సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 27, 2013

"త్రిపుర" గారి రేడియో ఇంటర్వ్యూ + ఒక కథానిక, వారి కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం


'ఇవి కథలా, కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా?'
'ప్రతి కథ గురించీ సమీక్షిస్తే పరిచయం అసలు కథ కన్నా పెద్దదవుతుంది.'
'ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది.' 
అంటారు 'పాలగుమ్మి పద్మరాజు'గారు.. "త్రిపుర కథలు" పుస్తకంలోని తన పరిచయవాక్యాల్లో. 



పద్మరాజుగారి ప్రశంసను అందుకున్నది విలక్షణమైన కవీ, కథకుడు శ్రీ రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు. "త్రిపుర" పేరుతో అతి తక్కువ రచనలు చేసి ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న నైరూప్య చిత్రకారుడు. ఒక తాత్విక రచయిత. ఇంతకు మించి వారి గొప్పతనం గురించి చెప్పేంత సాహసం చెయ్యను. ఎందుకంటే సాహిత్యం గురించి ఏమీ తెలియని చిన్నతనంలో మా ఇంట్లో ఉన్న త్రిపుర కథల పుస్తకం చదవడానికి ప్రయత్నించిన అజ్ఞానిని. ఇప్పుడు సాహిత్యసాగరం లోతులు తెలిసిన సంపూర్ణ అజ్ఞానిని. 


త్రిపుర గారి మరణవార్త తెలిసాకా, నా దగ్గర ఉన్న రెండు ఆడియో లింక్స్ బ్లాగ్ లో పెట్టాలని... రకరకాల సాంకేతిక ఇబ్బందుల తర్వాత ఇప్పటికి కుదిరింది. అవి.. త్రిపుర గారి రేడియో ఇంటర్వ్యూ ఒకటి, రెండవది ఆయన కథానిక + కథా రచనల మీద డా.వి.చంద్రశేఖరరావు గారి అభిప్రాయం.  


1) "త్రిపుర" గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ ఇక్కడ వినటానికి పెడుతున్నాను. ఇది 1999 march 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైంది. 

 



2) 'గొలుసులు-చాపం-విడుదల భావం' కథానిక + త్రిపుర కథా రచనల మీద 'డా.వి.చంద్రశేఖరరావు' గారి అభిప్రాయం:




***     ***

"త్రిపుర" గారి గురించి అంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చిన వాడ్రేవు చినవీరభద్రుడుగారి వ్యాసం:

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/05/27/ArticleHtmls/27052013004003.shtml?Mode=1


Vadrevu Ch Veerabhadrudu గారి మాటల్లో:
"త్రిపురగారి మీద నా వ్యాసం ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అయితే ఆ శీర్షిక 'విబంధుడు ' నేను పెట్టింది కాదు. ఆ పదానికి అర్థం నాకు తెలియదు. అలాగే ఆ వ్యాసంలో రెండు పేరాలు ఎడిట్ చేసారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను."

పూర్తి పాఠంతో ఇక్కడ:
http://www.scribd.com/doc/143874732/The-legacy-of-Tripura-in-Telugu-Literature


Wednesday, May 22, 2013

జీవన రాగం




సుప్రసిధ్ధ సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి రాసిన ఏకైన నవల "జీవనరాగం". వారి తొలి రచన. 1959లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో సీరియల్ గా ప్రచురితమైంది. తర్వాత 1970 లో పుస్తకరుపాన్ని దాల్చింది. నా దగ్గర ఉన్నది అప్పటి ప్రింట్. తర్వాత పున:ముద్రణ జరిగిందో లేదో తెలియదు. నాకు తెలుగు చదవడం వచ్చిన కొత్తల్లో ఇంట్లో చదవటానికి దొరికిన ప్రతి తెలుగు పుస్తకాన్ని వదలకుండా చదివేసేదాన్ని. అలా చిన్నప్పుడెప్పుడో చదివిన పుస్తకమిది. అప్పుడు వేటూరి ఎవరో కూడా తెలీదు నాకు. ఇవాళ వేటూరి వర్థంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని గురించి రాయాలనిపించింది.


ఈ పుస్తకం మొదటి పేజీల్లో "పల్లవి" పేరుతో వేటూరి ఈ రచనలో సహకరించిన మిత్రులు పెండ్యాల నాగేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. పుస్తకమ్లో తెలిపిన కొండజాతివారి ఆచారాలు, అలవాట్లను గురించి తెలిపినవారు, తనకి గురుతుల్యులైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఆ పక్కనే వేటూరి శ్రీ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభను మెచ్చుతూ రాసిన ఒక కవిత(గేయం?) బావుంటుంది. క్రింద ఫోటోలో అది చదవవచ్చు..




"జీవన రాగం" కథ చాలా నాటకీయంగా, ఒక సినిమా కథలాగానే ఉంటుంది. పేరుప్రఖ్యాతలు బాగా సంపాదించిన ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడు రఘు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. విశ్రాంతి కోసం "నాగార్జున కొండ" దగ్గరకు వెళ్లవలసినదిగా స్నేహితురాలు రాగిణి సలహా మేరకు అక్కడకు బయల్దేరుతాడు. వెళ్ళే ముందు గాయని రాగిణి తన మనసు తెలుపగా, రఘు సంతోషంతో ఆమె ప్రేమనంగీకరిస్తాడు. ఆమె హృదయవీణపై తన అనురాగరాగాలను పలికిస్తాడతను. మీకై ఎదురుచూస్తానంటూ వీడ్కోలు చెప్తుంది రాగిణి.


