో కూడినవారు జన్మిస్తారు. కాబట్టి సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. ఇంత చేసినా దుర్మార్గుడో, దుర్మార్గురాలో పుడితే అది బిడ్డ ప్రారబ్ధం. దాని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది.

* ప్రదూషవేళ (కాలము స్ఫుటముగా మార్పు చెందే రెండు సంధ్యాసమయాలూ) జరుగుతూండే శివుడి ఆనందతాండవం సమయంలో శివస్వరూపాన్ని చూసే అధికారం నలుగురికే ఉందిట. నందీశ్వరుడు, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు.

* కావ్య కంఠగణపతి ముని కథ కమనీయం.

* మధురమైన ముత్తుస్వామి దీక్షితులు జీవిత కథ..

* శంకరాచార్యులవారు, శ్రీ చంద్రశేఖర పరమచార్యుల వారి గురించిన కొన్ని తెలియని విశేషాలు..

* భృగుమహర్షి కుమారుడైన భార్గవుడు మహాపురుషుడిగా ఎలా మారాడు, శుక్రాచార్యుడన్న పేరు ఎలా ప్రకాశించిందో తెలిపే కథ విచిత్రమైనది. ఈశ్వరుడి కృపాకటాక్షాలను తెలిపేదీనూ!

* శివకోటి, రామ కోటి రాసిన పుస్తకాలలో ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపము అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తికి ప్రసరించే లక్షణం ఉంది. ఊళ్ళో ఎవరికయినా ఆపద వచ్చినట్లయితే ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. స్తూపంలో ఉన్న శక్తి బయటకు తరంగములుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకా కష్టం పోతుందో ఆ శక్తి అందులోంచి మీ మనసు లోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుధ్ధిని మారుస్తుంది. కాబట్టి ఉళ్ళో ఉన్నవాళ్ళు ప్రమాత్మ ప్రు రాసిఉన్న స్తూపం కట్టుకోవాలి. రాననాం ఎంత గొప్పదో శివనామమూ అంతే గొప్పది.



* స్కందోత్పత్తి - కుమారసంభవం:
కాళిదాసు రచించిన "కుమారసంభవం" పేరు వినడమే తప్ప కథ తెలియదు. ఇంతకుమునుపెక్కడా కూడా కుమారస్వామి జననానికి సంబంధించిన కథ వినలేదు కూడా. మొత్తం పుస్తకంలో మేము ఆసక్తికరంగా చదివిన వృత్తాంతమిది. పార్వతీపరమేశ్వరులిద్దరి దయ,కారుణ్యము ఒకచోట ప్రోగు చెస్తే ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడుట. ఇది గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమయినదిట. ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ స్త్రీ వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని, అవి ఔషధాలుగా మారి లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. అందుకే స్కందోత్పత్తి గర్భిణి వినాలని శాస్త్రం చెప్పిందిట. ఆయురారోగ్యాలూ, వంశాభివృధ్ధి, ధనం, దీర్ఘమైన ఆరోగ్యం మొదలైనవి సుబ్రహ్మణ్యారాధన వల్ల కలుగుతాయిట.


ఇలా చెప్పుకుపోతే ఎన్నో కథలు, వింతలూ, విశేషాలూ..! మధ్యమధ్య చాగంటివారు ఉదహరించిన వివిధ సంస్కృత శ్లోకాలూ, శివానందలహరి, భాగవతం మొదలైనవాటి నుండి తీసుకున్న పద్యాలన్నీ కూడా మధురమైన భక్తితత్వంతో నిండి ఉన్నాయి.


ఇంకో మూడు,నాలుగు రోజుల్లో పారాయణ పూర్తవుతుంది. చదువుతున్న కాలంలో ఎదురైన చిన్న చిన్న విశేషాలు:

* గత రెండునెలల కాలం కూడా మాకెంతో పరీక్షాసమయం. కొన్ని చికాకులూ, సమస్యలతో సతమతమై అయోమయావస్థలో ఉన్న మాకు శివానుగ్రహం వల్లనే ఈ పురాణపఠనం చేసే సదవకాసాశం కలిగి, తద్వారా మా భారాలని తేలిక చేసుకోగలిగే మనస్థితిని శంకరుడే కల్పించాడని మేమిద్దరం కూడా విశ్వసిస్తున్నాం. 

* సెప్టెంబర్ లో ఒకనాడు మా అత్తగారు హాస్పటల్లో సీరియస్ గా ఉన్న రోజున.. ఆ అర్థరాత్రి పూట ఒక్కదాన్నీ హాల్లో కూచుని ఈ పుస్తకాన్ని కాగలించుకుని శివా..శివా.. శివా.. అన్న ఒక్క నామాన్ని మాత్రమే జపిస్తూ గడిపిన గంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వరానుగ్రహం వల్లనే ఆవిడ అప్పటికప్పుడు మామూలై ఆ పూటే మా ఇంటికి రాగలిగారని మేం నమ్మాము.

* సరిగ్గా శరన్నవరాత్రుల్లోనే "గౌరీపూజ", "అమ్మవారి రూపములు" ఛాప్టర్లు చదవడం చిత్రమనిపించింది. 

