సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 28, 2013

వరంగల్ ప్రయాణం - భద్రకాళి ఆలయం


హనుమకొండలో ఉన్న వెయ్యి స్థంభాల గుడి నుండి వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి ఆటోలో పావుగంటలో చేరిపోయాం. సూర్యుడు అస్తమించే సమయం. పొద్దున్నుండీ విసిగించిన ఎండ తగ్గుమొహం పట్టింది. కొండల వల్లనేమో ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంది వేసవిలాగ. వెయ్యి స్థంభాల గుడి శిధిలాలను చూసి భారమైన మనసుతో అన్యమనస్కంగా ఉన్నాను. గుడి రెండో వైపు గేటు వద్ద మేమెక్కిన ఆటో ఆగింది. ఆ ఎంట్రన్స్ లో కుడివైపు గోడమీద నవదుర్గలు, చివర్లో గుడిలోని భద్రకాళి అమ్మవారి చిత్రాలు చాలా అందంగా పెయింట్ చేసి ఉన్నాయి. 







ఈ వైపున ముందర శిరిడీబాబాగారి గుడి ఉంది. లోనికివెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. విశాలంగా బాగా కట్టారు గుడి. బయటకు వచ్చి అమ్మవారి గుడివైపు వెళ్తుంటే ఎడమ పక్కన పూలకొట్ల వెనకాల ఏదో నది కనబడింది. ఏమిటని అడిగితే అది "భద్రకాళి చెరువు" అని చెప్పారు. నిశ్చలమైన నీళ్ళు, పైన గుంపులు గుంపులుగా తెల్లని మబ్బులు, ఇంటికెళ్పోతున్న సూర్యుడు, దూరంగా కొండలు.. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చెప్పలేను! గబగబా నాలుగు ఫోటోలు తీసేసాను.



కాస్త ముందుకి వెళ్ళగానే దూరంగా నదిలో మనుషులు కనబడ్డారు. బోటింగేమో అనుకున్నా. కానీ కాదు.. వాళ్లంతా పేద పేద్ద ధర్మోకోల్ ముక్కల మీద నిశ్శబ్దంగా కూచుని చేపలు పడుతున్న జాలరివాళ్ళు. అప్పుడప్పుడు ఓయ్.. అన్న పిలుపులూ, చిన్నచిన్న మాటలూ వినబడుతున్నాయి. అవి కూడా వినటానికి చాలా బాగున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశమేమో చెప్పలేనంత ప్రశాంతంగా మారిపోయింది మనసు.

దూరంగా అక్కడక్కడ కనిపించేది ధర్మోకోల్ మీద మనుషులు


ఇక ఈ గుడి కథ చెప్తాను. ఓసారి ఏదో పుస్తకంలో చదివాను గణేష్ రావు గారనే ఆయన కర్నాటక నుండి ఇక్కడకు వచ్చి గుడి పక్కనే చిన్న గదిలో ఉండిపోయి, శిధిలావస్థలో ఉన్న ఈ గుడిని బాగు చేసి, మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసారని. రెండేళ్ల క్రితమెప్పుడో ఆయన కాలంచేసేదాకా ఆయనే గుడి ధర్మకర్త అని. ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన ఎంతటి గొప్ప భక్తులో అదంతా రాసుకొచ్చారు. (ఎక్కడ చదివానో గుర్తురాట్లే.) so, అప్పటినుండీ ఈ గుడి చూడాలని. అసలు ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉందిట. కాకతీయుల కాలం కంటే ముందే చాళుక్యుల పాలనలో నిర్మాణం జరిగిందిట. కాకతీయుల కాలంలో మళ్ళీ వైభవంగా పూజలందుకొందిట "భద్రేశ్వరి". వాళ్ళే ఇప్పుడున్న చెరువు కూడా తవ్వించారుట. అయితే కాకతియ సామ్రాజ్య పతనం తర్వాత మళ్ళీ ప్రాభవాన్ని కోల్పోయిందిట గుడి. మళ్ళీ 1950లో గణేష్ రావు గారు పునరుధ్ధరించారు.అప్పటిదాకా అమ్మవారి విగ్రహం భయానకంగా బయటకు వేళ్లాడే నాలుకతో ఉండేదట. అప్పుడు ఆ నాలుకపై బీజాక్షరాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారుట. గుడిలో చండీ యంత్రం ప్రతిష్ఠించి, ప్రతి ఏడూ శరన్నవరాత్రులు అవి జరుపటం మొదలుపెట్టారుట. ఈ అభివృధ్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖవారు కూడా తగినంత సహాయం అందించారుట.