నాగార్జున కొండపై విహార యాత్రికులకు వసతి కల్పించే ఒక సుందర ఆరామంలో ఒక కుటీరాన్ని అద్దెకు తీసుకుంటాడతను. వెంకన్న అనే వంటవాడిని పనిలో కుదుర్చుకుంటాడు. ఇక్కడ వేటూరి వర్ణించే నాగార్జున కొండ అందాలు వర్ణానాతీతం. ఒక్కసారిగా పరుగున వెళ్ళి ఆ రమణీయ ప్రదేశంలో సేదతీరాలనిపించేంతటి అందమైన వర్ణన అది. వేటూరి పెరిగినది ఆ ప్రాంతం చుట్టుపక్కల కాబట్టే అంత బాగా ఆ పరిసరాలను వర్ణించగలిగరేమో అనిపించింది నాకు.  నాగార్జునకొండకి చేరగానే అంతటి అందమైన ప్రశాంత వాతావరణం పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాగిణికి ఉత్తరం రాస్తాడతను. 



తర్వాత ఒక రోజు కోనలలో విహరిస్తుండగా ఒక పిట్టసవ్వడికి ఆకర్షితుడై వెతుకుతూ వెళ్ళి దారితప్పుతాడు. దారి వెతుక్కుంటూ వెళ్తున్న అతనికి ఒక కొండజాతి గుంపు ఎదురౌతుంది. దిగువన ఉన్న సెంద్రవంక కోనలో వాళ్ళదొక గూడెమని చెప్తారు వాళ్ళు. నెమ్మదిగా పరిచయం పెరిగి గూడానికి రాకపోకలు సాగిస్తుంటాడు రఘు. అక్కడ సుగాలి నాయకుడి కుమార్తె రజని అతని మనసులో అలజడి రేపుతుంది. రమ్యమైన రజని నాట్యానికి రఘు సంగీతం తోడౌతుంది. ఆమె రూపలావణ్యాలు, ఆమె సాంగత్యంలో తనను తానే మరిచిన రఘు రాగిణిని, ఆమె ప్రేమనూ కూడా మరుస్తాడు. ఆమె ఉత్తరాలకు జవాబులు కూడా సరిగ్గా రాయడు. రజని భౌతిక సౌందర్యంలో కొట్టుకుపోతున్న అతని మనసుని రాగిణి రాసిన ఆర్ద్రమైన ఉత్తరం కూడా కదిలించలేకపోతుంది. వెంకన్న జాబు వ్రాయగా రఘు పట్ల ఆదుర్దాతో ప్రక్కవాద్యం పద్మనాభాన్ని వెంటపెట్టుకుని రాగిణి అక్కడికి చెరుకుంటుంది.


రజని తలపులతో నిండిపోయిన రఘు ఏమౌతాడు? రజని ఏమౌతుంది? గూడెం నాయకుడు రఘు కళ్ళు ఎలా తెరిపించాడు? రఘుకి రాగిణి మళ్ళీ ఎలా చేరువౌతుంది? మొదలైన ప్రశ్నలకు మిగిలిన కథ సమాధానం చెప్తుంది. ఇది ఒక అతి మాములు కథే కానీ వేటూరి ఈ కథను మలిచిన తీరు, వాడిన భాష, ప్రకృతి వర్ణనా తెలుగు భాషకు సంబంధించి ఒక అపురూపమైన ఉదాహరణగా ఈ పుస్తకాన్ని నిలుపుతుంది. అసలు అంత చక్కని తెలుగు చదవటానికి ఎంత ఆనందం కలుగుతుందో! సినీ గేయరచయిత కాకపోయి ఉంటే, వేటూరి వల్ల స్వచ్ఛమైన తెలుగు పదాలతో కూడిన సాహిత్యసృజన జరిగి ఉండేదనిపిస్తుంది పుస్తకం చదివాకా.

నవలలో వేటూరి వాడిన కొన్ని హృద్యమైన పదాలు:

ఉత్తంగ పర్వత శ్రేణి, కాలాంభోధరాలు, శోభస్కరంగా, వియత్పురుషుని, అలౌకిక రస నిర్భరానందం, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, అంగుళీకిసలయంలా, అవనతముఖి, వినమితముఖి, శరత్కాలసితచంద్రికలు, సకృతి, ,గ్రీష్మాతపవహ్ని, కందళిస్తున్నది, హ్రస్వమైన, ఆనందతోరణం, ఉదాత్త లజ్జావివశత్వం, ప్రకృతిసహజ సంస్కారజ్యోతి, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, కొంకర్తవ్యతామూఢుడు, రాగ ప్రస్థారం, సితచంద్రికాహ్లాదరజన్నిటాల, జనమన:కేదారములు !



ఈ పుస్తకం గురించి గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

Monday, May 20, 2013

అలరించిన 'Epic'




ఈ వేసవిలో పిల్లలను ఆకట్టుకోవటానికి మన దేశం వచ్చిన అమెరికన్ కంప్యూటర్ ఏనిమేటెడ్ ఫాంటసీ 3D చిత్రం "Epic". 'విలియమ్ జాయిస్' రాసిన ఒక పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా ఏనిమేషన్ మాత్రమే కాక 3D  కూడా అవడం వల్ల ఇంకా ఆకర్షణీయంగా రూపుదిద్దికుంది. ఇవాళ మా పాపను తీసుకువెళ్ళి చూపెట్టాను. మా ఇద్దరికీ బాగా నచ్చింది.


 ఈ సినిమా కథ క్లుప్తంగా చెప్పాలంటే మంచి, చెడుల మధ్యన యుధ్ధం. చివరికి విజయం మంచివారినే వరిస్తుంది అన్నది పాత కథాంశమే అయినా అడవి నేపథ్యం, అందులో ఉండే రహస్యప్రపంచం.. ఆ ప్రపంచంలోని మనుషులు, వాళ్ల జీవితాలు.. చెడుతో వాళ్ల పోరాటం... ఇదంతా ఆసక్తికరంగా మలిచారు. మేరీ కేథరీన్ అనే టీనేజ్ అమ్మాయి అడవిలో పరిశోధన జరుపుతున్న తండ్రి వద్దకు వస్తుంది. అతడికి పరిశోధనే ప్రపంచం. అనుకోని పరిస్థితుల్లో మేరీ చిన్నగా మారిపోయి, తండ్రి ఇంతకాలంగా పరిశోధిస్తున్న "leafmen" అనే లిల్లీపుట్ల లాంటి బుల్లి బుల్లి మనుషుల విచిత్రప్రపంచంలోకి వెళ్ళి పడుతుంది. వాళ్లతో కలిసి వాళ్ళ యుధ్ధంలో పాల్గొని, చివరికి మేరీ మళ్ళీ ఎలా మామూలు మనిషౌతుంది? అన్నది కథ. నాకు వాళ్ళ రాణి భలే నచ్చేసింది. ఆమె నడుస్తూంటే విచ్చుకునే పువ్వులు, కలువలూ ఎంత అందంగా ఉన్నాయో. ఆమె ఉన్నది కాసేపే అయినా ఆ కాసేపూ చాలు 'what a visual feast !' అనుకోవడానికి.