* నిన్న ఏదో పని మీద ఓ ఆఫీసుకి వెళ్తే అక్కడ మావారికి తెలిసినాయన, "పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి వచ్చాను.. ప్రసాదమిదిగో.." అని ఇచ్చారుట. మేం వెళ్ళలేకపోతున్నామని శివుడు ప్రసాదం పంపాడని మురిసిపోయాం ఇద్దరం.

ఇవి చిన్న విశేషాలే అయినా మా మనసులని ఎంతో ప్రభావితం చేసినవి. ఆసక్తి ఉన్నవారు తప్పక ఈ శివమహాపురాణపఠనాన్ని చేసి ఈశ్వరానుభూతిని పొందవలసినదని మనవి.

***

లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ
చీకాకున్ బడనీ మహాత్ముడననీ..
మూకీభా వమునన్ తిట్టనీ త్రోయనీ
నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!
(శంకరాచార్యులు)


మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!

Tuesday, November 4, 2014

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..



ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ పూజ వేళ వినేందుకు గానూ తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి.. క్రింద వీడియోస్ లో:
(వీడియో లింక్స్ పనిచేయకపోతే పేర్ల క్రింద డైరెక్ట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను.) 





తులసీ స్తోత్రం:
http://youtu.be/Dxptk_6cgss



తులసీ మంత్రం, తులసీ నామాష్టకం :
http://youtu.be/cAvzwnc16Ag




తులసీ వివాహం :
 https://www.youtube.com/watch?v=iWs142GBCVs



తులసీ హారతి:
http://youtu.be/T9JH9h0qL6M

Saturday, November 1, 2014

Kishori Amonkar - Drishti songs


image from google


1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ  పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా హిందుస్తానీ శాస్త్రీయ బాణిలోనే ఉంటుంది. సాహిత్యం వసంత్ దేవ్. 



ఈ చిత్రంలో రెండు పాటలు యూట్యూబ్ లో దొరికాయి.. రెండూ చాలా బావుంటాయి. 

1.)మేఘా ఝర్ ఝర్ బర్సత్ రే.. 
ఇది ఏ రాగమో గానీ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట.. 
(సంగీతం మరియు గాయకురాలు: కిశోరీ ఆమోంకర్) 



 2) ఏక్ హి సంగ్ హోతే.. జో హమ్ తుమ్.. కాహే బిఛురారే... (ఈ పాట క్రింద ఇచ్చిన గానా.కామ్ లింక్ లో క్లియర్ గా ఉంది) ఈ పాట వింటుంటే 'రుడాలీ' లో "సునియో జీ అర్జ్ మ్హారీ.. " పాట గుర్తుకు వస్తుంది.. బహుశా రెండూ ఒకటే రాగమై ఉంటాయి. 

  

 'ఆలాప్' తో పాటూ చిత్రంలో అన్ని పాటలూ gaana.com లింక్ లో వినచ్చు: http://gaana.com/album/drishti-hindi



నవలానాయకులు - 11


ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. సందర్భానుసారం, పరిస్థితుల దృష్ట్యా అవి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని అతడు చేసే/చేసిన పనుల వల్ల అంచనా వెయ్యడం అనేది సబబు కాదు. అసలలా ఎందుకు చేసాడు అనే కారణాలను అన్వేషించడం, వాటిని తెలుసుకున్న తరువాత ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సరైన పని అని ఈ నవల ద్వారా రచయిత తెలియపరుస్తారు. ప్రపంచమంతా కౄరుడు, నిర్దయుడు, పాషాణహృదయుడు, రక్తపిపాసి, రాక్షసుడు అని ముద్ర వేసిన మంగోల్ జాతి నాయకుడు "టెమూజిన్" కథను ఒక కొత్త కోణంలో మనకి చూపెడుతూ ఒక మహోన్నతమైన మానవతావాదిగా అతగాడిని మనకి పరిచయం చేసారు ప్రముఖ అభ్యుదయ కవి, కథారచయిత, నాటక కర్త శ్రీ తెన్నేటి సూరి. "ఛెంఘిజ్ ఖాన్" లోని కౌర్యం వెనుక కారణాలు చరిత్రని తవ్వితే గానీ బయటపడవు. ఈ నవలా నాయకుడి జీవితాన్ని గురించిన వివరాలు క్రింద లింక్ లో:
http://koumudi.net/Monthly/2014/november/nov_2014_navalaa_nayakulu.pdf






దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ నవల ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకం గా తయారైంది. శ్రీకాంతశర్మ గారు ఆ పాత్రపై ఎంతో అభిమానంతో నాటకరూపాన్ని అందించారు. నాన్నగారు శబ్దరూపాన్ని ఇచ్చారు. రికార్డింగ్ సమయంలోనూ, ఆ తరవాత ఎన్నో ప్రశంసలను అందుకుందీ నాటకం. గుర్రపు డెక్కల చప్పుడు, అరుపులు, కోలాహలాలూ, ఆర్తనాదాలు, హుంకారాలు, యుధ్ధపు వాతావరణం మొదలైన ఎఫెక్ట్స్ శబ్ద రూపంలో తేవడం కోసం నాన్న ఎంతగానో శ్రమించారు.  పూర్తయిన ఈ నాటకం కేసెట్ ను ఎన్నోసార్లో నాన్న వింటుంటే వినీ వినీ విసిగిపోయి అబ్బా..ఆపేద్దూ గోల అని మేము విసుక్కున్న రోజులు నాకు బాగా గుర్తు :) 
..వెరీ నాస్టాల్జిక్.. అబౌట్ దిస్ ప్లే!!