అసలు కాకతీయులు శివారాధకులు. అయినా అమ్మవారిని కూడా వివిధరూపాల్లో పూజించేవారుట. ఈ సంగతి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని గురించి తెలిపే "ప్రతాపరుద్ర చరిత్రము", "సిధ్ధేస్వర చ్రిత్రము", "ప్రతాపరుద్రీయమ్" అనే గ్రంధాలలో తెలుపబడిందిట. కాకతీయ శిల్పాలలో చాలాచోట్ల దుర్గ, మహిషాసురమర్దిని విగ్రహాలు కనబడతాయి. రామప్ప గుడి వద్ద ఎక్స్కవేషన్స్ లో దొరికినదని పెట్టిన ఒక మహిషాసురమర్దిని విగ్రహం చూసాం. ఇదే అది..


ఈ భద్రకాళి అమ్మవారి మహిమ తాలుకూ కథ ఒకటి విన్నాం. ప్రతాపరుద్రుని కాలంలో ఒక విద్వాంసుడు కొలువుకి వచ్చి తనని వాదనలో ఓడించమని అడిగాడుట. చివర్లో అతను "ఇవాళ ఏకాదశి,రేపు అమావస్య. కాదంటారా?" అన్నాడట. ఔనంటే ఆ పండితుడి మాట నెగ్గుతుంది. కాదని అంటే ఓడిపోతారు. అప్పుడు ఏదైతే అయ్యిందని రేపు "పౌర్ణమి" అన్నారుట. ఆ రాత్రికి ప్రతాపరుద్రుడి కొలువులోని విద్వాంసుడు భద్రకాళి ఆలయానికి వెళ్ళి దేవిని స్తుతించాడుట. తల్లి ప్రసన్నమై అతని మాటలు నిజం చేస్తానని మాట ఇచ్చిందిట. మర్నాడు రాత్రి పౌర్ణమి లాగ వెలిగిన చంద్రుడ్ని చూసి ఆ వచ్చిన పండితుడు ఇది దైవశక్తి అని ఓటమి ఒప్పుకుని  వెళ్పోయాడుట. ఆ రోజుల్లో దైవభక్తి కూడా అంత స్వచ్ఛంగా, పవర్ఫుల్ గా ఉండేది మరి! అప్పట్లో ఈ గుడి వద్ద చాలామంది ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేవారుట కూడా. భద్రకాళి చెరువుకి పక్కగా ఒక కొండ ఉండేదిట. అక్కడ ఒక గణేషుడి విగ్రహం ఉండేదిట. కాలంతరంలో కొండతో పాటుగా అది కూడా అంతరించిపోయిందిట. గుడి ఎదురుగా చిన్న కొండ మీద ఉన్న శివపార్వతుల విగ్రహాలు కూడా ప్రాచీనమైనవే అంటారు. వాటి అందం పాడుచేస్తూ తెల్లరంగు వేసారు ఎందుకో..!



గుడిలో అమ్మవారి విగ్రహం తొమ్మిదడుగుల పొడుగు, తొమ్మిదడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా ఉంది. ఎక్కువ జనం లేనందువల్ల సావకాసమైన, ప్రశాంతమైన దర్శనభాగ్యం కలిగింది. గుడి ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం, శిష్యులతో ఉన్న విగ్రహాలు బాగున్నాయి.




మరి ఆ తర్వాత, పొద్దున్నుంచీ తిరిగినతిరుగుడికి అలసిసొలసి, పొద్దున్నుంచీ తిండిలేక కడుపులో ఏనుగులు పరిగెడుతుంటే ఊళ్ళో ఉన్న మా పిన్నీవాళ్ళింటికి వెళ్పోయాం. రాత్రి లక్కీగా ఏ.సి. బస్ దొరికింది. హాయిగా బజ్జుని ఇల్లు చేరేసరికీ అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది. ఇదింకా నయం అంతకు ముందు సాగర్ వెళ్ళినప్పుడైతే అర్ధరాత్రి రెండున్నర! బండి మీదైనా అంత రాత్రి వెళ్లాలంటే నాకేమో భయం!! ఆ కథేమిటో మళ్ళీ వారం చెప్తానేం.... Happy weekend :-)

(అంటే "నాగర్జునసాగర్" ట్రిప్ కబుర్లన్న మాట.)



4 comments:

ఫోటాన్ said...

ఫొటోస్ చాలా బాగున్నాయి తృష్ణ గారు :)

వేణూశ్రీకాంత్ said...

గుడి విశేషాలు బాగున్నాయండీ థాంక్స్..

Anonymous said...

మీ బ్లాగును బ్లాగ్ వేదికకు అనుసంధానం చేసి విస్తృత ప్రచారం కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడగలరు.
http://blogvedika.blogspot.in/

Indira said...

బాగున్నాయ్ మీ యాత్రా విశేషాలు!కాకతీయుల చరిత్ర,శిల్పకళ,కల్చర్ అన్నీ చాలా ఆసక్తికరంగా వుంటయ్.ఈసారి వెళ్ళినప్పుడు వరంగల్ కోట దగ్గర శిధిలాలు చూసిరండి.అక్కడి శిలాతోరణం చాలా ప్రఖ్యాతి పొందింది.