మామూలు 2D సినిమా కన్నా ఏనిమేషన్ తీయడం,అందునా 3D తీయడం  ఎంతో శ్రమతో కూడుకున్న పని. అది కాస్తయినా బాలేకపోతే ఆ శ్రమంతా వృధా పోతుంది. అలా కాక చూసేవాళ్లకి చక్కని అనుభూతిని మిగిలిస్తే, కష్టపడి తీసినవాళ్లకు కూడా తృప్తి. మీ ఇంటి దగ్గరలో ఆడుతూ ఉంటే, ఏనిమేషన్ ఇష్టముంటే మిస్సవకుండా తప్పక చూడండి. టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అని ఖచ్చితంగా అనుకుంటారు.

'Epic' trailer:

Thursday, May 16, 2013

దూరమౌతున్న పచ్చదనం



ఇలా ఉండేది


ఇలా అయిపోయింది :(


మేము ఉంటున్న ప్రాంతానికి వచ్చిన కొత్తల్లో పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళినప్పుడు చుట్టూరా ఉన్న పచ్చదనాన్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉండేదాన్ని. అందులోనూ వర్షాకాలమేమో మరీ అందంగా ఉండేది. పల్లెటూరి వాతావరణం fresh air అని  చాలా ఆనందించాము. పొలాలకు, చెట్లకూ ఫోటోలు అవీ తీసి మురిసిపోయేదాన్ని. ఆనందించినంత సేపు పట్టలేదు.. నెమ్మదిగా పచ్చదనమంతా మాయమైపోవడం మొదలైంది. 


నిన్న మొన్నటిదాకా అలరించిన కాకర పాదులూ, బీర పాదులూ కాపు అయ్యాకా తీసేస్తే కొత్త పంట వేస్తున్నారు కాబోలనుకున్నాం. కానీ పాదులు పాకే స్థంభాలు కూడా పెకలించి వేస్తూంటే అర్థమైంది ఇక ఆ వైపున పచ్చదనం కనబడదని. ఇప్పటికే సందు చివర మూడంతస్థుల బిల్డింగ్ ఒకటి సగానికి పైగా పూర్తయిపోయింది. మరో వైపు ఖాళీగా ఉండే స్థలంలో రెండు డూప్లెక్సులు మొలిచాయి. దాని వెనుకగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా ఏవో తవ్వకాలు జరుగుతున్నాయి. 


నేను వాకింగ్ కి వచ్చే దారిలో చివరకు ఉండే పొలాలు మాయమైపోయాయి. అక్కడ పొలాలకు కాపలాగా ఉండే పనివాళ్ల గుడిసెలు , చుట్టూరా ఉండే చెట్లు మాయమైపోయాయి. గుడ్డ ఉయ్యాల వేసుకుని ఊగే పసిపిల్లలను, చలిమంట కాచుకునే పిల్లలను చూట్టం నాకు భళే సరదాగా ఉండేది. అలా నడుచుకు వెళ్తూంటే చెయ్యి ఊపేవారా పిల్లలు. ఫోటోలు తీసుకుంటుంటే ఇంకోటి తియ్యరా? అని అడిగేవారు. ఆ గుడిసెల్లోని వాళ్లంతా ఏమైపోయారో..ఎక్కడికి వెళ్పోయారో..! మొదలంటా నరికిన చింతచెట్టు మొదట్లో మళ్ళీ వచ్చిన పచ్చని లేతచిగుర్లు చూసి ఆనందించేలోపే అది కూడా పూర్తిగా తవ్విపారేసారు. పెద్ద పెద్ద వేపచెట్లు.. అన్నీ కొట్టి పరేసారు. ఒకో చేట్టు ఎంత చల్లదనాన్నీ, నీడనీ ఇచ్చేదో. ఏం కడతారో ఏమో!!


క్రింద ఫోటోల్లోవేవీ ఇవేవీ లేవిప్పుడు :(








మనుషులకి ఊళ్ళు సరిపోక ఊరి బయటకు వచ్చేస్తున్నారు అనుకుంటే, ఆ ఊరి బయట కూడా జనాలకు సరిపోవట్లేదు. ఇంకా ఇంకా చెట్లు నరుక్కుంటూ, పచ్చదనాన్ని విధ్వంసం చేసుకుంటూ పక్క ఊరిదాకా పాకేస్తాడేమో మనిషి ! ఇన్నాళ్ళూ మెయిన్ రోడ్ నుండీ మా గేట్ దాకా ఉండే మట్టి రోడ్డులో చాలా ఇబ్బంది పడ్డాం.. నెల క్రితం ఓ రోజు తెల్లారేసరికీ కనబడ్డ అందమైన నల్లని తారు రోడ్డుని చూసి కష్టాలు గట్టెక్కాయని సంతోషించాం కానీ మొదలవబోతున్న కొత్త భవంతులు చూశాకా రోడ్డెందుకు వేయించారో అర్థమైంది !


ఒక చిన్న ఆనందం ఏంటంటే ఈ కట్టడాలన్నీ మా ఇంటికి ఒక వైపునే జరుగుతున్నాయి. మరో వైపున ఉండే వరిపైరు కోతలు మొన్ననే పూర్తయ్యాయి.