నవల చదివిన ప్రతిసారీ చాలా రోజుల వరకూ యాసుఖై, యూలన్, టెమూజిన్, సుబూటిన్, చమూగా, కరాచర్,బుర్టీ, కూలన్.. మొదలైన పాత్రలు మదిలో మెదులుతూ కలవరపెడతాయి. అసలు వీళ్ళ మూలాలేమిటి.. వీరందరి నిజమైన చరిత్ర తెలిస్తే బాగుండు.. అని మనసంతా గోబీ ఎడారి చూట్టూ ప్రదక్షిణలు చేస్తుంది!!!

Friday, October 31, 2014

Surdas Bhajans - M.S. Subbalakshmi

ఫోటో కర్టసీ: గూగుల్

పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ సూరదాసు(सूरदास) ప్రసిధ్ధి చెందిన కవి, వాగ్గేయకారుడు, కృష్ణభక్తుడు. పుట్టుకతో అంధుడైన సూరదాసుకి పేదరికం మూలానో ఏమో తల్లిదండ్రుల లాలన అందక ఆరేళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టేసి వ్రజ్ లో స్థిరపడిపోయాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురానగరి సమీపంలోని ప్రాంతం ఇది. సుధ్ధాద్వైత గురువు వల్లభాచార్యులు అతడిని శిష్యుడిగా స్వీకరించి ఆదరించాకా అతని జీవితం మెరుగుపడి భక్తిమార్గంలో పయనించింది. ఉత్తర భారతదేశంలో అప్పట్లో ప్రబలంగా ఉన్న Bhakti movementలో సగుణ భక్తి , నిర్గుణ భక్తి అని రెండు శాఖలుండేవి. సగుణ భక్తి శాఖలో కృష్ణ భక్తి, రామ భక్తి అని మళ్ళీ రెండు శాఖలు. అందులో 'కృష్ణభక్తి శాఖ'కి సూరదాసు చెందుతాడు. 


సూరదాసు రచనలన్నీ 'సూర్ సారావళి', 'సాహిత్య లహరి', 'సూర్ సాగర్'  అనే మూడు గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సూరదాసు వందలు వేలల్లో రాసిన రచనలు చాలావరకూ అందుబాటులో లేవని చెప్తారు. మూడూ గ్రంధాల్లోనూ కృష్ణుడి లీలాగానామృతంతో నిండి ఉన్న 'సూర్ సాగర్' బాగా ప్రసిధ్ధి చెందింది. అంధుడైన వ్యక్తి కృష్ణలీలలను అంత అద్భుతంగా కన్నులకు కట్టినట్లు ఎలా రచించగలిగాడని అంతా ఆశ్చర్యపోయేవారుట. కృష్ణలోలలను వర్ణిస్తూ సాగే సూరదాసు భజనలు పిక్చరస్క్ గా , 'మధురాష్టకం'లాగ ఎంత మధురంగా ఉంటాయో మాటల్లో చెప్పడం కష్టం. 


ఇటువంటి మధురమైన సూరదాసు భజనలు కొన్నింటిని గానకోకిల ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో పాడించారు HMVవారు పదిహేనేళ్ళ క్రితం. కేసెట్ లో మొత్తం ఎనిమిది భజనలు ఉన్నాయి. అవన్నీ క్రిం ఉన్న raaga.com లింక్ లో వినవచ్చు:
http://play.raaga.com/hindi/album/The-Spiritual-Voice-Of-MSS-Surdas-Bhajans-hd001394

Track list:  
1) Prabhuji tum bin kaun sahaai
2) Nis din basrat nain hamaari
3) Raakho laaj hari tum meri
4) Kunjani kunjani Bbjati murli
5) Akhiyan hari darshan ki pyasi
6) Madhuban tum kyon rahat hare
7) He deen dayal gopal hari
8) Suneri maine nirmal ke balram


యూట్యూబ్ లో ఒక మూడు భజనలు దొరికాయి..
1) అఖియా హరి దర్శన్ కీ ప్యాసీ...

 


 2) ప్రభుజీ తుమ్ బిన్ కౌన్ సహాయ్.. 





3) "మైయ్యా మోరీ మై నహీ మాఖన్ ఖాయో..." (ఇది కేసెట్ లో లేదు కానీ సూరదాసు భజనే)






 *** *** ***

3) "ప్రభుజీ మోరే అవగుణ్ చిత్ న ధరో.. " అని సాగే ఈ సూరదాస్ భజన నాకు చాలా ఇష్టం. "స్వామి వివేకానంద" చిత్రంలోనిది.
గాయని: కవితా కృష్ణమూర్తి