Wednesday, May 15, 2013

కథ నేపథ్యం - 1



కొన్ని కథలు చదివినప్పుడు, రచయిత ఈ కథను ఎందుకు రాయాలనుకున్నారో, ఏ సందర్భంలో ఇలాంటి ఆలోచన వచ్చిందో, ఎందుకని ఇలా రాసారో అన్న ప్రశ్నలు కలుగుతాయి మనకు. అలాంటి కొన్ని ప్రశ్నలకు మనకు "కథ నేపథ్యం" పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి. కొన్నేళ్ల క్రితం 'ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక'లో చాలామంది రచయితలతో వారి కథల నేపథ్యాలను ప్రచురించారు. వాటికి మొత్తానికి మరికొన్ని కథా నేపథ్యాలు రచయితలతో రాయించి అవి అచ్చు వేసేసింది తానా ప్రచురణల సంఘం. అయితే అవి మొత్తం చాలా పేజీలు ఉండడం వల్ల రెండు భాగాలుగా ప్రచురించాలనుకున్నారుట. 25 కథలతో మొదటి భాగం 2013 జనవరిలో విడుదల చేసారు. ఈ పుస్తకానికి సంపాదకులు ఆర్. ఎమ్. ఉమామహేశ్వరరావు గారు, డా.జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు. ఔత్సాహిక రచయితలకు ఈ కథా నేపథ్యాలు ఉపయోగపడగలవని సంపాదకుల అభిప్రాయం.



కథ వెనుక కథను తెలిపే ఈ కథా నేపథ్యాలను చదువుతుంటే ఆయా కథల పట్ల మనకున్న దృక్కోణం మారుతుంది. ఇలా కథ వెనుక ఉన్న రచయిత ఉద్దేశాన్నో ,ఆలోచననో, అనుభూతినో తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయం. మామూలుగా కథ చదివిన దాని కన్నా ఇలా కథానేపథ్యాన్ని తెలుసుకున్నాకా ఆ కథ మరింత అర్థమౌతోందనిపిస్తుంది. కొన్ని కథలకూ వాటి వెనుక కథకూ పెద్దగా సంబంధమేమీ కనబడదు కానీ ఇంత చిన్న ఆలోచన లోంచి ఈ కథ పుట్టిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.



వైవిధ్యమైన పాతిక కథలున్న ఈ పుస్తకంలో తమ కథానేపథ్యాలను తెలిపిన కథకుల పేర్లు క్రింద ఫోటోలో చూడవచ్చు:

 


సతి: అబ్బూరి చాయాదేవి కథ "సతి" తో మొదలౌతుందీ పుస్తకం. ప్రఖ్యాత కథకులుగా ఎదిగిన ఒక జంట కథ ఇది. "బీనాదేవి" పేరుతో రచనలు చేసిన దంపతుల్లో ఒకరైన బి.నరసింగరావుగారి మరణం తర్వాత జరిగిన సంతాప సభలూ, పరిస్థితులు "సతి" కథకు నేపథ్యం అని ఛాయాదేవి చెప్తారు. ఈ కథలో తాను పురుషాహంకారం నీడని నిరసించానని చెప్తారు.


చీకటి: బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపే అల్లం శేషగిరిరావు కథానిక "చీకటి". ఈ కథ చదువుతుంటే ఎందుకో వంశీ మన్యంరాణి గుర్తుకొచ్చింది. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు జీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని విభ్రాంతి చెందుతాము. అతడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు మన రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. రచయిత ఏజన్సి ప్రాంతంలో పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఒకసారి ఉరిశిక్ష పడిన ఒక గిరిజన ఖైదీ తన కొడుకు తన కోసం వస్తాడనీ, ఆకలితో వచ్చే అతనికి పూరీకూర పెట్టమని, అదే అతన ఆఖరి కోరిక అనీ జైలర్ కు చెప్పాడుట. ఈ చిన్న సంఘటన ఆధారంతో ఈ కథ అల్లాననీ కథానేపథ్యంలో శేషగిరిరావు చెప్తారు. చదివిన చాలాసేపటి వరకూ మనల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి".


సర్కస్ డేరా: ఊళ్ళోకి సర్కస్ రావటం, పబ్లిసిటి కోసం తిప్పే మోటారువేన్, సర్కస్ డేరాలూ, చుట్టూతా డబ్బారేకు అంచులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, మనుషులూ... ఇవన్నింటితో చిన్నప్పుడు చూసిన సర్కస్ గుర్తుకు తెస్తారు ఈ కథలో మధురాంతకం రాజారాం. నాగులు దాబ్బులు తీసుకుపోయాడని రఘుపతి చింతిస్తూంటే, ఎందుకు నమ్మారని ఆరా తీసిన మనుషులే తీరా నాగులు చిల్లర డబ్బులతో తిరిగి వచ్చేసరికీ మాట మార్చేసి ఇంతోటి దానికే ఇంత హంగామానా అని వెటకారాలాడతారు. ఈ సంఘటన రెండునాల్కలతో మాట్లాడే సమాజానికి ప్రతీక. సర్కస్ లో ఆటగాళ్లాడే ఏ ఆటకీ పెద్దగా ఆశ్చర్యపడని నాగులు జీవన పోరాటానికి ప్రత్యక్ష్యసాక్షి. బ్రతుకువెళ్లదీయటం కోసం నిత్యం ఎన్నోపాట్లు పడుతూ ప్రమాదాల అంచున ప్రయాణించేవాడికి సర్కస్ ఫీట్లు ఉత్సుకతనూ, కుతూహలాన్నీ ఎలా కలిగిస్తాయి?
ఈ కథలో వాస్తవానికి కొంత కల్పన జోడించినట్లు నేపథ్యంలో చెప్తారు రాజారాం.


వారాల పిల్లాడు: అసాంతం గబగబా చదివించిన ఈ కథ నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. నాయినమ్మ చనిపోయినట్లు తెలీక ఆవిడని అందరూ ఏం చేసేస్తున్నారో అని బెంబేలెత్తిపోయే ఎనిమిదేళ్ల నారాయణ అమాయకత్వం మన పసితనాన్ని గుర్తుకు తెస్తుంది. వాళ్ళింట్లో వారాలు చేసుకుని చదువుకునే నరసింహ్వం ని చూసి తను కూడా వారాలు చేసుకుని చదువుకోవాలనుకునే నారాయణ అమాయకత్వానికి మరింత ముచ్చటపడేలోపే ఓళ్ళు బళ్ళవుతాయన్నట్లుగా వారి కుటుంబపరిస్థితి తలకిందులైపోతుంది. నిజంగా తల్లిని  వదిలి పొరుగూరెళ్ళి వారాలు చేసుకుంటూ చదువుకోవాల్సిన అతని పరిస్థితి, అతని ఆకలి బాధా జాలిగొలుపుతాయి. ముగింపు ఇంకా వేదన కలిగిస్తుంది. ఈ కథా నేపథ్యంలో ఇందులో ఉన్నది తన జీవన నేపథ్యమేననీ, తమ కుటుంబం దుర్దశలో ఉన్నప్పుడు తమను మేనమామలూ, తల్లి చేసిన అన్నదానాలు ఆదుకున్నాయని పరిస్థితులు చక్కబడ్డాయనీ, తమ తిరగబడ్డ పరిస్థితులను, కథా రచన కాలంలో తాను తిరిగిన కొన్ని ప్రాంతాల్లో చూసిన భీబత్సమైన చారిత్రక దృశ్యాల ఆధారంతో ఈ కథ రాసాననీ చెప్తారు రచయిత మునిపల్లెరాజు. కానీ ఈ కథ విషాదాంతమే నన్ను బాగా కదిలించివేసింది.


ధనలక్ష్మి: బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లకు కూడా పాఠాలు చెప్పగల నేర్పు ఉన్న వ్యాపారస్తురాలు కథ శ్రీరమణ గారి "ధనలక్ష్మి". వ్యాపారాభివృధ్ధికి తను తెలివితో చేసిన ఆలోచనలను, కాపురం బాగుండాలని భర్త రామాంజనేలు కి ఆపాదించి, అందరూ అతడిని మెచ్చేలా చేస్తుంది ధనలక్ష్మి. కథలో చివరిదాకా అదే నేర్పుతో నెట్టుకొచ్చి, నెగ్గుతుంది ఆమె. ఈ కథలో పాత్రలు తన క్లాస్మేట్స్ అనీ, వాళ్ల కథే ఈ కథకు నేపధ్యమనీ చెప్తారు శ్రీరమణ. అయితే, ఈ విజయగాథలో తన ఆత్మన్యూనతను ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న తన మిత్రుడిదే గొప్ప పాత్ర అంటారు ఆయన.


ఇటువంటి మరికొన్ని వైవిధ్యభరితమైన కథలనూ, వాటి కథా నేపథ్యాలను "కథ నేపథ్యం - 1" పుస్తకంలో చదవవచ్చు.



Tuesday, May 14, 2013

సుకవి 'ప్రదీప్'





1997లో ప్రతిష్ఠాత్మకమైన 'దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని', భారత ప్రభుత్వం ద్వారా 'రాష్ట్ర కవి'(జాతీయ కవిగా) బిరుదుని అందుకున్న సుకవి ప్రదీప్. ప్రదీప్ గురించిన వివరాలనూ, ఆయన రాసిన పాటల జాబితాను ఈ వికీ లింక్ లో చూడవచ్చు:
http://en.wikipedia.org/wiki/Kavi_Pradeep


ప్రదీప్ పాటలన్నింటిలోకీ నాకు బాగా ఇష్టమైన మూడు పాటల గురించి ఈ టపాలో చెప్పాలని ! రాయటమే కాక ప్రదీప్ స్వయంగా పాడేవారు కూడా. మా చిన్నప్పుడు "ప్రదీప్ భజన్స్" అనే కేసెట్ ఒకటి మా ఇంట్లో ఉండేది. అందులో అన్నీ ఆయన పాడినవే. చాలా బావుండేవి. ఆ భజన్స్ అన్నింటిలో "सुख दु:ख दोनों रहते जिस मॆं.." నాకు బాగా నచ్చేది. ఎన్నో సార్లు వింటూ ఉండేదాన్ని. తేలికైన మాటలతో లోతైన అర్థాన్ని తెలిపే ఈ భజన్ మనసు అలజడిగా ఉన్నప్పుడు వింటే ఎంతో ఊరట లభిస్తుంది. 


'కవి ప్రదీప్' స్వయంగా పాడిన ఈ భజన:

 


సాహిత్యం:

सुख दु:ख दोनों रहते जिस मॆं  जीवन हैं वॊ गाव 
कभी धूप... कभी छाव 
कभी धूप तो कभी छाव 
ऊपर वाला पासा फॆंकॆ नीचॆ चलतॆ दाव 
कभी धूप... कभी छाव 
कभी धूप तो कभी छाव 

भलॆ भी दिन आतॆ
जगत मॆं बुरॆ भी दिन आतॆ
कड़वे मीठॆ फल करम कॆ यहाँ सभी पातॆं
कभी सीधॆ कभी उल्टॆ पड़ते अजब समय कॆ पाँव 
कभी धूप... कभी छाव 
कभी धूप तो कभी छाव 
((सुख दु:ख)) 

क्या खुशियाँ क्या ग़म  
यॆ सब मिलतॆ बारी बारी
मालिक की मर्जी पॆ चलती यॆ दुनियाँ सारी
ध्यान सॆ खॆलना जग नदिया में बंदॆ अपनी नाव
((सुख दु:ख)) 

"సుఖదు:ఖాలు, వెలుగు నీడలు రెండూ జీవితంలో కలిసే ఉంటాయి, భగవంతుడు ఆడించే జీవితమనే ఆటను జాగ్రత్తగా ఆడాలి. గెలుపు ఓటమిలు అందరూ చవిచూస్తారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు అంతా తలక్రిందులైనట్లు అనిపిస్తుంది కానీ ఇదంతా ఆ పైవాడు నడిపించే ఆట. ప్రపంచమనే నదిలో జీవననావను నేర్పుగా నడుపుకోవాలి" అని ఈ సాహిత్యానికి అర్థం.


భజనలే కాక సినిమా పాటలు, ఉత్తేజపూరితమైన దేశభక్తి గీతాలూ కూడా ప్రదీప్ రచించారు. "जागृती" అనే హిందీ చిత్రంలో 'ఆశా భోంస్లే' పాడిన మహాత్మా గాంధీ గురించి ప్రదీప్ రాసిన ఈ పాట చాలా బాగుంటుంది..

 दॆदी हमॆं आजादी बिना खड्ग बिना ढाल.. 
साबर्मती कॆ संत तुनॆ करदिया कमाल.. 

 



ఉత్తేజపూరితమైన దేశభక్తిగీతం గా పేరుగాంచిన "ऎ मेरॆ वतन कॆ लॊगों.." పాట ప్రదీప్ రాసినదే. ఈ పాటకే "జాతీయ కవి" బిరుదు పొందారు ఈయన. ఈ పాట 'లతా' నే పాడాలని ప్రదీప్ చాలా పట్టు పట్టారుట. 
ఎందరికో స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగించిన ఈ పాట కూడా వినేయండి:


ऎ मेरॆ वतन कॆ लॊगों..
 .



Thursday, May 9, 2013

రజని గారి ఇటీవలి సన్మానం ఫొటోలు






ఆకాశవాణి ప్రముఖులలో రజని గారు మునిపుంగవులు లాంటివారు. అనేకమంది రేడియో కళాకారులకు ఆయన  భీష్మ పితామహులు. తెలుగు కార్యక్రమాలకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన తొలి కళాకారులు, వాగ్గేయకారులు రజని.

25-4-13 తేదిన 'మార్కోనీ' జయంతి సందర్భంగా కృష్ణవేణి క్రియేషన్స్ వారు విజయవాడలో ఆకాశవాణి మాజీ సంచాలకులు, కళాకారులు డాక్టర్ బాలాంత్రపు రజని కాంతారావు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేసారు. ప్రసార భారతి మాజీ అధికారి సాహితీవేత్త డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు అధ్యక్షతన ఈ పురస్కారం అందించబడింది.

సభ తాలుకు ఫోటోలు..









***


రజని గారి స్వీయ రచన "రజనీ ఆత్మ కథా విభావరి" పుస్తకం విడుదల సభ విశేషాలు, రెండు మంచి ప్రసంగాలు ఇక్కడ :
http://trishnaventa.blogspot.in/2012/05/blog-post_24.html

Wednesday, May 8, 2013

గ్రీకువీరుడు Ironman 3





అబ్బే.. ఈ రెండు టైటిల్స్ కీ లింక్ ఏమీ లేదు. కొత్త సినిమాల్లో బాగున్నాయని టాక్ వచ్చిన ఈ రెండింటిని దర్శించుకున్నాం. నాకైతే ఓ మాదిరిగానే అనిపించాయి రెండూ ! ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అని గొప్పగా పొగిడేస్తున్నారని ముందర "గ్రీకువీరుడు"కి వెళ్ళాం. "అనుబంధాలను నిలుపుకోవాలి. గొడవలొస్తే అహాన్ని వీడి ఎవరో ఒకరు ముందుకెళ్తే సమస్యలు సర్దుకుపోతాయి. బంధాలు నిలుస్తాయి." అన్నారు డైరెక్టర్ గారు. నిజంగా ఈ కాన్సెప్ట్ బాగుంది. కానీ కథే కాస్త తేలికగా ఉంది. బరువు లేదు. ఫీల్ లేదు. ఏ కథ అయినా కథనంలో గ్రిప్ లేకపోతే తేలిపోతుంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్స్ తీసిన దర్శకుడేనా? అనిపించింది. ఆ స్టాండర్డ్ లో ఎంతమాత్రం ఈ సినిమా లేదు :(

కథానాయకుడు నవ్వితే మనం నవ్వాలి. అతను బాధపడితే మనమూ బాధపడాలి. అటువంటి ఇమోషనల్ ఫీల్ లేనిదే సినిమా ఎంత గొప్ప నీతి చెప్పినా ఇన్వాల్స్ అవటం కష్టం.

ఏం బాగున్నాయి:
* అశ్లీల దృశ్యాలు లేకపోవడం, వీరోవినుకి నిండైన బట్టలు ఉండటం చాలా హాయినిచ్చాయి.
* వెకిలి హాస్యం లేకపోవటం.
* నయనతార మొహంలో ఏదో మార్పు.. బావుంది. ప్రశాంతంగా కనబడుతోందిప్పుడు.
* నాగార్జున స్మార్ట్ గా, పదేళ్ళు చిన్నగా బాగున్నాడు. But.. నలభై ఏడేళ్ల షారుఖ్ ఖాన్ నే చూడ్డానికి ఇబ్బంది అవుతుంటే ఏభై మూడేళ్ళ నాగార్జునని చూడటం కాస్త కష్టం గానే అనిపించింది. మంచి నటుడిగా ఎదిగిన నాగార్జున కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూడాలని ఉంది.

నాకొచ్చిన డౌట్స్:
* అసలా టైటిల్ కీ కథకూ సంబంధం ఉందా?
* ఫ్లైట్ లో కలిసి జర్నీ చేసిన కాస్త పరిచయానికే ముచ్చటపడిపోయి ఏ బుర్ర ఉన్న అమ్మాయి అయినా గాళ్ఫ్రెండ్ ఉందని చెప్తున్న ఓ అపరిచితుడితో తాళి కట్టించేసుకుంటుందా? ఎంత అబధ్ధమైనదైనా పెళ్ళి పెళ్ళే కదా? కాగితాల సంతకం కూడా కాదాయే..:(

చివరిగా:
ఓపికున్నవాళ్ళు ఓసారి చూడచ్చు.


***
Ironman 3



ఐరన్ మాన్ సిరీస్ లో వచ్చిన మూడో సినిమా.('ఎవెంజర్స్' తో కలిపితే నాలుగోది.)
భారీ బడ్జెట్ తో రూపొందించబడి, ప్రపంచవ్యాప్తంగా బోలెడు లాభాలు తెస్తున్న సినిమా! 'Ironman-2' చాలా నచ్చింది నాకు. ఇది మాత్రం అక్కడక్కడ కాస్త బోరింగ్ గా, వేస్టేజ్ ఆఫ్ టెక్నాలజీ గా తోచింది. ఇందులో కూడా కథ కన్విన్సింగ్ గా లేదు. ఇంతక్రితం వచ్చిన 'The Avengers' కన్నా చాలా బెటరే కానీ 'Ironman-2' లో ఉన్న ఇమోషనల్ ఫీల్ ఇందులో కలగదు. విలన్స్ కూడా ఇంప్రెసివ్ గా లేరు. మొదట్లో గంభీరంగా చూపించిన బెన్ కిన్స్లే ను, ఆ తర్వాత మరీ బఫూన్ లా చూపెట్టడం బాలేదు. ఎండిపోయినట్లున్న Gwyneth Paltrow ని చూడ్డం కష్టమైంది కానీ Ironman (Robert Downey) మాత్రం స్మార్ట్ గా బాగున్నాడు.

 చివరిగా: 

3D ఎఫెక్ట్ కోసం ఒకసారి చూడచ్చేమో..

ట్రైలర్:
http://www.youtube.com/watch?v=Ke1Y3P9D0Bc




Tuesday, May 7, 2013

భారతీయ నవల





ఏ దేశ సాహిత్యం ఆ దేశం యొక్క జీవనవిధానానికీ, సామాజిక పరిస్థితులకూ, మార్పులకూ అద్దం పడుతుంది. అయితే సాహిత్యం కేవలం వినోదసాధనం మాత్రమే కాదు మనుషులను చైతన్యవంతం కూడా చెయ్యగలదు. ప్రయోజనకారి కూడా. ఉద్యమాల వల్ల, విప్లవాల వల్ల, చట్టాల వల్ల, ఉపన్యాసల వల్లనే కాదు సాహిత్యం వల్ల కూడా సమాజోధ్ధరణ జరుగుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండి, చదివినవారి ఆలోచనల్లో, వ్యక్తిత్వంలోను మార్పుని తేగల శక్తి సాహిత్యానికి ఉంది.  సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ముఖ్యమైన “నవల”కి అటువంటి గొప్ప శక్తి ఎక్కువగా ఉంది.

 “చినుకు” మాసపత్రికలో “భారతీయ నవలా పరిచయాలు” పేరుతో నెలనెలా వీరలక్ష్మిగారు ఎంపిక చేసి పరిచయం చేసిన 25 భారతీయ భాషా నవలల్ని పుస్తకరుపంలో "భారతీయ నవల" పేరుతో మనకందించారు “చినుకు పబ్లికేషన్స్” వాళ్ళు. 

మిగిలిన పుస్తక పరిచయం పుస్తకం.నెట్ లో ఇక్కడ:
 http://pustakam.net/?p=14591



Friday, May 3, 2013

మా ఊళ్ళో కురిసిన వాన




"మన మానసిక స్థితికి సరిపోని పెద్ద సమూహంలో ఉన్నా పూర్తి ఒంటరి ఏకాకితనమే ఉంటుంది కదా! ఏకాంతంలో ఉంటూ కూడా ప్రపంచాన్నంతా అక్కున చేర్చుకుని మంతనాలాడగల సన్నివేశాన్ని అందించే పుస్తకం దొరికితే అంతకంటే గొప్ప ఎంజాయ్ మెంట్ మరేదయినా ఉందా?"
-- వాడ్రేవు వీరలక్ష్మి గారి 'మా ఊళ్ళో కురిసిన వాన' నుంచి.

 

ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసాల ద్వారా నాకు పరిచయమైన రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారు. తర్వత ఆ వ్యాసాలన్నీ 'ఆకులో ఆకునై' అనే పుస్తకంలో చేరాయి. ఆ మొదటి పరిచయంతోనే నాకు ప్రియమైన రచయితల జాబితాలో చేరిపోయారు. ఆ తరువాత 'ఉత్సవసౌరభం', 'కొండఫలం'  కథా సంపుటాలు, 'సాహిత్యానుభవం', 'మా ఊళ్ళో కురిసిన వాన' వ్యాస సంకలనాలు, 'చినుకు' మాస పత్రికలో 'భారతీయ నవలా పరిచయాలు', 'పాలపిట్ట' మాస పత్రికలో 'జాజిపూలపందిరి' మొదలైన రచనలు చేసారు. 


ఇరవై నాలుగు వారాల పాటు ఆంధ్రప్రభ దినపత్రిక(2003)లో వడ్రేవు వీరలక్ష్మి గారు రాసిన "వాన చినుకులు" కాలమ్ లోని వ్యాసాలను ఒకచోట చేర్చిన పుస్తకమే "మా ఊళ్ళో కురిసిన వాన". జులై 2012లో ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల 75/-.

గోపగారి రవీందర్ గారి ముందుమాట తో పాటుగా
"గురుపూర్ణిమ నాడు
అర్థరాత్రి దాటిన తరువాత
అదృష్టపశాత్తు కరెంట్ పోగా
తురాయిపూల చెట్ల గాలిలో
బాల్కనీలో  ఆకులనీడలో కూర్చొని
పున్నమివెన్నెలతో కబుర్లు మొదలు పెట్టిన దగ్గర్నుంచీ..."
అంటూ తల్లికి తక్క తనయుడు అనిపించేలా రాసిన వీరలక్ష్మి గారి అబ్బాయి రాజా సమీరనందన్ కబుర్లు, జ్ఞాపకాలు చదివి తీరాల్సిందే.



వీరలక్ష్మి గారి పుస్తకం చదివిన ప్రతిసారీ నాకు కొన్ని కొత్త పుస్తకాలో, రచయితలో తెలుస్తుంటారు. ఆవిడ చెప్పే రకరకాల రచయితల పేర్లూ, రిఫరెన్స్ లూ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంత ఒరేషియస్ రీడరో కదా.. అనిపిస్తుంది. ఇదివరకూ "కొండఫలం" టపాలో చెప్పినట్లుగా ఈవిడ రచనల్లో నా ఆలోచనల్లో చాలావరకూ భావసారూప్యం కనబడుతుంది నాకు. ఫలానాప్పుడు నేను ఇలానే అనుకున్నా కదా అని ఆవిడ పుస్తకాలు చదివినప్పుడల్లా ఎక్కడో అక్కడ గుర్తు చేసుకుంటూంటాను. అందుకేనేమో ఆవిడ నాకు ప్రియమైన రచయిత్రి అయిపోయారు. వీరలక్ష్మిగారి రచనల్లో నాకు ఇంకా నచ్చేవి జీవితం గురించీ, మానవ స్వభావాల గురించిన ఆవిడ రాసే చక్కని విశ్లేషణాత్మక వాక్యాలు. ఈ పుస్తకంలోనివన్నీ వ్యాసాలే కాబట్టి, వీటిల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను రాస్తాను ...

* "మా మాష్టారు యశస్సుకీ కీర్తికి తేడా చెప్పేవారు. యశస్సు అంటే సహజంగా వచ్చేదని, కీర్తిని సంపాదించడానికి కొంత ప్రయత్నం అవసరం అంటూ. ఇప్పుడు కీర్తికీ, పాపులారిటికి తేడా చెప్పుకోవాలేమి! పూర్తిగా ప్రయత్నం చేసి సంపాదించే పాపులారిటీ కోసమే ఈ క్రేజ్ అంతాను."

*హఠాత్తుగా ఒక్కనాడు తెల్లవారేసరికి మనుషులు మారిపోతారని గానీ, సంఘంలో గాని, ఇంట్లొ గాని పరిస్థితులు ఒక "ఫైన్ మార్నింగ్" చక్కబడిపోతాయని గాని అనుకోవడమూ, నమ్మడము కూడా ఎంత బుర్ర తక్కువ సంగతో ఈ ప్రకృతి ఇలా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది."

* "జీవితంలో ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మనిషిని ఇంత అస్థిమితంగా మర్చుతుందా?"
"...ఎంచుకోగల స్వేచ్ఛ కావాలనే కదా మనిషి కోరేది. కానీ ఎంచుకోడానికి ఎంత మనోనిశ్చలత, నాణ్యతని గ్రహించటానికి ఎంత పదునైన బుధ్ధి ఉండితీరాలి! ఇవి లేని వాడి చేతిలో రిమోట్ పెడితే ఎలా?"

* మన ఆలోచనలకు దగ్గరగా ఉండే ఆలోచనలు చదివినప్పుడు పెద్ద సముహంతో కలిసిపోయి ఆనందిస్తున్న భావనే కలుగుతుంది.

* "మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి. అదే జరిగితే ఈ వాదాలేవి అక్కర్లేదు. ఈ అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది."



इस मॊड सॆ जातॆ हैं..





విడుదలౌతూనే వివాదాల్లో చిక్కుకున్న సంచలనాత్మక చిత్రం, గుల్జార్ దర్శకత్వం వహించిన “ఆంధీ(1975)”. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో గుల్జార్ రాసిన నాలుగు పాటల్లో మూడుపాటలు క్లాసిక్స్ గా సంగీతప్రియులందరిచే ఈనాటికీ పరిగణించబడతాయి. “తేరే బినా జిందగీ సే కోయీ..” నా ఆల్ టైమ్ ఫేవొరేట్. ఎన్ని వందల పాటలు నచ్చినవి ఉన్నా.. నా మనసు ఈ పాట దగ్గరే నిలబడిపోతుంది. ఆ తర్వాత “తుమ్ ఆగయే తో నూర్ ఆగయా హై..” కూడా మరువలేని సాహిత్యమే. అయితే ఈ రెండూ స్ట్రెయిట్ లిరిక్స్. “ఇస్ మోడ్ సే జాతే హై..” అనే మూడో పాట లోతైన అర్థంతో పాటూ, కథ లోని మలుపులను కూడా తనలో ఇముడ్చుకున్న పాట. వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాహిత్యాన్ని, అందమైన పదాలతో రాయటం గుల్జార్ ప్రత్యేకత. స్వరపరిచేప్పుడు ఆర్.డి.బర్మన్ గుల్జార్ ని అడిగారుట.. “ఈ నషేమన్ ఏ ఊరి పేరోయ్..?” అని.

ఈ పాటకో చిన్న నేపథ్యం ఉంది. "Aaj Bichhade Hain” అని ఒక పాత ప్రైవేట్ ఆల్బం ఉంది. గుల్జార్ రచనే. అందులో ఉత్తమ్ సింగ్ స్వరకల్పనలో భూపేందర్ సింగ్ పాడిన ఈ “నజ్మ్” ఎంతో హాయి గొలిపేలా ఉంటుంది. ఇదే నజ్మ్ ని కాస్త సాహిత్యం మార్చి “ఆంధీ” చిత్రానికి వాడుకున్నారు గుల్జార్. 

ఆ నజ్మ్ సాహిత్యం, వినడానికి లింక్మ్ ఇంకా ఈ పాట కబుర్లు "వాకిలి" పత్రికలో చదవవచ్చు:

http://vaakili.com/patrika/?p=2707